మంగళవారం, జూన్ 30, 2009

మేఘమా...

ఆకాశంలో గుంపులుగా సాగే మేఘాలనీ, మేఘాల మధ్య మెరిసే మెరుపులనీ చూడాలని ఉంది.. చల్లని మలయ మారుతాన్ని ఆస్వాదించాలనీ, తొలకరిని ఆహ్వానిస్తూ నేల తల్లి వెలువరించే సుగంధాన్ని ఆఘ్రాణించాలనీ ఉంది..వర్షపు చినుకుల సవ్వడిని వినాలనీ, ఆగకుండా కురిసే వానలో తనివితీరా తడవాలనీ ఉంది.. కానీ వర్షం ఎక్కడ?

పాటలు వింటుంటే 'ఆషాఢ మాసాన ఆనీలి గగనాన మేఘాల రాగాల ఆలాపన' అని బాలూ గొంతు ఆర్తిగా వినిపించింది.. హరిప్రసాద్ చౌరాసియా వేణువు 'సిరివెన్నెల' కురిపించింది. ఆషాఢ లో పావు భాగం పూర్తయ్యింది కానీ నీలి మేఘపు ఆలాపన ఇంకా మొదలవ్వ లేదు..తొలి తొలి తొలకరి ఇంకా చినుకుని చిలక లేదు.. పుడమికి పులకల మొలకల పిలుపు ఇంకా అందలేదు.

మామూలుగానే వేసవి యెంతో సుదీర్ఘంగా అనిపిస్తుంది.. మామిడి పళ్ళనీ, మల్లెపూలనీ ఇచ్చినందుకు, చిన్నప్పుడైతే బడికి సెలవలు తెచ్చినందుకూ వేసవిని క్షమించొచ్చు.. ఐతే మాత్రం మరీ ఇంతంత ఎండలా? అది కూడా ఇన్ని రోజులు? పాతకాలపు అత్తింటి కొత్తల్లుడిలా వేసవి ఇలా వెళ్ళకుండా ఉండిపోతే భరించేదెలాగా? వచ్చిన పని చూసుకుని మర్యాదగా వెళ్లిపోవాలి కదా?

అయినా మేఘానిది ఇంత రాతి గుండె అనుకోలేదు.. మల్లి మనసు బావకి తెలిపింది కదా.. మమతలెరిగిందే అనుకున్నాం.. ఉత్తరాన ఉరుముతుందని తొలకరి కురుస్తుందనీ ఎదురు చూశాం.. కానీ ఎన్నాళ్ళీ దోబూచులాట? ఎవరిమీదీ అలక? వేళ మించిపోతోందని మర్చిపోయావా మేఘమా? ఆబాలగోపాలమూ నీ రాక కోసం ఆశగా ఎదురుచూస్తోందని తెలియదా నీకు?

ఎండల బాధ అటుంచి, పడమటి దిక్కున వరరగుడెయ్యక పొతే ఏరువాక సాగేదెలా? రైతుల కష్టం తీరేదెలా? వేళకి వానలు కురవకపోతే తాగడానికి గుక్కెడు నీళ్ళైనా దొరకవు కదా? పొగలు కక్కుతున్న నేల చల్లారకపోతే రోగాలు ప్రబలవూ? అన్నీ తెలిసి, ఏమీ తెలియని నంగనాచిలా ప్రవర్తిస్తుందేమిటీ మేఘం? అసలు ఏం చేద్దామనుకుంటోంది? వానలా కరగకుండా ఎందుకు ఆగుతోంది?

తనకి పార్టీ కండువా కప్పినందుకు వరుణ దేవుడు అలిగాడనుకోవాలా? అందుకే వర్షాన్ని కురిపించడం లేదా? కండువా కప్పి చాలా రోజులయ్యింది కదా..ఇప్పుడెందుకు అలిగినట్టు? అయినా పొలిటీషియన్స్ ఒపీనియన్స్ ని చేంజ్ చేసుకుంటారని ఆయనకి మాత్రం తెలియదా? అయినా నాయకులేదో అన్నారని ప్రజల్ని శిక్షించడం న్యాయమా? ఆకాశం ఎప్పుడు ఉరుముతుందో.. మేఘం ఎప్పుడు కరుగుతుందో.. ఎన్నాళ్ళు ఎదురుచూడాలో....

శుక్రవారం, జూన్ 19, 2009

'వంద'నాలు

"అసలు నేను ఎన్ని టపాలు రాయగలను? మహా ఐతే ఓ పాతికో ముప్ఫయ్యో.. ఇందుకోసం ఓ బ్లాగు మొదలు పెట్టడం అవసరమా?" ఓ బ్లాగు వాడిని అవ్వాలన్న పురుగు నా బుర్రలో ప్రవేశించినప్పుడు దానిని తరమడం కోసం నేను వెతుక్కున్న అనేకానేక కారణాలలో ఇదీ ఒకటి. ఇది జనవరి మూడో వారంలో జరిగిన ముచ్చట. చివరికి ఆ పురుగు గెలవడం నేను బ్లాగడం మొదలు పెట్టడం జరిగింది.

ప్రారంభంలో అన్నీ సందేహాలే.. ఏం రాయాలి? ఎలా రాయాలి? అన్న విషయంలో కాదు.. ఎలా పోస్టు చేయాలి? సెట్టింగులలో ఏ మార్పులు చేసుకోవాలి? కూడలి, జల్లెడలకి లంకె వేయడం ఎలా? సలహా చెప్పే వాళ్ళెవరూ లేరు. నా మిత్రులెవరికీ బ్లాగుల గురించి తెలియదు.. అప్పటికే కొన్ని బ్లాగులు చదివినా ఆ బ్లాగర్లతో ఎలాంటి పరిచయం లేదు. 'ముందు మొదలు పెడదాం..అన్నీ అవే అర్ధమవుతాయి' అనుకున్నా.

గ్రీక్ అండ్ లాటిన్ లా అనిపించిన బ్లాగర్ గైడ్ నాలుగైదు సార్లు చదివి, అప్పటికే ఉన్న జిమెయిల్ ఐడీ సాయంతో బ్లాగు మొదలు పెట్టేశా..జల్లెడ, కూడలి తెలుసు కాబట్టి వాటిల్లో బ్లాగుని లంకె వేయమన్న చోట లంకె వేశా.. తదుపరి కర్తవ్యం? ...వీవెన్ గారినుంచి మెయిల్ వచ్చింది, బ్లాగుని స్వీకరిస్తున్నట్టు. నీళ్ళలో కొట్టుకుపోతున్న వాడికి గడ్డిపోచ దొరికిన ఫీలింగ్. ఇక ఆయన్ని మెయిళ్ళతో విసిగించడం మొదలు పెట్టాను.

ప్రతి టపాకీ లంకె వేయాలా? వేరే వెబ్సైట్ల లంకెలు ఇవ్వడం ఎలా? ఇలాంటి సందేహాలు. ఆయన చాలా ఓపిగ్గా స్పందించారు. ధన్యవాదాలు వీవెన్ గారూ.. నా రాతలతో జనాల తలరాతలు మార్చెయ్యాలి లాంటి అజెండాలు ఏవీ లేవు కాబట్టి ఫలానా విషయాలు మాత్రమే రాయాలి అని అనుకోలేదు. ఇది నా డైరీ.. కాకపొతే మరికొందరు చదివేందుకు అందుబాటులో ఉంచుతున్నాను.. వాళ్ళని నొప్పించకుండా ఉంటే చాలు.. అప్పుడూ ఇప్పుడూ నా అభిప్రాయం ఇదే.

బ్లాగు లోకం యావత్తూ నా బ్లాగు ముందు క్యూలు కట్టాలని కోరుకోలేదు కానీ, అసలు ఎవరైనా నా బ్లాగు చూస్తున్నారా అన్న కుతూహలం.. ఒకరిద్దరితో మొదలైన స్పందన నెమ్మదిగా పెరిగింది. టెక్నికల్ విషయాలకి సంబంధించి బ్లాగరు 'మధురవాణి' కొన్ని సూచనలు చేశారు. అప్పుడప్పుడూ వ్యాఖ్యలతో పలకరించేవారు. తర్వాత 'అనంతం' ఉమాశంకర్ గారు, 'కొత్తపాళీ' గారు పరిచయమయ్యారు. 'మృచ్చకటికం' సంస్కృత నాటకం చదవగలిగానంటే అది బ్లాగు వల్లే.

నీళ్ళు లేక ఎండిపోతున్న మా గోదారిని తల్చుకుని నేను రాసిన టపా 'చీకట్లో గోదారి.' ఇలా మొదలు పెట్టాలి, ఇలా ముగించాలి లాంటివి ఏమీ అనుకోకుండా అలా అలా రాసుకుంటూ వెళ్ళిపోయాను..పావు గంటలో రాయడం పూర్తయ్యింది. ఇప్పటికీ ఆశ్చర్యమే.. ఇది నేనే రాశానా? అని. 'మీలో చాలా భావుకత ఉంది' అని వ్యాఖ్య రాశారు 'మనసులో మాట' సుజాత గారు. నేను నాకు కొత్తగా పరిచయం అయ్యాను..బ్లాగు వల్ల.

'పరిమళం' గారు 'పద్మార్పిత' గారు 'హిమబిందువులు' చిన్ని గారు ఇలా ఒక్కొక్కరే పలకరించడం మొదలు పెట్టారు. బ్లాగు ద్వారానే 'నిషిగంధ' ఆవిడ కవిత్వం ఇంకా 'కౌముది' అలాగే 'స్నేహమా' రాధిక గారి కవితలూ పరిచయమయ్యాయి. 'పర్ణశాల' కత్తి మహేష్ కుమార్, 'విశ్వామిత్ర' శ్రీనివాస్ పప్పు, 'నాన్న' భాస్కర్ రామరాజు, 'హృదయస్పందనల చిరు సవ్వడి' భాస్కర్ రామి రెడ్డి, 'ఏటిగట్టు' శేఖర్ పెద్దగోపు, 'జాజిపూలు' నేస్తం, 'సరిగమలు' సిరిసిరిమువ్వ, 'చైతన్యం' చైతన్య 'నాబ్లాగు' సునీత, 'మరువం' ఉష, 'కృష్ణ పక్షం' భావన, 'నేను-లక్ష్మి' లక్ష్మి గార్లు అప్పుడపుడూ పలకరించే అతిధులు.

కొన్నాళ్ళకి 'చిన్నమాట' భవాని, 'నాలోనేను' మేధ, 'అరుణమ్' అరుణ పప్పు, 'నాతోనేను నాగురించి' వేణూ శ్రీకాంత్ 'అక్షరాపేక్ష' మెహర్ గార్లూ ఇంకా మరికొందరు బ్లాగర్లూ, బ్లాగు పాఠకులూ ఓ లుక్కేయ్యడం మొదలుపెట్టారు. నా స్నేహితుల్లో నేనో బ్లాగు రాస్తానని తెలిసిన వాళ్ళు కేవలం నలుగురు. వారిలో ఒకరు ఇప్పటివరకూ నా బ్లాగుని చూడలేదు. మిగిలిన ముగ్గురిలో ఇద్దరు మాత్రం క్రమం తప్పకుండా చదువుతూ అభిప్రాయాలు చెబుతున్నారు.. గడిచిన ఐదు నెలల కాలంలో అనేకమంది బ్లాగ్మిత్రులని సంపాదించుకోవడం చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తోంది.

నా బాల్యం, నేను చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు, అప్పుడప్పుడు నన్ను వెంటాడే ఆలోచనలు ఇవన్నీ పదిమందితో పంచుకోడానికి, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొడానికి వేదిక కల్పించింది నా బ్లాగు. చాలా రోజుల క్రితం చదివి దాచుకున్న పుస్తకాలూ, చాలా ఏళ్ళ క్రితం చదివిన కథలూ బ్లాగు కోసం మళ్ళీ చదవడంలో ఆనందాన్ని అనుభవించాను. 'అమ్మ చెప్పిన కబుర్ల'ని గుర్తు చేసుకున్నాను. బ్లాగ్మిత్రుల ద్వారా చదవాల్సిన పుస్తకాల గురించి, చూడాల్సిన సినిమాలగురించితెలుసుకున్నాను. 'నవతరంగం' నాకు బ్లాగుల్ని పరిచయం చేస్తే, బ్లాగు నన్ను 'పుస్తకం' కి పరిచయం చేసింది.

ఓ రోజు ఉదయాన్నే నా బ్లాగుని గురించి పరిచయ వ్యాసం ప్రచురించింది 'ఈనాడు.' ఆ పత్రిక చదివే వాళ్ళలో బ్లాగుల గురించి తెలిసిన వాళ్ళందరి దృష్టికీ వెళ్ళింది నా బ్లాగు. అతిధులూ, మిత్రులూ ఒక్కసారిగా పెరిగారు. ఏ బ్లాగరికైనా ఇది సంతోషం కలిగించే పరిణామమే..ఇలాంటివి అస్సలు ఊహించని నాకు ఇదో పెద్ద సర్ప్రైజ్. మిత్రులు తమ బ్లాగుల్లోనూ, నా బ్లాగులోనూ అభినందనలు కురిపించారు. సర్వదా కృతజ్ఞుడిని. కొత్తగా పరిచయమైన బ్లాగ్మిత్రులు పాత టపాలు చదివి అభిప్రాయాలు చెబుతున్నారు. బ్లాగు చదువుతున్న, అభిప్రాయాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా వందనాలు.

నేను ఎలాంటి ప్రణాళికా లేకుండా మొదలు పెట్టానీ బ్లాగుని.. నాకు ఏ విషయాన్ని గురించి రాసుకోవాలనిపిస్తే ఆ విషయాన్ని రాస్తూ ఇప్పటికి వంద టపాలు పూర్తి చేశాను. ఇది నా గమ్యం కాదు, ఒక మజిలీ. నా అక్షరాలు ప్రజా శక్తులవహించే విజయ ఐరావతాలు కాదు..వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలూ కాదు.. అయినా ఇవంటే నాకు ఇష్టం.. ఎందుకంటే ఇవి 'నా' అక్షరాలు కాబట్టి. ఇంకా ఎన్ని టపాలు రాస్తాను అన్న సందేహం ఇప్పుడు నాకు లేదు.. ఎందుకంటే రాయాలనిపించి నన్నాళ్ళు, పంచుకునేందుకు కబుర్లు ఉన్నన్నాళ్ళు రాస్తూనే ఉంటాను. ప్రస్తుతానికి మాత్రం ఒక చిన్న విరామం.. అతి త్వరలోనే మళ్ళీ కలుస్తాను.

మంగళవారం, జూన్ 16, 2009

నాయికలు-అనూరాధ

పెళ్ళయిన తర్వాత ఆడపిల్ల అప్పటి వరకూ తను గడిపిన జీవితాన్ని శూన్యం చేసుకోవాలా? అప్పుడు మాత్రమే కొత్త మనుష్యుల మధ్య, కొత్త వాతావరణం లో తను ఏ ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా ఉండగలుగుతుందా? అత్తవారింట్లో అడుగుపెట్టి, అక్కడ ఇమడలేక ఇబ్బంది పడుతున్న అనూరాధ మనస్సులో జరిగిన సంఘర్షణ ఇది. తన తప్పేమీ లేకుండానే అత్తగారికి తను శత్రువుగా ఎందుకు మారింది? ఆమెతో స్నేహం సాధ్యమేనా? ఇవి అనూరాధను తొలిచేసిన ప్రశ్నలు.

ఉమ్మడి కుటుంబ వాతావరణాన్ని, వ్యవసాయ రంగ సంక్షోభాన్ని నేపధ్యంగా తీసుకుని చంద్రలత రాసిన 'రేగడి విత్తులు' నవలలో ఓ ప్రధాన పాత్ర అనూరాధ. నవలలో ప్రధాన పాత్ర రామనాధం చెల్లెలు దమయంతి కూతురు ఈమె. అనూరాధ పసిపిల్ల గా ఉండగానే ఆమె తల్లిదండ్రులూ ఓ పడవ ప్రమాదం లో మరణించడంతో మేనమామ ఇంట పెరుగుతుంది. రామనాధం కొడుకు సుధాకర్ ని అనూరాధకి ఇచ్చి చేయాలని పిల్లల చిన్నప్పుడే పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు.

గుంటూరు జిల్లా రేపల్లె ప్రాంతానికి చెందిన రామనాధం, వ్యవసాయం మీద మక్కువతో ఉద్యోగం వదిలి మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డలో నల్లరేగడి నేల కొని వ్యవసాయం మొదలు పెడతాడు. తోటి రైతు బాలయ్య కొడుకు మల్లేష్ ను సుధాకర్ తో పాటే పట్నంలో ఉంచి చదివిస్తాడు. తొలి చూపులోనే ప్రేమలో పడతారు అనూరాధ-మల్లేష్ లు. బావని తన భర్త గా ఊహించుకోలేక పోతున్నానని మేనమామకి చెబుతుంది అనూరాధ. ఆమె మనసెరిగిన రామనాధం మల్లేష్ తో ఆమె వివాహం జరిపిస్తాడు.

రెండు ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాల సంగమం ఆ వివాహం. ఒకరి పద్ధతులు, ఆచారాలు మరొకరికి పూర్తిగా కొత్త. ఇరు వర్గాల పురోహితులూ ఇరువైపుల పద్ధతులూ పాటిస్తూ జరిపిస్తారు వివాహాన్ని. రచయిత్రి నవలలో సుదీర్ఘంగా రాసిన సన్నివేశాలలో ఈ వివాహం ఒకటి. ఈనవలలో నాకు చాలా ఇష్టమైన సన్నివేశం ఇది. ప్రధానం మొదలు అప్పగింతల వరకు ప్రతి తంతునీ వర్ణించారు చంద్రలత. మల్లేష్ తల్లి నారాయణి కి తన మేనకోడలిని కలుపుకోవాలని ఉన్నా, కొడుకు ఇష్టాన్ని మన్నిస్తుంది. కోడలు తనకి నచ్చినా, 'చదువుకున్న పిల్ల' అనే భయమూ ఉంటుంది.

పెళ్లి తర్వాత మల్లేష్ పై చదువు కోసం పట్నం వెళ్ళడంతో అత్తవారింట సమస్యలు మొదలవుతాయి అనూరాధకి. తను వరి అన్నం తిని పెరిగింది. అత్తవారింట తినేది జొన్న రొట్టెలు. పుట్టింట వంటలో వాడేది ఎండు మిరపకాయ కారం, అత్తవారి ఇంట్లో రొట్టెల్లోకి పచ్చిమిరపకాయ నూరిన మసాలా కూరలు తప్పనిసరి. పుట్టింట వంట మట్టిపాత్రల్లో, ఇక్కడ ఇత్తడి, కంచు గిన్నెలతో. అప్పుడప్పుడూ వచ్చి వెళ్ళే భర్తకి తన సమస్యలు చెప్పుకోలేదు, పుట్టింటివారికి చెప్పి వాళ్ళని బాధ పెట్టలేదు. ఇంట్లోనే ఓ గదిలో పశువులని కట్టేసే అలవాటు (దొంగల భయం వల్ల) ఉండడంతో సరైన గాలి కూడా ఉండదు రాత్రిళ్ళు.

వీటన్నింటికన్నా పెద్ద సమస్య అత్తగారికి కోడలి పట్ల మొదలైన అసహనం. కోడలు నెల తప్పకపోవడం అవమానంగా భావిస్తుంది నారాయణి. జీవితంలో సెటిల్ అయ్యాకే పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంటారు భార్యాభర్తలు. అత్తగారి ఆశ కోడలికి, కొడుకు-కోడలి నిర్ణయం అత్తగారికి తెలియక పోవడం వల్ల ఏర్పడ్డ కమ్యునికేషన్ గ్యాప్. గుళ్ళు, గోపురాలు తిప్పుతూ, మొక్కులు మొక్కుతూ వాటిని కోడలి చేత తీర్పిస్తూ ఉంటుంది నారాయణి. తనకి ఎన్నడూ తెలియని ఆ ఆచారాలు పాటించలేక, అత్తగారికి ఎదురు చెప్పలేక, అసలు తను అవన్నీ ఎందుకు చెయ్యాలో తెలియక నలిగిపోతూ ఉంటుంది అనూరాధ.

అత్తగారి అసహనానికీ, మొక్కులకీ కారణం తెలిసిన రోజున పగిలిన అగ్ని పర్వతమే అవుతుంది అనూరాధ. ఆమె పరంగా అత్తగారికీ తనకీ మధ్య పూడ్చలేని అగాధమే ఏర్పడుతుంది. మల్లేష్ చదువు పూర్తయ్యాక అనూరాధ నెలతప్పడంతో ఆమెని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోడం మొదలు పెడుతుంది నారాయణి. ఒకప్పటి ఆమె అసహనానికీ, ఇప్పటి ప్రేమకీ భేదం కనిపించదు అనూరాధకి.

పురిటికి పుట్టింటికి వెళ్ళినప్పుడు తన సమస్యని మేనమాకి చెప్పుకుంటుంది ఆమె. "నువ్వు నువ్వుగా ఉండు. అలా ఉంటూనే ఎదుటి వాళ్ళలో మార్పు కోసం ప్రయత్నించు. చిత్తశుద్ధితో నువ్వు చేసే ప్రయత్నం ఫలితం ఇస్తుంది. ఏం చేయాలన్నది నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం" అంటాడు రామనాధం. నవల ముగింపుకి వచ్చేసరికి అత్తగారితో సయోధ్య సాధిస్తుంది అనూరాధ.

శుక్రవారం, జూన్ 12, 2009

గంట మోగింది

చాలా రోజుల తరువాత వీధిలో ఉదయపు కోలాహలం మొదలయ్యింది. ఎనిమిదయ్యిందో లేదో ఆటోలు వచ్చేశాయి. బద్ధకానికి అలవాటు పడ్డ పిల్లలు ఒక్కసారి పాతరోజులు గుర్తు చేసుకుని "ఫైవ్ మినిట్స్" అంటూ ఆటో అంకుల్ ని బతిమాలుకున్నారు. యూనిఫాం, బ్యాగ్, షూస్, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అన్నీ కొత్తవే. అమ్మకీ నాన్నకీ బై చెప్పేసి హడావిడిగా ఆటో ఎక్కేశారు.

దాదాపు నెలన్నర వేసవి సెలవుల తర్వాత స్కూళ్ళు తెరిచారు. చిట్టి తల్లులకీ, బుజ్జి నాన్నలకీ అర్ధరాత్రి వరకూ టీవీ చూడడానికీ, బారెడు పొద్దెక్కే వరకూ మంచం దిగకుండా మారాం చేయడానికీ ఇంక అవకాశం లేదు. 'పొద్దున్న మనము లేవాలి' పద్యం వచ్చినా, రాకపోయినా ఆ ప్రకారం నడుచుకోవాల్సిందే. అధికారికంగా స్కూళ్ళు తెరవాల్సింది ఇవాళే అయినా, చాలా కాన్వెంట్లలో ఈసరికే పాఠాలు మొదలైపోయాయి. ఏవో కొన్ని ప్రైవేటు స్కూళ్ళు మాత్రం ఇవాల్టివరకూ ఓపికపట్టాయి. ఈ పిల్లలకి ఇంక చదువుకి తప్ప వేరే ఎందుకూ టైం దొరకదు, మళ్ళీ వేసవి వరకూ.

సర్కారు స్కూళ్ళ విద్యార్ధులకి ఎప్పటిలాగే సమస్యలు స్వాగతం చెబుతున్నాయి. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా పాఠ్య పుస్తకాలింకా సిద్ధం కాలేదు. కొన్ని ప్రింటింగ్ దశలో ఉండగా, మరి కొన్ని ఇంకా శ్రీకారం దగ్గరే ఉన్నాయని సర్కారీ పత్రిక మొదటి పేజిలో ప్రకటించింది. కర్ణుడి చావుకి ఉన్నన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న డీఎస్సీ పరీక్ష ఎట్టకేలకి మొన్ననే పూర్తయ్యింది. పిల్లల అదృష్టం బాగుండి అన్నీ సక్రమంగా జరిగితే ఏ అర్ధ సంవత్సర పరిక్షల నాటికో కొత్త మేష్టార్లు స్కూళ్ళకి చేరతారు.

చెట్ల కిందే పాఠాలు చెప్పే ఆధునిక గురుకులాల్లో చదువుతున్న పిల్లలకి ఈ సంవత్సరం కూడా 'వానాకాలం చదువు' తప్పక పోవచ్చు. తరగతి గదులు కట్టడం కోసం ప్రభుత్వం 'సర్వ శిక్ష అభియాన్' కింద నిధులు విడుదల చేసింది. పిల్లలకి తరగతి గదిలో కూర్చుని పాఠాలు వినే అదృష్టం లేకపోవడం వల్ల ఆ నిధులు కాస్తా రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిపోయాయి. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించి పధకం పేరు 'రాజీవ్ విద్యా మిషన్' అని మార్చేసింది. పేరు బలం గొప్పదైతే ఈసారి పిల్లలకేమైనా మేలు జరగొచ్చు.

ఈమాత్రం చదువుకి కూడా నోచుకోని పిల్లలున్నారు. వాళ్ళకోసం ఐక్యరాజ్య సమితి ఇవాల్టి రోజుని 'బాలకార్మిక వ్యతిరేక దినం' గా జరుపుతోంది. ఇళ్ళలోనూ, పొలాల్లోనూ, హోటళ్ళ లోనూ ఇంకా శివకాశి లాంటి చోట్లా రూపాయికీ రెండు రూపాయలకీ కూలీ చేస్తున్న యెంత మంది పిల్లలకి ఇవాళ తమ రోజు అన్న సంగతి తెలుసో? ఇలాంటి పిల్లలు ఎందరు ఉన్నారు? అని అడగడం పాపం. సర్కారు ఒక లెక్క, స్వచ్చంద సంస్థలు మరో లెక్కా చూపిస్తాయి. 'సర్కారు పరువు పోతుందనే భయంతో తక్కువ లెక్క చూపుతోంది' అంటాయి స్వచ్చంద సంస్థలు. 'సంస్థలే ప్రాజెక్టుల నిధుల కోసం పిల్లల సంఖ్యని ఎక్కువ చేస్తున్నాయి' అంటుంది సర్కారు. ఈ లెక్క తేలేది కాదు.

వీళ్ళందరి గొడవా మనమెక్కడ పట్టించుకోగలం? ఎవరి అదృష్టం వాళ్ళది. ప్రైవేటు స్కూళ్ళు ఇంత చక్కగా చదువు చెబుతోంటే ప్రభుత్వం స్కూళ్ళు నడపడం ఎందుకు? డబ్బు దండుగ.. తల్లిదండ్రులందరూ పిల్లల్ని స్కూళ్ళలో వెయ్యొచ్చు కదా..పనికి పంపడం ఎందుకు? అంత తిండి పెట్టలేని వాళ్ళు, చదివించలేని వాళ్ళు కనడం ఎందుకో? ఏం.. మనం మన పిల్లల్ని చదివించడం లేదూ... పాపం ప్రభుత్వం మాత్రం ఎన్నని చేస్తుంది? దానికెన్నెన్నిపనులూ.....

గురువారం, జూన్ 11, 2009

అతడి భార్య

"పెళ్ళికి పునాది నమ్మకం, గౌరవం.." ముళ్ళపూడి వెంకట రమణ 'పెళ్ళిపుస్తకం' సినిమా కోసం రాసిన డైలాగు ఇది. భార్యా భర్తలిద్దరికీ ఒకరిమీద ఒకరికి నమ్మకం, గౌరవం ఉన్నప్పుడే వివాహ బంధం బలంగా ఉంటుందని వివరిస్తారు ముళ్ళపూడి. మరి.. అతను తన చేతల ద్వారా ఆమె నమ్మకాన్నీ, ఆమెకి తనమీద గల గౌరవాన్నీ కోల్పోతే? ఇదే అంశాన్ని వస్తువుగా తీసుకుని ఎన్. శ్రీలలిత రాసిన కథ 'అతడి భార్య.'

'ఒక కొత్త రచయిత్రి రాసిన తొలి కథ ఇది' అనే ప్రకటనతో ఆదివారం ఆంధ్రజ్యోతి ఐదేళ్ళ క్రితం ప్రచురించిన ఈ కథకి నేపధ్యం హెచ్.ఐ.వీ. అతనూ, ఆమె ఇద్దరూ చదువుకున్న వాళ్ళు. అతను మంచి ఉద్యోగం లో ఉన్నాడు. తొమ్మిదేళ్ళ క్రితం పెళ్ళయ్యింది. పెళ్ళయిన రెండేళ్ళకి బాలింత గా ఉన్న ఆమెకి భర్త నుంచి సుఖవ్యాధి సంక్రమిస్తుంది. ఆమె సూటిగా అడగడాన్ని అతను భరించలేక పోతాడు.

భర్త తో గడవ పొడిగిస్తే ఏం జరుగుతుందో ఆమెకి తెలుసు కాబట్టి మౌనం వహిస్తుంది. ఇద్దరిమధ్యా దూరం మొదలవుతుంది. అతని వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు. అతన్ని మార్చడానికి ఆమె చెయ్యని ప్రయత్నం లేదు. "అసలందరూ వయసు రాగానే, అర్హత రాగానే పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే ఈ సెక్స్ వర్కర్లు ఎందుకున్నారు?" ఆమె ఆలోచన, ఆవేదన. మరో ఆరేళ్ల తర్వాత అతను హెచ్.ఐ.వీ. పాజిటివ్ అని చెబుతారు డాక్టర్లు.

ఈ షాక్ నుంచి తేరుకోడానికి మూడు నెలలు పడుతుందామెకి. తనకంటూ ఉన్న పెద్ద దిక్కు పెద్దక్క దగ్గరికి వెళ్లి విషయం చెబుతూనే భోరుమంటుందామె. "లెటజ్ కంపేర్ విత్ ద లీస్ట్. ఇన్నాళ్ళూ నీకూ, పిల్లలకూ ఆయనేం లోటు చేయలేదు కదా. ఇప్పుడెలాగూ ఆరోగ్య పరంగా నువ్వూ, పిల్లలూ సేఫ్. అనుకోని పరిణామాలు ఎదురైనప్పుడు నీ పీజీ డిగ్రీ నీకెలాగూ ఉంది. నీకు మేమంతా ఉన్నాం. ఇక అతని ఖర్మకి అతన్నొదిలేయ్," అని ఊరడిస్తుంది అక్క.

ఇంట్లో అత్తగారిదీ అదే మాట.. "వాడి ఖర్మదీ.. ఎవరు చేసుకున్న దానికి వారనుభవించక తప్పదనీ.. మనం చూస్తూ ఉండడమే.." అతనికి బుద్ది చెప్పడం కోసం ఇంట్లో వాళ్ళ చేత సహాయ నిరాకరణ చేయించే ప్రయత్నం చేస్తుందామె. అత్తగారు పార్టీ ఫిరాయిస్తుంది. "నీకు శరీరాన్ని కాపాడుకోవడం రాదు. ఇంట్లో లేకపోయాక బయటకెళ్ళక తప్పదు. అయినా నా జీవితం నా ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి?" అతని జవాబు. కనీసం అతనితో తిరిగే ఆడవాళ్ళకి అతను హెచ్.ఐ.వీ అని చెప్పాలనుకుంటుంది. "మీరు చాలా కనస్ట్రక్టివ్ గా అబద్ధాలు చెబుతారనుకుంటా.." అంటూ వస్తుంది స్పందన.

ఉన్నట్టుండి అతనికి సీరియస్ అవ్వడంతో హాస్పిటల్ లో చేర్పిస్తుందామె. "కుటుంబ మనుగడ కోసం కాలంతో సమానంగా పరుగులు తీస్తూ విశ్రాంతి ఎరుగని శరీరంలో సంవత్సరంగా చిక్కి శల్యమైనట్టుగా మార్పులు జరుగుతున్నా భార్యనైన నాకే తెలియలేదు. అమ్మని పూర్తిగా మరచి ఏ ఒడిలో నిద్రపోయానో, ఎవరికి ఒక్క రోజు జ్వరం వచ్చినా కాళ్ళు పడుతూ, కంగారు పడుతూ రోజంతా సేవలు చేసి కాపాడుకున్నానో ఆ వ్యక్తి ఇవాళ నాకు 'అతను' గా మారిపోయాడు. ఏదైనా మిరకిల్ జరిగి కాలం వెనక్కి జరిగిపోతే యెంత బాగుంటుంది..జస్ట్ నైన్ ఇయర్స్..ఏవీ ఆ ప్రేమ, భద్రతా, ఆలంబన..నిశ్చింతా?"

హాస్పిటల్లో అతని 'చివరి బిల్' చెల్లించి బయట పడుతుందామె. ఇక ఎప్పటికీ ఎక్కడా బిల్ కట్టక్కరలేదు. "అతను భౌతికంగా, మానసికంగా నానుంచి చెరిగిపోయాడు..." హెచ్.ఐ.వీ. సోకిన వారికోసం పనిచేస్తున్న ఓ స్వచ్చంద సంస్థలో సభ్యురాలిగా చేరుతుందామె. "ఈ పని బాగుంది. ఓదార్పు.. ఈ భార్యకు, ఆ భార్యకు, ఎందరున్నారో తెలియని ఎందరో అతనుల భార్యలకు..."

బుధవారం, జూన్ 10, 2009

పదమూడో ఎక్కం

'పదమూడు' అని వినగానే చాలా మంది కంగారు పడతారు. ఎందుకో ఈ సంఖ్య అంత శుభసూచకం కాదని చాలామంది నమ్మకం. ఈ సంగతి నాకు తెలియడానికి చాలా రోజుల ముందే, అంటే నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడే 'పదమూడు' నాతో ఆడుకుంది. చాలా తిప్పలు పెట్టించింది..ఎన్నో దెబ్బలు కొట్టించింది. ఇది మరీ పెద్ద కథ ఏమీ కాదు. ఎక్కాల పుస్తకం అంత చిన్నదే..

చిన్నప్పుడు నాకు బళ్ళో చదువు కన్నా ఇంట్లో చదువు ఎక్కువగా ఉండేది. తాతయ్య చిన్న బాలశిక్ష నేర్పించి, బళ్ళో చేర్చి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇక నా చదువు బాధ్యత నాన్న చేతికి వచ్చింది. మామూలుగానే నాన్నకి సహనం కొంచం తక్కువ. తను చెప్పింది చెప్పినట్టు చెయ్యకపోతే విపరీతమైన కోపం వచ్చేది. అలా చేస్తే ఇంక నా గొప్పదనం ఏముంది?

తాతయ్య వేసిన పునాది పుణ్యమా అని ఒకటి, రెండు తరగతులు ఆడుతూ పాడుతూ గడిచి పోయాయి. మూడో తరగతి కి వచ్చేసరికి ఎక్కాల బాధ మొదలయ్యింది. ఓ రోజు సాయంత్రం నాన్న ఎక్కాల పుస్తకం తెచ్చి, దానికో అట్ట వేసి నా చేతికిచ్చారు. తెలుగు వాచకం కన్నా చాలా చాలా చిన్నది.. దీనిని చదవడం పెద్ద పనా? అనుకున్నాను. దిగితేనే కదా లోతు తెలిసేది!

ఒక రెండు రెండు.. రెండ్రెళ్ళు నాలుగు.. మూడ్రెళ్ళు ఆరు... మొదటి ఎక్కం కదా..సరదాగానే ఉంది. పన్నెండు రెళ్ళు ఇరవైనాలుగు వరకు అప్పచెబితే చాలు. ఇది కూడా రోజుకో ఎక్కం లెక్క కాదు. ఉన్నట్టుండి ఓ రోజు పొద్దున్నే నాన్నకి నా చదువు గురించి గుర్తొస్తుంది. 'ఎక్కాల పుస్తకం తియ్యరా' అంటారు. ఎక్కడివరకు వచ్చిందో అడిగి, ఏదో ఒక ప్రశ్న అడుగుతారు.. అంటే ఏ ఏడు రెళ్ళు యెంత అనో అన్నమాట.

సరిగ్గా సమాధానం చెబితే తర్వాతి ఎక్కం చదవమని ఆర్డరేసి బయటికి వెళ్తారు. తను బయటినుంచి రాగానే ముందుగా ఎక్కం అప్పచెప్పించుకుని కానీ మంచి నీళ్ళు కూడా తాగేవాళ్లు కాదు. పన్నెండైదులు అరవై  వరకు నల్లేరు మీద బండిలా సాగిపోయింది. నేను చాలా సులువుగా చదివేస్తున్నాన్న విషయం నాన్నకి అర్ధమై ఇంకో కొత్త పని అప్పచెప్పారు.

అప్పట్లో ఎక్కాల పుస్తకాలు ఎలా ఉండేవంటే, ఒక పేజి లో రెండు ఎక్కాలు, వాటికింద సుమతి, వేమన శతకాల నుంచి ఒక్కొక్క పద్యం ప్రచురించేవారు. ఎక్కం తో పాటు ఒక పద్యం కూడా చదవమని ఆర్డరు. చేసేదేముంది.. 'ఉప్పు కప్పురంబు..' 'కూరిమి గల దినములలో..' కూడా బట్టీ కొట్టడం, అప్పజెప్పడం. ఆరో ఎక్కం నుంచి సమస్యలు మొదలయ్యాయి. అప్పజెప్పడం లో తడబాట్లు రావడంతో..

నాన్న ఇంటికి రాగానే మంచి నీళ్ళ గ్లాసు, ఎక్కాల పుస్తకం, ఒక చీపురు పుల్ల పట్టికెళ్ళి ఇవ్వాలి. నీళ్ళు తాగగానే ఎక్కం అప్పచెప్పాలి (ఆయన మూడ్ ని బట్టి, ఒక్కోసారి తాగక ముందే). ఎక్కడైనా నట్టు పడిందంటే చీపురు పుల్ల కాలి మీద చురుక్కు మంటుంది. తప్పులు ఎక్కువయ్యాయంటే రెండోరోజూ అదే ఎక్కం చదవాలి. రెండోసారి కూడా తప్పులోస్తే చీపురు పుల్ల బదులు వెదురు పుల్ల అందుకునే వాళ్ళు. ఇది కొంచం గట్టిగా తగులుతుంది. దద్దురు కూడా బాగా తేలుతుంది.

రానురాను ఈ పద్యాలు నాకు తలనొప్పిగా తయారయ్యాయి. ఎక్కం తప్పుల్లేకుండా అప్పచెప్పానన్న ఆనందాన్ని పద్యం మింగేసేది. పన్నెండు పన్నెండ్లు నూట నలభై నాలుగు తో మూడో తరగతి పూర్తయ్యింది. నాలుగో తరగతిలో పదమూడో ఎక్కం. పైగా ఇరవై పదమూళ్ళు వరకు.. చీపురు పుల్ల, వెదురు బెత్తం అయిపోయాయి.. నిద్రగన్నేరు కొమ్మ వంతూ వచ్చింది. ఊదా రంగు అందమైన పూలు పూసే ఈ చెట్టులో నాకు నచ్చనిది కొమ్మే.

దెబ్బ కొంచం గట్టిగానే తగులుతుంది, పైగా దెబ్బ పడగానే మన చేతిమీదే కొమ్మ రెండుగా చీలిపోతుంది. సైకలాజికల్ గా 'చాలా గట్టి దెబ్బ' అనిపించేది. చేతిలో బెత్తంతో, ఎర్రటి పెద్ద కళ్ళతో నాన్నని చూడగానే సగం ఎక్కం మర్చిపోయే వాడిని. పద్నాలుగు పదమూళ్ళు దగ్గర కొన్నాళ్ళు, పదహారు పదమూళ్ళు దగ్గర కొన్నాళ్ళు ఆగాను. గజనీ దండయాత్రలు కొనసాగించి, మొత్తానికి ఓ మద్యాహ్నం వెక్కిళ్ళ మధ్య పదమూడో ఎక్కం అప్పచేప్పేశాను.

కానీ తర్వాత ఎప్పుడు లెక్కల్లో పదమూడో ఎక్కం అవసరం వచ్చినా పేజి లో పక్కన గుణకారం చేసుకోవాల్సి వచ్చేది, ఎక్కం గుర్తు రాక. అదేమిటో తెలీదు కాని పద్నాలుగు, పదిహేను ఎక్కాలు నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు. అక్కడితో నా ఎక్కాల చదువు ముగిసింది. మిగిలిన నాలుగు ఎక్కాలు చదివాను కాని, అప్పజెప్ప మని నాన్న అడగలేదు, నాకు నేనుగా అలాంటి ప్రయత్నం చెయ్యలేదు. తెలిసి తెలిసి అంత రిస్కు నేనెందుకు తీసుకుంటాను?

మంగళవారం, జూన్ 09, 2009

కావ్యా's డైరి

"కావ్యాస్ డైరీ బాగుందిట.. ముఖ్యంగా సెకండాఫ్.." ఫోన్ పెట్టేసే ముందు మిత్రుడు చెప్పిన మాట ఇది. మహేశ్ బాబు కూడా ఇదే మాట చెప్పాడు టీవీల్లోనూ, పేపర్లలోనూ.. అసలేముందీ సెకండాఫ్ లో.. తెలుసుకోవాలంటే మొదటి సగం కూడా చూడాల్సిందే కదా.. నాకు మహేశ్ బాబు మాట మీద కన్నా, నా మిత్రుడి మాటమీదే గురెక్కువ..ఫలితం.. చలో 'కావ్యా's డైరి'

నాకేంటో సినిమా మొదలవ్వక ముందే వెళ్లి థియేటర్లో కూర్చుంటే తప్ప సినిమా చూసినట్టుండదు. ముందు వేసే ప్రకటనలు కూడా మిస్సవ్వకుండా చూస్తాను. అలాంటిది నేను వెళ్ళేసరికే పట్టుచీరల షాపు వాళ్ళ ప్రకటన అయిపోయింది. ఇందిరా ప్రొడక్షన్స్ లోగో చూపించి వెంటనే ఓ నల్ల చొక్కా వేసుకున్న వాడిని వెనుకనుంచి చూపించారు.. సినిమా వాళ్లకి బోల్డన్ని సెంటిమెంట్లు కదా ఈ నల్ల చొక్కా ఏమిటీ, మొదటిదే బ్యాక్ షాట్ ఏమిటీ అని ఆలోచిస్తున్నానో లేదో కారు గుద్దేసి ఆ నల్ల చొక్కా వాడు చనిపోయాడు.. టైటిల్స్ మొదలయ్యాయి.

పూజ (మంజుల) ది 'రాగాలా సరాగాలా' టైపు సంసారం. భర్త రాజ్ సైంటిస్ట్. స్కూలుకెళ్ళే కూతురు, ఓ పదినెలల చంటోడు. వాళ్ళో విల్లా లోకి మారడం, కుక్కపిల్లని పెంచుకోవడం, పాట పాడుకోవడం...ఇలా సినిమాల్లో వాళ్లకి మాత్రమే సాధ్యమైన విధంగా ఆనందంగా జీవిస్తూ ఉండగా (అలాగే జీవిస్తే కథేముంది?సినిమా ఏముంది?) వాళ్ళ జీవితాల్లోకి కావ్య (చార్మి) ప్రవేశిస్తుంది, చంటోడికి ఆయాగా. కావ్య కనీస వివరాలైనా తెలుసుకోకుండా ఆమెకి ఇల్లప్పగించేసే అమాయకురాలు పూజ, ఆమెకి తగ్గవాడు రాజ్.

అన్నని చూడ్డానికొచ్చిన రాజ్ తమ్ముడు (శశాంక్ -- పేషెంట్ లా అయిపోయాడు) కావ్యతో ప్రేమలో పడతాడు. ఆమె డైరీ చదవడానికి ప్రయత్నించి భంగ పడతాడు. తన దారికి అడ్డొస్తే చంపేస్తానని బెదిరించి, అన్నంత పనీ చేస్తుంది ఇంటర్వల్కి.. యాభై నిమిషాలలో మొదటి సగం ఐపోయింది. సినిమా మొదలైన అరగంట తర్వాత మా కాళ్ళు తొక్కుకుంటూ వచ్చి నా పక్క సీట్లో కూర్చుని, తనకి వచ్చిన రెండు కాల్స్ ని డీటీఎస్ లో ఆన్సర్ చేసినాయన ముఖం చూడాలన్న కోరికని బలవంతంగా నిగ్రహించుకున్నా.. సినిమా లో కామెడీ తక్కువగా ఉందన్న కొరతని ఈ సంఘటన తీర్చేసింది..

సెకండాఫ్ లో కావ్య, పూజ పిల్లల్ని తన పిల్లల్లా చూసుకుంటుంది. చంటాడికి తన స్తన్యం కూడా ఇస్తుంది. రాజ్ ని తనవాడిగా చేసుకోవాలనుకుంటుంది. ఇందుకు పూజని అడ్డు తొలగించు కోవాలనుకుంటుంది. మరోపక్క పూజ మాత్రం కావ్యని గుడ్డిగా నమ్ముతూనే ఉంటుంది, ఆమె ముఖం లో క్షణ క్షణం మారే రంగుల్ని గమనించకుండా. భార్యాభర్తల గొడవలు పెట్టడం కోసం రాజ్ కి సంబంధించిన ఓ ముఖ్యమైన డాక్యుమెంట్ దాచేస్తుంది కావ్య. ఎప్పుడూ లాప్టాప్ మీద పనిచేసుకునే రాజ్ దగ్గర సాఫ్ట్ కాపీ ఉండదో ఏమిటో, పూజతో గొడవ పడతాడు.

కావ్యలో ఉన్న రెండు డిఫరెంట్ షేడ్స్ చూపించడానికి దర్శకుడు కరుణ ప్రకాష్ 'అపరిచితుడి' మీదే ఆధార పడ్డాడు. ఎమోషన్ మారేటప్పుడు కావ్య పొడవాటి జుట్టు ఆమె ముఖం మీద పడడం తో సహా. సెట్లో రోజూ చార్మి 'అపరిచితుడు' వీడియోలు చూసి ఉంటుంది, సెకండ్ హాఫ్ షూటింగ్ జరిగినన్నాళ్ళూ.. ఇలాంటి సినిమాలకి సంగీతం, రి-రికార్డింగ్ ప్రాణం పోయాలి.. ఈ సినిమా విషయంలో అది జరగలేదు. ఒక్క పాటా గుర్తు పెట్టుకునేలా లేదు.

సినిమా ప్రారంభంలో మరణించిన నల్ల చొక్కా వాడికీ, కావ్యకీ సంబంధం, కావ్య పగ పట్టడానికి కారణం, అది కూడా కుటుంబం మొత్తాన్ని నాశనం చేయాలనుకోకుండా, పూజని తప్పించి ఆ స్థానాన్నితను ఆక్రమించాలనుకోడానికి కారణం ఏమిటన్నదే కథ. తన ప్లాన్ అమలులో విఫలమైనపుడు కావ్య పడే బాధని ఛార్మి బాగా అభినయించింది. అలాగే భర్తతో కమ్యునికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు పూజ గా మంజుల నటన బాగుంది.. మొత్తం మీద 'షో' లో కన్నా పర్వాలేదు. నటనలోనే కాదు, నిర్మాతగానూ మంజుల మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది..

ఆదివారం, జూన్ 07, 2009

'ప్రయాణం' లో పదనిసలు

నటీనటుల కోసం కన్నా సాంకేతిక నిపుణుల కోసం సినిమా చూడడం నాకు అలవాటు. ముఖ్యంగా కొత్త దర్శకుడి సినిమా ఏమాత్రం 'పర్లేదు' అని తెలిసినా తప్పకుండా చూస్తాను. అలా 'ఐతే' చూసినప్పుడు చంద్రశేఖర్ యేలేటి 'బాగా తీశాడు' అనిపించింది. 'అనుకోకుండా ఒకరోజు' చూసినప్పుడూ అదే ఫీలింగ్, టేకింగ్ లో అక్కడక్కడా ఇంగ్లీష్ సినిమాలని గుర్తు చేసినప్పటికీ..

స్టార్ల వారసుల సినిమాలంటే నాక్కొంచం భయం. వీళ్ళ నటన కన్నా వంశాన్ని గురించీ, వీళ్ళ తాతయ్య, నాన్న, బాబాయి, మావయ్యల గొప్పదాన్ని వివరిస్తూ చెప్పే డైలాగులూ, డి.టి.ఎస్. లో వినిపించే తొడల చప్పుళ్ళూ భరించడం కష్టం. అందువల్ల ఇలాంటి సినిమాలకి కొంచం దూరంగా ఉంటాను. నాకొచ్చిన సమస్య ఏమిటంటే చంద్రశేఖర్ యేలేటి ఓ స్టార్ తనయుడితో తీసిన సినిమా చూడాలా? వద్దా?

రిలీజ్ రోజు సినిమా చూసే అలవాటున్న మిత్రులని ఒకటే మాట అడిగా.. ఇది చంద్రశేఖర్ సినిమానా లేక మంచు మనోజ్ బాబుదా అని. 'చంద్రశేఖర్ దే' అని చెప్పగానే ఇంకేమీ చెప్పొద్దన్నా, సినిమా చూడ్డానికి నిర్ణయించుకుని. కొంచం ఆలస్యం అయ్యింది కాని మొత్తానికి సినిమా చూసేశా.. మనోజ్ చాలా కష్టపడి చంద్రశేఖర్ స్టైల్లో నటించాడు..కానీ చంద్రశేఖరే పడాల్సినంత కష్టపడలేదనిపించింది.

సినిమా నిడివి రెండు గంటలు. మొదటి గంట అవ్వగానే విశ్రాంతి. కథాస్థలం విమానాశ్రయం. ప్రధాన పాత్రలైన నాయికా నాయకులతో పాటు హీరో స్నేహితులో ముగ్గురు, హీరోయిన్ ఫ్రెండ్ ఒకమ్మాయి మరియు బ్రహ్మానందం. ఒకేస్థలం లో తక్కువ పాత్రలతో నడిచే కథ అనే సెటప్ చూడగానే నీలకంఠ 'షో' గుర్తొచ్చింది. ఐతే స్క్రిప్టు విషయంలో నీలకంఠ తీసుకున్నంత శ్రద్ధ చంద్రశేఖర్ తీసుకోలేదు, ముఖ్యంగా సినిమా రెండో సగంలో.

చదువు పూర్తి చేసిన ధృవ్ (మంచు మనోజ్) కి ప్రయాణాలంటే సరదా. మలేషియా ఏర్పోర్ట్ లో హారిక (కొత్తమ్మాయి హారిక) ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఇద్దరూ వేర్వేరు విమానాల్లో ప్రయాణించాలి. ఆమె విమానం రెండు గంటల్లో బయలుదేరుతుంది. కేవలం రెండు గంటల్లో ఆమెని పరిచయం చేసుకుని, తన ప్రేమని ప్రకటించి, ఆమెని ప్రేమని పొందగలిగాడా అన్నదే కథ.

హీరోకి తోడుగా అతని మిత్రులిద్దరూ. ఒకతను సైకాలజీ స్టూడెంట్. అమ్మాయిల సైకాలజీ మీద హీరోకి సలహాలు ఇస్తూ ఉంటాడు. రెండో అతను కథా రచయిత.. ఏర్పోర్టులో పరిచయమైన బ్రహ్మానందానికి ఇతను చెప్పిన 'ఉగ్రనరం' సినిమా కథ ప్రస్తుతం తెలుగులో వస్తున్నా ఫ్యాక్షన్ సినిమాల మీద మంచిసెటైర్. హీరోయిన్ ఫ్రెండుగా చేసిన అమ్మాయిని చూడగానే ఎందుకో గానీ 'ఆనంద్' ఫేం సత్య కృష్ణన్ గుర్తొచ్చింది.

హీరో, హీరోయిన్లు కలవక తప్పదని తెలుగు సినిమాలు చూసేవాళ్ళందరికీ తెలుసు. కానీ ఎలా కలిశారన్నదే కథ.. అది చెప్పడంలోనే తడబాట్లు కనిపించాయి. హీరోయిన్ పాత్ర బలమైనది.. సునీత తన డబ్బింగ్ తో మెప్పించిందే తప్ప, హారిక తన హావభావాలతో మెప్పించలేక పోయింది. మొదటి సగం బాగానే అనిపించినప్పటికీ, రెండో సగం లో కథ బాగా నీరసంగా అనిపించింది.

హీరోతో పాటు ప్రేక్షకులు కూడా చాలాసార్లు వాచీ చూసుకుంటారు. నాకైతే ఒక్క గంటలో ఐపోయే సినిమాని బలవంతంగా రెండో గంట సాగదీశారనిపించింది. ప్రారంభం లో వచ్చే నేపధ్య గీతం బాగుంది. చిన్నపిల్ల చేత (అమృత వర్షిణి అనుకుంటా) పాడించారు. కెమెరా పనితనం బాగుంది. నేనైతే రెండో సారి చూడడానికి టిక్ చేసుకోలేదీ సినిమాని.

శనివారం, జూన్ 06, 2009

'ఈనాడు' లో 'నెమలికన్ను'

ఉదయానే పేపర్ తిరగేస్తూ 'ఈతరం' పేజి దగ్గర ఒక్కసారి ఆగా.. ఒక్క క్షణం ఆశ్చర్యం..ఆవెంటే ఆనందం.. నాలుగు నెలల క్రితం మొదలు పెట్టిన నా బ్లాగు గురించి 'నెమలికన్ను స్పర్శ' అంటూ ఓ పరిచయం రాశారు అందులో. నా టపాలన్నీ నిశితంగా చదివి, వ్యాఖ్యలను సైతం పరిశీలించి రాసిన ఆ కథనం నన్ను సంతోష పరిచింది అంటే చిన్నమాటే అవుతుంది. కంప్యూటర్ తెరిచేసరికి మిత్రులనుంచి అభినందనల పరంపర.. పరిచయ వ్యాస రచయితకీ, ప్రచురించిన 'ఈనాడు' కీ ధన్యవాదాలు.

మంచుపూల వాన

మట్టి వాసనని, పూల పరిమళాలని, చిటపట చినుకుల సౌందర్యాన్ని ఆస్వాదించే భావుకత ఉన్న రచయిత్రి కుప్పిలి పద్మ. ఆ భావుకతనంతా కథలుగా మలచడం తో పాటు, ప్రతి కథలోనూ ఏదో ఒక సమస్యని తీసుకుని, దానికి తనదైన పరిష్కారాన్నీ సూచిస్తారామె. టీనేజ్ అమ్మాయిలూ, వాళ్ళ తల్లిదండ్రులకి ఎదురయ్యే సమస్యల మొదలు, ఓ మురికివాడలో ఎన్నో ఏళ్ళుగా జీవిస్తున్నా వాళ్లకి ఆ పక్కనే కొత్తగా వెలిసిన అపార్ట్మెంట్ వాసుల నుంచి ఎదురైనా సమస్యల వరకు ప్రతి సమస్యనీ తనదైన దృష్టి కోణం నుంచి నిశితంగా పరిశీలించి కథలుగా మలిచారు పద్మ. కుప్పిలి పద్మ కథాసంకలనం 'మంచుపూల వాన' పరిచయం 'పుస్తకం' లో..

శుక్రవారం, జూన్ 05, 2009

అప్పిచ్చువాడు...

కొన్ని కొన్ని అపార్ధాలు ఎప్పుడు తలచుకున్నా నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. చిన్నప్పుడు పద్యాలు నేర్చుకునేటప్పుడు 'అప్పిచ్చు వాడు' పద్యం చదువుతూ అప్పిచ్చువాడే వైద్యుడు అనుకున్నా.. తర్వాత తెలిసింది..అప్పిచ్చువాడు, వైద్యుడు, ఏరూ అవీ ఉన్న ఊళ్ళో ఉండమని కవి భావమని. మా ఊరి దుంపల బడిలో చదివినంత కాలం నాకు అప్పు అవసరం రాలేదు. అసలు చిన్నప్పటినుంచీ నా దగ్గర చిల్లర గలగలమంటూనే ఉండేది. ఓ డబ్బాలో నాణేలు దాచుకోడం, అప్పుడప్పుడు లెక్కపెట్టుకోడం అదో కాలక్షేపం. దీనికి మళ్ళీ ఆడిట్ ఉండేది దాదాపు ప్రతి నెలా..

హైస్కూలికి పొరుగూరికి వెళ్ళినప్పుడు అమ్మ రోజూ గుర్తు చేసేది.. "దగ్గర కొన్ని డబ్బులుంచుకో, ఎప్పుడే అవసరం వస్తుందో.." అంటూ. అప్పట్లో పాకెట్ మనీ అంటూ ప్రత్యేకంగా ఉండేది కాదు కానీ, అప్పుడప్పుడూ కొద్దిగా డబ్బిచ్చి ప్రతిరోజూ జమాఖర్చుల వివరాలు అడిగే వాళ్ళు నాన్న. అదో పెద్ద హింస. దగ్గర డబ్బులుంటాయి..కాని ఇష్టానికి ఖర్చుపెట్టే వీలు లేదు. ఇక రాను రాను డబ్బులడగాలంటే విసుగొచ్చేది, మరీ అత్యవసరమైతే తప్ప.

ఏడో తరగతి చివర్లో మొదటిసారిగా అప్పు చేశాను..మా క్లాస్మేట్ రత్న కుమారి దగ్గర. ఆవేళ నాదగ్గర డబ్బులు లేవు. మాస్టారేమో "వచ్చే వారం స్కూల్లో ఎగ్జిబిషన్ పెడుతున్నాం.. మద్యాహ్నం కూర్చుని చార్టులు గీసి సాయంత్రం ఇచ్చేసి వెళ్ళండి" అని చెప్పారు. ఆయన కొంచం మంచాడు, మరికొంచెం చండశాసనుడు. అప్పటికింకా మాస్టారిని అప్పడిగేంత సాహసం లేదు. నడిచి మా ఊరెళ్ళి డబ్బులు తెచ్చుకునే అంత ఓపికా, టైమూ లేవు.

లంచి బ్రేక్ లో మా ఊరి మిత్రులని అడిగాను.. ఎవరికి వాళ్ళు చార్టులు, పెన్సిళ్ళూ కొనుక్కోవాలి..మాకే డబ్బులు చాలవు అనేవాళ్ళే. క్లాసురూములో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే రత్న వచ్చి అడిగింది చార్టులు తెచ్చుకోలేదేమని. నేను విషయం చెప్పగానే వెంటనే అడిగింది 'యెంత కావాల'ని. చెప్పాను 'అర్ధ రూపాయి' అని. వెంటనే తన బాక్సు లోనుంచి తీసిచ్చేసింది. అస్సలు ఊహించలేదు.. ఇప్పుడెవరైనా ఓ లక్ష రూపాయలు అప్పిచ్చినా అంత ఆనందం కలగదు. నేను చేసిన దుర్మార్గం ఏమిటంటే ఆ అప్పు తీర్చడం మర్చిపోవడం.

తర్వాత డిగ్రీ ఐపోయాక, అప్పులు చేయడం బాగా అలవాటయ్యాక, ఈ బాకీ విషయం గుర్తొచ్చింది. మా ఊరెళ్లినప్పుడు నా హైస్కూలు ఫ్రెండుని అడిగా.. రత్న వాళ్ళింటికి వెళ్దామని. "తనకి పెళ్ళయ్యింది. నువ్వా బాకీ తీర్చడానికి మాత్రమే వచ్చావంటే వాళ్ళాయన అస్సలు నమ్మడు .." అని వాడు కొంచం బెదిరించాడు.. బాకీ తీర్చి తనని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదనిపించింది. పువ్వుల్లో పెట్టి తీర్చేయాలనుకున్న ఆ బాకీ అలా ఇప్పటికీ తీర్చలేదు. ఎక్కడున్నావు రత్నా?

చదువు, ఉద్యోగం అనే రెండు పడవలమీద ప్రయాణం చేస్తున్న రోజుల్లో అప్పులిచ్చి నన్నాదుకున్న చల్లని తల్లి మా పిన్ని. ఫీజుల కోసమో, పుస్తకాలకో ఎందుకో అందుకు డబ్బులు అవసరమయ్యేవి. ఉద్యోగం చేస్తూ ఊరికే డబ్బులడగడానికి మొహమాటం. తనే చాలాసార్లు అప్పులిచ్చింది. అన్నీ తీర్చేశాను. అంతేనా..ఓ విలువైన మాట కూడా చెప్పింది. "మనకి ఎప్పుడూ యెంతో కొంత అప్పు ఉండాలి. ఒక్కోసారి మనం బతకడానికి ఏ కారణం కనిపించదు.. మనం ఎవరికైనా బాకీ ఉన్నామనుకో.. అది తీర్చేదాకా బతికి ఉండాలి అనుకుంటాం.." ఈ ఫిలాసఫీ నాకు బాగా నచ్చింది.

ఓసారి నాకు అత్యవసరంగా డబ్బు కావాల్సొచ్చింది. కొంచం పెద్ద మొత్తమే. ఓ బ్యాంక్ మేనేజర్ ఇస్తానని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో సారీ చెప్పడంతో వచ్చింది సమస్య అంతా.. సమస్యని నా దగ్గరే దాచుకునే కన్నా, మిత్రులకి చెబితే ఎవరో ఒకరు ఏదో ఒకటి చెయ్యకపోరు అనిపించింది. అనుకున్నట్టుగానే ఓ మిత్రుడు తనకి తెలిసిన బ్యాంకు మేనేజర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన అప్పటికప్పుడు అప్పిచ్చేశాడు. "మామూలుగా అయితే ఇంత సాయం చేసినందుకు మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను అని చెప్పాలండి.. కానీ నేను ఈ జన్మలోనే తప్పక తీర్చేస్తాను.." అన్నాను మేనేజర్ తో.

ఆయనకో నిమిషం పట్టింది, అర్ధం చేసుకోడానికి. చాలాసేపు నవ్వారు. ఇప్పటికీ కలిసినప్పుడల్లా గుర్తు చేస్తారు. అప్పులు సక్రమంగా తీర్చడం వచ్చినంత బాగా, నేనిచ్చిన అప్పులు వసూలు చేసుకోడం రాలేదు నాకు. అన్నీ చిన్న చిన్న చేబదుళ్ళే కానీ, అన్నీ కలిపితే కొంచం పెద్ద మొత్తమే అవుతుంది. ఈ మధ్య మా ఆఫీసు వాళ్ళు ఉద్యోగులకి అప్పులిచ్చే పధకం ఒకటి మొదలు పెట్టారు. ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ.. అలా నా అప్పుల కథంతా గుర్తొచ్చింది..

బుధవారం, జూన్ 03, 2009

హరిశ్చంద్ర-అయ్యప్పనాయుడు

సత్య హరిశ్చంద్ర నాటకం అంటే యెంత క్రేజు.. ముఖ్యంగా కాటిసీను.. పద్యాలకి వన్స్ మోర్లు పడాల్సిందే.. అబ్బే ఇప్పటి సంగతి కాదు. అమ్మ వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ ఊళ్ళో ప్రతి సంవత్సరం ఈ నాటకం వేయాల్సిందే. తెలిసిన కథే అయినా, ఊళ్ళో సగం మందికి పద్యాలన్నీ నోటికి వచ్చేసినా, సంవత్సరాదికో, శ్రీరామ నవమికో సత్య హరిశ్చంద్ర ప్రదర్శన తప్పదు.

అమ్మ వాళ్ళు కొంచం పెద్దవాళ్ళయ్యాక ఇంట్లో ఆంక్షలు మొదలయ్యాయి. వాళ్ళు బడికెళ్లే వయసులో మాత్రం ఎలాంటి ఆంక్షలూ లేవు. పైగా వాళ్ళ పెద నాన్నగారికి నాటకాలంటే విపరీతమైన ఇష్టం. ఊళ్ళో ఎక్కడ నాటక ప్రదర్శన జరిగినా పిల్లల కోడిలా వీళ్ళందరినీ వెంటేసుకుని ఆయన హాజరు తప్పదు. అలా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు చాలా నాటకాలే చూశారు.

నాటకాలేనా? నాటక బృందం ఊళ్లోకి వచ్చింది మొదలు వాళ్ళ వెంట తిరుగుతూ వాళ్ళ ప్రతి కదలికనీ గమనించడం, మిగిలిన పిల్లలకి గొప్పగా చెప్పడం.. ఇవన్నీ వీళ్ళ వీరోచిత కార్యాలు. ప్రతి సంవత్సరం లాగే ఆ సంవత్సరం కూడా 'సత్య హరిశ్చంద్ర' బృందం ఊళ్లోకి వచ్చింది. మర్నాడు రాత్రి ప్రదర్శన. పెద్ద చెక్కపెట్టెల్లో బట్టలు, సెట్టింగులు, వాయిద్యాలతో దిగిపోయారు బృందం వాళ్ళు. తాతగారింటికి నాలుగిళ్ళ అవతల ఉన్న ఇల్లే నాటక బృందానికి విడిది ఇచ్చారు.

మధ్యాహ్న భోజనాలయ్యాక, నాటక బృందం పెద్ద తలకాయ (హెడ్) ఊరి పెద్ద తలకాయతో వాళ్ళ సమస్య చెప్పాడు. అదికాస్తా గోడ పక్క కాపు కాసిన అమ్మ వాళ్ళ చెవిన పడింది. నాటకంలో లోహితాస్యుడి వేషం వేసే పిల్లాడికి జ్వరం వచ్చింది. అందువల్ల అతను రాలేదు. స్థానికంగా ఓ ఏడెనిమిదేళ్ళ కుర్రాడినెవరినైనా ఏర్పాటు చేస్తే అతనితో నాటకం కానిస్తారు. అదీ సంగతి.

అసలు హరిశ్చంద్ర కాటిసీను లో లోహితాస్యుడికి పనేమీ ఉండదు.. చంద్రమతి భుజం మీద నిద్రపోవడమే. కథ ప్రకారం పాము కరిచి మరణించిన లోహితాస్యుడిని చంద్రమతి శ్మశానానికి తీసుకొస్తుంది. అక్కడ కాటికాపరి మరెవరో కాదు మారువేషంలో ఉన్న హరిశ్చంద్రుడు. సుంకం చెల్లించనిదే లోపలి అడుగు పెట్టనివ్వనంటాడు సత్య వాక్య పాలకుడైన హరిశ్చంద్రుడు. తన దగ్గర చిల్లిగవ్వ లేదంటుంది చంద్రమతి. హరిశ్చంద్రుడికి మాత్రమే కనిపించే 'చంద్రమతి మాంగల్యం' చూపించి దానిని సుంకంగా చెల్లించమంటాడు కాపరి. అప్పుడు భర్తని భార్య గుర్తుపడుతుంది.

బోల్డంత సెంటిమెంటు..బోల్డన్ని పద్యాలు.. పైగా అన్నీ వన్స్ మోర్లు.. ఎవర్ని కాదన్నా తెర చింపేస్తారేమో అన్న భయం. అలా నాటకం ఇంచుమించు తెల్లారే వరకూ జరిగేది. లోహితాస్యుడి వేషానికి సరిపడే పిల్లాడి కోసం అన్వేషణ మొదలయ్యింది. ఆ వయసు పిల్లల తల్లిదండ్రులు శవం వేషం వేయించడం ఆశుభంగా భావించారు. సరిగ్గా అప్పుడు అయ్యప్పనాయుడు ఆవేషం నేనేస్తానంటూ ముందుకొచ్చాడు.

అయ్యప్పనాయుడికి ఓ పదిహేనేళ్ళు ఉంటాయి. కాస్త బరువు ఎక్కువే అయినా, పొట్టిగా చూడ్డానికి పదేళ్ళ పిల్లాడిలా ఉంటాడు. అమ్మానాన్నలకి లేకలేక పుట్టిన సంతానం కావడం తో బాగా గారాబం. ఇంట్లో అతని మాటకి ఎదురు చెప్పరు. లోహితాస్యుడు దొరికాడన్న ఆనందం కన్నా చంద్రమతి మీద జాలి పెరిగిపోయింది అందరికీ.. ఇతన్ని మూడు నాలుగు గంటల పాటు ఎత్తుకుని స్టేజి మీద నిలబడి పద్యాలు చెప్పడం అంటే మాటలా? అమ్మ వాళ్లకి నాటకం చూడాలన్న కుతూహలం పెరిగిపోయింది.

నాటకం మొదలైంది. చంద్రమతి అయ్యప్పనాయుడిని అవలీలగా ఎత్తుకుంది. ఆవిడ భుజం మీద ఆ అబ్బాయి హాయిగా నిద్రపోయాడు. హరిశ్చంద్రుడికీ, చంద్రమతికీ పద్యాల పోటీ లాంటిది జరుగుతోంది, వన్స్ మోర్ల, చదివింపుల కోలాహలంతో. కాకపొతే చంద్రమతి గొంతు కాస్త బొంగురుగా ఉంది. విషయం ఏమిటంటే, చంద్రమతి వేషం వేసే ఆవిడ చివరి నిమిషంలో కారణాంతరాల వల్ల రాలేక పోయిందిట.. దానితో ట్రూపులో మగతనే ఆ వేషం వేసేశాడు. అదీ కథ.. మా ఇంట్లో నాటకం టాపిక్ వచ్చినప్పుడల్లా అమ్మ గుర్తు చేసుకుంటుంది..

మంగళవారం, జూన్ 02, 2009

మరపురాని రేయి

గ్రీష్మ తాపానికి రోజంతా తల్లడిల్లిన ప్రకృతి సాయంత్రం కాగానే కొంత సేద తీరింది. మాడ్చే ఎండకి, వేడి గాలులకీ కొద్ది విరామం. రాత్రి గడిచే కొద్దీ వాతావరణం లో వేడి కొద్ది కొద్దిగా తగ్గుతోంది..సరిగ్గా నా అశాంతికి వ్యతిరేక దిశలో. నిన్నటి రోజంతా చికాగ్గానే గడిచింది.. ఇంటా, బయటా సమస్యలు.. చిన్న చిన్నవే అయినా మనశ్శాంతిని తగ్గించేవి. రాత్రి ఎవరితోనూ మాట్లాడాలనిపిచలేదు..రెండు మూడు పుస్తకాలు తిరగేసి చూశా.. ప్చ్..లాభం లేదు.

బాల్కనీ లో పచార్లు చేస్తూ యధాలాపంగా ఆకాశంలోకి చూశాను.. మామిడి చెట్టు కొమ్మల చాటు నుంచి నవమి చంద్రుడు పలకరించాడు. 'నవమి నాటి వెన్నెల నీవు..' పాట గుర్తొచ్చింది.. బుర్రలో ఓ మెరుపు మెరిసింది.. 'పాటలు వింటే..' ...రైట్ ...సమస్యకి సరైన పరిష్కారం అనిపించింది. ఓ కుర్చీ బయటికి లాక్కోడం తో పాటు, తలుపు నెమ్మదిగా దగ్గరికి లాగాను. ఇయర్ ఫోన్స్ తగిలించుకుని మొదటి పాట సెలెక్ట్ చేసుకున్నా.. 'ఓం నమః..' గీతాంజలి నుంచి..

ఎప్పుడు మూడ్ బాగోపోయినా వినే మొదటి పాట.. 'ఈ మంచు బొమ్మలొకటై...' జానకి గొంతు వినగానే మరో నిర్ణయం..కేవలం జానకి పాటలు మాత్రమే వినాలని. రెండో పాట 'ఆకాశం ఏనాటిదో..' ఈపాటని ఎప్పుడూ కూడా ఒక్కసారి మాత్రమే వినను. కనీసం రెండు మూడు సార్లు. పాట చివరికి వచ్చేసరికి ప్రతిసారీ ఒకటే అనుభూతి. ఎదురుగా జానకి ఉంటె ఆమెకి సాష్టాంగ ప్రణామం చెయ్యాలని. ఎన్ని గమకాలూ? ఎన్నెన్ని భావాలు? ప్రేమ, బాధ, విరహం, చిలిపిదనం, కరుణ..ఇన్ని రసాలనూ అలవోకగా పలికించే గొంతు.

చుట్టూ చీకటిగా ఉంది..గాలికి రెపరెపలాడుతున్న దీపం లా మబ్బు చాటు చంద్రుడు. ఎందుకో తెలీదు కానీ చెట్లన్నీ ఊపిరి బిగబట్టి నిలబడ్డాయి.. గాలిలేదు.. నేనింకా జానకి మాయలో పూర్తిగా చిక్కుకోలేదు.. ఎందుకంటే నాకు వినిపిస్తున్నవి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' పాటలు. ఈ పాటలు ఎప్పుడు విన్నా నాకు జానకి కన్నా శ్రీదేవే కళ్ళముందు నిలుస్తుంది. 'అందాలలో..' వింటుంటే దేవకన్యలా, 'ప్రియతమా..' వింటుంటే పిలక జడతో, 'యమహో..' పాటకి ఎల్లో డ్రెస్ తో స్టెప్పులేస్తో..

వీటిల్లో 'ప్రియతమా..' మాత్రం పూర్తిగా జానకి మార్కు పాట. విరహం, వేదన కలగలిపి వినిపిస్తాయి ఈ పాటలో. ఒక్కసారిగా పిల్ల తెమ్మెర స్పృశించిన అనుభూతి. నిజమేనా? లేక నా భ్రమా? చెవుల్లో జానకి హమ్మింగ్. 'మౌనమేలనోయి...' పాట.. డౌటే లేదు.. పడిపోయా ఆవిడ మాయలో.. 'ఇది యేడడుగుల..వలపూ మడుగుల..' ...నేనెక్కడున్నాను? ...తర్వాతి పాట.. ఏడేడు లోకాల్లో ఎక్కడున్నా వెంటాడే పాట.. 'మరుగేలరా..ఓ రాఘవా..' 'నిన్నేగాని మదిని ఎన్నజాల నొరుల..' నా చెవుల్లో కేవలం నాకోసమే పాడుతున్నట్టుగా..

నేను నిద్రలోకి జారుకుంటానని సందేహం వచ్చినట్టుంది.. హై పిచ్ లో 'ఆ..అ అ ఆ..' అని మొదలు పెట్టి 'ఆకాశంలో ఆశల హరివిల్లు' చూపించేశారావిడ. ఒక్కసారిగా అలర్టై చుట్టూ చూశాను.. ప్రకృతి అలాగే ఉంది..ఆ చంద్రుడూ, మబ్బులూ.. తలలూపని చెట్లూ.. కళాతపస్వికి సెలవిచ్చేసి వంశీ తో కలిసి వచ్చేశారు జానకి, అల్లరి చేయడానికి..'హాయమ్మ హాయమ్మ హాయమ్మ..' అంటూ.. మౌనమేలనోయి అనీ మరుగేలరా అనీ అడిగింది ఈ అల్లరి గొంతేనా?

'మహర్షి' కోసం పాడిన 'కోనలో..' పాట.. అసలీవిడ పాడలేని పాట లేదేమో.. 'కోయిలమ్మ రాగం..కొండ వాగు వేగం..' ఇంకెవరిది.. ఈవిడ గొంతుదే.. అవుతూనే 'సితార' లో 'జిలిబిలి పలుకుల..' అసలు ఈ పాట మొదట్లో వచ్చే నవ్వు చాలు..'సితార' కథ మొత్తం చెప్పెయ్యడానికి..కాస్త బరువైన ఈ పాట అవ్వగానే అల్లరిపాట 'గోపెమ్మ చేతుల్లో..' అలు.. అరు.. ఇణి.. అనడం యెంత ముద్దుగానో.. ఆతర్వాత 'వయ్యారి గోదారమ్మ..' గోదారమ్మ సంగతేమో కానీ శ్రోతలకి మాత్రం కలవరమే..

అర్ధ రాత్రి దాటి చాలాసేపయ్యింది. 'శ్రీమన్మహారాజ..' వస్తోంది.. ఆపాలనిపించలా.. 'మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ' అనగానే 'నిజమే' అనిపించింది. పదహారేళ్ళ పిల్ల ప్రేమలేఖ రాసుకుంటే ఇంత సుకుమారంగానూ ఉండి తీరుతుందనిపించింది. ఆ పాటల మత్తులోనే హాయిగా నిద్రపోయాను.. ఆఫ్కోర్స్, ఉదయం లేచేసరికి సమస్యలు అలాగే ఉన్నాయి..ఐతే వాటిని పరిష్కరించుకునే మూడ్ కూడా ఉంది..

సోమవారం, జూన్ 01, 2009

వాన కురిస్తే

చెప్పదలచుకున్న విషయాన్ని ఎలాంటి తికమకలూ లేకుండా సూటిగా స్పష్టంగా చెప్పే కథకుల్లో కేతు విశ్వనాథ రెడ్డి ఒకరు. ఈయన కథల్లో పాత్రలన్నీ నిజజీవితం నుంచి వచ్చేవే.. జీవితానికి సంబంధించి అన్ని అంశాలనూ తన కథల్లో స్పృశించే ఆచార్య కేతు రాయలసీమ రైతు సమస్యలను నేపధ్యంగా తీసుకుని ఎన్నో కథలు రాశారు.

వర్షం కోసం ఎదురు చూస్తున్న ఓ రైతు ఆవేదననూ, ఒక్క వాన తన జీవితాన్ని మార్చేయగలదన్న అతని ఆశనీ చిత్రిస్తూ ఆయన రాసిన కథ 'వాన కురిస్తే.' 1971 లో తొలిసారి ప్రచురితమైన ఈ కథ కన్నడ, హిందీ భాషల్లోకీ అనువాదమైంది. ఈ కథాకాలం నాలుగు దశాబ్దాలకి ముందు దైనా, ఈ నాటికీ రైతు స్థితిలో..ముఖ్యంగా రాయలసీమ రైతు స్థితిగతుల్లో ఎలాంటి మార్పూ లేకపోవడం వల్ల సమకాలీన కథే అనిపిస్తుంది.

కథానాయకుడు పాపయ్య రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ రైతు. తండ్రి చేసిన అప్పులు తీర్చడం కోసం పదెకరాలు అమ్మేసి, మిగిలిన భూమిలో చీనీ, మిరప తోటల పెంపకం మొదలు పెట్టాడు. వర్షాధారమైన వ్యవసాయం చేయడం ఎప్పుడూ లాటరీనే. వ్యవసాయం కోసం, కుటుంబం గడవడం కోసం తప్పని అప్పులు. కురవని వర్షం.. అన్ని బావుల్లో మాదిరే లోతుకి, ఇంకా లోతుకి పోతున్న నీళ్ళు.

"నిమ్మచెట్లే కాస్తే, చేసిన అప్పులు ఒక లెక్క కాదు. తన ఆశా, నమ్మకమూ నెరవేరే విషయం ఏమో కాని అప్పుల దయ్యం తన్ను పట్టుకుంది. తన వంశంలో ఏదో పద్ధతిలో, ఏదో కారణానికి, ఏదో దశలో అప్పులు చేయందెవరు? అవును. చేయక తప్పేదేముంది? మెట్టన్నమ్ముకున్న వాళ్ళు ఎవళ్ళూ బాగుపడరు. ఎప్పుడూ బాగు పడరు. వానలు అదునులో వస్తే బాగుపడతారు."

ఓ స్వామి మాటలు నమ్మి బావి తవ్వినా నీళ్ళు పడలేదు. ఇంక ఉన్న ఒకే ఒక్క అవకాశం వర్షం పడడం. వర్షం కురిస్తే, పంట చేతికొస్తే, మంచి రేటు పలికితే, పంట అమ్మి అప్పులు తీర్చాలి. వంశం పేరు నిలబెట్టాలి. తన వంశానికి పేరూ ప్రతిష్టా ఉన్నాయి.. డబ్బు లేకపోతేనేం. అంగడి రామిరెడ్డి దగ్గర డబ్బుంది కాని పేరెక్కడుంది? రామిరెడ్డి అప్పు ముందుగా తీర్చేయ్యాలి. ఆలోచిస్తూ ఇంటిదారి పట్టిన పాపయ్యకి ఆకాశంలో ఉరుము ఉరిమిన శబ్దం వినిపిస్తుంది.

వార్తలు వినడం కోసం పంచాయితీ ఆఫీసు దగ్గర ఆగుతాడు పాపయ్య. ఊరి రాజకీయాలు అతనికి కోపం రప్పిస్తాయి. బోర్లు వేయించని, చెరువులు తవ్వించని ప్రభుత్వం మీదా అతనికి కోపం వస్తుంది. ఐతే దానికి ప్రకటించడు. "అందరూ దొంగలే..ఈ మనుషులు బాగు పడరు..ఈ ఊరు బాగు పడదు..ఈ దేశం బాగు పడదు. అందరూ చస్తారు..అప్పులతో చస్తారు.. పనికి మాలిన రాజకీయాలతో చస్తారు.. " పాపయ్య మనసులో కసి.. గుండెల్లో మంట..

ఇంటికి చేరుకున్న పాపయ్య వానొస్తే ఇల్లు తడిసి పాడైపోతుందని బాధ పడతాడు. పంట డబ్బు రాగానే అప్పులు తీర్చాక మిగిలిన డబ్బుతో ఇల్లు బాగు చేయించాలనుకుంటాడు. భోజనం చేసి వర్షం కోసం ఎదురు చూస్తూ ఆరుబయట నిద్రపోతాడు. "నిద్రలో పాపయ్యకి ఒక కల వచ్చింది. పెద్ద వాన పడుతోంది. చెరువు నిండింది. తోట పక్కనే గట్టుల్ని ఎగదంటూ పారుతున్న కాలవ. బావిలో నీళ్ళు. పాదుల్లో నీళ్ళు. యింట్లో నీళ్ళు. వీధిలో నీళ్ళు. తనమీద నీళ్ళు. ఎక్కడ చూసినా నీళ్ళు..."

ఉన్నట్టుండి ఉరిమిన ఉరుముకి కల చెదిరిన పాపయ్య దిగ్గున లేచి కూర్చుంటాడు. ఆర్తనాదం చేసి కూలిపోతాడు. ఆరాత్రి ఆకాశంలోంచి పడని వాన ఆ ఇంట్లో వాళ్ళ కళ్ళలోనుంచి పడింది. కర్మకాండ ముగిశాక అప్పులవాళ్ళంతా పాపయ్య పెద్ద కొడుకు మల్లయ్యతో బాకీ విషయం నెమ్మదిగా చూసుకోవచ్చని హామీ ఇస్తారు. నెల రోజుల తర్వాత తోట దగ్గరికి వెళ్తాడు మల్లయ్య.

"నాయన పోయినాక వొక వాన వచ్చింది. ఇంకొక మంచి వాన కురుస్తే ఈ మిరప చెట్లకి కాయ బాగా పడుతుంది. ధరలున్నాయి. సెనక్కాయ తీగ బాగా సాగుతుంది. ధరలు పెరుగుతున్నాయి. నిమ్మ చెట్లకు పూత వస్తుంది. రెండు మూడు లారీలు కాస్తాయి. బావిలో నీళ్ళు సరిపోతాయి. అన్నీ కుదిరితే ఏముందీ? బాకీలు సుమారుగా తీర్చ వచ్చు. బాకీలెంత బాధ! బాకీలు తీర్చాలి. బావిలోకి చూస్తూ, ఆకాశం వైపు చూస్తూ, ఆ మధ్య వచ్చిన ఒక వానతో బతకలేక, చావలేక అవస్థ పడుతున్న మిరప చెట్లను చూస్తూ, నీరెత్తని నిమ్మ చెట్లని చూస్తూ అనుకున్నాడు.. వొక్క వాన కురిస్తే! మరొక్క వాన కురిస్తే!!"