శుక్రవారం, నవంబర్ 27, 2020

ది హంగర్ గేమ్స్

గత కొద్ది నెలలుగా థాయిలాండ్ లో నిరసనలు జరుగుతున్నాయి. పాలనా విధానాలని నిరసిస్తూ నిరసనకారులు రాణికి మూడు వేళ్ళు చూపించండం, వెనువెంటే పాలకులు ఆ నిరసనకారుల్ని శిక్షించడమే కాకుండా 'మూడువేళ్ళ నిరసన' మీద నిషేధం విధించడం కూడా జరిగిపోయింది. దీన్ని నిరసించేవాళ్లూ మూడువేళ్ళ మార్గమే ఎంచుకోవడంతో అంతర్జాతీయ వార్తల్లో ఈ వేళ్ళు చూపించే నిరసన ఫోటోలు కొంచం తరచుగా కనిపిస్తున్నాయి. 'అసలీ మూడువేళ్ళ నిరసన' పుట్టుపూర్వోత్తరాలేమిటని వెతకడం ప్రారంభిస్తే 2008 లో వచ్చిన ఓ ఇంగ్లీష్ నవలలో మొదటిసారిగా ఈ తరహా నిరసన ప్రస్తావన ఉందని తెలిసింది. అంతే కాదు, ఆ నవలకి తర్వాత మరో రెండు భాగాలు కొనసాగింపు రావడం, అదే కథతో హాలీవుడ్ లో సినిమా కూడా నిర్మాణమవ్వడం అనేది నాకు దొరికిన అదనపు సమాచారం. ఆ బెస్ట్ సెల్లర్ నవల పేరు 'ది హంగర్ గేమ్స్', రచయిత్రి సూసన్ కాలిన్స్. 

Google Image

కథానాయిక పదహారేళ్ళమ్మాయి కాట్నిస్ ఎవర్దీన్. పానెమ్ అనే దేశంలో డిస్ట్రిక్ట్-12 లో తన తల్లి, చెల్లెలితో కలిసి నివసిస్తూ ఉంటుంది. డిస్ట్రిక్ట్-12 బొగ్గు గనులకి పెట్టింది పేరు. 'సీమ్' అనే ముద్దు పేరు కూడా ఉంది. పానెమ్ రాజధాని కాపిటోల్ మినహా మిగిలిన ప్రాంతాలన్నీ బాగా వెనకబడినవి. ప్రజలందరికీ రోజు గడవడమే కష్టం. కాట్నిస్ తండ్రి బొగ్గు గనిలో కార్మికుడిగా పనిచేస్తూ గనిలో జరిగిన ప్రమాదంలో మరణించి ఐదేళ్లయింది. ఆ సంఘటనతో తల్లి షాక్ లోకి వెళ్ళిపోయింది. ఆయుర్వేద వైద్యం చేసే ఆమె పూర్తిగా కోలుకుని మనుషుల్లో పడకపోవడంతో తల్లిని, చెల్లిని పోషించే బాధ్యత కాట్నిస్ మీదే పడింది. స్కూల్ కి వెళ్లొస్తూనే, డిస్ట్రిక్ట్-12 ని ఆనుకుని ఉండే అడవుల్లోకి వెళ్లి చిన్న చిన్న పక్షుల్ని, జంతువుల్నీ వేట చేసి, పళ్లనీ, దుంపల్నీ పట్టుకొచ్చి ఊళ్ళోనే ఉన్న బ్లాక్ మార్కెట్లో అమ్మి ఇంటి అవసరాలు గడుపుతూ ఉంటుంది కాట్నిస్. వేటలో ఆమె స్నేహితుడు గేల్ ఎంతో సహాయం చేస్తూ ఉంటాడామెకి. 

నిజానికి పానెమ్ మొత్తాన్ని 13 డిస్ట్రిక్ట్స్ గా విభజించారు. డిస్ట్రిక్ట్-13 లో ప్రజలు పాలకులని వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో, పాలకులే ఆ ప్రాంతం మొత్తాన్ని సర్వ నాశనం చేశారు. అప్పటినుంచీ ప్రజల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటున్నారు కాపిటోల్ లో ఉండే నాయకులూ, అధికారులూ. పానెమ్ కే ప్రత్యేకమైన క్రీడ 'హంగర్ గేమ్స్.' దేశం మొత్తంలో ఉండే 12-18 ఏళ్ళ పిల్లలందరికీ ఏడాదికి ఒకసారి ఈ గేమ్స్ జరుగుతాయి. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచీ ఒక అబ్బాయిని, ఒక  అమ్మాయిని లాటరీ ద్వారా ఎంపిక చేసి కెపిటోల్ కి పంపాలి. అక్కడ ఈ 24 మందినీ ట్రిబ్యూట్స్ అని పిలుస్తారు. వీళ్లందరినీ ట్రేస్ చేసేలా వాళ్ళ ఒంట్లో చిప్స్ ఇంజెక్ట్ చేసి, ఓ విశాలమైన ఎరీనా లోకి వదులుతారు. ఎరీనా మొత్తం కెమెరాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ 24 మందీ ఒకరినొకరు చంపుకోవాలి. చివరికి మిగిలిన ఒక్కరూ విజేత. ఈ క్రీడలు టీవీలో ప్రసారమైనప్పుడు ప్రజలంతా తప్పక చూడాల్సిందే. 

కాట్నిస్ చెల్లెలు ప్రిమ్ ఆ ఏడే పన్నెండో ఏట అడుగుపెట్టింది. హంగర్ గేమ్స్ కి జరిగే సెలక్షన్స్ కి కూతుళ్ళిద్దరినీ తయారు చేసి తీసుకెళ్తుంది తల్లి. పద్దెనిమిదేళ్ల గేల్ కూడా హాజరవుతాడా కార్యక్రమానికి. లాటరీ మొదలవుతుంది. ముందుగా అమ్మాయి ఎంపిక. లాటరీలో ప్రిమ్ పేరు ప్రకటిస్తారు నిర్వాహకులు. చెల్లెలి తరపున తాను క్రీడల్లో పాల్గొంటానని ముందుకొస్తుంది కాట్నిస్. అబ్బాయిల తరపున ఎంపికైన వాడు పీటా. స్థానిక బేకరీ నిర్వాహకుడి కొడుకు. పీటాకి అన్నదమ్ములున్నా వాళ్ళెవరూ ముందుకి రారు. ఎన్నో ఏళ్ళ క్రితం హాంగర్ గేమ్స్ విజేతగా నిలిచిన డిస్ట్రిక్ట్-12 వాసి హ్యమిచ్ వీళ్లిద్దరికీ కోచ్ గా కాపిటోల్ బయల్దేరతాడు. ప్రత్యేకమైన రైల్లో కాపిటోల్ బయల్దేరతారు ట్రిబ్యూట్స్ బృందం. అడుగడుగునా డిస్ట్రిక్ట్-12 ని కాపిటోల్ ని పోల్చుకుని విస్తుపోతూ ఉంటుంది కాట్నిస్. డిస్ట్రిక్ట్-12 (ఆమాటకొస్తే దేశం మొత్తం) ఎంత పేదరికంలో ఉంటుందో, కాపిటోల్ లో అంత ఐశ్వర్యం ఉంటుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీకి లోటే లేదు. 

Google Image
ఎరీనాలోకి పంపేముందు ట్రిబ్యూట్స్ అందరినీ కాపిటోల్ లో ఊగించి, అటుపైన అందరితోనూ టీవీ ఇంటర్యూలు తీసుకోవడం ఆనవాయితీ. కాట్నిస్ కి డిజైనర్ గా వచ్చిన సిన్నో అనే యువకుడు ఆమెని కొత్తగా ప్రెజెంట్ చేయాలి అనుకుంటాడు. ఆమె ప్రాంతం బొగ్గుగనులకి ప్రసిద్ధి కనుక, ఆ ఆ విషయాన్ని ప్రజలకి గుర్తు చేసేలా నల్లని దుస్తులు వేసి, తలపైన ఓ వెలుగుతున్న కుంపటిని అలంకరిస్తాడు. దాంతో 'గాళ్ ఆన్ ఫైర్' గా అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది కాట్నిస్. టీవీ ఇంటర్యూలో పీటా తాను చిన్నప్పటినుంచీ కాట్నిస్ ని ప్రేమిస్తున్నానని, ఇప్పటివరకూ ఆమెకా విషయం చెప్పలేదని చెప్పడంతో షాక్ కి గురవుతుంది. జనం అందరికీ ఈ జంట మీద ప్రత్యేకమైన ఆసక్తి కలుగుతుంది. చివరికి ఎవరో ఒకరే మిగలాలనే నిబంధన ఉంది కాబట్టి, ఎరీనాలో ఈ ఇద్దరి మధ్యా పోటీ ఎలా ఉంటుందనే చర్చ మొదలవుతుంది. ఇలా వార్తల్లో ఉండడం వాళ్ళ స్పాన్సర్లని సంపాదించడం సులువవుతుంది కాట్నిస్ ని ఒప్పిస్తాడు హేమిచ్. 

ట్రైనింగ్ లో 'కెరీర్ ట్రిబ్యూట్స్' ని ప్రత్యేకంగా గమనిస్తుంది కాట్నిస్. ఇలా గేమ్స్ కోసం పిల్లని ప్రత్యేక శిక్షణతో తయారు చేయడం నియమాలకు విరుద్ధమే అయినా కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రం ఎంపిక చేసిన పిల్లల్ని ఇందుకోసం తయారు చేస్తూ ఉంటాయి. వాళ్ళకి 'కెరీర్స్' అని పేరు. తనకి మొదటి ముప్పు కెరీర్స్ నుంచే అని అర్ధం చేసుకుంటుంది కాట్నిస్. ఎరీనా లో అటవీ ప్రాంతం కూడా ఉండడం కాట్నిస్ కి కొంత ఊరట. ప్రతి రోజూ రాత్రి ఆకాశంలో కనిపించే అప్డేట్స్ ద్వారా మాత్రమే గేమ్స్ లో ఇంకా ఎవరు మిగిలిఉన్నారో తెలుసుకునే వీలుంటుంది ట్రిబ్యూట్స్ కి. వాళ్ళపని ఎవరికీ దొరక్కుండా తమని తాము రక్షించుకోవడం, మరొకరు ఎవరు కనిపించినా అంతమొందించడం. తన ఈడు పిల్లల కన్నా చాలా ముందే జీవన పోరాటం చేయడం మొదలు పెట్టిన కాట్నిస్ ఈ గేమ్స్ లో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంది? చివరికి విజేత కాగలిగిందా అన్నది ముగింపు. మొదటి భాగం తర్వాత మరో రెండు నవలలు (కాచింగ్ ఫైర్, మాకింగ్ జే) వచ్చాయి. ఆపకుండా చదివించే కథనం. ఇంతకీ ఈ మొదటిభాగంలో 'మూడువేళ్ళ నిరసన' ఒకట్రెండు చోట్ల ప్రస్తావనకు వచ్చిందంతే. 

శనివారం, నవంబర్ 21, 2020

మిడిల్ క్లాస్ మెలొడీస్

మలయాళంలో వస్తున్న నేటివిటీ సినిమాలు చూసి ఆహా ఓహో అనుకోడమే కాదు, మనవాళ్ళు అలాంటి ప్రయత్నం చేసినప్పుడు చూడాలి కూడా అనే స్ఫురణ కలిగి చూసిన సినిమా  'మిడిల్ క్లాస్ మెలొడీస్.'  భవ్య క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకి కొత్తదర్శకుడు వినోద్ అనంతోజు దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ హీరో హీరోయిన్లు. కథ మొత్తం గుంటూరు (టౌన్/సిటీ), చుట్టుపక్కల ఊళ్లలో జరగడం ఈ సినిమా ప్రత్యేకత. పైగా, హీరో రాఘవకి గుంటూరులో ఓ హోటల్ పెట్టి తను బ్రహ్మాండంగా చేస్తానని అనుకుంటున్న 'బొంబాయి చెట్నీ' (శనగపిండి ఉడకపెట్టి చేస్తారు, గోదావరి జిల్లాల్లో 'చింతామణి చట్నీ' అనేవారు - సుబ్బిశెట్టి గారి 'చింతామణి' కాదు) రుచిని అక్కడివాళ్ళకి చూపించి వాళ్ళ మెప్పు పొందాలన్నది ఆశయం.

తల్లిదండ్రులు (థియేటర్ నటులు సురభి ప్రభావతి, గోపరాజు రమణ) హోటల్ వ్యాపారంలోనే ఉన్నారు కానీ, గుంటూరుకి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పల్లెటూరిలో.  అలా చిన్నప్పటినుంచీ హోటల్ అనేది రాఘవ జీవితంలో ఓ భాగం. పైగా గుంటూరు కొత్తేమీ కాదు. మామ వరసయ్యే నాగేశ్వరరావు ఉండేది అక్కడే. ఆ మావయ్య కూతురు సంధ్య ఇంటర్మీడియట్ నుంచీ రాఘవని మూగగానూ, మాటల్లోనూ ఆరాధిస్తూ ఉంటుంది కూడా. మామయ్యకి షాపు ఉంది కానీ, అతగాడు 'తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే' అని నమ్మిన మనిషి. రాఘవకేమో తండ్రి సాధింపు, పాతికేళ్ళొచ్చేసినా ఇంకా ప్రయోజకుడవ్వలేదని. అక్కడ ఇంటర్లో క్లాస్మేట్ సంధ్యేమో ఇంకా ఇంజినీరింగ్ చదువుతూ.... ఉంటుంది (ఆమెది బాగా కష్టమైన బ్రాంచో, హీరో ఆలీసెంగా బళ్ళో చేరేడో తెలీదు మరి). 

రాఘవ నానా రకాల కష్టాలూ పడి తండ్రి తిట్లు, తల్లి దీవెనల నేపథ్యంలో మావయ్య షాపులోనే 'రాఘవ టిఫిన్ సెంటర్' మొదలు పెడతాడు.  అదిమొదలు, అప్పటివరకూ చక్కగా పక్కింటి కుర్రాడిలా ఉన్నవాడు కాస్తా వింతగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండకి తమ్ముడనీ, ఆ విజయ్ కి 'అర్జున్ రెడ్డి' అనే బలమైన ఇమేజి ఉందనీ దర్శకుడికి ఉన్నట్టుండి జ్ఞాపకం వచ్చిందేమో అని సినిమా చూసే ప్రేక్షకులకి  అనుమానం వచ్చేసేలా మన రాఘవ చీటికీ మాటికీ అందరితోనూ గొడవలు పెట్టేసుకుంటూ ఉంటాడు. తన హోటల్ కి కష్టమర్లు బొత్తిగా రారు. అప్పుడు హీరోయినొచ్చి, ప్రేక్షకులందరి తరపునా వకాల్తా పుచ్చుకున్నట్టుగా, "నువ్వు చేసే బొంబాయి చెట్నీ అంత గొప్పగా ఏమీ ఉండదు. దాన్నే నమ్ముకుంటే కష్టం. కాస్త నేలమీదకి దిగు" అని చెప్పి వెళ్తుంది. 

హోటల్ వ్యాపారంతో పాటు, రియలెస్టేటు, రాజకీయాలు, కాంట్రాక్టులు, చిట్ ఫండ్లు, జాతకాలు, సోషల్ రెస్పాన్సిబిలిటీ.. ఇలా అనేక విషయాలని కథలో భాగం చేసే ప్రయత్నం చేశాడు కొత్త దర్శకుడు. గుంటూర్లో హోటల్ పెట్టాలని కలలు కనే హీరో, తన ఊళ్ళో హోటల్ కి వచ్చిన కష్టమర్లని తక్కువ చేసి మాట్లాడ్డం ఏవిటో అర్ధం కాదు.  కష్టమర్లని  అవమానించి ఏ వ్యాపారస్తుడూ మనజాలడు కదా. సదరు గ్రామస్తులు కూడా, ఓ కాకా హోటల్ వాడు మనల్ని ఇన్నేసి మాటలు అనడం ఏమిటన్న ధ్యాస లేకుండా అతగాడు హీరో, మనం జూనియర్ ఆర్టిస్టులం అన్నట్టుగా ఊరుకుండి పోతారు. హీరో తండ్రిదీ పెద్దనోరే కానీ అతనెప్పుడూ కష్టమర్ల మీద అరిచినట్టుగా చూపించలేదు. అగ్రెసివ్ తండ్రి పాత్రని గోపరాజు రమణ బాగా చేశాడు. మన తెలుగు సినిమా హీరోహీరోయిన్లకి ఓ 'తెలుగు తండ్రి' దొరికినట్టే. 

రాఘవ ఫ్రెండ్ గోపాల్ (చైతన్య గరికిపాటి) కేరక్టర్ డిజైన్ బాగుంది. హీరో లవ్ ట్రాక్ కన్నా ఇతని లవ్ ట్రాకే ఆసక్తికరంగా అనిపించింది. ఈ కుర్రాడు, ఇతనికి జతగా నటించిన అమ్మాయి (దివ్య శ్రీపాద) చాలా సహజంగా చేశారు. పౌరాణిక, జానపద నాయికగా రంగస్థలాన్ని ఏలిన సురభి జమునా రాయలుని సినిమాలో చూడడం భలేగా అనిపించింది. ఓపెనింగ్ సీన్ లో కుర్చీతో మేడెక్కే బామ్మగా కనిపించిందీమె. హీరో తల్లిగా వేసిన సురభి ప్రభావతి కేఆర్ విజయని జ్ఞాపకం చేసింది. డిఫరెంట్ సినిమా తీద్దామని మొదలెట్టిన దర్శకుడు మధ్యమధ్యలో రొటీన్ తెలుగు సినిమా ఫార్ములాలోకి జారిపోతూ, పడుతూ లేస్తూ తాపత్రయ పడడం స్పష్టంగా తెలుస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో డ్యూయెట్లు, 'ప్రత్యేక' గీతాలు, ఫైట్లని ఇరికించక పోవడం పెద్ద రిలీఫ్. 

కొన్ని సీన్లు అవసరానికి మించి సా..గడం, మరికొన్ని అర్ధాంతరంగా ఆగిపోయినట్టు అనిపించడం ఎడిటర్ జాగ్రత్తపడవలసినవి. పాటలు, నేపధ్య సంగీతం బాగున్నాయి. గుంటూరుని పూర్తి స్థాయిలో తెరమీద చూపించలేదన్న లోటుని క్లైమాక్స్ తీర్చేస్తుంది. ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించిన 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ క్లైమాక్స్ లో ప్రత్యేక ఆకర్షణ. ఇతగాడు ప్రయాణించే కారూ, ఆటో గుంటూరులో ముఖ్య ప్రాంతాలని చుట్టేశాయి.  'రొటీన్ సినిమా'  చట్రాన్ని పూర్తిగా బద్దలుకొట్టగలిగి ఉంటే మరింత మంచి సినిమా అయ్యే అవకాశం ఉన్న ఈ 'మిడిల్ క్లాస్ మెలొడీస్' ని అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు.

మంగళవారం, నవంబర్ 17, 2020

రాతి తయారీ

వైవిధ్యభరితమైన కథల్ని అందించే తెలుగు రచయిత సురేష్ పిళ్లె నుంచి వచ్చిన రెండో కథా సంకలనం 'రాతి తయారీ'. తొలి సంకలనం 'పూర్ణమూ నిరంతరమూ' లో లాగే ఇందులోనూ పందొమ్మిది కథలున్నాయి.  ఇవన్నీ గడిచిన పాతికేళ్లలో వివిధ పత్రికల్లో అచ్చయినవి, బహుమతులు గెల్చుకున్నవీను. ఎక్కువగా సమకాలీన అంశాలనే ఇతివృత్తాలుగా తీసుకున్నప్పటికీ, ఈ కథలన్నీ ఇవాళ్టి సమాజానికి రిలవెంట్ అనిపిస్తాయి. తద్వారా, గత పాతికేళ్లలో కొన్ని కొన్ని విషయాల్లో పెద్దగా మార్పేమీ వచ్చెయ్యలేదని బోధ పడుతుంది, ఈ కథలు చదవడం పూర్తి చేశాక. ఎక్కువ కథలకి 'వ్యంగ్యాన్ని' టోన్ గా ఎంచుకున్నారు రచయిత. నిజానికిది కత్తిమీద సాము. కనీసం కొందరు పాఠకులైనా వ్యంగ్యాన్ని హాస్యంగా భ్రమ పడే ప్రమాదం ఉంది. అయితే, ఈ సాముని బహు నేర్పుగా చేయడం ద్వారా తన పాఠకుల్ని ఆ ప్రమాదంలోకి నెట్టలేదు రచయిత.  

నక్సల్బరీ ఉద్యమం నేపధ్యంగా సాగే 'అలియాస్' కథతో మొదలయ్యే ఈ సంకలనం ఆశావహ దృక్పథంతో సాగే 'సేవ-బాధ్యత' అనే చిన్న కథతో ముగుస్తుంది. ప్రతి కథనీ ముగించగానే కాసేపు ఆగి ఆలోచించాల్సిందే. కవలలుగా పుట్టిన శివ కేశవుల్లో ఒకడు అన్నల వెంట అడవుల దారి పడితే, రెండో వాడు దాని తాలూకు చేదు ఫలితాలు అనుభవిస్తాడు. కొన్ని పరిణామాల అనంతరం, రెండో వాడు అడవి దారి పట్టేందుకు సిద్ధమవుతాడు. మొదటివాడు సౌకర్యవంతమైన జీవితంలోకి ప్రవేశిస్తాడు. బతకడానికి అవసరమైన లౌక్యం విలువని అన్యాపదేశంగా చెప్పే కథ ఈ 'అలియాస్.' రెండో కథ 'కుక్కా నక్కల పెళ్లి' హాస్యంగా మొదలవుతుంది కానీ హాస్యకథ కాదు. తన క్లాసు పిల్లలు గురుకులానికి సెలక్టయితే వాళ్ళ ప్రతిభకి గర్వపడాలో, క్లాసులో 'క్రీమ్' అంతా వెళ్ళిపోతోన్నందుకు బాధ పడాలో తెలియని సందిగ్ధావస్థలో ఉన్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కథ ఇది.  

సారా వ్యాపారంతో ప్రభుత్వాలాడే దోబూచులాటని 'చమించేయండి' చిత్రిస్తే, పల్లె మూలాలున్న చాలామంది నగర జీవుల ఎవర్ గ్రీన్ కలకి అక్షర రూపం 'జిందగీ.' ఓ. హెన్రి తరహా మెరుపు ముగింపు కలిగిన కథ 'తడిచిన సోఫా'. రచయితలో ఆశావహ దృక్పథానికి ఉదాహరణలుగా నిలిచే కథలు 'తోడు', 'థియరీ ఆఫ్ యాక్టివిటీ.' నిజానికి ఈ ఆశావహ దృక్పథం అన్ని కథల్లోనూ కనిపిస్తుంది. సంసారాన్ని చక్కదిద్దుకునేందుకు ఏడాది పాటు ఓపిక పట్టిన రాధ కథ 'దిద్దుబాట.' ఏడాది పెద్ద గడువే నిజానికి. హిరణ్యాక్ష వరాన్ని గుర్తుచేసే కథ 'దొరకానుక.' దేవుడి చుట్టూ జరిగే వ్యాపారంలో ఒకానొక కోణాన్ని చిత్రించారు 'నవ్వు మొలిచింది' కథలో. ఎంసెట్ ఒత్తిడికి నలిగిపోయే ఓ కుర్రాడి జీవితం 'నాన్నకి ప్రేమతో' కథలో కనిపించి భయపెడుతుంది. 
 

అడపాదడపా వినవస్తున్న బదిలీలల కథ 'బదిలీ.' కథానాయిక పేరు 'అప్పలమ్మ' అని చూసి దీనిని హాస్య కథ అనుకోరాదు. రచయితకెంతో పేరు తెచ్చిన కథ 'రాతి తయారీ.' నిరంతర వార్తాస్రవంతులని ఇతివృత్తంగా చేసుకుని సూటిగా, నిస్పక్షపాతంగా రాసిన తెలుగు కథల్లో బహుశా   ఇదే మొదటిది. తర్వాత కూడా వేళ్ళమీద లెక్కపెట్టే అన్ని కథలు మాత్రమే వచ్చాయి. 'రిరంస' అనే సంస్కృత పదానికి అర్ధం వెతుక్కోనక్కర్లేదు, ఇదే పేరుతో ఉన్న కథ చదివితే. కథతో సాఫ్ట్వేర్ దంపతులు మరీ ఏటా ఉద్యోగాలు మానేయడాన్ని చిత్రించారు కానీ, లాంగ్ లీవ్ ఆప్షన్లు కూడా ఉంటాయనుకుంటా. పల్లెటూరి బడిచదువులు ఇతివృత్తంగా ఓ ఉపాధ్యాయురాలి దృష్టికోణం నుంచి వచ్చిన కథ 'లచ్చిమి.' గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసపు లేమి ఎక్కడ నుంచి మొదలవుతుందో చాలా చక్కగా పట్టుకున్నారు రచయిత.  

'కర్మ ఈజ్ బూమరాంగ్' అంటూ ఉంటారు కదా. ఈ మాటని ఓ కథలో బంధిస్తే ఆది 'వేరు పాత్రలు ఒకటే కథ.' ఈ కథని చెప్పిన విధానం మాత్రం దామల్ చెరువు అయ్యోరు మధురాంతకం రాజారాం కథన శైలిని గుర్తు చేసింది. అలాగే 'శివమ్' కథని పూర్తి చేశాక నాటక, సినీ, కథా రచయిత గంధం నాగరాజు కథ 'జీవితానికో పుష్కరం' గుర్తొచ్చింది. సురేష్ పిళ్లె కథల్లో రొమాంటిక్ సన్నివేశాలు వచ్చిన ప్రతిసారీ యండమూరి నవలలు గుర్తుకొచ్చాయి. వాటి ప్రభావం రచయిత మీద ఉందో, పాఠకుడి (నేనే) మీద ఉందో మరి. కాంట్రాక్టర్లు-ఇంజినీర్లు-రాజకీయ నాయకుల మధ్య ఉండే ఇనుప త్రికోణాన్ని నేర్పుగా పాఠకుల ముందుంచిన కథ 'సెవెంత్ ఫ్లోర్.' ఈ కథ మూడేళ్ళ క్రితం ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురింప బడిందని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను.  

పుస్తకం చివర్లో ఉన్న రెండు అనుబంధ వ్యాసాలూ 'రాతి తయారీ' కథకి సంబంధించినవే. మొదటిది జాన్సన్ చోరగుడి రాసిన సమీక్ష వ్యాసం కాగా, రెండోది కథా నేపధ్యాన్ని గురించి ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో రచయిత సురేష్ పిళ్లె చేసిన ప్రసంగ పాఠం. 'రాతి తయారీ' కథని మొదటగా బహుమతికి తిరస్కరించిన పత్రికని మనం అభినందించకుండా ఉండలేం. ఈ రెండు సంకలనాలతో ఆగిపోకుండా సురేష్ పిళ్లె మరిన్ని కథలు రాయాలని కోరుకుంటున్నా. తన నవల 'సుపుత్రికా ప్రాప్తిరస్తు' చదవాల్సి ఉంది. ('రాతి తయారీ' కథా సంకలనం, ఆదర్శిని మీడియా ప్రచురణలు, పేజీలు 176, వెల రూ. 200. ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు అమెజాన్ ద్వారానూ లభిస్తోంది.

శనివారం, నవంబర్ 14, 2020

ఆకాశం నీ హద్దురా

తెలుగు దర్శకురాలు సుధ కొంగర తమిళంలో తీసిన 'సూరారై పోట్రు'  సినిమాకి తెలుగు డబ్బింగ్ 'ఆకాశం నీ హద్దురా.' ఎయిర్ డెక్కన్ పేరుతో చౌక విమానయానాన్ని భారతీయులకి పరిచయం చేసిన కెప్టెన్ గోపీనాథ్ ఆత్మకథ 'సింప్లి ఫ్లై' లో కొన్ని భాగాలు తీసుకుని, వాటికి సినిమాకి అవసరమైన మరికొన్ని దినుసుల్ని చేర్చి వండిన కథలో - కన్నడనాట పుట్టిన గోపీనాథ్ ని మదురై తమిళుడిగా ఒరిజినల్ లోనూ, గుంటూరు జిల్లా చుండూరు వాసి చంద్ర మహేష్ గా తెలుగులోనూ చూపించారు. చిన్నప్పటినుంచీ విమానాలని ప్రేమించిన మహా (చంద్ర మహేష్ గా తమిళ నటుడు సూర్య)కి సామాన్య ప్రజలకి విమానయానాన్ని అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం. 

స్కూలు మేష్టారు, గాంధేయ వాదీ అయిన తండ్రి ప్రభుత్వానికి ఉత్తరాలు రాసి ఊరికి కరెంటు తెప్పించడమే కాక, ఎక్స్ప్రెస్ రైలు స్థానిక స్టేషనులో ఆగేలా కృషి చేస్తాడు. అయితే రైలుకి హాల్టుని యువకుడైన మహా సాధిస్తాడు. దానితో అతనిలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. నేవీలో కొన్నాళ్ళు ఉద్యోగం చేశాక, చౌక విమాన సర్వీసుల వ్యాపారం కోసం ఉద్యోగం వదిలిపెట్టి ఊరికి తిరిగి వచ్చేస్తాడు. బేకరీ వ్యాపారం చేసి తానేమిటో నిరూపించుకోవాలని తపన పడే బేబీగా పిలువబడే సుందరి (మలయాళ నటి అపర్ణ బాలమురళి) మహాని ఇష్టపడి అతనికి కొన్ని కండిషన్లు పెట్టిమరీ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటుంది. అక్కడి నుంచీ చౌక విమాన సర్వీసు అన్నది వాళ్ళిద్దరి కలా అవుతుంది. మహా ఎయిర్ ఫోర్స్ మిత్రులతో పాటు, ఊళ్ళో వాళ్లంతా అతని వెనుక నిలబడతారు. 

అయితే అతను తలపడాల్సింది ప్రభుత్వాన్నే శాసించే కార్పొరేట్ దిగ్గజం పరేష్ గోస్వామి (పరేష్ రావల్) తో. సాక్షాత్తూ టాటా గ్రూపునే  ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి రానివ్వనంత మోనోపలీని ఆ సరికే సాధించేసిన పరేష్, మహాకి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తాడు. వాటన్నింటినీ అంతే సమర్ధవంతంగా ఎదుర్కొంటూ, పడుతూ లేస్తూ మహా తన లక్ష్యాన్ని చేరుకోవడం ముగింపు. అన్ని బయోపిక్స్ మాదిరిగానే ఇందులోనూ కెప్టెన్ గోపీనాథ్ జీవిత విశేషాలని చివర్లో జతచేశారు. విలన్ అడ్డంకులు సృష్టిస్తాడనీ, హీరో లక్ష్యాన్ని సాధిస్తాడనీ ప్రేక్షకులు అంచనా వేసేసుకోగలిగిన కథని చివరివరకూ ఆసక్తికరంగా చెప్పడం దర్శకురాలి విజయం. బేబీ పాత్రని పాటలకీ, సెంటిమెంటుకీ పరిమితం చేసేయకుండా చాలా బలంగా రాసుకోడాన్నే తన విజయానికి దగ్గరదారిగా చేసుకుంది దర్శకురాలు. 


డిఫరెంట్ షేడ్స్ ఉన్న మహా పాత్రని అనాయాసంగా చేశాడు సూర్య. అతనికి సత్యదేవ్ చేత డబ్బింగ్ చెప్పించడం ద్వారా ఈ డబ్బింగ్ సినిమాకి తెలుగుదనం అద్దే ప్రయత్నం చేశారు. బేబీగా చేసిన అపర్ణ సూర్యతో పోటీ పడడమే కాదు, కొన్ని సన్నివేశాల్లో అతన్ని డామినేట్ చేసింది కూడా. వీళ్లిద్దరి తర్వాత ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నది విలన్ పరేష్ రావల్ కి. విలనిజమే అయినా ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రత్యేకత చూపించేందుకు కృషి చేసే నటుడు కావడంతో, ఈ సినిమాలో కార్పొరేట్ విలనీని ఎక్కడా అతి లేకుండా ప్రదర్శించగలిగాడు. హీరో తల్లిగా కనిపించిన ఊర్వశికి ఇలాంటి పాత్రలు చేయడం బహు సులువు. 

ఓ అతిధి పాత్ర లాంటి ప్రత్యేక పాత్రలో కనిపించి మన మోహన్ బాబు ఆశ్చర్య పరిచాడు. తన ఈడు వాళ్ళు ఇంకా హీరో వేషాలు కొనసాగిస్తూ ఉండగా, తాను కేరక్టర్లకి షిఫ్ట్ అయిపోవడమే కాక, నిడివిని కాక పాత్రని మాత్రమే చూసి సినిమాలు అంగీకరిస్తున్నాడని మరోసారి అనిపించింది. ఎయిర్ ఫోర్స్ అధికారిగా నాలుగైదు సీన్లకే పరిమితమైన పాత్రే అయినా, కథకి కీలకం. డబ్బింగ్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ  తమిళ నేటివిటీ అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. బోర్డులు, వాల్ పోస్టర్ల వరకూ తెలుగు చేసినా ఇంకా చాలా విషయాలు వదిలేశారు.  అయితే, సినిమాలో కథ పాకాన పడే కొద్దీ ఈ నేటివిటీ పలుకురాయిని మర్చిపోగలుగుతాం. 

కొన్ని సన్నివేశాలు - మరీ ముఖ్యంగా కాసిన్ని ఉన్న రొమాంటిక్ సన్నివేశాలు - మరియు హీరోయిన్ పాత్ర చిత్రణ చూసినప్పుడు మణిరత్నం మార్కులా అనిపించి, ఆరాతీస్తే, దర్శకురాలు సుధ మణిరత్నం శిష్యురాలని తెలిసింది. 'గీతాంజలి' సినిమాలో ఓ బిట్టు, 'సఖి' పోస్టరూ కనిపించాయి సినిమాలో. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో పాటలకన్నా నేపధ్య సంగీతం బాగా కుదిరింది. సినిమా నిడివి రెండున్నర గంటలు. కనీసం ఓ పావుగంట ట్రిమ్ చేయచ్చు. హీరో-విలన్ ల రెండో భేటీ, ఛాలెంజులు లాంటి  సినీ మసాలాలని కాస్త తగ్గించి ఉంటే బాగుండేదనిపించింది. ఇలాంటి వాటిని కాస్త సరిపెట్టుకుంటే, చూడదగిన సినిమా ఇది. ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉందీ సినిమా