గురువారం, సెప్టెంబర్ 15, 2016

కోర్టులు-తీర్పులు

ఈమధ్య మన న్యాయవ్యవస్థ తరచూ వార్తల్లో కనిపిస్తోంది. కోర్టుల్లో గుట్టలుగా పెరిగిపోతున్న కేసులు ఓ పక్క, భర్తీ కాక మిగిలిపోతున్న ఉద్యోగాలు మరోపక్క, వెరసి న్యాయమూర్తులు ఒత్తిడికి గురవుతున్నట్టుగా కనిపిస్తోంది. న్యాయమూర్తుల పోస్టుల భర్తీ విషయంలో సాక్షాత్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశ ప్రధాని సమక్షంలో భావోద్వేగానికి గురవ్వడాన్ని చూశాం మనం. కొన్ని న్యాయపరమైన చిక్కుల కారణంగా ఏళ్లతరబడి పోస్టుల భర్తీ నిలిచిపోయిందని వ్యాసాలు ప్రచురించాయి పత్రికలు. 'న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వం పాత్ర ఉండాలా? ఉండకూడదా?' అన్న చర్చ సుదీర్ఘంగా కొనసాగుతోంది.

న్యాయమూర్తుల కొలీజియం ద్వారానే నియామకాలు జరగాలి తప్ప ప్రభుత్వం జోక్యం ఉండకూడదని సీనియర్ న్యాయమూర్తులు అభిప్రాయ పడుతూ ఉండగా, ప్రభుత్వ జోక్యం ఉండని స్వాతంత్య్రం ఏ వ్యవస్థకీ ఉండకూడదనీ, న్యాయవ్యవస్థ కూడా ఇందుకు మినహాయింపు కాదనీ ప్రభుత్వ పెద్దలు వాదిస్తున్నారు. నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఉన్న పక్షంలో కేసుల విచారణలోనూ, తీర్పు వెలువరించడంలోనూ న్యాయవస్థ తాలూకు స్వతంత్రం ప్రశ్నార్ధకవుతుందన్న వాదన కోర్టుల వైపు నుంచి వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, కావాల్సింది పెద్ద సంఖ్యలో న్యాయమూర్తులు కాదనీ, పనిచేసే న్యాయమూర్తులే తక్షణావసరమనీ ప్రకటించింది లా కమిషన్.

నియామకాలని గురించిన చర్చ జరుగుతూ ఉన్న సమయంలోనే, సుప్రీం కోర్టు వెలువరించిన ఒక తీర్పు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చిన రెండు తీర్పులు ఆసక్తికరంగా అనిపించాయి. సుప్రీం కోర్టు తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సింగూరు భూములకి సంబంధించింది. సతతమూ పేదల పక్షాన నిలబడి పోరాటాలు చేసే కమ్యూనిష్టు పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న సమయంలో టాటా సంస్థకి కార్ల కర్మాగారం ఏర్పాటు నిమిత్తం సింగూరులో భూసేకరణ చేసింది. రైతులంతా బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం, ఆ పోరాటాలకు నాయకత్వం వహించిన తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ తదనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కావడం చరిత్ర.


నాటి బలవంతపు భూసేకరణని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చి, సేకరించిన భూముల్ని రైతులకి స్వాధీనం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూసేకరణ అనంతరం బెంగాల్లో జరిగిన ఏ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు విజయం సాధించలేదు. కోర్టు తీర్పు తర్వాత, ఆ పార్టీ నాయకులు చట్ట ప్రకారమే భూసేకరణ జరిగింది తప్ప ప్రభుత్వం తప్పేమీ లేదని ప్రకటించారు. లోపం బ్రిటిష్ కాలం నాటి భూసేకరణ చట్టానిదేననీ, సింగూరు సంఘటన ఫలితంగానే ప్రభుత్వం ఆ చట్టానికి మార్పు చేసిందనీ కూడా పత్రికల్లోనూ, టీవీల్లోనూ గట్టిగా చెప్పారు. మమతా బెనర్జీ ప్రస్తుతం రైతులకి భూములని  స్వాధీనం చేస్తూ కోర్టు ఆదేశించిన నష్ట పరిహారాన్ని కూడా పంపిణీ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులని ప్రస్తావించే ముందు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మాన్య  చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పు పట్టిన సందర్భాలు బహు అరుదు. దీనిని న్యాయ వ్యవస్థ పట్ల చంద్రబాబుకి ఉన్న తిరుగులేని అవగాహనకి నిదర్శనంగా ఆయన అనుయాయులు టీవీ చర్చల సాక్షిగా గర్వపడేవారు కూడా. అయితే, ప్రపంచస్థాయి రాజధాని నగరం అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న 'స్విస్ ఛాలెంజ్' విధానాన్ని నిలిపివేయవలసిందిగా హైకోర్టు మూడు రోజుల క్రితమే ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అప్పీలుకు వెళ్లేందుకు సిద్ధ పడుతూ ఉండగానే నిన్న మరోకేసులో ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు.

తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలో నిర్మించదలచిన ఔషధ పరిశ్రమనీ, అందునిమిత్తం జరిగిన భూసేకరణనీ స్థానిక రైతులు వ్యతిరేకించారు. నాడు బెంగాల్లో బలవంతపు భూసేకరణ జరిపిన వామపక్ష పార్టీలు తుని రైతులకి సంఘీభావం ప్రకటించాయి. రైతులు హైకోర్టుని ఆశ్రయించారు. ఈ భూసేకరణని న్యాయస్థానం తప్పు పట్టింది. మాన్య చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలకి వ్యతిరేకంగా వరుసగా రెండు తీర్పులు రావడం బహుశా ఇదే మొదటిసారి. ప్రజాస్వామ్యంలో ఒక్కో వ్యవస్థ మీదా నమ్మకం కోల్పోతూ వస్తున్న సామాన్యులకి అంతో ఇంతో నమ్మకం ఉన్నది న్యాయ వ్యవస్థ మీదే అనడం అతిశయోక్తి కాదు. ఈ మూడు తీర్పుల్లాంటివి ఆ నమ్మకాన్ని పెంచుతున్నాయి కూడా. నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఉన్నట్టయితే, స్వతంత్రంగా తీర్పులివ్వడం కోర్టులకి ఏమేరకు సాధ్య పడుతుంది అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా పెద్ద ప్రశ్న.

సోమవారం, సెప్టెంబర్ 12, 2016

జ్యో అచ్యుతానంద

టైటిల్ కోసం హిట్ పాటల పల్లవులు అయిపోయాయి, ఇప్పుడిక అన్నమాచార్య కీర్తనల వంతు కాబోలు అనుకున్నా 'జ్యో అచ్యుతానంద' టైటిల్ చూడగానే. సినిమాకీ, టైటిల్ కీ పెద్దగా సంబంధం ఉంటుందని కూడా అనుకోలేదు. కానీ, చక్కని టైటిల్ కి వంద శాతం న్యాయం చేస్తూ దర్శకుడు అవసరాల శ్రీనివాస్ రూపొందించిన సినిమా ఓ సకుటుంబ కథా చిత్రం. మెలోడ్రామాని కాక, సెంటిమెంట్ ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా. సినిమా అంటే నాలుగు ఫైట్లు, ఐదు డ్యూయెట్లు మరియు ఒక ఐటెం సాంగ్ మాత్రమే అనుకునే వాళ్ళు ఈ సినిమా ఆడుతున్న ధియేటర్ దరిదాపులకు వెళ్లకపోడమే మంచిది.

అన్నదమ్ముల కథ అనగానే నాటి 'అన్నదమ్ముల అనుబంధం' నుంచి మొన్నటి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వరకూ గుర్తు రావడం సహజం. కానైతే ఈ సినిమా ప్రత్యేకం. కాసింత లాజిక్ మిస్సయినా ఇందులో కథ ఉంది. ఆ కథని మింగేసే స్టార్లు లేకపోవడం, అన్నదమ్ములుగా నటించిన ఇద్దరూ 'నటులు' కావడం (స్టార్లు కాకపోవడం), ఎక్కడా విసిగించని కథనంతో పాటుగా బూతు ఏమాత్రం లేని హాస్యం ఉండడమే ఆ ప్రత్యేకత. జ్యోత్స్న(రెజీనా కసాండ్రా) అనే అమ్మాయిని ప్రేమించిన అన్నదమ్ములు అచ్యుతరామారావు (నారా రోహిత్), ఆనందవర్ధనరావు (మూల్పూరి నాగశౌర్య)ల కథ ఇది. చాలా సిన్సియర్ గా జ్యోత్స్నని ప్రేమించేసిన అన్నదమ్ములిద్దరూ, ఆమెకోసం ఒకరి కాలర్ ఒకరు పట్టుకునే స్టేజికి వచ్చేశాక, వీళ్ళిద్దరినీ కాదని, ఆమె పై చదువులకోసం విదేశాలకి వెళ్ళిపోతుంది.

అన్నదమ్ములిద్దరూ పెళ్లిళ్లు చేసుకుని జీవితాల్లో స్థిరపడే నాటికి జ్యోత్స్న మళ్ళీ ఊడిపడుతుంది. ఒకప్పుడు వీళ్ళ ప్రేమని తిరస్కరించిన ఆమె, ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా ప్రపోజ్ చేస్తుంది. ఆమె ఎందుకలా చేసింది అన్న ప్రశ్నకి జవాబుతో పాటు, అప్పుడు అన్నదమ్ములిద్దరూ ఏం చేశారు అన్నది సినిమాకి ముగింపు. కథ కన్నా కూడా కథనం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు దర్శకుడు. ఫలితంగా సినిమా చాలా హాయిగా సాగిపోయింది. మొదటిసగం మొత్తం నవ్వుల్లో ముంచి తేలిస్తే, రెండో సగంలో హాస్యంతో సెంటిమెంట్ పోటీపడింది. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయని అప్పుడెప్పుడో ఆత్రేయ చెప్పిన మాటని నిజం చేసి చూపించాడు అవసరాల శ్రీనివాస్.


రోహిత్, నాగశౌర్య అన్నదమ్ములు అని వినగానే 'బాబాయ్ అబ్బాయ్ లా ఉంటారేమో' అని అనుమానించాను కానీ, చూస్తున్నప్పుడు అలాంటి ఇబ్బంది కలగలేదు. కానైతే, రోహిత్ ఫిజిక్ మీద శ్రద్ధ పెట్టడం అత్యవసరం. లేని పక్షంలో కేరక్టర్ ఆర్టిస్ట్ గా ప్రమోషన్ కొట్టేసే అవకాశాలు మరీ పెరిగిపోయాయి. అన్నదమ్ములుగా వీళ్ళిద్దరూ అతికినట్టుగా సరిపోయారు. సిగరెట్ షేర్ చేసుకోడం మొదలు, అమ్మాయి కోసం కొట్టుకోడం వరకూ ఎక్కడా అతి అనిపించలేదు. అలాగే, వాళ్ళ వ్యక్తిత్వాల్లో వైరుధ్యాలని డైలాగులు అవసరం లేకుండా ప్రదర్శించి మెప్పించారు. మొదటి సగంలో రెజీనా నటనకి వంక పెట్టడానికి లేదు కానీ, రెండో సగంలో అక్కడక్కడా అతి అనిపించింది. ఆమె పాత్ర కూడా కొంతమేర నేలవిడిచి సాము చేసింది. హీరోల తల్లిగా సీత, హీరోయిన్ తండ్రిగా తనికెళ్ళ భరణి కనిపించారు.

ఇంటివాళ్లతో అంత పెద్ద మాట పట్టింపు వచ్చినా భరణి ఏళ్లతరబడి ఇల్లెందుకు ఖాళీ చేయలేదన్నది జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయింది. హీరోల భార్యలకీ, రెజీనాకి మధ్య కాన్ఫ్లిక్ట్ సృష్టించే అవకాశం ఉన్నా దర్శకుడు ఎందుకో ఆ జోలికి వెళ్ళలేదు. కొడుకు పుట్టినరోజుకి తండ్రి ఓ తెలుగు నవలని కానుకగా ఇవ్వడంతో పాటు, ఆ నవల చుట్టూ కొన్ని సన్నివేశాలు అల్లడం ఈతరం దర్శకులు ఎవ్వరూ ఇప్పటివరకూ చేయని ప్రయత్నం. నా వరకూ చాలా బాగా నచ్చేసిన సీక్వెన్సు ఇది. మరోసారి పేరు మార్చుకున్న సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ పనిమీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదనిపించింది. ముఖ్యంగా రెండోసగంలో సన్నివేశాలకి, సంగీతానికీ పొత్తు కుదరని ఫీలింగ్. పాటలు, నేపధ్య సంగీతం గుర్తుండిపోయే విధంగా ఉంటే సినిమా మరో మెట్టు పైకెక్కి ఉండేది.

ఈ మధ్యకాలంలో చిన్న బడ్జెట్లో చక్కని సినిమాలు నిర్మిస్తున్న 'వారాహి' సంస్థ అందించిన సినిమా ఇది. ఇప్పటివరకూ నటుడిగా హాస్యాన్ని, విలనీని ప్రదర్శించిన అవసరాల శ్రీనివాస్ తనలో దర్శకుణ్ణి పూర్తిగా ఆవిష్కరించుకున్నాడని చెప్పాలి. పంచ్ ల కోసం పాకులాడకుండా, సందేశాలివ్వాలని ఆయాస పడిపోకుండా అవసరాల రాసుకున్న సంభాషణలు సన్నివేశాలని అలవోకగా నడిపించేయడమే కాక, ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాయి. రెండోసగంలో ఫైటింగ్ సీన్ చాలా కృతకంగా అనిపించింది.మొదటిసగం మీద పెట్టిన శ్రద్ధ రెండోసగం లోని ఓ ఇరవై నిమిషాల మీద పెట్టి ఉంటే వంక పెట్టడానికి వీల్లేని సినిమా వచ్చి ఉండేది కదా అనిపించింది. అయితే, దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ మీద అంచనాలని 'జ్యో అచ్యుతానంద' బాగా పెంచేసిందని చెప్పక తప్పదు.