బుధవారం, జూన్ 22, 2011

గురజాడ కథానికలు

'తొలి' అనడంలోనే ఓ ప్రత్యేకత ఉంది. ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత కూడా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని తొలి అడుగులని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా తర్వాతి ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించ వచ్చు. ఆ ప్రయాణం ఓ వ్యక్తిది కావొచ్చు, సంస్థది కావొచ్చు లేదా ఓ సాహిత్య ప్రక్రియది కావొచ్చు. తెలుగునాట వ్యవహారిక భాషలో కథానికా రచనకి శ్రీకారం చుట్టిన గురజాడ అప్పారావు తన జీవిత కాలంలో వెలువరించిన నాలుగు కథానికలు, ఓ నవల తాలూకు స్కెచ్ తో విశాలాంధ్ర వెలువరించిన చిరు పుస్తకం 'గురజాడ రచనలు-కథానికలు .'

తెలుగులో తొలి ఆధునిక కథ లేదా వ్యవహారిక భాషలో తొలి తెలుగు కథానిక 'దిద్దుబాటు.' ఇది 'ఆంధ్ర భారతి' పత్రిక 1910, ఫిబ్రవరి సంచికలో ప్రచురితమయ్యింది. 'కన్యాశుల్కం' నాటకం తర్వాత, గురజాడ చేపట్టిన అనేక సాహితీ ప్రక్రియలలో ఈ కథానికా రచన ఒకటి. 'కన్యాశుల్కం' మాదిరే, ఈ కథానికల అంతిమ లక్ష్యమూ సంఘ సంస్కారమే. సంఘంలో పేరుకున్న చెడుని ఎత్తి చూపడం ద్వారా, విద్యావంతులని సన్మార్గంలోకి తేవాలన్న గురజాడ ప్రయత్నం కథానికల్లోనూ కనిపిస్తుంది.

వేశ్యా వృత్తిని నేపధ్యంగా తీసుకుని రాసిన ఈ కథానికలో ప్రధాన పాత్ర 'కమలిని.' చెడు మార్గం పట్టిన తన భర్త గోపాలరావుని ఆమె ఎలా 'దిద్దుబాటు' చేయగలిగిందన్నది కథ. ఇక్కడ చదవొచ్చు. అయితే ఈ 'దిద్దుబాటు' కి తనే దిద్దుబాటు చేసి సవరించిన కథానికను 'కమలిని' పేరిట విడుదల చేశారు గురజాడ. ఈ రెంటినీ చదవడం ద్వారా వ్యావహారిక భాషని ఉపయోగించే విషయంలో రచయిత శ్రద్ధని గమనించ వచ్చు. కథని మరికొంచం విస్తరించడంతో పాటు, సంస్కృత సమాసాలని పరిహరించి, మొత్తం కథకి వ్యావహారికాన్నే ఉపయోగించడం ఈ సవరించిన కథానిక ప్రత్యేకత.


పడుపు వృత్తినే నేపధ్యంగా తీసుకుని రాసిన మరో కథానిక 'సంస్కర్త హృదయం.' తమని తాము సంస్కర్తలు గా చెప్పుకునే వారి బోలుతనాన్నీ, వారి వ్యక్తిత్వ లోపాలనీ సున్నితంగా ఎత్తి చూపారు గురజాడ. కథానాయిక సరళ నగరంలో పేరు మోసిన వేశ్య. చదువు సంస్కారం ఉన్న అమ్మాయి, 'కన్యాశుల్కం' నాయిక మధురవాణి లాగా. కాలేజీ ప్రొఫెసర్ రంగనాధయ్యరు 'యాంటీ నాచ్' ఉద్యమం లో చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు. నగరంలో 'ప్రోనాచ్' 'యాంటీ నాచ్' ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటూ ఉంటుంది. ఒకానొక ప్రోనాచ్ విద్యార్ధి, భూస్వామి కొడుకూ అయిన చందర్ సరళ ని రంగనాధయ్యరు మీద ప్రయోగించడమే కథాంశం.

శైవం-వైష్ణవాల మధ్య తారా స్థాయిలో ఉన్న విభేదాలని ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథానిక 'మీ పేరేమిటి?' నాంచారమ్మ అనే విద్యావంతురాలైన శ్రీవైష్ణవ గృహిణిది బలమైన పాత్ర ఇందులో. "ఈ దేశంలో పాండవులు ఉండని గుహలూ, సీతమ్మవారు స్నానమాడని గుంటలూ లేవు" అంటారు రచయిత, కథా స్థలాన్ని పరిచయం చేస్తూ. శివ మతానికి మొనగాడు జంగం శరభయ్య తనని తాను నందికేశ్వరుడి అవతారంగా ప్రచారం చేసుకుంటే, వైష్ణవ ప్రచారకుడు సాతాని మనవాళ్ళయ్య తాను గరుడాళ్వారి అంశగా చెప్పుకుని తిరుగుతూ ఉంటాడు. బుద్ధుడిని శ్రీమహావిష్ణువు పదో అవతారం అన్న వాళ్లకి, యేసు క్రీస్తుని పదకొండో అవతారంగా చెయ్యడానికి సాధ్యం కాలేదంటారు గురజాడ.

మతం ఇతివృత్తంగా రాసిన మరో కథానిక 'మతము: విమతము" నిడివిలో చాలా చిన్నదే అయినా, చాలాసేపు ఆలోచింపజేసేది. ముఖ్యంగా ముగింపు వాక్యం. గురజాడ కలలు కన్న మరో సంఘ సంస్కారం భార్య భర్తల మధ్యన వయోభేదం ఎక్కువ ఉండకుండా ఉండడం. 'మెటిల్డా' కథానిక ఈ అంశాన్ని గురించే. ముసలి భర్త అనుమానం జబ్బు కారణంగా ఇబ్బందులు పడే పడుచు మెటిల్డా కథ ఇది. అసంపూర్తిగా అనిపించిన స్కెచ్ 'సౌదామిని.' గురజాడ దీనిని పూర్తి చేసి ఉంటే తెలుగు నాట మరో మంచి నవల అయి ఉండేది అనిపించింది, ఆయన సిద్ధ పరచిన పూర్వరంగాన్ని చదివాక.

ఈ కథానికల తో పాటుగా గురజాడ జీవిత విశేషాలనీ, అరుదైన ఛాయా చిత్రాల్నీ, సెట్టి ఈశ్వరరావు రాసిన రెండు వ్యాసాలనీ జత పరిచారు ప్రచురణ కర్తలు. 'ఆధునిక భాషా సాహిత్యాల యుగకర్త' అనే వ్యాసంలో, తెలుగు సాహిత్యం పురుడు పోసుకున్నది మొదలు, గురజాడ శకం వరకూ పరిణామ క్రమాన్ని విశదంగా రాశారు ఈశ్వర రావు. ఇక రెండో వ్యాసం 'మొట్టమొదటి ఆధునిక కథలు' సంకలనం లోని కథానికల పరిచయం. ఇది క్లుప్తంగా సాగింది. కథా సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం. (పేజీలు 88, వెల రూ.40, విశాలాంధ్ర అన్ని శాఖలూ).

2 కామెంట్‌లు:

  1. 'దిద్దుబాటు' ఎప్పుడో టీవీలో చూశాను. దూరదర్శన్ అనుకుంటా.

    రిప్లయితొలగించండి
  2. @హరిచందన: అవునండీ.. దూరదర్శన్ లో సింగిల్ ఎపిసోడ్ గా వచ్చాయి, దిద్దుబాటు, కలుపు మొక్కలు ఇంకొన్ని కథలూను.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి