సోమవారం, ఆగస్టు 23, 2021

నా మాటే తుపాకి తూటా

ప్రపంచ పోరాటాల చరిత్రలోనే ఓ ప్రత్యేక స్థానం ఉన్న తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టుకుని పాల్గొని, అటుపైన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన కమ్యూనిస్టు పార్టీ నేత మల్లు స్వరాజ్యం ఆత్మకథ 'నా మాటే తుపాకి తూటా'. హైదరాబాద్ బుక్  ట్రస్ట్ ప్రచురించిన ఈ పుస్తకం స్వరాజ్యం స్వీయ రచన కాదు. బుక్ ట్రస్ట్ తరపున రచయిత్రులు విమల, కాత్యాయని స్వరాజ్యాన్ని ఇంటర్యూ చేసి, ఆమె చెప్పిన వివరాలన్నింటినీ ఓ క్రమ పద్ధతిలో గ్రంధస్తం చేసి రూపు దిద్దిన పుస్తకం. ఇంటర్యూ చేసే నాటికి స్వరాజ్యం వయసు ఎనభై ఆరేళ్ళు. తన చిన్నప్పటి కబుర్ల మొదలు, రహస్య జీవితపు రోజుల విశేషాల వరకూ ఆవిడ జ్ఞాపకం చేసుకుని వివరంగా చెప్పిన తీరు అబ్బురమనిపిస్తుంది. ఉద్యమం-సంసారం అనే రెండింటినీ ఆవిడ సమన్వయం చేసుకున్న తీరునీ వివరంగా చిత్రించారీ పుస్తకంలో. 

నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో ఓ భూస్వామ్య కుటుంబంలో జన్మించారు స్వరాజ్యం. పుట్టిన సంవత్సరం 1930 లేదా 31. నాటి భూస్వాముల కుటుంబాల్లో ఆడపిల్లలకి ఆత్మరక్షణ పద్ధతుల మొదలు, ఎస్టేట్ నిర్వహణకు అవసరమైన శిక్షణ వరకూ చిన్ననాడే అందించే వారట.  దొరల మధ్య ఉండే స్పర్ధ  ఇందుకు కారణం అంటారామె. పుట్టింది భూస్వామ్య కుటుంబంలోనే అయినా ఇంట్లో వామపక్ష రాజకీయ వాతావరణం ఉండడం, ముఖ్యంగా తన అన్న భీమిరెడ్డి నరసింహా రెడ్డి ప్రభావంతో ఉద్యమంలో అడుగుపెట్టానంటారు స్వరాజ్యం. పదకొండేళ్ల వయసులో ఉద్యమంలో అడుగుపెట్టిన ఆమె, ఎన్నడూ వెనుతిరిగి చూడలేదు. వివాహానంతరం, పిల్లల పెంపకం నిమిత్తం ప్రజా జీవితానికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఉక్కిరిబిక్కిరయ్యారు కూడా. 

మొత్తం పుస్తకంలో అత్యంత ఆసక్తికరంగా అనిపించే అధ్యాయాలు నిజాం కి వ్యతిరేకంగా జరిపిన పోరాటాలని వివరించేవి. స్వరాజ్యం స్వయంగా తుపాకీ పట్టి గెరిల్లా పోరాటంలో పాల్గొనడమే కాకుండా ఒక దళానికి నాయకత్వం వహించారు కూడా. గిరిజనుల నమ్మకాన్ని సంపాదించుకోడం మొదలు, పోలీసుల రాకని ఆనవాలు పట్టి ఎదురు దాడులు చేయడం, పోలీసులు చుట్టుముట్టినప్పుడు నేర్పుగా తప్పించుకోడం లాంటి సన్నివేశాలు ఊపిరి బిగపట్టి చదివిస్తాయి. అటు నిజాం, ఇటు స్థానిక దొరలూ కూడా అత్యంత బలవంతులు కావడంతో పోరాటం ఢీ అంటే ఢీ అన్నట్టుగా సాగింది. ఆయుధాలు సమకూర్చుకోడం మొదలు, రహస్యంగా డెన్ లు ఏర్పాటు చేసుకోడం, ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేస్తూ పోరాటాన్ని సాగించడం.. ఈ వివరాలన్నీ అత్యంత ఆసక్తికరంగా చెప్పారు స్వరాజ్యం. 



పోరాట విరమణ (1951) అనంతర కాలం స్వరాజ్యం లాంటి గెరిల్లా దళ సభ్యులకి నిజంగా గడ్డు కాలమే. దాదాపు పదేళ్ల పాటు అడవుల్లో తిరుగుతూ ఒక లక్ష్యం కోసం పని చేసిన వాళ్ళకి ఉన్నట్టుండి చేయడానికి ఏపనీ లేకుండా పోవడం అన్నది ఊహకి అందని సమస్య. అయితే స్వరాజ్యానికి కాల్పులు మాత్రమే కాదు, జన రంజకంగా ఉపన్యాసాలు చేయడమూ తెలుసు. పార్టీ సభల్లో ఉపన్యాసాలు ఇస్తూ తనని తాను యాక్టివ్ గా ఉంచుకున్నప్పటికీ, పూర్తి స్థాయిలో పనిచేయలేక పోతున్నానన్న బాధ ఆమెని వేధించింది. ఇదే విషయాన్ని పార్టీ నాయకుడు చండ్ర రాజేశ్వర రావు దృష్టికి అనేకమార్లు తీసుకెళ్లారు కూడా. ఉద్యమ సహచరుడు వీఎన్ (మల్లు వెంకట నరసింహా రెడ్డి) ని వివాహం చేసుకున్నాక కొన్నేళ్ల పాటు పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోవాల్సి వచ్చింది. ఆ రోజులు మరింత దుర్భరం అంటారు స్వరాజ్యం. 

కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలాక సీపీఎం వైపు నిలబడ్డ స్వరాజ్యం, పార్టీ కార్యకలాపాల ద్వారా ప్రజల్లోకి వచ్చారు. మహిళా సమస్యలతో పాటు, రైతు సమస్యలని భుజాన వేసుకున్నారు. ఓ పక్క ముగ్గురు పిల్లల పెంపకం బాధ్యతలు చూస్తూనే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు, ఈమె వేషధారణ చూసి అక్కడి కావలి వారు ఎమ్మెల్యే అంటే నమ్మకం కలగక, లోపలికి అనుమతించలేదట! అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల సీపీఎం పూర్తి వ్యతిరేక వైఖరి తీసుకోడంతో, ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పటికీ ఉద్యమాలు, పోరాటాలు కొనసాగాయి. ఈ విశేషాలతో పాటు సమాంతరంగా, తన పుట్టిల్లు, మెట్టింటి విశేషాలు, ఆస్తుల పంపిణీ తాలూకు గొడవలు, పిల్లల పెంపకం, వాళ్ళ చదువులు ఇత్యాది విషయాలనే సమాంతరంగా చెప్పుకుంటూ వచ్చారు. 

ఈ పుస్తకాన్ని స్వరాజ్యం స్వయంగా రాయలేదన్న లోపం చాలాచోట్ల కనిపిస్తుంది. వివరంగా రాయాల్సిన విషయాలని చెప్పీ చెప్పనట్టు చెప్పడం, కొన్ని విషయాలని పూర్తిగా దాటవేయడం గమనించినప్పుడు ఆమే స్వయంగా రాసి ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. దాటవేత - ప్రశ్న సరిగా లేకపోవడం వల్లనా, ఆమె  మరిచిపోవడం వల్లనా, లేక ఉద్దేశపూర్వకమా అన్న ప్రశ్న రెండుమూడు చోట వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటం పూర్వాపరాలని గురించి అవగాహనా లేని వారికి, 'మలిమాట' పేరుతో ఫెమినిస్టు చరిత్రకారిణి ఉమా చక్రవర్తి రాసిన పద్దెనిమిది పేజీల వ్యాసం అవసరమైన సమాచారాన్ని ఇస్తుంది. ఆత్మకథలో అవసరమైన చోట్ల వ్యక్తులు, సంఘటనలకు సంబంధించిన ఫుట్ నోట్స్ ఇచ్చి ఉంటే పాఠకులకి మరింత ఉపయుక్తంగా ఉండి ఉండేది. హెచ్ బీటీ ప్రచురించిన ఈ 138 పేజీల పుస్తకం వెల రూ. 120. చదువుతుంటే కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ 'నిర్జన వారధి' గుర్తురాక మానదు. 

బుధవారం, ఆగస్టు 04, 2021

ఒక వైపు సముద్రం

కావేరి, కస్తూరి, మాధురి, గోదావరి ఈ  నలుగురూ అక్కాచెల్లెళ్లు. వీళ్ళకి ఒక తమ్ముడు మంజునాథ. కస్తూరి కూతురు రత్న, గోదావరి కూతురు సునంద. కస్తూరి ఆడపడుచు కొడుకు పురందర, ఇతను తన చిన్ననాడే తన తండ్రిని పోగొట్టుకున్నాడు. ప్రధానంగా కస్తూరి కుటుంబం, కొంచంగా కావేరి కుటుంబం పురందర చదువుకి సాయం చేస్తాయి. చదువు పూర్తవుతూనే మంజునాథ సాయంతో ఉద్యోగస్తుడవుతాడు పురందర. రత్నని పురందరకి ఇచ్చి పెళ్లి చేయాలని కస్తూరి సంకల్పం. అటు పురందర తల్లి, ఇటు కావేరి కూడా ఇది చాలా సహజమైన విషయంగానే భావిస్తారు. పురందర కాదంటాడని ఎవరూ అనుకోరు. ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకునే పరిస్థితులు కూడా అతనికి ఉండవు. 

ఇక పెళ్లి జరగడమే తరువాయి అనే సందర్భంలో, "పురందరని సునందకు ఎందుకు చేసుకోకూడదు?" అన్న ఆలోచన వస్తుంది గోదావరికి. వచ్చిన ఆలోచన ఆమెని నిలవనివ్వదు. పురందర సుగుణాలు ఇందుకు ఒక కారణమైతే, కస్తూరి కుటుంబం పట్ల గోదావరికి ఉన్న విముఖత మరో కారణం. కావేరితో కూడా సంప్రదించకుండా రహస్యంగా తన పని ప్రారంభిస్తుంది. అప్పటివరకూ కార్యసాధకురాలిగా పేరు తెచ్చుకున్న గోదావరి ప్రయత్నం ఏమైంది? తదనంతర పరిణామాలు ఆ కుటుంబాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించాయో వివరించే నవలే 'ఒక వైపు సముద్రం.' వివేక్ శానభాగ కన్నడ నవల  'ఒందు బది కడలు' కి రంగనాథ రామచంద్రరావు తెలుగు అనువాదం. 

కావేరి ఇంటి పొరుగున ఉండే వితంతువులైన అత్తాకోడళ్లు పండరి-యమునల పెరట్లో నింపాదిగా మొదలయ్యే కథనం, ఒక్కో పాత్ర పరిచయంతోనూ వేగం పుంజుకుంటూ సగానికి వచ్చేసరికి పుస్తకం పూర్తి చేసి కానీ పక్కన పెట్టలేని బలహీనతకి లోనుచేస్తుంది పాఠకుల్ని. కథకి కేంద్రం కుటుంబ రాజకీయాలు అయినందువల్ల పాత్రల చిత్రణలో ఎంతో శ్రద్ధ చూపించారు రచయిత. కథలో ప్రధానమైన మలుపులన్నింటికీ కారణాలు చిన్నవే అయి ఉండడం, వాటిని రచయిత ఎంతో నేర్పుగా చెప్పడం నవల ఆసాంతమూ ఆశ్చర్య పరిచే విషయం. ఒక్క పురందర మాత్రమే కాక, చిన్నాపెద్దా పాత్రలన్నీ కూడా పాఠకులకి గుర్తుండిపోతాయి. పాత్రలు తీసుకునే నిర్ణయాలు - క్షణికావేశంలో తీసుకున్నవి కూడా - ఎక్కడా అసహజం అనిపించవు. 

ఉత్తర కర్ణాటక సముద్ర తీరంలోని గ్రామాలు, పట్టణాల్లో సాగే కథ ఇది. కథాకాలం ఇప్పటికి దాదాపు ఓ యాభై ఏళ్ళ క్రితానిది. పండరీబాయి కథా నాయికగా నటించిన కొత్త సినిమా విడుదలవ్వడం మినహా కథా కాలానికి సంబంధించి ఎలాంటి క్లూ ఇవ్వలేదు రచయిత. నిజానికి ఇది ఏ కాలంలో అయినా జరగడానికి అవకాశం ఉన్న కథే. ఒక చోటునుంచి మరో చోటికి వెళ్ళడానికి బస్సుతో పాటు పడవ ప్రయాణమూ తప్పనిసరి. ఒకపక్క కొండలు, మరోపక్క సముద్రం తాలూకు 'ఉక్కపోత' పాఠకులకి అనుభవమవుతుంది. నవల మొదటి సగంలో కథ పురందర చుట్టూ తిరిగినా, రెండో సగంలో ఎక్కువ భాగం అతని స్నేహితుడు యశవంత చుట్టూ తిరుగుతుంది. చదువు తర్వాత నాటకాల్లోకి వెళ్లిన యశవంతకి అక్కడ ఎదురయ్యే అనుభవాలు, నాటి కన్నడ నాటక సమాజాల పనితీరుని కళ్ళముందు ఉంచుతాయి. 

కేవలం పురందర, యశవంతలది మాత్రమే కాదు. నవల్లో ఒక్కో పాత్రదీ ఒక్కో కథ. ప్రతీ కథకీ ఆద్యంతాలు ఉంటాయి. కొన్ని కథల్లో ఇవి విశదంగా ఉంటే, మరికొన్ని కథల్లో క్లుప్తంగా ముగుస్తాయి. కన్నడనాటి సముద్రపు పల్లెటూళ్లలో జరిగే కథ అవ్వడం వల్ల అక్కడక్కడా 'మరల సేద్యానికి' గుర్తొస్తుంది. అయితే, ప్రాంతాలు మినహా, కథల్లో ఎక్కడా పోలిక లేదు. మధ్యతరగతి సమాజం పాటించే కొన్ని విలువలు, స్నేహాలు, బంధుత్వాలు, అంతర్వాహినిగా డబ్బు చూపించే ప్రభావం వీటన్నింటినీ చాలా నిశితంగా చిత్రించారు రచయిత. పురందర విషయానికి వస్తే, కేవలం డబ్బు మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచీ పరాయి పంచన, మరొకరి దయా దాక్షిణ్యాలతో పెరిగిన వాడు అవ్వడం వల్ల ఆత్మగౌరవమూ ముఖ్యమైన విషయమే. కష్టపడి ఓ జీవితాన్ని నిర్మించుకున్నాక "ఇంతకీ నేను సాధించింది ఏమిటి?" అన్న విచికిత్సలో పడతాడు. 

అనువాదం చాలావరకు సరళంగానే సాగింది. పాత్రలు. ప్రాంతాల పేర్లు, హాస్య సన్నివేశాలు మినహా మిగిలిన నవలంతా తెలుగు కథ చదువుతున్న భావననే కలిగించింది. "ఈ కథ జరిగేది ఉత్తర కన్నడ జిల్లాలో. కడలి తీరంలోని ఈ జిల్లాలో అనేక నదులు ప్రవహించి సముద్రాన్ని చేరతాయి. సముద్రాన్ని చేరే చోటు దూరం నుంచి శాంతంగా, మనోహరంగా కనిపించినా, ఆ సంగమం మధ్యకు వెళ్లి చూసినప్పుడే నది సాగరాన్ని చేరేటప్పటి కోలాహలం కనిపిస్తుంది. అదేవిధంగా మార్పులతో పోరాడుతున్న ఇక్కడి జీవితాలూ!" అన్నారు వివేక్ శానభాగ తన ముందుమాటలో. ఛాయ రిసోర్స్ సెంటర్ ప్రచురించిన ఈ 253 పేజీల నవల వెల  రూ. 180. ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఆన్లైన్ లోనూ కొనుగోలు చేయవచ్చు.