బుధవారం, డిసెంబర్ 29, 2021

సమాంతరాలు

వాక్యం ఒడుపు తెలిసిన రచయిత తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి నుంచి తాజాగా వచ్చిన కథాసంపుటి 'సమాంతరాలు.' నూటిరవై పేజీల సంకలనంలో కథల సంఖ్య కేవలం ఐదు. వీటిలో మొదటి కథ నిడివే యాభై పేజీలు. పదాల లెక్కలు, సన్నివేశాల నిడివి లాంటి కొలతలేవీ పెట్టుకోకుండా కథల్ని తాపీగానూ, అదే సమయంలో ఎక్కడా ఆపకుండా చదివించేలానూ రాశారు. కథలు చదివేప్పుడు ముగింపు ఏమై ఉంటుందో అన్న ఆత్రుత కన్నా, పాయసంలో జీడిపప్పు పలుకుల్లా తగిలే వాక్యాలని నెమరువేసుకుంటూ ముందుకుసాగడం బాగుంటుంది పాఠకులకి. కథ చదవడం పూర్తయ్యాక ఆగి ఆలోచించడం ఎటూ జరిగేదే అయినా, చదువుతూ మధ్యమధ్యలో కూడా ఆగి ఆలోచనల్లో పడేలా చేయడం ఈ ఐదు కథల ప్రత్యేకత. జీవిత సత్యాలని - నిలబెట్టి పాఠం చెప్పేస్తున్నట్టుగా కాక, యధాలాపంగా చెప్పినట్టనిపించే వాక్యాల్లో పొదగడం కనిపిస్తుంది కథలన్నింటిలోనూ. మళ్ళీ చదివినప్పుడు కూడా కొత్తగా అనిపించే ఎక్స్ప్రెషన్లకి కొదవే లేదు. ఈ కథల్ని మొదటిసారి చదివినప్పుడు - వెలుగుని చూసి కళ్ళు మిరుమిట్లు గొలిపినట్టుగా - ఏమీ రాయాలనిపించలేదు. మళ్ళీమళ్ళీ చదివించే గుణం ఉన్న కథలే అన్నీను.

హరిదాసుల కుటుంబలో పుట్టిన దాసు గారు ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యారు. రాజమండ్రిలో బాగా డెవలప్ అయిన లొకాలిటీలో పాతదైన సొంత ఇల్లు ఉంది. భార్య గతించింది. మగపిల్లలిద్దరూ వాళ్ళ కుటుంబాలతో దూరంగా ఉంటున్నారు. ఓ రాత్రి వేళ దాసుగారింట్లో ఓ దొంగ ప్రవేశించాడు. అప్రమత్తంగా ఉన్న దాసుగారు, తాను చీకట్లో దాగి దొంగాడిని కర్రతో మోదారు. ఆ దొంగ పేరు పీటర్. ఇంటర్ ఫెయిలైన కుర్రాడు. దొంగతనం అదే ప్రధమం. దాసుగారే కుర్రాడికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్యనా చిత్రమైన స్నేహం అల్లుకుంది. దాసు గారికి గతమే తప్ప భవిష్యత్తు లేదు. పీటర్ గతమంతా దెబ్బల మయం. రంగుల భవిష్యత్తుని నిర్మించుకునే పనిలో ఉన్నాడు. భిన్న ధ్రువాలైన ఆ ఇద్దరి జీవితాల్లో, వాళ్ళు కలిసి గడిపిన కొంత కాలాన్ని చిత్రించారు 'సమాంతరాలు' కథ. సంపుటిలో మొదటి కథ ఇదే. "గోదారి మధ్యనే ఉత్తినే దొరికిన చిన్న పడవలా ఉన్నాడు పీటరు" లాంటి వర్ణనలెన్నో కథనిండా. దాసు గారికి ఇష్టమైన మెత్త పకోడీని మనవూ నవుల్తూన్నట్టే ఉంటుంది కథ చదువుతుంటే. 

పూర్ణ, మార్కండేయులు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మార్కండేయులు చిత్రమైన వ్యక్తి. అతనికి జ్ఞాపకాలంటూ ఏవీ ఉండవు. పెళ్ళైన మూడేళ్ళకి పూర్ణ అతనికి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. అప్పటినుంచీ మార్కండేయులుకి ఒకటే వ్యాపకం - పూర్ణ ఆనుపానులు తెలుసుకోవడం. అతని ప్రయత్నాల గురించి పూర్ణకీ తెలుసు, అందుకే అతనికి దొరక్కుండా దూరంగా తప్పించుకుంటూ ఉంటుంది. ఆమెకి మార్కండేయులు మీద చెడు అభిప్రాయమేమీ లేదు. కానీ, అతనితో జీవితం తనకి కష్టం అనే విషయాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకుని, బాగా ఆలోచించే విడాకుల నిర్ణయం తీసుకుంది. పూర్ణ తన ఇంట్లో ఉన్నన్నాళ్లూ ఆమెని పట్టించుకోలేదు మార్కండేయులు. కానీ, ఆమె వెళ్ళిపోయినప్పటినుంచీ ఆమె ఆలోచనలే అతని ప్రపంచం అయిపోయాయి. వీళ్ళ కథకి సమాంతరంగా సాగుతుంది చౌదరి గారి నవయుగ హోటల్ నిర్వహణ. నవయుగ ఇడ్లీలు, పల్లీ పచ్చడి దేవతలు చేసినట్టు ఉంటాయి. బహుశా అక్కడి కాఫీనే అమృతం అంటారేమో అనుకుంటారు కస్టమర్లు. ఇంతకీ, మార్కండేయులు, పూర్ణ గురించి వాళ్ళ స్నేహితుడు (కథకుడు) ఏం తెలుసుకున్నాడో చెబుతుంది 'మార్కండేయుడి కాఫీ' కథ ముగింపు. 

మూడో కథ మృత్యువు చుట్టూ తిరిగే 'నీడ వెంట'. ఓ రాజకీయ నాయకుడి మరణం అనంతరం మోపబడిన కర్ఫ్యూతో మొదలై, మూర్తి తండ్రి హఠాన్మరణం నుంచీ వేగం పుంజుకుని, అస్తి సంచయనానికి మూర్తి కాశీలో అడుగు పెట్టే సమయానికి అక్కడ కూడా కర్ఫ్యూ పరిస్థితులు తలెత్తడం అనే మలుపు తీసుకుని ఊహకందని ముగింపుకి చేరుతుంది. "ఏం చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా మూర్తికి తనొక్కడే పెద్ద ఉల్లిపొర కాయితం పొట్లంలో ఉన్నట్టనిపించింది.." "ఉదయం గంగ మామూలుగా ప్రశాంతంగా మురిగ్గా ఉంది" లాంటి వాక్యాల దగ్గర ఆగకుండా ముందుకెళ్లలేం. అపార్ట్మెంట్లో మూర్తి కుటుంబం శవ జాగరంలో ఉండగా, పక్క ఫ్లాట్లలో జీవితాలు యధాతధంగా గడవడం లాంటి పరిశీలనలకీ లోటులేదు. కాశీ చిత్రణ గతంలో చదివిన వాళ్ళకి కూడా, కర్ఫ్యూ నాటి కాశీని గురించి చదవడం కొత్త అనుభవమే అవుతుంది. మూర్తితో పాటు కాశీని చూస్తున్న పాఠకులు ఉలిక్కిపడే లాంటి ముగింపు ఇచ్చారు కథకి. 

జీవితం అల్లకల్లోలం అయిపోడానికి పెద్ద పెద్ద మార్పులే జరగక్కర్లేదు, 'గునపం లాంటి ఒక వాక్యం' చాలు గురుమూర్తి గారి లాంటివాళ్ళకి. అప్పటివరకూ లేని కొత్త చింత, చింతన మొదలవుతాయి గురుమూర్తి గారిలో - ఆ వాక్యం విన్న తర్వాత. అప్పటి వరకూ నింపాదిగా ఉన్నవాడు కాస్తా గతాన్ని పెళ్లలు పెళ్లలుగా తవ్వి పోయడం మొదలెడతాడు. ఆ తవ్వకాల్లో ఎక్కువగా దొరికేవి పగిలిన కాఫీ కప్పులే. గవర్నమెంట్లో పనిచేసి రిటైరైన గురుమూర్తికి ఇటీవలే భార్యా వియోగం సంభవించింది. ఆ తర్వాతే ఆయనలో అశాంతి మొదలయ్యింది. అందుకు కారణం ఆయన భార్య ఆయనతో చివరగా మాట్లాడిన ఒకే ఒక్క వాక్యం. ఆ వాక్యం నుంచి అన్వేషణ మొదలై గతంలోకి సాగింది. ఆలోచనలన్నీ అసంపూర్ర్ణమే అవుతున్నాయి. చూడబోతే తన జీవితమే అసంపూర్ణం అనిపించింది ఆయనకి. 'అతని శీతువు' కథలో వరదాచార్యులు ఈ కథలో అతిధి పాత్రలో మెరుస్తారు. "ఎదురింటి మెట్ల మీద కామాలా పడుకుంది కుక్క" లాంటి వాక్యాలు భలే అందాన్నిచ్చాయీ  'ఇదొక అరసున్నా' కథకి. 

అమెరికా నుంచి తల్లితో పాటు తురకపాలెం వచ్చిన ఎనిమిదేళ్ల క్రిష్-కృష్ణ-కిష్టప్పకి మురికిగా ఉండే ఆ ఊరు మొదట అస్సలు నచ్చనే నచ్చదు. రోడ్డు మీద పేడ వేసే గేదెలు, ఉమ్ములేసే మనుషులూ, బొత్తిగా గతుకుల రోడ్డూ.. ఏవీ ఆకట్టుకోవు. ఇంట్లో మావయ్య, అత్తయ్య, పెద్దమ్మ మాత్రం బాగా నచ్చుతారు. రానురానూ తురకపాలెం ప్రత్యేకతలని గురించి ఇంట్లో వాళ్ళ నుంచీ, బయటి వాళ్ళనుంచీ తెలుసుకున్నాక  - ఏ ఇద్దరు చెప్పే విషయాలకీ పొంతన లేకపోయినా - ఆ ఊరిమీద కుతూహలం మొదలవుతుంది. పున్నమి రాత్రులలో ఆ ఊరి మురికికాల్వలో స్నానం చేయడానికి వచ్చే దేవకన్యలని చూడడానికి అర్ధ రాత్రి ఇంట్లో అందరూ పడుకున్నాక బేటరీలైటు వేసుకుని "తెల్ల పిల్లిలా" వెళ్లిన కృష్ణ తెలుసుకున్నదేవిఁటి? ఆ ఊరిని గురించి అతనిలో స్థిరపడిన అభిప్రాయం ఏమిటన్నది 'తురకపాలెం దేవకన్యలు' కథ ముగింపు. పిల్లల్లో సృజనాత్మకతని ప్రోది చేయాల్సిన అవసరాన్ని అన్యాపదేశంగా చెప్పే కథ ఇది. ఒకప్పుడు చాలా సహజంగా జరిగిన ఈ ప్రక్రియ ఇప్పుడు ఎందుకు ఆగిపోయిందనే ఆలోచన వస్తుంది పాఠకుల్లో. 

"జీవితానుభవం తడిసిన చపాతీ పిండి వంటిది కాదు. ఒక స్థితి దాటింతర్వాత అనుభవం వైయక్తికం కాదనుకుంటున్నాను. పొందడం, పోగొట్టుకోవడం, స్మృతి, ఒక రకమైన మృత్యు స్పృహ - నుభవాలు. అవి చొక్కా పేంట్లతో ఈ కథల్లో కనిపిస్తాయి" అన్నారు రచయిత తన ముందు మాటలో. 'సమాంతరాలు' 'తురకపాలెం దేవకన్యలు' కథలు మొదటిసారి చదివినప్పుడే ఆకట్టుకుంటే, మిగిలిన కథలు పునశ్చరణలో బాగా నచ్చుతాయి. మళ్ళీ చదివినప్పుడు కూడా ఏకబిగిన కథని పూర్తిచేయించే శైలి ఈ కథల ప్రత్యేకత. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారికి అంకితం ఇచ్చిన 'సమాంతరాలు' కథాసంపుటిని 'ఛాయ' ప్రచురించింది. పేజీలు 120, వెల రూ. 120. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు, ఆన్లైన్లోనూ కొనుక్కోవచ్చు. 

శనివారం, డిసెంబర్ 04, 2021

కొణిజేటి రోశయ్య

రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా తెలుగు రాజకీయాల్లో, 'వివాద రహితులు' గా ఉన్న నాయకులు బహు తక్కువ. ఆ కొందరిలో మొదటి వరస నాయకుడు కొణిజేటి రోశయ్య ఈ ఉదయం కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ కాలం ఆర్ధిక మంత్రి, స్వల్పకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా తన రాజకీయ విశ్రాంతి జీవితం గడిపి, అటుపైన రాజకీయాల వైపు ఏమాత్రం తొంగిచూడలేదు. దీనిని 'తామరాకు మీద నీటిబొట్టు చందం' అనుకుంటే, రాజకీయ జీవితంలో తొలినాళ్ళ నుంచీ అదే ధోరణి అవలంబించిన అరుదైన నాయకుడు రోశయ్య. ఆయనని ప్రత్యేకంగా గమనించడానికి కారణం ఏమిటంటే, నేను కలిసిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఆయనే.  

అప్పట్లో నేను పనిచేసే సంస్థ యాజమాన్యానికి ఆయనతో స్నేహం. ఒకసారి అనుకోకుండా నేనూ వాళ్లతో పాటు రోశయ్య ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో ఆయన ప్రతిపక్షం. అమీర్ పేటలో ఆయన ఇల్లు ఎలాంటి హంగూ, ఆర్భాటమూ  లేకుండా ఉంది. ఆ వేసవి కాలపు మధ్యాహ్నపు వేళ ఆయన నాకు స్వయంగా మంచినీళ్ల గ్లాసు అందించడమే కాదు, నా వివరాలూ కనుక్కున్నారు! అప్పటివరకూ పేపర్లో రోశయ్య గురించి చదవడం, రేడియోలో వినడం, టీవీలో చూడడం మాత్రమే చేసిన నాకు అదో వింత అనుభవం. బహుశా అప్పటినుంచీ ఆయన్ని కొంచం  ప్రత్యేకంగా గమనించాననుకుంటా. నున్నని మెరిసే బట్టతల, మడత నలగని తెల్లని ఖద్దరు దుస్తులు, భుజం మీద కావి రంగు పై పంచ, ఆరడుగుల ఎత్తున్న భారీ విగ్రహమేమో ఓ సారి చూస్తే మళ్ళీ మర్చిపోలేం. 

ఎన్టీఆర్ వెన్నుపోటు తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే 'విజన్-2020' అనీ, 2020 వరకూ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అనీ మీడియా హోరెత్తించడం మొదలు పెట్టింది. అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం లో ఉండేది. అది కూడా బలమైన ప్రతిపక్షం కాదు. ఉన్నవాళ్ళలో కూడా కొందరు నాయకులు చంద్రబాబు నాయుడికి అనుకూలమని గాసిప్ వార్తలు వచ్చేవి పేపర్లలో. అదిగో, ఆ కాలంలో క్రమం తప్పకుండా కాంగ్రెస్ గొంతు వినిపించిన కొద్దిమంది నాయకుల్లో రోశయ్య ఒకరు. నిజానికి మొదటివారు అనడం సబబు. అప్పట్లో రోశయ్య పేపర్లలో, టీవీల్లో కనిపించని రోజు ఉండేది కాదు. రోశయ్య మనవడు, తాతని రూపాయి ఇవ్వమని అడిగాడని, నేను పేపర్లోనూ, టీవీలోనూ కనిపించని రోజున రూపాయి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారనీ, ఆ మనవడు పాపం రోజూ టీవీ చూసి నిరాశ పడుతున్నాడనే వ్యంగ్య కథనం ఒకటి పేపర్లో వచ్చింది. ('ఆంధ్రభూమి' లో బుద్ధా మురళి రాసిన 'జనాంతికం' వీక్లీ కాలమ్). 

Google Image
రోశయ్య వాగ్ధాటినీ, పనితీరుని ప్రజలంతా ప్రత్యక్షంగా చూసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో. ఆర్ధిక శాఖ రోశయ్యది. పైగా అప్పుడు టీవీ చానళ్ళు విస్తృతంగా వ్యాపించి, ప్రత్యక్ష ప్రసారాలు ఊపందుకున్నాయి. "నేను సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెడదామంటే రోశయ్య గారు బడ్జెట్ ఇవ్వడం లేదు" అని వైఎస్  వేసిన సెటైర్లు జనంలోకి బాగా వెళ్లాయి. చంద్రబాబు నాయుడు-రోశయ్యలది ప్రత్యేక అనుబంధం. ఎవరి మాటలూ పెద్దగా పట్టించుకోని చంద్రబాబు నాయుడు, రోశయ్య మాటల్ని పట్టించుకున్న సందర్భాలున్నాయి. తనపై అలిపిరి దాడి తర్వాత, సింపతీ వేవ్ లో గెలవచ్చన్న ఆలోచనతో ముందస్తు ఎన్నికలు ప్రకటించారు చంద్రబాబు. దాడి జరిగి నెలలు గడిచినా చేతికి కట్టు తియ్యలేదు. దీనిమీద రోశయ్య నుంచి విమర్శ రాగానే, మర్నాటి నుంచీ చేతి కట్టు కనిపించలేదు. 

"నేను తెలివైన వాడిని అని చంద్రబాబు నాయుడు అంటున్నారు అధ్యక్షా. నాకన్ని తెలివితేటలు ఉంటే, వైఎస్ వెనకే వెళ్లి కత్తితో పొడిచేసి ఆ కుర్చీలో కూర్చునే వాడిని కదా అధ్యక్షా.." అన్న రోశయ్య అసెంబ్లీ వీడియో, ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారీ వైరల్ అవుతూ ఉంటుంది. అయితే, చాలా అనూహ్యంగా వైఎస్ అకాల మరణం తర్వాత ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అవకాశం వచ్చింది రోశయ్యకి. పార్టీకి వీర విధేయుడిగా ఉండడం, తనకంటూ వర్గం లేకపోవడం, సొంత బలం లేకపోవడం లాంటివి కలిసొచ్చాయని విశ్లేషణలు వచ్చాయి అప్పట్లో. రెండేళ్ళకి కాస్త తక్కువగా ఆపదవిలో ఉన్నా, అది దినదిన గండంగానే గడిచింది. కాంగ్రెస్ లో ఉన్న కలహాలు, కుమ్ములాటలు ఓ పక్క, యువరాజ పట్టాభిషేకానికి రోశయ్యే అడ్డుపడ్డారనే భావనతో వ్యతిరేకించిన వర్గం మరోపక్క, హైకమాండ్ మితిమీరిన పెత్తనం ఇంకో పక్క ముప్పేట దాడి చేసినా తన అనుభవం, లౌక్యంతో నెగ్గుకొచ్చారు రోశయ్య. 

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో అధినేతతో పాటు గెలిచిన పదిహేడు మంది ఎమ్మెల్యేలలో ఒకరు రోశయ్యకు దగ్గరవారనీ, సదరు ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి దూకేయబోవడమే ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిసిపోడానికి కారణమనీ  విశ్లేషణలు వచ్చాయి అప్పట్లో. ఇలాంటి చారిత్రక సందర్భాలు రోశయ్య రాజకీయ జీవితంలో చాలానే ఉన్నాయి. తను ఆదేశించిన వెంటనే ముఖ్యమంత్రి కుర్చీ దిగిపోయినందుకు బహుమతిగా రోశయ్యని తమిళనాడు గవర్నరుగా చేసింది కాంగ్రెస్ హైకమాండ్. అప్పటికే గవర్నరు గిరీ అంటే విశాలమైన రాజభవన్లో విశ్రాంతి తీసుకోవడం, దగ్గరలో ఉన్న గుళ్ళూ, గోపురాలూ చుట్టి రావడం అన్న భావన జనంలో బలపడడం వల్ల, "పోన్లే, పెద్దాయన రాజ లాంఛనాలతో విశ్రాంతి తీసుకుంటారు" అనుకున్నారందరూ. 

కానీ, రోశయ్యకు అక్కడా సమస్యలే స్వాగతం పలికాయి. సరిగ్గా అప్పుడే ముఖ్యమంత్రి జయలలిత అవినీతి కేసుల్లో జైలుపాలు కావడం, ఆమె భక్తుణ్ణి ముఖ్యమంత్రిని చేయడం, ప్రతిపక్ష నాయకుడు కరుణానిధి పూటకో ఫిర్యాదుతో ముఖ్యమంత్రిని కలవడం లాంటివెన్నో జరిగాయి. ఈ మధ్యలో కర్ణాటక గవర్నరుగా ఓ రెండు నెలలు అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. అటుపైన తనకి, తన పార్టీకీ కూడా వయోభారం సంభవించడంతో రాజకీయాలకి దూరంగా ఉండిపోయారు. హైదరాబాద్ కి తిరిగి వచ్చేసినా, 'మాజీ ముఖ్యమంత్రి' హోదాని వాడుకోనట్టే ఉంది. ఎన్ జీ రంగా శిష్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించి, సోనియా గాంధీ అంతరంగికుడిగా రాజకీయాల్లోనుంచి విరమించుకోవడం మధ్యలో రోశయ్య చూసినవి, చేసినవి చాలానే ఉన్నాయి. ఎప్పటికీ వివాద రహితుడిగా ఉండడం కోసం కాబోలు, అయన తన ఆత్మకథ రాయలేదు. రోశయ్య ఆత్మకి శాంతి కలగాలి.