శుక్రవారం, డిసెంబర్ 24, 2010

రైలు ప్రయాణం

జీవితాన్ని రైలు ప్రయాణంతో పోలుస్తారు చాలామంది. చూసే ఓపిక, ఆసక్తీ ఉండాలే కాని రైలు ప్రయాణంలోనే జీవితం మొత్తం కనిపించేస్తుంది మనకి. రకరకాల మనుషులు. ఎవరి ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ఆగుతుందో మరొకరికి తెలీదు. అయినా కలిసిన ఆ కాసేపట్లోనే అపరిచితుల మధ్య ఎన్నో సంభాషణలు నడిచిపోతూ ఉంటాయి. కొండొకచో పోట్లాటలు కూడా. చొరవగా మాట కలిపేవాళ్ళు కొందరైతే, మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయే వాళ్ళు మరికొందరు.

మనుషులు ఎంత ఎదిగినా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇష్టంగా గుర్తొచ్చే మొదటి జ్ఞాపకం బాల్యం. ఆ బాల్యంలో ఆడిన తొలి ఆటల్లో 'ఛుక్ ఛుక్ రైలు వస్తోంది..' లేకుండా ఉంటుందా? అలా రైలుకీ బాల్యానికీ అవినాభావ సంబంధం. నావరకు నాకు తొలి రైలు ప్రయాణం ఓ అపురూప జ్ఞాపకం. రైలంటే ఎలా ఉంటుంది? మొదలు, రైలు ఎందుకు కూత పెడుతుంది? వరకూ సవాలక్ష సందేహాలు అప్పట్లో. పెద్దైపోయాక ఎవరినీ అడగక్కర్లేకుండానే జవాబులు తెలుసుకునే వీలున్నప్పుడు బుర్రలో ప్రశ్నలే పుట్టవెందుకో.

రైల్వే ట్రాక్ ల పక్కన బాల్యాన్ని గడిపిన భాగ్యశాలుల రైలు జ్ఞాపకాలు రాయడం మొదలు పెట్టారంటే అది అలా ఎక్ష్ప్రెస్ రైలులా సాగిపోవలసిందే. ట్రాక్ మీద నాణాన్ని ఉంచి నాణెం నాణ్యతని పరిశీలించడం మొదలు రైల్లో వెళ్ళే ముక్కూ మోహం తెలియని వందలాదిమందికి వీడ్కోలు చెప్పడం వరకూ వీళ్ళు ఆడని ఆట ఉండదు. నా చిన్నప్పుడు మా బాబాయ్ వాళ్ళు కొన్నాళ్ళ పాటు రైల్వే ట్రాక్ పక్కన ఉన్నారు. అప్పట్లో నేనూ ఈ ఆటలన్నీ ఆడానని చెప్పడానికి గర్వ పడుతున్నాను.

అన్నట్టు రైలు పెట్టెలు లెక్క పెట్టే ఆట ఎంత బాగుంటుందో. కొత్తగా అంకెలు నేర్చుకునే వాళ్ళ చేత గూడ్సు బండి పెట్టెలు లెక్క పెట్టించాలి. అప్పుడింక వాళ్లకి అంకెలు, సంఖ్యల్లో తిరుగుండదు. కాకపొతే, మామూలు రైలు పెట్టెలని లెక్క పెట్టడంలో ఉండే సరదా, గూడ్సు రైలు పెట్టెలని లెక్క పెట్టడంలో ఉండదుగాక ఉండదు. తిరిగి నవ్వే, చెయ్యూపే ఒక్క ముఖమూ కనిపించక పోతుంటే అలా మన పాటికి మనం పెట్టెలు లెక్కెట్టుకోడం భలే విసుగు.


రైలు ప్రయాణంలో కలిసే బంధుత్వాలు భలే చిత్రంగా ఉంటాయి. నిమిషాల్లో ప్రాణ స్నేహితులు అయిపోయిన వాళ్ళే, రైలు దిగిన మరుక్షణం పరాయివాళ్ళు అయిపోతారు. కొండొకచో రైలుబండి నిజమైన స్నేహాలనీ కూర్చి పెట్టినప్పటికీ, అధికశాతం రైలు స్నేహాలు అవసరార్ధపు స్నేహాలే. అసలు ఈ రైలు పరిచయాల్లో తమ తమ నిజ వివరాలని పంచుకునే వాళ్ళు ఎందరు ఉంటారా అనే విషయం మీద ఓ చిన్న పరిశోధన చేస్తే ఎలా ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి.

రైల్లో పైతరగతి ప్రయాణాల కన్నా జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణాలు భలే బాగుంటాయి. నాకైతే సరదాగా కూడా అనిపిస్తాయి. అయితే ప్రయాణ కాలం ఓ రెండు గంటలు మించకూడదు. పైతరగతి పెట్టెల్లో ప్రయాణికులు మూతులు బిగించుకుని కూర్చుంటే, జనరల్లో ప్రయాణికులు కాసేపు వీళ్ళు మౌనంగా ఉంటే బాగుండు అనిపించే విధంగా మాట్లాడుతూనే ఉంటారు. అసలిక్కడ దొర్లని టాపిక్ అంటూ ఉండదు. ఉన్న ఆ కొంచం జాగాలోనే కూసింత సర్దుకుని నిలబడ్డ వాళ్లకి సీటివ్వగల ఔదార్యం జనరల్ ప్రయాణికుల సొంతం.

అయితే, కొంచం ముందుగా బండెక్కిన ఒకే ఒక కారణానికి సామాను పరుచుకుని సీట్లు ఆక్రమించుకుని నిద్ర నటించే వాళ్ళూ ఇక్కడ కనిపిస్తారు. సమస్త వ్యాపారాలు చేసేవాళ్ళూ తమ తమ వస్తువులని 'కారు చౌక'గ అమ్మేది జనరల్ కంపార్ట్మెంట్ లోనే. తాజా కూరలు, పళ్ళు మొదలు పైరేటెడ్ డిస్కుల వరకూ ఏం కావాలన్నా దొరికే సూపర్ మార్కెట్ ఈ జనరల్ కంపార్ట్మెంట్. రౌడీయిజం మొదలు రాజకీయాల వరకూ ఏ విషయాన్ని గురించైనా అలవోకగా చెప్పేయగల ఎన్ సైక్లోపీడియా కూడా ఇదే.

మన సినిమాలు, సాహిత్యం రైలు ప్రయాణాన్ని ఏమాత్రం చిన్నచూపు చూడలేదు. అలా చేస్తే రైలుబండిని ప్రేమించే జనం తమని చిన్న చూపు చూస్తారేమోనన్న భయసందేహం ఇందుకు కారణం కావొచ్చు. అందుకే ఎందరో నాయికా నాయకులు రైలు ప్రయాణంలో కలుసుకున్నారు. మరికొందరు విడిపోయారు. ఇంకొందరి జీవితాలు ఊహించని మలుపు తిరిగి పాఠ/ప్రేక్షకులని ఉక్కిరిబిక్కిరి చేశాయి. రైలు ప్రయాణాల నేపధ్యంలో వచ్చిన కథలు, కార్టూనులకైతే లెక్కేలేదు. అసలు రైలు ప్రయాణాన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా ఉంటారా?

గురువారం, డిసెంబర్ 23, 2010

నాయికలు-హేమసుందరి

మనిషికెప్పుడూ తనకి దొరకని దానిని ఎలా అయినా సాధించుకోవాలన్న తపన ఉంటుంది. అలా సాధించుకునే ప్రయత్నంలో ఎదురయ్యే కష్టనష్టాలని భరించడం పెద్ద పనిగా అనిపించదు. రాజసౌధంలాంటి విశాలమైన భవనంలో విలాస జీవితం గడిపే హేమసుందరికి అందుబాటులో లేనివంటూ లేవు, పిడికెడు ప్రేమాభిమానాలు తప్ప. వాటిని తనకి అందించాడనే ఒకేఒక్క కారణంతో ఆమె ఓ సామాన్యుడైన రంగనాయకుడి తో ప్రేమలో పడిపోయింది. పీకలోతు కష్టాలని ఆనందంగా భరించింది.

నవరసాలనూ తగు పాళ్ళలో రంగరించి నలభై నాలుగేళ్ల క్రితం పిలకా గణపతి శాస్త్రి రాసిన 'విశాల నేత్రాలు' నవలలో నాయిక హేమసుందరి. కాంచీ రాజ్య ప్రధాన నగరం నిచుళాపురంలో పేరుగాంచిన వృద్ధ వేశ్య శృంగారమంజరి చిన్న కూతురు. నిజానికి ,హేమ శృంగారమంజరికి సొంత కూతురు కాదు. తను యవ్వనంలో ఉండగా ఇద్దరు బాలికలని చేరదీసి పెద్ద చేసింది శృంగారమంజరి. వారిలో ఒకరు మాణిక్యవల్లి మరొకరు హేమసుందరి.

శృంగారమంజరి పెంపకంలో లోటన్నది ఎరగకుండా పెరిగింది హేమసుందరి. సకల కళలనీ అభ్యసించింది. దొరకనిదల్లా ప్రేమ. తన సొంత వాళ్ళెవరో తనకి తెలీదు. చుట్టూ ఉన్న వారెవరూ తనవారు కాదు. తల్లి తనని వృత్తిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే రంగనాయకుడి కంట పడింది హేమసుందరి. సాముగరిడీలలో దిట్టైన రంగనాయకుడికి ఓ అందమైన ఆడపిల్లని దగ్గరనుంచి చూడడం, ఆపై చూపు తిప్పుకోలేక పోవడం అదే తొలిసారి.

అది మొదలు రంగనాయకుడి జీవితం మారిపోతుంది. హేమసుందరి దర్శన భాగ్యం కోసం తపించిపోతాడతడు. హేమసుందరి తనని ప్రేమించడం తన అదృష్టంగా భావిస్తాడు. రాత్రిపూట శరీరానికి మసి పూసుకుని శృంగార మంజరి భవంతిలోకి ప్రవేశించడానికి సైతం వెనుకాడడు అతడు. మరోపక్క, కేవలం తనకోసం రంగనాయకుడు అంతటి సాహసాలు చేస్తుండడంతో అతనిపై పుట్టిన ప్రేమ రెట్టింపవుతుంది హేమసుందరికి.

తన ఇంట్లో ఎవరినీ మనస్పూర్తిగా నమ్మని హేమసుందరి, మొదటిసారిగా అక్క మాణిక్యవల్లిని నమ్మి తన ప్రేమకథ చెబుతుంది. అప్పటివరకూ తనని మించిన అందగత్తె అయిన హేమ తన వ్యాపారానికి అడ్డం వస్తుందని మథన పడుతున్న మాణిక్యవల్లికి హేమని అడ్డు తొలగించుకోడానికి ఇదో చక్కని అవకాశంగా కనిపిస్తుంది. చెల్లెలు రంగానాయకుడితో కలిసి శ్రీరంగం పారిపోడానికి పరోక్షంగా సహకరిస్తుంది మాణిక్యవల్లి.

తనకంటూ ఒక ఇల్లు, భర్త, సంఘంలో గౌరవం.. ఈ కొత్త జీవితం ఎంతగానో సంతృప్తిని ఇస్తుంది హేమసుందరికి. వివాహం చేసుకోకపోయినా శ్రీరంగంలో భార్యాభర్తలుగా చెలామణి అవుతారు హేమ, రంగనాయకుడు. అయితే ఆ సంతృప్తి, సంతోషం ఎంతోకాలం ఉండవు. ఒక్కసారిగా దొరికిన స్వేచ్ఛ రంగనాయకుడిని వ్యసనపరుడిని చేస్తుంది. అత్యంత సౌందర్యవతి అయిన హేమ పక్కనే ఉన్నా పరస్త్రీ వ్యామోహంలో పడతాడు. ఇదేమని ప్రశ్నించిన హేమకి జవాబు దొరకదు.

రంగనాయకుడి వ్యసనాలని భరిస్తున్న హేమకి, అతడికి వృద్ధుడైన రామానుజ యతితో ఏర్పడ్డ అనుబంధం మాత్రం కలవరాన్ని కలిగిస్తుంది. రంగనాయకుడు సన్యసిస్తాడేమో అనే సందేహం ఆమెని యతిని కలుసుకునేలా చేస్తుంది. తనకి పిడికెడు ప్రేమని అందించిన రంగనాయకుడి పై సముద్రమంత ప్రేమని కురిపించిన హేమసుందరి జీవితం ఏ మలుపు తిరిగింది? ఆమెకి తను కోరుకున్నది దొరికిందా? అన్నది నవల ముగింపు. నవల పూర్తయ్యాక కూడా ఏళ్ళ తరబడి వెంటాడే పాత్ర హేమసుందరి.

బుధవారం, డిసెంబర్ 22, 2010

దీక్షలు

రాష్ట్రంలో ప్రస్తుతం దీక్షల సీజన్ నడుస్తోంది. నల్లని దుస్తుల్లో అయ్యప్ప భక్తులు, ఎర్రని దుస్తుల్లో కనకదుర్గ భక్తులు నిష్టగా రోజులు గడుపుతున్నారు. పూజలు, ఉపవాసాలు, భజనలతో దీక్షలు కొనసాగించే భక్తులని చూడడం కొత్త విషయం కాదు, ఎందుకంటే ప్రతి సంవత్సరం మన చుట్టూ వీళ్ళు కనిపిస్తూనే ఉంటారు. కొందరైతే క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం దీక్ష తీసుకుంటూ ఉంటారు కూడా.

ఈ దీక్షకి కారణం కేవలం భక్తి మాత్రమే కాదంటే ఆశ్చర్యపడనవసరం లేదు. భక్తి తో పాటుగా ఎవరి వ్యక్తిగత కారణాలు వాళ్లకి ఉంటూ ఉంటాయి. ఆయా కారణాలు వాళ్ళని దీక్ష దిశగా ప్రేరేపిస్తూ ఉంటాయి. అయ్యప్ప దీక్షలు పాపులర్ అయ్యాక భవాని దీక్ష, వెంకటేశ్వర స్వామి దీక్ష లాంటివి నెమ్మదిగా జనంలోకి వచ్చాయి. ఇప్పుడిప్పుడు చిన్న చిన్న ఆలయాల్లో కూడా దీక్షలు ఇవ్వడం, భక్తులు వాటిని స్వీకరించడం జరుగుతోంది.

అరుదుగా మాత్రమే కనిపించే రెండో రకం దీక్షలూ ఇప్పుడు రాష్ట్రం నలుమూలలా చర్చనీయం అయ్యాయి. అవును, రాజకీయ నాయకులకి రైతుల సమస్యలు కళ్ళకి కనిపించడంతో వారిలో ధర్మాగ్రహం పెల్లుబికి నిరసన దీక్షకి కూర్చునేలా చేశాయని ఆయా నాయకుల అనునూయులు టీవీ చానళ్ళలో చెబుతున్నారు. ప్రస్తుతం నిరసన దీక్ష జరుపుతున్న ఇద్దరు నాయకుల అంతిమ లక్ష్యమూ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోడమే అన్నది ఏ ఊళ్ళో ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెప్పే మాట.

రైతుల కోసం దీక్ష చేపట్టిన ఇద్దరు నాయకుల్లోనూ ఒకాయన తనకి అపారమైన పాలనానుభావం ఉందన్న విషయాన్ని సందర్భం వచ్చినా రాకపోయినా ఇష్టంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. రాష్ట్రానికి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన తన అనుభవాన్ని పాలక పక్షం గుర్తించడం లేదన్నది ఆయన నోటినుంచి తరచూ వినిపించే ఫిర్యాదు. సాంకేతికతని అందిపుచ్చుకుని రాష్ట్రానికి బంగారు తాపడం చేసేయాలనే కుతూహలం కారణంగా కావొచ్చు, ఆయన తన పాలనాకాలంలో వ్యవసాయం లాంటి చిన్నచిన్న విషయాలపై దృష్టి పెట్టలేకపోయారు.

ఇప్పుడు తానున్నది అధికారంలో కాక ప్రతిపక్షంలో కావడంతో రైతులవంటి బడుగు జీవుల కష్టాలని గుర్తించ గలుగుతున్నారు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఆయనకి ముఖ్యమంత్రి అన్ని రకాల పళ్ళూ తెచ్చి తినిపించబోతుండగా, ఆయన వద్దు వద్దంటూ తన పక్క మంచం మీద మరణ శయ్య మీద ఉన్న రైతుకు వాటిని తినిపించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్టుగా ఓ దినపత్రిక నిన్నటి సంచికలో వచ్చిన కార్టూను చూసి నవ్వాపుకోడం నా వల్ల కాలేదు. కార్టూన్ అంటేనే వ్యంగ్యం అయినప్పటికీ, మరీ ఇంత వ్యంగ్యమా?

తన 'బలాన్ని' నిరూపించుకోడానికి, ఏ చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశాన్ని వదులుకోకుండా ఉండడానికి సర్వదా సిద్ధంగా ఉన్న యువనేత సైతం రైతులకోసం దీక్ష మొదలు పెట్టారు. వేషాలు లేక మేకప్పులు వెలిసిపోయిన సినిమా వాళ్ళు, రాజకీయ ఊసరవల్లులు ఆయనకి మద్దతు పలికారు, పలుకుతున్నారు. ఆయన సొంత మీడియా చాన్సుని దొరకబుచ్చుకుని 'నేల ఈనిందా? ఆకాశం బద్దలయిందా?' అంటూ జనం మీద 'వార్తలని' రుద్దేస్తోంది.

ఈ యువనేత పదే పదే వల్లెవేసే 'మహానేత' పాలనలోనూ రైతుల ఆత్మహత్యలు ఆగలేదన్నది నివేదికల సాక్షిగా తేలిన నిజం. మరి ఆయన మొదలు పెట్టిన పథకాలు ఎవరికి చేరాయన్నది ఒక్కొక్కటిగా బయట పడుతూనే ఉన్నాయి. అటు ప్రభుత్వానికీ, ఇటు ప్రతిపక్షాలకీ తన సమస్యలమీద చిత్తశుద్ధి లేదన్న సంగతి రైతుకి మళ్ళీ మళ్ళీ అర్ధమవుతోంది. తనని చుట్టుముట్టిన కష్టాలని మర్చిపోయి, కాసేపు హాయిగా నవ్వుకోడానికైనా ఈ చిత్తశుద్ధి లేని దీక్షలు రైతులకి ఉపయోగ పడుతున్నందుకు మనలాంటివాళ్ళం సంతోష పడాలి.

మంగళవారం, డిసెంబర్ 21, 2010

హాస్య కథలు

పుస్తకం పేరే 'హాస్య కథలు' పైగా రాసిందేమో 'శ్రీవారికి ప్రేమలేఖ' లాంటి అద్భుత హాస్య చిత్రానికి కథ అందించిన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి. ఇక, కథలు ఎలా ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. రెండేళ్ళ క్రితం ఈనాడు ఆదివారం లో వారానికో కథ చొప్పున ప్రచురితమైన ఈ కథలని శ్రీధర్ కార్టూనులతో సహా పుస్తకంగా ప్రచురించారు ఎమెస్కో వారు. మొత్తం ఇరవైనాలుగు కథల విందు భోజనం ఈ చిరు పొత్తం.

కథలన్నీ రచయిత్రి బాల్య జ్ఞాపకాలే. చిన్నారి విజయ చేసే చిలిపి పనులతో పాటు అమ్మమ్మ, ఆవిడ స్నేహితురాళ్ళ చాదస్తాలు, తాతగారి పాట్లు, బంధువుల చిత్ర విచిత్రమైన అలవాట్లు, వాటి కారణంగా విజయతో సహా చిన్న పిల్లలు పడ్డ పాట్లు.. ఇలా ప్రతి జ్ఞాపకాన్నీ ఓ అందమైన కథగా మలిచారు విజయలక్ష్మి. కొన్ని కథలు పూర్తి చేశాక ఓసారి ఆలోచిస్తే, అసలు ఈ జ్ఞాపకాన్ని కథగా మలచవచ్చు అన్న ఆలోచన ఎలా వచ్చి ఉంటుందబ్బా? అనిపించక మానదు.

అల్లుడుగారు రేడియో పంపించారు. వినకపోతే మర్యాద కాదు. కానీ వింటూ కూర్చుంటే ఇంట్లో పనులు జరగడం లేదు. ఎలా? అన్నది అమ్మమ్మ సమస్య. పక్కింటి వాళ్ళని బతిమాలి వాళ్ళని రేడియో ముందు కూర్చోపెట్టి తను వంట చేయడానికి వెళ్ళే ప్రహసనాన్ని ఆనందించొచ్చు 'ఆలిండియా రేడియో' కథలో. ఇంటికి కరెంటీ పెట్టించుకున్న అమ్మమ్మ పాట్లు, సెకండ్ హ్యాండ్ కారు కదలక మొరాయిస్తున్నా ఆ ప్రయాణానికే సంతోష పడిపోతూ 'కారాగిపోయినప్పుడు పిల్లలు తింటారు' అంటూ చిరుతిళ్ళు కట్టివ్వడం 'కారులో షికారు' కథ.

వియ్యంకుడు తెచ్చిన 'ఇంగ్లీష్' కూరలని ఇరుగుపొరుగు వాళ్లకి చూపించడం కోసం అమ్మమ్మ పడే ఆరాటం 'ఇంగ్లీష్ కూరలు' కథ చెబితే, కొత్తగా వెలిసిన అట్ల దుకాణం ఆవిడ కాపురంలో రేపిన కలతలేమితో 'దొంగ అట్లు' కథ చెబుతుంది. హోటల్ వాళ్ళు రేట్లు పెంచినా, ఇంట్లో వాళ్ళు పాత రేట్లే ఇచ్చి పిల్లల్ని పంపిస్తే అప్పుడు హోటల్ వాళ్ళు ఏంచేస్తారు? గుంటూరు శంకర్ విలాస్ యజమాని ఏం చేశాడో చెప్పే కథ 'పదిహేను పైసలకి ఆరుగురు పిల్లలు.'

మొత్తం మీద ఈ తొంభై ఆరు పేజీల పుస్తకం చదివిన వాళ్లకి డాక్టర్ సోమరాజు సుశీల రాసిన 'ఇల్లేరమ్మ కతలు' గుర్తు రాకుండా ఉండడం అసాధ్యం. అలా అని ఈ కథలు సుశీల కథలకి అనుకరణా కాదు. రెంటిలోనూ బాల్యమే కథ వస్తువు కావడం ఒక్కటే పోలిక. అలాగే వయసుతో పాటు రచయిత్రి ఆలోచనల్లో వచ్చే పరిణతినీ రెండు పుస్తకాలూ పఠితలకి పట్టిస్తాయి. (వెల రూ. 40, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు.)

ఆదివారం, డిసెంబర్ 12, 2010

అంకితం

"ఓ కాలమా.. ఇది నీ జాలమా..." పాట, "ఈ ఇల్లు చినబాబుది.. అతనికి ఇష్టం ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండొచ్చు..." అన్న జేవీ సోమయాజులు డైలాగు, "కొంతకాలం, నన్ను ఒంటరిగా వదిలేయండి నాన్నా.." అంటూ నాగార్జున చెప్పిన డైలాగు జమిలిగా బుర్రలో గింగిరాలు తిరుగుతున్నాయి. ఇప్పుడే మన సుమన్ బాబు నటించిన 'అంకితం' ప్రీమియర్ షో రెప్ప వాల్చకుండా చూడడం పూర్తయ్యింది.

మూడు వారాలుగా ఎదురు చూసిన వేళ రానే వచ్చింది. సాయంత్రం ఆరూ ఇరవై ఐదుకి షో ప్రారంభం అని ఈటీవీ షెడ్యూల్ లో చూడగానే, ఆవేళకి కచ్చితంగా టీవీ ముందు ఉండేలా ప్లాన్ చేసుకున్నాను. ఓ పూర్తి స్థాయి కామెడీ షో చూడ్డానికి సిద్ధపడ్డ నన్ను సెంటిమెంటుతో పిండేశాడు సుమన్ బాబు. దర్శకత్వం ఇంద్రనాగ్ దే అయినప్పటికీ, చిత్రీకరణలో సుమన్ బాబు మార్కు పూర్తిగా కనిపించింది.

ముందుగా ఊహించినట్టుగానే ఇది ఓ సిన్సియర్ పోలిస్ కానిస్టేబుల్ కథ. 'నువ్వేకావాలి' సినిమాలో సునీల్ చెప్పిన కామెడీ డైలాగు "రోగిష్టి తల్లి, పాపిష్టి తండ్రి, పారిపోయిన తమ్ముడు, లేచిపోయిన చెల్లెలు..." గుర్తుంది కదా.. అచ్చం అలాంటి సెటప్. కాకపొతే ఇక్కడ తల్లి లేదు. తండ్రి రోగిష్టి. ఇద్దరు చెల్లెళ్ళు, ఓ తమ్ముడు, వీళ్ళందరి బాధ్యతనీ ఆనందంగా భరించే విజయ్ బాబు (సుమన్ బాబు). ఇంటిళ్ళపాదికీ, వాళ్ళ వాళ్ళ అభిరుచులకి అనుగుణంగా వండి వార్చడం మొదలు, బట్టలు ఇస్త్రీ చేయడం వరకూ ప్రతి పనినీ యెంతో ఆనందంగా చేస్తాడితడు.

మళ్ళీ సునీల్ ప్రస్తావన తప్పడం లేదు. 'మర్యాద రామన్న' లో సునీల్ కి ఉన్న లాంటి సైకిల్ ఒక్కటే విజయ్ బాబు ఆస్తి. ఆ సైకిల్ మీద తిరుగుతూ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇవాళ్రేపు హోంగార్డులు కూడా హీరో హోండాలు మైంటైన్ చేస్తున్నారు కదా అనకూడదు. ఇతను సిన్సియర్ కానిస్టేబుల్ మరి. రోజూ ఆ సైకిల్ ని అరిగిపోయేలా తుడిచేక కానీ దాన్ని బయటకి తీయడు.

విజయ్ బాబు మీద పడి తినడం అతనికి కొత్త సమస్యలు తేవడం తప్ప, ఇంట్లో ఎవరూ అతనికి లేశమైనా సాయం చేయరు. పాపం, అతని ఇబ్బందులు పట్టించుకోకుండా మరదలు లావణ్య ప్రేమిస్తున్నా అంటూ వెంటపడుతూ ఉంటుంది, అచ్చం మన తెలుగు సినిమా హీరోయిన్లా. కాకపొతే ఈమె 'సుమన్ మార్కు' హీరోయిన్.. లంగావోణీ, వాలుజడ, వంటినిండా నగలు, జడనిండా పూలు.. ఇదీ అలంకరణ. ('అనుబంధం' సీరియల్లో కిన్నెర గుర్తొచ్చింది).

పెద్ద చెల్లెలి పెళ్ళికోసం స్నేహితుడు రాజు దగ్గర చేసిన అప్పు ఎలా తీర్చాలా అని మధన పడుతూ ఉండగానే, ఆ చెల్లెలు వితంతువుగా తిరిగి రావడం జరిగిపోతుంది. పులి మీద పుట్రలా చిన్న చెల్లెల్ని తన స్వహస్తాలతోనే బ్రోతల్ కేసు కింద అరెస్టు చేయాల్సి వస్తుంది. అది చాలదన్నట్టు విజయ్ బాబు కి బ్రెయిన్ ట్యూమర్ అని తెలియడం జరిగిపోతుంది. (సినిమా అయితే ఇక్కడ ఇంటర్వల్ పడి ఉండేది, బహుశా..).

తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా బలవంతం చేస్తున్న లావణ్య కి తప్పని పరిస్థితిలో తన జబ్బు విషయం చెప్పేస్తాడు విజయ్ బాబు. ఇంట్లో వాళ్ళంతా విజయ్ బాబు ని 'హిట్లర్' అంటూ నానా మాటలూ అంటున్న వేళ, ఉండబట్టలేక అతని జబ్బు విషయం నోరు జారేస్తుంది లావణ్య. తన వాళ్ళ కళ్ళలో కన్నీరు చూడలేని విజయ్ బాబు ఇది భరించలేడు. లావణ్య తో పోటీపడి, తన కిడ్నీ అమ్మేసి తన బాధ్యతలన్నీ తీర్చేసుకుని, బతికినంత కాలం ఒంటరిగా బతుకుతానంటూ సుదూరతీరాలకి విజయ్ బాబు బయలుదేరడం, ఆవెంటే లావణ్య "ఉన్నంతకాలం తోడుంటా.." అంటూ తనూ బయలుదేరడం ముగింపు.

ఈ కథలో కాంట్రడిక్షన్స్ బోలెడు. విజయ్ బాబు ఓ నిజాయితీ పరుడైన కానిస్టేబుల్. కానీ తన చెల్లెలికి 'కట్నం' ఇచ్చి పెళ్లి చేయడం తన బాధ్యతగా భావిస్తాడు. లంచం తీసుకోడు కానీ, తప్పని పరిస్థితిలో భారీ బహుమతిని అంగీకరిస్తాడు. సమస్యలకి ఎదురు నిలబడాలని ఉపన్యాసాలు ఇస్తాడు కానీ, తన సమస్యల పరిష్కారం కోసం తానుగా ఎలాంటి ప్రయత్నాలూ చేయడు. తనకి జబ్బు అని తెలిశాక, డబ్బు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తాడే కానీ, తన వాళ్ళలో స్థైర్యం నింపడాన్ని గురించి ఆలోచించడు.

చిరంజీవి సినిమాలు 'హిట్లర్' 'విజేత' నాగార్జున 'గీతాంజలి' చూసి ప్రేరణ పొంది రాసినట్టు అనిపించిన ఈ కథతో ఓ ముప్ఫై ఏళ్ళ క్రితం సినిమా తీసి ఉంటే బ్రహ్మాండంగా ఆడి ఉండేది. ప్చ్.. బ్యాడ్ టైమింగ్. పోలిస్ పాత్రలో ఆశించే రఫ్నెస్ సుమన్ బాబులో కనిపించలేదు. ఇంట్లోనే కాదు, విధి నిర్వహణలోనూ అదే పాసివ్ నేచర్. టీవీ వాళ్లకి అబద్ధం చెప్పి (అదికూడా ఈటీవీనే) ఓ కిడ్నాప్ కి తెర దింపడం, ఓ లెక్చర్ ఇచ్చి విలన్ ని మంచివాడుగా మార్చేయడం పోలిస్ గా అతను సాధించిన విజయాలు.

కథలోనే మెలోడ్రామా విపరీతంగా ఉందనుకుంటే, నటీనటుల నటన కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. ఈ ప్రీమియర్ షో కి స్పాన్సర్లు 'క్లోజప్' వాళ్ళు. అందుకేనేమో క్లోజప్ దృశ్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు నచ్చినవి కొన్ని సన్నివేశాల్లో సుమన్ బాబు ధరించిన చొక్కాలు (అబ్బే ఖాకీవి కాదు, యూనిఫాం లో అరుదుగా మాత్రమే కనిపించాడు), వాళ్ళ ఇంట్లో గోడకి తగిలించిన ఒక హ్యాంగింగ్ ఇంకా కొన్ని సన్నివేశాల్లో వినిపించిన నేపధ్య సంగీతం. నచ్చని వాటి గురించి ఒక టపాలో రాయడం అసాధ్యం. దీనిని థియేటర్ లో ఎందుకు రిలీజ్ చేయలేదో తెలీదు మరి. చాలా బోలెడు మంది స్పాన్సర్లని సంపాదించిన ఈటీవీ ప్రకటనల విభాగం వారిని మాత్రం ప్రత్యేకంగా అభినందించాల్సిందే.

గురువారం, డిసెంబర్ 09, 2010

కారణం...క్రిములు...

"నోటి దుర్వాసన మీకు చింతా? కారణం.. క్రిములు.." అంటూ వచ్చే వాణిజ్య ప్రకటన రెండు రోజులుగా తరచూ గుర్తొస్తూ ఉంది. ఇది ఎప్పుడు మొదలయ్యిందంటే, ఓ ప్రముఖ సిని నిర్మాత "కొందరు దర్శకులు తెలుగు సిని పరిశ్రమకి క్రిములుగా మారారు" అంటూ సుదీర్ఘంగా ఆవేదన చెందడాన్ని టీవీలో చూసినప్పటి నుంచీ. ఆయన తాజాగా నిర్మించిన ఓ భారీ సినిమా అంచనాల మేరకి ఓపెనింగ్స్ తెచ్చుకోకపోవడంతో, కేవలం ఆ దర్శకుడిని మాత్రం అనలేక "కొందరు" అంటూ వ్యాఖ్య చేశాడని వినికిడి.

నిజానికి సినిమానష్టాల గురించి చర్చ ఇవాల్టిది కాదు. ఎప్పటినుంచో నడుస్తున్నదే.. కాకపొతే సదరు అగ్ర నిర్మాత తన ఆవేదనని ఆగ్రహంగా ప్రకటించడంతో మరోసారి చర్చకి వచ్చింది అంతే. ముఖ్యంగా, దర్శకుల హవా తగ్గిపోయాక, నిర్మాతల పెత్తనంలో ఉన్న తెలుగు సినిమా పగ్గాలు, వరుస విజయాలు సాధించిన కొందరు యువ దర్శకుల కారణంగా తిరిగి దర్శకుల చేతిలోకి వచ్చిన తరుణంలో వచ్చిన ప్రకటన కాబట్టి, దీనిని కేవలం ఓ నిర్మాత ఆవేదనగానో, ఆక్రోశంగానో కొట్టి పారేయలేం.

తెలుగు సినిమా గతిని పరిశీలిస్తే, సినిమా నిర్మాణం పెత్తనం మొత్తం ఉంటే నిర్మాత చేతిలో ఉంటోంది. లేని పక్షంలో అగ్ర హీరోలు లేదా దర్శకుల చేతిలో ఉంటోంది. అంతే తప్ప సమిష్టి కృషి అన్నది అరుదుగా మాత్రమే కనిపిస్తోంది. మరి ఇరవైనాలుగు కళల సమాహారమైన సినిమాని నిర్మించడం అన్నది పూర్తిగా ఒక వ్యక్తి అధీనంలో ఉంచడం (డబ్బు ఎవరిదైనప్పటికీ) ఎంతవరకూ సమంజసం? సినిమాకి పని చేసే ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేయనక్కరలేదా?

ప్రముఖ స్టూడియోలు సినిమాలు తీసిన రోజుల్లో, నటీనటులు, సాంకేతిక నిపుణులని నెల జీతానికి నియమించుకుని సినిమా పూర్తయ్యేవరకూ వాళ్ళ చేత పని చేయించుకునేవి. అలా వచ్చిన సినిమాల్లో హిట్టైన వాటి పుణ్యమాని అగ్ర కథానాయకులుగా వెలుగొందిన వాళ్ళు తర్వాతి కాలంలో సినిమాని శాసించారు. నిర్మాత మొదలు, కథారచయిత, కథానాయిక ఎంపిక వరకూ ప్రతి ఒక్కటి వారి కనుసన్నల్లో జరిగేది. కొన్ని సినిమాలు ఫెయిలవ్వడంతో, సదరు తారల ప్రభ కాసింత మసకబారడం, అదే సమయంలో కొత్త దర్శకులు తక్కువ బడ్జెట్ తో విజయాలు సాధించడంతో సినిమా నావకి దర్శకుడే చుక్కాని అనే ట్రెండ్ వచ్చింది.

తర్వాత జరిగిన శాఖాచంక్రమణాల్లో సినిమా నావ చుక్కాని అనేక చేతులు మారి మళ్ళీ దర్శకుల చేతుల్లోకి వచ్చింది. కాలంతో పాటు మారిన విలువలు డబ్బు విలువని మరింత పెంచేశాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకైనా వెనుకాడని నిర్మాతలు బయలుదేరారు. డబ్బు ఖర్చు విషయంలో నిర్మాతే రాజీ పడడం లేదు కాబట్టి, తనది కాని డబ్బుని ఖర్చు పెట్టడంలో దర్శకులూ రాజీ పడడం లేదు. ఒక్క సినిమా భారీ విజయం సాధించడంతో డబ్బు, అవకాశాలూ వచ్చి పడుతూ ఉండడంతో దర్శకులకి 'రేపు' గురించి ఆలోచన ఉండడం లేదు.

నిజానికి ఇప్పుడు సినిమా నిర్మాణంలో బాధ్యత ఎవరికి ఉంది? నిర్మాత, దర్శకుడు, హీరో.. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ పరిధిలో మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప సినిమా గురించి సమిష్టిగా ఆలోచిస్తున్న దాఖలాలు లేవు. నిర్మాత ఖర్చుకి వెనకాడడు. దర్శకుడు ప్రతి ఫ్రేం నీ రిచ్ గా తీస్తాడు. హీరోకి తన సినిమా బడ్జెట్ తన పోటీ హీరో సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువగా ఉండాలి. ఆవిషయాన్ని తన అభిమానులు ఘనంగా చెప్పుకోవాలి. సినిమా షూటింగ్ ఎంత ఎక్కువ కాలం జరిగితే అంత గొప్ప.

తను డబ్బిచ్చి పెట్టుకున్న దర్శకుడు 'క్రిమి' గా మారాడన్న విషయం నిర్మాతకి మొదట్లోనే ఎందుకు తెలియలేదన్నది ప్రశ్న. రోజూ ఎంత షూటింగ్ జరుగుతోందో తెలుసుకుని, ఇంత మాత్రమే ఎందుకు జరుగుతోందని గట్టిగా అడిగితే, అదేదో "తోటకూర నాడే.." సామెతలా విషయం ఇంత దూరం రాదు కదా. హీరోకి నటన రాకపోవడం వల్ల అనో, హీరోయిన్ షూటింగుకి ఆలస్యంగా వచ్చిందనో, హాస్య నటుడు మధ్యలోనే షూటింగ్ ఎగ్గొట్టి వెళ్లి పోయాడనో... ఇలా తనకి ఎదురైన సమస్యని దర్శకుడు నిర్మాతకి చెప్పి ఉండేవాడు, ఇద్దరూ కలిసి పరిస్థితి చక్కదిద్దే వారు.

ఊహాత్మకమైన ప్రశ్నే అయినా, జవాబు కష్టం కాదు. ఎంత ఖర్చు చేయించినా, సినిమా విజయవంతం అయ్యి పెట్టిన డబ్బు పిల్లాపాపలతో తిరిగొస్తే, నిర్మాతకి దర్శకుడు 'క్రిమి' గా కాక 'దేవుడి'గా కనిపించి ఉండేవాడే కదా? ఇది దర్శకుడిని సమర్ధించడం కాదు. కానీ దర్శకుడిని మాత్రమే బాద్యుడిని చేయడం ఎంతవరకూ సబబు? దర్శకుల మీద వ్యంగ్యాస్త్రాలు వేయడం సమర్ధనీయమేనా? టిక్కెట్ కొని సినిమా చూసే ప్రేక్షకుడికి తెర వెనుక పెత్తనం ఎవరు చేశారన్నది అనవసరం. సినిమా బాగోకపోతే, టిక్కెట్ కి పెట్టిన డబ్బు వృధా అనిపిస్తే, ప్రేక్షకుడి దృష్టిలో అంతటి చెత్త సినిమా ఇచ్చిన ప్రతి ఒక్కరూ క్రిములే...

శుక్రవారం, డిసెంబర్ 03, 2010

తోచీతోచని కబుర్లు

ఏమిటో.. ఏమీ తోచకుండా ఉంది. అలా అని పని లేకుండా లేదు. ఉంటూనే ఉంది.. అయినా తోచీతోచకుండా ఉంది. ఏ తోడల్లుడి పుట్టింటికన్నా వెళ్దామంటే ఎవరూ లేరు మరి. 'తోచీతోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళింది' అని కదా సామెత. మరి తోచీ తోచనయ్య చేయాల్సింది ఇదే కదా. చదవాల్సిన పుస్తకాలు 'మా సంగతేమిటి?' అని ప్రశ్నిస్తున్నాయ్. ఉన్నవి చాలనట్టు మొన్ననే ఓ చిన్న పుస్తక ప్రదర్శనకి వెళ్లి ఓ నాలుగు కొత్తవి తెచ్చా. లాభం లేదు, కొంచం స్పీడు పెంచాలి, చదివే విషయంలో.

పుస్తక ప్రదర్శన అంటే గుర్తొచ్చింది. ఓ కొత్త స్నేహితుడితో కలిసి వెళ్లాను పుస్తకాలు చూడ్డానికి. మేము తెలుగు పుస్తకాలు చూడడం పూర్తి చేసి ఇంగ్లీష్ సెక్షన్ వైపు వెళ్లాం. పాల్ కోయిలోనీ, చేతన్ భగత్ నీ మధ్యలో వదిలేసిన విషయం నేను గుర్తు చేసుకుంటుండగానే, "ఏడుతరాలు లేదా అంకుల్?" అని వినిపించింది వెనుక నుంచి. నన్నేమో అని తిరిగిచూశా కానీ, కాదు. ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు, మేనేజర్ని అడుగుతున్నారు. భలే సంతోషం కలిగింది. ఇద్దరూ నేరుగా కాలేజీ నుంచి వచ్చేసినట్టున్నారు. తెలుగు పుస్తకం, అందులోనూ ఏ వ్యక్తిత్వ వికాసమో కాకుండా 'ఏడుతరాలు' అడిగారు కదా మరి. మేమింకా పుస్తకాలు చూస్తుండగానే వాళ్ళు కొనుక్కుని వెళ్ళిపోయారు.

"జగన్ పార్టీ ఎలక్షన్లో గెలుస్తుందంటారా?" ఉదయాన్నే ఫోన్ పలకరింపు. నాకు "ఆలు లేదు, చూలు లేదు.." సామెత గుర్తొచ్చింది. ఏమిటో సామెతల మీద నడుస్తోంది బండి. ఇంకా పార్టీ పెట్టడం, ఎన్నికలు జరగడం ఏదీ లేదు కానీ, అప్పుడే ఫలితాల గురించి చర్చలు. వైఎస్ తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన పైలట్ తాలూకు కుటుంబ సభ్యులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్ధం కావడం లేదు. అతని పిల్లలు కూడా "మా నాన్న పైలట్ కాబట్టి, ఎలాంటి శిక్షణా లేకుండానే మమ్మల్నీ పైలట్లు చేసేయాల్సిందే" అని ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదో మరి.

కూరగాయలు కొనడానికి బజారుకి వెళ్తే వినబడ్డ వ్యాఖ్యానాలు నవ్వు తెప్పించాయ్. "ముఖ్యమంత్రి మారినా కూరల రేట్లు తగ్గలేదు.." అనుకుంటున్నారు జనం. "సొరాజ్జం వస్తే మా ఊరి కానిస్టీబుకి బదిలీ అవుతుందా బాబయ్యా" అంటూ 'కన్యాశుల్కం' లో బండి వాడి ప్రశ్న గుర్తొచ్చేసింది. ఎవరి సమస్యలు వాళ్ళవి మరి. అసలే ఓ పక్క మంత్రుల్ని బుజ్జగిస్తూ, కప్పల తక్కెడని బేలన్స్ చేయడంలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రికి కూరల రేట్లు లాంటి చిన్న విషయాలు పట్టించుకునే తీరిక ఉంటుందా? వీళ్ళ పిచ్చి కానీ.

వంశీ 'మాపసలపూడి కథలు' ని సీరియల్గా తీస్తున్నారుట. మా గోదారి తీరంలోనే షూటింగ్ జరుగుతోందిట. త్వరలోనే మాటీవీ లో ప్రసారం అవుతుందిట. వర్ణన ప్రధానంగా సాగే కథలకి దృశ్య రూపం ఎలా ఇస్తారో చూడాలని కుతూహలంగా ఉంది. మరోపక్క వంశీ 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' పేరుతో అలనాటి హిట్ 'లేడీస్ టైలర్' కి సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నట్టు సమాచారం. తన కొత్తపుస్తకం 'ఆకుపచ్చని జ్ఞాపకం' కొన్నాను, ఫోటో ఆల్బంలా అందంగా ఉందీ పుస్తకం. కథలన్నీ చదివేసినవే. మళ్ళీ ఓసారి తిరగేయాలి.

థియేటర్ కి వెళ్లి సినిమా చూసి చాలా రోజులయ్యింది. చూడాలనిపించే సినిమా ఏదీ కనిపించడం లేదు. నా టేస్ట్ లో ఏదో లోపం ఉందేమో మరి. కనీసం నిర్మాణం లో ఉన్న సినిమాలు కూడా ఏవీ చూడాలనే కుతూహలాన్ని కలిగించడం లేదు. రాబోయేకాలం అంతా డీవీడీలతోనే కాలక్షేపం చేయాల్సి వచ్చేలా ఉంది. శ్రీరమణ సంపాదకత్వంలో వస్తున్న 'పత్రిక' మాసపత్రిక తాత్కాలికంగా మూతపడిందని ఎక్కడో చదివి కలుక్కుమనిపించింది. మిత్రులొకరు ఇదే విషయం ధృవీకరిస్తూ మెయిల్ రాశారు. మంచి పత్రికలకి రోజులు కావేమో. ఈ పరిణామం ప్రభావం పరోక్షంగా అయినా వర్తమాన తెలుగు సాహిత్యం మీద ఉంటుందనే అనిపిస్తోంది. ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాను కదా..

మంగళవారం, నవంబర్ 30, 2010

వద్దు వద్దంటే డబ్బు

ఈమధ్య మెయిల్ లోకి లాగిన్ అవుతుంటే అంతా లక్ష్మీ ప్రసన్నంగా ఉంటోంది. రోజూ ఒకటి రెండు మెయిళ్ళకి తక్కువ కాకుండా అభినందనలు చెబుతూ వస్తున్నాయి. ఎక్కడో నాకు పేరు కూడా తెలియని దేశంలో జరిగిన లక్కీ డ్రా లో నా మెయిల్ ఐడీ మిలియన్ల కొద్దీ డాలర్లు గెలుచుకుందనో, అలాంటిదే మరో దేశంలో ఎప్పుడూ పేరు వినని స్వచ్చంద సంస్థ మెయిల్ ఐడీలకి నిర్వహించిన డ్రాలో నాకు ప్రధమ బహుమతి వచ్చిందనో, టిక్కట్టే కొనక్కర్లేని లాటరీలో నాకు యూరోలో, పౌండ్లో వచ్చి పడ్డాయనీ.. ఈ తరహాగా ఉంటున్నాయి సందేశాలు.

అంతంత డబ్బు ఏం చేసుకోవాలో తెలియక పోవడంచేత మెయిల్ ఓపెన్ చేయాలంటే కూడా భయంగా ఉంటోంది. అభినందనల సందేశంతో పాటు, నా పూర్తి వివరాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్ తో సహా, పంపితే సొమ్ముని నేరుగా బ్యాంకులో వేసేస్తామని హామీలు వచ్చేస్తున్నాయి. అంతలేసి పెద్ద మొత్తాలని వద్దు వద్దని ప్రతిరోజూ చెప్పాలంటే ఎంత కష్టమో కదా. కోట్లు వచ్చి పడుతున్నా వద్దని చెప్పగల స్థిత ప్రజ్ఞత అలవరుచుకోవడం కూసింత కష్టంగానే ఉంది మరి.

నాకు విదేశీ స్నేహితులెవరూ లేరు. ఇంకో మాట చెప్పాలంటే నా స్నేహితులంతా భారతీయులే. మొన్నామధ్య ఓ విదేశీయుడు రాసిన మెయిల్ ఆసాంతం చదివితే నాకు ఆనందభాష్పాలు జలజలా రాలాయి. ఆయన మిలియన్ల కొద్దీ డాలర్లు సంపాదించాడట. వారసులెవరూ లేరుట. ఏదో అలా జీవితాన్ని గడిపేస్తూ ఉండగా, ఉన్నట్టుండి అనారోగ్యం చేసిందిట. హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్లు తనకి ప్రాణాంతకమైన జబ్బు చేసిందనీ, ఆ జబ్బుకి ప్రపంచంలో ఏ దేశంలోనూ చికిత్స లేదనీ, మరణం కోసం ఎదురు చూడమనీ చెప్పేశారుట.

"నేను పోయాక నేను సంపాదించిన ఆస్తినంతా ఏం చెయ్యను దేవుడా?" అని దేవుడిని అడిగితే, ఆయన కల్లో కనిపించి నమ్మకస్తుడు ఎవరికైనా రాసిచ్చేయమన్నాట్ట. అతను పాపం ఇంటర్నెట్లో వెతికితే, గూగులమ్మ ఈ ప్రపంచంలో నా అంత నమ్మకస్తుడెవడూ లేడని చెప్పిందిట. (చచ్చి నీ కడుపున పుట్టాలని ఉంది గూగులమ్మా). ఆస్తి తీసేసుకోమనీ, ఓ పాతిక శాతాన్ని చారిటీ కోసం ఉపయోగించమనీ, మిగిలింది నన్ను అనుభవించమనీ బతిమాలుతూ మరణ శయ్య మీద నుంచి మెయిల్ రాశాడాయన.

నేను కఠినమైన హృదయం కలవాడినీ, సిరిదా మోకాలడ్డే వాడినీ కావడం వల్ల, ఆ మెయిల్ ని 'స్పాం' అని మార్క్ చేసేశాను. బొత్తిగా ముక్కూ మోహం తెలియని అతని నుంచి అంత ఆస్తి అయాచితంగా తీసుకోబుద్ధి కాలేదు. లాటరీలో వచ్చిన బహుమతి మొత్తాలు తీసుకోమని మొహమాట పెడుతూ వస్తున్న ఉత్తరాలని కూడా 'స్పాం' లోకే తోసేస్తున్నాను. వారానికోసారి 'స్పాం' ని ఖాళీ చేసేటప్పుడు ఈ ఉత్తరాలన్నీ ఓసారి చదువుకుని నిట్టూర్చడం ఓ అలవాటుగా మారిపోయిందీ మధ్య.

కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే, నా స్నేహితురాలొకావిడకి ఆన్ లైన్ లాటరీలో మొదటి బహుమతి వచ్చిందంటూ ఓ ఉత్తరం వచ్చింది. ఓ రిఫరెన్స్ నెంబరు ఇచ్చి, జవాబులో ఆవిడ వివరాలతో పాటు ఆ నెంబరు కూడా ప్రస్తావించామని సూచించారు ఉత్తరం రాసిన వాళ్ళు. "అసలే డబ్బుకి ఇబ్బందిగా ఉంది..ఇదేదో బానే ఉంది" అనుకుంటూ ఆవిడ సమాధానం ఇవ్వబోతూనే, ఎందుకో సందేహం వచ్చి నాకు చూపించారా మెయిల్ ని. నాకూ డౌట్ వచ్చింది. ఆ నెంబరు కోట్ చేస్తూ నేనో మెయిల్ పంపాను వాళ్లకి. నాక్కూడా అభినందనలు వచ్చేయడంతో అనుమానం బలపడింది.

తెలిసిన విషయాలు ఏమిటంటే, ప్రపంచంలో ఏ లాటరీ సంస్థా కూడా టిక్కెట్ కొనకుండా బహుమతి ఇవ్వదు. ఆన్లైన్ లాటరీల పేరుతో జరుగుతున్న మోసాలు, బ్యాంకు అకౌంట్ నెంబర్లు తీసుకుని వాటి ఆధారంగా చేసే మోసాల గురించి తెలుసుకుని అవాక్కయ్యాం ఇద్దరం. అప్పటి నుంచీ మాకు తెలిసిన వాళ్ళలో ఎవరు ఆన్లైన్ లాటరీలో బహుమతి వచ్చిందని చెప్పినా, ఈ అనుభవాన్ని ఉదహరించడం మొదలు పెట్టాం. అప్పట్లో బాగా తక్కువగానే ఉండేవి కానీ, రాన్రాను ఈ తరహా మెయిల్స్ బాగా పెరిగిపోయాయి. తెలిసిన వాళ్ళే ప్రాణం పోతున్నా పది రూపాయలు ఇవ్వని ఈ రోజుల్లో, ముక్కూ మోహం తెలియని వాళ్ళు వేల డాలర్లు అయాచితంగా ఇచ్చేస్తామంటే నమ్మేయడమే??

ఆదివారం, నవంబర్ 28, 2010

ఉపోషం

"అమ్మా.. రేపు నేనుకూడా మీతోపాటు ఉపోషం ఉంటానమ్మా.. అన్నం తినకూడదు, అంతే కదా.. నేనుండగలనమ్మా.. జొరం వచ్చినప్పుడు అన్నం తినకుండా ఉంటున్నానుకదా.." ఇలా పరిపరివిధాలుగా చెప్పి కార్తీక సోమవారం నాడు నేను ఉపవాసం ఉండడానికి అమ్మని ఒప్పించేశాను నేను. అప్పుడు నేను మూడో తరగతి. పండగలు వచ్చాయంటే కొత్త బట్టలు కుట్టిస్తారనీ, పిండి వంటలు చేస్తారనీ, బోయినాలు ఆలస్యమవుతాయనీ, కార్తీక మాసం వచ్చిందంటే సోమవారాలు "ఉపోషాలు" ఉంటారనీ మాత్రమే తెలిసిన రోజులు.

ఆదివారం రోజంతా బతిమాలగా బతిమాలగా ఎట్టకేలకి సాయంత్రానికి నా ఉపవాస వ్రతానికి అమ్మ అనుమతి దొరికేసింది. "రేపు మళ్ళీ నువ్వు ఉపోషం కదా. అన్నం తినవు కదా.. పొద్దున్నే నీరసం వచ్చేస్తుంది. ఓ రెండు ముద్దలు ఎక్కువ తినాలి మరి.." అని ఆవేళ రాత్రి ఎప్పుడూ తినేదానికి డబుల్ కోటా తినిపించేసిందా.. ఓ పక్క నాకు ఆవులింతలొచ్చేస్తూ కళ్ళు బరువుగా వాలిపోతుంటే అప్పుడింక ఒకటే జాగ్రత్తలు. "ఇదిగో.. నువ్వు ఎప్పుడు ఉండలేకపోతే అప్పుడు నాకు చెప్పెయ్యాలి, తెలిసిందా. మధ్యాహ్నం ఆకలేసినా చెప్పెయ్యి. వంట చేసేస్తాను.." అంటూ.. నేను వింటూ వింటూ నిద్రలోకి జారుకున్నాను.

మర్నాడు పొద్దున్నే చెర్లో కార్తీక స్నానం చేసొచ్చేశామా. ఇంక గుళ్ళోకెళ్ళి అభిషేకం చేయించుకుని రావాలి. ఎప్పుడూ ఖాళీగా ఉండే శివాలయం ఆవేళ ఒకటే హడావిడిగా ఉంది. ఊళ్ళో వాళ్ళందరూ గుళ్ళోనే ఉన్నారు. "గుళ్ళో అభిషేకం ఆలస్యం అయ్యేలా ఉంది కదా బాబూ. నువ్వు పాలు తాగెయ్యి," అంది అమ్మ, తను మాత్రం కాఫీ తాగలేదు. అదే అడిగితే "కాఫీ తాక్కూడదమ్మా.. పాలు పర్వాలేదు.." అని చెప్పిందే కానీ, తను మాత్రం పాలు కూడా తాగలేదు. నాన్న నన్ను బడికి పంపాలనుకున్నారు కానీ, అమ్మ ఒప్పుకోలేదు, "ఉపోషం పూటా ఏం వెళ్తాడు.." అని.

గుళ్ళో అభిషేకం చేయించుకుంటే ప్రసాదం ఇవ్వకుండా ఉండరు కదా. అసలే పూజారిగారు మాకు బాగా తెలుసు కూడాను. కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు పళ్ళెంలో పెట్టి ఇచ్చారు. గుడి బయటకి రావడం ఆలస్యం, అమ్మ కొబ్బరి చెక్క ముక్కలుగా కొట్టీ, అరటి పళ్ళు ఒలిచీ నాకు అందించేసింది.."ప్రసాదం వద్దనకూడదమ్మా, తినాలి" అని కూడా చెప్పింది. నేను భక్తిగా ప్రసాదాన్ని ఆరగిస్తుండగా, "ఇవాళ మావాడు కూడా ఉపోషం" అని మిగిలిన భక్తులకి పుత్రోత్సాహంతో చెప్పింది అమ్మ. వాళ్ళంతా నా భక్తిని ఎంతగానో మెచ్చుకున్నారు. అంత చిన్నపిల్లలెవరూ ఉపోషాలు ఉండరుట.

ఇంటికి రాగానే మళ్ళీ బోల్డన్ని పాలు కాచి వాటిలో పంచదార, అటుకులు వేసి ఇచ్చింది నాకు. "అటుకులు తినొచ్చు, అన్నం తినకూడదు కానీ," అని చెప్పెయ్యడంతో నేను ఆ పాలటుకుల పని పట్టాను. మధ్యాహ్నం అవుతుండగా చాలా ప్రేమగా మళ్ళీ అడిగింది "అన్నం వండేయనా? చిన్న పిల్లలు ఉపోషం ఉండకపోయినా పర్వాలేదు" అని. నేనొప్పుకోలేదు. ఉపోషం ఉండాల్సిందే అనేశాను, కచ్చితంగా. "పిల్లాడు ఉపోషం ఉన్నాడు, ఎవర్నైనా పిలిచి బొండాలు తీయించండి" అని నాన్నకి పురమాయించేసింది.

బొండాలు చెట్టు దిగడం ఆలస్యం, రెండు బొండాల్లో నీళ్ళు నాచేత తాగించడమే కాదు, కొబ్బరి మీగడ అంతా తినిపించేసింది అమ్మ. "ఉపోషాలు ఉండేవాళ్ళు బొండాలు తాగొచ్చు" అనడంతో నేనింకేమీ మాట్లాడలేదు. సాయంత్రం కాఫీల వేళ నాకు పెద్ద గ్లాసుడు పాలిచ్చి, బిస్కట్లైనా, రస్కులైనా ముంచుకుని తినమంది. నేను "బిస్కట్లు తినొచ్చా?" అని సందేహం వెలిబుచ్చితే, "అన్నం తినకూడదు కానీ మిగిలినవి ఏవన్నా తినొచ్చు" అని మళ్ళీ హామీ ఇచ్చేసింది. పాలతో పాటు కాసిన్ని బిస్కట్లు నమిలాను.

దీపాల వేళ అయ్యిందో లేదో, హడావిడి పడుతూ పొయ్యి వెలిగించేసింది వంటకి, "అసలే పిల్లాడు కూడా ఉపోషం" అంటూ. నేనేమో వీధిలో మంచం వాల్చుకుని కూర్చుని, నక్షత్రం కనిపిస్తుందేమో అని కొబ్బరాకుల మధ్యనుంచి కళ్ళు చికిలించుకుని ఆకాశంలోకి చూడడం. అలా చూస్తూ నేను కాసిని పాలు తాగేసరికి అమ్మ వంట అవ్వడం, నక్షత్రం రావడం జరిగిపోయింది. ఇంకేముంది, పప్పు, కూర, పులుసు, పెరుగు వేసుకుని బోయినం చేసేశా. "ఇంతేనా ఉపోషం ఆంటే.. బామ్మెప్పుడూ బోల్డు హడావిడి చేసేస్తుంది. తను రాగానే చెప్పాలి, నేను ఉపోషం ఉన్నానని" అనుకుంటూ నిద్రపోయా.

మర్నాడు స్కూల్లో మేష్టారు అడిగారు, ముందు రోజు ఎందుకు రాలేదని. "కార్తీక సోమవారం కదండీ, ఉపోషం ఉన్నాను" అని చెప్పగానే ఆయన ఎంతగా మెచ్చుకున్నారంటే, నాకు ఫస్టు మార్కులొచ్చినప్పుడు కూడా ఆయనెప్పుడూ అంతగా మెచ్చుకోలేదు. అది మొదలు నేనెప్పుడూ ఉపోషం మిస్సవ్వలేదు.

బుధవారం, నవంబర్ 24, 2010

ఇందిరమ్మ రాజ్యం

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన అత్తగారు ఇందిర గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్నారు. రాష్ట్రాల విషయంలో, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ విషయంలో నాడు ఇందిర అనుసరించిన వైఖరే నేటి సోనియా వైఖరి. లేకపొతే, అన్నీ సక్రమంగానే ఉన్నప్పటికీ రాత్రికి రాత్రే రాయకీయం మారిపోవడం ఏమిటి? కొత్త ముఖ్యమంత్రి ఎంపిక నిర్ణయాన్ని సోనియాకే వదిలేస్తూ పార్టీ ఎమ్మెల్యేలంతా తీర్మానం చేయాల్సిన అగత్యం రావడం ఏమిటి?

రోశయ్య రాజీనామా ఆయన చెప్పినట్టుగా "వయోభారం, అనారోగ్యం" కారణాల వల్ల కాదన్నది రోజూ టీవీలు చూసే చిన్న పిల్లలు కూడా చటుక్కున చెప్పగలిగే సమాధానం. "అధిష్ఠానం నియమిస్తే ముఖ్యమంత్రిని అయ్యాను.. సోనియా నన్నీ బాధ్యత నిర్వహించమన్నంత కాలం ఈ కుర్చీలో ఉంటాను" అని గడిచిన పద్నాలుగు నెలల ఇరవైరెండు రోజుల్లో రోశయ్య లెక్కలేనన్నిసార్లు చెప్పారు. పెద్ద సమస్య వచ్చిన ప్రతిసారీ ఆయన చెప్పిన మొదటి మాట ఇదే.

వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆరేళ్ళ కాలాన్ని మినహాయిస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మిగిలిన కాలంలో పేరుకి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా పెత్తనం చేసింది అధిష్టానమే అన్నది బహిరంగ రహస్యమే. నిజానికి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సైతం ఆయన "ఒంటెత్తు పోకడల" పట్ల అధిష్ఠానం అసంతృప్తిని వ్యక్తం చేసిందన్న వార్తలు చాలాసార్లే వెలుగు చూశాయి. ఈ నేపధ్యంలో స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిని సోనియా ముఖ్యమంత్రిగా నియమిస్తారని ఆశించడం వృధా ప్రయాస.

వ్యక్తి ఎవరైనా పాలన సోనియాదే అయినప్పుడు రోశయ్యని మార్చి మరొకరిని ఆ కుర్చీలో కూర్చోపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ముఖ్యంగా రోశయ్య విధేయత ఏమాత్రం తగ్గనప్పుడు, మంత్రులు ఆయన మాట వినేలా అధిష్ఠానం చేయగలిగినప్పుడు ఈ మార్పు ఎందుకు? జవాబు మనకి ఇందిరమ్మ రాజ్యంలో దొరుకుతుంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సందర్భంలో, రాజకీయ వాతావరణం కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న మెజారిటీ సందర్భాలలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరిగిందన్నది గమనించాల్సిన విషయం.

అటు కేంద్రంలో ఆదర్శ్ సొసైటీ, టెలికాం కుంభకోణం ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న సమయంలో, రాష్ట్రంలో తెలంగాణా సమస్య, జగన్మోహన్ రెడ్డి అసమ్మతి, ఇంకా వివిధ వర్గాల ఆందోళనలు ప్రభుత్వానికి కొత్త సవాళ్లు విసురుతున్న నేపధ్యంలో జరుగుతున్న ఈ ముఖ్యమంత్రి మార్పు ప్రజల దృష్టి మరల్చేందుకు మాత్రమే అనిపిస్తోంది. అత్తమ్మ ఎంచుకున్న సీల్డ్ కవర్ సంస్కృతిని కొద్దిగా మార్చి, రాష్ట్రానికి తన ప్రతినిధులని పంపారు కోడలమ్మ. అంతిమంగా ఎంపిక తన చేతిలోనే ఉండేలా జాగ్రత్త పడ్డారు.

అధిక సంఖ్యలో ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రమే అయినా, ఎలాంటి ముఖ్య ప్రాజెక్టులూ కేటాయించక పోవడం, ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు ఇవ్వక పోవడం, నిధుల కేటాయింపులో సైతం చిన్న చూపు చూడడం ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఏం చేసినా చేయకున్నాఇక్కడ గెలిచేది తమ పార్టీనే అన్న వైఖరి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మార్పు తతంగం అందుకు ఊతమిస్తోంది. ఇందిర కాలంలో ఏర్పడ్డ ఇలాంటి వాతావరణమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి, ఎన్టీఆర్ నాయకత్వంలో ఆ పార్టీ అఖండ విజయం సాధించడానికీ తోడ్పడిందన్న సత్యాన్ని సోనియా విస్మరించారా? లేక ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితి పునరావృతం అయ్యే పరిస్థితి కనిపించడం లేదన్న ధీమాతో ఉన్నారా? వేచి చూడాలి...

మంగళవారం, నవంబర్ 23, 2010

చిల్లర దేవుళ్ళు

పోరాటాల చరిత్రలో తెలంగాణా సాయుధ పోరాటానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. యావత్ ప్రపంచపు దృష్టినీ ఆకర్షించిన పోరాటాల్లో ఇదొకటి. మిగిలిన దేశం యావత్తూ పరాయిపాలకులని తరిమికొట్టడం కోసం పోరుని ఉద్ధృతం చేసిన సమయంలో, నిజాం పాలనని అంతమొందించడం కోసం ఆయుధం పట్టారు తెలంగాణా ప్రజ. అమాయకులైన ప్రజలని ఇంత పెద్ద పోరాటం చేసేలా ప్రేరేపించిన పరిస్థితులు ఏమిటి? నిజాం పాలనలో ప్రజల జీవితం ఎలా ఉండేది? లాంటి ఎన్నో ప్రశ్నలకి జవాబిచ్చే పుస్తకం నాలుగున్నర దశాబ్దాల క్రితం దాశరధి రంగాచార్య రాసిన 'చిల్లర దేవుళ్ళు.'

తెలుగు పాఠకులకి దాశరధి రంగాచార్యని పరిచయం చేయాల్సిన పనిలేదు. మూడుతరాల రచయితలు, పాఠకులకి వారధి ఈ బహుభాషా పండితుడు. నిజాం అకృత్యాలకి ప్రత్యక్ష సాక్షి. తెలంగాణా పోరాటం పూర్వాపరాలని అక్షరబద్ధం చేయాలనే ఆకాంక్షతో నవలా రచన ప్రారంభించిన రంగాచార్య ఇందుకోసం 1964 లో 'చిల్లర దేవుళ్ళు' తో శ్రీకారం చుట్టారు. కథాకాలం అంతకు రెండు దశాబ్దాలకి పూర్వం. కథాస్థలం తెలంగాణలోని ఓ కుగ్రామం. సంగీతోపాధ్యాయుడు సారంగపాణి బ్రతుకుతెరువు వెతుక్కుంటూ విజయవాడ నుంచి ఆ ఊరికి చేరుకోడం కథా ప్రారంభం.

ఊరిమద్యలో ఠీవిగా నిలబడి ఉంటుంది దేశముఖ్ రామారెడ్డి 'దొర' గడీ. ఊరిమొత్తానికి అదొక్కటే భవంతి. కరణం వెంకట్రావు తో పాటు మరి కొద్దిమందివి మాత్రమే చెప్పుకోదగ్గ ఇళ్ళు. మిగిలినవన్నీ గుడిసెలే. దొర, కరణం ఆ ఊరిని పాలిస్తూ ఉంటారు. నిజాం ప్రభుత్వం దఖలు పరిచిన అపరిమితమైన అధికారం పుణ్యమా అని వారిద్దరూ చిల్లర దేవుళ్ళుగా వెలిగిపోతూ ఉంటారు ఆ పల్లెలో. సంగీతం పట్ల కొంత ఆసక్తి ఉన్న దొర, పాణి కి తన గడీలో ఆశ్రయమిస్తాడు. రోజూ పాణి పాటని వినడం అలవాటు చేసుకోడంతో పాటు, ఊళ్ళో రెండు మూడు పాఠాలు కూడా ఏర్పాటు చేస్తాడు. పాణి శిష్యురాళ్ళలో కరణం కూతురు తాయారు కూడా ఉంది.

ఊరిమీద దొర పెత్తనం ఎలాంటిదో నెమ్మది నెమ్మదిగా అర్ధమవుతుంది పాణికి. కథలో అతడిది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే. ఊళ్ళో దొర మాట శిలాశాసనం. అతని కంట పడ్డ ఏ స్త్రీ తప్పించుకోలేదు. అంతే కాదు చిన్న తప్పుకు సైతం దొర విధించే శిక్ష అత్యంత కఠినంగా ఉంటుంది. తన అధికారాన్ని నిలబెట్టుకోడానికి దొర ఎంతకైనా వెనుకాడడని తెలుస్తుంది పాణికి. దొరకీ-కరణానికీ మధ్య వైరం, జనం విషయానికి వచ్చేసరికి ఇద్దరూ ఏకం కావడం చూస్తాడతడు.

గడీ లోపల ఒక్కక్కరిదీ ఒక్కో కథ. 'ఆడబాప' గా పనిచేస్తున్న వనజది వేశ్య కన్నా నికృష్ట జీవితం. ఆమె పాణి మీద మనసు పడుతుంది. మరోపక్క పరదాల చాటున పెరిగే దొర కూతురు మంజరి సైతం 'సంగీతప్పంతులు' మీద మనసు పారేసుకుంటుంది. ఇంకోపక్క కరణం కూతురు తాయారు, తనని పెళ్లి చేసుకుంటే తండ్రి కరణీకం పాణికి ఇప్పిస్తానని ప్రతిపాదించడం మాత్రమే కాదు, తన కోరికని అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తుంది కూడా.

అలా అని ఇదేమీ ముక్కోణపు ప్రేమకథ కాదు. సాయుధ పోరాటానికి పూర్వం తెలంగాణా ప్రజల బతుకు పోరాటాన్ని చిత్రించిన నవల. భూతగాదాలో లంబాడీలను కరణం మోసగిస్తే, న్యాయం చేయాల్సిన పోలీసులు కరణానికి మద్దతుగా లంబాడీలపై కాల్పులు జరుపుతారు. నిజాం మనుషులు రోజు కూలీలని బలవంతంగా ముస్లిం మతంలోకి మారిస్తే, ఆ తర్వాత వాళ్ళు ఇటు హిందువులుగానూ, అటు ముసల్మానులుగానూ చెలామణి కాలేక, రెండు మతాల చేతా వెలివేయబడి పడే బాధలు వర్ణనాతీతం. దొర బండి రోడ్డున వెళ్తుంటే, గడీ గౌరవానికి చిహ్నంగా బండికి ముందు ఒక మనిషి పరుగు పెట్టడం లాంటి సంప్రదాయాలని చిత్రించడం మాత్రమే కాదు, అలా పరుగు పెట్టే మనిషి పడే కష్టాన్నీ కళ్ళకు కట్టారు రచయిత.

నిజాం పాలనలో ఉనికి కోల్పోతున్న తెలుగు భాషా సంస్కృతులని కాపాడడానికి మాడపాటి హనుమంతరావు వంటి తెలుగు వాళ్ళు చేస్తున్న కృషిని తెలుసుకుంటాడు పాణి. తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాడపాటి తో మాట్లాడి తన సందేహాలని నివృత్తి చేసుకుంటాడు కూడా. హైదరాబాద్ నుంచి అతను కొని తెచ్చిన కెమెరా, వాటితో అతను తీసిన ఫోటోలు దొరకి నచ్చడంతో ఆ కుటుంబానికి మరింత దగ్గరవుతాడు పాణి. ఊహించని విధంగా పాణి మీద దొర చేయి చేసుకోవడం, ఆ తర్వాత పాణి ఊరు విడిచి వెళ్ళడంతో కథ నాటకీయమైన ముగింపు దిశగా పయనిస్తుంది.

పాణి, మంజరి అనే రెండు పాత్రలు మినహాయిస్తే, మిగిలిన పాత్రలన్నీ నిజ జీవితం నుంచి పుట్టినవే అనడం నిస్సందేహం. కథానాయకుడిది పాసివ్ పాత్ర కావడం వల్ల కావొచ్చు, కథకి సినిమాటిక్ ముగింపు ఇచ్చారు రచయిత. కథని పక్కన పెట్టి, రచయిత పరిశీలనాశక్తి ని దృష్టిలో పెట్టుకుని చదివినప్పుడు ఈనవల మనకెన్నో విషయాలు చెబుతుంది. అనేక వాస్తవాలని కళ్ళముందు ఉంచుతుంది. అందుకే కావొచ్చు రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాలలో (ఉస్మానియా, కాకతీయ, శ్రీవెంకటేశ్వర) ఈ నవలపై అధ్యయనం జరిగింది. రాష్ట్ర సాహిత్య అకాడెమీ 1971 సంవత్సరానికి బహుమతి ప్రకటించింది. (విశాలాంధ్ర ప్రచురణ; పేజీలు 131 వెల రూ.50).

సోమవారం, నవంబర్ 22, 2010

అన్వేషణ

సృష్టిలో క్రూరమైన మృగం పులి అనుకుంటారు చాలామంది. కానీ, మనిషికన్నా క్రూరమైన మృగం మరొకటి లేదంటుంది పాతికేళ్ళ క్రితం వంశీ తీసిన 'అన్వేషణ' సినిమా. ఈ సినిమా ద్వారా మర్డర్ మిస్టరీని తెరకెక్కించడంలో వంశీ చేసిన ప్రయోగాలు తర్వాత ఎంతోమంది దర్శకులకి మార్గదర్శకం అయ్యాయి.. వాళ్ళెవరూ కూడా 'అన్వేషణ' స్థాయి విజయాన్ని సాధించలేకపోయారు. వంశీ తీసిన మంచి సినిమాల జాబితాలో స్థిరమైన చోటు సంపాదించుకున్న ఈ సినిమా అప్పట్లో వంద రోజుల పండుగ జరుపుకుంది.


మద్రాస్ మ్యూజిక్ కాలేజీలో చదివిన హేమ (భానుప్రియ), ఫారెస్ట్ కాంట్రాక్టర్ రావు గారి (కైకాల సత్యనారాయణ) ఆహ్వానం మేరకి ఆయన ఉంటున్న అటవీ ప్రాంతానికి వస్తుంది. సంగీతాన్ని యెంతో ఇష్టపడే రావుగారికి ఉన్నది ఒకటే కోరిక, పక్షుల కిలకిలారావాల నుంచే సంగీతం పుట్టిందని నిరూపిస్తూ ఓ పుస్తకం రాయాలని. ఇందుకోసం ఆయన స్వయంగా పరిశోధన మొదలు పెట్టినప్పటికీ, వృద్ధాప్యం కారణంగా మొదలైన మతిమరుపు ఆయన చేత ఆ పనిని పూర్తి చేయనివ్వదు.

రావుగారి జీప్ డ్రైవర్ (రాళ్ళపల్లి) భార్యే ఆ ఇంట్లో వంట మనిషి కూడా. అక్కడ పనిచేస్తున్న ఫారెస్ట్ రేంజర్ జేమ్స్ (శరత్ బాబు) రావుగారికి మంచి స్నేహితుడు. ఊరి సర్పంచ్ పులిరాజు (మల్లికార్జున రావు), అతని భార్య నాగలక్ష్మి (వై.విజయ), వాళ్ళ కొడుకు చంటోడు (శుభలేఖ సుధాకర్), పులిరాజు బావమరిది (బాలాజీ)... ఇలా రావుగారితో మసిలే ప్రతి ఒక్కరూ చిత్రంగా ప్రవర్తిస్తూ ఉండడం అర్ధం కాదు, రావుగారి స్నేహితుడి కూతురైన హేమకి.

హేమ కన్నా ముందు అదే అంశం మీద పరిశోధన కోసం రావుగారు రప్పించిన సుమతి అనే అమ్మాయిని అడవిలో పులి దారుణంగా చంపేసిందని తెలిసినా ఏమాత్రమూ భయపడని ధైర్యస్తురాలు హేమ. ఎవరి మాటలూ పట్టించుకోకుండా అడవిలో తిరుగుతూ తన పరిశోధన తాను చేసుకుంటూ ఉంటుంది. ఓ ముగ్గురు ముసుగు మనుషులు తనని వెంబడించడం, వాళ్ళని మరో ముసుగు మనిషి వెంబడించడం గమనిస్తుంది హేమ. రావుగారి సహాయకుడు గోఖలేని పులి చంపేయడంతో ఊరి జనంలో మళ్ళీ భయం మొదలవుతుంది.

గోఖలే స్థానంలో పనిచేయడం కోసం పట్నం నుంచి వస్తాడు అమర్ (తర్వాతికాలంలో కార్తిక్ గా మారిన తమిళ నటుడు, 'సీతాకోకచిలక' ఫేం మురళి). ఉద్యోగంలో చేరకుండా పులి ఆనుపానులమీద ఎంక్వయిరీలు చేసే అమర్ ప్రవర్తన కూడా చిత్రంగానే ఉంటుంది. ఇంతలో ఊళ్ళో బండివాడిని (ధమ్) పులి చంపేయడంతో ప్రజల్లో మళ్ళీ భయభ్రాంతులు మొదలవుతాయి. పులిని చంపేయమని కలెక్టర్ నుంచి ఉత్తర్వులు కూడా ఉంటాయి. నిజానికి అప్పటివరకూ పులిని చూసిన వాళ్ళు ఎవరూ లేరు. జనం చూసిందల్లా పులిచేతిలో మరణించిన వాళ్ళ శవాలనే.

హేమకీ అమర్ కీ స్నేహం కలవడం, అమర్ పోలిస్ అధికారి అనీ, పులి చేతిలో మరణించిన వారిగా చెబుతున్న వారంతా నిజానికి మనుషుల చేతిలోనే హతమయ్యారనే దిశగా అతను పరిశోధన సాగిస్తున్నాదనీ తెలియడంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. హేమని వెంటాడుతున్నవాళ్ళు ఎవరు? వాళ్ళని వెంబడిస్తున్న వ్యక్తి ఎవరు? పులి పేరుతో హత్యలు ఎందుకు జరిగాయి? రావుగారి పుస్తక రచన పూర్తయ్యిందా? లాంటి ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ సినిమా ముగుస్తుంది.

నిజానికి ఈ 'అన్వేషణ' సాంకేతిక నిపుణుల సినిమా. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన వంశీతో పాటు, చాయాగ్రాహకుడు ఎమ్వీ రఘు, ఎడిటింగ్ చేసిన జి.ఆర్. అనిల్ మర్నాడ్, సంగీతం సమకూర్చిన ఇళయరాజాల ప్రతిభ ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. చిత్తూరు జిల్లా తలకోనలో చిత్రీకరించిన ఈ సినిమా కథ శ్రీకారం నుంచి శుభం కార్డు వరకూ అడవిలోనే జరుగుతుంది. ప్రతి పాత్ర ప్రవర్తనా అనుమానాస్పదంగానే అనిపించడంతో ముగింపు ఊహకందదు. అడవిని ఎంత అందంగా చూపించారో, అంతగానూ కెమేరాతో భయపెట్టేశారు రఘు. ఏ సన్నివేశం నిడివి ఎంత ఉండాలో అంత మాత్రమే ఉండడం ఈ సినిమా ఎడిటింగ్ ప్రత్యేకత.

వాయిద్యాలతో మాత్రమే కాదు, అవసరమైన చోట్ల నిశ్శబ్దంతోనూ అద్భుతమైన మూడ్ క్రియేట్ చేశాడు ఇళయరాజా. 'కీరవాణి' 'ఏకాంతవేళ' 'యెదలో లయ' 'ఇలలో కలిసే..' ప్రతిపాటా దేనికదే ప్రత్యేకమైనది. వేటూరి చక్కని సాహిత్యం అందించారు. పక్షుల గొంతులను సంగీత వాద్యాల మీద ఇళయరాజా ఎంత సహజంగా పలికించాడో, అంటే సహజంగా ఆ గొంతులకి తన గొంతుని పోటీగా నిలిపారు జానకి. 'ఇలలో కలిసే..' ట్యూన్ 'అభినందన' లో 'ఎదుట నీవే..' ట్యూన్ ఒకటే. నిజానికి ఈ ట్యూన్ మాతృక ఇళయరాజా తమిళం లో చేసిన ఒక పాట అని వంశీ ఆ మధ్యనెప్పుడో ఓ టీవీ చానెల్లో చెప్పిన కబురు.

నటీనటుల గురించి చెప్పాలంటే ముందుగా చెప్పాల్సింది హేమ గా నటించిన భానుప్రియ గురించే. గత చిత్రం 'సితార' లో పూర్తి సంప్రదాయ బద్ధంగా కనిపిస్తే, ఈ సినిమాలో ఫ్యాంటు షర్టులు, సల్వార్ కమీజుల్లో కనిపించింది. ధైర్యస్తురాలైన పట్నం అమ్మాయిగానూ, తన చుట్టూ జరుగుతున్న సంఘటనలకి చలించే సన్నివేశాల్లోనూ చక్కని నటనని ప్రదర్శించింది. సత్యనారాయణ, మురళి, శరత్ బాబు, రాళ్ళపల్లి, మల్లికార్జున రావు, వై.విజయ, సుధాకర్.. ఇలా అందరూ తమ పాత్రలకి న్యాయం చేశారు.

వంశీ రాసుకున్న కథకి యండమూరి వీరేంద్ర నాథ్ చేత ఒక వెర్షన్ రాయించారు సినిమాని నిర్మించిన రాంకుమార్ ప్రొడక్షన్స్ వాళ్ళు. ఆ వెర్షన్ వంశీకి నచ్చకపోవడంతో తనే మరో వెర్షన్ రాసుకున్నారు. ఇళయరాజా ట్యూన్స్ ఇచ్చిన తర్వాత, వాటికి అనుగుణంగా కథలో మార్పులు చేశారట. రెండుమూడు ఆంగ్ల సినిమాల స్పూర్తితో ఈ కథ రాసుకున్నారట వంశీ. అప్పట్లో సెన్సార్ బోర్డు 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చింది ఈ సినిమాకి. ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా ఆసాంతమూ ఉత్కంఠభరితంగా అనిపించడం 'అన్వేషణ' ప్రత్యేకత.

ఆదివారం, నవంబర్ 21, 2010

ఖాకీ సుమన్

"సంకల్పం గొప్పది" అని మురారి సినిమాలో మహేష్ బాబు చేత ఓ డైలాగ్ చెప్పించాడు కృష్ణవంశీ. నిజమే.. సంకల్పం గొప్పది కాకపొతే తలచినంతనే సుమన్ బాబు ప్రత్యక్షం అవుతాడా? మొన్నామధ్యన కృష్ణాష్టమి నాడు కన్నయ్య కనిపించలేదనే ఆవేదనతో ఓ టపా రాశాను. 'ఎక్కడికి పోతాడు, వచ్చేస్తాడు లెమ్మని' మిత్రులు ఓదార్చారు. కొత్తపాళీ గారైతే తధాస్తు దేవతలు ఉంటారని ఊరడించారు. సంకల్ప బలమో, తధాస్తు దేవతల వరమో తెలీదు కానీ సుమన్ బాబు దర్శన భాగ్యం కలిగింది, ఇవాల్టి ఈనాడు ఆదివారం చివరి పేజిలో.

'నాన్ స్టాప్ కామెడీ' నాటికన్నా కొంచం చిక్కాడు బాబు. ఖాకీ యూనిఫాం వేసుకుని, గంభీరంగా చూడడానికి ప్రయత్నిస్తూనే అప్రయత్నంగా నవ్వు పుట్టించేశాడు. ఎక్కువగా వివరాలేమీ ఇవ్వలేదు. బాబు ఫోటో పెద్దది వెయ్యగా మిగిలిన చోటులో ఆయనకి కుడివైపున నమస్కరిస్తున్న రెండు చేతులు, వాటికింద 'అంకితం' అనీ, ఎడమ వైపున 'ప్రీమియర్ షో త్వరలో ఈటీవీలో...' అని మాత్రమే ఇచ్చారు. ఇక పేజి కింది భాగంలో ఎడమ వైపున దర్శకత్వం ఇంద్రనాగ్ అనీ, నిర్మాత సుమన్ ('బాబు' లేదు, అయినా ఈ విషయంలో ఎలాంటి ప్రకటనా లేదు కాబట్టి నేను సుమన్ బాబు అనే వ్యవహరిస్తున్నా) అనీ వేశారు.

కాస్త పరకాయించి చూస్తే బాబు ధరించింది పోలిస్ యూనిఫాం అని అర్ధమయ్యింది. ఎడమ భుజం మీద 'పోలిస్' లోగో కనబడింది. కుడి జేబు పైన సి. విజయ్ బాబు అన్న పేరు కనిపిస్తోంది. ఇంటి పేరునీ ('సి') బాబునీ మన బాబు వదులుకోక పోవడం తన అసలుపేరు పట్ల ఆయన మమకారాన్ని సూచిస్తోంది. తగు మాత్రంగా ఉన్న బొజ్జని బిగించి పెట్టిన బెల్టు మీద కూడా పోలిస్ లోగో ఉంది. రెండు భుజాలూ నక్షత్రాలు లేకుండా ఖాళీగా ఉన్నాయి కాబట్టి పోలిస్ డిపార్టుమెంటులో నీతినీ, న్యాయాన్నీ కాపాడే కానిస్టేబుల్ పాత్రని బాబు పోషించి ఉండొచ్చని ఊహిస్తున్నాను ప్రస్తుతానికి.


ఈ 'అంకితం' టెలిఫిల్మా లేక సినిమానా అన్న విషయం ఎప్పటిలాగే సస్పెన్స్ గా ఉంచారు సుమన్ బాబు. అలా అని చూస్తూ ఊరుకోలేం కదా. కుంచం కష్టపడి కాసిన్ని విశేషాలు తెలుసుకున్నాను. అందిన సమాచారం మేరకు ఈ 'అంకితం' ఒక టెలిఫిలిం. ఈటీవీలో త్వరలో ప్రసారం కాబోతోంది. థియేటర్ రిలీజ్ బహుశా ఉండకపోవచ్చు. 'నాన్ స్టాప్ కామెడీ' లో నెగిటివ్ ఛాయలున్న అన్నయ్య పాత్ర పోషించిన సుమన్ బాబు 'అంకితం' లో పూర్తి పాజిటివ్ పాత్రని పోషించారు. "కుటుంబ బంధాలకి విలువనిచ్చే" పాత్రలంటే తనకి ఇష్టమని అప్పుడెప్పుడో ఒక ఇంటర్యూ లో చెప్పిన విషయం మనందరికీ గుర్తుంది కదా. ఇది అలాంటి పాత్ర అయి ఉండొచ్చు.

ఇప్పటికే క్రియేటివ్ హెడ్ గా తనని తాను నిరూపించుకున్న ఇంద్రనాగ్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆయనకి కూడా కుటుంబ బంధాలంటే ఇష్టం కాబట్టి ఇలాంటి కథని ఎంచుకుని ఉండొచ్చు. విధి నిర్వహణలో సిన్సియర్ ఉద్యోగిగా పోలిస్ శాఖకీ, అన్నగా ఇంట్లో కుటుంబ సభ్యులకీ పూర్తిగా అంకితమైన విజయ్ బాబు పాత్రలో సుమన్ బాబు బహుశా పూర్తిగా ఒదిగిపోయి ఉండొచ్చు. పాత్రోచితమైన నటనని ప్రదర్శించడం కోసం కొత్త విగ్గుని వాడడం ఆహార్యం పట్ల బాబు శ్రద్ధకి నిదర్శనంగా అనిపిస్తోంది.

నిజం చెప్పాలంటే ఈ 'అంకితం' ప్రకటన నన్ను కొంచం నిరాశ పరిచింది. 'నాన్ స్టాప్ కామెడీ' తర్వాత సుమన్ బాబు ఓ భారీ జానపద చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించడంతో పాటు, అమ్మాయిల కలల రాకుమారుడిగా కథానాయక పాత్ర పోషిస్తారని ఎదురు చూస్తూ వచ్చాను. ఖర్చుకి వెనకాడకుండా సొంత స్టుడియోలో సెట్టింగులు వేయించి, నిర్మాణ విలువల విషయంలో అస్సలు రాజీ పడకుండా సినిమా తీయడం ఆయనకి పెద్ద పనేమీ కాదు. అయితే అస్సలు ఊహించని విధంగా ఫ్యామిలీ సెంటిమెంట్ వైపు మొగ్గు చూపారు. తర్వాత వచ్చేది జానపద చిత్రమే అవుతుందేమో.. ఎదురు చూద్దాం.

శనివారం, నవంబర్ 20, 2010

నూడుల్స్

నాకు ఉప్మా చేయడం వచ్చు. రెండు రకాల నూకలు, సేమియా, సగ్గుబియ్యం, అటుకులు.. ఇలా అన్నింటితోనూ రకరకాల ఉప్మాలు చేయగలను. (ఈ సందర్భంగా ఆంధ్రుల ఆహ్లాద రచయితకి కృతజ్ఞతలు చెప్పుకోవడం అవసరం.. తన ప్రతి నవలలోనూ ఉప్మా తప్పనిసరి కదా). అలాగే ఇనిస్టంట్ మిక్స్ తో పులిహోర కూడా చేయగలను. ఆఫ్కోర్స్, తినేవాళ్ళకి 'దంతసిరి' ఉండాలనుకోండి. ఈ వరుసలో నాకు వచ్చిన మరో వంటకం నూడుల్స్. ఇది మా ఇంట్లో నేను మాత్రమే తినే వంటకం. అందువల్ల దీనితో నేను చేసిన ప్రయోగాలకి లెక్కలేదు.

ఎన్ని రెస్టారెంట్లలో తిన్నా నూడుల్స్ రుచి ఒకేలా ఎందుకు ఉంటోందా? అని ఆలోచిస్తున్న సమయంలో చాన్నాళ్ళ క్రితం ఒక ఫ్రెండ్ ఇంట్లో నూడుల్స్ రుచి చూసే సందర్భం వచ్చింది. వీటిని ఇలా కూడా చేయొచ్చా? అనిపించి చేసినావిడ నుంచి తయారీ విధానం వివరంగా తెలుసుకున్నాను. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఆవిడ చాలా సంతోషంగానూ మరియు వివరంగా నాక్కావలసిన సంగతులు చెప్పారు.

వాళ్ళింటి నుంచి వస్తూ వస్తూ షాపుకెళ్ళి మేగి పేకెట్లు తెచ్చుకున్నాని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అప్పటికే నేను ఒకటి రెండు సార్లు స్వతంత్రించి చేసిన ప్రయోగాలు వికటించాయి. నీళ్ళు చాలక బాండీ మాడడం, నీళ్ళు ఎక్కువై నూడుల్స్ సూప్ గా అవతారం మార్చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ నేను అదరక, బెదరక, పట్టుదల విడవక వివరాలు తెలుసుకుని మరీ వచ్చాను కదా. ఆ ఉత్సాహంలో వంటకం మొదలు పెట్టేశా.

సదరు మిత్రురాలు చెప్పిన ప్రకారం, ముందుగా బాండీ వేడి చేసి ఓ రెండు చెంచాల నూనె పోయాలి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కేప్సికం తురుము, కేరట్ తురుము, కేబేజీ (ఇష్టమైతేనే), బీన్స్ (దొరికితేనే) వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కల్ని చివరికి ఉంచి, మిగిలినవన్నీ కొంచం వేగాక బాండీ లో వేయడం ఉత్తమం. నూడుల్స్ లో ఆనియన్ డీప్ ఫ్రై కాకపోతేనే టేస్ట్ బాగుంటుందన్న మాట. (టీవీ వంటల ప్రోగ్రాం భాష).


మన ఇష్టాన్ని బట్టి ఒకటో, రెండో పచ్చి మిర్చి కూడా సన్నగా తరిగి వేయాలి. పచ్చి బఠానీ వేసినట్టయితే వాటిని బాగా వేగనివ్వాలి. ఏమేం వెయ్యాలన్నది ముందుగానే నిర్ణయించుకుంటే, ఒక వరుసలో బాగా వేగాల్సిన వాటిని ముందుగానూ, తక్కువగా వేగాల్సిన ఉల్లి, టమాటా లాంటి వాటిని చివరిగానూ వేసుకోవచ్చు. ఇప్పుడింక కూరగాయ ముక్కలు ఫ్రై అయిపోయాక బాండీలో తగినన్ని నీళ్ళు పోయాలి. ఈ తగినన్ని దగ్గర చాలా సమస్య వస్తుంది. కూరగాయ ముక్కలు ప్లస్ నూడుల్స్ కలిసి ఉడకడానికి సరిపోయే నీళ్ళు పోయ్యాలన్న మాట.

వేసిన కూరగాయ ముక్కల పరిమాణాన్ని బట్టి (పరిమాణమా? పరిణామమా?? ...పరిమాణమే) తగినంత ఉప్పుని మరుగుతున్న నీటిలో వేయాలి. ఓ చిటికెడు సరిపోతుంది. నూడుల్స్ పేకట్ లో ఉండే చిన్న మసాల టేస్టర్ పేకట్ ని కత్తిరించి ఆ మసాలాని కూడా బాండీలోకి వొంపి గరిటతో కలపాలి. నూడుల్స్ అచ్చులని తగుమాత్రం చిన్న ముక్కలుగా విరిచి బాండీలో వేయాలి. సన్నని సెగమీద సరిగ్గా రెండు నిమిషాలు ఉడకనిస్తే చాలు ఘుమఘుమలాడే నూడుల్స్ రెడీ. ఇష్టమైతే గార్నిష్ చేసుకోవచ్చు(మళ్ళీ టీవీ భాష). టమాటా సాస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది.

నేను మేగి, టాప్ రోమన్ పేకట్లు మార్చి మార్చి వాడుతూ ఉంటాను. మేగి కన్నా టాప్ రోమన్ కి తక్కువ నీళ్ళు పడతాయన్నది నా అనుభవం. కొత్త కంపెనీ ఏది కనిపించినా ఓసారి ప్రయత్నిస్తా కానీ, నాకెందుకో ఈ రెండే బాగా నచ్చాయి. వండడానికీ, తినడానికీ కూడా. మసాలా టేస్టర్ ని అస్సలు వాడకుండా, నూడుల్స్ తో సేమియా ఉప్మా పద్ధతిలో చేసిన నూడుల్స్ వంటకాన్ని తినడం ఒకసారి సంభవించింది. అదో అనుభవం. ఎంత జాగ్రత్తగా చేసినా నూడుల్స్ ప్రతిసారీ రుచిగా రావు. అలాంటప్పుడు బాండీ సింకులో పడేసి, ఇంట్లో వాళ్ళతో పాటు ఇడ్లీ తినేయడమే..

గురువారం, నవంబర్ 18, 2010

వరమేనా?

భారీ నీటిపారుదల ప్రాజెక్టులకి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వేత్తలు ఆందోళనలు జరుపుతున్న నేపధ్యంలో, మన రాష్ట్రంలో దశాబ్దాల తరబడి పెండింగులో ఉన్న పోలవరం భారీ నీటిపారుదల ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలని అధికార పార్టీలో ఒక వర్గం నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకులూ ఉన్నారు కానీ, ఆ వ్యతిరేకత కేవలం రాజకీయ కారణాల వల్ల.

గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు నిర్మించాలన్న ప్రతిపాదన ఈనాటిది కాదు. స్వాతంత్రానికి  పూర్వం నుంచీ ప్రయత్నాలు మొదలైనా అనేకానేక కారణాల వల్ల ఎప్పటికప్పుడు నిర్మాణం వాయిదా పడుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అట్టహాసంగా మొదలు పెట్టిన 'జలయజ్ఞం' లో పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు కాగల ఈ పెండింగు ప్రాజెక్టుని ప్రధానంగా చేర్చారు.

అంతేకాదు, పోలవరం ద్వారా గోదావరి డెల్టాకి నీరందుతుందన్ననమ్మకంతో, ఎగువన గోదావరి నదిపై ఏడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే, తెలంగాణా ప్రాంతంలో బీడు భూములకి నీరంది అవి వ్యవసాయ యోగ్యం అవుతాయి. అయితే, గోదారి దిగువ ప్రాంతానికి ప్రవహించే నీటిని ఎగువ భాగంలోనే లిఫ్ట్ ద్వారా తోడేయడం వల్ల దిగువ ప్రాంతంలో నీటి కటకట ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. ఈ కారణం చేత పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలని ఈ ప్రాజెక్టుని సమర్ధిస్తున్న నాయకులు అంటున్నారు.

ప్రాజెక్టు పూర్తయితే పెరగబోయే సాగు భూమి విస్తీర్ణం, విద్యుత్ ఉత్పత్తి, ఆంధ్ర తో పాటు తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలకీ నీరందించే వీలుండడం వల్ల రానున్న కాలంలో మారబోయే రాష్ట్ర ఆర్ధిక ముఖచిత్రం లాంటి అంశాలని ఆకర్షణీయంగా చెబుతున్న ఈ నాయకులు, పర్యావరణ అంశాలని తేలిగ్గా తీసుకుంటున్నారు. "ఒకటి కావాలంటే మరొకటి కోల్పోవాలి" అన్న ధోరణి వీరి వ్యాఖ్యల్లో వినిపిస్తోంది.


ప్రాజెక్టు నిర్మించాక ఏదైనా జల విపత్తు జరిగితే కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రధాన నగరాలు ఆనవాలు లేకుండా పోయే ప్రమాదం ఉందనే కారణంతో కొందరూ, ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులయ్యే వారి హక్కులని కాపాడడం కోసం మరికొందరూ ఈ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్నారు. వీరి వ్యతిరేకతలో ప్రధానంగా రాజకీయ కారణాలే వినిపిస్తున్నాయి తప్ప, పర్యావరణాన్ని గురించి మచ్చుకైనా వీరూ మాట్లాడడం లేదు.

రాజశేఖరరెడ్డి మరణం తర్వాత దాదాపుగా ఆగిపోయిన అనేక ప్రాజెక్టుల్లో పోలవరం ఒకటి. ఇన్నాళ్ళూ మౌనం వహించిన నేతలందరూ ఉన్నట్టుండి ఇప్పుడీ ప్రాజెక్టుని గురించి మాట్లాడడం రాష్ట్ర రాజకీయాలని పరిశీలిస్తున్న వారికి బొత్తిగా అంతుపట్టని విషయమేమీ కాదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో ఈ ప్రాజెక్టుకి జాతీయ హోదా తీసుకొచ్చి, తద్వారా కేంద్ర నిధులతో పనులు పూర్తి చేసేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు తవ్విన కాలువలు పూడిపోక ముందే ప్రాజెక్టు పనులు మొదలవుతాయా? అన్నది అంతు చిక్కని ప్రశ్నలాగే ఉంది.

రాజకీయాలని పక్కన పెడితే, పర్యావరణవేత్తలెవరూ భారీ ప్రాజెక్టులని సమర్ధించడం లేదు. జీవ వైవిధ్యం దెబ్బ తినడం, సమతుల్యత లోపించడం లాంటి అనేక కారణాలు ఉన్నాయి. భారీ ప్రాజెక్టుల కారణంగా కొన్ని అడవులు, జీవజాతులు అంతరించిపోయే ప్రమాదమూ ఉందంటున్నారు వాళ్ళు. ( పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అంతరించిపోయే మొదటి జీవి ఆంధ్రులకి అత్యంత ప్రియమైన పులసచేప). ప్రాజెక్టులు-పర్యావరణానికి సంబంధించిన అనేక కీలక అంశాలు సామాన్యులకి అర్ధమయ్యే భాషలో వివరంగా రాశారు రచయిత్రి చంద్రలత తన నవల 'దృశ్యాదృశ్యం' లో.

పర్యావరణాన్నిసైతం పక్కన పెట్టి ప్రాజెక్టుని స్వాగతిద్దామంటే వెంటాడుతున్న మరో భయం పనుల నాణ్యత. గడిచిన కొన్నేళ్లుగా ఓ పక్క పనులు జరుగుతుండగానే మరోపక్క నుంచి అప్పటివరకూ జరిపిన నిర్మాణాలు వరదల్లో కొట్టుకోపోడాన్నిటీవీల్లో చూశాక, ఈ ప్రాజెక్టులో నాణ్యతా ప్రమాణాలు ఎంతవరకూ పాటించగలరు? అన్నసందేహం కలగక మానదు. గడిచిన ఆరున్నర దశాబ్దాలలో ఎన్నోమార్లు వాయిదా పడ్డ పోలవరం నిర్మాణం ఈసారి ఏమవుతుందో వేచి చూడాలి.

బుధవారం, నవంబర్ 17, 2010

గాళిదేవరు

యాజమాన్యాలు పనివాళ్ళని కష్టపెట్టడం అన్నది సహజ పరిణామంగా తీసుకుంటాం మనం. కానీ, పనివాళ్ళు తమ కొద్దిపాటి తెలివితేటలని, సమయస్పూర్తిని, యజమాని బలహీనతలనీ ఉపయోగించుకుని అతన్ని దేశం విడిచిపెట్టి పోయేలా చేయడం అన్నది వినడానికి కథలా అనిపిస్తుంది. సి. రామచంద్రరావు రాసిన 'గాళిదేవరు' కథ ఇతివృత్తం ఇదే.

కూర్గు కాఫీ తోటల పరిమళాలని, అక్కడి వాతావరణాన్ని, కాఫీ తోటల్లో పనివాళ్ళ జీవితాలనీ, యజమాని-పనివాళ్ళ మధ్య సంబంధాలనీ కళ్ళకు కట్టినట్టు వర్ణించే ఈ కథని చదవడం పూర్తిచేయగానే పఠితలు ఓ చిత్రమైన అనుభూతికి లోనవుతారు. మంగుళూరు రోడ్డులోని పోలిబేటా కాఫీ ఎస్టేటు మేనేజరు సోమయ్య. మేంగిల్స్ బ్రదర్స్ సంస్థ ఆ ఎస్టేటుకి ఒకప్పటి యజమాని. కాఫీ పంటలో లాభాలు బాగా రావడంతో పనివాళ్ళ ఇళ్ళని నివాస యోగ్యంగా మార్చాలనీ, బాత్రూములు ఏర్పాటు చేయించాలనీ తలపెడతాడు సోమయ్య.

పోలిబేటా యాజమాన్యం ఇందుకు అంగీకరించడంతో కిల్లిక్ సన్ అండ్ కంపెనీకి ఆ కాంట్రాక్టు ఇవ్వాలనుకుంటాడు. బాత్రూం ఫిట్టింగ్స్ తయారీలో పేరుపొందిన ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఏంథోనీ చిన్నప్ప యువకుడు, ఉత్సాహవంతుడు. పోలిబేటా పేరు వినగానే "గాళిదేవరు వెలిసింది మీ ఎస్టేట్ లోనే కదూ?" అని అడుగుతాడు సోమయ్యని. అంతేకాదు, 'గాళిదేవరు' ని చూడడానికి తన ఉద్యోగులని వెంట పెట్టుకుని ఎస్టేట్ కి బయలుదేరతాడు కూడా.

ఎస్టేట్ లో ముసలి కార్మికుడు మాంకూ, గాళిదేవరు గుడి బాధ్యతలు చూస్తూ ఉంటాడు. ఏటా జరిగే జాతరలో మాంకూదే హడావిడి అంతా. అప్పుడే కురిసిన వర్షానికి బురదగా ఉన్న బాట వెంట చాలాదూరం నడిచి గుడికి చేరుకుంటారు సోమయ్య, చిన్నప్ప, అతని బృందం. అతి చిన్నగా ఉన్న ఆ గుడినీ, ఆకృతి లేకుండా ఉన్న విగ్రహాన్నీ చూసి చిన్నప్ప మినహా అతని బృందమంతా నిరాశ పడతారు. గుడిని చూడడం అయ్యాక, మేంగిల్స్ దొర కట్టిన బంగాళా చూడాలంటాడు చిన్నప్ప. అతని ఉత్సాహం చూసి మేంగిల్స్ కథని వివరంగా చెబుతాడు మాంకూ.



మేంగిల్స్ బ్రదర్స్ సంస్థ ఎస్టేట్ కొన్న కొత్తలో వర్షాభావం వల్ల కాఫీ పంట దిగుబడి ఉండదు. మేంగిల్స్ దొర తన కుటుంబాన్ని తన దేశంలోనే వదిలి, తానొక్కడే ఎస్టేట్లో ఉంటూ పనులు చేయిస్తాడు. ఆ సంవత్సరం లాభాలు బాగా రావడంతో, ఎస్టేట్లోనే సకల సౌకర్యాలతో బంగళా కట్టించి తన కుటుంబాన్ని అక్కడికి తీసుకురావాలని అనుకుంటాడు మేంగిల్స్. బంగళా నిర్మాణం దాదాపు పూర్తవుతుంది. వంట ఇంటి నుంచి వచ్చే నీరు గాళిదేవరు విగ్రహం పక్కగా ప్రవహిస్తుంది కాబట్టి వంటిల్లు మరో చోటికి మార్చమని అడుగుతారు పనివాళ్ళు. గాళిదేవరు పట్ల ఎలాంటి నమ్మకం లేని మేంగిల్స్ ఇందుకు ససేమిరా అంటాడు.

అక్కడినుంచీ మేంగిల్స్ కష్టాలు మొదలవుతాయి. తాగేతాగే విస్కీ గ్లాసు మాయమవడం, భోజనం పళ్ళెంలో ఉన్నట్టుండి రాళ్ళు ప్రత్యక్షం కావడం.. ఇలా జరిగే విచిత్రాలన్నింటికీ కారణం గాళిదేవరుకి కోపం రావడమే అంటారు పనివాళ్ళు. ప్రమాదంలో తన చేయి విరగడం, తాళం వేసిన గ్యారేజీ నుంచి అర్ధ రాత్రివేళ కారు స్టార్టు చేసిన చప్పుడూ హారనూ వినిపించడం వంటి మరికొన్ని సంఘటనలు జరిగాక గాళిదేవరు మీద భయం మొదలవుతుంది మేంగిల్స్ కి.

అయినకాడికి ఎస్టేట్ అమ్ముకుని తనదేశం వెళ్ళిపోడానికి సిద్ధపడతాడు. అభిరుచితో కట్టించుకున్న ఇంటిని అలాగే వదిలి వెళ్ళడానికి మనసొప్పక శానిటరీ ఫిట్టింగ్స్ అన్నీ తనతో తీసుకుని వెళ్ళాలనుకుంటాడు. గాళిదేవరు తన మహిమలు చూపడంతో, ఆ ప్రయత్నం విరమించుకుని, ఆ ఫిట్టింగ్స్ అన్నీ నీళ్ళలో పారేయాల్సిందిగా తన బట్లర్ని ఆదేశిస్తాడు. గాళిదేవరుకి గుడి కట్టడానికి మాంకూకి డబ్బిచ్చి తన దేశానికి బయలుదేరతాడు దొర.

గాళిదేవరు మహిమల వెనుక మాంకూ పాత్ర ఎంత? బెంగుళూరులో వ్యాపారం చేసుకుంటున్నఏంథోనీ చిన్నప్పకి గాళిదేవరు గురించి ఎలా తెలిసింది? అప్పటివరకూ గాళిదేవరు తమ ఎస్టేట్ లో వెలిసినందుకు గర్వపడుతున్న సోమయ్య అసలు కథ తెలిశాక ఎలా స్పందించాడు? తదితర విషయాలన్నీ కథ చదివి తెలుసుకుంటేనే బాగుంటుంది.

నాటి, నేటి రచయితలూ, రచయిత్రుల డెబ్భై ఎనిమిది కథలతో తిరుపతికి చెందిన అధ్యాపకుడు సాకం నాగరాజు ప్రచురించిన 'తెలుగు కథకి జేజే!' సంకలనంలో ఉందీ కథ. ఇదొక్కటే కాదు సంకలనం లో ఉన్న చాలా కథలు మళ్ళీ మళ్ళీ చదివించేవే. ఆరువందల రెండు పేజీల ఈ అందమైన సంకలనం వెల మూడు వందల రూపాయలు. ఈ సంకలనాన్ని నాకు కానుకగా ఇచ్చిన ఫ్రెండ్ ని, ఆ సందర్భాన్నీ మరోమారు ఆప్యాయంగా గుర్తు చేసుకుంటూ...

బుధవారం, నవంబర్ 10, 2010

చిల్లరకొట్టు-సూపర్ బజారు

ఇప్పుడంటే 'షాపింగ్' అని ఒకింత స్టైలుగా చెప్పి బజారుకి బయలుదేరుతున్నాం కానీ, చిన్నప్పుడు ఇంట్లోకి ఏం కావాలన్నా చిల్లర కొట్టుకి పరిగెత్తే వాళ్ళం, కూసింత గర్వంగా. రెండు కొట్లు ఇంచుమించు ఎదురెదురుగా ఉండేవి. ఒకటి కొంచం పెద్దది. జనం ఎక్కువగా ఉంటారు. రెండోది మా సుబ్బమ్మ గారిది. చిన్న కొట్టే అయినా దొరకని వస్తువు దాదాపు ఉండదు. నా మొగ్గెప్పుడూ సుబ్బమ్మగారి కొట్టు వైపే ఉండేది. ఒకే ఒక్క సిగరెట్ కొన్నా (నాక్కాదు, నాన్నకి) నాలుగు బఠాణీలో చిన్న బెల్లంముక్కో 'కొసరు' ఇచ్చేవాళ్ళు. (ఇది మాత్రం అచ్చంగా నాకే, ఎవరికీ వాటా లేదు).

ఇంట్లో ఉన్నంతసేపూ కొట్టుమీదకి వెళ్ళే అవకాశం ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూసేవాణ్ణి. చిన్న వస్తువు కొనుక్కు రాడానికైనా, కొట్టు దగ్గర మనకి నచ్చినంత సేపు కూర్చోవచ్చు. నలుగురూ చేరతారు కాబట్టి ఊళ్ళో కబుర్లు వినొచ్చు. వస్తూ వస్తూ కొసరు చప్పరించొచ్చు. పైగా, కొట్టు దగ్గర ఉన్నంతసేపూ చదువు బాధ ఉండనే ఉండదు. కానీ ఏం లాభం, తరచుగా కొట్టుమీదకి వెళ్ళే అవకాశం ఉండేది కాదు. ఒకటో తారీఖునో, రెండో తారీఖునో నెల సరుకులన్నీ పొరుగూరి నుంచి బండి మీద వచ్చేసేవి.


అమ్మ రెండు రోజులు శ్రద్ధగా కూర్చుని చీటీ రాసినా, తప్పకుండా కొన్నయినా మర్చిపోతూ ఉండేది. వాటిని తేడానికీ, ఇంకా నాన్నకి సిగరెట్లు, అగ్గిపెట్టెలు తేడానికీ నా కొట్టు యాత్ర సాగుతూ ఉండేది. శ్రీరమణ కథ 'ధనలక్ష్మి' లో కథానాయిక ధనలక్ష్మి కిరాణా వ్యాపారం చేయడంలో సూక్ష్మాలని తన భర్త రామాంజనేయులుకి చెబుతూ అంటుంది కదా "మనం చిన్న వాళ్ళం. సెంటర్ లో పెద్ద షాపుల వాళ్ళతో పోటీ పడాలంటే ఒకటే చిట్కా. మన దగ్గర సమస్తం దొరుకుతాయని పేరు పడాల. పేరొస్తే బేరాలు వాటంతటవే వస్తాయ్.." ఏ ధనలక్ష్మీ వ్యాపార సూత్రం చెప్పకపోయినా మా ఊరి చిల్లరకొట్ల వారు ఈ ఫార్ములాని అమలు చేసేయడంవల్ల దొరకని వస్తువంటూ ఉండేది కాదు.

నగరజీవితంలో మొదట కిరాణా షాపులనీ, మినీ-సూపర్ బజార్లనీ ఆ తర్వాత్తర్వాత బడా సూపర్ బజార్లనీ చూశాన్నేను. చెప్పకపోవడం ఎందుకు, సూపర్ బజార్లో షాపింగ్ అంటే భలే ఇష్టం నాకు. షాపుల్లో పుస్తకాల షాపు తర్వాత నాకు నచ్చే రెండో షాపు సూపర్ బజారే. ఎన్నెన్ని వస్తువులు... ఎంత చక్కని అమరిక.. ఎన్ని రకాల పరిమళాలు. క్రమం తప్పకుండా పుస్తకాల షాపుకి వెళ్తే కొత్త పుస్తకాల గురించి తెలిసినట్టే, రెగ్యులర్గా సూపర్ బజారుకి వెళ్తే కొత్త వస్తువులు ఏం వచ్చాయో తెలిసిపోతుంది కదా. సూదిపిన్ను మొదలు సూపర్రిన్ వరకూ (అబ్బే, ప్రాస కోసం) దొరకని వస్తువంటూ ఉంటుందా? గేటు దాటి లోపలి వెళ్తే అదో కొత్త ప్రపంచం.


రెండుమూడేళ్ళ క్రితం, అప్పటివరకూ నేను రెగ్యులర్గా వెళ్ళిన ఒకానొక సూపర్ మార్కెట్ ఉన్నట్టుండి మూత పడింది. కారణం ఆర్ధిక మాంద్యం అని వినికిడి. ఆ షాపు నాకెంతగా పరిచయం అంటే.. ఏ వస్తువు ఏ రాక్ లో దొరుకుతుందో సేల్స్ వాళ్ళకన్నా నాకే బాగా తెలిసేది. కనిపించిన వాళ్ళందరికీ ఫలానా సూపర్ మార్కెట్లో సరుకులు కొనుక్కోమని చెప్పాను కూడా, అక్కడికి నేనేదో వాళ్ళకి మార్కెటింగ్ చేస్తున్నట్టు. నవ్విన వాళ్ళు నవ్వారు. నవ్విన నాపచేను పండలేదు కానీ, కొన్నాళ్ళకి ఆ సూపర్ మార్కెట్ మూతపడింది. అక్కడ ఆఖరి షాపింగ్ చేసిన రోజు నాకింకా బాగా జ్ఞాపకం. ఇప్పటికీ అక్కడ కొన్న కొన్ని వస్తువులు చూసినప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఆతర్వాత ఏ షాపుతోనూ అంతగా అనుబంధం బలపడలేదు.

సూపర్ బజార్ల వాళ్ళు రకరకాల స్కీములు పెడుతూ ఉంటారు. మిగిలిన షాపులకన్నా తమ దగ్గర ధరలు తక్కువ అని భ్రమ పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆవుని అమ్మడానికి వెళ్ళిన వాళ్ళ చేత గేదెను కొనిపించేందుకు ఏం చేయాలో అన్నీ చేయగలరు వాళ్ళు. మనమేమో అన్నీ కాకపోయినా కొన్ని తెలిసినా, అస్సలు ఏమీ తెలియనట్టు వాళ్ళు చెప్పేవి వింటూ నమ్మినట్టు నటిస్తూ ఉండాలి. తగుమాత్రం జాగ్రత్తలో ఉండకపోతే క్రెడిట్ కార్డు తాలూకూ లిమిట్ కూడా దాటిపోయే ప్రమాదం ఉంది. ఈమధ్య ఒక సూపర్ బజారుకి వెళ్ళినప్పుడు బిల్లుతో పాటు ఒక కార్డు కూడా ఇచ్చాడు కౌంటర్ అబ్బాయి. అక్కడ కొన్నప్పుడల్లా ఆ కార్డు చూపిస్తే భవిష్యత్తులో డిస్కౌంట్లు వస్తాయిట. కార్డు ఉచితమేనట.. నాకు మా సుబ్బమ్మగారు గుర్తొచ్చారు.

మంగళవారం, అక్టోబర్ 26, 2010

సూక్ష్మం

మనకి చాలా బ్యాంకులున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, సహకార బ్యాంకులతో పాటు ఈమధ్యనే విస్తరిస్తున్న విదేశీ బ్యాంకుల వరకూ... ఓ మాదిరి పట్టణంలో కనీసం ప్రతి ప్రధాన వీధిలోనూ ఒకటి రెండు బ్యాంకు శాఖలు కనిపించే విధంగా బ్యాంకులు విస్తరించాయి. కానీ ఈ బ్యాంకుల్లో అప్పు పుట్టాలంటే విలువైన వస్తువో పత్రమో తనఖా పెట్టాలి. అప్పుడు మాత్రమే మనకి కావలసిన మొత్తాన్ని అప్పురూపంలో కళ్ళ చూడగలం. వడ్డీతో సహా బాకీ తీర్చేశాక మనం తనఖా పెట్టిన వస్తువునో పత్రాన్నో వెనక్కి తెచ్చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే.

సామాన్యుడి మొదలు టాటా బిర్లాల వరకూ (వీళ్ళ పక్కనే మన తెలుగు తేజం జగన్ని కూడా చేర్చాలన్న వాదన వినిపిస్తోంది) డబ్బు అవసరం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తనఖా పెట్టగల శక్తి ఉన్నవాళ్ళ కోసం బ్యాంకు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మరి రెక్కల కష్టం తప్ప వేరే ఆధారం లేని వాళ్లకి? వడ్డీ వ్యాపారులు ఉంటారు (వీళ్ళనే ఒకప్పుడు ముద్దుగా కాబూలీవాలాలు అనేవాళ్ళు), వీళ్ళు అవసరానికి అప్పిస్తారు. వడ్డీ రేటు బాగా ఎక్కువగానే ఉంటుంది. చెప్పిన సమయానికి బాకీ కట్టకపోతే ఇంట్లో విలువైన వస్తువులతో పాటు, విలువ కట్టలేని పరువూ బజార్న పడుతుంది.

మేనేజ్మెంట్ పుస్తకాలు తిరగేస్తే మనకెన్నో విజయ గాధలు కనిపిస్తాయి. తోపుడు బండి మీద ఇడ్లీలు అమ్ముకున్న కుర్రాడు స్టార్ హోటల్ చైర్మన్ కావడం లాంటి నమ్మశక్యం కాని నిజాలెన్నో వాటిలో ఉంటాయి. రెక్కల కష్టాన్ని మాత్రమే నమ్ముకుని, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకి తక్కువ వడ్డీకి అప్పిచ్చి, సులభ వాయిదాల మీద వాళ్ళ దగ్గరనుంచి బాకీ వసూలు చేసుకుంటే..? అప్పిచ్చిన సంస్థతో పాటు, అప్పు తీసుకున్న వాళ్ళూ క్రమంగా ఎదిగే అవకాశం ఉంది కదా? ఈ ఆలోచనే బంగ్లాదేశ్ కి చెందిన యూనస్ సుల్తాన్ కి వచ్చింది, ముప్ఫై నాలుగేళ్ల క్రితం. ఫలితం, గ్రామీణ బ్యాంకు స్థాపన.

ఈ గ్రామీణ బ్యాంకు విజయ గాధ ఆనోటా, ఆనోటా పాకి ప్రపంచానికంతటికీ తెలిసింది. యూనస్ కి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అంతే కాదు, ఈ గ్రామీణ బ్యాంకు పధకాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి సూచించింది. ఫలితంగా సూక్ష్మ ఋణం (మైక్రో ఫైనాన్స్) మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రవేశించింది. సరిగ్గా అదే సమయంలో మన రాష్ట్రంలో ఏలిన వారికి మహిళా శక్తి మీద అపారమైన గురి కుదిరి ఊరూరా స్వయంశక్తి సంఘాలు (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్) ప్రారంభించాలని సంకల్పించారు. రాజు తలచుకుంటే కానిదేముంది? స్వయంశక్తి సంఘాలకి ప్రభుత్వం లోన్లిచ్చింది. ఈ సంఘాల విజయాన్ని (కొన్ని) పత్రికలు వేనోళ్ళ పొగిడాయి. సూక్ష్మఋణ సంస్థలు చాపకింద నీరులా విస్తరించాయి.

అన్నీ సక్రమంగా జరిగిపోతే ఇంక రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ నాయకుల స్వప్రయోజనాలు ఇవన్నీ ఎలా? అందుకే ముసలం పుట్టింది. ముందుగా స్వయం శక్తి సంఘాలకి ఋణ సరఫరా ఆగిపోయింది. నిజానికి ఇలా ఆగిపోవడంలో ప్రత్యక్షంగా సంఘ సభ్యులదీ, పరోక్షంగా రాజకీయ నాయకులదీ పాత్ర ఉంది. ఉత్పాదకత ఉన్నా లేకున్నా సంఘం నుంచి నెలనెలా ఋణం తీసుకుని, సులభ వాయిదాలలో చెల్లించడానికి అలవాటు పడ్డ సంఘ సభ్యులకి బ్యాంకుల నుంచి లింకేజి లోన్లు అందకపోవడం ఊహించని పరిణామం. లోన్లు ఆగిపోయినా, అవసరాలు ఆగవు కదా.

సరిగ్గా ఇప్పుడే, ఇప్పటికే చాపకింద నీరులా విస్తరించిన సూక్ష్మ ఋణ సంస్థలు తమ ఏజెంట్లని ఊళ్ళ మీదకి వదిలాయి. బ్యాంకులకి బదులుగా ఈ సంస్థలు స్వయం శక్తి సంఘాలకి రుణాలిస్తాయి, రెండు షరతుల మీద. మొదటగా సంఘం పేరు మార్చి కొత్త గ్రూపుగా ఏర్పడాలి.. పేరులో ఏముంది?? రెండో నిబంధన వడ్డీ.. బ్యాంకుల కన్నా'కొంచం' ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు ఆడడం ముఖ్యం కానీ, వడ్డీ కొంచం ఎక్కువైతే ఏమైంది??? ...ఈ ఆలోచనా ధోరణి సూక్ష్మ ఋణ సంస్థల పంట పండించింది.

మరోవైపు, స్వయంశక్తి సంఘాలకి వసూలవుతుందో లేదో తెలియని రుణాన్ని తక్కువ వడ్డీకి అందించడం కన్నా, అదే మొత్తాన్ని సూక్ష్మ ఋణ సంస్థలకి అప్పిస్తే కచ్చితంగా బాకీ వసూలవుతుందన్న హామీ ఉండడంతో బ్యాంకులు సైతం ఈ సంస్థలకి రుణాలివ్వడానికే మొగ్గు చూపుతున్నాయి. పైగా, నిబంధనల ప్రకారం ఈ సంస్థలకి ఋణం ఇవ్వడమూ 'సేవ' కిందకే వస్తోంది. సేవా సంస్థలన్న ముసుగు ఉండడం, నిన్న మొన్నటివరకూ వడ్డీ మీద ఎటువంటి నియంత్రణా లేకపోవడంతో ఈ సూక్ష్మ ఋణ సంస్థలది అక్షరాలా ఆడింది ఆట అయ్యింది. కాబూలీవాలాలే నయమనిపించేలా తయారయ్యింది పరిస్థితి.

కేవలం ఈ సంస్థలని మాత్రమే తప్పు పట్టడం సరికాదు. శక్తికి మించి అప్పులు తీసుకోవడం, ఆపై ప్రభుత్వం ఈ అప్పులని మాఫీ చేసుందన్న ధీమాతో బాకీలు చెల్లించకపోవడం అలవాటు చేసుకున్న ప్రజలూ ఉన్నారు మరి. ఋణ సంస్థలకైనా, బ్యాంకులకైనా కావాల్సింది వ్యాపారమే కాబట్టి వారి వారి వ్యాపార విస్తరణ వాళ్ళు చూసుకుంటున్నారు. సమస్య పరిష్కారం కన్నా, మీడియా కవరేజితో పూట గడవడమే ప్రతిపక్షాలకి ముఖ్యం కనుక వాళ్ళనీ ఏమీ అనలేం. మరి ప్రభుత్వం? "ఆయనే ఉంటే..." అన్న పాత సామెత గుర్తొస్తే తప్పు నాది కాదు.

సోమవారం, అక్టోబర్ 18, 2010

రాజేశ్ కి అభినందనలు...

అనంతపురం జిల్లాకి చెందిన యువ గాయకుడు రాజేశ్ కుమార్ కి అభినందనలు. ఈటీవీ నిర్వహించిన 'పాడుతా తీయగా' కార్యక్రమం ఫైనల్స్ లో ప్రధమ విజేతగా నిలిచిన రాజేశ్, సిని నటుడు చిరంజీవి చేతుల మీదుగా పది లక్షల రూపాయల బహుమతిని అందుకున్నారు . గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యాత మరియు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతమూ ఆసక్తికరంగానూ, మునుపటి సిరీస్ కన్నా కొంచం వైవిధ్యంగానూ సాగింది.

రాజేశ్ తనకి చిన్నప్పటి నుంచీ సంగీతం అంతే మక్కువ అనీ, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాననీ, ఘంటసాల, బాలూలు తన అభిమాన గాయకులనీ ఫైనల్స్ కి ఎంపికైన సందర్భంగా చెప్పారు. రాజేశ్ చేసిన నిరంతర సంగీత సాధన సత్ఫలితాన్నే ఇచ్చింది. 'పాడుతా తీయగా' ప్రారంభించిన నాటినుంచీ ప్రతి సిరీస్ లోనూ ఫైనల్స్ కి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలని ఎంపిక చేసి వారిలో ఒక అబ్బాయినీ, అమ్మాయినీ విజేతలుగా ప్రకటించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సిరీస్ లో అందుకు భిన్నంగా ముగ్గురు అమ్మాయిలు - లిప్సిక, మల్లిక, సబీహ - ఒకే అబ్బాయి రాజేశ్ ఫైనల్స్ కి ఎంపికయ్యారు.

సెమి-ఫైనల్స్ వరకూ ఖమ్మం జిల్లాకి చెందిన లిప్సిక, కడపకి చెందిన సబీహాల మధ్య 'నువ్వా-నేనా' అన్నట్టుగా జరిగిన పోటీ సరళి, ఫైనల్స్ కి వచ్చేసరికి అనూహ్యంగా మలుపు తిరిగి, రాజేశ్-లిప్సిక ల మధ్య పోటీగా మారింది. బాలసుబ్రహ్మణ్యం అభిమాన గాయని అయిన లిప్సిక విజేతగా ఎంపికవుతుందన్న నా అంచనాని తారుమారు చేస్తూ ఫలితాలు వెలువడ్డాయి. లిప్సిక రెండో స్థానంలో నిలిచి ఐదు లక్షల రూపాయల బహుమతిని అందుకున్నారు. మల్లిక, సబీహ లు వరుసగా మూడు నాలుగో స్థానాల్లో నిలిచారు.

నిజానికి నేనీ కార్యక్రమం క్రమం తప్పకుండా చూడడానికి కారణం సబీహ. ఈమె గొంతుని "మధుర స్వరం" అనడానికి సందేహం అనవసరం. ఈ పోటీలో తను పాడిన పాటల్లో "ఈ ఎర్రగులాబీ.." పాట ఇష్టమని సబీహ చెప్పారు. నాకు మాత్రం బాపు-రమణ ఎపిసోడ్ లో పాడిన "నిదురించే తోటలోకి.." చాలా చాలా నచ్చింది. సాఫీగా సాగిపోయే పాటలని అలవోకగా పాడేసే సబీహాకి, హుషారైన పాటలు పాడడం కొంచం కష్టమైన విషయం అనిపించింది, ఈమె పాడిన కొన్ని పాటలు విన్నప్పుడు. ఫైనల్స్ లో రెండు రౌండ్స్ లో హుషారైన గీతాలు పాడాల్సి రావడం సబీహకి మైనస్ గా మారిందని అనిపించింది. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ఆలస్యంగా (ఈ మధ్యనే) మొదలు పెట్టడం మరో మైనస్ అయ్యింది.

లిప్సిక గొంతులో మాధుర్యం పాళ్ళు తక్కువే అయినా, హుషారైన పాటలు పాడడం లో లిప్సిక ప్రతిభని తక్కువ చెయ్యలేం. చిన్నప్పటి నుంచే శాస్త్రీయ సంగీత నేర్చుకోవడం ఈమె ప్లస్ పాయింట్. గొంతులో ఉండే కొద్దిపాటి జీర, పాటని అనుభవిస్తూ పాడే విధానం లిప్సిక ప్రత్యేకతలు. ఒక ఎపిసోడ్ లో ఈమె 'మానసవీణ మధుగీతం...' పాట పాడినప్పుడు న్యాయనిర్ణేత బాలూ స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం, సెమి-ఫైనల్స్ లో ఒక రౌండ్ లో నూటికి నూరు మార్కులు ఇవ్వడం (పోటీల్లో, ముఖ్యంగా సెమి-ఫైనల్స్ దశలో ఇలా వందశాతం మార్కులు రావడం చాలా అరుదు) లిప్సిక ప్రతిభకి, ఈమె గళం పట్ల బాలూ అభిమానానికీ నిదర్శనం అని చెప్పాలి.

ప్రారంభపు ఎపిసోడ్లలో సాధారణంగానే పాడిన గుంటూరు జిల్లాకి చెందిన గాయని మల్లిక క్వార్టర్ ఫైనల్స్ నుంచి తన కృషిని రెట్టింపు చేశారు. ఎక్స్ ప్రెషన్ ని అలవోకగా పలికించడం ఈమె గళానికి ప్రత్యేకం. బహుమతి ప్రధానానికి చిరంజీవిని ముఖ్య అతిధిగా ఆహ్వానించడం వల్ల అప్పటివరకూ సాఫీగా సాగిన కార్యక్రమంలో ఒక్కసారిగా హడావిడి చోటు చేసుకుంది. దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో హంగామా సృష్టించారు. ఒక సంగీత కార్యక్రమంగా 'పాడుతా తీయగా' ని తీసుకున్నప్పుడు, ముగింపు అసమగ్రంగా, అసంతృప్తిగా అనిపించింది.

మిగిలిన చానళ్ళలో వచ్చే సిని సంగీత కార్యక్రమాలతో పోల్చినప్పుడు ఇప్పటికీ 'పాడుతా తీయగా' చాలా రెట్లు నయం అనిపిస్తుంది నాకు. ఎస్సెమ్మెస్ల బెడద, ఎలిమినేషన్ తాలూకు అనవసర నాటకీయ దృశ్యాలు వంటి వాటికి అతీతంగా సాఫీగా సాగడమే ఇందుకు కారణం. ఈసారి కార్యక్రమంలో గాయనీ గాయకుల విషయంలో ప్రాధమిక దశ నుంచే క్వాలిటీ తగ్గిందన్నది చాలా చోట్ల వినిపించిన మాట. ఎంపికైన వారు 'జిల్లాకి ఒక్కరు' అనిపించేలా లేరన్నది ఫిర్యాదు. అలాగే మార్కులని మరికొంచం పారదర్శకంగా ఇస్తే బాగుంటుంది. కనీసం క్వార్టర్ ఫైనల్స్, కీలకమైన సెమి-ఫైనల్స్ దశలో అయినా మార్కులకి సంబంధించి మరికొంచం వివరణ జోడించడం అవసరం. అనవసరపు మసాలాలు ఏవీ చేర్చకుండా ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని ఆశిస్తూ...

బుధవారం, అక్టోబర్ 13, 2010

చూడాల్సిందేనా?

ఒక నటుడికి అవార్డు వచ్చినందుకూ, మరో నటుడికి రానందుకూ రెండు వర్గాల మధ్యనా మాటల యుద్ధం. అవార్డు రావడం ఎంత సమంజసమో ఒకరు వివరిస్తే, రాకపోవడం వెనుక కుట్రల్ని మరొకరు బహిర్గతం చేస్తారు. వీళ్ళిలా కొట్టుకుంటూ ఉంటే జనం చచ్చినట్టు తమ చానల్నే చూస్తారన్న ఆనందం సదరు టీవీ చానల్ యాంకర్ ముఖంలో దాచినా దాగదు. మాటల మంటలు ఆరిపోకుండా మధ్య మధ్యలో సమిధలు విసురుతూ ఉంటాడతను. ఈలోగానే ఈ ముఖ్యాతి ముఖ్యమైన విషయం గురించి జనం తమ అమూల్య అభిప్రాయాలు ఎస్సెమ్మెస్ ద్వారా చెప్పాలంటూ స్క్రోలింగులు... చూడాల్సిందేనా?

కర్ణాటక రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. డైలీ సీరియల్ని మించిన ట్విస్టులతో మాంచి ఉత్కంఠ భరితమైన మలుపులు తిరుగుతోంది. రాజ్యాంగ, రాజ్యాంగేతర శక్తులన్నీ తమ తమ శక్తి మేరకి ఈ కథకి మసాలా దినుసులని అందిస్తున్నాయి. తలనెరిసిన జనాలంతా రాజకీయ విశ్లేషకుల అవతారాలెత్తి చానళ్ళని పావనం చేసి జరుగుతున్న సంఘటనల పట్ల తీవ్ర దిగ్భ్రమనీ, దిగ్భ్రాంతినీ తమ వాక్చాతుర్యం మేరకి వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమాల నిర్వాహకులు ప్రజాస్వామ్యానికి ఇంతటి కష్టం ఇంతకుముందెప్పుడూ కలగలేదనీ, మరిన్ని అప్డేట్స్ కోసం తమ చానల్ చూస్తూనే ఉండమనీ సూచిస్తున్నారు... చూడాల్సిందేనా??

సంపదలో తాజాగా టాటాలనీ, బిర్లాలనీ మించిపోయిన రాజకీయ వారసుడు ఎవరూ ఊహించని మొత్తాన్ని ముందస్తు ఆదాయపు పన్నుగా చెల్లించాడు. కిట్టని వాళ్ళు ఈ పన్ను ఆధారంగా అతని ఆదాయాన్ని అంచనా వేసి గుండెలు బాదుకుంటుండగా, అతనేం చేసినా ముద్దుగానే అనిపించే వాళ్ళు అణా పైసలతో సహా లెక్కేసి పన్ను కట్టేయడం అతని నిజాయితీని సూచిస్తోందనీ, విమర్శలు చేసేవాళ్ళంతా పన్నులు ఎగేసే రకాలనీ టీవీ చానళ్ళ సాక్షిగా జనాలకి వివరిస్తున్నారు. చానళ్ళన్నీ ఇరువర్గాలతో తమకున్న సంబంధ బాంధవ్యాల మేరకు జరుగుతున్న తతంగాన్నంతా తమదైన దృష్టి కోణం నుంచి తిలకిస్తూ, ప్రేక్షకులని కూడా అదే దృష్టితో చూడమంటున్నాయి... చూడాల్సిందేనా???

ఎందుకొచ్చిన వార్తలనిపించి, ఎంటర్టైన్మెంట్ చానళ్ళ వైపు మళ్ళితే, ఒకప్పుడు వెండితెర మీద ఆడిపాడిన నాయిక ఇప్పుడు పెద్దంచు చీరలు కట్టుకుని పెద్ద తరహాగా కుటుంబ సమస్యలకి పరిష్కారాలు చెప్పేస్తోంది. గొడవ పడుతున్న కుటుంబ సభ్యులని రెండు పక్కలా కూర్చోబెట్టుకుని, వాళ్ళు ఒకరినొకరు తిట్టుకునే తిట్లని సెన్సార్ లేకుండా వింటూ, మనకి వినిపిస్తూ తనకి తోచిన సలహాలు చెప్పేస్తోంది. పనిలో పనిగా లాయర్లనీ, మానసిక వైద్యులనీ స్టూడియోలకి రప్పించి వాళ్ళచేతా సలహాలు చెప్పించేస్తోంది. వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి మాత్రమే పరిమితం చేసుకోవాల్సిన గొడవలని మనం చూడాల్సిందేనా?

మానవ హక్కుల కమిషన్ తప్పు పట్టినా చలించకుండా ముక్కు పచ్చలారని పసిపిల్లలకి మూడోవంతు కురచ బట్టలేసి, ఏకార్ధపు పాటలకి వాళ్ళ చేత డాన్సులు చేయిస్తున్న 'అన్నయ్య'లూ 'తాతయ్య'లూ అంతటితో ఆగకుండా "వచ్చే జన్మంటూ ఉంటే నీ కడుపున పుట్టాలని ఉందమ్మా.." అంటూ తమ తమ పాత్రల్లో జీవించేస్తున్నారు. "ఇలాగేనా స్టెప్పులేయించడం?" అని డేన్సు మేష్టర్లని అదిలించడం అయితేనేమి, "పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ కాకపొతే నిన్ను ఎలిమినేట్ చేసేస్తా" అంటూ చిన్నారుల్ని బెదిరించడం అయితేనేమి.. ఈ రియాలిటీ షోలు తమ పంధాని ఏమాత్రం మార్చుకోలేదు. అయినా కూడా వీటిని చూడాల్సిందేనా??

ఓపక్క థియేటర్లు జనాల్లేక వెలవెలబోతున్నా తమ సినిమా అన్ని రికార్డులనీ బద్దలుకొడుతోందని నిర్లజ్జగా ఇంటర్యూలిచ్చే సినిమా బృందాలు, "నీకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదా? మరి పాటని ఎవరికి డెడికేట్ చేయమంటావ్?" అంటూ కుర్రాళ్ళని కవ్వించే యాంకరీమణులు, వందలూ వేలూ ఎపిసోడ్లు జరిగిపోయాక కూడా ఇంకా పాలల్లో విషాలు కలుపుకునే అత్తలూ, కోడళ్ళూ, తన రెండో భర్తకి మూడో భార్య ఉందని తెలిసి రగిలిపోయే మహిళా పాత్రలున్న, అపూర్వ మహిళాదరణతో దీర్ఘ కాలంగా కదులూ మెదులూ లేకుండా కొనసాగుతున్న అరవ డబ్బింగ్ సీరియళ్ళూ... వీటన్నింటినీ కిమ్మనకుండా చూడాల్సిందేనా???

ఆదివారం, అక్టోబర్ 10, 2010

తోడికోడలు

కుటుంబ బంధాల్లో చాలా చిత్రమైన బంధం తోడికోడలు. అప్పటివరకూ ఒకరికొకరు ఏమాత్రం తెలియని స్త్రీలు, ఒకే కుటుంబంలోని అన్నదమ్ములని వివాహం చేసుకున్న కారణంగా ఒకే ఇంట్లో అక్కాచెల్లెళ్ళుగా కలిసి ఉండాల్సిన పరిస్థితి. అంతే కాదు, ఉమ్మడి కుటుంబాల రోజుల్లో ఒక కుటుంబం కలిసి ఉండడంలోనూ, విడిపోవడంలోనూ కూడా ప్రధాన పాత్ర పోషించింది తోడికోడళ్ళే. ఈ బంధాన్ని కథావస్తువుగా తీసుకుని దశాబ్దకాలం క్రితం చంద్రలత రాసిన కథ 'తోడికోడలు.'

కథానాయిక చిత్ర అమెరికాలో కంప్యూటర్స్ లో ఎంఎస్ పూర్తి చేసింది. తన చిరకాల సైబర్ స్నేహితుడు సంపత్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ పెళ్ళికి సంపత్ వైపు నుంచి పెద్దరికం వహించింది అతని అన్న అనంత్ భార్య శారద. అలా తన తోడికోడలు శారదని తొలిసారిగా తన ఇంట్లో కలుసుకుంది చిత్ర. పొడవు లోనూ, చదువులో మాత్రమే కాదు, అంతస్తులోనూ చిత్ర కన్నా తక్కువే శారద. ఆమె కట్టు, బొట్టు, మాట, మన్నన అన్నీ మామూలుగానే ఉన్నాయి. అయితే, చిత్రని తొలి చూపులోనే ఆకర్షించింది శారద కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ధీమా.

డిఫార్మసీ చేసిన శారద ఓ చిన్న పల్లెటూరి నుంచి హైదరాబాద్ వచ్చింది. అది కూడా అనంత్ ని పెళ్లి చేసుకున్నాకే. పెళ్ళయ్యాక ఓ పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలో చిన్న ఉద్యోగానికి చేరింది. శారద లో కనిపించే ధీమాకి పక్కతాళం వేస్తున్నట్టు చురుకైన చూపులు. ఆ చూపుల్లో అహంకారం, అభిజాత్యం కనిపించకపోయినా, ఆ చూపులు వెంటాడుతూనే ఉన్నాయి చిత్రని. అనంత్ ఉద్యోగం మానేసి ఫైనాన్స్ కంపెనీ పెడితే, తను ఉద్యోగం చేస్తూ తనకి తెలిసిన వాళ్ళందరినీ చిట్టీల్లో చేర్పించింది శారద.

పెళ్ళయ్యాక ఉద్యోగానికి అమెరికా వెళ్ళిపోయిన చిత్రకి ఓ అర్ధరాత్రి పుట్టింటి నుంచి ఫోన్. శారద తమ ఇంటికి వచ్చిందనీ, అనంత్ కనిపించక రెండు వారాలు అయ్యిందనీ. చిత్ర కళ్ళ ముందు ధీమాగా ఉండే శారద రూపం మెదులుతుంది. కానీ, కట్టాల్సిన బాకీ డబ్బు ముప్ఫై నలభై లక్షలు ఉందనగానే గుండెల్లో రాయి పడుతుంది. అమెరికాలో ఇప్పుడిప్పుడే స్థిర పడుతున్న తమ మీద ఆ భారం పడుతుందేమో అన్న ఆలోచన ఆమెని స్థిరంగా ఉండనివ్వదు. అప్పు చేసి కొన్న కారు, కొనాలనుకుంటున్న ఇల్లూ కళ్ళ ముందు మెదులుతాయి.

తమకి సెలవు దొరికాక ఇండియాకి వెళ్తారు చిత్ర, సంపత్. అనంత్ సంగతులు శారదకి తెలిసినా ఎవరికీ చెప్పడం లేదని సంపత్ కి చెబుతుంది అతని తల్లి. చిట్టీలు కట్టిన వాళ్ళూ, పోలీసులూ, రౌడీలూ శారదని ఎలా ఇబ్బందులపాలు చేస్తున్నారో చిత్రకి వివరిస్తారు ఆమె తల్లిదండ్రులు. తిరిగి అమెరికాకి వెళ్ళే రోజున శారదతో మాట్లాడడానికి వెళ్తారు చిత్ర,సంపత్ లు. తనక్కడ ఉంటే శారద మాట్లాడడానికి ఇబ్బంది పడుతుందని భావించిన చిత్ర పక్క గదిలోకి వెళ్ళబోతే, ఆమెని చేయి పట్టి ఆపుతుంది శారద.

చిత్ర భయపడ్డట్టుగానే, అన్నగారి బాకీలన్నీ తను తీర్చేస్తానని వదినకి హామీ ఇస్తాడు సంపత్. అన్నకి విడాకులిచ్చేయమని వదినకి సలహా ఇస్తాడు కూడా. చిత్రని ఆశ్చర్య పరుస్తూ ఆ సాయాన్ని తిరస్కరిస్తుంది శారద. అంతే కాదు, అనంత్ గురించి తనకి మాత్రమే తెలిసిన ఒక రహస్యాన్ని చిత్రతో పంచుకుని, తను ఏం చేయబోతోందో కూడా వివరంగా చెబుతుంది. "నువ్వు సంపత్ కు ఈ విషయం చెప్పవనే నా నమ్మకం చిత్రా. ఎందుకంటే... సంపత్ ఆ అన్నకు తమ్ముడేగా...!" శారద మాటల్లో హేళన ఉందో, హెచ్చరికే ఉందో తెలియదు చిత్రకి. ఆమాటలు అనుక్షణం ఆమెని వెన్నాడుతూనే ఉన్నాయి, శారద చూపుల్లాగే.

చంద్రలత కథల సంపుటి 'ఇదం శరీరం' లో 'తోడికోడలు' కథని చదవవచ్చు. 'ప్రభవ' పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకం వెల రూ. 75. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తుంది. 'తోడికోడలు' తో పాటు ఉన్న మిగిలిన ఎనిమిది కథలూ ఆసాంతమూ చదివించేవే.

శుక్రవారం, అక్టోబర్ 08, 2010

వానగోదారి

ఆకాశం మబ్బుపట్టి ఉంది. ఉదయం కరిగి మధ్యాహ్నం మొదలవ్వబోతున్న వేళైనా వాతావరణం చల్ల చల్లగా ఉంది. ఉండుండి వీస్తున్నగాలి హాయిగొలుపుతోంది. మరి కాసేపట్లో గోదారి బ్రిడ్జి చేరుకోబోతున్నా. వర్ష ఋతువు కదూ.. ఎర్రెర్రని నీళ్ళతో కళకళ్ళాడిపోతూ ఉండి ఉంటుంది గోదారమ్మ. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఒక్కో ఋతువులోనూ ఒక్కో అందం మా గోదారిది. వేసవి వేడికి చిక్కిపోయిన గోదారే, నాలుగు వానలు పడేసరికి పెద్దరికం తెచ్చేసుకుని నిండు ముత్తైదువలా గాంభీర్యాన్ని ప్రదర్శించేస్తూ ఉంటుంది.

మాటల్లోనే వచ్చేసింది గోదారి బ్రిడ్జి. ఎక్కడా..యెర్ర నీళ్ళు కనపడవే? వరదల్లో భయపెట్టిన ఉగ్రరూపం ఆనవాళ్ళుకూడా లేవిప్పుడు. అచ్చం ఏమీ తెలియని నంగనాచిలా చూస్తోంది అందరికేసీ. నీళ్ళు నిశ్చలంగా, తేటగా ఉన్నాయి. ఆకాశంలో పరుగులు తీస్తున్న నల్ల మబ్బుల నీడలు అద్దంలాంటి గోదారి నీళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి. చుట్టూ కొబ్బరి చెట్లు అంచు కడితే, మధ్య మధ్యలో పైకి తేలిన ఇసుక పర్రలూ, ఇక్కడోటీ అక్కడోటీగా తిరుగుతున్న పడవలూ చేయి తిరిగిన చిత్రకారుడు గీసిన పెయింటింగ్ లా మార్చేశాయి గోదారిని.

అరె.. మధ్యాహ్నం కాబోతుండగా ఇప్పుడు చలేస్తోందేమిటి? జర్కిన్ తెచ్చుకోవాల్సింది. బలంగా వీచిన గాలికి అనుకుంటా నిశ్చల చిత్రంలా అనిపించిన గోదారిలో కదలికలు కనిపించాయి. నీళ్ళలో కనిపిస్తున్న మబ్బుల తాలూకు నీడల ఆకృతుల్లో మార్పులు వచ్చేస్తున్నాయ్. ఏం జరుగుతోందబ్బా? ఠప్ ఠాప్ మంటూ నెత్తిమీద పడ్డ రెండు వాన చినుకులు జరుగుతున్నదేమిటో చెప్పకనే చెప్పాయి. చూస్తుండగానే, జ్ఞానం తెలియని పసివాడు తన రెండు చేతుల్నీ రకరకాల రంగుల్లో ముంచి వాటిని మళ్ళీ ఆర్టు పేపర్ మీద పెట్టినట్టుగా.. ఇంకొంచం వివరంగా చెప్పాలంటే మాడరన్ ఆర్టులా మారిపోయింది గోదారి.

పడవలో నల్ల గొడుగు తెరుచుకుంది. సరంగు బహుశా చుట్ట కాల్చుకుంటూ ఉండి ఉంటాడా? నా ఆలోచనకి నాకే నవ్వొచ్చింది. చినుకులకి తడుస్తున్నానన్న స్పృహ నాకు కలగక ముందే వాన ఆగిపోయింది. క్రమ క్రమంగా మాడరన్ ఆర్టు నిశ్చల చిత్రంగా మారుతోంది. మరి కాసేపు వర్షం పడితే ఎలా ఉండేదో? చినుకులు ఆగిపోయాయనడానికి సాక్ష్యంగా ఓ పక్షుల గుంపు శక్తి మేరకి ఎగురుతూ గోదారి దాటే ప్రయత్నం చేస్తోంది. ఉన్నట్టుండి మబ్బు చాటు నుంచి సూరీడు మెరిశాడు. ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు.. అదీ గోదారి మీద.. సౌందర్యానికి ఇంతకన్నా అర్ధం ఏముంటుంది?

ప్రయాణం సాగుతూ ఉండగానే రోజు ముగింపుకి వచ్చేసింది. సూరీడు మబ్బు దుప్పటి వదలక పోవడంతో గడియారం చూస్తే కానీ సమయం తెలియడం లేదు. గోధూళి వేళ.. కానీ గోవులూ లేవు, ధూళీ లేదు. ఉన్నదంతా బురదే. మళ్ళీ గోదారి. పూటన్నా గడవక ముందే మళ్ళీ ఏం చూస్తావ్? అనలేదు తను. ఎంతసేపు చూసినా అదివరకెరుగని కొత్తదనం ఏదో ఒకటి తనలో కనిపిస్తూనే ఉంటుంది. అందుకే మళ్ళీ చూడడం. నిజం చెప్పాలంటే మళ్ళీ మళ్ళీ చూడడం. వాన ఉద్ధృతంగా పడుతోందిప్పుడు. నింగినీ నేలనీ ఏకం చేస్తున్న వాన. రెయిన్ కోట్ నన్ను తడవనివ్వడం లేదు.

నల్లని ఆకాశం నుంచి తెల్లని వాన నీటి ధారలు నల్లని గోదారిలోకి చేసే ప్రయాణాన్ని చూడాల్సిందే. అప్పుడప్పుడూ మెరిసే మెరుపుల్లో ఈ నీటి ధారలు వెండి దారాలేమో అనిపిస్తోంది. పడవలు ఒడ్డుకి వచ్చేశాయ్. గొడుగుల జాడ లేదు. రంగురంగుల వర్ణ చిత్రంలోని రంగులన్నింటినీ కృష్ణవర్ణం తనలో కలిపేసుకుంది. ఇప్పుడు గోదారి కేవలం నలుపు తెలుపుల సమ్మేళనమే. చూస్తుండగానే చిన్న చిన్న ఇసుక పర్రలు మరింత చిన్నవై, ఇక అంతకన్నా చిన్నవి కాలేక గోదారిలో కలిసిపోయాయి మౌనంగా. సూర్యుడు అస్తమించేసినట్టున్నాడు. ఛాయామాత్రంగా అయినా కనిపించడం లేదు. దట్టంగా అలుముకున్న చీకటి వానగోదారిని తనలో కలిపేసుకుంది.

ఆదివారం, అక్టోబర్ 03, 2010

మిస్సమ్మ

తెలుగునాట గిలిగింతలు పెట్టే హాస్యంతో వచ్చిన సినిమాల జాబితా వేయాలంటే ఈనాటికీ మొదటివరుసలో ఉండే పేరు విజయా వారి 'మిస్సమ్మ'. నిర్మాణ విలువలకి పెట్టింది పేరైన విజయ సంస్థ, చక్రపాణి స్క్రిప్టు, ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం, సావిత్రి, రామారావు, యస్వీ రంగారావు, జమున, నాగేశ్వర రావు, రేలంగి వంటి ఉద్దండపిండాల అసమాన నటవైదుష్యం, పింగళి నాగేంద్ర రావు మాటలు, సాలూరి రాజేశ్వర రావు సంగీతం... వీటన్నింటి కలబోతే యాభై ఐదేళ్ళ నాటి ఆణిముత్యం 'మిస్సమ్మ.'

ఓ చిన్న కథని రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాగా మలచడంలో ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో చేసిన కృషి ఈ సినిమాని చిరంజీవిని చేసింది. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో దేశం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. బ్రిటిష్ వారి పుణ్యమా అని ఆంగ్ల విద్యా బోధన పెరగడంతో ఊరూరా బీయేలు పెరిగిపోయారు. మరోపక్క వారికి ఉద్యోగాలు చూపించగల స్థితిలో లేదు ప్రభుత్వం. ఈ నిరుద్యోగ సమస్యని ఉన్నదున్నట్టుగా చూపిస్తే అది డాక్యుమెంటరీ అవుతుంది కానీ కలకాలం నిలిచిపోయే సినిమా అవ్వదు కదా.

అందుకే ఈ కథకి "చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లకోసం వెతకడం" అనే ఫ్యామిలీ డ్రామాని జత చేసి ఎవ్వరికీ ఎక్కడా విసుగు కలిగించని విధంగా ఆసక్తికరమైన సినిమాగా మలిచారు నాగిరెడ్డి-చక్రపాణి మరియు ఎల్వీ ప్రసాద్ లు. కథ విషయానికొస్తే, మదరాసు మహా నగరంలో ఎం. టి. రావు (ఎన్టీ రామారావు) ఓ అనాధ. బీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ వెతుకులాటలో అతనికి మిస్ మేరీ (సావిత్రి) తో పరిచయం అవుతుంది. ఆమె కూడా బీఏ, ఉద్యోగం ఆమెకి కూడా అవసరం, వృద్ధులైన తల్లిదండ్రులకి ఆమె ఒక్కర్తే ఆసరా. అదీకాక అవసరానికి అప్పిచ్చి, ఆపై పెళ్ళిచేసుకుంటానని వేధిస్తున్న డేవిడ్ (రమణారెడ్డి) ని వదిలించుకోడానికైనా ఆమెకి డబ్బు, అందుకోసం ఉద్యోగం అవసరం.

మదరాసుకి కొన్ని వందల మైళ్ళ దూరంలో ఆంధ్రదేశంలో అప్పాపురం అనే ఓ పల్లెటూళ్ళో గోపాలరావు (యస్వీ రంగారావు) ఓ ధనవంతుడు. భార్య (ఋష్యేంద్ర మణి), కూతురు సీతాలక్ష్మి (జమున), మేనల్లుడు 'డిటెక్టివ్' రాజు (నాగేశ్వర రావు) ఇదీ అతని కుటుంబం. పదహారేళ్ళ క్రితం మహాలయ అమావాస్య నాడు సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు అప్పటికి నాలుగేళ్ల పిల్లగా ఉన్న పెద్ద కూతురు మహాలక్ష్మి జనసందోహంలో తప్పిపోతుంది. ఆమె పేరిట ఊళ్ళో ఓ ఎలిమెంటరీ స్కూలు నడుపుతూ ఉంటాడు గోపాలరావు.

మేష్టార్లు సరిగా పాఠాలు చెప్పని కారణంగా బడి మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఇష్టం లేని గోపాల రావు ఇద్దరు బీయేల కోసం పేపర్లో ప్రకటన ఇప్పిస్తాడు. వారిలో ఒకరుసంగీతం వచ్చిన స్త్రీ అయితే, ఆమె దగ్గర సీతాలక్ష్మికి సంగీతం నేర్పించవచ్చునన్నది ఆయన ఆలోచన. కూతుర్ని ఎలాగైనా బీయే ని చేయాలన్నది ఆయనకున్న మరోకోరిక. మేష్టర్లిద్దరికీ తనే వసతి ఏర్పాటు చేసి, మంచి జీతలివ్వాలనుకుంటాడు. "వాళ్ళిద్దరూ భార్యా భర్తలై ఉండాలని రూలు పెడితే, ఒకే వసతి సరిపోతుంది కదా" అన్న రాజు సలహా మేరకు ప్రకటనలో ఆ మేరకు మార్పు చేయిస్తాడు గోపాలరావు.

సరిగ్గా అప్పుడే "నీ డిటెక్టివ్ పని చేసి, తప్పి పోయిన మా అక్కని వెతికి పెట్టొచ్చు కదా బావా" అన్న సీతాలక్ష్మి ప్రతిపాదన, రాజు లోని డిటెక్టివ్ ని ఉత్సాహ పరుస్తుంది. అప్పటికే పీకల్లోతు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రావు, మేరీ ఆ ప్రకటన చూసి ఉద్యోగాల కోసం భార్యాభర్తలుగా నటించడానికి సిద్ధపడి, దరకాస్తు చేస్తారు. సర్టిఫికేట్లైనా చూడకుండానే వాళ్లకి ఉద్యోగం ఇచ్చేస్తాడు గోపాలరావు. మిసెస్ రావు ని (కనీసం ఆమె పేరైనా అడగరు వాళ్ళు) చూడగానే తెలియని వాత్సల్యం పుడుతుంది గోపాలరావు దంపతులకి. మేరీనే మహాలక్ష్మి ఎందుకు కాకూడదు అన్న సందేహం మొదలవుతుంది రాజుకి.

ఓపక్క తనకి ఏమాత్రం ఇష్టం లేని హిందూమత సంప్రదాయాలని పాటిస్తూ, అస్సలు ఇమడలేని కొత్త వాతావరణంలో ఇబ్బందులు పడే మేరీ, మరోపక్క ఆమెలో తమ కూతుర్ని చూసుకుని ఆపేక్ష చూపించే గోపాలరావు దంపతులు, ఇంకోపక్క మేరీయే మహాలక్ష్మి అన్న అనుమానంతో పరిశోధన చేసే రాజు. రావు, మేరీల మధ్య వచ్చే తగువులకి ప్రత్యక్ష సాక్షి రావు స్నేహితుడు దేవయ్య (రేలంగి). రావు, మేరీల కథంతా తెలుసు దేవయ్యకి. ఇదిగో ఈ దేవయ్యనే ఉపయోగించుకుని పరిశోధన చేయాలనుకుంటాడు రాజు.

కానీ చేతిలో 'తైలం' పడందే పెదవి విప్పుడు దేవయ్య. (ఈ సినిమా విడుదలైన రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన 'అందాల రాముడు' లో అల్లు రామలింగయ్య 'ఆమ్యామ్యా' ని పరిచయం చేసేవరకూ, లంచానికి ముద్దు పేరుగా కొనసాగింది ఈ తైలమే) పోనీ తైలం పడ్డాకైనా నిజం చెబుతాడా అంతే, అదీ లేదు. అమాయకురాలైన సీతాలక్ష్మి చేష్టల పుణ్యమా అని రావు మేరీల మధ్య స్పర్ధలు పెట్టి, ప్రేమ పెరగడానికి దోహదం చేస్తాయి. రావు-మేరీల నాటకం గోపాలరావుకి తెలిసిందా? మహాలక్ష్మి దొరికిందా? తదితర ప్రశ్నలకి జవాబిస్తూ సినిమా ముగుస్తుంది.

నటీనటుల గురించి చెప్పాలంటే మొదటగా చెప్పాల్సింది టైటిల్ పాత్ర పోషించిన సావిత్రి గురించే. బొట్టూ, పూలూ ధరించడంలో అయిష్టత చూపడం మొదలు, అమాయకురాలైన సీతాలక్ష్మి రావుతో చనువుగా ఉంటే భరించలేక ఆవేశ పడడం వరకూ ప్రతి సన్నివేశంలోనూ ప్రతి చిన్న హావభావాల్నీ అత్యంత సమర్ధంగా పోషించి, మిస్సమ్మ ని సజీవంగా కళ్ళముందు నిలిపింది సావిత్రి. 'సీమంతం' అంతే ఏమిటో తెలియకుండా సీమంతం జరిపించేసుకునే సన్నివేశం, రాజు వద్దు వద్దంటున్నా వినిపించుకోకుండా అతనికి సంగీతం నేర్పించే సన్నివేశాలని మర్చిపోవడం అంత సులభం కాదు. రావు పాత్రని తెర మీద చూసినప్పుడల్లా 'కన్యాశుల్కం' గిరీశం రేఖామాత్రంగా గుర్తొస్తాడు నాకు. తనకీ, మేరీకీ మధ్య జరిగిన తగువుల్ని గోపాలరావు దగ్గర 'మేనేజ్' చేసే సన్నివేశాల్లో రావుగా ఎన్టీఆర్ నటన గుర్తుండి పోతుంది.

పల్లెటూరి దంపతులుగా ప్రేమనీ, ఆపేక్షనీ కలబోసి చూపే పాత్రల్లో యస్వీఆర్, ఋష్యేంద్రమణి జీవించారనే చెప్పాలి. ఈ దంపతులు రావుని ఎంతగా నమ్మారంటే, ఒకసందర్భంలో సహనం కోల్పోయిన మేరీ "నేను క్రిష్టియన్ని, నా పేరు మేరీ, నాకింకా పెళ్ళికాలేదు" అని చెబితే, పంతులమ్మకి దెయ్యం పట్టిందనుకున్నారే తప్ప, ఆమె నిజమే చేబుతోందేమో అన్న అనుమానం లేశమైనా కలగలేదు వాళ్లకి. రావు-మేరీలని అమ్మాయి-అల్లుడు అంటూ ఆప్యాయంగా పిలవడం మొదలు, వాళ్లకి ఇబ్బంది కలగ కూడదనుకుంటూ వీళ్ళు చేసే పనుల వల్ల వాళ్లకి కలిగే ఇబ్బందులు, అప్పుడు పుట్టే హాస్యం తెర మీద చూడాల్సిందే.

పల్లెటూరి పిల్లగా జమున నటన గురించి చెప్పాలంటే మచ్చుకి ఒక సన్నివేశాన్ని గుర్తు చేయాలి. పంతులమ్మ దగ్గర సంగీతం నేర్చుకోడానికి మేష్టారింటికి వెళ్తుంది సీతాలక్ష్మి. పంతులమ్మ లోపలెక్కడో ఉంటుంది. మేష్టారి పక్కన సోఫాలో చనువుగా కూర్చుని కుశలాలు మొదలుపెడుతుంది సీతాలక్ష్మి. "కాఫీ తాగుతావా?" అని మేష్టారంటే "వద్దు మేష్టారూ, ఇప్పుడే చద్దన్నంలో పెరుగేసుకుని తినొచ్చా" అని చెబుతుంది. కాసేపట్లో పంతులమ్మ వచ్చి, మేష్టారి పక్కన కూర్చున్నందుకు భగ్గున మండి, సోఫాలో నుంచి లెమ్మంటే "ఇది మా సోఫా, నేనిక్కడే కూర్చుంటా"నంటుంది. అంతలోనే పంతులమ్మ "తెలుసుకొనవె చెల్లీ.." అని పాఠం మొదలెడితే, అలక మర్చిపోయి పాఠానికి వెళ్ళిపోతుంది.

రావు-మేరీ పాత్రలని ఇరుసు-చక్రం అనుకుంటే, ఆరెంటినీ సరిగ్గా పనిచేయించే కందెన దేవయ్య. ఈ పాత్రలో రేలంగి ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ని మర్చిపోవడం అంత సులువు కాదు. తన పని కోసం వీళ్ళ చుట్టూ తిరిగే డిటెక్టివ్ రాజు గా నాగేశ్వరరావు నవ్విస్తాడు. రేలంగి-నాగేశ్వర రావు ల మధ్య వచ్చే సన్నివేశాలు, ఆ సన్నివేశాల్లో నాగేశ్వరరావు సహాయకుడిగా నటించిన నటుడి హావభావాలు... ఇలా ఒకటేమిటి? సినిమా మొత్తాన్ని గుర్తు చేసుకోవాల్సిందే. స్క్రిప్టు పకడ్బందీగా ఉండడం, ఎక్కడా ఏ సన్నివేశమూ అనవసరం అనిపించక పోవడం చక్రపాణి గొప్పదనం అనే చెప్పాలి. ఈ సినిమాకి మూలం ఓ బెంగాలీ సినిమా అంటోంది వికీపీడియా.

రాజేశ్వర రావు సంగీతంలో పాటలని గురించి చెప్పకుండా ఈ సినిమా గురించి చెప్పడం పూర్తి కాదు. ఏ.ఏం. రాజా, లీల, సుశీల పాడిన పాటల్లో 'ఆడువారి మాటలకు..,' 'రావోయి చందమామ...,' 'బృందావనమిది అందరిదీ..,' 'కరుణించు మేరి మాతా..' ఇంకా 'బాలనురా మదనా..' పాటలు సంగీత ప్రియుల కలెక్షన్లలో శాశ్విత స్థానం పొందాయి. ఈ సినిమా ప్రారంభ సన్నివేశాల్లో వచ్చే నేపధ్య సంగీతానికీ, రెండేళ్ళ తర్వాత విజయ సంస్థ తీసిన 'మాయా బజార్' సినిమాలోని 'భళి భళి భళి భళి దేవా..' పాట ట్యూన్ కీ దగ్గర పోలికలు వినిపిస్తాయి. మనసు బాగోనప్పుడు 'మిస్సమ్మ' సినిమా చూడడం కన్నా మంచి మందు మరొకటి ఉండదు.