గురువారం, మార్చి 26, 2026

పాలగుమ్మి పద్మరాజు మోనోగ్రాఫ్

ఫ్రాయిడ్ మనోవైజ్ఞానిక సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేస్తూ లోతైన కథలు రాసిన విఖ్యాత కథకుడు పాలగుమ్మి పద్మరాజు. 'గాలివాన' కథకి అంతర్జాతీయ బహుమతి రావడంతో, ఆ కథ ఆయనకి ఇంటిపేరుగా మారిపోయిందే తప్ప, మిగిలిన యాభైతొమ్మిది కథలూ తీసికట్టని కాదు. ప్రతి కథా దేనికదే ప్రత్యేకం. రాసినవి కాసిన్ని నవలలు అయినా, ఇతివృత్తంలోనూ, నడక లోనూ ఒకదానికొకటి పోలికే లేని రచనలవి. కాస్తంత కవిత్వం, కాసిన్ని అనువాదాలు, కొద్దిపాటి సాహిత్య విమర్శ చేసినప్పటికీ పద్మరాజుకి కథా రచయిత గానే పెద్దపేరు.ఒక రచయిత తాలూకు రచనల్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలనుకునే పాఠకులకి, ఆ రచయితని గురించి వీలైనన్ని వివరాలు తెలుసుకోవడం అవసరం. పద్మరాజు విషయంలో ఆయన్ని గురించి వచ్చిన వ్యాసాలూ, ఇంటర్యూలూ తక్కువే కానీ, ఆయన డైరీలు కొంతమేరకు కొరత తీర్చాయి. 

'భారతీయ సాహిత్య నిర్మాతలు' సిరీస్ లో భాగంగా కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురించిన పాలగుమ్మి పద్మరాజు మోనోగ్రాఫ్ ఆయన్ని గురించీ, ఆయన రచనలని గురించీ మరిన్ని వివరాలు అందిస్తోంది. నిన్నటి తరం రచయిత, సాహిత్య విమర్శకుడు అయిన అక్కిరాజు రమాపతి రావు రాసిన ఈ మోనోగ్రాఫ్ మొదటి ముద్రణ 2017 లో జరిగింది. అకాడెమీ నిర్దేశించిన టెంప్లేట్ లోనే సాగిన ఈ పుస్తకంలో పద్మరాజు జీవన రేఖలు, సాహిత్య-సామాజిక నేపథ్యం, కథా, నవలా, నాటక రచయితతో పాటు కవిగా, నాటక, సినిమా రచయితగా ఆయన జరిపిన కృషిని క్లుప్తంగా మన ముందుంచింది. పద్మరాజు రచనలని గురించి రమాపతిరావు చేసిన ప్రతిపాదనలు ఆసక్తికరంగా వున్నాయి. 'పరిధికి లోబడి' చేసిన ఈ విమర్శని చదువుతున్నప్పుడు, ఆ పరిధిని మరికొంత విస్తరించి ఉంటే బాగుండేదనిపించింది చాలాసార్లు. 

'కథా రచయితగా పద్మరాజు' అధ్యాయంలో సింహభాగం, అంతర్జాతీయ బహుమతి గెలుచుకున్న 'గాలివాన' కథని గురించే ప్రస్తావించారు. ఆ పోటీ నిర్వహించిన విధానం, పద్మరాజు కేవలం ఆ పోటీ కోసమే మొదటగా ఇంగ్లీష్ లో కథని రాసి పంపిన సంగతి (తర్వాతే తెలుగు చేశారు) మొదలుకొని, కథలో ప్రతి సన్నివేశాన్నీ విశ్లేషిస్తూ వెళ్లి, ముగింపుని విమర్శించారు. "ఆమె చేతిలో ఈ పర్సు చూసి ఆమె ఆ రాత్రి దొంగతనం చేసిందని ఎవరూ అనుకోరా? మృతురాలైన ఆమెను ఆమె గుడిసెకు చేర్చాల్లన్న ఆలోచన అయినా రావుగారికి కలగలేదా?" అని ప్రశ్నించారు రమాకాంత రావు. "కాని తన పర్సు ఆమె చేతిలోంచి విడదీయటానికి ఆయన మనస్సు వొప్పలేదు" అని పద్మరాజు స్పష్టంగానే రాశారు. పైగా, కథ తిరిగేదే వర్గస్పృహ చుట్టూ. తుఫానుకి ముందు ఆ బిచ్చగత్తెని రైల్లోనుంచి దింపేసే ప్రయత్నం చేసిన రావుగారు, తుఫాను చక్కబడ్డాక తన పూర్వస్థితికి వచ్చేసి, దుస్తులతోపాటు హోదానీ ధరించారని చెప్పకనే చెప్పారు కదా పద్మరాజు?!!

నవలల గురించి చెబుతూ "పద్మరాజు రచనల్లో 'రామరాజ్యానికి రహదారి' ని 'మాగ్నమ్ ఓపస్' గ్రంధం అనాల్సి ఉంటుంది" అన్నారు. ఇందుకు అభ్యంతరం లేదు. అయితే, 'రెండవ అశోకుడి మూన్నాళ్ళ పాలన' లో వ్యంగ్యాన్ని గుర్తిస్తూనే, "ఈ నవల గూర్చి విశేషంగా చెప్పవలసింది ఏమీ లేదు పాలగుమ్మి వారి పరిశీలనా, హాస్య రచనా నైపుణ్యమూ ఈ నవలలో ప్రతిపదం వెల్లివిరిశాయి" అని ముక్తాయించారు. నిజానికి తెలుగు సాహిత్య చరిత్రలో ఈ నవలకి ఒక ప్రత్యేకత వున్నది. ఏ ఒక్క రాజకీయ పక్షాన్నీ విడిచిపెట్టకుండా, అన్ని పార్టీల విధానాలనీ సూటిగా విమర్శించిన తొలి రచన ఇదే అని చెప్పాలి. పద్మరాజు 'రాయిస్టు' (ఎమ్మెన్ రాయ్ అనుయాయి) కావడం వల్లనే ఇలా రాయగలిగారు. ఈ నవలకి సమవుజ్జీ అనదగ్గ మరో నవల, తర్వాత కాలంలో కేఎన్వై పతంజలి రాసిన 'అప్పన్న సర్దార్' అనే చెప్పాలి. తెలుగు సాహిత్యంలో రాజకీయ వ్యంగ్యమే పరిమితం. ఆ పరిమిత జాబితాలో ఉండే మొదటి నవలని గురించి "విశేషంగా చెప్పవలసింది ఏమీ లేదు" అనడం చివుక్కు మనిపించింది. 

నాటక రచయితగా పద్మరాజుని పరిచయం చేస్తూ చెప్పిన ప్రధాన విషయం 'రక్తకన్నీరు' నాటకాన్ని గురించి. నటుడు నాగభూషణం ఇంటిపేరుగా మారిపోయిన ఈ నాటకానికి తమిళ మూలం తిరుచానూర్ కె. తంగరుసు రాసిన 'రక్తకన్నీర్' నాటకం. ఎమ్మార్ రాధా (నటి రాధిక తండ్రి)ని నటుడిగా నిలబెట్టింది. మూలాన్నీ, తెలుగుసేతనీ పోలుస్తూ విమర్శ రాశారేమో అని ఎదురు చూస్తే నిరాశే మిగిలింది. అయితే, బుచ్చిబాబు 'చివరకు మిగిలేది' నవలనీ, స్వీయ రచన 'గాలివాన' కథనీ రేడియో నాటకాలుగా మలచడంలో పద్మరాజు ప్రతిభ, శ్రవ్య మాధ్యమంపై ఆయనకి ఉన్న పట్టుని గురించి వివరంగా రాశారు. మొత్తం నాటకాల జాబితా ఇచ్చినా బాగుండేది. విమర్శకుడిగానూ, కవి గానూ పద్మరాజు చేసిన కృషి పరిమితమే అయినా ఆ తాలూకు ప్రత్యేకతలని బలంగా చెప్పారీ పుస్తకంలో. 

పద్మరాజుని గురించి అక్కిరాజు రమాపతి రావుకి ఉన్న ప్రధానమైన ఫిర్యాదు ఆయన సినిమా రంగానికి వెళ్లడం. అలా వెళ్లకపోయి వుంటే మరిన్ని మంచి రచనలు వచ్చి ఉండేవన్న ఆవేదనని నాలుగైదు చోట్ల ప్రకటించారు. తీరాచేసి అక్కడ కూడా పేరు రాలేదు కదా అన్నది ఆయన నిట్టూర్పు. సినిమా రంగానికి వెళ్లాలన్నది పద్మరాజు వ్యక్తిగత నిర్ణయం. "ఆయొక్క బగవంతుడు బొయినం చేసి బతకమని శపించాడు కాబట్టి..." అంటుంది పతంజలి గారి వీరబొబ్బిలి. కాబట్టి, ఉదరపోషణార్ధం కట్టిన వేషమైనా కావొచ్చు. ఏ రంగంలో అయినా పేరు రావడం, రాకపోవడం అన్నది ఏ ఒక్కరి చేతిలోనూ ఉండదు. పేరో, డబ్బో, లేదా రెండూనో వస్తాయనే కదా అక్కడికి వెళ్లి అదృష్టం పరీక్షించుకుంటూ ఉంటారు. ఒకవేళ సినిమాలకి వెళ్లకపోతే, ఆమాత్రం ఉపాధీ లేక, రాయడాన్ని పూర్తిగా మానేసి ఉండేవారేమో కదా? ఇది వేరే పెద్ద చర్చ. ఎనభై పేజీల ఈ మోనోగ్రాఫ్ వెల యాభై రూపాయలు. సాహిత్య అకాడమీ స్టాల్స్ లో (పుస్తక ప్రదర్శనల్లో) దొరుకుతుంది.