బుధవారం, జూన్ 29, 2022

సినిమా చూద్దాం ...

తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడో చిత్రమైన పరిస్థితి ఉంది. ఇది గతంలో ఎప్పుడూ లేనిది, నిర్మాతలు ఊహించనిదీను. సినిమా హాళ్ళకి ప్రేక్షకులు రావడం లేదు. ఒకప్పుడు ప్రత్యేక పరిస్థితులు, కారణాలు చెప్పి టిక్కెట్టు రేటుకి రెట్టింపు వసూలు చేసినా అమితమైన ఉత్సాహంతో టిక్కెట్లు కొనుక్కుని భారీ సినిమాలని అతిభారీగా విజయవంతం చేసిన ప్రేక్షకులు, ఇప్పుడు 'టిక్కెట్టు రేటు తగ్గించాం, సకుటుంబంగా థియేటర్ కి వచ్చి మా సినిమా చూడండి' అని సినిమా వాళ్ళు సగౌరవంగా పిలుస్తున్నా, ఆవైపు వెళ్ళడానికి తటపటాయిస్తున్నారు. ఫలితంగా, భారీ సినిమాలు కోలుకోలేని విధంగానూ, మధ్యరకం సినిమాలు తగుమాత్రంగానూ నష్టపోతున్నాయి. 'చిన్న సినిమాలు' అనేవి దాదాపుగా కనుమరుగైపోయాయి కదా. 

నిజానికి 'సినిమా నష్టాలు' అనేది కొత్త విషయమేమీ కాదు, ఉండుండీ అప్పుడప్పుడూ చర్చకి వస్తూనే ఉంటుంది. తేడా ఏంటంటే, నష్టాలకి కారణాలు మారుతూ ఉంటాయి. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా నష్టాలకి కారణం ప్రేక్షకులే. జాతి గౌరవాన్నో, అభిమాన హీరో పరువునో నిలబెట్టడం కన్నా కష్టర్జితాన్ని ఇతరత్రా ఖర్చులకి వెచ్చిస్తున్నారు వాళ్ళు. ఫలితంగా, అటు పెద్ద పెట్టుబడులతో సినిమా తీసి, పెద్దల సాయంతో టిక్కెట్టు రేట్లు పెంచుకున్న సినిమాలకీ, ఇటు సంసారపక్షంగా తగుమాత్రం బడ్జెట్టుతో సినిమా పూర్తి చేసి టిక్కెట్టు రేటు తగ్గించిన సినిమాలకీ కూడా థియేటర్ల దగ్గర ఫలితం ఒకలాగే ఉంటోంది. హాలుకొచ్చి టిక్కెట్టు కొని సినిమా చూసే ప్రేక్షకులనే నమ్ముకుని సినీ కళామతల్లి సేవకి జీవితాలని అంకితం చేసిన నటీనటులకీ, దర్శక నిర్మాతలకీ ఇది బొత్తిగా మింగుడు పడని పరిణామం. 

కరోనా కారణంగా జనమంతా రెండేళ్ల పాటు ఇళ్లకే పరిమితమైపోయారు. నట్టింట వినోదానికి అలవాటు పడిపోయారు. ఓటీటీల పుణ్యమా అని ఇతర భాషల సినిమాలని నేరుగానూ, డబ్బింగు వెర్షన్ల ద్వారానూ చూసేశారు. ఫలితం ఏమిటంటే, తెలుగు సినిమాలని ఆయా భాషల సినిమాలతో పోల్చుకోవడం మొదలు పెట్టారు. రాజుని చూడ్డానికి అలవాటు పడిపోయిన కళ్ళు మరి. నాటకాలు తదితర కళలన్నీ విజయవంతంగా అవసాన దశకి చేరుకొని, సినిమా మాత్రమే ఏకైక వినోదంగా మిగిలింది కాబట్టి నాణ్యతతో సంబంధం లేకుండా హాల్లో సినిమాలు చూసి తీరాలి నిజానికి. చిక్కు ఎక్కడొచ్చిందంటే, కరోనా అనంతర పరిస్థితుల్లో ఖర్చు వెచ్చాల్లో తేడాలొచ్చేసి నెల జీతాల వాళ్ళు బడ్జెట్లు, ఖర్చు చేసే ప్రాధాన్యతా క్రమాలు ఉన్నట్టుండి మారిపోయాయి. 

Google Image

కరోనా పేరు చెప్పి చాలామందికి జీతాలు పెరగలేదు. ఉద్యోగం నిలబడింది, అందుకు సంతోషించాలి అనుకునే పరిస్థితి. మరోపక్క ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఉక్రెయిన్ యుద్ధం అనే వంక కూడా దొరికింది, ధరల పెరుగుదలకి. తారుమారైన ఇంటి బడ్జెట్లలో, సినిమా ఖర్చు అనివార్యంగా 'తగ్గించుకో గలిగే ఖర్చుల' జాబితాలోకి చేరిపోయింది. మనవాళ్ళు అన్నం తినకుండా అయినా ఉండగలరు కానీ, సినిమా చూడకుండా ఉండలేరని సినిమా వాళ్ళకో ఘాట్టి నమ్మకం. దాన్నేమీ వమ్ము చేయడం లేదు. వచ్చిన సినిమాని వచ్చినట్టు చూస్తున్నారు, కాకపోతే థియేటర్లో కాదు, ఓటీటీలో. హాల్లో రిలీజైన రెండు మూడు వారాల్లోపే ఇంట్లో టీవీలో చూసే సౌకర్యం ఉన్నప్పుడు, వస్తున్న సినిమాలు కూడా ఆమాత్రం రెండు మూడు వారాలు ఆగగలిగేవే అయినప్పుడు అన్నం మానేయాల్సిన అవసరం ఏముంది? 

పైగా ఒక్క టిక్కెట్టు రేటు మాత్రమే కాకుండా, పార్కింగ్ మొదలు పాప్ కార్న్ వరకూ చెల్లించాల్సిన భారీ మొత్తాలు కూడా ఆదా అయి ఖర్చులో బాగా వెసులుబాటు కనిపిస్తోంది. మొత్తం సినిమానో, కొన్ని భాగాలో బాగా నచ్చితే మళ్ళీ చూసే వెసులుబాటుతో పాటు, నచ్చకపోతే వెంటనే టీవీ కట్టేసే సౌకర్యాన్ని కూడా ఓటీటీ ఇస్తోన్నప్పుడు కష్టపడి సినిమాహాలు వరకూ వెళ్ళాలా? అన్నది బడ్జెట్ జీవుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఇలా ఉన్నట్టుండి ప్రేక్షకులు వాళ్ళ  స్వార్ధం వాళ్ళు చూసుకోడంతో సినిమావాళ్ళు కాస్ట్ కటింగ్ ఆలోచనలో పడ్డారు. కళామతల్లికి ఖరీదైన సేవ చేసే పెద్ద నటీనటుల జోలికి వెళ్లడం లేదు కానీ, రోజువారీ కూలీకి పని చేసే కార్మికులు, చిన్నా చితకా ఆర్టిస్టుల ఖర్చుల వైపు నుంచి నరుక్కొద్దామని చూస్తున్నారు. 

రోజువారీ వేతనాలు సవరించమంటూ మొన్నామధ్యన సినిమా కార్మికులు మొదలు పెట్టిన సమ్మె ఒక్కరోజులోనే ఆగిపోయింది. అవసరమైతే పొరుగు రాష్ట్రాల నుంచి కార్మికుల్ని తీసుకొచ్చి సినిమాలు నిర్మిస్తాం తప్ప, మీ డిమాండ్లు పరిష్కరించం అని తెగేసి చెప్పేశారు నిర్మాతలు. సమస్య పరిష్కారానికి ఓ కమిటీ వేశారు కానీ, ఫలానా తేదీ లోగా పరిష్కరించాలనే నిబంధనలేవీ లేవు. చట్టంలాగే ఆ కమిటీ కూడా తన పని తాను చేసుకుపోతుంది కాబోలు. ఈ ప్రకారంగా అగ్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల కళాసేవకి ఆటంకం కలగకుండా ఉండేందుకు నిర్మాతలు పాపం తమవంతు కృషి చేస్తున్నారు. ఇతరత్రా ఉపాయాలు కోసం వేరే రాష్ట్రాల వైపు చూసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే, అన్నిరకాలుగానూ తెలుగు సినిమా ప్రత్యేకమైనది. ఇప్పటి పరిస్థితీ ప్రత్యేకమైనదే. అద్భుతాలు జరిగిపోతాయన్న ఆశ లేదు కానీ, రాబోయే రోజుల్లో కళాసేవ ఏవిధంగా జరుగుతుందో చూడాలన్న కుతూహలం మాత్రం పెరుగుతోంది . 

సోమవారం, జూన్ 27, 2022

ఒక ఎంపిక

"సంతాలీ వారి వృత్తి వేట, ఆయుధం బాణం. అందుకే వారి గౌరవార్ధం చిత్తరంజన్ లోకో వర్క్స్ లోగోలో బాణం గుర్తుని కూడా చేర్చారు. చాలామంది సంతాలీలకి ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళ ఇంటిపేర్లు భిన్నంగా ఉంటాయి. టుడ్డు, ముర్ము, ఎక్కా.. అలా ఉంటాయి. చిత్తరంజన్ లో విశ్వకర్మ పూజకి చాలా ప్రాధాన్యత ఉంది. సెప్టెంబర్ నెలలో వచ్చే ఆ పూజని చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సెక్షన్ లోనూ విశ్వకర్మ విగ్రహం పెట్టి పూజ చేస్తారు. వర్క్ షాప్ కి ఆవేళ బయట వాళ్ళని కూడా అనుమతిస్తారు. వేలమంది వస్తారు. మాలాంటి వాళ్ళు ఒంటరిగా వెళ్లినా సంతాలీలు మాత్రం పసిపిల్ల బాలాదీ వస్తారు. ఆడవారి కట్టు వేరుగా ఉంటుంది. జాకెట్టు వేసుకోరు. ఉన్నంతలో మంచి చీరె కట్టుకుని, తల నున్నగా దువ్వుకుని, పువ్వులు పెట్టుకుని, వెండి నగలు వేసుకుని వచ్చారు.

ఒక ఏడు చూస్తే చాలదా, ప్రతి ఏడూ ఎందుకు కాళ్ళీడ్చుకుంటూ రావడం అని సందేహం కలిగింది. 'ఈ పూజ కోసం ఏడాదంతా ఎదురు చూస్తారు. తప్పకుండా వస్తారు' అని చెప్పారు మా శ్రీవారు. వచ్చిన వాళ్ళు ఊరికే చూసి పోటం లేదు, వాళ్ళ వాళ్ళు పని చేసే దగ్గర ఆగి, అక్కడ పెట్టిన విశ్వకర్మ విగ్రహానికి, అమిత భక్తితో ఒకటికి పదిసార్లు దండాలు పెట్టడం చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. ఏడాది పొడుగునా తమ మనిషి అక్కడే పనిచేస్తాడు, అతనికి ఎటువంటి ప్రమాదమూ జరగ కూడదని ప్రార్ధిస్తారుట. మరి వాళ్ళ ప్రార్ధనల ఫలితమేనేమో, అంత పెద్ద కర్మాగారంలో ఏనాడూ ప్రమాదం జరగదు. సంతాలీలను చూశాక, రోజూ పొద్దున్న దీపం పెట్టి, ఫ్యాక్టరీ చల్లగా ఉండాలని దణ్ణం పెట్టుకోటం అలవాటు అయింది.." సీనియర్ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి రాసిన 'జ్ఞాపకాల జావళి' లో 'కర్మాగారం' అనే అధ్యాయంలో కొంత భాగం ఇది. 

ఒక్క చిత్తరంజన్ మాత్రమే కాదు, భారతదేశంలో నిర్మాణం జరిగిన అనేక భారీ ప్రాజెక్టుల వెనుక ఈ సంతాలీల శ్రమ ఉంది. వారు చిందించిన చెమట ఉంది. దేశానికి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్ల తర్వాత, మొట్టమొదటిసారిగా ఈ 'సంతాలీ' తెగకి చెందిన మహిళని అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించింది కేంద్రంలోని అధికార పార్టీ. ఆమె ఎన్నిక లాంఛనమా, కష్టసాధ్యమా అనే చర్చని పక్కన పెడితే అత్యున్నత పదవికి నామినేషన్ వరకూ ప్రయాణం చేయడానికి అత్యంత వెనుకబడ్డ సంతాలీ గిరిజనులకు డెబ్బై ఐదేళ్లు పట్టింది! ఒడిశాకి చెందిన ద్రౌపది ముర్ము నామినేషన్ ఘట్టాన్ని టీవీలో చూస్తుంటే వచ్చిన చాలా ఆలోచనల మధ్యలో పొత్తూరి విజయలక్ష్మి గారి రచనా గుర్తొచ్చింది. తెలుగు సాహిత్యంలో సంతాలీల ప్రస్తావన ఇంకెక్కడా వచ్చినట్టు లేదు. 

అదే టీవీలో కొన్ని ఛానళ్లలో 'మన వాడికి' రాష్ట్రపతి అవకాశం ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం కనిపించింది. దేశం ముక్కలవుతుందన్న బెదిరింపూ వినిపించింది. 'ముక్కలవ్వడం మరీ అంత సులభమా?' అనిపించేసింది చూస్తుంటే. మనవాళ్ళకి ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చాయి, ఒక్క అవకాశమూ రాని వర్గాలు ఇంకా చాలానే మిగిలి ఉన్నాయన్న స్పృహ వారికి ఎందుకు కలగలేదన్న ఆశ్చర్యం వెంటాడింది. 'రాష్ట్రపతి-రబ్బరు స్టాంపు' తరహా చర్చలూ జరిగాయి. ఇప్పటివరకూ పనిచేసిన పద్నాలుగు మందిలోనూ పదవిని అలంకరించుకున్న వాళ్లతో పాటు, పదవికి అలంకారంగా మారిన వాళ్ళూ ఉన్నారు. లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు గాక, మన వ్యవస్థ బలమైనది. ప్రతి పదవికీ ప్రయోజనం ఉంటుంది. సమయం, సందర్భం కలిసిరావాలి. ఆ సమయంలో, ఆ పదవిలో ఉన్న వ్యక్తి బలమైన నిర్ణయాలు తీసుకోగలిగే వారై ఉండాలి. 

ఇదే 'జ్ఞాపకాల జావళి' లో 'అర్చన' అధ్యాయంలో కొంత భాగం: "అర్చనా వాళ్ళు సంతాలీల్లో ఒక తెగకు చెందిన వాళ్ళు. వాళ్ళ బంధువులు కాస్త దూరంలో బాఘా అనే చిన్న జనావాసంలో ఉంటారు. అక్కడ ఒక అమ్మాయికి ఏడాది కిందట పెళ్లి అయింది. భర్త తిన్ననైన వాడు కాదు. తాగటం, పెళ్ళాన్ని కొట్టటం. రెండు నెలలకే పుట్టింటికి వచ్చేసింది. వాళ్లొచ్చి నచ్చచెప్పి తీసుకెళ్లారు. అలా నాలుగైదు సార్లు జరిగింది. వీళ్ళు విసిగిపోయి దండువా పెట్టారు. దండువా అంటే పిల్లవైపు బంధువులు పిల్లాడింటికి వెళ్తారు. మగవాళ్ళు ఖాళీ చేతులతో వెళ్తారు. ఆడవాళ్ళూ వెళ్తూ చీపురు, అప్పడాల కర్ర, విసిన కర్ర వంటి ఆయుధాలు తీసుకెళ్తారు. పిల్లాడిని కూచోబెట్టి చుట్టూ తిరుగుతూ తలోటీ తగిలిస్తారు. మళ్ళీ అందులోనూ పద్ధతులున్నాయి. పిల్ల తల్లి, వదిన మాత్రం కొట్టరు, తిట్టి ఊరుకుంటారుట. 

'దండువా అయ్యాక ఛాటా చేశారు' అంది అర్చన. ఛాటా అంటే తెగతెంపులు. 'ఇక మీకూ మాకూ రామ్ రామ్' అని అందరిముందూ ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళిచ్చిన బంగారం, వెండి వాళ్ళకి ఇచ్చేశారు. వీళ్ళు ఇచ్చినవి చెవులు మెలేసి తీసుకున్నారు. వాళ్ళు కారం బూందీ, తీపి బూందీ పెట్టి చాయ్ ఇచ్చారుట. 'తన్నడానికి పోతే విందు కూడానా?' అంటే, 'అవును మరి, మేము ఊరికే పోయామా? మా పిల్లని బాగా చూసుకుంటే వాళ్ళ గడప తొక్కే పనేముంది మాకు? తప్పు వాళ్లదే కాబట్టి మర్యాద చెయ్యాలి. అదే మా పధ్ధతి. పిల్లని పుట్టింటి వాళ్ళు తీసుకు వచ్చేశారు. దానిష్టం అయితే మారు మనువుకి వెళ్తుంది. లేదా ఏదో కాయకష్టం చేసుకుంటూ ఉంటుంది' అని వివరంగా చెప్పి 'పనుంది' అని వెళ్ళిపోయింది. చెయ్యెత్తి దణ్ణంపెట్ట బుద్ధి వేసింది నాకు. ఏం చదివారు వీళ్ళు? ఎంత తెలివి? ఎంత బాధ్యత? ఎంత ఐకమత్యం? అన్నింటినీ మించి ఎంత ధైర్యం? మనమూ ఉన్నాం ఎందుకూ? చుట్టుపక్కల ఏం అన్యాయం జరిగినా బాపూ గారి కార్టూన్ లో చెప్పినట్టు చూసీ చూడనట్లు ఊరుకుంటాం." 

బుధవారం, జూన్ 22, 2022

యుద్ధ బీభత్సం

యుద్ధం కొనసాగుతోంది. బలమైన రష్యా, చిన్న దేశమైన ఉక్రెయిన్ మీద విజయం సాధించడం పెద్ద విషయమేమీ కాదనుకున్న వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు. రెండు దేశాల బలాబలాలు, వాటి వెనుక ఉన్న శక్తులు, యుద్ధభూమిలో జరగబోయే పరిణామాలు.. వీటన్నింటినీ కాసేపు పక్కన పెట్టి, యుద్ధ బీభత్సాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన సమయమిది. మృతులు, క్షతగాత్రులు, కాలిన, కూలిన భవనాలు, ధ్వంసమైన ఆస్తులు.. ఇవన్నీ కనిపించే బీభత్సాలు. చాపకింద నీరులా ప్రపంచాన్ని, మరీ ముఖ్యంగా బీదవైన మూడో ప్రపంచ దేశాలని, చుట్టుముడుతోన్న బీభత్సం ఆకలి. కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో ఆకలి కేకలు మొదలయ్యాయి. మరికొన్ని దేశాలకీ ఇవి విస్తరించబోతున్నాయి. అంత తీవ్రంగా కాకపోయినా మిగిలిన అన్ని దేశాల్లోనూ ఎంతో కొంత ప్రకంపనలు వినిపించని తప్పని పరిస్థితే కనిపిస్తోంది. 

నెలల తరబడీ జరుగుతున్న యుద్ధం కారణంగా, సరిహద్దుల మూసివేత ఫలితంగా, అటు రష్యా నుంచీ, ఇటు ఉక్రెయిన్ నుంచీ మిగిలిన దేశాలకి ఆహారధాన్యాల సరఫరా ఆగిపోయింది. సోమాలియా, సూడాన్, లిబియా లాంటి చిన్న దేశాలు గోధుమలు, వంట నూనెల కోసం ఈ రెండు దేశాల మీదే ఆధార పడ్డాయి. అంతే కాదు, వ్యవసాయం చేయడానికి అవసరమయ్యే రసాయన ఎరువుల తయారీకి రష్యా ప్రధాన కేంద్రం. ఎరువుల సరఫరా కూడా ఆగిపోయింది. కరువు మొదలయ్యింది. గడ్డి మొలవని పరిస్థితుల్లో పాడి పశువులు మరణిస్తున్నాయి. పాలకీ కొరత మొదలయ్యింది. ఉన్న ఆహార నిల్వలు అడుగంటున్నాయి. కొత్త సరఫరాలకి దారులు తెరుచుకోలేదు. దూర దేశాల నుంచి తెప్పించుకోవడం ఖరీదైన వ్యవహారం మాత్రమే కాదు, చాలా సమయం పట్టే ప్రక్రియ కూడా. 

ఇది ఆఫ్రికా దేశాలకి మాత్రమే పరిమితమైన సమస్య కాదు, ఆహారధాన్యాల దిగుమతుల మీదే పూర్తిగా ఆధార పడ్డ ఈజిప్టుది కూడా. కానైతే, ఆఫ్రికన్ దేశాల పేదరికం వాటిని త్వరగా కరువులోకి నెట్టేసింది. యుద్ధకాలంలోనే ప్రకృతి కూడా పగబట్టింది. ధరలు రెట్టింపయ్యాయి, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. ఫలితంగా, ఆకలి కేకలు మొదలయ్యాయి. నిజానికి ధరల పెరుగుదల యుద్ధానికన్నా ముందే మొదలయ్యింది. కరోనా కారణంగా ధరల పెరుగుదల ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదు. అయితే, అటు ఈజిప్టు, ఇటు ఆఫ్రికన్ దేశాల్లో మాత్రం యుద్ధం కారణంగా పరిస్థితి పుండుమీద కారం జల్లినట్టైంది. ఇప్పుడు ప్రపంచమంతా 'గ్లోబల్ విలేజ్' కాబట్టి ఈ సమస్య మిగిలిన దేశాలకి విస్తరించడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. 

సముద్ర మార్గాలు మూసుకుపోవడం, భూమార్గాల ద్వారా సరుకు రవాణా ఖరీదైన వ్యవహారం కావడం, అన్నింటినీ మించి ఆహారధాన్యాలు యుద్ధంలో ఉన్న రెండు దేశాల సరిహద్దులు దాటి బయటికి వచ్చే మార్గాలు రోజురోజుకీ మూసుకుపోవడంతో కొద్ది నెలల్లోనే ఆహార ధాన్యాల కొరత తీవ్రమయ్యింది.  ఆహార ధాన్యాలు పండించే మిగిలిన దేశాలేవీ ఎగుమతి చేయగలిగే పరిస్థితుల్లో లేవు. స్థానిక అవసరాల మొదలు, రాజకీయ సమస్యల వరకూ కారణాలు అనేకం. ఉదాహరణగా భారత దేశాన్నే తీసుకుంటే, గోధుమలు ఎగుమతి చేస్తామని ప్రకటించి వెనువెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కారణం, దిగుబడి తగ్గడం, పండిన పంట స్థానిక అవసరాలకి ఎంతవరకూ సరిపోతుందన్న సందేహం రావడం. మార్చి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఈ ఏడు గోధుమ దిగుబడి దారుణంగా పడిపోయింది. 

కరువు అనేది ఓ భయంకరమైన విషయం. గోదావరి ఆనకట్ట కట్టక మునుపు సంభవించిన 'డొక్కల కరువు' గురించి చిన్నప్పుడు కథలు కథలుగా విన్నాం. క్షుద్భాధకి తాళలేక మట్టిలో నీళ్లు కలుపుకు తిన్నవాళ్ళు, ఎవరైనా చనిపోగానే వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి తిండికోసమూ మిగిలిన వాళ్ళు ప్రాణాలకి తెగించి కొట్టుకోడం లాంటివి విన్నప్పుడు ఒళ్ళు జలదరించేది. అవన్నీ సాంకేతికత అభివృద్ధి చెందని నాటి పరిస్థితులు. గడిచిన ముప్ఫయ్యేళ్లలో సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరిగింది. ఎన్నెన్నో సమస్యల్ని కంప్యూటర్లు చిటికెలో పరిష్కరించేస్తున్నాయి. వాతావరణం ఎలా ఉండబోతోందో ముందుగా తెలుస్తోంది. వరదలు, తుపానుల గురించి ముందస్తు అంచనా ఎన్నో ప్రాణాలనీ, పంటల్నీ కాపాడుతోంది. ఇప్పుడు చుట్టుముడుతున్న కరువుని ఎదిరించాలంటే యుద్ధం ఆగాలి. ఆపని చేయగలిగేది టెక్నాలజీ కాదు, దాన్ని వాడే మనుషులే.

సోమవారం, జూన్ 20, 2022

'క్లాసిక్స్' తో పేచీ ...

విజయ-వాహినీ వారి 'గుండమ్మ కథ' సినిమాకి అరవై ఏళ్ళు నిండాయని గత వారమంతా హడావిడి జరిగింది. పత్రికల్లో ప్రత్యేక కథనాలు, టీవీల్లో ప్రత్యేక కార్యక్రమాలు, యూట్యూబ్ ఛానళ్లలో వాళ్ళకి తోచిన విశేషాలు.. ఇలా ఒక్కసారిగా ఆ సినిమా వార్తల్లోకి మళ్ళీ వచ్చింది. భారీ తారాగణం, వీనుల విందైన సంగీతం, గుర్తుండిపోయే పాటలు,  ఆరోగ్యకరమైన హాస్యం.. ఇలా విడివిడిగా చూసినప్పుడు ఒక్కొక్కటీ బాగుంటాయి కానీ మొత్తం సినిమాగా నేను 'క్లాసిక్స్' జాబితాలో వేసుకోలేను. నా పేచీ అంతా కథలోని ఓ  ముఖ్య భాగంతోనే. ఏళ్ళ తరబడి మిత్రులతో చర్చించి, చాలాసార్లు ఏకాభిప్రాయం కుదరక వదిలేసిన విషయమే కానీ, ఈ 'వజ్రోత్సవ' సందర్భంలో మళ్ళీ గుర్తొచ్చింది.  

చనిపోయిన తన స్నేహితుడి కుటుంబాన్ని బాగుచేయాలన్న ఎస్వీ రంగారావు తాపత్రయమే ఈ సినిమా కథ. ఆ స్నేహితుడికి భార్య వల్ల సావిత్రి, ఆ భార్య చనిపోయాక రెండో పెళ్లి చేసుకున్న సూర్యకాంతం వల్ల జమునా కలుగుతారు. సవితి తల్లి సూర్యకాంతం తనని నానా బాధలూ పెడుతున్నా, సాత్వికురాలైన సావిత్రి అవన్నీ భరిస్తూ అందరిపట్లా ఆదరం కనబరుస్తూ మంచి పిల్ల అనిపించుకుంటూ ఉంటుంది. తన పెద్ద కొడుకు ఎంటీఆర్కి సావిత్రినిచ్చి పెళ్లిచేసి, సవితి తల్లి బారినుంచి కాపాడి కొత్త జీవితం ఇవ్వాలనుకుంటాడు ఎస్వీఆర్. ఇక్కడి వరకూ పేచీలేదు. కానైతే, గారాబంగా పెరిగిన జమునని తన చిన్నకొడుకు నాగేశ్వర్రావుకి చేసుకుని ఆమెని 'సంస్కరించాలి' అని కూడా అనుకుంటాడు - ఇదే పేచీ. 

గారంగా పెరగడం జమున తప్పు కాదు. తల్లికలా సాగింది కాబట్టి, పనిపాటలకి సావిత్రి ఉంది కాబట్టీ, సవితి కూతురికి, సొంతకూతురికి మధ్య తల్లి భేదం చూపించాలి కాబట్టీ అలా అల్లారుముద్దుగానే పెరిగింది.  పనిపాటలు చేతకావు, ఆధునికంగా అలంకరించుకుని సినిమాలకి వెళ్లడం లాంటి సరదాలు మెండు. ఇలా ఉన్నవాళ్లు అన్ని కాలాల్లోనూ ఉన్నారు. ('సుమంగళి' 'చరణదాసి' లాంటి సినిమాలని ఇప్పటి పరిస్థితుల్లో చూసి పోల్చి తీర్పులివ్వడం కాదు అని గమనించాలి). చిన్ననాటి స్నేహితుడి ఇద్దరు కూతుళ్ళని తన కోడళ్ళుగా చేసుకోవాలనే అభిలాష తీర్చుకునే క్రమంలో జమునని యధాతధంగా అంగీకరించకుండా, ఆమెని ఓ కొత్త మూసలో ప్రవేశపెట్టి, హింసపడేలా చేసి (డొమెస్టికేట్ చేసి?) చివరాఖరి రీల్లో ఆమెలో 'మార్పు' తేవడం అనే ప్రాసెస్ అంతా ఎన్నిసార్లు ఆ సినిమా చూసినా నాకు అంగీకారం అవ్వడం లేదు. 

జమున, జమునలా ఉండిపోకుండా సావిత్రి లాగా ఎందుకు మారిపోవాలి? అలా మారిపోయాక మాత్రమే ఆమెకి మిగిలిన పాత్రల, ప్రేక్షకుల అంగీకారం ఎందుకు దొరకాలి? మారిపోవడం అంత సులభమా?? మామూలుగా అయితే ఇంత ఆలోచన అవసరం లేదేమో కానీ, 'క్లాసిక్' స్టేటస్ ఉన్న సినిమా కదా. అసలు సూర్యకాంతం గయ్యాళిగా వేసిన మెజారిటీ సినిమాల్లో చివరి రీల్లో భర్త పాత్రధారి ఎస్వీఆరో, గుమ్మడో ఓ చెంపదెబ్బ కొట్టగానే ఆమెలో పశ్చాత్తాపం వచ్చేయడం కూడా 'ఏదోలా సినిమాని ముగించాలి కాబట్టి' అనే అనిపిస్తుంది  తప్ప వాస్తవికంగా కనిపించదు. 'ఆ దెబ్బేదో మొదటి రీల్లోనే కొట్టేసి ఉంటే ఇంత గొడవ ఉండేది కాదు కదా' అనిపించిన సందర్భాలూ కోకొల్లలు. ఈ నేపథ్యంలో 'గుండమ్మ కథ' లో జమున పాత్ర తాను చేయని తప్పుకి శిక్ష అనుభవించిందనే అనిపిస్తుంది. మారిన జమునకీ, 'మార్చుకున్న' నాగేశ్వరరావుకీ ప్రేక్షకుల అభినందనలు నాకు కొరుకుడు పడవు. 

'Google' images

ఇలాంటి పేచీయే ఉన్న మరో 'క్లాసిక్' స్టేటస్ సినిమా కె. విశ్వనాథ్ 'స్వర్ణకమలం'. ఇందులో కూడా మంచి నటీనటులున్నారు, ఇళయరాజా సంగీతం, సంస్కృత పదబంధ సమ్మిళితమైన సిరివెన్నెల సాహిత్యం, అరుదుగా వినిపించే ఇళయరాజా-సుశీల కాంబినేషన్, కొన్ని హాస్య సన్నివేశాలు, మరికొన్ని సెంటిమెంట్ సీన్లు.. ఇవన్నీ బాగుంటాయి. కానీ, భానుప్రియ లో 'పరివర్తన' తెచ్చి, ఆమె నాట్యాన్ని ప్రేమించేలా చేయడానికి వెంకటేష్ పడే తాపత్రయం, తనకి నచ్చిన కెరీర్ ఎంచుకున్న ఆమెని రకరకాల ప్రయత్నాలతో నాట్యంలోకి వెనక్కి తీసుకురావడం.. ఇవన్నీ చూస్తుంటే 'ఆమె పాటికి ఆమెని వదిలేయచ్చు కదా.. వాళ్ళ నాన్నకున్న చాలామంది శిష్యుల్లో ఎవరో ఒకరు నాట్యాన్ని ముందుకు తీసుకెళ్తారు కదా' అనిపిస్తూ ఉంటుంది. 

'గుండమ్మ కథ' తో పోల్చినప్పుడు 'స్వర్ణకమలం' విషయంలో రిలీఫ్ ఏమిటంటే, భానుప్రియ నాట్యంలో మమేకమైన తర్వాత అందులో ఆత్మానందాన్ని సంపాదించుకోవడం. తనకి ఇష్టమైన హౌస్ కీపింగ్ ఉద్యోగంలో ఆమెకిది దొరికేది కాదా? అంటే, సందేహమే మళ్ళీ. సినిమా మొదటినుంచి, చివరివరకూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాట్యం గొప్పదనాన్ని గురించి ఆమెకి ఏదో ఒక విధంగా చెప్పి చూసేవాళ్ళే. ఇష్టపడక పోడానికి ఆమె కారణాలు ఆమెకి ఉన్నాయి. అవీ సబబైనవే. కానైతే, హీరో కంకణం కట్టేసుకుని మరీ ఆమెలో మార్పు తెచ్చేయడం, తండ్రి ఆత్మార్పణ లాంటి బలమైన సంఘటనల తర్వాత ఆమెలో ఆ మార్పు వచ్చేయడం.. ఇదంతా కాస్త హైరానాగానే అనిపిస్తుంది. అందరికీ అన్నీ నచ్చాలని లేదుకదా..