గురువారం, డిసెంబర్ 29, 2022

నవలేఖన కన్నడ కథలు

పద్నాలుగు మంది కన్నడ యువరచయితల కథలని తెలుగులోకి అనువదింపజేసి 'నవ లేఖన మాల' సిరీస్ లో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన సంకలనం 'నవ లేఖన కన్నడ కథలు'. సుప్రసిద్ధ కన్నడ కవి ఎస్. జి. సిద్ధరామయ్య సంపాదకత్వం వహించారు. తెలుగు పాఠకులకి సుపరిచితులైన రంగనాథ రామచంద్ర రావు అనువదించారీ కథలన్నింటినీ. సమకాలీన అంశాలతో పాటు, పాత సమస్యల్ని కొత్త దృష్టితో చూసి యువత రాసిన కథలివి. కొన్ని సంభాషణలు, పదప్రయోగాలు, కొన్నిచోట్ల హాస్యమూ కొంత ముతకగా అనిపించినప్పటికీ కథల్లో చర్చకు పెట్టిన వస్తువు మొదలు, కథని చెప్పిన విధానం వరకూ ప్రతి కథలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉండడం ఈ సంకలనం ప్రత్యేకత. చదివి మర్చిపోయే వాటి కన్నా, గుర్తుంచుకోమని వెంటపడే కథలే ఎక్కువ. 

హనుమంత హలగేరి రాసిన 'పాడు వల్లకాడు బతుకు' సంకలనంలో తొలి కథ. శీర్షిక సూచిస్తున్నట్టుగా ఇది ఒక కాటి కాపరి కథ. సంప్రదాయ పద్దతిలో జరిగే శవదహనాలకి ఎలక్ట్రిక్ క్రిమిటోరియం ఒక ప్రత్యామ్నాయంగా అవతరించిన దశలో, కొత్త విద్య నేర్చుకోలేని, చేతనైన పనితో బతుకు వెళ్లదీయలేని కాపరి కథ ఇది. సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలని కథలో భాగం చేశారు రచయిత. నగరానికి వలస వచ్చి తీరైన బతుకు తెరువు వెతుక్కునే క్రమంలో పెళ్లి వయసు దాటేసిన వ్యక్తి కథ '24 క్యారెట్'. శ్రీధర బనవాసి రాసిన ఈ కథ, అతడివైపు నుంచి మాత్రమే కాకుండా అతన్ని పెళ్లాడాలనుకునే డైవోర్సీ స్త్రీ వైపు నుంచి కూడా సాగుతుంది. 

నిడివిలో పెద్ద కథలు 'రెండు మరియు ఒకటి' 'వేగంలోని అవేగం'. ఇంద్రకుమార్ హెచ్ జి రాసిన 'రెండు మరియు ఒకటి' కథ తప్పిపోయిన తమ భార్యని వెతికే ఇద్దరు మగవాళ్ల కథగా మొదలై (ఇద్దరికీ ఒకే భార్య) ఊహించని మలుపులతో సాగుతుంది. దావణగెరె నూలు మిల్లుల మూసివేత, అనంతర పరిస్థితులని కళ్ళకి కడుతుంది. నాయిక పాత్ర ప్రత్యేకమైనది ఈ కథలో. టీవీ న్యూస్ ఛానళ్ల కథగా అనిపించే 'వేగంలోని అవేగం' లో నగరజీవితంలో ఓ భాగమైన వేగం నిజానికి ఎంతవరకూ అవసరం అనే ప్రశ్నని లేవనెత్తుతారు రచయిత మౌనేశ బడిగెర. కార్పొరేట్ కంపెనీల్లో కనిపించే ద్వంద్వ నీతిని హెచ్చార్ డిపార్ట్మెంట్ వైపు నుంచి చెప్పిన కథ 'కామసూత్ర'. విక్రమ హత్వార రాసిన ఈ కథ ఆపకుండా చదివిస్తుంది. 

మమతా.ఆర్ కథ 'ఖాళీ చేతులతో వచ్చిన చంద్రుడు' పేరుకి తగ్గట్టే కవితాత్మకంగా సాగుతుంది. సంతోష గుడ్డియంగడి రాసిన 'దీన దళితుడి హోటల్' కథ దళిత రాజకీయాల నేపథ్యంలో నడుస్తుంది. వ్యసన పరుడైన కొడుకుని దారిలో పెట్టుకోడానికి గ్రామ జాతరని ఆసరా చేసుకున్న తండ్రి కథ టి. ఎస్. గొరవర రాసిన 'దేవుడి ఆట'. పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన మరో కథ 'నాన్న తప్పెట'. జడేకుంటె మంజునాథ్ రాసిన ఈ కథలో చదువుకునే కొడుక్కి తప్పెట మీద ఆసక్తి ఉండడాన్ని భరించలేని తండ్రిని మాత్రమే కాదు, సమకాలీన గ్రామరాజకీయాలనీ చూస్తాం. 'బార్బర్ బబ్లూ - ఆరెంజ్ అమ్మాయిలు' కథ చదువుతున్నంతసేపూ 'ఈ రచయిత తెలిసిన వాడే' అనిపించింది. 'రాయల్ ఎన్ ఫీల్డ్' నవల రాసిన మంజునాథ్ వి ఎం రాసిన కథ ఇది. 

నది ఉగ్రరూపాన్నీ, వరద బీభత్సాన్నీ చిత్రించిన కథ 'కృష్ణ ప్రవహించింది'. తిరుపతి భంగి రాసిన ఈ కథలో బీభత్స రసంతో పాటు గ్రామ రాజకీయాలూ కనిపిస్తాయి. నిబంధనల్ని అతిక్రమించే పరిశ్రమ కథ 'గ్రీన్ టీ'. ఫార్మాస్యూటికల్ కంపెనీ నేపథ్యంగా సాగే ఈ కథని ఆనంద కుంచనూరు రాశారు. గ్రామాల శిధిలావస్థని ప్రతీకాత్మకంగా చెప్పిన కథ 'శిధిలం'. చూడ్డానికి చాలా చిన్నవిగా అనిపించే సమస్యలు అనుభవంలోకి వచ్చినప్పుడు ఎంత భరింపరానివిగా మారతాయో విశదంగా చెప్పారు అలకా కట్టెమనె. 'తుఫాన్' కథని సంకలనంలో చివరిదిగా ఉంచడం యాదృచ్చికం కాదనిపించింది, చదవడం పూర్తి చేశాక. సుశీలా డోణూర రాసిన ఈ కథ గుర్తుండిపోయే కథల్లో ఒకటి. 'కన్నడ ఫ్లేవర్' చెడని విధంగా అనువాదం సాగింది. మొత్తం 164 పేజీల ఈ సంకలనం వెల రూ. 170. పుస్తకాల షాపులతో పాటు, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు. 

శుక్రవారం, డిసెంబర్ 23, 2022

నవరస నట సార్వభౌమ ...

గుణచిత్ర నటుడు అనే తెలుగు అనువాదం కన్నా కేరక్టర్ ఆర్టిస్ట్ అనే ఇంగ్లీషు మాటే సులువుగా అర్ధమవుతుంది. అంతకన్నా కూడా 'కైకాల సత్యనారాయణ' అనే పేరు చెబితే చాలు చెప్పదల్చుకున్నది ఏ విషయాన్ని గురించో మరింత సులభంగా బోధ పడుతుంది. నటులు చాలామందే ఉండొచ్చు. కానీ తెరమీద తాను పోషించిన పాత్ర తప్ప తాను కనిపించకపోవడం అన్నది కొందరికే సాధ్యం. తెలుగు సినిమా వరకూ ఆ కొందరిలో తప్పక ఉండే పేరు కైకాల సత్యనారాయణ. 'నవరస నట సార్వభౌమ' బిరుదు ఎవరిచ్చారో తెలియదు కానీ, కైకాల విషయంలో అది అక్షర సత్యం. ప్రేక్షకలోకం 'సత్తిగాడు' అని ముద్దుగా పిలుచుకునే ఈ నటుడు ఏడొందల పైచిలుకు సినిమాల్లోనూ తానుగా ఎక్కడా తెరమీద కనిపించలేదు, ఆయా పాత్రలు మాత్రమే కనిపించాయి. 

సత్యనారాయణ విలన్ గా వెలిగిన కాలం బహు ప్రత్యేకమైనది. హీరో ఎవరైనా కావచ్చు, విలన్ మాత్రం తనే. రకరకాల మేకప్పులు, మేనరిజాలు, వాటిల్లో పునరుక్తులు తప్పించడానికి ప్రయత్నాలు.. విలన్ వేషం ఎవరు వేసినా సినిమా చివరికి గెలుపు హీరోదే అని ప్రేక్షకులకి ముందే తెలిసినా, సినిమా చూస్తున్న వాళ్ళకి విలన్ మీద కోపం పెరిగే కొద్దీ హీరోకి మైలేజీ పెరుగుతుందన్నది వెండితెర సూత్రం. అలా విలన్లందరూ తమని తాము తగ్గించుకుని హీరోని హెచ్చింపజేస్తూ ఉంటారు. రచయితలు రాసిన పాత్ర బలానికి తోడుగా, సత్యనారాయణ నిండైన విగ్రహం, స్పష్టమైన ఉచ్చారణ, భావాలని పలికించే కళ్ళు.. ఇవన్నీ ఆ హెచ్చింపుకి మరింత బాగా దోహదం చేశాయి. ఒకానొక సమయంలో తెలుగు తెరకి మోస్ట్ వాంటెడ్ విలన్ అవడంలో ఆశ్చర్యం లేదు. 

విలనీ తర్వాత చెప్పుకోవాల్సినవి కామెడీ వేషాలు. జుట్టు నుదుటిమీదకి దువ్వి డిప్ప కటింగ్ చేస్తే అది 'సత్తిగాడి హెయిర్ స్టయిల్'. ఆ గెటప్ లో సత్యనారాయణ ని చూడగానే నవ్వొచ్చేసేది. 'ఈ మనిషిలో సహజసిద్ధంగానే ఓ పాలు అమాయకత్వం ఉందేమో' అని సందేహం కలిగేంతగా ఆ పాత్రలు పండేవి. ఆ హెయిర్ స్టైల్ కి తోడు చిత్ర విచిత్రమైన కాస్ట్యూమ్సు. ఆ గెటప్ లో సత్యనారాయణని చూస్తూ సీరియస్ గా నటించాల్సి రావడం మిగిలిన నటీనటులకు ఎంత పరీక్షో కదా. ఇక, సత్యనారాయణ వేసినన్ని 'ఎస్ బాస్' వేషాలు ఇంకెవరూ వెయ్యలేదేమో. అలా విలన్ డెన్ లో 'ఎస్ బాస్' అంటూనే, కనుబొమ పైకెత్తి ప్రేక్షకులవైపు సాలోచనగా చూశాడంటే, ఆ సినిమాలో సత్యనారాయణ విలన్ని ముంచెయ్యబోతున్నట్టే. 

Google Image

తెల్లపంచె, లాల్చీ వేసుకుని తండ్రి/తాత వేషం ధరిస్తే కరుణామూర్తి అన్నట్టే. ఇలాంటి వేషాలున్న రెండు మూడు సినిమాలు తెలుగేతరులకి చూపించి, ఆ తర్వాత ఇతను క్రూరమైన విలన్ గా ఫేమస్ తెలుసా?' అంటే వాళ్ళు నమ్మకపోవచ్చు. పాత్రలోకి పరకాయ ప్రవేశం అంత సులువుగా ఎలా సాధ్యపడుతుంది అని ఆశ్చర్య పరిచిన సందర్భాలు ఎన్నో. ఒక్క సాంఘికాలు మాత్రమే కాదు, పౌరాణికాలు, జానపదాలు కూడా ఉన్నాయి తన ఖాతాలో. 'యమగోల' లోనూ 'యమలీల' లోనూ యముడి వేషమే అయినా, ఇద్దరు యముళ్ళకీ పోలిక కనిపించదు. అసలు ఆ వైవిధ్యం కోసం చేసిన నిరంతర పరిశ్రమే సత్యనారాయణని అన్నాళ్ళు సినిమా రంగంలో బిజీగా ఉంచిందేమో. 

అందరిలాగే హీరో అవుదామని సినిమా పరిశ్రమకి వచ్చినా, గిరిగీసుకుని ఉండిపోకుండా, వచ్చిన అవకాశాల్లోనే తనని తాను నిరూపించుకుని ఏ ఒక్క ముద్రా, మూసా తనమీద పడకుండా కెరీర్ ని కొనసాగించిన ఘనత సత్యనారాయణది. 'ప్రతి అవార్డుకీ ఓ లెక్కుంటుంది' అనే మాట నిజమేనేమో అనిపించడానికి సత్యనారాయణకి చెప్పుకోదగ్గ అవార్డులేమీ రాకపోవడం కూడా ఓ ఉదాహరణ. రాజకీయాల్లోనూ, సినిమా నిర్మాణంలోనూ ప్రవేశించినా, నటనే తన ఫుల్ టైం ప్రొఫెషన్ గా కెరీర్ కొనసాగించారు. వయోభారంతో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా వేషాలు తలుపు తట్టాయి. నిండైన జీవితాన్ని, నట జీవితాన్నీ చూసిన నవరస నట సార్వభౌముడు తెలుగు ప్రేక్షకులకి కొన్ని తరాల పాటు జ్ఞాపకం ఉంటాడు. సత్యనారాయణ ఆత్మకి శాంతి కలగాలి. 

మంగళవారం, డిసెంబర్ 20, 2022

ఆలీతో సరదాగా

తెలుగునాట టాక్ షో లు కోకొల్లలు. అలనాటి దూరదర్శన్ మొదలు నిన్నమొన్ననే మొదలైన యూట్యూబ్ ఛానళ్ల వరకూ ప్రముఖుల ఇంటర్యూలు జరపని వాళ్ళు అరుదు. మనకి కళ అంటే సినిమాలు, సెలబ్రిటీలు అంటే సినిమావాళ్ళే కాబట్టి ఈ ఇంటర్యూల అతిధుల్లో అధికులు సహజంగా సినిమా వాళ్ళే. తగుమాత్రం సినీ సెలబ్రిటీలందరూ ఒకటికి మించి చానళ్లకు ఇంటర్యూలు ఇచ్చిన వాళ్ళే. ఇన్నేసి ఇంటర్యూల మధ్య తనదైన ప్రత్యేకతని నిలుపుకుంటూ దాదాపు ఏడేళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగి మూడు వందల ఎపిసోడ్లతో ముగిసిన కార్యక్రమం 'ఆలీతో సరదాగా'. అనేకానేక టాక్ షోలు నడుస్తూ ఉండగా ఈ కార్యక్రమాన్ని గురించి మాత్రమే మాట్లాడుకోడం ఎందుకూ అంటే, దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి. 

ఏ కార్యక్రమం రక్తి కట్టాలన్నా ముఖ్యంగా ఉండాల్సింది 'తగినంత నిడివి'. దూరదర్శన్ తొలినాళ్లలో చేసిన ఇంటర్యూల నిడివి పావుగంట, ఇరవై నిముషాలు మించి ఉండేది కాదు. బహుశా రేడియో ఇంటర్యూలకి కొనసాగింపుగా ఈ పద్దతి పాటించి ఉంటారు. ఇంటర్యూ కోసం ఎదురు చూసినంత సేపు పట్టేది కాదు, శాంతి స్వరూపో, విజయదుర్గో "చాలామంచి విషయాలు చెప్పారండి, నమస్కారం" అనడానికి. తర్వాత్తర్వాత వాళ్ళూ నెమ్మదిగా సమయం పెంచడమే కాకుండా, రెండు మూడు ఎపిసోడ్లుగా ప్రసారం చేయడం అలవాటు చేసుకున్నారు. శాటిలైట్ చానళ్ళు జెమినీ, ఈటీవీల్లో కూడా తొలినాటి ఇంటర్యూల నిడివి అరగంట మాత్రమే ఉండేది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో పదిహేను పదహారు గంటల సుదీర్ఘ ఇంటర్యూలు కూడా కనిపిస్తున్నాయి, ఇది మరీ అతివృష్టి. 

ఏదైనా విషయం మీద మనం ఫోకస్ చేయగలిగే గరిష్ట సమయం నలభై ఐదు నిమిషాలని, అందుకే హైస్కూల్, కాలేజీల్లో ఒక్కో పీరియడ్ నిడివి నలభై ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుందనీ అంటారు. ఆ లెక్కన చూసినప్పుడు ఈ 'ఆలీతో సరదాగా' షో నిడివి ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ కి సరిగ్గా సరిపోయేంత మాత్రమే. కనీసం ఒక్క ఎపిసోడ్ కూడా నేను టీవీలో ప్రసారం అవుతుండగా చూడలేదు కాబట్టి ఎన్ని బ్రేకులు ఇచ్చేవారో తెలియదు. ఈ ఇంటర్యూలని చూసింది, విన్నది యూట్యూబ్ లోనే. గెస్టులు మరీ బోరింగ్ అనిపిస్తే ఆ ఎపిసోడ్ల జోలికే పోలేదు తప్ప, మొదలు పెట్టి మధ్యలో ఆపేసినవో, స్కిప్పులు కొడుతూ చూసినవో లేనేలేవు. ఆ విధంగా గెస్టులూ, హోస్టూ కూడా నన్ను ఎంగేజ్ చేశారు. 

నవతరం ప్రేక్షకులకి బొత్తిగా తెలియని గెస్టులని వాళ్ళకి పరిచయం చెయ్యాలి, బాగా తెలిసిన వాళ్ళని గురించి కొత్త విషయాలు చెప్పాలి. ఈ రెండూ టాక్ షో లకి ప్రధానమైన సవాళ్లు. మూడొందల మంది గెస్టుల్లో ఓ పాతిక ముప్ఫయి మంది మినహా మిగిలిన అందరితోనూ కలిసి పనిచేసిన అనుభవం ఉంది ఆలీకి. ఆ అనుభవం ఈ షో కి చక్కగా ఉపకరించి ఆయా ఎపిసోడ్లు లైవ్లీ గా రావడానికి సహకరించింది. ఉదాహరణకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనేక ఇంటర్యూలు ఇచ్చినా, ఆలీ ఇంటర్యూ ఇప్పుడు చూసినా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రశ్నలు దాదాపు అందరూ అడిగేవే. కానీ, సంభాషణలో కనిపించే ఆత్మీయత వెనుక ఉన్నది వ్యక్తిగత అనుబంధమే. చాలామంది అతిధుల విషయంలో ఈ అనుబంధం చక్కగా పనిచేసింది 

అతిధులకీ, షో చూసే ప్రేక్షకులకి కూడా హాయిగా అనిపించే మరో విషయం అలీ చూపించే హంబుల్ నెస్. పెద్దవాళ్ళ ముందు కాస్త ఒదిగి ఉండడం మాత్రమే కాదు, తనకన్నా వయస్సులోనూ హోదాలోనూ చిన్నవాళ్ళని ఇంటర్యూ చేసినప్పుడూ ఎక్కడా అతిచనువు ప్రదర్శించక పోవడం ఈ షో ని ప్రత్యేకంగా నిలిపింది. ఎటు చూసినా అతి చనువు ప్రదర్శించాలని తహతహలాడే హోస్టులే కనిపిస్తూ ఉండడం వల్ల కావొచ్చు, ఈ ప్రత్యేకత మరీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రారంభ ఎపిసోడ్లలో గెస్టులని వ్యక్తిగతమైన ప్రశ్నలు గుచ్చి గుచ్చి అడిగి ఇబ్బంది పెట్టినా, తర్వాత్తర్వాత అలాంటి ప్రశ్నల విషయంలో జాగ్రత్త పడడం కనిపించింది. అయితే, ఏదో వంకన గెస్టుల చేత ప్రయత్నపూర్వకంగా కన్నీళ్లు పెట్టించడం మాత్రం ఓ దశలో విసుగు తెప్పించింది. 

గెస్టుల గురించి సరే, ఆలీ గురించి కూడా అనేక విషయాలు తెలుసుకోడానికి ఈ షో ఉపకరించింది. అంతకు ముందు ఆలీ గురించి తెలిసింది తక్కువ. సినిమా ఫంక్షన్లకి యాంకరింగ్ చేస్తూ హీరోయిన్లని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లాంటి కాంట్రవర్సీలు అప్పటికే ఉన్నాయి. అతను పెద్దగా చదువుకోలేదనీ, సినిమా తప్ప మిగిలిన ప్రపంచం పెద్దగా తెలీదనీ తెలిసింది ఈ షో వల్లనే. ఎలాంటి బేక్ గ్రౌండూ లేకుండా సినిమాల్లోకి వచ్చి నలభయ్యేళ్ళ పాటు నిలదొక్కుకోవడం, కొనసాగుతూ ఉండడం మామూలు విషయం కాదు. మరీ ముఖ్యంగా, 'హీరో' ముద్ర పడ్డాక మళ్ళీ వెనక్కి వచ్చి మామూలు కమెడియన్ అయిపోవడమూ పెద్ద విషయమే. పాత ఎపిసోడ్లని కుదించి యూట్యూబ్ లో పెడుతున్నారు ఎందుకో. వాటిని ఉన్నఫళంగా ఉంచితే బాగుంటుంది. 

సోమవారం, డిసెంబర్ 05, 2022

పసిడిబొమ్మ

బ్లాగులతో రచనలు మొదలుపెట్టి కథారచయితలుగా మారిన వారి జాబితాలో చేరిన మరో పేరు చందు శైలజ. సరదా పోస్టులతో బ్లాగింగ్ ప్రారంభించిన ఈ గుంటూరు డాక్టర్ గారు ప్రేమకథల మీదుగా సాగి డాక్టర్ చెప్పిన కథలు చెబుతూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. లెక్క తీస్తే ఇప్పటివరకూ సుమారు యాభై కథలు రాసి ఉండొచ్చు. వాటిలోంచి పదకొండు కథలు ఎంచి 'పసిడిబొమ్మ' కథా సంకలనాన్ని వెలువరించారు. వ్యంగ్య వచనం మీద తనదైన ముద్ర వేసిన ఈ రచయిత్రి, సీరియస్ గా సాగే కథనంలో అక్కడక్కడా వ్యంగ్యాన్ని చేర్చి పఠితకి కథ తాలూకు సీరియస్ నెస్ నుంచి కొంత రిలీఫ్ ఇవ్వడాన్ని బాగా సాధన చేశారనిపించింది - ఈ కథల్ని పుస్తకరూపంలో చదవడం పూర్తి చేయగానే. 

నిజానికి బ్లాగు పాఠకులకి చందు శైలజని మాత్రమే కాదు, ఆమె కథల్నీ కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. పైగా, ఈ సంపుటిలో కథల తొలి ప్రచురణ ఆమె బ్లాగు తో సహా ఆన్లైన్ వేదికలమీదే. అయితే, పుస్తకరూపంలో వచ్చిన కథల్ని ఏకబిగిన చదివినప్పుడు (అవును, ఏకబిగినే) అనిపించిన నాలుగు విషయాలు పంచుకుందామనిపించింది. 'అమృతం' 'ఆమె నిర్ణయం' 'కళ్ళజోడు' స్త్రీవాద కథలైతే (బలమైన స్త్రీ, బలహీనమైన పురుష పాత్ర), 'దోషి', 'ఇద్దరు మనుషులు-ఒక జంట', 'వాన' కథల్లో బలమైన పురుష పాత్రలు మెరవడమే కాదు, రచయిత్రి మొగ్గు ఈ పురుష పాత్రలవైపు కనిపిస్తుంది. గత పదేళ్లలో రాయడం మొదలు పెట్టిన వాళ్లలో, ప్రత్యేకించి రచయిత్రులలో, ఈ బాలన్స్ అరుదు. 'అమృతం' కథలో శారదత్త, 'దోషి' కథలో నారాయణ, 'వాన' కథలో దేవ్ పాఠకుల్ని వెంటాడే పాత్రలు. 

ఒక పాత్ర గొప్పదనాన్ని ఎలివేట్ చేయడం కోసం మరో పాత్రని తక్కువ చేసి చూపడం, కథని కూడా ఈ మరో పాత్ర దృష్టి కోణం నుంచి చెప్పడం అన్నది ఈ పుస్తకం లోని కథల్లో కొంచం తరచుగా వాడిన టెక్నిక్. పుస్తకం పూర్తి చేసేసరికి ఈ టెక్నిక్ కొంచం ఎక్కువగా రిపీట్ అయిన భావన కలిగింది. ఇలాంటి సందర్భాల్లో కూడా రచయిత్రి వ్యంగ్యపు టోన్ కథల్ని నిలబెట్టేసింది. 'ఇద్దరు మనుషులు - ఒక జంట' ఇందుకు ఉదాహరణ. ఆసాంతమూ వ్యంగ్యంతో నడిపిన కథ 'పెళ్లి-పెటాకులు'. పెళ్లి ఎందుకు పెటాకులు అయిందో రచయిత్రి ఎక్కడా నేరుగా చెప్పకపోయినా, కథ సగానికి వచ్చేసరికే పాఠకులకి అర్ధమవుతుంది. అయితే, ఇది 'ఆమె' వైపు నుంచి చెప్పిన కథ అవడం వల్ల అతని తాలూకు లోపాలు మాత్రమే కనిపిస్తాయి. 

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కథల్లో మొదటిది 'దేవుడా, క్షమించు'. వరాలుని దేవుడు తప్పక క్షమిస్తాడు. ఎంతమాత్రం క్షమించనిది ఆమె చుట్టూ ఉన్న మనుషులు మాత్రమే. సమాజంలో సహానుభూతి (సానుభూతి కాదు, ఎంపతీ) పాళ్ళు పెరగాల్సిన అవసరాన్ని అన్యాపదేశంగా చెప్పే కథ ఇది. మామూలు ప్రేమకథగా మొదలై, ఊహించని మలుపు తిరిగి ఆర్ద్రంగా ముగుస్తుంది. నాయిక చుట్టూ తిరిగే రెండు కథలు 'పెనిమిటి', 'పసిడిబొమ్మ'. 'పెనిమిటి' కథలో నిశ్చలని పని చేతకాని పనమ్మాయిగా పరిచయం చేసి, ఆమె గురించి ఒక్కో వివరాలన్నీ చెబుతూ వెళ్లి, తాను చెప్పకుండా వదిలేసిన వివరాల్ని గురించి పాఠకులు కథ పూర్తయ్యేక కూడా ఆలోచించేలా చిత్రించారు. మామూలుగా చదివితే నోస్టాల్జియాలా అనిపించేసే 'పసిడిబొమ్మ' నిజానికి అంతకు మించిన కథ. 

మోనోలాగ్ లా అనిపించే 'సెల్వాన్ని పంపించేస్తా' కథ బాగా గుర్తుండి పోడానికి కారణం బలమైన పాత్ర చిత్రణ. సెల్వం తాలూకు శ్రీలంక తమిళ యాసని ప్రత్యేకంగా చిత్రించిన తీరు. కథకురాలిని కాస్త తక్కువ చేసినా, సెల్వానికి ఎలివేషన్ ఎక్కువైన భావన రాలేదు.  "శ్రద్ధగా వంట చేసి ప్రేమతో వడ్డించడం వంటిదే, కథ చెప్పడం కూడా. ఆహ్వానం నుండి, తాంబూల వాక్యం వరకూ, పాఠకుడి పట్ల ఆ శ్రద్ధ, గౌరవం చూపించగలగాలి" .. రచయిత్రి రాసుకున్న ముందుమాటలో ఈ వాక్యాలు, సాహిత్య సృష్టి చేసేవాళ్లంతా నిత్యం గుర్తుంచుకోవాల్సినవి. పాఠకుల పట్ల ఉన్న శ్రద్ధ, గౌరవం వల్లనే కావొచ్చు తన తొలి సంకలనంతోనే విందు భోజనాన్ని వడ్డించగలిగారు చందు శైలజ. ప్రతి కథ చివరా తొలి ప్రచురణ తేదీని ఇచ్చి ఉంటే తాంబూలంలో మరో వక్కపలుకు చేర్చినట్టయ్యేది. 

పాఠకులకి ఈ చేర్పు ఏ రకంగా ఉపకరిస్తుందో ఈ పుస్తకం నుంచే ఉదాహరణ చెప్పాలంటే, 'సెల్వాన్ని పంపించేస్తా' కథలో కథకురాలు సెల్వం పెళ్ళికి వెళ్లలేక పోడానికి కారణం కరోనా లాక్ డౌన్. ఈ విషయం కథలో ఎక్కడా ఉండదు. రచనా కాలాన్ని బట్టి అంచనాకి రాగలం. బ్లాగులో వచ్చిన వెంటనే చదివిన వాళ్ళు కాక, పుస్తకంలోనే తొలిసారి ఈ కథ చదివేవాళ్ళు కాస్త గందరగోళ పడే అవకాశం ఉంది. "ఇంకా లోనికి ప్రయాణించాలి, ఇంకా గాఢత ఉన్న రచనలు చెయ్యాలి" అన్న రచయిత్రి ఆకాంక్ష నెరవేరాలన్నదే పాఠకుడిగా నా ఆశంస. 'అనల్ప' ప్రచురించిన 130 పేజీల 'పసిడిబొమ్మ' పుస్తకం అందమైన గెటప్ తో, అచ్చుతప్పులు లేకుండా బొమ్మలాగే ఉంది. కథలన్నీ ప్రాణం ఉన్నవే. ('పసిడిబొమ్మ' వెల రూ. 150, అన్ని పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ దొరుకుతోంది).