సోమవారం, సెప్టెంబర్ 30, 2013

బీనాదేవీయం

తెలుగు పాఠకులకి బీనాదేవిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భార్యా భర్తలిద్దరూ కలిసి ఒకే పేరుతో సాహిత్యాన్ని సృజించడం అరుదైన ప్రక్రియే అయితే, తెలుగు పాఠకులకి జంట సాహిత్యాన్ని రుచి చూపించిన జంట బి.నరసింగరావు (బిన) బాలా త్రిపుర సుందరీ దేవి (దేవి). వీరి కలంపేరు 'బీనాదేవి.' ఇరవయ్యేళ్ళ క్రితం నరసింగరావు మరణించినప్పుడు 'బీనాదేవి మృతి' అని ప్రకటించేశాయి మన పత్రికలు. అయితే, బీనాదేవిలో రెండో సగం బాలా త్రిపుర సుందరీ దేవి రాయడం మానలేదు. 'కథలు-కబుర్లు' సంకలనం తర్వాత, ఆమె నుంచి వచ్చిన తాజా రచన 'బీనాదేవీయం.'

"ఎప్పటినుంచో నాకు ఓ తీరని కోరిక.. ఓ అయిదు తరాల నవల రాయాలని... ఓ మాగ్నమ్ ఓపస్! బుచ్చిబాబు గారి 'చివరకు మిగిలేది' లాగా.. రావిశాస్త్రి గారి 'రత్తాలు-రాంబాబు' లాగా... ఎలా ప్రారంభించాలి? అన్ని తరాలు ఎలా ఊహించాలి? ఆ అయిదు తరాలు మేమే ఎందుక్కాకూడదూ! ఊహ, కల్పన అవసరం లేదు. మా అమ్మమ్మ మొదలు, మా మనవల వరకూ తెలిసిన జీవితాలే అన్నీ!" అంటూ రచన ప్రారంభించిన సుందరమ్మ, తన అమ్మమ్మ-తాతయ్య, అమ్మ-నాన్నల తరాల గురించి విపులంగా రాశారు.

ఊహించగలిగినట్టే అవన్నీ ఎంతగానో ఆసక్తి కలిగించే విశేషాలు.. ఇద్దరు తాతల్లోనూ మాతామహులు వకీలు కాగా, పితామహులు ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర పోలీస్ ఆఫీసర్. ఈ రెండు డిపార్ట్మెంట్ల జీన్స్ తో పుట్టిన త్రిపుర సుందరీ దేవి, తన మేనమావ, వకీలు అయిన నరసింగరావుని పెళ్ళాడేశారు. తండ్రిగారిది ఒక రకంగా ఇల్లరికమే కావడంతో అమ్మమ్మ ఇంట్లో పుట్టి పెరిగి, ఆ అమ్మమ్మకే కోడలు అయిపోయారు. 'అంట్లు తోముకునే ఆడపిల్లకి ఆల్జీబ్రా ఎందుకూ?'అనే వ్యాఖ్యానాలు లెక్కపెట్టకుండా తండ్రి హైస్కూలు వరకూ చదువు చెప్పిస్తే, పెళ్లి తర్వాత అమ్మమ్మ ప్రోత్సాహం, భర్తగారి అనుమతి తో ప్రయివేటుగా డిగ్రీలో చేరి, నలుగురు పిల్లల తల్లయ్యాక పట్టా పుచ్చుకున్న వైనం స్పూర్తిదాయకం.


ప్లీడర్ ప్రాక్టీసులో ఆదాయం స్థిరమైనది కాదు కాబట్టి, మిత్రుల సలహా మేరకి నరసింగరావు నెల జీతం వచ్చే జడ్జీ ఉద్యోగం లోకి మారిపోవడంతో, రెండు మూడేళ్ళకోసారి కుటుంబం మొత్తం బదిలీలమీద ఊళ్లు తిరగడం.. ఆ బదిలీలు కూడా అనంతపురం నుంచి అమలాపురం లాంటి దూర దూర ప్రాంతాలకి.. జడ్జీ గారి సర్వీసు పూర్తయ్యేసరికి రాష్ట్రం మొత్తం చుట్టేశారు! పిల్లల పెంపకం, వాళ్ళ చదువులు, రచనా వ్యాసంగం, రచయితలతో స్నేహాలు ఓ వైపు, వెళ్ళిన ప్రతిచోటా దొరికిన అనేకరంగాలకి సంబంధించిన స్నేహితులు మరోవైపు. వీళ్ళందరికీ సంబంధించిన కబుర్లు ఎన్నో, ఎన్నెన్నో..

బీనాదేవి పేరు చెప్పగానే గుర్తొచ్చే 'పుణ్యభూమీ కళ్ళుతెరు' నవల ఎలా పుట్టిందో రేఖామాత్రంగానే చెప్పారు. అలాగే, బీనాదేవి రచనల మీద రావిశాస్త్రి ప్రభావాన్ని గురించి కూడా.. నిజానికి ఈ పుస్తకంలో స్పృశించి వదిలేసిన అనేక విషయలని గురించి విపులంగా రాసి ఉంటే బాగుండేది కదా అనిపించక మానదు. అలాగే, 'కథలు-కబుర్లు' లో చెప్పిన కొన్ని కబుర్లు పునరావృతం కావడంతో, ఆ పుస్తకం చదివిన వాళ్లకి తెలిసిన సంగతులే మళ్ళీ చదువుతున్న భావన కలుగుతుంది. వీటిలోనే కొన్ని పునరుక్తులు కూడా.. ఎడిటింగ్ మీద మరికొంచం శ్రద్ధ పెట్టి ఉంటే ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు, బహుశా.

అలాగే, తాతయ్య, నాన్న తరాల గురించి చెప్పినంత వివరంగా తర్వాతి మూడు తరాల గురించీ చెప్పకపోవడం వల్ల పుస్తకం పూర్తిచేశాక "ఐదు తరాలు ఎక్కడ?" అని ఆలోచించుకునే పరిస్థితి. ఆసక్తికరమైన ఎత్తుగడతో రచన మొదలు పెట్టినా, చివరి వరకూ కొనసాగించక పోవడం, చివరి పేజీల దగ్గరకి వచ్చేసరికి హడావిడిగా ముగించేస్తున్నారు అన్న భావన కలగడం వల్ల కాబోలు, ఈ 191 పేజీల పుస్తకాన్ని చదివి పక్కన పెట్టాక ఓ 'మాగ్నమ్ ఓపస్' చదివిన భావన అయితే కలగదు. అలాగని చదవకుండా వదిలేయాల్సిన పుస్తకం అయితే కాదు.. గడిచిన తరాల జీవితాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, ఆత్మకథలని ఇష్టంగా చదివే వాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం. ('రచన' మాస పత్రికలో వచ్చిన సీరియల్ని వాహిని బుక్స్ పుస్తక రూపంలో తీసుకువచ్చింది. వెల రూ. 180. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యం).