గురువారం, డిసెంబర్ 14, 2023

ముసురు

ఆత్మకథలు ఆయా రచయితల అనుభవాలు, జ్ఞాపకాలు, ఆలోచనలకు అక్షర రూపం. సాధారణంగా అనుభవాలనీ, జ్ఞాపకాలనీ ప్రధానంగా అక్షరబద్ధం చేస్తూ అక్కడక్కడా తమ ఆలోచనల్ని పంచుకుంటూ ఉంటారు. అయితే, ఆలోచనలకి పెద్దపీట వేస్తూ సాగిన ఆత్మకథ ముదిగంటి సుజాతారెడ్డి విరచిత 'ముసురు'. తెలుగు అధ్యాపకురాలిగా సుదీర్ఘ కాలం పనిచేసిన సుజాత, అకడమిక్ పుస్తకాలతో పాటుగా కథా సంకలనాలని, నవలలనీ వెలువరించారు. వాటితో పాటు, పదమూడేళ్ల క్రితం తన ఆత్మకథని ప్రకటించారు. నిజాం కాలం మొదలు ప్రపంచీకరణ వరకూ డెబ్భై ఏళ్ళ కాలాన్ని, ఆకాలంలో తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పులని వివరించడంతో పాటు ఉమ్మడి కుటుంబాల మొదలు ఆత్మగౌరవ పోరాటాల వరకూ ప్రతి విషయం మీదా తనకున్న స్థిరమైన అభిప్రాయాలని ప్రకటించారు. 

నిజాం పాలన అనగానే మొదట గుర్తొచ్చేది నిజాం అకృత్యాలు, దొరల ఆగడాలు. చరిత్రలోనూ, సాహిత్యంలోనూ రికార్డయినవి ఇవే. అయితే, దొరల విషయంలో అసత్యాలు చలామణిలోకి వచ్చాయంటారు నల్గొండలో ఓ గడీలో పుట్టి పెరిగిన సుజాత. దొరలు స్త్రీలని ఎంతగానో గౌరవించారు తప్ప ఎవరితోనూ అమర్యాదగా ప్రవర్తించేవారు కాదనీ, బోనాల పండుగ లాంటివి కేవలం స్త్రీలంతా కూడి జరుపుకునే వారనీ చెబుతూ, కథలు, నవలలు రాసిన వారిలో చాలామందికి వాస్తవ జీవితం పట్ల అవగాహన లేకపోవడం వల్లనే దొరలని విలన్లుగా చిత్రించారని వివరించారు. నీటి వసతి లేకపోవడం వల్ల, తెలంగాణలో భూస్వాములకు కూడా రాబడి అంతంతమాత్రంగానే ఉండేదని, గౌరవమర్యాదలు ఉన్నంతగా సంపదలు ఉండేవి కావంటారు. 

తండ్రికి చదివించే ఆసక్తి లేకపోయినా పట్టుపట్టి హైదరాబాద్ లో కాలేజీలో చేరారు సుజాత. పేరుకి రెడ్డి కాలేజీ, హాస్టల్ అయినా అన్ని కులాలు, మతాల విద్యార్థులు అక్కడ ఉండేవారని, ఎంతోమంది అక్కడ చదువుకుని ప్రయోజకులు అయ్యారని గుర్తుచేసుకున్నారు. డిగ్రీ చదువుతూ ఉండగానే గోపాలరెడ్డి తో వివాహం జరిగింది సుజాతకి. ఆయన జంధ్యం వేసుకున్న బ్రహ్మసామాజికుడు. అంతే కాదు, సంస్కృతంలో ఎమ్మే చదువుకున్న వాడూను. పెళ్లి తర్వాత చదువు కొనసాగించడమే కాదు, పీహెచ్డీ పూర్తి చేశారు సుజాత. మధ్యలోనే గోపాలరెడ్డి కి జర్మనీలో పనిచేసే అవకాశం రావడంతో కొన్నాళ్ళు అక్కడ గడపడమే కాకుండా, ఒక యూనివర్సిటీలో లైబ్రేరియన్ గా పని చేసి, సంస్కృత సాహిత్యాన్ని గురించి బాగా తెలుసుకుని, భారత దేశానికి తిరిగి వచ్చాక 'సంస్కృత సాహిత్య చరిత్ర' పుస్తకం రాశారు కూడా. 

అప్పటికి జర్మనీ తూర్పు, పశ్చిమాలుగా విడిపోయి ఉంది, బెర్లిన్ గోడ సాక్షిగా. ఆ రెండు దేశాల మధ్య భేదాలే కాకుండా, జర్మనీ-భారత జీవన విధానాలని సూక్షంగా పరిశీలించి ఒక సిద్ధాంత పత్రం స్థాయిలో విశ్లేషించారు సుజాత. ఇలాంటి పరిశీలనే తెలంగాణ కట్టుబొట్టు-గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల కట్టుబొట్టు మధ్య ఉన్న దగ్గరి పోలికల గురించి కూడా చేశారు. మిద్దె ఇళ్ల మొదలు అపార్ట్మెంట్ల వరకూ గృహ నిర్మాణ శైలులని గురించీ, నిరాడంబరమైన ఆర్య సమాజపు పెళ్లిళ్ల మొదలు కార్పొరేట్ వెడ్డింగ్ ల వరకూ జరిగిన ప్రయాణాన్ని గురించి, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, పిల్లల పెంపకం, చదువులు ఉద్యోగాల్లో పోటీ వరకూ అనేక విషయాల మీద తన ఆలోచనలని సవివరంగా పంచుకున్నావారు. 

తన కూతురు, కొడుకు వాసవిక, ఉదయన (ఎంత చక్కని పేర్లు!!) మొదలు తన దగ్గర చదువుకున్న విద్యార్థుల వరకూ ఆ తరం యువత ఆలోచనలు, జీవన విధానం గురించి చెప్పారు. అప్పటికే తరాల అంతరాలని గుర్తించిన రచయిత్రి, 1990 తర్వాత ఇంటా బయటా కూడా మార్పు శరవేగంతో చొచ్చుకొని వచ్చిందంటారు. తన జీవితంలో జరిగిన ఒక్కో విషయాన్నీ చెబుతూ, ఆ విషయంతో పాటుగా దానికి సంబంధించి వచ్చిన మార్పులు (చదువు, ఉద్యోగం, పెళ్లి...), తన ఆలోచనలు, అభిప్రాయాలూ రాస్తూ వచ్చారు. ఒక పేజీ ఆమె జీవితం కనిపిస్తే, తర్వాత పది పన్నెండు పేజీలు తులనాత్మక అధ్యయనం, ఆలోచనల ప్రకటనగా సాగింది రచన. తన బాల్యాన్ని గురించి, రచనా వ్యాసంగాన్ని గురించీ వివరంగానే చెప్పినా, ఉద్యోగ జీవితాన్ని గురించి క్లుప్తంగానే చెప్పారు. 

"ఆత్మకథలు చరిత్ర పునర్నిర్మాణానికి పనికి వస్తాయనే అభిప్రాయం బలంగానే ఉంది. సుజాతారెడ్డి ఆత్మకథ మరో రకంగా ఉపయోగపడుతుంది. సాయుధ పోరాట చరిత్రను, దాని వెలుపలి జీవన విధానాన్ని కలిపి తెలంగాణకు సంబంధించిన సంపూర్ణ సామాజిక చరిత్రను నిర్మించడానికి ఉపయోగపడుతుంది. తెలంగాణ సామాజిక పరిణామ క్రమాన్ని కొత్తగా అర్ధం చేసుకోడానికి వీలు కల్పిస్తుంది" అన్నారు కాసుల ప్రతాపరెడ్డి తన ముందుమాటలో. ఆత్మకథలతో పాటు, తెలంగాణ పరిణామ క్రమం మీద ఆసక్తి ఉన్న వాళ్లకి నచ్చే పుస్తకం ఇది. 'రోహణమ్' ప్రచురించిన ఈ 231 పేజీల పుస్తకం వెల రూ. 250. విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, నవయుగ పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. 

శనివారం, అక్టోబర్ 28, 2023

సూర్యకాంతం ...

గత నెలలో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఘనంగా జరిగింది. హైదరాబాదులో అక్కినేని నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యులు వేడుక జరిపారు. అంతకు నాలుగు నెలల ముందే నందమూరి తారక రామారావు శతజయంతి ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులకి సన్మానాలు, సత్కారాలు.. ఇలా ఏడాది పొడవునా కార్యక్రమాలు జరిపి, ముగింపు వేడుకని వైభవంగా నిర్వహించాయి ఎన్టీఆర్ కుటుంబం మరియు ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ. సినిమా కెరీర్లో అక్కినేనికి తొంభై తొమ్మిదో సినిమా, నందమూరికి వందో సినిమా ఒక్కటే. అయితే ఆ సినిమాకి టైటిల్లో వాళ్ళు పోషించిన పాత్రల పేర్లు కలపలేదు. వాళ్ళిద్దరికీ ఏడాది తర్వాత పుట్టి, వాళ్ళకి అత్తగారిగాగా నటించి మెప్పించిన సూర్యకాంతం పోషించిన 'గుండమ్మ' పేరు పెట్టారు. ఆ సినిమా 'గుండమ్మ కథ'. దటీజ్ సూర్యకాంతం. ఇవాళ్టి నుంచి సూర్యకాంతం శతజయంతి ప్రారంభం. 

కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురం సూర్యకాంతం స్వస్థలం. బ్రాహ్మణ కుటుంబ నేపధ్యం. చిన్నప్పటి నుంచీ నాట్యం మీద ఉన్న ఆసక్తి కొంత, కుటుంబ ఆర్ధిక పరిస్థితులు మరికొంత (తండ్రి అకాల మరణం తదితరాలు) ఆమెని మొదట నాటకాల వైపుకీ, అటు నుంచి సినిమాలకీ నడిపించాయి. సినిమా రంగంలోకి అడుగుపెట్టే అందరు నటీమణుల్లాగే సూర్యకాంతానికి కూడా హీరోయిన్ కావాలన్నది కల. గ్రూప్ డాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టినా కథానాయిక అవకాశాల కోసం ప్రయత్నాలు మానలేదు. ఒక అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారినప్పుడు మాత్రం, నాయిక పాత్రల కోసం గిరిగీసుకోకూడదని, వచ్చిన పాత్రల్ని అంగీకరించి మెప్పించాలనీ నిర్ణయించుకుని చిన్న వయసులోనే 'అత్త' పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి, తనకు తానే ఓ బ్రాండ్ గా ఎదిగారు. చిరంజీవి-శ్రీదేవిల 'ఎస్పీ పరశురామ్' సూర్యకాంతం చివరి చిత్రం. ఆ సినిమాలో చిరంజీవి పాత్ర ఆమెని చెంపదెబ్బ కొట్టే సీన్ ఉంది. అది చూస్తూ "ఈవిడ ఇలాంటి పాత్రల్లోనటించాలా?" అనుకున్నాను మనసులో. కొన్నాళ్లకే ఆమె ప్రయాణం ముగిసింది. 

కెరీర్ మొత్తంలో సూర్యకాంతం నటించిన సినిమాల ఏడొందలు అని లెక్క తేల్చారు సినిమా వారు. "ఒకే పాత్రని ఏడొందల సార్లు నటించిన ఆర్టిస్టు ప్రపంచ సినిమా చరిత్రలో సూర్యకాంతం ఒక్కరే" అన్నారు తనికెళ్ళ భరణి. ఆయన ఉద్దేశం 'గయ్యాళి అత్త' పాత్ర అని కావొచ్చు. మూస పాత్ర పోషణలో వైవిధ్యాన్ని చూపేందుకు ఎంతగానో శ్రమించారు సూర్యకాంతం. కాబట్టే ప్రేక్షకులు ఆమెని అన్నాళ్ళు ఆదరించారు. ఏమాత్రం విసుగెత్తినా, 'రొటీన్' అని ఫీలయినా ఎప్పుడో ఇంటికి పంపేసేవారు కదా. ఆహార్యం మొదలు, మేనరిజాల వరకూ ఆమె చేసిన హోమ్ వర్క్ అనితరసాధ్యం. మచ్చుకి రెండు మూడు సినిమాలు వరుసగానో, లేదా ఆమె ఉన్న బిట్లనో పరిశీలనగా చూడండి, తెలుస్తుంది. అయితే, ఎడమ చేయి విసురుగా ఊపడం మాత్రం అన్ని సినిమాల్లోనూ కామన్ గా కనిపిస్తుంది, ఆ పాత్ర హిడింబి అయినా, గుండమ్మ అయినా, మరేదైనా. ఆ మేనరిజం సూర్యకాంతం ట్రేడ్ మార్కు. 

Google Image

లేడీ ఆర్టిస్టులు కొత్త వేషం గురించిన చర్చల్లో ఆ పాత్ర ఎలాంటి చీరలు కడుతుంది, సినిమా మొత్తానికి ఎన్ని చీరలు లాంటి విషయాల్లో ఎక్కువ ఆసక్తి చూపే కాలంలో, సూర్యకాంతం మాత్రం కొత్త వేషం రాగానే ఆ పాత్రకి తగిన కళ్ళజోడుని మొదట ఎంపిక చేసుకునే వారట. ఆవిడ పర్సనల్ కలెక్షన్లో ఉన్న వందలాది కళ్లజోళ్ల నుంచి ఒకటి ఎంపిక చేసుకుంటే మూడొంతుల గెటప్ పూర్తయినట్టే. మెజారిటీ సినిమాల్లో ఆమె కట్టినవి మల్లు పంచెలు, తెల్లచీరలే. ఈ కళ్ళజోడు సంగతితో పాటు సూర్యకాంతం గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు ముళ్ళపూడి వెంకట రమణ తన 'కోతి కొమ్మచ్చి' లో. "రవణా, తోట నుంచి మావిడి పళ్ళు వచ్చాయి" అని సెట్లో సూర్యకాంతం చెప్పారంటే, సినిమా కంపెనీ నుంచి డబ్బు వచ్చిందని, ఇంటికి వచ్చి తీసుకు వెళ్ళమని అర్ధం. బాపూ-రమణలు నిర్మించిన సినిమాలకి సూర్యకాంతం కూడా ఒక రహస్య నిర్మాత. కష్టపడి డబ్బు సంపాదించడమే కాక, దానిని జాగ్రత్త చేశారు కూడా. 

సూర్యకాంతానికి ఉన్న మరో అలవాటు ఇంటి నుంచి స్పెషల్స్ వండి తెచ్చి సెట్లో అందరికీ వడ్డించడం. షూటింగ్ చివరి రోజున అసిస్టెంట్లు, సెట్ బాయ్స్ అందరికీ బహుమతులు ఇవ్వడం. స్వతహాగా భోజన ప్రియురాలు కావడంతో వండి వడ్డించడం ఇష్టం. అంతే కాదు, 'సూర్యకాంతం వంటలు' పేరుతో ఓ వంటల పుస్తకం కూడా రాశారు. యద్దనపూడి సులోచనారాణి 'వెజిటేరియన్ వంటలు' కన్నా ముందు మార్కెట్లోకి వచ్చిన సెలబ్రిటీ కుక్ బుక్ బహుశా సూర్యకాంతం రాసిందే. బహుమతుల విషయంలో ఆమెకి ఉన్న ఓ అలవాటు గురించి మిత్రులు పంచుకున్న సంగతొకటి ఆసక్తిగా అనిపించింది. బంధుమిత్రుల్లో ఎవరింట పెళ్లి జరిగినా స్థాయీ భేదం లేకుండా సూర్యకాంతం పంపిన బహుమతి ఒక్కటే. 'సూట్ కేసు'. ఆమెకి పెళ్లి పత్రిక అందిందీ అంటే, కొత్తజంటకి సూట్ కేసు కానుకగా అందినట్టే. ఇది విన్నప్పుడు, సినిమా వాళ్ళ ఇళ్లల్లో పెళ్ళిళ్ళకి ఆమె ఏ కానుకలు ఇచ్చి ఉంటారో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. ముళ్ళపూడి రమణ ఏమీ చెప్పలేదు మరి. 

సోషల్ మీడియా ప్రబలమయ్యాక పాతవీ, కొత్తవీ అనేక వార్తలు నిత్యం శాఖా చంక్రమణం చేస్తున్నాయి.సూర్యకాంతానికి సంబంధించి ఇలా తరచూ తిరిగే వార్తల్లో ముఖ్యమైనది ఆమె చనిపోయినప్పుడు సినిమా పరిశ్రమ నుంచి పట్టుమని పది మంది కూడా ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించలేదని. అప్పుడే కాదు తర్వాతెప్పుడూ కూడా ఆమెకి సంస్కరణ సభ లాంటివి ఏమీ జరగలేదు. విగ్రహావిష్కరణలు, ఆమె పేరిట అవార్డులు కాదు కదా, ఆమెని గురించిన ఓ సమగ్రమైన పుస్తకం కూడా ఇన్నేళ్లలోనూ రాలేదు. లేడీ ఆర్టిస్టుల పట్ల ఉండే సహజమైన వివక్ష కొంత కారణమైతే, ఆమె వారసులెవరూ సినిమా పరిశ్రమలో లేకపోవడం మరికొంత కారణం అనిపిస్తుంది. సూర్యకాంతం తాలూకు వాళ్ళు సినిమా పరిశ్రమలో చెప్పుకోదగ్గ స్థానంలో వుండుంటే, ఈపాటికి శతజయంతి సంరంభాలకి భూనభోంతరాలు దద్దరిల్లేవి కాదూ. ప్రేక్షక హృదయాల్లో మాత్రం కనీసం మరికొన్ని తరాల పాటు ఆమె చిరంజీవి, 'మీమ్స్' సాక్షిగా. 

గురువారం, సెప్టెంబర్ 28, 2023

ఎమ్మెస్ స్వామినాథన్ ...

తమిళ దేశాన్ని తలచుకోగానే గుర్తొచ్చే ఇద్దరు ఎమ్మెస్ లలో రెండోవారు ఎమ్మెస్ స్వామినాథన్ వెళ్లిపోయారు. స్వామినాథన్ అనగానే గుర్తొచ్చే మొదటి/ఏకైక విషయం హరిత విప్లవం. నార్మన్ బొర్లాగ్ తో కలిసి స్వామినాథన్ చేసిన పరిశోధనలు, నాటి ప్రభుత్వ సాయంతో క్షేత్ర స్థాయిలో ఆ పరిశోధనలని అమలు చేసిన తీరు, వాటి ఫలితంగా అప్పటివరకు ఆహార ధాన్యాల కొరతని అనుభవించిన భారత దేశం క్రమంగా మిగులు నిలవలని పెంచుకుంటూ వచ్చే దిశగా ఎదగడం ఇవన్నీ గుర్తొస్తాయి. వీటితో పాటే పీఎల్-480 ఒప్పందం, దాని తాలూకు చీకటి కోణమైన 'కాంగ్రెస్ గడ్డి' లాంటి కలుపు మొక్కలూ జ్ఞాపకం వచ్చి తీరతాయి. స్వామినాథన్ కి నివాళి అర్పించే ముందు ఆ సంగతులన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి.

స్వతంత్రం వచ్చిన తొలి దశాబ్దాలలో భారతదేశం ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య ఆహారం. పెరుగుతున్న జనాభాకి, సంప్రదాయబద్ధంగా సాగుతున్న వ్యవసాయం నుంచి వస్తున్న ఫలసాయానికీ మధ్య దూరం అంతకంతకీ పెరిగిపోవడంతో ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది.తక్షణ పరిష్కారంగా అంతర్జాతీయంగా అందే సాయం మీద దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఆ కృషి ఫలించి, అమెరికా తిండి గింజల ఎగుమతికి అంగీకరించింది తన పీఎల్-480 కార్యక్రమంలో భాగంగా. అమెరికా నుంచి దిగుమతులు వచ్చే నాటికి భారత దేశంలో తిండి గింజలు మాత్రమే కాదు, విత్తనాలకీ కొరత వచ్చింది. దిగుమతుల్లో వచ్చిన గింజలనే విత్తనాలుగా నాటింది నాటి రైతాంగం. దీనివల్ల జరిగిన దుష్పరిణామం పేరు 'పార్తీనియం.' స్థానికంగా 'వయ్యారి భామ' అనే అందమైన పేరున్న ఈ కలుపు మొక్కకి తెలుగు రైతులు పెట్టిన మరో పేరు 'కాంగ్రెస్ గడ్డి.'

వేగంగా వ్యాపించే కలుపుమొక్క పార్తీనియం. ఈ మొక్క ఒక్కసారి మొలిచిందంటే మరి చంపేందుకు వీలుండదు. మొదలంటా నరికినా, తగలబెట్టినా కూడా మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉంటుంది. ఉబ్బస వ్యాధి గ్రస్తులతో పాటు పాడి పశువులకీ ఈ మొక్క ప్రాణాంతకం. "ఈ కాంగిరేస్సూ పోదు, కాంగిరేసు గడ్డీ పోదు" అని తిట్టుకునే వాళ్ళు రైతులు (బీజేపీ నాయకులు 'కాంగ్రెస్ ముక్త భారత్' అని నినదించినప్పుడల్లా నాకు గుర్తొచ్చే మాట ఇదే). ఈ పార్తీనియం విత్తనాల వెనుక అమెరికా కుట్ర కోణం ఉందని చాలామందే నమ్మారు. ఇది ఒక కారణం అయితే, ఏటా కొత్త దాతలని వెతుక్కోవాల్సి రావడం, సాయం అందుకోడం వల్ల అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ మసకబారడం లాంటి మరిన్ని కారణాలు భారత ప్రభుత్వాన్ని 'తిండి గింజల స్వయం సమృద్ధి' వైపు గట్టిగా ఆలోచించేలా చేసింది. ఫలితమే హరిత విప్లవం. ఈ హరిత విప్లవ పితామహుల్లో ముఖ్యులు, వ్యవసాయ శాస్త్రవేత్త, డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్.


సినీ నటుడు శోభన్ బాబు పేరు మీద ప్రచారంలో ఉన్న కొటేషన్ "రానురాను మనుషులు పెరుగుతారు తప్ప భూమి పెరగదు". ఇది రియల్ ఎస్టేట్ కి మాత్రమే కాదు, వ్యవసాయానికి కూడా వర్తిస్తుంది. నిజానికి మొదట వర్తించేది వ్యవసాయానికే . కూడు తర్వాతే కదా గూడు. హరిత విప్లవం లక్ష్యం వ్యవసాయ యోగ్యమైన భూమిలోనే అధిక దిగుబడులు సాధించడం. మేలైన విత్తనాల కోసం పరిశోధనల మొదలు, ఎరువులు, పురుగు మందులు దేశీయంగా తయారు చేసి రైతులకి అందుబాటులో ఉంచడం వరకూ హరిత విప్లవంలో భాగమే. వీటి ఫలితంగా అప్పటివరకూ ఏటా ఒక పంట మాత్రమే పండిన భూముల్లో రెండు మూడు పంటలు పండించడం మొదలయ్యింది. మరో పక్క సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యి మరింత భూమి వ్యవసాయ యోగ్యమయ్యింది. ఫలితంగా తిండి గింజల స్వయం సమృద్ధి సాధ్య పడింది.

'ఆహార ధాన్యాల కోసం ఇప్పటికీ విదేశాల మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఉండి ఉంటే?' అన్న ప్రశ్న వేసుకుంటే చాలు హరిత విప్లవం ప్రాముఖ్యత అర్ధమై, అందుకోసం కృషి చేసిన వారి మీద గౌరవం కలుగుతుంది. నిజమే, ఈ విప్లవం కారణంగా వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం గణనీయంగా పెరిగింది. వీటి వల్ల, ఈ రసాయనాలని తయారు చేసే ఫ్యాక్టరీల వల్లా వాతావరణ కాలుష్యం పెరిగింది. అయితే, ఈ కీడు కన్నా జరిగిన పెద్ద మేలు ఏమిటంటే, ఆకలి చావుల బారి నుంచి దేశం రక్షింపబడింది. అంతర్జాతీయంగా తలెత్తుకుని నిలబడ గలిగింది. లోపాలున్నప్పటికీ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇప్పటికీ సబ్సిడీ ధరలకి ఆహార ధాన్యాలని పేదలకి అందించగలుగుతోంది.

శ్వేత విప్లవం వెనుక ఉన్న వర్గీస్ కురియన్ ని, హరిత విప్లవ సారధి మంకొంబు సాంబశివన్ స్వామినాథన్ ని ఒక్కసారైనా కలవాలి అనుకున్న రోజులున్నాయి. కురియన్ విషయంలో ఏమీ కలిసిరాలేదు కానీ, స్వామినాథన్ చెన్నైలో తన పేరుమీదే నడుపుతున్న ఫౌండేషన్ లో రెండు రోజులు గడిపే అవకాశం వచ్చింది, ఎనిమిదేళ్ల క్రితం. నేను అక్కడ ఉన్న సమయంలో ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. స్వామినాథన్ ని కలవలేకపోతేనేం, ఆ సంస్థ పనితీరుని, క్రమశిక్షణనీ చూసిన తర్వాత స్వామినాథన్ వ్యక్తిత్వాన్ని గురించి, క్రమశిక్షణ గురించీ ఓ అంచనా వచ్చింది. 'హరిత విప్లవం' తర్వాత దశగా 'సతత హరిత విప్లవం' (ఎవర్ గ్రీన్ రివల్యూషన్) తీసుకురావాలని, 'అందరికీ ఆహారం' నుంచి 'అందరికీ బలవర్ధకమైన ఆహారం' వైపుగా వ్యవసాయ రంగ ప్రయాణం సాగాలని కోరుకున్నారు స్వామినాథన్. ఆ కోరిక నెరవేరడమే ఆయనకి అసలైన నివాళి.

సోమవారం, సెప్టెంబర్ 11, 2023

నిన్నటి పరిమళాలు

చాలారోజుల తర్వాత పుస్తకాల షాపుకి స్వయంగా వెళ్లి నచ్చిన పుస్తకాల్ని ఎంచుకోవడం. మొదటగా కనిపించిన పుస్తకం 'నిన్నటి పరిమళాలు', రచయిత శ్రీరమణ. ఆయన వెళ్ళిపోయాక వేసిన పుస్తకమా? అని సందేహం కలిగింది. చూస్తే తొలి ప్రచురణ అక్టోబరు 2022 అని ఉంది. పుస్తకం పేరు, దొరికిన సందర్భమూ రెండూ కూడా కలుక్కుమనిపించాయి. ఇంతకీ ఇది శ్రీరమణ రాసిన నివాళి వ్యాసాల సంకలనం. పండుగల గురించి రాసిన నాలుగైదు వ్యాసాలు, రెండు పుస్తకాలకి రాసిన ముందు మాటలు, కాలం నాడు 'కినిగె పత్రిక' కి ఇచ్చిన ఇంటర్యూ అదనపు చేర్పులు. నివాళి వ్యాసాలన్నీ 'సాక్షి' దినపత్రికలో 'అక్షర తూణీరం' కాలమ్ లో భాగంగా రాసినవే. చివర్న వేసిన ఇంటర్యూతో కలుపుకుని మొత్తం యాభై మూడు తూణీరాలు. 

నివాళి వ్యాసానికి ఇంగ్లీష్ సమానార్థకం ఎలిజీ. అది రాయడం కత్తిమీద సాము. ఎందుకంటే, 'చచ్చినవాడి కళ్ళు చారెడంత' అని తెలుగునాట ఓ సామెత. వెళ్ళిపోయిన గొప్పవాళ్లు బతికి ఉన్నన్నాళ్లూ మంచీ, చెడూ రెండు రకాలూ చేసినా, కొండొకచో చెడు మాత్రమే చేసినా పోగానే బహుమంచి వాడు అయిపోతాడు. అభిమాన, అనుచర, భక్త గణాలు ఉండనే ఉంటాయి. అవన్నీ తమ ఆప్తుడిని గురించి మంచి మాటలు మాత్రమే వినాలని అనుకుంటాయి. ఇన్ని ఒత్తుడుల మధ్య ఓ నాలుగు మాటలు ప్రత్యేకంగా రాయడం, వాటిలో ఆ పోయిన వాడి వ్యక్తిత్వాన్ని చూపించడం అసాధ్యం కాదు కానీ కష్ట సాధ్యం. కాలమిస్టులకి ఇలాంటి కష్టాలు ఓ లెక్క కాదన్నట్టుగా తనదైన ఫ్లోతో ఎలిజీలు రాసేశారు శ్రీరమణ. వీటిలో కొన్ని మళ్ళీ మళ్ళీ చదివించేవి ఉన్నాయి, మరికొన్నింటిలో మరెక్కడా దొరకని విశేషాలూ ఉన్నాయి. అందుచేత ఈ పుస్తకం ప్రత్యేకమైనది. 

ఎన్టీఆర్ కి జరిగిన (రెండో) వెన్నుపోటు సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఏమీ చేయకుండా మనకెందుకులే అని ఊరుకుంది. ఆ సంక్షోభంలో నుంచి అవకాశాన్ని వెతుక్కునే పథకం ఒకటి ఢిల్లీ లో రచింపబడింది. అమలు చేసే బాధ్యత రాష్ట్రంలో ఓ పెద్దాయనకి ఇవ్వబడింది. ఆ పెద్దాయన జంకడంతో ఆ పథకం అమలు జరగలేదు. అమలు జరిగి ఉంటే తెలుగుదేశం పార్టీ అనేక ముక్క చెక్కలయ్యేది. పథకం వేసింది పీవీ నరసింహారావు అయితే, జంకిన పెద్దాయన కోట్ల విజయభాస్కర రెడ్డి. 'వార్తల కెక్కని పీవీ చాణక్యం' పేరిట శ్రీరమణ వదిలిన తూణీరం రాజకీయాల మీద కొద్దిపాటి ఆసక్తి ఉన్నవాళ్ళకి కూడా ఆఫళాన మతి పోగొడుతుంది. పీవీని గురించి రాసిన రెండు నివాళి వ్యాసాల్లో ఇది మొదటిది. రెండోది పీవీ పూర్తి జీవన రేఖ. 

తెనాలి పక్కన పల్లెటూరు తుమ్మపూడిని తన ప్రపంచంగా చేసుకోడమే కాక, రసజ్ఞులందరికీ దర్శనీయంగా మార్చిన సంజీవ దేవ్ కి నివాళిగా రాసిన రెండు వ్యాసాల్లోనూ, సంజీవ దేవ్ రస దృష్టితో పాటు శ్రీరమణ జిహ్వ చాపల్యమూ కనిపించి మురిపిస్తుంది. ఓ పక్క సంజీవ్ దేవ్ గురించి సీరియస్ గా చెబుతూనే, ఆయన అర్ధాంగి సులోచన గారి చేతి వంట, వడ్డనలు గురించి, వంటకాల రుచులని గురించీ పై సంగతులు వేసి నోరూరించారు. సంజీవ్ దేవ్ చిత్రలేఖన ప్రతిభ కన్నా, సులోచన గారి చేతి గుత్తి వంకాయ కూర, చల్ల పొంగడాలు పాఠకులకి ఎక్కువగా గుర్తుండిపోయేలా చేసేది శ్రీరమణ వాక్య విన్యాసమే. ఈ విన్యాసమే వస్తువుతో (అనగా ఎలిజీకి కారకులతో) సంబంధం లేకుండా ప్రతి వ్యాసాన్నీ ఆపకుండా చదివిస్తుంది. 

"కొత్త కొత్త నాటకాలు చదవడం, తనదైన శైలిలోకి దించడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య" అంటూ గొల్లపూడికి ఎలిజీ రాయాలంటే కూసింత పెంకితనం ఉండాల్సిందే. "రావి కొండలరావు బహుముఖ ప్రజ్ఞాశాలి" అని ఊరుకోవచ్చా, అబ్బే, "అన్నిటికీ మించి ప్రఖ్యాత నటి రాధాకుమారిని కట్టుకున్న భర్త" అనడమే శ్రీరమణ స్టైలు. "కెరీర్ లో లెక్కకి ఐదొందల సినిమాల్లో కనిపించినా ఒక పాతిక వేషాలు ఎన్నదగ్గవి" అనడానికి చాలా నిర్మొహమాటం కావాలి. నేరుగానే, పరోక్షంగానో విశ్వనాథ ప్రస్తావన లేకుండా శ్రీరమణ కథేతర రచనలుండవు. విశ్వనాథుడి దర్శనం ఇక్కడా జరిగింది. ధైర్యం పుంజుకుని "శ్రీశ్రీ గారి మీద మీ అభిప్రాయం?" అని టీనేజీ శ్రీరమణ కాస్త బెరుకుగానే అయినా సూటిగా అడిగిన ప్రశ్నకి చెప్పిన జవాబు 'ఒక్కడు విశ్వనాథ' ఎందుకయ్యాడో చెప్పకనే చెబుతుంది. 

పోయిన మంచోళ్ళు గురించి మాత్రమే కాదు, మిగిలిన తీపి గుర్తులని కూడా ప్రోత్సహిస్తూ రాసిన మంచి మాటలు కొన్ని జతపడ్డాయి ఈ పుస్తకంలో. ఆత్రేయపురం కుర్రాడు బ్నిం గురించీ, చిత్రకారుడు రాయన గిరిధర గౌడ్ గురించీ కొత్తసంగతులెన్నో చెప్పారు. అన్నమయ్య గ్రంధాలయం స్థాపకుడు లంకా సూర్యనారాయణ, 'పాత్రికేయులకు పెద్ద బాలశిక్ష' ఆవటపల్లి నారాయణరావు.. ఇలా పాఠక లోకానికి పెద్దగా తెలియని వారిని కొత్తగా పరిచయం చేశారు. ముందుమాటలందు శ్రీరమణ ముందుమాటలు వేరు. డాక్టర్ సోమరాజు సుశీల 'ఇల్లేరమ్మ కతలు', 'కలైమామణి' దాట్ల దేవదానం రాజు 'కథల గోదారి' పుస్తకాలకి రాసిన ముందు మాటలని చేర్చారు ఈ పుస్తకంలో. 'కథల గోదారికి గొజ్జంగి పూదండ' కాస్త నిడివైన ముందుమాట. ఈ 'నిన్నటి పరిమళాలు' పుస్తకానికి మోదుగుల రవికృష్ణ ముందుమాట రాశారు. వీవీఐటీ ప్రచురించింది. 192 పేజీలు, 180 రూపాయల వెల. సాహితీ ప్రచురణలు ద్వారా లభ్యం.

బుధవారం, సెప్టెంబర్ 06, 2023

శృంగేరి-2

(మొదటి భాగం తర్వాత)

బయట చినుకులు పెరుగుతున్నాయి. వాటిని చీల్చుకుంటూ భక్తులు లోపలికి  వస్తున్నారు. చూస్తుండగానే హాలు నెమ్మదిగా నిండుతోంది. ఇంతలో ఓ కుర్రాడు నా దగ్గరికి వచ్చాడు.రెండంచుల పంచె, ఉత్తరీయం, నుదుటన విభూది పట్టెలు, మధ్యలో కుంకుమ బొట్టు, చేతిలో ఉన్న పళ్లెంలో పళ్ళు, పూజా ద్రవ్యాలు, చంకన బ్యాక్ ప్యాక్.. అతను నన్ను పలకరిస్తే తప్ప 'రూమ్మేట్' గా గుర్తు పట్టలేక పోయాను.  "నేను పాదపూజ టికెట్ తీసుకున్నాను. ఆ క్యూలో స్వామీజీని చూస్తాను.. మీరు ఈ వైపు క్యూలో ఉంటే స్వామిని దర్శనం చేసుకోవచ్చు. స్వామీజీ పూర్వాశ్రమంలో మీ తెలుగువారే. ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు" అనేసి హడావుడిగా పాదపూజ వైపు వెళ్ళిపోయాడు. 'నీ ప్రశ్నలు నీవే.. ఎవరూ బదులివ్వరుగా...' అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడడానికి చాలా ముందు నుంచీ కూడా నా నమ్మకం అదే, కాబట్టి అడగడానికి ఏమీ లేదు. కానైతే స్వామీజీని దగ్గరగా చూడాలనిపించింది. ఆయనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని కొన్నేళ్ల క్రితం ఓ సందర్భంలో కలిశానని గుర్తొచ్చింది. 

ఎడమవైపు పాదపూజల హడావిడి మొదలైంది. ఇంతకీ పూజ నిజ పాదాలకి కాదు, గురు పాదుకలకి. రూమ్మేట్ చేస్తున్న పూజని చూస్తూ ఉండగానే ఒక్కసారిగా కలకలం, స్వామీజీ వచ్చేశారు. వేగంగా వచ్చి, ఎవరివైపూ చూడకుండా తన స్థానంలో కూర్చున్నారు. హాల్లో అందరూ లేచి నిలబడ్డారు. కొందరు ఉన్నచోటే సాష్టాంగ పడ్డారు. అందరిలోకీ వయసులో పెద్ద అయిన పరిచారకుడు స్వామీజీ దగ్గరకి వెళ్లి తీర్ధం స్వీకరించాక, దర్శనం మొదలైంది. నన్ను రెండో వైపు క్యూలో నిలబడమని రూమ్మేట్ సైగ చేశాడు. అప్పటికే ఐదారు కుటుంబాలు అక్కడ నిలబడి ఉన్నాయి. నేనూ నిలబడ్డా. తొలి దర్శనం పాదపూజల వాళ్లకి. రూమ్మేట్ వంతు వచ్చింది. అతను స్వామీజీకి ఏదో చెప్పడం, ఆయన శ్రద్ధగా వింటూ మధ్యలో ప్రశ్నలు అడగడం, ఇతను జవాబులు చెప్పడం కనిపిస్తోంది. రెండు మూడు నిమిషాలపాటు సంభాషణ సాగింది. రూమ్మేట్, పరిచారకుడు ఇచ్చిన తీర్ధం తీసుకుని, హాల్లోనే ఓ మూల ధ్యానంలో కూర్చున్నాడు. 

క్యూ చాలా నెమ్మదిగా కదులుతోంది. ఎందుకా అని చూస్తే వీఐపీల తాకిడి. వాళ్ళు షార్ట్ కట్ లో దర్శనానికి వెళ్లిపోతున్నారు. ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక వాళ్ళు.. అప్పటికప్పుడు రావడం, స్వామీజీతో మాట్లాడి వెళ్లిపోవడం. హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తెలుగు భాషల్లో జరుగుతున్నాయి సంభాషణలు. అక్కడక్కడా తమిళ మాటలూ వినిపిస్తున్నాయి. అన్ని భాషల్నీ స్వామీజీ అనర్గళంగా మాట్లాడుతున్నారు. పక్కనున్న పళ్లాల నుంచి పండో, పువ్వో వాళ్ళ వైపు విసురుతున్నారు. పరిచారకులు ప్రసాదం అందిస్తున్నారు. క్యూలో నా ముందు ఓ కుటుంబం. ఆయన, భార్య, కొడుకు, కోడలు, ఏడాది వయసున్న మనవరాలు - ఉత్తరాది నుంచి వచ్చారు. ఆ పిల్ల అందరి చంకలూ మారుతోంది. భక్తులందరూ పళ్ళ పళ్ళాలు, బుట్టలతో వస్తున్నారు. 'పత్రం, పుష్పం, ఫలం, తోయం..' అన్నాడు గీతాకారుడు. వాటిలో ఏ ఒక్కటీ తేలేదు నేను. 'యోమే భక్త్యా ప్రయచ్ఛతి' అని కూడా అన్నాడు. నా భక్తి నాకెప్పుడూ ప్రశ్నార్ధకమే. 

బయట వర్షం తగ్గింది. రూమ్మేట్ నా దగ్గరికి వచ్చి క్యూ కి ఆవల నిలబడ్డాడు. "నేను రూమ్ కి వెళ్తున్నాను. మీకు దర్శనం అయ్యాక, గుడి ఎంట్రన్స్ దగ్గర అన్న ప్రసాదం ఉంటుంది.. తినేసి రూమ్ కి వచ్చేయండి. ఒకవేళ నేను తలుపు తీయకపోతే కాల్ చెయ్యండి" అని చెప్పి వెనుతిరిగాడు. నాకూ వెనక్కి వెళ్లిపోదామా అనిపించింది. ఎందుకో మరి, ముందుకే వెళ్లాను. మరో విడత పాదపూజ పూర్తవ్వడంతో ఆ భక్తులు అటువైపు క్యూలో చేరారు. ఒక  కుటుంబం, తర్వాత నా ముందున్న ఉత్తరాది వాళ్ళు, ఆ తర్వాత నా వంతు. కొంచం సేపటికి ఉన్నట్టుండి స్వామీజీ దృష్టి నామీద పడింది. నేనూ ఆయన వైపే చూశాను రెప్ప వేయకుండా. అర నిమిషం పైనే గడిచి ఉంటుంది. కేవలం ఆయన కళ్ళని  మాత్రమే చూస్తున్నాన్నేను. పరిచారకుడి పిలుపుతో ఆయన దృష్టి మరలింది. 

చన్నీళ్లతో తలారా స్నానం చేసినట్టు, అడగని ప్రశ్నలు అన్నింటికీ జవాబులు దొరికినట్టూ అనిపించింది. ఉత్తరాది పెద్దాయన స్వామీజీకి ఏదో చెప్పుకుంటున్నాడు. నేను నెమ్మదిగా బయట పడ్డాను. రూమ్ కి తిరిగి వెళ్లడం, "కాసేపు నిద్రపోతాను" అని రూమ్మేట్ కి చెప్పి నా మంచం మీద వాలడం లీలగా మాత్రమే గుర్తున్నాయి. మూడు గంటల పాటు ఒంటి మీద స్పృహ లేదు. ఉన్నట్టుండి మెలకువ వచ్చేసరికి రూమ్మేట్ నన్ను నిద్ర లేపుదామా అని తటపటాయిస్తున్నాడు. నాకు బరువేదో దిగిపోయినట్టు వొళ్ళంతా తేలికగా అనిపించింది. "మీరు భోజనం చేశారో లేదో అని.." అన్నాడు. ఆకలిగా అనిపించలేదని చెప్పాను. పాదపూజ చేశాడు కాబట్టి తను ఉపవాసం ఉంటాడట. "స్వామీజీతో మాట్లాడారా?" అని అడిగాడు. దర్శనం అయిందని చెప్పాను. 

కిటికీలోనుంచి చూస్తే బయట జల్లు పడుతోంది. తన కబుర్లు వింటున్నా. ఓ దేశంలో మాస్టర్స్ లో సీటు, మరో దేశంలో ఇప్పుడు చేస్తున్న కన్నాపెద్ద ఉద్యోగం వచ్చాయట. ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోగలడు. ఏది ఎంచుకోవాలా అని సందేహం. "నాకు ఏ సందేహం వచ్చినా స్వామీజీ దగ్గరకి వస్తాను. ఆయన్ని అడిగినా, అడగక పోయినా మంచి పరిష్కారం అయితే దొరుకుతుంది.." నేనా విషయంలో జోక్యం చేసుకోకుండా, "తరచూ వస్తూ ఉంటారా?" అని అడిగాను. "చాలా తరచుగా వస్తాం.. ఇదే మొదటి సారి నేను ఒక్కడినీ రావడం .. మీరు ఉండడం వల్ల రూమ్ దొరికింది.. లేకపోతే ఏమయ్యేదో.." అన్నాడు. "మీరు లేకపోతే నా పరిస్థితి కూడా అదే కదా" అన్నాను. "నాన్నగారిప్పుడు ఢిల్లీలో ఉన్నారు.. సెంట్రల్ సెక్రటేరియట్లో పోస్టింగ్" ఒక్కడూ రాడానికి కారణం చెప్పాడు. "బ్యూరోక్రాట్?" అడిగాను. "ఐఏఎస్, సెంట్రల్ సర్వీస్" ఏదో కో-ఆపరేటివ్ సొసైటీలో గుమస్తా అన్నంత కాజువల్ గా చెప్పాడు. 

నాకు తగిలింది మామూలు షాక్ కాదు. వాళ్ళ నాన్నారి ఆఫీసు జీపులో ప్రతిరోజూ దర్జాగా కాలేజీకొచ్చిన నా కాలేజ్మేట్ 'తాసీల్దారు గారి అబ్బాయి' గుర్తొచ్చాడు. ఇతనేమో నేను లేకపోతే రూమ్ దొరికేది కాదు అంటున్నాడు. రికమండేషన్ ఆ తండ్రికి ఇష్టం ఉండదా? ఈ కొడుక్కి నచ్చదా? వీఐపీలకి దొరికే ట్రీట్మెంట్ ఏవిటో కొన్ని గంటల ముందే ప్రత్యక్షంగా చూసి ఉన్నాను. "మిమ్మల్ని సివిల్స్ వైపు వెళ్ళమనలేదా?" కుతూహలంగా అడిగాను. "నేను చాలా అదృష్టవంతుడిని. చదువు, ఉద్యోగం, ఇప్పుడు వచ్చిన ఛాన్సులు.. ఏ విషయంలోనూ కలగజేసుకోలేదు.. కాకపోతే, పెళ్లి చేసుకోమని మాత్రం ప్రెషర్ చేస్తున్నారు" కొంచం సిగ్గు పడుతూ చెప్పాడు. "వాళ్ళూ అదృష్టవంతులే, ఇలాంటి కొడుకు ఉన్నందుకు" అప్రయత్నంగా పైకే అనేసి, "మంచి పిల్ల జతపడాలి" అని మనసులో దీవించా, అప్పదాసులా. "మా నాన్నగారి రూట్స్ తెలుగు అని ఈ మధ్యనే తెలిసింది. నాకు తెలుగు నేర్చుకోవాలని ఉంది.. సులువే అంటున్నారు అందరూ.." అన్నాడు. "కన్నడకి దగ్గరగానే ఉంటుంది, సులువే" అన్నాను. చాలా సేపు కబుర్లు నడిచాయి. 

"నా విషయంలో మీరైతే ఏ నిర్ణయం తీసుకుంటారు?" ఉన్నట్టుండి అడిగాడు. ఊహించని ప్రశ్న కాదు. "ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది.. మీ ప్లేసులో, మీ వయసులో  ఉంటే నేనైతే చదువుకి వెళ్తాను" అతని మొహం వెలిగిపోయింది. "నాకూ చదువే ఇష్టం.. కానీ జాబ్ ఆఫర్ బాగా టెంప్ట్ చేస్తోంది. మా ఫ్రెండ్స్ చాలామంది ఎదురు చూసిన ఛాన్స్, అది నాకు వచ్చింది.. అందుకే..." ..."మీరు మంచి నిర్ణయమే తీసుకుంటారు.. ఆల్ ది బెస్ట్" అన్నాను. నేను బయల్దేరాల్సిన వేళవుతోంది. అతని ప్రయాణం రాత్రి హారతి తర్వాతట. "మారుతి టిఫిన్ సెంటర్ సాయంత్రం కూడా ఉంటుంది. ఏదన్నా తినేసి వెళ్ళండి. అదే రోడ్ లో తిన్నగా వెళ్లి ఎడమకి తిరిగితే బస్టాండ్.. వర్షం తగ్గింది కాబట్టి నడిచి వెళ్లిపోవచ్చు.. ఈ ఊళ్ళో మిరియాలు తప్ప షాపింగ్ చేయాల్సింది ఏమీ ఉండదు. కాంపౌండ్ బయట చూడాల్సినవి రెండు మూడు ఆలయాలున్నాయి, కానీ మీకు టైం లేదు, పైగా వర్షం" ఒక్కొక్కటిగా చెప్పాడు. "ఇది నాకు అన్ ప్లాన్డ్ ట్రిప్.. కేవలం మీవల్ల చాలా బాగా జరిగింది అనిపిస్తోంది.. గ్రేట్ మీటింగ్ యు.." అన్నాను బయల్దేరుతూ.. చేయి సాచాడు, తొలి హ్యాండ్ షేక్. "మనం ఈసారి ప్లాన్ చేసుకుని ఏదన్నా ట్రిప్ కి వెళదామా, నేను అబ్రాడ్ వెళ్ళేలోగా?" అడిగాడు. "తప్పకుండా..." ఇది దాదాపు నా ఊతపదం. 

గుడి దగ్గర వాతావరణం ఉదయం ఉన్నట్టే ఉంది. టిఫిన్ సెంటర్ దగ్గర కూడా అంతే. ఈసారి మాత్రం స్నేహితుల ఇంటికి వెళ్లినంత చొరవగా లోపలి వెళ్లి కూర్చున్నా. వండి వడ్డించే వాళ్ళు వాళ్ళే, మెనూ కూడా అదే. ఆశ్చర్యం ఏమిటంటే అందరూ గుర్తు పట్టి పలకరించారు. బిల్లు రాస్తుండగా "ఇంకొక్క కాఫీ తాగుతాను, ఇంకొంచం స్ట్రాంగ్ గా.." అడిగేశాను నిర్మొహమాటంగా. ఆ వేళ్టి మూడో కాఫీ ఘుమఘుమలాడుతూ నా ముందుకు వచ్చింది. బిల్లు చెల్లించి నడక మొదలు పెట్టాను. ఏ క్షణంలో అయినా మళ్ళీ వర్షం పడేలా ఉంది వాతావరణం. పాతకాలపు ఇళ్ళు, వాటి మధ్యలో సరికొత్త మేడలు. జనం తాకిడికి బాగా అలవాటు పడిన మనుషులు. గుడిని మినహాయిస్తే ఓ చిన్న పల్లెటూరు. బస్సు నా కోసం ఎదురు చూస్తోంది. సీట్లో కూర్చుని ఫోన్ తీసి మెసేజ్ టైపు చేశాను "థాంక్స్ ఫర్ మేకింగ్ మై ట్రిప్ మెమరబుల్". కిటికీ లోంచి బయటికి చూస్తుంటే పచ్చని శృంగేరి వెనక్కి వెళ్ళిపోతోంది. గాలితో పాటుగా చినుకులు పలకరిస్తున్నాయి. అద్దం మూసి ఫోన్ చూస్తే, జవాబు ఎదురు చూస్తోంది "హేపీ జర్నీ.. శృంగేరి మళ్ళీ వద్దామా? ఇంకెక్కడికైనా వెళదామా?" ... "ప్లాన్ చేద్దాం.." రిప్లై ఇచ్చి వెనక్కి వాలాను. 

(అయిపోయింది)

సోమవారం, సెప్టెంబర్ 04, 2023

శృంగేరి-1

"ఒక్కొక్కరికి రూములు ఇవ్వం.. కనీసం ఇద్దరుండాలి..." మధ్వ సంప్రదాయపు పంచెకట్టు, బొట్టు, గుండు, పిలకతో కంప్యూటర్ ముందు కూర్చున్న బలమైన రిసెప్షనిస్టు కన్నడ-ఇంగ్లిషుల కలగలుపుతో గద్దిస్తూ ఉంటే, ఓ క్షణం పాటు తక్షణ కర్తవ్యం బోధ పడలేదు నాకు. అప్పటికే ఆ గద్దింపు భరించి, ఏం చెయ్యాలో తోచక నిలబడ్డ కుర్రాడి మీద పడింది నా దృష్టి. "మనం రూమ్ షేర్ చేసుకుందామా?" చొరవగా అడిగాను ఇంగ్లిష్లో. నన్నోసారి పరకాయించి చూసి, సరే అన్నట్టు తలూపాడు. "ఇదివరకే ఫ్రెండ్స్ అయితే సరే.. కానీ ఇక్కడ కలిసి రూమ్ తీసుకున్న వాళ్ళు, తర్వాత వచ్చి ఏ కంప్లైంట్ చేసినా నేను రెస్పాన్సిబుల్ కాదు" అడక్కపోయినా చెప్పేశాడు రిసెప్షనిస్టు. ఇద్దరి వివరాలూ క్షుణ్ణంగా టైపు చేసి, మూడొందలు కట్టమన్నాడు. కుర్రాడు వాలెట్ తెరిచేలోగా, ఐదొందల నోటు తీసి ఇచ్చాను. నేను చిల్లర అందుకునే లోగా, తన నూటేభై నా బ్యాక్ పాక్ లో పెట్టేశాడు బెంగళూరు నుంచి వచ్చిన నా రూమ్మేట్. అలా నా శృంగేరి యాత్రలో రూమ్ తీసుకొనుట అనే తొలిఘట్టం పూర్తయ్యింది. 

ఊరింకా పూర్తిగా తెల్లవారలేదు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటోంది, మాలాగే. 'యాత్రి నివాస్' లో మా రూముకి చేరాం. రెండు పెద్ద మంచాలు, వాష్ రూములు, ఛేంజింగ్ రూము.. మొత్తం కలిపి ఓ సింగల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అంత ఉంది. "మీరు స్నానం చేసేయండి, నేను తర్వాత చేస్తాను" మంచి ఇంగ్లిష్లో చెప్పి ఫోన్లో తల దూర్చాడు రూమ్మేట్. ఫార్మల్ పరిచయాలు రిసెప్షనిస్టు సమక్షంలోనే అయిపోయాయి కదా. చలిగా, వర్షం వచ్చేలా ఉంది బయట వాతావరణం. హాయిగా వేడినీళ్ల స్నానం. రెడీ అయి బయటికి వచ్చిన నన్ను చూసి ఫోన్ పక్కన పెట్టాడు. "రిసెప్షన్ బిల్డింగు దాటి కొంచం ముందుకు వెళ్తే కుడివైపు మారుతి టిఫిన్ సెంటర్ అని ఉంటుంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయండి, బాగుంటుంది" చెప్పాడు. "గుడికి వెళ్లొచ్చాక బ్రేక్ఫాస్ట్ కదా" అన్నాన్నేను.  "ఒకసారి లోపలికి వెళ్తే భోజనం చేసే బయటికి వస్తాం. ఇక్కడ అందరూ బ్రేక్ఫాస్ట్ చేసే గుడికి వెళ్తారు. నేను బహుశా స్వామీజీ దర్శనం దగ్గర మిమ్మల్ని కలుస్తాను" ఈ 'స్వామీజీ దర్శనం' ఏవిటో అర్ధం కాక అయోమయంగా తలూపాను. 

కష్టపడక్కర్లేకుండానే మారుతి టిఫిన్ సెంటర్ అడ్రస్ దొరికేసింది. బయట కొందరు తమవంతు కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. అక్కడున్న చిన్న ట్యాప్ దగ్గర కాళ్ళు, చేతులు కడుక్కుని నేనూ వరుసలో నిలబడ్డా. లోపలి నుంచి మా అందరికీ పిలుపొచ్చింది. బాగా పాతకాలపు ఇంట్లో ఓ చివరి వాటా. సన్నని, పొడవాటి హాలు. గచ్చు నేల మీద రెండు వైపులా చాపలు పరిచి ఉన్నాయి. తగు చోటు చూసుకుని కూర్చున్నా. ఉత్తరీయాన్ని నడుముకి కట్టుకున్న మధ్వాచార్యులు ఒకాయన వచ్చి అందరి ముందూ అరిటాకులు పరిచి వెళ్లారు. వెనుకే మరో ఆయన మంచి నీళ్ల గ్లాసులతో వచ్చారు. ఆకు శుభ్రం చేసుకునే లోగా, మొదటి ఆయన వేడి వేడి ఇడ్డెన్లతోనూ, రెండో ఆయన చట్నీతోనూ ప్రత్యక్షం. అటు పైన చిక్కటి సాంబారు, వడలు, పూరీలు, కూర ఒకదాని వెంట మరొకటి వచ్చాయి. కావలిస్తే వేయించుకోవడం, వద్దనుకుంటే చేయి అడ్డం పెట్టడం తప్ప మాటలేవీ లేవు. తినడానికి తప్ప నోరు తెరవడం లేదు ఎవ్వరూ. ఏదో నందికేశుడి నోముకి వచ్చినట్టు ఉంది తప్ప, ఎక్కడా హోటల్ లో టిఫిన్ తింటున్నట్టు లేదు. 

వడ్డించిన టిఫిన్ల వేడికి అరిటాకు కమిలి పోయింది. వంటకాల రుచి, నాణ్యత ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. "కాఫీ? టీ?" ఆకులేసిన ఆయన అందరినీ అడిగాడు. మొత్తం మీద ఓ పాతిక మందిమి ఉన్నాం. పూరీ పూర్తి చేసేలోగా పొగలు కక్కే కాఫీ వచ్చింది. తాపీగా తాగుతూ ఉండగా అప్పుడొచ్చాడు మూడో మనిషి, చేతిలో పుస్తకం, పెన్నుతో. ఏమేం తిన్నామో చెబితే బిల్లు వేసి ఇస్తాడన్నమాట. ఏవి ఎన్నేసి తిన్నామో గుర్తు చేసుకోవడం కాస్త కష్టమైన వ్యవహారమే. ఎవర్నీ ఆకులు మడవనివ్వలేదు. ఆకులు వేసినాయనే ఓ బుట్టతో వచ్చి అన్నీ తీశాడు, ఆ వెనుకే రెండో ఆయన తడి బట్టతో గచ్చు తుడిచేశాడు.   బిల్లు అందుకుని నేరుగా ముందుకి వెళ్తే (వన్ వే) కిచెన్ లో ఉన్నాయన డబ్బు తీసుకున్నాడు. అటు నుంచి పెరట్లోకి వెళ్లి చెయ్యి కడుక్కుని, సందు గుండా వీధిలోకి రావాలి. దాదాపు వందేళ్ల నుంచి అదే ఇంట్లో అదే పద్ధతిలో నడుస్తోందిట ఆ చిన్న హోటల్. బయటికి వచ్చేసరికి తర్వాతి బ్యాచి వాళ్ళు వాళ్ళ వంతు కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు. 

ఎండ వేడి చురుక్కుమంటూండగా విశాలమైన ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టాను. కుడి వైపున వరుసగా ఆలయాలు, ఎడమవైపున వరుసగా పెద్ద పెద్ద హాళ్లు - ఆధ్యాత్మిక సమావేశాల మొదలు అక్షరాభ్యాసాల వరకూ అనేక కార్యక్రమాలు సామూహికంగా నిర్వహించుకోడానికి వీలుగా. మొదట శారదాంబ ఆలయం. హారతి అవుతోంది. భక్తుల రద్దీ మరీ ఎక్కువగా లేదు. బారికేడ్స్ ఉన్నా, ప్రదక్షిణకి వీలుగా ఉంది ఏర్పాటు. ప్రదక్షిణ పథంలో చిన్న చిన్న ఉపాలయాలున్నాయి. హారతి చాలాసేపు జరగడంతో, కాసేపు సన్నిధిలో నిలబడే వీలు చిక్కింది. బయటికి వచ్చేసరికి ఆకాశంలో మబ్బులు. 'అరే' అనిపించింది. వరుసలో తర్వాత ఉన్నది విద్యా శంకర ఆలయం. హోయసాల, విజయనగర ఆర్కిటెక్చర్ల కలగలుపుగా కనిపించే ఈ ఆలయం ప్రత్యేకత లోపల మహా మండపంలో ఉండే పన్నెండు స్థంభాలు. ఒక్కో స్థంభం ఒక్కో రాశికి ప్రతీక. సూర్యుడు ఏ నెలలో ఏ రాశిలో ఉంటాడో ఆ స్థంభం మీద మాత్రమే సూర్యకిరణాలు పడతాయి. ఆ అద్భుతాన్ని కళ్లారా చూడడానికి వీలు లేకుండా శ్రావణ మాసపు కరిబ్బులు అడ్డం పడ్డాయి. 

దశావతారాల మొదలు యక్షిణులు వరకూ అనేక శిల్పాలను పరిశీలిస్తూ ప్రదక్షిణ చేస్తున్నా. ఫోటోల వాళ్ళతో పాటు, వ్లాగర్లు, రీల్స్ వారు, వాట్సాప్ లైవ్ వారు... ఇలా అందరినీ దాటుకుంటూ, కొందరికి అడ్డు తప్పుకుంటూ, మరికొందరికి అడ్డుపడుతూ ప్రదక్షిణ పూర్తి చేసి లోపలికి అడుగుపెట్టేసరికి అక్కడ ఇంకో కోలాహలం. ఏదో ప్రత్యేక పూజ జరుగుతోంది. భక్తులు చాలామంది ఉండడంతో స్థంభాలని బాగా చూడడం వీలవ్వలేదు. దర్శనం పూర్తి చేసుకుని బయటికి వచ్చి, ఒకరిద్దరికి ఫోటోలు తీసి పెట్టి ముందుకు వెళ్తే మరో రెండు ఉపాలయాలు కనిపించాయి. అవి చూసుకుని తుంగ నది దగ్గరకు చేరేసరికి మబ్బులు మరికాస్త చిక్కబడ్డాయి. స్నానానికి అనుమతించరు కానీ తుంగలో పాద ప్రక్షాళనకి వీలుంది. పెద్ద పెద్ద రాతి మెట్లు జాగ్రత్తగా దిగుతూ ఉంటే మోకాళ్ళు కలుక్కుమన్నాయి. 

తీరా కాళ్ళు కడుక్కునే వేళకి భారీ చేపలు కాళ్ళ మధ్య అడ్డం పడడం  మొదలెట్టాయి. ఆకారానికి మొసలి పిల్లల్లా ఉన్నాయవి. చాలామంది భక్తులు అక్కడే కొన్న మరమరాలు వాటికి ఆహారంగా పెడుతున్నారు. డైట్ లో కార్బ్స్ మరీ ఎక్కువైతే జరిగే పరిణామం ఏవిటో వాటి పరిమాణం చెబుతోంది. పక్కనెవరో భక్తులు ఒక్కో చేపనీ ఎంతమందికి వండి పెట్టొచ్చో అంచనా వేస్తున్నారు (ఆ రేవులో వేట నిషిద్ధం). కాస్త కష్టపడి మెట్లెక్కి పైకి వస్తే తుంగ మీద ఒక వంతెన ఉంది. అవతల పక్క ఏముందో చెప్పే బోర్డు కన్నడలో ఉంది. కొందరు భక్తులు వెళ్తున్నారు. నేనూ బయల్దేరాను. బ్రిడ్జి మధ్యలో నిలబడితే తుంగ అలలతో పాటు, చేపలూ (చేప  పిల్లలు అనలేం) బాగా కనిపిస్తున్నాయి. 'చెలి పయ్యెదలో తుంగ అల పొంగాలీవేళ..' వేటూరి గుర్తొచ్చారు. కేవలం ఏముందో చూసొద్దాం అనే కుతూహలం ముందుకు నడిపించింది. 

అడుగు పెట్టగానే తెలిసింది అది లంక అని. సారవంతమైన నేల, ఆపై వర్ష ఋతువు కావడంతో పచ్చగా హరిత ద్వీపంలా ఉంది. కానైతే, పూలమొక్కలు, పళ్ళ చెట్లు మొదలు పచ్చిక వరకూ అన్నీ క్రమశిక్షణతో పెరుగుతున్నాయక్కడ. ఫెన్స్ కి ఆవల రెండు జింక పిల్లలు ఓ లేగ దూడ పచ్చిక మేస్తూ కనిపించాయి. బొమ్మలేమో అనుకున్నా ఒక్క క్షణం. కదులుతున్నాయి. బలమైన గజరాజు, బక్కపలచటి మావటి ఎదురొచ్చారు. మావటిని చూడగానే 'వేలాయుధం' గుర్తొచ్చేశాడు.  శంకరాచార్యుల సందేశాలని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రాసిన బోర్డులున్నాయి అక్కడక్కడా. వాటిని చదువుకుంటూ ముందుకు వెళ్తే 'ప్రయివేట్ సెక్రటరీ'స్ ఆఫీస్' అని బోర్డున్న ఓ చిన్న బిల్డింగు, ఆ వెనుకే గెస్టు హౌసు, కాస్త ముందుకెళ్తే ఓ ఆలయం, యాగశాల, గురు నివాసం కనిపించాయి. ఒక్కొక్కటీ చూసుకుంటూ గురు నివాసం చేరేసరికి చినుకులు మొదలయ్యాయి. అప్రయత్నంగానే గురు నివాసానికి వెళ్లాను. వెళ్లాకే తెలిసింది, అది శృంగేరి పీఠానికి కాబోయే జగద్గురువు విదుశేఖర భారతీ స్వామి భక్తులకి దర్శనం ఇచ్చే చోటు అని. 

విశాలమైన పెద్ద హాలు. ఎదురుగా వేదిక. గుడి కన్నా చిన్నది, పూజా మందిరం కన్నా పెద్దది అయిన దేవుని మండపం. వేదికకి ఎదురుగా హాలు మధ్యలో కూర్చున్నా. నాకు ఎడమవైపున 'పాదపూజ' అని బోర్డు, అక్కడి నుంచి వేదికపై ఓ ప్రత్యేకమైన బారికేడ్ కనిపించాయి. కుడివైపున మరో బారికేడ్ ఉంది. వేదికని ఆనుకుని కుడి వైపున భారీ గాజుపెట్టెలో ఒక వీణ ఉంది. అది ప్రపంచంలోనే అతి పెద్ద వీణ అట. స్వామీజీ అంతేవాసులు, బహుశా పరిచారకులు అంటారనుకుంటా, కొందరు మండపంలో పూజలు చేస్తుంటే మరి కొందరు తీర్ధ ప్రసాదాలు ఏర్పాటు చేస్తూ హడావిడి పడుతున్నారు. ఏక్షణంలో అయినా స్వామీజీ లోపలి నుంచి బయటికి రావచ్చు అన్నట్టుగా ఉంది వాతావరణం. పరిచారకుల హడావిడి చూస్తుంటే 'బంగారు మురుగు' కథలో బామ్మ గుర్తొచ్చింది. బుర్రలో తిరుగుతున్న ఆ ఛానల్ ని బలవంతంగా ఆపి చుట్టూ చూస్తే హాల్లో జనం పలచగా ఉన్నారు. కొందరు ధ్యానం చేసుకుంటున్నారు. నేనూ ప్రయత్నించాను కానీ అంత కుదురెక్కడిది? 

(ఇంకావుంది) 

శుక్రవారం, జులై 21, 2023

బతుకుబాటలో కొండగుర్తులు

ఆత్మకథ వేరు, దినచర్య (డైరీ) వేరు. ఒక వ్యక్తి జీవనగతిని, ఆలోచనలని, కృషిని, దృక్పథాన్ని వివరించేది ఆత్మకథ అయితే, ప్రతిరోజూ చేరిన పనుల తాలూకు రికార్డు దినచర్య. ఆత్మకథలుగా మొదలై డైరీలుగా మారిపోయిన ప్రముఖుల రచనలు కొన్ని ఇటీవల కాలంలో చదవడం తటస్థించింది. ఈ కోవలోకే వచ్చే రచన భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి 'బతుకుబాటలో కొండగుర్తులు.' గంభీరమైన శీర్షికతో, ఆసక్తికరమైన ఆరంభంతో ఆపకుండా చదివించే పుస్తకం అనే భావనని కలిగించినా, సగానికి వచ్చేసరికి ఈ భావన క్రమేణా పలచబడి ఆసక్తి స్థానంలో నిరాశ పెరగడం మొదలయ్యింది. ఇందుకు కారణం ఈ ఆత్మకథలో డైరీ ప్రవేశించి, కేవలం రోజువారీ కార్యకలాపాలు మాత్రమే క్లుప్తంగా ప్రస్తావించి (డైరీ నోట్స్) ఊరుకోవడమే. ఆత్మకథల మీద ఉన్న ఆసక్తి ఈ పుస్తకాన్ని కడదాకా చదివించింది.

ఒంగోలు పట్టణంలోని ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో మూడో సంతానంగా జన్మించిన కృష్ణమూర్తి బాల్యంలో చాలా సమస్యలనే చూశారు. తండ్రిని పోగొట్టుకుని, బంధువులు సాయంతో చదువు పూర్తి చేశారు. నిజానికి ఉన్నత విద్యకి బదులు, ఉద్యోగానికే వెళ్లాలని అనుకున్నారు కానీ, అనుకున్నట్టుగా ఉద్యోగం రాకపోవడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ తెలుగు సాహిత్యానికి బదులుగా, తెలుగు భాషా శాస్త్రాన్ని ఆప్షనల్ గా ఎంచుకోవడం కృష్ణమూర్తి జీవితంలో మొదటిమలుపు. ఈ మలుపు వెనుక ఉన్నవారు నాటి యూనివర్సిటీ లైబ్రేరియన్ అబ్బూరి రామకృష్ణారావు, అధ్యాపకులు గంటి జోగిసోమయాజి. చదువు పూర్తవుతూనే ఆంధ్ర విశ్వవిద్యాలయం లోనే ఉద్యోగం దొరకడంతో ఆర్ధిక సమస్యలు గట్టెక్కాయి. అటు తర్వాత, పెన్సెల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి భాషాశాస్త్రంలో పీహెచ్డీ చేసే అవకాశం రావడం జీవితంలో రెండో మలుపు.

చదువు పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చి ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర బోధన చేపట్టడం, హైదరాబాద్ యూనివర్సిటీ కి వైస్-ఛాన్సలర్ గా పనిచేయడంతో పాటు అనేక ప్రపంచ దేశాలు పర్యటించి, భాషాశాస్త్ర సదస్సులో పాల్గొని, కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేయడం మాత్రమే కాకుండా భాషా శాస్త్రానికి సంబంధించి పత్రాలు, పుస్తకాలెన్నింటినో రచించారు. చేకూరి రామారావు, బూదరాజు రాధాకృష్ణ లాంటి శిష్యులని తయారు చేశారు. ఉస్మానియాలో భాషాశాస్త్ర విభాగం ఏర్పాటు, విస్తరణకి ప్రత్యేక కృషి చేశారు. భాషకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచిన విధానపరమైన నిర్ణయాల వెనుక (తెలుగు అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు లాంటివి) ఉన్నారు. 

తెలుగులో భద్రిరాజు కృష్ణమూర్తి సంపాదకత్వం వహించి స్వరూప నిర్దేశం చేసిన మాండలిక వృత్తి పదకోశాలు భారతీయ భాషల్లోనే తొలి ప్రయత్నం. ప్రద ప్రయోగ కోశ నిర్మాణ పద్ధతులని రూపొందించారు. లింగ్విస్టిక్ సొసైటీ అఫ్ అమెరికా గౌరవ సభ్యత్వం, రాయల్ సొసైటీ అఫ్ ఎడింబరో విద్వత్ సభ్యత్వం లాంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ గౌరవాలు అందుకున్నారు. ఆత్మకథలు అంటే ఉన్న ఇష్టంతో పాటు, ఈ ప్రొఫైల్ లో కొంత తెలిసి ఉండడం ఈ పుస్తకం కొనడానికి కారణమైతే, ఆరంభం కడు ఆకర్షణీయంగా ఉండి ఏకబిగిన చదవడానికి దోహదం చేసింది. ముందే చెప్పినట్టుగా, సగం పేజీలు తిరిగేసరికి ఆత్మకథ బదులు దినచర్య దర్శనమిచ్చింది. తేదీల వారీగా ఏరోజు ఏ దేశంలో ఏ కార్యక్రమం లో పాల్గొన్నారో, ఎవరెవరిని కలిశారో వివరాలు నమోదు చేశారు. భాషాశాస్త్ర అధ్యయనం, పరిశోధనకి సంబంధించిన లోతైన వివరాలు బొత్తిగా లేవు.

తన డైరీకి అక్కడక్కడా యూనివర్సిటీ రాజకీయాలు, కుటుంబ విషయాలు జోడించారే తప్ప, ఒక భాషా శాస్త్రవేత్త ఆత్మకథ నుంచి పాఠకులు ఏం ఆశిస్తారు అన్న కోణం బొత్తిగా ఆలోచించలేదేమో అనిపించింది. చివరి రెండు అధ్యాయాలు ఆయన చెబుతుండగా వేరే వారు రాసినవి. అక్కడ నుంచి కథనం ప్రధమ పురుషలోకి మారింది, వివరాలు మాత్రం మారలేదు. హైదరాబాద్ యూనివర్సిటీలో చేసిన అభివృద్ధి పనుల జాబితా దర్శనమిచ్చింది. పట్టి చూస్తే నాటి విద్యావిధానం, విదేశీ ప్రయాణాల తీరుతెన్నులు, దేశ-విదేశీ జీవన విధానాల లాంటి వాటిని గురించి కొన్ని పరిచయ వాక్యాలు కనిపిస్తాయి తప్ప లోతైన వివరణ దొరకదు. 'వాళ్ళతో సంభాషించాను' 'అక్కడ కూర్చుని రాసుకున్నాను' లాంటి వాక్యాలు లెక్కకు మిక్కిలి. ఆ సంభాషణలు, రచనల 'లోతు' తాలూకు ప్రస్తావన లేదెక్కడా.

పదేళ్ల క్రితం ఎమెస్కో ప్రచురించిన ఈ పుస్తకం మధ్యలో ఓ పద్దెనిమిది పేజీలని కేవలం ఫోటోలకి కేటాయించారు. పేపర్ క్వాలిటీ బొత్తిగా లేకపోవడం వల్ల ఆ ఫోటోలు బొత్తిగా అలుక్కుపోయి కనిపిస్తున్నాయి. రచయిత కుటుంబ సభ్యులైనా ఆ ఫోటోల్లో ఉన్నదెవరో గుర్తు పట్టగలరా అంటే సందేహమే. కాగితపు నాణ్యత పెంచడమో, ఫోటోల ప్రచురణ పరిహరించడమో చేసి ఉండాల్సింది. ఆ విధంగా రచనతో పాటు ముద్రణ కూడా నిరాశ పరిచింది. భద్రిరాజు కృష్ణమూర్తి కాలం, చేసిన కృషి, పొందిన అవకాశాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు నాటి సమాజం మొదలు, తెలుగులో భాషా శాస్త్ర అభివృద్ధి వరకూ చాలా విషయాలని వివరించే వీలున్న పుస్తకం ఇది. మరి ఈ 'స్కోప్' ని ఉపయోగించుకోక పోవడం వెనుక యేవో కారణాలు ఉండే ఉంటాయి. ('బతుకుబాటలో కొండగుర్తులు', పేజీలు 214, వెల రూ. 100).

బుధవారం, జులై 19, 2023

శ్రీరమణ ...

సుమారు పాతికేళ్ల క్రితం మాట. ఒక సాహిత్య సభ జరగాల్సి ఉంది, అప్పటికే గంటకి పైగా ఆలస్యం. ఉన్న కొద్దిమంది ప్రేక్షక శ్రోతలూ కాస్త అసహనంగా ఉన్నారు. ఇంతలో చిన్నపాటి కలకలం, "శ్రీరమణ గారొస్తున్నారు.." అంటూ. నేనేమో 'ద్వారానికి తారా మణిహారం' లాగా గుమ్మం దగ్గర నిలబడి మిత్రులతో కబుర్లు చెబుతున్నాను. పరిస్థితిని బట్టి లోపలికో, బయటికో వెళ్లేందుకు వీలుగా. లోపలికి వెళ్ళబోతున్న శ్రీరమణ నా పక్కనే ఆగారు. అవి 'మిథునం' రోజులు. అంటే, 'మిథునం' కథా సంకలనం విడుదలై ఎక్కువమంది మెప్పు పొందిన రోజులు. 'మిథునం' కథకైతే కల్ట్ స్టేటస్ వచ్చేస్తూ ఉన్న కాలం. "ఈయన శ్రీరమణ గారు, మిథునం, తెలుసుకదా.." ఓ మిత్రుడు నన్నాయనకి పరిచయం చేసేశాడు. వేదిక మీద ఔత్సాహిక గాయని పాట పాడుతోంది. శ్రీరమణ అక్కడే ఆగిపోయారు. అలాంటి అనూహ్య పరిస్థితిలో ఆయనతో చిరు సంభాషణ సాగింది.

"మీ స్వస్థలం ఎక్కడండీ? 'షోడా నాయుడు' లో మగ్గాల వర్ణన చదివి, ఏ ఊరు అయి ఉంటుందా అని ఆలోచించాను" చాలా కేజువల్ గా అడిగాను. "తెనాలి దగ్గర అండీ.. ఆ మగ్గాలూ అవీ నా చిన్నప్పుడు, ఇప్పుడు ఉన్నట్టు లేవు" అంతే కేజువల్ జవాబు. "ఆ కథ ముగింపు చాలా ప్రత్యేకం.. మొత్తం కథ ఒక ఎత్తైతే, ముగింపు ఒక్కటీ ఓ ఎత్తు.." అంతకు ముందే చదివి ఉన్నానేమో, నాకు కథలన్నీ బాగానే గుర్తున్నాయి. "థాంక్యూ" క్లుప్తంగా వచ్చింది జవాబు. సన్నగా, ఆయనే ఒక కాలమ్ లో వరవరరావుని వర్ణించినట్టు 'పంట్లాము తొడుక్కున్న కృపాచార్యుడిలా' అనిపించారు శ్రీరమణ. "ధనలక్ష్మిలో భాష.. అసలు ఎలా పట్టుబడిందా అనిపించింది చదువుతుంటే. కథకుడి భాష వేరు, ధనమ్మ, రామాంజనేయులు భాష వేరు.. పై పెంకు మరియు కోడిపిల్ల..." చెబుతుండగానే నవ్వొచ్చింది నాకూ, శ్రద్ధగా వింటున్న ఆయనకీ కూడా. "తెలిసిన వాళ్లేనండి .. నాకు తెలిసిన మనుషులే అందరూ." గాయని పాట కొనసాగుతోంది.

"బంగారు మురుగులో కొన్నిచోట్ల నన్ను నేను చూసుకున్నాను.. బామ్మ మరీ ఐడియలిస్టిక్ గా అనిపించింది కొన్నిచోట్ల.." నా అనుభవం కొద్దీ అన్నమాట. "లేదండీ, ఉన్నారు అలాంటి వాళ్ళు.." మళ్ళీ క్లుప్తమైన జవాబు. "ఆయన్ని అందరూ 'మిథునం' శ్రీరమణ అంటారు, మీరసలు ఆ కథ మాటే ఎత్తడం లేదు?" ఆయన పక్కనున్నాయన ప్రశ్నించాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన జయప్రభ ('పైటను  తగలెయ్యాలి' ఫేమ్ ఫెమినిస్టు కవయిత్రి) "ఏంటి రమణా? ఆడవాళ్లు అంటే ఎంతసేపూ వండి పెట్టడమేనా? ఆ బుచ్చిలక్ష్మికి వేరే పని లేదా?" అంటూ ప్రశ్నలు కురిపిస్తూ ఆయన్ని లోపలికి తీసుకు (లాక్కు)పోయారు. నేను నిలబడిపోయాను. అది మొదలు, శ్రీరమణ పుస్తకం ఎప్పుడు చదివినా, ఈ సన్నివేశం మొత్తం నిన్ననే జరిగినంత తాజాగా గుర్తొస్తూ ఉంటుంది. వాక్యం మీద అద్భుతమైన అదుపు ఉన్న కొద్దిమంది తెలుగు రచయితల్లో శ్రీరమణ ఒకరు. పొదుపైన వాక్యాలతో విస్తారమైన (నిడివి పరంగా) కథలు రాసిన శ్రీరమణ ఇక లేరన్న వార్త తెలియగానే ఇదిగో మళ్ళీ ఇంకోసారి గుర్తొచ్చింది నాటి చిరు సంభాషణ.


పేరడీ మొదలు ముందుమాట మీదుగా ఎలిజీ వరకూ ఏం రాసినా ప్రతి ప్రక్రియ మీదా తనదైన ముద్ర వేశారు శ్రీరమణ. 'పాషాణ పాక ప్రభువు' విశ్వనాథ శైలిని అనుకరించడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. వ్యంగ్యంతో సహా ఏరసాన్ని ఎక్కడ ఏమోతాదులో వాడాలో బాగా తెలిసిన రచయిత అవ్వడం వల్ల రచనలన్నీ బాగా పండాయి. కొన్ని కాలమ్స్, కథల్ని మరిపిస్తాయి. చాలా కథలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. నవలలు మరికాస్త బావుండొచ్చు అనిపించినా బొత్తిగా తీసేసేవి కాదు. ఇతరుల రచనలకి ఆయన రాసిన ముందుమాటలు రెండు రకాలు. రచనని ఇష్టపడి మనస్ఫూర్తిగా రాసినవి, మొహమాటానికి బలవంతంగా రాసినవి. చదువుతూనే అవి ఏ కోవకి చెందుతాయో ఇట్టే పోల్చుకోవచ్చు. చదివినంతలో ఓ రెండు బలవంతపు ముందుమాటలు ఎప్పుడు తల్చుకున్నా నవ్వు తెప్పిస్తాయి. ఈ రెండూ కాకుండా మూడోరకం 'నాస్తికానికి ముందుమాట', నరిశెట్టి ఇన్నయ్యగారు ప్రచురించని ముందుమాట దానికదే సాటి.

నివాళి వ్యాసాలదీ ఇదే తీరు. చాలావరకు మనస్ఫూర్తిగా రాసినవే. పోయిన వాళ్ళ సుగుణాలతో పాటు, వాళ్ళతో తన అనుబంధాన్ని తల్చుకుంటూ రాసిన విలువైన నివాళులవి. కొన్ని మాత్రం పూర్తిగా భిన్నం. పోయినవాళ్ళు కనుక బతికితే, ఆ నివాళి చదవగానే గుండాగి చచ్చిపోతారేమో అనిపించేలాంటివి. పెంకితనంగా రాసినవి.  రానురానూ ఈ ధోరణి బాగా పెరిగింది కూడా, బొత్తిగా ఎవరినీ క్షమించలేదు. ఎవరైనా ఓ రచయిత రచనలు అన్నీనో, ఎక్కువగానో చదవడం వల్ల జరిగేది ఏంటంటే ఆ రచయిత మనకి బాగా తెలిసిన వ్యక్తి అయిపోతారు. కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి ఏం రాస్తారో ఊహించ గలుగుతాం, ఎదురు చూస్తాం కూడా. శ్రీరమణ వీక్లీ కాలమ్స్ విషయంలో నా అనుభవం ఇదే. 'సాక్షి' నాటికి ఆయన కాలమ్ ఏ విషయం మీద మొదలు, ఎలా ఉండబోతోంది వరకూ ఓ అంచనా ఉండేది. చాలాసార్లు అది నిజమయ్యేది కూడా. కీలకమైన రాజకీయ సందర్భాలని వ్యంగ్యాత్మకంగా రికార్డు చేశారు.

'చిలకల పందిరి' ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆర్టిస్టు మోహన్ తో కలిసి శ్రీరమణ చేసిన ఈ జుగల్బందీ అంటే నాకు మాత్రమే కాదు, శ్రీరమణకి, మోహన్ కీ కూడా ప్రత్యేకమైన ఇష్టం. అల్లదిగో ఆ పుస్తకం వచ్చేస్తోంది అంటూ చివరివరకూ ఊరిస్తూనే వచ్చారు శ్రీరమణ. అదొక్కటే కాదు, 'దేవుడు మేలు చేస్తే..' అంటూ ఆయన విప్పిన జాబితాలో నుంచి ఇంకా రావాల్సిన పుస్తకాలున్నాయి. ఇప్పుడు వాటి బాధ్యతని ఎవరు చూస్తారో మరి. వంకమామిడి రాధాకృష్ణగా ఓ ఇంట్లోనూ, కామరాజు రామారావు గా మరో ఇంట్లోనూ పెరిగి, తనకంటూ 'శ్రీరమణ' అనే పేరు పెట్టుకుని రచయితగా ఎదిగి, రాయాల్సినన్ని కథలూ, వ్యాసాలూ రాయకుండానే వెళ్లిపోయారు. 'రాయాల్సినన్ని' కి ప్రాతిపదిక ఏమిటంటే ఆయనకున్న విషయ పరిజ్ఞానం, విస్తృతమైన పఠనానుభవం, తనదైన రచనా శైలీను. రాసిన పుస్తకాలన్నిటినీ వెలుగులోకి తీసుకురావడమే శ్రీరమణకి ఇవ్వగలిగే ఘనమైన నివాళి.

సోమవారం, మే 22, 2023

శరత్ బాబు...

బ్లాకండ్ వైట్ సినిమాల్లో కొంగర జగ్గయ్య, హీరోతో సమంగా కథానాయికని ప్రేమిస్తున్నట్టయితే సినిమా చూస్తున్న ప్రేక్షకులకి యిట్టే తెలిసిపోయేది - ఇతడి ప్రేమ త్యాగాన్ని కోరుతుందని. కేవలం రెండో హీరో మాత్రమే కాదు, విలన్ గానూ, కేరక్టర్ ఆర్టిస్టు గానూ రాణించారు జగ్గయ్య. సినిమాలు నలుపు-తెలుపుల్లో నుంచి రంగుల్లోకి మారాక జగ్గయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అతికొద్దిమంది నటుల్లో ఒకరు శరత్ బాబు. నలగని, చక్కని దుస్తులు, చెదరని క్రాఫు, రిమ్ లెస్ కళ్లద్దాలు.. గాంభీర్యం కలగలిసిన ఆహార్యం. చిన్న నవ్వులో కనిపించే చిరు వంకర అతని విలన్ వేషాలకి భలేగా కలిసొచ్చింది. కళ్ళజోడు తీసి చేత్తో పట్టుకుంటే సెంటిమెంటు, కళ్లద్దాలు పైనుంచి వోరగా చూస్తే విలనీ.. వెరసి క్లుప్తమైన నటన. 

హీరో మెటీరియల్ అయివుండీ, కథానాయకుడిగా గట్టిగా నిలదొక్కుకోలేక పోయిన కొందరిలో ఒకడు శరత్ బాబు. చలం, రంగనాథ్ ల కోవ. పాత్ర ఏదైనా, అతడు తెరమీద కనిపించాడంటే, దృష్టి నిలిపి చూడాల్సిందే. హీరోగానే కెరీర్ మొదలుపెట్టినా, చిత్ర పరిశ్రమ తత్వాన్ని యిట్టే అర్ధం చేసుకుని అట్టే కేరక్టర్ల లోకి, విలనీ లోకీ మారిపోయాడు. వయసులో తనకన్నా పెద్ద వాళ్ళకి 'అన్న' అయ్యాడు. కొండొకచో నాన్న కూడా అయ్యాడు. పోలీసు, దొంగ వేషాలతో పాటు రెంటినీ కలగలిపిన నెగటివ్ పాత్రల్లోనూ ఔననిపించాడు. దాదాపు ఒకే సమయంలో వచ్చిన 'సితార' 'సీతాకోకచిలుక' సినిమాలు రెంటిలోనూ శరత్ బాబు కేరక్టర్ ఆర్టిస్టు. చేసిన కేరక్టర్ల లో భేదం రేఖామాత్రమే అయినా, వాటిని అభినయించిన విధం ఎంత ప్రత్యేకం అసలు! 

ఆముదాలవలస హోటల్ ఓనర్ గారబ్బాయి సత్యంబాబు దీక్షితులు, శరత్ బాబుగా మారిన క్రమాన్ని గురించి పెద్దగా తెలిసింది లేదు. ఆ ప్రారంభపు రోజుల్ని మాత్రమే కాదు, తర్వాత కాలంలో తిన్న ఎదురు దెబ్బల గురించీ ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు. విడాకుల తర్వాత రమాప్రభ చేసిన ఆరోపణల విషయంలోనూ అదే మౌనం. ఆ మౌనమే ఆ పెళ్లి కథలో శరత్ బాబుని విలన్ని చేసేసింది. 'అభినందన' లాంటి త్యాగపూరిత పాత్రలు చేసినా, అతన్ని తలచుకోగానే దుష్ట పాత్రలే మొదట గుర్తొచ్చేలా జరిగిన ట్యూనింగ్ లో రమాప్రభ ఎపిసోడ్ ప్రభావం తెలియకుండానే ఉందేమో. 'సంసారం ఒక చదరంగం' లాంటి సినిమాల్లో వేసిన పాత్రలు అత్యంత సహజంగా ఉండడమూ మరో కారణం కావొచ్చు. నటీనటులకి ఒక్కో 'ఇమేజి ' స్థిర పడిపోవడం అన్నది కొత్త విషయం కాదు కదా. 

'ఇది కథ కాదు' 'గుప్పెడు మనసు' 'అన్వేషణ' 'సాగర సంగమం' 'స్వాతి' 'ఓ భార్య కథ' ... గుర్తు చేసుకుంటూ వెళ్తే ఎన్ని వైవిధ్య భరితమైన పాత్రలో అసలు. శరత్ బాబు యంగ్ లుక్ కి అలవాటు పడిపోవడం వల్ల కావచ్చు, 'శుభప్రదం' లాంటి సినిమాల్లో వయసు మళ్ళిన (అప్పటికి తన వయసుకి తగ్గవే అయినా) పాత్రల్లో చూడడం అలవాటవడానికి కొంచం టైం పట్టింది. 'సాగర సంగమం' క్లైమాక్స్ లో కమల్ హాసన్ మీద వర్షం పడకుండా అడ్డం పడడం (జయప్రద గొడుగు తెచ్చేలోగా) తెరమీద కనిపించేది ఒక్క క్షణమే అయినా చెరగని ముద్ర వేసే సన్నివేశం. "ఇలాంటి ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు" అనుకోని ప్రేక్షకులు ఉండరేమో అసలు. నిజానికి ఆ సీన్లో బోల్డంత అభినయించవచ్చు. అలా కాకుండా సహజంగా చేయడమే శరత్ బాబు ప్రత్యేకత. 

శరత్ బాబు వేసిన పోలీసు వేషాల గురించి ప్రత్యేకం చెప్పుకోవాలి. తెరమీద పోలీసు యూనిఫామ్ ధరించాలన్నది నటీనటుల్లో చాలామందికి కల. నెరవేర్చుకునే అవకాశమూ దొరుకుతుంది. కానైతే, ఆ యూనిఫామ్ అందరికీ సెట్ అవ్వదు. పెద్ద హీరోల విషయంలో అభిమానులు కాసేసుకుంటారు కాబట్టి సమస్య ఉండదు, కానీ కేరక్టర్ ఆర్టిస్టుల విషయంలో అలా కాదు. సెట్ అయ్యే వాళ్ళకి మాత్రమే యూనిఫామ్ వేస్తారు. శరత్ బాబు ఖాకీ యూనిఫామ్ వేసుకుని కనిపిస్తే, అచ్చంగా పోలీస్ ఆఫీసర్ లాగే ఉండేవాడు. అక్కడ కూడా ఆఫీసరే, కానిస్టేబుల్ వేషంలో చూడలేం. నిజానికి పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నది తన చిన్నప్పటి కల అట. అయితే ఐ సైట్ సమస్య ఉండడంతో ఆ ఉద్యోగం రాదని నిశ్చయించుకుని, సినిమాల వైపు చూశానని చెప్పాడు ఓ ఇంటర్యూలో. (ఇది కూడా 'డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా' లాంటిదే కావచ్చునేమో.) 

సినిమా వేషాలు తగ్గుతుండగానే టీవీకి షిఫ్ట్ అయిపోయిన శరత్ బాబు, చాలా ఏళ్ళ పాటు ఈటీవీ కి నిలయ విద్వాంసుడు. ఒక్క 'అంతరంగాలు' సీరియలే ఏళ్ళ తరబడి సాగింది. పాటలతో పాటు శరత్ బాబు కూడా ప్రత్యేక ఆకర్షణ ఆ సీరియల్ కి. మహిళా ప్రేక్షకుల్లో అతడికున్న ఫాలోయింగ్ ఆ సీరియల్ ని నిలబెట్టి, సుదీర్ఘంగా సాగేందుకు దోహదం చేసింది. అప్పుడప్పుడూ సినిమాల్లోనూ కనిపిస్తూ ఉండడం వల్ల శరత్ బాబు రిటైర్ అయిపోయాడు అనే ఆలోచన రాలేదెప్పుడూ. గత రెండు మూడు నెలలుగా అనారోగ్యం వార్తలు మాత్రం తరచూ కనిపిస్తున్నాయి. టీవీ చానళ్ళు చంపేసి, నాలిక్కరుచుకున్న సందర్భాలూ ఉన్నాయి. (చంపడం మీద వీళ్ళకి ఇంత ఉత్సాహం ఏమిటో, కాస్త ఆలస్యం అయినా కన్ఫర్మ్ చేసుకుని వార్త వెయ్యొచ్చు, కొంపలు మునగవు). ఎందుకో తెలియదు కానీ, శరత్ బాబు 'ఫిర్యాదులు లేని మనిషి' అనిపిస్తాడు. తన పాత్రని ముగించుకుని (బహుశా తృప్తిగానే) వెళ్ళిపోయాడు. శరత్ బాబు ఆత్మకి శాంతి కలగాలి. 

శనివారం, ఏప్రిల్ 22, 2023

సంకెళ్లను తెంచుకుంటూ

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్  చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు ఆత్మకథ 'సంకెళ్లను తెంచుకుంటూ'. మాధవ రావు స్వయంగా ఇంగ్లీష్ లో రాసుకున్న 'బ్రేకింగ్ బారియర్స్' కు రఘురాములు చేసిన తెలుగు అనువాదం ఇది. కృష్ణా జిల్లా పెద మద్దాలి గ్రామంలో ఓ దళిత కుటుంబంలో జన్మించి, తల్లి ప్రోత్సాహంతో చదువు సాగించి, ఐఏఎస్ సాధించి, ఎందరో ఐఏఎస్లు కలగనే చీఫ్ సెక్రటరీ పోస్టు వరకూ రావు చేసిన ప్రయాణమే ఈ పుస్తకం. వ్యవసాయ కూలీలుగా పని చేసిన మాణిక్యమ్మ, శోభనాద్రి దంపతుల చిన్న (రెండో) కొడుకుగా పేదరికంలో గడిచిన బాల్యం మొదలుకొని, ఉద్యోగ జీవితంలో ఎదురైన సవాళ్లు, ఆటుపోట్లు మీదుగా, తాను కోరుకుంటున్న సాంఘిక, రాజకీయ సంస్కరణల వరకూ తన అనుభవాలను, ఆలోచనలను అక్షరబద్ధం చేశారు మాధవ రావు. 

మోతుబరి రైతు దగ్గర పాలేరుగా జీవితం గడిపిన శోభనాద్రి తన కొడుకులు ఇద్దరూ కూడా తనలాగే 'నమ్మకస్తులైన పాలేర్లు' గా జీవించాలని గట్టిగా కోరుకున్నారు. ఈ ఆలోచనని అంతకన్నా గట్టిగా వ్యతిరేకించారు మాణిక్యమ్మ. ఫలితం, కొడుకులిద్దరూ ఊరి ఎలిమెంటరీ స్కూలు దాటి హైస్కూలుకి, అటుపైన కాలేజీకి వెళ్లి చదువుకునే అవకాశం దొరికింది. పెద్ద కొడుకు ఉద్యోగంలో కుదురుకోగా, ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చదివిన మాధవరావు సివిల్ సర్వీసెస్ సాధించారు. తనకి మేలు చేసిన ఎంతో మందిని పుస్తకం పొడవునా పేరు పేరునా ప్రస్తావించినప్పటికీ, తనలో సివిల్ సర్వీసెస్ ఆలోచన మొలకెత్తడానికి కారకులు, ప్రిపరేషన్ కి సహాయ పడిన వారు, ప్రోత్సహించిన వారి వివరాలని ఎక్కడా రాయకుండా ఆశ్చర్య పరిచారు రచయిత. 

"కట్ చేస్తే ఐఏఎస్" అన్నంత సులువుగా చదువు నుంచి ఉద్యోగ విషయాల్లోకి వచ్చేయడం వల్ల ఓ ముఖ్యమైన లింక్ మిస్సయినట్టుగా అనిపించింది పుస్తకం చదువుతుంటే. ప్రారంభంలో ఏ కెరీర్ లో అయినా ఇబ్బందులు సహజమే. సివిల్ సర్వీస్ ఇందుకు మినహాయింపు కాదని గతంలో కొందరు ఐఏఎస్ లు రాసిన ఆత్మకథల్లో చదువుకున్నాం. అలాంటి సమస్యలే మాధవరావుకీ ఎదురయ్యాయి. తనని ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లు బయట పెట్టలేదన్న మాటే కానీ, వాళ్ళ వివరాలు ఎంత సూక్ష్మంగా చెప్పారంటే -- ఇచ్చిన ఆధారాల సాయంతో గూగుల్ చేసి వాళ్ళ పేర్లు, ఫోటోలు సరి చూసుకోవచ్చు. ఎన్నో క్లిష్టమైన ఫైళ్లని పరిష్కరించిన అనుభవం కదా మరి. వరంగల్ కలెక్టర్ గా పని చేసిన నాటి అనుభవాలు మాత్రం ఆసక్తిగా చదివిస్తాయి. 'నక్సలైట్ సానుభూతి పరుడు' అన్న ముద్ర పడింది అప్పుడే. 

నేదురుమల్లి జనార్దన  రెడ్డి  ముఖ్యమంత్రి గా పనిచేసే రోజుల్లో, మాధవరావు సెక్రటరీ గా ఉన్నారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హైదరాబాద్ వస్తున్నారు. మాధవరావు ని ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఆమెకి స్వాగతం పలకమన్నారు జనార్దన రెడ్డి. అంతకు మునుపే జనార్దన  రెడ్డి తమిళనాడు వెళ్ళినప్పుడు జయలలిత సెక్రటరీ ఆయనకి స్వాగతం పలికారు. ఇది బదులు తీర్చుకోడం అన్నమాట. అయితే, జయలలితకి స్వాగతం పలకడానికి మాధవరావు నిరాకరించారు. ఆయనదృష్టిలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత జానకి రామచంద్రన్ (ఎంజీఆర్ భార్య) కి ఉంది తప్ప, జయలలితకి కాదు. ఈ అభ్యంతరాన్ని జనార్దన రెడ్డి మన్నించారు. అనూహ్యంగా, ఇది జరిగిన కొన్నేళ్ళకే, ఎన్టీఆర్ వెన్నుపోటు ఫలితంగా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ పదవి చేపట్టారు మాధవరావు. దీనిని కేవలం 'పారడాక్స్' అనగలమా?  

మొత్తం పధ్నాలుగు అధ్యాయాలుగా విభజించిన ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చినవి పది, పదకొండు అధ్యాయాలు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు పనితీరు పట్ల రచయిత పరిశీలనలున్నాయి వీటిలో. తాను చెప్పాలనుకున్న విషయాలని కొన్ని చోట్ల నేరుగానూ, చాలాచోట్ల గుంభనంగానూ చెప్పుకొచ్చారు. ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ ఏర్పాటు గురించి చెబుతూ "హైదరాబాద్ సంస్థాన పరిపాలకుడైన నిజాం ఉస్మానియా యూనివర్సిటీ కి 1917 లో 1,600 ఎకరాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక్క బిజినెస్ స్కూల్ కు 260 ఎకరాలు కేటాయించారు" అన్నారు. ఈ రెంటిలో ఏ సంస్థ ఏయే వర్గాలకి ఉపయోగ పడిందన్న ప్రశ్న పాఠకులే వేసుకుని, జవాబు వెతుక్కోవాలి. ఐఎస్బీ కి, సింగపూర్ విమానాలకి ఇచ్చిన 'రాయితీ' లని వివరంగానే ప్రస్తావించారు. 

మొత్తం పుస్తకాన్ని పూర్తి చేశాక, రచయిత తన చిన్ననాటి పేదరికాన్ని, తన కులాన్ని 'సంకెళ్లు' గా భావించారనిపించింది. కడుపు నిండా తిండి దొరకని నాటి పేదరికం, అప్పుడు తప్పక మొదలుపెట్టిన మితాహారాన్ని ఇప్పటికీ కొనసాగించడం లాంటి విషయాలు కదిలిస్తాయి. అయితే, కులం అన్నది ఆయన విషయంలో సంకెలగా కాక పూలదండగానే మారిందనిపించింది (పుస్తకంలో ప్రస్తావించిన విషయాల మేరకు). మరీ ముఖ్యంగా, చీఫ్ సెక్రటరీ నియామకం వెనుక కులం బలంగా పనిచేసింది. ఎస్సీ వర్గీకరణ ఆందోళనలు జరుగుతున్న ఆ రోజుల్లో కీలక పదవికి తనని ఎంపిక చేయడం వెనుక చంద్రబాబు నాయుడు వ్యూహమూ, చాతుర్యమూ ఉన్నాయన్నది మాధవరావే అంగీకరించిన విషయం. పాలనా సంబంధ విషయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఆసక్తి కలిగించే పుస్తకం. అనువాదం మరికొంత సరళంగా ఉండొచ్చు. (భూమి బుక్ ట్రస్ట్ ప్రచురణ, పేజీలు 289, వెల రూ. 300. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఆన్లైన్ లోనూ లభ్యం). 

ఆదివారం, ఏప్రిల్ 09, 2023

నీలంపురాశి

మహాత్మా గాంధీ చేసిన మొదటి సత్యాగ్రహం 'చంపారన్' నీలి రైతులకి మద్దతుగా 1917 లో జరిగింది. అహింసాయుతంగా జరిగిన ఆ సత్యాగ్రహం సహాయనిరాకరణ తదితర అహింస ఉద్యమాలకి నాంది పలికింది. అయితే, చంపారన్ కి అరవయ్యేళ్ళ ముందే బెంగాల్ లో నీలి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారనీ, 1857 నాటి సిపాయిల తిరుగుబాటుకి దోహదం చేసిన అంశాల్లో బెంగాల్ నీలి సమస్యకూడా ఒకటని చరిత్రని క్షుణ్ణంగా చదివిన వారికి తప్ప మిగిలిన వారికి తెలిసే అవకాశం లేదు. బెంగాల్ నీలి రైతుల తిరుగుబాటు తర్వాత, ప్రత్యామ్నాయం ఆలోచించిన బ్రిటిష్ ఇండిగో ప్లాంటర్ల దృష్టి ఆంధ్ర ప్రదేశ్ లో మచిలీపట్టణం రేవుపట్టణ పరిసర గ్రామాల మీద పడిందనీ, మచిలీపట్నం-నిజాంపట్నం పోర్టుల మధ్య గ్రామాల రైతులు నీలిని పండించి రాణీకాసులు సంపాదించుకున్నారన్నది చరిత్రలో మరుగున పడిపోయిన సంగతి. దేశ రాజకీయాలని, ఆంధ్ర రైతాంగపు చరిత్రని మలుపుతిప్పిన నీలి పంట ఇతివృత్తంగా చంద్రలత రాసిన బృహన్నవల 'నీలంపురాశి'. 

చంద్రలత పేరు చెప్పగానే తానా నవలల పోటీలో బహుమతి గెలుచుకున్న 'రేగడి విత్తులు' నవల మొదట గుర్తుకురావడం సహజం. నాకుమాత్రం నీటిపారుదల ప్రాజెక్టులు ఇతివృతంగా ఆమె రాసిన 'దృశ్యాదృశ్యం' నవలంటే ప్రత్యేకమైన ఇష్టం. ఒక డ్రై సబ్జెక్టుకి ఫ్యామిలీ డ్రామాని జతచేసి, ఆద్యంతమూ ఆసక్తిగా చదివించడమే కాక, చిన్న పాత్రలని కూడా ప్రధాన కథలో భాగం చేసిన నవలది. 'దృశ్యాదృశ్యం' తర్వాత ఆ రచయిత్రి నుంచి వస్తున్న పెద్దనవల కావడం, పైగా చరిత్ర నేపథ్యంతో రాసిన నవల కావడం వల్ల చాలా కుతూహలంతో చదవడం మొదలుపెట్టాను. చదువుతున్నంత సేపూ, నవల పూర్తి చేసి పక్కన పెట్టాక కూడా నాకు అనిపించింది ఒక్కటే "చంద్రలత ఓ పరిశోధన రాక్షసి". మొత్తం 538 పేజీల ఈ నవల కోసం ఆమె చేసిన పరిశోధన సినాప్సిస్ నిడివి నవలకి మరో నాలుగు రెట్లు ఉంటుందనిపించింది. 

బెంగాల్ నీలి ఉద్యమం మొదలు, భారత దేశానికి వలస వచ్చిన ఆంగ్లో-ఇండియన్ల జీవిత శైలి, స్థానికులతో వాళ్ళ సంబంధాలు, నాటి స్థానిక వ్యవసాయ పద్ధతులు, ఉమ్మడి కుటుంబ జీవన విధానం, తీరప్రాంతపు మోతుబరి రైతులు వ్యాపారులుగా పరిణమించిన వైనం, వంశపారంపర్యంగా చేసే అద్దకం వృత్తి, ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాణి పాలనా పగ్గాలు అందుకున్న తరుణంలో కొత్తగా తయారైన సివిల్ సర్వెంట్ల ఆలోచనలు, పని తీరు, నాటి బెంగాల్ విద్యావంతుల్లో బ్రిటిష్ వారి పట్ల పెరిగిన ఆరాధన, కాలక్రమంలో ఆ అభిమానం అనుమానంగా మారిన వైనం, ఇందుకు దోహదం చేసిన పరిస్థితులు... ఇలా ఒకటని కాదు. సమాచార సేకరణ ఒక ఎత్తైతే, కథా క్రమాన్ని అనుసరించి, చారిత్రక క్రమానికి తగ్గట్టుగా కథా కాలాన్ని నిర్మించుకుని, సేకరించిన సమాచారాన్ని కథలో పొదగడం మరో ఎత్తు. నీలిపంట, నీలిమందు, నీలికళ్ళ మనుషులు (ఆంగ్లో-ఇండియన్స్), కథనిండా కనిపించేవి ఇవే. 

బెంగాల్ కి చెందిన విద్యావంతుడు శిశిర్ కుమార్ మిత్ర (శిశిరుడు), మచిలీపట్టణం రేవుకి దగ్గరగా ఇండిగో ఎస్టేట్ నడిపే ఆంగ్ల కుటుంబం రాబిన్సన్స్, స్థానిక రైతు సాంబశివుడి కుటుంబం అనే మూడు కథల ముప్పేటగా సాగుతుంది 'నీలంపురాశి'. శిశిరుడు బెంగాల్ నుంచి తలదాచుకోడం కోసం మచిలీపట్నం రావడంతో మొదలయ్యే కథ అనేక మలుపులు తిరుగుతూ సాగర తీరంలో జరిగే ఒక అనూహ్య సంఘటన అనంతర పరిణామాలతో ముగుస్తుంది. బెంగాల్ నీలి ఉద్యమంతో పాటు, ఆంధ్ర రైతుల జీవితాల్లో నీలిపంట తెచ్చిన మార్పులు, కంపెనీ నుంచి రాణి కి పాలన మారిన సందర్భంలో జరిగిన చారిత్రక సంఘటనలు, వాటి ఫలితంగా స్థానికులు పొందినవి, కోల్పోయినవి, వీటన్నింటినీ చర్చిస్తూ సాగుతుంది ఈ నవల. బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలు, కథ ముందుకు సాగే కొద్దీ చిక్కపడే కథనం ఈనవల ప్రత్యేకతలుగా చెప్పాలి. 

బెంగాల్ నుంచి శిశిరుడు మచిలీపట్టణం ఎందుకు వచ్చాడు, తమ బెంగాల్ సహచరులు కోల్పోయిన నీలి వ్యాపారాన్ని రాబిన్సన్స్ కుటుంబం ఎలా అందిపుచ్చుకుంది, నీలి పంట ఫలితంగా సాంబశివుడిలోనూ, అతని కుటుంబంలోనూ వచ్చిన మార్పులేవిటన్నది స్థూలంగా చెబుతూనే, సూక్ష్మ స్థాయిలో స్థానిక అద్దకం పరిశ్రమ, వంశపారంపర్యంగా వాళ్ళు దాచుకంటూ వస్తున్న 'నీలి' రహస్యాలు, పొంగళ్ళు పెట్టడం లాంటి ఆచారాలు, గోవాడ ప్రభల తిరనాళ్ళు, వలస వచ్చాక మరింత బ్రిటిష్ గా మారిపోయే ఆంగ్లేయుల కుటుంబ జీవనం, స్థానిక జమీందారీలు, మిషనరీలు, చర్చిలు, స్కూళ్ళు, స్థానికుల దృష్టిలో దొరలూ, బ్రిటిష్ వారికి పంక్తి బాహ్యులూ అయిన యురేషియన్లు (భారతీయ తల్లికి, ఆంగ్లేయ తండ్రికి పుట్టిన సంతానం) లాంటి అనేక సూక్ష్మ విషయాలని సందర్భోచితంగా ప్రస్తావించారు రచయిత్రి. 

శిశిరుడు మచిలీపట్నం రావడంతో కథ మొదలు పెట్టడం, అతని నేపధ్యాన్ని, ప్రయాణపు అనుభవాలని తాపీగా చెబుతూ పోవడం వల్ల తొలి వంద పేజీల్లో కథనం బహు నింపాదిగా సాగిన భావన కలిగింది. వందపేజీల తర్వాతే కథలో నీలి పంట ప్రవేశించింది. అక్కడినుంచీ కథనం వేగం పుంజుకుంది. నవలని శిశిరుడి కథతో కాక, రాబిన్సన్స్ కథతో మొదలు పెట్టి ఉంటే ఈ 'నింపాది' సమస్య ఉండేది కాదు. మరికొన్ని కారణాలకి కూడా రాబిన్సన్స్ తో కథని మొదలు పెట్టడమే సమంజసం. మరి రచయిత్రి కథని ఈ ఆర్డర్ లో ఎందుకు చెప్పారో. రాబిన్సన్స్ వారసుడు, స్థానిక రైతాంగం 'హరయ్య బాబు' అని పిలుచుకునే హ్యారీ పాత్ర మీద రచయిత్రికి కలిగిన ప్రత్యేకమైన అభిమానం మరో సమస్య. అతని స్నేహితుడు, ఆపై కుటుంబ సభ్యుడు అయిన ఐసీఎస్ అధికారి ఆష్లీ కన్నా హ్యారీని ఓ మెట్టు పైన చూపించడానికి రచయిత్రి ప్రత్యేకంగా కష్టపడ్డారనిపించింది. ఐసీఎస్ శిక్షణలో ప్రథముడిగా నిలిచిన ఆష్లీకి స్థానికులు తనకి నమస్కరించినప్పుడు  ఎలా ప్రతిస్పందించాలో హ్యారీ నేర్పించడం ఇందుకు పరాకాష్ట. ఈ ఆష్లీ లో అక్కడక్కడా 'దృశ్యాదృశ్యం' కేశవ ఛాయలు కనిపించాయి. 

మమ్మారోజీ, లూయిసా, పార్వతి లాంటి బలమైన స్త్రీపాత్రల్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. గ్రేట్ గ్రానీని, సారా విత్ హెచ్ నీ కూడా పాఠకులు ఓ పట్టాన మర్చిపోలేరు. పోస్ట్ మాస్టర్ లక్ష్మీనారాయణ, వ్యాపారి సత్యనారాయణ పేర్ల మధ్య రచయిత్రి చాలాసార్లు తికమక పడ్డారు. లక్ష్మీనారాయణ గురించి చెబుతూ అతన్ని సత్యనారాయణ అని ప్రస్తావించడం చాలాసార్లు జరిగింది. 'బృందావనం' వారి మేనల్లుడు కనుక పోస్ట్ మేష్టారు పాత్రకి ఆ పేరు సబబే. వ్యాపారి పేరు మార్చుకుని ఉంటే ఈ ఇబ్బంది ఉండకపోయేదేమో. మిగిలిన ఏ పాత్రల విషయంలోనూ ఈ సమస్య లేదు కానీ అచ్చుతప్పులు మాత్రం చాలానే కనిపించాయి. ప్రూఫ్ ని మరింత శ్రద్ధగా దిద్దడం అవసరం. తొలి వంద పేజీలు కొంచం ఓపిగ్గా చదివితే, ఆ తర్వాత ఆపకుండా చదివించే కథనం. కథాకాలం నాటి ఆంగ్ల సాహిత్యాన్ని, రచయితల్ని, పాత్రల్ని నవలలో సందర్భోచితంగా ప్రస్తావించడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చివర్లో ఇచ్చిన 'ఆధార పట్టిక & పదసూచిక' పాఠకులకి అత్యంత సహాయకారి. 

నీలిపంటకి, నీలిమందుకి సంబంధించి దాదాపు అన్ని విషయాలనీ కథలో భాగం చేసినా, 'నీలివార్త' గురించి ప్రస్తావించలేదు ఎందుకో మరి. ఇప్పుడు 'రూమర్/గాసిప్' అని పేరుబడిన నీలివార్తల్ని ఒకప్పుడు పనికట్టుకుని ప్రచారంలోకి తెచ్చేవారట. నీలిమందు ఉడకనప్పుడు ఇలాంటి వార్తల్ని ప్రచారంలోకి తెస్తే అప్పుడు బాగా ఉడుకుతుందని ఓ నమ్మకం ఉండేదని, అలా పుట్టినవే నీలివార్తలనీ గోదావరి జిల్లాల్లో జనబాహుళ్యం చెప్పుకునే మాట (మిగిలిన ప్రాంతాల సంగతి తెలియదు, రచయిత్రి పరిశోధన చేసిన ప్రాంతాల్లో ఈ 'నీలివార్త' వెనుక కథ ప్రచారంలో లేదేమో). చారిత్రక సంఘటనలకి కల్పిత పాత్రలని జోడించి రాసిన ఈ నవల తాను తలపెట్టిన 'విక్టోరియన్ నవలా త్రయం' లో మొదటిదని చెప్పారు రచయిత్రి, 'నీలంపురాశి' కి చివర్లో రాసిన 'కథనానికి ముందు, తర్వాత' వ్యాసం చివర్లో. రాబోయే రెండు నవలల కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. (ప్రభవ పబ్లికేషన్స్ ప్రచురణ, వెల రూ. 495, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఆన్లైన్ లోనూ లభిస్తోంది). 

మంగళవారం, మార్చి 28, 2023

బలగం

అతను మొదట 'వేణు వండర్స్' గా పరిచయం. ధారాళమైన బూతులకి మరికొన్ని అవలక్షణాలు గుదిగుచ్చి 'జబర్దస్త్' అని పేరిచ్చిన ఒకానొక టీవీ షోలో ఒకానొక టీం లీడర్ అప్పుడతను. ఆ మొత్తం షో ని భరించాల్సిన అవసరం లేకుండా, ఉన్నంతలో శుభ్రంగానూ, ఏదో ఒక ప్రత్యేకతతోనూ స్కిట్లు చేసే టీం లీడర్లని ఎంచుకుని, టీవీ కి బదులుగా యూట్యూబులో చూసే అవకాశం వచ్చినప్పుడు నేను షార్ట్ లిస్ట్ చేసుకున్న కొద్దిమంది టీం లీడర్లలో అతనూ ఒకడు. అప్పటికే వేణు సినిమాల్లో చిన్న వేషాలు వేసి ఉన్నాడని నెమ్మదిగా తెలిసింది. కాలక్రమంలో అతను ఇతర చానళ్లకు మళ్ళినా, యూట్యూబ్ లో దొరికిన కంటెంట్ ని చూస్తూనే ఉన్నాను. హాస్యంతో పాటుగా జానపద కళల మీద వేణుకి ఉన్న మక్కువ, అతని స్కిట్లు ప్రత్యేకంగా అనిపించడానికి, గుర్తుండడానికీ కారణమని అర్ధమవ్వడానికి చాలారోజులు పట్టింది. 

ఆలోగా అతను బుర్రకథ మొదలు, ఒగ్గు కథ వరకూ ఎన్నింటినో తన స్కిట్లలో వాడుకున్నాడు, ఆయా కళల్ని ఏమాత్రం కించ పరచకుండా, వాటిని మరింతగా గౌరవిస్తూ... "వేణు సినిమా తీస్తున్నాడు" అని విన్నప్పుడు కచ్చితంగా కామెడీ సినిమానే అయి ఉంటుంది అనుకున్నాను. ఆ సినిమా, 'బలగం', విడుదలై మంచి పేరు తెచ్చుకుందని తెలిసి సంతోషం కలిగింది. మొదట తక్కువ థియేటర్లలో విడుదల చేసినట్టున్నారు, దగ్గర థియేటర్లలో కనిపించలేదు. కేవలం సినిమాకి పెరిగిన ఆదరణ వల్ల థియేటర్లు పెంచారు. ముందుగా చేసుకున్న ఒప్పందం వల్ల అమెజాన్ ప్రైమ్ లోనూ విడుదల చేసేశారు. ఓపక్క ఉచితంగా ఓటీటీలో దొరుకుతున్నా, జనం టిక్కెట్లు కొనుక్కుని హాళ్ళకి వెళ్తూ ఉండడం బహుశా ఈ సినిమాకి మాత్రమే దొరికిన గౌరవం. 

ప్రియదర్శి మినహా పేరున్న నటీనటులెవరూ లేరు. జబర్దస్త్ లో వేణుతో పాటు కనిపించిన కొందరు కమెడియన్లతో మాత్రం జనానికి ముఖ పరిచయం. కథా స్థలం తెలంగాణ పల్లె. కథేమో ఆ పల్లెలో జరిగే ఒక చావు. చాలా మామూలుగా మొదలై, చిన్నగా నవ్విస్తూ సాగే కథనం మనకి తెలియకుండానే సీరియస్ గా మారుతుంది. సినిమా చూస్తున్న మనం ప్రేక్షకులం అనే విషయం మర్చిపోయి, ఆ ఊళ్ళో మనుషులం అయిపోతాం. ఇంటి పెద్దని పోగొట్టుకున్న ఆ కుటుంబానికి ఊహించని సమస్య రావడంతో, దాన్నుంచి వాళ్ళు ఎలా బయట పడతారా అని కుతూహల పడతాం. మెడమీద వేలాడే 'పదిలక్షల అప్పు' అనే కత్తి బారి నుంచి కథానాయకుడు (?) ఎలా తప్పించుకుంటాడో అని ఆందోళన పడతాం. చివరికొచ్చేసరికి తెరమీద కనిపించే మిగిలిన పాత్రలతో పాటు మనం కూడా 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకుంటాం. 

ఆ పల్లెటూళ్ళో సాయిలు (ప్రియదర్శి) ఓ రైతు కొడుకు. పాతికేళ్ళు ఉంటాయి. చదువుకున్నాడు కనుక వ్యవసాయం మీద ఆసక్తి లేదు. వ్యాపారం చేయాలని కోరిక. తండ్రిది బొత్తిగా సహాయనిరాకరణ. అప్పులు చేసి మొదలు పెట్టిన వ్యాపారాలేవీ ఆ పల్లెటూళ్ళో క్లిక్కవ్వలేదు. అప్పు మాత్రం, వడ్డీలతో కలిపి పది లక్షలయ్యింది. పదిహేను లక్షల కట్నంతో పెళ్లి కుదరడం సాయిలుకి పెద్ద ఊరట. రెండు రోజుల్లో వరపూజ (ఎంగేజ్మెంట్) అనగా సాయిలు తాత కొమరయ్య హఠాత్తుగా కన్నుమూస్తాడు. ఇక, చావు చుట్టూ జరిగే రాజకీయాలు మొదలు. ముసలాయన పోయినందుకు సాయిలుతో సహా మనస్ఫూర్తిగా బాధపడేవాళ్లు ఎవరూ లేరు, సాయిలు మేనత్త లక్ష్మి పరుగున వచ్చే వరకూ. ఇరవై ఏళ్ళ తర్వాత పుట్టింట్లో అడుగు పెట్టింది ఆమె. అది కూడా, తండ్రి కడసారి చూపు కోసం. 

పెళ్ళైన తర్వాత వచ్చిన తొలి దసరా పండుగకి పుట్టింట్లో లక్ష్మి భర్త నారాయణకి, లక్ష్మి సోదరుల (సాయిలు తండ్రి, చిన్నాన్న) చేతిలో జరిగిన అవమానం ఫలితంగా ఇరవయ్యేళ్లు ఆమె పుట్టింటి గడప తొక్కలేదు. పుట్టెడు దుఃఖంతో వచ్చిన ఆమెని మనస్ఫూర్తిగా అక్కున చేర్చుకున్నది సాయిలు తల్లి మాత్రమే. నాటి అవమానాన్ని నారాయణ ఇంకా మర్చిపోలేదు. బావమరుదులూ మర్చిపోలేదు. వాళ్ళు అతన్ని కనీసం పలకరించలేదు. లక్ష్మి కూతురు సంధ్య (కావ్య కళ్యాణ్ రామ్) కి ఇదంతా కొత్త. తాతగారింటికి తొలిసారి వచ్చిందామె. అది కూడా ఇలాంటి సందర్భంలో. ఇంజినీరింగ్ చదువుకుంటోన్న ఆ అమ్మాయి జరుగుతున్న వాటిని మౌనంగా గమనిస్తూ ఉంటుంది, తప్పొప్పుల తీర్పుల జోలికి పోకుండా. 

చిన్న దినంలో కొమరయ్యకి పెట్టిన భోజనాన్ని కాకి ముట్టకపోవడంతో కథ పాకాన పడుతుంది. కాకి వస్తుంది, కొమ్మ మీద కూర్చుంటుంది తప్ప విస్తరిని కన్నెత్తి చూడదు. కొమరయ్య తీరని కోరిక ఏమిటన్నది ఎవరికీ తెలీదు. అది పల్లెటూరు కావడంతో జరుగుతున్న వాటిని ఊరు బాగానే పట్టించుకుంటూ ఉంటుంది. పదకొండో రోజున జరిగే పెద్ద దినం నాడు కూడా కాకి ముట్టకపోతే అది ఊరికి అరిష్టం. అదే కనుక జరిగితే పంచాయితీ వేసే శిక్షని ఆ కుటుంబం భరించాలి. సినిమా మొదట్లో ఏ ప్రాముఖ్యతా లేని కొమరయ్య, పోయాక కథలో ముఖ్యపాత్ర అయిపోతాడు. పోయినప్పుడు కూడా పెద్దగా మాట్లాడుకోని వాళ్ళు ప్రతి క్షణం అతన్ని తల్చుకుంటూ ఉంటారు. సాయిలు అప్పు గొడవ, బావ-బావమరుదులు ఇగో క్లాషెస్, ఇవి చాలవన్నట్టు అన్నదమ్ముల (సాయిలు తండ్రి, చిన్నాన్న) మధ్య ఆస్తి తగాదాలు. 

చాలా సీరియస్ గా వినిపించే ఈ కథని వ్యంగ్యాత్మకంగా తీశాడు వేణు. తెరమీద సీరియస్ సన్నివేశాలు నడుస్తున్నా చూస్తున్న ప్రేక్షకులకి చాలాచోట్ల నవ్వొస్తుంది, అక్కడక్కడా ఏడుపొస్తుంది. సాయిలు హీరో కాబట్టి, కుటుంబ సభ్యులందరికీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేసి, అందరినీ కలిపేసి, అవసరమైతే కాకికి కూడా పంచ్ డైలాగులతో బ్రెయిన్ వాష్ చేసేసి ముద్ద తినిపించేస్తాడేమో అని భయపడ్డాను. కానైతే, అవేవీ జరగలేదు. ఏం చేస్తే తాత ఆత్మ శాంతిస్తుందో తన వాళ్ళకి సింబాలిక్ గా చెప్పాడు. అందులో కూడా తన డబ్బు సమస్య నుంచి బయట పడే దారిని వెతుక్కున్నాడు. ఈ కథకి కీలకం లక్ష్మి పాత్ర. ఎంతో అనుభవం ఉన్న నటి వేయాల్సిన బరువైన పాత్ర. రూపాలక్ష్మి అనే ఆవిడ చాలా అలవోకగా పోషించింది. ఆ మాటకొస్తే అన్ని పాత్రలూ అంతే. పేరున్న నటులు కాకపోవడం వల్ల, పాత్రలు మాత్రమే కనిపించాయి. 

తేలికపాటి సన్నివేశాలతో కూడిన బరువైన సినిమా 'బలగం'. వేణు తన అభిరుచికి తగ్గట్టుగా ఒగ్గుకథ మొదలు అనేక తెలంగాణ కళా రూపాలని కథలో భాగం చేశాడు. క్లైమాక్స్ లో వచ్చే పాట థియేటర్లలో ఒక సామూహిక దుఃఖ ప్రకటనగా మారుతోంది. అలా తేలిక పడడంకోసమే జనం ప్రత్యేకంగా సినిమా హాళ్ళకి వెళ్ళి చూస్తున్నారేమో అనిపించింది. చావింటిలో టీల పంపిణీ మొదలు ప్రతి చిన్న విషయాన్నీ జాగ్రత్తగా కథలో భాగం చేసుకున్నాడు దర్శకుడు. రెండు గంటల సినిమాలో ఎక్కడో అక్కడ ఏదో ఒక పాత్రలో తమని తాము చూసుకోని ప్రేక్షకులు ఉండరేమో. సంగీతం, కెమెరా, ఎడిటింగ్.. ఇలా సాంకేతిక విభాగాలన్నీ వంక పెట్టడానికి వీల్లేని విధంగా పనిచేశాయి. తెలిసిన కథలా అనిపిస్తూనే, తర్వాత ఏమిటన్న కుతూహలాన్ని ఆసాంతమూ కొనసాగించింది. నేల విడిచి సామన్నది ఎక్కడా కనిపించలేదు. బహుశా, 'బలగం' విజయ రహస్యం అదేనేమో.

బుధవారం, మార్చి 22, 2023

రంగమార్తాండ

నాటకరంగం వేరు.. జీవిత రంగం వేరు..
ఏ వేషం వేస్తున్నావో  తెలిసే చోటు అది..
ఏ నిమిషం ఏం చెయ్యాలో తెలియని ఆట ఇది... 

మన దగ్గర సినిమా నటీనటులకి ఉన్నంత క్రేజ్ నాటకాల్లో నటించే వాళ్ళ విషయంలో లేక పోవడం వల్ల నాకో మేలు జరిగింది. నాటక ప్రదర్శన అయ్యాక ఆయా నటీనటులతో నేరుగా మాట్లాడే అవకాశం చాలాసార్లు దొరికింది. కొందరితో స్నేహమూ కుదిరింది. ఈ క్రమంలో నాటకానికన్నా ముందు గ్రీన్ రూమ్ కి వెళ్లి కబుర్లు చెప్పడం తెలియకుండానే అలవాటయ్యింది. వేషం వేసుకున్నప్పుడూ, పూర్తి చేశాక కూడా వాళ్ళు మామూలు మనుషులే. కానీ, ఒక్కసారి స్టేజీ ఎక్కగానే పోషించే పాత్రలుగా మారిపోతారు. నాటకం ముగిసి, వేషం తుడుచుకోడానికి మళ్ళీ గ్రీన్ రూమ్ లోకి వస్తూనే మామూలు మనుషులైపోతారు. ఈ భేదం మొదట్లో చాలా ఆశ్చర్య పరిచేది. రానురానూ అలవాటైపోయింది. 

ఈ భేదాన్ని బహు చక్కగా పట్టుకున్నారు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం. ఈ సూక్ష్మాన్ని అంతే చక్కగా తెరకెక్కించాడు కృష్ణవంశీ. 'రంగమార్తాండ' సినిమా చూస్తున్నంత సేపూ, చూడడం పూర్తయ్యాక కూడా నాకు తెలిసిన థియేటర్ ఆర్టిస్టులందరూ గుర్తొస్తూనే ఉన్నారు. 'రంగస్థల రంగమార్తాండ' రాఘవరావు పాత్రలో ప్రకాష్ రాజ్ జీవిస్తే, 'నాకు అంతకన్నా ఒక మార్కన్నా ఎక్కువ ఇవ్వాల్సిందే' అన్నంతగా మరో నటుడు చక్రపాణి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు బ్రహ్మానందం. రాఘవరావు భార్య రాజుగారు గా రమ్యకృష్ణ మూడో స్థంభం అయితే, మిగిలిన నటీనటులు, సాంకేతిక బృందమంతా కలిసి నాలుగో స్థంభం. దర్శకుడితో పాటు సంభాషణల రచయిత (ఆకెళ్ళ శివప్రసాద్), సంగీత దర్శకుడు (ఇళయరాజా), గీత రచయితలు (సిరివెన్నెల తదితరులు) కెమెరా (రాజ్ కె నల్లి), ఎడిటింగ్ (పవన్)  విభాగాలకీ క్రెడిట్ ఇవ్వాలి. 

ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ని వాడుకుని తీసిన ఈ సినిమాలో అసలు కథ రాఘవరావు రిటైర్మెంట్ తో ప్రారంభమవుతుంది. అతడు స్టేజిమీద నటించిన సీన్ ఒక్కటన్నా చూపించలేదన్న కొరతని బ్రహ్మానందం హాస్పిటల్ సీన్ కొంతవరకూ తీర్చింది. నిజానికి ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం.. వీళ్ళు ముగ్గురూ కూడా మంచి పాత్ర దొరికితే ఒళ్ళు మర్చిపోయి నటించేస్తారు. దర్శకుడు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, వీళ్ళ నటన పాత్ర పరిధిని దాటేస్తుంది. అలా దాటకుండా కృష్ణవంశీ కాసుకున్నాడు. (వీళ్ళ ముగ్గురి ముందూ శివాత్మిక నటన లౌడ్ గా అనిపించిందంటే చాలదూ, వీళ్ళు ఎంత సటిల్డ్ గా చేశారో చెప్పడానికి). గత  కొన్నేళ్లుగా కృష్ణవంశీకి తన సినిమాల్లో సందేశాలు ఇమడ్చాలన్న తపన బాగా పెరిగింది. భాష గురించి, సంస్కృతి గురించి సందేశాలని ఈ సినిమాలోనూ చేర్చాడు. వాటి నిడివి పెరిగి ప్రేక్షకులకి విసుగు రాకుండా, క్రిస్ప్ గా కట్ చేయడం ద్వారా ఎడిటింగ్ టీం కృష్ణవంశీని కాసుకుంది. 

రంగస్థల నటుల వ్యక్తిగత జీవితం అనే పాయింట్ తీసేస్తే, ఈ కథ ఏ మధ్య తరగతి ఇంట్లో అయినా జరగడానికి వీలున్నదే. కానైతే, ఈ కథలా జరగదు. అందుకు కీలకం రంగస్థల నటుల వ్యక్తిగత జీవన శైలి. ఎక్కువమందిలో కనిపించేవి భోళాతనం, మనుషుల్ని తేలిగ్గా నమ్మేసే గుణం, తమ మీద తమకి విపరీతమైన ఆత్మవిశ్వాసం, తమ జడ్జిమెంట్ తప్పక నిజమవుతుందనే నమ్మకం... రాఘవరావు కి ఉన్న ఈ లక్షణాల వల్లే అతని జీవితం ఇల్లు దాటి రోడ్డున పడింది. మొదటినుంచీ హెచ్చరిస్తూ వచ్చిన భార్య మాత్రం అతడి వెనుక గట్టిగా నిలబడింది, అతన్ని నిలబెట్టేందుకు తన శక్తినంతటినీ పోగుచేసుకుంది. సినిమా చూసే ప్రేక్షకులు రాఘవరావుని ఎలా అర్ధం చేసుకుంటారో, సినిమా వాళ్ళకి అలా అర్ధమవుతుంది. ఇందుకోసం నాటకాలతో పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. రంగస్థల రంగమార్తాండుడితో సహానుభూతి చెందగలిగితే చాలు. 


మహానటుడు ఎస్వీ రంగారావు ఆశీస్సులతో రంగస్థల నటుడిగా జీవితం మొదలు పెట్టిన రాఘవరావు, తన కొడుక్కి (ఆదర్శ్ బాలకృష్ణ) ఆ నటుడి పేరే పెట్టుకున్నాడు. కానీ అతన్ని ఎస్వీఆర్లా పెంచలేకపోయాడు. ఫలితం, భార్య (అనసూయ భరద్వాజ్) చాటు భర్తగా మిగిలిపోయాడు రంగారావు. రాఘవరావు కూతురు శ్రీ (శివాత్మిక) మాత్రం తండ్రి కళా వారసత్వాన్ని కొనసాగిస్తూ ఫ్యూషన్ మ్యూజిక్ లో భవిష్యత్తుని వెతుక్కోవడం మొదలుపెట్టింది. సహ గాయకుడు రాహుల్ (రాహుల్ సిప్లిగంజ్) ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తనకి స్వర్ణకంకణం ప్రదానం చేసిన సన్మాన  సభలోనే నటుడిగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు రాఘవరావు, చూసుకోడానికి పిల్లలు ఉన్నారన్న నమ్మకంతో. ఆ రాత్రే తన ఆస్తిపాస్తుల్ని పిల్లలకి పంచేశాడు, భార్యకి మాటమాత్రమైనా చెప్పకుండా. ఆ తర్వాత, అసలు కథ మొదలైంది. 

ఇక, చక్రపాణి (బ్రహ్మానందం)ది ఓ శాపగ్రస్త జీవితం. (అందుకే సింబాలిక్ గా కర్ణ పాత్ర వేయించాడేమో కృష్ణవంశీ). రంగస్థలం మీద రాఘవరావుని మించిన నటుడే అయినా (ఈ మాట రాఘవరావే ఒప్పుకుంటాడు), తగినంత పేరు రాక వెనుక వరసలో నిలబడిపోయాడు. వ్యక్తిగత జీవితంలో ఉన్న లోటు సరేసరి. చక్రపాణిగా బ్రహ్మానందాన్ని చూశాక 'ఇంతటి నటుడిని ఇన్నాళ్లూ కామెడీకి మాత్రమే పరిమితం చేశారే' అనిపించింది. కామెడీ తక్కువ అని కాదు, ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేసి ఉండేవాడు కదా అని. నిజం చెప్పాలంటే తెరమీద చక్రపాణి మాత్రమే కనిపించాడు, నవ్వించినప్పుడు కూడా. చక్రపాణి భార్య సుబ్బుగా జయలలిత కనిపించింది. ఆమెకి నటించే అవకాశం దొరకలేదు. 

రమ్యకృష్ణ కి తన ట్రేడ్ మార్క్ అరుపులు లేని పాత్ర. లోపల అగ్నిపర్వతాలు బద్ధలవుతున్నా, చాలా మామూలుగా కనిపించేందుకు ప్రయత్నించే ఇల్లాలిగా ఆమె బదులు మరొకరిని ఊహించలేం. "కళ్ళతోనే నటించింది" అని ఇంటర్యూలలో కృష్ణవంశీ చెబితే ఏమో అనుకున్నా కానీ, నిజమే. రాఘవరావుని పూర్తిగా అర్ధం చేసుకున్న 'రాజుగారు' ఆమె. వీళ్ళ ముగ్గురూ తెరమీద కనిపిస్తుంటే, వీళ్ళతో పాటు కనిపిస్తూ మెప్పించడం ఎవరికైనా కష్టమే. అనసూయ, శివాత్మిక, రాహుల్, ఆదర్శ్ లు కేవలం సెట్ ప్రాపర్టీలుగా మిగిలిపోకుండా తాము చేయగలిగింది చక్కగా చేశారు. తెలుగు రంగస్థల చరిత్రని సందర్భోచితంగా ప్రస్తావిస్తూ రాసిన డైలాగులు ఈ సినిమాకి అదనపు బలం. అలాగే, రంగస్థల నటుల జీవితాలు ఎలా ఉంటాయన్నదీ ప్రస్తావించారు. 

ఓ సందర్భంలో రాఘవరావు "కోట్లు సంపాదించాను, తగలేశాను" అంటాడు. ఇది అర్ధసత్యం. తెలుగునాట రంగస్థలం అంత పే చెయ్యదు. మొత్తం సంపాదన లక్షల వరకూ వెళ్లే వాళ్లే తక్కువ. అయితే, తగలేయడం మాత్రం నూటికి తొంభై మంది నటుల విషయంలో నిజం. చప్పట్లు ఇచ్చే మత్తు, ఫలితంగా మారే జీవన శైలి, ఇన్ఫీరియారిటీ - సుపీరియారిటీ కాంప్లెక్సుల మిశ్రమంగా మారే వ్యక్తిత్వం, వీటినుంచి పుట్టే నిర్లక్ష్యం.. వీటన్నంటివల్లా కావొచ్చు థియేటర్ నుంచి సంపాదించింది నిలబెట్టుకున్న వాళ్ళు బహు తక్కువ. సినిమా రంగంలోనూ ఈ సమస్య ఉన్నా, అక్కడ సంపాదన ఎక్కువ, జాగ్రత్త పరుల సంఖ్యా ఎక్కువే. ఇళయరాజా స్వయంగా పాడిన నేపధ్య గీతంతో సహా పాటలన్నీ బాగున్నాయి. 'దమిడి సేమంతి' పాట చూస్తుంటే 'సాగర సంగమం' లో 'తకిట తధిమి' గుర్తొచ్చింది అప్రయత్నంగా. 

టైటిల్స్ రన్నయ్యేప్పుడు చిరంజీవి గొంతులో 'నేనొక నటుణ్ణి' కవిత వినిపిస్తూ తెలుగు సినిమా నటుల ఫోటోలు చూపించారు. నాటకం గురించిన సినిమాలో సినిమా నటుల్ని చూపించడం ఏమిటన్నది ఒక ప్రశ్నయితే, ఎన్టీఆర్, ఏఎన్నార్లతో మొదలుపెట్టడం మరోప్రశ్న. వాళ్లకన్నా ముందు వాళ్ళయిన నారాయణ రావు, నాగయ్య లాంటి నటుల్ని ప్రస్తావించక పోవడం కృష్ణవంశీ చేయదగ్గ పని కాదు. వాళ్ళ ఫోటోలు దొరకనివీ కాదు. నటుల్ని గురించి చక్కని సినిమా తీసిన దర్శకుడికి, ఎన్టీఆర్, ఏఎన్నార్లకి ముందు కూడా తెలుగు సినిమా చరిత్ర ఉందని గుర్తు చేయాల్సి రావడం బాధాకరం. సినిమా చూసిన ప్రేక్షకుడిగా రాఘవరావుని అర్ధం చేసుకోగలిగాను కానీ, చక్రపాణిని  అర్ధం చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉందనిపిస్తోంది. చాన్నాళ్ల తర్వాత మంచి సినిమా ఇచ్చిన కృష్ణవంశీకి అభినందనలు!! (కృష్ణవంశీ రీమేక్ చేస్తున్నాడని తెలిసి మరాఠీ 'నటసామ్రాట్' చూడలేదు ఇన్నాళ్లూ, ఇప్పుడు చూస్తే తెలుగుతో పోలిక వస్తుందేమో?) 

నీ నిలయమేది.. నర్తనశాలే కాదా.. 
నీ కొలువు ఏది.. విరాట పర్వం కాదా..
ముగిసిందా నీ అజ్ఞాతవాసం ??? 

సోమవారం, మార్చి 06, 2023

గ్లాచ్చు మీచ్యూ 

అసలు పుస్తకం పేరే భలే చమత్కారంగా ఉంది కదా అనుకుంటూ చేతిలోకి తీసుకుంటే, 'నా పర్సనల్ స్టోరీలు' అనే ఆకర్షణీయమైన ఉపశీర్షిక పుస్తకాన్ని బిల్లింగ్ కౌంటర్ వైపు నడిపించింది. పుస్తకం మీద దృష్టి పడడానికి కారణమేమో కవర్ పేజీ మీద రచయిత 'జయదేవ్' పేరు మరియు పోర్ట్రైట్. జయదేవ్ కార్టూనులు తెలుగు నాట మాత్రమే కాదు, అంతర్జాతీయంగానూ పేరు పొందాయి. తెలుగు వ్యాఖ్యల కార్టూన్లు పత్రికలు చదివే తెలుగు వాళ్ళని గిలిగింతలు పెడితే, క్యాప్షన్ లెస్ కార్టూనులు అంతర్జాతీయ పోటీల్లో ఆయనకి బహుమతులు తెచ్చిపెట్టాయి. కార్టూన్ రేఖలు మాత్రమే కాదు, జయదేవ్ వాటికి రాసే వ్యాఖ్యలూ బహు పొదుపుగా ఉంటాయి. ఒక్కోసారి రెండోసారి చదువుకుని అర్ధం చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇదిగో ఈ పర్సనల్ స్టోరీలని కూడా రెండో సారి చదవాల్సిందే - అర్ధం చేసుకోడానికి కాదు, మరింతగా ఆస్వాదించడానికి. 

మద్రాసు చాకలి వీధిలో 'రేడియో కారమ్మ' మనవడిగా బాల్యాన్ని గడిపారు జయదేవ్. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మొదట రేడియో కొనుక్కున్నది వీళ్ళే కావడంతో, ఇంటి యజమానురాలి పేరు మీద 'రేడియో కారమ్మ ఇల్లు' గా పేరు స్థిరపడి పోయింది. ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ లో పని చేసే తండ్రి గారిది బదిలీల ఉద్యోగం కావడంతో, నాయనమ్మ, చిన్నాన్నల దగ్గర ఉండి చదువుకున్నారు జయదేవ్. వీళ్ళతో పాటు మేనత్త 'అనసూయమ్మఆంటీ' .. ఈవిడ దాదాపు జయదేవ్ ఈడుదే. మధ్యతరగతి మందహాసం, పైగా మద్రాసు నగరంలో.. ఇక సరదా కబుర్లకి లోటేం ఉంటుంది? వందకి పైగా ఉన్న స్టోరీలని ఒక ఆర్డర్ లో చెప్పాలనే శషభిషలేవీ పెట్టుకోలేదు రచయిత. అలాగని కొమ్మచ్చులూ ఆడలేదు. ఒక్కో స్టోరీని రెండు మూడు పేజీలకి మించకుండా క్లుప్తంగా చెబుతూనే, ఎక్కడా చర్విత చర్వణం కాకుండా జాగ్రత్త పడ్డారు. 

చిత్రకళ మీద లోపలెక్కడో ఉన్న ఆసక్తి బడి రోజుల్లో బయట పడింది. బళ్ళో మేష్టర్ల తో పాటు ఇంట్లో సభ్యులూ ప్రోత్సహించడంతో మెరుగులు దిద్దుకునే అవకాశం దొరికింది. కెరీరిజం ఊపందుకోని పంతొమ్మిది వందల యాభైల నాటి రోజులు కదా. రేఖలు సాధన చేస్తూనే, కార్టూనులు గీసి పత్రికలకి పంపడం, అవి అచ్చయ్యి పారితోషికాలు వస్తూ ఉండడం త్వరలోనే మొదలయ్యింది. కాలేజీ చదువుకు వచ్చే నాటికి, కార్టూన్ మానియార్దర్లు ఖర్చులకి సరిపోయేవి. పేరొచ్చేసినా సాధనని ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. ప్రతినెలా కార్టూనులు మీద వచ్చిన డబ్బులో కొంతభాగం డ్రాయింగ్ పేపర్లు, రంగుల కోసం, మరికొంత భాగాన్ని అంతర్జాతీయ పత్రికలు కొనడం కోసం క్రమం తప్పకుండా వెచ్చించేవారు జయదేవ్. అదిగో, ఆ పత్రికలు చదివే అలవాటే అంతర్జాతీయ కార్టూన్ రంగంలో అడుగు పెట్టడానికి దారి చూపింది. 

చదువుకున్న కాలేజీలోనే జువాలజీ డిమాన్ స్ట్రేటర్ ఉద్యోగం రావడంతో మద్రాసు వదిలి వెళ్లాల్సిన అవసరం కనిపించలేదు. కార్టూనింగ్ నే కాదు, చదువునీ విడిచిపెట్టలేదు. పులికాట్ చేపల మీద జయదేవ్ చేసిన పరిశోధన విశేషాలు ఎంత ఆసక్తిగా చదివిస్తాయో, ఆయన స్నేహితుడు పులికాట్ జలగలు మీద చేసిన పరిశోధన విశేషాలు అంతకు మించి చదివిస్తాయి. ఎంత ఘాటు విషయాన్నైనా అలవోకగా నవ్విస్తూ చెప్పడం ఆయనకి బాగా అలవాటైపోయింది మరి. సరదా సంభాషణ, స్నేహశీలత జయదేవ్ వ్యక్తిత్వంలో ప్రత్యేకతలు అనిపిస్తుంద కాలేజీలో లెక్చరర్లకు ఇళ్ల నుంచి కేరేజీలు తెచ్చే అమ్మాయికి 'క్లియోపాత్రా' అనే ముద్దు పేరు పెట్టి, ఆమెకో ప్రేమకథ సృష్టించి కార్టూన్లు వేయడం లాంటి చమక్కులు అసలు కథలో సరదాగా కలిసిపోయే కొసరు కథలు. స్టాఫ్ రూమ్ బోర్డు మీద రోజూ కార్టూన్ స్ట్రిప్ గా గీసే ఆ ప్రేమకథ కోసం లెక్చరర్లందరూ ఎదురు చూసేవారట. 

చిత్రకారులు, కార్టూనిస్టులు అందరితోనూ స్నేహం చేసి, దాన్ని నిలబెట్టుకున్నారు జయదేవ్. చిన్నా పెద్దా భేదాలు చూడలేదు. తనకి కావాల్సిన విషయాలు నేర్చుకోడానికి, తనకి తెలిసినవి నేర్పడానికి వెనకాడలేదు. ఆ అనుభవాలని అక్షరబద్ధం చేయడంలో ఎక్కడా ఆత్మస్తుతికి, పరనిందకీ చోటివ్వలేదు. (ఈమధ్యే మరో చిత్రకారుడి పరనిందా పూరితమైన ఆత్మకథ - బాలి 'చిత్రమైన జీవితం' - చదివానేమో, ఈ పుస్తకం మరింత హాయిగా అనిపించింది. సెన్సారు బోర్డు సభ్యుడిగా పనిచేసిన నాటి విశేషాల మొదలు, బాపూ-రమణల టెలిస్కూల్ పాఠాల కబుర్ల వరకూ ఏళ్ళ నాటి ముచ్చట్లని హాయిగా చెప్పారు. కార్టూనిస్టులందరినీ ఏకతాటి మీదకి తెచ్చి సభలు నిర్వహించడం లాంటి కబుర్లు ఆసక్తిగా అనిపించాయి. మద్రాసు జీవితం, తరచూ వచ్చే అనారోగ్యాలు, వాటికి చేయించుకునే వైద్యాలు లాంటి బరువైన విషయాలని కూడా తేలిగ్గా చెప్పారు. 

ముందుమాట రాసిన మాలతీ చందూర్ (ఈ పుస్తకం తొలి ముద్రణ 2009) "వీరేశలింగం గారి 'స్వీయ చరిత్ర', గురజాడ వారి డైరీలు, శ్రీపాద వారి 'కథలు-గాధలు' ..." అంటూ జాబితా రాశారు. 'కథలు-గాధలు' రచన శ్రీపాద వారిది కాదు, చెళ్ళపిళ్ళ వారిది. ప్రకాశకులైనా సరిదిద్ది ఉంటే బాగుండేది. కాస్త తక్కువగా నాలుగొందల పేజీలున్న ఈ పుస్తకంలో ప్రతి స్టోరీకీ జయదేవ్ స్వయంగా వేసుకున్న రేఖా చిత్రం ప్రత్యేక ఆకర్షణ. ఆపకుండా చదివించే కథనం, శైలి. జయదేవ్ జీవితంతో పాటు, తెలుగునాట కార్టూన్ పరిణామ క్రమాన్ని గురించి కూడా రేఖా మాత్రపు అవగాహనని ఇచ్చే రచన ఇది. (వియన్నార్ బుక్ వరల్డ్, చౌడేపల్లి, చిత్తూరు వారి ప్రచురణ. వెల రూ. 250). 

శుక్రవారం, ఫిబ్రవరి 03, 2023

'కళాతపస్వి' విశ్వనాథ్ ...

సుమారు పదేళ్ల క్రితం అనుకోకుండా ఓ అవకాశం వచ్చింది. దర్శకుడు కె. విశ్వనాథ్ తో దాదాపు ఓ గంటసేపు తాపీగా మాట్లాడే అవకాశం వస్తుందని అంతకు ముందెప్పుడూ ఊహించలేదు. అప్పటికి 'శుభప్రదం' సినిమా విడుదలయ్యింది. అంతబాగా ఆడలేదు. అంతకు ముందు వచ్చిన 'స్వరాభిషేకం' సినిమాకి జాతీయ అవార్డు వచ్చినా జనం మెచ్చలేదు. విమర్శకుల ప్రశంసలూ దక్కలేదు. ఈ నిరాశ కొంత, వయోభారం మరికొంత కలిసి అప్పటికే దర్శకత్వానికి, నటనకి దూరం జరిగారు. అయితే ఊహించని కొత్త కెరీర్ అవకాశం ఒకటి ఆయన తలుపు తట్టింది. వాణిజ్య ప్రకటనలకి మోడలింగ్ చేయడం అప్పట్లోనే మొదలు పెట్టారు. నేనేమో 'శుభప్రదం' మీద పెద్దగా అంచనాలు పెట్టుకోకపోడానికి కారణం, 'స్వరాభిషేకం' తీవ్రంగా నిరాశ పరచడమే. పైగా, ఇప్పటికీ చక్కని మ్యూజిక్ ఆల్బమ్ అది. 

"శంకరాభరణం నాటికి మీరు నటులు కాదు కానీ, ఒకవేళ శంకర శాస్త్రి పాత్ర మీరే వేసి ఉంటే ఆ సినిమా ముగింపు మరోలా ఉండేదేమో కదా" అన్న నా ప్రశ్న కారణంగానే 'హలో' తో ఆగిపోవాల్సిన సంభాషణ చాలాసేపు సాగింది. "అంటే మీ ఉద్దేశం, స్వరాభిషేకం క్లైమాక్స్ లో అన్న పాత్రని చంపేసి ఉండాల్సిందనా?" సూటిగానూ, స్పష్టంగానూ అడిగారు విశ్వనాథ్. నేనూ నీళ్లు నమల దలచుకోలేదు. ఫోటోల కోసం తన దగ్గరికి రాబోతున్న వాళ్ళని  ఆగమని చే సైగ చేశారు. ఏయే నిజజీవిత సంఘటలని ఆధారం చేసుకుని ఆ కథ రాసుకున్నారో ఆయన చెబితే, ప్రేక్షకుడిగా నా అభ్యంతరాలని నేను చెప్పాను. ఉన్నట్టుండి, "మీకిష్టమైన నా సినిమా ఏమన్నా ఉందా?" అని అడిగారు. "చాలా ఉన్నాయండి.. మొదటిది సాగర సంగమం" చెప్పాన్నేను. 

ఈ పదేళ్లలోనూ నాటి సంభాషణని చాలాసార్లు గుర్తు చేసుకున్నాను. మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో 'ఫిలిం అప్రిసియేషన్' తక్కువ అన్నది ఆయన ఫిర్యాదు. "మీరు, బాపూ గారు, వంశీ గారు సినిమాలు తీయకపోతే కలర్ సినిమాల్లో మనకి కమర్షియల్ మాత్రమే మిగిలేవేమో " అన్నాను సిన్సియర్ గానే. "వంశీ నాదగ్గర పనిచేశారు, 'శంకరాభరణం' సినిమాకి" అన్నారు. "అవునండి, సినిమా నవల రాశారు కదా" అని, సోమయాజులు కాళ్ళకి కొబ్బరినూనె రాసి నడిపించిన సీన్ గుర్తుచేశాను. సంతోషపడ్డారు. ఒక్క 'స్వరాభిషేకం' టాపిక్ లో అసంతృప్తి తప్ప, మిగిలిన సినిమాల గురించి ఇష్టంగా మాట్లాడారు ('సీతామాలక్ష్మి' మాత్రమే మినహాయింపు). రిలీజుకి నోచుకోని 'సిరిమువ్వల సింహనాదం' గురించి, తీయకుండా ఉండాల్సింది అనిపించే 'జననీ జన్మభూమి' 'చిన్నబ్బాయి' లాంటి సినిమాల గురించీ నేను మాట్లాడినా అభ్యంతర పెట్టలేదు. "కొన్ని అలా జరుగుతూ ఉంటాయి, అంతే" అని మాత్రమే అన్నారు. 

Google Image

సంభాషణ మొదలైన కొంతసేపటికి 'స్వరాభిషేకం' విషయంలో కొంచం కటువుగా మాట్లాడనేమో అనే గిల్ట్ మొదలైంది. బహుశా అందుకే కావొచ్చు, ఆయన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సీన్లని ప్రస్తావించాను. 'స్వాతిముత్యం' లో రాధికకి పెళ్లి చేసుకుని వచ్చిన కమల్, నిర్మలమ్మ మరణాన్ని పట్టించుకోకుండా, వరలక్ష్మితో "చిట్టీ, ఆకలేస్తోంది.. అన్నం పెట్టవా" అన్నప్పుడు రాధిక ఇచ్చిన ఎక్స్ప్రెషన్, 'స్వాతికిరణం' లో మమ్ముట్టిలో అసూయ పెరిగే క్రమం.. ఇలాంటివన్నీ శ్రద్ధగానూ, సంతోషంగానూ విన్నారు. చిన్న చిన్న న్యూయాన్సెస్ ని పట్టించుకుని కేప్చర్ చేసే శ్రద్ధ నాకు భలే ముచ్చటగా అనిపిస్తుంది. 'శుభలేఖ' లో సుమలత కళ్ళజోడు, 'సప్తపది' లో డబ్బింగ్ జానకి స్నానం చేసొచ్చి, బొట్టు దిద్దుకున్నాక మాత్రమే సోమయాజులు ప్రశ్నకి జవాబివ్వడం ఇలాంటివన్నీ. వీటిలో చాలా సంగతుల్ని ఆవేళ చెప్పనే లేదు. 

'సిరిసిరిమువ్వ' సినిమా రాకపోయి ఉంటే, విజయం సాధించకపోయి ఉంటే, గత శతాబ్దపు ఎనభయ్యో దశకం నుంచి తెలుగు సినిమా  పూర్తిగా 'కమర్షియల్' బాటలోనే సాగి ఉండేదన్నది నిర్వివాదం. 'సిరిసిరిమువ్వ' విజయం, విశ్వనాథ్ కి ప్రయోగాత్మక సినిమాలు తీసే ధైర్యాన్నిస్తే, ఆయా సినిమాల విజయాలు మిగిలిన దర్శక నిర్మాతలు 'డిఫరెంట్' సినిమాలు తీయడానికి దోహదం చేశాయి. కొన్ని చెప్పుకోదగిన సినిమాలొచ్చాయి. సినిమా రంగానికి వేటూరిని, సిరివెన్నెలని పరిచయం చేసి సినిమా సాహిత్యం పదికాలాల పాటు నిలవడానికి తనవంతు కాంట్రిబ్యూట్ చేశారు విశ్వనాథ్. 'సర్గం' తో జయప్రదని జాతీయ స్థాయి కథానాయికగా మలిచారు. 'శంకరాభరణం' తర్వాత పెరిగిన సంగీతం క్లాసుల గురించీ, 'సాగర సంగమం' తర్వాత మొలిచిన డేన్సు స్కూళ్ల గురించీ ఎంత చెప్పుకున్నా తక్కువే. 

నిండు జీవితాన్ని చూశారు విశ్వనాథ్. వ్యక్తిగా మాత్రమే కాదు, దర్శకుడిగా ఆయన కెరీర్ కీ ఈ మాట వర్తిస్తుంది. ఓ దర్శకుడు తీసిన మొత్తం సినిమాల్లో కాలానికి నిలిచే వాటి శాతం అనే లెక్కవేస్తే, తెలుగు దర్శకుల జాబితాలో విశ్వనాథ్ ముందుంటారు. దర్శకుడిగా స్థిరపడి, ఆపై తనకంటూ ఓ మార్గాన్ని నిర్మించుకుని, చివరికంటా అదే మార్గంలో ప్రయాణం చేశారు. ఆ మార్గంలో ప్రయాణం అంత సులువైనదేమీ కాదనడానికి, ఇంకెవరూ ఆ దారి తొక్కే సాహసం చేయలేకపోడాన్ని మించిన ఉదాహరణ అవసరం లేదేమో. విశ్వనాథ్ కృషికి తగ్గ గౌరవం, గుర్తింపు జీవించి ఉండగానే దొరికాయి. భిన్నమైన సినిమాలు తీసినా వాటికి లభించిన ప్రేక్షకాదరణే నిజానికి అతిపెద్ద పురస్కారం. హిట్, ఫ్లాపు లకి అతీతంగా ఆయనతో సినిమా చేయడమే గౌరవంగా నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే కాక నిర్మాతలు కూడా భావించడానికి మించిన అవార్డు ఏదన్నా ఉంటుందా? తెలుగు సినిమా చరిత్రలో ప్రస్తావించి తీరాల్సిన వ్యక్తిగా తనని తాను తీర్చిదిద్దుకున్న కళాతపస్వి ఆత్మకి శాంతి కలగాలి.

శుక్రవారం, జనవరి 27, 2023

జమున ...

కొన్నేళ్ళ క్రితం కాకినాడ నుంచి సామర్లకోట వైపు వెళ్తుంటే దారిలో కుడివైపున 'జమున నగర్' అని బోర్డు కనిపించింది. అనుకోకుండా పైకే చదివాను. "హీరోయిన్ జమునా గారున్నారు కదండీ.. ఆరు తోలు బొమ్మలాట ఆడేవోళ్ళందరికీ ఇళ్ళు కట్టిచ్చేరండిక్కడ.. నూటేబై గడప పైగానే ఉంటాదండి.. ఆల్లందరూ ఊరికి ఆవిడ పేరే ఎట్టేరండి" అడక్కపోయినా వివరం చెప్పాడు కారు డ్రైవరు. బహుశా, రాజమండ్రి ఎంపీ గా పనిచేసిన కాలంలో కట్టించి ఉండొచ్చు అనుకున్నాను. కానైతే, ఇలాంటి కథే సూర్యాపేట (తెలంగాణ) దగ్గరా వినిపించింది. అక్కడ కూడా జమున నగరే, నివాసం ఉండేది రంగస్థల కళాకారులు. కనుక్కుంటే తెలిసిందేమిటంటే, సినిమా జీవితం నుంచి విశ్రాంతి తీసుకుని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాడానికి పూర్వం 'రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య' ని ఏర్పాటు చేయడమే కాకుండా, ఆ కళాకారుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసింది జమున. 

సినిమా వాళ్లలో, మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన సినిమా వాళ్లలో, కళాకారుల సమస్యలు అనే విషయాన్ని గురించి మాట్లాడని వాళ్ళు అరుదు. అంతే కాదు, నిజంగా వాళ్ళ సమస్యల్ని పట్టించుకుని, చేతనైన తోవ చూపేవాళ్ళూ అరుదే. ఈ రెండో రకానికి చెందిన అరుదైన తార జమున. అందుకేనేమో, ఆమె మరణ వార్త తెలియగానే ముందుగా జమునా నగర్ గుర్తొచ్చింది, ఆ వెనుక మాత్రమే ఆమె పోషించిన వెండితెర పాత్రలు జ్ఞాపకానికి వచ్చాయి. నటిగా తాను తొలిఅడుగులు వేసిన రంగస్థలాన్ని మాత్రమే కాదు, సినిమాయేతర కళారూపాలన్నింటినీ శ్రద్ధగా పట్టించుకుని, వాటినే నమ్ముకున్న కళాకారుల కోసం తాను చేయగలిగింది చేసి చూపించింది జమున. ఇళ్ళు కట్టించడం మాత్రమే కాదు, వాళ్ళకి ప్రదర్శనలు ఇప్పించడానికీ చొరవ చూపిందట!

'జమునాతీరం' పేరిట ఆమె రాసుకున్న ఆత్మకథని చదవడం తటస్థించింది కొన్నాళ్ల కిందట. తన పితామహులది దుగ్గిరాలకి చెందిన వ్యాపార కుటుంబమని, మాతామహులు విజయనగర సంస్థానంలో కళాకారులనీ రాసుకున్నదామె. "ఈమె మాతామహుల కాలానికి ముందే విజయనగర సంస్థానం శిధిలం అయిపోయింది కదా?" అని సందేహం నాకు. బహుశా, మాతామహుల తాలూకు పూర్వులు అయి ఉంటారనుకున్నాను. అలా మాతామహుల ఇంట హంపీ విజయనగరంలో పుట్టి, 'హంపీ సుందరి' అనే సార్ధక నామధేయాన్ని సాధించుకుంది జమునా బాయి (చిన్నప్పటి పేరు).  బాలనటిగా కొంగర జగ్గయ్యతో కలిసి స్టేజి డ్రామా వేయడం, ఆ సందర్భంలో జగ్గయ్యాదులని మూడు చెరువుల నీళ్లు తాగించడం లాంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి ఆ పుస్తకంలో. 

కాంగ్రెస్ టిక్కెట్టు మీద 1989 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు సీటుకి పోటీ చేసినప్పుడు, గోడలమీది ఎన్నికల అభ్యర్ధనల్లో 'మీ సోదరి జమున రమణారావు' అని ప్రస్ఫుటంగా కనిపించేది. రాజకీయాలు ఎంతపని చేస్తాయి!! పార్టీ పెట్టడానికి ముందు రోజు వరకూ మహిళల కలల రాకుమారుడైన ఎంటీఆర్ ఒక్కసారిగా 'అన్నగారు' అయిపోయినట్టుగా, డ్రీం గర్ల్ జమున (సినిమాలు విరమించుకున్న చాలా ఏళ్ళ తర్వాత) సోదరిగా మారిపోయింది. ఆ ఎన్నికల ప్రచార సభల్లో "ఎంటీఆర్ ని నేను కాలితో తన్నాను" అని ఆమె పదేపదే చెప్పుకోడాన్ని అన్నగారి అభిమానులు తప్పట్టుకున్నారు. "ఎంటీఆర్ కాళ్ళకి ఈవిడ ఎన్నిసినిమాల్లో దణ్ణం పెట్టలేదూ?" అన్న ప్రశ్నలూ వచ్చాయి. ఆ ఎన్నికల్లో గెలిచి లోక్ సభ సభ్యురాలు అయినప్పటికీ, తర్వాతి కాలంలో రాజకీయాలు కలిసిరాలేదామెకి. 

కాలితో తన్నడం సినిమా షూటింగ్ లో భాగమే అయినా, ఎంటీఆర్, ఏఎన్నార్ల గర్వాన్ని తన్నిన ఘనత మాత్రం జమునదే. విధేయంగా ఉండదన్న వంక చెప్పి జమున మీద నాటి ఈ అగ్రహీరోలిద్దరూ నిషేధం పెట్టించినప్పుడు, హరనాథ్ లాంటి హీరోలని ప్రోత్సహించి వాళ్లతో సినిమాలు చేసి హిట్లు కొట్టింది తప్ప, వాళ్లిద్దరూ ఊహించినట్టు కాళ్ళ బేరానికి వెళ్ళలేదు. సినిమా నటుల్లో, ముఖ్యంగా నటీమణుల్లో, ఇప్పటికీ అరుదుగా కనిపించే లక్షణం ఈ స్వాభిమానం. ఈ స్వాభిమానమే ఆమె సత్యభామ పాత్రని రక్తి కట్టించడానికి దోహదం చేసిందేమో. చిన్న హీరోలతో చేసినా ఆ సినిమాలు హిట్ అవ్వడం, ఆమె స్టార్డం తగ్గకపోవడంతో ఆ పెద్ద హీరోలే మెట్టు దిగాల్సి వచ్చింది. తెలుగు సినిమా చరిత్రలోనే దీన్నో అరుదైన సంఘటనగా చెప్పుకోవాలి. 

సినిమాలు విరమించుకోడానికి కొంచం ముందుగా ఓ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో గాయపడింది జమున. త్వరగానే కోలుకున్నా, మెడ వణుకు మిగిలిపోయింది. ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చేనాటికి వయోభారం మీద పడడం వల్ల కాబోలు, ఆ వణుకుని చివరి వరకూ భరించిందామె. ఒకవేళ ఆ సమస్య రాకుండా ఉండి ఉంటే మిగిలిన నటీమణుల్లాగే ఆమె కూడా అమ్మ/అత్త పాత్రలకి ప్రమోటయి ఉండేదా? బహుశా నటనకి దూరంగానే ఉండేదేమో అనిపిస్తుంది నాకు. ప్రేక్షకుల దృష్టిలో కథానాయికగానే ఉండిపోవాలన్నది ఆమె నిర్ణయం అయి ఉండొచ్చు. కేవలం తెరమీద పోషించిన పాత్రలకు మాత్రమే కాదు, జీవించిన విధానం వల్లకూడా జమున అనగానే కథానాయికే గుర్తొస్తుంది. ఆమె ఆత్మకి శాంతి కలగాలి.