యాత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
యాత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బుధవారం, సెప్టెంబర్ 06, 2023

శృంగేరి-2

(మొదటి భాగం తర్వాత)

బయట చినుకులు పెరుగుతున్నాయి. వాటిని చీల్చుకుంటూ భక్తులు లోపలికి  వస్తున్నారు. చూస్తుండగానే హాలు నెమ్మదిగా నిండుతోంది. ఇంతలో ఓ కుర్రాడు నా దగ్గరికి వచ్చాడు.రెండంచుల పంచె, ఉత్తరీయం, నుదుటన విభూది పట్టెలు, మధ్యలో కుంకుమ బొట్టు, చేతిలో ఉన్న పళ్లెంలో పళ్ళు, పూజా ద్రవ్యాలు, చంకన బ్యాక్ ప్యాక్.. అతను నన్ను పలకరిస్తే తప్ప 'రూమ్మేట్' గా గుర్తు పట్టలేక పోయాను.  "నేను పాదపూజ టికెట్ తీసుకున్నాను. ఆ క్యూలో స్వామీజీని చూస్తాను.. మీరు ఈ వైపు క్యూలో ఉంటే స్వామిని దర్శనం చేసుకోవచ్చు. స్వామీజీ పూర్వాశ్రమంలో మీ తెలుగువారే. ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు" అనేసి హడావుడిగా పాదపూజ వైపు వెళ్ళిపోయాడు. 'నీ ప్రశ్నలు నీవే.. ఎవరూ బదులివ్వరుగా...' అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడడానికి చాలా ముందు నుంచీ కూడా నా నమ్మకం అదే, కాబట్టి అడగడానికి ఏమీ లేదు. కానైతే స్వామీజీని దగ్గరగా చూడాలనిపించింది. ఆయనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని కొన్నేళ్ల క్రితం ఓ సందర్భంలో కలిశానని గుర్తొచ్చింది. 

ఎడమవైపు పాదపూజల హడావిడి మొదలైంది. ఇంతకీ పూజ నిజ పాదాలకి కాదు, గురు పాదుకలకి. రూమ్మేట్ చేస్తున్న పూజని చూస్తూ ఉండగానే ఒక్కసారిగా కలకలం, స్వామీజీ వచ్చేశారు. వేగంగా వచ్చి, ఎవరివైపూ చూడకుండా తన స్థానంలో కూర్చున్నారు. హాల్లో అందరూ లేచి నిలబడ్డారు. కొందరు ఉన్నచోటే సాష్టాంగ పడ్డారు. అందరిలోకీ వయసులో పెద్ద అయిన పరిచారకుడు స్వామీజీ దగ్గరకి వెళ్లి తీర్ధం స్వీకరించాక, దర్శనం మొదలైంది. నన్ను రెండో వైపు క్యూలో నిలబడమని రూమ్మేట్ సైగ చేశాడు. అప్పటికే ఐదారు కుటుంబాలు అక్కడ నిలబడి ఉన్నాయి. నేనూ నిలబడ్డా. తొలి దర్శనం పాదపూజల వాళ్లకి. రూమ్మేట్ వంతు వచ్చింది. అతను స్వామీజీకి ఏదో చెప్పడం, ఆయన శ్రద్ధగా వింటూ మధ్యలో ప్రశ్నలు అడగడం, ఇతను జవాబులు చెప్పడం కనిపిస్తోంది. రెండు మూడు నిమిషాలపాటు సంభాషణ సాగింది. రూమ్మేట్, పరిచారకుడు ఇచ్చిన తీర్ధం తీసుకుని, హాల్లోనే ఓ మూల ధ్యానంలో కూర్చున్నాడు. 

క్యూ చాలా నెమ్మదిగా కదులుతోంది. ఎందుకా అని చూస్తే వీఐపీల తాకిడి. వాళ్ళు షార్ట్ కట్ లో దర్శనానికి వెళ్లిపోతున్నారు. ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక వాళ్ళు.. అప్పటికప్పుడు రావడం, స్వామీజీతో మాట్లాడి వెళ్లిపోవడం. హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తెలుగు భాషల్లో జరుగుతున్నాయి సంభాషణలు. అక్కడక్కడా తమిళ మాటలూ వినిపిస్తున్నాయి. అన్ని భాషల్నీ స్వామీజీ అనర్గళంగా మాట్లాడుతున్నారు. పక్కనున్న పళ్లాల నుంచి పండో, పువ్వో వాళ్ళ వైపు విసురుతున్నారు. పరిచారకులు ప్రసాదం అందిస్తున్నారు. క్యూలో నా ముందు ఓ కుటుంబం. ఆయన, భార్య, కొడుకు, కోడలు, ఏడాది వయసున్న మనవరాలు - ఉత్తరాది నుంచి వచ్చారు. ఆ పిల్ల అందరి చంకలూ మారుతోంది. భక్తులందరూ పళ్ళ పళ్ళాలు, బుట్టలతో వస్తున్నారు. 'పత్రం, పుష్పం, ఫలం, తోయం..' అన్నాడు గీతాకారుడు. వాటిలో ఏ ఒక్కటీ తేలేదు నేను. 'యోమే భక్త్యా ప్రయచ్ఛతి' అని కూడా అన్నాడు. నా భక్తి నాకెప్పుడూ ప్రశ్నార్ధకమే. 

బయట వర్షం తగ్గింది. రూమ్మేట్ నా దగ్గరికి వచ్చి క్యూ కి ఆవల నిలబడ్డాడు. "నేను రూమ్ కి వెళ్తున్నాను. మీకు దర్శనం అయ్యాక, గుడి ఎంట్రన్స్ దగ్గర అన్న ప్రసాదం ఉంటుంది.. తినేసి రూమ్ కి వచ్చేయండి. ఒకవేళ నేను తలుపు తీయకపోతే కాల్ చెయ్యండి" అని చెప్పి వెనుతిరిగాడు. నాకూ వెనక్కి వెళ్లిపోదామా అనిపించింది. ఎందుకో మరి, ముందుకే వెళ్లాను. మరో విడత పాదపూజ పూర్తవ్వడంతో ఆ భక్తులు అటువైపు క్యూలో చేరారు. ఒక  కుటుంబం, తర్వాత నా ముందున్న ఉత్తరాది వాళ్ళు, ఆ తర్వాత నా వంతు. కొంచం సేపటికి ఉన్నట్టుండి స్వామీజీ దృష్టి నామీద పడింది. నేనూ ఆయన వైపే చూశాను రెప్ప వేయకుండా. అర నిమిషం పైనే గడిచి ఉంటుంది. కేవలం ఆయన కళ్ళని  మాత్రమే చూస్తున్నాన్నేను. పరిచారకుడి పిలుపుతో ఆయన దృష్టి మరలింది. 

చన్నీళ్లతో తలారా స్నానం చేసినట్టు, అడగని ప్రశ్నలు అన్నింటికీ జవాబులు దొరికినట్టూ అనిపించింది. ఉత్తరాది పెద్దాయన స్వామీజీకి ఏదో చెప్పుకుంటున్నాడు. నేను నెమ్మదిగా బయట పడ్డాను. రూమ్ కి తిరిగి వెళ్లడం, "కాసేపు నిద్రపోతాను" అని రూమ్మేట్ కి చెప్పి నా మంచం మీద వాలడం లీలగా మాత్రమే గుర్తున్నాయి. మూడు గంటల పాటు ఒంటి మీద స్పృహ లేదు. ఉన్నట్టుండి మెలకువ వచ్చేసరికి రూమ్మేట్ నన్ను నిద్ర లేపుదామా అని తటపటాయిస్తున్నాడు. నాకు బరువేదో దిగిపోయినట్టు వొళ్ళంతా తేలికగా అనిపించింది. "మీరు భోజనం చేశారో లేదో అని.." అన్నాడు. ఆకలిగా అనిపించలేదని చెప్పాను. పాదపూజ చేశాడు కాబట్టి తను ఉపవాసం ఉంటాడట. "స్వామీజీతో మాట్లాడారా?" అని అడిగాడు. దర్శనం అయిందని చెప్పాను. 

కిటికీలోనుంచి చూస్తే బయట జల్లు పడుతోంది. తన కబుర్లు వింటున్నా. ఓ దేశంలో మాస్టర్స్ లో సీటు, మరో దేశంలో ఇప్పుడు చేస్తున్న కన్నాపెద్ద ఉద్యోగం వచ్చాయట. ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోగలడు. ఏది ఎంచుకోవాలా అని సందేహం. "నాకు ఏ సందేహం వచ్చినా స్వామీజీ దగ్గరకి వస్తాను. ఆయన్ని అడిగినా, అడగక పోయినా మంచి పరిష్కారం అయితే దొరుకుతుంది.." నేనా విషయంలో జోక్యం చేసుకోకుండా, "తరచూ వస్తూ ఉంటారా?" అని అడిగాను. "చాలా తరచుగా వస్తాం.. ఇదే మొదటి సారి నేను ఒక్కడినీ రావడం .. మీరు ఉండడం వల్ల రూమ్ దొరికింది.. లేకపోతే ఏమయ్యేదో.." అన్నాడు. "మీరు లేకపోతే నా పరిస్థితి కూడా అదే కదా" అన్నాను. "నాన్నగారిప్పుడు ఢిల్లీలో ఉన్నారు.. సెంట్రల్ సెక్రటేరియట్లో పోస్టింగ్" ఒక్కడూ రాడానికి కారణం చెప్పాడు. "బ్యూరోక్రాట్?" అడిగాను. "ఐఏఎస్, సెంట్రల్ సర్వీస్" ఏదో కో-ఆపరేటివ్ సొసైటీలో గుమస్తా అన్నంత కాజువల్ గా చెప్పాడు. 

నాకు తగిలింది మామూలు షాక్ కాదు. వాళ్ళ నాన్నారి ఆఫీసు జీపులో ప్రతిరోజూ దర్జాగా కాలేజీకొచ్చిన నా కాలేజ్మేట్ 'తాసీల్దారు గారి అబ్బాయి' గుర్తొచ్చాడు. ఇతనేమో నేను లేకపోతే రూమ్ దొరికేది కాదు అంటున్నాడు. రికమండేషన్ ఆ తండ్రికి ఇష్టం ఉండదా? ఈ కొడుక్కి నచ్చదా? వీఐపీలకి దొరికే ట్రీట్మెంట్ ఏవిటో కొన్ని గంటల ముందే ప్రత్యక్షంగా చూసి ఉన్నాను. "మిమ్మల్ని సివిల్స్ వైపు వెళ్ళమనలేదా?" కుతూహలంగా అడిగాను. "నేను చాలా అదృష్టవంతుడిని. చదువు, ఉద్యోగం, ఇప్పుడు వచ్చిన ఛాన్సులు.. ఏ విషయంలోనూ కలగజేసుకోలేదు.. కాకపోతే, పెళ్లి చేసుకోమని మాత్రం ప్రెషర్ చేస్తున్నారు" కొంచం సిగ్గు పడుతూ చెప్పాడు. "వాళ్ళూ అదృష్టవంతులే, ఇలాంటి కొడుకు ఉన్నందుకు" అప్రయత్నంగా పైకే అనేసి, "మంచి పిల్ల జతపడాలి" అని మనసులో దీవించా, అప్పదాసులా. "మా నాన్నగారి రూట్స్ తెలుగు అని ఈ మధ్యనే తెలిసింది. నాకు తెలుగు నేర్చుకోవాలని ఉంది.. సులువే అంటున్నారు అందరూ.." అన్నాడు. "కన్నడకి దగ్గరగానే ఉంటుంది, సులువే" అన్నాను. చాలా సేపు కబుర్లు నడిచాయి. 

"నా విషయంలో మీరైతే ఏ నిర్ణయం తీసుకుంటారు?" ఉన్నట్టుండి అడిగాడు. ఊహించని ప్రశ్న కాదు. "ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది.. మీ ప్లేసులో, మీ వయసులో  ఉంటే నేనైతే చదువుకి వెళ్తాను" అతని మొహం వెలిగిపోయింది. "నాకూ చదువే ఇష్టం.. కానీ జాబ్ ఆఫర్ బాగా టెంప్ట్ చేస్తోంది. మా ఫ్రెండ్స్ చాలామంది ఎదురు చూసిన ఛాన్స్, అది నాకు వచ్చింది.. అందుకే..." ..."మీరు మంచి నిర్ణయమే తీసుకుంటారు.. ఆల్ ది బెస్ట్" అన్నాను. నేను బయల్దేరాల్సిన వేళవుతోంది. అతని ప్రయాణం రాత్రి హారతి తర్వాతట. "మారుతి టిఫిన్ సెంటర్ సాయంత్రం కూడా ఉంటుంది. ఏదన్నా తినేసి వెళ్ళండి. అదే రోడ్ లో తిన్నగా వెళ్లి ఎడమకి తిరిగితే బస్టాండ్.. వర్షం తగ్గింది కాబట్టి నడిచి వెళ్లిపోవచ్చు.. ఈ ఊళ్ళో మిరియాలు తప్ప షాపింగ్ చేయాల్సింది ఏమీ ఉండదు. కాంపౌండ్ బయట చూడాల్సినవి రెండు మూడు ఆలయాలున్నాయి, కానీ మీకు టైం లేదు, పైగా వర్షం" ఒక్కొక్కటిగా చెప్పాడు. "ఇది నాకు అన్ ప్లాన్డ్ ట్రిప్.. కేవలం మీవల్ల చాలా బాగా జరిగింది అనిపిస్తోంది.. గ్రేట్ మీటింగ్ యు.." అన్నాను బయల్దేరుతూ.. చేయి సాచాడు, తొలి హ్యాండ్ షేక్. "మనం ఈసారి ప్లాన్ చేసుకుని ఏదన్నా ట్రిప్ కి వెళదామా, నేను అబ్రాడ్ వెళ్ళేలోగా?" అడిగాడు. "తప్పకుండా..." ఇది దాదాపు నా ఊతపదం. 

గుడి దగ్గర వాతావరణం ఉదయం ఉన్నట్టే ఉంది. టిఫిన్ సెంటర్ దగ్గర కూడా అంతే. ఈసారి మాత్రం స్నేహితుల ఇంటికి వెళ్లినంత చొరవగా లోపలి వెళ్లి కూర్చున్నా. వండి వడ్డించే వాళ్ళు వాళ్ళే, మెనూ కూడా అదే. ఆశ్చర్యం ఏమిటంటే అందరూ గుర్తు పట్టి పలకరించారు. బిల్లు రాస్తుండగా "ఇంకొక్క కాఫీ తాగుతాను, ఇంకొంచం స్ట్రాంగ్ గా.." అడిగేశాను నిర్మొహమాటంగా. ఆ వేళ్టి మూడో కాఫీ ఘుమఘుమలాడుతూ నా ముందుకు వచ్చింది. బిల్లు చెల్లించి నడక మొదలు పెట్టాను. ఏ క్షణంలో అయినా మళ్ళీ వర్షం పడేలా ఉంది వాతావరణం. పాతకాలపు ఇళ్ళు, వాటి మధ్యలో సరికొత్త మేడలు. జనం తాకిడికి బాగా అలవాటు పడిన మనుషులు. గుడిని మినహాయిస్తే ఓ చిన్న పల్లెటూరు. బస్సు నా కోసం ఎదురు చూస్తోంది. సీట్లో కూర్చుని ఫోన్ తీసి మెసేజ్ టైపు చేశాను "థాంక్స్ ఫర్ మేకింగ్ మై ట్రిప్ మెమరబుల్". కిటికీ లోంచి బయటికి చూస్తుంటే పచ్చని శృంగేరి వెనక్కి వెళ్ళిపోతోంది. గాలితో పాటుగా చినుకులు పలకరిస్తున్నాయి. అద్దం మూసి ఫోన్ చూస్తే, జవాబు ఎదురు చూస్తోంది "హేపీ జర్నీ.. శృంగేరి మళ్ళీ వద్దామా? ఇంకెక్కడికైనా వెళదామా?" ... "ప్లాన్ చేద్దాం.." రిప్లై ఇచ్చి వెనక్కి వాలాను. 

(అయిపోయింది)

సోమవారం, సెప్టెంబర్ 04, 2023

శృంగేరి-1

"ఒక్కొక్కరికి రూములు ఇవ్వం.. కనీసం ఇద్దరుండాలి..." మధ్వ సంప్రదాయపు పంచెకట్టు, బొట్టు, గుండు, పిలకతో కంప్యూటర్ ముందు కూర్చున్న బలమైన రిసెప్షనిస్టు కన్నడ-ఇంగ్లిషుల కలగలుపుతో గద్దిస్తూ ఉంటే, ఓ క్షణం పాటు తక్షణ కర్తవ్యం బోధ పడలేదు నాకు. అప్పటికే ఆ గద్దింపు భరించి, ఏం చెయ్యాలో తోచక నిలబడ్డ కుర్రాడి మీద పడింది నా దృష్టి. "మనం రూమ్ షేర్ చేసుకుందామా?" చొరవగా అడిగాను ఇంగ్లిష్లో. నన్నోసారి పరకాయించి చూసి, సరే అన్నట్టు తలూపాడు. "ఇదివరకే ఫ్రెండ్స్ అయితే సరే.. కానీ ఇక్కడ కలిసి రూమ్ తీసుకున్న వాళ్ళు, తర్వాత వచ్చి ఏ కంప్లైంట్ చేసినా నేను రెస్పాన్సిబుల్ కాదు" అడక్కపోయినా చెప్పేశాడు రిసెప్షనిస్టు. ఇద్దరి వివరాలూ క్షుణ్ణంగా టైపు చేసి, మూడొందలు కట్టమన్నాడు. కుర్రాడు వాలెట్ తెరిచేలోగా, ఐదొందల నోటు తీసి ఇచ్చాను. నేను చిల్లర అందుకునే లోగా, తన నూటేభై నా బ్యాక్ పాక్ లో పెట్టేశాడు బెంగళూరు నుంచి వచ్చిన నా రూమ్మేట్. అలా నా శృంగేరి యాత్రలో రూమ్ తీసుకొనుట అనే తొలిఘట్టం పూర్తయ్యింది. 

ఊరింకా పూర్తిగా తెల్లవారలేదు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటోంది, మాలాగే. 'యాత్రి నివాస్' లో మా రూముకి చేరాం. రెండు పెద్ద మంచాలు, వాష్ రూములు, ఛేంజింగ్ రూము.. మొత్తం కలిపి ఓ సింగల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అంత ఉంది. "మీరు స్నానం చేసేయండి, నేను తర్వాత చేస్తాను" మంచి ఇంగ్లిష్లో చెప్పి ఫోన్లో తల దూర్చాడు రూమ్మేట్. ఫార్మల్ పరిచయాలు రిసెప్షనిస్టు సమక్షంలోనే అయిపోయాయి కదా. చలిగా, వర్షం వచ్చేలా ఉంది బయట వాతావరణం. హాయిగా వేడినీళ్ల స్నానం. రెడీ అయి బయటికి వచ్చిన నన్ను చూసి ఫోన్ పక్కన పెట్టాడు. "రిసెప్షన్ బిల్డింగు దాటి కొంచం ముందుకు వెళ్తే కుడివైపు మారుతి టిఫిన్ సెంటర్ అని ఉంటుంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయండి, బాగుంటుంది" చెప్పాడు. "గుడికి వెళ్లొచ్చాక బ్రేక్ఫాస్ట్ కదా" అన్నాన్నేను.  "ఒకసారి లోపలికి వెళ్తే భోజనం చేసే బయటికి వస్తాం. ఇక్కడ అందరూ బ్రేక్ఫాస్ట్ చేసే గుడికి వెళ్తారు. నేను బహుశా స్వామీజీ దర్శనం దగ్గర మిమ్మల్ని కలుస్తాను" ఈ 'స్వామీజీ దర్శనం' ఏవిటో అర్ధం కాక అయోమయంగా తలూపాను. 

కష్టపడక్కర్లేకుండానే మారుతి టిఫిన్ సెంటర్ అడ్రస్ దొరికేసింది. బయట కొందరు తమవంతు కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. అక్కడున్న చిన్న ట్యాప్ దగ్గర కాళ్ళు, చేతులు కడుక్కుని నేనూ వరుసలో నిలబడ్డా. లోపలి నుంచి మా అందరికీ పిలుపొచ్చింది. బాగా పాతకాలపు ఇంట్లో ఓ చివరి వాటా. సన్నని, పొడవాటి హాలు. గచ్చు నేల మీద రెండు వైపులా చాపలు పరిచి ఉన్నాయి. తగు చోటు చూసుకుని కూర్చున్నా. ఉత్తరీయాన్ని నడుముకి కట్టుకున్న మధ్వాచార్యులు ఒకాయన వచ్చి అందరి ముందూ అరిటాకులు పరిచి వెళ్లారు. వెనుకే మరో ఆయన మంచి నీళ్ల గ్లాసులతో వచ్చారు. ఆకు శుభ్రం చేసుకునే లోగా, మొదటి ఆయన వేడి వేడి ఇడ్డెన్లతోనూ, రెండో ఆయన చట్నీతోనూ ప్రత్యక్షం. అటు పైన చిక్కటి సాంబారు, వడలు, పూరీలు, కూర ఒకదాని వెంట మరొకటి వచ్చాయి. కావలిస్తే వేయించుకోవడం, వద్దనుకుంటే చేయి అడ్డం పెట్టడం తప్ప మాటలేవీ లేవు. తినడానికి తప్ప నోరు తెరవడం లేదు ఎవ్వరూ. ఏదో నందికేశుడి నోముకి వచ్చినట్టు ఉంది తప్ప, ఎక్కడా హోటల్ లో టిఫిన్ తింటున్నట్టు లేదు. 

వడ్డించిన టిఫిన్ల వేడికి అరిటాకు కమిలి పోయింది. వంటకాల రుచి, నాణ్యత ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. "కాఫీ? టీ?" ఆకులేసిన ఆయన అందరినీ అడిగాడు. మొత్తం మీద ఓ పాతిక మందిమి ఉన్నాం. పూరీ పూర్తి చేసేలోగా పొగలు కక్కే కాఫీ వచ్చింది. తాపీగా తాగుతూ ఉండగా అప్పుడొచ్చాడు మూడో మనిషి, చేతిలో పుస్తకం, పెన్నుతో. ఏమేం తిన్నామో చెబితే బిల్లు వేసి ఇస్తాడన్నమాట. ఏవి ఎన్నేసి తిన్నామో గుర్తు చేసుకోవడం కాస్త కష్టమైన వ్యవహారమే. ఎవర్నీ ఆకులు మడవనివ్వలేదు. ఆకులు వేసినాయనే ఓ బుట్టతో వచ్చి అన్నీ తీశాడు, ఆ వెనుకే రెండో ఆయన తడి బట్టతో గచ్చు తుడిచేశాడు.   బిల్లు అందుకుని నేరుగా ముందుకి వెళ్తే (వన్ వే) కిచెన్ లో ఉన్నాయన డబ్బు తీసుకున్నాడు. అటు నుంచి పెరట్లోకి వెళ్లి చెయ్యి కడుక్కుని, సందు గుండా వీధిలోకి రావాలి. దాదాపు వందేళ్ల నుంచి అదే ఇంట్లో అదే పద్ధతిలో నడుస్తోందిట ఆ చిన్న హోటల్. బయటికి వచ్చేసరికి తర్వాతి బ్యాచి వాళ్ళు వాళ్ళ వంతు కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు. 

ఎండ వేడి చురుక్కుమంటూండగా విశాలమైన ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టాను. కుడి వైపున వరుసగా ఆలయాలు, ఎడమవైపున వరుసగా పెద్ద పెద్ద హాళ్లు - ఆధ్యాత్మిక సమావేశాల మొదలు అక్షరాభ్యాసాల వరకూ అనేక కార్యక్రమాలు సామూహికంగా నిర్వహించుకోడానికి వీలుగా. మొదట శారదాంబ ఆలయం. హారతి అవుతోంది. భక్తుల రద్దీ మరీ ఎక్కువగా లేదు. బారికేడ్స్ ఉన్నా, ప్రదక్షిణకి వీలుగా ఉంది ఏర్పాటు. ప్రదక్షిణ పథంలో చిన్న చిన్న ఉపాలయాలున్నాయి. హారతి చాలాసేపు జరగడంతో, కాసేపు సన్నిధిలో నిలబడే వీలు చిక్కింది. బయటికి వచ్చేసరికి ఆకాశంలో మబ్బులు. 'అరే' అనిపించింది. వరుసలో తర్వాత ఉన్నది విద్యా శంకర ఆలయం. హోయసాల, విజయనగర ఆర్కిటెక్చర్ల కలగలుపుగా కనిపించే ఈ ఆలయం ప్రత్యేకత లోపల మహా మండపంలో ఉండే పన్నెండు స్థంభాలు. ఒక్కో స్థంభం ఒక్కో రాశికి ప్రతీక. సూర్యుడు ఏ నెలలో ఏ రాశిలో ఉంటాడో ఆ స్థంభం మీద మాత్రమే సూర్యకిరణాలు పడతాయి. ఆ అద్భుతాన్ని కళ్లారా చూడడానికి వీలు లేకుండా శ్రావణ మాసపు కరిమబ్బులు అడ్డం పడ్డాయి. 

దశావతారాల మొదలు యక్షిణులు వరకూ అనేక శిల్పాలను పరిశీలిస్తూ ప్రదక్షిణ చేస్తున్నా. ఫోటోల వాళ్ళతో పాటు, వ్లాగర్లు, రీల్స్ వారు, వాట్సాప్ లైవ్ వారు... ఇలా అందరినీ దాటుకుంటూ, కొందరికి అడ్డు తప్పుకుంటూ, మరికొందరికి అడ్డుపడుతూ ప్రదక్షిణ పూర్తి చేసి లోపలికి అడుగుపెట్టేసరికి అక్కడ ఇంకో కోలాహలం. ఏదో ప్రత్యేక పూజ జరుగుతోంది. భక్తులు చాలామంది ఉండడంతో స్థంభాలని బాగా చూడడం వీలవ్వలేదు. దర్శనం పూర్తి చేసుకుని బయటికి వచ్చి, ఒకరిద్దరికి ఫోటోలు తీసి పెట్టి ముందుకు వెళ్తే మరో రెండు ఉపాలయాలు కనిపించాయి. అవి చూసుకుని తుంగ నది దగ్గరకు చేరేసరికి మబ్బులు మరికాస్త చిక్కబడ్డాయి. స్నానానికి అనుమతించరు కానీ తుంగలో పాద ప్రక్షాళనకి వీలుంది. పెద్ద పెద్ద రాతి మెట్లు జాగ్రత్తగా దిగుతూ ఉంటే మోకాళ్ళు కలుక్కుమన్నాయి. 

తీరా కాళ్ళు కడుక్కునే వేళకి భారీ చేపలు కాళ్ళ మధ్య అడ్డం పడడం  మొదలెట్టాయి. ఆకారానికి మొసలి పిల్లల్లా ఉన్నాయవి. చాలామంది భక్తులు అక్కడే కొన్న మరమరాలు వాటికి ఆహారంగా పెడుతున్నారు. డైట్ లో కార్బ్స్ మరీ ఎక్కువైతే జరిగే పరిణామం ఏవిటో వాటి పరిమాణం చెబుతోంది. పక్కనెవరో భక్తులు ఒక్కో చేపనీ ఎంతమందికి వండి పెట్టొచ్చో అంచనా వేస్తున్నారు (ఆ రేవులో వేట నిషిద్ధం). కాస్త కష్టపడి మెట్లెక్కి పైకి వస్తే తుంగ మీద ఒక వంతెన ఉంది. అవతల పక్క ఏముందో చెప్పే బోర్డు కన్నడలో ఉంది. కొందరు భక్తులు వెళ్తున్నారు. నేనూ బయల్దేరాను. బ్రిడ్జి మధ్యలో నిలబడితే తుంగ అలలతో పాటు, చేపలూ (చేప  పిల్లలు అనలేం) బాగా కనిపిస్తున్నాయి. 'చెలి పయ్యెదలో తుంగ అల పొంగాలీవేళ..' వేటూరి గుర్తొచ్చారు. కేవలం ఏముందో చూసొద్దాం అనే కుతూహలం ముందుకు నడిపించింది. 

అడుగు పెట్టగానే తెలిసింది అది లంక అని. సారవంతమైన నేల, ఆపై వర్ష ఋతువు కావడంతో పచ్చగా హరిత ద్వీపంలా ఉంది. కానైతే, పూలమొక్కలు, పళ్ళ చెట్లు మొదలు పచ్చిక వరకూ అన్నీ క్రమశిక్షణతో పెరుగుతున్నాయక్కడ. ఫెన్స్ కి ఆవల రెండు జింక పిల్లలు ఓ లేగ దూడ పచ్చిక మేస్తూ కనిపించాయి. బొమ్మలేమో అనుకున్నా ఒక్క క్షణం. కదులుతున్నాయి. బలమైన గజరాజు, బక్కపలచటి మావటి ఎదురొచ్చారు. మావటిని చూడగానే 'వేలాయుధం' గుర్తొచ్చేశాడు.  శంకరాచార్యుల సందేశాలని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రాసిన బోర్డులున్నాయి అక్కడక్కడా. వాటిని చదువుకుంటూ ముందుకు వెళ్తే 'ప్రయివేట్ సెక్రటరీ'స్ ఆఫీస్' అని బోర్డున్న ఓ చిన్న బిల్డింగు, ఆ వెనుకే గెస్టు హౌసు, కాస్త ముందుకెళ్తే ఓ ఆలయం, యాగశాల, గురు నివాసం కనిపించాయి. ఒక్కొక్కటీ చూసుకుంటూ గురు నివాసం చేరేసరికి చినుకులు మొదలయ్యాయి. అప్రయత్నంగానే గురు నివాసానికి వెళ్లాను. వెళ్లాకే తెలిసింది, అది శృంగేరి పీఠానికి కాబోయే జగద్గురువు విదుశేఖర భారతీ స్వామి భక్తులకి దర్శనం ఇచ్చే చోటు అని. 

విశాలమైన పెద్ద హాలు. ఎదురుగా వేదిక. గుడి కన్నా చిన్నది, పూజా మందిరం కన్నా పెద్దది అయిన దేవుని మండపం. వేదికకి ఎదురుగా హాలు మధ్యలో కూర్చున్నా. నాకు ఎడమవైపున 'పాదపూజ' అని బోర్డు, అక్కడి నుంచి వేదికపై ఓ ప్రత్యేకమైన బారికేడ్ కనిపించాయి. కుడివైపున మరో బారికేడ్ ఉంది. వేదికని ఆనుకుని కుడి వైపున భారీ గాజుపెట్టెలో ఒక వీణ ఉంది. అది ప్రపంచంలోనే అతి పెద్ద వీణ అట. స్వామీజీ అంతేవాసులు, బహుశా పరిచారకులు అంటారనుకుంటా, కొందరు మండపంలో పూజలు చేస్తుంటే మరి కొందరు తీర్ధ ప్రసాదాలు ఏర్పాటు చేస్తూ హడావిడి పడుతున్నారు. ఏక్షణంలో అయినా స్వామీజీ లోపలి నుంచి బయటికి రావచ్చు అన్నట్టుగా ఉంది వాతావరణం. పరిచారకుల హడావిడి చూస్తుంటే 'బంగారు మురుగు' కథలో బామ్మ గుర్తొచ్చింది. బుర్రలో తిరుగుతున్న ఆ ఛానల్ ని బలవంతంగా ఆపి చుట్టూ చూస్తే హాల్లో జనం పలచగా ఉన్నారు. కొందరు ధ్యానం చేసుకుంటున్నారు. నేనూ ప్రయత్నించాను కానీ అంత కుదురెక్కడిది? 

(ఇంకావుంది) 

గురువారం, ఫిబ్రవరి 27, 2020

హంపీ యాత్ర - 4

(మూడో భాగం తర్వాత)

"ఆ రాణీ ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు.." చరిత్ర సారం కాదని మహాకవి శ్రీశ్రీ అంటే అని ఉండొచ్చుగాక, శ్రీకృష్ణదేవరాయలు తన దేవేరులని ఎంతగా ప్రేమించాడో తెలియాలంటే మాత్రం వాళ్ళు నివసించిన అంతఃపురం తాలూకు అవశేషాలని సందర్శించాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే రక్షణ, సౌకర్యం, సౌందర్యాల కలగలుపు ఆ అంతఃపురం. రక్షణ అనగానే 'రాణుల్ని వేరే రాజెవరో ఎత్తుకుపోకుండా' అనే ఆలోచన వచ్చెయ్యక ముందే ఇంకో విషయం చెప్పేసుకోవాలి. అంతఃపురంలో ఓ వైపున ఉన్న శిధిలాలు 'ఖజానా' భవనానివి అంటోంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. అయితే, ఆ ఖజానా విజయనగర సామ్రాజ్యం మొత్తానిదా, లేక కేవలం రాణులది మాత్రమేనా అనే విషయంలో స్పష్టత లేదు. (విజయనగర రాణులు స్వయంగా ఖజానా నిర్వహించుకున్నారన్న వాదన ఒకటి ఉంది, పుట్టింటి ఆరణాలో లేక చీటికీ మాటికీ చెయ్యి చాపే అవసరం లేకుండా మహారాజు చేసిన ఏర్పాటో మరి). 

స్థానికంగా 'జనానా' అని పిలుచుకునే ప్రాంగణం ముందు ఆటో దిగి, లోపలి అడుగుపెడుతూ ఉండగానే ఎస్. వరలక్ష్మి, దేవిక, ఎల్. విజయలక్ష్మితో కలిసి జమిలిగా గుర్తొచ్చారు 'తిరుమల తిరుపతి వెంకటేశ్వరా..' పాడుకుంటూ. చుట్టూ ఎత్తైన ప్రహరీ ఉన్న సువిశాలమైన ప్రాంగణంలో ఎడమ చేతివైపు చివర ఒక మ్యూజియం ఉందని చెప్పింది ఆర్కియాలజీ వారి మేప్. మ్యూజియంకి ముందే ఖజానా తాలూకు శిధిలాలు, వాటికి పార్లల్ గా అంతఃపురం తాలూకు శిధిలాలు (కేవలం పునాది మాత్రమే మిగిలింది), అంతఃపురం ఎదురుగా చిన్న కొలను, ఆ కొలను ఒడ్డున లోటస్ మహల్ అని పిలవబడే పద్మ మందిరం, ప్రాంగణం రెండో చివర సైనికుల విశ్రాంతి మందిరం, ఏనుగుల మహాలూ ఉన్నాయి. ప్రహరీ దాటి బయటికి వెళ్తే వరుసగా హిందూ, జైన ఆలయాలు. ఖజానా పునాదుల్లో చూసేందుకు ఏమీ లేదు కనుక, మ్యూజియం వైపు వెళ్తే అంతఃపురంలో  వాడిన వస్తువుల తాలూకు శకలాలు కనిపించాయి. ఒకప్పుడు అది అంతఃపురం తాలూకు కొట్టుగది అనీ, కిరాణా సరుకులు నిల్వ చేసేవారని చెప్పింది, అక్కడ పనిచేస్తున్నావిడ. 

పద్మ మందిరం 

అంతఃపురపు పునాది దిబ్బ చుట్టూ ప్రదక్షణ చేసినా, ఆనాటి అత్తరు వాసనలేవీ నా నాసికని తాకలేదు. నీళ్లు లేని కొలనులో పెరిగిపోయిన గడ్డిని కోస్తున్నారు ఆర్కియాలజీ వారు ఏర్పాటు చేసిన మెయింటెనెన్స్ వర్కర్స్. పద్మ మందిరం కేవలం ఆకారాన్ని మిగుల్చుకుంటే, ఏనుగుల మహాలూ, సైనికుల విశ్రాంతి మందిరమూ కాల పరీక్షలని తట్టుకుని మరీ ఠీవిగా నిలబడ్డాయి. రంగులోనూ, రూపులోనూ కలువపువ్వుని గుర్తు చేసే పద్మ మందిరం నిర్మాణం మరో ఇంజినీరింగ్  అద్భుతం. వేసవిలో రాణిగారి శీతల విడిది ఆ చిన్న భవనం. బయటి అన్నివైపులా నుంచీ నిరంతరం పరిచారికలు భవనాన్ని నీళ్లతో తడుపుతూ ఉంటే, లోపల విశ్రాంతి తీసుకుంటున్న రాణీకి సహజసిద్ధమైన ఏసీ ఏర్పాటయ్యేదట! మిగిలిన కాలాల్లో సంగీత, నృత్య ప్రదర్శనాల్లాంటి వినోదాలు జరిగేవట అక్కడ. నాటి శిల్పుల సౌందర్య దృష్టికీ, పనితనానికీ మరో ఉదాహరణ ఈ మందిరం. 

పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించిన ఏనుగుల మహల్ ఎంత ముద్దుగా అనిపించిందంటే, చూసినకొద్దీ చూడాలనిపించింది. సైజుల వారీగా ఏనుగుల కోసం గదులు, మేత, నీళ్లు అందించే ఏర్పాట్లు, ఒక్క మాటలో చెప్పాలంటే ఏనుగుల మనస్తత్వాన్ని, అవసరాలని కాచి వడబోసి అప్పుడు ప్లాన్ చేసి ఉంటారు ఈ నిర్మాణాన్ని. అంతేకాదు, కావలి వాళ్ళు రాత్రి వేళల్లో ఆ భవనం పైనుంచి పహారా కాసేందుకు వీలుగా మెట్లు కూడా ఉన్నాయి. సైనికుడు అనగానే ఎత్తుగా, బలంగా ఉండే రూపం గుర్తొచ్చినట్టే, ఆ సైనికుల విశ్రాంతి కోసం నిర్మించిన భవనం కూడా బాగా ఎత్తుగానూ, బలంగానూ ఉంది. కనీసం యాభై మంది సైనికులు ఒకేసారి విశ్రాంతి తీసుకుందుకు సరిపోయేట్టుగా ఉంది. వెనుక ద్వారం నుంచి బయటికి వెళ్తే వరసగా ఆలయాలు. కేవలం రాణి కోసం నిర్మించినట్టుగానే ఉన్నాయి. జైనాలయం వాస్తు మిగిలిన వాటికన్నా ప్రత్యేకంగా ఉంది. రథంలోనో, మేనాలోనో క్వీన్స్ బాత్ కి వెళ్లొచ్చి, ఈ ఆలయాలన్నీ వరసగా దర్శించుకునేసరికి రాణికి రోజు గడిచిపోయేదేమో అనిపించింది. పక్కలో బల్లెంలా శతృభయం వెంటాడుతూనే ఉంటుంది కదా పాపం. 

ఏనుగుల మహల్ 

హోటల్లో చెకవుట్ చేసి, హోస్పేట రైల్వేస్టేషన్ కి ప్రయాణం, ఆటోలో. డ్రైవరు ఉత్సాహవంతుడైన యువకుడు, కొత్తగా ఆటో కొనుక్కున్న వాడూను. దారిలో రెండు మూడు స్థానిక ఆలయాల దగ్గర ఆపాడు. టైం ఉండడంతో హోస్పేట డామ్ కూడా చూపించాడు. చెప్పకపోడమేం, అవన్నీ కూడా 'హంపిని చూసిన కళ్ళతో...' అనిపించాయి. నేను చూడాలనుకున్న ఆనెగొంది కోట మాత్రం చూడలేక పోయాను, అది ప్రయివేటు ప్రాపర్టీ అన్నాడు డ్రైవరు. దారంతా రాయల సామ్రాజ్యాన్ని పరికించి చూస్తే, అప్పుడు ఎలా ఉండేవో కానీ ఇప్పుడు తుంగభద్ర కాల్వల పుణ్యమా అని మాగాణులుగా మారిన నేలలు, వాటికి అంచులుగా కొండలు, గుట్టలు. అప్పటి గుర్తులుగా రోడ్డు పక్కన అక్కడక్కడా బాటసారుల కోసం రాళ్లతో కట్టిన సత్రవులు. వాటిని చూస్తూనే నాలుగు రోజులుగా చుట్టి వచ్చిన నిర్మాణాలన్నీ ఒక్కసారి కళ్ళముందు కదిలాయి. ఎందుకు కట్టించి ఉంటారు అన్నేసి గుడులూ, గోపురాలూ? కేవలం దైవభక్తి, కళాభిరుచి మాత్రమేనా, ఇంకా ఏమైనా కారణం ఉండి ఉంటుందా? అన్న ఆలోచన వచ్చింది. 

రాజ్యంలో శాంతిభద్రతలు కాపాడడం రాజు విధి. ప్రజలందరికీ చేతినిండా పనులున్నప్పుడు మాత్రమే కొట్లాడుకోకుండా, సామరస్యంగా ఉంటారు. కేవలం వ్యవసాయం తప్ప పరిశ్రమలేవీ లేని ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ఉపాధి చూపించాలి, అది కూడా స్థానిక వనరులతో అంటే, రాతి నిర్మాణాలని మించిన ప్రత్యామ్నాయం దొరికి ఉండదు. ఖజానాలో ఎంత డబ్బున్నా, ప్రజలకి ఊరికే పంచడం అనే పధ్ధతి ఆనాటికి అమల్లోకి రాలేదు కదా. రాజు తల్చుకుంటే దెబ్బలకే కాదు, నిర్మాణాలకీ కొదవ ఉండదు. ఇప్పటి కాలేజీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లని ఉత్పత్తి చేస్తున్నట్టుగా, అప్పటి గురుకులాలు శిల్పులని తయారు చేసి ఉంటాయి బహుశా. ఇప్పుడు "మావాడు సాఫ్ట్వేర్" అని చెప్పుకున్నట్టే, అప్పటి తల్లిదండ్రులు "మావాడు శిల్పి" అని గర్వంగా చెప్పుకుని ఉంటారు.  నిర్మాణాలు పెంచమని రాజాజ్ఞ అయినప్పుడు, అందులో వైవిధ్యం చూపించడం భృత్యుల బాధ్యత కదా. స్థానికంగా దొరికే రాయితో పాటు, ఓరుగల్లు రాజ్యం నుంచి నల్లరాతినీ తెప్పించి ఉంటారు. 

సైనికుల విశ్రాంతి మందిరం 

చూసిన నిర్మాణాలని ఈ ఆలోచనతో లంకె వేసినప్పుడు, ఎన్నివేల మంది శిల్పులకి, పనివాళ్లకి ఎన్నేళ్లపాటు గౌరవప్రదమైన ఉపాధి దొరికి ఉంటుందో కదా అనిపించింది. వేలల్లో కాకపోయినా, ఇప్పటికీ నిత్యం వందల మందికి ఉపాధి ఇస్తున్నాయి హంపీ శిధిలాలు. టూరిస్టు బస్సులు, క్యాబ్లు, ఆటో డ్రైవర్లు, హోటళ్ల వాళ్ళు మొదలు టూరిస్టు గైడ్లు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగాలు పొందిన సెక్యూరిటీ గార్డులు, మెయింటెనెన్స్ సిబ్బంది వరకూ అనేకమంది ప్రత్యక్షంగా జీవనోపాధి పొందుతున్నారు. పరోక్షంగా ఆదాయం పొందుతున్న వాళ్ళ వివరాల్లోకి వెళ్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. పర్యాటకుల విషయానికి వస్తే, భారతీయుల సంఖ్యకి సమంగా (కొన్నిచోట్ల ఎక్కువగా) విదేశీయులు కనిపించారు. 

కానీ సౌకర్యాలని చూస్తే నిరాశ కలిగింది. చాలా సైట్లకి కనుచూపు మేరలో టాయిలెట్ సౌకర్యం లేదు కనీసం. అయితే, రోడ్లు, నడక దారులూ కూడా బాగున్నాయి. మిగిలిన పర్యాటక ప్రాంతాలతో పోల్చినప్పుడు స్థానికులు మంచి వాళ్ళుగా, సహాయం చేసేవాళ్లుగా అనిపించారు. మొత్తం ప్రయాణంలో ఒకరిద్దరు మినహా మిగిలిన ఆటోడ్రైవర్లు రీజనబుల్ ఫేర్లే అడిగారు. నాలుగురోజుల హంపీ ట్రిప్ అంటే "అన్నాళ్ళు ఎందుకు?" అన్నవాళ్లున్నారు. కానీ, నాకేమో చూడాల్సినవి, మళ్ళీ మళ్ళీ చూడాల్సినవి ఎన్నో మిగిలే ఉన్నాయి అనిపించింది. నా సింహావలోకనంలో నేనుండగానే రైల్వే స్టేషన్ వచ్చేసింది. "మేము హోమ్ స్టే కూడా పెడుతున్నాం. ఈసారి మా దగ్గరే ఉందురుగాని. నా ఫోన్ నెంబర్ రాసుకోండి సార్..." ఆటోడ్రైవర్ మాటల్ని రైలుకూత మింగేసింది. 

(అయిపోయింది) 

ఎన్నాళ్ళుగానో వాయిదా పడుతూ వస్తున్న హంపీయాత్ర మరో వాయిదా పడకుండా కార్యరూపం దాల్చేందుకు దోహదం చేసిన కొత్తావకాయ గారికి కృతజ్ఞతలు... 

బుధవారం, ఫిబ్రవరి 26, 2020

హంపీ యాత్ర - 3

(రెండో భాగం తర్వాత) 

"అందమైన ఈ హంపీ పట్టణమంతా మూడు నెలలపాటు దట్టమైన పొగల్లో ఉంది సార్. వాళ్ళు విగ్రహాలు పగలగొట్టారు, గోపురాలని కూల్చేశారు. నగలన్నీ దోచుకున్నారు. అయినా కూడా ఇంకా ఏదో మిగిలిపోయింది. హంపీని నామరూపాలు లేకుండా చేయందే ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అనుకున్నారు. కలప ఉన్న ప్రతి నిర్మాణానికీ నిప్పు పెట్టి అప్పుడు కదిలారు. జనమంతా కట్టుబట్టలతో పారిపోయారు. హంపి ఒక పెద్ద శ్మశానంగా మారిపోయింది..." గుక్క తిప్పుకోడం కోసం ఆగాడు టూరిస్టు గైడు. అభావంగా ఉన్నాడతను. అప్పటికి అరగంట నుంచీ మాట్లాడుతూనే ఉండడం వల్ల కలిగిన అలసట తెలుస్తోంది. ఐదేళ్ల క్రితం పర్యాటక శాఖ వారు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో పాల్గొని, గైడుగా అర్హత సంపాదించుకున్నవాడు. వాళ్ళు నేర్పిన చిలక పలుకులే కాకుండా ఇంకా ఏదో చెప్పాలనే తాపత్రయం ఉన్నవాడు. చేస్తున్న వృత్తిమీద గౌరవంతో పాటు, ఆ వృత్తికి కారణమైన రాయల మీద ఆరాధన గోచరించింది అతని మాటల్లో. 

హంపీ అనగానే మొదట గుర్తొచ్చేది ఏకశిలా రథం. ఆ రథం ఉన్నది విశాలమైన విజయ విఠల ఆలయ ప్రాంగణంలో. యాత్రలో మూడో రోజు ఉదయం అడుగుపెట్టింది ఆ ఆలయ ప్రాంగణంలోనే. రోజూలాగే తెలుగు మాట్లాడే  ఆటో డ్రైవరే దొరికాడు. అందరు డ్రైవర్లలాగే హంపీ కథలెన్నో చెబుతూ, ఇరవై నిమిషాల్లోనే గమ్యస్థానంలో దించేసి వెళ్ళిపోయాడు. అప్పుడే తెలిసిన విషయం ఏమిటంటే, నేరుగా విఠలాలయం దగ్గరికి బయటి వాహనాలు వేటినీ అనుమతించరు. ఒక కిలోమీటరు దూరంలోనే ఆపేస్తారు. అక్కడి నుంచి నడిచి వెళ్లొచ్చు, లేదా అందరూ మహిళలే నడిపే చిన్న చిన్న బేటరీ కార్లలో టిక్కెట్టు కొనుక్కుని వెళ్లొచ్చు. ఉదయపు వాతావరణం ఆహ్లాదంగా అనిపించడంతో నడకకే ఓటు పడింది. ఫలితం, దారిలో మరో రెండు చారిత్రక నిర్మాణాలని చూసేందుకు వీలయింది. వాటిలో ఒకటి 'గజ్జెల మండపం,' ఎందరు నర్తకీమణులు నాట్యం చేశారో అక్కడ. మరొకటి, బాటసారుల కోసం కట్టించిన సత్రం లాంటి నిర్మాణం, ఎదురుగా కోనేరు. ఆశ్చర్యం ఏమిటంటే, అక్కడ కూడా తమ కళా నైపుణ్యం ప్రదర్శించారు విజయనగర శిల్పులు.


అనుకోకుండా జర్నలిస్టు అరుణ మళ్ళీ కలిశారు. అనేగొంది లో ఉన్న ఆర్కియలాజికల్ సైట్ లోకి పర్యాటకులని ఆపేశారని, ఆ శాఖ ఉన్నతాధికారులకి తను మెయిల్ రాశానని చెబుతూ  డిపార్ట్మెంట్ ని తిట్టిపోశారు. విఠలాలయంలో గైడ్ ని ఏర్పాటు చేసుకోమని మళ్ళీ గుర్తు చేస్తూ, తను గజ్జెల మండపం దగ్గర నోట్స్ రాసుకోడానికి ఆగిపోయారు. టిక్కెట్టు కొనుక్కుని ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా, కుమారి పద్మ మళ్ళీ గుర్తొచ్చింది. జేసుదాసు గొంతుతో రవీంద్రబాబు 'నవరస సుమమాలికా..' అని పాడుతూ ఉండగా, రథం పక్కన, స్థంభాల మధ్యనా పరవశంగా నర్తించిన పద్మ. ఒక్క 'అందాలు అలలైన మందాకిని..' చరణంలో హేమకూటాన్ని పావనం చేసింది తప్ప, మిగిలిన పాటంతటికీ ఎండని సైతం లెక్కచేయకుండా ఇక్కడే కదా నర్తించింది. చాలా విశాలమైన ఆవరణలో ఉంది విఠలాలయం. ఇంకా సందర్శకుల తాకిడి ఊపందుకోలేదు. లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా రాతి రథం. రకరకాల మండపాలు. చుట్టూ ఎత్తైన ప్రాకారం. గైడు కోసం వాకబు చేస్తుంటే, ఓ హిందీ గైడు తెలుగతన్ని పరిచయం చేశాడు.

గైడు చెప్పిన ఆలయపు శిల్ప రహస్యాలు కొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తే, మరికొన్ని నమ్మశక్యం అనిపించలేదు. రాతి స్థంభాల నుంచి సంగీతం ఎలా పలికించేవారో స్వయంగా పలికించి చూపించాడు. ఆ కాసేపూ సెక్యూరిటీ వాళ్ళెవరూ ఆ దాపులకి రాకుండా అతనికి సహకరించారు. విదేశీ వర్తకుల నుంచి శ్రీకృష్ణ దేవరాయలు గుర్రాలని కొనుగోలు చేయడం మొదలు, ఆలయం బయటి బజారులో రత్నాలు రాశులుగా పోసి అమ్మడం వరకూ తాను స్వయంగా చూసినంత నమ్మకంగా చెప్పాడు. సాక్ష్యంగా కొన్ని రాతి శిల్పాలని చూపించాడు. వాటిలో కొన్ని విదేశీ వర్తకులవి, మరికొన్ని గుర్రాల వ్యాపారులవి. చిన్నాదేవి జన్మతః దేవదాసీ కనుక ఆమెకి గుడి మండపంలో నృత్యం చేసే సెంటిమెంట్ ఉండేదనీ, అయితే ఆమె రాణీ కాబట్టి సామాన్యులెవరూ ఆమె నృత్యం చూడకుండా ఉండేదుకు మండపం చుట్టూ తెరలు కట్టేవారనీ చెబుతూ, అందుకోసం చేసిన ఏర్పాట్లని చూపించాడు. ఒక్క రాయలుకి మాత్రమే ఆమె నాట్యం చూసే అవకాశం ఉండేదట. "ఇవన్నీ మీకు ట్రైనింగ్ లో చెప్పారా?" అని అడిగితే అవునన్నాడు.


ఉన్నట్టుండి సందర్శకుల తాకిడి పెరిగింది. రథం దగ్గర ఫోటోలు, సెల్ఫీలు తీసుకుని తిరుగు ముఖం పట్టిన వాళ్ళు కొందరైతే, మండపాల్లో మరికొన్ని ఫోటోలు తీసుకుని తర్వాతి సైట్ కి పరుగులు పెట్టిన వాళ్ళు మరికొందరు. ఓ గుజరాతీ ఆవిడ మాత్రం చాలా తాపీగా ఒక్కో స్థంభాన్నీ ఫోటోలు తీసుకున్నారు, భర్తే కాబోలు - బ్యాగ్ మోస్తూ మధ్య మధ్యలో ఆవిడకి నీళ్ళూ, బిస్కట్లూ భక్తిగా అందిస్తున్నాడు. "ఏకశిల రథముపై లోకేష్ ఒడిలోన అని నాగేశ్వర్ రావు పాడాడు కానీ సార్, ఇది ఏకశిలా రథం కాదు. ప్రతి పార్టుని విడగొట్టి మళ్ళీ అసెంబుల్ చేయొచ్చు. టూరిస్టులు పాడు చేసేస్తారని చక్రాలని సిమెంట్ తో అతికేశారిప్పుడు," చెప్పాడు గైడు. రథాన్ని దగ్గర నుంచి చూస్తుంటే, ఇలాంటి రథం పక్కనే ఓ రాత్రివేళ 'మౌనమేలనోయి..' అని పాడుకున్న మాధవి గుర్తొచ్చింది. గైడుతో అంటే ఈ రథాన్ని చూసి గజపతులు కోణార్క్ లో ఆ రథాన్ని చేయించి ఉంటారని అభిప్రాయ పడ్డాడు. ప్రధాన ఆలయంలోనూ, ఉపాలయాల్లోనూ కూడా దేవతా విగ్రహాలు లేవు. స్థంభాల మీద చెక్కడం పని మాత్రం చెక్కుచెదరలేదు. 

ఆలయ ప్రాంగణం బయట ఉన్న అతిపెద్ద బజారుని పురావస్తు శాఖవారు పునర్నిర్మించారని తెలిసింది. వెనుకవైపు సత్రాలు శిధిలావస్థలో ఉన్నాయి కానీ, రాయలు తులాభార స్థంభాలు మాత్రం ఠీవిగా నిలబడి ఉన్నాయి. ఆవరణంతా కలియతిరిగి బయటికి వచ్చేసరికి, మళ్ళీ రోడ్డు వరకూ నడిచే ఓపిక లేకపోయింది. బేటరీకారు ప్రయాణం తప్పలేదు. విఠలాలయానికి తీసుకున్న టిక్కట్లతోనే లోటస్ మహల్ ఉన్న రాణుల అంతఃపురాన్నీ, కమలాపురంలో ఉన్న మ్యూజియంనీ కూడా చూడొచ్చు. మ్యూజియంని ఎంచుకుని అటు వెళ్తే ఖాళీగానే ఉంది. ప్రదర్శనలో ఉంచిన వస్తువులు కూడా ఊహించినన్ని లేవు. ఆయుధాల తాలూకు అవశేషాలూ, శాసనాల తాలూకు శేష భాగాలూ  ఉన్నాయక్కడ. 'మినియేచర్ హంపీ' మాత్రం ప్రత్యేక ఆకర్షణ. చూసేసిన స్థలాలు, చూడాల్సిన విశేషాలు గుర్తు పెట్టుకోడానికి వీలుగా ఉంది ఆ ఏర్పాటు. ప్రవేశ ద్వారం దగ్గర రాయలు, ఇద్దరు రాణుల విగ్రహాలు తిరుమల ఆలయాన్ని గుర్తు చేశాయి.


మయూర భువనేశ్వరిలో వసతి బాగానే ఉంది కానీ, తిండి బొత్తిగా బాలేదు. అంతకు మించి అక్కడెక్కడా ఏమీ దొరికే వీలూ కనిపించలేదు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరి వెళ్తే, వెళ్లిన చోట మధ్యాహ్నానికి కాయో, పండో తినడం, సాయంత్రం తిరిగొచ్చాక పూర్తిస్థాయి డిన్నర్ చేయడం. తిండి, తిరుగుడు షెడ్యూల్లో ఒక్కసారిగా వచ్చిన మార్పు మూడోరోజుకి బయటపడింది. కాస్త తొందరగానే విశ్రాంతికి ఉపక్రమించి, "ఇంతకీ హంపీని ఎవరు ధ్వంసం చేశారు?" అన్న నా ప్రశ్నకి గైడు చెప్పిన జవాబుని జ్ఞాపకం చేసుకున్నాను. "కొడుకు మరణంతో అళియ రాయలు దెబ్బతిని ఉన్నాడు. దీనితో శతృ నవాబులందరూ ఒక్కటై దండెత్తారు. ఎంత దోచుకున్నారో లెక్కే లేదు. దోచుకోడంతో ఆగలేదు. రాయలు మీద అసూయతో హంపిని సర్వనాశనం చేయాలనుకున్నారు. అందమైన విగ్రహాలు పగలగొట్టారు, ఫిరంగులతో మండపాలు పేల్చారు. ఇక్కడి జనాన్ని వాళ్ళు ఎంత భయపెట్టారంటే, మళ్ళీ ఇంగ్లీష్ దొరలు వచ్చి ఈ నిర్మాణాలు గుర్తించే వరకూ మనుషులెవరూ ఇక్కడికి రాలేదు సార్. రాయలుతోనే హంపి వైభవం అంతా పోయింది..." ..హంపీ వచ్చి మూడురోజులు గడిచిపోయాయి. 

(ఇంకా ఉంది) 

మంగళవారం, ఫిబ్రవరి 25, 2020

హంపీ యాత్ర - 2

(మొదటి భాగం తర్వాత..) 

"ఒంపుల హంపీ శిల్పమా.. బాపూ గీసిన చిత్రమా.. అందమా నీ పేరేమిటి.. అందమా..." ఎంత చమత్కారి వేటూరి?!! ఆయన పాటల్లో నిగూఢమైన అర్ధాలుంటాయని తెలుసు కానీ, వాటిని అర్ధం చేసుకోడానికి ఇంతలేసి దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని అస్సలు ఊహించలేదు. నేనున్నది హంపి నడిబొడ్డున ఉన్న హజార రామస్వామి ఆలయ ప్రాంగణంలో. రామాయణ కథని వెయ్యి శిల్పాలలో వర్ణించి, ఆ శిల్పాలతో ప్రాంగణాన్ని అలకరించినందుకు గాను ఈ ఆలయానికి ఆ పేరు వచ్చిందని ఇతిహాసం. అయితే, ఏ శిల్పాన్ని చూసినా బాపూ బొమ్మే గుర్తొస్తోంది. బాపూ బొమ్మల్ని చూసి ఈ శిల్పాలు చెక్కే అవకాశం లేదు కాబట్టి, ఈ బొమ్మల నుంచి స్ఫూర్తి పొందే బాపూ తన దేవతామూర్తులకు ఆకృతి ఇచ్చి ఉంటారు. దానిని గడుసుగా చెప్పేందుకే హంపీ శిల్పాన్ని, బాపూ చిత్రాన్ని కలగలిపి అందాన్ని వర్ణించి ఉంటారు నిరుపమాన సినీ కవి.

హజార రామస్వామి ఆలయ గోపురం మీది ఒకానొక శిల్పం 

శ్రీకృష్ణ దేవరాయల అంతఃపురానికి చేరువలో ఉందీ ఆలయం. సీతారామలక్ష్మణుల విగ్రహాలని తొలగించినట్టుగా అంతరాలయంలో గుర్తులున్నాయి. రాయల పూర్వీకులు చిన్న ఆలయాన్ని నిర్మిస్తే, అదనపు హంగులన్నీ రాయల కాలంలోనే సమకూరాయంటోంది చరిత్ర. రాముడి బాల్యం నుంచీ వరుసగా ఒక్కో దృశ్యాన్నీ రాళ్ళలో చెక్కిన తీరుని చూడడం మొదలు పెడితే, వరుసగా పూర్తి చేయడానికి లేకుండా మధ్యమధ్యలో సంబంధంలేని విష్ణు కథలు దర్శనమిచ్చాయి. అంతే కాదు, పట్టాభిషేకంతో సహా కొన్ని ముఖ్యమైన సన్నివేశాల తాలూకు శిల్పాలు కనిపించలేదు. రాతిపలకల మీద సన్నివేశాలని చెక్కి, ఆ పలకల్ని గోపురం చుట్టూ అతికించడం తెలిసింది, చాలా జాగ్రత్తగా గమనిస్తే. కేవలం దేవతా మూర్తుల శిల్పాలే కాదు, నాటి జానపదుల జీవన శైలిని సూచించే బొమ్మలూ ఉన్నాయి మధ్యమధ్యలో. 

రామకథని దృష్టిలో ఉంచుకుని ఒక్కో బొమ్మనీ తాపీగా చూస్తూ, శిల్పుల కళా నైపుణ్యానికి అచ్చెరువొందుతూ, కథలో ఏయే సన్నివేశాల తాలూకు బొమ్మలు మిస్సయ్యాయో చూస్తూ ఉండగానే, ఒక్కొక్కటిగా టూరిస్టు బస్సులు ఆగడం, బిలబిల్లాడుతూ వచ్చే టూరిస్టులు క్షణాల్లో ఆలయం మొత్తం చుట్టేసి నాలుగైదు ఫోటోలు తీసుకుని తిరిగి వెళ్లిపోవడం. కొందరైతే ఫోటోలకి అడ్డం వస్తున్నాననుకున్నారో ఏమో, దాదాపుగా తోసినంత పని చేశారు. నాలాంటి అతికొద్ది మంది చాదస్తులు, విదేశీ టూరిస్టులు మాత్రమే ఎక్కువ సేపు గడిపారు ఆ ప్రాంగణంలో. కనిపించిన ప్రతి విషయాన్నీ శ్రద్ధగా నోట్స్ రాసేసుకుంటూ, శిల్పాలన్నింటినీ హడావిడిగా ఫోటోలు తీసేసుకుంటున్న ఒక స్త్రీ తనకి తానుగా వచ్చి పలకరించింది. ఆమె పేరు అరుణ, తమిళనాడుకి చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. "విజయ విఠల ఆలయంలో మాత్రం మీరు గైడ్ ని ఏర్పాటు చేసుకోండి," అంటూ సలహా ఇచ్చింది, కొంత సంభాషణ తర్వాత. ఒక్కో ఆలయాన్నీ రెండు మూడు సార్లు వచ్చి చూస్తోందట ఆమె. 

నాట్య భంగిమలు చెక్కిన మండపాన్ని చూడగానే, మళ్ళీ వేటూరి గుర్తొచ్చేశారు, అప్రయత్నంగా. "కలికి చిలక కనిపించదేమే.." అంటూ చుట్టాల సురభి రంగాజమ్మ గారి గొంతు ఖంగుమన్న భావన. ఈ మండపంలోనే కదూ, 'సిరికాకొలను చిన్నది' అలివేణి నాట్యం చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది? ఇక్కడే కదూ, ఆమెకి జరిగిన అన్యాయం రాయలు దృష్టికి వచ్చింది? కల్పితమో కాదో తెలియదు కానీ, అలివేణి కథని వేటూరి చెప్పిన తీరు మాత్రం అపూర్వం. స్థంభాల మీద చెక్కిన నర్తకీమణుల శిల్పాల్లో అలివేణి శిల్పమూ ఉండి ఉంటుందనిపించింది. విజయనగర ఆర్కిటెక్చర్ ప్రత్యేకత ఏమిటంటే, కేవలం దేవుళ్ళ బొమ్మలు, జంతువులు, పక్షుల బొమ్మలతో పాటు, నాటి సంఘంలో అనేక వృత్తులు నిర్వహించిన స్త్రీ పురుషుల బొమ్మల్ని, విదేశీ వర్తకులు, యాత్రికుల బొమ్మల్ని కూడా చెక్కారు ఆలయాల మీద. నాటి జీవితాన్ని వారు రికార్డు చేసిన ఒక పధ్ధతి ఇదై ఉంటుంది బహుశా. 

ఆలయం వెలుపలి గోడల మీద రాళ్లతో చెక్కిన విజయనగర సామ్రాజ్యపు గజ బలాన్నీ, అశ్వ దళాన్నీ పరిశీలిస్తూ ముందుకు నడిస్తే రాయల అంతఃపురం.  అక్కడొకటి ఇక్కడొకటిగా మిగిలిన మహా నిర్మాణపు అవశేషాలు. అవేమిటో వివరిస్తూ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఏర్పాటు చేసిన బోర్డులు. ఆ బోర్డుల్లో రాసింది చదువుకుంటూ, అవశేషాలని చూస్తూ, చరిత్రలో ఖాళీలని ఊహాశక్తి మేరకి పూరించుకున్న సందర్భమది. ఎత్తైన నవరాత్రి దిబ్బకి కొంచం దూరంలోనే, లోతైన స్నానఘట్టం. రెండుచోట్లా కళ్ళు చెదిరే రాతి పనితనం. ఆ రోజుల్లోనే తుంగభద్ర నుంచి అంతఃపురానికి నేరుగా నీళ్లు వచ్చేలా చేసిన ఏర్పాటు! ప్రజలు నేరుగా ప్రభువుకి తమ సమస్యలు విన్నవించుకునే అవకాశం, ఆ వేదిక లోపల విదేశీ రాయబారులతో అత్యవసర చర్చలు జరిపేందుకు అవసరమైన అండర్ గ్రౌండ్ ఛాంబర్. ఒక పక్క రాయలు పాలనని బేరీజు వేసుకుంటూనే, మరోపక్క నాటి శిల్పకళని, ఇంజినీరింగ్ అద్భుతాలనీ చూడడం. కళ్ళకీ, మెదడుకీ ఏకకాలంలోనే విపరీతమైన పని.

సామాన్యుల స్నానఘట్టం 

మొత్తం నిర్మాణాల్లో ఇప్పుడు మిగిలి ఉన్నవి కనీసం ఒక వందో వంతైనా ఉంటాయా అన్న సందేహం, వందో వంతే ఇలా ఉంటే ఇక మొత్తం నిర్మాణాలు ఎలా ఉండి ఉంటాయన్న ఆశ్చర్యార్ధకం!! ఎండ ఎక్కువగా ఉండడంతో పాటు, ఫోటోగ్రఫీకి అనువైన లొకేషన్లు లేకపోవడం వల్ల కాబోలు టూరిస్టుల తాకిడి పెద్దగా లేదిక్కడ. ఏకాంతాన్ని వెతుక్కునే జంటలు మాత్రం అక్కడక్కడా తారసపడ్డాయి.  తదుపరి మజిలీ 'క్వీన్స్ బాత్' అని పిలువబడే రాణీ వారల స్నానఘట్టం. బయటి నుంచి చూడ్డానికి పాడుబడిన నిర్మాణం అనిపించింది కానీ, లోపలి పనితనం కళ్ళు మిరుమిట్లు గొలిపింది. మొత్తం చెక్కడం పనిలో ఓ ఇరవై శాతం మిగిలి ఉందేమో. అయితేనేం, కట్టడానికి వాడింది సున్నమా లేక వెన్నా అనిపించేలా ఉంది ఇంటీరియర్ అంతా. గుండ్రటి ఇన్నర్ బాల్కనీ, కింద ఉన్న నీళ్ళలోకి వెళ్ళడానికి వీలుగా మెట్లు. బాల్కనీ అంతా స్నానానికి ముందు, తర్వాత రాణికి చేసే ఉపచారాలకి అనువైన ఏర్పాట్లు.  చాలా ఏళ్ళక్రితం వేసిన సినిమా సెట్టింగ్ లా అనిపించింది. 

ఎవరో పది పదిహేను మంది టూరిస్టులు కలిసి ఒక గైడుని ఏర్పాటు చేసుకున్నారు. ఆ గైడు చాలా ఉత్సాహంగా పెద్ద గొంతుతో వర్ణిస్తున్నాడు. "అత్తరు, పన్నీరు కలిపిన నీళ్లలో రాణీవారు స్నానం చేస్తూ ఉంటే, పరిచారికలు ఈ చుట్టూ నిలబడి రాణి మీదకి పూలు విసిరేవారు.." ఈ మాటలు చెవిన పడ్డంతోనే నవ్వొచ్చింది. "రాఘవేంద్రరావు సినిమాలు చూడ్డం కాస్త తగ్గించబ్బాయ్" అని ఆ గైడుకి సలహా ఇవ్వాలనిపించింది. ఇంతకీ ఈ స్నానఘట్టం ఏ రాణిది? తిరుమల దేవి కోసం కట్టించిందా? చిన్నాదేవి స్నానం చేసేదా? లేక, ఎస్. వరలక్ష్మి, దేవికల్లాగా ఇద్దరూ కలిసి మెలిసి ఉండేవారా? ఏవిటో, నా సందేహాల్ని ఏ గైడూ తీర్చలేడు. అన్నట్టు, ఈ స్నాన వాటికకి కూడా అండర్ గ్రౌండ్ నీళ్ల సరఫరా ఏర్పాటు ఉంది. తుంగభద్రా నీళ్లు మొదట ఇక్కడికి వచ్చి, ఇటు నుంచి రాజాంతఃపురానికి, అటుపైన సామాన్యులకీ సరఫరా అయ్యేలా ఉండేదిట ఏర్పాటు.


క్వీన్స్ బాత్ 

అలిసిపోయి హోటల్ కి వెళ్తే, అతిధుల కోసం శాస్త్రీయ నృత్య కార్యక్రమం ఏర్పాటు  చేశామన్నారు వాళ్ళు. 'కుమారి పద్మ నృత్య ప్రదర్శన కానీ కాదు కదా?' అని సందేహం వచ్చింది కానీ, ఏనాటి పద్మ? స్నానాదికాలు కానిచ్చి, లాన్లో ఏర్పాటు చేసిన వేదిక ఎదుట కూర్చుంటే, భరతనాట్యం నేర్చుకుంటున్న నలుగురమ్మాయిలు అరగంట పాటు నాట్యం చేశారు, ఐదారు పాటలకి. రెండు పాటలు భరతనాట్యం అని తెలిశాయి కానీ, నాలుగు పాటల తాలూకు శాస్త్రం ఏంటో బోధ పడలేదు. వేదిక పక్కనే అప్పటికప్పుడు అదనపు కాస్ట్యూమ్స్ ధరిస్తూ, కొంచం కూడా గ్యాప్ ఇవ్వకుండా నడిపారు ప్రోగ్రాంని. నలుగురూ నెమళ్ళ వేషం వేసుకుని ఓ హిందీ పాటకి చేసిన డేన్స్ మాత్రం భలేగా ఉంది. కార్యక్రమం అయ్యాక, కమల్ హాసన్ టోన్ రాకుండా జాగ్రత్త పడుతూ, ఆ నాలుగు పాటలకీ చేసిన డేన్స్ ఏ సంప్రదాయం అని ఇంగ్లీష్ లోఅడిగాను ఓ అమ్మాయిని. "సెమీ క్లాసికల్ అంకుల్" అని జవాబిచ్చింది మృదువుగానే. నెమళ్ళ పాట ప్రభావం కాబోలు, "నెమలికి నేర్పిన నడకలివీ.." పాడుకుంటూ నిద్రకి ఉపక్రమించాను. రెండో రోజు హంపీ యాత్ర ఆ విధంగా ముగిసింది. 

(ఇంకా ఉంది) 

సోమవారం, ఫిబ్రవరి 24, 2020

హంపీ యాత్ర - 1

"నా పేరు విరూపాక్ష సార్. నా ఫోన్ నంబర్ రాసుకోండి.." ఎదురుగా నిలువెత్తు గుడి గోపురం, విరూపాక్ష స్వామిది. ఎడమ చేతివైపున రాతిపలకలతో నిర్మించిన బజారు, దానిని ఆనుకునే ఓ కొండ. కుడివైపున మైదానంలో పార్కు చేసిన టూరిస్టు బస్సులు, ఆటోలు. 'ఇదేనా చారిత్రాత్మకమైన హంపీ విరూపాక్ష స్వామి ఆలయం?' నా సందేహంలో నేనుండగానే, నెంబర్రాసుకోమంటూ ఆటో విరూపాక్షుడి గొడవ. ఫోన్లో నెంబర్ ఫీడ్ చేసుకున్నట్టుగా నటించి, అతగాడికి డబ్బులిచ్చి పంపించి నెమ్మదిగా గుడివైపుకి నడుస్తూ ఉండగా పలకరించింది హంపీ గాలి. అవును, అక్కడి గాలి కూడా ప్రత్యేకమే. వినగలిగితే ఎన్నెన్ని కథలూ, గాథలూ వినిపిస్తుందనీ? ఎస్సెల్లార్ కెమెరా సహిత బ్యాక్ ప్యాక్ బరువనిపించడం లేదు. రాత్రంతా ప్రయాణం చేసిన బడలిక లేనే లేదు. రాయల కాలంలోకి నడిచి వెళ్తున్న అనుభూతి కాబోలు.  

పాదరక్షలు స్టాండులో పెట్టి, కెమెరా సహితంగా టిక్కెట్లు కొనుక్కుని, ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే కుడివైపున ఆయుర్వేద డిస్పెన్సరీ పలకరించింది. దీపాలు వెలిగించిన గుర్తుగా నూనె చారికలు కనిపిస్తున్నాయి రాతి నేలమీద. హంపీ పట్టణం మొత్తం మీద ఉన్న ఆలయాల్లో, ఇప్పటికీ నిత్యం ధూప దీప నైవేద్యాలు జరుగుతున్న పురాతన గుడి ఈ విరూపాక్ష స్వామి ఆలయం ఒక్కటే. అప్పుడప్పుడూ గుడి గంటలు వినిపించడమే కాదు, ప్రసాదాలు ఆరగించడం కోసం లెక్కకు మిక్కిలిగా వానరాలూ తిరుగాడుతున్నాయి ఆ ప్రాంగణంలో. ఎన్నో ప్రాచీన నిర్మాణాలు చూసినా, ఈ తరహా వాస్తుని చూడడం ఇదే ప్రధమం. 'విజయనగర ఆర్కిటెక్చర్' అని కదూ దీనికి పేరు. ఎత్తైన గోపురం చిట్టచివరి వరకూ సున్నితమైన పనితనంతో చెక్కిన శిల్పాలు. శిల్పదృష్టితోనే కాదు, గణితశాస్త్రం దృష్ట్యా చూసినా అబ్బుర పరిచే కొలతలతో ఠీవిగా నిలబడ్డ మండపాలు, నిర్మాణాలు. 

ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలనీ, వాటి నిర్మాణన్నీ పరిశీలిస్తూ, కలియతిరిగి, ఓ మండపంలో విశ్రాంతిగా కూర్చోగానే, చెంగున ఎగిరొచ్చిన వానరం కెమెరా లెన్స్ కవర్ ఎత్తుకుపోయి, ఓ స్థంభం మీద కూర్చుని వినోదం చూసింది. 'నేన్నీకు మునిమనవడి వరస' అని ప్రవర చెప్పుకుంటే, కనికరించి, కవరు తిరిగిచ్చింది. ప్రవేశ ద్వారానికి అభిముఖంగా బయటికి వెళ్లేందుకు రాతి గుమ్మం, ఆనుకునే కోనేరు. కనుచూపు మేరలో కనిపిస్తున్న తుంగభద్రా నది. అప్రయత్నంగానే అడుగులు ఆ నదివైపుకు సాగాయి. నాగరికతలన్నీ నదీతీరాన్నే వెలిశాయని చెబుతుంది చరిత్ర. ఆ ప్రకారం చూసినప్పుడు, మహోన్నతమైన విజయనగర నాగరికత వికసించేందుకు దోహదం చేసిన నది ఈ తుంగభద్ర. సగం దూరం నడిచి రెండు పక్కలా చూస్తే, ఒకవైపు ఎత్తైన విరూపాక్ష ఆలయ ప్రాకారం, గోపురం, మరో వైపు తుంగభద్ర. అనుభూతిని అక్షరాల్లో తర్జుమా చేయటానికి ఈ యాత్రలో చేసిన మొట్టమొదటి విఫల ప్రయత్నం బహుశా ఇదే. హంపిలో గడిపినంత కాలమూ ఎన్నెన్ని విఫల యత్నాలు జరిగాయో లెక్కేలేదు. అడుగులు తుంగభద్ర వైపే పడ్డాయి.

హేమకూట పర్వతం నుంచి విరూపాక్ష దేవాలయం 

ఎండ కాస్త తీక్షణంగా ఉన్న ఆ మధ్యాహ్నం వేళ, తన సహజ ధోరణిలోనే ప్రశాంతంగా కనిపిస్తోంది తుంగభద్ర, చారిత్రక నగరం హంపి ఉత్థానపతనాలకి మౌనసాక్షి. గట్టుమీద అక్కడక్కడా పైకిలేస్తున్న పొగలని చూడగానే ఒకటే సందేహం, కాశీలో లాగా ఇక్కడ కూడా శవదహనాలు జరుగుతాయా? ఉహు, జరుగుతున్నది అది కాదు. పట్టణంలో పేరుకున్న చెత్తని రాశులుగా పోసి తగలబెడుతున్నారని తెలిసింది. ఆ చెత్తని తయారు చేస్తున్నది నాలాంటి యాత్రికులే. అయినా, హంపికి, తుంగభద్రకీ ఈ పొగలు కొత్త కాదు. ఇంతకుమించిన దట్టమైన పొగల్ని మూడునెలలపాటు ఊపిరాడని విధంగా భరించాయవి. కానీ నాకే, ఆ సంగతులు తెలుసుకోడానికి మరో రెండు రోజులు పట్టింది.  తుంగభద్రలో కాళ్ళు కడుక్కుంటూ ఉంటే మొదటగా గుర్తొచ్చినవి మొసళ్ళు! మహామహోపాధ్యాయ తిరుమల రామచంద్ర 'హంపీనుంచి హరప్పా దాక' చదివిన ప్రభావం. ఆ పండితుణ్ణీ, ఆ పుస్తకాన్నీ తల్చుకోడం ఆ ఉదయం నుంచీ అది ఎన్నోసారో గుర్తులేదు. 

హోస్పేట స్టేషన్లో రైలు దిగగానే మొదట వెళ్ళాల్సింది కమలాపురం. కర్ణాటక టూరిజం కార్పొరేషన్ వారి హోటల్ మయూర భువనేశ్వరిలో బస. కమలాపురంలో అడుగుపెట్టింది మొదలు రామచంద్ర గుర్తొస్తూనే ఉన్నారు. స్నానానికి వేడినీళ్ళతో పాటు, మైసూర్ శాండల్ సబ్బుని, దావణగెరె తువ్వాలునీ అందించిన హోటల్ వారు సగం బడలిక పోగొట్టేశారు. బలంగా  బ్రేక్ఫాస్ట్ చేసి, ఆటో పట్టుకుంటే అరగంట లోపే హంపీ చేర్చాడు డ్రైవరు, దారిలో కనిపించిన ప్రతి చెట్టు, పుట్ట గురించీ నమ్మశక్యం కాని కథలు చెబుతూ.  మొసళ్ల  ఆలోచనల్ని పక్కన పెట్టి, చుట్టూ చూస్తే, తుంగభద్ర గట్టున పొడవు పొడవూ దుకాణాలు. యాంటిక్ డిజైన్లని పోలిన డెకరేటివ్ పీసుల మొదలు, సేవెండి ఆభరణాల వరకూ అనేకం అమ్ముతున్నారు రాశులు పోసి. కొన్ని వందల ఏళ్ళక్రితం రత్నాలని, ముత్యాలనీ రాశులుగా పోసి విక్రయించింది ఇచ్చోటనేనా? 

ఆలయాన్ని ఆనుకునే ఉన్న చిన్నపాటి కొండమీద పడింది దృష్టి. హేమకూట పర్వతమట పేరు. ఆ మధ్యాహ్నపు ఎండలో నిజంగానే బంగారంలా మెరిసిపోతోంది ఆ పర్వతం. సెమ్మెట్రికల్ గా నిర్మించిన చిన్న చిన్న గుళ్ళూ, మండపాలూ రారమ్మని పిలుస్తూ ఉంటే కొండెక్కడం ఏమంత కష్టమనిపించలేదు. ఆ కొండమీంచి మరింత స్పష్టంగా కనిపిస్తోంది విరూపాక్ష ఆలయ గోపురం. రెండోపక్క కనుచూపు మేరంతా హంపీ శిధిలాలు. ఆ గోపురం బ్యాక్డ్రాప్ గా వచ్చేలా వాళ్ళిద్దరికీ ఓ ఫోటో తీయమని రిక్వెస్ట్ చేసింది ఓ విదేశీ జంట. ఒకటికి నాలుగు ఫోటోలు తీసి ఐఫోన్ తిరిగిస్తే, మొహాలు చేటంత చేసుకున్నారు ఆ చైనా అమ్మాయి, డెన్మార్క్ అబ్బాయీ. అమెరికా నుంచి వచ్చారట హంపిని చూడడానికి. వాళ్ళ ప్రేమకథని మూడుముక్కల్లో చెప్పేసి "ఇటీజ్ టూ హాట్ హియర్" అన్నారు. 'మా రాయలుకీ ఓ ప్రేమకథ ఉంది తెలుసా మీకు?' అని అడగాలనిపించింది. కానీ, 'చిన్నాదేవిని గురించి నాకు తెలిసిందెంత?' అనే సందేహం అడ్డొచ్చింది.

శ్రీకృష్ణాలయంలో చెక్కుచెదరని ఓ గోపురం 

హేమకూటం మీద ఉన్న గుళ్ళనీ, మండపాలనీ చూస్తున్నంతసేపు ఒకటే ప్రశ్న. ఇక్కడ ఉన్న రాళ్లనే తొలిచి వీటిని నిర్మించారా? లేక, వేరే చోట్ల నుంచి బండరాళ్లని ఈ కొండమీదకి చేర్చారా? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఏర్పాటు చేసిన బోర్డులో ఈ వివరం లేదు. ఆ మాటికొస్తే చాలా వివరాలే లేవు. హేమకూటం మీద కడలేకలు (శనగ గింజ) గణేశ, ససివేకలు (ఆవగింజ)  గణేశ ఆలయాలు రెండూ చెప్పుకోదగ్గవి. రెండు విగ్రహాలూ భారీగానే ఉన్నాయి. కడలేకలు గణేశుడి ఉదరభాగం చెక్కేసి ఉండడం చూసి చివుక్కుమనిపించింది. ఆ పొట్టలో విలువైన మణులు ఉండొచ్చన్న అనుమానమో లేక అందమైన ఆ విగ్రహాన్ని పాడుచేయాలన్న ప్రయత్నమో తెలియదు కానీ, క్రూరత్వానికి గుర్తుగా చెక్కేసిన బొజ్జ మాత్రం మిగిలిపోయింది. 

మరికాసేపట్లోనే - ఒడిలో లక్ష్మి లేని నరసింహుడినీ నీళ్లలో ఉన్న భారీ శివలింగాన్నీ దర్శించుకుని మరో నాలుగడుగులు ముందుకు వేసేసరికే - అంతకి వెయ్యింతల బాధ సుళ్ళు తిరిగింది, బలవంతంగా కూల్చివేయబడిన శ్రీకృష్ణ మందిరపు శిఖరాన్ని చూసినప్పుడు.  విగ్రహమూ, పూజా పునస్కారమూ లేని ఆ గుడిలో గడిపే ఒక్కో నిమిషమూ మరింత బరువైపోయింది. శిధిలాలలోనే ఇంత సౌందర్యం తొంగిచూస్తూ ఉంటే, వైభవోపేతమైన కాలంలో ఈ ఆలయం ఎలా ఉండి ఉండేది? ఏమి వాస్తు ఇది? ఎందరి శ్రమ ఈ నిర్మాణం? టైం మెషిన్ లో వెనక్కి వెళ్లి ఆ విధ్వంసాన్ని ఆపేయగలిగితే అన్న ఆలోచన మొదటిసారిగా కలిగింది. అదొక్కటేనా? ఆ శిధిల సౌందర్యాన్ని చూస్తూ ఉంటే ఉబికి వచ్చే ఆలోచనలు ఎన్నో, ఎన్నెన్నో. ఎటొచ్చీ, వాటిల్లో కొట్టుకుపోకుండా పట్టి బయటికి లాగేందుకు విరూపాక్ష లాంటి వాళ్ళు సదా సిద్ధంగా ఉంటారు. ...అలా తొలిరోజు హంపీ యాత్ర పూర్తయింది. 

(ఇంకా ఉంది) 

మంగళవారం, డిసెంబర్ 23, 2014

పతంజలి లేని అలమండ-2

(మొదటిభాగం తరువాత...)

కారు చాలా నెమ్మదిగా కదులుతోంది. ఇంత చిన్న ఊళ్ళో ఓ  ఇంటిని పట్టుకోలేక పోవడం ఏమిటన్న  పట్టుదల పెరిగినట్టుంది శ్రీకాంత్ కి. రోడ్డుకి రెండు వైపులా పరిశీలిస్తూ తాపీగా డ్రైవ్ చేస్తున్నాడు. కుడి వైపుకి చూస్తే రోడ్డుకి ఆనుకుని ఉన్న బాగా పాతకాలం నాటి దేవాలయం. కొత్తగా సున్నం వేశారు కాబోలు తళతళా మెరిసిపోతోంది. చుట్టూ ప్రహరీ, మధ్యలో పెద్ద ఖాళీ స్థలం. పెద్దావిడ చెప్పిన సంతబయలు అదే!! ఆవరణలో ఓ పక్క రావి చెట్టు కనిపించింది. కళ్ళు సంతబయలుని చూస్తున్నాయి. మనసులో ఓ పక్క దొమ్మీ యుద్ధం సినిమా రీల్లాగా గిరగిరా తిరుగుతోంది. మరోపక్క పతంజలి ఇల్లు ఎలా ఉండబోతోందో అన్న ఆలోచనలు.


శ్రీకాంత్ కి కూడా కుతూహలం పెరిగినట్టుంది. రోడ్డుకి రెండువైపులా పాతకాలపు ఇళ్ళేమన్నా కనిపిస్తాయా అని శ్రద్ధగా గమనిస్తున్నాడు. పెద్దావిడ 'కుడి వైపున' అని స్పష్టంగా చెప్పింది కానీ, ఎడంవైపున ఓ శిధిలావస్థలో ఉన్న ఇల్లు కనిపించగానే కారాపమన్నాను. రోడ్డునానుకుని ఉన్న ఇల్లు బాగా పాడైపోయింది కానీ, వెనుకగా ఉన్న ఓ ఇల్లు వాసయోగ్యంగా ఉండడమే కాదు అక్కడ మనుషుల అలికిడి కూడా కనిపించింది. ఆ ఇంటివైపు గబగబా నడిచాను. రాజుల లోగిలని ఎవరూ చెప్పకుండానే అర్ధమైపోయింది. వీధరుగు నిండా టేకు మానులు, కొమ్మలు సైజుల ప్రకారం కోసినవి అమర్చి ఉన్నాయి. తలుపు తీసే ఉంది కానీ, గుమ్మానికి తెర వేలాడుతోంది. తెరవెనుక గచ్చునేల పాలు ఒలికిపోతే ఎత్తుకోగలిగేలా ఉంది.


"ఎవరండీ ఇంట్లో.."  నా గొంతు నాకే కొత్తగా వినిపించింది. "వస్తున్నా" అంటూ వినిపించింది లోపలినుంచి. ఆ మాటతో పాటే ఓ స్త్రీ నడిచి వస్తున్న నగల చప్పుడు. రాణివాసపు ఘోషా స్త్రీ.. నాతో మాట్లాడతారో లేదో అని సందేహిస్తూ ఉండగానే, నన్ను రక్షిస్తూ మా వాళ్ళు వచ్చేశారు. ఆవిడ తెరవెనుక నిలబడ్డారు. ఆడవాళ్ళ మధ్య సంభాషణ జరిగింది. శిధిలావస్థ లో ఉన్న ఇంటి పక్కన ఓ తోట ఉంది. ఆ తోటకి ఎదురుగా ఉన్న ప్రహరీ ఇల్లే పతంజలిది. రోడ్డు మీదకి ఇల్లు కనిపించదనీ, గేటు దాటి బాగా లోపలికి వెళ్లాలనీ చెబుతూనే, గేటుకి తాళం ఉంటుందని చెప్పారావిడ. మొన్నటి తుపానుకి (హుద్ హుద్) టేకు చెట్లన్నీ పడిపోయాయనీ, ముక్కలు కోయించి పెట్టామనీ కూడా చెప్పారు. "మీ పేరేవిటండీ" అన్న మావాళ్ళ ప్రశ్నకి "ఉప్పలపాటోరి కోడల్నమ్మా" అని మాత్రం జవాబిచ్చి, నగలు చప్పుడవుతూ ఉండగా ఇంట్లోకి వెళ్ళిపోయారు.


వచ్చేశాం పతంజలి ఇంటికి. గుండె గొంతుకులోన కొట్టాడడం అంటే ఇదేనా? లోపలేదో విస్పోటనం లాంటిది జరుగుతోంది. ఏవిటీ ఉద్వేగం? కళ్ళలోనుంచి నీళ్ళెందుకు రావు?? ప్రహరీ గోడకి ఓ పెద్ద ఇనుపగేటు. ఆ గేటుకి తాళం. లోపలంతా జీబురు జీబురుగా.. కళ్ళు చికిలించుకుని బాగా లోపలికి చూస్తే దూరంగా, ఠీవిగా నిలబడ్డ పాతకాలం నాటి ఇల్లు. కొంత భాగం కూలిపోవడం తెలుస్తోంది. ఆవరణంతా పెద్ద పెద్ద చెట్లు. ఎక్కువగా మావిడి చెట్లే. వాటి రాలిన ఆకులతో పాటు, బాగా పెరిగిపోయిన గడ్డి నేలని కమ్మేసింది. "నేను ఆ తరంలో పుట్టాను" అని ఓ తరమంతా గర్వంగా చెప్పుకోగలిగే రచయిత తన బాల్యాన్ని గడిపింది ఇక్కడేనా?! నిజంగా ఇది పతంజలి ఇల్లేనా?? నా ఆలోచనల్లో నేనుండగానే కర్ర సాయంతో రోడ్డు మీద నడిచి వెళ్తున్న ఓ వృద్ధుడు మమ్మల్ని చూసి ఆగాడు. గోపాల్రాజు డాక్టర్ గారిల్లు చూడ్డానికి వచ్చామని శ్రీకాంత్ చెప్పాడతనికి.


"నానార్రైతుని.. తవరెవరూ?" తన చూపుడు వేలితో శ్రీకాంత్ పొట్టలో పొడుస్తూ అడిగాడా వృద్ధుడు. అది చూడగానే, "నువ్వెవరవోయీ? సేనాపతి అరసవిల్లివా.. రొంగలి అమ్మన్నవా లేక బిత్తిరి సోవులువా?" అని అడగాలనిపించింది. కానీ, "నానార్రైతుని" అని చాలా స్పష్టంగా ఆ ఇంటి మీద తన హక్కుని ప్రకటించుకుని, జవాబివ్వాల్సిన బాధ్యతని మా మీద పెట్టేశాడు కదా. "మీ రైతు 'మీరెవరు?' అని అడుగుతున్నాడు. ఏమని చెప్పాలి పతంజలి బాబూ? కనీసం 'రాజుల లోగిళ్ళు' అన్నా పూర్తి చేయకుండా జాతి యావత్తుకీ అన్యాయం చేసి వెళ్ళిపోయిన పతంజలికి పాఠకులం అని చెప్పాలా? చెప్పినా మీ రైతుకి అర్ధమవుతుందా??"  ...అక్కడికీ గొంతు పెగుల్చుకుని "మావు పతంజలి బావు చేయితులం" అన్నాను కానీ, నా మాట నాకే కొత్తగా వినిపించింది. ఇంతకీ ఆ రైతుకి వినిపించదట. ఆ మాటే శ్రీకాంత్ కి చెప్పి కర్ర తాటించుకుంటూ వెళ్ళిపోయాడు.


ఎదురుగా పతంజలి ఇల్లు. లోపలి వెళ్ళడానికి అడ్డుగా గేటుకి పెద్ద తాళం. ఏవిటి సాధనం? మేం ముఖాలు చూసుకుంటూ ఉండగా, "నేను ఫోటోలు తీసి పట్టుకొస్తా" అంటూ ఓ ఫోన్ అందుకుని చెంగున గోడ దూకేశాడు శ్రీకాంత్. అతగాడి ఉత్సాహం చూసి మాకు ముచ్చటేసింది కానీ, మా సంగతేవిటి? ఇంతదూరం వచ్చింది గేటుకున్న తాళం చూసి వెళ్లడానికా? గేటు వెనుకున్న సన్నాకుల మావిడిచెట్లు చూడగానే "పయిటేల" వాటికింద నిద్ర చేసే వీరబొబ్బిలి గుర్తొచ్చింది. అంతలోనే, ఓ రాత్రివేళ దివాణంలో ప్రవేశించిన దొంగాడికి అదే బొబ్బిలి కందా ఇంటికి దారి చూపించి, పోలుగు పిట్టల మాంసం కూరలో తన వాటా అడిగి పుచ్చుకున్న సంగతీ జ్ఞాపకం వచ్చేసింది. వెతికితే దివాణంలోకి ఏదో ఒక దొంగదారి దొరక్క పోతుందా?? ఉత్సాహంగా చుట్టూ చూస్తే ఓ చోట గోడ కూలిపోతే, ఒకదానిమీద ఒకటిగా రాళ్ళు అమర్చి ఖాళీని పూడ్చడం కనిపించింది. రాసోరింట్లోకి దారి దొరికేసింది!!


ఆ సాయంత్రం వేళ.. ఎండుటాకులు కాళ్ళకింద చప్పుడు చేస్తున్నాయి. దూరంగా కీచురాళ్ళ రొద వినిపిస్తోంది. ఆకులలముల చాటున పురుగూ పుట్రా ఉండొచ్చన్న జాగ్రత్త ఓ పక్కా, పతంజలి లోగిట్లో నడుస్తున్నానన్న భావన మరోపక్కా. ఎంత పెద్ద లోగిలసలు?! 'సీతమ్మ లోగిట్లో' కథ జరిగింది ఇక్కడేనా? ఒక్కో అడుగూ ముందుకు పడుతున్న కొద్దీ ఇల్లు మరింత దగ్గరగా వస్తోంది. సాక్షాత్తూ వాళ్ళ రైతే చెప్పినా సందేహమే, నిజంగా ఇది పతంజలి ఇల్లేనా?? అపనమ్మకం కాదు, ఆశ్చర్యం. ఫకీర్రాజు, చిట్టెమ్మ, మీర్జా పెదబాబు, అరసవిల్లి, వంటరాజు, గోపాత్రుడు, దుంపల దత్తుడు, ఈటె సూరి, కజ్జపు అప్పారావు, లగుడు ముత్తేల్ నాయుడు, పిల్లికళ్ళ సూరి, పాకలపాటి రంగరాజు మేష్టారు.. ఒక్కరనేమిటి? పతంజలి సృష్టించిన పాత్రలన్నీ సజీవులై ఆ ఆవరణలో తిరుగుతున్న భావన.


ముందు భాగం పైకప్పు కూలిపోయింది. నేలమీద మట్టిని తొలగిస్తే కొవ్వు గచ్చు మెరుస్తూ కనిపించింది. లోపల ఏ గదికీ తాళాల్లేవు. కొన్ని తలుపులైతే విరిగి పడిపోయాయి కూడా. తుపాను ప్రభావం కాబోలు. ఒక్కో గదినీ చూస్తుంటే మాటలకందని భావాలేవో సుళ్ళు తిరుగుతున్నాయి. ఫోటోలు తీసుకుంటూ, ఏ గది ఏమై ఉంటుందో ఊహించుకుంటూ ఉండగా.. చెదలు పట్టేసిన ఓ పుస్తకం మా వాళ్ళ కంట పడింది. పరీక్షగా చూస్తే తెలిసింది, అది 'రీడర్స్ డైజెస్ట్' అని. నిస్సంశయంగా ఇది పతంజలి ఇల్లే అనిపించిందా క్షణంలో. మండువా లోగిలి నిండా పిచ్చి మొక్కలు మొలిచిపోయి ఉన్నాయి. వాస్తు ప్రకారం ఆలోచించి, ఏ గదిని ఎందుకోసం వాడి ఉంటారో ఊహిస్తున్నాడు శ్రీకాంత్. "అప్పటి ఇల్లు కాబట్టండి.. కలపకెక్కడా చిన్న చెద కూడా లేదు చూడండి" అంటూ తను ఉత్సాహ పడుతూ మమ్మల్ని ఉత్సాహ పరుస్తున్నాడు.


రెండు చెక్క కుర్చీలు, ఓ చెక్క పెట్టి, ఓ పింగాణీ కాఫీ కప్పూ దుమ్ము కొట్టుకుపోయి కనిపించాయి. కందా ఇంట్లో గోడకి పుట్టపర్తి సాయిబాబా ఫోటో వేలాడుతోంది. ఓ పెద్దగదిని చెక్కలతో పార్టిషన్ చేసినట్టు తెలుస్తోంది. ఏమాత్రం ఆదరణ లేకపోయినా ఎంత మొండిగా నిలబడిందో కదా ఈ ఇల్లు అనిపించింది చూస్తుంటే. పతంజలిని జ్ఞాపకం చేసుకుంటూ ఇల్లంతా మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉండగా "ఈ పతంజలి ఏ విదేశంలోనో పుట్టి ఉంటే అతని పుట్టిల్లు మ్యూజియం గానూ, అతని ఊరు యాత్రా స్థలిగానూ మారి ఉండేవి కదా" అనిపించింది. "ఎక్కువరోజులుండదండి ఈ ఇల్లు" అని శ్రీకాంత్ అంటూ ఉంటే, వినడానికి బాధగా అనిపించింది. కానీ నిజం, ఇంకొంచం ఆలస్యం చేసి ఉంటే ఇల్లు పూర్తిగా శిధిలం అయిపోయి ఉండేదేమో. పతంజలి ఉండగా వచ్చి ఉంటే? "వాళ్ళు పిచ్చి వాళ్ళమ్మా" అని తన తల్లికి చెప్పి ఉండేవాడేమో, మాగురించి కూడా. వెనక్కి వెనక్కి చూసుకుంటూ లోగిలి బయటికి వస్తూ ఉండగా "ఫోటోలు ఫేస్ బుక్ లో పెట్టండి" అన్నాడు శ్రీకాంత్.

(అయిపోయింది)

సోమవారం, డిసెంబర్ 22, 2014

పతంజలి లేని అలమండ-1

విశాఖపట్నం నుంచి విజయనగరం దగ్గర పడుతూ ఉండగా పెట్రోల్ బంకు ఎదురుగా ఎడమవైపు వచ్చే రోడ్డుకి తిరిగి పది కిలోమీటర్లు లోపలికి వెళ్తే వచ్చే ఊరే అలమండ -- ఈ సమాచారం చాలదూ, పతంజలి పుట్టి పెరిగిన ఊరిని చూసిరాడానికి? పది కిలోమీటర్లు దాటినా ఎక్కడా ఊరన్నది కనిపించకపోవడంతో కారు డ్రైవర్ శ్రీకాంత్ కి కంగారు మొదలయ్యింది. రోడ్డు పక్కన నలుగురు మనుషులు కనిపించిన చోట కారాపి, అద్దం దించి "ఆల్మండ్ ఎలా వెళ్ళాలి?" అని అడుగుతూ ఉంటే నా గుండె తరుక్కుపోయింది.. "ఆల్మండ్ కాదు నాయనా.. అలమండ.. అలమండ" మనసు ఆక్రోశించింది. ముందుకెళ్ళమన్నారు వాళ్ళు.

మరో ఐదారు కిలోమీటర్లు ముందుకి సాగేసరికి పట్నపు వాసనలు ఏమాత్రం సోకని - కాస్త శుభ్రంగా ఉంటే బాగుండుననిపించే - ఓ పల్లెటూరు పలకరించింది. 'డా. అంబేద్కర్ సామాజిక భవనం, అలమండ' బోర్డు చూడగానే ప్రాణం లేచొచ్చింది. ఆడవాళ్ళూ, పిల్లలూ ఉన్నారు రోడ్డు పక్కన. "పతంజలి గారింటికి ఎలా వెళ్ళాలి?" కించిత్తు గర్వంగా అడిగాను. వాళ్ళు చాలా అయోమయంగా చూశారు. "రాజుగారు" అని చెప్పాను. "రాసోల్లు పెదసావిడి కాడుంటారు.. ఇల్లాగ లోనికెల్లాల" కుడివైపుకి దారి చూపించారు. పెదసావిడంటే రాజులందరూ కూడి "విదండీ చంగతి.. వదండీ బోగట్టా" అని మాట్లాడుకునే చోటు కదూ. ఇద్దరు పిల్లలు ఉత్సాహంగా కారెక్కి డ్రైవరు పక్కన సెటిలయ్యారు, మాకు పెదసావిడి చూపించడం కోసం.


రెండు మలుపులు తిరిగి కారు ముందుకి సాగుతూ ఉండగా ఓ కిళ్ళీ కొట్టు దగ్గర కూర్చున్న నీర్కావి పంచె రాజుగారు కనిపించారు. "సోలెడు ముక్కు" చూసి గుర్తు పట్టేయచ్చు ఏ రాజుగారినైనా. పెదసావిట్లో ఎవరూ లేరు. "ముందలికెల్తే సూరిబాబు గోరి లోగిలొత్తాది. రాసోలందరి బోగట్టా ఆరికి తెలుసు," పిల్లలు సలహా ఇచ్చారు డ్రైవర్ కి. సూరిబాబు గారి లోగిలి ముందు కారాగింది. పాతకాలం ఇల్లు కాదు, పది పదిహేనేళ్ళ క్రితం కట్టిన మేడ. లోగిలంతా పూలమొక్కలు. ఆ మొక్కల మధ్యలో వాటికి సంరక్షణ చేస్తున్న బాగా పెద్దాయన. గేటు తీసుకుని లోపలికి వెళ్లి చొరవగా ఆయన్ని పలకరించాను, "పతంజలి గారిల్లు చూద్దామని వచ్చామండీ.." నవ్వారాయన, "పుస్తకాలు చదివి వచ్చారా?" అన్న ప్రశ్నతో పాటుగా.

నీర్కావి పంచె రాజుగారు
"ఇదే రోడ్డులో ముందుకి వెళ్ళండి రామకోవెలొస్తుంది. దాటి ముందుకి వెడితే ఓ పెద్ద నుయ్యి కనిపిస్తుంది. దాన్ని ఆనుకుని ఉన్న లోగిలే పతంజలిది. ఎవ్వరూ ఉండడం లేదక్కడ. పతంజలి అంటే ఎవరికీ తెలీదు. గోపాల్రాజు డాక్టర్ గారిల్లు అని అడగాలి," ఓపిగ్గా చెప్పారాయన. "మీరెల్లండి.. మావు ఇల్లకెల్లిపోతాం," కారు దిగి తుర్రుమన్నారు పిల్లలిద్దరూ. వాళ్లకి పతంజలి తెలియకపోవడం నిరాశ పరిచింది మావాళ్ళని. పెద రామకోవెల చూడగానే కారాపమన్నాను. మూడు గుర్రాల బీడీ కాల్చుకుంటూ, "భూవి బల్లపరుపుగా ఉన్నాది" అని చెప్పి అలమండ భూవి తగువుకి గోపాత్రుడు తెరతీసింది ఈ కోవెల దగ్గరే. కోవెలని ఆనుకునే కిళ్ళీ కొట్టు. బొబ్బిలి రాజుగారిది కానీ కాదు కదా?!! కారాగడం చూసి ఇద్దరు ముగ్గురు మనుషులు దగ్గరికొచ్చి పలకరించారు. పల్లెటూళ్ళలో ఉండే సౌకర్యం ఇదే.

పెదసావిడి
"గోపాల్రాజు డాట్టర్ గోరు కాలం సేస్సేరు.. ఆరింట్లో ఎవర్లేరిప్పుడు" అన్న సమాచారం ఇచ్చేశారు, అడక్కుండానే. "వాళ్ళబ్బాయి పతంజలి కోసం" అని చెప్పినా ఇదే జవాబొస్తుంది. అందుకే, ఏమీ మాట్లాడలేదు. అడ్రస్ దొరికిన ఆనందంలో కారు డ్రైవ్ చేసేస్తున్నాడు శ్రీకాంత్. ఎవరింటికో కాకుండా ఓ ఇల్లు చూడడం కోసం ప్రయాణం పెట్టుకునే వాళ్ళు ఉండడం, వాళ్ళు తన కార్లో ప్రయాణం చేయడం అతనిక్కాస్త థ్రిల్లింగ్ గా ఉన్నట్టుంది. కిటికీలోంచి బయటికి చూస్తే తాటి తోపులు, పూరిళ్ళు కనిపిస్తున్నాయి తప్ప గోపాల్రాజు గారి దివాణం జాడ లేదు. నాలుగు రోడ్ల కూడలిని ఆనుకుని పెద్ద నుయ్యి. అక్కడ బట్టలుతుక్కుంటున్న ఆడవాళ్ళు. అడ్రస్ తప్పు చెప్పారా? లేక మేము దారి తప్పామా??

పెద రామకోవెల
"రాజుగోర్లిల్లు ఇక్కడేటీనేవు.. అలమండ్లో ఉంటాయారి లోగిల్లు.. ఎనక్కెల్లాలి," బట్టలుతుక్కుంటున్న ఓ స్త్రీమూర్తి వింతగా చూస్తూ చెప్పింది. పాపం, ఆవిడే మా అవస్థ గమనించి పక్కనున్న ఓ ఇంటి ముందు కూర్చుని అడ్డపొగని ఆస్వాదిస్తున్న ఓ పెద్దావిడని చూపించి, "రాసోల్ల బోగట్టాలైతే ఆయమ్మి సెబుతాది" అని సలహా ఇచ్చింది. తన అడ్డపొగ తపస్సుకి భంగం కలిగించినందుకు ఏమాత్రం విసుక్కోని ఆ పెద్దావిడ, "రాజుగోరంటే ఏ రాజుగోరు? సొట్ట రాజుగోరా? పిచ్చి రాజుగోరా? గుడ్డి రాజుగోరా?" అని ప్రశ్నలు సంధిస్తూ ఉంటే, తన అత్త దేవుడమ్మకి ఔషధం కోసం ఫకీర్రాజు ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి, పెదరాజుగోరికి దొరికిపోయిన కలగాడ నాయుడు కళ్ళముందు మెదిలాడు.


"ఓయమ్మ.. ఏనాటి గోపాల్రాజోస్సి. ఆబాబు నేడు గదా.. లోగిలిగూడా ఏటీ నేదు. తిన్నగెల్తే ఇసాపట్నం. ఎల్లొచ్చీండి" సలహా చెప్పి, చుట్టని నిప్పున్న వైపు నోట్లో పెట్టుకుని కళ్ళు మూసేసుకుందావిడ. ఓపిగ్గా నిలబడితే ఓ క్షణానికి కళ్ళు తెరిచి చిత్రంగా చూసింది. "ఎనక్కెల్తే సంత బయలొత్తాది. దాటెల్తే ఒత్తాదా రాజుగోరి లోగిలి. తాలవేసేసి ఉంటాది..." ఆవిడ ఓపిగ్గా చెబుతూనే ఉంది కానీ, 'సంత బయలు' దగ్గర ఆగిపోయాన్నేను. విశ్వాసాల కోసం అలమండ ప్రజలు దొమ్మీ యుద్ధానికి సిద్ధ పడిపోయిన చారిత్రక ప్రదేశం. చూడకపోతే ఇంకేమన్నా ఉందా అసలు?!!

భూవి బల్లపరుపుగా ఉంటాదని నమ్మిన రాజుల ఫౌజు రావి చెట్టు కిందా, గుండ్రంగా ఉందని వాదించిన వెలమల జట్టు మర్రిచెట్టు కిందా జమకూడి యుద్ధం మొదలు పెట్టిన స్థలం.. రొంగలి అమ్మన్నకి అతని పెదనాన్న రొంగలి బుజ్జి అచ్చం భగవద్గీతలో శ్రీకృష్ణుడి లాగా దొమ్మీ యుద్ధం సమగ్ర సారాంశాన్ని బోధ పరిచిన చోటు... అవతలి గ్రూపులో కుక్కలేవీ లేవని 'వీరబొబ్బిలి' చింతించిన తావు.. జామి పోలీసులొచ్చి దొమ్మీ గ్రూపులు రెండిటినీ అదుపులోకి తీసేసుకుని యుద్ధం మధ్యలోనే ఆగిపోడానికీ, అటు పిమ్మట మేస్ట్రెటు గంగాధరం గారు "భూవి బల్లపరుపుగా ఉంద"ని తీర్పు చెప్పడానికి కారణమైన ఆయొక్క సంత బయలు... నా ఆలోచనల్లో నేనుండగానే, పరిస్థితి అర్ధం చేసేసుకున్న శ్రీకాంత్ కారుని రివర్స్ చేశాడు.

(ఇంకా ఉంది)

సోమవారం, సెప్టెంబర్ 22, 2014

దక్షిణ కాశీ

ఉన్నట్టుండి మబ్బు పట్టేసింది ఆకాశం. చల్లబడిపోయింది వాతావరణం. రోడ్డుకి రెండు పక్కలా పచ్చని పంటపొలాలు. కొంచం దూరంగా కొబ్బరిచెట్లు. అప్పుడోటీ అప్పుడోటీ కారో, బస్సో కనిపిస్తున్నాయి తప్ప పెద్దగా ట్రాఫిక్ లేదు రోడ్డుమీద. 'ద్రాక్షారామం-20 కిమీ' బోర్డు కనిపించింది. అవును, శ్రీరమణ 'మిథునం' బుచ్చిలక్ష్మికి సమ్మంధం తప్పిపోయిన దాక్షారమే!

దాటి వెడుతున్న ఊరిపేరు గొర్రిపూడి. ఒకప్పుడు మాంచి రుచికరమైన జామిపళ్ళకి ప్రసిద్ధి. 'గొర్రిపూడి గావా' అంటే మదరాసు మార్కెట్లో ఎగబడి కొనేవాళ్ళు వ్యాపారులు. అయితే అదంతా చరిత్ర. ఉన్నట్టుండి ఆ ఊళ్ళో జామిచెట్లకి ఏదో తెగులు సోకడం, ఎక్కడా జామిచెట్టన్నది మచ్చుకైనా కనిపించకపోవడం వర్తమానం. రోడ్డుకి, పొలాలకి మధ్య కాయగూరల తోటలు. అప్పుడే కోసి తెచ్చిన కూరలని రోడ్డుపక్కనే అమ్ముతున్నారు రైతులు. బెండకాయలు, ఆనపకాయలు కొరుక్కు తినేయాలనిపించేలా ఉన్నాయి.

గాలి వేగం పెరిగి, సుళ్ళు తిరుగుతోంది. ఆకులు, అలమలూ గాలితోపాటు చుట్టుతిరుగుతూ ఎగురుతున్నాయి రోడ్డు మీద. వాతావరణంలో వర్షం వాసన తెలుస్తోంది. ఏ క్షణానైనా కుంభవృష్టి మొదలవ్వొచ్చు. వచ్చేసింది దాక్షారం. రోడ్డు పక్కనే పైడా వారి సత్రాన్ని ఆనుకుని విశాలమైన పార్కింగ్. నాలుగంగల్లో భీమేశ్వరాలయం తాలూకు పందిరి మొదలు. పందిట్లో అడుగు పెట్టడంతోనే ఫోన్ మోగింది. ఫోన్ ఆన్సర్ చేస్తూండగానే వర్షం మొదలయ్యింది. గొంతు మాట్లాడుతోంది. మెదడు, మనసు మాత్రం గొంతుతో కాక, కళ్ళతో చెలిమి చేస్తున్నాయి.


అతి విశాలమైన ప్రాంగణం, చుట్టూ పురాతన ప్రాకారం. ఏ పక్క చూసినా ఎత్తైన గోపురాలు. కుడిపక్క దూరంగా సప్తగోదావరం. "ఏదో పనిలో ఉన్నట్టున్నారు.. మళ్ళీ చేస్తాను.." కాల్ కట్టవ్వడం, వర్షం ఆగిపోవడం ఒక్కసారే జరిగాయి. సప్త గోదావరం వైపు అప్రయత్నంగా పడ్డాయి అడుగులు. ఆకుపచ్చగా ఉన్నాయి నీళ్ళు. వెళ్ళడానికి బాగా అరిగిపోయిన రాతిమెట్లు. ఎందరు నడిచిన దారో కదా ఇది! వ్యాసుడి మొదలు శ్రీనాథుడి వరకూ.. ఎందరెందరి కథలో ముడిపడి ఉన్న క్షేత్రం కదూ మరి.


జాగ్రత్తగా మెట్లు దిగి, కాళ్ళు తడుపుకుంటూ ఉండగా ఖాళీ షాంపూ పేకెట్ నా కాళ్ళని దాటి వెళ్ళింది. నాకే ఎందుకు కనిపిస్తాయి ఇలాంటివి? చేతులు కడుక్కుని, కాసిన్ని నీళ్ళు తలమీద జల్లుకుని పైకి వస్తే ఓ పెద్ద రావి చెట్టు. చుట్టూ అనేకానేక నాగప్రతిమలు. దగ్గరలో ధ్వజస్థంభం, పక్కనే పెద్ద నంది విగ్రహం. గుళ్ళోకి వెళ్లేముందు చుట్టూ చూడాలి అనిపించింది. ప్రదక్షిణా పథం మీద నడవడం మొదలుపెట్టాను. అనేకానేక స్థంభాలతో అన్నదాన మండపం. భోజనాల వేళ కాకపోయినా ఆడామగా ఓ ఇరవైమంది ఉన్నారు. కొందరు పెద్దగా అరుస్తున్నారు. చెవిన పడిన వాటిని బట్టి తెలిసిందేమంటే అక్కడేదో కులపంచాయితీ జరుగుతోందని.


దగ్గరలోనే ఓ గోపురం. ఊరికే ఉండక అటు వెళ్లాను. బయటికి దారి ఉంది. ఆ గోపురంలో బాటసారులు కొందరు కూర్చుని ఉన్నారు. అప్పుడే వాన వెలిసిన వాతావరణం కదూ. వాళ్ళలో ఒకతను చుట్ట వెలిగించాడు. ఘాటైన లంకపొగాకు. అతగాడు గుప్పుగుప్పున పొగ వదులుతూ ఉంటే, "కోవిల్లో చుట్ట కాల్చవచ్చునా?" అన్న వెంకటేశం అమాయకపు ప్రశ్నా, "కాలిస్తే కోవిల్లోనే కాల్చాలోయి. దీని పొగ ముందు సాంబ్రాణీ, గుగ్గిలం యేమూల?" అన్న గిరీశం సమాధానమూ గుర్తొచ్చేశాయి.


గుడిలోపలికి అడుగుపెట్టాను. గర్భాలయం చుట్టూ విశాలమైన రెండతస్తుల రాతి మండపం. ఆ మండపంలోనే ఉపాలయాలు. పదమూడు వందల ఏళ్ళనాటి నిర్మాణం! ఎంత శ్రద్ధగా మలిచారు ఒక్కో స్థంభాన్నీ!! ఈ నిర్మాణం నాకు తెలుసునా? నా కళ్ళముందే జరిగిందా?? పురాతన కట్టడం ఏదైనా చిరపరిచితంగానే అనిపించేస్తుంది అదేమిటో. నా మనసు వశం తప్పుతోందా లేక చాళుక్య ప్రభువుల ఆత్మలు అక్కడే సూక్ష్మ రూపంలో తిరుగాడు తున్నాయా? హేతువుకి అందనిదేదో జరుగుతోంది మొత్తానికి.


చల్లటి వాతావరణం, చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోనంతగా కళా కౌశలాన్ని సొంతం చేసుకున్న నిర్మాణం. కదలాలని అనిపించడం లేదు. కానీ, తప్పదు. పెద్దగా జనం లేరు ఆలయంలో. గర్భాలయం రెండు అంతస్తులు. అవును మరి, శివలింగం ఎత్తు సుమారు పద్నాలుగు అడుగులు. ముందుగా పీఠ దర్శనం చేసుకుని, పై అంతస్తుకి వెడితే, అక్కడ మళ్ళీ కళ్ళు చెదిరే చెక్కడం పనితో ఉన్న రాతిస్థంభాలు. ప్రదక్షిణ పూర్తయ్యింది. అయ్యవారు మొబైల్ ఫోన్లో మాట్లాడడం అయ్యింది అప్పుడే.


పళ్ళెంలో దక్షిణ చూసి "గోత్రనామాలు చెప్పండి" అన్నారు హుషారుగా. పాతికేళ్ళు ఉంటాయేమో. జంధ్యప్పోగు, బ్రహ్మచారని చెబుతోంది. పచ్చని మెళ్ళో బంగారు గొలుసు మెరుస్తోంది. "ధర్మపత్నీ సమేతస్య.." పేరు చెప్పమన్నట్టుగా చూశారు. ధర్మపత్ని పేరు చదవడం తప్పనిసరి చేసేసినట్టున్నారు అన్ని గుళ్ళలోనూ. పూజ పూర్తయ్యింది. "అటు నుంచి జాగ్రత్తగా దిగి వెళ్ళండి" సూచన వినిపించింది వెనుకనుంచి.

మళ్ళీ ఓసారి ఆలయం అంతా తిరిగి చూసి, అమ్మవారు మాణిక్యాంబ దగ్గర కూడా సెలవు తీసుకుని బయటికి వచ్చేసరికి తల పగిలిపోతుందా అన్నంత నొప్పి. అప్పటివరకూ కనీస సూచన కూడా లేదు, అదేమిటో. సప్తగోదావరం మీదనుంచి వీస్తున్న చల్లగాలి ఓ పక్కా, రోడ్డు మీద వాహనాల రణగొణ ధ్వని మరోపక్కా. ఫ్లాస్కులో టీ ఓచేత, కాగితం కప్పులు మరో చేతా పట్టుకు తిరుగుతూ కనిపించాడో కుర్రాడు, సంజీవిని తెస్తున్న హనుమంతుడిలా. టీని మించిన దివ్యౌషధం ఏముంది, తలనొప్పిని తగ్గించడానికి? మబ్బులు మూసుకొస్తూ ఉండగా మళ్ళీ ప్రయాణం మొదలయ్యింది.

గురువారం, నవంబర్ 01, 2012

ఓ జ్ఞాపకం... కృష్ణశాస్త్రిది...

"లిఫ్టు కావాలి సార్"
"చంద్రంపాలెం వెడుతున్నాం"
"మా ఊరేనండి.. థాంక్సండీ బాబూ.. రెండు కిలోమీటర్లు నడవాల్సొచ్చేది.."
"ఎవరింటికి మీరు?"
"ఉహు... ఎవరింటికీ కాదు.. ఊరికే...ఊరు చూద్దామని.."
"నిజం చెప్పండే.. ఊరికే మా ఊరు ఎవరొస్తారు?"


"మీ ఊళ్ళో స్కూలు ఉంది కదండీ.. అది చూద్దామని.."
"దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి స్కూలు..."
"ఓహ్.. ఆయన పేరు తెలుసా మీకు?"
"అయ్ బాబోయ్... ఏటా ఆయన పుట్టిన్రోజు సేత్తాం కదండీ.. ఆయాల అన్నీ ఆయన పాటలే ఏస్తాం మైకులో... 'గోరింటా పూసింది కొమ్మాలేకుండా..' ఇంకా సాలా పాటలు.."
"బాగా పాడుతున్నారు.. పాడండి.. పాడండి.."
"అంత బాగా రావండి.. 'ఆకులో ఆకునై.. కొమ్మలో పువ్వునై.."
"కొమ్మలో కొమ్మనై అండీ.. పాడండి..."
"ఆరు బేమ్మలు కామోలు.. మీరు గానీ సుట్టాలా?"
"కాదండీ.. ఆయన ఇల్లు చూద్దామని వెళ్తున్నాం"
"ఆయన ఇల్లే స్కూలికి ఇచ్చేశారండి.. అక్కడే ఇగ్రహం కూడా పెట్టావండి, ఆయంది.. ఆరి పిల్లలూ గట్రా ఒచ్చారండి అప్పుడు .."
"మీ వయసు చూస్తే, ఆయన పేరు కూడా మీకు తెలిసి ఉండకపోవచ్చు అనిపించింది"
"నిజం సెప్పాలంటే తెల్దండి.. ఇగ్రహం పెట్టాక, పుట్టినరోజులు సేత్తన్నారు కదండీ.. అప్పట్నుంచీ తెలుసు"
"మీరు...?"
"ఈరబాబంటారండి. కాకినాట్లో పెట్రోలు బంకులో సేత్తన్నానండి.. రోజూ ఎల్లొస్తా ఉంటాను..ఊళ్ళో సొంతిల్లండి.."
"పిఠాపురం రాజా వారికీ కృష్ణ శాస్త్రి గారికీ మంచి స్నేహం ఉండేదంటారు?"
"తెల్దండీ.. ఇప్పుడారి కోటా లేదక్కడ.. ఏయో గుర్తులు మాత్రం ఉన్నాయ్ లెండి..."
"భలేగా ఉందండీ మీ ఊరు.. పచ్చగా..."


"ఈ ఊరు చూసే రాసుంటారండి.. 'మేడంటే మేడా కాదూ...' భలే పాట కదండీ.."
"మీకు కృష్ణశాస్త్రి గారి పాటలన్నీ నోటికి వచ్చేసినట్టే ఉన్నాయే.."
"అంటే మరి, ప్రెతి సంవత్సరం ఆయన పుట్టిన్రోజుకి మైకులో ఈ పాటలే ఏసుకుంటాం కదండీ...కానీ, మాకు పెద్ద బాగోదండి ఊరు..రోడ్డు సరింగా లేదు.. ఆటోలు కూడా గమ్మున్రావు..కానైతే, అయన వల్ల పేరండి.. "
"బయటి నుంచి వచ్చిన వాళ్ళకే నచ్చుతుందన్న మాట అయితే..."
"అంతేనండి... ఇక్కడోసారి ఆపండి.. నే దిగుతాను.. తిన్నగా ఎల్లి, సెంటర్లో లెఫ్టు తిరగండి.. స్కూలు కనిపిత్తాది.. అక్కణ్ణుంచి మీరు తిన్నగా ఎల్లిపోవచ్చు.. ఆ రోడ్డు బాగుంటాది దీనికన్నా.."


"థాంక్స్ అండీ.."
"అయ్ బాబోయ్.. ఎంతమాటా.. నేను చెప్పాలండి.. మీరు లేకపోతే నడుచుకుంటా రావాల్సొచ్చును ఇంతదూరం.." 

(తెలుగునాట భావకవితకి పర్యాయపదంగా నిలిచిన దేవులపల్లి  వేంకట కృష్ణశాస్త్రి జయంతి నేడు)

గురువారం, జనవరి 12, 2012

ఉత్తరాంధ్ర యాత్ర-6

తిరిగి తిరిగి అలసిపోయి, ఆపై భోజనం చేశామేమో, అందరికీ నిద్ర ముంచుకొచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ నిద్రని పోగొట్టడానికా అన్నట్టు ఒక్కసారి డప్పు శబ్దాలు వినిపించాయి. అవేమిటా అనుకునే లోగానే గైడు వచ్చి చెప్పాడు, హోటల్ ప్రాంగణంలోనే టూరిస్టుల కోసం గిరిజనుల 'ధింసా' నృత్యం ఏర్పాటు చేశామని. ఆ ప్రకటన వినగానే అందరూ ఒక్కుదుటన డేన్స్ చూడడానికి కదిలారు. అందరితో పాటే మేమూను. ఓ డజను మంది గిరిజన స్త్రీలు టూరిస్టులతో కలిసి ఫొటోలకి ఫోజులిస్తున్నారు. గిరిజన యువకులు డప్పుల దరువు సరి చూసుకుంటున్నారు.

కాసేపట్లో ధింసా నృత్యం మొదలైపోయింది. నృత్యం జరుగుతూనే ఉంది కానీ, నేనెందుకో లీనం కాలేకపోతున్నాను. అప్పుడు చూశాను కొంచం పరిశీలనగా. అంచున్న శిల్కు చీరలు వాళ్ళు పద్ధతిలో కట్టుకుని, సిగలో ప్లాస్టిక్ పూలు ముడుచుకుని నృత్యం చేస్తున్న మహిళలు ఏదో యాంత్రికంగా కదులుతున్నట్టు అనిపించిందే తప్ప చేస్తున్న నృత్యంలో లీనమైనట్టు అనిపించలేదు. మధ్యమధ్యలో టూరిస్టుల వీడియో కెమెరాల వైపు చూస్తున్నారేమో, నాకు 'సాగర సంగమం' సినిమా ప్రారంభంలో ఎస్పీ శైలజ చేసే డేన్స్ గుర్తొచ్చింది.

నృత్యం అవుతుండగానే అందరినీ బస్సులు ఎక్కమన్న ప్రకటన వచ్చింది. మొదట గాలికొండ వ్యూ పాయింట్ చూపించి, అక్కడినుంచి బొర్రా గుహలు తీసుకెడతారట. బస్సు కిటికీ నుంచి చూస్తుంటే అరకు అందంగానే కనిపిస్తోంది.. ఏదో లోపం.. అదేమిటో అర్ధమయ్యేసరికి మేము గాలికొండ వ్యూ పాయింట్ చేరుకున్నాం. అరకులోనే ఎత్తైన ప్రదేశమట అది. బైనాక్యులర్స్ సరి చేసుకునే వాళ్ళు, ఫోటోలు దిగే వాళ్ళు, ఫోన్ సిగ్నల్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు.. అంతటా కోలాహలం. కొందరు గిరిజనులు కాఫీ గింజలు, కాఫీ పొడి, మసాలా దినుసులు అమ్మకానికి పెట్టారక్కడ. మన్యం కాఫీ అంటూ అప్పుడెప్పుడో పేపర్లో చూసింది గుర్తొచ్చి కాఫీపొడి తీసుకున్నాం.


నా ఆలోచన నిజమేనా అని నన్ను నేను పరిక్షించుకుంటూ, చుట్టూ వెతుకుతూ ఉండగానే బస్సు అనంతగిరి కాఫీ తోటలు దాటుకుని బొర్రా గుహలు చేరుకుంది. ఇక్కడ మాకు గంట టైం ఇచ్చాడు గైడు. మెట్లు ఎక్కుతూ, దిగుతూ ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఆ గుహలని లైట్ల వెలుగులో చూడడం ఓ చిత్రమైన అనుభూతి. రాక్ ఫార్మేషన్ గురించి ఎప్పుడో ఎక్కడో చదివిన సంగతులు గుర్తొచ్చాయి. గుహల నిర్వహణ బాగుంది. బయటికి వచ్చి రెస్టారెంట్లో టీ తాగుతుండగా గైడు కొంచం ఖాళీగా కనిపించాడు, ఇంకా రావాల్సిన వాళ్ళకోసం ఎదురు చూస్తూ. నాక్కలిగిన సందేహాన్ని అతని ముందు ఉంచేశాను. "అరకు అనగానే పసుపచ్చ పూలే గుర్తొస్తాయసలు. వాటిని చూడ్డం కోసమే ఈ సీజన్ ఎంచుకుని వచ్చాం. ఒక్క పువ్వూ కనిపించడం లేదిక్కడ," నా ప్రశ్న పూర్తి కాకముందే అందుకున్నాడతను.

"వాటిని వలస పువ్వులంటారు సార్ ఇక్కడ. ఆవ నూనె లాంటి నూనె వచ్చే గింజలని ఇచ్చే మొక్కలవి. ఇక్కడ, ఒరిస్సాలోనూ వంటలో ఆ నూనెనే వాడతారు. రెండు మూడేళ్ళ నుంచీ ఆ పంట వెయ్యడం మానేశారు వీళ్ళు. గత ఏడాది వరకూ అక్కడక్కడా కనిపించేది, ఈ ఏడాది ఒక్క మొక్కా లేదు," అతను చెప్పింది విన్నాక చాలా ఆశ్చర్యం కలిగింది నాకు. మరికొంచం కబుర్లలో పెట్టాను. గిరిజనుల నుంచి నూనె గింజలని గిరిజన కార్పోరేషన్ కొంటుందిట. రేటు గిట్టుబాటు కావడం లేదని ట్రైబల్స్ ఎప్పటినుంచో గొడవ చేస్తున్నాకార్పోరేషన్ పట్టించుకోవడం లేదుట. దానితో, ట్రైబల్స్ అంతా కూడగట్టుకుని, పంట వెయ్యడమే మానేశారుట. "ఎవరన్నా సినిమా వాళ్ళు వచ్చి, షూటింగ్ కోసమని డబ్బులిస్తే వాళ్ళు అడిగినంత మేరా పంట వేస్తారు సార్. ఈసారి సినిమా వాళ్ళు కూడా ఎవరూ వచ్చినట్టు లేరు," చెప్పాడు గైడు.

చాలా చాలా ఆశ్చర్యం కలిగింది నాకు. గిరిజనులంతా కలిసి ఓ నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నా, ప్రభుత్వంలో కదలిక లేకపోవడం, అన్నింటికీ మించి అనవసరమైన విషయాలకి హడావిడి చేసే మీడియా ఇంత ముఖ్యమైన విషయాన్ని కనీసం పట్టించుకోకపోవడం.. తరువాతి ప్రయాణమంతా ఇదే ఆలోచన వెంటాడింది నన్ను. పచ్చపూలు లేని అరకు బోసిగా కనిపించింది. అంతకు మించి, గిరిజనుల్లో వచ్చిన చైతన్యం ఓ వెలుగులాగా అనిపించింది. తైదా రిసార్ట్స్ దగ్గర టీ, స్నాక్స్ కోసం బస్సులు ఆగినప్పుడు మళ్ళీ కదిలించాను గైడుని. "బొర్రా గుహలు ఒక్కటే టూరిస్ట్ ఎట్రాక్షన్ సార్ ఇప్పుడు. బాక్సైట్ అంటున్నారు.. ఈ కొండలు ఉంటాయో, తవ్వేస్తారో, నాకు అనుమానంగానే ఉంది," అన్నాడతను.

అరకులో కనిపించిన మార్పులు, యాంత్రికంగా చేసిన ధింసా నృత్యం, పచ్చపూలు లేని అరకు, కొత్తగా వచ్చిన బాక్సైట్ విపత్తు..ఈ లోయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో, ఆలోచనకి అందలేదు. ఘాట్ రోడ్డులో బస్సు ప్రయాణం.. మెలికలూ, మలుపులూ ఎక్కువకావడంతో మావాళ్ళు కొంచం ఇబ్బంది పడ్డారు. దీనితో అలసట మరీ ఎక్కువగా అనిపించింది నాకు. జవాబు లేని ప్రశ్నలతో విశాఖ చేరుకున్నాను. బహుశా, కాలం మాత్రమే జవాబు చెప్పగలిగే ప్రశ్నలివి. ....."టూర్ అనగానే పొరుగు రాష్ట్రాలు కాదు. మన రాష్ట్రంలో చూడని వాటిని ముందుగా చూసెయ్యాలి," ఇల్లు చేరగానే మావాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఇది. (అయిపోయింది).