బుధవారం, ఆగస్టు 19, 2020

పాజిటివిటీ

"కావడి కొయ్యేనోయ్.. కుండలు మన్నేనోయ్.. కనుగొంటే సత్యమింతేనోయీ.." ...'దేవదాసు' గొంతుతో ఘంటసాల పాడుతున్న పాట అలలు అలలుగా వినిపిస్తోంది.. ఇదొక్కటేనా? జేసుదాసు విషాద గీతాలు, సత్యహరిశ్చంద్ర కాటిసీను పద్యాలు ఇవన్నీ రోజూ ఏదో ఒక టైములో తప్పకుండా వినడం ఈమధ్యనే వచ్చి పడిన కొత్త అలవాటు అయి కూర్చుంది. ఆ కథా కమామీషూ చెప్పాలంటే, మొన్నామధ్య జరిగిన 'మోటివేషన్ క్లాసెస్' దగ్గరికి వెళ్ళాలి. 'ఇంటి నుంచి పని' కారణంగా ఉద్యోగులంతా స్తబ్దుగా తయారయ్యారని అనుమానించిన శ్రీ ఆఫీసు వారు, ఓ బట్టతలాయనతో మాట్లాడి ఆన్లైన్ క్లాసులు ఏర్పాటు చేశారు. రోజూ రెండు గంటల చొప్పున నాలుగు రోజులు జరిగిన ఆ ముచ్చటలో మమ్మల్ని 'పాజిటివిటీ' లో ముంచి తేల్చడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడా శిక్షకుడు (ట్రైనర్). తీసుకున్న సొమ్ముకి న్యాయం చేయాలి కదా మరి. 

నాకు తెలిసినంతలో ఈ ట్రైనింగుల కల్చరు ఊపందుకుని ఓ ఇరవై ఏళ్ళు దాటింది. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి శిక్షణ ఇచ్చినా కొన్ని పడికట్టు మాటలు, ఇంకొన్ని పరమ రొటీను ప్రాక్టికల్సూ తప్పనిసరి. వినే వాళ్ళు కూడా, పరమ పాత విషయాల్ని కూడా జీవితంలో అప్పుడే తొలిసారి తెలుసుకుంటున్నటుగా అభినయించడానికి బాగా అలవాటు పడిపోయారు. "అన్నీ నీవే.. అంతా నీవే.. " అంటూ బాగా వినేసిన పాత పాటతో పలకరించాడు కొత్త ట్రైనరు. ఇక్కడ 'నీవే' అనగా పరమాత్మ కాదు, శిక్షణలో పాల్గొంటున్న అందరూ ఎవరికి వారే అన్నమాట. "సర్వశక్తులూ నీలోనే ఉన్నాయి.. ఈ సత్యం నీవు తెలుసుకున్న నాడు ప్రపంచం నీ పాదాక్రాంతమవుతుంది" అని హిందీ యాస వినిపించే ఇంగ్లీష్ లో ఇంకో జ్ఞాన గుళిక విసిరాడు. అతన్ని మేము వీడియోలో చూడడం తప్పని సరి, మా దివ్యమంగళ విగ్రహాలని అతగాడికి చూపించక్కర్లా (అడిగినప్పుడు తప్ప). లెక్చరు మొదలైన పది నిముషాలు తిరక్కుండానే చాట్ విండోలు యమ యాక్టివ్ అయ్యాయి. 

ఈ ట్రైనర్ ఎక్కడ దొరికి ఉంటాడు మొదలు ఎంత ఛార్జ్ చేసి ఉంటాడు వరకూ గాసిప్పులు మొదలయ్యాయి. అతగాడు ఇలాంటివి ఎన్ని చూసి ఉండడూ? ఉన్నట్టుండి  అందరూ ఆడియోలు ఆన్ చేసి తను చెప్పింది చెప్పినట్టు పలకమని ఆదేశించాడు. చిన్నప్పుడు బళ్ళో చెప్పిన 'ఇండియా ఈజ్ మై కంట్రీ..' లాంటిది (అతని స్వీయ రచన అనుకుంటా) ఒకటి చెప్పించాడు. దీనిమీద కూడా చాట్లో జోకులు బాగా పేలాయి.  ఓ గంటన్నా గడవక ముందే అతగాడు చెబుతున్నవన్నీ మన ప్రవచనాల్లోనే ఉన్నాయన్న నిశ్చయానికి వచ్చేసాం అందరం, అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష టైపులో. మొదటి రోజు రెండు గంటలూ పూరయ్యేసరికి, "ఇంకో మూడ్రోజులు భరించాలా?" అనే ఒకలాంటి నీరసం ఆవహించేసింది అందరినీ. క్లాసు సరిపోదన్నట్టు, హోమ్ వర్కు ఒకటి మళ్ళీ. దీంతో అందరికీ పూర్తిగా నీరసం వచ్చేసింది. 

(Google Image)

అతడు తెలివైన వాడు. ఎందుకంటే, రెండో రోజు 'హోమ్ వర్క్ చేశారా?' అని అడగలేదు. 'మీరు చేసి ఉంటారనే భావిస్తున్నా' అన్నాడు నమ్మకంగా. 'నచ్చావోయీ ట్రైయినరూ ' అనుకున్నాం చాట్ లలో. పాజిటివిటీని పెంచే పుస్తకాలూ సినిమాలని గురించి అనర్గళంగా ప్రసంగించాడు. జెనెరిక్ టాపిక్ అవ్వడంతో పెద్దగా బోరు కొట్టలేదు. పాజిటివిటీతో ప్రపంచాన్ని మార్చేయచ్చని నమ్మకంగా చెప్పాడు, చెడ్డవారి పట్ల కూడా మంచిగా ఉండమని మధురవాణికి సలహా ఇచ్చిన సౌజన్యరావు పంతుల్లాగా. ప్రశ్నలు అడగమనడమే తడవుగా, 'మనం ఓ పిచ్చికుక్కతో పాజిటివ్ గా ఉండడం ద్వారా దానిని మంచి కుక్కగా మార్చవచ్చా?' అనే ప్రశ్న వచ్చింది. సదరు 'పిచ్చికుక్క' గురించి తెలిసిన అందరం గుంభనంగా నవ్వుకున్నాం. ట్రైనరేమో పిచ్చి గురించీ, కుక్క గురించీ వివరించి, 'సమాన స్థాయి ఆలోచనలు' అనే కొత్త సిద్ధాంతం ప్రవేశపెట్టాడు. అనగా, ఒకే వేవ్ లెన్త్ ఉన్నవాళ్ళని మార్చవచ్చట. చాట్ బాక్స్ లోకి ఓ తెలుగు సామెత వచ్చి పడింది. 

మూడోరోజు రొటీన్ గానే గడిచింది కానీ, చివరిరోజున అతగాడు పాజిటివ్ థింకింగ్ ద్వారా గాయాలని మాన్పుట అనే కార్యక్రమానికి ఒడిగట్టాడు. కొత్తగా చేరిన కుర్రాడొకడు - రెండేళ్ల క్రితం తనకి బైక్ యాక్సిడెంట్ అయిందనీ, వెన్నునొప్పి ఇంకా పోలేదనీ చెప్పాడు. చిటికలో నొప్పి తగ్గిస్తానని ట్రైనర్ హామీ ఇచ్చి ఆన్లైన్ లోనే 'దేవుడా ఓ మంచి దేవుడా' టైపులో ఈ కుర్రాడిచేత 'నేను పడలేదు.. నాకు నొప్పిలేదు..' లాంటిది హిందీ యాస ఇంగ్లీష్ లో తను చెప్పి, తమిళింగ్లీషులో కుర్రాడిచేత చెప్పించాడు. ఈలోగా మేమంతా 'అసలు యాక్సిడెంట్ ఎలా అయి ఉంటుంది? రాష్ డ్రైవింగా? డ్రంకెన్ డ్రైవింగా?' లాంటి గాసిప్ మాట్లాడుకున్నాం చాట్లో.  ఇలా హాయిగా ఓ అరగంట పైగా గడిచాకా, 'నా నొప్పి సగం పోయింది' అని ప్రకటించాడు కుర్రాడు. ఎవరి అనుమానాలు వాళ్ళకున్నాయ్ కానీ, ఎవ్వరం కిమ్మనలా. పరిసరాల్ని పాజిటివిటీతో నింపుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పి ట్రైనింగ్ ముగించాడు శిక్షకుడు. 

ఓ రెండ్రోజులు టైమిచ్చి, ఓ ప్రత్యేకమైన కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చేసి మరీ అందరం కలిసి కుర్రాడిని అడిగేసాం, 'నీకిప్పుడేమీ నొప్పి లేదు కదా?' అనేసి. మేము ఊహించినట్టే "ఏమీ తగ్గలేదు. అతను ఫీలవుతాడని తగ్గిందని చెప్పా" అని గుట్టు విప్పాడు. ఆ ట్రైనింగ్ కోసం పెట్టిన ఖర్చుని వాటాలేసి అందరికీ తలోకొంచం ఏదో అలవెన్సు పేరుతో ఇచ్చి ఉంటే ఇంతకన్నా ఎక్కువ పాజిటివ్ గా ఉండేవాళ్ళం కదా అని నిట్టూర్చాము అందరం. సరే, అంత గొప్ప ట్రైనింగ్ లో పాల్గొన్నందుకు పాజిటివ్ గా ఉండే ప్రయత్నాలు ఎవరివంతుగా వాళ్ళం చేయాలి కదా.. నావరకు, 'దేవదాసు' పాటలు, హరిశ్చంద్ర పద్యాలని మించిన పాజిటివిటీ ఇంకెక్కడా కనిపించడంలేదు. అదిగో, "ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ.. " అంటూ గుర్రం జాషువా పద్యాన్ని అందుకున్నారు డీవీ సుబ్బారావు జూనియర్.. మరికాస్త పాజిటివిటీ నింపుకుని వస్తా.. 

సోమవారం, ఆగస్టు 17, 2020

అక్షరాంజలి

'నేనెవర్ని?' 'నన్ను నడిపించే శక్తి ఏమిటి?' ఆలోచనాపరులందరికీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదురవ్వక తప్పని ప్రశ్నలివి. అతికొద్దిమందిని ఏళ్ళ తరబడి వెంటాడే ప్రశ్నలూ ఇవే. మహర్షులు, మహాత్ముల జీవిత చరిత్రల్ని పరిశీలిస్తే, వాళ్ళ ప్రయాణం మొదలయ్యిందీ ఈ ప్రశ్నలతోనే అని తెలుస్తుంది మనకి. 'అనామకుడు' అనే కలంపేరుతో కథలు, నవలలు రాస్తున్న ఏ. ఎస్. రామశాస్త్రి చేత 'అక్షరాంజలి' అనే చిరుపొత్తాన్ని రాయించింది కూడా ఈ ప్రశ్నలే అనిపించింది, పుస్తకం చదవడం పూర్తి చేయగానే. భౌతికశాస్త్రంలో అత్యున్నత విద్యాభ్యాసం చేసి, భారతీయ రిజర్వు బ్యాంకులో ఉన్నతోద్యోగం చేసి, ఆర్ధిక శాస్త్రాన్ని గురించి ఆంగ్లంలో గ్రంధాలు రాసి, మధ్యమధ్యలో మాతృభాషలో కథలు, నవలలు రాసిన 'అనామకుడు' తన  'అక్షరాంజలి' ని పాఠకులకి అందించే మాధ్యమం గా పద్యాన్ని ఎంచుకున్నారు. 'చదువులలోని సారమెల్ల' చదవడం అంటే ఇదేనేమో. 

అరవై పేజీల పుస్తకాన్ని 'అక్షరాంజలి', 'ఆత్మ నివేదన', 'నీ వినోదం', 'మా సందేహం', 'నీ విలాసం', 'ఉపనిషత్తులు', 'సనాతన విజ్ఞానం', 'నా విన్నపం' అనే ఎనిమిది అధ్యాయాలుగా విభజించడంతో పాటు, తాను ప్రస్తావించిన అంశాల తాలూకు వివరణలతో ఓ 'అనుబంధం' ని కూడా జతచేశారు. "అరవై సంవత్సరాలుగా ఈ సృష్టి నన్ను అనుక్షణం అబ్బురపరుస్తూనే ఉంది. ఆనందంలో ముంచెత్తుతూనే ఉంది.." అని చెబుతూ,  "సృష్టికర్త ప్రేరణతోనే సృష్టిలో నేను చూస్తున్న విశేషాలనీ, వింతలనీ సృష్టికర్తకు విన్నవించుకునే ప్రయత్నం మొదలు పెట్టాను. ఆ ప్రయత్న ఫలితమే ఈ అరవై పద్యాల అక్షరాంజలి" అంటూ ఈ రచన వెనుక తన ప్రేరణని వచన రూపంలో వివరించి, అక్కడి నుంచి అత్యంత సరళమైన పద్యాలతో 'ఆత్మనివేదన' ఆరంభించారు కవి. 


"ఇచ్చితివీవు భోజ్యములు - ఇచ్ఛితి నీకు నివేదంబుగా/ ఇచ్చితివీవు పుష్పములు - ఇచ్ఛితి నీకు సుమమాలగా/ ఇచ్చితివీవు విద్యలను - ఇచ్చుచుంటిని పద్యమట్లుగా/ ఇచ్చిన  నీకె  ఇచ్చుటను - ఎంచక తప్పుగా స్వీకరించుమా" ..బహుశా 'నేను' నుంచి బయటికి వచ్చే క్రమంలో ఈయన చాలా దూరమే ప్రయాణం చేశారనిపించింది ఈ పద్యం చదువుతుంటే. 'నీ వినోదం' అధ్యాయంలోని పదకొండు పద్యాలూ మనకెప్పుడూ మామూలుగా అనిపించే ప్రపంచాన్ని, కొత్తగా చూపిస్తాయి. తారలు, కృష్ణ బిలాలతో కూడిన సౌర కుటుంబం మొదలు, క్రమం తప్పకుండా జరిగే ఉదయాస్తమయాలు, మానవ శరీర నిర్మాణం, సృష్టిక్రమం, ఒకే శరీర భాగాలతో పుట్టిన మనుషుల రూపురేఖల్లో స్థూలమైన, సూక్ష్మమైన తేడాలు.. వీటన్నింటినీ నిబిడాశ్చర్యంతో పరిశీలిస్తూనే, ఆటను సృష్టిచేసి, నియమావళి ఏర్పాటు చేసి ఆడనిచ్చేదీ, అందులో గెలవనిచ్చేది కూడా నువ్వే అంటారు సృష్టికర్తతో. 

మనందరికీ చూసే కళ్ళు, వినే చెవులు, ఆలోచించే మెదడు ఉన్నాయి. మన వివేచనతో మనం నిర్ణయాలు తీసుకుంటాం. అయితే ఈ నిర్ణయాలన్నీ మనవేనా లేక మనల్ని సృష్టించి, తన ఆటలో మనల్ని పావుల్ని చేసి ఆడించే సృష్టికర్తవా? ఇవే ప్రశ్నలు సంధించారు 'మా సందేహం' అధ్యాయంలో. 'నీ విలాసం' అధ్యాయం కూడా ఇవే ప్రశ్నలకి కొనసాగింపుగా అనిపిస్తుంది. "ఉపనిషత్తులలో కొన్ని కథలు అవాస్తవంగా కనిపించవచ్చు. కొన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నట్టు అనిపించవచ్చు. ఐతే మనం ఉపనిషత్తులు చదువుతున్నప్పుడు - అవి ఏ కాలంలో, ఏ పరిస్థితుల్లో చెప్పబడ్డాయో ఆలోచించుకోవాలి" అంటూ చేసిన సూచన, కేవలం ఉపనిషత్తుల విషయంలోనే కాదు సాహిత్య అధ్యయనానికి  కూడా వర్తిస్తుంది. 

ఈశ, కేన, కఠ, ప్రశ్నాది  దశోపనిషత్తుల సారాన్ని చిన్న చిన్న పద్యాల రూపంలో అందించడం వెనుక కవి/రచయిత  చేసిన కృషి అంచనాకి అందదు. "అనుకున్నది జరుగనపుడు/ అనుకోనిది జరిగినపుడు ఆరటపడకన్/ మనకది ప్రాప్తంబనుకొన/ మనసున సం'తృప్తి ' నింపు మాకందరికిన్" అంటారు 'నా విన్నపం' లో. అదంత సులువుగా సాధ్యమయ్యేదా? ఎన్ని దెబ్బలు తినాలి, ఎంత సాధన చేయాలి?? మొత్తంమీద చూసినప్పుడు, రెండు భిన్న ప్రపంచాలుగా అనిపించే భౌతిక శాస్త్రాన్ని, సనాతన ధర్మాన్నీ కలగలిపి పద్య రచన చేయడం ఈ పుస్తకం ప్రత్యేకత అనిపించింది. తెలియని విషయాలు చెప్పడం కన్నా, అందరికీ బాగా తెలిసిన విషయాలనే బాగా అర్ధమయ్యేలా చెప్పడమే ఎక్కువ కష్టమేమో కూడా అని మరోమారు అనిపించింది. ఈ పుస్తకాన్ని చదవాలనుకునే వారు 'కినిగె' నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కవి/రచయిత గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడొచ్చు.