దాయాదులు అనే మాట వినగానే మొదట గుర్తొచ్చేది మహాభారతమే. అన్నదమ్ముల పిల్లలైన కౌరవ పాండవుల మధ్య రాజ్యాన్ని భాగాలు పంచుకోవడంలో వచ్చిన తేడాలు మహా యుద్ధానికి ఎలా దారితీశాయో చెబుతుందీ ఇతిహాసం. దాయాదుల పోరుతో పాటు భారతం చర్చకి పెట్టిన విషయాల్లో ఒకటి 'నియోగం'. రాజు రోగిష్టి అయి, పిల్లల్ని కనలేని స్థితిలో ఉంటే, రాణి వేరొక వ్యక్తితో కూడి సంతానవతి కావచ్చు. ఆ సంతానం రాజు సంతానంగానే గుర్తింపు పొందడంతో పాటు, పుత్రసంతానం అయితే వారసత్వంగా రాజ్యపాలనీ చేపట్టవచ్చు. ఈ దాయాదుల పోరుని, నియోగ పద్ధతినీ వ్యంగ్యాత్మకంగా చర్చకి పెట్టిన నవల మధురాంతకం నరేంద్ర రాసిన 'దాయాదుల తోట'. ఈ రెండు ప్రధాన అంశాలతో పాటుగా, రాయలసీమ నీటి సమస్య, పాలన పరంగా తమిళనాడులో కలిసిన తెలుగు ప్రాంతాల్లో భాషాసేవ లాంటి అనేక ఆసక్తికర విషయాలనీ కథలో భాగం చేశారు.
తిరుపతి-చిత్తూరు మధ్య ఉన్న యానాదుల తోటలో మొదలవుతుంది. జాన్ సుభాష్-సంగీతరెడ్డి దంపతులు, కొందరు స్నేహితులతో కలిసి యానాదులతోటలో ఓ ఫ్యాక్టరీ కట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని, పనులు ప్రారంభించబోతూ ఉండగా, వెంసూ అనే మాజీ నక్సలైటు స్థానికులని కూడదీసి ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమం మొదలు పెడతాడు. వెంసూ మరణంతో కథ ప్రారంభమవుతుంది. సరిగ్గా అదే సమయానికి పెళ్లిచూపుల నిమిత్తం అమెరికా నుంచి ఇండియాకి వస్తాడు సంగీతరెడ్డి కొడుకు హర్ష. తనకి వచ్చిన ఆకాశరామన్న ఉత్తరం అనే తీగని పట్టుకుని హర్ష మొదలు పెట్టిన తన అస్తిత్వం తాలూకు వెతుకులాట ఎన్నెన్ని మలుపులు తిరిగి ఏ మజిలీకి చేరిందన్నది కథ. మొత్తం తొమ్మిది పాత్రలు కథని చెబుతాయి (నరేంద్ర గత నవల 'మనోధర్మ పరాగం' తో రేఖామాత్రపు పోలిక ఇక్కడ).
సంగీతరెడ్డి స్వస్థలం కడప. బ్రిటిష్ పాలనా కాలంలో ఆమె పూర్వులు క్రైస్తవంలోకి మారి అనేక విధాలుగా లబ్దిపొందారు. ఒకవైపు నెత్తురోడే ఫ్యాక్షన్ నీ, మరోవైపు శాంతిని బోధించే క్రైస్తవాన్నీ ఏకకాలంలో బేలన్స్ చేసుకుంటూ వచ్చారు. ఓ పక్క ఈ కుటుంబాన్ని గురించి చెబుతూనే, రచయిత దళిత నేపధ్యం ఉన్న పాత్రల్ని పరిచయం చేస్తారు. ఆలయాల్లోకి ప్రవేశం లేకపోయినా, క్రైస్తవం రా రమ్మని పిలుస్తున్నా మతం మారని పాత్రలివి. నవల ఆసాంతమూ ఈ కాంట్రాస్ట్/బేలన్సింగ్ కనిపిస్తూనే వుంటుంది. హర్ష పుట్టాక, సంగీతరెడ్డికి జాన్ సుభాష్ తో పెళ్లవుతుంది. వాళ్ళిద్దరికీ ఓ కూతురు. హర్ష కొన్నాళ్ళు అమ్మమ్మ ఇంట్లో పెరిగి, అటుపై ఋషి వేలీ స్కూల్లో చదువుకుని, ప్లస్ టూ నాటికే అమెరికా వెళ్ళిపోయి, డిగ్రీతో పాటు గ్రీన్ కార్డు కూడా సంపాదించేసుకుంటాడు. ఈ పెరిగిన వాతావరణం కారణంగా హర్షకి తన 'జన్మ రహస్యం' తెలియదు.
తిరుపతి యూనివర్సిటీలో సంగీతరెడ్డి చదువుకునే రోజుల్లో ఆమెకి పరిచయమవుతాడు వెంసూ. బ్రాహ్మణ తండ్రికి, క్రైస్తవ తల్లికీ పుట్టిన వెంసూ రాడికల్ విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాల్గొంటాడు. కొంత రహస్య జీవితం తర్వాత లా చదివి, పౌరహక్కుల లాయరవుతాడు. జీవితపు తర్వాతి దశలో ఆయుధం పట్టి అడవికి వెళ్తాడు. చివరి రోజుల్లో యానాదుల భూమి కోసం సంగీతరెడ్డి కుటుంబం నిర్మించ తలపెట్టిన ఫ్యాక్టరీ కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాడు. వెంసూ జీవితంలో మొత్తం ముగ్గురు స్త్రీలు ఉంటారు. వాళ్ళ పట్లా, వాళ్ళ ద్వారా కలిగిన సంతానం పట్లా అతనికి ఎలాంటి బాధ్యతా వుండదు. వెంసూ కి కాంట్రాస్టుగా, వివాహేతర సంబంధం ద్వారా కలిగిన సంతానం పట్ల కూడా బాధ్యతగా వుండే దళిత నేపధ్యం వున్న పాత్రలు కనిపిస్తాయి.
నవలలో ఆసక్తికరంగా అనిపించే రెండు పాత్రలు రాఘవరెడ్డి, నాగరాజు. మ్యాప్ ప్రకారం తమిళనాడులో ఉన్నప్పటికీ, తెలుగు మాట్లాడే ప్రజలున్న ప్రాంతాల్లో భాషా వ్యాప్తికి జరిగే ఉద్యమంలో పాల్గొనే కార్యకర్త రాఘవరెడ్డి. ఈ పాత్రకి ఆపాదించిన కృషి, అనుభవాలు అన్నీ కూడా తెలుగు భాషా ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న రచయిత స. వెం. రమేష్ అనుభవాలు, ఆలోచనలే. పైగా, వాటన్నింటినీ రమేష్ కథలుగానూ, వ్యాసాలుగానూ రికార్డు చేశారు కూడా. ఇక, నాగరాజు రాయలసీమ నీటి హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటాడు. సీమ జిల్లాలకి నీటి పంపిణీ విషయంలో జరిగిన అన్యాయం, సరిదిద్దే మార్గాలు, ఇవన్నీ ఇతని నాలిక చివరన ఉంటాయి. ఈ సమాచారం మొత్తం కె. బాలగోపాల్ రాసిన 'జల పాఠాలు' పుస్తకంలో వున్నదే. అటు స.వెం. రమేష్ కి గానీ, ఇటు బాలగోపాల్ కి గానీ, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం కాదు కదా, కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేదు రచయిత. పైగా, నవల 'టోన్' వ్యంగ్యం కావడం వల్ల, ఈ రెండు పాత్రలూ చేసే కృషి మొత్తం వ్యంగ్యంగా ధ్వనించడం మరో విషాదం.
నరేంద్ర గత రచనలతో పోల్చినప్పుడు ఈ నవలకి చదివించే గుణం తక్కువ. కథానాయకుడు వెతుకుతున్నది ఏమిటో పాఠకులకి మొదటి అధ్యాయంలోనే తెలిసిపోవడం, ఒక పాత్ర పేరు చూడగానే ఆ పాత్ర మంచిదో, చెడ్డదో అర్ధమైపోవడం, ముందుకు సాగడంతో పాఠకులకి ఎదురయ్యే ప్రధాన ఇబ్బందులు. అనేక పాత్రల దృష్టి కోణం నుంచి కథ చెప్పించడం అనే ప్రయోగం గత నవలలో కొత్తగా అనిపించింది కానీ, ఇప్పుడు బరువుగా అనిపించింది. సీరియస్ గా చర్చకి పెట్టాల్సిన విషయాలని కూడా వ్యంగ్యంగా చెప్పడం రసపోషణకి కాక, రసాభాసకే దారితీసింది చాలా చోట్ల. గడిచిన వందేళ్ల రాయలసీమ రాజకీయాలు, సాంఘిక, ఆర్ధిక పరిస్థితులు, సీమ ముఖచిత్రంలో వస్తున్న మార్పులు వీటన్నింటినీ చర్చకి పెట్టినా, రచయిత ఎంచుకున్న 'టోన్', పాత్రల డిజైనింగ్, కథని సూటిగా కాక తిప్పితిప్పి చెప్పడం లాంటి కారణాలకి ఈ నవల పాఠకుల నుంచి ఓపికని డిమాండ్ చేస్తుంది.
('దాయాదుల తోట', అజు పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 334, వెల రూ. 275)
