ఆదివారం, డిసెంబర్ 15, 2019

గజ్జె ఘల్లు మన్నదో ...

"వంగతోటెంతొ బాగుంది వయ్యారి వడ్డీలు చెల్లించి పో.. 
కొత్త కవ్వి౦త పుట్టించి గల్ల౦తు చేసేసి వేడిక్కిపో.. వేధించుకో.. వేటాడుకో.."

ఓ అమ్మాయి మావిడిపండులా ఉండే తన మేనమామతో ప్రేమలో పడింది. ఆ మేనమామకి ఆ అమ్మాయి మీద బొత్తిగా అలాంటి అభిప్రాయం లేదు. వాళ్ళుండేది కృష్ణా జిల్లాలో ఓ పల్లెటూళ్ళో. వాళ్ళిద్దరికీ ఓ శృంగార ప్రధానమైన యుగళగీతం రాయాలి (నిజానికి రెండు). దర్శకుడు శరత్ సందర్భం చెప్పారు. సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి ట్యూన్ ఇచ్చారు. 'బావ-బావమరిది' (1993) సినిమా కోసం వేటూరి రాసిన పాట ఇలా మొదలైంది: 

"గజ్జె ఘల్లు మన్నదో గుండే ఝల్లు మన్నదో.. 
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో.. 
తట్టుకో తడే తమషా.. ఇచ్చుకో ఒడే మజాగా..
లేత చీకట్లో నీ ఒళ్ళు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే.. 
సోకు పూరేకులా విచ్చి మారాకులేసింది నన్నంటుకో.. చిన్నింటిలో.. జున్నంటుకో.."



'సిరిసిరిమువ్వ' సినిమాలో 'గజ్జె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది..' అంటూ తాను రాసిన పల్లవినే మరో అర్ధంలో ఉపయోగించారు వేటూరి. ఇక్కడ నాయకుడు ఎద్దుబండి మీద తిరిగే రైతు. ఆ బండి తాలూకు గజ్జెల శబ్దం వినిపించిందంటే అతను వస్తున్నాడని అర్ధం. ఆమె గుండె ఝల్లుమనడం సహజం. అతనికేమో ఆమె కాలి అందెల సవ్వడి వినిపిస్తూ ఉంటే గుండె ఝల్లుమంటోంది, జరగబోయే తతంగాన్ని తల్చుకుని. 'గుట్టు చప్పుడు కాకుండా' అనే వాడుకని, గుట్టు చప్పుడయింది అని చెప్పడం సందర్భోచితమే. శృంగార ప్రధాన గీతాల్లో జున్ను ప్రస్తావన తేకుండా ఉండరు వేటూరి, పైగా ఇక్కడ నాయికా నాయకులవి వ్యవసాయ ప్రధానమైన కుటుంబాలు కూడా. ఇక తొలి చరణానికి వస్తే: 

"ఒంపుల్లో సొంపుల్లో వాటేసుకుంటేనె సంపంగి కంచాలు.. 
ఒళ్లంటుకుంటేనె ఝల్లంటు పుట్టేను వయ్యారి గంధాలు.. 
నీ గాలికే పైట మేఘాలు కమ్మేను సాయంత్ర వేళల్లో.. 
నీ చూపుకే ఊపు ఉయ్యూరు దాటేను ఉల్లాస లీలల్లో.. 
గుత్తమైన గుమ్మ౦దమూ.. వత్తుకున్న వడ్డాణమూ.. గంట కొట్టె కౌగిళ్ళలోనా.. 
మువ్వగోపాల రమ్మంది ముద్దిచ్చి పొమ్మంది మువ్వెన్నడో.. 
జివ్వు జివ్వంటు నా గువ్వ గూడెక్కి కూసింది నీ కోనలో.. నీరెండలో.. నీ గుండెలో.."

శృంగారంతో పాటు స్థానీయతని కూడా పాటలో మేళవించారు వేటూరి. ఊపు ఉయ్యూరు దాటడం, మువ్వగోపాలుణ్ణి మువ్వ (మొవ్వ) ముద్దిచ్చి పొమ్మందనడమూ ఈ కోవలోవే. (మువ్వగోపాల పదాలు రాసిన క్షేత్రయ్య స్వస్థలం కృష్ణా జిల్లాలో మొవ్వ గ్రామం అంటారు పరిశోధకులు, ఆ మొవ్వని మువ్వ అనడమూ కద్దు). రెండో చరణానికి వచ్చేసరికి, నాయికా నాయకులు కూడా రెండో దశకి వచ్చేశారు: 

"చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మ లాడేను నీ గోరువంకల్లో.. 
చీరంటు సిగ్గుల్లొ ఛీ పోలు రేగేను నా పూల సంతల్లో.. 
కొండమ్మ కోనమ్మ కోలాటమాడేను నీ రూపురే్ఖల్లో.. 
ఆడున్న యీడమ్మ ఈడొచ్చి కుట్టేను నీ వాలుచుపుల్లో.. 
పంచదార పందిళ్ళలో.. మంచు తేనె సందిళ్ళలో.. పాలు పంచుకోరా నా ప్రాయం.. 
వంగతోటెంతొ బాగుంది వయ్యారి వడ్డీలు చెల్లించి పో.. 
కొత్త కవ్వి౦త పుట్టించి గల్ల౦తు చేసేసి వేడిక్కిపో.. వేధించుకో.. వేటాడుకో.."

బుగ్గలు ఎరుపెక్కడం సహజమే కానీ, పక్షులు వాటిని పూలుగానో పళ్ళు గానో భ్రమించేంతగా ఎరుపెక్కాయని చెప్పడం ఆమె విరహ తీవ్రతకు చక్కని ప్రతీక. అతనిలో పురుషుడికి ఆమెలో ప్రకృతి (కొండా కోనా) కనిపించింది. ఆడున్న (అక్కడ ఉన్న) యీడమ్మ (వయసు) ఈడొచ్చి (ఇక్కడికొచ్చి) కొట్టేను అంటూనే, వాలుచూపుల్లో అని ముక్తాయించారు. పాలు-తేనే, పాలూ-నీళ్ళూ, పాలూ-పంచదారా.. ఇవన్నీ ఆలుమగలు ఎలా ఉండాలో చెప్పడానికి వాడే ఉపమలు. లావాదేవీల గురించి మాట్లాడేప్పుడు 'ఎక్కడైనా బావ కానీ, వంగతోట దగ్గర కాదు' అంటూ ఉంటారు. ఆ వాడుకని యుగళగీతంలోకి తేవడం వేటూరికే చెల్లు. 

బాలూ చిత్ర పోటీ పడి పాడిన ఈ పాటని సుమన్-మాలాశ్రీ లపై చిత్రీకరించారు. ఈ సినిమా విజయంలో పాటలది ప్రధాన పాత్ర. (నిజానికి ఇదే సినిమాలోని మరో యుగళ గీతం నాక్కొంచెం ఎక్కువ ఇష్టం. కానీ, బ్లాగ్ మిత్రులు పరుచూరి వంశీకృష్ణ మొదటగా నేనీ పాటని గురించే టపా రాసేలా చేశారు!)

గురువారం, డిసెంబర్ 12, 2019

గొల్లపూడి ...

నటుడు, రచయిత, పాత్రికేయుడు గొల్లపూడి మారుతి రావు ఇక లేరు. ఎనభయ్యేళ్ళ జీవితంలో తనకి కావాల్సినవన్నీ స్వయంకృషితో సాధించుకున్నారు. కష్టాలకి కుంగిపోకుండా, పొగడ్తలకి పొంగిపోకుండా జీవితం గడిపిన గొల్లపూడికి తీరకుండా మిగిలిపోయిన కోరికలు బహుకొద్ది. మొదట రచయితగానూ, ఆ తర్వాత నటుడిగానూ ఆయన పరిచయం నాకు. అయితే, ఆయనలోని రచయితే నన్నాయనకు ఏ కొద్దో దగ్గర చేసింది. గడిచిన పది-పన్నెండేళ్ల  కాలంలో జరిగిన మూడు సమావేశాల్లోనూ అనేక విషయాలు చర్చకి వచ్చినా, ఎక్కువగా మాట్లాడుకున్నది సాహిత్యాన్ని గురించే. 

గొల్లపూడిని గురించి ఆగి, ఆలోచించిన సందర్భం 'సాయంకాలమైంది' నవల చదివినప్పటిది. పదిహేనేళ్ల క్రితం ఒక రాత్రివేళ ఆ నవలని చదవడం మొదలు పెట్టి, తెల్లవారు జాముకి పూర్తి చేసి, చివరి పేజీ నుంచి మళ్ళీ మొదటి పేజీకి వచ్చి వెనువెంటనే రెండో సారి చదవడాన్ని జీవితంలో మర్చిపోలేను. అప్పుడు నేనున్న పరిస్థితుల వల్ల కావొచ్చు, నచ్చాల్సిన కన్నా ఎక్కువగా నచ్చేసిందా పుస్తకం. సమస్యల్లో ఉన్నప్పుడు పుస్తకాలని ఆలంబన చేసుకోడం నాకు కొత్త కాకపోయినప్పటికీ, ఆ పరిస్థితులు, ఆ పుస్తకం పూర్తిగా వేరు. ఆ తర్వాత నా వ్యక్తిగత  జీవితంలో వచ్చిన కొన్ని మార్పుల వెనుక కూడా ఆ పుస్తకం ప్రత్యేక పాత్ర పోషించింది, అందుకు కూడా నాకు 'సాయంకాలమైంది' ప్రత్యేకం. 

ఇంతకీ, 'సాయంకాలమైంది' నవలని కంఠతా పట్టి, చుట్టూ ఉన్న అందరిచేతా చదివిస్తున్న కాలంలో గొల్లపూడిని కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. తిరుపతిలో జరిగిన ఓ సాహిత్య సభకి ఆయన అతిధిగా వచ్చినప్పుడు, ముగ్గురు మిత్రులం హోటల్ గదిలో కలిశామాయన్ని. ఆయన, అయన భార్య శివాని (అసలు పేరు శివకామసుందరి అని జ్ఞాపకం) కూడా మేమాయన్ని ఓ సినిమా నటుడిగా కలవడానికి వచ్చామని అనుకున్నారు. మూడు నాలుగు గంటల పాటు జరిగిన మా సంభాషణలో ఒక్క సినిమా కబురూ దొర్లలేదు. అసలు 'సాయంకాలమైంది' ని దాటి మరో విషయం వైపే వెళ్ళలేదు. ఆ నవల్లో కొన్ని పాత్రలు, సన్నివేశాలు ఎలా పుట్టాయో ఆయన చెబుతుంటే నిబిడాశ్చర్యంతో విన్నాం మేం ముగ్గురం. (వాటిలో కొన్నివిషయాలు తర్వాత ఇంటర్యూలలో చెప్పారు. మరికొన్ని ప్రయివేటు సంభాషణల్లో తప్ప పంచుకునేందుకు వీల్లేనివి).  


విశాఖపట్నంలో తమ పొరిగింటాయన విదేశంలో ఉండే కూతురి ఫోన్ కోసం ఎదురు చూడడాన్ని సుభద్రాచార్యులు, రేచకుడు పాత్రల కోసం ఉపయోగించుకున్నానని, శివాని గారి మేనమామ ఆయన భార్యకి అక్షరాలు నేర్పించిన విధానాన్నే జైల్లో నవనీతం రామకోటి రాయడంగా మర్చి రాశానని చెప్పారు గొల్లపూడి. ఆ సాయంత్రం ఎక్కువ చర్చ జరిగింది మాత్రం 'ఆండాళ్ళు' పాత్రని గురించే. ఆండాళ్ళు, కూర్మయ్యని పెళ్లి చేసుకోడానికి మరికొన్ని బలమైన సన్నివేశాలు సృష్టించి ఉండాల్సింది అన్నాం మేము. శివాని గారు కూడా మాతో ఏకీభవించారు. నవల్లో అచ్చుతప్పులే కాక, కథాపరంగా కూడా కొన్ని తప్పులున్నాయని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. (అప్పుడు మేం చదివింది జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు ప్రచురణ. తర్వాత విశాలాంధ్ర ప్రచురించింది, మరిన్ని అచ్చు తప్పులతో). 

సుభద్రాచార్యుల అంతిమ సంస్కారం మొదలు జయవాణి ఉద్యోగం వరకూ వరుసగా చెప్పుకొచ్చాం మేము. అన్నీ శ్రద్ధగా విని, తన మెయిల్ ఐడీ ఇచ్చి, మేము చెప్పినవన్నీ మెయిల్ రాసి తనకి పంపితే, రీప్రింట్ లో సరిచేస్తానన్నారు. (మేము మాట నిలబెట్టుకున్నాం కానీ, ఆయన నిలబెట్టుకోలేదు). "ఎర్రసీత అని నా కొత్త నవల. సాయంకాలమైంది కన్నా బావుంటుంది. తప్పకుండా చదవండి," అని చెబుతూ మాకు వీడ్కోలిచ్చారు. రెండో మాట నన్ను బాగా పట్టుకుని, వెంటనే కొని చదివాను. నచ్చలేదు. ఆయన పెట్టిన పోలిక అంతకన్నా నచ్చలేదు. మొదటి సమావేశం జరిగిన ఐదారేళ్ళ తర్వాత రెండో సమావేశం. కొత్తగా మాట్లాడుకోడానికి ఏముంటుంది? ఆయన ఆత్మకథ 'అమ్మకడుపు చల్లగా' చదవడం మొదలు పెట్టాను కానీ పూర్తవ్వలేదు (ఇప్పటికీ పూర్తి చేయలేదు). సాహిత్యాన్ని దాటి మామూలు విషయాలు చర్చకొచ్చాయి. 

"నా పేరు మారుతి రావండీ. అందరూ కలిసి మారుతీరావు చేసేశారు" అన్నారు. సంభాషణలని 'పద్మ' అవార్డుల మీదకి తీసుకెళ్లారు ఆయనే. ఆయనకా అవార్డు మీద మనసుందని మాటల్లో అర్ధమయ్యింది. (విశాఖ రెవిన్యూ నుంచి ఆయన వివరాల ఫైలు కేంద్రానికి వెళ్లిందని రెవిన్యూ శాఖలో పనిచేసే మిత్రులొకరు చెప్పారు). కాంగ్రెస్ పార్టీ మీద ఆయనకున్న కోపం రాతల్లో అనేకసార్లు బయట పడినా (కాలమ్స్ లో) ఆవేళ మాటల్లోనూ చెప్పారు. ఆయన అభిమానించే పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, గొల్లపూడి 'పద్మ' పురస్కారం దక్కలేదు.  మూడోసారి క్లుప్తంగా జరిగిన సమావేశంలో తన అసంతృప్తిని నేరుగా కాకపోయినా కొంచం ఘాటుగానే బయటపెట్టారు. 

పత్రికలకి, రేడియోకి, నాటకాలకి, సినిమాలకి రచనలు చేసి, అనేక సినిమాల్లో నటించి, టీవీ కార్యక్రమాల ప్రయోక్తగా వ్యవహరించి, అభిరుచి గల ప్రేక్షకుడిగా అంతర్జాతీయ సినిమాలెన్నో చూసి, విదేశీ యాత్రలు చేసిన గొల్లపూడికి జీవితంలో తగిలిన పెద్ద దెబ్బ కొడుకు శ్రీనివాస్ దుర్మరణం. అందులోనుంచి కోలుకోడానికి ఆయనకి ఊతమిచ్చింది సాహిత్యమే. ఎన్ని భూమికలు నిర్వహించినా గొల్లపూడి నాకెప్పుడూ గుర్తుండిపోయేది 'సాయంకాలమైంది' రచయితగానే. ఆయన ఆత్మకి శాంతి కలుగు గాక. 

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

నేరము-శిక్ష-వ్యవస్థ

'దిశ' సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులు పోలీసు ఎన్ కౌంటర్ లో మరణించారు. నేరం ఎలా చేశారో నటించి చూపించమని నిందితుల్ని సంఘటన స్థలానికి తీసుకెళ్తే, అక్కడినుంచి వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారని, వాళ్ళని నిలువరించేందుకు కాల్పులు జరపగా నలుగురు నిందితులూ అక్కడికక్కడే మరిణించారనీ పోలీసులు ప్రకటించారు. సందర్భం ఏదైనప్పటికీ, ఎన్ కౌంటర్ అనంతరం పోలీసులు చేసే ప్రకటనలన్నీ దాదాపు ఇలాగే ఉంటాయన్నది నిజం. అలవాటైన ఈ ప్రకటనకన్నా, ఎన్ కౌంటర్ పట్ల ప్రజలు స్పందిస్తున్న తీరు ఆలోచింపజేస్తోంది, బాగా. 

జరిగిన నేరం సాధారణమైనది కాదు. నేర తీవ్రతా సామాన్యమైనది కాదు. కాబట్టి, శిక్ష కూడా అసాధారణంగా ఉండాలని సమాజంలో భిన్న వర్గాల ప్రజలు ఎలుగెత్తి చాటారు. సెలబ్రిటీలు సోషల్ మీడియాకే పరిమితమైనప్పటికీ, సామాన్య ప్రజలు రోడ్డెక్కి నినదించారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక, జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. నిందితుల్ని పోలీసు స్టేషన్ కి తీసుకెళ్తున్న వ్యాన్ మీద ప్రజలు చేసిన రాళ్ళ దాడి, సంఘటన పట్ల జనం స్పందననీ, నిందితులకి పడాల్సిన శిక్ష పట్ల వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పింది. ఓ పక్క ప్రభుత్వం నుంచి సత్వర నేర విచారణ, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు ప్రకటనలు వస్తుండగానే ఎన్ కౌంటర్ జరగడం గమనార్హం. 

ముందుగానే చెప్పినట్టు, ఎన్ కౌంటర్ లు గతంలోనూ జరిగాయి. అప్పటికన్నా ఇప్పుడు వచ్చిన స్పష్టమైన మార్పు ప్రజల స్పందన. పోలీసు అధికారులని కీర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలు, మహిళలు, యువతులు వాళ్లకి దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లకి వెళ్లి పోలీసు అధికారులకి రాఖీలు కట్టడం వరకూ అనేక రూపాల్లో ఎన్ కౌంటర్ పట్ల హర్షాన్ని, పోలీసుల పట్ల కృతజ్ఞతని ప్రకటిస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసులని అభినందిస్తూ ప్రదర్శనలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. కేవలం నేర విచారణకి మాత్రమే పరిమితం కావాల్సిన పోలీసులు, చట్టాన్ని చేతిలోకి తీసుకుని శిక్ష వేయడం ఎంతవరకూ సబబు అన్న ప్రశ్న మెజారిటీకి తట్టడం లేదు సరికదా, ఈ ప్రశ్నని లేవనెత్తాలనుకునే వాళ్ళు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు. 

మన వ్యవస్థలో ఒక నేరం జరిగినప్పుడు, విచారణ జరిపి నిందితుల్ని అదుపులోకి తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులది, విచారణ జరిపి శిక్ష విధించాల్సిన బాధ్యత న్యాయస్థానానిది. ఎన్ కౌంటర్ జరిగిందీ అంటే, న్యాయవస్థ చేయాల్సిన పనిని పోలీసు వ్యవస్థ తన చేతుల్లోకి తీసుకుంది అని అర్ధం. దీనిని ప్రజలంతా స్వాగతించారు. స్థూలంగా ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది జరిగిన నేరం (అత్యాచారం, హత్య) తాలూకు తీవ్రత. రెండోది, వ్యవస్థల పనితీరులో లోపాలు. మొదటి కారణాన్ని చర్చించాల్సిన అవసరం లేదు. పెల్లుబికిన జనాగ్రహాన్ని దేశం మొత్తం చూసిన తర్వాత ఇక కొత్తగా చర్చించాల్సింది ఏదీ లేదు. 

ఇక మిగిలింది రెండో కారణం. నిజానికి ఇప్పుడు చర్చ జరగాల్సింది దీనిని గురించే. సత్వర నేర విచారణ, శిక్ష విధింపు, అమలు అన్నవి జరుగుతూ ఉన్నట్టయితే ఈ చర్చకి ఆస్కారం లేకపోయేది. అనేక కారణాల వల్ల మన దేశంలో సత్వర విచారణ, సత్వర న్యాయం అన్నవి అందుబాటులోలేవు. సాక్షాత్తూ దేశ ప్రధానిని హత్య చేసిన నిందితులపై నేర నిరూపణ జరిగి, శిక్ష పడేందుకే సుదీర్ఘ కాలం పట్టిందిక్కడ. 'చట్టం ముందు అందరూ సమానులే' అని ఎంతగా చెప్పుకున్నప్పటికీ, వీవీఐపీ కేసుల విచారణకి, మామూలు కేసుల విచారణకి హస్తిమశకాంతరం భేదం ఉంటున్నది బహిరంగ రహస్యమే. ఏళ్ళ తరబడి కేసుల విచారణ జరగడం, అంచెలంచెల న్యాయ వ్యవస్థలో పై కోర్టుకు అప్పీలు చేసుకునే వీలుండడంతో అనేక కేసుల్లో నిందితులకి వాళ్ళ జీవిత కాలంలో శిక్షలు పడడం లేదు. పడినా, అమలు జరగడం లేదు.

'వందమంది అపరాధులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు' అన్నది మన న్యాయ వ్యవస్థ నమ్మిన సూత్రం. దీనితో న్యాయ స్థానం ప్రతి నేరస్తుడికీ 'బెనిఫిట్ ఆఫ్ డౌట్' ఇస్తుంది. పెరుగుతున్న జనాభాకి తగ్గ నిష్పత్తిలో నేరాలు జరుగుతున్నాయి. అయితే, అదే నిష్పత్తిలో న్యాయస్థానాల ఏర్పాటు జరగకపోవడం, ఇప్పుడు ఉన్న కోర్టుల్లో కూడా తగినంత సిబ్బంది లేకపోవడంతో పెండింగ్ కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ఈ సమస్యని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల్ని ఇప్పుడు ప్రజలు అభినందిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే, ప్రజలే చట్టాన్ని చేతిలోకి తీసుకునే పరిస్థితి రావొచ్చు. అది అనేక అరాచకాలకు దారితీయొచ్చు. అక్కడివరకూ రాకుండా ఉండాలంటే, వ్యవస్థలో లోపాలని సరిదిద్దడం తక్షణావసరం. 

'దిశ' అమానుషం. నిందితులకు శిక్ష పడడం అభినందనీయం. కానీ, ఆ 'శిక్ష' నిర్ణయింపబడిన తీరు, అమలు జరిగిన తీరూ ఆమోదయోగ్యమేనా? అన్నదే ఇప్పటి ప్రశ్న. 

గురువారం, డిసెంబర్ 05, 2019

పుచ్చా పువ్వుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలు ... 

"ఓరా వాకిలి తీసీ తీయని  దోరా వయసుల్లో.. 
మాఘామాసపు మంచూ బెబ్బులి పొంచే వేళల్లో.. "

మన సినిమాల్లో శృంగార భరిత యుగళగీతం సాధారణంగా పాడుకునే జంట సమాగమానికి ముందు వస్తుంది. పాట చివర్లో పూలు, పొదలు లాంటి సింబాలిక్ షాట్స్ ఉంటాయి. సమాగమం తర్వాత వచ్చే యుగళగీతాలు అరుదు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'మనోహరం' (2000) సినిమాలో "పుచ్చా పువ్వుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలు..." అనే పల్లవితో వచ్చే డ్యూయెట్ ఇందుకు మినహాయింపు. కొత్తగా పెళ్ళైన యువజంట గంటల్ని క్షణాలుగా గడిపేయడం సందర్భం. కవి వేటూరి. పాట ఇలా మొదలవుతుంది:  

"పుచ్చా పువ్వుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలు.. 
పచ్చా మీగడలిచ్చే తీయన తెచ్చే నీ కలలు.. 
వచ్చీనాయమ్మా..  విచ్చీనాయమ్మా.. 
వచ్చీనాయమ్మా..  కలువలు విచ్చీనాయమ్మా.. "
అంటూ అతడు ఆరంభించగానే,
"ముద్దా బంతులు మునిగోరింటలు మురిసే  సంజెల్లో.. 
పొద్దే ఎరగని ముద్దే తరగని రసనారింజల్లొ.. 
వచ్చీనాయమ్మా.. విచ్చీనాయమ్మా.. 
వచ్చీనాయమ్మా.. కలువలు విచ్చీనాయమ్మా.. "

అని ఆమె అందుకుంటుంది. 'వెన్నెల పుచ్చపువ్వులా ఉంది' అనడం వాడుక. అలాంటిది పుచ్చపువ్వులు విచ్చే చోట కాసే వెన్నెల (అది కూడా వెచ్చని వెన్నెల!),  దానితో పాటుగా ఆ అమ్మాయి కన్న కలలు - అవికూడా పచ్చ మీగడ (పాలని మరగ కాచగా వచ్చే మీగడ) తాలూకు తీయదనాన్ని తెచ్చేవి - కలలూ వెన్నెలా కలిసి రావడంతో కలువలు విచ్చుకున్నాయట!! అతనిలా చెప్పగానే ఆమె కలువలు విచ్చుకున్నాయని వెంటనే ఒప్పేసుకుంది (పెళ్ళైన కొత్త కదా). కాకపోతే ఆమె చెప్పే కారణాలు వేరు. ముద్దబంతులు, మునిగోరింట పూలు మురిసే (విరిసే కాదు) వేళ, పొద్దు తెలియనంతగా ముద్దుముచ్చట్లు సాగుతున్న వేళల్లో కలువలు విచ్చాయి అంటోంది.  (అసలే కొత్తజంట, ఆపై ముద్దబంతులు పూసే, చలి చంపేసే ధనుర్మాసం.. అర్ధంచేసుకోవాలి మరి). 



"గువ్వ జంటలకు కువకువ..  ఇటు కుర్ర గుండెలకు మెలకువ.. 
వీణ మీటె  సెలయేరూ ..  చలి వేణువూదె చిరుగాలీ.. 
కలువ కనులలోనా కలవరింతలాయే.. 
చలువ తనువులోనా జలదరింతలాయే.. "

అంటూ తొలి చరణం మొదలవుతుంది. గూటికి చేరిన గువ్వలు కువకువలాడడం ఎంత సహజమో, కుర్ర గుండెలకి నిద్ర పట్టకపోడమూ అంతే సహజం. సెలయేరు పాడే వీణపాటతో పాటుగా వేటూరి మార్కు 'చలి వేణువు' మళ్ళీ ప్రత్యక్షం ఇక్కడ. మామూలుగా జలదరింతని భయం లాంటి వ్యతిరేక భవనాలు చెప్పేందుకు వాడతారు కానీ ఈ సందర్భంలో కవి చేసిన  'చలువ తనువులో జలదరింత' ఆలోచించేకొద్దీ నచ్చేసే ప్రయోగం.  

"పిండీ వెన్నెల వండీ వార్చిన వెండీ  ఇసకల్లో.. 
తెల్లా మబ్బుల  వెల్లా వేసిన పిల్ల కాలువల్లో.. 
వచ్చీనాయమ్మా.. వచ్చీనాయమ్మా.. 
వచ్చీనాయమ్మా.. అలజడులొచ్చీనాయమ్మా.. "

పల్లవి చివర్లో కలువలు విచ్చాయి. తొలి చరణం చివరికి వచ్చేసరికి అలజడులొచ్చాయి. పాట మొదలైన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటే సల్లాపాలు మరోమారు సరసానికి దారితీస్తున్నాయనిపిస్తుంది. ఇక, రెండో చరణానికి వస్తే:  

"లేత పచ్చికల అణకువ..  నును లేత మచ్చికల తొణకవ.. 
నిండు అల్లికల నవనవ..  తలదిండు మల్లికల శివశివ.. 
పట్ట పగటి ఎండే పండు వెన్నెలాయే.. 
నిట్ట నిలువు తపనే నిలువనీయదాయే.. "

ఒకసారి చెప్పిన దగ్గరితనాన్నే మళ్ళీ వేరే మాటల్లో చెప్పడం మిగిలిన కవులకి కష్టం కావచ్చేమో కానీ వేటూరికి కాదు. "తలదిండు మల్లికల శివశివ" ప్రయోగం మాత్రం పూర్తిగా వేటూరి మార్కు!

"ఓరా వాకిలి తీసీ తీయని  దోరా వయసుల్లో.. 
మాఘామాసపు మంచూ బెబ్బులి పొంచే వేళల్లో.. 
వచ్చీనాయమ్మా.. గిచ్ఛీనాయమ్మా.. 
వచ్చీనాయమ్మా.. వలపులు గిచ్ఛీనాయమ్మా.. "

అలజడులొచ్చి వలపుల్ని గిచ్చాయి.. అక్కడికీ వాకిలి ఇంకా పూర్తిగా తీయనే లేదు. అయితేనేం, పొంచి ఉన్న మంచు బెబ్బులి బోల్డంత దోహదం చేసింది దోర వయసుల వలపులకి. సంగీతాన్ని పక్కన పెట్టేసి కేవలం సాహిత్యాన్ని చూస్తే,  మాంచి రస దృష్టి ఉన్న కవి 'సంక్రాతి-కొత్తజంట' అంశం మీద రాసిన వచన కవితలా ఉంటుంది. తన తొలియవ్వనపు రోజుల్లో కృష్ణ ఒడ్డున విహరిస్తూ రాసుకున్న గాలిపాటని సినిమా కోసం ఇచ్చానని, ఈ పాట మీద విశ్వనాథ సత్యనారాయణ 'ఋతుసంహారం' కావ్య ప్రభావం ఉందనీ రాసుకున్నారు వేటూరి తన 'కొమ్మకొమ్మకో సన్నాయి' లో. 

మణిశర్మ చక్కని ట్యూన్ చేసినా, పార్థసారధి, చిత్ర అంతబాగా పాడలేకపోయారేమో అనిపిస్తుంది నాకు పాట విన్న ప్రతిసారీ. బోల్డన్ని గ్రాఫిక్స్ తో జగపతి బాబు-లయ ల మీద చిత్రించారు గుణశేఖర్. గ్రాఫిక్స్ లేకపోతే చిత్రీకరణ ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. కేవలం సాహిత్యం కోసం వినే పాటల్లో ఇదీ ఒకటి.

మంగళవారం, నవంబర్ 26, 2019

అసురసంధ్య వేళ ...

"నశ్వరమిది... నాటకమిది... 
నాలుగు ఘడియల వెలుగిది..." 

శృంగార రస ప్రధానమైన గీతంలో భక్తిని, వైరాగ్యాన్ని రంగరించడం అన్నది అనేక పరిమితుల మధ్య పనిచేసే సినీ గీత రచయితలకి పెద్ద సవాలే. ఇలాంటి సవాళ్లనెన్నింటినో అలవోకగా గెలిచిన చరిత్ర వేటూరిది. భగవదారాధనకి జీవితాన్ని అంకితం చేసిన ఓ సన్యాసి మీద, ఒక వేశ్య మనసు పడితే? అతన్ని తనవాడిని చేసుకోడానికి ఆమె పట్టువిడవకుండా ప్రయత్నాలు చేస్తే?

అందరికీ తెలిసిన 'విప్రనారాయణ' కథ ఇది. ఈ కథని తన సినిమా 'అమరజీవి' (1983) లో సందర్భానికి అనువుగా ఉపయోగించుకున్న దర్శకుడు జంధ్యాల, పాటని రాసే బాధ్యతని వేటూరికి అప్పగించారు. ఫలితమే, 'అసురసంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామీ...' అనే సుప్రసిద్ధ గీతం. చిన్నపిల్లల నృత్యనాటకంగా మొదలై, నాయికా నాయకుల యుగళగీతంగా మారే ఈ పాటలో ఆసాంతమూ విప్రనారాయణుణ్ణీ, దేవదేవినీ కళ్ళకి కట్టారు వేటూరి. 

"శ్రీ రంగనాధ చరణారవింద చారణ చక్రవర్తి.. పుంభావ భక్తి.. 
ముక్తికై మూడు పుండ్రాలు నుదుట దాల్చిన
ముగ్ధ మోహన సుకుమార మూర్తీ.. 
తొండరడిప్పొడి... నీ అడుగుదమ్ముల పడి ధన్యఅయినది ..
నీ దీన దీన దేవదేవి.. నీ దాసాను దాసి..
నీ పూజలకు పువ్వుగా.. జపములకు మాలగా.. పులకించి పూమాలగా..
గళమునను.. కరమునను.. ఉరమునను..
ఇహముకు.. పరముకు నీదాననై.. ధన్యనై..
జీవన వదాన్యనై తరియించుదాన.. మన్నించవే..మన్నించవే..
అని విన్నవించు నీ ప్రియ సేవిక .. దేవదేవి.."

ఈ సాకీతో పాట ప్రారంభమవుతుంది. ఇదంతా నాయకుడి వర్ణనే. శ్రీ రంగనాధ స్వామి పదాలని సదా పూజించే సంచారి, భక్తికి పురుష రూపం, ముక్తి కోసం మూడు పుండ్రాలు నుదిటి మీద ధరించిన వాడు (శ్రీ వైష్ణవులు మొత్తం పన్నెండు పుండ్రాలు శరీరం మీద ధరిస్తారు - శైవులు విభూది ధరించినట్టు - వీటికి ద్వారశోర్ధ్వ పుండ్రాలు అని పేరు), ముగ్ద మోహన సుకుమారుడు, తొండరడిప్పొడి (శ్రీరంగ నాధుణ్ని సేవించిన ఆళ్వారుల్లో ఒక ఆళ్వార్ పేరు - భక్తుడి పాదరేణువు అని అర్ధం) అయినటువంటి అతడి పాదముద్రలు తాకి తాను ధన్య అయ్యానంటోంది దేవదేవి. 

నువ్వు చేసే పూజలకు పువ్వునవుతాను, జపాలకి మాలనవుతాను, పూమాలగా మారి నీ కంఠాన్ని, చేతుల్ని, వక్షాన్ని అలంకరించడమే కాక, ఇహపరాలు రెంటికీ నీ దానినై నా జీవితాన్ని తరింప చేసుకుంటాను, నా ప్రార్ధనని మన్నించి, నా ప్రేమని అంగీకరించు అంటూ తనని తాను అతనికి 'ప్రియసేవిక' గా అభివర్ణించుకుంది దేవదేవి. ఇక్కడితో సాకీ ముగిసి, పాట మొదలవుతుంది: 




"అసురసంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి..
ఆడ ఉసురు తగలనీకు స్వామీ...
ముసురుకున్న మమతలతో కొసరిన అపరాధమేమి ?
స్వామీ.. స్వామీ.." 

సూర్యాస్తమయం తర్వాతి సమయాన్ని అసురసంధ్య అంటారు. అసురసంధ్య వేళ చేయకూడని పనులతో పెద్ద జాబితానే ఉంది. అటువంటి పుణ్యకాలంలో ఆడపిల్లని బాధ పెట్టి ఆమె ఉసురు నీకు తగలనివ్వకు స్వామీ (ఇక్కడ స్వామి అంటే సన్యాసి అనీ, నా దైవమా అనీ అర్ధాలు తీసుకోవచ్చు). ప్రేమతో నీవైపు మొగ్గడంలో తప్పేముంది  అని ఆమె ప్రశ్న. 

"అసురసంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ.. 
స్వామి ఉసురు తగలనీకు దేవీ..
మరులుగొన్న హరిని వీడి మరలిన నర జన్మమేమి?దేవి ..దేవీ.." 

నా మనస్సు నీ వైపు మళ్లించుకుని ఆ స్వామి (శ్రీరంగనాధ స్వామి) ఉసురు నాకు, నీకూ కూడా తగలనివ్వకు, నా మనస్సంతా నిండి ఉన్న హరిని నేను విడిచిపెడితే ఇక ఈ జన్మకి అర్ధం ఏముంది? అని అతని జవాబు లాంటి ప్రశ్న. 

"హరిహర సుర జ్యేష్టాదులు.. కౌశిక శుక వ్యాసాదులు
నిగ తత్వములను దెలిపి.. నీమ నిష్టలకు అలసి.. 
పూనిన శృంగారయోగమిది కాదని .. నను కాదని..
జడదారీ.. ఆ..ఆ..ఆ..ఆ.. పడకు పెడదారి.." 

అతడు హరి ప్రస్తావన తెచ్చేసరికి, ఆమె తనని తాను సమర్ధించుకోవాల్సిన సందర్భంలో   పడింది. అందుకు తాను కూడా అదే దారిలో వెళ్ళింది. దేవతలు, మునులు కూడా శృంగారాన్ని నిషేధించలేదని గుర్తు చేస్తూనే, ఓ సన్యాసీ నాదారిని విడిచి పెడదారిలో వెళ్లొద్దు అని సలహా ఇచ్చింది. ఇప్పుడు అతడు సమాధానం చెప్పాలి. చెప్పాడు, రెండో చరణంలో: 

"నశ్వరమిది.. నాటకమిది... నాలుగు ఘడియల వెలుగిది..
కడలిని కలిసే వరకే... కావేరికి రూపు ఉన్నదీ.. 
రంగని కీర్తన చేసే రాగమాలికను కానీ..
రంగని భక్తుల ముంగిట రంగ వల్లికను కానీ..
దేవి..దేవీ..దేవదేవీ..." 

ఈ శరీరం  శాశ్వితం కాదు, కేవలం నాలుగు ఘడియల ఈ జీవితం ఓ పెద్ద నాటకం. ఆ కావేరీ నది కూడా (శ్రీరంగం ఉన్నది కావేరి ఒడ్డునే) సముద్రంలో కలవగానే తన రూపం కోల్పోతుంది. నన్ను ఆ రంగని కీర్తించుకొనీ, ఆ స్వామి భక్తుల వాకిట ముగ్గుగా నా జీవితాన్ని అలంకరించుకోనీ దేవదేవీ అన్నాడు (ఆళ్వారులు రంగనాధుడి కన్నా, స్వామి భక్తులకే ఎక్కువ విలువిచ్చారు. 'తొండరడిప్పొడి' కి అర్ధమే ఇందుకు ఉదాహరణ). ఇక్కడి నుంచి వాదం పెరిగింది, ఇద్దరూ చెరో మాటా అనుకున్నారు, మూడో చరణంలో: 

"అలిగేనట శ్రీరంగము.." 

ఇది ఆమె మాట. అతడు ఆమెని కాదంటే శ్రీరంగం ఎందుకు అలుగుతుంది? ఎందుకంటే శ్రీరంగ స్వామి యోగి కాదు, భోగి. 

"తొలగేనట వైకుంఠము.." 

ఇది అతడి వాదన. వైకుంఠం చేరాలంటే నిష్టగా, దీక్షగా బ్రహ్మచర్యం ఆచరించాలని అతడి నమ్మకం మరి. 

"యాతనకేనా దేహము?"

శరీరానికి కావాల్సినవి ఇవ్వకుండా బాధపెట్టడాన్ని ప్రశ్నిస్తోందామె.

"ఈ దేహము సందేహము" 

ఈ శరీరమే పెద్ద సందేహం అంటున్నాడతను. ఉంటుందో ఉండదో తెలియని శరీరాన్ని బాధ పెట్టడం పెద్ద విషయం కాదతనికి. 

"ఈ క్షణమే సమ్మోహము... వీక్షణమే మరు దాహము"

అంటూ అతని చెంత చేరిందామె. ("It is women that seduce all mankind" అని గిరీశం వాపోలేదూ?) 

"రంగా... రంగా... రంగరంగ శ్రీరంగ.. 
ఎటులోపను? ఎటులాపను?" 

అతను ఓడిపోతున్నాడు. చివరి ప్రయత్నంగా ఆ రంగడికే మొరపెట్టుకున్నాడు. 

"ఒకసారి.. అ.. అ.. అనుభవించు ఒడిచేరి.."

అంతిమ విజయం ఆమెదే. బహుశా, ఆ రంగడి సంకల్పం కూడా అదేనేమో మరి. ఆ విప్రనారాయణుడి లాగే 'అమరజీవి' కథానాయకుడు ఆనంద్ (అక్కినేని) కూడా స్త్రీలని దూరంపెట్టే వ్యక్తి. అతన్ని ప్రేమించిన లలిత (జయప్రద)  కూడా ఆ దేవదేవి లాగే తన ప్రేమని గెలుచుకోడానికి విడవకుండా ప్రయత్నాల్ని కొనసాగిస్తూ ఉంటుంది. జంధ్యాల సృష్టించిన సందర్భానికి వేటూరి రాసిన పాట అతికినట్టు సరిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. 

చక్రవర్తి సంగీత సారధ్యంలో బాలు, సుశీల కలిసి పాడిన ఈ శృంగార యుగళంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సుశీలని గురించి. ఎక్కువ సందర్భాల్లో రొమాంటిక్ డ్యూయెట్ అనగానే జ్వరం గొంతుతో పాడేసే సుశీల, ఈ పాటలో (మరీ ముఖ్యంగా చివరి చరణంలో) రొమాన్స్ ని పలికించిన తీరు ప్రత్యేకం. 'అసురసంధ్య వేళ..' అని పాడుతూ నాయికానాయకులు  మిట్టమధ్యాహ్నం పూట నది ఒడ్డున నడవడం ఏమిటో దర్శకుడికే తెలియాలి. క్లోజప్పుల్లో నాగేశ్వరరావు వయసు మరీ తెలిసి పోవడం వల్ల జయప్రద అందం మరింతగా ఇనుమడించింది ఈ పాటలో.

గురువారం, అక్టోబర్ 24, 2019

వయ్యారి గోదారమ్మ ...

"పున్నాగ కోవెల్లోన.. పూజారి దోసిళ్ళన్ని.. 
యవ్వనాలకు కానుక..."

వినడానికి మాత్రమే బాగుండే పాటల జాబితాలో చేర్చుకున్న పాట 'ప్రేమించు పెళ్లాడు' సినిమా కోసం వేటూరి రాసిన 'వయ్యారి గోదారమ్మ.. ' సాహిత్యంతో పాటుగా, ఇళయరాజా చేసిన స్వరం, బాలు-జానకిల గళం ఈ పాటని చిరంజీవిని చేసేశాయి. ఒక నర్సుతో ప్రేమలో పడ్డ ఓ కుర్రాడు, ఆమెతో పాడుకునే డ్యూయెట్ ఇది. అతిమామూలు సందర్భానికి కవితాత్మకంగా సాహిత్యం సమకూర్చారు వేటూరి. 

"వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం... 
కడలి ఒడిలో కలసిపోతే కల-వరం..." 

ప్రేమలో పడ్డ కుర్రాడికి నిద్దట్లో వచ్చే కలలో తన ప్రేయసి చేరువైతే ఆ 'కల' 'వరమే' కదా. 

"ఇన్ని కలలిక ఎందుకో...  కన్నె కలయిక కోరుకో... 
కలవరింతే కౌగిలింతై..."

కలలెందుకు, కలయిక కోరుకో అంటోందా అమ్మాయి. 'కలవరం,' 'కల-వరం,' 'కలలిక,' 'కలయిక' ..పదాలతో ఆడుకోడం వేటూరికి కొత్తేమీ కాదు కదా. 

"నిజము నా స్వప్నం... నీవు నా సత్యం ఔనో...  కానో...  
ఊహ నీవే... ఉసురుకారాదా.. 
మోహమల్లె... ముసురుకోరాదా..."

నా కల నిజం, నువ్వు నా నిజం అని అతనంటే, ఔనో/కానో అంటోందామె. నా ఊహల్లో ఉన్న నువ్వు ఊపిరివి కావొచ్చు కదా, మోహం లాగ నన్ను ముసురుకోవచ్చు కదా అని అడుగుతున్నాడతను. 

"నవ్వేటి నక్షత్రాలు... మువ్వల్ని ముద్దాడంగ... 
మువ్వగోపాలుని రాధికా... 
ఆకాశవీణ గీతాలలోన...  ఆలాపనై నే కరిగిపోనా..."

...అంటూ ముక్తాయించి చరణాన్ని ముగించాడతను.  ఈ ముక్తాయింపు పూర్తిగా భావ కవిత్వమే అనిపిస్తుంది నాకు. పల్లవిలో లాగే ఇక్కడా 'మువ్వల్ని ముద్దాడంగ,'  'మువ్వగోపాలుని రాధికా' అంటూ శబ్దపరంగా దగ్గరగానూ, అర్ధంలో దూరంగానూ ఉండే పదాలు వాడారు వేటూరి.




"తాకితే తాపం... కమలం... భ్రమరం... 
సోకితే మైకం... అధరం... మధురం... 
ఆటవెలది... ఆడుతూరావే...  
తేటగీతి... తేలిపోనీవే... "

కమలాన్ని భ్రమరం తాకడాన్ని గురించి, అధరం తాలూకు మధుర మైకాన్ని గురించి ప్రేమికులు కబుర్లాడుకోడం మామూలే. ఆమెని ఆటవెలది (నర్తకి) లా ఆడుతూ రమ్మంటున్నాడు. ఆ రావడంలో తేటగీతిని తేలిపోనివ్వమంటున్నాడా? (ఛందోరీతులైన ఆటవెలది, తేటగీతుల్ని ప్రేమగీతంలో ప్రవేశ పెట్టడం ముచ్చటైన విషయం). 

"పున్నాగ కోవెల్లోన... పూజారి దోసిళ్ళన్ని... 
యవ్వనాలకు కానుక... 
చుంబించుకున్న... బింభాధరాల... 
సూర్యోదయాలే పండేటి వేళ..."

మళ్ళీ గాఢమైన భావకవిత్వం! అతగాడు పున్నాగపూల కోవెల్లో పూజారట.. సదా అతడి దోసిళ్ళు నిండేది పున్నాగపూలతోనే. వాటిని యౌవనాలకి కానుక చేస్తున్నాడు. ఇక, అధరబింబాలు బింబాధరాలయ్యాయి. వాటి చుంబనాల్లో సూర్యోదయాలు పండుతాయట! (చిత్రీకరణలో నాయికకి అవసరానికి మించి లిప్ స్టిక్ వాడింది ఇందుకేనేమో మరి). 

మామూలుగా పాటలు తీయడంలో ప్రత్యేక ముద్ర చూపించే దర్శకుడు వంశీ, ఈ చిత్రీకరణ విషయంలో మాత్రం సాహిత్యానికి, సంగీతానికి, గానానికి ఏమాత్రమూ న్యాయం చేయలేక పోయాడు. ఇంటర్లూడ్స్ లో వచ్చే క్లోజప్ షాట్స్ మినహా, పాటంతా నాయికా నాయకులు గోదారొడ్డున పరిగెడుతూనే ఉంటారు, ఏదో పరుగు పందానికి ప్రాక్టీస్ లాగా. విన్న ప్రతిసారీ 'బాగా తీస్తే బాగుండేది కదా' అనిపిస్తూ ఉంటుంది.

గురువారం, అక్టోబర్ 10, 2019

ఏ టైగర్ ఫర్ మాల్గుడి (A Tiger for Malgudi)

సాహిత్యంలో పులిని గురించి రాసిన వాళ్ళు అనుకోగానే మనకి మొదట జిమ్ కార్బెట్ గుర్తొస్తాడు. తెలుగులో అల్లం శేషగిరి రావు రాసిన వేట కథలు గుర్తొస్తాయి. వీటిలో చాలావరకూ వేటగాళ్ల దృష్టి కోణం నుంచి రాసినవే. కానీ, ఒక పులి తన కథని తాను చెప్పుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఊహకి అక్షర రూపం ఇచ్చింది మాత్రం ఆర్కే నారాయణన్. తన ఊహల్లో సృష్టించిన పట్టణం 'మాల్గుడి' ని నేపధ్యంగా తీసుకుని రాసిన నవల 'ఏ టైగర్ ఫర్ మాల్గుడి.' జూ పార్కులో ఆశ్రయం పొందుతున్న ఒక ముసలి పులి, ఆత్మగతంగా తన జీవితాన్ని తల్చుకోడమే ఈ 175 పేజీల నవల. 

అడవిలో పుట్టిన ఓ మగపులి ఓ గుహలో బద్ధకంగా జీవిస్తూ ఉంటుంది. మిగిలిన జంతువుల మధ్య తన గౌరవాన్ని నిలబెట్టుకోడమే పెద్ద సవాలు. ఈ క్రమంలో ఒకరోజు ఒక ఆడపులితో తలపడవలసి వస్తుంది. అటు తర్వాత ఆ పులితోనే అదే గుహలో సహజీవనం చేసి పిల్లల్ని కూడా కంటుంది. పిల్లలతో సహా ఆడపులి వేటగాళ్ళకి చిక్కడం మగపులి జీవితంలో మొదటి మలుపు. వాటిని వెతుక్కుంటూ అడవి దాటి, కొన్నాళ్ల పాటు ఊళ్ళో మాటేసి దొరికిన జంతువులని తింటూ కాలం గడుపుతూ ఉంటుంది. నిజానికి అడవిలో గుహలో కన్నా, ఊళ్ళో జీవితమే బాగున్నట్టు భావిస్తుంది కూడా. 

అయితే, తమ పాడి పశువులు మాయమైపోతూ ఉండడాన్ని గమనించిన గ్రామస్తులు పులి ఉనికిని కనిపెట్టేస్తారు. వాళ్ళా సమస్యని కలెక్టర్ కి మొరపెట్టుకోవడంతో, పులి విషయం మాల్గుడి లో సర్కస్ కంపెనీ నడిపే 'కెప్టెన్' దృష్టికి వస్తుంది. చాకచక్యంగా పులిని బంధించి తన సర్కస్ కంపెనీకి తీసుకు వచ్చిన కెప్టెన్ ఆ పులికి 'రాజా' అని పేరు పెట్టి సర్కస్ ఫీట్లు చేసే శిక్షణ ఇస్తాడు. రాజాగా మారడం పులి జీవితంలో రెండో మలుపు. నిజానికి భయంకరమైన మలుపు. కెప్టెన్ కి రాజాకి మధ్య ఉన్న సమస్య భాష. ఒకరి భాష మరొకరికి తెలీదు. కాబట్టి కెప్టెన్ ఎలాంటి శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాడో రాజాకి తెలీదు. తాను చెప్పినట్టు రాజా వినకపోవడంతో కోపగించిన కెప్టెన్ ఇనప కుర్చీతో బాదడం, తిండి పెట్టకుండా మాడ్చడం లాంటి 'శిక్షలు' వేస్తూ ఉంటాడు. 

Photo: Wiki

కెప్టెన్ లేని సమయంలో, సర్కస్ కంపెనీలో ఉండే కొండముచ్చు అడవి భాషలో రాజాతో మాట్లాడడంతో కెప్టెన్ తన నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకునే వీలు కలుగుతుంది. కాలక్రమంలో రాజా మనుషుల భాషని అర్ధం చేసుకోడమే కాదు, కెప్టెన్ నేర్పే ఫీట్లని అలవోకగా చేసేస్తూ సర్కస్ కంపెనీకి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. అలా ఆకర్షణగా మారాక, ఓ సినిమా దర్శకుడి దృష్టిలో పడడం పులి జీవితంలో మూడో మలుపు. కెప్టెన్ సారధ్యంలో సినిమా చిత్రీకరణ లో పాల్గొనడం మొదలు పెట్టిన రాజాకి, షూటింగ్ లో జరిగిన ఓ గడబిడలో తప్పించుకోడానికి అవకాశం దొరుకుతుంది. మొదట ఓ బడిలో దాక్కుని, అటుపైన ఒక సన్యాసికి అనుయాయి గా మారిపోతుంది. 

కొన్నాళ్ల పాటు అడవిలో ఆశ్రమ జీవితం గడిపిన పులి పూర్తి సాధువుగా మారిపోయాక, సన్యాసికి తాను మరణానికి దగ్గరవుతున్నానని తెలుస్తుంది. సాధువుగా మారిన పులి తను లేకుండా అడవిలో ఒంటరిగా  బతకలేదని గ్రహించి, ఓ జూ పార్కుకి అప్పగించేస్తాడు. జూ ఎంక్లోజర్ లో తనని చూసిన జనం మాట్లాడుకునే మాటలన్నీ పులికి అర్ధమవుతూ ఉంటాయి. జూ లో మొదలైన కథ, ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లి, మళ్ళీ జూ లో ముగుస్తుంది. పులుల మనస్తత్వాన్ని గురించీ, సర్కస్ కంపెనీలు జంతువులకి ఇచ్చే శిక్షణ గురించీ ఎంతో అధ్యయనం చేసి ఈ నవలని రాశారు ఆర్కే. సినిమా షూటింగ్ విశేషాలు సరేసరి. ఇక ఆర్కే మార్కు హాస్యానికి, వ్యంగ్యానికి కొదవ ఉండదు. 

సర్కస్ కంపెనీలు పులులని విరివిగానూ, విశేష ఆకర్షణ గానూ వినియోగించిన కాలంలో (1983) ఈ నవలని రాశారు ఆర్కే నారాయణన్. అడవిలో, గ్రామంలో, సర్కస్ కంపెనీలో, సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు పులి ఆలోచనల్ని "అచ్ఛం పులి ఇలాగే ఆలోచిస్తుందేమో" అనిపించేలా రాయడం ఈ నవల ప్రత్యేకత. సర్కస్ పులిని వినోదంగా చూస్తున్న ప్రజలకి, ఆ వినోదం వెనకున్న విషాదాన్ని వివరించడమే ఈ నవల ఉద్దేశం అనిపిస్తుంది, చదవడం పూర్తి చేశాక. చదువుతున్నంతసేపూ పులి పాత్రలో మమేకమవుతామనడంలో అతిశయోక్తి లేదు. ఆబాలగోపాలన్నీ అలరించే ఈ నవల పునర్ముద్రణలు పొందుతూనే ఉంది. 

గురువారం, అక్టోబర్ 03, 2019

హంసనాదమో .. పిలుపో ...  

"మురళికే చలి చెలి ప్రియా..
మరునికే గుడి మహాశయా.."

'రాజేశ్వరి కళ్యాణం' సినిమాలో "ఓడను జరిపే.." పాటని గురించి రాస్తూ ఉండగా గుర్తొచ్చిన పాట కోనేరు రవీంద్రనాథ్ నిర్మాణంలో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 'లేడీస్ స్పెషల్' సినిమాలో వచ్చే యుగళగీతం "హంసనాదమో.. పిలుపో.."  రెండు సినిమాలూ ఒకే కాలంలో రావడం, ఒకే హీరో (సురేష్) నటించడంతో పాటు, రెండు పాటల్నీ రాసిన వేటూరి రెంటిలోనూ త్యాగరాజుని స్మరించుకోవడం ఈ రెండు పాటల మధ్యనా ఉన్న పోలికలు. 

సుస్వర బాణీల సృష్టికర్త సాలూరి రాజేశ్వరరావు సంతానంలో, రావాల్సినంత గుర్తింపు రానిది వాసూరావుకే అనిపిస్తుంది. ఈయన చేసిన మంచిట్యూన్లు వేరే వాళ్ళ పేర్లమీద చెలామణిలో ఉన్నాయన్నది ఒక వినికిడి. నిజానిజాలు తెలియవు. శాస్త్రీయ సంగీతం మీద మంచి పట్టున్న వాసూరావు, సినిమాలో కథానాయకుడు, నాయికకి తన ప్రేమని తెలిపే సన్నివేశంలో వచ్చే యుగళగీతానికి 'హంసనాదం' రాగంలో ట్యూన్ చేశారు. 'బంటురీతి కొలువు ఈయవయ్య రామా' అని త్యాగయ్య వేడుకున్నది ఈ రాగంలోనే!


"హంసనాదమో.. పిలుపో..
వంశధారలో..  వలపో..
సరిపా..  మపనీ పామా..
మదిలో..  విరిసింది ప్రేమా..
తొలకరి రాగాలేవో రేగే.." 

ఇది పల్లవి. 'వంశధార' ని ఎన్ని విరుపులతో, ఎన్నెన్ని రకాలుగా ప్రయోగించ వచ్చో వేటూరికి తెలిసినంత బాగా మరో కవికి తెలీదేమో. 'వంశ' ధార అన్న కొంటె ప్రయోగం మీద పూర్తి పేటెంటు వేటూరిదే.  హాయిగా సాగే రాగంలా వలపు మొదలయ్యింది. ఆ ప్రేమ, పెళ్ళికి దారితీయడం, అటుపై నాయికా నాయకులిద్దరూ పరిపూర్ణ జీవితాన్ని ఊహించుకోవడం చరణాల్లో వినిపిస్తుంది.  

"ఏ స్వప్న లోకాల ఆలాపన..
సంసార సుఖవీణ తొలికీర్తన.. 

బృందా విహారాల ఆరాధన..
నా ప్రాణ హారాల విరులల్లనా.. 

మురళికే చలి చెలి ప్రియా..
మరునికే గుడి మహాశయా.. 

కిసలయా ధ్వనే శ్రుతి లయ..
మదన మోహనా మృదంగ
తకధిమి తాళాలెన్నో రేగే... "

సంసార వీణ అనడం తెలుసు కానీ, దానికి సుఖాన్ని జోడించారు వేటూరి. ప్రేమ జంటకి పెళ్ళైన తొలిరోజులు కదా మరి. బృందావిహారాలు (హనీమూన్) కూడా అందుకే. మామూలుగా విరులతో (పువ్వులతో) హారాలు అల్లుతారు. కానీ, నాయిక చేత 'నా ప్రాణ హారాల విరులల్లనా" అని పలికించారు. బృందావనాన్ని కృష్ణుడితో ముడిపెట్టి "మురళికే చలి చెలి ప్రియా" అని అతని చేత అనిపించి, "మరునికే గుడి మహాశయా" అని ఆమెచేత బదులిప్పించారు. హనీమూన్లో ప్రధాన పాత్ర మరునిదే (మన్మధుడు) మరి. ఆ మరుని వాహనం చిలుక, ఆ చిలుక పలికే పలుకులు కిసలయలు. "మదనమోహనా మృదంగ తకధిమి తాళాలెన్నో" రేగడాన్ని గురించి ఇక్కడ వివరించబూనుకోవడం సభామర్యాద అనిపించుకోదు. 

"ఈ రీతి నీ బంటునై ఉండనా.. 
నీ సీతనై ఇంట కొలువుండనా..
బంటురీతి కొలువు
ఇయ్యవయ్య రామా.. 

త్యాగయ్య పాడింది హరి కీర్తన..
నీ పాట నా ఇంటి సిరి నర్తన..
కనులకే ఇలా స్వయంవరం..
గృహిణితో కదా ఇహం పరం.. 

కలయికే సదా మనోహరం.. 
స్వరస వాహినీ తరంగ
కథకళి లాస్యాలెన్నో రేగే..."
  

రెండో చరణానికి వచ్చేసరికి హనీమూన్ ముగిసి సంసారంలో పడ్డారు దంపతులు. అందుకే, "ఈ రీతి నీ బంటునై ఉండనా.. నీ సీతనై ఇంట కొలువుండనా.. బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామా.. " అని పాడుతుంది నాయిక. ఈమె మరీ త్రేతాయుగం మనిషి (సినిమాలో వాణి విశ్వనాధ్ ఆహార్యం, పాత్రచిత్రణ కూడా ఇందుకు తగ్గట్టే ఉంటాయి). శాస్త్రీయ సంగీతాభిమానులకి  'హంసనాదం'  అనగానే గుర్తొచ్చే త్యాగయ్య కీర్తనని సందర్భోచితంగా సాహిత్యంలో జోడించడం కవిగా వేటూరి ప్రతిభకి తార్కాణం. నాయకుడూ ఆ కాలం వాడే, కాబట్టే 'నువ్వు పాడితే నా  ఇంట్లో లక్ష్మీదేవి నర్తిస్తుంది' అని జవాబిచ్చాడు. 

సీతారాముల ప్రస్తావన వచ్చింది కనుక, ఆ వెనుకే స్వయంవర దృశ్యం, ఏకపత్నీవ్రతం కూడా వచ్చేశాయి సాహిత్యంలోకి. పెళ్ళైన కొత్తల్లో ఉండే 'తకధిమి తాళాలు' తర్వాతి కాలంలో 'కథకళి లాస్యాలు' గా మారే సహజ పరిణామాన్ని అలవోకగా చెప్పేసినందుకు మరోమారు నచ్చేశారు వేటూరి. వాసూరావు ట్యూన్ వినిపించి, సందర్భం చెబితే కేవలం నాలుగు గంటల్లో పాట రాసి చేతిలో పెట్టారట. బాలూ, చిత్ర పాడిన తీరు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా ఉంటుంది. సురేష్, వాణి విశ్వనాధ్ ల మీద సంసారపక్షంగానే  చిత్రించారు జంధ్యాల. 

సోమవారం, సెప్టెంబర్ 30, 2019

సిమ్లా మిర్చి కూర

సిమ్లా మిర్చితో చేసే బజ్జీలు భలే రుచిగా ఉంటాయి. మామూలు మిరపకాయల్లో ఉండే కారం వాటిలో ఉండదు కదా, కమ్మని రుచితో మరిన్ని తినాలనిపిస్తాయి. కానయితే శనగపిండి, డీప్ ఫ్రై ఇవన్నీ చూడగానే డాక్టరు, లెక్చరు గుర్తొస్తాయి. తక్కువ పిండి, నూనెతో ఇంచుమించు బజ్జీ రుచితో ఉండే వంటకం ఒకటి ఆమధ్య ఒక చోట రుచి చూశాను. హోస్టుని అడిగి రెసిపీ జ్ఞాపకం పెట్టుకున్నాను. అవకాశం దొరకడంతో వండేశాను. ఆ వంటకం పేరే సిమ్లా మిర్చి కూర. మిర్చి బజ్జీకి కావాల్సిన దినుసులే. ఎటొచ్ఛీ మిరపకాయలు మినహా మిగిలినవన్నీ తక్కువ పరిమాణంలో సరిపోతాయి.  

మార్కెట్ నుంచి మిరపకాయలు ఎంచి తెచ్చుకోవడం (అన్నీ దాదాపు ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలి) వరకూ బాగానే జరిగిపోయింది కానీ, అసలు కథ ఆ తర్వాతే మొదలయ్యింది. గుత్తి వంకాయ కూరకి వంకాయ ముచికలు సగానికి కోసినట్టుగా ఈ మిరపకాయలకి కూడా ముచికలు కొయ్యాలి. ఆ తర్వాత ఒక నిలువు చీలిక పెట్టి లోపలున్న గింజలన్నీ తీసేయాలి. వినేప్పుడు 'ఇదెంతపని' అనిపించింది కానీ, దిగాకే లోతు తెలిసింది. డాక్టర్లు సర్జరీ చేసినంత నేర్పుగా అనడం అతిశయోక్తిలా వినిపిస్తుందేమో కానీ, ఇంచుమించు అంత నేర్పూ అవసరం. 


మిర్చి విరిగిపోకండా, మొత్తంగా చీలిపోకుండా చూసుకుంటూనే, గింజలన్నీ బయటికి తెచ్చేయాలి. నేనైతే, మొత్తం నాట్లు పెట్టే పనయ్యాక, ఒక్కో మిర్చీకి షవర్ బాత్ చేయించాను. గింజల్ని వదుల్చుకున్న మిర్చీలన్నిటినీ ఓ చిల్లుల బుట్టలో వాడేసి, తర్వాత పనికి ఉపక్రమించాను. (ఈ స్టెప్పుని నేను సరిగ్గా వినకపోవడం వల్ల హోస్టు గారికి ఫోన్ చేసి మరోసారి కనుక్కోవాల్సి వచ్చింది, ఆవిడ పాపం ఓపిగ్గా మళ్ళీ చెప్పారు). ఇంతకీ ఇప్పుడు చేయాల్సిన పని స్టఫింగ్ రెడీ చేసుకోవడం. నేను చేసిన పధ్ధతి చెబుతున్నాను కానీ, ఇలా మాత్రమే చేయాలన్న రూలేమీ లేదు. ఈ స్టఫింగ్ రుచులలో ఎవరి అభిరుచికి తగ్గట్టు వాళ్ళు మార్పులు చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంది (ఇది కూడా ఆవిడ మాటే). 

ముందుగా ఓ చిన్న కప్పులో చింతపండు తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టాను. స్టవ్ మీద బాండీ వేడి చేసి, తగినంత శనగపిండిని దోరగా వేయించాను. నూనె అక్కర్లేదు, డ్రై రోస్టు సరిపోతుంది. వేగిన పిండిని ఓ గిన్నెలోకి తీసుకుని అందులో వాము, ఉప్పు, కారం తగు పాళ్ళలో వేసి కలిపాను. (మొన్నామధ్య నేను చేసిన సాంబారు మా పనామెకి ఇస్తే, మర్నాడొచ్చి "ఉప్పెక్కువయ్యింది, అంతంత ఉప్పు తినడం ఒంటికి మంచిది కాదు" అని కుండ బద్దలు కొట్టేసింది. ఆమె 'సంసారం ఒక చదరంగం' లో చిలకమ్మలాగా మా  విషయాల్లో కొంచం చనువు తీసేసుకుంటూ ఉంటుంది, ఏమీ చేయలేం). ఈ మిశ్రమాన్ని చెంచాతో బాగా కలిపి పక్కన పెట్టాను. 

నానిన చింతపండు నుంచి రసం తీసి, ఆ రసాన్ని పిండిలో కలిపాను. మిశ్రమాన్ని గరిటజారుగా చేయడానికి కొంచం నీళ్లు కూడా కలిపి రుచి సరిచూసుకోవడంతో రెండో అంకం పూర్తయ్యింది. చివరి స్టెప్పు దగ్గరికి వస్తే, ఫ్లాట్ గా ఉన్న దోశల పెనం స్టవ్ మీద పెట్టి, వేడెక్కుతూ ఉండగా ఓ మూడు చెంచాల నూనె వేసి, ఆ నూనె పెనమంతా పరుచుకునేలా కదిపాను. స్టవ్ సిమ్ లో ఉంచి, ముందుగా సిద్ధం పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని (మాలతీ చందూర్ గారి 'ముందుగా తరిగిపెట్టుకున్న కూర ముక్క'ల్లాగా) ఒక్కో మిర్చి లోనూ కూరి - ఒక్కో మిర్చిలో ఒక్కో చిన్న చెంచాడు చొప్పున వేశా - పెనం మీద పరిచాను. ఇక మిగిలింది సూపర్వైజింగ్ పనే. 


అప్పుడప్పుడు మిర్చీలని కదుపుతూ,  అడుగువైపున వేగిన వాటిని తిరగేస్తూ, రెండు పక్కలా వేగినవాటిని పెనం మీంచి తీసేసి వేరే బౌల్ లోకి మారుస్తూ అరగంట గడిపితే ఎర్రెర్రని సిమ్లా మిర్చీ కూర నోరూరిస్తూ రెడీ అయిపోయింది. కాస్త నెయ్యి తగిల్చిన వేడన్నం ముద్దలు, మిర్చీ కాంబినేషన్ భలేగా కుదిరింది. మా హోస్టు ముద్దపప్పుతో వడ్డించారు కానీ, విడిగా అన్నంతో కూడా కూర బావుంది. ఉప్పుకారాల పాళ్ళు సరిపోయినట్టు అనిపించడంతో పనామెకి ఇచ్చే ధైర్యం చేశాం. చెప్పకపోడమేం, ఫీడ్ బ్యాక్ ఎలా ఉంటుందో అని గుండెలు బితుకు బితుకు మంటున్నాయి. 

గురువారం, సెప్టెంబర్ 26, 2019

ఇల్లేరమ్మ - సోమరాజు సుశీల

దాదాపు పాతికేళ్ల క్రితం మాట.. ఇంటికొచ్చిన బంధువొకరు తను  ప్రయాణంలో చదువుకోడానికి కొనుక్కున్న వారపత్రికని వెళ్తూ వెళ్తూ మా ఇంట్లో వదిలేసి వెళ్లారు. కాలక్షేపానికి నేనా పుస్తకం తిరగేస్తూ ఓ చోట ఆగిపోయాను. 'మేమందరం ఇంకో ఊరికి.. ఏలూరికి' పేరుతో ఓ చిన్న కథ. చదవడం మొదలెట్టగానే చిన్నప్పుడు నేనాలోచించినట్టే ఆలోచించే పాత్ర పరిచయం అయ్యింది. పోస్టుమాన్ టెలిగ్రామ్ తెస్తే ఎవరో చచ్చిపోయిన వార్త పట్టుకొచ్చాడని అనేసుకోడం మొదలు, సినిమాల్లో కుటుంబం అంతా కలిసి పాడుకునే పాటని ఇంట్లో అందరూ గుర్తుపెట్టుకుంటే, ఒకవేళ ఎప్పుడైనా విడిపోయినా మళ్ళీ కలవడానికి పనికొస్తుందన్న ఆలోచన వరకూ.. ఆ కథ అలా గుర్తుండిపోయింది. ఆ పాత్ర పేరు ఇల్లేరమ్మ. సృష్టికర్త డాక్టర్ సోమరాజు సుశీల. 

కొన్నేళ్లు గడిచాక 'ఇల్లేరమ్మ కతలు ఆవిష్కరణ' అంటూ పేపర్లో వార్త. ఆవిష్కరించిన బాపూ రమణలు రచయిత్రి సోమరాజు సుశీలని అభినందించారని చదవగానే 'మేమందరం ఇంకో ఊరికి..' చటుక్కున గుర్తొచ్చింది. వెంటనే పుస్తకం కొని 'గణేశా ఈశా' మొదలు 'అయితే నా రెండెకరాలూ గోవిందేనా' వరకూ పుస్తకంలో ఉన్న కథలన్నీ మళ్ళీ మళ్ళీ చదివేశాను, దాదాపు నోటికొచ్చేసేలా. చదివేశాను అనడం అతిశయోక్తి,  ఆ కథలు చదివించేశాయి అనడం నిజం. ఒక్క ఆలోచనలే కాదు, ఇంటి వాతారణం మొదలు, పాటించే ఆచారాలు, బంధువులు, గృహ రాజకీయాలు.. వీటన్నింటిలో పోలికలు కనిపించడం  వల్లనేమో ఇంటిల్లిపాదీ ఆ పుస్తకాన్ని 'సొంతం' చేసేసుకున్నాం. అద్దిల్లు వెతుక్కోడం మొదలు, పాలు పొంగేప్పుడు 'పొంగిపోతున్నాయీ' అనకూడదు అనడం వరకు  ఎన్ని విషయాలు నేర్పిందో ఇల్లేరమ్మ. 

కేవలం సరదా కబుర్లే కాదు, 'మిథునం' లో  బుచ్చిలక్ష్మి చెప్పినట్టు 'బరువు తగ్గించే మాటలు' ఎన్నో చెప్పింది ఇల్లేరమ్మ. 'పెరట్లో జామచెట్టు ఉన్నవాళ్ళకి ఉయ్యాలూగొచ్చని తెలీదు. తెలిసిన వాళ్లకి జామచెట్టు ఉండదు'  ఎంతగొప్ప జీవితసత్యం! చెప్పుకుంటూ వెళ్తే ఇలాంటివి ఎన్నో. బంధుమిత్రుల్లో చదివే అలవాటున్న వాళ్లందరికీ 'ఇల్లేరమ్మ కతలు' కాపీలు పంచడం అనే కార్యక్రమం కొనసాగుతూ ఉండగానే, ' దీపశిఖ' కధాసంపుటి మార్కెట్లోకి వచ్చింది. ఈలోగానే 'చిన్న పరిశ్రమలు - పెద్ద కథలు' చదవడం పూర్తయ్యింది. చెప్పకపోడమేం, ఈ రెండు పుస్తకాలూ కూడా 'ఇల్లేరమ్మ కతలు' ముందు తేలిపోయినట్టు అనిపించాయి. తర్వాత వచ్చిన 'ముగ్గురు కొలంబస్ లు' ట్రావెలాగ్లు ఇలా కూడా రాయొచ్చు అని నిరూపించిన పుస్తకం. 

కొందరు రచయితలు కొన్ని పాత్రలు సృష్టించడానికే పుడతారేమో.. గురజాడ 'మధురవాణి,' ముళ్ళపూడి 'బుడుగు,' పతంజలి 'వీరబొబ్బిలి' ఇలా జాబితా వేస్తే డాక్టర్ సోమరాజు సుశీల 'ఇల్లేరమ్మ' ని చేర్చి తీరాలి. రాశిగా చూస్తే ఆధ్యాత్మిక రచనలతో కలిపి సుశీల పుస్తకాలు రెండు పుంజీలకి మించకపోవచ్చు. కానీ వాసిలో ఎంచితీరాల్సినవి. ఐ డ్రీమ్స్ వాళ్ళ 'అక్షర యాత్ర'  సిరీస్ లో డాక్టర్ సి. మృణాళిని, డాక్టర్ సుశీలని ఇంటర్యూ చేసినప్పుడు 'ఐ డ్రీమ్స్ వాళ్ళు చేస్తున్న మంచిపనుల్లో ఇదొకటి' అనిపించింది నాకు. మృణాళిని ఇంటర్యూ నిర్వహణని గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు కానీ, నవ్వుతూ, నవ్విస్తూనే తాను చెప్పదల్చిన విషయాలని చాలా స్పష్టంగా చెప్పారు సుశీల. 


ఇంటర్యూ వచ్చిన కొన్నాళ్ళకి ఇల్లేరమ్మని ముఖాముఖీ కలుసుకునే అవకాశం వచ్చింది, అదికూడా చాలా యాదృచ్చికంగా. 'ఇల్లేరమ్మ కతలు' గురించి ఎన్నో ప్రశ్నలు అడిగినా, ఆమె తను చెప్పదల్చుకున్న విషయాలు మాత్రమే చెప్పారు. "మీ హిందీ మేస్టార్ని కల్లో చంపేయడం గురించి చెప్పండి" అని ఎన్ని సార్లు అడిగినా ఇంకేదో చెప్పి మాట దాటేశారు తప్ప, అసలు విషయం మాత్రం చెప్పలేదు. 'జామచెట్టు ఉయ్యాల' ని ప్రస్తావిస్తే,  సువర్ణ అకాల మరణాన్ని తల్చుకుని బాధపడ్డారు. 'హరేరామ' తాతగారి గురించి, 'పుంగోణం' గురించి, 'చంద్రరావు' గురించీ బోల్డన్ని కబుర్లు చెప్పారు. గొప్ప  రచయితలతో సన్నిహితంగా మసిలినా వాళ్ళ పుస్తకాలేవీ చదవలేదని, ఆ విషయం ఆయా రచయితలకి కూడా తెలుసనీ చెప్పారు. 

ఆవిడ మాటలు వింటున్నంతసేపూ రచన  అన్నది ఆవిడకి సహజాతం అనిపించింది. ఆవిడ మాటలన్నీ ఆవిడ కథల్లో వాక్యాల్లాగే ఉన్నాయి. ఏ  విషయాన్ని గురించైనా ఆవిడ చెప్పే పధ్ధతి కథ చెప్పినట్టే ఉంటుంది. చిన్న సంఘటనకి కూడా బోల్డంత హాస్యాన్ని, వ్యంగ్యాన్ని రంగరించి చెప్పడం ఆవిడకి వెన్నతో పెట్టిన విద్య అని అర్ధమయ్యింది. చాలామంది రచయితలు వాళ్ళ రచనల్లో దొరకరు. రచయితలకీ, రచనల్లో పాత్రలకే పోలికే ఉండదు. కానీ, సోమరాజు సుశీల ఇందుకు మినహాయింపు. తను నవ్వుతూ, చుట్టూ ఉన్నవాళ్ళని నవ్వించడం, ఆ నవ్వుల మధ్యలో అనేక జీవితసత్యాలని అలవోకగా చెప్పడం ఆవిడ తన రచనల్లో రాయడం మాత్రమే కాదు, ఆచరించీ చూపించారు.  నొప్పించక, తానొవ్వక ఉంటూనే తప్పించుకోకుండా నిలబడడం ఆమె ప్రత్యేకత. ఆమె ఇకలేరన్న వార్త వినగానే మొదటగా అనిపించిన మాట 'హంసలా ఆర్నెల్లు...' ఎలా బతకాలో చూపించి వెళ్ళిపోయిన డాక్టర్ సోమరాజు సుశీల ఆత్మకి తప్పక శాంతి కలుగుతుంది. 


బుధవారం, సెప్టెంబర్ 25, 2019

ఓడను జరిపే ...

"తరాలు మారే జతలే, స్వరాలు పాడే కథలో..
సగాలై పోయే మనువే, సృజించే మూడో తనువే.."


సినీరంగ శ్రీనాధుడు వేటూరి సుందర రామ్మూర్తికి సద్గురు త్యాగరాజస్వామి మీద ఉన్న గౌరవం తెలిసిందే. అనేక త్యాగరాజ కృతుల్ని తన పాటల్లో సందర్భానికి అనుగుణంగా ఉపయోగించుకున్నారు వేటూరి.  కొత్తగా పెళ్ళైన ఓ యువజంట సల్లాపాలనూ, ఆ ఇద్దరు, ముగ్గురవుతున్న సంతోషాన్నీ వర్ణించే క్రమంలో వచ్చే పాటకి పల్లవిగా త్యాగరాజ విరచిత 'నౌకా చరిత్రము' లో ఓ కృతిని ఎంచుకోవడం, ఇటు సందర్భానికి అటు కృతికీ కూడా అతికినట్టు చరణాలు రాయడం ఈ పాటలో విశేషం. 

'సీతారామయ్యగారి మనవరాలు' సినిమా అనూహ్య విజయం సాధించడంతో మరికొందరులు నిర్మాతలు ఆ తరహా సినిమాల నిర్మాణం మీద దృష్టి సారించారు. ఆ సినిమా  ప్రధాన తారాగణం నాగేశ్వరరావు, మీనాలతో పాటుగా దర్శకుడు క్రాంతికుమార్ తో 'రాజేశ్వరి కళ్యాణం' చిత్రాన్ని నిర్మించారు నటుడు, నిర్మాత మురళీమోహన్. సంగీత ప్రధానంగా సాగే ఈ సినిమాలో త్యాగరాజ కృతుల్ని సందర్భానుసారంగా ఉపయోగించుకున్నారు. 

ఇప్పుడు చెప్పుకుంటున్న పాట కథని ముందుకు తీసుకెళ్లే సందర్భ గీతం, రెండు జంటలు పాడుకునే యుగళగీతం కూడాను. వృద్ధ జంట మాస్టారు, సీత (నాగేశ్వరరావు, వాణిశ్రీ), యువజంట శంకరం, రాజేశ్వరి (సురేష్, మీనా) లపై ఈ గీతాన్ని చిత్రించారు క్రాంతికుమార్. 

కథ ప్రకారం, మాస్టారు, సీత శాస్త్రీయ సంగీతాభిమానులు. సంతానం లేని ఆ జంటకి రాజేశ్వరి అంటే అభిమానం. ఆమె సవతి తల్లి (జయచిత్ర)ని ఎదిరించి మరీ రాజేశ్వరి ప్రేమించిన యువకుడితో ఆమె పెళ్లి జరిపిస్తారు. పెళ్లి తర్వాత ఆ జంటని తమతోపాటే ఉండిపొమ్మంటారు. వడియాలుపెట్టుకుంటూ సీత తీసే కూనిరాగంతో పాట ఆరంభమవుతుంది. 

"ఓడను జరిపే ముచ్చట కనరే వనితలారా నేడూ..
ఆడువారు యమునకాడ కృష్ణుని కూడి
ఆడుచు పాడుచు అందరు చూడగా.."

ఇది యధాతధంగా 'నౌకా చరిత్రము' నుంచి తీసుకున్నదే. త్యాగరాజు రచించిన రెండు సంగీత నాటకాల్లో 'నౌకా చరిత్రము' ఒకటి (రెండోది 'ప్రహ్లాద భక్తి విజయం' ). బాలకృష్ణుడి లీలల్ని వర్ణించే ఈ నాటకాన్ని తర్వాతి కాలంలో నృత్య నాటకంగానూ మార్చి ప్రదర్శనలు ఇచ్చారు/ఇస్తున్నారు శాస్త్రీయ నృత్య కళాకారులు. 

పల్లవి తర్వాత వచ్చే తొలిచరణంలో యువజంట ముద్దు ముచ్చట్లని చిత్రించారు దర్శకుడు. నది ఒడ్డున ఇంట్లో ఉండే జంటకి ఏకాంతం కావాలంటే పడవే శరణ్యం మరి. (చిత్రీకరణలో ఈ చరణానికి న్యాయం జరగలేదనిపిస్తుంది నాకు) 



"వలపుతడీ తిరణాలే పొంగిన యేటికి అందం..
కెరటాలకు వయ్యారం, కరిగే తీరం..
తిలకమిడే కిరణాలే.పొద్దుటి తూరుపుకందం..
చినదానికి సింగారం, సిగమందారం.. 

పదాల మీదే పడవ, పెదాలు కోరే గొడవ.. 
ఎదల్లో మోగే దరువే, కదంగా నావే నడవ..
ఇలా నీలాటిరేవులో..." 
 

నీలాటి రేవులో ముగిసిన చరణానికి, 'ఓడను జరిపే' పల్లవితో చక్కని లంకె. తొలిచరణంలో సాగిన ముద్దుముచ్చట్ల ఫలితం ఏమిటన్నది పల్లవి సాగుతుండగా తెరమీద కనిపిస్తుంది. తొలిసారి తల్లిదండ్రులు కాబోతున్న ఆనందంలో ఆ జంట పాడుకునే చరణం ఇలా సాగుతుంది: 

"చిలిపితడీ వెన్నెలలే గౌతమి కౌగిలికందం..
తొలిచూలుకు శ్రీకారం, నడకే భారం..
ఉలికిపడే ఊయలలే కన్నుల పాపలకందం..
నెలవంకల సీమంతం, ఒడిలో దీపం.. 

తరాలు మారే జతలే, స్వరాలు పాడే కథలో..
సగాలై పోయే మనువే, సృజించే మూడో తనువే..
త్యాగయ్య రామ లాలిలో..." 

త్యాగయ్య రామలాలితో ముగిసే ఈ చరణానికి కూడా పల్లవితో అందమైన లంకె కుదిరింది. రామలాలి వింటూ పెరిగే బాలకృష్ణుడి విలాసాలే కదా 'నౌకా చరిత్రము.'  కథలో సందర్భాన్ని, నౌకాచరిత్రపు నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వింటూ ఉంటే, వినే ప్రతిసారీ మరింత సొగసుగా వినిపించే పాట ఇది. కీరవాణి సంగీత సారధ్యంలో కోరస్ తో కలిసి బాలూ, చిత్ర పాడారు. (చరణాల ప్రతిపదార్ధం ఇక్కడ చెప్పడం కంటే, ఎవరి ఊహా శక్తి మేరకు వారు అన్వయం చేసుకోడమే బావుంటుంది).

సోమవారం, జులై 29, 2019

ది గుడ్ ఎర్త్ (The Good Earth)

దేశమేదైనా, కాలం ఎలాంటిదైనా వ్యవసాయం చేసే రైతుల ఆలోచనలు, జీవనవిధానమూ ఒకేలా ఉంటాయని  తెలియజెప్పే నవల  చైనా రచయిత్రి పెర్ల్ ఎస్ బక్ ఆంగ్లంలో రాసిన 'ది గుడ్ ఎర్త్.' 1931 లో నాటి గ్రామీణ చైనాని చిత్రిస్తూ రాసిన ఈ నవలకి గాను పెర్ల్ బక్ పులిట్జర్ బహుమతిని అందుకున్నారు. అంతేకాదు, ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారానికి ఆమె ఎంపిక కావడానికి ఈ నవల కూడా దోహదం చేసింది.  ప్రపంచ సాహిత్యాభిమానులు మెచ్చిన ఈ నవలకి కొనసాగింపుగా మరో రెండు నవలలు రాశారామె. ఈ కథ ఇదే పేరుతో సినిమా గానూ విడుదలైంది.

కథానాయకుడు వాంగ్ లంగ్ పెళ్లి హడావుడితో కథ మొదలవుతుంది. కొద్దిపాటి వ్యవసాయ భూమి, ఒక చిన్న ఇల్లు మాత్రమే వాంగ్ ఆస్థులు. తల్లి మరణించింది. వృద్ధుడైన తండ్రి విశ్రాంతి తీసుకుంటున్నాడు. కాబట్టి, వాంగ్ పొలం పనులతో పాటు తన పెళ్లి పనులనీ తానే చేసుకోవాలి. పెద్దమొత్తంలో కన్యాశుల్కం చెల్లించగలిగే స్థితిపరుడు కాదు కాబట్టి, వాంగ్ తండ్రి తన కొడుకు కోసం ఓలాన్ అనే బానిస యువతిని వధువుగా ఎంచుతాడు. వాంగ్ వాళ్ళ పల్లెకి సమీపంలోని పట్టణంలో ఉండే జమీందార్ల ఇంట వంట మనిషిగా పనిచేస్తోంది ఓలాన్. ఆమె చిన్నపిల్లగా ఉండగా ఓ కరువు సంవత్సరంలో ఆమెని జమీందార్లకి బానిసగా అమ్మేశారు ఆమె తల్లిదండ్రులు. పెళ్లి కూతురి కోసం భయంభయంగా భవంతిలోకి అడుగుపెడతాడు వరుడు.

దంపతులుగా తన ఎదుట నిలబడ్డ వాంగ్, ఓలాన్ లని మనస్ఫూర్తిగా దీవిస్తుంది వృద్ధ  జమీందారిణి. ఆమె నల్లమందు మత్తులో జోగుతూ ఉంటుంది. ఉన్నట్టుండి మాటలు మర్చిపోతూ ఉంటుంది కూడా. "ఓలాన్ ఒళ్ళు దాచుకునే బానిస కాదు. కష్టపడి పనిచేస్తుంది. ఆమెలో నా కొడుకుల్ని మెప్పించేంత అందం లేదు. కనుక ఆమె కన్య అనే నేను భావిస్తున్నాను. నీ ఇంటికీ, పొలానికీ ఆమె చాకిరీ చేస్తుంది. నీకు కొడుకులని కనిస్తుంది. మీ మొదటి కొడుకుని ఎత్తుకుని నా  దగ్గరికి రండి," అంటూ కొత్త దంపతులని తన భవనం నుంచి సాగనంపుతుంది. జమీందారిణి  మాటలు అక్షరాలా నిజం. వాంగ్ లంగ్ ఇంటికీ, పొలానికీ ఓలాన్ తన శ్రమనంతటినీ ధారపోసింది.

ఏడాది తిరిగేలోగా మగబిడ్డకి జన్మనిచ్చింది ఓలాన్. రోజంతా పొలంలో పనిచేసి, నొప్పులు వస్తుండగా ఇంటికి వెళ్లి మరో మనిషి సాయం లేకుండా బిడ్డని కనడమే కాదు, మర్నాటి నుంచీ ఇంటి పనులు, పొలం పనులూ యధావిధిగా అందుకుంది. బిడ్డకి పాలిచ్చి పొలం గట్టున పడుకోబెట్టి, పొలంలో వంగి పని అందుకుంటే ఓలాన్ చనుబాలతో పొలం తడిసేది. ఆ ఏడు పంట విరగపండింది. పట్నంలో పంటని అమ్మి, వెండి నాణేలమూట రొంటిన దోపుకుని ఇంటికి వచ్చాడు వాంగ్ లంగ్. నూతన సంవత్సరం పండగ వస్తోంది. భార్యకీ కొడుక్కీ కానుకలు కొనాలి.

ఓలాన్ బహు పొదుపరి. పెద్దగా డబ్బు ఖర్చు చేయకుండానే ఇంటిల్లిపాదికీ అందమైన కొత్త దుస్తులు అమరుస్తుంది. భర్తకీ కొడుక్కీ పాదరక్షల్ని స్వయంగా తయారు చేస్తుంది. అంతేకాదు, తాను పనిచేసే చోట వంటబట్టించుకున్న పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని వినియోగించి పల్లెలో ఎవరూ తయారుచేసుకోని వంటకాల్ని సిద్ధం చేస్తుంది కూడా. జమీందారిణి ఆదేశం ప్రకారం, భార్యనీ కొడుకునీ ఆమె దర్శనానికి తీసుకెళ్తాడు వాంగ్ లంగ్. ఈసారికి జమీందారిణి అంతఃపురంలో ఉంటుంది. మగవాళ్ళకి అక్కడ ప్రవేశం లేదు. బయటే నిలబడిపోతాడు వాంగ్ లంగ్.  తిరిగి వచ్చిన ఓలాన్ ఇంటికి వెళ్లే దారిలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతుంది భర్తతో. 


జమీందారు పరిస్థితి బాగా లేదనీ, డబ్బుకి కటకటగా ఉండడంతో కొంత  పొలాన్ని అమ్మాలని అనుకుంటున్నారన్నది ఆమె మాటల సారాంశం. "ఎటూ మన దగ్గర వెండి ఉంది కదా, ఆ పొలాన్ని మనమే ఎందుకు కొనకూడదు?" అన్న ఆలోచన వస్తుంది ఇద్దరికీ. దారి పొడవునా తర్జనభర్జనలు పడతారు. ఏ ఇంటి నుంచి తనో బానిసని భార్యగా తెచుకున్నాడో, అదే ఇంటి వాళ్ళ పొలాన్ని తాను కొనబోవడం అన్న ఊహ చాలా బాగా నచ్చేస్తుంది వాంగ్ లంగ్ కి. పొలాన్ని కొనేస్తాడు. మరి రెండేళ్లు గడిచేసరికి మరో మగపిల్లాడు, ఆడపిల్ల కలుగుతారు. జమీందార్ల నుంచి మరికొంత పొలం కొంటాడు వాంగ్ లంగ్. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఉన్నట్టుండి కరువొస్తోంది. వర్షాల్లేవు. పంటల్లేవు. డబ్బు లేదు. ఒకవేళ డబ్బులున్నా కొనేందుకు ఏమీ దొరకని పరిస్థితి.

వాంగ్ లంగ్ ఎదుగుదల అతని చిన్నాన్నకి కంటగింపవుతుంది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాడికి  ఆ కరువు కాలంలో అవకాశం దొరుకుతుంది. తల్లిపాల బలం వల్లనేమో కానీ, కరువు రోజుల్లో ఊళ్ళో పిల్లలంతా డొక్కలెండిపోయి ఉంటే, వాంగ్ లంగ్ పిల్లలు మాత్రం ఆరోగ్యంగా ఉంటారు. వాంగ్ లంగ్ తన ఇంట్లో తిండి గింజలు దాచుకున్నాడనీ అందుకే అతడి పిల్లలు మాత్రమే మిసమిసలాడుతూ ఉన్నారనీ పితూరీ లేవదీస్తాడు చిన్నాన్న. దాంతో, ఊరందరూ వాంగ్ లంగ్ ఇంటిమీద కరువు దాడి చేస్తారు. కానీ ఆ ఇంట్లో తిండి గింజలు దొరకవు. రోజులు గడవడం మరింత భారమవుతుంది. తప్పని పరిస్థితుల్లో కుటుంబంతో సహా నగరానికి వలస వెళ్తాడు వాంగ్ లంగ్.

ఓ పెద్ద భవంతి ప్రహరీ గోడ పక్కన గుడారాన్ని నిర్మించుకుంటుంది ఆ కుటుంబం. వాంగ్ లంగ్ రిక్షా లాగడం మొదలు పెడతాడు. ఓలాన్, పిల్లల్నీ, మావఁగార్నీ తీసుకుని భిక్షాటనకు బయలుదేరుతుంది. నగర ప్రముఖులు ఏర్పాటు చేసిన గంజి కేంద్రాల్లో నామమాత్రపు ధరకి ఆహారం దొరుకుతుంది. కానీ, కరువు రోజుల్లో ఆ మొత్తాన్ని సంపాదించడమూ అసాధ్యమే. రోజులు బరువుగా గడుస్తూ ఉంటాయి. వాంగ్ లంగ్ దృష్టంతా ఊరిమీదా, తన పొలాలమీదా ఉంటుంది. కరువు దాడుల్లో డబ్బు పోగొట్టుకున్న వాళ్ళ గురించి విన్నప్పుడు, తన భూమిని ఎవరూ దోచుకోలేరని తృప్తి పడతాడు వాంగ్ లంగ్. కానీ ఎప్పటికన్నా మంచిరోజులు వస్తాయా అన్న చింత అతన్ని తొలిచేస్తూ ఉంటుంది. అదే విషయాన్ని తన పక్క గుడిసెలో ఉండే అతన్ని అడుగుతాడు.

"ధనవంతుడు మరింత ధనవంతుడు అయినప్పుడు, పేదవాడు మరింత పేదవాడు అయినప్పుడు తప్పకుండా మంచి రోజులు వస్తాయి" అని భరోసా ఇస్తాడతను. ఆ మాటలు అర్ధం కాకపోయినా, ఆ మంచిరోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వాంగ్ లంగ్. అనుకోని విధంగా ఆ మంచి రోజు వస్తుంది. వాంగ్ లంగ్ తన ఊళ్ళో ఎవరూ ఊహించనంత పొలాన్ని కొంటాడు. కొడుకుల్ని చదివిస్తాడు. కవలపిల్లలకు (ఆడ, మగ) జన్మనిస్తుంది ఓలాన్. వాళ్ళ జీవితాల్లో వచ్చిన అనూహ్యమైన మార్పులు, మట్టినే నమ్ముకుని బతికిన ఆ కుటుంబం మట్టికి దూరంగా జరిగేలా చేసిన పరిస్థితులు తెలుసుకోవాలంటే 354 పేజీల 'ది గుడ్ ఎర్త్' చదవాల్సిందే.

ఈ నవల చదువుతున్నంతసేపూ డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి రాసిన 'మట్టిమనిషి,'  శివరామ కారంత్ కన్నడ నవల 'మరళి మణ్ణిగె' ('మరల సేద్యానికి' పేరిట అందంగా తెనిగించారు ఆచార్య తిరుమల రామచంద్ర) పదేపదే గుర్తొచ్చాయి. ఈ ఇద్దరు రచయితలనీ పెర్ల్ బక్ రచన ప్రభావితం చేసింది అనడం నిర్వివాదం. వాంగ్ లంగ్-ఊరుబోయిన సాంబయ్య, ఓలాన్-పారోతి పాత్రల మధ్య పోలికలు సుస్పష్టం.  ఇవాళ్టికీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలని ఆనాడే తన నవలలో చిత్రించడం పెర్ల్ బక్ ముందు చూపుకు నిదర్శనమా లేక వ్యవసాయం చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు లేదన్న సంకేతమా అన్న ప్రశ్న రాక తప్పదు. 'ది గుడ్ ఎర్త్' మార్కెట్లోనూ, ఆన్లైన్లోనూ దొరుకుతోంది.

గురువారం, మే 23, 2019

చంద్రబాబు పొరపాట్లు

కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత 2014 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చిన అంశం ఒక్కటే - వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు వైఎస్  జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారనీ, ప్రజల సొమ్ము లక్ష కోట్ల రూపాయలు సొంతానికి వెనకేసుకున్నారనీ. ఇతరత్రా కారణాలతో పాటు, ఈ 'అవినీతి' ప్రచారమూ తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాడానికి కలిసొచ్చిందన్నది నిర్వివాదం. చంద్రబాబు, ఇతర నాయకుల ప్రచారావేశం చూసిన ప్రజల్లో కొందరైనా కొత్త ప్రభుత్వం ఏర్పడగానే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లడం ఖాయం అని భావించారు. తెలుగు దేశం అధికారం లోకి వచ్చింది, కానీ, జగన్మోహన్ రెడ్డి మీద చేసిన అవినీతి ఆరోపణలు రుజువు కాలేదు.

ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలొచ్చాయి. జగన్ లక్ష కోట్ల అవినీతి పరుడు అంటూ చంద్రబాబు మళ్ళీ పాత పల్లవి అందుకున్నారు. మరి ఐదేళ్ల పాటు ఎలాంటి చర్యలూ ఎందుకు తీసుకోలేదు అంటే జవాబు దొరకదు. జగన్ అవినీతిని చంద్రబాబు కేవలం ఎన్నికల అంశంగా మాత్రమే చూస్తున్నారన్న ఆలోచన జనంలోకి వెళ్ళింది. కేంద్రంలో అధికారంలో ఉన్న మిత్రపక్షం బీజీపీతో నాలుగేళ్లకు పైగా సత్సంబంధాలు నెరిపిన కాలంలో కూడా అవినీతి ఆరోపణల కేసుల్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు ఏమాత్రం ప్రయత్నాలు జరిగాయన్నది తెలీదు. ఫలితం 'అవినీతి జగన్' ఆరోపణల్ని జనం ఈసారి సీరియస్ గా తీసుకోలేదు. ఆరోపణల్లో నిజం ఉండి, తన పార్టీ నేతల చేత ప్రత్యర్థి మీద కేసులు వేయించడంతో ఊరుకోకుండా, వాటి పురోగతి విషయంలో కూడా చంద్రబాబు శ్రద్ధ చూపి ఉంటే ఇవాళ ఎన్నికల ఫలితం మరోలా ఉండేది బహుశా.

ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తన వ్యవసాయ విధానాలతో రైతులకి దూరమైన చంద్రబాబు, గత ఎన్నికలకి ముందు సంపూర్ణ రైతు రుణ మాఫీ హామీ ప్రకటించారు. సహజంగానే రైతుల్ని ఇది ఆకర్షించింది. కానీ, హామీ అమలు విషయానికి వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. అర్హుల్ని నిర్ణయించడం మొదలు, పంపిణీ వరకూ రుణ మాఫీని నానారకాలుగా నీరుకార్చడంతో విసిగిపోయిన రైతులకి, రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా రైతు రుణమాఫీ చేసేసిందంటూ చేసిన భారీ ప్రచారం పుండు మీద కారంలా మారింది. స్వయం శక్తి సంఘాల మహిళల రుణమాఫీదీ ఇదే తీరు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు రావడం మీద కన్నా, నియోజకవర్గాల పునర్విభజన మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం, మెజారిటీ ప్రజల సెంటిమెంట్ అయిన ప్రత్యేక హోదాని చిన్నబుచ్చుతూ మాట్లాడ్డం చంద్రబాబు స్థాయి నేత చేయాల్సిన పనులు కావు.

స్థాయికి తగని వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కోవడం చంద్రబాబుకి గతంలోనూ అనుభవమే (లక్ష్మీ సెహగల్ ఎవరో తనకి తెలీదనడం లాంటివి) కానీ గడిచిన ఐదేళ్ళలో అలాంటి సందర్భాల సంఖ్య మరింత పెరిగింది. వయసు, అనుభవంతో పాటు హుందాతనాన్ని పెంచుకోవాల్సిన ఉండగా, అలా కాకుండా జనం నొచ్చుకునేలా మాట్లాడడం, క్షమాపణ ప్రస్తావనే లేకపోవడం కొన్ని వర్గాలని నొప్పించింది. ఇక, ప్రతిపక్షానికి సంబంధించిన విషయాల్లో అయితే హుందాతనం ప్రసక్తే లేదు. ఓటుకి నోటు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు లాంటి విషయాలని ఓటర్లు గమనించారని, గుర్తు పెట్టుకున్నారని ఈ ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. ప్రధాని మీద కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగని విధంగా విమర్శలు చేయడం కొందరు వోటర్లని తెలుగుదేశం పార్టీకి దూరం చేసింది. కాంగ్రెస్ తో పెట్టుకున్న పొత్తయితే చాలామంది తెలుగుదేశం వారినే విస్మయపరిచింది.

'జలయజ్ఞం' లో అవినీతి జరిగిందంటూ పదేపదే విమర్శలు చేసిన చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టు వ్యయం విషయంలో పారదర్శకతని చూపలేకపోయారు. జనానికి జవాబుదారీగా ఉండడం మాట అంటుంచి, నిధులు విడుదల చేసిన కేంద్రానికే లెక్కలు చెప్పలేదన్న ఆరోపణలున్నాయి. ప్రాజెక్టు కోసం కేటాయించిన నిధుల్ని ఇతర ఖర్చులకి వాడడాన్ని కాగ్ ఎత్తిచూపినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. గత ఐదేళ్లుగా జరిగిన వృధావ్యయానికి లెక్కేలేదు. ప్రత్యేక విమానాల్లాంటి ప్రత్యేక ఖర్చులు అదనం. ఎన్టీఆర్ వెన్నుపోటు నుంచి మొన్నటి 2014 సార్వత్రిక ఎన్నికలవరకూ ఎప్పుడూ పొత్తు లేకుండా పోటీ చేయని చంద్రబాబు, మొదటిసారిగా అన్ని స్థానాలనుంచీ తన పార్టీ వారినే నిలిపే ప్రయోగం చేశారు. ఇందుకు దారితీసిన పరిస్థితులు ఏవైనప్పటికీ, ఫలితం మాత్రం తేడా కొట్టేసింది.

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఖాళీ ఖజానా మొదలు, ప్రస్తుతం జరుగుతున్న పనులు పూర్తి చేయడానికి, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోడానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతాయి. కేంద్ర ప్రభుత్వానికి సొంత మెజారిటీ ఖాయంగా కనిపిస్తోంది కాబట్టి, పార్టీ ఎంపీల ద్వారా ఒత్తిడి చేసి నిధులు సాధించుకునే వీలుండకపోవచ్చు. ప్రతిపక్షంలో సభ్యుల సంఖ్య మరీ తక్కువే అయినా, తొంభై శాతం ప్రసార సాధనాలు బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాయి. జగన్ ని వైఎస్సార్ తో పోల్చి చూడడం అనే సవాలు ఒకటుంది. వారసత్వ రాజకీయాల్లో ఇది తప్పదు. రాష్ట్రంలో వాడవాడలా అవినీతి జెడలు విప్పుకుని నాట్యం చేస్తోందంటూ రేపటినుంచే కథనాలు మొదలైనా ఆశ్చర్యం లేదు.

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటినుంచీ, రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేస్తే 'అభివృద్ధి' ఆగిపోతుందనీ, అవినీతి పెరిగిపోతుందనీ కొందరు పౌరులు ఆవేదన చెందుతూ వచ్చారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మాత్రం ఆగిపోయేంత అభివృద్ధి, పెరగడానికి అవకాశం ఉన్న స్థాయిలో అవినీతి రాష్ట్రంలో లేవనే భావించినట్టున్నారు. తొమ్మిదేళ్లపాటు అలుపెరగకుండా చేసిన కృషి, ఎదురుదెబ్బలు తట్టుకుని నిలబడ్డ ఓరిమి, మొండితనాలతో పాటు చంద్రబాబు చేసిన పొరపాట్లు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని దక్కించుకోడానికి దోహదం చేశాయనడంలో సందేహం లేదు. పొరపాట్లకు ఫలితంగా తన రాజకీయ అనుభవం అంత వయసున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండే సభలో తాను ప్రతిపక్ష పోషించాలి. చంద్రబాబు అనుభవాల నుంచి జగన్ ఏమన్నా నేర్చుకుంటారా అన్నది వేచి చూడాల్సిన విషయం.

శనివారం, మే 18, 2019

రాళ్ళపల్లి ...

చిరంజీవి-కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన 'అభిలాష' సినిమాలో, చిరంజీవికి ఉరిశిక్ష రద్దయ్యే సన్నివేశం గుర్తుందా? ఓ పక్క ఉరి తీయడానికి ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటే, రద్దు వార్తని జైలు అధికారులకి చెప్పడానికి రొప్పుతూ, రోజుతూ పరిగెత్తుకు వచ్చే సెంట్రీ గుర్తున్నాడా? గుండెలవిసే పరుగు.. అల్లం శేషగిరిరావు 'చీకటి' కథలో డిబిరిగాడి పరుగులాంటి పరుగు. నటుడు రాళ్ళపల్లిని ఎప్పుడు తల్చుకున్నా నాకు మొదట గుర్తొచ్చేది 'అభిలాష' సినిమాలో ఈ సన్నివేశమే. ఆ సినిమాకి ముందు, తర్వాత కూడా రాళ్ళపల్లి ఎన్నో మంచి పాత్రలు చేశారు. కానీ, నావరకూ 'అభిలాష' ప్రత్యేకం. 
 

ఎప్పుడా సినిమా చూస్తున్నా, ఆ సన్నివేశం రాగానే ఊపిరి బిగపడతాన్నేను. తెరమీద జైలు సెంట్రీ పరిగెడుతుంటే, నా డొక్కలు ఎగిరిపడుతున్న అనుభూతి కలుగుతుంది. రాళ్ళపల్లి కన్నా సెంట్రీనే కనిపిస్తాడు (యూట్యూబ్ లో ఉన్న వీడియోలో ఈ పరుగు సీన్ ఎడిట్ అయిపొయింది). ఇలాంటి సీరియస్ పాత్రలే కాదు, కడుపుబ్బా నవ్వించే కామెడీ పాత్రల్నీ అలవోకగా చేసేశారు. కావాలంటే 'సిలోన్ సుబ్బారావ్ బావ' ని గుర్తు చేసుకోండి. అసలా పాత్ర లేకపోతే 'శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డేన్స్ ట్రూప్' సినిమా రెండోసగం ఎంత వెలితిగా ఉండేదో కదా. ఆ వెంటనే మణిరత్నం 'బొంబాయి' సినిమా చూస్తే అర్ధమవుతుంది రాళ్ళపల్లి బహుముఖీనత.

తనతరం నటులు చాలామంది లాగే, రాళ్ళపల్లి కూడా రంగస్థలం నుంచే సినిమా రంగానికి వచ్చారు. అదికూడా, ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసుకుని. సాధారణంగా అనిపించే ముఖ కవళికలు, ఎలాంటి మాడ్యులేషన్నైనా అలవోకగా పలికించేయగల స్వరం, వీటి సాయంతో ఎలాంటి పాత్రనైనా అర్ధంచేసుకుని, సొంతం చేసేసుకునే నటనా పటిమ. వేసిన పాత్ర ఏదైనా, కేవలం పాత్ర మాత్రమే కనిపించేలా నటించడం ఆషామాషీ విషయం కాదు. మంచి చదువరి, రచయిత కూడా అయిన రాళ్ళపల్లి, సినిమాల్లోకి వచ్చాక నటన మీద మాత్రమే దృష్టి పెట్టి, రచనని పక్కన పెట్టేశారు. రచయిత, నటుడు తనికెళ్ళ భరణిని తన శిష్యుడిగా సినిమా రంగానికి అందించారు.

రాళ్ళపల్లి ఈడువాళ్ళు, ఇంకాస్త పెద్దవాళ్ళు ఇచ్చిన, ఇస్తున్న టీవీ ఇంటర్యూలు చూస్తున్నప్పుడు ఎక్కడో ఓచోట వాళ్ళు తమకి రావాల్సినంత పేరు, అవార్డులు రాలేదనో, సంపాదించుకోవాల్సినంత డబ్బు సంపాదించలేదనో చెప్పడం కనిపిస్తుంది. కానీ, రాళ్ళపల్లి నుంచి అలాని ఫిర్యాదు వినిపించలేదు. 'నా పని నేను చేశాను' అన్న నిమిత్తమాత్రపు ధోరణే కనిపిస్తుంది. వ్యక్తిగత జీవితంలో వరసగా తగిలిన ఎదురు దెబ్బలు ఎంతగానో రాటుదేల్చాయి ఆయన్ని. అందుకే కాబోలు, సంపాదన, ఆస్తుల బెంగలేదు. 'ఓ ప్రభుత్వోద్యోగి కన్నా ఎక్కువే సంపాదించా' అని ఊరుకున్నారు. ఆరోగ్యం విషయంలో కూడా అదే నిర్లిప్తత.

ప్రేక్షకుల్లో చాలామంది రాళ్ళపల్లి నటనకి అభిమానులైతే, సినిమావాళ్లలో చాలామంది ఆయన చేతివంటకి అభిమానులు. జంధ్యాల మొదలు కమల్ హాసన్ వరకూ ఆ జాబితా చాలా పెద్దది. కమల్ అయితే 'శుభసంకల్పం' షూటింగ్ అప్పుడు, 'మీరు నటుడిగా రిటైర్ అయ్యాక నాదగ్గరికి వచ్చేయండి, వండి పెడుదురుగాని' అని అడిగేశాడట. 'షూటింగ్ లో వంటంటే మనిష్టం. ఇంట్లో అయితే మా ఆవిడ ఒప్పుకోదు. నెలకి సరిపడా వంటనూనె, ఒక్కరోజులో ఖాళీ చేసేస్తానని..' ఈమాటా రాళ్లపల్లిదే. వెండితెరమీద ఎన్నో పాత్రలకి ప్రాణప్రతిష్ట చేసిన రాళ్ళపల్లి ఇక లేక లేరన్న వార్త బాధాకరం. నటనని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్లకి ఆయన పాత్రలు ఎన్నో కొత్తవిషయాలు చెబుతాయి. వారి ఆత్మకి శాంతి కలుగుగాక..

శనివారం, మే 04, 2019

మజిలీ

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఆమె తండ్రి వాళ్ళ ప్రేమకి అడ్డుపడ్డాడు. ఆమె ఉన్నట్టుండి అతని జీవితం నుంచి మాయమైపోయింది. ఆమె జ్ఞాపకాల్లో అతడు దాదాపు పిచ్చివాడైపోయాడు. ఎప్పటినుంచో అతన్ని మూగగా ప్రేమిస్తున్న ఇంకో అమ్మాయి అతన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంది. భార్యగా అతని జీవితంలో ప్రవేశించింది. అతని గతాన్ని, తనపట్ల అతని నిరాదరణనీ కూడా అంగీకరించింది. ఉందోలేదో తెలియని ప్రేయసిపై అతడి ప్రేమ, అతని లవ్ ఫైల్యూర్ ని భరిస్తున్న ఆమె ప్రేమ - ఈ రెండింటిలో ఏ ప్రేమ గెలిచిందన్నదే 'మజిలీ' సినిమా.

ఇంకోలా చెప్పాలంటే, 'సాగర సంగమం' కథానాయకుడు బాలూ డాన్సర్ కాక క్రికెటర్ అయి ఉంటే, మాధవి మీద అతడి ప్రేమ తెలిసీ మరో స్త్రీ అతని జీవితంలో ప్రవేశించి, బాలూ మనసు మారడం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఏం జరిగి ఉండేదన్న ఊహాజనిత ప్రశ్నకి జవాబు 'మజిలీ' సినిమా. మిగిలిన ఏ విషయాల్లోనూ పోలిక కుదరదు కానీ, స్టోరీలైన్ మాత్రం అలనాటి విశ్వనాధ్-కమల్-జయప్రద-ఇళయరాజాల క్లాసిక్ ని గుర్తుచేసి తీరుతుంది, 'శైలజ' ప్రవర్తనతో సహా.

వైజాగ్ కుర్రాడు పూర్ణ (అక్కినేని నాగచైతన్య) రైల్వే టికెట్ కలెక్టర్ జగన్నాధరావు (రావు రమేష్) గారబ్బాయి. ఐటీఐ చదువుతూ, క్రికెట్ ని లక్ష్యంగా ఎంచుకుని స్థానిక టీమ్ లో ప్రవేశం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. క్రికెట్ ఆడే అవకాశం, అన్షు (దివ్యాంశ కౌశిక్) తో పరిచయం ఒకేసారి జరుగుతాయి. కుర్రాడు క్రికెట్లో దూసుకుపోవడం, అన్షుతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోవడం కూడా సమాంతరంగా జరుగుతున్న తరుణంలో, నేవీలో పనిచేసే అన్షు తండ్రికి వీళ్ళ ప్రేమకథ తెలిసి, ఆమెని దూరంగా తీసుకుపోతాడు. 

స్థానిక రాజకీయాల కారణంగా క్రికెట్ టీం లో చోటు దొరకదు పూర్ణకి. దీంతో అప్పటివరకూ క్లీన్ షేవ్ తో ఉన్నవాడు కాస్తా గడ్డం పెంచుకుని తాగుబోతైపోతాడు. ఎప్పటికైనా అన్షుని కలుసుకోడం మాత్రమే అతని జీవిత లక్ష్యం ఇప్పుడు. పూర్ణ సంగతులు పూర్తిగా తెలిసిన ఎదురింటి అమ్మాయి, రైల్వేలో బుకింగ్ క్లర్క్ గా పనిచేస్తున్న శ్రావణి (సమంత రూత్ ప్రభు) అతన్ని తప్ప మరొకర్ని పెళ్లిచేసుకోనని పంతం పట్టి మరీ అతని జీవితంలోకి ప్రవేస్తుంది. అతను తనని ఏమాత్రమూ పట్టించుకోకపోయినా, పూర్ణ మీద ఈగ వాలనివ్వదు. తన తల్లిదండ్రులతోనూ, మావగారితోనూ పోట్లాడి మరీ అతన్ని వెనకేసుకొస్తూ ఉంటుంది.

ఈ నేపథ్యంలో పూర్ణ, అన్షు తండ్రిని కలుసుకోడవం, ఏం జరిగిందో తెలుసుకోవడంతో పాటు, అతడు తనకి అప్పగించిన బాధ్యతని తీసుకోవడం, ఆ బాధ్యత నెరవేర్చడానికి శ్రావణి తన వంతు సాయం చేయడం తర్వాతి కథ. ఇంతకీ, ఆ 'సాయం' పూర్ణ-శ్రావణి లని దగ్గర చేసిందా అన్నది ముగింపు. శ్రావణి అనే ఐడియలిస్టిక్ పాత్ర ఈ సినిమా విజయానికి దోహదం చేసిందన్నది ఒప్పుకోవాల్సిన విషయం. బాయ్ ఫ్రెండ్/భర్తకి ఓ అభిమాన కథానాయిక ఉండడాన్ని కూడా జీర్ణించుకోలేని 'పొసెసివ్' అమ్మాయిలున్న కాలంలో, దర్శకరచయిత శివ నిర్వాణ శ్రావణి పాత్రతో రావడం, కమర్షియల్ గా మంచి తెలివైన ఆలోచన అని చెప్పాలి. శ్రావణిగా సమంత రెండో సగం అంతా తానై సినిమాని నిలబెట్టింది.

నాగచైతన్య చాలాచోట్ల తన తాత నాగేశ్వరరావు ని గుర్తు చేశాడు. క్లీన్ షేవ్ తో కన్నా, గెడ్డంతోనే బావున్నాడు. రావు రమేష్, పోసాని, సుబ్బరాజులవి పూర్తి నిడివి పాత్రలు. వీళ్ళతో పాటు, హీరో ఫ్రెండ్స్ గా వేసిన కుర్రాళ్ళూ బాగా చేశారు. సినిమాలో చాలాభాగం విశాఖపట్నంలోనే షూట్ చేశారు. అయితే, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తీసినప్పుడు లొకేషన్ల ఎంపికలో మరికొంచం జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది అనిపించింది. తమన్-గోపీ సుందర్ ల సంగీతం పర్లేదు. ఒక హాంటింగ్ ట్యూన్ ఉంటే మరింత బాగుండేది. హాస్యాన్ని కథలో భాగం చేసి, బరువైన సన్నివేశాలకి ముందూ వెనుకా ఒకట్రెండు నవ్వించే సీన్స్ వచ్చేలా జాగ్రత్త పడ్డం వల్ల ప్రేక్షకుల మీద మరీ ఎక్కువ బరువు పడలేదు. మొత్తంగా చూసినప్పుడు, చూడాల్సిన సినిమా ఇది.

శనివారం, ఏప్రిల్ 20, 2019

జెర్సీ

విజయం సాధించేవారు నూటికొక్కరైతే, ఆ విజయంకోసం శ్రమించేవారు మిగిలిన తొంభైతొమ్మిది మంది. ఈ మెజారిటీకి ప్రతినిధి క్రికెటర్ అర్జున్. అతని కథే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార  ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన 'జెర్సీ' సినిమా. క్రికెట్ ని జీవితంలో ఒక భాగంగా కాక, పూర్తిజీవితంగా చేసుకున్న అర్జున్ సాధించిన విజయాలు, ఎదుర్కొన్న పరాజయాలు, మళ్ళీ విజయం సాధించడం కోసం చేసిన తీవ్రమైన ప్రయత్నాలే ఈ సినిమా. కేవలం క్రికెట్ ని అభిమానించే వారికి మాత్రమే కాదు, జీవితంలో ఏదో ఒక దశలో వైఫల్యాలని ఎదురుకొన్న వారికి, విజయం కోసం శ్రమిస్తున్న వారికీ నచ్చేసే సినిమా.

క్రికెట్ ప్లేయర్ గా రాణిస్తూ నేషనల్స్ కి సెలక్ట్ అవడాన్ని లక్ష్యంగా చేసుకున్న అర్జున్ (నాని), తన అభిమాని సారా (శ్రద్ధా శ్రీనాధ్) ని ప్రేమ వివాహం చేసుకుంటాడు. వాళ్ళకో కొడుకు నాని (మాస్టర్ రోనిత్). ఊహించని విధంగా  సెలక్షన్ మిస్ అవ్వడంతో, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగంలో చేరతాడు అర్జున్. ఊహించని విధంగా  ఉద్యోగంలో సస్పెన్షన్ రావడంతో, ఉదయాన్నే నానీని క్రికెట్ కోచింగ్ కి తీసుకెళ్లడం, రోజంతా టీవీలో క్రికెట్ చూడడమే జీవితం అయిపోతుంది అర్జున్ కి.  అతన్ని అమితంగా ప్రేమించే సారా, ఇల్లు గడపడం కోసం తాను ఉద్యోగంలో చేరుతుంది.

ఎప్పుడూ తండ్రిని ఏదీ కావాలని అడగని నానీ, తన ఏడో  పుట్టినరోజున  క్రికెటర్లు ధరించే 'జెర్సీ' కొనిమ్మని కోరతాడు తండ్రిని. దాని ఖరీదు ఐదువందలు. ఆ ఐదు వందల కోసం చేసే ప్రయత్నాలలో అర్జున్ కి ఎన్నో అవమానాలు. తనని ఎంతో అభిమానించే కోచ్ మూర్తి (సత్యరాజ్) ద్వారా ఓ ఛారిటీ మ్యాచ్ ఆడే అవకాశం వచ్చినప్పుడు కూడా, అర్జున్ ఆలోచన ఆ వచ్చే  డబ్బులతో నానీకి ఒక జెర్సీ కొనివ్వచ్చని మాత్రమే. పన్నెండేళ్ల విరామం తర్వాత ఆడిన ఆ మ్యాచ్ ఫలితంగా అర్జున్ జీవితం ఏ మలుపు తిరిగింది? అంతగా ప్రేమించిన భార్య కూడా కుటుంబం లేదా క్రికెట్లో ఏదో ఒకటే ఎంచుకోమని ఎందుకు షరతు విధించింది? ఇంతకీ అర్జున్ నానీకి జెర్సీ కొనిచ్చాడా, లేదా అన్నది మిగిలిన కథ. 

సినిమా నిడివి రెండు గంటల నలభై నిమిషాలన్నా, అందులో నలభై నిముషాలు కేవలం క్రికెట్ మ్యాచ్లు మాత్రమే ఉన్నా ఎక్కడా విసుగురాని విధంగా తీర్చిదిద్దిన క్రెడిట్లో దర్శకుడితో పాటు ఎడిటర్ నవీన్ నూలి కి కూడా ఇవ్వాలి. నటన విషయానికి వస్తే నాని, శ్రద్దా శ్రీనాథ్ లు పోటాపోటీగా నటించారు. సత్యరాజ్ ది పూర్తి నిడివి పాత్ర. మూర్తిగా మరొకర్ని ఊహించలేని విధంగా చేశాడు. ప్రేమకథ, తండ్రీకొడుకుల అనుబంధం, క్రికెట్, డ్రెస్సింగ్ రూమ్ అసూయలు, బోర్డు రాజకీయాలు.. ఇలా అనేక విషయాల చుట్టూ రాసుకున్న కథ అయినప్పటికీ, ఏం చెప్పాలి అనే దానితో పాటు ఎలా చెప్పాలి అన్న విషయంలో దర్శకుడికి స్పష్టత ఉండడం వల్ల ఎక్కడా అయోమయానికి అవకాశం లేకుండా సాగింది సినిమా.

తన తొలిసినిమా 'మళ్ళీరావా' లాగానే కథని ఇంటర్కట్స్ లో చెప్పాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. న్యూయార్క్ లో చదువుకుంటున్న నాని తన తండ్రి జీవితకథ 'జెర్సీ' ని పుస్తకాల షాపులో కొనడంతో మొదలయ్యే సినిమా, ఇండియాలో జరిగే ఆ పుస్తకం ప్రమోషన్ మీట్ లో తన తండ్రిని గురించి అప్పటివరకూ తెలియని ఓ విషయాన్ని తెలుసుకోవడంతో ముగుస్తుంది.. హీరో స్నేహితులతో సహా ప్రతి పాత్రకీ ఒక ఐడెంటిటినీ ఇవ్వడంతో పాటు, పాత్రలన్నింటినీ కథలో భాగం చేశాడు దర్శకుడు. అర్జున్ విజయాల్లో ఉన్నప్పుడు, వైఫల్యాలతో కూరుకుపోయినప్పుడూ అతని చుట్టూ ఉన్న వాళ్ళ ప్రవర్తనల్లో తేడాని చిత్రించిన తీరు ముచ్చటగొలిపింది.

కొంచం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండును అనిపించిన ఒకే ఒక్క విషయం సంగీతం. పాటలు, నేపధ్య సంగీతం కథకి తగినట్టుగా లేవనిపించింది. సినిమా మొదలైన గంటా ఇరవై నిమిషాలకి ఇంటర్వల్ వస్తే, "అప్పుడే సగం సినిమా అయిపోయిందా?" అన్న కామెంట్స్ వినిపించాయి థియేటర్లో. క్లైమాక్స్ లో అయితే కొందరు ప్రేక్షకుల నుంచి క్లాప్స్ పడ్డాయి. విజయం సాధించడం అంటే మెట్లో, నిచ్చెనలో ఎక్కినంత సులువు కాదనీ, నిరంతర శ్రమ, పట్టుదలతో పాటు కొన్ని త్యాగాలూ అవసరమవుతాయనీ చెప్పిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి అభినందనలు. ఈ దర్శకుడి తర్వాతి సినిమా ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాన్నేను.

బుధవారం, ఏప్రిల్ 03, 2019

కీలుబొమ్మలు

తప్పక చదవాల్సిన తెలుగు నవలల జాబితాని ఎవరు ప్రకటించినా అందులో తప్పకుండా ఉండే పేరు  జి.వి. కృష్ణారావు రాసిన 'కీలుబొమ్మలు.' గుంటూరు జిల్లా కూచిపూడి (అమృతలూరు) కి చెందిన గవిని వెంకట కృష్ణారావు 1951 లో రాసిన ఈ నవల మానవ మనస్తత్వ విశ్లేషణకి, విలువల చిత్రణకీ పెద్దపీట వేసింది. మార్క్సిస్టు నుంచి మానవవాది (ఎమ్మెన్ రాయ్) గా మారిన కృష్ణారావు, ఈ రెండు రాజకీయ సిద్ధాంతాలనీ నవలలో ముఖ్యమైన మలుపుల దగ్గర ప్రస్తావించారు.

కోస్తా ప్రాంతంలోని ఓ పల్లెటూరు 'కీలుబొమ్మలు' నవలలో కథాస్థలం. ప్రధాన పాత్ర పుల్లయ్య ఆ ఊళ్ళో మోతుబరి రైతు. పెద్దకొడుకు అకాల మరణం మినహా అతడి జీవితంలో లోటేమీ లేదు. కోడల్ని, మనవడిని తన దగ్గరే పెట్టుకున్నాడు. ఉన్న ఒక్క కూతుర్ని, చిన్న కొడుకుని బస్తీలో పెట్టి చదివిస్తున్నాడు. ఇంటి పెత్తనం అంతా భార్య లక్ష్మమ్మదే. ఊరికి పెద్దమనిషే అయినా, ఇంట్లో పుల్లయ్య కూడా ఆవిడ మాటకి సరే అనాల్సిందే. భార్యతో చెప్పకుండా ఏపనీ చేయని పుల్లయ్య, గ్రామస్తుడు చంద్రశేఖరం మార్వాడీ దగ్గర చేసిన ఐదువేల రూపాయల అప్పుకి మాత్రం హామీ పడతాడు.

చంద్రశేఖరం బాగా చదువుకున్న, డబ్బున్న కమ్యూనిస్టు. ఊళ్ళో ఫ్యాక్టరీ నిర్మించి కార్మికులకి సకల సౌకర్యాలూ ఏర్పాటు చేస్తాడు. అయితే, అతనికి వ్యాపారంలో అనుభవం లేకపోవడంతో ఫ్యాక్టరీకి నష్టాలు మొదలవుతాయి. కార్మికులతో చర్చలు జరిపి, సహకార పద్ధతిలో ఫ్యాక్టరీ నడుపుదామని ప్రతిపాదిస్తాడు. కార్మికులు మాత్రం లాభనష్టాలతో తమకి సంబంధం లేదనీ, జీతభత్యాలు, సౌకర్యాలు మరింత పెంచాల్సిందేననీ తెగేసి చెబుతారు. తన సొమ్మే కాక, మామగారి సొమ్ము మొత్తం తెచ్చి పెట్టుబడి పెట్టినా, ఫ్యాక్టరీ దివాళా తీయడంతో ఆ రెండు కుటుంబాలూ వీధిన పడతాయి. 


ఫ్యాక్టరీని నిలబెట్టడం కోసం చంద్రశేఖరం చేసిన అప్పుల్లో పుల్లయ్య హామీ ఉన్న మార్వాడీ అప్పు ఒకటి. అయితే, పుల్లయ్య హామీ సంతకం చేసినట్టుగా సాక్ష్యం లేదు. చంద్రశేఖరం తరపున పుల్లయ్య మార్వాడీకి బాకీ తీర్చాల్సిన పరిస్థితి వస్తుంది. నిజానికి పుల్లయ్యకి చంద్రశేఖరం మీద సానుభూతి ఉంది. చెల్లించాల్సిన మొత్తమూ లెక్కలోది కాదు. కానీ, హామీ విషయాన్నీ అతడు తన భార్య నుంచి దాచాడు. ఇప్పుడు బయట పడితే ఆమె గొడవ చేయచ్చు. చంద్రశేఖరం బాకీ తాను తీరిస్తే, ఊళ్ళో తన పరపతి తగ్గొచ్చు. ఈ ఆలోచనల్లో ఉండి ఎటూ తేల్చుకోకుండానే, తానేమీ హామీ పడలేదని అర్ధం వచ్చేలా గొణుగుతాడు పుల్లయ్య.

అక్కడినుంచి అనూహ్యంగా పరిస్థితులు మారిపోతాయి. తాను అభిమానించిన చంద్రశేఖరం మీద ఫోర్జరీ కేసు పెట్టాల్సి వస్తుంది పుల్లయ్యకి. అతడి మనస్సాక్షికి, లోకరీతికీ మధ్య సంఘర్షణ. పుల్లయ్య దగ్గర గుమస్తాగా పనిచేస్తున్న సత్యనారాయణకి హామీ విషయం తెలుసు. కానీ ప్రభుభక్తి, ఉద్యోగభయం అతన్ని నోరు మెదపనివ్వవు. పట్నంలో చదువుకుంటున్న పుల్లయ్య కొడుకు రామారావు కమ్యూనిస్టు సానుభూతి పరుడు. చంద్రశేఖరం ఫోర్జరీ చేశాడని నమ్మలేని రామారావు తన తండ్రిని అనుమానిస్తాడు. అక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరిగి అనూహ్యమైన ముగింపుకి చేరుతుంది.

పుల్లయ్య, చంద్రశేఖరాల కుటుంబాలతో పాటు, ఆదర్శభావాలతో ఊరి వాళ్లకి వైద్యం చేసే వాసుదేవ శాస్త్రి, సంఘసేవిక ముసుగులో రాజకీయాలు చక్కబెట్టే అమ్మాయమ్మ, ఊళ్ళో పుల్లయ్య ప్రత్యర్థి మల్లయ్య ఇతర ముఖ్య పాత్రలు. మానసిక సంఘర్షణలు, స్త్రీపురుష సంబంధాలని చిత్రించిన తీరు బుచ్చిబాబు 'చివరికి మిగిలేది' ని జ్ఞాపకం చేస్తుంది. వ్యంగ్యాన్ని కథనంలో భాగం చేశారు రచయిత. తాను సృష్టించిన ప్రతి పాత్ర పట్లా రచయిత సానుభూతి చూపడం, ప్రతి పాత్రకీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం ఈ నవల ప్రత్యేకత. అలకనంద ప్రచురణలు తాజాగా ప్రచురించిన 'కీలుబొమ్మలు' నవల  అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది. పేజీలు: 204, వెల రూ. 100.

మంగళవారం, మార్చి 26, 2019

బీ'జేపీ'

సరిగ్గా ఇరవై ఏడు రోజులుంది, నేనివాళే ఎదురు చూడడం మొదలు పెట్టిన ఒక ఎన్నిక జరగడానికి. దేశం, రాష్ట్రం, నియోజకవర్గం వగయిరా ఎన్నికల మీద నాకు పెద్దగా దృష్టి లేదు. ప్రచారార్భాటాలు చూడడం, స్నేహితుల చర్చలు వినడం, పేపర్లో విశ్లేషణల్లాంటివి చదవడం జరుగుతున్నాయి కానీ, ఏం జరిగిపోతుందో అన్న ఉత్కంఠ, కుతూహలం పెద్దగా లేవనే చెప్పాలి. నిజానికి అవి లేకుండానే ఈ ఎన్నికల సీజన్ గడిపేసే వాణ్ణే కానీ ఉత్తరప్రదేశ్ లో రాంపూర్ పార్లమెంటు స్థానం అలా వీల్లేదు పొమ్మంటోంది.

గత కొంతకాలంగా రాజకీయాల విషయంలో మౌనంగా ఉంటున్న జయప్రద ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం, ఆమెని రాంపూర్ లోక్ సభ స్థానం నుంచి అభ్యర్థిగా ప్రకటించడం వెనువెంటనే జరిగిపోయాయి. ములాయం సింగ్ - అమర్ సింగ్ ల మధ్య మొలకెత్తిన విభేదాలు పెరిగి పెద్దవైనప్పుడూ, ఆ మిత్రులిద్దరూ బద్ధ శత్రువులుగా మారినప్పుడూ ఎక్కువగా ఇబ్బంది పడింది జయప్రదే. జాతీయ రాజకీయాల్లో తనకి గురు సమానుడైన అమర్ సింగ్ వెనుకే అప్పట్లో ఆమె స్థిరంగా నిలబడింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి నేర్చుకున్న పాఠం ఆమెకి ఉపయోగపడి ఉండొచ్చు బహుశా.

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు  ఎన్టీ రామారావుతో వెండితెరని పంచుకున్న జయప్రద, ఆయన పిలుపుతోనే పార్టీలో చేరి 1994 ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పటికే ఆమెకి నాయికగా అవకాశాలు తగ్గడం, అక్క, వదిన పాత్రల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఎన్నికల తర్వాత రాజకీయాలకి పూర్తి సమయం కేటాయిచారు. ఎన్టీఆర్ వెన్నుపోటు, అనంతరం జరిగిన అధికార మార్పులో జయప్రద అనూహ్యంగా ఎన్టీఆర్ వైపు కాక, చంద్రబాబు నాయుడు పక్షాన చేరారు. అయితే, కొంత కాలానికే అత్యంత అవమానకర పరిస్థితుల్లో పార్టీ నుంచి ఆమె నిష్క్రమణ జరిగింది. 

(Google Image)
హిందీ సినిమాల్లో నాయికగా నటించి ఉత్తరాది వారికి దగ్గరవడంతో పాటు, అమితాబ్ బచ్చన్ వంటి రాజకీయ సంబంధాలున్న కథానాయకులతో ఉన్న స్నేహం కారణంగా జాతీయ రాజకీయాల్లో కాలూనుకున్నారు జయప్రద. అమితాబ్ స్నేహితుడు అమర్ సింగ్ ఆమెకి రాజకీయ గురువయ్యాడు. రాంపూర్ లోక్ సభ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున 2004 ఎన్నికల్లో పోటీ చేసిన జయప్రద భారీ మెజారిటీతో గెలుపొందారు. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి పోటీ చేసి తక్కువ మెజారిటీతో గట్టెక్కారు. ఎన్నికలు జరిగిన మరుసటేడే (2010) సమాజ్ వాదీ పార్టీలో చీలిక రావడంతో అమర్ సింగ్ తో కలిసి పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. 

ఇటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికలు జరగడంతో, తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపినా, ఎందుచేతనో ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు జయప్రద. తాజా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆమె రాజకీయ ప్రవేశం గురించి వార్తలు వస్తున్నా, ఆమె వెళ్ళేది ఎటు అన్న విషయంలో ఇవాళ్టి వరకూ స్పష్టత రాలేదు. జరుగుతున్న ఎన్నికలు బీజీపీకి గత ఎన్నికలంత కేక్ వాక్ కాదని వార్తలు వినిపిస్తున్న సమయంలో జయప్రద ఆ పార్టీలో చేరడం ఆసక్తి కలిగించింది. వరుసగా రెండు సార్లు 'రాంపూర్ కీ రాణీ' కిరీటాన్ని ధరించిన ఈ నిన్నటితరం వెండితెర కలల రాణి భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నది మరికొద్ది వారాల్లో తెలియనుంది.

ఆమె, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఎన్నికల్లో విజయం సాధించినట్టైతే రాబోయే కేంద్ర మంత్రివర్గంలో జయప్రద పేరు చేరడానికి అవకాశాలు ఎక్కువే. స్వరాష్ట్రంలో అవమానాలు ఎదుర్కొన్న ఆమెకి లభించబోయే గొప్ప గౌరవం అవుతుందది. భవిష్యత్తు సంగతి ఎలా ఉన్నా, వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నప్పటికీ వాటిని తట్టుకుని నిలబడుతూ, ప్రతిసారీ తనని తాను నిరూపించుకుంటూ వస్తున్న నా అభిమాన తారని చూసి కించిత్తు గర్వపడుతున్న మరో సందర్భం ఇది. There is a long way to go, Jayaprada...