గురువారం, అక్టోబర్ 24, 2019

వయ్యారి గోదారమ్మ ...

"పున్నాగ కోవెల్లోన.. పూజారి దోసిళ్ళన్ని.. 
యవ్వనాలకు కానుక..."

వినడానికి మాత్రమే బాగుండే పాటల జాబితాలో చేర్చుకున్న పాట 'ప్రేమించు పెళ్లాడు' సినిమా కోసం వేటూరి రాసిన 'వయ్యారి గోదారమ్మ.. ' సాహిత్యంతో పాటుగా, ఇళయరాజా చేసిన స్వరం, బాలు-జానకిల గళం ఈ పాటని చిరంజీవిని చేసేశాయి. ఒక నర్సుతో ప్రేమలో పడ్డ ఓ కుర్రాడు, ఆమెతో పాడుకునే డ్యూయెట్ ఇది. అతిమామూలు సందర్భానికి కవితాత్మకంగా సాహిత్యం సమకూర్చారు వేటూరి. 

"వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం... 
కడలి ఒడిలో కలసిపోతే కల-వరం..." 

ప్రేమలో పడ్డ కుర్రాడికి నిద్దట్లో వచ్చే కలలో తన ప్రేయసి చేరువైతే ఆ 'కల' 'వరమే' కదా. 

"ఇన్ని కలలిక ఎందుకో...  కన్నె కలయిక కోరుకో... 
కలవరింతే కౌగిలింతై..."

కలలెందుకు, కలయిక కోరుకో అంటోందా అమ్మాయి. 'కలవరం,' 'కల-వరం,' 'కలలిక,' 'కలయిక' ..పదాలతో ఆడుకోడం వేటూరికి కొత్తేమీ కాదు కదా. 

"నిజము నా స్వప్నం... నీవు నా సత్యం ఔనో...  కానో...  
ఊహ నీవే... ఉసురుకారాదా.. 
మోహమల్లె... ముసురుకోరాదా..."

నా కల నిజం, నువ్వు నా నిజం అని అతనంటే, ఔనో/కానో అంటోందామె. నా ఊహల్లో ఉన్న నువ్వు ఊపిరివి కావొచ్చు కదా, మోహం లాగ నన్ను ముసురుకోవచ్చు కదా అని అడుగుతున్నాడతను. 

"నవ్వేటి నక్షత్రాలు... మువ్వల్ని ముద్దాడంగ... 
మువ్వగోపాలుని రాధికా... 
ఆకాశవీణ గీతాలలోన...  ఆలాపనై నే కరిగిపోనా..."

...అంటూ ముక్తాయించి చరణాన్ని ముగించాడతను.  ఈ ముక్తాయింపు పూర్తిగా భావ కవిత్వమే అనిపిస్తుంది నాకు. పల్లవిలో లాగే ఇక్కడా 'మువ్వల్ని ముద్దాడంగ,'  'మువ్వగోపాలుని రాధికా' అంటూ శబ్దపరంగా దగ్గరగానూ, అర్ధంలో దూరంగానూ ఉండే పదాలు వాడారు వేటూరి.




"తాకితే తాపం... కమలం... భ్రమరం... 
సోకితే మైకం... అధరం... మధురం... 
ఆటవెలది... ఆడుతూరావే...  
తేటగీతి... తేలిపోనీవే... "

కమలాన్ని భ్రమరం తాకడాన్ని గురించి, అధరం తాలూకు మధుర మైకాన్ని గురించి ప్రేమికులు కబుర్లాడుకోడం మామూలే. ఆమెని ఆటవెలది (నర్తకి) లా ఆడుతూ రమ్మంటున్నాడు. ఆ రావడంలో తేటగీతిని తేలిపోనివ్వమంటున్నాడా? (ఛందోరీతులైన ఆటవెలది, తేటగీతుల్ని ప్రేమగీతంలో ప్రవేశ పెట్టడం ముచ్చటైన విషయం). 

"పున్నాగ కోవెల్లోన... పూజారి దోసిళ్ళన్ని... 
యవ్వనాలకు కానుక... 
చుంబించుకున్న... బింభాధరాల... 
సూర్యోదయాలే పండేటి వేళ..."

మళ్ళీ గాఢమైన భావకవిత్వం! అతగాడు పున్నాగపూల కోవెల్లో పూజారట.. సదా అతడి దోసిళ్ళు నిండేది పున్నాగపూలతోనే. వాటిని యౌవనాలకి కానుక చేస్తున్నాడు. ఇక, అధరబింబాలు బింబాధరాలయ్యాయి. వాటి చుంబనాల్లో సూర్యోదయాలు పండుతాయట! (చిత్రీకరణలో నాయికకి అవసరానికి మించి లిప్ స్టిక్ వాడింది ఇందుకేనేమో మరి). 

మామూలుగా పాటలు తీయడంలో ప్రత్యేక ముద్ర చూపించే దర్శకుడు వంశీ, ఈ చిత్రీకరణ విషయంలో మాత్రం సాహిత్యానికి, సంగీతానికి, గానానికి ఏమాత్రమూ న్యాయం చేయలేక పోయాడు. ఇంటర్లూడ్స్ లో వచ్చే క్లోజప్ షాట్స్ మినహా, పాటంతా నాయికా నాయకులు గోదారొడ్డున పరిగెడుతూనే ఉంటారు, ఏదో పరుగు పందానికి ప్రాక్టీస్ లాగా. విన్న ప్రతిసారీ 'బాగా తీస్తే బాగుండేది కదా' అనిపిస్తూ ఉంటుంది.

గురువారం, అక్టోబర్ 10, 2019

ఏ టైగర్ ఫర్ మాల్గుడి (A Tiger for Malgudi)

సాహిత్యంలో పులిని గురించి రాసిన వాళ్ళు అనుకోగానే మనకి మొదట జిమ్ కార్బెట్ గుర్తొస్తాడు. తెలుగులో అల్లం శేషగిరి రావు రాసిన వేట కథలు గుర్తొస్తాయి. వీటిలో చాలావరకూ వేటగాళ్ల దృష్టి కోణం నుంచి రాసినవే. కానీ, ఒక పులి తన కథని తాను చెప్పుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఊహకి అక్షర రూపం ఇచ్చింది మాత్రం ఆర్కే నారాయణన్. తన ఊహల్లో సృష్టించిన పట్టణం 'మాల్గుడి' ని నేపధ్యంగా తీసుకుని రాసిన నవల 'ఏ టైగర్ ఫర్ మాల్గుడి.' జూ పార్కులో ఆశ్రయం పొందుతున్న ఒక ముసలి పులి, ఆత్మగతంగా తన జీవితాన్ని తల్చుకోడమే ఈ 175 పేజీల నవల. 

అడవిలో పుట్టిన ఓ మగపులి ఓ గుహలో బద్ధకంగా జీవిస్తూ ఉంటుంది. మిగిలిన జంతువుల మధ్య తన గౌరవాన్ని నిలబెట్టుకోడమే పెద్ద సవాలు. ఈ క్రమంలో ఒకరోజు ఒక ఆడపులితో తలపడవలసి వస్తుంది. అటు తర్వాత ఆ పులితోనే అదే గుహలో సహజీవనం చేసి పిల్లల్ని కూడా కంటుంది. పిల్లలతో సహా ఆడపులి వేటగాళ్ళకి చిక్కడం మగపులి జీవితంలో మొదటి మలుపు. వాటిని వెతుక్కుంటూ అడవి దాటి, కొన్నాళ్ల పాటు ఊళ్ళో మాటేసి దొరికిన జంతువులని తింటూ కాలం గడుపుతూ ఉంటుంది. నిజానికి అడవిలో గుహలో కన్నా, ఊళ్ళో జీవితమే బాగున్నట్టు భావిస్తుంది కూడా. 

అయితే, తమ పాడి పశువులు మాయమైపోతూ ఉండడాన్ని గమనించిన గ్రామస్తులు పులి ఉనికిని కనిపెట్టేస్తారు. వాళ్ళా సమస్యని కలెక్టర్ కి మొరపెట్టుకోవడంతో, పులి విషయం మాల్గుడి లో సర్కస్ కంపెనీ నడిపే 'కెప్టెన్' దృష్టికి వస్తుంది. చాకచక్యంగా పులిని బంధించి తన సర్కస్ కంపెనీకి తీసుకు వచ్చిన కెప్టెన్ ఆ పులికి 'రాజా' అని పేరు పెట్టి సర్కస్ ఫీట్లు చేసే శిక్షణ ఇస్తాడు. రాజాగా మారడం పులి జీవితంలో రెండో మలుపు. నిజానికి భయంకరమైన మలుపు. కెప్టెన్ కి రాజాకి మధ్య ఉన్న సమస్య భాష. ఒకరి భాష మరొకరికి తెలీదు. కాబట్టి కెప్టెన్ ఎలాంటి శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాడో రాజాకి తెలీదు. తాను చెప్పినట్టు రాజా వినకపోవడంతో కోపగించిన కెప్టెన్ ఇనప కుర్చీతో బాదడం, తిండి పెట్టకుండా మాడ్చడం లాంటి 'శిక్షలు' వేస్తూ ఉంటాడు. 

Photo: Wiki

కెప్టెన్ లేని సమయంలో, సర్కస్ కంపెనీలో ఉండే కొండముచ్చు అడవి భాషలో రాజాతో మాట్లాడడంతో కెప్టెన్ తన నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకునే వీలు కలుగుతుంది. కాలక్రమంలో రాజా మనుషుల భాషని అర్ధం చేసుకోడమే కాదు, కెప్టెన్ నేర్పే ఫీట్లని అలవోకగా చేసేస్తూ సర్కస్ కంపెనీకి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. అలా ఆకర్షణగా మారాక, ఓ సినిమా దర్శకుడి దృష్టిలో పడడం పులి జీవితంలో మూడో మలుపు. కెప్టెన్ సారధ్యంలో సినిమా చిత్రీకరణ లో పాల్గొనడం మొదలు పెట్టిన రాజాకి, షూటింగ్ లో జరిగిన ఓ గడబిడలో తప్పించుకోడానికి అవకాశం దొరుకుతుంది. మొదట ఓ బడిలో దాక్కుని, అటుపైన ఒక సన్యాసికి అనుయాయి గా మారిపోతుంది. 

కొన్నాళ్ల పాటు అడవిలో ఆశ్రమ జీవితం గడిపిన పులి పూర్తి సాధువుగా మారిపోయాక, సన్యాసికి తాను మరణానికి దగ్గరవుతున్నానని తెలుస్తుంది. సాధువుగా మారిన పులి తను లేకుండా అడవిలో ఒంటరిగా  బతకలేదని గ్రహించి, ఓ జూ పార్కుకి అప్పగించేస్తాడు. జూ ఎంక్లోజర్ లో తనని చూసిన జనం మాట్లాడుకునే మాటలన్నీ పులికి అర్ధమవుతూ ఉంటాయి. జూ లో మొదలైన కథ, ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లి, మళ్ళీ జూ లో ముగుస్తుంది. పులుల మనస్తత్వాన్ని గురించీ, సర్కస్ కంపెనీలు జంతువులకి ఇచ్చే శిక్షణ గురించీ ఎంతో అధ్యయనం చేసి ఈ నవలని రాశారు ఆర్కే. సినిమా షూటింగ్ విశేషాలు సరేసరి. ఇక ఆర్కే మార్కు హాస్యానికి, వ్యంగ్యానికి కొదవ ఉండదు. 

సర్కస్ కంపెనీలు పులులని విరివిగానూ, విశేష ఆకర్షణ గానూ వినియోగించిన కాలంలో (1983) ఈ నవలని రాశారు ఆర్కే నారాయణన్. అడవిలో, గ్రామంలో, సర్కస్ కంపెనీలో, సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు పులి ఆలోచనల్ని "అచ్ఛం పులి ఇలాగే ఆలోచిస్తుందేమో" అనిపించేలా రాయడం ఈ నవల ప్రత్యేకత. సర్కస్ పులిని వినోదంగా చూస్తున్న ప్రజలకి, ఆ వినోదం వెనకున్న విషాదాన్ని వివరించడమే ఈ నవల ఉద్దేశం అనిపిస్తుంది, చదవడం పూర్తి చేశాక. చదువుతున్నంతసేపూ పులి పాత్రలో మమేకమవుతామనడంలో అతిశయోక్తి లేదు. ఆబాలగోపాలన్నీ అలరించే ఈ నవల పునర్ముద్రణలు పొందుతూనే ఉంది. 

గురువారం, అక్టోబర్ 03, 2019

హంసనాదమో .. పిలుపో ...  

"మురళికే చలి చెలి ప్రియా..
మరునికే గుడి మహాశయా.."

'రాజేశ్వరి కళ్యాణం' సినిమాలో "ఓడను జరిపే.." పాటని గురించి రాస్తూ ఉండగా గుర్తొచ్చిన పాట కోనేరు రవీంద్రనాథ్ నిర్మాణంలో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 'లేడీస్ స్పెషల్' సినిమాలో వచ్చే యుగళగీతం "హంసనాదమో.. పిలుపో.."  రెండు సినిమాలూ ఒకే కాలంలో రావడం, ఒకే హీరో (సురేష్) నటించడంతో పాటు, రెండు పాటల్నీ రాసిన వేటూరి రెంటిలోనూ త్యాగరాజుని స్మరించుకోవడం ఈ రెండు పాటల మధ్యనా ఉన్న పోలికలు. 

సుస్వర బాణీల సృష్టికర్త సాలూరి రాజేశ్వరరావు సంతానంలో, రావాల్సినంత గుర్తింపు రానిది వాసూరావుకే అనిపిస్తుంది. ఈయన చేసిన మంచిట్యూన్లు వేరే వాళ్ళ పేర్లమీద చెలామణిలో ఉన్నాయన్నది ఒక వినికిడి. నిజానిజాలు తెలియవు. శాస్త్రీయ సంగీతం మీద మంచి పట్టున్న వాసూరావు, సినిమాలో కథానాయకుడు, నాయికకి తన ప్రేమని తెలిపే సన్నివేశంలో వచ్చే యుగళగీతానికి 'హంసనాదం' రాగంలో ట్యూన్ చేశారు. 'బంటురీతి కొలువు ఈయవయ్య రామా' అని త్యాగయ్య వేడుకున్నది ఈ రాగంలోనే!


"హంసనాదమో.. పిలుపో..
వంశధారలో..  వలపో..
సరిపా..  మపనీ పామా..
మదిలో..  విరిసింది ప్రేమా..
తొలకరి రాగాలేవో రేగే.." 

ఇది పల్లవి. 'వంశధార' ని ఎన్ని విరుపులతో, ఎన్నెన్ని రకాలుగా ప్రయోగించ వచ్చో వేటూరికి తెలిసినంత బాగా మరో కవికి తెలీదేమో. 'వంశ' ధార అన్న కొంటె ప్రయోగం మీద పూర్తి పేటెంటు వేటూరిదే.  హాయిగా సాగే రాగంలా వలపు మొదలయ్యింది. ఆ ప్రేమ, పెళ్ళికి దారితీయడం, అటుపై నాయికా నాయకులిద్దరూ పరిపూర్ణ జీవితాన్ని ఊహించుకోవడం చరణాల్లో వినిపిస్తుంది.  

"ఏ స్వప్న లోకాల ఆలాపన..
సంసార సుఖవీణ తొలికీర్తన.. 

బృందా విహారాల ఆరాధన..
నా ప్రాణ హారాల విరులల్లనా.. 

మురళికే చలి చెలి ప్రియా..
మరునికే గుడి మహాశయా.. 

కిసలయా ధ్వనే శ్రుతి లయ..
మదన మోహనా మృదంగ
తకధిమి తాళాలెన్నో రేగే... "

సంసార వీణ అనడం తెలుసు కానీ, దానికి సుఖాన్ని జోడించారు వేటూరి. ప్రేమ జంటకి పెళ్ళైన తొలిరోజులు కదా మరి. బృందావిహారాలు (హనీమూన్) కూడా అందుకే. మామూలుగా విరులతో (పువ్వులతో) హారాలు అల్లుతారు. కానీ, నాయిక చేత 'నా ప్రాణ హారాల విరులల్లనా" అని పలికించారు. బృందావనాన్ని కృష్ణుడితో ముడిపెట్టి "మురళికే చలి చెలి ప్రియా" అని అతని చేత అనిపించి, "మరునికే గుడి మహాశయా" అని ఆమెచేత బదులిప్పించారు. హనీమూన్లో ప్రధాన పాత్ర మరునిదే (మన్మధుడు) మరి. ఆ మరుని వాహనం చిలుక, ఆ చిలుక పలికే పలుకులు కిసలయలు. "మదనమోహనా మృదంగ తకధిమి తాళాలెన్నో" రేగడాన్ని గురించి ఇక్కడ వివరించబూనుకోవడం సభామర్యాద అనిపించుకోదు. 

"ఈ రీతి నీ బంటునై ఉండనా.. 
నీ సీతనై ఇంట కొలువుండనా..
బంటురీతి కొలువు
ఇయ్యవయ్య రామా.. 

త్యాగయ్య పాడింది హరి కీర్తన..
నీ పాట నా ఇంటి సిరి నర్తన..
కనులకే ఇలా స్వయంవరం..
గృహిణితో కదా ఇహం పరం.. 

కలయికే సదా మనోహరం.. 
స్వరస వాహినీ తరంగ
కథకళి లాస్యాలెన్నో రేగే..."
  

రెండో చరణానికి వచ్చేసరికి హనీమూన్ ముగిసి సంసారంలో పడ్డారు దంపతులు. అందుకే, "ఈ రీతి నీ బంటునై ఉండనా.. నీ సీతనై ఇంట కొలువుండనా.. బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామా.. " అని పాడుతుంది నాయిక. ఈమె మరీ త్రేతాయుగం మనిషి (సినిమాలో వాణి విశ్వనాధ్ ఆహార్యం, పాత్రచిత్రణ కూడా ఇందుకు తగ్గట్టే ఉంటాయి). శాస్త్రీయ సంగీతాభిమానులకి  'హంసనాదం'  అనగానే గుర్తొచ్చే త్యాగయ్య కీర్తనని సందర్భోచితంగా సాహిత్యంలో జోడించడం కవిగా వేటూరి ప్రతిభకి తార్కాణం. నాయకుడూ ఆ కాలం వాడే, కాబట్టే 'నువ్వు పాడితే నా  ఇంట్లో లక్ష్మీదేవి నర్తిస్తుంది' అని జవాబిచ్చాడు. 

సీతారాముల ప్రస్తావన వచ్చింది కనుక, ఆ వెనుకే స్వయంవర దృశ్యం, ఏకపత్నీవ్రతం కూడా వచ్చేశాయి సాహిత్యంలోకి. పెళ్ళైన కొత్తల్లో ఉండే 'తకధిమి తాళాలు' తర్వాతి కాలంలో 'కథకళి లాస్యాలు' గా మారే సహజ పరిణామాన్ని అలవోకగా చెప్పేసినందుకు మరోమారు నచ్చేశారు వేటూరి. వాసూరావు ట్యూన్ వినిపించి, సందర్భం చెబితే కేవలం నాలుగు గంటల్లో పాట రాసి చేతిలో పెట్టారట. బాలూ, చిత్ర పాడిన తీరు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా ఉంటుంది. సురేష్, వాణి విశ్వనాధ్ ల మీద సంసారపక్షంగానే  చిత్రించారు జంధ్యాల.