గురువారం, డిసెంబర్ 29, 2022

నవలేఖన కన్నడ కథలు

పద్నాలుగు మంది కన్నడ యువరచయితల కథలని తెలుగులోకి అనువదింపజేసి 'నవ లేఖన మాల' సిరీస్ లో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన సంకలనం 'నవ లేఖన కన్నడ కథలు'. సుప్రసిద్ధ కన్నడ కవి ఎస్. జి. సిద్ధరామయ్య సంపాదకత్వం వహించారు. తెలుగు పాఠకులకి సుపరిచితులైన రంగనాథ రామచంద్ర రావు అనువదించారీ కథలన్నింటినీ. సమకాలీన అంశాలతో పాటు, పాత సమస్యల్ని కొత్త దృష్టితో చూసి యువత రాసిన కథలివి. కొన్ని సంభాషణలు, పదప్రయోగాలు, కొన్నిచోట్ల హాస్యమూ కొంత ముతకగా అనిపించినప్పటికీ కథల్లో చర్చకు పెట్టిన వస్తువు మొదలు, కథని చెప్పిన విధానం వరకూ ప్రతి కథలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉండడం ఈ సంకలనం ప్రత్యేకత. చదివి మర్చిపోయే వాటి కన్నా, గుర్తుంచుకోమని వెంటపడే కథలే ఎక్కువ. 

హనుమంత హలగేరి రాసిన 'పాడు వల్లకాడు బతుకు' సంకలనంలో తొలి కథ. శీర్షిక సూచిస్తున్నట్టుగా ఇది ఒక కాటి కాపరి కథ. సంప్రదాయ పద్దతిలో జరిగే శవదహనాలకి ఎలక్ట్రిక్ క్రిమిటోరియం ఒక ప్రత్యామ్నాయంగా అవతరించిన దశలో, కొత్త విద్య నేర్చుకోలేని, చేతనైన పనితో బతుకు వెళ్లదీయలేని కాపరి కథ ఇది. సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలని కథలో భాగం చేశారు రచయిత. నగరానికి వలస వచ్చి తీరైన బతుకు తెరువు వెతుక్కునే క్రమంలో పెళ్లి వయసు దాటేసిన వ్యక్తి కథ '24 క్యారెట్'. శ్రీధర బనవాసి రాసిన ఈ కథ, అతడివైపు నుంచి మాత్రమే కాకుండా అతన్ని పెళ్లాడాలనుకునే డైవోర్సీ స్త్రీ వైపు నుంచి కూడా సాగుతుంది. 

నిడివిలో పెద్ద కథలు 'రెండు మరియు ఒకటి' 'వేగంలోని అవేగం'. ఇంద్రకుమార్ హెచ్ జి రాసిన 'రెండు మరియు ఒకటి' కథ తప్పిపోయిన తమ భార్యని వెతికే ఇద్దరు మగవాళ్ల కథగా మొదలై (ఇద్దరికీ ఒకే భార్య) ఊహించని మలుపులతో సాగుతుంది. దావణగెరె నూలు మిల్లుల మూసివేత, అనంతర పరిస్థితులని కళ్ళకి కడుతుంది. నాయిక పాత్ర ప్రత్యేకమైనది ఈ కథలో. టీవీ న్యూస్ ఛానళ్ల కథగా అనిపించే 'వేగంలోని అవేగం' లో నగరజీవితంలో ఓ భాగమైన వేగం నిజానికి ఎంతవరకూ అవసరం అనే ప్రశ్నని లేవనెత్తుతారు రచయిత మౌనేశ బడిగెర. కార్పొరేట్ కంపెనీల్లో కనిపించే ద్వంద్వ నీతిని హెచ్చార్ డిపార్ట్మెంట్ వైపు నుంచి చెప్పిన కథ 'కామసూత్ర'. విక్రమ హత్వార రాసిన ఈ కథ ఆపకుండా చదివిస్తుంది. 

మమతా.ఆర్ కథ 'ఖాళీ చేతులతో వచ్చిన చంద్రుడు' పేరుకి తగ్గట్టే కవితాత్మకంగా సాగుతుంది. సంతోష గుడ్డియంగడి రాసిన 'దీన దళితుడి హోటల్' కథ దళిత రాజకీయాల నేపథ్యంలో నడుస్తుంది. వ్యసన పరుడైన కొడుకుని దారిలో పెట్టుకోడానికి గ్రామ జాతరని ఆసరా చేసుకున్న తండ్రి కథ టి. ఎస్. గొరవర రాసిన 'దేవుడి ఆట'. పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన మరో కథ 'నాన్న తప్పెట'. జడేకుంటె మంజునాథ్ రాసిన ఈ కథలో చదువుకునే కొడుక్కి తప్పెట మీద ఆసక్తి ఉండడాన్ని భరించలేని తండ్రిని మాత్రమే కాదు, సమకాలీన గ్రామరాజకీయాలనీ చూస్తాం. 'బార్బర్ బబ్లూ - ఆరెంజ్ అమ్మాయిలు' కథ చదువుతున్నంతసేపూ 'ఈ రచయిత తెలిసిన వాడే' అనిపించింది. 'రాయల్ ఎన్ ఫీల్డ్' నవల రాసిన మంజునాథ్ వి ఎం రాసిన కథ ఇది. 

నది ఉగ్రరూపాన్నీ, వరద బీభత్సాన్నీ చిత్రించిన కథ 'కృష్ణ ప్రవహించింది'. తిరుపతి భంగి రాసిన ఈ కథలో బీభత్స రసంతో పాటు గ్రామ రాజకీయాలూ కనిపిస్తాయి. నిబంధనల్ని అతిక్రమించే పరిశ్రమ కథ 'గ్రీన్ టీ'. ఫార్మాస్యూటికల్ కంపెనీ నేపథ్యంగా సాగే ఈ కథని ఆనంద కుంచనూరు రాశారు. గ్రామాల శిధిలావస్థని ప్రతీకాత్మకంగా చెప్పిన కథ 'శిధిలం'. చూడ్డానికి చాలా చిన్నవిగా అనిపించే సమస్యలు అనుభవంలోకి వచ్చినప్పుడు ఎంత భరింపరానివిగా మారతాయో విశదంగా చెప్పారు అలకా కట్టెమనె. 'తుఫాన్' కథని సంకలనంలో చివరిదిగా ఉంచడం యాదృచ్చికం కాదనిపించింది, చదవడం పూర్తి చేశాక. సుశీలా డోణూర రాసిన ఈ కథ గుర్తుండిపోయే కథల్లో ఒకటి. 'కన్నడ ఫ్లేవర్' చెడని విధంగా అనువాదం సాగింది. మొత్తం 164 పేజీల ఈ సంకలనం వెల రూ. 170. పుస్తకాల షాపులతో పాటు, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు. 

శుక్రవారం, డిసెంబర్ 23, 2022

నవరస నట సార్వభౌమ ...

గుణచిత్ర నటుడు అనే తెలుగు అనువాదం కన్నా కేరక్టర్ ఆర్టిస్ట్ అనే ఇంగ్లీషు మాటే సులువుగా అర్ధమవుతుంది. అంతకన్నా కూడా 'కైకాల సత్యనారాయణ' అనే పేరు చెబితే చాలు చెప్పదల్చుకున్నది ఏ విషయాన్ని గురించో మరింత సులభంగా బోధ పడుతుంది. నటులు చాలామందే ఉండొచ్చు. కానీ తెరమీద తాను పోషించిన పాత్ర తప్ప తాను కనిపించకపోవడం అన్నది కొందరికే సాధ్యం. తెలుగు సినిమా వరకూ ఆ కొందరిలో తప్పక ఉండే పేరు కైకాల సత్యనారాయణ. 'నవరస నట సార్వభౌమ' బిరుదు ఎవరిచ్చారో తెలియదు కానీ, కైకాల విషయంలో అది అక్షర సత్యం. ప్రేక్షకలోకం 'సత్తిగాడు' అని ముద్దుగా పిలుచుకునే ఈ నటుడు ఏడొందల పైచిలుకు సినిమాల్లోనూ తానుగా ఎక్కడా తెరమీద కనిపించలేదు, ఆయా పాత్రలు మాత్రమే కనిపించాయి. 

సత్యనారాయణ విలన్ గా వెలిగిన కాలం బహు ప్రత్యేకమైనది. హీరో ఎవరైనా కావచ్చు, విలన్ మాత్రం తనే. రకరకాల మేకప్పులు, మేనరిజాలు, వాటిల్లో పునరుక్తులు తప్పించడానికి ప్రయత్నాలు.. విలన్ వేషం ఎవరు వేసినా సినిమా చివరికి గెలుపు హీరోదే అని ప్రేక్షకులకి ముందే తెలిసినా, సినిమా చూస్తున్న వాళ్ళకి విలన్ మీద కోపం పెరిగే కొద్దీ హీరోకి మైలేజీ పెరుగుతుందన్నది వెండితెర సూత్రం. అలా విలన్లందరూ తమని తాము తగ్గించుకుని హీరోని హెచ్చింపజేస్తూ ఉంటారు. రచయితలు రాసిన పాత్ర బలానికి తోడుగా, సత్యనారాయణ నిండైన విగ్రహం, స్పష్టమైన ఉచ్చారణ, భావాలని పలికించే కళ్ళు.. ఇవన్నీ ఆ హెచ్చింపుకి మరింత బాగా దోహదం చేశాయి. ఒకానొక సమయంలో తెలుగు తెరకి మోస్ట్ వాంటెడ్ విలన్ అవడంలో ఆశ్చర్యం లేదు. 

విలనీ తర్వాత చెప్పుకోవాల్సినవి కామెడీ వేషాలు. జుట్టు నుదుటిమీదకి దువ్వి డిప్ప కటింగ్ చేస్తే అది 'సత్తిగాడి హెయిర్ స్టయిల్'. ఆ గెటప్ లో సత్యనారాయణ ని చూడగానే నవ్వొచ్చేసేది. 'ఈ మనిషిలో సహజసిద్ధంగానే ఓ పాలు అమాయకత్వం ఉందేమో' అని సందేహం కలిగేంతగా ఆ పాత్రలు పండేవి. ఆ హెయిర్ స్టైల్ కి తోడు చిత్ర విచిత్రమైన కాస్ట్యూమ్సు. ఆ గెటప్ లో సత్యనారాయణని చూస్తూ సీరియస్ గా నటించాల్సి రావడం మిగిలిన నటీనటులకు ఎంత పరీక్షో కదా. ఇక, సత్యనారాయణ వేసినన్ని 'ఎస్ బాస్' వేషాలు ఇంకెవరూ వెయ్యలేదేమో. అలా విలన్ డెన్ లో 'ఎస్ బాస్' అంటూనే, కనుబొమ పైకెత్తి ప్రేక్షకులవైపు సాలోచనగా చూశాడంటే, ఆ సినిమాలో సత్యనారాయణ విలన్ని ముంచెయ్యబోతున్నట్టే. 

Google Image

తెల్లపంచె, లాల్చీ వేసుకుని తండ్రి/తాత వేషం ధరిస్తే కరుణామూర్తి అన్నట్టే. ఇలాంటి వేషాలున్న రెండు మూడు సినిమాలు తెలుగేతరులకి చూపించి, ఆ తర్వాత ఇతను క్రూరమైన విలన్ గా ఫేమస్ తెలుసా?' అంటే వాళ్ళు నమ్మకపోవచ్చు. పాత్రలోకి పరకాయ ప్రవేశం అంత సులువుగా ఎలా సాధ్యపడుతుంది అని ఆశ్చర్య పరిచిన సందర్భాలు ఎన్నో. ఒక్క సాంఘికాలు మాత్రమే కాదు, పౌరాణికాలు, జానపదాలు కూడా ఉన్నాయి తన ఖాతాలో. 'యమగోల' లోనూ 'యమలీల' లోనూ యముడి వేషమే అయినా, ఇద్దరు యముళ్ళకీ పోలిక కనిపించదు. అసలు ఆ వైవిధ్యం కోసం చేసిన నిరంతర పరిశ్రమే సత్యనారాయణని అన్నాళ్ళు సినిమా రంగంలో బిజీగా ఉంచిందేమో. 

అందరిలాగే హీరో అవుదామని సినిమా పరిశ్రమకి వచ్చినా, గిరిగీసుకుని ఉండిపోకుండా, వచ్చిన అవకాశాల్లోనే తనని తాను నిరూపించుకుని ఏ ఒక్క ముద్రా, మూసా తనమీద పడకుండా కెరీర్ ని కొనసాగించిన ఘనత సత్యనారాయణది. 'ప్రతి అవార్డుకీ ఓ లెక్కుంటుంది' అనే మాట నిజమేనేమో అనిపించడానికి సత్యనారాయణకి చెప్పుకోదగ్గ అవార్డులేమీ రాకపోవడం కూడా ఓ ఉదాహరణ. రాజకీయాల్లోనూ, సినిమా నిర్మాణంలోనూ ప్రవేశించినా, నటనే తన ఫుల్ టైం ప్రొఫెషన్ గా కెరీర్ కొనసాగించారు. వయోభారంతో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా వేషాలు తలుపు తట్టాయి. నిండైన జీవితాన్ని, నట జీవితాన్నీ చూసిన నవరస నట సార్వభౌముడు తెలుగు ప్రేక్షకులకి కొన్ని తరాల పాటు జ్ఞాపకం ఉంటాడు. సత్యనారాయణ ఆత్మకి శాంతి కలగాలి. 

మంగళవారం, డిసెంబర్ 20, 2022

ఆలీతో సరదాగా

తెలుగునాట టాక్ షో లు కోకొల్లలు. అలనాటి దూరదర్శన్ మొదలు నిన్నమొన్ననే మొదలైన యూట్యూబ్ ఛానళ్ల వరకూ ప్రముఖుల ఇంటర్యూలు జరపని వాళ్ళు అరుదు. మనకి కళ అంటే సినిమాలు, సెలబ్రిటీలు అంటే సినిమావాళ్ళే కాబట్టి ఈ ఇంటర్యూల అతిధుల్లో అధికులు సహజంగా సినిమా వాళ్ళే. తగుమాత్రం సినీ సెలబ్రిటీలందరూ ఒకటికి మించి చానళ్లకు ఇంటర్యూలు ఇచ్చిన వాళ్ళే. ఇన్నేసి ఇంటర్యూల మధ్య తనదైన ప్రత్యేకతని నిలుపుకుంటూ దాదాపు ఏడేళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగి మూడు వందల ఎపిసోడ్లతో ముగిసిన కార్యక్రమం 'ఆలీతో సరదాగా'. అనేకానేక టాక్ షోలు నడుస్తూ ఉండగా ఈ కార్యక్రమాన్ని గురించి మాత్రమే మాట్లాడుకోడం ఎందుకూ అంటే, దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి. 

ఏ కార్యక్రమం రక్తి కట్టాలన్నా ముఖ్యంగా ఉండాల్సింది 'తగినంత నిడివి'. దూరదర్శన్ తొలినాళ్లలో చేసిన ఇంటర్యూల నిడివి పావుగంట, ఇరవై నిముషాలు మించి ఉండేది కాదు. బహుశా రేడియో ఇంటర్యూలకి కొనసాగింపుగా ఈ పద్దతి పాటించి ఉంటారు. ఇంటర్యూ కోసం ఎదురు చూసినంత సేపు పట్టేది కాదు, శాంతి స్వరూపో, విజయదుర్గో "చాలామంచి విషయాలు చెప్పారండి, నమస్కారం" అనడానికి. తర్వాత్తర్వాత వాళ్ళూ నెమ్మదిగా సమయం పెంచడమే కాకుండా, రెండు మూడు ఎపిసోడ్లుగా ప్రసారం చేయడం అలవాటు చేసుకున్నారు. శాటిలైట్ చానళ్ళు జెమినీ, ఈటీవీల్లో కూడా తొలినాటి ఇంటర్యూల నిడివి అరగంట మాత్రమే ఉండేది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో పదిహేను పదహారు గంటల సుదీర్ఘ ఇంటర్యూలు కూడా కనిపిస్తున్నాయి, ఇది మరీ అతివృష్టి. 

ఏదైనా విషయం మీద మనం ఫోకస్ చేయగలిగే గరిష్ట సమయం నలభై ఐదు నిమిషాలని, అందుకే హైస్కూల్, కాలేజీల్లో ఒక్కో పీరియడ్ నిడివి నలభై ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుందనీ అంటారు. ఆ లెక్కన చూసినప్పుడు ఈ 'ఆలీతో సరదాగా' షో నిడివి ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ కి సరిగ్గా సరిపోయేంత మాత్రమే. కనీసం ఒక్క ఎపిసోడ్ కూడా నేను టీవీలో ప్రసారం అవుతుండగా చూడలేదు కాబట్టి ఎన్ని బ్రేకులు ఇచ్చేవారో తెలియదు. ఈ ఇంటర్యూలని చూసింది, విన్నది యూట్యూబ్ లోనే. గెస్టులు మరీ బోరింగ్ అనిపిస్తే ఆ ఎపిసోడ్ల జోలికే పోలేదు తప్ప, మొదలు పెట్టి మధ్యలో ఆపేసినవో, స్కిప్పులు కొడుతూ చూసినవో లేనేలేవు. ఆ విధంగా గెస్టులూ, హోస్టూ కూడా నన్ను ఎంగేజ్ చేశారు. 

నవతరం ప్రేక్షకులకి బొత్తిగా తెలియని గెస్టులని వాళ్ళకి పరిచయం చెయ్యాలి, బాగా తెలిసిన వాళ్ళని గురించి కొత్త విషయాలు చెప్పాలి. ఈ రెండూ టాక్ షో లకి ప్రధానమైన సవాళ్లు. మూడొందల మంది గెస్టుల్లో ఓ పాతిక ముప్ఫయి మంది మినహా మిగిలిన అందరితోనూ కలిసి పనిచేసిన అనుభవం ఉంది ఆలీకి. ఆ అనుభవం ఈ షో కి చక్కగా ఉపకరించి ఆయా ఎపిసోడ్లు లైవ్లీ గా రావడానికి సహకరించింది. ఉదాహరణకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనేక ఇంటర్యూలు ఇచ్చినా, ఆలీ ఇంటర్యూ ఇప్పుడు చూసినా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రశ్నలు దాదాపు అందరూ అడిగేవే. కానీ, సంభాషణలో కనిపించే ఆత్మీయత వెనుక ఉన్నది వ్యక్తిగత అనుబంధమే. చాలామంది అతిధుల విషయంలో ఈ అనుబంధం చక్కగా పనిచేసింది 

అతిధులకీ, షో చూసే ప్రేక్షకులకి కూడా హాయిగా అనిపించే మరో విషయం అలీ చూపించే హంబుల్ నెస్. పెద్దవాళ్ళ ముందు కాస్త ఒదిగి ఉండడం మాత్రమే కాదు, తనకన్నా వయస్సులోనూ హోదాలోనూ చిన్నవాళ్ళని ఇంటర్యూ చేసినప్పుడూ ఎక్కడా అతిచనువు ప్రదర్శించక పోవడం ఈ షో ని ప్రత్యేకంగా నిలిపింది. ఎటు చూసినా అతి చనువు ప్రదర్శించాలని తహతహలాడే హోస్టులే కనిపిస్తూ ఉండడం వల్ల కావొచ్చు, ఈ ప్రత్యేకత మరీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రారంభ ఎపిసోడ్లలో గెస్టులని వ్యక్తిగతమైన ప్రశ్నలు గుచ్చి గుచ్చి అడిగి ఇబ్బంది పెట్టినా, తర్వాత్తర్వాత అలాంటి ప్రశ్నల విషయంలో జాగ్రత్త పడడం కనిపించింది. అయితే, ఏదో వంకన గెస్టుల చేత ప్రయత్నపూర్వకంగా కన్నీళ్లు పెట్టించడం మాత్రం ఓ దశలో విసుగు తెప్పించింది. 

గెస్టుల గురించి సరే, ఆలీ గురించి కూడా అనేక విషయాలు తెలుసుకోడానికి ఈ షో ఉపకరించింది. అంతకు ముందు ఆలీ గురించి తెలిసింది తక్కువ. సినిమా ఫంక్షన్లకి యాంకరింగ్ చేస్తూ హీరోయిన్లని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లాంటి కాంట్రవర్సీలు అప్పటికే ఉన్నాయి. అతను పెద్దగా చదువుకోలేదనీ, సినిమా తప్ప మిగిలిన ప్రపంచం పెద్దగా తెలీదనీ తెలిసింది ఈ షో వల్లనే. ఎలాంటి బేక్ గ్రౌండూ లేకుండా సినిమాల్లోకి వచ్చి నలభయ్యేళ్ళ పాటు నిలదొక్కుకోవడం, కొనసాగుతూ ఉండడం మామూలు విషయం కాదు. మరీ ముఖ్యంగా, 'హీరో' ముద్ర పడ్డాక మళ్ళీ వెనక్కి వచ్చి మామూలు కమెడియన్ అయిపోవడమూ పెద్ద విషయమే. పాత ఎపిసోడ్లని కుదించి యూట్యూబ్ లో పెడుతున్నారు ఎందుకో. వాటిని ఉన్నఫళంగా ఉంచితే బాగుంటుంది. 

సోమవారం, డిసెంబర్ 05, 2022

పసిడిబొమ్మ

బ్లాగులతో రచనలు మొదలుపెట్టి కథారచయితలుగా మారిన వారి జాబితాలో చేరిన మరో పేరు చందు శైలజ. సరదా పోస్టులతో బ్లాగింగ్ ప్రారంభించిన ఈ గుంటూరు డాక్టర్ గారు ప్రేమకథల మీదుగా సాగి డాక్టర్ చెప్పిన కథలు చెబుతూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. లెక్క తీస్తే ఇప్పటివరకూ సుమారు యాభై కథలు రాసి ఉండొచ్చు. వాటిలోంచి పదకొండు కథలు ఎంచి 'పసిడిబొమ్మ' కథా సంకలనాన్ని వెలువరించారు. వ్యంగ్య వచనం మీద తనదైన ముద్ర వేసిన ఈ రచయిత్రి, సీరియస్ గా సాగే కథనంలో అక్కడక్కడా వ్యంగ్యాన్ని చేర్చి పఠితకి కథ తాలూకు సీరియస్ నెస్ నుంచి కొంత రిలీఫ్ ఇవ్వడాన్ని బాగా సాధన చేశారనిపించింది - ఈ కథల్ని పుస్తకరూపంలో చదవడం పూర్తి చేయగానే. 

నిజానికి బ్లాగు పాఠకులకి చందు శైలజని మాత్రమే కాదు, ఆమె కథల్నీ కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. పైగా, ఈ సంపుటిలో కథల తొలి ప్రచురణ ఆమె బ్లాగు తో సహా ఆన్లైన్ వేదికలమీదే. అయితే, పుస్తకరూపంలో వచ్చిన కథల్ని ఏకబిగిన చదివినప్పుడు (అవును, ఏకబిగినే) అనిపించిన నాలుగు విషయాలు పంచుకుందామనిపించింది. 'అమృతం' 'ఆమె నిర్ణయం' 'కళ్ళజోడు' స్త్రీవాద కథలైతే (బలమైన స్త్రీ, బలహీనమైన పురుష పాత్ర), 'దోషి', 'ఇద్దరు మనుషులు-ఒక జంట', 'వాన' కథల్లో బలమైన పురుష పాత్రలు మెరవడమే కాదు, రచయిత్రి మొగ్గు ఈ పురుష పాత్రలవైపు కనిపిస్తుంది. గత పదేళ్లలో రాయడం మొదలు పెట్టిన వాళ్లలో, ప్రత్యేకించి రచయిత్రులలో, ఈ బాలన్స్ అరుదు. 'అమృతం' కథలో శారదత్త, 'దోషి' కథలో నారాయణ, 'వాన' కథలో దేవ్ పాఠకుల్ని వెంటాడే పాత్రలు. 

ఒక పాత్ర గొప్పదనాన్ని ఎలివేట్ చేయడం కోసం మరో పాత్రని తక్కువ చేసి చూపడం, కథని కూడా ఈ మరో పాత్ర దృష్టి కోణం నుంచి చెప్పడం అన్నది ఈ పుస్తకం లోని కథల్లో కొంచం తరచుగా వాడిన టెక్నిక్. పుస్తకం పూర్తి చేసేసరికి ఈ టెక్నిక్ కొంచం ఎక్కువగా రిపీట్ అయిన భావన కలిగింది. ఇలాంటి సందర్భాల్లో కూడా రచయిత్రి వ్యంగ్యపు టోన్ కథల్ని నిలబెట్టేసింది. 'ఇద్దరు మనుషులు - ఒక జంట' ఇందుకు ఉదాహరణ. ఆసాంతమూ వ్యంగ్యంతో నడిపిన కథ 'పెళ్లి-పెటాకులు'. పెళ్లి ఎందుకు పెటాకులు అయిందో రచయిత్రి ఎక్కడా నేరుగా చెప్పకపోయినా, కథ సగానికి వచ్చేసరికే పాఠకులకి అర్ధమవుతుంది. అయితే, ఇది 'ఆమె' వైపు నుంచి చెప్పిన కథ అవడం వల్ల అతని తాలూకు లోపాలు మాత్రమే కనిపిస్తాయి. 

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కథల్లో మొదటిది 'దేవుడా, క్షమించు'. వరాలుని దేవుడు తప్పక క్షమిస్తాడు. ఎంతమాత్రం క్షమించనిది ఆమె చుట్టూ ఉన్న మనుషులు మాత్రమే. సమాజంలో సహానుభూతి (సానుభూతి కాదు, ఎంపతీ) పాళ్ళు పెరగాల్సిన అవసరాన్ని అన్యాపదేశంగా చెప్పే కథ ఇది. మామూలు ప్రేమకథగా మొదలై, ఊహించని మలుపు తిరిగి ఆర్ద్రంగా ముగుస్తుంది. నాయిక చుట్టూ తిరిగే రెండు కథలు 'పెనిమిటి', 'పసిడిబొమ్మ'. 'పెనిమిటి' కథలో నిశ్చలని పని చేతకాని పనమ్మాయిగా పరిచయం చేసి, ఆమె గురించి ఒక్కో వివరాలన్నీ చెబుతూ వెళ్లి, తాను చెప్పకుండా వదిలేసిన వివరాల్ని గురించి పాఠకులు కథ పూర్తయ్యేక కూడా ఆలోచించేలా చిత్రించారు. మామూలుగా చదివితే నోస్టాల్జియాలా అనిపించేసే 'పసిడిబొమ్మ' నిజానికి అంతకు మించిన కథ. 

మోనోలాగ్ లా అనిపించే 'సెల్వాన్ని పంపించేస్తా' కథ బాగా గుర్తుండి పోడానికి కారణం బలమైన పాత్ర చిత్రణ. సెల్వం తాలూకు శ్రీలంక తమిళ యాసని ప్రత్యేకంగా చిత్రించిన తీరు. కథకురాలిని కాస్త తక్కువ చేసినా, సెల్వానికి ఎలివేషన్ ఎక్కువైన భావన రాలేదు.  "శ్రద్ధగా వంట చేసి ప్రేమతో వడ్డించడం వంటిదే, కథ చెప్పడం కూడా. ఆహ్వానం నుండి, తాంబూల వాక్యం వరకూ, పాఠకుడి పట్ల ఆ శ్రద్ధ, గౌరవం చూపించగలగాలి" .. రచయిత్రి రాసుకున్న ముందుమాటలో ఈ వాక్యాలు, సాహిత్య సృష్టి చేసేవాళ్లంతా నిత్యం గుర్తుంచుకోవాల్సినవి. పాఠకుల పట్ల ఉన్న శ్రద్ధ, గౌరవం వల్లనే కావొచ్చు తన తొలి సంకలనంతోనే విందు భోజనాన్ని వడ్డించగలిగారు చందు శైలజ. ప్రతి కథ చివరా తొలి ప్రచురణ తేదీని ఇచ్చి ఉంటే తాంబూలంలో మరో వక్కపలుకు చేర్చినట్టయ్యేది. 

పాఠకులకి ఈ చేర్పు ఏ రకంగా ఉపకరిస్తుందో ఈ పుస్తకం నుంచే ఉదాహరణ చెప్పాలంటే, 'సెల్వాన్ని పంపించేస్తా' కథలో కథకురాలు సెల్వం పెళ్ళికి వెళ్లలేక పోడానికి కారణం కరోనా లాక్ డౌన్. ఈ విషయం కథలో ఎక్కడా ఉండదు. రచనా కాలాన్ని బట్టి అంచనాకి రాగలం. బ్లాగులో వచ్చిన వెంటనే చదివిన వాళ్ళు కాక, పుస్తకంలోనే తొలిసారి ఈ కథ చదివేవాళ్ళు కాస్త గందరగోళ పడే అవకాశం ఉంది. "ఇంకా లోనికి ప్రయాణించాలి, ఇంకా గాఢత ఉన్న రచనలు చెయ్యాలి" అన్న రచయిత్రి ఆకాంక్ష నెరవేరాలన్నదే పాఠకుడిగా నా ఆశంస. 'అనల్ప' ప్రచురించిన 130 పేజీల 'పసిడిబొమ్మ' పుస్తకం అందమైన గెటప్ తో, అచ్చుతప్పులు లేకుండా బొమ్మలాగే ఉంది. కథలన్నీ ప్రాణం ఉన్నవే. ('పసిడిబొమ్మ' వెల రూ. 150, అన్ని పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ దొరుకుతోంది). 

మంగళవారం, నవంబర్ 15, 2022

నటశేఖర ...

వెండితెర మీద కృష్ణ అంటే ఓ బాధ్యత కలిగిన అన్నయ్య. విలన్లు మినహా మిగిలిన అందరూ సులభంగా గుర్తుపట్టగలిగే మారువేషాల్లో తిరిగే గూఢచారి. రాకుమారుడు. విప్లవ వీరుడు. త్యాగశీలి. అనురాగమూర్తి. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో. వాల్ పోస్టర్లు అతికించే గోడల మీద తరచూ మారే పోస్టర్లలో హీరో కృష్ణే. ఒక్కోసారి రెండేసి సినిమాల పోస్టర్లు పక్కపక్కన కనిపించేవి. ఎంటీ వోడి పోస్టర్లకీ, నాగేసర్రావు పోస్టర్లకీ జరిగే పేడముద్దల సత్కారం నుంచి కృష్ణ పోస్టర్లు చులాగ్గా తప్పించేసుకునేవి. అంతేనా? శోభన్ బాబు సినిమా రాగానే "చివరికి ఏ హీరోయిన్ చచ్చిపోతుంది?" అనే చర్చ బాగా జరిగేది. కాసిని మినహాయింపులు ఉన్నప్పటికీ, వెండితెర మీద కృష్ణ ఏకపత్నీవ్రతుడే. 

తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్ళుగా భుజకీర్తులందుకున్న ఎంటీఆర్, ఏఎన్నార్లు పరిశ్రమని ద్విచత్రాధిపత్యంగా ఏలుతున్న రోజుల్లో సినిమాల్లో ప్రవేశించిన కృష్ణకి సినిమాల్లో నిలదొక్కుడానికి దోహదం చేసినవి కులమూ,  క్రమశిక్షణా. తనకన్నా తనతో పాటు సినిమాలకి పరిచయం అయిన వాళ్ళ నటనకే ఎక్కువ మార్కులే పడినా హీరోగా కృష్ణ మిగలగా, మిగతా వాళ్ళు తెరమరుగయ్యారు. తనో అద్భుతమైన నటుడినని కానీ, తను వేస్తేనే స్టెప్పులని కానీ ఏనాడూ అనుకోకపోగా, తన మీద తానే జోకులేసుకోగల ధీశాలి కృష్ణ. పేరు చక్రపాణిది వేసినా, బాపూ దర్శకత్వం వహించిన సినిమా 'శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్'. తర్వాత చాన్నాళ్ళకి బాపూ దర్శకత్వంలో 'కృష్ణావతారం' సినిమా ('మేలుకోరాదా కృష్ణా' పాట భలేగా ఉంటుంది). 

ఏదో షాట్ రీటేక్ చేద్దామని దర్శకుడు అనుకుంటే, "ఇన్నాళ్లలో ఏమన్నా నటన నేర్చుకున్నానని అనుకుంటున్నారేమో బాపూ గారు, అలాంటిదేమీ లేదని చెప్పండి" అని చమత్కరించినట్టుగా 'కోతికొమ్మచ్చి' కథనం. ఇదొక్కటేనా, అంతటి ఎంటీఆర్ కి వ్యతిరేకంగా సినిమాలు తీసి, బాలూతో విరోధాలొచ్చి రాజ్ సీతారామ్ ని తీసుకొచ్చి పాడించీ కూడా 'అజాత శత్రువు' అనిపించేసుకోగలగడం కేవలం కృష్ణకే చెల్లు. ముక్కీ, మూలిగీ మూడేళ్లకో సినిమా చేస్తున్న ఇప్పటి హీరోలని చూసినప్పుడు, ఏడాదికి ఏకంగా పదిహేడు సినిమాలు చేసేసిన కృష్ణ 'పని రాక్షసుడు' అనిపించక మానడు. చేసిన అన్ని సినిమాలూ హిట్లవ్వవనీ, అప్పుడప్పుడూ ఓ హిట్ అన్నా లేకపోతే నిలబడ్డం కష్టమనీ బాగా తెలిసిన వాడు మరి. 

ఇప్పుడంటే సినిమా వేషాలు కాస్త వెనకబడ్డ నటీనటులందరూ టీవీ వైపు వచ్చేస్తున్నారు కానీ, శాటిలైట్ టీవీల శకం మొదలైన తొలినాళ్లలో సినిమా వాళ్ళకి టీవీ మీద చిన్నచూపు ఉండేది. దాన్ని బద్దలు కొట్టినవాడు కృష్ణే. ఈటీవీ కోసం 'అన్నయ్య' సీరియల్లో టైటిల్ పాత్ర. విజయనిర్మల నాయిక. "ఇంతచిన్న వయసులోనే మీమీద ఇన్ని బాధ్యతలు పడ్డాయి" అని ఆమె గాద్గదికంగా చెప్పిన డైలాగు, డ్రాయింగ్ రూముల్లో నవ్వులు పూయించింది. నా మిత్రులొకరు కృష్ణకి వీరాభిమాని. దూరపు బంధుత్వం కూడా ఉంది. మహేష్ బాబు లాంచింగ్ కి ఈయన్ని పిలిచి, సినిమా షూట్ అవుతుండగా "మనవాడు పర్లేదంటారా?" అని అడిగారట. రమేష్ బాబు విషయంలో ఉన్న అసంతృప్తి నుంచి వచ్చిన ప్రశ్న అని మిత్రుడి ఉవాచ. తర్వాతి కాలంలో ఆ అసంతృప్తిని మహేష్ బాబు సమూలంగా తుడిచేశాడు. 

కృష్ణ లాగే కృష్ణ అభిమానులు కూడా సాధుస్వభావులు. మిగిలిన హీరోల మీద గరిక వాలినా వాళ్ళ అభిమానులు భరించలేరు. అలాంటిది కృష్ణ మీద లెక్కకు మిక్కిలి మిమిక్రీలు, స్పూఫులు వచ్చినా ఒక్క అభిమానీ రచ్చ చెయ్యలేదు. "అవునండీ మావాడికి డేన్స్ రాదు. వచ్చని ఎప్పుడూ చెప్పుకోలేదు కదా? తనకేం వచ్చో అదే చేశాడు, మాకు నచ్చింది" అన్నాడు కృష్ణ వీరాభిమాని ఒకాయన ఆమధ్యన. వాళ్ళబ్బాయికి మహేష్ బాబు వయసుంటుంది. "మావాడి పాటల్లో మీకు వెంటనే గుర్తొచ్చేవి ఓ రెండు చెప్పండి" అని పరీక్ష కూడా పెట్టాడు నాకు. 'ఎక్కడో చూసిన జ్ఞాపకం' 'చుక్కల తోటలో ఎక్కడున్నావు' లని ప్రస్తావించి అగ్ని లంఘనం చేశాను. కాసేపు కృష్ణ పాటల చర్చ జరిగింది. ఏ పాట ఏ సినిమా లోదో, అందులో హీరోయిన్ ఎవరో, ఆ సినిమా ఎన్ని రోజులాడిందో ఇవన్నీ ఆయనకి కరతలామలకం. 'ఇది కదా అభిమానం అంటే' అనిపించేసింది నాకు. 

సినిమాని ప్రేమించిన వాడూ, సినిమా కోసమే చివరికంటా బతికిన వాడు కృష్ణ. తెలుగు సినిమాకి ఎన్నో జిలుగులద్దాడు. తన ఖాతాలో ఎన్ని 'తొలి' లో! 'తెలుగు సినిమాకి కృష్ణ చేసిన అతిపెద్ద కంట్రిబ్యూషన్ మహేష్ బాబు' అన్న చమత్కారాలని పక్కన పెట్టి చూస్తే, సినిమాల నుంచి సంపాదించిన దానిలో ఎక్కువ మొత్తాన్ని తిరిగి సినిమాల మీద ఖర్చు చేసిన వాడు కృష్ణ. విజయ నిర్మల గారి గిన్నిస్ రికార్డే ఇందుకు సాక్ష్యం. 'సినిమా నిర్మాణం జోలికి వెళ్లకుండా ఉండుంటే కృష్ణ దగ్గర హైదరాబాద్ మొత్తాన్ని కొనగలిగేంత ఆస్థి ఉండేది' అన్నమాట చాలామంది నుంచి విన్నాను. కించిత్ అతిశయోక్తి ఉండొచ్చు కానీ, నిర్మాణంలో పోగొట్టుకున్నది తక్కువేమీ కాదు. అందుకు పెద్దగా చింతించినట్టూ లేదు. దటీజ్ కృష్ణ. ఆయన ఆత్మకి శాంతి కలగాలి. 

సోమవారం, అక్టోబర్ 31, 2022

ప్రేమకథలు

సీనియర్ రచయిత్రి సి. మృణాళిని నుంచి వచ్చిన తాజా కథల సంకలనం 'ప్రేమలేఖలు'. టీనేజీ మొదలు, డెబ్భయ్యేళ్ళు పైబడిన వయసు వరకూ ఉన్న జంటల ప్రేమకథలివి. మొత్తం పదమూడు కథలున్న ఈ సంకలనం ప్రత్యేకత ఏమిటంటే వీటిలో ఏ ఒక్క కథా సుఖాంతమూ కాదు, అలాగని విషాదాంతమూ కాదు. మొహాన్ని ప్రేమగా భ్రమించే ప్రేమికుల మొదలు, ఎన్నో ఏళ్లుగా తమని మూగగా ప్రేమిస్తున్న వారికి అవుననీ, కాదనీ చెప్పని ప్రేమికుల వరకూ రకరకాల వ్యక్తులు తారసపడతారీ కథల్లో. యాసిడ్ దాడులూ, పరువు హత్యలూ పెరుగుతున్న రోజుల్లో అసలు ప్రేమంటే ఏమిటో తెలియజెప్పడం కోసమే ఈ కథలు రాశారనిపిస్తుంది రచయిత్రి. తనమార్కు సున్నితమైన వ్యంగ్యంతోనూ, తనకెంతో ఇష్టమైన హిందీపాటల నేపథ్యంలోనూ అందంగా నడిపారు కథలన్నింటినీ. 

వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ అనూహ్యంగా వాళ్ళిద్దరి కెరీర్ కీ అడ్డంకి అయ్యింది. పరిష్కరించుకో గలిగే సమస్యే, కానైతే ఇగోలు అడ్డొచ్చాయి. ఫలితంగా, అతను తన దారి తాను చూసుకున్నాడు. కథని ఆమె వైపు నుంచి చెప్పడం వల్ల, ఏళ్ళు గడిచాక ఆనాటి నిర్ణయం పట్ల అతని స్పందనేమిటో పాఠకులకి తెలియదు. కానీ, నాయిక సురభి ఆ ప్రేమకి కట్టుబడే ఉందని మాత్రం తెలుస్తుంది మొదటి కథ 'నిరీక్షణ' లో. యూనివర్సిటీ రోజుల్లో తాను ప్రేమించిన అమ్మాయి, వేరే అతన్ని పెళ్లి చేసుకుని, విదేశంలో స్థిరపడి, పిల్లలు కాలేజీ చదువులకి వచ్చాక అతన్ని చూడ్డానికి వస్తోంది. అతనికీ పెళ్లి, పిల్లలు, సమాజంలో హోదా అన్నీ ఏర్పడి పోయాయి. ఆమె రావడం సంతోషమే, కానీ భార్య ఎలా స్పందిస్తుందో అని ఏమూలో దిగులు. మెరుపు ముగింపు ఇచ్చారు 'నిష్కామ ప్రేమ' కథకి. 

అవతలి వెళ్లి అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా, తాము వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళూ తమని ప్రేమించి తీరాలని డిమాండ్ చేసే వాళ్ళకీ, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి తెగబడే వాళ్ళకీ లోటు లేదు. అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో చెప్పే కథ 'ఇదా ప్రేమంటే?' ఈ కథలో కనిపించే రెండు జంటల్లోనూ పురుషులే బ్లాక్ మెయిలర్లు కావడం కొంచం నిరాశ పరిచింది. ఇలాంటిదే మరో స్త్రీవాద ప్రేమకథ 'అలవాటు'. ప్రేమికుడుగా మంచి మార్కులు కొట్టేసిన వాడు కాస్తా, పెళ్లయ్యేసరికి సగటు స్త్రీవాద భర్త అయిపోతాడు. ఆమె సర్దేసుకుంటుంది, ఏళ్ళ తరబడి. అలా ఎందుకు చేసిందన్నది కథ ముగింపు.సందేశాత్మకమైన ప్రేమకథ 'జీవితం ఎంతో పెద్దది'. ఇందులో నాటకీయత పాళ్ళు కొంచం ఎక్కువే. 

చాలా ప్రాక్టికల్ గా ఆలోచించే అమ్మాయి కథ 'భద్రమైన ప్రేమ'. ఇద్దరబ్బాయిలు తనని ప్రేమిస్తున్నప్పుడు, తనకి ఇద్దరి మీదా ఇష్టం ఉన్నప్పుడు, ఒకరిని ఎంచుకునే విషయంలో ఆ అమ్మాయి పడిన జాగ్రత్త ఈ కథ. సర్రియలిస్టిక్ గా అనిపించే కథనంతో సాగుతుంది 'చీకటి వెలుగులు'. ప్రేమకథే అయినా, స్త్రీవాద కోణమే అయినా, ఈ కథని ప్రత్యేకంగా నిలబెట్టేది కథనం. ప్రాక్టికల్ ముగింపునే ఇచ్చారు రచయిత్రి. డెబ్భయ్యేళ్ళ వయసులో భార్య చనిపోతే, ఆమె జీవించి ఉండగా ఎన్నడూ 'ఐలవ్యూ' చెప్పలేదని వగచే భర్త కథ 'భార్యా ఐలవ్యూ'. మృణాళిని మార్కు వ్యంగ్యం పతాక స్థాయిలో కనిపించే కథ ఇది. కమ్యూనిస్టు కుర్రాడు, భక్తురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అసహజం ఏమీ కాదు (వైస్ వెర్సా కూడా). ఆ పెళ్లి తర్వాత అతని ప్రవర్తన, ఉద్యమ స్నేహితులకి అభ్యంతరం కావడమే 'ప్రేమంటే వదులుకోవడం' కథ. నాయకుడు కాస్త ఉపన్యాస ధోరణిలో మాట్లాడతాడు, మిగిలిన కథలకి భిన్నంగా. 

యాసిడ్ ప్రేమకథ 'ఈతరం ప్రేమ'. యాసిడ్ నిర్ణయానికి తగినంత బలమైన నేపధ్యాన్ని కుదిర్చి ఉంటే మరింత బాగుండేది. ఉపన్యాసల్లేని హాయైన ముగింపు ఈ కథ గుర్తుండిపోయేలా చేస్తుంది. సాఫ్ట్ వేర్ జంట కథ 'విలువల్లేని ప్రేమ'. సగటు స్త్రీవాద కథల్లో లాగే, ఇందులోనూ విలువల్లేనిది అతనికే. చివరి రెండు కథలూ మాత్రం ఇందుకు కొంచం భిన్నంగా నాయికల్లో గ్రే షేడ్ ని చూపిస్తాయి. 'ప్రేమించలేనితనం' కథలో ఆమెక్కొంచం ఎక్కువ కన్ఫ్యూజన్, స్నేహితుడు (ప్రేమికుడు కాదు) స్వచ్ఛమైన వాడు. చివరి కథ 'ఒక వ్యామోహం' లో నాయికా నాయకులు నడివయసు వాళ్ళు. వాళ్ళ ప్రేమని గురించి ఇద్దరూ ఒకేలాంటి నిర్ణయం తీసుకోవడమే ముగింపు. 

పేపర్లు, టీవీ ఛానళ్ల వార్తలతో పాటు చుట్టూ ఉన్న జీవితాలని గమనించి ఈ కథలని రాశారనిపించింది పుస్తకం పూర్తి చేశాక. ఎక్కడా రొమాన్స్ జోలికి వెళ్ళలేదు. "మోహావేశం వేరు, ప్రేమ వేరు. మొదటిది తాత్కాలికం, రెండోది ఉన్నంతలో శాశ్వతం" అన్నారు తన ముందుమాటలో. మరో రచయిత్రి కాత్యాయనీ విద్మహే విశదంగా రాసిన ముందుమాటలో దాదాపు కథలన్నింటి ముగింపులనీ పరామర్శించారు. ఈ ముందుమాటని పుస్తకం పూర్తిచేశాక చదవడం బాగుంటుంది. ప్రతి కథకీ తల్లావఝుల శివాజీ వేసిన రేఖాచిత్రాలు అదనపు ఆకర్షణ. 'అనల్ప' ప్రచురించిన ఈ 122 పేజీల పుసకం క్వాలిటీ బాగుంది, వెల (కొంచం ఎక్కువే) రూ. 150. ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు.  

శనివారం, అక్టోబర్ 15, 2022

కాంతార

"థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనే మాటని మనవాళ్లు ఓ బూతుగా మార్చేశారు. కానీ, ఈ సినిమాని మాత్రం నిజంగానే థియేటర్లోనే చూడాలి" ..అప్పటివరకూ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూసిన నేను, ఓ మిత్రుడు చెప్పిన ఈ మాటలతో 'కాంతార'    సినిమాని థియేటర్లో చూశాను. రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమా విషయంలో చివరి అరగంటకి మిత్రుడి మాటలు అక్షర సత్యం. అలాగని, చివరి అరగంట కోసం మొదటి రెండు గంటల్నీ భరించక్కర్లేదు. నేటివిటీని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే హాయిగా సాగిపోతుంది.  ఇంతకీ 'కాంతార' అంటే మిస్టీరియస్ ఫారెస్ట్ అట.  'అనూహ్యమైన అడవి' అనుకోవచ్చా? కథా స్థలం దక్షిణ కర్ణాటకలోని తుళునాడు అటవీ ప్రాంతం. కథ అటవీ భూముల మీద హక్కులకి సంబంధించిందే. 

ఇన్నాళ్లూ తుళునాడు అనగానే గుర్తొచ్చే సినిమా వాళ్ళ పేర్లు శిల్పాశెట్టి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, సుమన్ (తల్వార్), ప్రకాష్ రాజ్. ఇక మీదట వీళ్ళతో పాటు తప్పక గుర్తొచ్చే పేరు రిషబ్ శెట్టి. ఈ 'కాంతార' సినిమాకి కథని సమకూర్చి, దర్శకత్వం వహించడమే కాదు, హీరోగానూ గుర్తుండిపోయేలా నటించాడు. కథ చిన్నదే. అది 1847 వ సంవత్సరం. తుళునాడు అటవీ ప్రాంతాన్ని పాలించే రాజుకి అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి తప్ప. దానిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లి, గిరిజనుల దేవుడి సమక్షంలో శాంతి లభించడంతో, ఆ దేవుడిని తనతో పంపమని వాళ్ళని కోరతాడు. మొదట ఒప్పుకోరు. అతడు రాజు కావడం, బతిమలాడ్డం, పైగా అడవి మీద హక్కులు వాళ్ళకి దత్తం చేయడంతో అంగీకరిస్తారు. దేవుడితో కలిసి ప్రాసాదానికి తిరిగి వస్తాడు రాజు. 

కాలచక్రం తిరగడంతో 1970 వస్తుంది. రాజు వారసుల్లో ఒకడికి అటవీ భూమి మీద కన్ను పడుతుంది. గిరిజన గూడేనికి వస్తాడు. ఆవేళ వాళ్ళ పండుగ. 'భూత కళ' కి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. గిరిజనులు 'గురువు' గా వ్యవహరించే వ్యక్తి విష్ణువుగా అలంకరించుకుని రంగం మీదకి ప్రవేశించగానే, అతనిని విష్ణువు ఆవహిస్తాడని ప్రజల నమ్మకం. ఆ సమయంలో అతడేం చెప్పినా దేవుడి మాటలుగానే స్వీకరిస్తారు వాళ్ళు. (మా ఊళ్ళో అమ్మవారి జాతరప్పుడు ఆసాదు ఒంటిమీదకి అమ్మవారొచ్చి ఊరి పెద్దలతో మాట్లాడడం, హైదరాబాద్ బోనాల పండుగ లో జరిగే 'రంగం' గుర్తొచ్చాయి). గురువు రంగం మీదకి రావడంతోనే రాజు వారసుడు భూమిని తిరిగి ఇచ్చేయమంటాడు. ఒప్పందాన్ని ఉల్లంఘించరాదంటాడు గురువు. 

Google Image

మాటామాటా పెరిగి, "నువ్వు దేవుడివి కాదు, కేవలం నటుడివి మాత్రమే" అంటాడు వారసుడు. అనూహ్యంగా మంటల్లో మాయమైపోతాడు గురువు. కోర్టు ద్వారా భూమిని స్వాధీనం చేసుకోవాలనుకున్న వారసుడు కొద్దిరోజులకే అంతే  అనూహ్యంగా రక్తం కక్కుకుని మరణిస్తాడు. జరుగుతున్నవాటిని విస్మయంగా చూస్తూ ఉంటాడు ఏడెనిమిదేళ్ల శివ. కాలం గడిచి 1990 వస్తుంది. శివ ఇప్పుడు నవ యువకుడు. దున్నపోతుల క్రీడ 'కంబళ' జరిగిందంటే మెడల్ గెలుచుకోవల్సిందే. అతను భయపడేది రెండింటికే. ఒకటి కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని ఉండే తల్లి కమల. బరువులో శివకి ఆరోవంతు ఉండే ఆమె, కొడుకు తప్పు చేశాడనిపిస్తే పదిమందిలోనూ అతగాడి చెంపలు వాయించడానికి ఏమాత్రం వెనుకాడదు. (రిషబ్ శెట్టి తెలుగు సినిమాలు చూడడనుకుంటా, తల్లి చేత దెబ్బలు తినడం హీరో ఇమేజీకి భంగం అని అనుకోలేదు మరి). 

శివని భయపెట్టే రెండో విషయం అప్పుడప్పుడూ కలలో కనిపించే భూతకళ. ఆ కల శివకి ఎంత భయం అంటే, తన పడక మీంచి లేచి వచ్చి తల్లి పక్కన ముడుచుకుని పడుకునేంత.  కొత్తగా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ గిరిజన గూడాన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా మార్చాలనుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఆఫీసర్ కి ఎదురు నిలబడతాడు శివ. రాజకీయంగా ఎదగాలనుకుంటున్న రాచ కుటుంబ వారసుడు శివకి మద్దతు ఇస్తూ ఉంటాడు. శివ పోరాటం కనిపిస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్ తోనా, కనిపించని ఇంకో శత్రువుతోనా? మొదటి పావుగంట తర్వాత 1990 కి వచ్చేసే కథ సాఫీగా, సరదాగా సాగుతూ, రెండో సగం మొదలైన కాసేపటికి మలుపు తిరిగి వేగం అందుకుని ప్రేక్షకులు రెప్పవేయకుండా చూసేలా చేస్తుంది. సినిమా పూర్తయిందని రిజిస్టర్ కావడానికి కొన్ని నిముషాలు సమయం పడుతోంది అనడానికి సీట్ల లోంచి లేవని ప్రేక్షకులే సాక్ష్యం. 

మనం ఇష్టంగా మర్చిపోయేదీ, మిగిలిన దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు అంతకు మించిన ఇష్టంతో గుర్తు పెట్టుకునేదీ ఒక్కటే -- గతం. ఒక ప్రాంతపు సంస్కృతిని, నమ్మకాలనీ, సమకాలీన సమస్యతో ముడిపెట్టి కథ రాసుకుని, తనని తాను హీరోగా కాక నటుడిగా మాత్రమే భావించుకుని (అలాగని హీరోయిజానికి లోటు లేదు) సినిమా తీసిన రిషబ్ శెట్టి మీద గౌరవం కలిగింది. ఒక్క డైలాగూ లేని రాజవంశీకుడి భార్య అమ్మక్క తో సహా ప్రతీ పాత్రకీ ఐడెంటిటీ ఉంది. హీరోయిన్ ఈ సినిమాకి అలంకారం కాదు, అదనపు బలం. నటీనటులే కాదు, సాంకేతిక విభాగాలన్నీ చక్కగా పనిచేసిన సినిమా ఇది. మనవైన హరికథ, బుర్రకథ, పగటివేషాలు, తోలుబొమ్మలాట లాంటి వాటిని చివరగా తెలుగు సినిమాలో ఎప్పుడు చూశాను అన్న ప్రశ్న వెంటాడుతోంది.. ఇంకొన్నాళ్ళు వెంటాడుతుంది, బహుశా. 

ఆదివారం, సెప్టెంబర్ 11, 2022

కృష్ణంరాజు ...

"జానకీ.. కత్తందుకో జానకీ..." కృష్ణంరాజుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా మొదట గుర్తొచ్చే డైలాగు ఇదే. ఈ డైలాగు ఎంతగా ట్యూన్ అయిపోయిందంటే, ఈ ఉదయం కృష్ణంరాజు మరణ వార్త చూడగానే మొదటగా గుర్తొచ్చింది ఈ డైలాగే. తన పరిధి మేరకు వైవిద్యభరితమైన పాత్రలు పోషించినా, ఒక్క 'రెబల్ స్టార్' ఇమేజీ చిరకాలం కొనసాగింది. కృష్ణంరాజు శరీరాకృతి, కళ్ళు, గంభీరమైన గొంతు..  ఇవన్నీ ఇందుకు దోహదం చేసి ఉంటాయి బహుశా. ఈ తరంలో చాలామందికి 'బాహుబలికి పెడ్నాంగారు' గా మాత్రమే తెలిసిన కృష్ణంరాజు, వెనుకటి తరం ప్రేక్షకులకి విలన్ గా, కేరక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, కథలో కీలక పాత్రగా ఇలా బహురూపాల్లో తెలుసు. గోదారి జిల్లాల్లో పుట్టి పెరిగిన వాళ్ళకైతే కేవలం సినిమా మనిషిగా మాత్రమే కాదు, ఆయుర్వేద వైద్యం చేసే రాజుగారుగా కూడా కృష్ణంరాజు జ్ఞాపకమే. 

చాలామంది వెండితెర కథానాయికలు డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన కాలంలోనే వెండితెరకి సహాయక పాత్రల్లో పరిచయం అయ్యారు కృష్ణంరాజు. తన మొదటి లవ్ నటన కాదు, కెమెరా. సినిమాల్లోకి రాక మునుపు ఓ ఫోటోస్టూడియో నడిపారు కూడా. సినిమాల్లోకి వచ్చాక ఫలానా పాత్రలు మాత్రమే చెయ్యాలి అనే శషభిషలేవీ పెట్టుకోకుండా వచ్చిన పాత్రని వచ్చినట్టు చేసుకుపోయారు. నటుడిగా కృష్ణంరాజుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించిన పాత్ర బాపూ-రమణల  'భక్త కన్నప్ప' అని చెప్పొచ్చు. ముళ్ళపూడి రమణకి కృష్ణంరాజుకి మధ్య ఏవో ఆర్ధిక లావాదేవీలు నడిచాయన్న సంగతి రమణ ఆత్మకథ 'కోతికొమ్మచ్చి' లో చూచాయగా చెప్పారు. పూర్తి వివరాలు తెలియదు. 'కన్నప్ప గారు' అంటూ రమణ ఆడిపోసుకున్నా, ఎందుచేతనో కృష్ణంరాజు ఎక్కడా స్పందించలేదు. 

నటుడిగా పేరొచ్చాక స్వంత నిర్మాణ సంస్థ 'గోపీకృష్ణా మూవీస్' స్థాపించి అభిరుచిగల సినిమాలు నిర్మించారు. అవేవీ హీరో ఎలివేషన్ సినిమాలు కాదు, నాయికలకి పేరు తెచ్చిన 'కృష్ణవేణి' లాంటి సినిమాలే. నటుడిగా తనకి పేరొస్తున్న తరుణంలో పారితోషికం ఎలా నిర్ణయించుకోవాలి లాంటి విషయాల్లో గోపీకృష్ణ సంస్థ, కృష్ణంరాజు అందించిన సాయం మరువలేనిదని ఆమధ్య తన ఆత్మకథలో గుర్తు చేసుకున్నారు నటుడు కోట శ్రీనివాసరావు. పిలకా గణపతి శాస్త్రి నవల 'విశాల నేత్రాలు' ని సినిమాగా మలచడం మాత్రం డ్రీం ప్రాజెక్టుగానే మిగిలిపోయింది. రంగనాయకులుగా కృష్ణంరాజు, హేమసుందరిగా జయప్రద.. అసలా కాంబినేషన్ ఊహించుకోడానికే ఎంతో బాగుంది. ఎందుకనో సినిమాగా రాలేదు. ప్రభాస్ హీరోగా తీయాలని కూడా ఓ దశలో అనుకున్నా, పని జరగలేదు. 

Google Image

హీరోలు మెచ్యూర్డ్ రోల్స్ ని అంగీకరించడం అంటే తమకి వయసైపోతోందని అంగీకరించడమే. ఈ అంగీకారం చాలా కొద్దిమందిలో కనిపిస్తుంది. వారిలో కృష్ణంరాజు ఒకరు. తన ఈడు వాళ్ళు హీరోలుగా మాత్రమే చేస్తున్న సమయంలో కేరక్టర్లకి షిఫ్ట్ అయిపోయారు. అలా అయ్యాక చేసిన సినిమాల్లో బాగా గుర్తుండిపోయేవి 'బావ-బావమరిది' 'పల్నాటి పౌరుషం'. ఈ రెండు సినిమాల్లోనూ కృష్ణంరాజుకి రకరకాల షేడ్స్ ప్రదర్శించే అవకాశం దొరికింది. రెండు సినిమాల్లోనూ కాస్త అరవ్వాసనలు కనిపించినా, 'పల్నాటి పౌరుషం' లో ఆ వాసనలు బాగా ఎక్కువ. 'రుద్రమదేవి' లో పాత్ర నిడివి తక్కువే అయినా, కృష్ణంరాజు వయసు, విగ్రహం, వృద్ధుడైన గణపతి దేవ చక్రవర్తి పాత్రకి సరిగ్గా సరిపోడంతో ఆ పాత్ర రక్తి కట్టింది. ప్రభాస్ 'బిల్లా' లోనూ చెప్పుకోదగ్గ పాత్రే. 'రాధేశ్యామ్' స్టిల్స్ లో మాత్రం కళతప్పి కనిపించారు. 

సినిమాలు, రాజకీయాలు -- ఈ రెండు రంగాల్లోనూ కృషి ఎంత ఉన్నా అంతకు మించి పనిచేయాల్సింది లక్ ఫాక్టర్ గా పిలుచుకునే అదృష్టరేఖ. ఈ రేఖ కృష్ణంరాజు కి సినిమాల్లో ఏమాత్రం సహాయపడిందో తెలియదు కానీ, రాజకీయాల్లో మాత్రం చక్కగా పనిచేసింది. ఆజీవన పర్యంతం రాజకీయాల్లోనే గడిపిన వాళ్ళు సైతం అందుకోలేని పదవుల్ని ఆయన చులాగ్గా అందేసుకోగలిగారు. అయినప్పటికీ, 'గవర్నర్ గిరీ' కోరిక బలంగా ఉందన్న వార్త అప్పుడప్పుడూ వినిపించింది. బీజేపీ నుంచి మధ్యలో 'ప్రజారాజ్యం' పార్టీలోకి వెళ్లి వెనక్కి రావడం అన్న మజిలీ లేకపోయినట్టైతే ఆ కోరికా తీరి ఉండేదేమో బహుశా. ఆ మైనస్ ని చెరుపుకోడానికి చేసిన కృషి, పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. 

ఇప్పుడు డాక్టర్లు 'లివర్ ఇస్యూ' గా చెబుతున్న సమస్యని పామర భాషలో కామెర్లు అంటారు. ఇవి రకరకాలు. వీటిలో పచ్చ కామెర్లు బాగా ప్రమాదకరం. ఆయుర్వేదంలో వైద్యం ఉంది కానీ, ప్రారంభ దశలో గుర్తించిన రోగులకు మాత్రమే వైద్యం చేస్తారు. కామెర్లు ముదిరితే మందివ్వడానికి ఏ కొద్దిమందో తప్ప ఎవరూ అంగీకరించరు. అదిగో, ఆ కొద్దిమందిలో కృష్ణంరాజు ఒకరు. కృష్ణంరాజు మొగల్తూరులో ఉన్నట్టు తెలియడం ఆలస్యం, కామెర్ల రోగుల బంధువులు దివాణం ముందు క్యూ కట్టేవారు. లేదనకుండా మందివ్వడంతో పాటు 'హస్తవాసి' మీద జనానికున్న నమ్మకం కూడా ఇందుకు కారణం. కృష్ణంరాజు ఇచ్చిన మందుతో నిలబడ్డ ప్రాణాల సంఖ్య వందలు దాటి వేలలో ఉన్నా ఆశ్చర్యం లేదు. నిండు జీవితాన్ని గడిపి నిష్క్రమించిన కృష్ణంరాజుకి శ్రద్ధాంజలి.  

శనివారం, ఆగస్టు 06, 2022

సీతారామం

అది 1964వ సంవత్సరం. అనాధ అయిన రామ్ (దుల్కర్ సల్మాన్) భారతీయ సైన్యంలో పనిచేస్తున్నాడు. సరిహద్దులో రామ్ ఆధ్వర్యంలో సైన్యం జరిపిన ఓ సాహస కృత్యం అనంతరం, ఆ బృందాన్ని ఇంటర్యూ చేయడానికి ఆకాశవాణి తరపున వెళ్లిన విజయలక్ష్మి రామ్ ని ఇంకెప్పుడూ అనాధ అనుకోవద్దని చెబుతుంది. అంతే కాదు, అదే విషయాన్ని రేడియోలో ప్రకటించి, రామ్ కి మేమున్నామంటూ ఉత్తరాలు రాయాల్సిందిగా శ్రోతల్ని ప్రోత్సహిస్తుంది. అది మొదలు రామ్ కి గుట్టలు గుట్టలుగా ఉత్తరాలు రావడం మొదలవుతాయి. అన్న, తమ్ముడు, పిన్ని, బాబాయ్, అక్క, చెల్లి.. ఇలా ఎంతోమంది కొత్త బంధువుల నుంచి వచ్చే ఉత్తరాలవి. ఒక్క ఉత్తరాలు మాత్రమే కాదు, అరిసెల్లాంటి తినుబండారాలు, కష్టసుఖాల కలబోతలూ కూడా పోస్టులో వెల్లువెత్తుతూ ఉంటాయి. 

వాళ్ళందరి ప్రేమలోనూ తడిసి ముద్దవుతున్న రామ్ కి ఆ గుట్టలో కనిపించిన ఓ ఉత్తరం మొదట ఉలికిపాటుకి గురిచేస్తుంది, అటుపైన ఫ్రమ్ అడ్రస్ ఉండని ఆ ఉత్తరాల కోసం ఎదురు చూసేలా చేస్తుంది. ప్రతి ఉత్తరం చివరా ఉండే 'ఇట్లు మీ భార్య సీతామహాలక్ష్మి' అనే సంతకం సీతతో (మృణాల్ ఠాకూర్) ప్రేమలో పడేలా చేస్తుంది. సీతామహాలక్ష్మి ఉత్తరాల ప్రకారం, రామ్ ఆమెని పెళ్లి చేసుకుని, చాలా కొద్దిసమయం మాత్రమే ఆమెతో గడుపుతూ, ఎక్కువ సమయం ఉద్యోగంలోనే గడుపుతున్నాడు. అతను చేసిన చిలిపి పనుల మొదలు, అలకలు, కోపాల మీదుగా, నెరవేర్చాల్సిన బాధ్యతల్ని గుర్తు చేయడం వరకూ ఆ ఉత్తరాలు చెప్పని కబురు ఉండదు. రాను రానూ, మిగిలిన ఉత్తరాలు తగ్గుముఖం పట్టినా, సీత నుంచి మాత్రం క్రమం తప్పకుండా ఉత్తరాలు వస్తూనే ఉంటాయి. 

ఊహల్లో మెరిసే, ఉత్తరాల్లో మాత్రమే కనిపించే సీతకి ఎప్పటికప్పుడు జవాబులు రాస్తూ ఉంటాడు రామ్. కానీ, వాటిని సీతకి పంపే వీలేది? అందుకే ఆ ఉత్తరాలన్నీ తన దగ్గరే జాగ్రత్తగా దాచుకుంటాడు. ఎలాగైనా సీతని కలవాలన్న పట్టుదల హెచ్చుతుంది రామ్ లో. సైనికుడు కదా, బుద్ధికి పదును పెడతాడు. ఆమె ఉత్తరాల ఆధారంగానే ఆమె జాడ కనిపెడతాడు. తాను రాసిన జవాబులన్నీ ఆమె ముందు కుప్పపోస్తాడు. రామ్ సీతని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. మరి సీత? ఎక్కడో కాశ్మీర్ లో ఉద్యోగం చేస్తున్న రామ్ కి భార్యనంటూ ఉత్తరాలు రాయడం వెనుక కారణం ఏమిటి? ఆకతాయి తనమా లేక నిజమైన ప్రేమేనా? ఉత్తరాలతో మొదలైన వాళ్ళ కథ ఏ తీరం చేరింది? ఈ ప్రశ్నలకి జవాబు, హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన 'సీతారామం' సినిమా. 

కాశ్మీర్ నేపధ్యంగా ప్రేమకథ అనగానే మణిరత్నం 'రోజా' గుర్తు రావడం సహజం. అసలే, హను మొదటి సినిమా 'అందాల రాక్షసి' మీద మణిరత్నం ముద్ర అపారం. 'రోజా,' 'చెలియా' మొదలు క్రిష్ 'కంచె' వరకూ చాలా సినిమాలూ, పుస్తకాలు చదివే వాళ్ళకి యండమూరి 'వెన్నెల్లో ఆడపిల్ల' మల్లాది 'నివాళి' మొదలుకొని అనేక నవలలూ, కథలూ గుర్తొస్తూనే ఉంటాయి, సినిమా చూస్తున్నంతసేపూ. అలాగని, నిడివిలో మూడు గంటలకి పావు గంట మాత్రమే తక్కువున్న ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఎక్కడా భారీ బిల్డప్పులు, ఎలివేషన్ల జోలికి పోకుండా, ఆసాంతమూ తగుమాత్రం నాటకీయతతో నడిపారు కథనాన్ని. భారీ తారాగణం, అందరికీ తగిన పాత్రలూ ఉన్నప్పటికీ, సినిమా పూర్తయ్యేసరికి గుర్తుండేది నాయికా నాయకులిద్దరే  - స్పష్టంగా చెప్పాలంటే నాయిక మాత్రమే. అలాగని ఇదేమీ హీరోయిన్-ఓరియెంటెడ్ కథ కాదు. 

టైటిల్స్ తర్వాత, లండన్ లో 1985 లో రష్మిక మందన్న విస్కీ బాటిల్ కొనడం తో మొదలయ్యే సినిమా అనేక ఫ్లాష్ బ్యాకులతో సాగి ఢిల్లీ లో ముగుస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాకులన్నీ ఎక్కడా కన్ఫ్యూజన్ కి వీలు లేకుండా, కథలో సస్పెన్స్ పోని విధంగా గుదిగుచ్చినందుకు దర్శకుడితో పాటు ఎడిటర్ (కోటగిరి వెంకటేశ్వర రావు) నీ అభినందించాల్సిందే. సీత పాత్రని ప్రవేశపెట్టడానికి ముందు ఆమె పట్ల ప్రేక్షకుల్లో కుతూహలాన్ని కలిగించడం, ఆమెకి సంబంధించిన ఒక్కో విషయాన్నీ ఒక్కో ఫ్లాష్ బ్యాక్లో చెప్పుకుంటూ వెళ్లి, రామ్ ఉత్తరం సీతకి చేరేసరికి సీతతో పాటు, ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురు చూసేలా చేయడం బాగా నచ్చిన విషయాలు.  నేపధ్య సంగీతం బాగుంది కానీ, పాటలు గుర్తుండిపోయేలా లేవు. చిత్రీకరణ కి మాత్రం వంక పెట్టలేం. బిట్ సాంగ్స్ చేసి ఉంటే సినిమా నిడివి కొంత తగ్గేదేమో. 

అనాధగా ఎస్టాబ్లిష్ అయిన హీరోకి అవసరార్ధం వెన్నెల కిషోర్ రూపంలో బాల్య స్నేహితుడిని సృష్టించడం లాంటివి సరిపెట్టేసుకోవచ్చు. ప్రధానమైన లాజిక్ ని మిస్సవ్వడాన్ని మాత్రం సరిపెట్టుకోలేం. రామ్ పాత్రకి దుల్కర్ ని, బాలాజీ పాత్రకి తరుణ్ భాస్కర్ ('పెళ్లిచూపులు' దర్శకుడు)నీ ఎంచుకోడం మొదలు, సుమంత్ పాత్రకి 'విష్ణు శర్మ' అనే పేరు పెట్టడం వరకూ అన్నీ వ్యూహాత్మకంగానే జరిగాయనిపించింది. దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత థియేటర్ లో కూర్చుని సినిమా చూడగలనా అని సందేహిస్తూ వెళ్ళాను కానీ, మూడు గంటలు తెలియకుండా గడిచిపోయాయి. కథనం 'మహానటి' ని గుర్తు చేసింది. అశ్వినీదత్ కన్నా వాళ్ళమ్మాయిలే అభిరుచి ఉన్న సినిమాలు తీస్తున్నారనిపించింది. అవసరమైన మేరకు బాగా ఖర్చు చేయడమే కాదు, ఆ ఖర్చు తెరమీద కనిపించేలా చేశారు కూడా. రొటీన్ ని భిన్నమైన సినిమాలు ఇష్టపడే వాళ్లకు నచ్చే సినిమా ఇది.  

శనివారం, జులై 30, 2022

జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర

ఆ మధ్యన చదవడం మొదలుపెట్టిన 'రాజా రవివర్మ' నవలలో జానకమ్మ అనే ఓ స్త్రీ విదేశీ పర్యటనలు చేయమని, లోకం చూసి రావడం ఎంతో అవసరమనీ రవివర్మకి సలహా ఇస్తుంది. నూట యాభై ఏళ్ళ క్రితం ఓ స్త్రీ నుంచి ఇలాంటి సలహా వినడం ఆశ్చర్యం కలిగించింది. ఇంకా ఆ నవల చదవడం పూర్తి చేయకముందే 'జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర' పుస్తకం చేతికొచ్చింది. కాళిదాసు పురుషోత్తం అనువదించిన ఈ పుస్తకానికి తెరవెనుగాక కృషి  'రాజా రవివర్మ' నవలా రచయిత పి. మోహన్ ది. నాటి మద్రాసు నగరంలో ఓ ధనిక కుటుంబానికి చెందిన పోతం జానకమ్మ రాఘవయ్య అనే తెలుగు మహిళ 1873 లో లండన్ యాత్ర చేసొచ్చి రాసుకున్న పుస్తకం ఇది. లండన్ వెళ్లిన తొలి భారతీయ మహిళ (హిందూ దేశపు మహిళ) జానకమ్మే!  

జానకమ్మ తన యత్రానుభవాలని మొదట తెలుగులో రాసి, ఆ తర్వాత తన విదేశీ స్నేహితుల సౌకర్యం కోసం ఆంగ్లంలోకి అనువదించారు. తెలుగు ప్రతి ఆనవాలు కూడా ఎక్కడా దొరక్కపోయినా, లండన్ లైబ్రరీ సౌజన్యంతో ఆంగ్ల ప్రతి 'పిక్చర్స్ అఫ్ ఇంగ్లండ్' ఆర్కీవ్స్ లో లభిస్తోంది. నేటి తెలుగు పాఠకుల సౌకర్యార్ధం ఆ ఆంగ్ల రచనని తెనిగించి ప్రచురించారు సొసైటీ ఫర్ సోషల్ చేంజ్, నెల్లూరు, వారు. జానకమ్మకి ఉన్న విశేషమైన పరిశీలనా దృష్టి వల్ల కొంతా, భాష విషయంలోనూ, పదాల ఎంపికలోనూ అనువాదకుడు తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధ మరికొంతా కలిపి నాటి పుస్తకాన్ని చదివిన అనుభూతినే ఇచ్చింది. అయితే, జానకమ్మ రాసిన తెలుగు ప్రతి లభించక పోవడం పెద్ద లోటే. ఆమె అనుభవాలని ఆమె భాషలోనే తెలుసుకోగలిగే వీలుండేది కదా అని చాలాసార్లే అనిపించింది, ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ.  

హిందూ సమాజం సముద్ర ప్రయాణాలనీ, విదేశీ యానాలనీ అంగీకరించని రోజుల్లో, పురుషులే అనేక ఒత్తిడుల మధ్యనా, శుద్ధి క్రతువులకి ముందస్తు అంగీకారం చెప్పీ అరుదుగా ప్రయాణాలు చేసిన కాలంలో, ఒక మహిళ కేవలం విహార యాత్రకి విదేశం వెళ్లడం కచ్చితంగా పెద్ద విశేషమే. అనేక అభ్యంతరాలు, ఒత్తిడులు, భయ సందేహాల నడుమనే ఆమె ప్రయాణమూ మొదలైంది. ఓడలో మరికొందరు మహిళా ప్రయాణికులున్నా వారంతా విదేశీయులు. చీర ధరించిన ఏకైక మహిళ జానకమ్మే. తొలి నౌకా ప్రయాణమే అయినా, 'సీ సిక్నెస్' లాంటి సమస్యలు ఇతర మహిళా ప్రయాణికుల్ని బాధించినంతగా జానకమ్మని బాధించలేదు. మొత్తం ప్రయాణంలో ఆమె అనారోగ్యం పాలైందీ తక్కువే. ఆమె దగ్గర డబ్బుతో పాటు, మంచి ఆరోగ్యమూ ఉంది.  

ఇప్పుడు విరివిగా ట్రావెలాగ్స్ రాస్తున్న చాలామంది రచయితల రచనల్లో కనిపించని ఓ సంపూర్ణత్వం ఈ 'జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర' కనిపిస్తోందంటే అందుకు కారణం ఆమెకి ఉన్న జిజ్ఞాస, గొప్ప పరిశీలనా దృష్టి, తనకి తెలియని విషయాలని గురించి త్వరపడి తీర్పులు చెప్పేయకుండా  ఆచితూచి నిర్ణయం తీసుకోవడమూను. ఇంగ్లండ్, ఫ్రాన్సు యాత్రల్లో వెళ్లిన ప్రతిచోటా, ప్రతిరోజూ ఆమె స్థానిక దినపత్రికలు చదివేది. తాను హై సొసైటీ మనిషే అయినా విదేశంలో అన్ని వర్గాల వాళ్ళతోనూ మాట్లాడి వాళ్ళని గురించి తెలుసుకునే ప్రయత్నం చేసేది. ఆమె ఆసక్తులు కూడా విశేషమైనవి. పూలు, పళ్ళు, వస్త్రాలు, ఆభరణాల మీద ఎంత ఇష్టమో సైన్సు, చరిత్ర, మతం, రాజకీయాలు లాంటి విషయాల మీదా అంతే ఇష్టం. నాటకాలు, సంగీత కచేరీలతో పాటు, మ్యూజియాలు, ఎగ్జిబిషన్లనూ సందర్శించింది. ఉపన్యాసాలకీ హాజరయ్యింది.  

మాంచెస్టర్ బట్టల మిల్లుల చరిత్ర మొదలు, ఫ్రాన్సు రాజకీయాల వరకూ అనేక విషయాలని ఆమె స్వయంగా తెలుసుకుంది తన యాత్రలో. అదే సమయంలో తన అనుభవాల్లాంటి వాటిని రామాయణ, భారత కథల్లో వెతుక్కుంది. నాటి భారతదేశ పాలకులైన బ్రిటిష్ రాజవంశం పట్ల ఆమెకి విశేషమైన గౌరవం ఉంది. దానికి ఎక్కడా దాచుకునే ప్రయత్నం చేయలేదు. అదే సమయంలో లండన్ నగరంలో తాను చూసిన చెడుని గురించి ఉన్నదున్నట్టుగా చెప్పడానికి వెనుకాడనూ లేదు. (ముందుమాట రాసిన కాత్యాయని, జానకమ్మ "గందరగోళంలో పడిపోయారు" అనడం ఆశ్చర్యం కలిగించింది). లండన్ నగరంలో అద్దెకి తీసుకున్న ఇల్లు మొదలు, రకరకాల ప్రయాణ సాధనాలు, రవాణా చార్జీలు, ప్రదర్శన శాలల టిక్కెట్టు రుసుము లాంటి విషయాలని శ్రద్ధగా గ్రంధస్తం చేశారు.  

చాలాచోట్ల "కొద్దిగా షాపింగ్ చేశాను" అని రాశారు తప్ప, ఆ షాపింగ్ లో కొన్నవి ఏవిటో ఎక్కడా చెప్పలేదు. వెళ్లే ప్రయాణంలో నౌకలో సాటి అనారోగ్యంతో  ప్రయాణికుడు మరణించడం, అంత్యక్రియలు, అలాగే తిరుగు ప్రయాణంలో ఓ నావికుడి మరణం, అంత్యక్రియలని గురించి వివరంగా చెప్పడం ద్వారా విదేశీ యాత్ర తనలో తెచ్చిన మార్పుని చెప్పకనే చెప్పారు జానకమ్మ. అనువాదకులు పురుషోత్తం స్వయంగా చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న పరిశోధకులు కావడంతో జానకమ్మని గురించి పుస్తకంలో లేని విషయాలు సేకరించే ప్రయత్నం చేసి, ఆ వివరాలు తన విశదమైన ముందుమాటలో ప్రస్తావించారు. పుస్తకాలని, ప్రయాణాలని ఇష్టపడే వాళ్ళు తప్పక చదివావాల్సిన పుస్తకం. ట్రావెలాగ్ రచయితలకి రిఫరెన్సు గా ఉపయోగపడుతుంది, కచ్చితంగా. (పేజీలు 118, వెల రూ. 100, పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు). 

సోమవారం, జులై 25, 2022

చుక్కల్లో తళుకులా...

మహాశయా నా మన్మథా.. మందార సందెల్లో రారా...  
సఖీ ప్రియా సాగే లయా.. నా ప్రేమ తొందర...

"నాగార్జునకి, రమ్యకృష్ణకీ ఓ డ్యూయెట్ కావాలి..." వేటూరికి రాఘవేంద్రరావు ఇంతకన్నా ఇన్ పుట్స్ ఇచ్చి ఉంటారని అనుకోను, 'ఘరానా బుల్లోడు' (1995) లో 'మబ్బుల్లో జాబిల్లి...' పాట విన్నప్పుడల్లా. సినిమా కథతో పెద్ద సంబంధం లేకుండా ఎక్కడైనా ఇమిడిపోయే ఇలాంటి పాటలు రాయడంలో సిద్ధహస్తుడు వేటూరి. కీరవాణి స్వరకల్పనలో మనో-చిత్ర పాడిన ఈ డ్యూయెట్ పూర్తిగా కె. రాఘవేంద్ర రావు, బీఏ మార్కు చిత్రీకరణ, పూలు-పళ్ళుతో సహా. "నాకు నేను చాలా అందంగా కనిపించే పాట ఇది" అని రమ్యకృష్ణ చేత కితాబు కూడా అందుకుంది. హమ్మింగు, కోరస్సు ఈ పాటకి ప్రాణం పోశాయనిపిస్తూ ఉంటుంది నాకు, వింటున్నప్పుడల్లా. 


చుక్కల్లో తళుకులా... దిక్కుల చలి వెలుగులా... 
నింగి నుంచి తొంగి చూసి నచ్చగానేనిచ్చెనేసి జర్రుమంటు జారింది... 
మబ్బుల్లో జాబిల్లి... జాజుల్లో నా మల్లి... మబ్బుల్లో జాబిల్లి... 
పొద్దుల్లో ఎరుపులా.... మబ్బుల తొలి మెరుపులా...

ఇక్కడ కాస్త ట్రివియా... పాట సాహిత్యంలో రొమాన్సు పాళ్ళు కొంచం ఎక్కువగా ఉండాలని వాళ్ళే అలా అడిగారో, లేక తనకే అలా తోచిందో కానీ వేటూరి మొదట రాసిన పల్లవిలో 'మబ్బుల్లో జాబిల్లి' బదులు 'జాకెట్లో జాబిల్లి' అని ఉంటుంది. రికార్డింగ్ పూర్తయ్యి, కేసెట్లు బయటికి వచ్చేశాయి. తర్వాత సినిమా సెన్సార్ అప్పుడు అభ్యంతరం రావడంతో అప్పటికప్పుడు 'మబ్బుల్లో జాబిల్లి' అని మార్చి పాడించారు. మ్యూజిక్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ ఛానల్ లో మొదటి వెర్షన్ ఇప్పటికీ ఉంది. 

మల్లెపూల చెల్లెలా... నవ్వు పూలజల్లులా...  
మిలమిలా సోకులే...  మీటనివ్వు నన్ను లేతగా... 
కొంగుచాటు ముంతలా... పొంగు పాలపుంతలా... 
గిలగిల గిల్లకా రేతిరైతె రెండు చెంపలా... 
నిబ్బరాల నిమ్మపండు ఒలిచి పెట్టవా... 
కొబ్బరంటి కొత్త ఈడు కొలిచి పెట్టవా... 
ఏకాదశి నా ఊర్వశి శ్రీ రమ్య శృంగార రాశి 
త్రయోదశి జాబిల్లికి ఈనాడే పున్నమి 
సిగ్గమ్మా చీ..చీ..ఛీ..

నాయికని 'మల్లెపూల చెల్లెలా' అనడం, ఏకాదశిని, త్రయోదశినీ రొమాంటిక్ డ్యూయెట్లోకి తీసుకురావడం వేటూరికి మాత్రమే చెల్లింది. నాయిక పేరుని కావాలని ఇరికించినట్టు కాకుండా ఎప్పటిలాగే సందర్భోచితం చేశారు. 

నింగి నేల ఒడ్డున... చందమామ బొడ్డున...  
తళతళ తారలే తాకిపోయె నన్ను మెత్తగా...  
రాజహంస రెక్కల... రాసలీల పక్కల... 
గుసగుసా గువ్వలా గూడు కట్టుకోవె మత్తుగా... 
పిక్కటిల్లిపోతె ఈడు పైట నిలుచునా... 
పిక్కలావు పిల్లదాని నడుము పలచన...  
మహాశయా నా మన్మథా.. మందార సందెల్లో రారా...  
సఖీ ప్రియా సాగే లయా.. నా ప్రేమ తొందర...  
చీకట్లో చిందేసి...️️️️ 

'గుసగుసా గువ్వలా..' మొదట విన్నప్పుడే భలేగా నచ్చేయడమే కాదు, ఇప్పటికీ ఆ ఇష్టం కొనసాగుతోంది. 'పిక్కటిల్లి' 'పిక్కలావు' లాంటి పల్లెటూరి నుడికారాలని అలవోకగా తెచ్చేశారు పాటలోకి. ట్యూనుకి నింపే సాహిత్యం అయితేనేమి, ఇంత సొగసుగా నింపడం మరొకరి వల్ల అవుతుందా? 

శనివారం, జులై 16, 2022

తలనేత

ఇస్తాంబుల్ అంటే ఇప్పటివరకూ తెలిసింది తెలుగు సినిమాలో ఖరీదైన విలన్ల స్థావరం మరియు నాయికానాయకులు ఒకటో రెండో యుగళగీతాలు పాడుకునే చోటు అని మాత్రమే. అయితే, ఈ టర్కీ దేశపు నగరం బట్టతలపై జుట్టు నేసే (హెయిర్ ట్రాన్స్ ప్లాంట్) పరిశ్రమ(?)కి ప్రపంచ స్థాయి రాజధాని అన్నది కొత్తగా తెలిసిన విశేషం. ప్రపంచం నలుమూలల నుంచీ ఏటా పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది (ప్రధానంగా పురుషులు) హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం ఇస్తాంబుల్ వచ్చి వెళ్తున్నారట! ఇందుకు కారణం, ఇక్కడ దొరికే ట్రీట్మెంటు ప్రపంచంలోనే అత్యుత్తమం అనుకుంటే పొరపాటు. చాలా ధనిక దేశాల కన్నా చాలా చౌక. అమెరికాలో ఇరవైవేల డాలర్ల వరకూ ఖర్చయ్యే జుట్టు నేతని ఇస్తాంబుల్లో రెండువేల డాలర్ల ఖర్చుతో పూర్తి చేసుకోవచ్చు. భలే మంచి చౌక బేరము కదా. 

తల నెరుపునీ, బట్టతలనీ ప్రకృతి సహజాలుగా అంగీకరించేసిన తరాలు తప్పుకున్నాక మొదటగా వర్ధిల్లింది రంగుల పరిశ్రమ. హెయిర్ డై ప్రకటనలు ఒకప్పుడు ఎంతగా తప్పుదోవ పట్టించేవిగా ఉండేవంటే, ఒక డై ని నేను ఔషధం అని పొరబడి, సలహా అడిగిన ఓ మిత్రుడికి సిఫార్సు చేశా. అతని అనుభవం నుంచి తెలిసింది, అది మందు కాదు రంగని. అప్పటి నుంచీ ఇలాంటి సలహాలిచ్చే పని మానుకున్నా. నాటకాలు, సినిమాల వాళ్ళకి మాత్రమే పరిమితమైన విగ్గులు కూడా జనబాహుళ్యానికి అందుబాటులోకి వచ్చేసి మార్కెట్ని దున్నేశాక ఈ హెయిర్ వీవింగ్, ట్రాన్స్ ప్లాంట్ లు రంగ ప్రవేశం చేశాయి. ఈ ట్రాన్స్ ప్లాంట్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది డాక్టర్ల చేత చేయబడుతుంది. ఒక్క సారి నాట్లు పూర్తయ్యాక, కొన్ని వారాలపాటు మొలకల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఇక ఆ కొత్త జుట్టు ఊడిపోదు. 

వైద్యరంగంలో కొత్త ఆవిష్కరణలతో సమస్య ఏమిటంటే, వచ్చిన కొత్తలో చాలా వైద్య విధానాలు ఖరీదు గానే ఉంటాయి. ఏళ్ళు గడిచిన తర్వాత తప్ప సామాన్యులకి అందుబాటులోకి రావు. బాగా ఖర్చు పెట్టగలిగే వాళ్ళు తొలివరసలో నిలబడి వినియోగించుకుంటారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి? ఒకప్పటి సంగతేమో కానీ, ఇప్పుడు ప్రపంచం ఓ కుగ్రామం అయిపోయాక అన్నింటికీ ఏదో రూపంలో ప్రత్యామ్నాయాలు దొరికేస్తున్నాయి. ఇదిగో, ఈ క్రమంలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ అనే ఖరీదైన ప్రక్రియని అందుబాటు(?) ధరలో అందించే దేశంగా టర్కీ, నగరంగా ఇస్తాంబుల్ వినుతికెక్కాయి. వేగవంతమైన జీవన శైలి వల్ల అయితేనేమి, మారిన ఆహార అలవాట్ల వల్ల అయితేనేమి బాల నెరుపులు, బట్ట తలలు విరివిగా పెరిగాయి. తలసరి ఆదాయాలు, జీవన ప్రమాణాలు కూడా పెరగడంతో వినియోగదారుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. 

Google Image

ప్రపంచంలో ఎన్నో నగరాలు, మహా నగరాలూ ఉండగా ఈ ఇస్తాంబుల్ మాత్రమే తలనేత రాజధానిగా ఎలా పరిణమించ గలిగింది? మొదటిది - అక్కడ తగినంతమంది డాక్టర్లు, ఇతర సిబ్బంది ఉండడం, రెండోది -  అక్కడి ప్రభుత్వం 'హెల్త్ టూరిజం' ని బాగా ప్రమోట్ చేయడం, మూడోదీ బాగా ముఖ్యమైనదీ - టర్కీ ఇంకా 'అభివృద్ధి చెందుతున్న' దేశం కావడం వల్ల తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ అందివ్వ గలగడం. అంతర్జాతీయ హెల్త్ టూరిజం  పర్యాటకులకి ప్రధాన సేవ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ కాగా, అనుబంధంగా దంత వైద్యం, శరీర బరువు తగ్గింపు లాంటి సేవలనీ సరసమైన ధరలకి అందిస్తున్నారు. స్టార్ హోటల్ లో బస, లోకల్ ట్రాన్స్పోర్టు, సదా అందుబాటులో ఉండే అనువాదకులు.. ఇవన్నీ కలిపి పేకేజీ నిర్ణయిస్తారు. పేకేజీ కాకుండా, టిక్కెట్టు ఖర్చులు మాత్రమే అదనం. దీనివల్ల జరగబోయే ఖర్చు గురించి ముందుస్తుగా ఓ అంచనా వచ్చేస్తుంది యాత్రీకులకి. 

చౌక వైద్యం అనగానే ముందుగా వచ్చే సందేహం సేవల్లో నాణ్యత గురించి. ఇస్తాంబుల్ వైద్యాన్ని గురించీ బోల్డన్ని ప్రచారాలున్నాయి. డాక్టర్లు కేవలం పర్యవేక్షణ చేస్తూ, నాట్లు, ఊడుపు లాంటి క్రతువులన్నీ సహాయకుల చేత చేయిస్తారనీ, చాలా సందర్భాల్లో ఈ సహాయకుల అనుభవ లేమి వల్ల యాత్రికులు (రోగులు అనకూడదేమో) ఇబ్బంది పడుతున్నారని వినిపిస్తున్నా, యాత్రికుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. నాట్లు పూర్తి చేయించుకుని స్వదేశానికి తిరిగి వచ్చాక కూడా, ఓ సహాయకుడు హమేషా వాట్సాప్ లో అందుబాటులో ఉంటూ, ఫోటోలు, వీడియోల పరిశీలన ద్వారా మొలకల పెరుగుదలని పర్యవేక్షిస్తూ ఉంటాడట. దీనికి అదనపు రుసుమేమీ లేదు, పేకేజీలో భాగమే. ఆ ప్రకారంగా టర్కీ 'హెల్త్ టూరిజం' ని ప్రమోట్ చేస్తోంది. 

అసలు 'హెల్త్ టూరిజం' అన్నమాట వినగానే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తొచ్చారు. "ఏ ఇజమూ లేదు, టూరిజం ఒక్కటే ఉంది" అన్న ఆయన పాపులర్ స్లోగన్ తో పాటు, అప్పట్లో హైదరాబాద్ ని 'హెల్త్ టూరిజం హబ్' గా డెవలప్ చేస్తానన్న హామీ కూడా.  ఒకవేళ ఆంధ్ర ఓటర్లు ఆయనకి మళ్ళీ ప్రజాసేవ చేసుకునే అవకాశం ఇస్తే అమరావతి హెల్త్ టూరిజానికి కూడా రాజధాని అవుతుందేమో చూడాలి. అసలే విజయవాడ, గుంటూరు చుట్టూ లెక్కలేనన్ని హాస్పిటళ్లు ఉన్నాయి. ఒకవేళ, ప్రస్తుత పాలకులకి ఇస్తాంబుల్ విషయం చెవిన పడితే అన్న ఆలోచన రావడమే కాదు, ఏ 'జుట్టు దీవెన' లాంటి సంక్షేమ పథకమో పురుడు పోసుకుంటుందేమో అన్న సందేహమూ కలిగేసింది. అమంగళం ప్రతిహతమగు గాక!

మంగళవారం, జులై 05, 2022

గుడిపూడి శ్రీహరి ...

"ఆకాశవాణి.. ప్రాంతీయ వార్తలు చదువుతున్నది.. గుడిపూడి శ్రీహరి.." రేడియో ట్యూనింగ్ లో కృత్యాద్యవస్థ మీద హైదరాబాద్ కేంద్రం తగిలిన రోజుల్లో గరగరమంటూ వినిపించేదీ గొంతు. గరగర రేడియోది. మిగిలిన వాళ్ళు బహు గంభీరంగా వార్తలు చదివితే, ఈ గొంతు మాత్రం మధ్యలో చిరు దగ్గులు, సవరింపులు వినిపించేది. పత్రికల్లో సినిమా రివ్యూల కింద గుడిపూడి శ్రీహరి అనే పేరు కనిపించేది. ఇద్దరూ ఒక్కరే అని తర్వాతెప్పుడో తెలిసింది. రేడియో వార్తల మీద, సినిమా రివ్యూల మీదా తనదైన ముద్ర వేసిన గుడిపూడి శ్రీహరి ఇకలేరన్న వార్త ఉదయాన్నే తెలిసింది. అప్పటి నుంచీ ఆయనకి సంబంధించిన జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి. ఇంతకీ, ఆయనతో నాకు ఎలాంటి ప్రత్యక్ష పరిచయమూ లేదు. 

సినిమా వెబ్సైట్లు మొదలయ్యాక కొత్త సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనో, విడుదలకు కొన్ని గంటల ముందో రివ్యూలు వచ్చేస్తున్నాయి కానీ, అంతకు ముందు వరకూ ఈ శుక్రవారం సినిమా విడుదలైతే వచ్చే గురువారం మార్కెట్లోకి వచ్చే సినిమా పత్రికలో రివ్యూ వచ్చేది. ఈలోగా ఉత్సాహవంతులు సినిమా చూసేయడమే కాక, మంచిచెడ్డల్ని గురించి చర్చోప చర్చలు కూడా పూర్తి చేసేసే వాళ్ళు. సినిమా టిక్కెట్లు అందరికీ అందుబాటులో ఉన్న రోజులవి. అదుగో, అలాటి చర్చల్లో "గుడిపూడి శ్రీహరి రివ్యూలో ఈ పాయింట్ ఉంటుంది చూడు" అన్న మాట కొంచం తరచుగానే వినిపిస్తూనే ఉండేది. అంత పాపులర్ ఆయన రివ్యూలు. 

ఓ ఇరవయ్యేళ్ళ క్రితం దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఓ సినిమా పత్రిక్కి  ఇచ్చిన ఇంటర్యూని సెలూన్ నిరీక్షణలో చదివినప్పుడు, ఆయన చిన్నప్పుడు వాళ్ళ మిత్రుల మధ్యనా ఇలాంటి చర్చలే జరిగేవనీ, శ్రీహరి రివ్యూల వల్ల 'సినిమా' మీద ఆయనకి పూర్తి అవగాహన కలిగిందని తెలిసి ఆశ్చర్యపోయాను. సినిమా అంటే ఆసక్తి ఉన్నవాళ్లందరికీ శ్రీహరి పేరు బాగా పరిచయమే అని అర్ధమయ్యింది. కేవలం నటీ నటుల నటన గురించి మాత్రమే రాసి ఊరుకోకుండా, సాంకేతిక విభాగాలన్నింటి పనితీరునీ పరామర్శించడం,  బాగాలేని చోట చిన్న చిన్న చురకలు వెయ్యడం శ్రీహరి రివ్యూల ప్రత్యేకత. ఆంధ్రభూమి దినపత్రిక 'వెన్నెల' అనే సినిమా సప్లిమెంట్ ని ప్రారంభించి బొత్తిగా నిర్మొహమాటమైన రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టే నాటి వరకూ ఈ చురకలే వాతల్లా అనిపించేవి. 

పరిశీలన వల్ల గమనించిన విషయం ఏమిటంటే, ఉషాకిరణ్ మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థల సినిమాలని రివ్యూ చేసే విషయంలో శ్రీహరి ఆచితూచి వ్యవహరించే వాళ్ళు. మొహమాటం బాగానే కనిపించేది. అదే చిన్న సంస్థలు, కొత్త సంస్థల సినిమాలైతే చెలరేగి పోయేవాళ్లు. ఇలా చెలరేగి పోయే క్రమంలో బాగున్న సినిమాలనీ రివ్యూలో చెండాడేసిన సందర్భాలు బోలెడు. నాకు బాగా గుర్తున్న సినిమా లయ-వేణు తొట్టెంపూడిలని నాయికా నాయకులుగా పరిచయం చేస్తూ విజయ భాస్కర్ దర్శకత్వంలో వేణు బంధువులు నిర్మించిన 'స్వయంవరం' సినిమా. రివ్యూ చదివే నాటికే సినిమా చూసేశా (శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి, ఆదివారం మధ్యాహ్నం 'టాక్ ఆఫ్ ది టౌన్' ప్రోగ్రాం లో యాంకర్ ఝాన్సీ నుంచి మంచి రివ్యూ వచ్చింది ). శ్రీహరి రివ్యూ నిరాశ పరిచింది. 

హైదరాబాద్ రోజుల్లో, బీకే గూడ లో ఉన్న శ్రీహరి ఇంటిముందు నుంచి చాలాసార్లే వెళ్ళాను. హౌసింగ్ బోర్డు వాళ్ళ ఎమ్మైజి (మిడిల్ ఇన్కమ్ గ్రూప్) ఇల్లు. గేటు లోపల ఎడమవైపు కార్ పార్కింగ్, కుడివైపు ఖాళీ స్థలం. మారుతీ కారుని షెడ్లోనుంచి తీస్తూనే, షెడ్లో పెడుతూనో, లేదా ఖాళీ స్థలంలో పడక్కుర్చీ వేసుకుని కూర్చుని పేపరు చదువుతూనో కనిపించే వాళ్ళు. "ఓసారి ఆగి, గేటు తీసుకుని వెళ్లి పలకరిస్తే..." అన్న ఆలోచన చాలాసార్లే వచ్చింది కానీ, ఆచరణలో పెట్టలేదు. అప్పట్లోనే ఆంగ్ల దినపత్రిక 'ది హిందూ' కి ఆయన రాసే సినిమా రివ్యూలు, సాంస్కృతిక కార్యక్రమాలకి సంబంధించిన ఇంటర్యూలు వగయిరా చదవడం తటస్థించింది. చాలా సినిమాలకి తెలుగులో రాసిన రివ్యూలనే ఇంగ్లిష్ లో అనువదించి ఇచ్చేవారు కానీ, కొన్ని సార్లు మాత్రం వేర్వేరుగా రాసేవాళ్ళు. అలాంటప్పుడు తెలుగులో కనిపించని విమర్శ ఇంగ్లిష్ రివ్యూల్లో (వైస్-వెర్సా గా కూడా) కనిపిస్తూ ఉండేది. 

శాస్త్రీయ సంగీత, నృత్య రంగ ప్రముఖులందరినో శ్రీహరి చేసిన ఇంటర్యూలు 'ది హిందూ' లో చదవగలిగాను. ఆ రంగాల మీద ఆయనకున్న పట్టు అర్ధమయ్యింది. తెలుగులో రాసిన వీక్లీ కాలమ్ 'హరివిల్లు' కొన్నిసార్లు ఆపకుండా చదివిస్తే, మరికొన్ని సార్లు మొదటిపేరా తర్వాత దృష్టి మరల్చేసేది. సినిమా నిర్మాణం లో లాగానే రివ్యూ రచనలోనూ ఒక్కసారిగా మార్పులు వచ్చి పడిపోవడం, నాణ్యత కన్నా వేగం ప్రధానం అయిపోవడంతో శ్రీహరి రివ్యూలు పత్రికల నుంచి మెల్లగా కనుమరుగయ్యాయి. యూట్యూబు చానళ్లకు ఇంటర్యూలు ఇచ్చారు కానీ వాటిలో నేను చూసినవి తక్కువ.  కొత్తతరం రివ్యూయర్లు వెల్లువలా వచ్చారు, వాళ్ళలో శ్రీహరిలా సుదీర్ఘ కాలం అదే పని చేసే వాళ్ళూ, అంత పేరు తెచ్చుకోగలిగే వారూ ఎందరున్నారన్నది కోటి రూపాయల ప్రశ్న. తెలుగు సినిమా రివ్యూ మీద తనదైన ముద్ర వేసిన గుడిపూడి శ్రీహరికి నివాళి. 

బుధవారం, జూన్ 29, 2022

సినిమా చూద్దాం ...

తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడో చిత్రమైన పరిస్థితి ఉంది. ఇది గతంలో ఎప్పుడూ లేనిది, నిర్మాతలు ఊహించనిదీను. సినిమా హాళ్ళకి ప్రేక్షకులు రావడం లేదు. ఒకప్పుడు ప్రత్యేక పరిస్థితులు, కారణాలు చెప్పి టిక్కెట్టు రేటుకి రెట్టింపు వసూలు చేసినా అమితమైన ఉత్సాహంతో టిక్కెట్లు కొనుక్కుని భారీ సినిమాలని అతిభారీగా విజయవంతం చేసిన ప్రేక్షకులు, ఇప్పుడు 'టిక్కెట్టు రేటు తగ్గించాం, సకుటుంబంగా థియేటర్ కి వచ్చి మా సినిమా చూడండి' అని సినిమా వాళ్ళు సగౌరవంగా పిలుస్తున్నా, ఆవైపు వెళ్ళడానికి తటపటాయిస్తున్నారు. ఫలితంగా, భారీ సినిమాలు కోలుకోలేని విధంగానూ, మధ్యరకం సినిమాలు తగుమాత్రంగానూ నష్టపోతున్నాయి. 'చిన్న సినిమాలు' అనేవి దాదాపుగా కనుమరుగైపోయాయి కదా. 

నిజానికి 'సినిమా నష్టాలు' అనేది కొత్త విషయమేమీ కాదు, ఉండుండీ అప్పుడప్పుడూ చర్చకి వస్తూనే ఉంటుంది. తేడా ఏంటంటే, నష్టాలకి కారణాలు మారుతూ ఉంటాయి. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా నష్టాలకి కారణం ప్రేక్షకులే. జాతి గౌరవాన్నో, అభిమాన హీరో పరువునో నిలబెట్టడం కన్నా కష్టర్జితాన్ని ఇతరత్రా ఖర్చులకి వెచ్చిస్తున్నారు వాళ్ళు. ఫలితంగా, అటు పెద్ద పెట్టుబడులతో సినిమా తీసి, పెద్దల సాయంతో టిక్కెట్టు రేట్లు పెంచుకున్న సినిమాలకీ, ఇటు సంసారపక్షంగా తగుమాత్రం బడ్జెట్టుతో సినిమా పూర్తి చేసి టిక్కెట్టు రేటు తగ్గించిన సినిమాలకీ కూడా థియేటర్ల దగ్గర ఫలితం ఒకలాగే ఉంటోంది. హాలుకొచ్చి టిక్కెట్టు కొని సినిమా చూసే ప్రేక్షకులనే నమ్ముకుని సినీ కళామతల్లి సేవకి జీవితాలని అంకితం చేసిన నటీనటులకీ, దర్శక నిర్మాతలకీ ఇది బొత్తిగా మింగుడు పడని పరిణామం. 

కరోనా కారణంగా జనమంతా రెండేళ్ల పాటు ఇళ్లకే పరిమితమైపోయారు. నట్టింట వినోదానికి అలవాటు పడిపోయారు. ఓటీటీల పుణ్యమా అని ఇతర భాషల సినిమాలని నేరుగానూ, డబ్బింగు వెర్షన్ల ద్వారానూ చూసేశారు. ఫలితం ఏమిటంటే, తెలుగు సినిమాలని ఆయా భాషల సినిమాలతో పోల్చుకోవడం మొదలు పెట్టారు. రాజుని చూడ్డానికి అలవాటు పడిపోయిన కళ్ళు మరి. నాటకాలు తదితర కళలన్నీ విజయవంతంగా అవసాన దశకి చేరుకొని, సినిమా మాత్రమే ఏకైక వినోదంగా మిగిలింది కాబట్టి నాణ్యతతో సంబంధం లేకుండా హాల్లో సినిమాలు చూసి తీరాలి నిజానికి. చిక్కు ఎక్కడొచ్చిందంటే, కరోనా అనంతర పరిస్థితుల్లో ఖర్చు వెచ్చాల్లో తేడాలొచ్చేసి నెల జీతాల వాళ్ళు బడ్జెట్లు, ఖర్చు చేసే ప్రాధాన్యతా క్రమాలు ఉన్నట్టుండి మారిపోయాయి. 

Google Image

కరోనా పేరు చెప్పి చాలామందికి జీతాలు పెరగలేదు. ఉద్యోగం నిలబడింది, అందుకు సంతోషించాలి అనుకునే పరిస్థితి. మరోపక్క ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఉక్రెయిన్ యుద్ధం అనే వంక కూడా దొరికింది, ధరల పెరుగుదలకి. తారుమారైన ఇంటి బడ్జెట్లలో, సినిమా ఖర్చు అనివార్యంగా 'తగ్గించుకో గలిగే ఖర్చుల' జాబితాలోకి చేరిపోయింది. మనవాళ్ళు అన్నం తినకుండా అయినా ఉండగలరు కానీ, సినిమా చూడకుండా ఉండలేరని సినిమా వాళ్ళకో ఘాట్టి నమ్మకం. దాన్నేమీ వమ్ము చేయడం లేదు. వచ్చిన సినిమాని వచ్చినట్టు చూస్తున్నారు, కాకపోతే థియేటర్లో కాదు, ఓటీటీలో. హాల్లో రిలీజైన రెండు మూడు వారాల్లోపే ఇంట్లో టీవీలో చూసే సౌకర్యం ఉన్నప్పుడు, వస్తున్న సినిమాలు కూడా ఆమాత్రం రెండు మూడు వారాలు ఆగగలిగేవే అయినప్పుడు అన్నం మానేయాల్సిన అవసరం ఏముంది? 

పైగా ఒక్క టిక్కెట్టు రేటు మాత్రమే కాకుండా, పార్కింగ్ మొదలు పాప్ కార్న్ వరకూ చెల్లించాల్సిన భారీ మొత్తాలు కూడా ఆదా అయి ఖర్చులో బాగా వెసులుబాటు కనిపిస్తోంది. మొత్తం సినిమానో, కొన్ని భాగాలో బాగా నచ్చితే మళ్ళీ చూసే వెసులుబాటుతో పాటు, నచ్చకపోతే వెంటనే టీవీ కట్టేసే సౌకర్యాన్ని కూడా ఓటీటీ ఇస్తోన్నప్పుడు కష్టపడి సినిమాహాలు వరకూ వెళ్ళాలా? అన్నది బడ్జెట్ జీవుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఇలా ఉన్నట్టుండి ప్రేక్షకులు వాళ్ళ  స్వార్ధం వాళ్ళు చూసుకోడంతో సినిమావాళ్ళు కాస్ట్ కటింగ్ ఆలోచనలో పడ్డారు. కళామతల్లికి ఖరీదైన సేవ చేసే పెద్ద నటీనటుల జోలికి వెళ్లడం లేదు కానీ, రోజువారీ కూలీకి పని చేసే కార్మికులు, చిన్నా చితకా ఆర్టిస్టుల ఖర్చుల వైపు నుంచి నరుక్కొద్దామని చూస్తున్నారు. 

రోజువారీ వేతనాలు సవరించమంటూ మొన్నామధ్యన సినిమా కార్మికులు మొదలు పెట్టిన సమ్మె ఒక్కరోజులోనే ఆగిపోయింది. అవసరమైతే పొరుగు రాష్ట్రాల నుంచి కార్మికుల్ని తీసుకొచ్చి సినిమాలు నిర్మిస్తాం తప్ప, మీ డిమాండ్లు పరిష్కరించం అని తెగేసి చెప్పేశారు నిర్మాతలు. సమస్య పరిష్కారానికి ఓ కమిటీ వేశారు కానీ, ఫలానా తేదీ లోగా పరిష్కరించాలనే నిబంధనలేవీ లేవు. చట్టంలాగే ఆ కమిటీ కూడా తన పని తాను చేసుకుపోతుంది కాబోలు. ఈ ప్రకారంగా అగ్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల కళాసేవకి ఆటంకం కలగకుండా ఉండేందుకు నిర్మాతలు పాపం తమవంతు కృషి చేస్తున్నారు. ఇతరత్రా ఉపాయాలు కోసం వేరే రాష్ట్రాల వైపు చూసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే, అన్నిరకాలుగానూ తెలుగు సినిమా ప్రత్యేకమైనది. ఇప్పటి పరిస్థితీ ప్రత్యేకమైనదే. అద్భుతాలు జరిగిపోతాయన్న ఆశ లేదు కానీ, రాబోయే రోజుల్లో కళాసేవ ఏవిధంగా జరుగుతుందో చూడాలన్న కుతూహలం మాత్రం పెరుగుతోంది . 

సోమవారం, జూన్ 27, 2022

ఒక ఎంపిక

"సంతాలీ వారి వృత్తి వేట, ఆయుధం బాణం. అందుకే వారి గౌరవార్ధం చిత్తరంజన్ లోకో వర్క్స్ లోగోలో బాణం గుర్తుని కూడా చేర్చారు. చాలామంది సంతాలీలకి ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళ ఇంటిపేర్లు భిన్నంగా ఉంటాయి. టుడ్డు, ముర్ము, ఎక్కా.. అలా ఉంటాయి. చిత్తరంజన్ లో విశ్వకర్మ పూజకి చాలా ప్రాధాన్యత ఉంది. సెప్టెంబర్ నెలలో వచ్చే ఆ పూజని చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సెక్షన్ లోనూ విశ్వకర్మ విగ్రహం పెట్టి పూజ చేస్తారు. వర్క్ షాప్ కి ఆవేళ బయట వాళ్ళని కూడా అనుమతిస్తారు. వేలమంది వస్తారు. మాలాంటి వాళ్ళు ఒంటరిగా వెళ్లినా సంతాలీలు మాత్రం పసిపిల్ల బాలాదీ వస్తారు. ఆడవారి కట్టు వేరుగా ఉంటుంది. జాకెట్టు వేసుకోరు. ఉన్నంతలో మంచి చీరె కట్టుకుని, తల నున్నగా దువ్వుకుని, పువ్వులు పెట్టుకుని, వెండి నగలు వేసుకుని వచ్చారు.

ఒక ఏడు చూస్తే చాలదా, ప్రతి ఏడూ ఎందుకు కాళ్ళీడ్చుకుంటూ రావడం అని సందేహం కలిగింది. 'ఈ పూజ కోసం ఏడాదంతా ఎదురు చూస్తారు. తప్పకుండా వస్తారు' అని చెప్పారు మా శ్రీవారు. వచ్చిన వాళ్ళు ఊరికే చూసి పోటం లేదు, వాళ్ళ వాళ్ళు పని చేసే దగ్గర ఆగి, అక్కడ పెట్టిన విశ్వకర్మ విగ్రహానికి, అమిత భక్తితో ఒకటికి పదిసార్లు దండాలు పెట్టడం చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. ఏడాది పొడుగునా తమ మనిషి అక్కడే పనిచేస్తాడు, అతనికి ఎటువంటి ప్రమాదమూ జరగ కూడదని ప్రార్ధిస్తారుట. మరి వాళ్ళ ప్రార్ధనల ఫలితమేనేమో, అంత పెద్ద కర్మాగారంలో ఏనాడూ ప్రమాదం జరగదు. సంతాలీలను చూశాక, రోజూ పొద్దున్న దీపం పెట్టి, ఫ్యాక్టరీ చల్లగా ఉండాలని దణ్ణం పెట్టుకోటం అలవాటు అయింది.." సీనియర్ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి రాసిన 'జ్ఞాపకాల జావళి' లో 'కర్మాగారం' అనే అధ్యాయంలో కొంత భాగం ఇది. 

ఒక్క చిత్తరంజన్ మాత్రమే కాదు, భారతదేశంలో నిర్మాణం జరిగిన అనేక భారీ ప్రాజెక్టుల వెనుక ఈ సంతాలీల శ్రమ ఉంది. వారు చిందించిన చెమట ఉంది. దేశానికి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్ల తర్వాత, మొట్టమొదటిసారిగా ఈ 'సంతాలీ' తెగకి చెందిన మహిళని అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించింది కేంద్రంలోని అధికార పార్టీ. ఆమె ఎన్నిక లాంఛనమా, కష్టసాధ్యమా అనే చర్చని పక్కన పెడితే అత్యున్నత పదవికి నామినేషన్ వరకూ ప్రయాణం చేయడానికి అత్యంత వెనుకబడ్డ సంతాలీ గిరిజనులకు డెబ్బై ఐదేళ్లు పట్టింది! ఒడిశాకి చెందిన ద్రౌపది ముర్ము నామినేషన్ ఘట్టాన్ని టీవీలో చూస్తుంటే వచ్చిన చాలా ఆలోచనల మధ్యలో పొత్తూరి విజయలక్ష్మి గారి రచనా గుర్తొచ్చింది. తెలుగు సాహిత్యంలో సంతాలీల ప్రస్తావన ఇంకెక్కడా వచ్చినట్టు లేదు. 

అదే టీవీలో కొన్ని ఛానళ్లలో 'మన వాడికి' రాష్ట్రపతి అవకాశం ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం కనిపించింది. దేశం ముక్కలవుతుందన్న బెదిరింపూ వినిపించింది. 'ముక్కలవ్వడం మరీ అంత సులభమా?' అనిపించేసింది చూస్తుంటే. మనవాళ్ళకి ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చాయి, ఒక్క అవకాశమూ రాని వర్గాలు ఇంకా చాలానే మిగిలి ఉన్నాయన్న స్పృహ వారికి ఎందుకు కలగలేదన్న ఆశ్చర్యం వెంటాడింది. 'రాష్ట్రపతి-రబ్బరు స్టాంపు' తరహా చర్చలూ జరిగాయి. ఇప్పటివరకూ పనిచేసిన పద్నాలుగు మందిలోనూ పదవిని అలంకరించుకున్న వాళ్లతో పాటు, పదవికి అలంకారంగా మారిన వాళ్ళూ ఉన్నారు. లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు గాక, మన వ్యవస్థ బలమైనది. ప్రతి పదవికీ ప్రయోజనం ఉంటుంది. సమయం, సందర్భం కలిసిరావాలి. ఆ సమయంలో, ఆ పదవిలో ఉన్న వ్యక్తి బలమైన నిర్ణయాలు తీసుకోగలిగే వారై ఉండాలి. 

ఇదే 'జ్ఞాపకాల జావళి' లో 'అర్చన' అధ్యాయంలో కొంత భాగం: "అర్చనా వాళ్ళు సంతాలీల్లో ఒక తెగకు చెందిన వాళ్ళు. వాళ్ళ బంధువులు కాస్త దూరంలో బాఘా అనే చిన్న జనావాసంలో ఉంటారు. అక్కడ ఒక అమ్మాయికి ఏడాది కిందట పెళ్లి అయింది. భర్త తిన్ననైన వాడు కాదు. తాగటం, పెళ్ళాన్ని కొట్టటం. రెండు నెలలకే పుట్టింటికి వచ్చేసింది. వాళ్లొచ్చి నచ్చచెప్పి తీసుకెళ్లారు. అలా నాలుగైదు సార్లు జరిగింది. వీళ్ళు విసిగిపోయి దండువా పెట్టారు. దండువా అంటే పిల్లవైపు బంధువులు పిల్లాడింటికి వెళ్తారు. మగవాళ్ళు ఖాళీ చేతులతో వెళ్తారు. ఆడవాళ్ళూ వెళ్తూ చీపురు, అప్పడాల కర్ర, విసిన కర్ర వంటి ఆయుధాలు తీసుకెళ్తారు. పిల్లాడిని కూచోబెట్టి చుట్టూ తిరుగుతూ తలోటీ తగిలిస్తారు. మళ్ళీ అందులోనూ పద్ధతులున్నాయి. పిల్ల తల్లి, వదిన మాత్రం కొట్టరు, తిట్టి ఊరుకుంటారుట. 

'దండువా అయ్యాక ఛాటా చేశారు' అంది అర్చన. ఛాటా అంటే తెగతెంపులు. 'ఇక మీకూ మాకూ రామ్ రామ్' అని అందరిముందూ ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళిచ్చిన బంగారం, వెండి వాళ్ళకి ఇచ్చేశారు. వీళ్ళు ఇచ్చినవి చెవులు మెలేసి తీసుకున్నారు. వాళ్ళు కారం బూందీ, తీపి బూందీ పెట్టి చాయ్ ఇచ్చారుట. 'తన్నడానికి పోతే విందు కూడానా?' అంటే, 'అవును మరి, మేము ఊరికే పోయామా? మా పిల్లని బాగా చూసుకుంటే వాళ్ళ గడప తొక్కే పనేముంది మాకు? తప్పు వాళ్లదే కాబట్టి మర్యాద చెయ్యాలి. అదే మా పధ్ధతి. పిల్లని పుట్టింటి వాళ్ళు తీసుకు వచ్చేశారు. దానిష్టం అయితే మారు మనువుకి వెళ్తుంది. లేదా ఏదో కాయకష్టం చేసుకుంటూ ఉంటుంది' అని వివరంగా చెప్పి 'పనుంది' అని వెళ్ళిపోయింది. చెయ్యెత్తి దణ్ణంపెట్ట బుద్ధి వేసింది నాకు. ఏం చదివారు వీళ్ళు? ఎంత తెలివి? ఎంత బాధ్యత? ఎంత ఐకమత్యం? అన్నింటినీ మించి ఎంత ధైర్యం? మనమూ ఉన్నాం ఎందుకూ? చుట్టుపక్కల ఏం అన్యాయం జరిగినా బాపూ గారి కార్టూన్ లో చెప్పినట్టు చూసీ చూడనట్లు ఊరుకుంటాం." 

బుధవారం, జూన్ 22, 2022

యుద్ధ బీభత్సం

యుద్ధం కొనసాగుతోంది. బలమైన రష్యా, చిన్న దేశమైన ఉక్రెయిన్ మీద విజయం సాధించడం పెద్ద విషయమేమీ కాదనుకున్న వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు. రెండు దేశాల బలాబలాలు, వాటి వెనుక ఉన్న శక్తులు, యుద్ధభూమిలో జరగబోయే పరిణామాలు.. వీటన్నింటినీ కాసేపు పక్కన పెట్టి, యుద్ధ బీభత్సాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన సమయమిది. మృతులు, క్షతగాత్రులు, కాలిన, కూలిన భవనాలు, ధ్వంసమైన ఆస్తులు.. ఇవన్నీ కనిపించే బీభత్సాలు. చాపకింద నీరులా ప్రపంచాన్ని, మరీ ముఖ్యంగా బీదవైన మూడో ప్రపంచ దేశాలని, చుట్టుముడుతోన్న బీభత్సం ఆకలి. కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో ఆకలి కేకలు మొదలయ్యాయి. మరికొన్ని దేశాలకీ ఇవి విస్తరించబోతున్నాయి. అంత తీవ్రంగా కాకపోయినా మిగిలిన అన్ని దేశాల్లోనూ ఎంతో కొంత ప్రకంపనలు వినిపించని తప్పని పరిస్థితే కనిపిస్తోంది. 

నెలల తరబడీ జరుగుతున్న యుద్ధం కారణంగా, సరిహద్దుల మూసివేత ఫలితంగా, అటు రష్యా నుంచీ, ఇటు ఉక్రెయిన్ నుంచీ మిగిలిన దేశాలకి ఆహారధాన్యాల సరఫరా ఆగిపోయింది. సోమాలియా, సూడాన్, లిబియా లాంటి చిన్న దేశాలు గోధుమలు, వంట నూనెల కోసం ఈ రెండు దేశాల మీదే ఆధార పడ్డాయి. అంతే కాదు, వ్యవసాయం చేయడానికి అవసరమయ్యే రసాయన ఎరువుల తయారీకి రష్యా ప్రధాన కేంద్రం. ఎరువుల సరఫరా కూడా ఆగిపోయింది. కరువు మొదలయ్యింది. గడ్డి మొలవని పరిస్థితుల్లో పాడి పశువులు మరణిస్తున్నాయి. పాలకీ కొరత మొదలయ్యింది. ఉన్న ఆహార నిల్వలు అడుగంటున్నాయి. కొత్త సరఫరాలకి దారులు తెరుచుకోలేదు. దూర దేశాల నుంచి తెప్పించుకోవడం ఖరీదైన వ్యవహారం మాత్రమే కాదు, చాలా సమయం పట్టే ప్రక్రియ కూడా. 

ఇది ఆఫ్రికా దేశాలకి మాత్రమే పరిమితమైన సమస్య కాదు, ఆహారధాన్యాల దిగుమతుల మీదే పూర్తిగా ఆధార పడ్డ ఈజిప్టుది కూడా. కానైతే, ఆఫ్రికన్ దేశాల పేదరికం వాటిని త్వరగా కరువులోకి నెట్టేసింది. యుద్ధకాలంలోనే ప్రకృతి కూడా పగబట్టింది. ధరలు రెట్టింపయ్యాయి, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. ఫలితంగా, ఆకలి కేకలు మొదలయ్యాయి. నిజానికి ధరల పెరుగుదల యుద్ధానికన్నా ముందే మొదలయ్యింది. కరోనా కారణంగా ధరల పెరుగుదల ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదు. అయితే, అటు ఈజిప్టు, ఇటు ఆఫ్రికన్ దేశాల్లో మాత్రం యుద్ధం కారణంగా పరిస్థితి పుండుమీద కారం జల్లినట్టైంది. ఇప్పుడు ప్రపంచమంతా 'గ్లోబల్ విలేజ్' కాబట్టి ఈ సమస్య మిగిలిన దేశాలకి విస్తరించడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. 

సముద్ర మార్గాలు మూసుకుపోవడం, భూమార్గాల ద్వారా సరుకు రవాణా ఖరీదైన వ్యవహారం కావడం, అన్నింటినీ మించి ఆహారధాన్యాలు యుద్ధంలో ఉన్న రెండు దేశాల సరిహద్దులు దాటి బయటికి వచ్చే మార్గాలు రోజురోజుకీ మూసుకుపోవడంతో కొద్ది నెలల్లోనే ఆహార ధాన్యాల కొరత తీవ్రమయ్యింది.  ఆహార ధాన్యాలు పండించే మిగిలిన దేశాలేవీ ఎగుమతి చేయగలిగే పరిస్థితుల్లో లేవు. స్థానిక అవసరాల మొదలు, రాజకీయ సమస్యల వరకూ కారణాలు అనేకం. ఉదాహరణగా భారత దేశాన్నే తీసుకుంటే, గోధుమలు ఎగుమతి చేస్తామని ప్రకటించి వెనువెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కారణం, దిగుబడి తగ్గడం, పండిన పంట స్థానిక అవసరాలకి ఎంతవరకూ సరిపోతుందన్న సందేహం రావడం. మార్చి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఈ ఏడు గోధుమ దిగుబడి దారుణంగా పడిపోయింది. 

కరువు అనేది ఓ భయంకరమైన విషయం. గోదావరి ఆనకట్ట కట్టక మునుపు సంభవించిన 'డొక్కల కరువు' గురించి చిన్నప్పుడు కథలు కథలుగా విన్నాం. క్షుద్భాధకి తాళలేక మట్టిలో నీళ్లు కలుపుకు తిన్నవాళ్ళు, ఎవరైనా చనిపోగానే వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి తిండికోసమూ మిగిలిన వాళ్ళు ప్రాణాలకి తెగించి కొట్టుకోడం లాంటివి విన్నప్పుడు ఒళ్ళు జలదరించేది. అవన్నీ సాంకేతికత అభివృద్ధి చెందని నాటి పరిస్థితులు. గడిచిన ముప్ఫయ్యేళ్లలో సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరిగింది. ఎన్నెన్నో సమస్యల్ని కంప్యూటర్లు చిటికెలో పరిష్కరించేస్తున్నాయి. వాతావరణం ఎలా ఉండబోతోందో ముందుగా తెలుస్తోంది. వరదలు, తుపానుల గురించి ముందస్తు అంచనా ఎన్నో ప్రాణాలనీ, పంటల్నీ కాపాడుతోంది. ఇప్పుడు చుట్టుముడుతున్న కరువుని ఎదిరించాలంటే యుద్ధం ఆగాలి. ఆపని చేయగలిగేది టెక్నాలజీ కాదు, దాన్ని వాడే మనుషులే.

సోమవారం, జూన్ 20, 2022

'క్లాసిక్స్' తో పేచీ ...

విజయ-వాహినీ వారి 'గుండమ్మ కథ' సినిమాకి అరవై ఏళ్ళు నిండాయని గత వారమంతా హడావిడి జరిగింది. పత్రికల్లో ప్రత్యేక కథనాలు, టీవీల్లో ప్రత్యేక కార్యక్రమాలు, యూట్యూబ్ ఛానళ్లలో వాళ్ళకి తోచిన విశేషాలు.. ఇలా ఒక్కసారిగా ఆ సినిమా వార్తల్లోకి మళ్ళీ వచ్చింది. భారీ తారాగణం, వీనుల విందైన సంగీతం, గుర్తుండిపోయే పాటలు,  ఆరోగ్యకరమైన హాస్యం.. ఇలా విడివిడిగా చూసినప్పుడు ఒక్కొక్కటీ బాగుంటాయి కానీ మొత్తం సినిమాగా నేను 'క్లాసిక్స్' జాబితాలో వేసుకోలేను. నా పేచీ అంతా కథలోని ఓ  ముఖ్య భాగంతోనే. ఏళ్ళ తరబడి మిత్రులతో చర్చించి, చాలాసార్లు ఏకాభిప్రాయం కుదరక వదిలేసిన విషయమే కానీ, ఈ 'వజ్రోత్సవ' సందర్భంలో మళ్ళీ గుర్తొచ్చింది.  

చనిపోయిన తన స్నేహితుడి కుటుంబాన్ని బాగుచేయాలన్న ఎస్వీ రంగారావు తాపత్రయమే ఈ సినిమా కథ. ఆ స్నేహితుడికి భార్య వల్ల సావిత్రి, ఆ భార్య చనిపోయాక రెండో పెళ్లి చేసుకున్న సూర్యకాంతం వల్ల జమునా కలుగుతారు. సవితి తల్లి సూర్యకాంతం తనని నానా బాధలూ పెడుతున్నా, సాత్వికురాలైన సావిత్రి అవన్నీ భరిస్తూ అందరిపట్లా ఆదరం కనబరుస్తూ మంచి పిల్ల అనిపించుకుంటూ ఉంటుంది. తన పెద్ద కొడుకు ఎంటీఆర్కి సావిత్రినిచ్చి పెళ్లిచేసి, సవితి తల్లి బారినుంచి కాపాడి కొత్త జీవితం ఇవ్వాలనుకుంటాడు ఎస్వీఆర్. ఇక్కడి వరకూ పేచీలేదు. కానైతే, గారాబంగా పెరిగిన జమునని తన చిన్నకొడుకు నాగేశ్వర్రావుకి చేసుకుని ఆమెని 'సంస్కరించాలి' అని కూడా అనుకుంటాడు - ఇదే పేచీ. 

గారంగా పెరగడం జమున తప్పు కాదు. తల్లికలా సాగింది కాబట్టి, పనిపాటలకి సావిత్రి ఉంది కాబట్టీ, సవితి కూతురికి, సొంతకూతురికి మధ్య తల్లి భేదం చూపించాలి కాబట్టీ అలా అల్లారుముద్దుగానే పెరిగింది.  పనిపాటలు చేతకావు, ఆధునికంగా అలంకరించుకుని సినిమాలకి వెళ్లడం లాంటి సరదాలు మెండు. ఇలా ఉన్నవాళ్లు అన్ని కాలాల్లోనూ ఉన్నారు. ('సుమంగళి' 'చరణదాసి' లాంటి సినిమాలని ఇప్పటి పరిస్థితుల్లో చూసి పోల్చి తీర్పులివ్వడం కాదు అని గమనించాలి). చిన్ననాటి స్నేహితుడి ఇద్దరు కూతుళ్ళని తన కోడళ్ళుగా చేసుకోవాలనే అభిలాష తీర్చుకునే క్రమంలో జమునని యధాతధంగా అంగీకరించకుండా, ఆమెని ఓ కొత్త మూసలో ప్రవేశపెట్టి, హింసపడేలా చేసి (డొమెస్టికేట్ చేసి?) చివరాఖరి రీల్లో ఆమెలో 'మార్పు' తేవడం అనే ప్రాసెస్ అంతా ఎన్నిసార్లు ఆ సినిమా చూసినా నాకు అంగీకారం అవ్వడం లేదు. 

జమున, జమునలా ఉండిపోకుండా సావిత్రి లాగా ఎందుకు మారిపోవాలి? అలా మారిపోయాక మాత్రమే ఆమెకి మిగిలిన పాత్రల, ప్రేక్షకుల అంగీకారం ఎందుకు దొరకాలి? మారిపోవడం అంత సులభమా?? మామూలుగా అయితే ఇంత ఆలోచన అవసరం లేదేమో కానీ, 'క్లాసిక్' స్టేటస్ ఉన్న సినిమా కదా. అసలు సూర్యకాంతం గయ్యాళిగా వేసిన మెజారిటీ సినిమాల్లో చివరి రీల్లో భర్త పాత్రధారి ఎస్వీఆరో, గుమ్మడో ఓ చెంపదెబ్బ కొట్టగానే ఆమెలో పశ్చాత్తాపం వచ్చేయడం కూడా 'ఏదోలా సినిమాని ముగించాలి కాబట్టి' అనే అనిపిస్తుంది  తప్ప వాస్తవికంగా కనిపించదు. 'ఆ దెబ్బేదో మొదటి రీల్లోనే కొట్టేసి ఉంటే ఇంత గొడవ ఉండేది కాదు కదా' అనిపించిన సందర్భాలూ కోకొల్లలు. ఈ నేపథ్యంలో 'గుండమ్మ కథ' లో జమున పాత్ర తాను చేయని తప్పుకి శిక్ష అనుభవించిందనే అనిపిస్తుంది. మారిన జమునకీ, 'మార్చుకున్న' నాగేశ్వరరావుకీ ప్రేక్షకుల అభినందనలు నాకు కొరుకుడు పడవు. 

'Google' images

ఇలాంటి పేచీయే ఉన్న మరో 'క్లాసిక్' స్టేటస్ సినిమా కె. విశ్వనాథ్ 'స్వర్ణకమలం'. ఇందులో కూడా మంచి నటీనటులున్నారు, ఇళయరాజా సంగీతం, సంస్కృత పదబంధ సమ్మిళితమైన సిరివెన్నెల సాహిత్యం, అరుదుగా వినిపించే ఇళయరాజా-సుశీల కాంబినేషన్, కొన్ని హాస్య సన్నివేశాలు, మరికొన్ని సెంటిమెంట్ సీన్లు.. ఇవన్నీ బాగుంటాయి. కానీ, భానుప్రియ లో 'పరివర్తన' తెచ్చి, ఆమె నాట్యాన్ని ప్రేమించేలా చేయడానికి వెంకటేష్ పడే తాపత్రయం, తనకి నచ్చిన కెరీర్ ఎంచుకున్న ఆమెని రకరకాల ప్రయత్నాలతో నాట్యంలోకి వెనక్కి తీసుకురావడం.. ఇవన్నీ చూస్తుంటే 'ఆమె పాటికి ఆమెని వదిలేయచ్చు కదా.. వాళ్ళ నాన్నకున్న చాలామంది శిష్యుల్లో ఎవరో ఒకరు నాట్యాన్ని ముందుకు తీసుకెళ్తారు కదా' అనిపిస్తూ ఉంటుంది. 

'గుండమ్మ కథ' తో పోల్చినప్పుడు 'స్వర్ణకమలం' విషయంలో రిలీఫ్ ఏమిటంటే, భానుప్రియ నాట్యంలో మమేకమైన తర్వాత అందులో ఆత్మానందాన్ని సంపాదించుకోవడం. తనకి ఇష్టమైన హౌస్ కీపింగ్ ఉద్యోగంలో ఆమెకిది దొరికేది కాదా? అంటే, సందేహమే మళ్ళీ. సినిమా మొదటినుంచి, చివరివరకూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాట్యం గొప్పదనాన్ని గురించి ఆమెకి ఏదో ఒక విధంగా చెప్పి చూసేవాళ్ళే. ఇష్టపడక పోడానికి ఆమె కారణాలు ఆమెకి ఉన్నాయి. అవీ సబబైనవే. కానైతే, హీరో కంకణం కట్టేసుకుని మరీ ఆమెలో మార్పు తెచ్చేయడం, తండ్రి ఆత్మార్పణ లాంటి బలమైన సంఘటనల తర్వాత ఆమెలో ఆ మార్పు వచ్చేయడం.. ఇదంతా కాస్త హైరానాగానే అనిపిస్తుంది. అందరికీ అన్నీ నచ్చాలని లేదుకదా..

శనివారం, మే 28, 2022

ఎన్టీఆర్

"కవిరాజు కంఠంబు కౌగిలించెనుగదా పురవీధి నెదురెండ బొగడదండ..." శ్రీనాథ కవిసార్వభౌముడి ఈ చాటువుతో పాటు చటుక్కున గుర్తొచ్చే పేరు, రూపం కీర్తిశేషులు నందమూరి తారక రామారావుది. ఇవాళ ఎన్టీఆర్ శతజయంతి.  శ్రీనాథుడి మిగిలిన రచనలు ఏవి తలుచుకున్నా మొదట గుర్తొచ్చేది సినీ గేయ రచయిత వేటూరి. కానీ, ఈ ఒక్క చాటువు మాత్రం నందమూరినే గుర్తుచేస్తుంది. వ్యక్తిత్వం మొదలు, ఆహార విహారాదుల వరకూ ఆ కవిసార్వభౌముడికీ, ఈ నట సార్వభౌముడికీ చాలా పోలికలుండడం ఇందుకు ఒక కారణం అయి ఉంటుంది. వందేళ్ల క్రితం ఓ మారుమూల పల్లెటూళ్ళో, సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఓ మనిషి స్వయంకృషితో ఎదిగి తానే ఒక చరిత్ర కావడం వెనుక ఉన్న శ్రమని, ఒడిదుడుకుల్ని ఎవరికి వారు ఊహించుకోవలసిందే. 

కాలేజీ రోజుల్లో నాటకాలాడడంతో నటన మీద మొదలైన ఆసక్తి, ఎన్టీఆర్ ని మదరాసు మహానగరం వైపు నడిపించింది. తన ప్రాంతానికి, తన కులానికే చెందిన అక్కినేని నాగేశ్వర రావు అప్పటికే సినిమాల్లో నిలదొక్కుకున్నారు. మొదట్లో పడ్డ ఇబ్బందులు మినహా, ఒకసారి కథానాయక పాత్రలు రావడం మొదలయ్యాక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. ఆ నాగేశ్వరరావుకే గట్టి పోటీ ఇవ్వడం, ఒక్క నటనతోనే ఆగిపోకుండా సినిమా రంగానికి సంబంధించిన చాలా రంగాల్లో ప్రవేశించి ఔననిపించుకోవడం ఎన్టీఆర్ ప్రత్యేకత. అప్పటివరకూ బ్రాహ్మణ కులస్తుల ఆధిపత్యంలో ఉన్న సినిమా పరిశ్రమని కమ్మ కులస్తులు తమ చేతుల్లోకి తీసుకుంటున్న దశలో సినిమా రంగంలోకి అడుగు పెట్టడం ఎన్టీఆర్ కి కలిసొచ్చిన విషయాల్లో ఒకటి. 

నలభైనాలుగేళ్ల సినిమా కెరీర్ లో మూడొందల సినిమాల్లో నటించడం అన్నది ఇప్పటి రోజులతో పోలిస్తే పెద్ద రికార్డే. రేయింబవళ్లు శ్రమించడం, నిర్మాత శ్రేయస్సు కోరడం అనే లక్షణాలు ఈ రికార్డుకి దోహదం చేశాయి. సినిమా నటులు తమని తాము దైవాంశ సంభూతులుగా భావించుకోవడం అనేది ఎన్టీఆర్ తోనే మొదలయ్యింది బహుశా. ఈ భావన బాగా వంటబట్టాక అడపాదడపా నిర్మాతల్ని ఇబ్బంది పెట్టిన సంఘటనలున్నప్పటికీ (ముళ్ళపూడి, ఎమ్మెస్ రెడ్డిలు తమ ఆత్మకథల్లో ప్రస్తావించిన విషయాలు) మొదటి నుంచీ ఇదే ధోరణిలో ఉండి ఉంటే పెద్ద ఎత్తున సినిమాలు చేసే అవకాశం ఉండేది కాదు. ఎన్టీఆర్ సెంటిమెంట్ సీన్లలో చేసే అభినయం మీద తమిళ నటుడు శివాజీ గణేశన్ ప్రభావం కనిపిస్తుంది. అదే రాజకీయాలకి వచ్చేసరికి,  ఎంజీ రామచంద్రన్ మార్గాన్ని తనది చేసుకున్నారనిపిస్తుంది. 

Google Image

ప్రాయంలో ఉండగానే 'భీష్మ' లాంటి వృద్ధ వేషాలు, 'బృహన్నల' వంటి సాహసోపేతమైన వేషాలూ వేసిన ఎన్టీఆర్, తన వయసు అరవైకి సమీపిస్తున్నప్పుడు మాత్రం కేవలం హీరోగా మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నారు. 'స్టార్డం' పతాక స్థాయికి చేరిన సమయమది. 'కూతురు వయసు పిల్లలతో తైతక్కలాడడం' లాంటి విమర్శల్ని ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇక, ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం ఒక సంచలనం. రాష్ట్ర రాజకీయాలన్నీ రెడ్డి కులస్తుల చుట్టూనే తిరుగుతున్నాయన్న అసంతృప్తి ఆర్ధికంగా బలపడిన కమ్మ కులస్తుల్లో మొదలైన సమయం కావడంతో నేరుగా ముఖ్యమంత్రి పదవి పొందడానికి మార్గం సుగమమైంది. కాంగ్రెస్ వ్యతిరేకత, తెలుగు ఆత్మగౌరవం పేరిట నాటి ప్రముఖ పత్రికలు ఒక నేపధ్యాన్ని సిద్ధం చేసి ఉండడంతో పాటు, అన్నివిధాలా సహకరించడంతో సొంతంగా పార్టీ పెట్టి,  అతితక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టి రికార్డు సాధించగలిగారు. ఇందుకోసం ఎన్టీఆర్ పడిన శ్రమని తక్కువ చేయలేం. 

ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలన్నింటికీ తాతలాంటిది అప్పట్లో ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన రెండురూపాయలకే కేజీ బియ్యం పథకం. తర్వాతి కాలంలో ఇదే పథకం రాష్ట్ర ఖజానా పాలిట తెల్ల ఏనుగుగా మారడం, లోటు బడ్జెట్టు, తత్ఫలితంగా రాష్ట్రానికి-కేంద్రానికి మధ్య సంబంధాలు దెబ్బతినడం వరకూ వెళ్లి, అటు నుంచి కేంద్రంలో తృతీయ కూటమి ఏర్పాటు వరకూ సాగింది. పేదలకి బియ్యం పథకం ఎన్నో ఇళ్లలో పొయ్యిలు వెలిగిస్తే, ఒక్క సంతకంతో ఉద్యోగాల రద్దు నిర్ణయం వేలాది కుటుంబాలని రాత్రికి రాత్రే రోడ్డున పడేసింది.  ముఖ్యమంత్రి అయినట్టే, ఎన్టీఆర్ చులాగ్గా ప్రధాని కూడా అయిపోతారని అప్పట్లో చాలామంది బలంగా నమ్మారు. కానీ, కాలం కలిసి రాలేదు. ప్రధాని పదవి రాకపోగా, తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న ముఖ్యమంత్రి కుర్చీ నుంచి అత్యంత అవమానకర పరిస్థితుల్లో దిగిపోవాల్సి వచ్చింది. 

సినిమాల్లో స్టార్డం వచ్చాక దైవత్వం ఆవహించినట్టే, రాజకీయాల్లో అవుననిపించుకోగానే అధికారం ఆవహించింది ఎన్టీఆర్ ని. ఫలితమే, "ఎన్నికల్లో నా కాలి చెప్పుని నిలబెట్టినా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు" లాంటి ప్రకటనలు. తాను నిలబెట్టిన ఎమ్మెల్యేలని అలా కాలి చెప్పులతో పోల్చారు ఎన్టీఆర్. అదే ఎమ్మెల్యేలు, అదే ఎన్టీఆర్ మీద చెప్పులు విసిరే పరిస్థితి రావడమే విధి విచిత్రం. చివరి రోజులు బాగుండాలి అనేది ప్రతి ఒక్కరూ కోరుకునే కోరిక. వయసులో ఉన్నప్పుడు ఎన్ని కష్ఠాలు ఎదురైనా, వృద్ధాప్యంలో ప్రశాంత జీవితాన్నీ, అనాయాస మరణాన్నీ కోరుకోని వారు ఉండరు. అప్పటివరకూ వైభవాన్ని చూసిన ఎన్టీఆర్ కి చివరి రోజుల్లో మిగిలినవి వెన్నుపోటు, అవమానాలు, ఆక్రోశాలు. రాజులా బతికిన శ్రీనాథుడు చివరి రోజుల్లో కష్టాలు అనుభవించడానికి స్వీయ తప్పిదాల కన్నా, మారిన పరిస్థితులే ఎక్కువ కారణం అంటుంది చరిత్ర. మరి, ఎన్టీఆర్ విషయంలో?? చరిత్ర ఎలాంటి జవాబు చెబుతుందో వేచి చూడాలి. 

సోమవారం, మే 16, 2022

మండుటెండలు

ఎండలు మండిపోతున్నాయనుకోవడం ప్రతి వేసవిలోనూ మనకి మామూలే కానీ ఈసారి మామూలుగా కాక 'రికార్డు' స్థాయిలో మండుతున్నాయి. గత నెలలో (ఏప్రిల్) భారతదేశంలో నమోదైన ఉష్ణోగ్రతలు గడిచిన నూట ఇరవై రెండు సంవత్సరాల్లోనే అత్యధికంట! మనమే కాదు, పొరుగున ఉన్న పాకిస్తాన్, శ్రీలంక దేశాలు కూడా మండుతున్నాయి, కేవలం రాజకీయ వేడి మాత్రమే కాదు అక్కడి వాతావరణమూ అసహజమైన ఎండలతో అట్టుడుకుతోంది. బంగ్లాదేశ్ దీ అదే పరిస్థితి. ఈ బీద దేశాలన్నింటిమీదా సూర్యుడు ఎందుకిలా పగబట్టాడన్నది బొత్తిగా అంతుబట్టడంలేదు. ఎండల నుంచి రక్షింపబడడానికి జనాలకున్న ఒకే ఒక్క అవకాశం ఫ్యాన్ కిందో, ఏసీలోనో సేదదీరడం. అవి నడిచేది కరెంటు మీద. ఆ కరెంటుకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి సరఫరాలో ప్రతిరోజూ కోత పడుతోంది. ఇది చాలదన్నట్టు చార్జీలు రోజురోజుకీ పెరుగుతున్నాయి కూడా. 

ఉష్ణోగ్రతలు పెరగడానికి సైన్సు చెప్పే రెండు కారణాలు కాలుష్యం పెరగడం, పచ్చదనం తగ్గిపోవడం. ఏళ్ళ తరబడి ఇవే కారణాలు వినిపిస్తున్నా పరిష్కారం ఏమీ దొరక్కపోగా, ఎండలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ రెండు కారణాలు మనొక్క చోటే కాదు, మొత్తం ప్రపంచం అంతా ఉన్నవే కదా. మరి మనల్ని మాత్రమే ఈ ఎండలు ఎందుకు బాధిస్తున్నాయి. నాకు అర్ధమైనంత వరకూ ప్రతి సమస్యకీ ఉన్నట్టే ఈ ఎండల సమస్యకీ రెండు పరిష్కారాలు ఉన్నాయి -  ఒకటి తాత్కాలికమైనది, రెండోది శాశ్వతమైనది. మిగిలిన ప్రపంచం, మరీ ముఖ్యంగా ధనిక దేశాలు తాత్కాలిక పరిష్కారం దోవ పట్టాయి. వేసవిలో పెరిగే విద్యుత్ డిమాండ్ ని ముందుగానే ఊహించి పంపిణీకి ఆటంకం లేకుండా చూడడం, అవసరమైతే వీళ్లకీ వాళ్ళకీ (ఓ దేశానికీ, మరోదేశానికీ) జుట్లు ముడిపెట్టి ఇంధన సరఫరా వరకూ వాళ్ళ పబ్బం గడుపుకోవడం. దీనివల్ల 'ఎండలు బాబోయ్' అన్న మాట అక్కడ వినిపించడం లేదు. 

Google Image

ఇప్పుడు ఉష్ణోగ్రతలో రికార్డులు బద్దలు కొడుతున్న దేశాల్లో ఎండలు పెరిగేందుకు భౌగోళిక కారణాలు కొంత కారణం అయితే, తగ్గించుకునేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకునే వీలు కూడా కనిపించకపోవడం మరో సమస్య. ఓ పదేళ్ల క్రితంతో పోలిస్తే ఏసీల మార్కెట్ విపరీతంగా పెరిగిన మాట వాస్తవమే అయినా, మొత్తం జనాభా-ఏసీల నిష్పత్తితో పోల్చి చూసినప్పుడు వినియోగంలో ఉన్న ఎయిర్ కండిషనర్ల సంఖ్య తక్కువనే చెప్పాలి. పైగా జనం దగ్గర ఉన్న ఏసీలన్నీ వినియోగంలో ఉన్నాయనీ చెప్పలేం. కరెంటు కోత, బిల్లుల మోత కారణంగా ఇంట్లో ఏసీ ఉన్నా రోజంతా వాడే వాళ్ళు తక్కువే. కూలర్లు, ఫ్యాన్లదీ ఇదే కథ. ప్రజల్లో ఖర్చుపెట్టే శక్తి తక్కువగా ఉండడం, ఖర్చు పెట్టే అవకాశం లేకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి. భారీ ఎత్తున చెట్ల నరికివేత, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కూడా గాలాడని ఉక్కపోతకి బాగానే దోహదం చేస్తున్నాయి. అయితే, వీటిలో ఏదీ ఆపగలిగేది కాదు. 

ఆశ్చర్యం ఏమిటంటే, ఏ ఏసీ అయితే ఎండ వేడిమి నుంచి ఉపశమనం ఇస్తుందో, అదే ఏసీ భవిష్యత్తులో ఉష్ణోగ్రత మరికొన్ని డిగ్రీలు పెరగడానికి కారణం అవుతోంది. పెరిగిపోతున్న వాతావరణం కాలుష్యానికి ప్రధానంగా తోడ్పడుతున్న వాటిలో ఏసీలో ఉన్నాయి. వీటితో పాటు క్రమేపీ పెరుగుతున్న విమానయానం, ఇప్పటికే బాగా పెరిగిన భవన నిర్మాణాలూ తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఒకప్పుడు కాలుష్యం అంటే ప్రధానంగా పారిశ్రామిక వ్యర్ధాల కారణంగా సంభవించేదే అయివుండేది. ఇప్పుడు కాలుష్య కారకాలు అనూహ్యంగా రూపం మార్చుకున్నాయి. ఉదాహరణకి పేకేజింగ్ మెటీరియల్స్. ఈకామర్స్ వినియోగం పెరిగిన తర్వాత, మరీ ముఖ్యంగా కరోనా మొదలైనప్పటినుంచి షాపుల్లో కన్నా, ఆన్లైన్ కొనుగోళ్లు బాగా పెరిగాయి. దుస్తులు, వస్తువులే కాదు, ఆహార పదార్ధాలు కూడా క్రమం తప్పకుండా కొనేవారు ఎక్కువయ్యారు. ఇదో అనివార్యతగా మారింది. పేకేజింగ్ కోసం వాడుతున్న ప్లాస్టిక్ గురించి ఎవరైనా డేటా సేకరిస్తే కళ్ళు తిరిగే విషయాలు బయట పడొచ్చు.  

తాత్కాలిక ఉపశమనాలను దాటి, శాశ్వత పరిష్కారాల వైపు దృష్టి సారించినప్పుడు ప్రభుత్వాల స్పందన ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. అడవుల విస్తీర్ణం నానాటికీ తగ్గుతోంది. మెరుగైన అర్బన్ ప్లానింగ్, గ్రీన్ బెల్ట్ ని పెంచే ఏర్పాట్లు, నీటి వనరుల సద్వినియోగం, భూగర్భ జలాలని పెంచే ఏర్పాట్లు.. ఇలాంటివన్నీ కాగితాలని దాటి క్రియలో కనిపించడం లేదు. జల, వాయు కాలుష్యాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ప్రజల వైపు నుంచి ఆచరణ బొత్తిగా లేదనలేం కానీ, ఉండాల్సిన స్థాయిలో అయితే లేదు. తెలంగాణలో 'హరిత హారం' కార్యక్రమంలో సెలబ్రిటీలు మొక్కలు నాటుతూ క్రమం తప్పకుండా ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారు. ఆంధ్రలో ప్రతి వర్షాకాలంలోనూ నెల్లాళ్ళ పాటు మొక్కలు నాటే కార్యక్రమం కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా జరుగుతోంది, ఇవి కాకుండా స్వచ్చంద సంస్థలు ఆన్లైన్ లో డోనర్ల నుంచి డబ్బు తీసుకుని వాళ్ళ తరపున మొక్కలు నాటుతున్నాయి.. వీటిలో సగం మొక్కలు చెట్లైనా ఈపాటికి ఎండల సమస్య కొంచమైనా తగ్గాలి. ఇప్పటికైతే దాఖలా కనిపించడం లేదు. ఎండల్ని తిట్టుకుని ఊరుకోడమా, తగ్గించేందుకు (లేదా, మరింత పెరగకుండా ఉండేందుకు) ఏమన్నా చేయడమా అన్నది మన చేతుల్లోనే ఉంది.

శుక్రవారం, మే 13, 2022

ఇచ్చట అప్పులు ఇవ్వబడును ...

అప్పు తీసుకోవడం నామర్దాగా భావించే రోజుల్నించి, అప్పులేకుండా బతకలేని రోజుల్లోకి మనకి తెలియకుండానే వచ్చేశాం. ఇది ఎంతవరకూ వచ్చిందంటే, అప్పిస్తాం తీసుకోమంటూ రోజూ వెంట పడేవాళ్ల నుంచి తప్పించుకోడానికి దారులు వెతికే దాకా. బ్యాంకుల మొదలు, ఫైనాన్సు కంపెనీల వరకూ మన ఫోన్ నెంబరు దొరకని వాళ్ళది పాపం, మీకు ఇంత మొత్తం ఋణం తీసుకునేందుకు అర్హత ఉంది (ఈ అర్హతని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారో తెలీదు, ఒకరు చెప్పే మొత్తానికీ, మరొకరు ఇస్తామని ఊరించే అప్పుకీ పొంతన ఉండదు మరి), పెద్దగా డాక్యుమెంటేషన్ కూడా అక్కర్లేదు, మీరు ఊ అనండి చాలు, అప్పు మీ బ్యాంకు అకౌంట్లో పడుతుంది అంటూ ఊదరగొట్టేస్తారు. "అబ్బే, దేవుడి దయవల్ల రోజులు బానే గడిచిపోతున్నాయి.. ఇప్పుడు అప్పులూ గట్రా అవసరం లేదు," అని చెబుతామా, "రేపెప్పుడన్నా అవసరం రావొచ్చు, ఈ నెంబరు సేవ్ చేసుకోండి.. అవసరం వచ్చిన వెంటనే ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు" అన్నది రొటీన్ సమాధానం. రోజూ ఎన్ని నెంబర్లని సేవ్ చేసుకోవాలి? 

మొదట్లో నేను చాలా ఆశ్చర్యపడిపోతూ ఉండే వాడిని, ఫోన్లు చేసి ఇంతలేసి అప్పులు ఎలా ఇచ్చేస్తారు? తీరుస్తామన్న వీళ్ళ ధైర్యం ఏమిటీ? అని. అయితే, ఒకానొక అనుభవం తర్వాత తత్త్వం బోధపడింది. అప్పులు ఇచ్చే బ్యాచీ వేరు, వసూలు చేసుకునే బ్యాచీ వేరు. ఎవరి పద్ధతులు, మర్యాదలు వారివి. నాకు పరిచయం ఉన్న ఒకాయన ఓ ప్రయివేటు ఫైనాన్సులో అప్పు తీసుకున్నాడు. అప్పుడు, వాళ్ళకి నన్ను తన స్నేహితుడిగా పరిచయం చేసి నా ఫోన్ నెంబరు ఇచ్చేశాడు. వాళ్ళు అప్పు ఇచ్చేశారు. ఇవేవీ నాకు తెలీదు. గడువు తీరినా బాకీ తీరక పోవడంతో, అతగాడి ఫోన్ స్విచ్చాఫ్ ఉండడంతో వాళ్ళు నాకు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. మొదట్లో మర్యాదగానే మాట్లాడినా, రాన్రానూ వాళ్ళ స్వరం మారడం తెలుస్తోంది. ఇతగాడు ఫోనుకి దొరకడు. ఇలా దొరికిపోయానేవిటా అని నేను చింతిస్తూ ఉండగా, ఫైనాన్సు వాళ్ళు బెదిరింపు ధోరణిలోకి దిగారు. 

ఓ రోజు నేను మహా చిరాగ్గా ఉండగా వాళ్ళ ఫోన్ వచ్చింది. ఎప్పటిలాగే తీయగా మొదలెట్టి, కటువుగా మారుతుండగా నాకు చిర్రెత్తుకొచ్చింది. "మీరు అతనికి అప్పు ఇచ్చే ముందు నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు?" అని అడిగా. వాళ్ళ దగ్గర జవాబు లేదు. నాకు దారి దొరికింది. "అప్పిచ్చే ముందు నాకు ఫోన్ చేసి ఇలా చేస్తున్నాం అంటే నేను ఇవ్వమనో, వద్దనో చెప్పేవాడిని. ఇవ్వమని పూచీ పడితే ఇప్పుడు నాకు బాధ్యత ఉండి ఉండేది. అప్పుడు నా నెంబరు తీసుకుని ఊరుకుని ఇప్పుడు ఫోన్లు చేస్తే నాకేం సంబంధం?" అని గట్టిగా అడిగా. అవతలి వాళ్ళు వాళ్ళ మేనేజర్ని లైన్లోకి తెచ్చారు. ఆ అప్పుతో నాకు ఎలాంటి సంబంధం లేదనీ, ఇంకెప్పుడూ ఫోన్లు చేయద్దనీ, చేస్తే మర్యాదగా ఉండదనీ గట్టిగా చెప్పా. అలా ఆ పీడ విరగడయ్యింది. అప్పుల వసూళ్లు ఏ పద్ధతిలో జరుగుతాయో తగుమాత్రం అర్ధమయింది నాకు. 

ఇది జరిగిన కొన్నాళ్లకే 'వాట్సాప్ అప్పులు' అంటూ వార్తలు రావడం మొదలైంది. ప్రయివేటు ఫైనాన్సు కంపెనీల వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి, ఎలాంటి హామీలూ లేకుండా అప్పులిచ్చేశారు. ఒకే ఒక్క మెలిక ఏమిటంటే, అప్పు తీసుకునే వాళ్ళు వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ అన్నీ సదరు సంస్థ వాళ్ళకి సమర్పించాలి. వాళ్ళు, సదరు కాంటాక్ట్స్ అందరినీ పీడించి బాకీ వసూలు చేసుకుంటారన్నమాట. అప్పు తీసుకుని తీర్చలేకపోయిన ఒకరిద్దరు సున్నిత మనస్కులు ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడంతో, పోలీసులు రంగంలోకి దిగి సదరు సంస్థల్ని మూసేయించారు. ఇంతలేసి మంది అప్పులివ్వడానికి ఎందుకు పోటీ పడుతున్నారో అంటే, తాకట్టో వాకట్టో పెట్టుకుని ఇచ్చే అప్పుల మీద కన్నా ఇలాంటి హామీ లేని రుణాల మీద రెండింతలు వడ్డీ వసూలు చేయచ్చు. రిస్కు ఉన్నప్పటికీ లాభం ఎక్కువ. 

ఇక అప్పు తీసుకునే వాళ్లలో నూటికి పది మందికి నిజమైన అవసరం అయితే, మిగిలిన వాళ్ళు అప్పు దొరుకుంటోంది కదా తీసేసుకున్న బాపతు. వీళ్ళకి వడ్డీ గురించి ఆలోచన కానీ, ఎలా తీర్చాలో అన్న చింత కానీ లేవు. వాట్సాప్ అప్పులు తీసుకుని, హెడ్సెట్ వగయిరా గాడ్జెట్లు కొనుక్కున్న కుర్రాళ్ళున్నారు. అప్పుల వాళ్ళు ఇళ్ల మీదకి వస్తే, పెద్దవాళ్ళు ఏడ్చుకుంటూ బాకీలు తీర్చారు. అయితే, ఈ పరిస్థితి ఇండియాలో మాత్రమే కాదనీ, ప్రపంచానికి అప్పులిచ్చే అమెరికాలో కూడా ఇంతేననీ ఈ మధ్యనే తెలిసింది. 'ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి' అనే ఆన్లైన్ స్కీంలో అప్పులు తీసుకున్న వాళ్ళు ఏకంగా నాలుగు రెట్ల మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నారట. వీళ్ళలో మెజారిటీ యువతే. అప్పు చేసి వాళ్ళు కొంటున్నవి ఫ్యాషన్ దుస్తులు, మేకప్ సామాగ్రి, గాడ్జెట్లు వగయిరాలు తప్ప ప్రాణం మీదకి వస్తే చేసిన అప్పులు కావు. 

కొనుగోలు చేసే వస్తువు వెలని నాలుగు నుంచి ఐదు సమ భాగాలు చేసి, మొదటి భాగం చెల్లించగానే వస్తువు డెలివరీ చేస్తున్నారు. మిగిలిన మొత్తం నాలుగుకు మించని వాయిదాల్లో చెల్లించాలి. నాలుగే ఎందుకు? ఐదు వాయిదాల నుంచీ మొదలయ్యే రుణాలన్నీ వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ విషయం అప్పు ఇచ్చే వాళ్ళకి తెలుసు, తీసుకునే వాళ్ళకి తెలీదు. వాళ్ళకింకా చాలా విషయాలే తెలీదు. అప్పు చేసి కొనే ఫ్యాషన్ దుస్తులు, ఆ అప్పు తీరే లోగానే అవుటాఫ్ ఫాషన్ అయిపోతున్నాయి. మళ్ళీ కొత్త ఫ్యాషన్, కొత్త అప్పు.. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. పైగా అప్పులు చేయించడం కోసం టిక్ టాక్ ఇంఫ్లుయెన్షర్లు, వాళ్ళకి కంపెనీల నుంచి ఉచిత బహుమతులూ.. ఇదో పెద్ద వలయం. ఇందులో చిక్కుకున్న వాళ్ళు చివరికి గాస్ (పెట్రోల్) కొనడానికి కూడా ఈ నాలుగు వాయిదాల అప్పు చేయాల్సిన పరిస్థితి. ఈ అప్పులు ఇంకా ఎన్నేసి రూపాలు మార్చుకుంటాయో చూడాలి.

బుధవారం, మే 11, 2022

యమహా నగరి కలకత్తా పురి ...

"రోజంతా సూర్యుడి కింద
రాత్రంతా రజనీ గంధ సాగనీ..." 

బెంగాలీ కవులు వందేమాతరాన్నీ, జనగణమననీ జాతికి కానుకగా ఇచ్చారు. వారి ఋణం తీర్చుకోవడం కోసం కాబోలు, మన తెలుగు సినీ కవి వేటూరి బెంగాలీలు రాష్ట్రగీతంగా పాడుకోదగ్గ పాటని తెలుగులో రాశారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'చూడాలని వుంది' (1998)లో కథానాయకుడు చిరంజీవి మీద చిత్రీకరించిన ఈ పాటని ఓ బెంగాలీ ఫ్రెండ్ కి వినిపించినప్పుడు అర్ధం చెప్పాల్సిన అవసరం లేకపోయింది. దణ్ణం పెట్టేశారు కవికి. మనకి భాష కూడా వచ్చు కాబట్టి వేటూరి ఉపయోగించిన శ్లేషల్ని, చమక్కుల్ని కూడా ఆస్వాదించ గలుగుతాం. 


యమహా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది...

ఏదన్నా 'గొప్పగా ఉంది' అనడానికి 'యమాగా ఉంది' అనడం అప్పటికే వాడుకలోకి వచ్చేసింది. ఇదే వేటూరి, ఇదే చిరంజీవి కోసం 'యమహా నీ యమా యమా అందం' అనే పల్లవితో పాట రాసి ఉన్నారు అప్పటికే. ఆ దృష్టితో చూసినప్పుడు కలకత్తా గొప్ప నగరం అంటున్నారు. కానైతే, ఈ కలకత్తా పురి బెంగాల్ కి రాజధాని. ఆ బెంగాల్ కరువులకి పుట్టిల్లు. దేశానికి స్వతంత్రం రాకపూర్వం సాక్షాత్తూ యమపురే. కలకత్తాలో ప్రవహించే హుగ్లీ నదికి, ప్రసిద్ధ హౌరా బ్రిడ్జీ కి నమస్సులు చెబుతున్నాడు - ఎవరు? - 'చిరు' త్యాగరాజు. శాస్త్రీయ బాణీలో పాడుతున్న వర్ధమాన గాయకుడు అని మాత్రమే కాదు, 'చిరు' అనే ముద్దుపేరున్న చిరంజీవి అని కూడా. 

నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట
పాడనా తెలుగులో
ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా
పదుగురు పరుగు తీసింది పట్నం
బ్రతుకుతో వెయ్యి పందెం
కడకు చేరాలి గమ్యం కదిలిపోరా
ఒకరితొ ఒకరికి ముఖ పరిచయములు
దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల
గజిబిజి ఉరుకుల పరుగులలో... 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టింది బెంగాలీ సీమలోనే. 'గీతాంజలి పూసిన చోట' అని ఎవరనగలరు, వేటూరి తప్ప? రామకృష్ణ పరమహంస హంసగీతం (చివరి సందేశం) ఆనందుడు (వివేకానందుడు) చూపిన బాట అయ్యింది. ఆ బాటలో సాగుతానంటున్నాడు కథానాయకుడు. పదుగురూ పరుగు తీసే పట్నాలన్నీ దాదాపు ఒకలాగే ఉంటాయి కాబట్టి, ఈ వర్ణనంతా ఏ మహానగరానికైనా సరిపోతుంది. 

బెంగాలీ  కోకిల బాల
తెలుగింటి కోడలు పిల్ల మానిని సరోజిని
రోజంతా సూర్యుడి కింద
రాత్రంతా రజనీ గంధ సాగనీ
పద గురు ప్రేమలే లేని లోకం
దేవాదా మార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా
కథలకు నెలవట కళలకు కొలువట
తిథులకు సెలవట అతిధుల గొడవట
కలకట నగరపు కిటకిటలో... 

'భారత కోకిల' బిరుదాంకిత సరోజిని (నాయుడు) హైదరాబాద్ కోడలు. ఆవిడ మెట్టిల్లు 'గోల్డెన్ త్రెషోల్డ్' ని ఇప్పటికీ చూడొచ్చు నాంపల్లిలో. బెంగాల్ వాతావరణంలోనే ఓ అతి ఉంది. అక్కడ అన్నీ ఎక్కువే, ఎండలు కూడా. అలా రోజంతా సూర్యుడి ఎండలో పని చేసినా, రాత్రయ్యేసరికి రజనీగంధ పూలు చక్కని సువాసనతో సేద తీరుస్తాయి. అక్కడ ఇంకా చాలా పూలే పూస్తాయి కానీ, ప్రత్యేకించి రజనీగంధ అనడానికి కారణాలు - ఇది దాదాపు అన్ని కాలాల్లోనూ పూచే పువ్వు అవడం ఒకటైతే, 'రజనీగంధ' అనే అందమైన సినిమా తీసిన బెంగాలీ బాబు బసు ఛటర్జీని ఈ వంకన తల్చుకోడం మరొకటి. ప్రేమరాహిత్యం అనగానే గుర్తొచ్చే దేవదాసు బెంగాలీ వాడే.. 'దేవదాసు' నవల ఒక మైకమైతే, కథానాయకుడి చేతిలో పాపులరైన సీసా మరో మైకం. ఈ 'దేవదాసు' శరత్ చంద్ర చటోపాధ్యాయ పాఠకులకి చేసిన నవలాభిషేకం అంటే కాదనగలమా? కథలకు నెలవు, కళలకు కొలువు సరే. తిథులకి సెలవేమిటి అంటే, 'ప్రోగ్రెసివ్' బెంగాలీలకి తిథి వార నక్షత్రాలతో పెద్దగా పనుండదు అని. నగరాలకి అతిధుల గొడవ తప్పదు, ఈ కథానాయకుడూ అతిధిగా వెళ్లిన వాడే కదా మరి. 

వందేమాతరమే అన్న వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయ చౌరంగి రంగుల దునియా నీదిరా
విను గురు సత్యజిత్ రే సితార
ఎస్ డి బర్మన్ కీ ధారా
థెరిస్సా కి కుమారా కదలి రారా
జనగణమనముల స్వరపద వనముల
హృదయపు లయలను శృతి పరిచిన
ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో... 

ముందే చెప్పుకున్నట్టుగా వందేమాతరం, జనగణమన పుట్టిన నేల అది. మాతంగి కాళికాలయం, చౌరంగీ చూసి తీరాల్సిన ప్రదేశాలు. సత్యజిత్ రే సినిమాలు, ఆర్డీ బర్మన్ సంగీతం, మదర్ థెరెసా సేవలు.. ఇవన్నీ కలకత్తా అనగానే గుర్తొచ్చే విషయాలు. పైగా, అప్పట్లోనే చిరంజీవి "మదర్ థెరెసా స్పూర్తితో" సేవా కార్యక్రమాలు నిర్వహించడం మొదలైంది కూడా. 

పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ విరచిత 'రఘువంశ సుధాంబుధి' బాణీలోనే ఈ పాటని స్వరపరిచారు సంగీత దర్శకుడు మణిశర్మ. పల్లవి చరణాల బాణీల్లో మార్పులేవీ చేయకుండా, ఇంటర్లూడ్స్ లో మాత్రం సినిమా పాటకి కావాల్సిన 'జోష్' ని అందించారు. చిరంజీవి ఈ పాటకి ఒప్పుకోవడం అప్పుడే కాదు, ఇప్పటికీ ఆశ్చర్యమే. మెగాస్టార్ అయిపోయాక తన పాటల్లో ఇలాంటి సాహిత్యం అరుదు. ఈ పాటని హరిహరన్ చేత పాడించడం అప్పట్లో నచ్చలేదు కానీ (గొంతుకి వంక పెట్టలేం, కాకపోతే ఉచ్చారణ...) వినగా వినగా అలవాటైపోయింది. ఓ పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాలో ఇలాంటి అభిరుచిగల పాట పెట్టిన నిర్మాత అశ్వనీదత్ నీ అభినందించాల్సిందే.