సోమవారం, మే 22, 2023

శరత్ బాబు...

బ్లాకండ్ వైట్ సినిమాల్లో కొంగర జగ్గయ్య, హీరోతో సమంగా కథానాయికని ప్రేమిస్తున్నట్టయితే సినిమా చూస్తున్న ప్రేక్షకులకి యిట్టే తెలిసిపోయేది - ఇతడి ప్రేమ త్యాగాన్ని కోరుతుందని. కేవలం రెండో హీరో మాత్రమే కాదు, విలన్ గానూ, కేరక్టర్ ఆర్టిస్టు గానూ రాణించారు జగ్గయ్య. సినిమాలు నలుపు-తెలుపుల్లో నుంచి రంగుల్లోకి మారాక జగ్గయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అతికొద్దిమంది నటుల్లో ఒకరు శరత్ బాబు. నలగని, చక్కని దుస్తులు, చెదరని క్రాఫు, రిమ్ లెస్ కళ్లద్దాలు.. గాంభీర్యం కలగలిసిన ఆహార్యం. చిన్న నవ్వులో కనిపించే చిరు వంకర అతని విలన్ వేషాలకి భలేగా కలిసొచ్చింది. కళ్ళజోడు తీసి చేత్తో పట్టుకుంటే సెంటిమెంటు, కళ్లద్దాలు పైనుంచి వోరగా చూస్తే విలనీ.. వెరసి క్లుప్తమైన నటన. 

హీరో మెటీరియల్ అయివుండీ, కథానాయకుడిగా గట్టిగా నిలదొక్కుకోలేక పోయిన కొందరిలో ఒకడు శరత్ బాబు. చలం, రంగనాథ్ ల కోవ. పాత్ర ఏదైనా, అతడు తెరమీద కనిపించాడంటే, దృష్టి నిలిపి చూడాల్సిందే. హీరోగానే కెరీర్ మొదలుపెట్టినా, చిత్ర పరిశ్రమ తత్వాన్ని యిట్టే అర్ధం చేసుకుని అట్టే కేరక్టర్ల లోకి, విలనీ లోకీ మారిపోయాడు. వయసులో తనకన్నా పెద్ద వాళ్ళకి 'అన్న' అయ్యాడు. కొండొకచో నాన్న కూడా అయ్యాడు. పోలీసు, దొంగ వేషాలతో పాటు రెంటినీ కలగలిపిన నెగటివ్ పాత్రల్లోనూ ఔననిపించాడు. దాదాపు ఒకే సమయంలో వచ్చిన 'సితార' 'సీతాకోకచిలుక' సినిమాలు రెంటిలోనూ శరత్ బాబు కేరక్టర్ ఆర్టిస్టు. చేసిన కేరక్టర్ల లో భేదం రేఖామాత్రమే అయినా, వాటిని అభినయించిన విధం ఎంత ప్రత్యేకం అసలు! 

ఆముదాలవలస హోటల్ ఓనర్ గారబ్బాయి సత్యంబాబు దీక్షితులు, శరత్ బాబుగా మారిన క్రమాన్ని గురించి పెద్దగా తెలిసింది లేదు. ఆ ప్రారంభపు రోజుల్ని మాత్రమే కాదు, తర్వాత కాలంలో తిన్న ఎదురు దెబ్బల గురించీ ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు. విడాకుల తర్వాత రమాప్రభ చేసిన ఆరోపణల విషయంలోనూ అదే మౌనం. ఆ మౌనమే ఆ పెళ్లి కథలో శరత్ బాబుని విలన్ని చేసేసింది. 'అభినందన' లాంటి త్యాగపూరిత పాత్రలు చేసినా, అతన్ని తలచుకోగానే దుష్ట పాత్రలే మొదట గుర్తొచ్చేలా జరిగిన ట్యూనింగ్ లో రమాప్రభ ఎపిసోడ్ ప్రభావం తెలియకుండానే ఉందేమో. 'సంసారం ఒక చదరంగం' లాంటి సినిమాల్లో వేసిన పాత్రలు అత్యంత సహజంగా ఉండడమూ మరో కారణం కావొచ్చు. నటీనటులకి ఒక్కో 'ఇమేజి ' స్థిర పడిపోవడం అన్నది కొత్త విషయం కాదు కదా. 

'ఇది కథ కాదు' 'గుప్పెడు మనసు' 'అన్వేషణ' 'సాగర సంగమం' 'స్వాతి' 'ఓ భార్య కథ' ... గుర్తు చేసుకుంటూ వెళ్తే ఎన్ని వైవిధ్య భరితమైన పాత్రలో అసలు. శరత్ బాబు యంగ్ లుక్ కి అలవాటు పడిపోవడం వల్ల కావచ్చు, 'శుభప్రదం' లాంటి సినిమాల్లో వయసు మళ్ళిన (అప్పటికి తన వయసుకి తగ్గవే అయినా) పాత్రల్లో చూడడం అలవాటవడానికి కొంచం టైం పట్టింది. 'సాగర సంగమం' క్లైమాక్స్ లో కమల్ హాసన్ మీద వర్షం పడకుండా అడ్డం పడడం (జయప్రద గొడుగు తెచ్చేలోగా) తెరమీద కనిపించేది ఒక్క క్షణమే అయినా చెరగని ముద్ర వేసే సన్నివేశం. "ఇలాంటి ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు" అనుకోని ప్రేక్షకులు ఉండరేమో అసలు. నిజానికి ఆ సీన్లో బోల్డంత అభినయించవచ్చు. అలా కాకుండా సహజంగా చేయడమే శరత్ బాబు ప్రత్యేకత. 

శరత్ బాబు వేసిన పోలీసు వేషాల గురించి ప్రత్యేకం చెప్పుకోవాలి. తెరమీద పోలీసు యూనిఫామ్ ధరించాలన్నది నటీనటుల్లో చాలామందికి కల. నెరవేర్చుకునే అవకాశమూ దొరుకుతుంది. కానైతే, ఆ యూనిఫామ్ అందరికీ సెట్ అవ్వదు. పెద్ద హీరోల విషయంలో అభిమానులు కాసేసుకుంటారు కాబట్టి సమస్య ఉండదు, కానీ కేరక్టర్ ఆర్టిస్టుల విషయంలో అలా కాదు. సెట్ అయ్యే వాళ్ళకి మాత్రమే యూనిఫామ్ వేస్తారు. శరత్ బాబు ఖాకీ యూనిఫామ్ వేసుకుని కనిపిస్తే, అచ్చంగా పోలీస్ ఆఫీసర్ లాగే ఉండేవాడు. అక్కడ కూడా ఆఫీసరే, కానిస్టేబుల్ వేషంలో చూడలేం. నిజానికి పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నది తన చిన్నప్పటి కల అట. అయితే ఐ సైట్ సమస్య ఉండడంతో ఆ ఉద్యోగం రాదని నిశ్చయించుకుని, సినిమాల వైపు చూశానని చెప్పాడు ఓ ఇంటర్యూలో. (ఇది కూడా 'డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా' లాంటిదే కావచ్చునేమో.) 

సినిమా వేషాలు తగ్గుతుండగానే టీవీకి షిఫ్ట్ అయిపోయిన శరత్ బాబు, చాలా ఏళ్ళ పాటు ఈటీవీ కి నిలయ విద్వాంసుడు. ఒక్క 'అంతరంగాలు' సీరియలే ఏళ్ళ తరబడి సాగింది. పాటలతో పాటు శరత్ బాబు కూడా ప్రత్యేక ఆకర్షణ ఆ సీరియల్ కి. మహిళా ప్రేక్షకుల్లో అతడికున్న ఫాలోయింగ్ ఆ సీరియల్ ని నిలబెట్టి, సుదీర్ఘంగా సాగేందుకు దోహదం చేసింది. అప్పుడప్పుడూ సినిమాల్లోనూ కనిపిస్తూ ఉండడం వల్ల శరత్ బాబు రిటైర్ అయిపోయాడు అనే ఆలోచన రాలేదెప్పుడూ. గత రెండు మూడు నెలలుగా అనారోగ్యం వార్తలు మాత్రం తరచూ కనిపిస్తున్నాయి. టీవీ చానళ్ళు చంపేసి, నాలిక్కరుచుకున్న సందర్భాలూ ఉన్నాయి. (చంపడం మీద వీళ్ళకి ఇంత ఉత్సాహం ఏమిటో, కాస్త ఆలస్యం అయినా కన్ఫర్మ్ చేసుకుని వార్త వెయ్యొచ్చు, కొంపలు మునగవు). ఎందుకో తెలియదు కానీ, శరత్ బాబు 'ఫిర్యాదులు లేని మనిషి' అనిపిస్తాడు. తన పాత్రని ముగించుకుని (బహుశా తృప్తిగానే) వెళ్ళిపోయాడు. శరత్ బాబు ఆత్మకి శాంతి కలగాలి. 

శనివారం, ఏప్రిల్ 22, 2023

సంకెళ్లను తెంచుకుంటూ

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్  చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు ఆత్మకథ 'సంకెళ్లను తెంచుకుంటూ'. మాధవ రావు స్వయంగా ఇంగ్లీష్ లో రాసుకున్న 'బ్రేకింగ్ బారియర్స్' కు రఘురాములు చేసిన తెలుగు అనువాదం ఇది. కృష్ణా జిల్లా పెద మద్దాలి గ్రామంలో ఓ దళిత కుటుంబంలో జన్మించి, తల్లి ప్రోత్సాహంతో చదువు సాగించి, ఐఏఎస్ సాధించి, ఎందరో ఐఏఎస్లు కలగనే చీఫ్ సెక్రటరీ పోస్టు వరకూ రావు చేసిన ప్రయాణమే ఈ పుస్తకం. వ్యవసాయ కూలీలుగా పని చేసిన మాణిక్యమ్మ, శోభనాద్రి దంపతుల చిన్న (రెండో) కొడుకుగా పేదరికంలో గడిచిన బాల్యం మొదలుకొని, ఉద్యోగ జీవితంలో ఎదురైన సవాళ్లు, ఆటుపోట్లు మీదుగా, తాను కోరుకుంటున్న సాంఘిక, రాజకీయ సంస్కరణల వరకూ తన అనుభవాలను, ఆలోచనలను అక్షరబద్ధం చేశారు మాధవ రావు. 

మోతుబరి రైతు దగ్గర పాలేరుగా జీవితం గడిపిన శోభనాద్రి తన కొడుకులు ఇద్దరూ కూడా తనలాగే 'నమ్మకస్తులైన పాలేర్లు' గా జీవించాలని గట్టిగా కోరుకున్నారు. ఈ ఆలోచనని అంతకన్నా గట్టిగా వ్యతిరేకించారు మాణిక్యమ్మ. ఫలితం, కొడుకులిద్దరూ ఊరి ఎలిమెంటరీ స్కూలు దాటి హైస్కూలుకి, అటుపైన కాలేజీకి వెళ్లి చదువుకునే అవకాశం దొరికింది. పెద్ద కొడుకు ఉద్యోగంలో కుదురుకోగా, ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చదివిన మాధవరావు సివిల్ సర్వీసెస్ సాధించారు. తనకి మేలు చేసిన ఎంతో మందిని పుస్తకం పొడవునా పేరు పేరునా ప్రస్తావించినప్పటికీ, తనలో సివిల్ సర్వీసెస్ ఆలోచన మొలకెత్తడానికి కారకులు, ప్రిపరేషన్ కి సహాయ పడిన వారు, ప్రోత్సహించిన వారి వివరాలని ఎక్కడా రాయకుండా ఆశ్చర్య పరిచారు రచయిత. 

"కట్ చేస్తే ఐఏఎస్" అన్నంత సులువుగా చదువు నుంచి ఉద్యోగ విషయాల్లోకి వచ్చేయడం వల్ల ఓ ముఖ్యమైన లింక్ మిస్సయినట్టుగా అనిపించింది పుస్తకం చదువుతుంటే. ప్రారంభంలో ఏ కెరీర్ లో అయినా ఇబ్బందులు సహజమే. సివిల్ సర్వీస్ ఇందుకు మినహాయింపు కాదని గతంలో కొందరు ఐఏఎస్ లు రాసిన ఆత్మకథల్లో చదువుకున్నాం. అలాంటి సమస్యలే మాధవరావుకీ ఎదురయ్యాయి. తనని ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లు బయట పెట్టలేదన్న మాటే కానీ, వాళ్ళ వివరాలు ఎంత సూక్ష్మంగా చెప్పారంటే -- ఇచ్చిన ఆధారాల సాయంతో గూగుల్ చేసి వాళ్ళ పేర్లు, ఫోటోలు సరి చూసుకోవచ్చు. ఎన్నో క్లిష్టమైన ఫైళ్లని పరిష్కరించిన అనుభవం కదా మరి. వరంగల్ కలెక్టర్ గా పని చేసిన నాటి అనుభవాలు మాత్రం ఆసక్తిగా చదివిస్తాయి. 'నక్సలైట్ సానుభూతి పరుడు' అన్న ముద్ర పడింది అప్పుడే. 

నేదురుమల్లి జనార్దన  రెడ్డి  ముఖ్యమంత్రి గా పనిచేసే రోజుల్లో, మాధవరావు సెక్రటరీ గా ఉన్నారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హైదరాబాద్ వస్తున్నారు. మాధవరావు ని ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఆమెకి స్వాగతం పలకమన్నారు జనార్దన రెడ్డి. అంతకు మునుపే జనార్దన  రెడ్డి తమిళనాడు వెళ్ళినప్పుడు జయలలిత సెక్రటరీ ఆయనకి స్వాగతం పలికారు. ఇది బదులు తీర్చుకోడం అన్నమాట. అయితే, జయలలితకి స్వాగతం పలకడానికి మాధవరావు నిరాకరించారు. ఆయనదృష్టిలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత జానకి రామచంద్రన్ (ఎంజీఆర్ భార్య) కి ఉంది తప్ప, జయలలితకి కాదు. ఈ అభ్యంతరాన్ని జనార్దన రెడ్డి మన్నించారు. అనూహ్యంగా, ఇది జరిగిన కొన్నేళ్ళకే, ఎన్టీఆర్ వెన్నుపోటు ఫలితంగా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ పదవి చేపట్టారు మాధవరావు. దీనిని కేవలం 'పారడాక్స్' అనగలమా?  

మొత్తం పధ్నాలుగు అధ్యాయాలుగా విభజించిన ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చినవి పది, పదకొండు అధ్యాయాలు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు పనితీరు పట్ల రచయిత పరిశీలనలున్నాయి వీటిలో. తాను చెప్పాలనుకున్న విషయాలని కొన్ని చోట్ల నేరుగానూ, చాలాచోట్ల గుంభనంగానూ చెప్పుకొచ్చారు. ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ ఏర్పాటు గురించి చెబుతూ "హైదరాబాద్ సంస్థాన పరిపాలకుడైన నిజాం ఉస్మానియా యూనివర్సిటీ కి 1917 లో 1,600 ఎకరాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక్క బిజినెస్ స్కూల్ కు 260 ఎకరాలు కేటాయించారు" అన్నారు. ఈ రెంటిలో ఏ సంస్థ ఏయే వర్గాలకి ఉపయోగ పడిందన్న ప్రశ్న పాఠకులే వేసుకుని, జవాబు వెతుక్కోవాలి. ఐఎస్బీ కి, సింగపూర్ విమానాలకి ఇచ్చిన 'రాయితీ' లని వివరంగానే ప్రస్తావించారు. 

మొత్తం పుస్తకాన్ని పూర్తి చేశాక, రచయిత తన చిన్ననాటి పేదరికాన్ని, తన కులాన్ని 'సంకెళ్లు' గా భావించారనిపించింది. కడుపు నిండా తిండి దొరకని నాటి పేదరికం, అప్పుడు తప్పక మొదలుపెట్టిన మితాహారాన్ని ఇప్పటికీ కొనసాగించడం లాంటి విషయాలు కదిలిస్తాయి. అయితే, కులం అన్నది ఆయన విషయంలో సంకెలగా కాక పూలదండగానే మారిందనిపించింది (పుస్తకంలో ప్రస్తావించిన విషయాల మేరకు). మరీ ముఖ్యంగా, చీఫ్ సెక్రటరీ నియామకం వెనుక కులం బలంగా పనిచేసింది. ఎస్సీ వర్గీకరణ ఆందోళనలు జరుగుతున్న ఆ రోజుల్లో కీలక పదవికి తనని ఎంపిక చేయడం వెనుక చంద్రబాబు నాయుడు వ్యూహమూ, చాతుర్యమూ ఉన్నాయన్నది మాధవరావే అంగీకరించిన విషయం. పాలనా సంబంధ విషయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఆసక్తి కలిగించే పుస్తకం. అనువాదం మరికొంత సరళంగా ఉండొచ్చు. (భూమి బుక్ ట్రస్ట్ ప్రచురణ, పేజీలు 289, వెల రూ. 300. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఆన్లైన్ లోనూ లభ్యం). 

ఆదివారం, ఏప్రిల్ 09, 2023

నీలంపురాశి

మహాత్మా గాంధీ చేసిన మొదటి సత్యాగ్రహం 'చంపారన్' నీలి రైతులకి మద్దతుగా 1917 లో జరిగింది. అహింసాయుతంగా జరిగిన ఆ సత్యాగ్రహం సహాయనిరాకరణ తదితర అహింస ఉద్యమాలకి నాంది పలికింది. అయితే, చంపారన్ కి అరవయ్యేళ్ళ ముందే బెంగాల్ లో నీలి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారనీ, 1857 నాటి సిపాయిల తిరుగుబాటుకి దోహదం చేసిన అంశాల్లో బెంగాల్ నీలి సమస్యకూడా ఒకటని చరిత్రని క్షుణ్ణంగా చదివిన వారికి తప్ప మిగిలిన వారికి తెలిసే అవకాశం లేదు. బెంగాల్ నీలి రైతుల తిరుగుబాటు తర్వాత, ప్రత్యామ్నాయం ఆలోచించిన బ్రిటిష్ ఇండిగో ప్లాంటర్ల దృష్టి ఆంధ్ర ప్రదేశ్ లో మచిలీపట్టణం రేవుపట్టణ పరిసర గ్రామాల మీద పడిందనీ, మచిలీపట్నం-నిజాంపట్నం పోర్టుల మధ్య గ్రామాల రైతులు నీలిని పండించి రాణీకాసులు సంపాదించుకున్నారన్నది చరిత్రలో మరుగున పడిపోయిన సంగతి. దేశ రాజకీయాలని, ఆంధ్ర రైతాంగపు చరిత్రని మలుపుతిప్పిన నీలి పంట ఇతివృత్తంగా చంద్రలత రాసిన బృహన్నవల 'నీలంపురాశి'. 

చంద్రలత పేరు చెప్పగానే తానా నవలల పోటీలో బహుమతి గెలుచుకున్న 'రేగడి విత్తులు' నవల మొదట గుర్తుకురావడం సహజం. నాకుమాత్రం నీటిపారుదల ప్రాజెక్టులు ఇతివృతంగా ఆమె రాసిన 'దృశ్యాదృశ్యం' నవలంటే ప్రత్యేకమైన ఇష్టం. ఒక డ్రై సబ్జెక్టుకి ఫ్యామిలీ డ్రామాని జతచేసి, ఆద్యంతమూ ఆసక్తిగా చదివించడమే కాక, చిన్న పాత్రలని కూడా ప్రధాన కథలో భాగం చేసిన నవలది. 'దృశ్యాదృశ్యం' తర్వాత ఆ రచయిత్రి నుంచి వస్తున్న పెద్దనవల కావడం, పైగా చరిత్ర నేపథ్యంతో రాసిన నవల కావడం వల్ల చాలా కుతూహలంతో చదవడం మొదలుపెట్టాను. చదువుతున్నంత సేపూ, నవల పూర్తి చేసి పక్కన పెట్టాక కూడా నాకు అనిపించింది ఒక్కటే "చంద్రలత ఓ పరిశోధన రాక్షసి". మొత్తం 538 పేజీల ఈ నవల కోసం ఆమె చేసిన పరిశోధన సినాప్సిస్ నిడివి నవలకి మరో నాలుగు రెట్లు ఉంటుందనిపించింది. 

బెంగాల్ నీలి ఉద్యమం మొదలు, భారత దేశానికి వలస వచ్చిన ఆంగ్లో-ఇండియన్ల జీవిత శైలి, స్థానికులతో వాళ్ళ సంబంధాలు, నాటి స్థానిక వ్యవసాయ పద్ధతులు, ఉమ్మడి కుటుంబ జీవన విధానం, తీరప్రాంతపు మోతుబరి రైతులు వ్యాపారులుగా పరిణమించిన వైనం, వంశపారంపర్యంగా చేసే అద్దకం వృత్తి, ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాణి పాలనా పగ్గాలు అందుకున్న తరుణంలో కొత్తగా తయారైన సివిల్ సర్వెంట్ల ఆలోచనలు, పని తీరు, నాటి బెంగాల్ విద్యావంతుల్లో బ్రిటిష్ వారి పట్ల పెరిగిన ఆరాధన, కాలక్రమంలో ఆ అభిమానం అనుమానంగా మారిన వైనం, ఇందుకు దోహదం చేసిన పరిస్థితులు... ఇలా ఒకటని కాదు. సమాచార సేకరణ ఒక ఎత్తైతే, కథా క్రమాన్ని అనుసరించి, చారిత్రక క్రమానికి తగ్గట్టుగా కథా కాలాన్ని నిర్మించుకుని, సేకరించిన సమాచారాన్ని కథలో పొదగడం మరో ఎత్తు. నీలిపంట, నీలిమందు, నీలికళ్ళ మనుషులు (ఆంగ్లో-ఇండియన్స్), కథనిండా కనిపించేవి ఇవే. 

బెంగాల్ కి చెందిన విద్యావంతుడు శిశిర్ కుమార్ మిత్ర (శిశిరుడు), మచిలీపట్టణం రేవుకి దగ్గరగా ఇండిగో ఎస్టేట్ నడిపే ఆంగ్ల కుటుంబం రాబిన్సన్స్, స్థానిక రైతు సాంబశివుడి కుటుంబం అనే మూడు కథల ముప్పేటగా సాగుతుంది 'నీలంపురాశి'. శిశిరుడు బెంగాల్ నుంచి తలదాచుకోడం కోసం మచిలీపట్నం రావడంతో మొదలయ్యే కథ అనేక మలుపులు తిరుగుతూ సాగర తీరంలో జరిగే ఒక అనూహ్య సంఘటన అనంతర పరిణామాలతో ముగుస్తుంది. బెంగాల్ నీలి ఉద్యమంతో పాటు, ఆంధ్ర రైతుల జీవితాల్లో నీలిపంట తెచ్చిన మార్పులు, కంపెనీ నుంచి రాణి కి పాలన మారిన సందర్భంలో జరిగిన చారిత్రక సంఘటనలు, వాటి ఫలితంగా స్థానికులు పొందినవి, కోల్పోయినవి, వీటన్నింటినీ చర్చిస్తూ సాగుతుంది ఈ నవల. బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలు, కథ ముందుకు సాగే కొద్దీ చిక్కపడే కథనం ఈనవల ప్రత్యేకతలుగా చెప్పాలి. 

బెంగాల్ నుంచి శిశిరుడు మచిలీపట్టణం ఎందుకు వచ్చాడు, తమ బెంగాల్ సహచరులు కోల్పోయిన నీలి వ్యాపారాన్ని రాబిన్సన్స్ కుటుంబం ఎలా అందిపుచ్చుకుంది, నీలి పంట ఫలితంగా సాంబశివుడిలోనూ, అతని కుటుంబంలోనూ వచ్చిన మార్పులేవిటన్నది స్థూలంగా చెబుతూనే, సూక్ష్మ స్థాయిలో స్థానిక అద్దకం పరిశ్రమ, వంశపారంపర్యంగా వాళ్ళు దాచుకంటూ వస్తున్న 'నీలి' రహస్యాలు, పొంగళ్ళు పెట్టడం లాంటి ఆచారాలు, గోవాడ ప్రభల తిరనాళ్ళు, వలస వచ్చాక మరింత బ్రిటిష్ గా మారిపోయే ఆంగ్లేయుల కుటుంబ జీవనం, స్థానిక జమీందారీలు, మిషనరీలు, చర్చిలు, స్కూళ్ళు, స్థానికుల దృష్టిలో దొరలూ, బ్రిటిష్ వారికి పంక్తి బాహ్యులూ అయిన యురేషియన్లు (భారతీయ తల్లికి, ఆంగ్లేయ తండ్రికి పుట్టిన సంతానం) లాంటి అనేక సూక్ష్మ విషయాలని సందర్భోచితంగా ప్రస్తావించారు రచయిత్రి. 

శిశిరుడు మచిలీపట్నం రావడంతో కథ మొదలు పెట్టడం, అతని నేపధ్యాన్ని, ప్రయాణపు అనుభవాలని తాపీగా చెబుతూ పోవడం వల్ల తొలి వంద పేజీల్లో కథనం బహు నింపాదిగా సాగిన భావన కలిగింది. వందపేజీల తర్వాతే కథలో నీలి పంట ప్రవేశించింది. అక్కడినుంచీ కథనం వేగం పుంజుకుంది. నవలని శిశిరుడి కథతో కాక, రాబిన్సన్స్ కథతో మొదలు పెట్టి ఉంటే ఈ 'నింపాది' సమస్య ఉండేది కాదు. మరికొన్ని కారణాలకి కూడా రాబిన్సన్స్ తో కథని మొదలు పెట్టడమే సమంజసం. మరి రచయిత్రి కథని ఈ ఆర్డర్ లో ఎందుకు చెప్పారో. రాబిన్సన్స్ వారసుడు, స్థానిక రైతాంగం 'హరయ్య బాబు' అని పిలుచుకునే హ్యారీ పాత్ర మీద రచయిత్రికి కలిగిన ప్రత్యేకమైన అభిమానం మరో సమస్య. అతని స్నేహితుడు, ఆపై కుటుంబ సభ్యుడు అయిన ఐసీఎస్ అధికారి ఆష్లీ కన్నా హ్యారీని ఓ మెట్టు పైన చూపించడానికి రచయిత్రి ప్రత్యేకంగా కష్టపడ్డారనిపించింది. ఐసీఎస్ శిక్షణలో ప్రథముడిగా నిలిచిన ఆష్లీకి స్థానికులు తనకి నమస్కరించినప్పుడు  ఎలా ప్రతిస్పందించాలో హ్యారీ నేర్పించడం ఇందుకు పరాకాష్ట. ఈ ఆష్లీ లో అక్కడక్కడా 'దృశ్యాదృశ్యం' కేశవ ఛాయలు కనిపించాయి. 

మమ్మారోజీ, లూయిసా, పార్వతి లాంటి బలమైన స్త్రీపాత్రల్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. గ్రేట్ గ్రానీని, సారా విత్ హెచ్ నీ కూడా పాఠకులు ఓ పట్టాన మర్చిపోలేరు. పోస్ట్ మాస్టర్ లక్ష్మీనారాయణ, వ్యాపారి సత్యనారాయణ పేర్ల మధ్య రచయిత్రి చాలాసార్లు తికమక పడ్డారు. లక్ష్మీనారాయణ గురించి చెబుతూ అతన్ని సత్యనారాయణ అని ప్రస్తావించడం చాలాసార్లు జరిగింది. 'బృందావనం' వారి మేనల్లుడు కనుక పోస్ట్ మేష్టారు పాత్రకి ఆ పేరు సబబే. వ్యాపారి పేరు మార్చుకుని ఉంటే ఈ ఇబ్బంది ఉండకపోయేదేమో. మిగిలిన ఏ పాత్రల విషయంలోనూ ఈ సమస్య లేదు కానీ అచ్చుతప్పులు మాత్రం చాలానే కనిపించాయి. ప్రూఫ్ ని మరింత శ్రద్ధగా దిద్దడం అవసరం. తొలి వంద పేజీలు కొంచం ఓపిగ్గా చదివితే, ఆ తర్వాత ఆపకుండా చదివించే కథనం. కథాకాలం నాటి ఆంగ్ల సాహిత్యాన్ని, రచయితల్ని, పాత్రల్ని నవలలో సందర్భోచితంగా ప్రస్తావించడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చివర్లో ఇచ్చిన 'ఆధార పట్టిక & పదసూచిక' పాఠకులకి అత్యంత సహాయకారి. 

నీలిపంటకి, నీలిమందుకి సంబంధించి దాదాపు అన్ని విషయాలనీ కథలో భాగం చేసినా, 'నీలివార్త' గురించి ప్రస్తావించలేదు ఎందుకో మరి. ఇప్పుడు 'రూమర్/గాసిప్' అని పేరుబడిన నీలివార్తల్ని ఒకప్పుడు పనికట్టుకుని ప్రచారంలోకి తెచ్చేవారట. నీలిమందు ఉడకనప్పుడు ఇలాంటి వార్తల్ని ప్రచారంలోకి తెస్తే అప్పుడు బాగా ఉడుకుతుందని ఓ నమ్మకం ఉండేదని, అలా పుట్టినవే నీలివార్తలనీ గోదావరి జిల్లాల్లో జనబాహుళ్యం చెప్పుకునే మాట (మిగిలిన ప్రాంతాల సంగతి తెలియదు, రచయిత్రి పరిశోధన చేసిన ప్రాంతాల్లో ఈ 'నీలివార్త' వెనుక కథ ప్రచారంలో లేదేమో). చారిత్రక సంఘటనలకి కల్పిత పాత్రలని జోడించి రాసిన ఈ నవల తాను తలపెట్టిన 'విక్టోరియన్ నవలా త్రయం' లో మొదటిదని చెప్పారు రచయిత్రి, 'నీలంపురాశి' కి చివర్లో రాసిన 'కథనానికి ముందు, తర్వాత' వ్యాసం చివర్లో. రాబోయే రెండు నవలల కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. (ప్రభవ పబ్లికేషన్స్ ప్రచురణ, వెల రూ. 495, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఆన్లైన్ లోనూ లభిస్తోంది). 

మంగళవారం, మార్చి 28, 2023

బలగం

అతను మొదట 'వేణు వండర్స్' గా పరిచయం. ధారాళమైన బూతులకి మరికొన్ని అవలక్షణాలు గుదిగుచ్చి 'జబర్దస్త్' అని పేరిచ్చిన ఒకానొక టీవీ షోలో ఒకానొక టీం లీడర్ అప్పుడతను. ఆ మొత్తం షో ని భరించాల్సిన అవసరం లేకుండా, ఉన్నంతలో శుభ్రంగానూ, ఏదో ఒక ప్రత్యేకతతోనూ స్కిట్లు చేసే టీం లీడర్లని ఎంచుకుని, టీవీ కి బదులుగా యూట్యూబులో చూసే అవకాశం వచ్చినప్పుడు నేను షార్ట్ లిస్ట్ చేసుకున్న కొద్దిమంది టీం లీడర్లలో అతనూ ఒకడు. అప్పటికే వేణు సినిమాల్లో చిన్న వేషాలు వేసి ఉన్నాడని నెమ్మదిగా తెలిసింది. కాలక్రమంలో అతను ఇతర చానళ్లకు మళ్ళినా, యూట్యూబ్ లో దొరికిన కంటెంట్ ని చూస్తూనే ఉన్నాను. హాస్యంతో పాటుగా జానపద కళల మీద వేణుకి ఉన్న మక్కువ, అతని స్కిట్లు ప్రత్యేకంగా అనిపించడానికి, గుర్తుండడానికీ కారణమని అర్ధమవ్వడానికి చాలారోజులు పట్టింది. 

ఆలోగా అతను బుర్రకథ మొదలు, ఒగ్గు కథ వరకూ ఎన్నింటినో తన స్కిట్లలో వాడుకున్నాడు, ఆయా కళల్ని ఏమాత్రం కించ పరచకుండా, వాటిని మరింతగా గౌరవిస్తూ... "వేణు సినిమా తీస్తున్నాడు" అని విన్నప్పుడు కచ్చితంగా కామెడీ సినిమానే అయి ఉంటుంది అనుకున్నాను. ఆ సినిమా, 'బలగం', విడుదలై మంచి పేరు తెచ్చుకుందని తెలిసి సంతోషం కలిగింది. మొదట తక్కువ థియేటర్లలో విడుదల చేసినట్టున్నారు, దగ్గర థియేటర్లలో కనిపించలేదు. కేవలం సినిమాకి పెరిగిన ఆదరణ వల్ల థియేటర్లు పెంచారు. ముందుగా చేసుకున్న ఒప్పందం వల్ల అమెజాన్ ప్రైమ్ లోనూ విడుదల చేసేశారు. ఓపక్క ఉచితంగా ఓటీటీలో దొరుకుతున్నా, జనం టిక్కెట్లు కొనుక్కుని హాళ్ళకి వెళ్తూ ఉండడం బహుశా ఈ సినిమాకి మాత్రమే దొరికిన గౌరవం. 

ప్రియదర్శి మినహా పేరున్న నటీనటులెవరూ లేరు. జబర్దస్త్ లో వేణుతో పాటు కనిపించిన కొందరు కమెడియన్లతో మాత్రం జనానికి ముఖ పరిచయం. కథా స్థలం తెలంగాణ పల్లె. కథేమో ఆ పల్లెలో జరిగే ఒక చావు. చాలా మామూలుగా మొదలై, చిన్నగా నవ్విస్తూ సాగే కథనం మనకి తెలియకుండానే సీరియస్ గా మారుతుంది. సినిమా చూస్తున్న మనం ప్రేక్షకులం అనే విషయం మర్చిపోయి, ఆ ఊళ్ళో మనుషులం అయిపోతాం. ఇంటి పెద్దని పోగొట్టుకున్న ఆ కుటుంబానికి ఊహించని సమస్య రావడంతో, దాన్నుంచి వాళ్ళు ఎలా బయట పడతారా అని కుతూహల పడతాం. మెడమీద వేలాడే 'పదిలక్షల అప్పు' అనే కత్తి బారి నుంచి కథానాయకుడు (?) ఎలా తప్పించుకుంటాడో అని ఆందోళన పడతాం. చివరికొచ్చేసరికి తెరమీద కనిపించే మిగిలిన పాత్రలతో పాటు మనం కూడా 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకుంటాం. 

ఆ పల్లెటూళ్ళో సాయిలు (ప్రియదర్శి) ఓ రైతు కొడుకు. పాతికేళ్ళు ఉంటాయి. చదువుకున్నాడు కనుక వ్యవసాయం మీద ఆసక్తి లేదు. వ్యాపారం చేయాలని కోరిక. తండ్రిది బొత్తిగా సహాయనిరాకరణ. అప్పులు చేసి మొదలు పెట్టిన వ్యాపారాలేవీ ఆ పల్లెటూళ్ళో క్లిక్కవ్వలేదు. అప్పు మాత్రం, వడ్డీలతో కలిపి పది లక్షలయ్యింది. పదిహేను లక్షల కట్నంతో పెళ్లి కుదరడం సాయిలుకి పెద్ద ఊరట. రెండు రోజుల్లో వరపూజ (ఎంగేజ్మెంట్) అనగా సాయిలు తాత కొమరయ్య హఠాత్తుగా కన్నుమూస్తాడు. ఇక, చావు చుట్టూ జరిగే రాజకీయాలు మొదలు. ముసలాయన పోయినందుకు సాయిలుతో సహా మనస్ఫూర్తిగా బాధపడేవాళ్లు ఎవరూ లేరు, సాయిలు మేనత్త లక్ష్మి పరుగున వచ్చే వరకూ. ఇరవై ఏళ్ళ తర్వాత పుట్టింట్లో అడుగు పెట్టింది ఆమె. అది కూడా, తండ్రి కడసారి చూపు కోసం. 

పెళ్ళైన తర్వాత వచ్చిన తొలి దసరా పండుగకి పుట్టింట్లో లక్ష్మి భర్త నారాయణకి, లక్ష్మి సోదరుల (సాయిలు తండ్రి, చిన్నాన్న) చేతిలో జరిగిన అవమానం ఫలితంగా ఇరవయ్యేళ్లు ఆమె పుట్టింటి గడప తొక్కలేదు. పుట్టెడు దుఃఖంతో వచ్చిన ఆమెని మనస్ఫూర్తిగా అక్కున చేర్చుకున్నది సాయిలు తల్లి మాత్రమే. నాటి అవమానాన్ని నారాయణ ఇంకా మర్చిపోలేదు. బావమరుదులూ మర్చిపోలేదు. వాళ్ళు అతన్ని కనీసం పలకరించలేదు. లక్ష్మి కూతురు సంధ్య (కావ్య కళ్యాణ్ రామ్) కి ఇదంతా కొత్త. తాతగారింటికి తొలిసారి వచ్చిందామె. అది కూడా ఇలాంటి సందర్భంలో. ఇంజినీరింగ్ చదువుకుంటోన్న ఆ అమ్మాయి జరుగుతున్న వాటిని మౌనంగా గమనిస్తూ ఉంటుంది, తప్పొప్పుల తీర్పుల జోలికి పోకుండా. 

చిన్న దినంలో కొమరయ్యకి పెట్టిన భోజనాన్ని కాకి ముట్టకపోవడంతో కథ పాకాన పడుతుంది. కాకి వస్తుంది, కొమ్మ మీద కూర్చుంటుంది తప్ప విస్తరిని కన్నెత్తి చూడదు. కొమరయ్య తీరని కోరిక ఏమిటన్నది ఎవరికీ తెలీదు. అది పల్లెటూరు కావడంతో జరుగుతున్న వాటిని ఊరు బాగానే పట్టించుకుంటూ ఉంటుంది. పదకొండో రోజున జరిగే పెద్ద దినం నాడు కూడా కాకి ముట్టకపోతే అది ఊరికి అరిష్టం. అదే కనుక జరిగితే పంచాయితీ వేసే శిక్షని ఆ కుటుంబం భరించాలి. సినిమా మొదట్లో ఏ ప్రాముఖ్యతా లేని కొమరయ్య, పోయాక కథలో ముఖ్యపాత్ర అయిపోతాడు. పోయినప్పుడు కూడా పెద్దగా మాట్లాడుకోని వాళ్ళు ప్రతి క్షణం అతన్ని తల్చుకుంటూ ఉంటారు. సాయిలు అప్పు గొడవ, బావ-బావమరుదులు ఇగో క్లాషెస్, ఇవి చాలవన్నట్టు అన్నదమ్ముల (సాయిలు తండ్రి, చిన్నాన్న) మధ్య ఆస్తి తగాదాలు. 

చాలా సీరియస్ గా వినిపించే ఈ కథని వ్యంగ్యాత్మకంగా తీశాడు వేణు. తెరమీద సీరియస్ సన్నివేశాలు నడుస్తున్నా చూస్తున్న ప్రేక్షకులకి చాలాచోట్ల నవ్వొస్తుంది, అక్కడక్కడా ఏడుపొస్తుంది. సాయిలు హీరో కాబట్టి, కుటుంబ సభ్యులందరికీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేసి, అందరినీ కలిపేసి, అవసరమైతే కాకికి కూడా పంచ్ డైలాగులతో బ్రెయిన్ వాష్ చేసేసి ముద్ద తినిపించేస్తాడేమో అని భయపడ్డాను. కానైతే, అవేవీ జరగలేదు. ఏం చేస్తే తాత ఆత్మ శాంతిస్తుందో తన వాళ్ళకి సింబాలిక్ గా చెప్పాడు. అందులో కూడా తన డబ్బు సమస్య నుంచి బయట పడే దారిని వెతుక్కున్నాడు. ఈ కథకి కీలకం లక్ష్మి పాత్ర. ఎంతో అనుభవం ఉన్న నటి వేయాల్సిన బరువైన పాత్ర. రూపాలక్ష్మి అనే ఆవిడ చాలా అలవోకగా పోషించింది. ఆ మాటకొస్తే అన్ని పాత్రలూ అంతే. పేరున్న నటులు కాకపోవడం వల్ల, పాత్రలు మాత్రమే కనిపించాయి. 

తేలికపాటి సన్నివేశాలతో కూడిన బరువైన సినిమా 'బలగం'. వేణు తన అభిరుచికి తగ్గట్టుగా ఒగ్గుకథ మొదలు అనేక తెలంగాణ కళా రూపాలని కథలో భాగం చేశాడు. క్లైమాక్స్ లో వచ్చే పాట థియేటర్లలో ఒక సామూహిక దుఃఖ ప్రకటనగా మారుతోంది. అలా తేలిక పడడంకోసమే జనం ప్రత్యేకంగా సినిమా హాళ్ళకి వెళ్ళి చూస్తున్నారేమో అనిపించింది. చావింటిలో టీల పంపిణీ మొదలు ప్రతి చిన్న విషయాన్నీ జాగ్రత్తగా కథలో భాగం చేసుకున్నాడు దర్శకుడు. రెండు గంటల సినిమాలో ఎక్కడో అక్కడ ఏదో ఒక పాత్రలో తమని తాము చూసుకోని ప్రేక్షకులు ఉండరేమో. సంగీతం, కెమెరా, ఎడిటింగ్.. ఇలా సాంకేతిక విభాగాలన్నీ వంక పెట్టడానికి వీల్లేని విధంగా పనిచేశాయి. తెలిసిన కథలా అనిపిస్తూనే, తర్వాత ఏమిటన్న కుతూహలాన్ని ఆసాంతమూ కొనసాగించింది. నేల విడిచి సామన్నది ఎక్కడా కనిపించలేదు. బహుశా, 'బలగం' విజయ రహస్యం అదేనేమో.

బుధవారం, మార్చి 22, 2023

రంగమార్తాండ

నాటకరంగం వేరు.. జీవిత రంగం వేరు..
ఏ వేషం వేస్తున్నావో  తెలిసే చోటు అది..
ఏ నిమిషం ఏం చెయ్యాలో తెలియని ఆట ఇది... 

మన దగ్గర సినిమా నటీనటులకి ఉన్నంత క్రేజ్ నాటకాల్లో నటించే వాళ్ళ విషయంలో లేక పోవడం వల్ల నాకో మేలు జరిగింది. నాటక ప్రదర్శన అయ్యాక ఆయా నటీనటులతో నేరుగా మాట్లాడే అవకాశం చాలాసార్లు దొరికింది. కొందరితో స్నేహమూ కుదిరింది. ఈ క్రమంలో నాటకానికన్నా ముందు గ్రీన్ రూమ్ కి వెళ్లి కబుర్లు చెప్పడం తెలియకుండానే అలవాటయ్యింది. వేషం వేసుకున్నప్పుడూ, పూర్తి చేశాక కూడా వాళ్ళు మామూలు మనుషులే. కానీ, ఒక్కసారి స్టేజీ ఎక్కగానే పోషించే పాత్రలుగా మారిపోతారు. నాటకం ముగిసి, వేషం తుడుచుకోడానికి మళ్ళీ గ్రీన్ రూమ్ లోకి వస్తూనే మామూలు మనుషులైపోతారు. ఈ భేదం మొదట్లో చాలా ఆశ్చర్య పరిచేది. రానురానూ అలవాటైపోయింది. 

ఈ భేదాన్ని బహు చక్కగా పట్టుకున్నారు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం. ఈ సూక్ష్మాన్ని అంతే చక్కగా తెరకెక్కించాడు కృష్ణవంశీ. 'రంగమార్తాండ' సినిమా చూస్తున్నంత సేపూ, చూడడం పూర్తయ్యాక కూడా నాకు తెలిసిన థియేటర్ ఆర్టిస్టులందరూ గుర్తొస్తూనే ఉన్నారు. 'రంగస్థల రంగమార్తాండ' రాఘవరావు పాత్రలో ప్రకాష్ రాజ్ జీవిస్తే, 'నాకు అంతకన్నా ఒక మార్కన్నా ఎక్కువ ఇవ్వాల్సిందే' అన్నంతగా మరో నటుడు చక్రపాణి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు బ్రహ్మానందం. రాఘవరావు భార్య రాజుగారు గా రమ్యకృష్ణ మూడో స్థంభం అయితే, మిగిలిన నటీనటులు, సాంకేతిక బృందమంతా కలిసి నాలుగో స్థంభం. దర్శకుడితో పాటు సంభాషణల రచయిత (ఆకెళ్ళ శివప్రసాద్), సంగీత దర్శకుడు (ఇళయరాజా), గీత రచయితలు (సిరివెన్నెల తదితరులు) కెమెరా (రాజ్ కె నల్లి), ఎడిటింగ్ (పవన్)  విభాగాలకీ క్రెడిట్ ఇవ్వాలి. 

ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ని వాడుకుని తీసిన ఈ సినిమాలో అసలు కథ రాఘవరావు రిటైర్మెంట్ తో ప్రారంభమవుతుంది. అతడు స్టేజిమీద నటించిన సీన్ ఒక్కటన్నా చూపించలేదన్న కొరతని బ్రహ్మానందం హాస్పిటల్ సీన్ కొంతవరకూ తీర్చింది. నిజానికి ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం.. వీళ్ళు ముగ్గురూ కూడా మంచి పాత్ర దొరికితే ఒళ్ళు మర్చిపోయి నటించేస్తారు. దర్శకుడు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, వీళ్ళ నటన పాత్ర పరిధిని దాటేస్తుంది. అలా దాటకుండా కృష్ణవంశీ కాసుకున్నాడు. (వీళ్ళ ముగ్గురి ముందూ శివాత్మిక నటన లౌడ్ గా అనిపించిందంటే చాలదూ, వీళ్ళు ఎంత సటిల్డ్ గా చేశారో చెప్పడానికి). గత  కొన్నేళ్లుగా కృష్ణవంశీకి తన సినిమాల్లో సందేశాలు ఇమడ్చాలన్న తపన బాగా పెరిగింది. భాష గురించి, సంస్కృతి గురించి సందేశాలని ఈ సినిమాలోనూ చేర్చాడు. వాటి నిడివి పెరిగి ప్రేక్షకులకి విసుగు రాకుండా, క్రిస్ప్ గా కట్ చేయడం ద్వారా ఎడిటింగ్ టీం కృష్ణవంశీని కాసుకుంది. 

రంగస్థల నటుల వ్యక్తిగత జీవితం అనే పాయింట్ తీసేస్తే, ఈ కథ ఏ మధ్య తరగతి ఇంట్లో అయినా జరగడానికి వీలున్నదే. కానైతే, ఈ కథలా జరగదు. అందుకు కీలకం రంగస్థల నటుల వ్యక్తిగత జీవన శైలి. ఎక్కువమందిలో కనిపించేవి భోళాతనం, మనుషుల్ని తేలిగ్గా నమ్మేసే గుణం, తమ మీద తమకి విపరీతమైన ఆత్మవిశ్వాసం, తమ జడ్జిమెంట్ తప్పక నిజమవుతుందనే నమ్మకం... రాఘవరావు కి ఉన్న ఈ లక్షణాల వల్లే అతని జీవితం ఇల్లు దాటి రోడ్డున పడింది. మొదటినుంచీ హెచ్చరిస్తూ వచ్చిన భార్య మాత్రం అతడి వెనుక గట్టిగా నిలబడింది, అతన్ని నిలబెట్టేందుకు తన శక్తినంతటినీ పోగుచేసుకుంది. సినిమా చూసే ప్రేక్షకులు రాఘవరావుని ఎలా అర్ధం చేసుకుంటారో, సినిమా వాళ్ళకి అలా అర్ధమవుతుంది. ఇందుకోసం నాటకాలతో పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. రంగస్థల రంగమార్తాండుడితో సహానుభూతి చెందగలిగితే చాలు. 


మహానటుడు ఎస్వీ రంగారావు ఆశీస్సులతో రంగస్థల నటుడిగా జీవితం మొదలు పెట్టిన రాఘవరావు, తన కొడుక్కి (ఆదర్శ్ బాలకృష్ణ) ఆ నటుడి పేరే పెట్టుకున్నాడు. కానీ అతన్ని ఎస్వీఆర్లా పెంచలేకపోయాడు. ఫలితం, భార్య (అనసూయ భరద్వాజ్) చాటు భర్తగా మిగిలిపోయాడు రంగారావు. రాఘవరావు కూతురు శ్రీ (శివాత్మిక) మాత్రం తండ్రి కళా వారసత్వాన్ని కొనసాగిస్తూ ఫ్యూషన్ మ్యూజిక్ లో భవిష్యత్తుని వెతుక్కోవడం మొదలుపెట్టింది. సహ గాయకుడు రాహుల్ (రాహుల్ సిప్లిగంజ్) ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తనకి స్వర్ణకంకణం ప్రదానం చేసిన సన్మాన  సభలోనే నటుడిగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు రాఘవరావు, చూసుకోడానికి పిల్లలు ఉన్నారన్న నమ్మకంతో. ఆ రాత్రే తన ఆస్తిపాస్తుల్ని పిల్లలకి పంచేశాడు, భార్యకి మాటమాత్రమైనా చెప్పకుండా. ఆ తర్వాత, అసలు కథ మొదలైంది. 

ఇక, చక్రపాణి (బ్రహ్మానందం)ది ఓ శాపగ్రస్త జీవితం. (అందుకే సింబాలిక్ గా కర్ణ పాత్ర వేయించాడేమో కృష్ణవంశీ). రంగస్థలం మీద రాఘవరావుని మించిన నటుడే అయినా (ఈ మాట రాఘవరావే ఒప్పుకుంటాడు), తగినంత పేరు రాక వెనుక వరసలో నిలబడిపోయాడు. వ్యక్తిగత జీవితంలో ఉన్న లోటు సరేసరి. చక్రపాణిగా బ్రహ్మానందాన్ని చూశాక 'ఇంతటి నటుడిని ఇన్నాళ్లూ కామెడీకి మాత్రమే పరిమితం చేశారే' అనిపించింది. కామెడీ తక్కువ అని కాదు, ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేసి ఉండేవాడు కదా అని. నిజం చెప్పాలంటే తెరమీద చక్రపాణి మాత్రమే కనిపించాడు, నవ్వించినప్పుడు కూడా. చక్రపాణి భార్య సుబ్బుగా జయలలిత కనిపించింది. ఆమెకి నటించే అవకాశం దొరకలేదు. 

రమ్యకృష్ణ కి తన ట్రేడ్ మార్క్ అరుపులు లేని పాత్ర. లోపల అగ్నిపర్వతాలు బద్ధలవుతున్నా, చాలా మామూలుగా కనిపించేందుకు ప్రయత్నించే ఇల్లాలిగా ఆమె బదులు మరొకరిని ఊహించలేం. "కళ్ళతోనే నటించింది" అని ఇంటర్యూలలో కృష్ణవంశీ చెబితే ఏమో అనుకున్నా కానీ, నిజమే. రాఘవరావుని పూర్తిగా అర్ధం చేసుకున్న 'రాజుగారు' ఆమె. వీళ్ళ ముగ్గురూ తెరమీద కనిపిస్తుంటే, వీళ్ళతో పాటు కనిపిస్తూ మెప్పించడం ఎవరికైనా కష్టమే. అనసూయ, శివాత్మిక, రాహుల్, ఆదర్శ్ లు కేవలం సెట్ ప్రాపర్టీలుగా మిగిలిపోకుండా తాము చేయగలిగింది చక్కగా చేశారు. తెలుగు రంగస్థల చరిత్రని సందర్భోచితంగా ప్రస్తావిస్తూ రాసిన డైలాగులు ఈ సినిమాకి అదనపు బలం. అలాగే, రంగస్థల నటుల జీవితాలు ఎలా ఉంటాయన్నదీ ప్రస్తావించారు. 

ఓ సందర్భంలో రాఘవరావు "కోట్లు సంపాదించాను, తగలేశాను" అంటాడు. ఇది అర్ధసత్యం. తెలుగునాట రంగస్థలం అంత పే చెయ్యదు. మొత్తం సంపాదన లక్షల వరకూ వెళ్లే వాళ్లే తక్కువ. అయితే, తగలేయడం మాత్రం నూటికి తొంభై మంది నటుల విషయంలో నిజం. చప్పట్లు ఇచ్చే మత్తు, ఫలితంగా మారే జీవన శైలి, ఇన్ఫీరియారిటీ - సుపీరియారిటీ కాంప్లెక్సుల మిశ్రమంగా మారే వ్యక్తిత్వం, వీటినుంచి పుట్టే నిర్లక్ష్యం.. వీటన్నంటివల్లా కావొచ్చు థియేటర్ నుంచి సంపాదించింది నిలబెట్టుకున్న వాళ్ళు బహు తక్కువ. సినిమా రంగంలోనూ ఈ సమస్య ఉన్నా, అక్కడ సంపాదన ఎక్కువ, జాగ్రత్త పరుల సంఖ్యా ఎక్కువే. ఇళయరాజా స్వయంగా పాడిన నేపధ్య గీతంతో సహా పాటలన్నీ బాగున్నాయి. 'దమిడి సేమంతి' పాట చూస్తుంటే 'సాగర సంగమం' లో 'తకిట తధిమి' గుర్తొచ్చింది అప్రయత్నంగా. 

టైటిల్స్ రన్నయ్యేప్పుడు చిరంజీవి గొంతులో 'నేనొక నటుణ్ణి' కవిత వినిపిస్తూ తెలుగు సినిమా నటుల ఫోటోలు చూపించారు. నాటకం గురించిన సినిమాలో సినిమా నటుల్ని చూపించడం ఏమిటన్నది ఒక ప్రశ్నయితే, ఎన్టీఆర్, ఏఎన్నార్లతో మొదలుపెట్టడం మరోప్రశ్న. వాళ్లకన్నా ముందు వాళ్ళయిన నారాయణ రావు, నాగయ్య లాంటి నటుల్ని ప్రస్తావించక పోవడం కృష్ణవంశీ చేయదగ్గ పని కాదు. వాళ్ళ ఫోటోలు దొరకనివీ కాదు. నటుల్ని గురించి చక్కని సినిమా తీసిన దర్శకుడికి, ఎన్టీఆర్, ఏఎన్నార్లకి ముందు కూడా తెలుగు సినిమా చరిత్ర ఉందని గుర్తు చేయాల్సి రావడం బాధాకరం. సినిమా చూసిన ప్రేక్షకుడిగా రాఘవరావుని అర్ధం చేసుకోగలిగాను కానీ, చక్రపాణిని  అర్ధం చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉందనిపిస్తోంది. చాన్నాళ్ల తర్వాత మంచి సినిమా ఇచ్చిన కృష్ణవంశీకి అభినందనలు!! (కృష్ణవంశీ రీమేక్ చేస్తున్నాడని తెలిసి మరాఠీ 'నటసామ్రాట్' చూడలేదు ఇన్నాళ్లూ, ఇప్పుడు చూస్తే తెలుగుతో పోలిక వస్తుందేమో?) 

నీ నిలయమేది.. నర్తనశాలే కాదా.. 
నీ కొలువు ఏది.. విరాట పర్వం కాదా..
ముగిసిందా నీ అజ్ఞాతవాసం ??? 

సోమవారం, మార్చి 06, 2023

గ్లాచ్చు మీచ్యూ 

అసలు పుస్తకం పేరే భలే చమత్కారంగా ఉంది కదా అనుకుంటూ చేతిలోకి తీసుకుంటే, 'నా పర్సనల్ స్టోరీలు' అనే ఆకర్షణీయమైన ఉపశీర్షిక పుస్తకాన్ని బిల్లింగ్ కౌంటర్ వైపు నడిపించింది. పుస్తకం మీద దృష్టి పడడానికి కారణమేమో కవర్ పేజీ మీద రచయిత 'జయదేవ్' పేరు మరియు పోర్ట్రైట్. జయదేవ్ కార్టూనులు తెలుగు నాట మాత్రమే కాదు, అంతర్జాతీయంగానూ పేరు పొందాయి. తెలుగు వ్యాఖ్యల కార్టూన్లు పత్రికలు చదివే తెలుగు వాళ్ళని గిలిగింతలు పెడితే, క్యాప్షన్ లెస్ కార్టూనులు అంతర్జాతీయ పోటీల్లో ఆయనకి బహుమతులు తెచ్చిపెట్టాయి. కార్టూన్ రేఖలు మాత్రమే కాదు, జయదేవ్ వాటికి రాసే వ్యాఖ్యలూ బహు పొదుపుగా ఉంటాయి. ఒక్కోసారి రెండోసారి చదువుకుని అర్ధం చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇదిగో ఈ పర్సనల్ స్టోరీలని కూడా రెండో సారి చదవాల్సిందే - అర్ధం చేసుకోడానికి కాదు, మరింతగా ఆస్వాదించడానికి. 

మద్రాసు చాకలి వీధిలో 'రేడియో కారమ్మ' మనవడిగా బాల్యాన్ని గడిపారు జయదేవ్. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మొదట రేడియో కొనుక్కున్నది వీళ్ళే కావడంతో, ఇంటి యజమానురాలి పేరు మీద 'రేడియో కారమ్మ ఇల్లు' గా పేరు స్థిరపడి పోయింది. ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ లో పని చేసే తండ్రి గారిది బదిలీల ఉద్యోగం కావడంతో, నాయనమ్మ, చిన్నాన్నల దగ్గర ఉండి చదువుకున్నారు జయదేవ్. వీళ్ళతో పాటు మేనత్త 'అనసూయమ్మఆంటీ' .. ఈవిడ దాదాపు జయదేవ్ ఈడుదే. మధ్యతరగతి మందహాసం, పైగా మద్రాసు నగరంలో.. ఇక సరదా కబుర్లకి లోటేం ఉంటుంది? వందకి పైగా ఉన్న స్టోరీలని ఒక ఆర్డర్ లో చెప్పాలనే శషభిషలేవీ పెట్టుకోలేదు రచయిత. అలాగని కొమ్మచ్చులూ ఆడలేదు. ఒక్కో స్టోరీని రెండు మూడు పేజీలకి మించకుండా క్లుప్తంగా చెబుతూనే, ఎక్కడా చర్విత చర్వణం కాకుండా జాగ్రత్త పడ్డారు. 

చిత్రకళ మీద లోపలెక్కడో ఉన్న ఆసక్తి బడి రోజుల్లో బయట పడింది. బళ్ళో మేష్టర్ల తో పాటు ఇంట్లో సభ్యులూ ప్రోత్సహించడంతో మెరుగులు దిద్దుకునే అవకాశం దొరికింది. కెరీరిజం ఊపందుకోని పంతొమ్మిది వందల యాభైల నాటి రోజులు కదా. రేఖలు సాధన చేస్తూనే, కార్టూనులు గీసి పత్రికలకి పంపడం, అవి అచ్చయ్యి పారితోషికాలు వస్తూ ఉండడం త్వరలోనే మొదలయ్యింది. కాలేజీ చదువుకు వచ్చే నాటికి, కార్టూన్ మానియార్దర్లు ఖర్చులకి సరిపోయేవి. పేరొచ్చేసినా సాధనని ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. ప్రతినెలా కార్టూనులు మీద వచ్చిన డబ్బులో కొంతభాగం డ్రాయింగ్ పేపర్లు, రంగుల కోసం, మరికొంత భాగాన్ని అంతర్జాతీయ పత్రికలు కొనడం కోసం క్రమం తప్పకుండా వెచ్చించేవారు జయదేవ్. అదిగో, ఆ పత్రికలు చదివే అలవాటే అంతర్జాతీయ కార్టూన్ రంగంలో అడుగు పెట్టడానికి దారి చూపింది. 

చదువుకున్న కాలేజీలోనే జువాలజీ డిమాన్ స్ట్రేటర్ ఉద్యోగం రావడంతో మద్రాసు వదిలి వెళ్లాల్సిన అవసరం కనిపించలేదు. కార్టూనింగ్ నే కాదు, చదువునీ విడిచిపెట్టలేదు. పులికాట్ చేపల మీద జయదేవ్ చేసిన పరిశోధన విశేషాలు ఎంత ఆసక్తిగా చదివిస్తాయో, ఆయన స్నేహితుడు పులికాట్ జలగలు మీద చేసిన పరిశోధన విశేషాలు అంతకు మించి చదివిస్తాయి. ఎంత ఘాటు విషయాన్నైనా అలవోకగా నవ్విస్తూ చెప్పడం ఆయనకి బాగా అలవాటైపోయింది మరి. సరదా సంభాషణ, స్నేహశీలత జయదేవ్ వ్యక్తిత్వంలో ప్రత్యేకతలు అనిపిస్తుంద కాలేజీలో లెక్చరర్లకు ఇళ్ల నుంచి కేరేజీలు తెచ్చే అమ్మాయికి 'క్లియోపాత్రా' అనే ముద్దు పేరు పెట్టి, ఆమెకో ప్రేమకథ సృష్టించి కార్టూన్లు వేయడం లాంటి చమక్కులు అసలు కథలో సరదాగా కలిసిపోయే కొసరు కథలు. స్టాఫ్ రూమ్ బోర్డు మీద రోజూ కార్టూన్ స్ట్రిప్ గా గీసే ఆ ప్రేమకథ కోసం లెక్చరర్లందరూ ఎదురు చూసేవారట. 

చిత్రకారులు, కార్టూనిస్టులు అందరితోనూ స్నేహం చేసి, దాన్ని నిలబెట్టుకున్నారు జయదేవ్. చిన్నా పెద్దా భేదాలు చూడలేదు. తనకి కావాల్సిన విషయాలు నేర్చుకోడానికి, తనకి తెలిసినవి నేర్పడానికి వెనకాడలేదు. ఆ అనుభవాలని అక్షరబద్ధం చేయడంలో ఎక్కడా ఆత్మస్తుతికి, పరనిందకీ చోటివ్వలేదు. (ఈమధ్యే మరో చిత్రకారుడి పరనిందా పూరితమైన ఆత్మకథ - బాలి 'చిత్రమైన జీవితం' - చదివానేమో, ఈ పుస్తకం మరింత హాయిగా అనిపించింది. సెన్సారు బోర్డు సభ్యుడిగా పనిచేసిన నాటి విశేషాల మొదలు, బాపూ-రమణల టెలిస్కూల్ పాఠాల కబుర్ల వరకూ ఏళ్ళ నాటి ముచ్చట్లని హాయిగా చెప్పారు. కార్టూనిస్టులందరినీ ఏకతాటి మీదకి తెచ్చి సభలు నిర్వహించడం లాంటి కబుర్లు ఆసక్తిగా అనిపించాయి. మద్రాసు జీవితం, తరచూ వచ్చే అనారోగ్యాలు, వాటికి చేయించుకునే వైద్యాలు లాంటి బరువైన విషయాలని కూడా తేలిగ్గా చెప్పారు. 

ముందుమాట రాసిన మాలతీ చందూర్ (ఈ పుస్తకం తొలి ముద్రణ 2009) "వీరేశలింగం గారి 'స్వీయ చరిత్ర', గురజాడ వారి డైరీలు, శ్రీపాద వారి 'కథలు-గాధలు' ..." అంటూ జాబితా రాశారు. 'కథలు-గాధలు' రచన శ్రీపాద వారిది కాదు, చెళ్ళపిళ్ళ వారిది. ప్రకాశకులైనా సరిదిద్ది ఉంటే బాగుండేది. కాస్త తక్కువగా నాలుగొందల పేజీలున్న ఈ పుస్తకంలో ప్రతి స్టోరీకీ జయదేవ్ స్వయంగా వేసుకున్న రేఖా చిత్రం ప్రత్యేక ఆకర్షణ. ఆపకుండా చదివించే కథనం, శైలి. జయదేవ్ జీవితంతో పాటు, తెలుగునాట కార్టూన్ పరిణామ క్రమాన్ని గురించి కూడా రేఖా మాత్రపు అవగాహనని ఇచ్చే రచన ఇది. (వియన్నార్ బుక్ వరల్డ్, చౌడేపల్లి, చిత్తూరు వారి ప్రచురణ. వెల రూ. 250). 

శుక్రవారం, ఫిబ్రవరి 03, 2023

'కళాతపస్వి' విశ్వనాథ్ ...

సుమారు పదేళ్ల క్రితం అనుకోకుండా ఓ అవకాశం వచ్చింది. దర్శకుడు కె. విశ్వనాథ్ తో దాదాపు ఓ గంటసేపు తాపీగా మాట్లాడే అవకాశం వస్తుందని అంతకు ముందెప్పుడూ ఊహించలేదు. అప్పటికి 'శుభప్రదం' సినిమా విడుదలయ్యింది. అంతబాగా ఆడలేదు. అంతకు ముందు వచ్చిన 'స్వరాభిషేకం' సినిమాకి జాతీయ అవార్డు వచ్చినా జనం మెచ్చలేదు. విమర్శకుల ప్రశంసలూ దక్కలేదు. ఈ నిరాశ కొంత, వయోభారం మరికొంత కలిసి అప్పటికే దర్శకత్వానికి, నటనకి దూరం జరిగారు. అయితే ఊహించని కొత్త కెరీర్ అవకాశం ఒకటి ఆయన తలుపు తట్టింది. వాణిజ్య ప్రకటనలకి మోడలింగ్ చేయడం అప్పట్లోనే మొదలు పెట్టారు. నేనేమో 'శుభప్రదం' మీద పెద్దగా అంచనాలు పెట్టుకోకపోడానికి కారణం, 'స్వరాభిషేకం' తీవ్రంగా నిరాశ పరచడమే. పైగా, ఇప్పటికీ చక్కని మ్యూజిక్ ఆల్బమ్ అది. 

"శంకరాభరణం నాటికి మీరు నటులు కాదు కానీ, ఒకవేళ శంకర శాస్త్రి పాత్ర మీరే వేసి ఉంటే ఆ సినిమా ముగింపు మరోలా ఉండేదేమో కదా" అన్న నా ప్రశ్న కారణంగానే 'హలో' తో ఆగిపోవాల్సిన సంభాషణ చాలాసేపు సాగింది. "అంటే మీ ఉద్దేశం, స్వరాభిషేకం క్లైమాక్స్ లో అన్న పాత్రని చంపేసి ఉండాల్సిందనా?" సూటిగానూ, స్పష్టంగానూ అడిగారు విశ్వనాథ్. నేనూ నీళ్లు నమల దలచుకోలేదు. ఫోటోల కోసం తన దగ్గరికి రాబోతున్న వాళ్ళని  ఆగమని చే సైగ చేశారు. ఏయే నిజజీవిత సంఘటలని ఆధారం చేసుకుని ఆ కథ రాసుకున్నారో ఆయన చెబితే, ప్రేక్షకుడిగా నా అభ్యంతరాలని నేను చెప్పాను. ఉన్నట్టుండి, "మీకిష్టమైన నా సినిమా ఏమన్నా ఉందా?" అని అడిగారు. "చాలా ఉన్నాయండి.. మొదటిది సాగర సంగమం" చెప్పాన్నేను. 

ఈ పదేళ్లలోనూ నాటి సంభాషణని చాలాసార్లు గుర్తు చేసుకున్నాను. మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో 'ఫిలిం అప్రిసియేషన్' తక్కువ అన్నది ఆయన ఫిర్యాదు. "మీరు, బాపూ గారు, వంశీ గారు సినిమాలు తీయకపోతే కలర్ సినిమాల్లో మనకి కమర్షియల్ మాత్రమే మిగిలేవేమో " అన్నాను సిన్సియర్ గానే. "వంశీ నాదగ్గర పనిచేశారు, 'శంకరాభరణం' సినిమాకి" అన్నారు. "అవునండి, సినిమా నవల రాశారు కదా" అని, సోమయాజులు కాళ్ళకి కొబ్బరినూనె రాసి నడిపించిన సీన్ గుర్తుచేశాను. సంతోషపడ్డారు. ఒక్క 'స్వరాభిషేకం' టాపిక్ లో అసంతృప్తి తప్ప, మిగిలిన సినిమాల గురించి ఇష్టంగా మాట్లాడారు ('సీతామాలక్ష్మి' మాత్రమే మినహాయింపు). రిలీజుకి నోచుకోని 'సిరిమువ్వల సింహనాదం' గురించి, తీయకుండా ఉండాల్సింది అనిపించే 'జననీ జన్మభూమి' 'చిన్నబ్బాయి' లాంటి సినిమాల గురించీ నేను మాట్లాడినా అభ్యంతర పెట్టలేదు. "కొన్ని అలా జరుగుతూ ఉంటాయి, అంతే" అని మాత్రమే అన్నారు. 

Google Image

సంభాషణ మొదలైన కొంతసేపటికి 'స్వరాభిషేకం' విషయంలో కొంచం కటువుగా మాట్లాడనేమో అనే గిల్ట్ మొదలైంది. బహుశా అందుకే కావొచ్చు, ఆయన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సీన్లని ప్రస్తావించాను. 'స్వాతిముత్యం' లో రాధికకి పెళ్లి చేసుకుని వచ్చిన కమల్, నిర్మలమ్మ మరణాన్ని పట్టించుకోకుండా, వరలక్ష్మితో "చిట్టీ, ఆకలేస్తోంది.. అన్నం పెట్టవా" అన్నప్పుడు రాధిక ఇచ్చిన ఎక్స్ప్రెషన్, 'స్వాతికిరణం' లో మమ్ముట్టిలో అసూయ పెరిగే క్రమం.. ఇలాంటివన్నీ శ్రద్ధగానూ, సంతోషంగానూ విన్నారు. చిన్న చిన్న న్యూయాన్సెస్ ని పట్టించుకుని కేప్చర్ చేసే శ్రద్ధ నాకు భలే ముచ్చటగా అనిపిస్తుంది. 'శుభలేఖ' లో సుమలత కళ్ళజోడు, 'సప్తపది' లో డబ్బింగ్ జానకి స్నానం చేసొచ్చి, బొట్టు దిద్దుకున్నాక మాత్రమే సోమయాజులు ప్రశ్నకి జవాబివ్వడం ఇలాంటివన్నీ. వీటిలో చాలా సంగతుల్ని ఆవేళ చెప్పనే లేదు. 

'సిరిసిరిమువ్వ' సినిమా రాకపోయి ఉంటే, విజయం సాధించకపోయి ఉంటే, గత శతాబ్దపు ఎనభయ్యో దశకం నుంచి తెలుగు సినిమా  పూర్తిగా 'కమర్షియల్' బాటలోనే సాగి ఉండేదన్నది నిర్వివాదం. 'సిరిసిరిమువ్వ' విజయం, విశ్వనాథ్ కి ప్రయోగాత్మక సినిమాలు తీసే ధైర్యాన్నిస్తే, ఆయా సినిమాల విజయాలు మిగిలిన దర్శక నిర్మాతలు 'డిఫరెంట్' సినిమాలు తీయడానికి దోహదం చేశాయి. కొన్ని చెప్పుకోదగిన సినిమాలొచ్చాయి. సినిమా రంగానికి వేటూరిని, సిరివెన్నెలని పరిచయం చేసి సినిమా సాహిత్యం పదికాలాల పాటు నిలవడానికి తనవంతు కాంట్రిబ్యూట్ చేశారు విశ్వనాథ్. 'సర్గం' తో జయప్రదని జాతీయ స్థాయి కథానాయికగా మలిచారు. 'శంకరాభరణం' తర్వాత పెరిగిన సంగీతం క్లాసుల గురించీ, 'సాగర సంగమం' తర్వాత మొలిచిన డేన్సు స్కూళ్ల గురించీ ఎంత చెప్పుకున్నా తక్కువే. 

నిండు జీవితాన్ని చూశారు విశ్వనాథ్. వ్యక్తిగా మాత్రమే కాదు, దర్శకుడిగా ఆయన కెరీర్ కీ ఈ మాట వర్తిస్తుంది. ఓ దర్శకుడు తీసిన మొత్తం సినిమాల్లో కాలానికి నిలిచే వాటి శాతం అనే లెక్కవేస్తే, తెలుగు దర్శకుల జాబితాలో విశ్వనాథ్ ముందుంటారు. దర్శకుడిగా స్థిరపడి, ఆపై తనకంటూ ఓ మార్గాన్ని నిర్మించుకుని, చివరికంటా అదే మార్గంలో ప్రయాణం చేశారు. ఆ మార్గంలో ప్రయాణం అంత సులువైనదేమీ కాదనడానికి, ఇంకెవరూ ఆ దారి తొక్కే సాహసం చేయలేకపోడాన్ని మించిన ఉదాహరణ అవసరం లేదేమో. విశ్వనాథ్ కృషికి తగ్గ గౌరవం, గుర్తింపు జీవించి ఉండగానే దొరికాయి. భిన్నమైన సినిమాలు తీసినా వాటికి లభించిన ప్రేక్షకాదరణే నిజానికి అతిపెద్ద పురస్కారం. హిట్, ఫ్లాపు లకి అతీతంగా ఆయనతో సినిమా చేయడమే గౌరవంగా నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే కాక నిర్మాతలు కూడా భావించడానికి మించిన అవార్డు ఏదన్నా ఉంటుందా? తెలుగు సినిమా చరిత్రలో ప్రస్తావించి తీరాల్సిన వ్యక్తిగా తనని తాను తీర్చిదిద్దుకున్న కళాతపస్వి ఆత్మకి శాంతి కలగాలి.

శుక్రవారం, జనవరి 27, 2023

జమున ...

కొన్నేళ్ళ క్రితం కాకినాడ నుంచి సామర్లకోట వైపు వెళ్తుంటే దారిలో కుడివైపున 'జమున నగర్' అని బోర్డు కనిపించింది. అనుకోకుండా పైకే చదివాను. "హీరోయిన్ జమునా గారున్నారు కదండీ.. ఆరు తోలు బొమ్మలాట ఆడేవోళ్ళందరికీ ఇళ్ళు కట్టిచ్చేరండిక్కడ.. నూటేబై గడప పైగానే ఉంటాదండి.. ఆల్లందరూ ఊరికి ఆవిడ పేరే ఎట్టేరండి" అడక్కపోయినా వివరం చెప్పాడు కారు డ్రైవరు. బహుశా, రాజమండ్రి ఎంపీ గా పనిచేసిన కాలంలో కట్టించి ఉండొచ్చు అనుకున్నాను. కానైతే, ఇలాంటి కథే సూర్యాపేట (తెలంగాణ) దగ్గరా వినిపించింది. అక్కడ కూడా జమున నగరే, నివాసం ఉండేది రంగస్థల కళాకారులు. కనుక్కుంటే తెలిసిందేమిటంటే, సినిమా జీవితం నుంచి విశ్రాంతి తీసుకుని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాడానికి పూర్వం 'రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య' ని ఏర్పాటు చేయడమే కాకుండా, ఆ కళాకారుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసింది జమున. 

సినిమా వాళ్లలో, మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన సినిమా వాళ్లలో, కళాకారుల సమస్యలు అనే విషయాన్ని గురించి మాట్లాడని వాళ్ళు అరుదు. అంతే కాదు, నిజంగా వాళ్ళ సమస్యల్ని పట్టించుకుని, చేతనైన తోవ చూపేవాళ్ళూ అరుదే. ఈ రెండో రకానికి చెందిన అరుదైన తార జమున. అందుకేనేమో, ఆమె మరణ వార్త తెలియగానే ముందుగా జమునా నగర్ గుర్తొచ్చింది, ఆ వెనుక మాత్రమే ఆమె పోషించిన వెండితెర పాత్రలు జ్ఞాపకానికి వచ్చాయి. నటిగా తాను తొలిఅడుగులు వేసిన రంగస్థలాన్ని మాత్రమే కాదు, సినిమాయేతర కళారూపాలన్నింటినీ శ్రద్ధగా పట్టించుకుని, వాటినే నమ్ముకున్న కళాకారుల కోసం తాను చేయగలిగింది చేసి చూపించింది జమున. ఇళ్ళు కట్టించడం మాత్రమే కాదు, వాళ్ళకి ప్రదర్శనలు ఇప్పించడానికీ చొరవ చూపిందట!

'జమునాతీరం' పేరిట ఆమె రాసుకున్న ఆత్మకథని చదవడం తటస్థించింది కొన్నాళ్ల కిందట. తన పితామహులది దుగ్గిరాలకి చెందిన వ్యాపార కుటుంబమని, మాతామహులు విజయనగర సంస్థానంలో కళాకారులనీ రాసుకున్నదామె. "ఈమె మాతామహుల కాలానికి ముందే విజయనగర సంస్థానం శిధిలం అయిపోయింది కదా?" అని సందేహం నాకు. బహుశా, మాతామహుల తాలూకు పూర్వులు అయి ఉంటారనుకున్నాను. అలా మాతామహుల ఇంట హంపీ విజయనగరంలో పుట్టి, 'హంపీ సుందరి' అనే సార్ధక నామధేయాన్ని సాధించుకుంది జమునా బాయి (చిన్నప్పటి పేరు).  బాలనటిగా కొంగర జగ్గయ్యతో కలిసి స్టేజి డ్రామా వేయడం, ఆ సందర్భంలో జగ్గయ్యాదులని మూడు చెరువుల నీళ్లు తాగించడం లాంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి ఆ పుస్తకంలో. 

కాంగ్రెస్ టిక్కెట్టు మీద 1989 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు సీటుకి పోటీ చేసినప్పుడు, గోడలమీది ఎన్నికల అభ్యర్ధనల్లో 'మీ సోదరి జమున రమణారావు' అని ప్రస్ఫుటంగా కనిపించేది. రాజకీయాలు ఎంతపని చేస్తాయి!! పార్టీ పెట్టడానికి ముందు రోజు వరకూ మహిళల కలల రాకుమారుడైన ఎంటీఆర్ ఒక్కసారిగా 'అన్నగారు' అయిపోయినట్టుగా, డ్రీం గర్ల్ జమున (సినిమాలు విరమించుకున్న చాలా ఏళ్ళ తర్వాత) సోదరిగా మారిపోయింది. ఆ ఎన్నికల ప్రచార సభల్లో "ఎంటీఆర్ ని నేను కాలితో తన్నాను" అని ఆమె పదేపదే చెప్పుకోడాన్ని అన్నగారి అభిమానులు తప్పట్టుకున్నారు. "ఎంటీఆర్ కాళ్ళకి ఈవిడ ఎన్నిసినిమాల్లో దణ్ణం పెట్టలేదూ?" అన్న ప్రశ్నలూ వచ్చాయి. ఆ ఎన్నికల్లో గెలిచి లోక్ సభ సభ్యురాలు అయినప్పటికీ, తర్వాతి కాలంలో రాజకీయాలు కలిసిరాలేదామెకి. 

కాలితో తన్నడం సినిమా షూటింగ్ లో భాగమే అయినా, ఎంటీఆర్, ఏఎన్నార్ల గర్వాన్ని తన్నిన ఘనత మాత్రం జమునదే. విధేయంగా ఉండదన్న వంక చెప్పి జమున మీద నాటి ఈ అగ్రహీరోలిద్దరూ నిషేధం పెట్టించినప్పుడు, హరనాథ్ లాంటి హీరోలని ప్రోత్సహించి వాళ్లతో సినిమాలు చేసి హిట్లు కొట్టింది తప్ప, వాళ్లిద్దరూ ఊహించినట్టు కాళ్ళ బేరానికి వెళ్ళలేదు. సినిమా నటుల్లో, ముఖ్యంగా నటీమణుల్లో, ఇప్పటికీ అరుదుగా కనిపించే లక్షణం ఈ స్వాభిమానం. ఈ స్వాభిమానమే ఆమె సత్యభామ పాత్రని రక్తి కట్టించడానికి దోహదం చేసిందేమో. చిన్న హీరోలతో చేసినా ఆ సినిమాలు హిట్ అవ్వడం, ఆమె స్టార్డం తగ్గకపోవడంతో ఆ పెద్ద హీరోలే మెట్టు దిగాల్సి వచ్చింది. తెలుగు సినిమా చరిత్రలోనే దీన్నో అరుదైన సంఘటనగా చెప్పుకోవాలి. 

సినిమాలు విరమించుకోడానికి కొంచం ముందుగా ఓ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో గాయపడింది జమున. త్వరగానే కోలుకున్నా, మెడ వణుకు మిగిలిపోయింది. ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చేనాటికి వయోభారం మీద పడడం వల్ల కాబోలు, ఆ వణుకుని చివరి వరకూ భరించిందామె. ఒకవేళ ఆ సమస్య రాకుండా ఉండి ఉంటే మిగిలిన నటీమణుల్లాగే ఆమె కూడా అమ్మ/అత్త పాత్రలకి ప్రమోటయి ఉండేదా? బహుశా నటనకి దూరంగానే ఉండేదేమో అనిపిస్తుంది నాకు. ప్రేక్షకుల దృష్టిలో కథానాయికగానే ఉండిపోవాలన్నది ఆమె నిర్ణయం అయి ఉండొచ్చు. కేవలం తెరమీద పోషించిన పాత్రలకు మాత్రమే కాదు, జీవించిన విధానం వల్లకూడా జమున అనగానే కథానాయికే గుర్తొస్తుంది. ఆమె ఆత్మకి శాంతి కలగాలి. 

గురువారం, జనవరి 26, 2023

ఆశాకిరణం

"భరించలేని దుఃఖం ఆవహించినప్పుడు మనిషి పిచ్చివాడైనా అవుతాడు, తత్వవేత్త అయినా అవుతాడు" - గొల్లపూడి మారుతిరావు 'సాయంకాలమైంది'. అంతకు మించి కూడా కావొచ్చనునని నిరూపించిన వ్యక్తి డాక్టర్ చంద్రశేఖర్ సంకురాత్రి, సంఘసేవకు గాను భారత ప్రభుత్వం నుంచి 'పద్మశ్రీ' పురస్కారానికి ఎంపికయ్యారు. ఎనభయ్యేళ్ళ చంద్రశేఖర్, తన ఆత్మకథని 'ఆశాకిరణం' పేరిట ప్రచురించారు నాలుగేళ్ల క్రితం. సంకురాత్రి ఫౌండేషన్, శ్రీకిరణ్ కంటి ఆస్పత్రి, శారద విద్యాలయం ద్వారా కోస్తాంధ్ర ప్రజలకి, మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాల వాళ్ళకి  చంద్రశేఖర్ పేరు చిరపరిచితం. అయితే ఏ పరిస్థితులు ఆయనని కెనడాలో సౌకర్యవంతమైన జీవితం వదులుకుని కాకినాడ శివార్లకి వచ్చి సంఘ సేవ మొదలుపెట్టేలా చేశాయో 'ఆశాకిరణం' పుస్తకం వచ్చే వరకూ చాలామందికి తెలియదు. 

రాజమండ్రిలో గోదారి ఒడ్డున పుట్టి పెరిగారు చంద్రశేఖర్. తండ్రి నాటి బ్రిటిష్ రైల్వే లో స్టేషన్ మాస్టర్. పదకొండు మంది సంతానంలో ఈయన చివరివాడు. బాల్యం వైభవంగానే గడిచినా త్వరలోనే కష్టాలు చుట్టుముట్టాయి. తల్లి మరణం, తండ్రి పదవీ విరమణ కారణంగా ఆర్ధిక సమస్యలు.. వీటన్నింటినీ చిన్ననాడే చూడాల్సి వచ్చింది. సోదరుల సహాయంతో ఎమ్మెస్సీ పూర్తి చేశాక పరిశోధన రంగానికి వెళ్లాలన్న అభిలాష పెరిగింది. అయితే, ఎమ్మెస్సీ చదివిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తనకి రావాల్సిన యూనివర్సిటీ ఫస్ట్ మరొకరికి వెళ్లిందని రూఢిగా తెలియడంతో అక్కడ మాత్రం చేరకూడదని బలంగా నిర్ణయించుకోడంతో చంద్రశేఖర్ అడుగులు కెనడా వైపు పడ్డాయి. జీవితంలో అదొక మేలు మలుపు. 

పరిశోధన పూర్తి చేసి, ఉద్యోగంలో కుదురుకున్నాక పెద్దలు కుదిర్చిన మంజరి ని వివాహం చేసుకుని కెనడా తీసుకెళ్లారు. మొదట అబ్బాయి శ్రీకిరణ్, తర్వాత అమ్మాయి శారద జన్మించారు. సాఫీ సాగిపోతున్న వాళ్ళ జీవితంలో పెద్ద కుదుపు విమాన ప్రమాదం రూపంలో వచ్చింది. ఎయిర్ ఇండియా కనిష్క విమానం పై జరిగిన ఉగ్రవాద దాడిలో మంజరి, పిల్లలు మరణించారు. "ఈ సంఘటన జరిగిన తదుపరి నెలల్లో కష్టాల కడలిలో కొట్టుమిట్టాడిన జీవితం గురించి నేను వర్ణించలేను.  ఆ సమయంలో నా జీవిత సరళి ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుండేది. ఒకటి బాహ్య ప్రపంచం - అక్కడ మామూలుగానే మాట్లాడుతుండే వాడిని, తింటుండే వాడిని, అందరిలాగే పని చేసుకునే వాడిని. రెండవది లోపలి ప్రపంచం. కన్నీళ్లు, శూన్యం తోడు-నీడగా నిరంతరం నన్ను ఆవహించి ఉండేవి". 

కొన్నాళ్ల తర్వాత కెనడాని వదులుకుని ఇండియాకి తిరిగి వచ్చేశారు చంద్రశేఖర్. తాను పుట్టిపెరిగిన రాజమండ్రి కాకుండా, మంజరి స్వస్థలమైన కాకినాడని కార్యక్షేత్రం చేసుకున్నారు. "కూలు కెళ్తా" అని ఆడుకోడమే తప్ప, కనీసం బడిలో చేరని శారద పేరు మీద శారదా విద్యాలయం స్థాపించారు మొదట. అటుపైన శ్రీకిరణ్ పేరుతో కంటి ఆస్పత్రి. వీటి నిర్వహణ కోసం సంకురాత్రి ఫౌండేషన్ పేరుతో స్వచ్చంద సంస్థ మొదలుపెట్టారు. తొలుత కెనడా స్నేహితుల విరాళాలతో మొదలైన సేవా కార్యక్రమాలు క్రమంగా విస్తరించి, అంతర్జాతీయ ఫండింగ్ సంస్థల దృష్ణిలో పడడంతో నిధుల సమస్య తీరి సేవా కార్యక్రమాల విస్తరణ సాధ్యమైందని రాసుకున్నారు తన ఆత్మకథలో. 

అయితే ఈ ప్రయాణం సులువుగా ఏమీ సాగిపోలేదు. ఇక్కడి బ్యూరోక్రసీ తలపెట్టిన ప్రతి పనికీ మోకాలడ్డింది. ఎదురుపడ్డ కొందరు మనుషులు, "వెనక్కి కెనడా వెళ్ళిపోతే" అనే ఆలోచన వచ్చేలా చేశారు చాలాసార్లు. కానైతే, తన లక్ష్యం మీద స్పష్టత ఉంది చంద్రశేఖర్ కి. విద్య, వైద్య రంగాల్లో చేయాల్సింది చాలా ఉందన్న భావన ఆయన్ని గట్టిగా నిలబడేలా చేసింది. చెడు పక్కనే మంచినీ, స్వార్థపరుల పక్కనే సహాయం చేసే వారిని కూడా చూశారు. బంధు మిత్రుల ప్రోత్సాహంతో, దాతల సహకారంతో విద్య, ఆరోగ్య రంగాల్లో తన సేవలని క్రమంగా విస్తరించారు. ఆలస్యంగానే అయినా, ఈ సేవలని గుర్తించి ప్రభుత్వం 'పద్మశ్రీ ' అవార్డుని ప్రకటించడం హర్షణీయం. 

నిజానికి 'ఆశాకిరణం' తెలుగులో రాసిన పుస్తకం కాదు. చంద్రశేఖర్ 'రే ఆఫ్ హాప్' పేరిట ఇంగ్లిష్ లో రాసిన పుస్తకానికి తెలుగు అనువాదం. పుస్తకం క్లుప్తంగానూ, అనువాదం సరళంగానూ ఉన్నాయి. మొత్తం తొమ్మిది అధ్యాయాల్లో తొలి మూడు అధ్యాయాల్లో వ్యక్తిగత విషయాలని పంచుకున్నారు. నాలుగో అధ్యాయం విమాన ప్రమాదానికి సంబంధించింది కాగా, అటుపైన వచ్చే అధ్యాయాలన్నీ సేవా కార్యక్రమాల స్థాపన, విస్తరణని విపులంగా చెప్పినవే. స్థాపన, విస్తరణకి సంబంధించి ప్రతి దశనీ వివరంగా చెప్పారు. అదే సమయంలో తన భార్యని బిడ్డలనీ పుస్తకం ఆసాంతమూ స్మరిస్తూనే ఉన్నారు. సంకురాత్రి ఫౌండేషన్ ప్రచురించిన ఈ 148 పేజీల పుస్తకం వెల రూ. 100. ప్రతుల కోసం info@srikiran.org ని సంప్రదించవచ్చు. 

మంగళవారం, జనవరి 24, 2023

పద్నాలుగు ...

గట్టి పట్టుదలతో ఏడాదిని మొదలుపెట్టి, కొన్నాళ్ళపాటు ఆ పట్టుదలని కొనసాగించి, నెమ్మది నెమ్మదిగా జారిపోవడం అన్నది బ్లాగింగ్ విషయంలో అనుభవం అయ్యింది గడిచిన ఏడాది కాలంలో. మళ్ళీ ఇప్పుడిప్పుడే 'బ్యాక్ ఆన్ ట్రాక్' అనుకోగలిగే పరిస్థితులు కనిపిస్తూ ఉండడం సంతోషదాయకం. బ్లాగరుగా పద్నాలుగేళ్ళ పూర్తి చేసుకుని పదిహేనో ఏట అడుగు పెట్టబోతున్న సమయంలో చేసుకుంటున్న స్వీయ విశ్లేషణ ఇది. ఎప్పటిలాగే రాయాలనుకున్నవన్నీ రాయలేకపోవడం, చదవల్సినవి చదువకుండా పెండింగ్ పెట్టడమే గడిచిన ఏడాదీ జరిగింది. మునుపటితో పోలిస్తే చాన్నాళ్ల తర్వాత రాశి కాస్త కనిపిస్తూ ఉండడం వల్లనేమో ఈసారి సింహావలోకనంలో హింస పాళ్ళు కనిపించడం లేదు నాకు. 

కరోనా భయాల నుంచి అందరూ నెమ్మది నెమ్మదిగా కోలుకుంటున్నట్టే ఉంది పరిస్థితి. ఇదిగో వేరియంట్ అదిగో వేవ్ అనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నా పరిస్థితులు చక్కబడడం తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఊళ్లు తిరిగే వాళ్ళకి కాస్త వెసులుబాటుగా ఉంటుంది. ఆందోళనల నుంచి ఉపశమనం దొరికితే వ్యాపకాల వైపుకి దృష్టి మళ్లుతుంది. గతేడాదితో చాలామంది టూర్లు పోస్టుపోన్ చేసుకున్నాం అని చెప్పిన వాళ్ళే. కరోనా వల్ల జరిగిన మెలేమైనా ఉందా అంటే ఓటీటీ ప్లాట్ ఫారాలు మరింత దగ్గరయ్యాయి. పరభాషా సినిమాలని పరికించే వీలు దొరికింది. బాగుంటుంది అనిపిస్తే తప్ప సినిమా కోసం థియేటర్ కి వెళ్లాల్సిన అగత్యమూ తప్పింది. మలయాళం, మరాఠీ భాషల్లో వస్తున్న సినిమాలు మిగిలిన వాటికన్నా ప్రత్యేకంగా ఉండి ఆకర్షిస్తున్నాయి. 

Google Image

గమనించిన సంగతేమిటంటే తెలుగు సినిమా వాళ్ళు నటీనటుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. అటు మలయాళీలు కానీ ఇటు మరాఠీలు కానీ నటులకు వెచ్చించే దానికి సరిసమానంగా కథ, సంగీతం కోసం వెచ్చిస్తారు. మొత్తంగా చూసినా వాళ్ళ సినిమాల బడ్జెట్ మన వాటిలో నాలుగో వంతు కూడా ఉండదు. ఖర్చు నేలమీద ఉండడం వల్లనేమో కథలూ నేలమీదే నడుస్తాయి. ఫోటోగ్రఫీలో మలయాళీలని (లొకేషన్లు వాళ్ళకి భలే ప్లస్ పాయింట్), నేపధ్య సంగీతంలో మరాఠీలనీ కొట్టేవాళ్ళు లేరు అనిపించింది కొన్ని సినిమాలు చూశాక. అసలు మరాఠీలు ఇంత ప్రోగ్రెసివ్ అని వాళ్ళ సినిమాల వల్లే తెలిసింది.  సినిమాలు చూడ్డం బాగానే ఉంది కానీ, ఇవి కాస్తా చదువు, రాత టైంని తినేస్తున్నాయి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని హిందీ సామెత ఉంది కదా. 

థియేటర్ కి వెళ్లి చూసినవి రెండే సినిమాలు. 'సీతారామం' మొదటిది, కన్నడ 'కాంతార' రెండోది. 'కాంతార' ఎక్కువగా నచ్చింది, పల్లెటూరి మట్టివాసన ప్రభావం కాబోలు. పుస్తకాల్లో కూడా కన్నడ నుంచి అనువాదం అయి వస్తున్న కథలు, నవలలు భలే ప్రత్యేకంగా ఉంటున్నాయి. 'తూఫాన్ మెయిల్' సంపుటిలో కథలు చాలారోజులు వెంటాడాయి. అన్నట్టు ఈ బ్లాగు వెయ్యిపోస్టుల మైలు రాయిని దాటింది గతేడాదిలోనే. ఆ సందర్భం కోసం 'వేయిపడగలు' మళ్ళీ చదవడం, అనుకోకుండా ఆ వెంటనే 'వేయిపడగలు నేడు చదివితే' అనే వ్యాసాల సంపుటి చదవడం తటస్థించాయి. విశ్వనాథ నవలల్లో 'ఏకవీర' ఎక్కువ ఇష్టం నాకు. కానీ, 'వేయి పడగలు' ని ప్రస్తావించకుండా తెలుగు సాహిత్యం అసంపూర్ణం అనిపించే స్థాయిని సాధించుకున్నది. ఈసారి చదివినప్పుడు నాకు ధర్మారావు మీద ఫిర్యాదుల సంఖ్య కాస్త తగ్గింది. 

వాళ్ళ సినిమాల ద్వారా మన కుటుంబ సభ్యులుగా మారిపోయిన కృష్ణంరాజు, కృష్ణ, సత్యనారాయణ కొద్దిరోజుల తేడాలో వెళ్లిపోయారు. ముగ్గురూ దాదాపు నిండు జీవితం గడిపిన వాళ్లే. ఫిర్యాదులు లేకుండా (అవార్డులు రాలేదు వగయిరా) బతికేసిన వాళ్ళే. ముగ్గురూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన వాళ్ళే అయినా, కృష్ణంరాజుని పెద్దపదవులు వరించాయి - అదికూడా పెద్దగా కృషి లేకుండా. 'ప్రాప్తం' అనేది ఇలాంటి విషయాల్లో పనిచేస్తుందేమో. ఎలాంటి పరిష్కారమూ లేకుండా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. శ్రీలంక ఆర్ధిక సంక్షోభానికి ఇంకా ఇదమిద్ధమైన పరిష్కారం ఏదీ దొరికినట్టు లేదు. ఆ ప్రకారంగా కాలచక్రం గిర్రున తిరిగింది. సగటున వారానికో పోస్టుని ఈ బ్లాగు నమోదు చేసింది. ఈ అంకెని కాస్త పెంచాలని ఎప్పటిలాగే ఇప్పుడూ అనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన ఈ సందర్భంలో మీ అందరికీ థాంక్స్ చెప్పకుండా ఈ టపాని ముగించేదెలా... 

మంగళవారం, జనవరి 10, 2023

వాళ్ళు పాడిన భూపాలరాగం

ఆధునిక తెలుగు సాహిత్యంలో 'కాలాతీత వ్యక్తులు' నవలది ఓ ప్రత్యేక స్థానం. ఈ నవల రాయడం కోసమే జన్మించారా అనిపించేలా రచయిత్రి డాక్టర్ పి. శ్రీదేవి పిన్నవయసు లోనే మరణించారు. 'కాలాతీత వ్యక్తులు' మినహా ఆమె రచనలు మరేవీ ప్రింట్ లో అందుబాటులో లేకపోవడం వల్ల కావొచ్చు, ఆమె ఆ ఒక్క రచనే చేశారన్న ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. ఆ ప్రచారానికి తెరదించుతూ, శ్రీదేవి రాసిన పన్నెండు కథల సంకలనాన్ని 'వాళ్ళు పాడిన భూపాలరాగం' పేరుతో ప్రచురించారు శీలా సుభద్రాదేవి. కథల్ని సేకరించి, సంకలనానికి సంపాదకత్వం వహించడం మాత్రమే కాదు, ఈ పన్నెండుతో పాటు శ్రీదేవి రాసిన కథలు మరో ఎనిమిది వరకూ ఉండవచ్చుననీ, వాటిని సేకరించే ప్రయత్నంలో ఉన్నాననీ చెప్పారు తన ముందుమాటలో. 

ఈ కథలన్నీ 1955-60 మధ్య కాలంలో రాయబడ్డాయి. అప్పటికి రచయిత్రి వయసు 26-31 సంవత్సరాలు. ఒకట్రెండు మినహా మిగిలిన కథలన్నీ చక్కని శిల్పంతో ఆసాంతమూ ఆపకుండా చదివించేలా ఉండడం రచయిత్రి ప్రతిభే. దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి దశాబ్దంలో తెలుగుదేశపు మధ్య తరగతి జీవితాల ఆశలు, ఆకాంక్షలు ప్రధానంగా కనిపిస్తాయి ఈ కథల్లో. రచయిత్రి డాక్టరుగా విధులు నిర్వహించి, కేన్సరు బారిన పడి పోరాడి ఓడారు. ఈ ప్రభావం కథలమీద ఉంది. ఆస్పత్రులు, కేన్సరు కథల్లో కనిపించాయి. కొన్ని కథల్లో పాత్రల మీద 'కాలాతీత వ్యక్తులు' నవల్లో పాత్రల ప్రభావమూ కనిపించింది. బలమైన స్త్రీపాత్రలతో పాటు దీటైన పురుష పాత్రల్నీ చిత్రించడం వల్ల ఏ కథా ఏకపక్షంగా అనిపించలేదు. సన్నివేశ కల్పనలో నాటకీయత - ఆ కాలాన్నీ, రచయిత్రి అనుభవాన్నీ దృష్టిలో ఉంచుకున్నప్పుడు సబబే అనిపిస్తుంది. 

సంకలనానికి శీర్షికగా ఉంచిన 'వాళ్ళు పాడిన భూపాలరాగం' కథలో కథానాయకుడు స్కూలు ఫైనలు పాసవ్వగానే, అతని తండ్రికి పై చదువులు చదివించే స్తోమతు ఉన్నా ఉద్యోగానికి పట్నం పంపడాన్ని మరికాస్త జస్టిఫై చేసి ఉండాల్సింది అనిపించే కథ. సజీవ పాత్రలు, సహజ సన్నివేశాలు ఈ కథకి ప్రధాన బలం. ఆ వెంటనే గుర్తుండే మరో కథ 'చక్రనేమి క్రమాన'. ముందుమాటలో సుభద్రాదేవి గారు చెప్పినట్టుగా చిన్న సస్పెన్సుని చివరివరకూ కొనసాగించిన కథ. (అయితే ఆ సస్పెన్సుని సుభద్ర గారు విప్పి చెప్పేశారు, ముందుమాటని చివర్లో చదవడం మంచిది). మానవ మనస్తత్వాన్ని ఆధారంగా చేసుకుని రాసిన 'ఉరుములూ మెరుపులూ' ఆపకుండా చదివించడమే కాదు, పదికాలాలు గుర్తుండి పోతుంది,  ముఖ్యమైన మలుపుని మరికాస్త బలంగా చిత్రించాల్సింది అనిపించినప్పటికీ. 

మధ్యతరగతి ఆదర్శాల సంఘర్షణ 'కళ్యాణ కింకిణి.' కథ నడపడంలో రచయిత్రి చూపిన యుక్తి ఆశ్చర్య పరుస్తుంది. పాత్రలన్నీ మనకి బాగా తెలిసినవేమో అనిపించే కథ 'తిరగేసి తొడుక్కున్న ఆదర్శం' కాగా చతురస్ర ప్రేమకథ 'రేవతి స్వయంవరం'. తర్వాతి కాలంలో ముగ్గురు నలుగురు స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమించే ఇతివృత్తంతో వచ్చిన సినిమాలకి మూలం బహుశా ఈ కథనేమో అనిపించింది. రాధ అనే బలమైన పాత్ర చుట్టూ అల్లిన కథ 'స్వరూపంలో రూపం'. రాధ ముందు మిగిలిన పాత్రలన్నీ చిన్నబోయాయి. రచయిత్రి స్వానుభవం కావచ్చునని బలంగా అనిపించే కథ 'అర్ధంకాని ఒక అనుభవం'. నాటి గ్రామ రాజకీయాలని పరిచయం చేస్తుందీ కథ. 

ఎండకాసి హఠాత్తుగా వర్షం రావడం కొన్ని కథల్లో కనిపించినా  (రచయిత్రి స్వస్థలం అనకాపల్లి, చదువు సాగింది విశాఖలో) ఆ వాతావరణాన్ని చక్కగా వాడుకుంటూ రాసిన కథ 'వర్షం వెలిసేసరికి...' చివర్లో నాయిక, నాయకుడి పాదాల మీద పడడం సుభద్రాదేవి గారికి నచ్చలేదు. నాకైతే రచయిత్రి మీద అప్పటి సినిమాల ప్రభావమేమో అనిపించింది. శిల్పపరంగా శ్రీదేవి చేసిన మరో ప్రయోగం 'శ్రావణ భాద్రపదాలు'. కథలో ఓ పక్క శ్రావణ మాసపు మబ్బులు, మరోపక్క మల్లెపూలూను. డాక్టరుగా పనిచేస్తున్నప్పుడు విన్న విషయాలని ఆధారంగా చేసుకుని రాసినట్టు అనిపించే కథ 'మెత్తని శిక్ష'. ఇప్పటి డాక్టర్లకి కనీసం ఈ విషయాలు ఆలోచించే తీరుబాటు ఉంటుందని అనుకోలేం. 

సంపుటిలో తొలి కథ 'కల తెచ్చిన రూపాయలు' నిరాశ పరిచింది. పొగచూరిన ఇంట్లో చిరుగుల చొక్కా పరంధామయ్యని చూసి నీరసం వచ్చింది. తర్వాతి కథలన్నీ బాగున్నా, ఈ కథని తొలికథగా ఉంచడం అంత మంచి నిర్ణయం కాదేమో అనిపించింది. 'అనల్ప' ద్వారా మార్కెట్లోకి వచ్చిన ఈ 201 పేజీల పుస్తకం వెల రూ. 250 (ఈ సంస్థ వారి చాలా పుస్తకాల్లాగే, ఈ పుస్తకానికీ వెల ఎక్కువే అనిపించింది, ముఖ్యంగా ముద్రణ నాణ్యత పరంగా చూసినప్పుడు). కథల్ని సంకలనం చేసిన సుభద్రాదేవి గారి కృషిని ప్రత్యేకంగా అభినందించాలి. కథల్ని ఉన్నవి ఉన్నట్టు ప్రచురించారో, 'సంపాదకత్వం' అని వేశారు కాబట్టి ఏమన్నా ఎడిట్ చేశారో తెలియదు. మొత్తంమీద, మిగిలిన ఎనిమిది కథల కోసం ఎదురు చూసేలా చేసిన పుస్తకం ఇది. 

మంగళవారం, జనవరి 03, 2023

"అమ్మ సెల్లియ్యదు..."

రెండు మూడు రోజులుగా న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో క్లిప్ ఇది. ఓ ప్రజాప్రతినిధి (?) తన మందీ మార్బలంతో ఓ జనావాసంలో తిరుగుతూ కనిపించినవాళ్ళని పలకరిస్తున్నారు. బొద్దుగా ఉన్న ఓ పిల్లాడిని చూడగానే ఆగి "ఏం చదువుతున్నావమ్మా?" అని అడగ్గానే, కుర్రాడు చేతులు కట్టుకుని "ఎయిత్ క్లాస్" అని బదులిస్తాడు. "ఏదిరా అంత లావై పోయినావు? గేమ్స్ ఆడుకోవా?" అని సదరు ప్రతినిధి ఆశ్చర్యపడుతూ అడగ్గానే, కుర్రాడు ధీర గంభీరంగా "అమ్మ సెల్లియ్యదు" అని జవాబు చెబుతాడు. వింటున్న వాళ్ళకే కాదు, వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా అర్ధం కాడానికి ఓ క్షణం పడుతుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ కుర్రాడి దృష్టిలో గేమ్స్ అంటే సెల్ ఫోన్ లో ఆడుకునేవి మాత్రమే అని అర్ధం కాగానే నా బుర్రని అనేక ప్రశ్నలు తొలచడం మొదలెట్టాయి. 

ఇప్పటి పిల్లలు మనుషులతో కన్నా ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ తో ఎక్కువ సమయం గడుపుతున్నారన్నది నిజం. కరోనా పుణ్యమా అని పలకా, పుస్తకాలని కూడా స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు రీప్లేస్ చేసేయడంతో ఈ గాడ్జెట్స్ తో సావాసం మరింత పెరిగింది. వీడియో గేమ్స్ చూస్తూ పెరిగి పెద్దవుతూ, గాడ్జెట్స్ లోనే చదువుకుంటూ, అన్నీ మొబైల్ లోనే ఉన్నాయని నమ్ముతున్న పిల్లలకి గేమ్స్ అంటే వీడియో గేమ్స్ మాత్రమే అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది? అవితప్ప వాళ్లకి తెలిసిన వేరే గేమ్స్ ఏమున్నాయి కనుక? తల్లిదండ్రులిద్దరి దగ్గరా మొబైల్ ఫోన్లు ఉండడం మాత్రమే కాదు, అవి వాళ్ళకి దాదాపుగా శరీర భాగాలుగా కలిసిపోడాన్ని చూస్తూ పెరుగుతున్న పిల్లలు వీళ్ళు. చందమామని కాక, సెల్ఫోనుని చూస్తూ గోరు ముద్దలు తిన్న వాళ్ళూను. ఇలా కాక, ఇంకెలా ఆలోచించగలరు మరి? 

పిల్లవాడి వీడియో చాలాసార్లు చూశాక (చాలామంది మిత్రుల నుంచి ఫార్వార్డ్ అయి వచ్చింది, కొందరైతే రకరకాల జిఫ్ లూ అవీ జోడించారు కూడా) ప్రధానంగా అనిపించినవి రెండు - పిల్లలకి సెల్లు మాత్రమే తెలియడం, సెల్ ఫోన్ తప్ప ఇంకేమీ తెలియక పోవడం. అన్నం కన్నా ముందు సెల్ ఫోన్ పరిచయం అవుతోంది కాబట్టి, పిల్లలు వాటికి అలవాటు పడడంలో ఆశ్చర్యం లేదు. కానీ వాళ్ళని సెల్ ఫోన్ ఆకర్షించినంతగా మిగిలిన ప్రపంచం ఎందుకు ఆకర్షించడం లేదు? టీవీలో సినిమా వస్తున్నా, చివరికి అమ్మానాన్నలతో సినిమా హాలుకి వెళ్లినా ఫోన్ లో తలదూర్చేసే పిల్లల్ని చూసినప్పుడల్లా బహురూపాల్లో వచ్చే ప్రశ్నే ఇది. పిల్లవాడి పుణ్యమా అని ప్రశ్నలో స్పష్టత వచ్చింది. చేత్తో పట్టుకోగలిగి, కంట్రోల్ చేతుల్లో ఉండి, కళ్ళకి సరిగ్గా సరిపోయేంత తెర ఉండడం మాత్రమేనా, ఇంకా ఏమన్నా కారణాలు ఉన్నాయా? 

గమనించిన మరో విషయం ఏమిటంటే పిల్లలు ఇలా సెల్ఫోన్ లోనే ప్రపంచాన్ని చూసుకోడాన్ని మెజారిటీ తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు, కొందరైతే గర్వ పడుతున్నారు కూడా. "వీళ్ళ వయసులో మాకు ఫోనే తెలియదు. వీళ్ళకి ఫోన్ వాడకం మొత్తం వచ్చేసిందప్పుడే" అనే గర్వరేఖలకీ లోటులేదు. పిల్లల కళ్ళమీదా, బుర్రమీదా పడే ప్రభావాలని గురించి ఆలోచిస్తున్నవాళ్ళు అరుదు. ఇగ్నోరెన్సు అన్నివేళలా బ్లిస్సేనా? ఇదిగో ఇలాంటి తల్లితండ్రులమధ్య, సెల్లియ్యని ఆ అమ్మ చిన్న ఆశాకిరణంలా కనిపించింది. ఇవ్వకపోడానికి కారణాలు తెలియవు కానీ, ఇవ్వకుండా ఉండడం ద్వారా బిడ్డకి బయటి ప్రపంచం కాస్త పరిచయం అవడానికి సాయం చేస్తోంది. అదే సెల్లు చేతిలో ఉంటే ఆ నాయకుడికి ఈ పిల్లవాడు దొరికి ఉండేవాడు కాదు, ప్రశ్నని అర్ధం చేసుకోగలిగే వాడూ కాదు. 

నిజానికి పిల్లవాడికి కొంచం ప్రపంచం తెలిసి, "గేమ్స్ ఆడడానికి గ్రౌండ్ లేదు" అని చెప్పి ఉంటే సదరు నాయకుడు ఎలా స్పందించి ఉండేవాడన్నది మరో ఆలోచన. ఇప్పుడు ఎన్ని స్కూళ్ళకి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, వ్యాయామ విద్య అనే క్లాసు టైం టేబుల్ లో ఉంది, అసలు బోధించే ఉపాధ్యాయులు ఎందరు ఉన్నారు అన్నవన్నీ జవాబు దొరకని ప్రశ్నలే. లెక్కకు మిక్కిలిగా ఉన్న ప్రయివేటు స్కూళ్లలో వ్యాయామ విద్యని గుర్తించేవి బహుతక్కువ. స్కూలు మొత్తానికి ఒకరో ఇద్దరో పిల్లల్ని - వాళ్ళు కూడా తల్లితండ్రుల పుణ్యమా అని క్రీడల్లోకి వచ్చినవాళ్లు - గుర్తించడం, వాళ్ళకి ఏదైనా పోటీల్లో బహుమతులొస్తే 'మా బడి పిల్లలకి బహుమతులు' అని ప్రచారం చేసుకోవడం మాత్రమే కనిపిస్తోంది. 

సర్కారు బడుల్లో కొన్నింటికి ప్లే గ్రౌండ్లు, మరికొన్ని చోట్ల పీఈటీలు ఉన్నా రెండూ ఉన్నవి తక్కువే అనిపిస్తుంది. నిజానికి వనరులు అన్నీ అందుబాటులోనే ఉన్నా, ఆడేందుకు ఆసక్తి చూపించే పిల్లలెందరు? ప్రోత్సహించే తల్లిదండ్రులెందరు? 'పిల్లల భవిష్యత్తంతా కంప్యూటర్ల లోనే ఉంది. ఫోన్ బాగా వస్తే (?) కంప్యూటరూ బాగా వస్తుంది' అనే ఆలోచనల్ని బద్దలుకొట్టేది ఎవరు, ఎప్పుడు? "గేమ్స్ ఆడుకోవా?" అని అడగడానికి ముందు, గేమ్స్ అంటే ఏమిటో స్పష్టంగా చెప్పి, ఎందుకు ఆడాలో వివరించి ఉంటే ఆ కుర్రాడు ఆడేందుకు ప్రయత్నించి ఉండేవాడేమో. సెల్లులోనే కాకుండా గ్రౌండ్ లో ఆడే గేమ్స్ కూడా ఉంటాయని తెలుసుకుని ఉండేవాడేమో. సెల్ ఫోన్ దాటి బయట ఉన్న ప్రపంచాన్ని పిల్లలకి పరిచయం చేయాల్సిన సమయం వచ్చిందేమో అనిపిస్తోంది. పిల్లలకన్నా ముందు పెద్దలకి అర్ధంకావాలి. పిల్లి మెడలో గంటని కట్టేదెవరు??