శనివారం, ఏప్రిల్ 22, 2023

సంకెళ్లను తెంచుకుంటూ

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్  చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు ఆత్మకథ 'సంకెళ్లను తెంచుకుంటూ'. మాధవ రావు స్వయంగా ఇంగ్లీష్ లో రాసుకున్న 'బ్రేకింగ్ బారియర్స్' కు రఘురాములు చేసిన తెలుగు అనువాదం ఇది. కృష్ణా జిల్లా పెద మద్దాలి గ్రామంలో ఓ దళిత కుటుంబంలో జన్మించి, తల్లి ప్రోత్సాహంతో చదువు సాగించి, ఐఏఎస్ సాధించి, ఎందరో ఐఏఎస్లు కలగనే చీఫ్ సెక్రటరీ పోస్టు వరకూ రావు చేసిన ప్రయాణమే ఈ పుస్తకం. వ్యవసాయ కూలీలుగా పని చేసిన మాణిక్యమ్మ, శోభనాద్రి దంపతుల చిన్న (రెండో) కొడుకుగా పేదరికంలో గడిచిన బాల్యం మొదలుకొని, ఉద్యోగ జీవితంలో ఎదురైన సవాళ్లు, ఆటుపోట్లు మీదుగా, తాను కోరుకుంటున్న సాంఘిక, రాజకీయ సంస్కరణల వరకూ తన అనుభవాలను, ఆలోచనలను అక్షరబద్ధం చేశారు మాధవ రావు. 

మోతుబరి రైతు దగ్గర పాలేరుగా జీవితం గడిపిన శోభనాద్రి తన కొడుకులు ఇద్దరూ కూడా తనలాగే 'నమ్మకస్తులైన పాలేర్లు' గా జీవించాలని గట్టిగా కోరుకున్నారు. ఈ ఆలోచనని అంతకన్నా గట్టిగా వ్యతిరేకించారు మాణిక్యమ్మ. ఫలితం, కొడుకులిద్దరూ ఊరి ఎలిమెంటరీ స్కూలు దాటి హైస్కూలుకి, అటుపైన కాలేజీకి వెళ్లి చదువుకునే అవకాశం దొరికింది. పెద్ద కొడుకు ఉద్యోగంలో కుదురుకోగా, ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చదివిన మాధవరావు సివిల్ సర్వీసెస్ సాధించారు. తనకి మేలు చేసిన ఎంతో మందిని పుస్తకం పొడవునా పేరు పేరునా ప్రస్తావించినప్పటికీ, తనలో సివిల్ సర్వీసెస్ ఆలోచన మొలకెత్తడానికి కారకులు, ప్రిపరేషన్ కి సహాయ పడిన వారు, ప్రోత్సహించిన వారి వివరాలని ఎక్కడా రాయకుండా ఆశ్చర్య పరిచారు రచయిత. 

"కట్ చేస్తే ఐఏఎస్" అన్నంత సులువుగా చదువు నుంచి ఉద్యోగ విషయాల్లోకి వచ్చేయడం వల్ల ఓ ముఖ్యమైన లింక్ మిస్సయినట్టుగా అనిపించింది పుస్తకం చదువుతుంటే. ప్రారంభంలో ఏ కెరీర్ లో అయినా ఇబ్బందులు సహజమే. సివిల్ సర్వీస్ ఇందుకు మినహాయింపు కాదని గతంలో కొందరు ఐఏఎస్ లు రాసిన ఆత్మకథల్లో చదువుకున్నాం. అలాంటి సమస్యలే మాధవరావుకీ ఎదురయ్యాయి. తనని ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లు బయట పెట్టలేదన్న మాటే కానీ, వాళ్ళ వివరాలు ఎంత సూక్ష్మంగా చెప్పారంటే -- ఇచ్చిన ఆధారాల సాయంతో గూగుల్ చేసి వాళ్ళ పేర్లు, ఫోటోలు సరి చూసుకోవచ్చు. ఎన్నో క్లిష్టమైన ఫైళ్లని పరిష్కరించిన అనుభవం కదా మరి. వరంగల్ కలెక్టర్ గా పని చేసిన నాటి అనుభవాలు మాత్రం ఆసక్తిగా చదివిస్తాయి. 'నక్సలైట్ సానుభూతి పరుడు' అన్న ముద్ర పడింది అప్పుడే. 

నేదురుమల్లి జనార్దన  రెడ్డి  ముఖ్యమంత్రి గా పనిచేసే రోజుల్లో, మాధవరావు సెక్రటరీ గా ఉన్నారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హైదరాబాద్ వస్తున్నారు. మాధవరావు ని ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఆమెకి స్వాగతం పలకమన్నారు జనార్దన రెడ్డి. అంతకు మునుపే జనార్దన  రెడ్డి తమిళనాడు వెళ్ళినప్పుడు జయలలిత సెక్రటరీ ఆయనకి స్వాగతం పలికారు. ఇది బదులు తీర్చుకోడం అన్నమాట. అయితే, జయలలితకి స్వాగతం పలకడానికి మాధవరావు నిరాకరించారు. ఆయనదృష్టిలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత జానకి రామచంద్రన్ (ఎంజీఆర్ భార్య) కి ఉంది తప్ప, జయలలితకి కాదు. ఈ అభ్యంతరాన్ని జనార్దన రెడ్డి మన్నించారు. అనూహ్యంగా, ఇది జరిగిన కొన్నేళ్ళకే, ఎన్టీఆర్ వెన్నుపోటు ఫలితంగా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ పదవి చేపట్టారు మాధవరావు. దీనిని కేవలం 'పారడాక్స్' అనగలమా?  

మొత్తం పధ్నాలుగు అధ్యాయాలుగా విభజించిన ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చినవి పది, పదకొండు అధ్యాయాలు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు పనితీరు పట్ల రచయిత పరిశీలనలున్నాయి వీటిలో. తాను చెప్పాలనుకున్న విషయాలని కొన్ని చోట్ల నేరుగానూ, చాలాచోట్ల గుంభనంగానూ చెప్పుకొచ్చారు. ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ ఏర్పాటు గురించి చెబుతూ "హైదరాబాద్ సంస్థాన పరిపాలకుడైన నిజాం ఉస్మానియా యూనివర్సిటీ కి 1917 లో 1,600 ఎకరాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక్క బిజినెస్ స్కూల్ కు 260 ఎకరాలు కేటాయించారు" అన్నారు. ఈ రెంటిలో ఏ సంస్థ ఏయే వర్గాలకి ఉపయోగ పడిందన్న ప్రశ్న పాఠకులే వేసుకుని, జవాబు వెతుక్కోవాలి. ఐఎస్బీ కి, సింగపూర్ విమానాలకి ఇచ్చిన 'రాయితీ' లని వివరంగానే ప్రస్తావించారు. 

మొత్తం పుస్తకాన్ని పూర్తి చేశాక, రచయిత తన చిన్ననాటి పేదరికాన్ని, తన కులాన్ని 'సంకెళ్లు' గా భావించారనిపించింది. కడుపు నిండా తిండి దొరకని నాటి పేదరికం, అప్పుడు తప్పక మొదలుపెట్టిన మితాహారాన్ని ఇప్పటికీ కొనసాగించడం లాంటి విషయాలు కదిలిస్తాయి. అయితే, కులం అన్నది ఆయన విషయంలో సంకెలగా కాక పూలదండగానే మారిందనిపించింది (పుస్తకంలో ప్రస్తావించిన విషయాల మేరకు). మరీ ముఖ్యంగా, చీఫ్ సెక్రటరీ నియామకం వెనుక కులం బలంగా పనిచేసింది. ఎస్సీ వర్గీకరణ ఆందోళనలు జరుగుతున్న ఆ రోజుల్లో కీలక పదవికి తనని ఎంపిక చేయడం వెనుక చంద్రబాబు నాయుడు వ్యూహమూ, చాతుర్యమూ ఉన్నాయన్నది మాధవరావే అంగీకరించిన విషయం. పాలనా సంబంధ విషయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఆసక్తి కలిగించే పుస్తకం. అనువాదం మరికొంత సరళంగా ఉండొచ్చు. (భూమి బుక్ ట్రస్ట్ ప్రచురణ, పేజీలు 289, వెల రూ. 300. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఆన్లైన్ లోనూ లభ్యం). 

ఆదివారం, ఏప్రిల్ 09, 2023

నీలంపురాశి

మహాత్మా గాంధీ చేసిన మొదటి సత్యాగ్రహం 'చంపారన్' నీలి రైతులకి మద్దతుగా 1917 లో జరిగింది. అహింసాయుతంగా జరిగిన ఆ సత్యాగ్రహం సహాయనిరాకరణ తదితర అహింస ఉద్యమాలకి నాంది పలికింది. అయితే, చంపారన్ కి అరవయ్యేళ్ళ ముందే బెంగాల్ లో నీలి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారనీ, 1857 నాటి సిపాయిల తిరుగుబాటుకి దోహదం చేసిన అంశాల్లో బెంగాల్ నీలి సమస్యకూడా ఒకటని చరిత్రని క్షుణ్ణంగా చదివిన వారికి తప్ప మిగిలిన వారికి తెలిసే అవకాశం లేదు. బెంగాల్ నీలి రైతుల తిరుగుబాటు తర్వాత, ప్రత్యామ్నాయం ఆలోచించిన బ్రిటిష్ ఇండిగో ప్లాంటర్ల దృష్టి ఆంధ్ర ప్రదేశ్ లో మచిలీపట్టణం రేవుపట్టణ పరిసర గ్రామాల మీద పడిందనీ, మచిలీపట్నం-నిజాంపట్నం పోర్టుల మధ్య గ్రామాల రైతులు నీలిని పండించి రాణీకాసులు సంపాదించుకున్నారన్నది చరిత్రలో మరుగున పడిపోయిన సంగతి. దేశ రాజకీయాలని, ఆంధ్ర రైతాంగపు చరిత్రని మలుపుతిప్పిన నీలి పంట ఇతివృత్తంగా చంద్రలత రాసిన బృహన్నవల 'నీలంపురాశి'. 

చంద్రలత పేరు చెప్పగానే తానా నవలల పోటీలో బహుమతి గెలుచుకున్న 'రేగడి విత్తులు' నవల మొదట గుర్తుకురావడం సహజం. నాకుమాత్రం నీటిపారుదల ప్రాజెక్టులు ఇతివృతంగా ఆమె రాసిన 'దృశ్యాదృశ్యం' నవలంటే ప్రత్యేకమైన ఇష్టం. ఒక డ్రై సబ్జెక్టుకి ఫ్యామిలీ డ్రామాని జతచేసి, ఆద్యంతమూ ఆసక్తిగా చదివించడమే కాక, చిన్న పాత్రలని కూడా ప్రధాన కథలో భాగం చేసిన నవలది. 'దృశ్యాదృశ్యం' తర్వాత ఆ రచయిత్రి నుంచి వస్తున్న పెద్దనవల కావడం, పైగా చరిత్ర నేపథ్యంతో రాసిన నవల కావడం వల్ల చాలా కుతూహలంతో చదవడం మొదలుపెట్టాను. చదువుతున్నంత సేపూ, నవల పూర్తి చేసి పక్కన పెట్టాక కూడా నాకు అనిపించింది ఒక్కటే "చంద్రలత ఓ పరిశోధన రాక్షసి". మొత్తం 538 పేజీల ఈ నవల కోసం ఆమె చేసిన పరిశోధన సినాప్సిస్ నిడివి నవలకి మరో నాలుగు రెట్లు ఉంటుందనిపించింది. 

బెంగాల్ నీలి ఉద్యమం మొదలు, భారత దేశానికి వలస వచ్చిన ఆంగ్లో-ఇండియన్ల జీవిత శైలి, స్థానికులతో వాళ్ళ సంబంధాలు, నాటి స్థానిక వ్యవసాయ పద్ధతులు, ఉమ్మడి కుటుంబ జీవన విధానం, తీరప్రాంతపు మోతుబరి రైతులు వ్యాపారులుగా పరిణమించిన వైనం, వంశపారంపర్యంగా చేసే అద్దకం వృత్తి, ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాణి పాలనా పగ్గాలు అందుకున్న తరుణంలో కొత్తగా తయారైన సివిల్ సర్వెంట్ల ఆలోచనలు, పని తీరు, నాటి బెంగాల్ విద్యావంతుల్లో బ్రిటిష్ వారి పట్ల పెరిగిన ఆరాధన, కాలక్రమంలో ఆ అభిమానం అనుమానంగా మారిన వైనం, ఇందుకు దోహదం చేసిన పరిస్థితులు... ఇలా ఒకటని కాదు. సమాచార సేకరణ ఒక ఎత్తైతే, కథా క్రమాన్ని అనుసరించి, చారిత్రక క్రమానికి తగ్గట్టుగా కథా కాలాన్ని నిర్మించుకుని, సేకరించిన సమాచారాన్ని కథలో పొదగడం మరో ఎత్తు. నీలిపంట, నీలిమందు, నీలికళ్ళ మనుషులు (ఆంగ్లో-ఇండియన్స్), కథనిండా కనిపించేవి ఇవే. 

బెంగాల్ కి చెందిన విద్యావంతుడు శిశిర్ కుమార్ మిత్ర (శిశిరుడు), మచిలీపట్టణం రేవుకి దగ్గరగా ఇండిగో ఎస్టేట్ నడిపే ఆంగ్ల కుటుంబం రాబిన్సన్స్, స్థానిక రైతు సాంబశివుడి కుటుంబం అనే మూడు కథల ముప్పేటగా సాగుతుంది 'నీలంపురాశి'. శిశిరుడు బెంగాల్ నుంచి తలదాచుకోడం కోసం మచిలీపట్నం రావడంతో మొదలయ్యే కథ అనేక మలుపులు తిరుగుతూ సాగర తీరంలో జరిగే ఒక అనూహ్య సంఘటన అనంతర పరిణామాలతో ముగుస్తుంది. బెంగాల్ నీలి ఉద్యమంతో పాటు, ఆంధ్ర రైతుల జీవితాల్లో నీలిపంట తెచ్చిన మార్పులు, కంపెనీ నుంచి రాణి కి పాలన మారిన సందర్భంలో జరిగిన చారిత్రక సంఘటనలు, వాటి ఫలితంగా స్థానికులు పొందినవి, కోల్పోయినవి, వీటన్నింటినీ చర్చిస్తూ సాగుతుంది ఈ నవల. బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలు, కథ ముందుకు సాగే కొద్దీ చిక్కపడే కథనం ఈనవల ప్రత్యేకతలుగా చెప్పాలి. 

బెంగాల్ నుంచి శిశిరుడు మచిలీపట్టణం ఎందుకు వచ్చాడు, తమ బెంగాల్ సహచరులు కోల్పోయిన నీలి వ్యాపారాన్ని రాబిన్సన్స్ కుటుంబం ఎలా అందిపుచ్చుకుంది, నీలి పంట ఫలితంగా సాంబశివుడిలోనూ, అతని కుటుంబంలోనూ వచ్చిన మార్పులేవిటన్నది స్థూలంగా చెబుతూనే, సూక్ష్మ స్థాయిలో స్థానిక అద్దకం పరిశ్రమ, వంశపారంపర్యంగా వాళ్ళు దాచుకంటూ వస్తున్న 'నీలి' రహస్యాలు, పొంగళ్ళు పెట్టడం లాంటి ఆచారాలు, గోవాడ ప్రభల తిరనాళ్ళు, వలస వచ్చాక మరింత బ్రిటిష్ గా మారిపోయే ఆంగ్లేయుల కుటుంబ జీవనం, స్థానిక జమీందారీలు, మిషనరీలు, చర్చిలు, స్కూళ్ళు, స్థానికుల దృష్టిలో దొరలూ, బ్రిటిష్ వారికి పంక్తి బాహ్యులూ అయిన యురేషియన్లు (భారతీయ తల్లికి, ఆంగ్లేయ తండ్రికి పుట్టిన సంతానం) లాంటి అనేక సూక్ష్మ విషయాలని సందర్భోచితంగా ప్రస్తావించారు రచయిత్రి. 

శిశిరుడు మచిలీపట్నం రావడంతో కథ మొదలు పెట్టడం, అతని నేపధ్యాన్ని, ప్రయాణపు అనుభవాలని తాపీగా చెబుతూ పోవడం వల్ల తొలి వంద పేజీల్లో కథనం బహు నింపాదిగా సాగిన భావన కలిగింది. వందపేజీల తర్వాతే కథలో నీలి పంట ప్రవేశించింది. అక్కడినుంచీ కథనం వేగం పుంజుకుంది. నవలని శిశిరుడి కథతో కాక, రాబిన్సన్స్ కథతో మొదలు పెట్టి ఉంటే ఈ 'నింపాది' సమస్య ఉండేది కాదు. మరికొన్ని కారణాలకి కూడా రాబిన్సన్స్ తో కథని మొదలు పెట్టడమే సమంజసం. మరి రచయిత్రి కథని ఈ ఆర్డర్ లో ఎందుకు చెప్పారో. రాబిన్సన్స్ వారసుడు, స్థానిక రైతాంగం 'హరయ్య బాబు' అని పిలుచుకునే హ్యారీ పాత్ర మీద రచయిత్రికి కలిగిన ప్రత్యేకమైన అభిమానం మరో సమస్య. అతని స్నేహితుడు, ఆపై కుటుంబ సభ్యుడు అయిన ఐసీఎస్ అధికారి ఆష్లీ కన్నా హ్యారీని ఓ మెట్టు పైన చూపించడానికి రచయిత్రి ప్రత్యేకంగా కష్టపడ్డారనిపించింది. ఐసీఎస్ శిక్షణలో ప్రథముడిగా నిలిచిన ఆష్లీకి స్థానికులు తనకి నమస్కరించినప్పుడు  ఎలా ప్రతిస్పందించాలో హ్యారీ నేర్పించడం ఇందుకు పరాకాష్ట. ఈ ఆష్లీ లో అక్కడక్కడా 'దృశ్యాదృశ్యం' కేశవ ఛాయలు కనిపించాయి. 

మమ్మారోజీ, లూయిసా, పార్వతి లాంటి బలమైన స్త్రీపాత్రల్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. గ్రేట్ గ్రానీని, సారా విత్ హెచ్ నీ కూడా పాఠకులు ఓ పట్టాన మర్చిపోలేరు. పోస్ట్ మాస్టర్ లక్ష్మీనారాయణ, వ్యాపారి సత్యనారాయణ పేర్ల మధ్య రచయిత్రి చాలాసార్లు తికమక పడ్డారు. లక్ష్మీనారాయణ గురించి చెబుతూ అతన్ని సత్యనారాయణ అని ప్రస్తావించడం చాలాసార్లు జరిగింది. 'బృందావనం' వారి మేనల్లుడు కనుక పోస్ట్ మేష్టారు పాత్రకి ఆ పేరు సబబే. వ్యాపారి పేరు మార్చుకుని ఉంటే ఈ ఇబ్బంది ఉండకపోయేదేమో. మిగిలిన ఏ పాత్రల విషయంలోనూ ఈ సమస్య లేదు కానీ అచ్చుతప్పులు మాత్రం చాలానే కనిపించాయి. ప్రూఫ్ ని మరింత శ్రద్ధగా దిద్దడం అవసరం. తొలి వంద పేజీలు కొంచం ఓపిగ్గా చదివితే, ఆ తర్వాత ఆపకుండా చదివించే కథనం. కథాకాలం నాటి ఆంగ్ల సాహిత్యాన్ని, రచయితల్ని, పాత్రల్ని నవలలో సందర్భోచితంగా ప్రస్తావించడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చివర్లో ఇచ్చిన 'ఆధార పట్టిక & పదసూచిక' పాఠకులకి అత్యంత సహాయకారి. 

నీలిపంటకి, నీలిమందుకి సంబంధించి దాదాపు అన్ని విషయాలనీ కథలో భాగం చేసినా, 'నీలివార్త' గురించి ప్రస్తావించలేదు ఎందుకో మరి. ఇప్పుడు 'రూమర్/గాసిప్' అని పేరుబడిన నీలివార్తల్ని ఒకప్పుడు పనికట్టుకుని ప్రచారంలోకి తెచ్చేవారట. నీలిమందు ఉడకనప్పుడు ఇలాంటి వార్తల్ని ప్రచారంలోకి తెస్తే అప్పుడు బాగా ఉడుకుతుందని ఓ నమ్మకం ఉండేదని, అలా పుట్టినవే నీలివార్తలనీ గోదావరి జిల్లాల్లో జనబాహుళ్యం చెప్పుకునే మాట (మిగిలిన ప్రాంతాల సంగతి తెలియదు, రచయిత్రి పరిశోధన చేసిన ప్రాంతాల్లో ఈ 'నీలివార్త' వెనుక కథ ప్రచారంలో లేదేమో). చారిత్రక సంఘటనలకి కల్పిత పాత్రలని జోడించి రాసిన ఈ నవల తాను తలపెట్టిన 'విక్టోరియన్ నవలా త్రయం' లో మొదటిదని చెప్పారు రచయిత్రి, 'నీలంపురాశి' కి చివర్లో రాసిన 'కథనానికి ముందు, తర్వాత' వ్యాసం చివర్లో. రాబోయే రెండు నవలల కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. (ప్రభవ పబ్లికేషన్స్ ప్రచురణ, వెల రూ. 495, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఆన్లైన్ లోనూ లభిస్తోంది).