శుక్రవారం, జులై 21, 2023

బతుకుబాటలో కొండగుర్తులు

ఆత్మకథ వేరు, దినచర్య (డైరీ) వేరు. ఒక వ్యక్తి జీవనగతిని, ఆలోచనలని, కృషిని, దృక్పథాన్ని వివరించేది ఆత్మకథ అయితే, ప్రతిరోజూ చేరిన పనుల తాలూకు రికార్డు దినచర్య. ఆత్మకథలుగా మొదలై డైరీలుగా మారిపోయిన ప్రముఖుల రచనలు కొన్ని ఇటీవల కాలంలో చదవడం తటస్థించింది. ఈ కోవలోకే వచ్చే రచన భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి 'బతుకుబాటలో కొండగుర్తులు.' గంభీరమైన శీర్షికతో, ఆసక్తికరమైన ఆరంభంతో ఆపకుండా చదివించే పుస్తకం అనే భావనని కలిగించినా, సగానికి వచ్చేసరికి ఈ భావన క్రమేణా పలచబడి ఆసక్తి స్థానంలో నిరాశ పెరగడం మొదలయ్యింది. ఇందుకు కారణం ఈ ఆత్మకథలో డైరీ ప్రవేశించి, కేవలం రోజువారీ కార్యకలాపాలు మాత్రమే క్లుప్తంగా ప్రస్తావించి (డైరీ నోట్స్) ఊరుకోవడమే. ఆత్మకథల మీద ఉన్న ఆసక్తి ఈ పుస్తకాన్ని కడదాకా చదివించింది.

ఒంగోలు పట్టణంలోని ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో మూడో సంతానంగా జన్మించిన కృష్ణమూర్తి బాల్యంలో చాలా సమస్యలనే చూశారు. తండ్రిని పోగొట్టుకుని, బంధువులు సాయంతో చదువు పూర్తి చేశారు. నిజానికి ఉన్నత విద్యకి బదులు, ఉద్యోగానికే వెళ్లాలని అనుకున్నారు కానీ, అనుకున్నట్టుగా ఉద్యోగం రాకపోవడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ తెలుగు సాహిత్యానికి బదులుగా, తెలుగు భాషా శాస్త్రాన్ని ఆప్షనల్ గా ఎంచుకోవడం కృష్ణమూర్తి జీవితంలో మొదటిమలుపు. ఈ మలుపు వెనుక ఉన్నవారు నాటి యూనివర్సిటీ లైబ్రేరియన్ అబ్బూరి రామకృష్ణారావు, అధ్యాపకులు గంటి జోగిసోమయాజి. చదువు పూర్తవుతూనే ఆంధ్ర విశ్వవిద్యాలయం లోనే ఉద్యోగం దొరకడంతో ఆర్ధిక సమస్యలు గట్టెక్కాయి. అటు తర్వాత, పెన్సెల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి భాషాశాస్త్రంలో పీహెచ్డీ చేసే అవకాశం రావడం జీవితంలో రెండో మలుపు.

చదువు పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చి ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర బోధన చేపట్టడం, హైదరాబాద్ యూనివర్సిటీ కి వైస్-ఛాన్సలర్ గా పనిచేయడంతో పాటు అనేక ప్రపంచ దేశాలు పర్యటించి, భాషాశాస్త్ర సదస్సులో పాల్గొని, కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేయడం మాత్రమే కాకుండా భాషా శాస్త్రానికి సంబంధించి పత్రాలు, పుస్తకాలెన్నింటినో రచించారు. చేకూరి రామారావు, బూదరాజు రాధాకృష్ణ లాంటి శిష్యులని తయారు చేశారు. ఉస్మానియాలో భాషాశాస్త్ర విభాగం ఏర్పాటు, విస్తరణకి ప్రత్యేక కృషి చేశారు. భాషకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచిన విధానపరమైన నిర్ణయాల వెనుక (తెలుగు అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు లాంటివి) ఉన్నారు. 

తెలుగులో భద్రిరాజు కృష్ణమూర్తి సంపాదకత్వం వహించి స్వరూప నిర్దేశం చేసిన మాండలిక వృత్తి పదకోశాలు భారతీయ భాషల్లోనే తొలి ప్రయత్నం. ప్రద ప్రయోగ కోశ నిర్మాణ పద్ధతులని రూపొందించారు. లింగ్విస్టిక్ సొసైటీ అఫ్ అమెరికా గౌరవ సభ్యత్వం, రాయల్ సొసైటీ అఫ్ ఎడింబరో విద్వత్ సభ్యత్వం లాంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ గౌరవాలు అందుకున్నారు. ఆత్మకథలు అంటే ఉన్న ఇష్టంతో పాటు, ఈ ప్రొఫైల్ లో కొంత తెలిసి ఉండడం ఈ పుస్తకం కొనడానికి కారణమైతే, ఆరంభం కడు ఆకర్షణీయంగా ఉండి ఏకబిగిన చదవడానికి దోహదం చేసింది. ముందే చెప్పినట్టుగా, సగం పేజీలు తిరిగేసరికి ఆత్మకథ బదులు దినచర్య దర్శనమిచ్చింది. తేదీల వారీగా ఏరోజు ఏ దేశంలో ఏ కార్యక్రమం లో పాల్గొన్నారో, ఎవరెవరిని కలిశారో వివరాలు నమోదు చేశారు. భాషాశాస్త్ర అధ్యయనం, పరిశోధనకి సంబంధించిన లోతైన వివరాలు బొత్తిగా లేవు.

తన డైరీకి అక్కడక్కడా యూనివర్సిటీ రాజకీయాలు, కుటుంబ విషయాలు జోడించారే తప్ప, ఒక భాషా శాస్త్రవేత్త ఆత్మకథ నుంచి పాఠకులు ఏం ఆశిస్తారు అన్న కోణం బొత్తిగా ఆలోచించలేదేమో అనిపించింది. చివరి రెండు అధ్యాయాలు ఆయన చెబుతుండగా వేరే వారు రాసినవి. అక్కడ నుంచి కథనం ప్రధమ పురుషలోకి మారింది, వివరాలు మాత్రం మారలేదు. హైదరాబాద్ యూనివర్సిటీలో చేసిన అభివృద్ధి పనుల జాబితా దర్శనమిచ్చింది. పట్టి చూస్తే నాటి విద్యావిధానం, విదేశీ ప్రయాణాల తీరుతెన్నులు, దేశ-విదేశీ జీవన విధానాల లాంటి వాటిని గురించి కొన్ని పరిచయ వాక్యాలు కనిపిస్తాయి తప్ప లోతైన వివరణ దొరకదు. 'వాళ్ళతో సంభాషించాను' 'అక్కడ కూర్చుని రాసుకున్నాను' లాంటి వాక్యాలు లెక్కకు మిక్కిలి. ఆ సంభాషణలు, రచనల 'లోతు' తాలూకు ప్రస్తావన లేదెక్కడా.

పదేళ్ల క్రితం ఎమెస్కో ప్రచురించిన ఈ పుస్తకం మధ్యలో ఓ పద్దెనిమిది పేజీలని కేవలం ఫోటోలకి కేటాయించారు. పేపర్ క్వాలిటీ బొత్తిగా లేకపోవడం వల్ల ఆ ఫోటోలు బొత్తిగా అలుక్కుపోయి కనిపిస్తున్నాయి. రచయిత కుటుంబ సభ్యులైనా ఆ ఫోటోల్లో ఉన్నదెవరో గుర్తు పట్టగలరా అంటే సందేహమే. కాగితపు నాణ్యత పెంచడమో, ఫోటోల ప్రచురణ పరిహరించడమో చేసి ఉండాల్సింది. ఆ విధంగా రచనతో పాటు ముద్రణ కూడా నిరాశ పరిచింది. భద్రిరాజు కృష్ణమూర్తి కాలం, చేసిన కృషి, పొందిన అవకాశాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు నాటి సమాజం మొదలు, తెలుగులో భాషా శాస్త్ర అభివృద్ధి వరకూ చాలా విషయాలని వివరించే వీలున్న పుస్తకం ఇది. మరి ఈ 'స్కోప్' ని ఉపయోగించుకోక పోవడం వెనుక యేవో కారణాలు ఉండే ఉంటాయి. ('బతుకుబాటలో కొండగుర్తులు', పేజీలు 214, వెల రూ. 100).

బుధవారం, జులై 19, 2023

శ్రీరమణ ...

సుమారు పాతికేళ్ల క్రితం మాట. ఒక సాహిత్య సభ జరగాల్సి ఉంది, అప్పటికే గంటకి పైగా ఆలస్యం. ఉన్న కొద్దిమంది ప్రేక్షక శ్రోతలూ కాస్త అసహనంగా ఉన్నారు. ఇంతలో చిన్నపాటి కలకలం, "శ్రీరమణ గారొస్తున్నారు.." అంటూ. నేనేమో 'ద్వారానికి తారా మణిహారం' లాగా గుమ్మం దగ్గర నిలబడి మిత్రులతో కబుర్లు చెబుతున్నాను. పరిస్థితిని బట్టి లోపలికో, బయటికో వెళ్లేందుకు వీలుగా. లోపలికి వెళ్ళబోతున్న శ్రీరమణ నా పక్కనే ఆగారు. అవి 'మిథునం' రోజులు. అంటే, 'మిథునం' కథా సంకలనం విడుదలై ఎక్కువమంది మెప్పు పొందిన రోజులు. 'మిథునం' కథకైతే కల్ట్ స్టేటస్ వచ్చేస్తూ ఉన్న కాలం. "ఈయన శ్రీరమణ గారు, మిథునం, తెలుసుకదా.." ఓ మిత్రుడు నన్నాయనకి పరిచయం చేసేశాడు. వేదిక మీద ఔత్సాహిక గాయని పాట పాడుతోంది. శ్రీరమణ అక్కడే ఆగిపోయారు. అలాంటి అనూహ్య పరిస్థితిలో ఆయనతో చిరు సంభాషణ సాగింది.

"మీ స్వస్థలం ఎక్కడండీ? 'షోడా నాయుడు' లో మగ్గాల వర్ణన చదివి, ఏ ఊరు అయి ఉంటుందా అని ఆలోచించాను" చాలా కేజువల్ గా అడిగాను. "తెనాలి దగ్గర అండీ.. ఆ మగ్గాలూ అవీ నా చిన్నప్పుడు, ఇప్పుడు ఉన్నట్టు లేవు" అంతే కేజువల్ జవాబు. "ఆ కథ ముగింపు చాలా ప్రత్యేకం.. మొత్తం కథ ఒక ఎత్తైతే, ముగింపు ఒక్కటీ ఓ ఎత్తు.." అంతకు ముందే చదివి ఉన్నానేమో, నాకు కథలన్నీ బాగానే గుర్తున్నాయి. "థాంక్యూ" క్లుప్తంగా వచ్చింది జవాబు. సన్నగా, ఆయనే ఒక కాలమ్ లో వరవరరావుని వర్ణించినట్టు 'పంట్లాము తొడుక్కున్న కృపాచార్యుడిలా' అనిపించారు శ్రీరమణ. "ధనలక్ష్మిలో భాష.. అసలు ఎలా పట్టుబడిందా అనిపించింది చదువుతుంటే. కథకుడి భాష వేరు, ధనమ్మ, రామాంజనేయులు భాష వేరు.. పై పెంకు మరియు కోడిపిల్ల..." చెబుతుండగానే నవ్వొచ్చింది నాకూ, శ్రద్ధగా వింటున్న ఆయనకీ కూడా. "తెలిసిన వాళ్లేనండి .. నాకు తెలిసిన మనుషులే అందరూ." గాయని పాట కొనసాగుతోంది.

"బంగారు మురుగులో కొన్నిచోట్ల నన్ను నేను చూసుకున్నాను.. బామ్మ మరీ ఐడియలిస్టిక్ గా అనిపించింది కొన్నిచోట్ల.." నా అనుభవం కొద్దీ అన్నమాట. "లేదండీ, ఉన్నారు అలాంటి వాళ్ళు.." మళ్ళీ క్లుప్తమైన జవాబు. "ఆయన్ని అందరూ 'మిథునం' శ్రీరమణ అంటారు, మీరసలు ఆ కథ మాటే ఎత్తడం లేదు?" ఆయన పక్కనున్నాయన ప్రశ్నించాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన జయప్రభ ('పైటను  తగలెయ్యాలి' ఫేమ్ ఫెమినిస్టు కవయిత్రి) "ఏంటి రమణా? ఆడవాళ్లు అంటే ఎంతసేపూ వండి పెట్టడమేనా? ఆ బుచ్చిలక్ష్మికి వేరే పని లేదా?" అంటూ ప్రశ్నలు కురిపిస్తూ ఆయన్ని లోపలికి తీసుకు (లాక్కు)పోయారు. నేను నిలబడిపోయాను. అది మొదలు, శ్రీరమణ పుస్తకం ఎప్పుడు చదివినా, ఈ సన్నివేశం మొత్తం నిన్ననే జరిగినంత తాజాగా గుర్తొస్తూ ఉంటుంది. వాక్యం మీద అద్భుతమైన అదుపు ఉన్న కొద్దిమంది తెలుగు రచయితల్లో శ్రీరమణ ఒకరు. పొదుపైన వాక్యాలతో విస్తారమైన (నిడివి పరంగా) కథలు రాసిన శ్రీరమణ ఇక లేరన్న వార్త తెలియగానే ఇదిగో మళ్ళీ ఇంకోసారి గుర్తొచ్చింది నాటి చిరు సంభాషణ.


పేరడీ మొదలు ముందుమాట మీదుగా ఎలిజీ వరకూ ఏం రాసినా ప్రతి ప్రక్రియ మీదా తనదైన ముద్ర వేశారు శ్రీరమణ. 'పాషాణ పాక ప్రభువు' విశ్వనాథ శైలిని అనుకరించడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. వ్యంగ్యంతో సహా ఏరసాన్ని ఎక్కడ ఏమోతాదులో వాడాలో బాగా తెలిసిన రచయిత అవ్వడం వల్ల రచనలన్నీ బాగా పండాయి. కొన్ని కాలమ్స్, కథల్ని మరిపిస్తాయి. చాలా కథలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. నవలలు మరికాస్త బావుండొచ్చు అనిపించినా బొత్తిగా తీసేసేవి కాదు. ఇతరుల రచనలకి ఆయన రాసిన ముందుమాటలు రెండు రకాలు. రచనని ఇష్టపడి మనస్ఫూర్తిగా రాసినవి, మొహమాటానికి బలవంతంగా రాసినవి. చదువుతూనే అవి ఏ కోవకి చెందుతాయో ఇట్టే పోల్చుకోవచ్చు. చదివినంతలో ఓ రెండు బలవంతపు ముందుమాటలు ఎప్పుడు తల్చుకున్నా నవ్వు తెప్పిస్తాయి. ఈ రెండూ కాకుండా మూడోరకం 'నాస్తికానికి ముందుమాట', నరిశెట్టి ఇన్నయ్యగారు ప్రచురించని ముందుమాట దానికదే సాటి.

నివాళి వ్యాసాలదీ ఇదే తీరు. చాలావరకు మనస్ఫూర్తిగా రాసినవే. పోయిన వాళ్ళ సుగుణాలతో పాటు, వాళ్ళతో తన అనుబంధాన్ని తల్చుకుంటూ రాసిన విలువైన నివాళులవి. కొన్ని మాత్రం పూర్తిగా భిన్నం. పోయినవాళ్ళు కనుక బతికితే, ఆ నివాళి చదవగానే గుండాగి చచ్చిపోతారేమో అనిపించేలాంటివి. పెంకితనంగా రాసినవి.  రానురానూ ఈ ధోరణి బాగా పెరిగింది కూడా, బొత్తిగా ఎవరినీ క్షమించలేదు. ఎవరైనా ఓ రచయిత రచనలు అన్నీనో, ఎక్కువగానో చదవడం వల్ల జరిగేది ఏంటంటే ఆ రచయిత మనకి బాగా తెలిసిన వ్యక్తి అయిపోతారు. కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి ఏం రాస్తారో ఊహించ గలుగుతాం, ఎదురు చూస్తాం కూడా. శ్రీరమణ వీక్లీ కాలమ్స్ విషయంలో నా అనుభవం ఇదే. 'సాక్షి' నాటికి ఆయన కాలమ్ ఏ విషయం మీద మొదలు, ఎలా ఉండబోతోంది వరకూ ఓ అంచనా ఉండేది. చాలాసార్లు అది నిజమయ్యేది కూడా. కీలకమైన రాజకీయ సందర్భాలని వ్యంగ్యాత్మకంగా రికార్డు చేశారు.

'చిలకల పందిరి' ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆర్టిస్టు మోహన్ తో కలిసి శ్రీరమణ చేసిన ఈ జుగల్బందీ అంటే నాకు మాత్రమే కాదు, శ్రీరమణకి, మోహన్ కీ కూడా ప్రత్యేకమైన ఇష్టం. అల్లదిగో ఆ పుస్తకం వచ్చేస్తోంది అంటూ చివరివరకూ ఊరిస్తూనే వచ్చారు శ్రీరమణ. అదొక్కటే కాదు, 'దేవుడు మేలు చేస్తే..' అంటూ ఆయన విప్పిన జాబితాలో నుంచి ఇంకా రావాల్సిన పుస్తకాలున్నాయి. ఇప్పుడు వాటి బాధ్యతని ఎవరు చూస్తారో మరి. వంకమామిడి రాధాకృష్ణగా ఓ ఇంట్లోనూ, కామరాజు రామారావు గా మరో ఇంట్లోనూ పెరిగి, తనకంటూ 'శ్రీరమణ' అనే పేరు పెట్టుకుని రచయితగా ఎదిగి, రాయాల్సినన్ని కథలూ, వ్యాసాలూ రాయకుండానే వెళ్లిపోయారు. 'రాయాల్సినన్ని' కి ప్రాతిపదిక ఏమిటంటే ఆయనకున్న విషయ పరిజ్ఞానం, విస్తృతమైన పఠనానుభవం, తనదైన రచనా శైలీను. రాసిన పుస్తకాలన్నిటినీ వెలుగులోకి తీసుకురావడమే శ్రీరమణకి ఇవ్వగలిగే ఘనమైన నివాళి.