సోమవారం, అక్టోబర్ 31, 2011

విజేత సాయిరమ్య

ఉత్కంఠ భరితంగా సాగిన 'పాడుతా తీయగా' చిన్నపిల్లల వరుస రెండో సిరీస్ లో విశాఖపట్నానికి చెందిన సాయిరమ్య మొదటి బహుమతి అందుకుంది. హైదరాబాద్ అమ్మాయి దామిని రెండో స్థానంలో నిలబడగా, ఖమ్మానికి చెందిన నూతన, నెల్లూరు జిల్లా తడ నుంచి వచ్చిన శరత్ చంద్ర మూడో స్థానంలో నిలబడ్డారు. విశాఖపట్నం పోర్టు కళావాణి ఆడిటోరియం లో జరిగిన ఫైనల్స్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న సిని దర్శకుడు దాసరి నారాయణ రావు, మొదటి బహుమతి విజేతకి మూడులక్షల రూపాయలు, రెండో బహుమతి విజేతకి లక్ష రూపాయలు, మూడో బహుమతి విజేతలు ఒక్కొక్కరికీ యాభైవేల రూపాయల నగదు బహుమతులు అందించారు.

సాయిరమ్య, దామిని, శరత్ చంద్ర మొదటి ఎపిసోడ్ నుంచీ బాగా పాడుతూ ఉండడంతో వీళ్ళు తప్పకుండా ఫైనల్స్ కి వస్తారు అనుకున్నాను నేను. ఎలాంటి భావాన్నైనా గొంతులో అలవోకగా పలికించగలిగే నూతన పాటల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించడంతో పాటు, చిన్న చిన్న లోపాలని సవరించుకోవడం ద్వారా ఫైనల్స్ కి స్థానం సంపాదించుకుంది. విజయనగరం అమ్మాయి లహరి సైతం ఫైనల్స్ లో తొలిదశ వడపోత వరకూ రాగలిగింది. ఆశ్చర్యకరంగా ఈ సిరీస్ లో మొదటినుంచీ కూడా అబ్బాయిల సంఖ్య బహు తక్కువ. వచ్చిన కొద్దిమందీ ప్రారంభ ఎపిసోడ్లలోనే ఒక్కొక్కరుగా వెను తిరగగా ఒక్క శరత్ చంద్ర మాత్రం చివరివరకూ నిలబడగలిగాడు.

నేను ఊహించిన ముగ్గురూ ఫైనల్స్ కి రావడం సంతోషాన్ని కలిగించినా వీళ్ళలో మొదటి బహుమతి ఎవరిది? అన్న విషయంలో ప్రతి పాటకీ అభిప్రాయం మారిపోతూ వచ్చింది. శరత్ చంద్ర 'అన్నమయ్య' సినిమాలో 'అంతర్యామీ...' పాట పూర్తి చేసిన మరుక్షణం 'ఇతనే విజేత' అనుకున్నాను.. మరో రౌండ్లో దామిని 'మాటే మంత్రము..' పాడిన తీరు చూసి, 'తప్పకుండా మొదటి బహుమతి అందుకుంటుంది..' అన్న అంచనా వచ్చేసింది. సాయిరమ్య, నూతనలూ తక్కువ తినలేదు. అందువల్లనే ఈ సిరీస్ చివరికంటా ఉత్కంఠ కొనసాగింది. కేవలం వాళ్ళ వాళ్ళ పాటల్ని మాత్రమే కాకుండా, వేరొకరికి కోరస్ పాడేటప్పుడూ అదే శ్రద్ధని కొనసాగించారు పిల్లలందరూ.


ప్రారంభ ఎపిసోడ్లతో పోల్చినప్పుడు, సెమి-ఫైనల్స్ దశనుంచీ కార్యక్రమం నాణ్యత బాగా పెరిగిందన్నది నా పరిశీలన. వడపోతల తర్వాత మిగిలిన గాయనీ గాయకులంతా నువ్వా-నేనా అన్నట్టుగా ఉండడమే బహుశా ఇందుకు కారణం. 'పద్యం తెలుగు వారి సొత్తు.. పద్యాలు నేర్చుకుందాం.. మన పిల్లలకి నేర్పిద్దాం' అని వీలున్నప్పుడల్లా చెప్పే కార్యక్రమ వ్యాఖ్యాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పద్యం రౌండు లేకుండానే ఈ సిరీస్ ముగించడం కించిత్ ఆశ్చర్యాన్ని కలిగించింది. చివరి ఎపిసోడ్లో అన్నా పద్యాల రౌండ్ ఉంటుందని ఎదురు చూసి నిరాశ పడ్డాను నేను. కారణం ఏమో తెలీదు కానీ, పద్యాలకి బదులుగా శాస్త్రీయ సంగీత ప్రధానమైన పాటలు పాడారు పిల్లలు.

సాయిరమ్య గొంతులో వినిపించే జీర కారణంగా, శ్రావ్యత కొంచం తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. విజేతగా నిలబడడానికి ఆ అమ్మాయికి ఇది ఇబ్బంది కాగలదేమో అనిపించింది నాకు. అయితే, పాటల ఎంపికలో తెలివిగా వ్యవహరించి, తన గాత్ర ధర్మానికి సరిపోయే పాటల్ని మాత్రమే ఎంచుకుని బాగా సాధన చేసి పాడడం ద్వారా తనకి మైనస్ అవుతుందనిపించే అంశాన్నే ప్లస్ గా మార్చుకుంది ఈ అమ్మాయి. ఆత్మవిశ్వాసం పాళ్ళు రవ్వంత ఎక్కువగా కనిపించే దామిని పాటలో 'ప్రొఫెషనలిజం' బాగా ఉంటుందనేది బాలూ తరచూ చెప్పిన మాట. ఇదే ఆమెకి మైనస్ గా మారింది అనుకోవాలా??

ఓ దశలో, 'రాజేశ్' సిరీస్ లో లాగా అమ్మాయిలతో పోటీపడి శరత్ చంద్ర టైటిల్ విజేతగా నిలబడతాడా? అనిపించింది.. అలా నిలబడే అర్హతలు అతనికి ఉన్నాయన్నది నిస్సందేహం. అయితే కంఠస్వరం మారే వయసు కావడం వల్ల, కొన్ని కొన్ని చోట్ల గొంతు అతనికి సహకరించక, కావాల్సిన భావం పూర్తిగా పలకలేదేమో అనిపించింది. మరీ ముఖ్యంగా, చివర్లో పాడిన 'బ్రోచేవారెవరురా..' పాటలో ఈ ఇబ్బంది వినిపించింది నాకు. నూతన అనగానే నాకు మొదట గుర్తొచ్చే పాట 'ప్రతిఘటన' సినిమాలో 'ఈ దుర్యోధన దుశ్శాసన..' క్వార్టర్ ఫైనల్స్ దశలో ఈ అమ్మాయి ఈ పాట పాడినప్పుడు 'అవసరమైన దానికన్నా కొంచం ఎక్కువ భావాన్ని పలికించింది' అనిపించింది. పాటేదైనా దానిని భావయుక్తంగా పాడడం ఈ అమ్మాయి ప్రత్యేకత. వచ్చేవారం నుంచీ టీనేజ్ గాయనీ గాయకులతో కొత్త సిరీస్ ప్రసారం కాబోతోంది.

ఆదివారం, అక్టోబర్ 30, 2011

సుమనే మీ అల్లుడు

ఓ నాయకుడు, ఇద్దరు నాయికలతో నడిచే కథలు చేసీ చేసీ తనకే విసుగొచ్చినట్టుంది. అందుకే ఈ సారి పంధా మార్చి ఓ నాయిక ఇద్దరు నాయకుల కథతో మన ముందుకు వచ్చాడు సుమన్ బాబు. సుమన్ ప్రొడక్షన్స్ సగర్వ సమర్పణలో, కె. సుభాష్ కుమార్ అనే నవతరం దర్శకుడు తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా, ఇంద్రనాగుడి దర్శకత్వ పర్యవేక్షణలో రూపు దిద్దుకున్న 'నేనే మీ అల్లుడు' చిత్రరాజం ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా హాస్యరస భరితం.

నదులన్నీ చివరికి సముద్రంలో కలిసినట్టుగా మన సుమనుడు ఏ రసాన్ని చేపట్టినా అది హాస్యంగా రూపు మారిపోతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, అనేకానేక సెంటిమెంటు షోల అనంతరం విడుదలైన ఈ షోలో మాత్రం ప్రేక్షకులు ఇతర రసాలనుంచి హాస్య రసాన్ని పిండుకునే అవసరం లేకుండా నేరుగా హాస్యాన్నే ఆస్వాదించే వీలు కలిగిందన్న మాట.

పచ్చని పల్లెటూళ్ళో అనగనగా ఓ సుబ్బరాజు (మిశ్రో). అతగాడికి పేకాట పిచ్చి. ఆయన భార్య జానకి (శ్రీలక్ష్మి) కి టీవీ సీరియళ్ళ పిచ్చి. వాళ్ళబ్బాయి బాండ్ కి తనో డిటెక్టివ్ అనే పిచ్చి. వాళ్ళ పనిపిల్ల సీతాలుకి 'అష్టా చమ్మా' సినిమాలో కలర్స్ స్వాతిలాగా హీరో మహేష్ బాబంటే పిచ్చి. అదే ఇంట్లో పనివాడు మరియు సీతాలు బావ రంగయ్యకి సీతాలంటే పిచ్చి. వీళ్ళందరి మధ్యనా ఏ పిచ్చీ లేనిది సుబ్బరాజు కూతురు మహాలక్ష్మి (అంజూ అస్రానీ, 'శుభం' ద్వితీయ నాయిక హారిక!)

చూడ్డానికి రెండు పదహార్లు నిండి మూడో పదహారు నడుస్తోందేమో అనిపించే మహాలక్ష్మి అచ్చమైన పల్లెటూరి 'ముద్దబంతి'. పగటివేళ పట్టు పావడాలు, శిల్కు వోణీలు మరియు ఒంటి నిండా ధగద్ధగాయమైన నగలతో వెలిగిపోతూ, రాత్రి వేళల్లో కేవలం నైటీ మాత్రమే ధరించే సంప్రదాయమైన ఆడపిల్ల. ఓ రోజు పొద్దున్నే అలంకరణ పూర్తి చేసుకుని, కడవెత్తుకుని నీలాటిరేవుకెళ్ళి నీళ్ళు ముంచుకుని ఇంటికి వస్తుంటే, అప్పుడే ఎర్రబస్సు దిగిన ఓ అందమైన యువకుడు (ఎవరో ఎంతమాత్రమూ కాదు, మన సుమనుడే) స్ట్రాలర్ సహితుడై ఆమె వెంట పడతాడు.

ఇంట్లో పిచ్చాళ్ళంతా వాళ్ళ వాళ్ళ పిచ్చిల్ని ప్రయోగించగా, వాటిని ఓపిగ్గా భరించి చివర్లో తను అమెరికా నుంచి వచ్చిన సుబ్బరాజు మేనల్లుడు 'చక్రధర్' అని చెబుతాడు. ఇటు మహాలక్ష్మి, అటు సీతాలూ కూడా అతగాడిని ఏకకాలంలో మోహించేస్తారు. ఆ అందాల చందమామే తన ఇంటి అల్లుడు కావాలని ఆశ పడుతుంది జానకి. సుబ్బరాజు ఆనందభాష్పాలు రాలుస్తాడు. ఇప్పుడో, ఇంకాసేపట్లోనో ఈ చక్రధరూ మహాలక్ష్మీ ఓ యుగళగీతం పాడేసుకుంటారని ఊహిస్తూ ఉండగా, సుబ్బరాజు ఇంటిముందు ఓ కారు ఆగుతుంది. నేనే చక్రధర్ అంటూ ఇంకో కుర్రాడు (ఇంద్రనాగు) దిగుతాడు.

వచ్చిన ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలియకుండా చేయాలని సుబ్బరాజు అండ్ కో ప్రయత్నం. ఇందులో భాగంగా రంగయ్య మన సుమన్ బాబుని గేదెల దగ్గరికి తీసుకెళ్ళి పాలు పిండమంటాడు. అప్పుడేమో బాబు 'అమెరికా గేదల' గురించి బోల్డన్ని విషయాలు చెబుతాడు. గుడికి వెళ్లి, మహాలక్ష్మితో సహా భక్తులందరికీ వినపడే విధంగా మహాలక్ష్మితో తనకి పెళ్ళి జరిపించమని షిరిడీ సాయిబాబాని కోరుకుని నూటెనిమిది ప్రదక్షిణాలు చేస్తాడు. మహాలక్ష్మితో బోల్డన్ని చిలిపి రొమాంటిక్ కబుర్లు చెబుతాడు. అంతేనా, మహాలక్ష్మి అతగాడిని తాకగానే గ్రాఫిక్స్ మెరుపులు కనిపిస్తాయి కూడా. విశాల హృదయ అయిన సీతాలు ఇంద్రనాగుని కూడా తగుమాత్రంగా ప్రేమించేస్తుంది.

ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఓ రోజు చక్రధర్లిద్దరూ ఎదురు పడిపోతారు. నలుపు తెలుపుల్లో దృశ్యం మాత్రమే కనిపించే వెనక మెరుపొకటి కనిపించి మాయమవుతుంది. ఇద్దరూ 'నువ్వెంత?' అంటే 'నువ్వెంత?' అనుకోవడం, 'మహాలక్ష్మి నాది' అంటే 'నాది' అనుకోవడం, ఈ ఇంటికి 'నేనే అల్లుడు' అనుకోవడం మాత్రం సొష్టంగా వినిపిస్తాయి. అప్పుడింక సుమనుడు అత్తగారినీ, ఇంద్రనాగు మావగారినీ ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో పడతారు. 'గుండమ్మకథలో ఎన్టీ వోడిలాగా' రుబ్బురోలు దగ్గర అత్తయ్యకి పప్పు రుబ్బిపెట్టీ, టీవీ సీరియల్ కబుర్లు చెప్పీ సుమనుడు అలరిస్తే, పేకాటతో సుబ్బరాజుని పడగొట్టేస్తాడు ఇంద్రనాగు.

ఇది పని కాదని తలచిన సుమనుడు ఏకంగా కోయదొర వేషం వేసుకుని 'కుర్రో కుర్రు' అనుకుంటూ వచ్చి ముందొచ్చిన వాడే అల్లుడు అనే హింటుని సుబ్బరాజు కుటుంబానికి అందించి చటుక్కున మాయమై, గబుక్కున తెల్ల పేంటు, నల్ల చొక్కాలో ప్రత్యక్షం అవుతాడు. సుమన్ బాబు శ్రమ ఫలించి మారువేషంలో అతగాడిని ఎవరూ కూడా గుర్తుపట్టరు. మహాలక్ష్మి కూడా ఇంక తప్పదురా బాబూ అనుకుని, సుమన్ తో కలిసి ఫిలిం సిటీలో "ఏ మాయ చేసేసావో ఓ మైనా.. ఏ మంత్ర మేసేసావో.." అనే డ్యూయట్టు పాడేసుకుంటుంది. డ్యూయట్టు అయిపోయాక వచ్చేది క్లైమాక్సే అని కొత్తగా చెప్పక్కర్లేదు కదా.

షిరిడీ సాయిబాబా సాక్షిగా సుమన్ బాబు చెప్పే నిజం అల్లప్పుడెప్పుడో రవిరాజా పినిశెట్టి తీసిన 'రుక్మిణి' సినిమాని జ్ఞాపకం చేస్తుంది. సుమనుడి మంచితనానికి అంతటి ఇంద్రనాగుడూ కరిగి కన్నీరవుతాడు. మహాలక్ష్మి పరుగున వెళ్లి వాటేసుకుంటుంది. అత్తమామలు ఆనందభాష్పాలు విడుస్తుండగా, నును సిగ్గుతో 'నేనే మీ అల్లుడు' అని ప్రకటిస్తాడు అనాధ సాఫ్టవేర్ ఇంజినీర్ వాసు పాత్రని ధరించిన సుమన్ బాబు. ఆద్యంతమూ హాస్యరసం అవ్వడం వల్లేమో తెలీదు కానీ తన పాత్రని అనాయాసంగా భరించేశాడు సుమనుడు. వాచికాన్ని మినహాయించుకుంటే, నటనలో కూసింత ఇంప్రూవ్మెంట్ కనిపించిందో, నాకు చూడడం అలవాటైపోయిందో అర్ధం కావడం లేదు.

మిత్రులొకరు చెప్పినట్టుగా, సినిమాల్లోనే కాదు టీవీ సీరియళ్లలోనూ అవుట్ డేటెడ్ అయిపోయిన పల్లెటూళ్ళు, మండువా లోగిళ్ళు లంగావోణీలని ఇంకా గుర్తుపెట్టుకున్నందుకైనా సుమన్ బాబుని అభినందించాల్సిందే. టైటిల్స్ లో యానిమేషనూ, అక్కడక్కడా గ్రాఫిక్సులూ ఈ షో ప్రత్యేకత. భోలేషావలీ సంగీతం ఈసారి కూడా బాగుంది. ఇంద్రనాగ్ కూడా సుమన్ తో సరిసమానంగా కాస్ట్యూమ్స్ ధరించడం కొంచం మింగుడు పడలేదు. పాసివ్ పాత్రల పట్ల బాబుకి ఉండే మక్కువ వల్ల కావొచ్చు, కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఇంద్రనాగు సుమన్ని దబాయించాడు. దర్శకత్వ పర్యవేక్షణ కొంచం శ్రుతిమించడం వల్ల కాబోలు ఆద్యంతమూ ఇంద్రనాగ్ మార్కు (మరేదో కాదు సుమన్ బాబు మార్కే) కనిపించింది. అయినప్పటికీ, కాసిన్ని సీన్లలో మనస్పూర్తిగా నవ్వించింది. అన్నట్టు తదుపరి షో పేరు 'చూడు చూడు తమాషా' .. ఇవాళే ప్రకటన వచ్చింది, బాబుది రాక్ స్టార్ పాత్ర అనుకుంటా!!

మంగళవారం, అక్టోబర్ 25, 2011

బీప్...బీప్...

ఏకాగ్ర చిత్తంతో పని చేసుకుంటూ ఉండగా చొక్కా జేబులోనుంచి బీప్ బీప్ అన్న చప్పుడు వినిపించింది. 'తర్వాత చూడొచ్చులే' అని నాకు నేను సర్ది చెప్పుకుని పనియందు మనసు లగ్నం చేసినవాడిని అయ్యాను. ఎంతసేపూ.. కేవలం ఒక్క నిమిషం. రెండో నిమిషంలో కుతూహలం. 'ఏదన్నా అర్జెంటు సంగతేమో.. ఫోన్ చేసి డిస్ట్రబ్ చేయడం ఎందుకని మెసేజీ పంపారేమో..' ఇలా మనసు పరిపరి విధాల పక్క దోవలు పట్టేసరికి, తప్పనిసరై జేబులోనుంచి ఫోను తీశాను.

"దంతేరాస్, దీపావళి శుభాకాంక్షలు. బంగారం కొనండి.. అంతే బరువున్న వెండిని ఉచిత బహుమతిగా పొందండి. తరుగు, మజూరీ చార్జీలు లేవు" అంటూ సకుటుంబ వస్త్రనందనం వారి పలకరింపు, మూడు రోజుల్లో ముప్ఫై మూడోసారి. కసిగా డిలీట్ బటను నొక్కి, మళ్ళీ నా పనిలో పడ్డాను. పది నిమిషాలన్నా గడిచాయో లేదో మళ్ళీ అదే దృశ్యం పునరావృతమయ్యింది. ఈసారి శుభాకాంక్షలు అందజేసిన వారు మా కుటుంబ దర్జీ. తన సేవలని వినియోగించుకుంటోన్నందుకు ధన్యవాదాలు కూడా అర్పించారు వారు.

'పండగ ఇంకా ఓ రోజు ఉందనగానే తొందరపడి ఈ కోయిల ఇలా ముందే ఎందుకు కూస్తోంది చెప్మా' అని ఒకప్పుడైతే ఆశ్చర్య పోయేవాడిని కానీ, ఇప్పుడు అలవాటైపోయింది. కొన్ని కొన్ని నెట్వర్కులు పండుగ రోజుల్లో మెసేజీ చార్జీలు పెంచేయడం మొదలు, నెట్వర్కులు జామైపోవడం వరకూ రకరకాల కారణాల వల్ల అసలు పండగకన్నా ముందరే శుభాకాంక్షల పరంపర మొదలైపోతోంది. కేవలం ఫోన్ల నుంచి మాత్రమే కాక, ఇంటర్నెట్ ద్వారా ఉచిత మెసేజీల సౌకర్యం మొదలయ్యాక ఈ శుభకామన సందేశాల పరంపర కొత్త పుంతలు తొక్కడం మొదలయ్యింది.

మొబైల్ ఫోన్ వినియోగంలోకి వచ్చిన కొత్తల్లో కాల్ చార్జీల మాదిరిగానే, మెసేజీల చార్జీలూ భారీగానే ఉండేవి.. చాన్నాళ్ళ పాటు మెసేజీ ఆప్షన్ వైపు వెళ్ళనే లేదు సామాన్య వినియోగదారులు చాలామంది. చూస్తుండగానే కాల్ చార్జీలతో పాటు మెసేజీల పేకేజీల్లోనూ ఊహించనన్ని మార్పులు వచ్చేశాయ్. అలాగే ఓ కొత్త తరహా ప్రకటన విధానమూ మొదలయ్యింది. శ్రీరమణ రాసిన 'గుత్తొంకాయ కూర - మానవ సంబంధాలు' వ్యాసాల పరంపరని ఓసారి గుర్తు చేసుకుంటే, మన సెల్ఫోన్ మెసేజీలు కూడా మానవ సంబంధాల మీద తమదైన ముద్రని వేశాయని అంగీకరించక తప్పదు.

ఇప్పుడిప్పుడు పండగ వస్తోందంటే చాలు.. అది ఏ మతానికి సంబంధించినదైనా, చివరికి దేశానికి సంబంధించినదైనా సరే సెల్ ఫోనులో అక్షరాలా సందేశాల వర్షం కురుస్తోంది. ఈ సందేశాలు పంపేది కేవలం మన సర్కిల్లో వాళ్ళు మాత్రమే కాదు.. మనం ఏమాత్రమూ ఊహించని వైపునుంచి కూడా శుభాకాంక్షలు వచ్చి పడుతున్నాయి. అంటే, శుభాకాంక్షల సందేశాల ద్వారా సర్కిల్ విస్తృతమవుతోందన్న మాట, మెచ్చుకోవాల్సిన విషయమే కదా..

మన కాంటాక్ట్ లిస్టులో ఉన్నవాళ్ళూ, తమ వివరాలతో సందేశాలు పంపేవాళ్ళతో ఎలాంటి ఇబ్బందీ ఉండదు కానీ, వాళ్ళ పేరు కచ్చితంగా మన జాబితాలో ఉంటుందన్న దీటైన నమ్మకంతో శుభాకాంక్షలు అందించేవారితో అప్పుడప్పుడూ ఇబ్బందులు తప్పవు. వాళ్ళెవరో మనకి తెలీదు.. కానీ మనం వాళ్లకి తెలుసు. 'మీరు ఎవరు?' అనకూడదు. ఎవరో తెలుసుకోవాలి. బుర్రకి పదును పెట్టే కార్యక్రమమే కచ్చితంగా. మొదటినుంచీ నాకు నేనుగా పండుగ శుభాకాంక్షల సందేశాలు పంపే అలవాటు లేదు కానీ, అందుకున్న ప్రతి సందేశానికీ కచ్చితంగా జవాబు పంపేవాడిని నిన్న మొన్నటివరకూ. ఇప్పుడిప్పుడు అదికూడా సాధ్యపడడం లేదు, అందుకునే సందేశాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది మరి.

దసరా పండుగ నెల్లాళ్ళు ఉందనగా ఓసారి రెగ్యులర్ విజిట్లలో భాగంగా వాళ్ళ పార్లర్ కి వెళ్ళినప్పుడు ఓ పుస్తకం నా ముందు పెట్టి ముసిముసిగా నవ్వుతూ 'పండగ మామూలు సార్' అన్నాడు నా బ్యూటీషియన్. పూర్వాశ్రమంలో ఇతగాడి వృత్తినామం క్షురకుడు అని ఉండేది. నాకు తోచిన అంకె వేసి తిరిగి ఇవ్వబోతుండగా, "పేరూ, ఫోన్ నెంబరూ కూడా రాయండి సార్" అన్నాడు చనువుగా. నా తల మీద కత్తెర పెట్టిన మరుక్షణం చిరంజీవి గురించీ, ప్రజారాజ్యం గురించీ వేడి వేడి చర్చ మొదలు పెట్టడం అతగాడి అలవాటు. చెసేదేముందీ, రాసిచ్చాను. ఈ టపా రాయడానికి కొద్ది క్షణాల ముందు నా ఫోన్ బీప్ మంది. పండుగ శుభాకాంక్షలు, అతగాడి నుంచి!!

మిత్రులందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు...

సోమవారం, అక్టోబర్ 24, 2011

తిరస్కృతులు

వాళ్ళంతా ఎదుటి వ్యక్తిని నిష్కల్మషంగా ప్రేమించగలరు. మనస్పూర్తిగా నమ్మగలరు. కానీ, అవతలి వ్యక్తినుంచి తిరిగి పొందేవి మాత్రం అవమానాలు, అవహేళనలు. వాళ్ళందరూ తిరస్కృతులు. నికోలాయ్, అతడి భార్య అన్నా, వాళ్ళ ఏకైక కుమార్తె నతాష, ముసలి స్మిత్ కూతురు, మనవరాలు నీలీ... వీళ్ళందరూ కూడా ప్రేమనీ, నమ్మకాన్నీ ఇచ్చి తిరస్కరింపబడ్డ వాళ్ళే. వీళ్ళందరి కథే 'తిరస్కృతులు' నవల. ప్రముఖ రష్యన్ రచయిత దస్తయేవస్కీ రాసిన 'The Insulted and Injured' కి తర్వాతికాలంలో 'సహవాసి' గా అనువాద రంగంలో గొప్పపేరు తెచ్చుకున్న జంపాల ఉమామహేశ్వర రావు తెలుగు సేత.

కథలో ప్రధాన పాత్ర వాన్య. అప్పుడే రచయితగా పేరు తెచ్చుకుంటున్న వాడు. చిన్నప్పుడే అనాధగా మారిన వాన్య ని పొరుగింటి పెద్దమనిషి నికోలాయ్ తన కూతురు నతాష తో పాటుగా పెంచి పెద్ద చేశాడు. వాన్యకి నతాష అంటే పిచ్చి ఇష్టం. కానీ నతాష అయోషాని ప్రేమించింది. ప్రిన్స్ వాల్కొవిస్కీ ఏకైక కుమారుడు ఆయోషా. ఎందరినో మోసం చేసి ప్రిన్స్ స్థాయికి ఎదిగిన వాల్కొవిస్కీ తెలివితేటలు ఏమాత్రమూ రాలేదు అయోషాకి. అతను అమాయకుడు, నిష్కల్మష హృదయుడు. తండ్రిమీద విపరీతమైన ప్రేమ ఉన్నవాడు.

తను డబ్బు సంపాదించుకునే క్రమంలో నికోలాయ్ తో స్నేహం చేశాడు ప్రిన్స్. తన ఎస్టేట్ వ్యవహారాలూ నికోలాయ్ కి అప్పగించాడు. ఎంతో నిజాయితీగా పని చేసిన నికోలాయ్ ఎస్టేట్ వృద్ధి చెందడానికి అహరహం శ్రమించాడు. నికోలాయ్ వ్యక్తిత్వం పట్ల ఎంతగానో ఆకర్షితుడైన ప్రిన్స్, అయోషాని కొంత కాలంపాటు అతని ఇంట్లో ఉంచాలని నిర్ణయించుకుంటాడు. ఆ రకంగానైనా ఆయోషాకి లోకజ్ఞానం అబ్బుతుందన్నది ప్రిన్స్ ఆశ. ప్రిన్స్ ప్రతిపాదనని సంతోషంగా ఆహ్వానిస్తాడు నికోలాయ్. ఫలితంగా, యవ్వనంలో అడుగుపెట్టిన ఆయోషా నికోలాయ్ ఇల్లు చేరతాడు.

ఆయోషా నతాష తో ప్రేమలో పడడం ప్రిన్స్ పాలిట పిడుగుపాటే అవుతుంది. అంతస్తుల భేదాన్ని కలలో కూడా మర్చిపోలేని ప్రిన్స్ నికోలాయ్ మీద నిప్పులు చెరుగుతాడు. ఎస్టేట్ మీది ఆశతో అమాయకుడైన తన కొడుకు మీదకి కూతుర్ని ఉసిగొలిపాడని అనరాని మాటలు అంటాడు. మాటల యుద్ధం చేతల్లోకి మారుతుంది. ఎస్టేట్ సొమ్ము కాజేశాడనే అభియోగం మోపి నికోలాయ్ ని కోర్టుకి ఈడుస్తాడు ప్రిన్స్. మరోపక్క ఒకరిని విడిచి మరొకరు ఉండలేని ఆయోష-నతాష ఇల్లు విడిచి వెళ్ళిపోతారు. కూతురు చేసిన పని మరింత కుంగదీస్తుంది నికోలాయ్ ని.

జీవిక కోసం ఇల్లు విడిచిన వాన్య రచయితగా స్థిరపడతాడు. ఇల్లు వెతుక్కునే క్రమంలో అతనికి వృద్ధుడైన స్మిత్, అతని టీనేజ్ మనవరాలు నీలీ తారసపడతారు. స్మిత్ మరణించడంతో ఏకాకిగా మారిన నీలీకి ఆశ్రయం ఇస్తాడు వాన్య. నీలీది ఓ విషాద గాధ. ఆమె తల్లి తన యవ్వనంలో ఓ యువకుడిని నమ్మి తన సంపదనంతా అతని చేతిలో పెడుతుంది. నీలీ భూమిమీద పడ్డాక అతడు మోసగాడని తెలుస్తుంది. అతన్నుంచి విడిపోయి దుర్భర దారిద్ర్యం అనుభవించిన ఆ వనిత, తన తండ్రి తనని క్షమించడం కోసం జీవితమంతా ఎదురు చూస్తుంది. క్షమాపణ పొందకుండానే మరణిస్తుంది. వాన్య ఇంటికి చేరిన నీలీ తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతుంది.

కోర్టు కేసుల నిమిత్తం తన బసని పట్నానికి మారుస్తాడు నికోలాయ్. నతాష ఆచూకి తెలిసినా ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడడు. మరోవంక ప్రిన్స్ కొడుకుని చేరదీయడంతో పాటుగా, నతాషని తన కోడలిగా చేసుకుంటానని ఆమెకి మాట ఇస్తాడు. మరోవంక డబ్బున్న అమ్మాయి కాత్య తో అయోషకి పెళ్ళి నిశ్చయం చేస్తాడు. తనకంటూ ఓ వ్యక్తిత్వం లేని ఆయోష నతాషతో ప్రేమగా ఉంటూనే, పెళ్ళి చేసుకుంటానని చెబుతూనే కాత్యతో ప్రేమలో పడతాడు. కొడుకు మనస్తత్వం తెలిసిన ప్రిన్స్ ఇందుకు పరోక్షంగా రంగం సిద్ధం చేస్తాడు. ప్రిన్స్ పధకం ఫలించిందా? నికోలాయ్ కేసు ఏమయ్యింది? నతాష ని అతడు క్షమించగలిగాడా? నీలీ జన్మ రహస్యం ఏమిటి? ఇత్యాది ప్రశ్నలకి జవాబిస్తూ నవల ముగుస్తుంది.

నవల ముగించి పక్కన పెట్టినా, ప్రధాన పాత్రలూ, వాటి వ్యక్తిత్వాలూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కథ చెప్పే వాన్య స్పటికంలాగా స్వచ్చంగా అనిపిస్తాడు. స్వీయ ప్రేమకథతో సహా ఎవరి కథ చెప్పేటప్పుడూ కూడా ఎలాంటి ఉద్వేగానికీ లోనవ్వకుండా, ఏ వ్యాఖ్యలూ చేయకుండా ఉన్నది ఉన్నట్టు చెబుతాడతడు. నతాషా, నీలీ ఇద్దరూ కూడా బలమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలే. ఆయోషా ప్రేమకోసం నతాషా చివరికంటా నిలబడితే, తల్లి జీవితం, బాల్యంలోనే ఎదురైన అనుభవాల కారణంగా వయసుకి మించిన పరిణతి చూపిస్తుంది నీలీ. కూతుర్ని విపరీతంగా ప్రేమించే, ఆత్మాభిమానం విషయంలో రాజీ పడలేని నికోలాయ్-అన్నా దంపతులనీ మర్చిపోలేం.

"జంపాల ఉమామహేశ్వర రావు ఇంకా సహవాసిగా మారక ముందు వెలుగు చూసిన గ్రంధం ఇది. ....ఆయన చేపట్టిన తొలి అనువాదం ఇది. అయన మాటల్లో 'విశ్వమంతా విశాల హృదయంతో విశ్వ విఖ్యాతుడైన దస్తయేవస్కీచే చిత్రింపబడి విశ్వమానవ హృదయాలలో ఉన్నత స్థానాన్ని అందుకొంది, ఈ తిరస్కృతులు. మన తెలుగు పాఠకులకి ఇది సుమారు యాభయి ఏళ్ళ క్రితం దర్శనమిచ్చింది. మళ్ళీ ఇంత కాలానికి ఇప్పుడు మీ ముందుంది. స్వీకరించండి," అన్నారు ప్రకాశకులు పీకాక్ క్లాసిక్స్ వారు, మూడేళ్ళ క్రితం విడుదల చేసిన ప్రింట్ చివరిమాటలో. 'ఏడుతరాలు' లాంటి ఎన్నో విదేశీ నవలల్ని తెలుగు వారికి పరిచయం చేసిన జంపాల అనువాద సరళిని గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అత్యంత సరళంగా ఉంది. (పేజీలు 204, వెల రూ.75, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

బుధవారం, అక్టోబర్ 12, 2011

అమ్మకి కోపం వస్తే..

ఇంట్లో అందరికీ మనమీద కోపం రావడం ఒక ఎత్తైతే, అమ్మకి కోపం రావడం మరో ఎత్తు. ఇంకెవరి కోపాన్నీ పెద్దగా పట్టించుకోక పోయినా పర్లేదు కానీ, అమ్మతో అలా కుదరదు. బోయినం మాట అటుంచి, మంచి నీళ్ళు కూడా సరిగా ముట్టవు. నాన్నకి కోపం వస్తే నాలుగు దెబ్బలు వేస్తారు. ఆ వెంటనే కోపం మర్చిపోతారు. కానీ అమ్మ అలా కాదు, ఏమీ అనదు కానీ అస్సలు మాటాడదు. మనం వెనక వెనకే తిరిగినా సరే అస్సలు మన వంక చూడనన్నా చూడదు.

అసలు అమ్మకి కోపం ఎందుకు వస్తుంది? మనం ఏదో ఒక పిచ్చి పని చేస్తేనే కదా?? 'వెర్రిదీ అమ్మేరా... పిచ్చిదాని కోపంరా..' అన్నాడు కదా ఓ సినిమా కవి. మనం తెలిసో తెలియకో చేసే పిచ్చి పనులు అమ్మకి మన మీద పిచ్చి కోపం రప్పిస్తాయన్న మాట. నాలుగు కొట్టాలనిపించినా గబుక్కున చేతులు రావు కదా, అందుకని ఏవీ అనకుండా ఊరుకుంటుంది. నాన్న మనల్ని కొట్టినా, మనం తనని చూడడం లేదనుకుని కళ్ళనీళ్ళు కక్కుకుని, అంతలోనే చెంగుతో తుడిచేసుకుంటుంది.

ఓసారేవయ్యిందంటే, అమ్మతో పాటూ శ్రావణమాసం పేరంటానికి వెళ్లాను. ఆ పేరంటానికి రాజ్యంగారమ్మాయి కొత్త చీర కట్టుకుని వచ్చింది. అందరూ ఆ చీరని ఒకటే మెచ్చుకోవడం. ఇంతలో నేను చేసిన ఓ పొరపాటు వల్ల ఆ చీరమీద మరక పడింది. చిన్న మరకే అయిన కొత్త చీర కదా, పైగా ఆ అమ్మాయి మొదటిసారి చీర కట్టుకుంది కూడాను, పేరంటానికి వచ్చిన అందరూ 'అయ్యో పాపం' అనడవే. ఏం చెయ్యాలో తెలీక నేను ఇంటికెళ్ళిపోయాను. తర్వాత కాసేపటికి అమ్మొచ్చింది. ఏవీ మాటాడలేదు.. ఒకటీ రెండూ కాదు ఏకంగా మూడు రోజులు.

అది మొదలు అమ్మకి చాలా సార్లే కోపం వచ్చింది నా మీద. ఎక్కువగా అల్లరి చేసినప్పుడూ, ఆటల్లో దెబ్బలు తిని వచ్చినప్పుడూ, బళ్ళో మేష్టారు నామీద కోప్పడ్డప్పుడూ, బామ్మ గట్టిగా గసిరినప్పుడూ, పరీక్షల్లో మంచి మార్కులు రానప్పుడూ ఇలా.. ఒక్కోసారి అమ్మకి నామీద ఎందుకు కోపం వచ్చిందో కూడా తెలిసేది కాదు. కోపం వచ్చినదని మాత్రం తన ముఖం చూడగానే తెలిసిపోయేది.. కారణం తర్వాతెప్పుడో తెలిసేది. నేను అల్లరేక్కువ చేస్తున్నానో, ఇంకోటనో ఎవరన్నా అమ్మకి చెప్పినా అమ్మకి నామీదే కోపం వచ్చేసేది మరి.

నేను బడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఎప్పటిలాగా నవ్వుతూ ఎదుర్రాకుండా ముఖం గంటు పెట్టుకుని తన పన్లు తను చేసుకుంటోందంటే అమ్మకి నామీద కోపం వచ్చేసినట్టే. ఇంక నేనెంత వెంటబడి మాటాడినా విననట్టు నటిస్తుంది. నాకేవీ పనులు చెప్పదు. నేను చెయ్యబోయినా చెయ్యనివ్వదు. మొదట్లో అమ్మకి కోపం వస్తే నాకు భయం, బాధా వచ్చేసేవి కానీ, రాన్రాను అమ్మ కోపం పోగెట్టే ఉపాయం తెలిసిపోయింది. ఏవీలేదు, అమ్మకి కోపం రాగానే అన్నం ఎప్పుడూ తినేంత కాకుండా కొంచమే తినడం.

మొత్తం మానేస్తే నాన్న తంతారు కానీ, ఆకల్లేదు అని కొంచం తిని ఊరుకుంటే ఏవీ అనలేరు కదా. ఈ ఉపాయం మాత్రం బ్రహ్మాండంగా పనిచేసింది. ఓ పూటో రోజో చూసి అమ్మ వెంటనే మాటాడేసేది. తర్వాతేవో మంచి మాటలు చెప్పేది. నేను బుద్ధిగా వినేవాడిని. మళ్ళీ కథ మామూలే. అమ్మ కోపం కబుర్లు ఇలా ఉంటే, మన బ్లాగు లోకపు అమ్మ గూగులమ్మకి నా మీద కోపం వచ్చిందివాళ. ఉదయానే నన్ను మెయిల్లోకి వెళ్ళనివ్వకుండా అడ్డగించి ఏదో ప్రశ్న అడిగింది, నా మూడ్ బాగోక ఓ తిక్క జవాబు చెప్పాను. అంతే.. దారి మూసేసింది.

చేసేది ఏముంది? ఇంతకాలం nemalikannu@gmail.com గా ఉన్న నా చిరునామా nemalikannumurali@gmail.com గా మారింది. ఎంతైనా అమ్మ అమ్మే.. గూగులమ్మ అమ్మ అవుతుందా? మనం అలిగినా పట్టించుకుంటుందా??

సోమవారం, అక్టోబర్ 10, 2011

లైబ్రరీలో ఓ సాయంత్రం...

మొన్నొక రోజు దగ్గరలోనే ఉన్న ఒక లైబ్రరీకి వెళ్లాను. చాలా రోజులుగా బయటినుంచి చూస్తున్నా ఎప్పుడూ లోపలికి వెళ్ళలేదు. మిగిలినవన్నీ ఎలా ఉన్నా లైబ్రరీకి వెళ్ళే అలవాటు తప్పిపోయి చాలా రోజులు అవ్వడం ఇందుకు ఒక ముఖ్యమైన కారణం అయి ఉండొచ్చు. ఒక ఆధ్యాత్మిక సంస్థ, ప్రభుత్వ సాయంతో నిర్వహిస్తున్న ఈ లైబ్రరీలో కేవలం ఆధ్యాత్మిక పుస్తకాలు మాత్రమే కాక అన్నిరకాల పుస్తకాలూ ఉండడం నన్ను ఆశ్చర్య పరిచింది.

పోటీ పరీక్షలకి ప్రిపేరవుతున్న పిల్లలంతా మహ సీరియస్సుగా పుస్తకాలు తిరగేస్తూ నోట్సులు రాసేసుకుంటున్నారు. పేపర్లు చదవడానికి వచ్చిన సీనియర్ సిటిజన్లు అక్కడక్కడా కనిపించారు. విశాలమైన ఆవరణ, దానికి తగ్గట్టు చక్కని నిర్వహణ. ర్యాకులు చూడగానే అసలు ఏమేం పుస్తకాలు ఉన్నాయా అన్న ఆసక్తి మొదలయ్యింది. యండమూరి నవలల మొదలు ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం వరకూ చాలా రకాల పుస్తకాలే కనిపించాయి.

ఇది పని కాదనిపించి, కేటలాగు చదవడం మొదలు పెట్టాను. ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, చాలా రోజులుగా ప్రింట్లో లేని ఎన్నో పుస్తకాలు ఆ లైబ్రరీలో ఉన్నాయి. ప్రతి పుస్తకానికీ ఓ కోడ్ నెంబర్ ఇచ్చారు. ఓ రెండు పేజీలు తిరగెయ్యగానే చిన్న ఆలోచన వచ్చి, నేను చదవాలనుకునే పుస్తకాల కోడ్ నెంబర్లు నోట్ చేయడం మొదలు పెట్టాను. ఆ పని చేస్తున్నంత సేపూ మా ఊరి రచ్చబండ దగ్గర సామూహిక పత్రికా పఠనం మొదలు, పక్కూళ్ళో ఉన్న ప్రభుత్వ గ్రంధాలయంలో గంటలకి గంటలు గడపడం వరకూ ఎన్నో సంగతులు గుర్తొచ్చాయి.

మా రచ్చబండ ప్రత్యేకత ఏమిటంటే, అక్కడ ఎవరూ పేపర్ చదవక్కరలేదు. వింటే చాలు, రేడియో వార్తలు విన్నట్టుగా. అప్పట్లో మా ఊళ్ళో తమని తాము ఆకాశవాణి వార్తా చదువర్లుగా భావించుకున్న వారికి లోటు లేని కారణాన, మొదటగా పేపర్ దక్కించుకున్న వాళ్ళు మిగిలిన వాళ్లకి చదివే అవకాశం ఇవ్వకుండా గడగడా చదివేసేవాళ్ళు. మా బడి ఉన్నది ఆ పక్కనే అవ్వడం వల్ల వద్దన్నా సరే, పేపరు వార్తలూ ఆ తర్వాత జరిగే విశ్లేషణలూ చెవిన పడుతూనే ఉండేది.

ప్రభుత్వం గ్రంధాలయాలని నిర్వహిస్తుందనీ, అక్కడ అన్నిరకాల పత్రిలతో పాటు నవలలూ ఉచితంగా చదువుకోవచ్చనీ కాలేజీకి వచ్చేంత వరకూ నాకు తెలీదు. హైస్కూల్లో పరిచయమైన అద్దె నవలల లైబ్రరీ ఓ విషాద జ్ఞాపకం. ఇది రాస్తూ కూడా వీపు తడుముకున్నానంటే ఇంక చెప్పడానికి ఏముంటుంది? అదృష్టవశాత్తూ ప్రభుత్వ గ్రంధాలయం లైబ్రేరియన్ తో నాకు స్నేహం కుదిరింది. వార, మాస పత్రికల్ని మడత నలగకుండా తాజాగా చదవగలిగే వీలు కుదిరింది. కోడూరి కౌసల్యా దేవి 'చక్రభ్రమణం' లాంటి నవలల్ని చదివింది అక్కడే.

తర్వాతి కాలంలో లైబ్రరీలకి వెళ్లిందీ, సమయం గడిపిందీ బహుతక్కువ. కావాల్సిన పుస్తకాలు కొనుక్కోవడం, చదువుకోవడమే తప్ప లైబ్రరీల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. లెండింగ్ లైబ్రరీలు కను మరుగైపోవడం తెలుసు.. ప్రభుత్వ లైబ్రరీల గురించి అప్పుడప్పుడూ పేపర్లలో 'నిధుల కొరతతో సతమతం' లాంటి వార్తలు చదవడమే తప్ప ఎలా ఉన్నాయో చూద్దాం అనిపించలేదు. ఇదిగో ఇప్పుడు, ఒక లైబ్రరీని కనుగొన్నాను. నేను తదేక దీక్షతో కేటలాగుని చదువుతూ ఉండగానే లైబ్రేరియన్ వచ్చారు.

తగుమాత్రంగా నన్ను నేను పరిచయం చేసుకుని, లైబ్రరీ వివరాలు అడిగాను. ప్రవేశం, పుస్తకాలూ ఉచితమే. కానైతే ఆవరణ దాటి బయటికి ఇవ్వరు. అక్కడే కూర్చుని చదువుకుని, వాళ్ళ పుస్తకాన్ని వాళ్లకి జాగ్రత్తగా అప్పగించేసి రావాలి. అంతా బాగానే ఉంది కానీ, వాళ్ళ టైమింగ్సూ, నా వేళలూ బొత్తిగా రైలు పట్టాల్లా ఉన్నాయి. ఏదో ఒకటి చేసి ఈ పట్టాల మీద బండి నడపాలని మాత్రం గట్టిగా అనేసుకున్నాను. చూడాలి, మనసుంటే మార్గం అదే దొరుకుతుంది అంటారు కదా..

శుక్రవారం, అక్టోబర్ 07, 2011

రోటి పచ్చడి

మధ్యాహ్నం బడిలోనుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ డబ్బాలో అప్పచ్చులు చిన్న పళ్ళెంలో పెట్టి సిద్ధంగా ఉంచుతుంది కదా. కాళ్ళూ, చేతులూ, ముఖం కడిగేసుకుని, తల దువ్వించేసుకుని, ఆ అప్పచ్చుల పని పట్టగానే ఓ గ్లాసుడు పాలిచ్చేస్తుంది. అవి తాగేసి, బళ్ళో చెప్పిన పాఠాలు కాసేపు చదివేసుకుని, పలక మీద రాయాల్సిన పాఠం ఏవన్నా ఉంటే రాసేసి ఆ పలకని జాగ్రత్తగా ఓమూల పెట్టేస్తే చదువైపోయినట్టే. ఇంక ఆటలకి వెళ్లిపోవచ్చు.

రామాలయం దగ్గరో, కాంగ్రెస్ అరుగు దగ్గరో అప్పటికే ఫ్రెండ్సులంతా వచ్చేసి ఉంటారు కదా.. పంటలేసుకునే లోగా వెళ్ళామంటే సరే. లేకపొతే వాళ్ళ ఆట చూస్తూ కూర్చోవాలి. ఎలాగూ మళ్ళీ నాన్న ఇంటికి వచ్చేలోగానే తిరిగి వచ్చెయ్యాలి కాబట్టి ఎక్కువసేపు ఆడుకోడానికి ఉండదు. గూటీబిళ్లో, ఏడు పెంకులాటో అయితే కనీసం ఒక్క ఆటా అవ్వదు. గుడి మీద మైకులో పాట వినిపించిందంటే ఇంక ఇంటికి వెళ్ళాల్సిందే. అప్పటికి అమ్మ పెరట్లో రోటిదగ్గర ఉంటుంది.

మందార చెట్టుకింద ఉండే ఆ రోలు ఎంత పెద్దదంటే, కడగాలంటేనే ఓ బిందెడు నీళ్ళు పడతాయి. ఆ రోట్లో ముందర పిండి రుబ్బేసుకుని, సుబ్బరంగా కడిగేసి, తుడిచేసి అప్పుడు మొదలు పెడుతుంది అమ్మ పచ్చడి రుబ్బడం. ఎక్కువగా కొబ్బరి పచ్చడి.. తప్పితే కంది పచ్చడో, పెసర పచ్చడో.. ఇంకా ఒక్కోసారి వెలక్కాయ పచ్చడి, వంకాయ రోటి పచ్చడి లాంటివి కూడా చేస్తుందనుకో. కానీ ఒక్క కొబ్బరి పచ్చడినే ఒక్కోరోజు ఒక్కోలా చెయ్యగలదు, రోజూ తిన్నా విసుగు రాకుండా.

రోలుకి ఎదురుకుండా పీటేసుకుని కూర్చున్నామంటే అమ్మ పచ్చడి చెయ్యడం చూడొచ్చు. ఎందుకూ చూడడం? అంటే చూడ్డానికి బాగుంటుంది కాబట్టి. తుడిచిన రోట్లో, ఇంట్లోనుంచి తెచ్చుకున్న వేడి వేడి పోపు దింపి రోకలి బండతో కొంచం దంపి అందులో కొబ్బరి కోరు వేస్తుందా, ఇంకో రెండు దంపులు దంపగానే రుబ్బురోలు పొత్రం జాగ్రత్తగా రోట్లోకి దించుతుంది. మనమేమో రోలు మీద చేతులు వెయ్యకుండా చూడాలన్న మాట. వేస్తే ఇంకేమన్నా ఉందీ, పొత్రం కింద వేళ్ళు కానీ పడ్డాయంటే ఇంక పలక మీద ఏమీ రాయలేం.

ఓ చేత్తో పొత్రం తిప్పుతూ, రెండో చేత్తో పచ్చడి రోట్లోకి తోస్తో భలేగా రుబ్బేస్తుంది అమ్మ. పచ్చడి అన్నంలోకి అయితే ఒకలాగా, ఇడ్డెన్ల లోకి ఇంకోలాగా రుబ్బుతుందా..అదే ఏ గారెల్లోకో అయితే పచ్చడి వేరేగా ఉంటుంది. అసలు అమ్మ రుబ్బే పచ్చడి చూసి అది ఎందులోకో చెప్పేయొచ్చు. శనివారం సాయంత్రం అల్లప్పచ్చడి కానీ రుబ్బుతోందంటే ఆవేళ రాత్రికి ఉప్మా పెసరట్టని అర్ధం. పెసర పచ్చడి బోల్డు బోల్డు రుబ్బుతోందంటే పుణుకులేసి, పులుసెడుతుందని తెలిసిపోయేది. వంకాయ పచ్చడి రాచ్చిప్పలోకి తీస్తోందంటే ఉప్పుడుపిండి తినబోతున్నామని ఇంకెవరూ వేరే చెప్పక్కర్లా.

రోట్లో పిండి రుబ్బుతోన్నా, పచ్చడి రుబ్బుతోన్నా పొత్రం భలేగా ఇబ్బంది పెట్టేస్తుంది. ఉన్నట్టుండి కర్ర బురుజు ఊడిపోతుందా.. దాంతో రుబ్బడం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఒక్కోసారి ఆ విసురుకి అమ్మ చెయ్యి రోటికి తగిలి ఒహటో రెండో గాజులు చెల్లిపోతాయి కూడాను. బురుజు ఊడిపోయినప్పుడు అమ్మకి మనం బోల్డంత సాయం చెయ్యొచ్చు. పొత్రం పైకి తీసి ఓ చేత్తో పట్టుకుని, రెండో చేత్తో బురుజు అమరుస్తుందా, మనమేమో రోకలి బండ తీసుకుని ఆ బురుజు మీద చిన్న చిన్న దెబ్బలు జాగ్రత్తగా వేశామంటే అదికాస్తా అమిరిపోతుంది. మనం ఏమరుపాటుగా గానీ ఉన్నామంటే మాత్రం ముందు అమ్మ చేతికి దెబ్బ తగులుతుంది, ఆ తర్వాత మన వీప్పగులుతుంది.

పచ్చడి రుబ్బడం అవుతోందనగా, వంటింట్లోకి పరిగెత్తుకెళ్ళి ఉప్పు రాచ్చిప్పలోనుంచి ఓ గుప్పెడు ఉప్పు గానీ పట్టుకొచ్చామంటే అమ్మ ఎంత సంతోషిస్తుందో చెప్పలేను. ఆ ఉప్పుని రోలు మీద వేసి, అమ్మ పచ్చట్లోకి కావాల్సింది తీసుకున్నాక ఎక్కువ మిగిలితే మళ్ళీ రాచ్చిప్పలో వేసేయడం.. కాసిన్ని రాళ్ళే అయితే నోట్లో వేసేసుకోవడం. అదికూడా అమ్మకి పచ్చడి రుచి ఎలా ఉందో చెప్పాకే. రుచి కోసం పచ్చడి అరచేతిలో వేయించుకోకూడదు. గుప్పిడు బిగించి చేయి చాపితే మణికట్టుకీ వేళ్లకీ మధ్యలో కొంచం పచ్చడి వేస్తుంది అమ్మ. దాన్ని నాలుకతో అందుకుని ఒక్కసారి కళ్ళు మూసుకున్నామంటే రుచి చెప్పేయొచ్చు.

పచ్చడి రుబ్బేటప్పుడు ఊరికే పోచికోలు కబుర్లు కాకుండా (అంటే ఏవిటో తెలీదు.. అమ్మ అలాగే అనేది) రోజూ పద్యాలు నేర్పేది అమ్మ. 'కూజింతం రామ రామేతి...' తో మొదలు పెడితే ఎన్నెన్ని పద్యాలో. విడి పద్యాలు అవ్వగానే అష్టకాలు అందుకుంది. 'వసుదేవ సుతందేవం...' తో మొదలు పెట్టి కృష్ణాష్టకం ఓ వారం రోజులు, అదయ్యాక 'గంగాతరంగ రమణీయ జటా కలాపం...' అంటూ విశ్వనాథాష్టకం మరో వారం.. ఇలా సాగేది చదువు. పచ్చడి రుబ్బుతున్నంత సేపూ ముందటి పద్యం అప్పగించడం, కొత్త పద్యం నేర్చుకోవడం.. ఇదంతా కూడా రుబ్బడాన్ని రెప్ప వెయ్యకుండా చూస్తూనే.

చూస్తుండగానే అన్నిచోట్లా వచ్చి పడిపోయిన మార్పు వంటగదిలోకీ చొచ్చుకుని వచ్చేసింది. అమ్మ స్థానంలో ఆలి ప్రవేశించింది. రోటి గలగలల స్థానాన్ని మిక్సీ గురుగుర్రులు ఆక్రమించేశాయి. నాలుగు ఆవాలు పొడి కొట్టాలన్నా, రెండు మిరపకాయలు నలపాలన్నా కూడా మిక్సీనే శరణ్యం ఇప్పుడు. "ఏవి తల్లీ నిరుడు రుబ్బిన రోటి పచ్చళ్ళు.." అని మూగగా పాడుకుంటూ కాలం గడుపుతుండగా, ఊహించని విధంగా మూలపడ్డ రోటికి పూర్వ వైభవం వచ్చేసింది. కరెంటు కోత పుణ్యమాని మిక్సీ మూగబోవడంతో అన్నపూర్ణ లాంటి రుబ్బురోలు రుచికరమైన పచ్చళ్ళని అందిస్తోందిప్పుడు. 'మరక మంచిదే' అని ఊరికే అన్నారా డిటర్జంట్ కంపెనీ వాళ్ళు?