హిట్ సినిమా పేరు ఇంటి పేరుగా మారడం అనేది తెలుగు సినీ పరిశ్రమలో బహుశా జానకితోనే ప్రారంభమయ్యిందేమో. 'షావుకారు' అనే సినిమా సాధించిన విజయం, శంకరమంచి జానకిని 'షావుకారు' జానకిని చేసింది. దక్షిణ భారత సినీ పరిశ్రమలో సుదీర్ఘమైన ప్రస్థానాన్ని ఇచ్చింది. గత కొన్నేళ్లుగా ఆమె యూట్యూబ్ ఇంటర్యూల ద్వారా బాగా పాపులర్. ఆమె సినిమాలు తెలియని తరానికి కూడా, ఇంటర్యూలు తెలుసు. థంబ్ నెయిల్స్ దాటి లోపలి వెళ్లి ఏ కొన్ని ఇంటర్యూలు చూసిన వాళ్ళకైనా ఆమె అనుభవం, జ్ఞానం, వాటి ఫలితంగా నిర్మించుకున్న తాత్వికత కొంతమేరకైనా అర్ధమయ్యే ఉంటాయి.
నిజానికి ఆమె జీవితచరిత్ర పుస్తకంగా వస్తుందేమోనని గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నాను. ఆమే స్వయంగా రాసుకోవడం, లేదా ఎవరిచేతైనా రాయించడం జరుగుతుందని భావించాను. 'బయోపిక్' తీసేందుకు కావాల్సిన ట్విస్టులు, టర్నులు ఉన్న జీవితం కాదు కానీ, ఆత్మకథ/జీవితచరిత్రగా వచ్చి వుంటే తప్పకుండా ఎన్నదగిన పుస్తకం అయి వుండేది. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ నిమిత్తం ఒక ప్రయత్నం మొదలై, కాస్త ముందుకి వెళ్లి, ఉన్నట్టుండి ఆగిపోయింది. బయటికి వచ్చిన కొద్దిపాటి కథా కూడా, ఆమె జీవన ప్రయాణం లాగే ఆసక్తిగా సాగింది. కొనసాగించే ఆసక్తి ఆమెకి లేకపోవడం వల్లనో, ఇంకేవన్నా వ్యక్తిగత కారణాలు అడ్డొచ్చాయో తెలియదు కానీ, ఒక మంచి పుస్తకాన్ని మిస్సయ్యాం మనం.
'ఆంధ్రప్రభ' దినపత్రిక 1991-92 ప్రాంతాల్లో ప్రతి రోజూ ఒక ప్రత్యేక అనుబంధం అనే పథకం మొదలు పెట్టింది. బహుశా మార్కెటింగ్ స్ట్రాటజీ కాబోలు. ఒక్కో రోజూ ఒక్కో ప్రత్యేక అనుబంధం. ఈ క్రమంలో శుక్రవారం నాటి అనుబంధం పేరు 'చిత్రలేఖ'. నాలుగు పేజీల సినిమా కబుర్లు. కొత్త సినిమాల విశేషాలు, సమీక్షలు, ఇంటర్యూలు, ఫోటోలు, వ్యాసాలతో పాటుగా కొన్ని పాత సినిమాల ముచ్చట్లు కూడా. ఆ 'చిత్రలేఖ' తొలి సంచికలో మొదలైన ఒకానొక సీరియల్ (రెండో పేజీలో మొదటి సగం) పేరు 'మల్లెపూలు-మొగలిరేకులు'. అది 'షావుకారు' జానకి ఆత్మకథ. ప్రారంభమే ఎంతో ఆసక్తిగా మొదలయ్యింది. ప్రతి వారం ఒక చిన్న మెలికతో ముగిసే ఎపిసోడ్ వచ్చే వారం కోసం ఎదురుచూసేలా చేసేది.
![]() |
| Google Image |
'మల్లెపూలు - మొగలిరేకులు' ప్రారంభం నాకు బాగా జ్ఞాపకం. తన మేకప్ టెస్ట్ తో మొదలుపెట్టారు జానకి. వాక్యాలు యధాతధంగా ఇవే కాకపోవచ్చు కానీ, భావం ఇదే. "స్మైల్ ప్లీజ్ అన్నారు మేకప్ మ్యాన్. నవ్వితే సాగిన పెదవులకి లిప్స్టిక్ పూయడం సులభం. లేకపోతే ముద్దగా అతుక్కుపోతుంది. కానీ, నవ్వే పరిస్థితుల్లో ఉన్నానా నేను? ఉయ్యాల్లో చంటి బిడ్డని ఇంట్లో వదిలేసి వచ్చాను. ఆ పిల్లకి పాల డబ్బా కొనాలి. అందుకు డబ్బులు కావాలి. ఈ వేషం దొరికియితే, కొంత డబ్బు సంపాదించగలిగితే పిల్ల కడుపు నింపగలను. నేను సినిమా స్టూడియోకి వచ్చింది పని వెతుక్కుంటూ, పేరు కోసం కాదు". నాకు గుర్తున్నంత వరకూ కథనం నాన్-లీనియర్ గా సాగింది. వచ్చిన పాత్రలు, వాటిని నిలబెట్టడానికి తాను చేసిన కృషిని వివరంగా చెప్పారు. కొన్ని భాగాల తర్వాత ఆ సీరియల్ ఆగిపోయింది. తర్వాత కొన్నాళ్ళకి 'చిత్రలేఖ' కూడా ఆగిపోయింది.
జానకికి తోడబుట్టిన చెల్లెలు కృష్ణకుమారి అగ్ర కథానాయిక. ఆమె ఒడ్డు, పొడవు, రూపలావణ్యం అందుకు దోహదం చేశాయి. తొలినుంచీ జానకికి తన పరిమితుల పట్ల అవగాహన వుంది. తనకి ఏ పాత్రలు సరిపోతాయన్న స్పష్టత వుంది. వచ్చిన పాత్రని ఒప్పించి, సినిమా పరిశ్రమలో నిలబడాలన్న లక్ష్యం వుంది. అందుకే 'కన్యాశుల్కం' సినిమాలో తనకి మొదట వచ్చిన వేషం 'మధురవాణి' చివరినిమిషంలో సావిత్రికి వెళ్ళిపోయి, బుచ్చమ్మ వేషం వచ్చినా, ఆ బుచ్చమ్మకి నూరుశాతం న్యాయం చేశారు తప్ప, మధురవాణి కాక మరో వేషం వేయను అని పట్టుబట్టలేదు.
తానే చెప్పినట్టుగా జానకి బలాలు రెండు - కళ్ళు, గొంతు. అమాయకత్వంతో సహా అన్ని భావాలనీ పలికించగల కళ్ళు. ఖంగున మోగే గొంతు, స్పష్టమైన ఉచ్చారణ. పాత్రని ముందు నిలబెట్టి తాను వెనుకే ఉండిపోడానికి సిద్ధ పడడమే కాక, అందుకు తగిన పరిశ్రమ చేయడం కూడా ఆమె బలమే. కృష్ణకుమారితో సహా మిగిలిన అందరు నటీమణుల్లాగే జానకినీ స్కాండల్సు విడిచిపెట్టలేదు. (ఇవే సంగతులు హీరోల దగ్గరికి వచ్చేసరికి వీరోచిత కార్యాలుగా ప్రచారం పొందుతాయి, ఇదో విచిత్రం). ఆమె వాటిని పట్టించుకోకుండా తన పని చేసుకుపోయారు. వయసు మీద పడినా నటనకి దూరం కాలేదు. టీవీ కెమెరాలని చూడగానే సంయమనం కోల్పోయి వాచాలత్వం చూపలేదు. అలాగని తన అసంతృప్తుల్ని దాచుకోనూ లేదు. ఆమె జీవితకథ పుస్తకంగా రాలేదన్నది ఒక్కటే లోటు. 'షావుకారు' జానకి ఆత్మకి శాంతి కలగాలి.
