శనివారం, మే 28, 2022

ఎన్టీఆర్

"కవిరాజు కంఠంబు కౌగిలించెనుగదా పురవీధి నెదురెండ బొగడదండ..." శ్రీనాథ కవిసార్వభౌముడి ఈ చాటువుతో పాటు చటుక్కున గుర్తొచ్చే పేరు, రూపం కీర్తిశేషులు నందమూరి తారక రామారావుది. ఇవాళ ఎన్టీఆర్ శతజయంతి.  శ్రీనాథుడి మిగిలిన రచనలు ఏవి తలుచుకున్నా మొదట గుర్తొచ్చేది సినీ గేయ రచయిత వేటూరి. కానీ, ఈ ఒక్క చాటువు మాత్రం నందమూరినే గుర్తుచేస్తుంది. వ్యక్తిత్వం మొదలు, ఆహార విహారాదుల వరకూ ఆ కవిసార్వభౌముడికీ, ఈ నట సార్వభౌముడికీ చాలా పోలికలుండడం ఇందుకు ఒక కారణం అయి ఉంటుంది. వందేళ్ల క్రితం ఓ మారుమూల పల్లెటూళ్ళో, సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఓ మనిషి స్వయంకృషితో ఎదిగి తానే ఒక చరిత్ర కావడం వెనుక ఉన్న శ్రమని, ఒడిదుడుకుల్ని ఎవరికి వారు ఊహించుకోవలసిందే. 

కాలేజీ రోజుల్లో నాటకాలాడడంతో నటన మీద మొదలైన ఆసక్తి, ఎన్టీఆర్ ని మదరాసు మహానగరం వైపు నడిపించింది. తన ప్రాంతానికి, తన కులానికే చెందిన అక్కినేని నాగేశ్వర రావు అప్పటికే సినిమాల్లో నిలదొక్కుకున్నారు. మొదట్లో పడ్డ ఇబ్బందులు మినహా, ఒకసారి కథానాయక పాత్రలు రావడం మొదలయ్యాక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. ఆ నాగేశ్వరరావుకే గట్టి పోటీ ఇవ్వడం, ఒక్క నటనతోనే ఆగిపోకుండా సినిమా రంగానికి సంబంధించిన చాలా రంగాల్లో ప్రవేశించి ఔననిపించుకోవడం ఎన్టీఆర్ ప్రత్యేకత. అప్పటివరకూ బ్రాహ్మణ కులస్తుల ఆధిపత్యంలో ఉన్న సినిమా పరిశ్రమని కమ్మ కులస్తులు తమ చేతుల్లోకి తీసుకుంటున్న దశలో సినిమా రంగంలోకి అడుగు పెట్టడం ఎన్టీఆర్ కి కలిసొచ్చిన విషయాల్లో ఒకటి. 

నలభైనాలుగేళ్ల సినిమా కెరీర్ లో మూడొందల సినిమాల్లో నటించడం అన్నది ఇప్పటి రోజులతో పోలిస్తే పెద్ద రికార్డే. రేయింబవళ్లు శ్రమించడం, నిర్మాత శ్రేయస్సు కోరడం అనే లక్షణాలు ఈ రికార్డుకి దోహదం చేశాయి. సినిమా నటులు తమని తాము దైవాంశ సంభూతులుగా భావించుకోవడం అనేది ఎన్టీఆర్ తోనే మొదలయ్యింది బహుశా. ఈ భావన బాగా వంటబట్టాక అడపాదడపా నిర్మాతల్ని ఇబ్బంది పెట్టిన సంఘటనలున్నప్పటికీ (ముళ్ళపూడి, ఎమ్మెస్ రెడ్డిలు తమ ఆత్మకథల్లో ప్రస్తావించిన విషయాలు) మొదటి నుంచీ ఇదే ధోరణిలో ఉండి ఉంటే పెద్ద ఎత్తున సినిమాలు చేసే అవకాశం ఉండేది కాదు. ఎన్టీఆర్ సెంటిమెంట్ సీన్లలో చేసే అభినయం మీద తమిళ నటుడు శివాజీ గణేశన్ ప్రభావం కనిపిస్తుంది. అదే రాజకీయాలకి వచ్చేసరికి,  ఎంజీ రామచంద్రన్ మార్గాన్ని తనది చేసుకున్నారనిపిస్తుంది. 

Google Image

ప్రాయంలో ఉండగానే 'భీష్మ' లాంటి వృద్ధ వేషాలు, 'బృహన్నల' వంటి సాహసోపేతమైన వేషాలూ వేసిన ఎన్టీఆర్, తన వయసు అరవైకి సమీపిస్తున్నప్పుడు మాత్రం కేవలం హీరోగా మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నారు. 'స్టార్డం' పతాక స్థాయికి చేరిన సమయమది. 'కూతురు వయసు పిల్లలతో తైతక్కలాడడం' లాంటి విమర్శల్ని ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇక, ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం ఒక సంచలనం. రాష్ట్ర రాజకీయాలన్నీ రెడ్డి కులస్తుల చుట్టూనే తిరుగుతున్నాయన్న అసంతృప్తి ఆర్ధికంగా బలపడిన కమ్మ కులస్తుల్లో మొదలైన సమయం కావడంతో నేరుగా ముఖ్యమంత్రి పదవి పొందడానికి మార్గం సుగమమైంది. కాంగ్రెస్ వ్యతిరేకత, తెలుగు ఆత్మగౌరవం పేరిట నాటి ప్రముఖ పత్రికలు ఒక నేపధ్యాన్ని సిద్ధం చేసి ఉండడంతో పాటు, అన్నివిధాలా సహకరించడంతో సొంతంగా పార్టీ పెట్టి,  అతితక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టి రికార్డు సాధించగలిగారు. ఇందుకోసం ఎన్టీఆర్ పడిన శ్రమని తక్కువ చేయలేం. 

ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలన్నింటికీ తాతలాంటిది అప్పట్లో ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన రెండురూపాయలకే కేజీ బియ్యం పథకం. తర్వాతి కాలంలో ఇదే పథకం రాష్ట్ర ఖజానా పాలిట తెల్ల ఏనుగుగా మారడం, లోటు బడ్జెట్టు, తత్ఫలితంగా రాష్ట్రానికి-కేంద్రానికి మధ్య సంబంధాలు దెబ్బతినడం వరకూ వెళ్లి, అటు నుంచి కేంద్రంలో తృతీయ కూటమి ఏర్పాటు వరకూ సాగింది. పేదలకి బియ్యం పథకం ఎన్నో ఇళ్లలో పొయ్యిలు వెలిగిస్తే, ఒక్క సంతకంతో ఉద్యోగాల రద్దు నిర్ణయం వేలాది కుటుంబాలని రాత్రికి రాత్రే రోడ్డున పడేసింది.  ముఖ్యమంత్రి అయినట్టే, ఎన్టీఆర్ చులాగ్గా ప్రధాని కూడా అయిపోతారని అప్పట్లో చాలామంది బలంగా నమ్మారు. కానీ, కాలం కలిసి రాలేదు. ప్రధాని పదవి రాకపోగా, తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న ముఖ్యమంత్రి కుర్చీ నుంచి అత్యంత అవమానకర పరిస్థితుల్లో దిగిపోవాల్సి వచ్చింది. 

సినిమాల్లో స్టార్డం వచ్చాక దైవత్వం ఆవహించినట్టే, రాజకీయాల్లో అవుననిపించుకోగానే అధికారం ఆవహించింది ఎన్టీఆర్ ని. ఫలితమే, "ఎన్నికల్లో నా కాలి చెప్పుని నిలబెట్టినా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు" లాంటి ప్రకటనలు. తాను నిలబెట్టిన ఎమ్మెల్యేలని అలా కాలి చెప్పులతో పోల్చారు ఎన్టీఆర్. అదే ఎమ్మెల్యేలు, అదే ఎన్టీఆర్ మీద చెప్పులు విసిరే పరిస్థితి రావడమే విధి విచిత్రం. చివరి రోజులు బాగుండాలి అనేది ప్రతి ఒక్కరూ కోరుకునే కోరిక. వయసులో ఉన్నప్పుడు ఎన్ని కష్ఠాలు ఎదురైనా, వృద్ధాప్యంలో ప్రశాంత జీవితాన్నీ, అనాయాస మరణాన్నీ కోరుకోని వారు ఉండరు. అప్పటివరకూ వైభవాన్ని చూసిన ఎన్టీఆర్ కి చివరి రోజుల్లో మిగిలినవి వెన్నుపోటు, అవమానాలు, ఆక్రోశాలు. రాజులా బతికిన శ్రీనాథుడు చివరి రోజుల్లో కష్టాలు అనుభవించడానికి స్వీయ తప్పిదాల కన్నా, మారిన పరిస్థితులే ఎక్కువ కారణం అంటుంది చరిత్ర. మరి, ఎన్టీఆర్ విషయంలో?? చరిత్ర ఎలాంటి జవాబు చెబుతుందో వేచి చూడాలి. 

సోమవారం, మే 16, 2022

మండుటెండలు

ఎండలు మండిపోతున్నాయనుకోవడం ప్రతి వేసవిలోనూ మనకి మామూలే కానీ ఈసారి మామూలుగా కాక 'రికార్డు' స్థాయిలో మండుతున్నాయి. గత నెలలో (ఏప్రిల్) భారతదేశంలో నమోదైన ఉష్ణోగ్రతలు గడిచిన నూట ఇరవై రెండు సంవత్సరాల్లోనే అత్యధికంట! మనమే కాదు, పొరుగున ఉన్న పాకిస్తాన్, శ్రీలంక దేశాలు కూడా మండుతున్నాయి, కేవలం రాజకీయ వేడి మాత్రమే కాదు అక్కడి వాతావరణమూ అసహజమైన ఎండలతో అట్టుడుకుతోంది. బంగ్లాదేశ్ దీ అదే పరిస్థితి. ఈ బీద దేశాలన్నింటిమీదా సూర్యుడు ఎందుకిలా పగబట్టాడన్నది బొత్తిగా అంతుబట్టడంలేదు. ఎండల నుంచి రక్షింపబడడానికి జనాలకున్న ఒకే ఒక్క అవకాశం ఫ్యాన్ కిందో, ఏసీలోనో సేదదీరడం. అవి నడిచేది కరెంటు మీద. ఆ కరెంటుకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి సరఫరాలో ప్రతిరోజూ కోత పడుతోంది. ఇది చాలదన్నట్టు చార్జీలు రోజురోజుకీ పెరుగుతున్నాయి కూడా. 

ఉష్ణోగ్రతలు పెరగడానికి సైన్సు చెప్పే రెండు కారణాలు కాలుష్యం పెరగడం, పచ్చదనం తగ్గిపోవడం. ఏళ్ళ తరబడి ఇవే కారణాలు వినిపిస్తున్నా పరిష్కారం ఏమీ దొరక్కపోగా, ఎండలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ రెండు కారణాలు మనొక్క చోటే కాదు, మొత్తం ప్రపంచం అంతా ఉన్నవే కదా. మరి మనల్ని మాత్రమే ఈ ఎండలు ఎందుకు బాధిస్తున్నాయి. నాకు అర్ధమైనంత వరకూ ప్రతి సమస్యకీ ఉన్నట్టే ఈ ఎండల సమస్యకీ రెండు పరిష్కారాలు ఉన్నాయి -  ఒకటి తాత్కాలికమైనది, రెండోది శాశ్వతమైనది. మిగిలిన ప్రపంచం, మరీ ముఖ్యంగా ధనిక దేశాలు తాత్కాలిక పరిష్కారం దోవ పట్టాయి. వేసవిలో పెరిగే విద్యుత్ డిమాండ్ ని ముందుగానే ఊహించి పంపిణీకి ఆటంకం లేకుండా చూడడం, అవసరమైతే వీళ్లకీ వాళ్ళకీ (ఓ దేశానికీ, మరోదేశానికీ) జుట్లు ముడిపెట్టి ఇంధన సరఫరా వరకూ వాళ్ళ పబ్బం గడుపుకోవడం. దీనివల్ల 'ఎండలు బాబోయ్' అన్న మాట అక్కడ వినిపించడం లేదు. 

Google Image

ఇప్పుడు ఉష్ణోగ్రతలో రికార్డులు బద్దలు కొడుతున్న దేశాల్లో ఎండలు పెరిగేందుకు భౌగోళిక కారణాలు కొంత కారణం అయితే, తగ్గించుకునేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకునే వీలు కూడా కనిపించకపోవడం మరో సమస్య. ఓ పదేళ్ల క్రితంతో పోలిస్తే ఏసీల మార్కెట్ విపరీతంగా పెరిగిన మాట వాస్తవమే అయినా, మొత్తం జనాభా-ఏసీల నిష్పత్తితో పోల్చి చూసినప్పుడు వినియోగంలో ఉన్న ఎయిర్ కండిషనర్ల సంఖ్య తక్కువనే చెప్పాలి. పైగా జనం దగ్గర ఉన్న ఏసీలన్నీ వినియోగంలో ఉన్నాయనీ చెప్పలేం. కరెంటు కోత, బిల్లుల మోత కారణంగా ఇంట్లో ఏసీ ఉన్నా రోజంతా వాడే వాళ్ళు తక్కువే. కూలర్లు, ఫ్యాన్లదీ ఇదే కథ. ప్రజల్లో ఖర్చుపెట్టే శక్తి తక్కువగా ఉండడం, ఖర్చు పెట్టే అవకాశం లేకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి. భారీ ఎత్తున చెట్ల నరికివేత, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కూడా గాలాడని ఉక్కపోతకి బాగానే దోహదం చేస్తున్నాయి. అయితే, వీటిలో ఏదీ ఆపగలిగేది కాదు. 

ఆశ్చర్యం ఏమిటంటే, ఏ ఏసీ అయితే ఎండ వేడిమి నుంచి ఉపశమనం ఇస్తుందో, అదే ఏసీ భవిష్యత్తులో ఉష్ణోగ్రత మరికొన్ని డిగ్రీలు పెరగడానికి కారణం అవుతోంది. పెరిగిపోతున్న వాతావరణం కాలుష్యానికి ప్రధానంగా తోడ్పడుతున్న వాటిలో ఏసీలో ఉన్నాయి. వీటితో పాటు క్రమేపీ పెరుగుతున్న విమానయానం, ఇప్పటికే బాగా పెరిగిన భవన నిర్మాణాలూ తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఒకప్పుడు కాలుష్యం అంటే ప్రధానంగా పారిశ్రామిక వ్యర్ధాల కారణంగా సంభవించేదే అయివుండేది. ఇప్పుడు కాలుష్య కారకాలు అనూహ్యంగా రూపం మార్చుకున్నాయి. ఉదాహరణకి పేకేజింగ్ మెటీరియల్స్. ఈకామర్స్ వినియోగం పెరిగిన తర్వాత, మరీ ముఖ్యంగా కరోనా మొదలైనప్పటినుంచి షాపుల్లో కన్నా, ఆన్లైన్ కొనుగోళ్లు బాగా పెరిగాయి. దుస్తులు, వస్తువులే కాదు, ఆహార పదార్ధాలు కూడా క్రమం తప్పకుండా కొనేవారు ఎక్కువయ్యారు. ఇదో అనివార్యతగా మారింది. పేకేజింగ్ కోసం వాడుతున్న ప్లాస్టిక్ గురించి ఎవరైనా డేటా సేకరిస్తే కళ్ళు తిరిగే విషయాలు బయట పడొచ్చు.  

తాత్కాలిక ఉపశమనాలను దాటి, శాశ్వత పరిష్కారాల వైపు దృష్టి సారించినప్పుడు ప్రభుత్వాల స్పందన ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. అడవుల విస్తీర్ణం నానాటికీ తగ్గుతోంది. మెరుగైన అర్బన్ ప్లానింగ్, గ్రీన్ బెల్ట్ ని పెంచే ఏర్పాట్లు, నీటి వనరుల సద్వినియోగం, భూగర్భ జలాలని పెంచే ఏర్పాట్లు.. ఇలాంటివన్నీ కాగితాలని దాటి క్రియలో కనిపించడం లేదు. జల, వాయు కాలుష్యాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ప్రజల వైపు నుంచి ఆచరణ బొత్తిగా లేదనలేం కానీ, ఉండాల్సిన స్థాయిలో అయితే లేదు. తెలంగాణలో 'హరిత హారం' కార్యక్రమంలో సెలబ్రిటీలు మొక్కలు నాటుతూ క్రమం తప్పకుండా ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారు. ఆంధ్రలో ప్రతి వర్షాకాలంలోనూ నెల్లాళ్ళ పాటు మొక్కలు నాటే కార్యక్రమం కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా జరుగుతోంది, ఇవి కాకుండా స్వచ్చంద సంస్థలు ఆన్లైన్ లో డోనర్ల నుంచి డబ్బు తీసుకుని వాళ్ళ తరపున మొక్కలు నాటుతున్నాయి.. వీటిలో సగం మొక్కలు చెట్లైనా ఈపాటికి ఎండల సమస్య కొంచమైనా తగ్గాలి. ఇప్పటికైతే దాఖలా కనిపించడం లేదు. ఎండల్ని తిట్టుకుని ఊరుకోడమా, తగ్గించేందుకు (లేదా, మరింత పెరగకుండా ఉండేందుకు) ఏమన్నా చేయడమా అన్నది మన చేతుల్లోనే ఉంది.

శుక్రవారం, మే 13, 2022

ఇచ్చట అప్పులు ఇవ్వబడును ...

అప్పు తీసుకోవడం నామర్దాగా భావించే రోజుల్నించి, అప్పులేకుండా బతకలేని రోజుల్లోకి మనకి తెలియకుండానే వచ్చేశాం. ఇది ఎంతవరకూ వచ్చిందంటే, అప్పిస్తాం తీసుకోమంటూ రోజూ వెంట పడేవాళ్ల నుంచి తప్పించుకోడానికి దారులు వెతికే దాకా. బ్యాంకుల మొదలు, ఫైనాన్సు కంపెనీల వరకూ మన ఫోన్ నెంబరు దొరకని వాళ్ళది పాపం, మీకు ఇంత మొత్తం ఋణం తీసుకునేందుకు అర్హత ఉంది (ఈ అర్హతని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారో తెలీదు, ఒకరు చెప్పే మొత్తానికీ, మరొకరు ఇస్తామని ఊరించే అప్పుకీ పొంతన ఉండదు మరి), పెద్దగా డాక్యుమెంటేషన్ కూడా అక్కర్లేదు, మీరు ఊ అనండి చాలు, అప్పు మీ బ్యాంకు అకౌంట్లో పడుతుంది అంటూ ఊదరగొట్టేస్తారు. "అబ్బే, దేవుడి దయవల్ల రోజులు బానే గడిచిపోతున్నాయి.. ఇప్పుడు అప్పులూ గట్రా అవసరం లేదు," అని చెబుతామా, "రేపెప్పుడన్నా అవసరం రావొచ్చు, ఈ నెంబరు సేవ్ చేసుకోండి.. అవసరం వచ్చిన వెంటనే ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు" అన్నది రొటీన్ సమాధానం. రోజూ ఎన్ని నెంబర్లని సేవ్ చేసుకోవాలి? 

మొదట్లో నేను చాలా ఆశ్చర్యపడిపోతూ ఉండే వాడిని, ఫోన్లు చేసి ఇంతలేసి అప్పులు ఎలా ఇచ్చేస్తారు? తీరుస్తామన్న వీళ్ళ ధైర్యం ఏమిటీ? అని. అయితే, ఒకానొక అనుభవం తర్వాత తత్త్వం బోధపడింది. అప్పులు ఇచ్చే బ్యాచీ వేరు, వసూలు చేసుకునే బ్యాచీ వేరు. ఎవరి పద్ధతులు, మర్యాదలు వారివి. నాకు పరిచయం ఉన్న ఒకాయన ఓ ప్రయివేటు ఫైనాన్సులో అప్పు తీసుకున్నాడు. అప్పుడు, వాళ్ళకి నన్ను తన స్నేహితుడిగా పరిచయం చేసి నా ఫోన్ నెంబరు ఇచ్చేశాడు. వాళ్ళు అప్పు ఇచ్చేశారు. ఇవేవీ నాకు తెలీదు. గడువు తీరినా బాకీ తీరక పోవడంతో, అతగాడి ఫోన్ స్విచ్చాఫ్ ఉండడంతో వాళ్ళు నాకు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. మొదట్లో మర్యాదగానే మాట్లాడినా, రాన్రానూ వాళ్ళ స్వరం మారడం తెలుస్తోంది. ఇతగాడు ఫోనుకి దొరకడు. ఇలా దొరికిపోయానేవిటా అని నేను చింతిస్తూ ఉండగా, ఫైనాన్సు వాళ్ళు బెదిరింపు ధోరణిలోకి దిగారు. 

ఓ రోజు నేను మహా చిరాగ్గా ఉండగా వాళ్ళ ఫోన్ వచ్చింది. ఎప్పటిలాగే తీయగా మొదలెట్టి, కటువుగా మారుతుండగా నాకు చిర్రెత్తుకొచ్చింది. "మీరు అతనికి అప్పు ఇచ్చే ముందు నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు?" అని అడిగా. వాళ్ళ దగ్గర జవాబు లేదు. నాకు దారి దొరికింది. "అప్పిచ్చే ముందు నాకు ఫోన్ చేసి ఇలా చేస్తున్నాం అంటే నేను ఇవ్వమనో, వద్దనో చెప్పేవాడిని. ఇవ్వమని పూచీ పడితే ఇప్పుడు నాకు బాధ్యత ఉండి ఉండేది. అప్పుడు నా నెంబరు తీసుకుని ఊరుకుని ఇప్పుడు ఫోన్లు చేస్తే నాకేం సంబంధం?" అని గట్టిగా అడిగా. అవతలి వాళ్ళు వాళ్ళ మేనేజర్ని లైన్లోకి తెచ్చారు. ఆ అప్పుతో నాకు ఎలాంటి సంబంధం లేదనీ, ఇంకెప్పుడూ ఫోన్లు చేయద్దనీ, చేస్తే మర్యాదగా ఉండదనీ గట్టిగా చెప్పా. అలా ఆ పీడ విరగడయ్యింది. అప్పుల వసూళ్లు ఏ పద్ధతిలో జరుగుతాయో తగుమాత్రం అర్ధమయింది నాకు. 

ఇది జరిగిన కొన్నాళ్లకే 'వాట్సాప్ అప్పులు' అంటూ వార్తలు రావడం మొదలైంది. ప్రయివేటు ఫైనాన్సు కంపెనీల వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి, ఎలాంటి హామీలూ లేకుండా అప్పులిచ్చేశారు. ఒకే ఒక్క మెలిక ఏమిటంటే, అప్పు తీసుకునే వాళ్ళు వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ అన్నీ సదరు సంస్థ వాళ్ళకి సమర్పించాలి. వాళ్ళు, సదరు కాంటాక్ట్స్ అందరినీ పీడించి బాకీ వసూలు చేసుకుంటారన్నమాట. అప్పు తీసుకుని తీర్చలేకపోయిన ఒకరిద్దరు సున్నిత మనస్కులు ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడంతో, పోలీసులు రంగంలోకి దిగి సదరు సంస్థల్ని మూసేయించారు. ఇంతలేసి మంది అప్పులివ్వడానికి ఎందుకు పోటీ పడుతున్నారో అంటే, తాకట్టో వాకట్టో పెట్టుకుని ఇచ్చే అప్పుల మీద కన్నా ఇలాంటి హామీ లేని రుణాల మీద రెండింతలు వడ్డీ వసూలు చేయచ్చు. రిస్కు ఉన్నప్పటికీ లాభం ఎక్కువ. 

ఇక అప్పు తీసుకునే వాళ్లలో నూటికి పది మందికి నిజమైన అవసరం అయితే, మిగిలిన వాళ్ళు అప్పు దొరుకుంటోంది కదా తీసేసుకున్న బాపతు. వీళ్ళకి వడ్డీ గురించి ఆలోచన కానీ, ఎలా తీర్చాలో అన్న చింత కానీ లేవు. వాట్సాప్ అప్పులు తీసుకుని, హెడ్సెట్ వగయిరా గాడ్జెట్లు కొనుక్కున్న కుర్రాళ్ళున్నారు. అప్పుల వాళ్ళు ఇళ్ల మీదకి వస్తే, పెద్దవాళ్ళు ఏడ్చుకుంటూ బాకీలు తీర్చారు. అయితే, ఈ పరిస్థితి ఇండియాలో మాత్రమే కాదనీ, ప్రపంచానికి అప్పులిచ్చే అమెరికాలో కూడా ఇంతేననీ ఈ మధ్యనే తెలిసింది. 'ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి' అనే ఆన్లైన్ స్కీంలో అప్పులు తీసుకున్న వాళ్ళు ఏకంగా నాలుగు రెట్ల మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నారట. వీళ్ళలో మెజారిటీ యువతే. అప్పు చేసి వాళ్ళు కొంటున్నవి ఫ్యాషన్ దుస్తులు, మేకప్ సామాగ్రి, గాడ్జెట్లు వగయిరాలు తప్ప ప్రాణం మీదకి వస్తే చేసిన అప్పులు కావు. 

కొనుగోలు చేసే వస్తువు వెలని నాలుగు నుంచి ఐదు సమ భాగాలు చేసి, మొదటి భాగం చెల్లించగానే వస్తువు డెలివరీ చేస్తున్నారు. మిగిలిన మొత్తం నాలుగుకు మించని వాయిదాల్లో చెల్లించాలి. నాలుగే ఎందుకు? ఐదు వాయిదాల నుంచీ మొదలయ్యే రుణాలన్నీ వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ విషయం అప్పు ఇచ్చే వాళ్ళకి తెలుసు, తీసుకునే వాళ్ళకి తెలీదు. వాళ్ళకింకా చాలా విషయాలే తెలీదు. అప్పు చేసి కొనే ఫ్యాషన్ దుస్తులు, ఆ అప్పు తీరే లోగానే అవుటాఫ్ ఫాషన్ అయిపోతున్నాయి. మళ్ళీ కొత్త ఫ్యాషన్, కొత్త అప్పు.. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. పైగా అప్పులు చేయించడం కోసం టిక్ టాక్ ఇంఫ్లుయెన్షర్లు, వాళ్ళకి కంపెనీల నుంచి ఉచిత బహుమతులూ.. ఇదో పెద్ద వలయం. ఇందులో చిక్కుకున్న వాళ్ళు చివరికి గాస్ (పెట్రోల్) కొనడానికి కూడా ఈ నాలుగు వాయిదాల అప్పు చేయాల్సిన పరిస్థితి. ఈ అప్పులు ఇంకా ఎన్నేసి రూపాలు మార్చుకుంటాయో చూడాలి.

బుధవారం, మే 11, 2022

యమహా నగరి కలకత్తా పురి ...

"రోజంతా సూర్యుడి కింద
రాత్రంతా రజనీ గంధ సాగనీ..." 

బెంగాలీ కవులు వందేమాతరాన్నీ, జనగణమననీ జాతికి కానుకగా ఇచ్చారు. వారి ఋణం తీర్చుకోవడం కోసం కాబోలు, మన తెలుగు సినీ కవి వేటూరి బెంగాలీలు రాష్ట్రగీతంగా పాడుకోదగ్గ పాటని తెలుగులో రాశారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'చూడాలని వుంది' (1998)లో కథానాయకుడు చిరంజీవి మీద చిత్రీకరించిన ఈ పాటని ఓ బెంగాలీ ఫ్రెండ్ కి వినిపించినప్పుడు అర్ధం చెప్పాల్సిన అవసరం లేకపోయింది. దణ్ణం పెట్టేశారు కవికి. మనకి భాష కూడా వచ్చు కాబట్టి వేటూరి ఉపయోగించిన శ్లేషల్ని, చమక్కుల్ని కూడా ఆస్వాదించ గలుగుతాం. 


యమహా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది...

ఏదన్నా 'గొప్పగా ఉంది' అనడానికి 'యమాగా ఉంది' అనడం అప్పటికే వాడుకలోకి వచ్చేసింది. ఇదే వేటూరి, ఇదే చిరంజీవి కోసం 'యమహా నీ యమా యమా అందం' అనే పల్లవితో పాట రాసి ఉన్నారు అప్పటికే. ఆ దృష్టితో చూసినప్పుడు కలకత్తా గొప్ప నగరం అంటున్నారు. కానైతే, ఈ కలకత్తా పురి బెంగాల్ కి రాజధాని. ఆ బెంగాల్ కరువులకి పుట్టిల్లు. దేశానికి స్వతంత్రం రాకపూర్వం సాక్షాత్తూ యమపురే. కలకత్తాలో ప్రవహించే హుగ్లీ నదికి, ప్రసిద్ధ హౌరా బ్రిడ్జీ కి నమస్సులు చెబుతున్నాడు - ఎవరు? - 'చిరు' త్యాగరాజు. శాస్త్రీయ బాణీలో పాడుతున్న వర్ధమాన గాయకుడు అని మాత్రమే కాదు, 'చిరు' అనే ముద్దుపేరున్న చిరంజీవి అని కూడా. 

నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట
పాడనా తెలుగులో
ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా
పదుగురు పరుగు తీసింది పట్నం
బ్రతుకుతో వెయ్యి పందెం
కడకు చేరాలి గమ్యం కదిలిపోరా
ఒకరితొ ఒకరికి ముఖ పరిచయములు
దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల
గజిబిజి ఉరుకుల పరుగులలో... 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టింది బెంగాలీ సీమలోనే. 'గీతాంజలి పూసిన చోట' అని ఎవరనగలరు, వేటూరి తప్ప? రామకృష్ణ పరమహంస హంసగీతం (చివరి సందేశం) ఆనందుడు (వివేకానందుడు) చూపిన బాట అయ్యింది. ఆ బాటలో సాగుతానంటున్నాడు కథానాయకుడు. పదుగురూ పరుగు తీసే పట్నాలన్నీ దాదాపు ఒకలాగే ఉంటాయి కాబట్టి, ఈ వర్ణనంతా ఏ మహానగరానికైనా సరిపోతుంది. 

బెంగాలీ  కోకిల బాల
తెలుగింటి కోడలు పిల్ల మానిని సరోజిని
రోజంతా సూర్యుడి కింద
రాత్రంతా రజనీ గంధ సాగనీ
పద గురు ప్రేమలే లేని లోకం
దేవాదా మార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా
కథలకు నెలవట కళలకు కొలువట
తిథులకు సెలవట అతిధుల గొడవట
కలకట నగరపు కిటకిటలో... 

'భారత కోకిల' బిరుదాంకిత సరోజిని (నాయుడు) హైదరాబాద్ కోడలు. ఆవిడ మెట్టిల్లు 'గోల్డెన్ త్రెషోల్డ్' ని ఇప్పటికీ చూడొచ్చు నాంపల్లిలో. బెంగాల్ వాతావరణంలోనే ఓ అతి ఉంది. అక్కడ అన్నీ ఎక్కువే, ఎండలు కూడా. అలా రోజంతా సూర్యుడి ఎండలో పని చేసినా, రాత్రయ్యేసరికి రజనీగంధ పూలు చక్కని సువాసనతో సేద తీరుస్తాయి. అక్కడ ఇంకా చాలా పూలే పూస్తాయి కానీ, ప్రత్యేకించి రజనీగంధ అనడానికి కారణాలు - ఇది దాదాపు అన్ని కాలాల్లోనూ పూచే పువ్వు అవడం ఒకటైతే, 'రజనీగంధ' అనే అందమైన సినిమా తీసిన బెంగాలీ బాబు బసు ఛటర్జీని ఈ వంకన తల్చుకోడం మరొకటి. ప్రేమరాహిత్యం అనగానే గుర్తొచ్చే దేవదాసు బెంగాలీ వాడే.. 'దేవదాసు' నవల ఒక మైకమైతే, కథానాయకుడి చేతిలో పాపులరైన సీసా మరో మైకం. ఈ 'దేవదాసు' శరత్ చంద్ర చటోపాధ్యాయ పాఠకులకి చేసిన నవలాభిషేకం అంటే కాదనగలమా? కథలకు నెలవు, కళలకు కొలువు సరే. తిథులకి సెలవేమిటి అంటే, 'ప్రోగ్రెసివ్' బెంగాలీలకి తిథి వార నక్షత్రాలతో పెద్దగా పనుండదు అని. నగరాలకి అతిధుల గొడవ తప్పదు, ఈ కథానాయకుడూ అతిధిగా వెళ్లిన వాడే కదా మరి. 

వందేమాతరమే అన్న వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయ చౌరంగి రంగుల దునియా నీదిరా
విను గురు సత్యజిత్ రే సితార
ఎస్ డి బర్మన్ కీ ధారా
థెరిస్సా కి కుమారా కదలి రారా
జనగణమనముల స్వరపద వనముల
హృదయపు లయలను శృతి పరిచిన
ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో... 

ముందే చెప్పుకున్నట్టుగా వందేమాతరం, జనగణమన పుట్టిన నేల అది. మాతంగి కాళికాలయం, చౌరంగీ చూసి తీరాల్సిన ప్రదేశాలు. సత్యజిత్ రే సినిమాలు, ఆర్డీ బర్మన్ సంగీతం, మదర్ థెరెసా సేవలు.. ఇవన్నీ కలకత్తా అనగానే గుర్తొచ్చే విషయాలు. పైగా, అప్పట్లోనే చిరంజీవి "మదర్ థెరెసా స్పూర్తితో" సేవా కార్యక్రమాలు నిర్వహించడం మొదలైంది కూడా. 

పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ విరచిత 'రఘువంశ సుధాంబుధి' బాణీలోనే ఈ పాటని స్వరపరిచారు సంగీత దర్శకుడు మణిశర్మ. పల్లవి చరణాల బాణీల్లో మార్పులేవీ చేయకుండా, ఇంటర్లూడ్స్ లో మాత్రం సినిమా పాటకి కావాల్సిన 'జోష్' ని అందించారు. చిరంజీవి ఈ పాటకి ఒప్పుకోవడం అప్పుడే కాదు, ఇప్పటికీ ఆశ్చర్యమే. మెగాస్టార్ అయిపోయాక తన పాటల్లో ఇలాంటి సాహిత్యం అరుదు. ఈ పాటని హరిహరన్ చేత పాడించడం అప్పట్లో నచ్చలేదు కానీ (గొంతుకి వంక పెట్టలేం, కాకపోతే ఉచ్చారణ...) వినగా వినగా అలవాటైపోయింది. ఓ పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాలో ఇలాంటి అభిరుచిగల పాట పెట్టిన నిర్మాత అశ్వనీదత్ నీ అభినందించాల్సిందే. 

సోమవారం, మే 09, 2022

వేయిపడగలు నేడు చదివితే

'కవిసమ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ అశువుగా చెబుతుండగా సోదరుడు వెంకటేశ్వర్లు 28 రోజుల్లో 999  అరఠావుల మీద  రాయడం పూర్తి చేసిన నవల 'వేయిపడగలు'. అచ్చులో కూడా ఈ పుస్తకం బరువు సుమారు వెయ్యి పేజీలకి దగ్గరగా ఉంటుంది. అయితే గడిచిన ఎనభై ఏళ్లలో ఈ నవల మీద వచ్చిన విమర్శని లెక్కిస్తే వేయి పేజీలు ఎప్పుడో దాటేసి ఉండొచ్చు. ఇప్పటికీ ఈ నవలని గురించి ఏదో ఒక రూపంలో చర్చ జరుగుతూ ఉండడమే 'వేయిపడగలు' ప్రత్యేకత. ఈ నవలపై కల్లూరి భాస్కరం తాజాగా వెలువరించిన విమర్శ వ్యాసాలకి పుస్తక రూపం 'వేయిపడగలు నేడు చదివితే'. సుప్రసిద్ధ సాహితీ విమర్శకుడు ఆర్.ఎస్. సుదర్శనం 'వేయిపడగలు' మీద రాసిన విమర్శని విశ్లేషిస్తూ భాస్కరం రాసిన వ్యాసాలు, ఈ నవలని ప్రఖ్యాత ఆంగ్ల నవల 'గాన్ విత్ ది విండ్' తో పోలుస్తూ రాసిన వ్యాసాల పరంపరని కలిపి పుస్తకంగా తీసుకొచ్చారు 'అస్త్ర బుక్స్' వారు. 

మొత్తం పదహారు వ్యాసాలున్న ఈ పుస్తకంలో తొలి ఏడు వ్యాసాలూ ఆర్.ఎస్. సుదర్శనం విమర్శని ఆధారంగా చేసుకుని రాసినవి. తొలి వ్యాసం 'బాహ్యమిత్రుని వెతుకులాట' లో సుదర్శనానికి విశ్వనాథ పట్ల ఉన్న కుతూహలాన్ని గురించి వివరిస్తూనే, ఆయన బ్రాహ్మణేతరుడైనందువల్ల విశ్వనాథని, వేయిపడగలునీ పైనుంచి మాత్రమే పరిశీలించారని, తాను (భాస్కరం) లోతుగా చూడగలిగాననీ ధ్వనించారు. వంటని రుచిచూసి చెప్పడానికి వంటవాడే అయి ఉండాలా? అనే ప్రశ్న ఇక్కడ సందర్భమూ, అసందర్భమూ కూడా. సుదర్శనం పరిశీలనల నుంచి భాస్కరం చేసిన గమనింపులూ, వాటికి చేసిన వ్యాఖ్యానాలూ మిగిలిన వ్యాసాల మీద ఆసక్తిని పెంచాయి. 'రవీంద్రుడు ఎన్నిమెట్లు ఎక్కారో విశ్వనాథ అన్నిమెట్లు దిగారు' అన్నది రెండో వ్యాసం శీర్షిక. ఇది సుదర్శనం చేసిన వ్యాఖ్యే. ఈ వ్యాఖ్యతో భాస్కరానికి పేచీ లేదు, ఆమోదమే. 'మాలపల్లి' తో సుదర్శనం తెచ్చిన పోలిక ఆసక్తిగా అనిపించింది. 

'వేయి ప్రశ్నల పడగలు' అనే మూడో వ్యాసంలో  'వేయిపడగలు' నవల కథానాయకుడు ధర్మారావు జీవిత చరిత్ర అని తేల్చారు, సుదర్శనం విమర్శ వ్యాసాల ఆధారంగానే. 'ధర్మారావు గెలిచాడు' అన్న నాలుగో వ్యాసాన్ని "ఇప్పుడు గనుక ధర్మారావు చరిత్రని తిరగరాస్తే అది ఒక విజేత చరిత్ర అవుతుంది" అన్న ఆశ్చర్యకరమైన ప్రతిపాదనతో ముగించారు. ఐదో వ్యాసం 'అతనిలో ఒక అపరిచితుడు' లో ధర్మారావు పాత్రని లోతుగా, విమర్శనాత్మకంగా విశ్లేషించారు. దీనికి కొనసాగింపుగా  'అతని ఊహా వైపరీత్యం', 'జ్ఞానానికి అడ్డుగోడ', 'భయపెట్టే నిర్లిప్తత' అనే మూడు వ్యాసాలు రాశారు. చివరి వ్యాసం 'విశ్వనాథ-గోపీచంద్' లో ధర్మారావుని, గోపీచంద్ 'అసమర్ధుని జీవయాత్ర' కథానాయకుడు సీతారామారావుతో పోల్చి గుణ(?)దోషాలు ఎంచారు. 

ఎవరైనా విమర్శకులు ఓ రెండు పుస్తకాల్ని పోలుస్తూ విమర్శకు పూనుకున్నప్పుడు, వారికి ఆ రెండు రచనలమీదా సమభావం ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి 'వేయిపడగలు-గాన్ విత్ ద విండ్ పోలికలు-తేడాలు' అధ్యాయంలో రాసిన ఏడు వ్యాసాలూ. ప్రపంచ ప్రఖ్యాత నవలల్లో ఒకటైన 'గాన్ విత్ ద విండ్' భాస్కరానికి బాగా నచ్చడంతో ఆశ్చర్యం లేదు. అయితే, ఆ రచనని 'పెద్దగీత' గా చూపేందుకు 'వేయిపడగలు' ని ఎంచుకోవడమే ఆశ్చర్యం. 'వేయిపడగలు' లో చర్చించిన ప్రధాన విషయం చాతుర్వర్ణ వ్యవస్థ. 'గాన్ విత్ ద విండ్' కథంతా 'ప్లాంటర్స్' వర్గం చుట్టూ తిరుగుతుంది. ఒక కులాన్ని, వర్గంతో పోల్చడం, అలా పోల్చి  'గాన్ విత్ ద విండ్' గొప్ప నవల, విశ్వనాథ కన్నా మిచెల్ మార్గరెట్ గొప్ప రచయిత్రి అని నిరూపించడం కోసం ఏకంగా ఏడు వ్యాసాలు రాశారు. 

ఈ వ్యాసాలు రాయడం వెనుక ఉన్న కృషి, చేసిన పరిశీలన అభినందనీయమే. అయితే, మందారాన్నీ, గులాబీని పోల్చి చూసి, గులాబీ గొప్ప పుష్పం అని చెప్పడంలా అనిపించింది చదవడం పూర్తిచేశాక. ఇంతకీ ఇప్పుడు ఈ పుస్తకం ఎందుకు రాసినట్టు? జవాబు ముందుమాటలో దొరికింది: "భారతీయ సమాజ, రాజకీయ, సాంస్కృతిక చక్రం మరోసారి బయలుదేరిన చోటికి వచ్చిన దశ ఒకటి ఇప్పుడు నడుస్తోంది. ముస్లింలు, ఆంగ్లేయుల పాలన కాలం నుంచీ, మరీ ముఖ్యంగా గత వందేళ్ల కాలం నుంచి తన వైభవ ప్రభావాలను కోల్పోయాననుకుని దుఃఖానికి, నిరాశా, నిస్పృహలకూ లోనవుతూ వచ్చిన భారతీయ సమాజంలోని ఒక ప్రాబల్య వర్గం - ఇప్పుడు వాటి నుంచి బయటపడి కొత్త ఊపిరిని, ఉత్సాహాన్ని పుంజుకోవడం చూస్తున్నాం. ఈ వర్గం ఇప్పుడున్నంత సంబరంగా, సంతోషంగా, గెలుపు గర్వంతో - ప్రత్యేకించి గత నూరేళ్ళలోనూ ఎప్పుడూ లేదు"

పాలకులుగా స్వదేశీయులున్నా, విదేశీయులున్నా, బాగుపడింది, బాగుపడుతూ వస్తున్నదీ ఈ ప్రాబల్య వర్గమే అనే బలమైన విమర్శ ఈ విమర్శకుడి చెవిన పడలేదా? ఈ వర్గానికి గత వందేళ్లలో ఒరగనిది, ఇప్పుడు కొత్తగా ఒరుగుతున్నదీ ఏమిటో వివరంగా చెప్పి ఉంటే బాగుండేది. "విశ్వనాథ సత్యనారాయణ గారి 'వేయిపడగలు' - దుఃఖం, నిరాశ, నిస్పృహ నిండిన ఈ వర్గపు కృష్ణపక్ష దశకు అద్దం పట్టింది. ఇప్పుడు నడుస్తున్న తన శుక్లపక్ష దశలో ఈ బృహన్నవల చదివితే ఏమనిపిస్తుంది? లౌకికంగా నిష్క్రియునిగా, నిర్లిప్తునిగా కనిపించే ధర్మారావు ముఖంలోని నైరాశ్యపు చీకట్ల స్థానంలో నేటి విజయ దరహాసపు వెన్నెల వెలుగులు దర్శించడం ఎలా ఉంటుంది? ఆ దిశగా ఆలోచనలను నడిపించడానికి ఈ వ్యాసాలలో ప్రయత్నించాను". ఇదే రచయిత "కనుక ధర్మారావు తను లక్షించిన ఆ వ్యవస్థకు ప్రతినిధి తానొక్కడే తప్ప సాటి బ్రాహ్మణ్యం తోడు కూడా అతనికి లేదు" (పేజీ 52) అని ప్రతిపాదించారు!

"ధర్మారావుల నేటి విజయ గాధను పొందుపరుస్తూ వారి శుక్లపక్ష దశను ప్రతిబింబిస్తూ వేయిపడగలకు సీక్వెల్ రాయవలసిన సందర్భం వచ్చిందని కూడా నేను అనుకుంటున్నాను.." ధర్మారావు ఇప్పుడు పుట్టి ఉంటే బహుశా బీఏ బదులు బీటెక్ చదివి ఉండేవాడు. సుబ్బన్నపేట నుంచి కదలడానికి ఇష్టపడడు కాబట్టి ఏదన్నా 'వర్క్ ఫ్రం హోమ్' ఉద్యోగం దొరికి ఉంటే చేసి ఉండేవాడు.  కానీ, అతను కలగన్నట్టుగా సుబ్బన్నపేటకి దివాను అయ్యే పరిస్థితి ఇప్పుడు కూడా కనిపించడం లేదు. అలా ముందుమాట లోనూ కొంచం అస్పష్టత కనిపించింది. ('అస్త్ర' ప్రచురణ, పేజీలు 181, వెల రూ. 225, అన్ని పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్లోనూ కొనుక్కోవచ్చు). 

బుధవారం, మే 04, 2022

రాసుకోడానికో చోటు

స్థానిక రాజకీయ మరియు సినిమా వార్తల పట్ల విరక్తి చెంది, ప్రపంచం ఎటుపోతోందో చూసొద్దాం అనుకుంటూ అంతర్జాతీయ వార్తలు బ్రౌజ్ చేస్తూంటే కనిపించిన 'రాయిటర్స్' వార్త ఆకర్షించడమే కాదు, వెంటనే చదివేసి ఆతర్వాత ఆగి కాసేపు ఆలోచించేలా చేసింది. అది జపాన్ రాజధాని టోక్యో నగరంలో నడుస్తున్న ఓ కెఫె గురించి. 'మాన్యుస్క్రిప్ట్ రైటింగ్ కెఫె' పేరుతో ఈ కాఫీషాపుని నడుపుతున్నది తకువా కవాయ్ అనే రచయిత. ఇక్కడ పది సీట్లు రచయిత(త్రి)ల కోసం రిజర్వు చేయబడ్డాయి. వాళ్ళ రచన ఏదైనా సరే, ఈ కెఫె లో కూర్చుని రాసుకోవచ్చు. మధ్య మధ్యలో కావాల్సినన్ని టీ కాఫీలు సేవించవచ్చు.  ఇది చదువుతూ ఉంటే సాహిత్య ప్రపంచంలో ఓ సంచలనాన్ని నమోదు చేసిన 'హ్యారీ పోటర్' సిరీస్ లో మొదటి పుస్తకాన్ని అప్పట్లో పేదరాలైన జేకే రౌలింగ్ ఓ కాఫీ షాపులో కూర్చుని రాసిన విషయం గుర్తొచ్చింది. 

జపాన్ కెఫె దగ్గరికి వస్తే, కాఫీ టీ లతో పాటు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ సర్వీసునీ అందిస్తోంది రచయితలు, ఎడిటర్ల కోసం. రచయితలు చేయాల్సిందల్లా తమ పేరుతో పాటు, ఏం రాయాలనుకుంటున్నారో ఆ వివరం, ఉజ్జాయింపున ఎన్ని గంటల్లో రాయడం పూర్తి చేద్దామనుకుంటున్నారో రిజిస్టర్లో నమోదు చేయాలి. రాత పనిని సకాలంలో పూర్తి చేయడానికి అక్కడ అందుబాటులో ఉన్న మూడు రకాల సేవల్లో ఒకదానిని ఎంచుకోవాలి. మొదటిది 'మైల్డ్', రెండోది 'నార్మల్', మూడోదేమో 'హార్డ్'. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ రకమైన సేవలు లేకపోబట్టి కదా అల్లసాని వారు నిరుపహతి స్థలము, రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పుర విడెము వగయిరాలు కోరుకున్నారు తన కావ్య సృష్టికీ అనిపించేసింది. అయినా, ఈ సేవలేవీ రాక పూర్వమే ఆధునిక జపాన్ నుంచి 'మురకామి' లాంటి గొప్ప రచయిత ఉద్భవించలేదూ? 

'మైల్డ్' సేవలు ఎంచుకున్న రచయితలు చెప్పిన గడువు లోపల రచన పూర్తి చేశారా లేదా అన్నది మాత్రమే చెక్ చేస్తారు కెఫె వారు. 'నార్మల్' కనుక ఎంచుకుంటే, గంటకోసారి వచ్చి, పలకరించి, ప్రోగ్రెస్ చెక్ చేస్తూ ఉంటారు. ఇక 'హార్డ్' వారి పరిస్థితి చదువుతుంటేనే గుండె గుభేల్ మంది. కెఫె స్టాఫు తరచూ వచ్చి వీరి వెనుక నిలబడుతూ ఉంటారట, మన రామయ్య మెస్సు, సుబ్బయ్య హోటలు లాంటి చోట ఓ బంతి వాళ్ళ భోజనాలు అవుతూ ఉండగానే, టోకెన్లు కొనుక్కున్న తర్వాతి బ్యాచి వాళ్ళు వచ్చి కుర్చీల వెనకాల అసహనంగా నిలబడ్డట్టు. ఇదంతా రచయితల్లో బద్ధకం వదిలించి, రాయాలనే వాళ్ళ లక్ష్యం పూర్తి చేయించడానికే అంటున్నాడు కవాయ్ మహాశయుడు. అయితే, ఈ సేవలు ఉచితం కాదు, తగుమాత్రం ఫీజు వసూలు చేస్తున్నాడు రచయితల దగ్గరనుంచి. నేనేమో 'హార్డ్' వాళ్లకి తక్కువ ఫీజు, 'మైల్డ్' వాళ్ళకి ఎక్కువా ఉంటుందేమో అనుకున్నా కానీ, కాదు. 

'మాన్యుస్క్రిప్ట్ రైటింగ్ కెఫె' లో కూర్చుని రాసుకోడానికి మొదటి అరగంటకి 1.01 అమెరికన్ డాలర్ (ర్లు), తర్వాత ప్రతి గంటకీ 2.34 డాలర్లూ చెల్లించాలి. జపాన్ కరెన్సీలో మొదటి అరగంటకి 130 యెన్ లు, తర్వాత ప్రతి గంటకీ 300 యెన్ లూ అన్నమాట. టేబులు, కుర్చీతో పాటు టీ, కాఫీలు, ఇంటర్నెట్టూ, త్వరగా రాసేందుకు దోహదం చేసే సిబ్బంది సేవలూ (?) ఉచితమే. ఈ సోషల్ మీడియా యుగంలో ఇలాంటి కొత్త వింతలు క్షణాల్లో 'వైరల్' అవ్వకపోతే కదా ఆశ్చర్య పోవాలి. యుగ ధర్మాన్ని అనుసరించి ఈ కెఫె వార్త టోక్యోని చుట్టేసింది. రచయితలు క్యూ కట్టేశారు. "మా సేవల వల్ల చాలామంది ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న రచనల్ని కొన్ని గంటల్లో పూర్తి చేసేస్తున్నారు" అనడమే కాదు, అలా పూర్తి చేసిన వాళ్ళ జాబితానూ ప్రదర్శిస్తున్నాడు కవాయ్. 

ఎమికో ససాకి అనే బ్లాగర్ ఈ కెఫె సేవల్ని ఉపయోగించుకుని మూడే గంటల్లో ఏకంగా మూడు బ్లాగు పోస్టులు రాసేసిందట. దృష్టిని మరల్చే ఇతరత్రా ఆటంకాలేవీ లేవు కాబట్టి రాయడం మీద గురి కుదుర్చుకో గలిగిందట. ఈవిడ 'హార్డ్' కేటగిరీ సేవల్ని ఎంచుకుని ఉంటుందని నాకెందుకో బలమైన సందేహం కలిగింది. రెండేళ్ల క్రితం వరకూ లైవ్ స్ట్రీమింగ్ వ్యాపారం చేసిన కవాయ్, కోవిడ్ రెండేళ్ళూ ఖాళీగానే గడిపి (రచయిత కదా, ఏవో రచనలు చేసే ఉంటాడు), ప్రపంచం కాస్త కుదుట పడ్డాక ఇదిగో ఈ వ్యాపారం మొదలు పెట్టాడు. "ఇక్కడి నుంచి ఎలాంటి రచనలు రాబోతున్నాయో నాకు తెలీదు. కానీ, అందరూ చదివే రచనలకి నావంతు మద్దతు పలకడం గర్వంగా ఉంది" అని జాపనీస్ లో సంతోషపడ్డాడు కవాయ్. కెఫె కి వచ్చే రచయితలు అక్కడి సేవల్ని మెచ్చుకుంటూ, మామూలుగా ఒక రోజు పట్టే రచనని మూడు గంటల్లో పూర్తి చేసేయగలుగుతున్నామనీ, మూడు గంటలు పట్టే రచన గంటలోనే పూర్తైపోతోందనీ చెబుతున్నారట. 

సహజంగానే నాకు ఇండియాలో ఇలాంటి కెఫె ఎవరైనా మొదలు పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన మొదలైంది. మన దగ్గర రాసే వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ, దాన్నో పూర్తి స్థాయి వ్యాపకంగా చేసుకున్న వాళ్ళు బహు తక్కువ. రచనల ద్వారా బాగా ఆర్జించే సినిమా వాళ్ళు వగయిరాలది అంతా భారీ వ్యవహారమే. స్టార్ హోటళ్లు, రిసార్టులు కావాలి కానీ, ఇలాంటి చిన్న ఏర్పాట్లు కాదు. చిన్న, సన్నకారు రచయితలకి ఇప్పటికే స్వీయ ప్రచురణ ఖర్చులు తలకి మోపెడు, ఇంకా ఈ 'రాత' ఖర్చు కూడానా? ఎడిటింగ్ అనే (ప్ర)వృత్తి దాదాపు అంతరించిపోతోంది, కాబట్టి వాళ్ళకీ అవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య కార్పొరేషన్ వారి దృష్టికి తీసుకెళ్తే, వారేమన్నా ఓ బిజినెస్ మోడల్ గా స్వీకరించే వీలుందా? దగ్గర ఆగాయి నా ఆలోచనలు ప్రస్తుతం. (నా ఉటంకింపులు లేకుండా వార్తని వార్తగా ఇక్కడ చదవొచ్చు).