వర్తమానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వర్తమానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మంగళవారం, జూన్ 04, 2024

ఉచితమైన తీర్పు

"జగన్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవక పోతే, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు, దేశం మొత్తం మీద కూడా ఎక్కడా ఏ రాజకీయ పార్టీ ఉచిత పథకాలు ప్రకటించాల్సిన అవసరం లేదు..." సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది మొదలు మిత్రులెవరితో ఎన్నికల ప్రస్తావన వచ్చినా నేను చెబుతూ వచ్చిన మాట ఇదే. ఉచిత పథకాలని ఉద్యమ స్థాయిలో అమలు చేసిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇంతటి దారుణ పరాభవాన్ని రుచి చూస్తారని నాకే కాదు, నా మిత్రులు ఎవరికీ కూడా అంచనా లేదు. ఎందుకంటే, పోలింగ్ బూత్ కి తప్పకుండా వెళ్లి ఓటు వేసే కుటుంబాలన్నింటికీ గడిచిన ఐదేళ్ల కాలంలో పంచిన మొత్తాలు తక్కువేమీ కాదు. ఆ కృతజ్ఞత పూర్తిగా పని చేస్తుందని జగన్ నమ్మితే, ఎంతోకొంత మేరకు తప్పక ప్రభావం చూపిస్తుందని మా బోంట్లం అనుకున్నాం. 

ఆంధ్రప్రదేశ్ వోటింగ్ సరళిని చూస్తే, ప్రతిపక్షం పట్ల అనుకూలత కన్నా ప్రభుత్వం పట్ల వ్యతిరేకతే ఎక్కువగా పనిచేసినట్టు అనిపిస్తోంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లోనూ ఇలాంటి తీర్పునే ఇంతే బలంగా ఇచ్చారు ప్రజలు. (ఐదేళ్ల పాలనకే ఇంత వ్యతిరేకతని ఎందుకు మూట కట్టుకుంటున్నాం అనే ఆత్మవిమర్శని మన నాయకుల నుంచి అస్సలు ఆశించలేం, ఇది ఒక విషాదం). ప్రతిపక్ష నాయకుడిగా కొంచం విశ్రాంత జీవితం గడిపినా, ఎన్నికలకి ఏడాది ముందు పూర్తిగా యాక్టివేట్ అయిన నారా చంద్రబాబు నాయుడు తన సర్వమూ ఒడ్డి పోరాడారు ఈ ఎన్నికల్లో. ఈ వయసులో ఈ పోరాట స్ఫూర్తి  ఎంతైనా అభినందనీయం. అయితే, బాబు ఇచ్చిన 'అంతకు మించి' హామీలని జనం నమ్మేరా? 

నేనైతే నమ్మలేదనే అనుకుంటున్నాను. పదేళ్ల నాటి 'రైతు రుణ సంపూర్ణ మాఫీ' 'ఇంటికో ఉద్యోగం' లాంటి అమలు కాని హామీలని జనం మర్చిపోలేదు. కానైతే, ప్రభుత్వం మీద వ్యతిరేకతని ప్రకటించడానికి మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో, తెలుగుదేశం పార్టీయే ఊహించని రీతిలో విజయాన్ని కట్టబెట్టారు. (దీనిని ఏమాత్రం ముందుగా ఊహించగలిగినా, పొత్తుల ప్రస్తావన లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఉండేది ఆ పార్టీ). ఇంత బలంగా ఆగ్రహ ప్రకటన ఎందుకు చేశారు అన్నది కుతూహలం కలిగించే విషయం. నెలనెలా అకౌంట్లలో పడే డబ్బు ఆగిపోయినా పర్లేదనే నిర్ణయానికి ఊరకే వచ్చెయ్యరు కదా. నిజానికి జగన్ డబ్బు పంపిణీతో సరిపెట్టేసి వుంటే అది వేరే కథ. కానీ విద్యా వైద్య రంగాల్లో చెప్పుకోదగిన కృషి జరిగింది (దీనినెందుకో ప్రచారానికి పెద్దగా వాడుకోలేదు). వాలంటీర్ల వల్ల చాలావరకు మేలు జరిగింది, ముఖ్యంగా కరోనా కాలంలో. 

మౌలిక సదుపాయాలు (రోడ్లు), ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, ఇసుక, లిక్కర్ పాలసీలు, చాలామంది ఎమ్మెల్యేలు సామంత రాజుల్లాగా వ్యవహరించడం (కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరిగినట్టు), కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో జరిగిన నిత్యావసర వస్తువుల ధరల విపరీత పెరుగుదల.. ఇవి ప్రధాన కారణాలు అయితే, సవాలక్ష కారణాల్లో మరికొన్నింటిగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకి జీతాలు/పెన్షన్లు ఎన్నో తారీఖున వస్తాయన్నది ప్రతి నెలా ఓ పజిల్ కావడం లాంటి వాటిని చెప్పుకోవాలి. చంద్రబాబు వస్తే మంత్రదండంతో రాత్రికి రాత్రే ఇవన్నీ సరైపోతాయని భ్రమలు లేకపోవచ్చు కానీ, తమ ఆగ్రహాన్ని ప్రకటించే మార్గంగా ప్రజలు ఓటుని ఎంచుకున్నారనిపిస్తోంది. అందిన వాటి పట్ల కృతజ్ఞత కన్నా (నిజానికి ఈ కృతజ్ఞత ఉండాలా అన్నది వేరే చర్చ) అందని వాటి పట్ల ఆగ్రహమే ఎక్కువగా పనిచేసింది. 

జగన్ ప్రభుత్వం చేయలేకపోయిన రెండు ముఖ్యమైన ప్రాజెక్టులు -- ఒక స్థిరమైన రాజధాని ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం. ఐదేళ్ల నాడు కేంద్రంలో మెజారిటీ తక్కువ వస్తే, తన ఎంపీల మద్దతు ఇచ్చి నిధులు సాధించుకోవాలని జగన్ ఆశించారు. "కేంద్రం మెడలు వంచి" అని పదేపదే చెప్పారు. అప్పుడు రాని అవకాశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. లోక్ సభ ఫలితాల తీరు చూస్తుంటే "పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారు" అనే ఐదేళ్ల నాటి తన వ్యాఖ్యని నరేంద్ర మోడీ మర్చిపోవాల్సిన తరుణం వచ్చినట్టుగా అనిపిస్తోంది. పోలవరాన్నీ, అమరావతినీ నిధుల వరద ముంచెత్తవచ్చు. అయితే, రెండూ కూడా ఆ ఫళాన పూర్తయ్యే నిర్మాణాలు కావు. ఆ పనులు ఏ రీతిగా సాగుతాయన్నది చూడాలి. 

"మళ్ళీ బీజేపీ గెలిస్తే ఇన్కమ్ టాక్స్ శ్లాబ్ నలభై శాతం అవుతుంది, జీఎస్టీ ముప్ఫయి శాతం అవ్వచ్చు.." ఎన్నికలకి ముందు మిత్రులొకరు వ్యంగ్యంగా అన్న మాట ఇది. గత పదేళ్ల పన్నుపోట్ల మీద సెటైర్ అన్నమాట. ఇప్పుడిక ఏ పక్షం అధికారం లోకి రావాలన్నా మిత్ర పక్షాల సాయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ ధరలు, పన్నుల దూకుడు అలాగే ఉంటుందా, లేక ఏమన్నా నిదానిస్తుందా అన్నది వేచి చూడాల్సిన విషయం. ఈ మిత్రపక్షాల సాయం ఏమేరకు అవసరం పడుతుంది అన్నదాని మీద కొన్ని కీలకమైన విషయాలు ఆధార పడి వున్నాయి. ఆ సర్దుబాట్లు, ఇచ్చిపుచ్చుకోడాలు ఇదంతా జరగబోయే కథ. చంద్రబాబు మీద ఉన్న స్కిల్ స్కామ్ వగయిరా కేసులన్నీ తొలగిపోతాయనడానికి సందేహం లేదు. జగన్ కేసుల విషయంలో ఇప్పుడు వ్యవస్థ ఎలా పని చేయబోతోందన్నది చూడాలి. ఇంతకీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉచితాలు లేకపోయినా పర్లేదనుకున్నారా లేక చంద్రబాబు 'అంతకుమించి' ని నిజంగానే నమ్మేరా?? 

శుక్రవారం, ఫిబ్రవరి 09, 2024

భారత రత్నం

అవార్డుల బహూకరణలో రాజకీయాలు ప్రవేశించడం ఇవాళ కొత్తగా జరిగింది కాదు. ఎవరికి ఏ అవార్డు వచ్చినా దాని వెనుక ఒక రాజకీయ కారణం ఉంటుందన్నది బహిరంగ రహస్యం. అయినప్పటికీ కూడా నేను ఇష్టపడే ఇద్దరు వ్యక్తులకి 'భారత రత్న' అవార్డు ప్రకటించడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి ఈ అవార్డు ప్రకటించారన్న వార్త తెలియగానే తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరిగాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలకీ, సోనియా, రాహుల్ గాంధీల అభిమానులకీ ఈ ప్రకటన మింగుడు పడక పోవచ్చు. కానీ, 'భారతరత్న' అవార్డుకి విలువ పెంచే నిర్ణయం ఇది. మళ్ళీ చెబుతున్నా, ఇది రాజకీయ నిర్ణయమే అయి ఉండవచ్చు. అయినప్పటికీ, పీవీ అర్హతకి తగిన బహుమతి - అది కూడా చాలా చాలా ఆలస్యంగా. 

అది తాత ముత్తాతల నుంచి తనకి వారసత్వంగా వచ్చిన పార్టీ కాదు. అందులో తాను అప్పటికి ఎంపీ కూడా కాదు. ప్రధాని పదవికి తన అభ్యర్థిత్వం ఒక తాత్కాలిక ప్రకటన. ఆ పదవి కోసం పార్టీలో సీనియర్ల నుంచే విపరీతమైన పోటీ. ప్రతి పూటా ఆ పదవిని రక్షించుకుంటూ ఉండాలి. ఇది చాలదన్నట్టు ఏ క్షణంలో ప్రభుత్వం కూలుతుందో తెలియని రాజకీయ అనిశ్చితి. ఒకరిద్దరు ఎంపీలు గోడ దూకినా ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితి. మరో నాయకుడైతే కేవలం తన పదవిని నిలబెట్టుకోడానికే పరిమితమై, రోజువారీ కార్యకలాపాలని 'మమ' అనిపించి కుర్చీ దిగి ఉండేవాడు. ఆనాడు ఆ పదవిలో ఉన్నది మరో నాయకుడే అయితే ఇవాళ భారత దేశం మూడో ప్రపంచ దేశాల (థర్డ్ వరల్డ్ కంట్రీస్) సరసన నిలబడి ఆకలి దప్పులతోనూ, అంతర్గత యుద్ధాలతోనూ అలమటిస్తూ ఉండేది. 

ఇవాళ్టిరోజున చాలా మామూలుగా అనిపించే 'నూతన ఆర్ధిక సంస్కరణలు' ఆరోజున చాలా పెద్ద నిర్ణయం. అప్పుడు, అంటే 1991 లో దేశానికి ఇక అప్పు పుట్టని పరిస్థితి ఎదురైనప్పుడు, బంగారం నిలవల్ని విదేశానికి తరలించాల్సి వచ్చింది, కుదువ పెట్టి అప్పు తీసుకు రావడం కోసం. బంగారాన్ని కళ్ళతో చూస్తే తప్ప అప్పు ఇవ్వడానికి నిరాకరించిన వాతావరణం. అంతర్జాతీయంగా ఆనాటి భారతదేశపు పరపతి అది. ఉన్నవి రెండే దారులు. కొత్త కొత్త అప్పులు చేస్తూ, పన్నులు పెంచి వాటిని తీరుస్తూ రోజులు గడపడం మొదటిది. ప్రపంచీకరణ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశించడం రెండవది. స్వపక్షం, విపక్షాలు కూడా మొదటి దారిని కొనసాగించమనలేదు, కానీ రెండో దారిని తీవ్రంగా వ్యతిరేకించాయి. (అలా వ్యతిరేకించిన వారిలో చాలామంది సంతానం ఇవాళ అమెరికా తదితర దేశాల్లో స్థిరపడడానికి కారణం ఆ ప్రపంచీకరణే కావడం ఒక వైచిత్రి). 

తన పదవిని, మైనారిటీ ప్రభుత్వాన్నీ నిలబెట్టుకుంటూనే, వ్యతిరేకిస్తున్న అందరినీ సమన్వయం చేసుకుంటూ, ఒక చారిత్రక నిర్ణయం తీసుకుని భారత దేశాన్ని ప్రపంచ మార్కెట్లో ప్రవేశపెట్టిన ఘనత కచ్చితంగా పీవీ నరసింహారావుకే దక్కుతుంది. మన్మోహన్ సింగ్ ని ఆర్ధిక మంత్రిగా నియమించుకోవడం మొదలు, కీలక నిర్ణయాలు తీసుకోడానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వరకూ అడుగడుగునా పీవీ శక్తియుక్తులు కనిపిస్తాయి. ప్రపంచీకరణ ఫలితంగా విదేశీ పెట్టుబడులు భారతదేశానికి రావడం మొదలయ్యింది. అప్పటి వరకూ ఉద్యోగం అంటే గవర్నమెంట్, బ్యాంక్ లేదా స్థానిక ప్రయివేటు సంస్థల్లో మాత్రమే విపరీతమైన పోటీ మధ్యలో అవకాశాలు దక్కించుకుంటూ వస్తున్న యువతకి కార్పొరేట్ ఉద్యోగాలు దేశ విదేశాల్లో స్వాగతం పలికాయి. స్థానికంగా విద్యావకాశాలు పెరిగాయి. మధ్యతరగతి నిలబడింది. చదువుకునే అవకాశాన్ని వినియోగించుకున్న పేదలు మధ్య తరగతికి, ఆపై తరగతికి చేరగలిగారు. 

ఇంత చేసిన పీవీకి దక్కింది ఏమిటి? సొంత పార్టీ నుంచే ఛీత్కారాలు. ప్రాణం పోయాక, అంతిమ సంస్కారాలకి దేశ రాజధానిలో కనీసం చోటు దొరకలేదు. ఆ జీవుడు వెళ్ళిపోయిన ఇన్నేళ్ల తర్వాత కూడా "అప్పట్లో మా కుటుంబం అధికారంలో ఉండి ఉంటే బాబరీ మసీదు కూలి ఉండేది కాదు" అనే వాళ్ళు ఒకరైతే, "భారత దేశానికి తొలి బీజేపీ ప్రధాని పీవీ నరసింహారావు" అనేవారు మరొకరు. ఇవన్నీ ఒక ఎత్తైతే, జీవితకాలమూ పీడించిన కోర్టు కేసులు మరో ఎత్తు. పోనీ ప్రధాని పదవిని దుర్వినియోగం చేసి వందల కోట్లో, లక్షల కోట్లో వెనకేసుకున్నారా అంటే, ఆ కుటుంబం ఇప్పటికీ దేశంలోనే ఉంది. సాధారణ జీవితాన్నే గడుపుతోంది. గోరంత చేసినా కొండంత ప్రచారం చేసుకునే నాయకులున్న కాలం ఇది. కొండంత చేసి కూడా గోరంతకూడా చెప్పుకోని (చెప్పుకోలేని) పీవీ లాంటి నాయకులు అత్యంత అరుదు. 

ఇప్పుడీ అవార్డు వల్ల విమర్శించే నోళ్లు మూత పడతాయా? అస్సలు పడవు. అవార్డు వెనుక రాజకీయ ప్రయోజనం ఉన్నట్టే, విమర్శ వెనుక కూడా ఉంటుంది. ఏం జరుగుతుందీ అంటే, నూతన ఆర్ధిక సంస్కరణలనాటి రోజుల నెమరువేత జరుగుతుంది. వాటి వల్ల బాగుపడిన కొందరైనా గతాన్ని గుర్తు చేసుకుంటారు. పీవీ కృషికి తగిన గుర్తింపు దొరికిందని సంతోషిస్తారు. విమర్శకులందరూ పాత విమర్శలకి మరో మారు పదును పెడతారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఉన్నతమైన అవార్డు పరువు తీసింది అంటారు. జీవించి ఉన్నప్పుడే విమర్శలకి వెరవని, చలించని నాయకుడు పీవీ. ప్రధాని పదవి వరిస్తే పొంగి పోనట్టే, ఈ అవార్డుకీ పొంగిపోరు. ఎటొచ్చీ ఆయన కృషిని గుర్తు చేసుకునే నా బోంట్లు సంతోషిస్తారు. అంతే.. 

అన్నట్టు, ఎమ్మెస్ స్వామినాథన్ కి 'భారత రత్న' వస్తుందని ఆయన ఉండగానే అనిపించింది నాకు. పీవీ లెక్కలో చూస్తే, స్వామినాథన్ కి త్వరగా వచ్చినట్టే. ఆయనకీ ఈ అవార్డుకి అన్ని అర్హతలూ ఉన్నాయి. 

బుధవారం, జూన్ 29, 2022

సినిమా చూద్దాం ...

తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడో చిత్రమైన పరిస్థితి ఉంది. ఇది గతంలో ఎప్పుడూ లేనిది, నిర్మాతలు ఊహించనిదీను. సినిమా హాళ్ళకి ప్రేక్షకులు రావడం లేదు. ఒకప్పుడు ప్రత్యేక పరిస్థితులు, కారణాలు చెప్పి టిక్కెట్టు రేటుకి రెట్టింపు వసూలు చేసినా అమితమైన ఉత్సాహంతో టిక్కెట్లు కొనుక్కుని భారీ సినిమాలని అతిభారీగా విజయవంతం చేసిన ప్రేక్షకులు, ఇప్పుడు 'టిక్కెట్టు రేటు తగ్గించాం, సకుటుంబంగా థియేటర్ కి వచ్చి మా సినిమా చూడండి' అని సినిమా వాళ్ళు సగౌరవంగా పిలుస్తున్నా, ఆవైపు వెళ్ళడానికి తటపటాయిస్తున్నారు. ఫలితంగా, భారీ సినిమాలు కోలుకోలేని విధంగానూ, మధ్యరకం సినిమాలు తగుమాత్రంగానూ నష్టపోతున్నాయి. 'చిన్న సినిమాలు' అనేవి దాదాపుగా కనుమరుగైపోయాయి కదా. 

నిజానికి 'సినిమా నష్టాలు' అనేది కొత్త విషయమేమీ కాదు, ఉండుండీ అప్పుడప్పుడూ చర్చకి వస్తూనే ఉంటుంది. తేడా ఏంటంటే, నష్టాలకి కారణాలు మారుతూ ఉంటాయి. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా నష్టాలకి కారణం ప్రేక్షకులే. జాతి గౌరవాన్నో, అభిమాన హీరో పరువునో నిలబెట్టడం కన్నా కష్టర్జితాన్ని ఇతరత్రా ఖర్చులకి వెచ్చిస్తున్నారు వాళ్ళు. ఫలితంగా, అటు పెద్ద పెట్టుబడులతో సినిమా తీసి, పెద్దల సాయంతో టిక్కెట్టు రేట్లు పెంచుకున్న సినిమాలకీ, ఇటు సంసారపక్షంగా తగుమాత్రం బడ్జెట్టుతో సినిమా పూర్తి చేసి టిక్కెట్టు రేటు తగ్గించిన సినిమాలకీ కూడా థియేటర్ల దగ్గర ఫలితం ఒకలాగే ఉంటోంది. హాలుకొచ్చి టిక్కెట్టు కొని సినిమా చూసే ప్రేక్షకులనే నమ్ముకుని సినీ కళామతల్లి సేవకి జీవితాలని అంకితం చేసిన నటీనటులకీ, దర్శక నిర్మాతలకీ ఇది బొత్తిగా మింగుడు పడని పరిణామం. 

కరోనా కారణంగా జనమంతా రెండేళ్ల పాటు ఇళ్లకే పరిమితమైపోయారు. నట్టింట వినోదానికి అలవాటు పడిపోయారు. ఓటీటీల పుణ్యమా అని ఇతర భాషల సినిమాలని నేరుగానూ, డబ్బింగు వెర్షన్ల ద్వారానూ చూసేశారు. ఫలితం ఏమిటంటే, తెలుగు సినిమాలని ఆయా భాషల సినిమాలతో పోల్చుకోవడం మొదలు పెట్టారు. రాజుని చూడ్డానికి అలవాటు పడిపోయిన కళ్ళు మరి. నాటకాలు తదితర కళలన్నీ విజయవంతంగా అవసాన దశకి చేరుకొని, సినిమా మాత్రమే ఏకైక వినోదంగా మిగిలింది కాబట్టి నాణ్యతతో సంబంధం లేకుండా హాల్లో సినిమాలు చూసి తీరాలి నిజానికి. చిక్కు ఎక్కడొచ్చిందంటే, కరోనా అనంతర పరిస్థితుల్లో ఖర్చు వెచ్చాల్లో తేడాలొచ్చేసి నెల జీతాల వాళ్ళు బడ్జెట్లు, ఖర్చు చేసే ప్రాధాన్యతా క్రమాలు ఉన్నట్టుండి మారిపోయాయి. 

Google Image

కరోనా పేరు చెప్పి చాలామందికి జీతాలు పెరగలేదు. ఉద్యోగం నిలబడింది, అందుకు సంతోషించాలి అనుకునే పరిస్థితి. మరోపక్క ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఉక్రెయిన్ యుద్ధం అనే వంక కూడా దొరికింది, ధరల పెరుగుదలకి. తారుమారైన ఇంటి బడ్జెట్లలో, సినిమా ఖర్చు అనివార్యంగా 'తగ్గించుకో గలిగే ఖర్చుల' జాబితాలోకి చేరిపోయింది. మనవాళ్ళు అన్నం తినకుండా అయినా ఉండగలరు కానీ, సినిమా చూడకుండా ఉండలేరని సినిమా వాళ్ళకో ఘాట్టి నమ్మకం. దాన్నేమీ వమ్ము చేయడం లేదు. వచ్చిన సినిమాని వచ్చినట్టు చూస్తున్నారు, కాకపోతే థియేటర్లో కాదు, ఓటీటీలో. హాల్లో రిలీజైన రెండు మూడు వారాల్లోపే ఇంట్లో టీవీలో చూసే సౌకర్యం ఉన్నప్పుడు, వస్తున్న సినిమాలు కూడా ఆమాత్రం రెండు మూడు వారాలు ఆగగలిగేవే అయినప్పుడు అన్నం మానేయాల్సిన అవసరం ఏముంది? 

పైగా ఒక్క టిక్కెట్టు రేటు మాత్రమే కాకుండా, పార్కింగ్ మొదలు పాప్ కార్న్ వరకూ చెల్లించాల్సిన భారీ మొత్తాలు కూడా ఆదా అయి ఖర్చులో బాగా వెసులుబాటు కనిపిస్తోంది. మొత్తం సినిమానో, కొన్ని భాగాలో బాగా నచ్చితే మళ్ళీ చూసే వెసులుబాటుతో పాటు, నచ్చకపోతే వెంటనే టీవీ కట్టేసే సౌకర్యాన్ని కూడా ఓటీటీ ఇస్తోన్నప్పుడు కష్టపడి సినిమాహాలు వరకూ వెళ్ళాలా? అన్నది బడ్జెట్ జీవుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఇలా ఉన్నట్టుండి ప్రేక్షకులు వాళ్ళ  స్వార్ధం వాళ్ళు చూసుకోడంతో సినిమావాళ్ళు కాస్ట్ కటింగ్ ఆలోచనలో పడ్డారు. కళామతల్లికి ఖరీదైన సేవ చేసే పెద్ద నటీనటుల జోలికి వెళ్లడం లేదు కానీ, రోజువారీ కూలీకి పని చేసే కార్మికులు, చిన్నా చితకా ఆర్టిస్టుల ఖర్చుల వైపు నుంచి నరుక్కొద్దామని చూస్తున్నారు. 

రోజువారీ వేతనాలు సవరించమంటూ మొన్నామధ్యన సినిమా కార్మికులు మొదలు పెట్టిన సమ్మె ఒక్కరోజులోనే ఆగిపోయింది. అవసరమైతే పొరుగు రాష్ట్రాల నుంచి కార్మికుల్ని తీసుకొచ్చి సినిమాలు నిర్మిస్తాం తప్ప, మీ డిమాండ్లు పరిష్కరించం అని తెగేసి చెప్పేశారు నిర్మాతలు. సమస్య పరిష్కారానికి ఓ కమిటీ వేశారు కానీ, ఫలానా తేదీ లోగా పరిష్కరించాలనే నిబంధనలేవీ లేవు. చట్టంలాగే ఆ కమిటీ కూడా తన పని తాను చేసుకుపోతుంది కాబోలు. ఈ ప్రకారంగా అగ్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల కళాసేవకి ఆటంకం కలగకుండా ఉండేందుకు నిర్మాతలు పాపం తమవంతు కృషి చేస్తున్నారు. ఇతరత్రా ఉపాయాలు కోసం వేరే రాష్ట్రాల వైపు చూసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే, అన్నిరకాలుగానూ తెలుగు సినిమా ప్రత్యేకమైనది. ఇప్పటి పరిస్థితీ ప్రత్యేకమైనదే. అద్భుతాలు జరిగిపోతాయన్న ఆశ లేదు కానీ, రాబోయే రోజుల్లో కళాసేవ ఏవిధంగా జరుగుతుందో చూడాలన్న కుతూహలం మాత్రం పెరుగుతోంది . 

సోమవారం, జూన్ 27, 2022

ఒక ఎంపిక

"సంతాలీ వారి వృత్తి వేట, ఆయుధం బాణం. అందుకే వారి గౌరవార్ధం చిత్తరంజన్ లోకో వర్క్స్ లోగోలో బాణం గుర్తుని కూడా చేర్చారు. చాలామంది సంతాలీలకి ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళ ఇంటిపేర్లు భిన్నంగా ఉంటాయి. టుడ్డు, ముర్ము, ఎక్కా.. అలా ఉంటాయి. చిత్తరంజన్ లో విశ్వకర్మ పూజకి చాలా ప్రాధాన్యత ఉంది. సెప్టెంబర్ నెలలో వచ్చే ఆ పూజని చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సెక్షన్ లోనూ విశ్వకర్మ విగ్రహం పెట్టి పూజ చేస్తారు. వర్క్ షాప్ కి ఆవేళ బయట వాళ్ళని కూడా అనుమతిస్తారు. వేలమంది వస్తారు. మాలాంటి వాళ్ళు ఒంటరిగా వెళ్లినా సంతాలీలు మాత్రం పసిపిల్ల బాలాదీ వస్తారు. ఆడవారి కట్టు వేరుగా ఉంటుంది. జాకెట్టు వేసుకోరు. ఉన్నంతలో మంచి చీరె కట్టుకుని, తల నున్నగా దువ్వుకుని, పువ్వులు పెట్టుకుని, వెండి నగలు వేసుకుని వచ్చారు.

ఒక ఏడు చూస్తే చాలదా, ప్రతి ఏడూ ఎందుకు కాళ్ళీడ్చుకుంటూ రావడం అని సందేహం కలిగింది. 'ఈ పూజ కోసం ఏడాదంతా ఎదురు చూస్తారు. తప్పకుండా వస్తారు' అని చెప్పారు మా శ్రీవారు. వచ్చిన వాళ్ళు ఊరికే చూసి పోటం లేదు, వాళ్ళ వాళ్ళు పని చేసే దగ్గర ఆగి, అక్కడ పెట్టిన విశ్వకర్మ విగ్రహానికి, అమిత భక్తితో ఒకటికి పదిసార్లు దండాలు పెట్టడం చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. ఏడాది పొడుగునా తమ మనిషి అక్కడే పనిచేస్తాడు, అతనికి ఎటువంటి ప్రమాదమూ జరగ కూడదని ప్రార్ధిస్తారుట. మరి వాళ్ళ ప్రార్ధనల ఫలితమేనేమో, అంత పెద్ద కర్మాగారంలో ఏనాడూ ప్రమాదం జరగదు. సంతాలీలను చూశాక, రోజూ పొద్దున్న దీపం పెట్టి, ఫ్యాక్టరీ చల్లగా ఉండాలని దణ్ణం పెట్టుకోటం అలవాటు అయింది.." సీనియర్ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి రాసిన 'జ్ఞాపకాల జావళి' లో 'కర్మాగారం' అనే అధ్యాయంలో కొంత భాగం ఇది. 

ఒక్క చిత్తరంజన్ మాత్రమే కాదు, భారతదేశంలో నిర్మాణం జరిగిన అనేక భారీ ప్రాజెక్టుల వెనుక ఈ సంతాలీల శ్రమ ఉంది. వారు చిందించిన చెమట ఉంది. దేశానికి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్ల తర్వాత, మొట్టమొదటిసారిగా ఈ 'సంతాలీ' తెగకి చెందిన మహిళని అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించింది కేంద్రంలోని అధికార పార్టీ. ఆమె ఎన్నిక లాంఛనమా, కష్టసాధ్యమా అనే చర్చని పక్కన పెడితే అత్యున్నత పదవికి నామినేషన్ వరకూ ప్రయాణం చేయడానికి అత్యంత వెనుకబడ్డ సంతాలీ గిరిజనులకు డెబ్బై ఐదేళ్లు పట్టింది! ఒడిశాకి చెందిన ద్రౌపది ముర్ము నామినేషన్ ఘట్టాన్ని టీవీలో చూస్తుంటే వచ్చిన చాలా ఆలోచనల మధ్యలో పొత్తూరి విజయలక్ష్మి గారి రచనా గుర్తొచ్చింది. తెలుగు సాహిత్యంలో సంతాలీల ప్రస్తావన ఇంకెక్కడా వచ్చినట్టు లేదు. 

అదే టీవీలో కొన్ని ఛానళ్లలో 'మన వాడికి' రాష్ట్రపతి అవకాశం ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం కనిపించింది. దేశం ముక్కలవుతుందన్న బెదిరింపూ వినిపించింది. 'ముక్కలవ్వడం మరీ అంత సులభమా?' అనిపించేసింది చూస్తుంటే. మనవాళ్ళకి ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చాయి, ఒక్క అవకాశమూ రాని వర్గాలు ఇంకా చాలానే మిగిలి ఉన్నాయన్న స్పృహ వారికి ఎందుకు కలగలేదన్న ఆశ్చర్యం వెంటాడింది. 'రాష్ట్రపతి-రబ్బరు స్టాంపు' తరహా చర్చలూ జరిగాయి. ఇప్పటివరకూ పనిచేసిన పద్నాలుగు మందిలోనూ పదవిని అలంకరించుకున్న వాళ్లతో పాటు, పదవికి అలంకారంగా మారిన వాళ్ళూ ఉన్నారు. లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు గాక, మన వ్యవస్థ బలమైనది. ప్రతి పదవికీ ప్రయోజనం ఉంటుంది. సమయం, సందర్భం కలిసిరావాలి. ఆ సమయంలో, ఆ పదవిలో ఉన్న వ్యక్తి బలమైన నిర్ణయాలు తీసుకోగలిగే వారై ఉండాలి. 

ఇదే 'జ్ఞాపకాల జావళి' లో 'అర్చన' అధ్యాయంలో కొంత భాగం: "అర్చనా వాళ్ళు సంతాలీల్లో ఒక తెగకు చెందిన వాళ్ళు. వాళ్ళ బంధువులు కాస్త దూరంలో బాఘా అనే చిన్న జనావాసంలో ఉంటారు. అక్కడ ఒక అమ్మాయికి ఏడాది కిందట పెళ్లి అయింది. భర్త తిన్ననైన వాడు కాదు. తాగటం, పెళ్ళాన్ని కొట్టటం. రెండు నెలలకే పుట్టింటికి వచ్చేసింది. వాళ్లొచ్చి నచ్చచెప్పి తీసుకెళ్లారు. అలా నాలుగైదు సార్లు జరిగింది. వీళ్ళు విసిగిపోయి దండువా పెట్టారు. దండువా అంటే పిల్లవైపు బంధువులు పిల్లాడింటికి వెళ్తారు. మగవాళ్ళు ఖాళీ చేతులతో వెళ్తారు. ఆడవాళ్ళూ వెళ్తూ చీపురు, అప్పడాల కర్ర, విసిన కర్ర వంటి ఆయుధాలు తీసుకెళ్తారు. పిల్లాడిని కూచోబెట్టి చుట్టూ తిరుగుతూ తలోటీ తగిలిస్తారు. మళ్ళీ అందులోనూ పద్ధతులున్నాయి. పిల్ల తల్లి, వదిన మాత్రం కొట్టరు, తిట్టి ఊరుకుంటారుట. 

'దండువా అయ్యాక ఛాటా చేశారు' అంది అర్చన. ఛాటా అంటే తెగతెంపులు. 'ఇక మీకూ మాకూ రామ్ రామ్' అని అందరిముందూ ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళిచ్చిన బంగారం, వెండి వాళ్ళకి ఇచ్చేశారు. వీళ్ళు ఇచ్చినవి చెవులు మెలేసి తీసుకున్నారు. వాళ్ళు కారం బూందీ, తీపి బూందీ పెట్టి చాయ్ ఇచ్చారుట. 'తన్నడానికి పోతే విందు కూడానా?' అంటే, 'అవును మరి, మేము ఊరికే పోయామా? మా పిల్లని బాగా చూసుకుంటే వాళ్ళ గడప తొక్కే పనేముంది మాకు? తప్పు వాళ్లదే కాబట్టి మర్యాద చెయ్యాలి. అదే మా పధ్ధతి. పిల్లని పుట్టింటి వాళ్ళు తీసుకు వచ్చేశారు. దానిష్టం అయితే మారు మనువుకి వెళ్తుంది. లేదా ఏదో కాయకష్టం చేసుకుంటూ ఉంటుంది' అని వివరంగా చెప్పి 'పనుంది' అని వెళ్ళిపోయింది. చెయ్యెత్తి దణ్ణంపెట్ట బుద్ధి వేసింది నాకు. ఏం చదివారు వీళ్ళు? ఎంత తెలివి? ఎంత బాధ్యత? ఎంత ఐకమత్యం? అన్నింటినీ మించి ఎంత ధైర్యం? మనమూ ఉన్నాం ఎందుకూ? చుట్టుపక్కల ఏం అన్యాయం జరిగినా బాపూ గారి కార్టూన్ లో చెప్పినట్టు చూసీ చూడనట్లు ఊరుకుంటాం." 

బుధవారం, జూన్ 22, 2022

యుద్ధ బీభత్సం

యుద్ధం కొనసాగుతోంది. బలమైన రష్యా, చిన్న దేశమైన ఉక్రెయిన్ మీద విజయం సాధించడం పెద్ద విషయమేమీ కాదనుకున్న వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు. రెండు దేశాల బలాబలాలు, వాటి వెనుక ఉన్న శక్తులు, యుద్ధభూమిలో జరగబోయే పరిణామాలు.. వీటన్నింటినీ కాసేపు పక్కన పెట్టి, యుద్ధ బీభత్సాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన సమయమిది. మృతులు, క్షతగాత్రులు, కాలిన, కూలిన భవనాలు, ధ్వంసమైన ఆస్తులు.. ఇవన్నీ కనిపించే బీభత్సాలు. చాపకింద నీరులా ప్రపంచాన్ని, మరీ ముఖ్యంగా బీదవైన మూడో ప్రపంచ దేశాలని, చుట్టుముడుతోన్న బీభత్సం ఆకలి. కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో ఆకలి కేకలు మొదలయ్యాయి. మరికొన్ని దేశాలకీ ఇవి విస్తరించబోతున్నాయి. అంత తీవ్రంగా కాకపోయినా మిగిలిన అన్ని దేశాల్లోనూ ఎంతో కొంత ప్రకంపనలు వినిపించని తప్పని పరిస్థితే కనిపిస్తోంది. 

నెలల తరబడీ జరుగుతున్న యుద్ధం కారణంగా, సరిహద్దుల మూసివేత ఫలితంగా, అటు రష్యా నుంచీ, ఇటు ఉక్రెయిన్ నుంచీ మిగిలిన దేశాలకి ఆహారధాన్యాల సరఫరా ఆగిపోయింది. సోమాలియా, సూడాన్, లిబియా లాంటి చిన్న దేశాలు గోధుమలు, వంట నూనెల కోసం ఈ రెండు దేశాల మీదే ఆధార పడ్డాయి. అంతే కాదు, వ్యవసాయం చేయడానికి అవసరమయ్యే రసాయన ఎరువుల తయారీకి రష్యా ప్రధాన కేంద్రం. ఎరువుల సరఫరా కూడా ఆగిపోయింది. కరువు మొదలయ్యింది. గడ్డి మొలవని పరిస్థితుల్లో పాడి పశువులు మరణిస్తున్నాయి. పాలకీ కొరత మొదలయ్యింది. ఉన్న ఆహార నిల్వలు అడుగంటున్నాయి. కొత్త సరఫరాలకి దారులు తెరుచుకోలేదు. దూర దేశాల నుంచి తెప్పించుకోవడం ఖరీదైన వ్యవహారం మాత్రమే కాదు, చాలా సమయం పట్టే ప్రక్రియ కూడా. 

ఇది ఆఫ్రికా దేశాలకి మాత్రమే పరిమితమైన సమస్య కాదు, ఆహారధాన్యాల దిగుమతుల మీదే పూర్తిగా ఆధార పడ్డ ఈజిప్టుది కూడా. కానైతే, ఆఫ్రికన్ దేశాల పేదరికం వాటిని త్వరగా కరువులోకి నెట్టేసింది. యుద్ధకాలంలోనే ప్రకృతి కూడా పగబట్టింది. ధరలు రెట్టింపయ్యాయి, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. ఫలితంగా, ఆకలి కేకలు మొదలయ్యాయి. నిజానికి ధరల పెరుగుదల యుద్ధానికన్నా ముందే మొదలయ్యింది. కరోనా కారణంగా ధరల పెరుగుదల ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదు. అయితే, అటు ఈజిప్టు, ఇటు ఆఫ్రికన్ దేశాల్లో మాత్రం యుద్ధం కారణంగా పరిస్థితి పుండుమీద కారం జల్లినట్టైంది. ఇప్పుడు ప్రపంచమంతా 'గ్లోబల్ విలేజ్' కాబట్టి ఈ సమస్య మిగిలిన దేశాలకి విస్తరించడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. 

సముద్ర మార్గాలు మూసుకుపోవడం, భూమార్గాల ద్వారా సరుకు రవాణా ఖరీదైన వ్యవహారం కావడం, అన్నింటినీ మించి ఆహారధాన్యాలు యుద్ధంలో ఉన్న రెండు దేశాల సరిహద్దులు దాటి బయటికి వచ్చే మార్గాలు రోజురోజుకీ మూసుకుపోవడంతో కొద్ది నెలల్లోనే ఆహార ధాన్యాల కొరత తీవ్రమయ్యింది.  ఆహార ధాన్యాలు పండించే మిగిలిన దేశాలేవీ ఎగుమతి చేయగలిగే పరిస్థితుల్లో లేవు. స్థానిక అవసరాల మొదలు, రాజకీయ సమస్యల వరకూ కారణాలు అనేకం. ఉదాహరణగా భారత దేశాన్నే తీసుకుంటే, గోధుమలు ఎగుమతి చేస్తామని ప్రకటించి వెనువెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కారణం, దిగుబడి తగ్గడం, పండిన పంట స్థానిక అవసరాలకి ఎంతవరకూ సరిపోతుందన్న సందేహం రావడం. మార్చి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఈ ఏడు గోధుమ దిగుబడి దారుణంగా పడిపోయింది. 

కరువు అనేది ఓ భయంకరమైన విషయం. గోదావరి ఆనకట్ట కట్టక మునుపు సంభవించిన 'డొక్కల కరువు' గురించి చిన్నప్పుడు కథలు కథలుగా విన్నాం. క్షుద్భాధకి తాళలేక మట్టిలో నీళ్లు కలుపుకు తిన్నవాళ్ళు, ఎవరైనా చనిపోగానే వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి తిండికోసమూ మిగిలిన వాళ్ళు ప్రాణాలకి తెగించి కొట్టుకోడం లాంటివి విన్నప్పుడు ఒళ్ళు జలదరించేది. అవన్నీ సాంకేతికత అభివృద్ధి చెందని నాటి పరిస్థితులు. గడిచిన ముప్ఫయ్యేళ్లలో సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరిగింది. ఎన్నెన్నో సమస్యల్ని కంప్యూటర్లు చిటికెలో పరిష్కరించేస్తున్నాయి. వాతావరణం ఎలా ఉండబోతోందో ముందుగా తెలుస్తోంది. వరదలు, తుపానుల గురించి ముందస్తు అంచనా ఎన్నో ప్రాణాలనీ, పంటల్నీ కాపాడుతోంది. ఇప్పుడు చుట్టుముడుతున్న కరువుని ఎదిరించాలంటే యుద్ధం ఆగాలి. ఆపని చేయగలిగేది టెక్నాలజీ కాదు, దాన్ని వాడే మనుషులే.

సోమవారం, మే 16, 2022

మండుటెండలు

ఎండలు మండిపోతున్నాయనుకోవడం ప్రతి వేసవిలోనూ మనకి మామూలే కానీ ఈసారి మామూలుగా కాక 'రికార్డు' స్థాయిలో మండుతున్నాయి. గత నెలలో (ఏప్రిల్) భారతదేశంలో నమోదైన ఉష్ణోగ్రతలు గడిచిన నూట ఇరవై రెండు సంవత్సరాల్లోనే అత్యధికంట! మనమే కాదు, పొరుగున ఉన్న పాకిస్తాన్, శ్రీలంక దేశాలు కూడా మండుతున్నాయి, కేవలం రాజకీయ వేడి మాత్రమే కాదు అక్కడి వాతావరణమూ అసహజమైన ఎండలతో అట్టుడుకుతోంది. బంగ్లాదేశ్ దీ అదే పరిస్థితి. ఈ బీద దేశాలన్నింటిమీదా సూర్యుడు ఎందుకిలా పగబట్టాడన్నది బొత్తిగా అంతుబట్టడంలేదు. ఎండల నుంచి రక్షింపబడడానికి జనాలకున్న ఒకే ఒక్క అవకాశం ఫ్యాన్ కిందో, ఏసీలోనో సేదదీరడం. అవి నడిచేది కరెంటు మీద. ఆ కరెంటుకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి సరఫరాలో ప్రతిరోజూ కోత పడుతోంది. ఇది చాలదన్నట్టు చార్జీలు రోజురోజుకీ పెరుగుతున్నాయి కూడా. 

ఉష్ణోగ్రతలు పెరగడానికి సైన్సు చెప్పే రెండు కారణాలు కాలుష్యం పెరగడం, పచ్చదనం తగ్గిపోవడం. ఏళ్ళ తరబడి ఇవే కారణాలు వినిపిస్తున్నా పరిష్కారం ఏమీ దొరక్కపోగా, ఎండలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ రెండు కారణాలు మనొక్క చోటే కాదు, మొత్తం ప్రపంచం అంతా ఉన్నవే కదా. మరి మనల్ని మాత్రమే ఈ ఎండలు ఎందుకు బాధిస్తున్నాయి. నాకు అర్ధమైనంత వరకూ ప్రతి సమస్యకీ ఉన్నట్టే ఈ ఎండల సమస్యకీ రెండు పరిష్కారాలు ఉన్నాయి -  ఒకటి తాత్కాలికమైనది, రెండోది శాశ్వతమైనది. మిగిలిన ప్రపంచం, మరీ ముఖ్యంగా ధనిక దేశాలు తాత్కాలిక పరిష్కారం దోవ పట్టాయి. వేసవిలో పెరిగే విద్యుత్ డిమాండ్ ని ముందుగానే ఊహించి పంపిణీకి ఆటంకం లేకుండా చూడడం, అవసరమైతే వీళ్లకీ వాళ్ళకీ (ఓ దేశానికీ, మరోదేశానికీ) జుట్లు ముడిపెట్టి ఇంధన సరఫరా వరకూ వాళ్ళ పబ్బం గడుపుకోవడం. దీనివల్ల 'ఎండలు బాబోయ్' అన్న మాట అక్కడ వినిపించడం లేదు. 

Google Image

ఇప్పుడు ఉష్ణోగ్రతలో రికార్డులు బద్దలు కొడుతున్న దేశాల్లో ఎండలు పెరిగేందుకు భౌగోళిక కారణాలు కొంత కారణం అయితే, తగ్గించుకునేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకునే వీలు కూడా కనిపించకపోవడం మరో సమస్య. ఓ పదేళ్ల క్రితంతో పోలిస్తే ఏసీల మార్కెట్ విపరీతంగా పెరిగిన మాట వాస్తవమే అయినా, మొత్తం జనాభా-ఏసీల నిష్పత్తితో పోల్చి చూసినప్పుడు వినియోగంలో ఉన్న ఎయిర్ కండిషనర్ల సంఖ్య తక్కువనే చెప్పాలి. పైగా జనం దగ్గర ఉన్న ఏసీలన్నీ వినియోగంలో ఉన్నాయనీ చెప్పలేం. కరెంటు కోత, బిల్లుల మోత కారణంగా ఇంట్లో ఏసీ ఉన్నా రోజంతా వాడే వాళ్ళు తక్కువే. కూలర్లు, ఫ్యాన్లదీ ఇదే కథ. ప్రజల్లో ఖర్చుపెట్టే శక్తి తక్కువగా ఉండడం, ఖర్చు పెట్టే అవకాశం లేకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి. భారీ ఎత్తున చెట్ల నరికివేత, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కూడా గాలాడని ఉక్కపోతకి బాగానే దోహదం చేస్తున్నాయి. అయితే, వీటిలో ఏదీ ఆపగలిగేది కాదు. 

ఆశ్చర్యం ఏమిటంటే, ఏ ఏసీ అయితే ఎండ వేడిమి నుంచి ఉపశమనం ఇస్తుందో, అదే ఏసీ భవిష్యత్తులో ఉష్ణోగ్రత మరికొన్ని డిగ్రీలు పెరగడానికి కారణం అవుతోంది. పెరిగిపోతున్న వాతావరణం కాలుష్యానికి ప్రధానంగా తోడ్పడుతున్న వాటిలో ఏసీలో ఉన్నాయి. వీటితో పాటు క్రమేపీ పెరుగుతున్న విమానయానం, ఇప్పటికే బాగా పెరిగిన భవన నిర్మాణాలూ తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఒకప్పుడు కాలుష్యం అంటే ప్రధానంగా పారిశ్రామిక వ్యర్ధాల కారణంగా సంభవించేదే అయివుండేది. ఇప్పుడు కాలుష్య కారకాలు అనూహ్యంగా రూపం మార్చుకున్నాయి. ఉదాహరణకి పేకేజింగ్ మెటీరియల్స్. ఈకామర్స్ వినియోగం పెరిగిన తర్వాత, మరీ ముఖ్యంగా కరోనా మొదలైనప్పటినుంచి షాపుల్లో కన్నా, ఆన్లైన్ కొనుగోళ్లు బాగా పెరిగాయి. దుస్తులు, వస్తువులే కాదు, ఆహార పదార్ధాలు కూడా క్రమం తప్పకుండా కొనేవారు ఎక్కువయ్యారు. ఇదో అనివార్యతగా మారింది. పేకేజింగ్ కోసం వాడుతున్న ప్లాస్టిక్ గురించి ఎవరైనా డేటా సేకరిస్తే కళ్ళు తిరిగే విషయాలు బయట పడొచ్చు.  

తాత్కాలిక ఉపశమనాలను దాటి, శాశ్వత పరిష్కారాల వైపు దృష్టి సారించినప్పుడు ప్రభుత్వాల స్పందన ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. అడవుల విస్తీర్ణం నానాటికీ తగ్గుతోంది. మెరుగైన అర్బన్ ప్లానింగ్, గ్రీన్ బెల్ట్ ని పెంచే ఏర్పాట్లు, నీటి వనరుల సద్వినియోగం, భూగర్భ జలాలని పెంచే ఏర్పాట్లు.. ఇలాంటివన్నీ కాగితాలని దాటి క్రియలో కనిపించడం లేదు. జల, వాయు కాలుష్యాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ప్రజల వైపు నుంచి ఆచరణ బొత్తిగా లేదనలేం కానీ, ఉండాల్సిన స్థాయిలో అయితే లేదు. తెలంగాణలో 'హరిత హారం' కార్యక్రమంలో సెలబ్రిటీలు మొక్కలు నాటుతూ క్రమం తప్పకుండా ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారు. ఆంధ్రలో ప్రతి వర్షాకాలంలోనూ నెల్లాళ్ళ పాటు మొక్కలు నాటే కార్యక్రమం కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా జరుగుతోంది, ఇవి కాకుండా స్వచ్చంద సంస్థలు ఆన్లైన్ లో డోనర్ల నుంచి డబ్బు తీసుకుని వాళ్ళ తరపున మొక్కలు నాటుతున్నాయి.. వీటిలో సగం మొక్కలు చెట్లైనా ఈపాటికి ఎండల సమస్య కొంచమైనా తగ్గాలి. ఇప్పటికైతే దాఖలా కనిపించడం లేదు. ఎండల్ని తిట్టుకుని ఊరుకోడమా, తగ్గించేందుకు (లేదా, మరింత పెరగకుండా ఉండేందుకు) ఏమన్నా చేయడమా అన్నది మన చేతుల్లోనే ఉంది.

సోమవారం, ఏప్రిల్ 11, 2022

'ఆర్కే రోజా అనే నేను ...'

ఆమె పేరు శ్రీలత. చిత్తూరు జిల్లా భాకరాపేట ఆమె స్వస్థలం. కుటుంబానికి ఉన్న సినీ పరిచయాల  కారణంగా కాలేజీలో చదివే రోజుల్లోనే సినిమా అవకాశాలు వచ్చాయి. దాదాపు ఒకేసారి ఓ తమిళ సినిమా, మరో తెలుగు సినిమా. సినిమా కెరీర్ ని ఆమె ఎంత సీరియస్ గా తీసుకుని ఉండేదో తెలియదు, తెలుగు సినిమా షూటింగ్ లో ఓ సహనటుడు ఆమెని ఇబ్బంది పెట్టి ఉండకపోతే. అతడి ప్రవర్తన ఆమెలో పట్టుదలని పెంచింది. తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో కొన్నేళ్ల పాటు టాప్ హీరోయిన్ 'రోజా' గా వెలుగొందేందుకు దోహదం చేసింది. ఏ నటుడైతే తొలినాళ్లలో ఆమెని ఇబ్బంది పెట్టాడో, అతడే స్టూడియోల్లో ఆమె వచ్చేవరకూ మేకప్ వేసుకుని ఎదురు చూశాడు. కెమెరా సాక్షిగా ఆమె చేత చెంపదెబ్బలూ తిన్నాడు. తనతో సినిమాలు తీసిన తమిళ దర్శకుడు ఆర్కే సెల్వమణిని ప్రేమ వివాహం చేసుకుని సంసార జీవితంలో స్థిరపడింది. ఇక్కడితో ఆగిపోతే, ఓ సినిమా నటిగా తప్ప ఆమెని గురించి చెప్పుకోడానికి ఇంకేమీ ఉండకపోను. ఆమె ఆగలేదు, రాజకీయాల్లో అడుగుపెట్టింది. 

నిజానికి సినీనటిగా రోజాని నేను గమనించింది తక్కువ. అప్పట్లో నేను చూసిన కొన్ని సినిమాల్లో ఆమె కథానాయిక, అంతే.  అయితే ఆమె రాజకీయాల్లోకి వచ్చాక మాటల్నీ, చేతల్నీ తెలియకుండానే గమనిస్తూ వచ్చాను. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారి చిలక పలుకులు వినడానికి సరదాగా ఉంటాయి. పెద్దగా సబ్జక్ట్ నాలెడ్జి లేకుండా నాయకుడిని పొగడ్తల్లో ముంచే ప్రసంగాలు చేసి నెట్టుకొచ్చేస్తూ ఉంటారు. అయితే, రోజా ఇందుకు భిన్నం. తెలుగు దేశం పార్టీలో ఉన్న రోజుల్లో కూడా ఆమెకి తనేం మాట్లాడుతోందో స్పష్టత ఉండేది. స్వతహాగా ఉన్న వాగ్ధాటి, సినిమా ఇమేజి, తక్కువ కాలంలోనే ఆమెకి పేరు తెచ్చిపెట్టాయి. అప్పట్లో కాంగ్రెస్ నాయకులపై ఆమె విసిరే పంచ్ డైలాగులు వింటుంటే ఆమె ఎవరిదో డైలాగ్ రైటర్ సాయం తీసుకుంటోందన్న సందేహం కలిగేది. అయితే, ఆమెకి 'స్పాంటేనిటీ' ఉందన్నది తర్వాత రోజుల్లో అర్ధమైన విషయం. రాజకీయాలని ఆమె ఎంత సీరియస్ గా తీసుకుని ఉండేది అన్నది మళ్ళీ సందేహమే -- తెలుగు దేశం పార్టీలో ఆమె దారుణమైన అవమానాలు ఎదుర్కొని ఉండకపోతే. పదేళ్ల పాటు పార్టీ కోసం పని చేస్తే, సొంత పార్టీ నాయకులే ఆమెని పోటీ చేసిన చోట ఓడించారు రెండు సార్లు. ఈ పరిస్థితుల్లో పార్టీ వీడింది. 

తెలుగు దేశం పార్టీని అవమానకర పరిస్థితుల్లో వీడిన మొదటి నటి రోజా కాదు. అప్పటికే జయప్రదకి ఆ అనుభవం వుంది. అయితే, జయప్రద నాటి పార్టీ పరిస్థితులు, లెక్కలు ఆమెని రాజ్యసభకు నామినేట్ చేసేలా చేశాయి. రోజాకి దక్కింది కేవలం 'తెలుగు మహిళ' అధ్యక్ష పదవి మాత్రమే. పార్టీని వీడిన జయప్రద  రాజకీయంగా ఉత్తరాదికి మరలిపోవడంతో ఆమెకి తెలుగు దేశం పార్టీని ఎదుర్కోవలసిన, ఆ పార్టీని గురించి మాట్లాడవలసిన అవసరం కలగలేదు. కానీ, రోజా పరిస్థితి అది కాదు. తొలుత కాంగ్రెస్ లో చేరి, ఆవిర్భావం నాటినుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న రోజా పార్టీకి ప్రధాన శత్రువు తెలుగు దేశం పార్టీనే. ఆ పార్టీ నుంచి పొందిన అవమానాల బ్యాగేజీని ఆమె మోస్తూనే ఉంది.  రాజకీయాల్లోకి వచ్చిన పదిహేనేళ్ళకి 2014లో నగరి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికవడం రాజకీయాల్లో ఆమె తొలివిజయం. ఆ ఎన్నికల్లో ఆమె పార్టీ గెలుపొందలేదు. అధికార పార్టీతో ఆమె అసెంబ్లీలోనూ, బయటా తీవ్రంగా పోరాడింది. ఆమె ఏదైనా మాట్లాడితే, తెలుగు దేశం పార్టీ మహిళా నేతలందరూ కలివిడిగానూ, విడివిడిగానూ ఎదురుదాడి చేసేవాళ్ళు. 

ఒకానొక సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 'లైవ్' లో ఉండడానికి రోజా కారణమైంది అనడం అతిశయోక్తి కాదు. తెలుగు దేశం పార్టీ చేసిన అనేక తప్పులు అధికారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పళ్లెంలో పెట్టి అందించినా, వాటిలో ముఖ్యమైనది రోజా అసెంబ్లీ బహిష్కరణ. ఏ పరిస్థితులు ఆమె బహిష్కరణకి దారితీశాయన్నది ఇవాళ్టికీ స్పష్టంగా తెలియదు. కానీ, ఆ బహిష్కరణని సవాల్ చేస్తూ ఆమె చేసిన పోరాటం మాత్రం గుర్తుండిపోయింది. ఒక సెక్షన్ వోటర్లని ఆమె పార్టీకి దగ్గర చేసింది. మూడేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో ఆమె రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. పార్టీ విజయ దుందుభి మోగించి అధికారంలోకి వచ్చింది. ఆమెకి మంత్రి పదవి తధ్యం అనుకున్నారందరూ. 'హోమ్' శాఖని కేటాయించనున్నారని రూమర్లూ షికారు చేశాయి. రోజాకి మంత్రి పదవి రాకపోవడం ఆమె కన్నా ఎక్కువగా రాజకీయాలని గమనిస్తున్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది. మరో మూడేళ్ళ తర్వాత, అనేక నాటకీయ పరిణామాల అనంతరం మాత్రమే ఆమెకి మంత్రి పదవి దక్కింది. 

రోజా మీద వినిపించే ప్రధానమైన విమర్శ రాజకీయాల్లో హుందాతనం పాటించదనీ, ఎమ్మెల్యేగా ఉంటూ ద్వందార్ధపు టీవీ కామెడీ షోలలో కనిపిస్తుందనీను. 'ఇదే విషయాన్ని ఈమె మరికొంచం హుందాగా చెప్పి ఉండొచ్చు' అనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానైతే, ఆమె ఒక్కర్తీ హుందాగా ఉంటే సరిపోతుందా, లేక మొత్తం రాజకీయాల నుంచి ఏనాడో మాయమైపోయిన హుందాతనం మళ్ళీ తిరిగి రావడం బాగుంటుందా? అదీకాకుండా, తన ప్రత్యర్థులకు అర్ధమయ్యే భాష అదేనని ఆమె భావిస్తోందా? ఎడతెగని ప్రశ్నలు. ఇక టీవీ షోల విషయానికి వస్తే, ఎమ్మెల్యేగా ఉంటూ ద్వందార్ధపు మాటలు, పాటలున్న సినిమాల్లో హీరోగా నటిస్తూ, తెరనిండా నెత్తురు పారిస్తున్న వారి విషయంలో ఈ అభ్యంతరం ఎందుకు వినిపించదు? ఆమె మహిళ కావడం వల్ల ఆమె నుంచి కొంచం ఎక్కువగా ఆశిస్తున్నారా? పురుషుడై ఉంటే షోల విషయంలో అభ్యంతరాలు ఉండేవి కాదా? ఇవీ ఎడతెగని ప్రశ్నలే. "టీవీ షోలు మానేస్తున్నా" అంటూ ఆమె చేసిన తాజా ప్రకటనతో ఈ రెండో విమర్శకి ఇకపై తావుండక పోవచ్చు. 

ఇంతకీ, మంత్రిగా రోజా ఏం చేయబోతోంది? ఒక ప్రాంతీయ పార్టీలో (ఆ మాటకొస్తే ఏ పార్టీలో అయినా) మంత్రిగా ఉన్నవాళ్ళు చేయగలిగేది ఏం ఉంటుంది? ఏదన్నా మంచి జరిగితే దాన్ని ముఖ్యమంత్రి ఖాతాలో వేయడం, చెడు జరిగితే, తప్పని పరిస్థితులు ఎదురైతే, బాధ్యత వహించడం. ఇప్పటి వరకూ చూస్తూ వస్తున్నది ఇదే కదా. వారసత్వం పుణ్యమా అని చులాగ్గా మంత్రులైపోయి, బోల్డంత స్వేచ్ఛని అనుభవించిన వాళ్ళే ఏ ముద్రా వేయలేకపోయిన పరిస్థితుల్లో, అనేక పరిమితుల మధ్య స్వల్పకాలం పదవిలో ఉండే ఈమె నుంచి అద్భుతాలు ఆశించగలమా? పోనీ గడిచిన మూడేళ్ళనే తీసుకున్నా, 'ఇది ఫలానా మంత్రి చేపట్టిన కార్యక్రమం' అని చెప్పుకోడానికి ఏముంది? చెక్కులిచ్చే ఫోటోల్లో ముఖ్యమంత్రి  వెనుక నిలబడ్డం మినహా ఎవరూ చేసిందేమీ ప్రస్ఫుటంగా కనిపించడం లేదు. కాబట్టి, మంత్రిగా రోజా ఏదో చేసేయబోతుందనే భ్రమలేవీ లేవు. ఓ దెబ్బ తిన్నప్పుడో, అవమానం ఎదురైనప్పుడో అక్కడే ఆగిపోకుండా, పట్టు వదలకుండా, ఓర్పుగా పోరాడితే  విజయం సాధించవచ్చు అనే సత్యాన్ని మరోమారు చెబుతుంది ఆమె కథ. 

సోమవారం, ఏప్రిల్ 04, 2022

కొత్త జిల్లాలు

మా చిన్నప్పుడు కోనసీమ నుంచి కాకినాడ వెళ్లాలంటే ఓ రోజు పని. అమలాపురం మీదుగా బస్సులో ఎదుర్లంక వెళ్లి, అక్కడ రేవు దాటి, యానాం వెళ్లి, అక్కడినుంచి మళ్ళీ బస్సు పట్టుకుని కాకినాడ వెళ్లడం దగ్గర దారి. కాకపొతే అంచె బస్సులు, పడవ వరసగా దొరికెయ్యాలి. ఎక్కడ ఆలస్యం అయినా మొత్తం ప్రయాణ సమయం పెరుగుతూ పోతుంది. లేదూ అంటే రావులపాలెం వెళ్లి, అక్కడి నుంచి అప్పుడప్పుడూ ఉండే కాకినాడ ప్యాసింజర్ బస్సు పట్టుకుంటే పడుతూ లేస్తూ నాలుగైదు గంటల్లో కాకినాడ చేరేవాళ్ళం. కలక్టరేట్లోనో ఇంకేదైనా ఆఫీసు లోనో  పనంటే వెళ్లినవాళ్ళు పనిపూర్తి చేసుకుని అదే రోజు తిరిగి రావడం కల్ల. అక్కడ ఉండిపోవడం అంటే, బంధుమిత్రులెవరన్నా ఉంటే పర్లేదు కానీ, లేకపోలే తిండి, లాడ్జీ ఖర్చులు తడిసిమోపెడు. ధ్రువీకరణ పత్రంలో (కులం/ఆదాయం/నివాసం) తప్పులు సవరింపజేసుకోడానికో, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ లో పేరు నమోదుకో, అప్డేటుకో మిత్రులు తరచూ ప్రయాణం అవుతూ ఉండేవారు, శ్రమనీ, ఖర్చునీ తట్టుకుని నిట్టూరుస్తూ. 

ఇప్పుడూ దూరం తగ్గలేదు కానీ, ప్రయాణ వేగం కాస్త పెరిగింది. ఎదుర్లంక-యానాం ల మధ్య వృద్ధ గౌతమి మీద బ్రిడ్జీ రావడం తో నేరుగా అమలాపురం-కాకినాడ బస్సులు తిరుగుతున్నాయి. రావులపాలెం వరకూ రోడ్డు అని భ్రమించే లాంటిది ఒకటి ఉంటుంది కానీ, అక్కడి నుంచీ పర్లేదు. అయినప్పటికీ మొత్తం ప్రయాణం మూడు నాలుగు గంటలు పైగా పడుతోంది.పాలనలో ఆన్లైన్ విప్లవం వచ్చేసినప్పటికీ ప్రత్యక్షంగా హాజరైతే తప్ప పూర్తికాని పనులు ఇప్పుడూ ఎక్కువే. ఏదో ఒక పని నిమిత్తం ప్రయాణం తప్పదు. జిల్లాలోకెల్లా ఉన్న పెద్ద ధర్మాసుపత్రిలో వైద్యం కోసం చేరేవాళ్ళు, వాళ్ళకి తోడుగానో, చూడ్డానికో వెళ్లేవాళ్ల సంఖ్యా ఎక్కువే. ప్రయాణం మరీ సుఖంగా ఏమీ ఉండదు. కాకపోతే, వెళ్లిన పని పూర్తయితే అర్ధరాత్రైనా అదే రోజు ఇంటికి తిరిగి రావొచ్చనే భరోసా ఉంది. చేతిలో మోటార్ సైకిల్ ఉంటే ప్రయాణం మరికొంచం సులువు. కారున్న వాళ్ళకి ఎటూ ఎక్కడైనా దూరాలు భారాలు కాదు కదా. 

దాదాపు పది పన్నెండేళ్ల క్రితం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ పుట్టకమునుపు, బ్యూరోక్రసీలో ఉన్న ఓ మిత్రుడి ఉవాచ: "మీ జిల్లాని మూడు జిల్లాలుగా చెయ్యచ్చు. ఉత్తరాదిలో ఎక్కడా ఇంత పెద్ద పెద్ద జిల్లాలు లేవు. జిల్లా చిన్నదైతే ప్రజలకే కాదు, అధికారులకి కూడా సుఖం. పనిమీద కొంచం ఎక్కువ శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంటుంది". ఆ మాట నేను కాదనలేదు కానీ, మరీ 'మూడు జిల్లాలు' అవసరం లేదేమో అనిపించింది. అప్పటికే 'కోనసీమ ప్రత్యేక జిల్లా' అనే నినాదం ఉండుండీ వినిపిస్తూ ఉండేది. అసలు జీఎంసీ బాలయోగి అకాల మరణం పాలయ్యి ఉండకపోతే, తన అధికారాలు ఉపయోగించి ఎప్పుడో కోనసీమని ప్రత్యేక జిల్లా చేసేసి ఉండేవారని నమ్మే వాళ్ళు ఎందరో ఉన్నారు మా ప్రాంతంలో. "రెండు జిల్లాలు చాలేమో" అన్నాను. "జనసాంద్రత, విస్తీర్ణం దృష్ట్యా మాత్రమే కాదు, ఇక్కడున్న వనరుల్ని దృష్టిలో పెట్టుకున్నా మూడు జిల్లాలైతేనే ఏవన్నా అభివృద్ధికి అవకాశం ఉంటుంది" అన్నప్పుడు, ఇంకేమీ జవాబు చెప్పకుండా వినేసి ఊరుకున్నా, "జరిగే పని కాదులే" అనుకుంటూ. 

Google Image

అప్పుడే కాదు, మొన్నామధ్య రాష్ట్ర ప్రభుత్వం 'జిల్లాల పునర్వ్యవస్తీకరణ-కొత్త జిల్లాల ఏర్పాటు' ప్రకటించినప్పుడు కూడా "బోల్డన్ని చిక్కులొస్తాయి, అయినప్పుడు కదా" అనే అనుకున్నాను. కానీ, అత్యంత ఆశ్చర్యకరంగా అనుకున్న సమయానికే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోయింది. పదమూడల్లా ఇరవయ్యారు జిల్లాలయ్యాయి.  మా కోనసీమకి ప్రత్యేక జిల్లా హోదా వచ్చేయడమే కాదు, నాటి నా మిత్రుడి మాటని నిజం చేస్తూ తూర్పుగోదావరి మూడు జిల్లాలుగా పునర్వ్యవస్తీకరింపబడింది. ప్రభుత్వ విభాగాలతో బొత్తిగా అవసరం పడని వాళ్ళకో, 'అన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతాయి' అనుకునే వాళ్ళకో ఇదేమీ పెద్ద విషయం కాదు కానీ, కలెక్టరేట్ల చుట్టూ నిత్యం చెప్పులరిగేలా తిరిగే వేలాది మందికి ఇది తీపి కబురు. జిల్లా కలెక్టరే మేజిస్ట్రేట్ కూడా అవ్వడం, భూ తగాదాలు లాంటివి ప్రత్యక్ష హాజరుతో తప్ప పరిష్కారం కానివి కావడం వల్ల గ్రామాల్లో ఉండే వాళ్ళకి, వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరక్క తప్పదు, ఎందుకో అందుకు. సదరు కార్యాలయం అక్కడెక్కడో కాక, దగ్గర ఉండడం అన్నది చాలా పెద్ద ఊరట. 

గతంతో పోల్చినప్పుడు రెండూ బై మూడో వంతు పని భారం తగ్గింది కాబట్టి కొత్త జిల్లాల కలెక్టర్లకి అభివృద్ధి మీద దృష్టి పెట్టే సమయమూ, వీలూ చిక్కొచ్చుననే ఆశ ఒకటి ఉంది. ఇక్కడ అభివృద్ధి అంటే ఫ్లై వోవరూ, హైటెక్ సిటీ నిర్మాణాలు కాదు, చేయగలిగే వాళ్ళకి యేటి పొడవునా చేతినిండా పని, కడుపు నిండా తిండీ దొరికేలా చేయడం. వనరులన్నీ ఉండి కూడా, ఈ విషయంలో వెనకపడ్డానికి కారణం రాజకీయ నాయకులకి చిత్తశుద్ధి కొరవడడం ఓ కారణం అయితే, శ్రద్ధ పెట్టాల్సిన ఉన్నతాధికారులకి తగినంత సమయం చేతిలో లేకపోవడం ఇంకో కారణం. వనరుల సద్వినియోగం మీద దృష్టి పెట్టగలిగే అధికారులు కలెక్టర్లుగా వస్తే, జీవనోపాధి సమస్య కొంతవరకైనా పరిష్కారం అవ్వకపోదనిపిస్తోంది. వ్యవస్థలో ఉన్న సమస్త లోపాలూ ఈ ఒక్క నిర్ణయంతో సరిద్దిబడిపోతాయన్న అత్యాశ అయితే లేదు. కొందరు ప్రచారం చేస్తున్నట్టుగా ఈ కొత్త జిల్లాల ఏర్పాటు సర్వరోగ నివారిణి కాదు. అదే సమయంలో మరికొందరు చెబుతున్నట్టుగా ఎందుకూ పనికిరాని నిర్ణయమూ కాదు. 

జిల్లా కేంద్రం అంటే కలెక్టరాఫీసు, ఎస్పీ ఆఫీసు, ముఖ్యమైన ఆధికారుల కార్యాలయాలతో పాటుగా జిల్లా ఆస్పత్రి కూడా ఉంటుంది. సాధారణంగా ఈ ఆస్పత్రిలో అన్ని వైద్య విభాగాలూ, అన్ని రకాల అనారోగ్యాలకీ వైద్యసేవలు అందించేవిగా ఉండాలి. ప్రస్తుతం ప్రకటించిన కొత్త జిల్లా కేంద్రాలలో చాలాచోట్ల ఏరియా ఆస్పత్రులున్నాయి. అయితే, వాటిలో సేవలు, సౌకర్యాలు పరిమితం. వీటిని జిల్లా ఆసుపత్రులుగా అప్ గ్రేడ్ చేసి, అవసరమైన వైద్యుల్ని, పరికరాల్ని సిద్ధం చేయాలి. ప్రయివేటు ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా విస్తరించినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది రోగులు ఇప్పటికీ ధర్మాసుపత్రుల మీదే ఆధారపడ్డారు. ప్రయివేటు ఆస్పత్రులో దొరికే వైద్యం ఖరీదైనది కావడం ఇందుకు ముఖ్య కారణం. పాలనా కార్యాలయాల ఏర్పాటుతో పాటుగా దృష్టి పెట్టాల్సిన అంశం ఇది. లెక్కపెడితే, ఇప్పటికీ జిల్లా కేంద్రాలకి ఇతరత్రా పనుల నిమిత్తం వెళ్లే వారి సంఖ్యతో సరిసమంగా ప్రభుత్వ వైద్యం కోసం వెళ్లేవారి సంఖ్యా ఉంటోంది. ఈ ఏర్పాటు చేసినప్పుడే కొత్త జిల్లాల ఏర్పాటు పరిపూర్ణమవుతుంది. 

బుధవారం, మార్చి 30, 2022

భారతీయ సీయీవో

కేరళ మూలాలున్న ప్రవాస భారతీయుడు రాజ్ సుబ్రమణియం 'ఫెడెక్స్' సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా  ఎంపిక కావడంతో భారతీయుల నాయకత్వ లక్షణాలపై మరోసారి చర్చ మొదలైంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ మొదలుకుని ట్విట్టర్ వరకూ దాదాపు ఇరవై భారీ మల్టి-నేషనల్ కంపెనీల్లో కీలక స్థానాల్లో భారతీయులు రాణిస్తుండడంతో రాజ్ నియామకం మరీ పెద్ద వార్త కాలేదు. కొంచం స్పష్టంగా చెప్పాలంటే 'భారతీయ సీయీవో'  అనేది ప్రపంచానికి అలవాటైపోయినట్టుగా అనిపిస్తోంది. నావరకు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ ల ఎంపిక జరిగినప్పటి హడావిడి గుర్తొచ్చింది. గడిచిన ఏడెనిమిదేళ్లలో ఏడాదికి రెండు మూడు కంపెనీలన్నట్టుగా భారతీయుల్ని కీలక స్థానాల్లో కూర్చోబెడుతున్నాయి. సదరు వ్యక్తులు కూడా పదవుల్ని అలంకారంగా భావించకుండా, తమ శక్తి సామర్ధ్యాలని కంపెనీల అభివృద్ధికి వెచ్చిస్తూ అహరహం శ్రమిస్తున్నారు. వాళ్ళ విజయాలు కూడా తాజా ఎంపికలో ఎంతోకొంత పాత్ర పోషిస్తూ ఉండొచ్చు, మిగిలిన వాటితో పాటుగా. 

పెద్దపెద్ద అమెరికన్ కంపెనీలు కీలక స్థానాల్లో భారతీయుల్ని ఎందుకు కూర్చోబెడుతున్నాయి? అన్న ప్రశ్నకి అనేక జవాబులు తడుతున్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది సంఖ్యాబలం. అమెరికా వలసదారుల్లో, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు చేసే వాళ్లలో అధిక సంఖ్యాకులు భారతీయులే. నాలుగున్నర దశాబ్దాల క్రితం వలసలకి అమెరికా తలుపులు తెరిచినప్పుడు, ముప్ఫయ్ ఏళ్ళ క్రితం నిబంధనల్ని మరింత సరళతరం చేసినప్పుడూ, మరీ ముఖ్యంగా అగ్ర రాజ్యాన్ని వణికించిన 'వైటూకే' సందర్భంలోనూ పెద్ద ఎత్తున ఆ దేశంలో అడుగు పెట్టిన వాళ్ళు భారతీయులే.  జనాభా ఎక్కువ, అవకాశాలు తక్కువా ఉన్న దేశం కనుక సహజంగానే పెద్ద ఎత్తున నిపుణుల్ని సరఫరా చేయగలిగింది. (వలసల సంఖ్యలో భారత్ కి దరిదాపుల్లో ఉన్నది అత్యధిక జనాభా ఉన్న మరోదేశం చైనా కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం.) తత్ఫలితంగా  అమెరికాలోని కీలక ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ భారతీయలు బాగా కుదురుకోగలిగారు. 
Google Image

సంఖ్యాబలం ఉన్నంత మాత్రాన ఉన్నతోద్యాగాలు వెతుక్కుంటూ వచ్చేస్తాయా? కీలకమైన పోస్టులకి ఎంపిక చేసేస్తారా? ఇవి కూడా చాలా సహజమైన ప్రశ్నలే. ఉద్యోగం వెతుక్కుంటూ ఇప్పుడు ఆ దేశానికి బయల్దేరే వాళ్ళకన్నా, ముందు నుంచీ అక్కడ ఉంటున్న/ఆ దేశానికి అలవాటు పడ్డవాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నది కాదనలేని నిజం. హైదరాబాదులో ఉద్యోగానికి, హైదరాబాదు నుంచి ఒకరూ, ఆముదాలవలస నుంచి ఒకరూ అప్లై చేసినప్పుడు, ఎంత సమానావకాశాలు ఇచ్చే వాళ్ళైనా హైదరాబాద్ అభ్యర్థికే తొలి ఓటు వేస్తారు. రెండు మూడు తరాలకి ముందు మొదలైన భారతీయుల అమెరికా విస్తరణ, ఇప్పటి తరానికి వినియోగానికి వస్తోంది. ఈ భారతీయ సీయీవోల్లో కొందరు అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళైతే, మరికొందరు ఉన్నత విద్య కోసం వెళ్లి అక్కడే ఉద్యోగంలోనూ, జీవితంలోనూ స్థిరపడిపోయిన వాళ్ళు. వీళ్ళలో మెజారిటీ భారతీయులం అని చెప్పుకుంటారు తప్ప, భారత్ కి తిరిగి వెళ్లడం అనే ఆలోచన పెట్టుకోరు, పెట్టుకోలేరు కూడా. 

ఇంతకీ నాయకత్వ లక్షణాలు అనగా ఏవి? విజేతల చరిత్రలు తిరగేసినప్పుడు వాళ్ళందరూ చాలా క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడుపుతారని, సమయపాలనకి విలువ ఇస్తారని, చాలా సహనంగానూ, దయతోనూ ఉంటారనీ, స్థితప్రజ్ఞత వారి సొత్తనీ, ఒక పని పూర్తి చేసేందుకు వంద మార్గాలని ఆలోచించి పెట్టుకుంటారనీ, పోరాట పటిమ కలిగి ఉంటారనీ... ఇలా ఓ పెద్ద జాబితా కనిపిస్తుంది. సూక్ష్మంగా పరిశీలిస్తే కెరీర్ లో పైకెదగాలనే తపన ఉన్న భారతీయులందరికీ వీటిలో చాలా లక్షణాలు సహజాతాలు. వీళ్లంతా ఎంసెట్ ర్యాంక్ కోసం ఎల్కేజీ నాటి నుంచీ కష్టపడి చదివిన వాళ్ళే. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అడుగు పెట్టనివ్వని పరీక్షలు రాసి రేంకులు తెచ్చుకున్న వాళ్ళే. 'స్కూలు బస్సు రాకపోతే బడిమానేద్దాం' అనే ఆలోచన లేకపోగా, ప్రేయరుకి ముందే బళ్ళో ఉండడానికి మార్గాలు అన్వేషిస్తూ పెరిగిన వాళ్ళే. చిన్నప్పటి నుంచీ వీళ్ళు నెగ్గుకొచ్చేది అల్లాటప్పా పోటీలో కాదు, కట్ త్రోట్ కాంపిటీషన్లో. 

ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే, ఈ భారతీయ సీయీవోల్లో మెజారిటీ మధ్యతరగతి నేపధ్యం నుంచి వచ్చిన వాళ్ళే. 'బతకడానికి నీకున్న ఒకేఒక్క దారి చదువు మాత్రమే' అన్న బోధలు నిత్యం వింటూ పెరిగిన వాళ్లే. ఇంట్లో చదువుకునే వాతావరణం ఉండడం, అదే సమయంలో పరిమితమైన వనరులు, అపరిమితమైన పోటీ వీళ్ళని యుద్ధానికి సిద్ధపడేలా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించి ఉంటాయి. ఎదగాలనే తపనని ఉగ్గుపాలతో రంగరించి మరీ నింపి ఉంటారు వీళ్ళ పెద్దలు. ప్రతిభని మెరుగు పరుచుకోడం, ఆపైన తమకి తగిన అవకాశాలని వెతుక్కుంటూ ఎంతదూరమైనా వెళ్ళడానికి మానసికంగా సిధ్దపడడం వాళ్లకి తెలియకుండానే రక్తంలో ఇంకి ఉంటుంది. సర్దుకు పోవడం, సర్దుబాటు చేసుకోవడం లాంటి లక్షణాలు కూడా వృత్తిలో ఎదగడానికి దోహదం చేసే ఉంటాయి. బహుశా అందుకే తమ భారతీయ మూలాలని కొంచం తరచుగా గుర్తు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. 'సీయీవో' అనే చక్కెర పూత వెనుక ఉన్న చేదు వాళ్లకన్నా బాగా ఇంకెవరికి తెలుసు?

మంగళవారం, మార్చి 22, 2022

కన్నీటిచుక్క

శానిటైజర్లో నానిన చేతుల్ని లిక్విడ్ సోపుతో కడుక్కుని, డిస్పెన్సర్ నుంచి అలవాటుగా పేపర్ నాప్కిన్ అందుకుంటూండగా గుర్తొచ్చింది నీటిచుక్క ఆకారంలో ఉండే శ్రీలంక. కాగితం కొరత కారణంగా విద్యార్ధులకి జరగాల్సిన అన్ని పరీక్షలనీ నిరవధికంగా వాయిదా వేసింది గతవారం. బిల్లులు ప్రింటు చేయడానికి కాగితం లేక అక్కడి విద్యుత్ సంస్థలు బిల్లులు పంపిణీ చేయలేదు. ఆ చిన్నదేశాన్ని చుట్టుముట్టిన ఆర్ధికసంక్షోభపు వికృత రూపాన్ని ప్రపంచానికి సులువుగా అర్ధమయ్యేలా చెప్పే ఉదాహరణ ఇది. ఇంతేనా? చమురు, సహజవాయువు ధరలు చుక్కలంటాయి. నిత్యావసరాలని అత్యధిక ధరలు చెల్లించి కొనడానికి జనం సిద్ధపడ్డా తగినంత సరుకు లేదు మార్కెట్లో. ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉండగా, ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య సంస్థలతో చర్చలు ప్రారంభించింది. ఈ చర్చలు ముగిసేదెప్పుడు? జనం ఆకలి కేకలు ఆగేదెప్పుడు? 

సరిగ్గా ఐదేళ్ల క్రితం శ్రీలంకని గురించి ఘనమైన వార్తా కథనాలు వచ్చాయి -  మనదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా. అప్పుడు, అంటే 2017 సంవత్సరానికి గాను శ్రీలంక జీడీపీ భారత జీడీపీని మించింది. పరిణామంలో భారత్ లో యాభయ్యో వంతు, కేవలం రెండు కోట్ల పైచిలుకు జనాభాతో - భారత్ తో పోల్చినప్పుడు ఆరొందలో వంతు - ఉన్న చిన్న దేశం, ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో ఓ రాష్ట్రం పాటి చేయని దేశం వృద్ధిలో భారత్ ని మించిపోవడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రత్యేక తమిళ దేశంకోసం సుదీర్ఘమైన ఉద్యమం చేసిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీయీ) ని సమర్ధవంతంగా అణచి వేయడం ద్వారా శ్రీలంక ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతల్ని పెంపొందించిందనీ, అందువల్లనే అభివృద్ధి సాధ్యపడిందనే విశ్లేషణలు జోరుగా సాగాయి. అయితే ఈ మురిపెం ఎన్నాళ్ళో సాగలేదు. 

సరిగ్గా రెండేళ్ల తర్వాత, 2019 లో ఈస్టర్ పండుగ నాడు ఆ దేశంలో జరిగిన బాంబు పేలుళ్లతో శ్రీలంక మాత్రమే కాదు, మొత్తం ప్రపంచమే ఉలికిపడింది. మొత్తం మూడు చర్చిలు, మూడు హోటళ్ల మీద వరుసగా జరిగిన బాంబు దాడుల్లో ఏకంగా 270 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటివరకూ దేశానికి ప్రధాన వనరుగా ఉన్న పర్యాటకరంగ ప్రగతి మసకబారడం మొదలయ్యింది. నిజానికి ఈస్టర్ బాంబు పేలుళ్ల వల్ల కన్నా తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గోటబాయ రాజపక్స గెలవడం వల్లనే ఎక్కువ నష్టం జరిగిందన్న వాదన ఉంది. ఎన్నికల్లో తన గెలుపు కోసమే బాంబు దాడులు జరిపించారన్న ఆరోపణలనీ గోటబాయ ఎదుర్కొంటున్నారు. రాజపక్స అన్నదమ్ములు నలుగురూ, వాళ్ళ పిల్లలూ శ్రీలంక పాలనలో కీలకమైన పదవుల్లో ఉన్నారు. మొత్తం దేశం బడ్జెట్లో డెబ్బై శాతం నిధులు ఈ కుటుంబం ఆధ్వర్యంలో నడిచే మంత్రిత్వ శాఖల్లోనే ఖర్చవుతాయి!

Google Image

ఈస్టర్ పేలుళ్ల కారణంగా తగ్గడం మొదలైన టూరిజం ఆదాయం, కోవిడ్ వ్యాప్తితో మరింతగా తగ్గి, తాజాగా ఉక్రెయిన్ మీద రష్యా ప్రకటించిన యుద్ధం కారణంగా పూర్తిగా క్షీణించిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం నిజానికి ఉక్రెయిన్ తో సమంగా శ్రీలంకకీ నష్టం చేస్తోంది. శ్రీలంకకి వచ్చే పర్యాటకుల్లో అత్యధికులు రష్యా, ఉక్రెయిన్ల నుంచే వస్తారు. శ్రీలంకలో ప్రధానమైన తేయాకు పంటకి అతిపెద్ద మార్కెట్ కూడా ఈ రెండు దేశాలే. అటు పర్యాటకుల్నీ, ఇటు తేయాకు మార్కెట్నీ కోల్పోయింది శ్రీలంక. వీటికి తోడు పాలనా పరమైన లోపాలు సరేసరి. గతేడాది ఉన్నట్టుండి కృత్రిమ ఎరువుల వాడకాన్ని నిషేధించింది శ్రీలంక ప్రభుత్వం. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మంచిదే అయినా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనలకి తలొగ్గి కొంచం ఆలస్యంగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పంటల దిగుబడి తగ్గి ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. 

ఆదాయం పడిపోవడం ఓపక్క, ఆహార ధాన్యాల కొరత మరోపక్క చుట్టుముట్టినా ప్రభుత్వం వేగంగా స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పొరుగు దేశాలు  సహాయం అందించేందుకు సిద్ధపడినా శ్రీలంక ప్రభుత్వం అందుకోడానికి తిరస్కరించడం, ద్రవ్యలోటుకి సంబంధించిన కీలక నిర్ణయాలని వాయిదా వేస్తూ రావడం లాంటి తప్పిదాలు కూడా నేటి శ్రీలంక సంక్షోభానికి కారణాలని చెప్పాలి. నిజానికి అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఏదో ఒక సమయంలో ఇలాంటి సంక్షోభాలని ఎదుర్కొన్నవే. నూతన ఆర్ధిక సంస్కరణలని ఆహ్వానించడానికి ముందు భారతదేశ పరిస్థితి కూడా ఇదే. బంగారు నిల్వలు మొత్తం విదేశీ బ్యాంకుల తాకట్టులో ఉండి, ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితుల్లో దిగుమతులన్నీ క్లియరెన్స్ లు దొరక్క పోర్టుల్లో పేరుకుపోయిన పరిస్థితిని ఈ దేశమూ అనుభవించింది. పైగా అప్పుడు రాజకీయ అస్థిరత పతాక స్థాయిలో ఉంది కూడా. 

అంతటి సంక్షోభపు అంచుల నుంచి దేశాన్ని బయట పడేసిన నాటి ప్రధాని పీవీ నరసింహారావు ని మళ్ళీ ఓసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇవాళ శ్రీలంక ఐఎంఎఫ్ చేతుల్లోకి వెళ్లిపోతుందేమోనని ప్రపంచం సందేహిస్తున్న వేళ, నాటి సంక్షోభం నుంచి భారత్ గట్టెక్కిన వైనాన్ని గుర్తు చేసుకోవాలి. అంతర్జాతీయ షరతుల్ని గుడ్డిగా ఆమోదించకుండా, పరిమితుల మేరకి మాత్రమే ప్రయివేటు పెట్టుబడుల్ని ఆహ్వానించి దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టిన నాయకుడిని స్మరించుకోవడం తప్పు కాదు. ప్రస్తుతం శ్రీలంకకి కొరవడింది ఇలాంటి నాయకత్వమే.  కోతిపుండు బ్రహ్మరాక్షసిగా మారినట్టుగా ఆహార ధాన్యాల కొరతతో మొదలైన సమస్య, రికార్డు స్థాయి ఆహార, ఆర్ధిక సంక్షోభం వరకూ పెరిగిపోయినా పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న గట్టి దాఖలా ఏదీ కనిపించడం లేదు. సంక్షోభం పెరిగే కొద్దీ బేరమాడే శక్తి (బార్గెయినింగ్ పవర్) తగ్గిపోతుందనీ, ద్రవ్య సంస్థలు పెట్టే షరతులన్నింటికీ అంగీకరించాల్సిన పరిస్థితిలోకి వెళ్లిపోతామనీ ఆ దేశపు నేతలకి తట్టకపోవడం దురదృష్టకరం. నీటి చుక్క దేశపు కన్నీరు ఎప్పటికి ఆగేనో... 

సోమవారం, మార్చి 14, 2022

చెయ్యిస్తుందా?

స్వాతంత్రం వచ్చిన పదేళ్లలోపే భారతదేశం ఎదుర్కొన్న మొదటి సమస్య ఆహార సంక్షోభం. అప్పటి అమెరికా ప్రభుత్వం సాయానికి ముందుకొచ్చింది. ఆహారధాన్యాలు ఎగుమతి చేయడం మొదలు పెట్టింది, 'పీఎల్ 480' లో భాగంగా. తిండిగింజలతో పాటే ఓ కలుపు మొక్క దేశంలోకి ప్రవేశించింది. దానిపేరు 'పార్తీనియం'. ఈ మొక్క త్వరగా విస్తరించడమే కాదు, నివారణకి లొంగదు. ఈ మొక్క పుప్పొడి కారణంగా మనుషులకీ, పశువులకీ కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. భూసారాన్ని పీల్చుకోడానికి, పరిసరాలని కలుషితం చేయడానికి పెట్టింది పేరు. పొలంగట్ల మీద, తోటల్లోనూ ఇష్టారాజ్యంగా పెరిగే ఈ మొక్కల్ని పీకడానికి ఇప్పటికీ రైతులు ఏటా పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. ఈ మొక్క మన దేశానికి రావడం వెనుక అమెరికా కుట్ర ఉన్నదని ఓ ప్రచారం ఉంది. తెలుగులో 'వయ్యారిభామ' అనే అందమైన పేరుకూడా ఉన్న ఈ మొక్కని వాడుకలో 'కాంగ్రెస్ గడ్డి' అంటారు రైతాంగం. కాంగ్రెస్ కాలంలో దేశంలోకి వచ్చింది కదా మరి.

మా ఊరి కాంగ్రెస్ అరుగు (రచ్చబండ పేరు) దగ్గర రోజూ చేరి కష్టసుఖాలు మాట్లాడుకునే రైతుల మాటల్లో ఈ 'కాంగ్రెస్ గడ్డి' ప్రస్తావన తప్పక వచ్చేది. యేవో కారణాలకి ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నవాళ్ళు "ఈ కాంగ్రెస్సూ, కాంగ్రెస్ గడ్డీ ఎప్పటికీ మనకి తప్పవు" అనేవాళ్ళు. ఈ మాట బాగా గుర్తుండిపోయింది. గత వారం ఉత్తర ప్రదేశ్ తో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావడం, ఐదుచోట్లా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవ్వడం, 'ఇక కాంగ్రెస్ పని అయిపోయింది' అంటూ మీడియా అంతా కోడై కూస్తున్న సందర్భంలో మా ఊరి రైతుల మాట మళ్ళీ గుర్తొచ్చింది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చి, అరవయ్యేళ్లు చక్రం తిప్పిన పార్టీ ఇప్పుడిలా చతికిలపడడం ఆశ్చర్యాన్ని కలిగించడం కన్నా ఎక్కువగా ఆలోచనల్లో పడేస్తోంది. ఎందుకంటే, జాతీయ స్థాయిలో ఓ బలమైన ప్రత్యామ్నాయం ఉండాల్సిన అవసరం ఎప్పుడూ లాగే ఇప్పుడూ ఉంది. సొంత ఇమేజి, బలమైన సంస్థాగత నిర్మాణం, ఇప్పటికీ తనదైన ఓటు బ్యాంకూ ఉన్న సీనియర్ మోస్ట్ రాజకీయ పార్టీ, బొత్తిగా ఉనికిని చాటుకోలేని పరిస్థితుల్లో పడిపోవడం తాలూకు ప్రభావం రానున్న రోజుల్లో దేశం మీద ఏమేరకు ఉండబోతోందోనని ఓ ఆలోచన.

వయసైపోయిన మామిడి చెట్టుకి బదనికలు రావడం, పూల చెట్లకి రానురానూ గుంటపూలు పూయడం అసహజమైన విషయాలేవీ కాదు. కానైతే, యజమాని వాటినలా చూస్తూ ఉండిపోకుండా చేతనైన చికిత్సలు చేసో, చేయించో మళ్ళీ పూతా, కాపూ వచ్చేలా చేస్తాడు. ఇక్కడ కాంగ్రెస్ అనే రాజకీయ పార్టీ/మహాసంస్థ యాజమాన్యం ఘనత వహించిన గాంధీ కుటుంబం చేతిలో ఉంది. వారసత్వంగా వచ్చిన కుటుంబ ఆస్తిని రక్షించుకుందామనే ధోరణి ఆ కుటుంబానికి ఉందో లేదో తెలియడం లేదు. ప్రధాని పదవిని తృణప్రాయంగా తిరస్కరించిన 'త్యాగమూర్తి' సోనియా గాంధీ నాయకత్వంలో పార్టీ రెండు ఎన్నికలు గెలిచి పదేళ్ల పాటు దేశాన్ని పాలించింది. యేవో స్కాములూ అవీ వెలుగు చూశాయంటే, రాజకీయాల్లో అవన్నీ మామూలే. ఆ పార్టీ ఉక్కు మహిళ ఇందిరా గాంధీనే 'కరప్షన్ ఈజ్ గ్లోబల్ ఫినామినా' అని ప్రకటించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. వయోభారం, అనారోగ్యం తదితర కారణాలతో సోనియా పార్టీ పగ్గాలని ఒదులు చేశాక, వాటిని అందుకోవాల్సిన యువకిశోరం రాహుల్ గాంధీ అందుకు అంతగా సముఖత చూపకపోవడంతో సంక్షోభం మొదలైంది.

Google Image

తాతలు, తండ్రులు చక్రాలు తిప్పిన చోట వారసులు బొంగరాలు తిప్పడం ఒక్క కాంగ్రెస్ పార్టీకే పరిమితమైన సమస్య కాదు. కుటుంబ పార్టీలుగా ముద్ర పడ్డ చాలా ప్రాంతీయ పార్టీలకీ ఈ సమస్య ఉంది. యువరాజుల్ని పట్టాభిషేకానికి సిద్ధం చేయకపోవడం, వాళ్ళు సిద్ధ పడిపోతే తమ కాళ్ళ కిందకి నీళ్లొస్తాయేమో అని పెద్ద తరం కాస్త వెనుకముందాడడం, సదరు వారసులకి రాజకీయాలకన్నా ఇతరేతర విషయాల మీద ఆసక్తి మెండుగా ఉండడం లాంటి కారణాల వల్ల చాలా రాష్ట్రాల్లో యువతరం పార్టీ పగ్గాలు పూర్తిగా అందుకోలేదు. పగ్గాలు అందుకున్న వాళ్ళు కూడా స్వతంత్రంగా కాకుండా సవాలక్ష ఆంక్షల మధ్య పనిచేయాల్సి రావడం, ఈ కారణంగా పార్టీ మీద పెట్టాల్సినంత దృష్టి పెట్టకపోవడం జరిగాయి. రాహుల్ కూడా ఇందుకు మినహాయింపు కాదనీ, కొత్త ఆలోచనలతోనే వచ్చినా, ఊహించని కట్టడుల కారణంగా పార్టీ వ్యవహారాల మీద అతనికి శ్రద్ధ తగ్గిపోయిందనీ కొందరు కాంగ్రెస్ కురు వృద్ధులు ప్రచారం చేస్తున్నారు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక.

కాంగ్రెస్ పార్టీకున్న ప్రధానమైన సమస్య వృద్ధ నాయకత్వం. దశాబ్దాల తరబడి పార్టీలో విశ్వాసపాత్రులుగా కొనసాగుతున్న వాళ్ళని పొమ్మనలేరు, పక్కన పెట్టలేరు. వాళ్ళు సలహాలు ఇవ్వక మానరు. ఈ కాలానికి అవి ఎంతవరకూ పనికొస్తాయన్న ప్రశ్న ఒకటైతే, పరస్పర విరుద్ధమైన సలహాలిచ్చే గ్రూపులు మరో సమస్య. ఈ గ్రూపులు పార్టీ సంస్కృతిలో భాగమైపోయాయి. తన అవసరాల కోసం ఒకప్పడు పార్టీ అధినాయకత్వమే వీటిని పెంచి పోషించింది. ఇప్పుడు తుంచలేదు. ఈ నాయకులు, గ్రూపుల బాధ పడలేక, పార్టీలో ఇమడలేక, సొంత వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం ఉన్న నాయకులు ఇతర పార్టీలకి మళ్లిపోయారు. 'పోయింది పొల్లు' అనుకోడానికి లేకుండా, అలా వెళ్లిన వాళ్లలో చాలామంది ఇవాళ ప్రముఖ రాజకీయ నాయకులుగా పరిణమించారు.  పార్టీలో విపరీతంగా పెరిగిపోయిన 'అంతర్గత ప్రజాస్వామ్యం' కారణంగా మిగిలిన నాయకుల్లో కూడా సయోధ్య లేదు. ఎందుకో అందుకు పార్టీని వీధిన పెడుతూనే ఉన్నారు. పార్టీ వీళ్ళని భరించలేదు, పొగబెట్టి పొమ్మననూ లేదు. అనేకానేక ఆత్మహత్యా సదృశ నిర్ణయాల తర్వాత, ఇవాళ అంపశయ్య మీదకి చేరే పరిస్థితిని చేతులారా తెచ్చుకుంది.

కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగితే దేశానికి వచ్చిన నష్టం ఏమిటి? 'కత్తికి ఎదురు లేకపోవడం' అన్నది రాచరికంలో చెల్లుతుంది కానీ, ప్రజాస్వామ్యంలో కాదు. ప్రతిపక్షం లేని చోట ప్రజాస్వామ్యానికి, రాజరికానికీ తేడా ఉండబోదు. 'చెక్స్ అండ్ బేలన్సెస్' ని పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదే. ఏకపార్టీ స్వామ్యం ఇష్టారాజ్యం కాకుండా చూడడం కోసం ప్రతిపక్షం ఉండాలి. ఓ జాతీయ పార్టీ కళ్ళముందే అంతరించిపోతున్నప్పుడు చర్చ జరగాల్సింది ప్రత్యామ్నాయాన్ని గురించి. ఒకప్పుడు విఫలమైన 'ఫ్రంట్' ప్రయోగం మళ్ళీ జరిగే అవకాశం ఉన్నా, అనేక చీలిక పీలిక పార్టీలని ఏకతాటిపై తెచ్చే నాయకులెవరన్న ప్రశ్న వస్తోంది. సంస్థాగత సమస్యల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులెవరైనా జాతీయ నేతలుగా ఆవిర్భవిస్తారా? ఎవరంతటి వారు వారైన మిగిలిన నేతలు ఈ నాయకత్వాన్ని అంగీకరిస్తారా? అన్నీ ప్రశ్నలే కనిపిస్తున్నాయి. 'సమోసాలో ఆలూ ఉన్నంత వరకూ బీహార్ రాజకీయాల్లో లాలూ ఉంటాడు' అన్నది లాలూ ప్రసాద్ యాదవ్ ప్రచారంలో పెట్టిన స్లోగన్. ఇప్పుడా నాయకుడు లైంలైట్ లో లేడు. సమోసా స్టఫింగ్ లోనూ  చాలా మార్పులు  వచ్చేశాయి. ఎక్కడో తప్ప ఆలూ సమోసా కనిపించడం లేదు. ఇంతకీ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతే మన రైతుల 'కాంగ్రెస్  గడ్డి' సమస్య పరిష్కారమవుతుందా??

బుధవారం, మార్చి 02, 2022

వైద్య విద్య

'రక్షించాల్సింది ఉక్రెయిన్ లో చిక్కుబడ్డ విద్యార్థులనే కాదు, ఇక్కడ చదువు కొనలేక అక్కడికి వెళ్లేలా చేసిన మన విద్యా వ్యవస్థని కూడా' గడిచిన రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న మెసేజ్ ఇది. ఒకప్పటి సోవియట్ యూనియన్ లో భాగమైన ఉక్రెయిన్ మీద రష్యా దండెత్తడం, ప్రాణాలు అరచేత పెట్టుకుని ఉక్రెయిన్ లో ఉన్న విద్యార్థులు స్వదేశాలకి చేరుకునే ప్రయత్నాలు తీవ్రతరం చేయడం మొదలయ్యాక సహజంగానే యుద్ధ సంబంధ విషయాలు వార్తల్లోనూ, సోషల్ మీడియాలోనూ సింహభాగాన్ని ఆక్రమించాయి. ఈ యుద్ధం పట్ల భారతదేశం తటస్థ వైఖరి తీసుకున్నప్పటికీ ఆలోచనాపరుల్లో కొందరు రష్యావైపు, మరికొందరు ఉక్రెయిన్ వైపు నిలబడి మాట్లాడుతున్నారు. బలహీన దేశం అవ్వడం చేత కావొచ్చు, ఉక్రెయిన్ కి కొంచం ఎక్కువ మద్దతే దొరుకుతోంది. 

కర్ణాటకకి చెందిన వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప ఉక్రెయిన్ లో జరిగిన కాల్పుల్లో మరణించడంతో చర్చ 'విదేశీ విద్య' వైపుకి మళ్లింది. విదేశాల్లో - మరీ ముఖ్యంగా ఉక్రెయిన్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న ఇరవై వేల మంది విద్యార్థులని గురించి ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. వేలాది మంది విద్యార్థులు అక్కడ చదవడం వల్ల భారతీయులకి చెందిన కోట్లాది రూపాయలు ఆ దేశానికి చేరుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మనదేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్య సమృద్ధిగా దొరుకుతోంది. ఏటా పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులు 'ఉన్నత విద్య' కోసం విదేశాలకి, మరీ ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకి, ప్రయాణం అవుతున్నారు. ఎందుకన్నది బహిరంగ రహస్యమే. కానీ, వైద్య విద్య కథ పూర్తిగా వేరు. 

మన దేశంలో మెడిసిన్ లో ప్రవేశం కోసం నిర్వహించే 'నీట్' పరీక్షకి ఏటా సుమారు పదహారు లక్షల మంది హాజరవుతూ ఉండగా, ఉత్తీర్ణులవుతున్న వారి సంఖ్య కేవలం ఏడు లక్షలు మాత్రమే. వీరిలో కూడా మెడిసిన్ చదివే అవకాశం కేవలం రెండులక్షల లోపు మందికి మాత్రమే ఉంది. ఎందుకంటే మన దేశం మొత్తం మీద ఉన్న సీట్ల సంఖ్య అంతే కాబట్టి. మరి, వైద్య విద్య చదవాలని కోరుకునే మిగిలిన విద్యార్థుల పరిస్థితి? ఇక్కడే 'విదేశాల్లో వైద్య విద్య' అక్కరకొస్తోంది. పేపర్లలోనూ, టీవీల్లోనూ  'చైనాలో ఎంబీబీఎస్' తరహా ప్రకటనలు విస్తారంగా దర్శనమిస్తున్నాయి. "మా అబ్బాయికి మెరిట్ ఉన్నా, ప్రభుత్వ కాలేజీలో సీటు రాలేదు. ప్రయివేటు కాలేజీలో కోటి రూపాయలు పైగా ఫీజు చెల్లించే స్తోమతు లేక ఉక్రెయిన్ పంపించాం" కాల్పుల్లో చనిపోయిన విద్యార్థి తండ్రి చెప్పిన ఈ మాటలు ఇండియాలో వైద్య విద్య ఎంత ఖరీదో చెప్పకనే చెబుతున్నాయి. 

Google Image

కోట్లాది రూపాయలు విదేశాలకి తరలి పోవడాన్ని గురించి ఆందోనళ చెందిన ప్రధానమంత్రి, అలా ఎందుకు జరుగుతోందన్న ప్రశ్న వైపుకి వెళ్ళలేదు. 'జవహర్లాల్ నెహ్రు తగినన్ని మెడికల్ కాలేజీలు ప్రారంభించక పోవడం వల్ల' అనే జవాబు విజ్ఞులైన ప్రజలందరికీ దొరికేసి ఉంటుందని ప్రధాని భావించి ఉండొచ్చు. అయితే, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాత్రం విదేశాల్లో వైద్య విద్య చదువుతున్న భారతీయ విద్యార్థుల 'అర్హత' ని శంకించారు. "వారిలో చాలా మంది నీట్ పరీక్ష ఉత్తీర్ణులు కాలేదు" అని ప్రకటించారు. ఆసరికి, నీట్ పాసైన అందరికీ దేశంలో మెడిసిన్ సీట్లు దొరికేస్తున్నట్టు. పోనీ మంత్రి గారి సందేహం నిజమే అనుకుందామన్నా, అలా చదువుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన వాళ్ళు అర్హత పరీక్ష పాసైతే తప్ప ఇక్కడ వైద్య వృత్తి ప్రారంభించలేరు. కాబట్టి, వాళ్ళ వల్ల దేశానికి ఇతరత్రా నష్టాలేవీ లేనట్టే. వాళ్ళ డబ్బు విదేశాలకి తరలిపోకుండా చూడడం అన్నది తరలిపోతోందని ఆవేదన చెందినంత సులువు కాదు.

మరీ ఇంజనీరింగ్ కాలేజీలంత పెద్ద సంఖ్యలో కాకపోయినా, మన దేశంలో మెడికల్ కాలేజీలు బొత్తిగా విస్తరించక పోడానికి కారణం ఏమిటన్నది ఆసక్తికరమైన ప్రశ్న. ప్రభుత్వానికైనా, ప్రయివేటు వారికైనా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం అన్నది బాగా ఖర్చుతో కూడిన వ్యవహారం (ఇంజనీరింగ్ కాలేజీల కన్నా అనేకరెట్లు ఎక్కువ). పైగా నిర్వహణ భారమూ ఎక్కువే. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం తన పాత్రని పన్నుల వసూళ్లకు మాత్రమే కుదించుకుంటున్న నేపథ్యంలో, ప్రయివేటు రంగాన్ని గురించి మాత్రమే ఆలోచించినా అంత ఖర్చు చేసి కాలేజీలు ఏర్పాటు చేస్తే సీట్ల సంఖ్య మొదలు ఫీజులెంత వసూలు చేయాలోవరకూ సమస్త విషయాల్లోనూ ప్రభుత్వమే పెత్తనం చేస్తుంది, నియంత్రణ పేరుతో. పెట్టుబడి, నిర్వహణ వ్యయం, వాటికి వడ్డీలు కలిపి తడిపి మోపెడు. మేనేజ్మెంట్ కోటా సీట్లు అమ్ముకోగలగడం లాంటి చిన్న చిన్న సౌలభ్యాలు ఉన్నప్పటికీ, మెడికల్ కాలేజీ ఖర్చుతో నాలుగైదు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి త్వరగానూ, బాగానూ ఆర్జించే వీలు కనిపిస్తోంది. 

మరి విదేశాలు తక్కువ ఫీజుకే వైద్య విద్యని ఎలా అందించగలుగుతున్నాయి? ఎందుకంటే, ఆయా కాలేజీలు ఇప్పుడు నిర్వహణ వ్యయాన్ని మాత్రం ఆర్జించుకుంటే సరిపోతుంది. ఉక్రెయిన్ విషయమే తీసుకుంటే కాలేజీలన్నీ గతకాలపు సోవియట్ రోజుల్లో మొదలైనవే. కాబట్టి పెట్టుబడి తాలూకు రాబట్టుకోవడం అనే బాదరబందీ వాటికి లేదు. విద్యా వ్యవస్థని రక్షించాలంటున్న సోషల్ మీడియా మెసేజీల దగ్గరికి వస్తే, ఓ పక్క ఉన్న ఆస్తులనే అయినకాడికి  తెగనమ్ముకుంటున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం వైపునుంచి మన విద్యార్థుల సంఖ్యకి తగినన్ని కాలేజీల ఏర్పాటుని ఆశించలేం. పైగా విద్య, వైద్యం ప్రభుత్వం పనికాదన్న వాదన ఒకటి ఏలినవారి పనుపున బాగా ఊపందుకుంది.  ప్రైవేటు కాలేజీలు ఏర్పాటైనా తక్కువ ఫీజు అన్నది ఆచరణలో సాధ్య పడేది కాదు. కాబట్టి, మెజారిటీ విద్యార్థులు చదువు కొనక తప్పదు. సోషల్ మీడియాదేముంది, మరో కొత్త విషయం దొరికితే అటు మళ్లిపోతుంది. 

సోమవారం, మే 03, 2021

అదే కథ ...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుని తన రాజకీయ గురువుగా చెప్పుకుంటూ ఉంటారు. ఎన్ఠీఆర్ మీద అభిమానంతోనే తన కొడుక్కి తారకరామారావు అని పేరు పెట్టుకున్నారు కూడా. అయితే, ఆచరణకి వచ్చేసరికి కొన్ని విషయాల్లో ఆయన తెలుగు దేశం పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పద్ధతుల్ని అనుసరిస్తున్నారేమో అనిపిస్తోంది. రాజకీయాలలో కూరిమి విరసంబైనప్పుడు ఇదే కేసీఆర్ ఇదే చంద్రబాబుని 'డర్టీయెస్ట్ పొలిటిషన్ ఇన్ ఇండియా' అని అని ఉండొచ్చు గాక, రాజకీయ చాణక్యంలో - కనీసం కొన్ని విషయాల్లో అయినా - చంద్రబాబు నాయుణ్ణి అనుసరిస్తున్నారన్న భావన రోజురోజుకీ బలపడుతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ని పదవీచ్యుతుణ్ణి చేసిన ప్రస్తుత సందర్భంలో. 

కారణాంతరాల వల్ల తనకి ఇష్టం లేని నాయకుల్ని పదవి నుంచి తొలగించడానికి, అధికారులని ఉన్నత పదవులలోకి రాకుండా చేయడానికీ చంద్రబాబు నాయుడు దాదాపు రెండు దశాబ్దాల క్రితమే అమలు చేసిన వ్యూహాలనే ఇప్పుడు కేసీఆర్ రాజేందర్ విషయంలో అమలు చేస్తున్నారనిపిస్తోంది. పందొమ్మిదేళ్ళ క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాటి కేబినెట్లో నేటి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా ఉన్నారు. కారణాలు పైకి రాలేదు కానీ, ముఖ్యమంత్రికి-మంత్రికి కుదరాల్సినంతగా సఖ్యత కుదరలేదు. ఫలితంగా ఒకరోజు ముఖ్యమంత్రి ఒద్దికలో ఉండే ఓ పత్రికలో పంచాయతీ రాజ్ శాఖలో పెద్దఎత్తున అవినీతి జరిగిందంటూ ముఖ్యవార్త. పంచాయతీ ఆఫీసులకి అవసరమైన స్టేషనరీ కొనుగోలులో నిధుల గోల్ మాల్ జరిగిందన్నది కథనం. 

క్రమశిక్షణకు మారుపేరుగా పేరుతెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వం ముందుగా మంత్రి రాజీనామాకి, అటుపైన జరిగిన అవినీతిపై విచారణకి ఆదేశాలిచ్చింది. ఒక్క వార్తాకథనంతో మంత్రిగారి పదవి పోయింది. అటుపై చాలారోజుల పాటు విచారణ సా...గి, రిపోర్టులో తేల్చిందేమిటంటే అవినీతిలో మంత్రి పాత్ర లేదని!! కొంచం అటూ ఇటూగా ఇదే సమయంలోనే ఇలాంటి అనుభవమే ఓ ఉన్నతాధికారికీ ఎదురయ్యింది. తెల్లారి లేస్తే ప్రభుత్వంలో ముఖ్యమైన పోస్టుకు ప్రమోషన్ ఉత్తర్వులు అందుకోవాలి. కానీ ఎక్కడో ఏదో ఈక్వేషన్ తేడా కొట్టింది. ఫలితం, ఉత్తర్వులు అందుకోడానికి కొన్ని గంటల ముందుగా  - మళ్ళీ ఒద్దికలో ఉన్న పత్రికే - ఓ భారీ భూ కుంభకోణాన్ని బద్దలు కొట్టింది. ఆ కుంభకోణపు తీగని ఈ అధికారికి ముడిపెట్టింది. క్రమశిక్షణకి మారుపేరైన ప్రభుత్వం ప్రమోషన్ ఆపేసింది!! ఆ ఆరోపణల మీద విచారణ ఇంకా కొనసాగుతోందో, మధ్యలో అటకెక్కిందో మరి. 

కాలం మారింది. రెండు దశాబ్దాల కాలం చాలా మార్పుల్ని తోడు తెచ్చుకుంది. చంద్రబాబు నాయుడికి ఒద్దికలో ఉన్న పత్రికలు సాయం చేసిపెడితే, కేసీఆర్ చేతుల్లో సొంత మీడియానే ఉంది. సొంత చానళ్ళు పేపర్లతో పాటు, అనుకూల చానళ్ళు, పత్రికలూ మూకుమ్మడిగా రాజేందర్ వ్యతిరేక కథనాలు కూడబలుక్కున్నట్టు ఒకేసారి ప్రసారం చేశాయి. కథనాలు రావడమే తరువాయిగా విచారణ, వెంటనే మంత్రిత్వ శాఖ ఉపసంహరణ, ఆ వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్. పరిణామాలన్నీ శరవేగంతో జరిగిపోయాయి. రాత్రికి రాత్రే రాజేందర్ 'మాజీ మంత్రి' అయిపోయారు. ఈసారి ఆరోపణ భూ ఆక్రమణ. నిజానికి ఇది చాలా మందిమీద వచ్చిన చాలా పాత ఆరోపణ. తెలంగాణ రాష్ట్రం రాగానే ముందుగా దృష్టిపెడతామని ఉద్యమకాలంలో కేసీఆర్ హెచ్చరించిన ఆరోపణ. 'లక్ష నాగళ్ళ' తో ఆక్రమణల్ని దున్నే కార్యక్రమాన్ని సొంత మంత్రివర్గ సహచరుడితో మొదలు పెట్టారనుకోవాలా? 

రాజేందర్ పై తీసుకున్న 'క్రమశిక్షణ చర్య' గడిచిన రెండు దశాబ్దాల్లో మన చుట్టూ వచ్చిన అనేక మార్పులని పరిశీలించే అవకాశం ఇస్తోంది మనకి. నాటితో పోలిస్తే నేడు ప్రత్యామ్నాయ మీడియా, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా బలపడ్డాయి. ప్రసార సాధనాలు వర్గాలుగా విడిపోవడం వల్ల ప్రతి విషయం తాలూకు బొమ్మనీ, బొరుసునీ తెలుసుకోగలుగుతున్నాం. ఇరుపక్షాల వాదనలనీ వినగలుగుతున్నాం. సోషల్ మీడియా ద్వారా మన అభిప్రాయాలనూ చెప్పగలుగుతున్నాం. వీటి ఫలితమే రాజేందర్ కి దొరుకుతున్న మద్దతు. జరిగింది కేవలం క్రమశిక్షణ చర్య మాత్రమే కాదన్న సంగతి జనబాహుళ్యం అర్ధం చేసుకోగలిగింది. కేవలం పత్రికలు, టీవీల్లో వచ్చింది మాత్రమే నమ్మేసి, అభిప్రాయాలు ఏర్పరుచుకోకుండా, విషయాన్ని మొత్తంగా తెలుసుకుని, విశ్లేషించుకుని ఓ అభిప్రాయానికి రావడానికి వీలవుతుంది. చంద్రబాబు నాయుడు రాజకీయపుటెత్తుగడల్లో కేసీఆర్ ఇంకా ఏమేమి వాటిని అనుసరిస్తారో రాబోయే రోజుల్లో చూడాలి.

ఆదివారం, మే 02, 2021

ఐనా, ఫలం దక్కలేదు ...

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి 'కరోనా' కలిసిరాలేదు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారిని లెక్కచేయకుండా ఎదురెళ్ళిన రెండు సందర్భాలలోనూ వ్యతిరేక ఫలితమే వచ్చింది. ఈ ఎదుర్కోలు ఫలితంగా దేశం తీవ్రమైన ప్రాణ నష్టాన్ని, ఆర్ధిక కష్టాలని అనుభవించింది, అనుభవిస్తోంది. నిజానికి ఈ కష్టనష్టాలని భరిస్తున్నవాళ్ళు దేశంలోని పేదలు, మధ్యతరగతి వాళ్ళూను. ఈ కష్టకాలంలో సామాన్యుల మీద పన్నుల భారం దాదాపు రెట్టింపవ్వగా, సంపన్నుల సంపదలు సైతం అదే వేగంతో రెట్టింపు కావడం ప్రపంచం మొత్తం పరిశీలిస్తున్న విషాదం. దేశంలో కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడం, చివరికి పాకిస్తాన్, నేపాల్ లాంటి దేశాలు కూడా భారత్ మీద ట్రావెల్ బ్యాన్ విధించడం అంతకు మించిన విషాదం. అతలాకుతలమైన పరిస్థితులన్నీ ఎప్పటికి అదుపులోకి వస్తాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. 

గత ఏడాది ఫిబ్రవరి మాసాంతం.. అప్పటికే కొన్ని దేశాలకి కరోనా తన తీవ్రతని రుచి చూపించింది. పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. నూటముప్ఫయ్ కోట్లకి పైగా జనాభా ఉన్న, జనసాంద్రత అధికంగా ఉన్న భారతదేశంలోని అధికార యంత్రాంగం మాత్రం అమెరికా కి నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగత సత్కారాలకి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై ఉంది. నిజానికి ఈ 'నమస్తే ట్రంప్' కార్యక్రమం అంతకు నాలుగు నెలల క్రితమే భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికాలో 'హౌడీ మోడీ' పేరిట జరిగిన సత్కారానికి కృతజ్ఞత ప్రకటించడం. రాబోయే అమెరికా ఎన్నికల్లో ట్రంప్ మళ్ళీ విజయ దుందుభి మోగించబోతున్నాడనీ, మోడీ-ట్రంప్ ల మధ్య స్నేహం బలపడడం వల్ల భారతదేశం మళ్ళీ వెలిగిపోతుందనీ ప్రచారం హోరెత్తింది. 

'నమస్తే ట్రంప్' ని విజయవంతంగా పూర్తిచేసి, యంత్రాంగం మళ్ళీ ప్రజల మీద దృష్టి సారించే నాటికి దేశంలో కరోనా పడగ విప్పింది. లాక్ డౌన్ ప్రకటనతో లక్షలాది మంది వలస కార్మికులు వేలాది కిలోమీటర్లు కాలినడకన స్వస్థలాలకు ప్రయాణం అయ్యారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం పిండిన పన్నులకీ, విదిల్చిన సాయానికి పొంతనే లేదు. చమురు ధరల పెరుగుదల ఒక్కటి చాలు, ప్రభుత్వ పన్ను విధానం జనజీవితాన్ని ఎంతగా అతలాకుతలం చేసిందో చెప్పడానికి. నిజానికి కాస్త ముందుగా మేల్కొని, అంతర్జాతీయ ప్రయాణికుల మీద ఆంక్షలు పెట్టి, విదేశాల నుంచి వచ్చిన వాళ్లందరినీ తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉంచడం లాంటి చర్యలు కూడా తీసుకుని ఉంటే లాక్ డౌన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. సరే, ఎంత ప్రభుత్వమే అయినా ఇంతటి విపత్తుని ఊహించలేదు కదా. తీరా అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలవ్వడం, బైడెన్ ప్రభుత్వంతో భారత్ సంబంధాల విషయంలో ఒక స్పష్టత లేని అయోమయం కొనసాగుతూ ఉండడం నడుస్తున్న చరిత్ర. 

ఒకసారి దెబ్బతిన్నాక, రెండోసారి జాగ్రత్త పడడం అందరూ చేసే  పని. దురదృష్టవశాత్తూ మనదేశంలో అలా జరగలేదు. ఈ ఏడాది తొలినాటికి కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టే కనిపించాయి. కానీ, కరోనాకి దెబ్బతిన్న దేశాలన్నీ అప్పటికే సెకండ్ వేవ్ దెబ్బని రుచిచూసి ఉన్నాయి. కొన్ని దేశాలైతే ప్రాప్తకాలజ్ఞతతో ముందస్తు ఏర్పాట్లు చేసుకుని వైద్య రంగాన్ని బలపరుచుకున్నాయి. వాక్సిన్ మార్కెట్లోకి వస్తే చాలు, మన దేశంలో మ్యాన్ పవర్ కి, నెట్వర్క్ కి కొరత లేదు కాబట్టి అతి త్వరలోనే అందరికీ వాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందని నా బోట్లం ఆశించాము. ఇప్పటికే, పోలియో నిర్మూలన వాక్సినేషన్లో దేశానికి ఒక రికార్డు ఉంది కదా. మన ఫార్మా కంపెనీల గత చరిత్ర కూడా ఘనమైనదే. అభివృద్ధి చెందిన దేశాలకే ఔషధాలు, వాక్సిన్లు సప్లై చేసిన కంపెనీలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఫార్ములా చేతికొస్తే తయారీ, రవాణా ఇబ్బందులు కూడా ఉండబోవనుకున్నాం. 

తీరా వాక్సిన్ మార్కెట్లోకి వచ్చేసరికి ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముంచుకొచ్చాయి. నాటి పురాణ పురుషులు అశ్వమేధాది యాగాలు చేసి రాజ్య విస్తరణ చేసినట్టుగా, ఎన్నికల్లో రాష్ట్రాలని గెలవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంటుంది కదా. అయితే, నాటి పురాణ పురుషులు కరువు కాటకాలప్పుడు, విపత్తులతో ప్రజలు అల్లాడుతున్నప్పుడు రాజ్యవిస్తరణ మీద దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. కానీ,  ప్రజాస్వామ్యంలో అలాంటి శషభిషలు పనికి రావు మరి. దేశీయంగా వాక్సిన్ తయారీ, పంపిణీ లాంటి విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన వ్యక్తులు, కీలకమైన సమయంలో ఎన్నికల ప్రచార బాధ్యతల్లో తలమునకలయ్యారు. అన్నీ బాగున్న రోజుల్లో వర్చువల్ సభలు నిర్వహించి టెక్నోక్రాట్ ఇమేజీకోసం తాపత్రయ పడిన వాళ్ళు, కరోనా కాలంలో నేరుగా సభలు నిర్వహించి బలప్రదర్శనలు చేశారు. 

ఐదు రాష్ట్రాలని, మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ని ఏకఛత్రం కిందికి తీసుకు రాడానికి చేయని ప్రయత్నాలు లేవు, తొక్కని దారులు లేవు, పణంగా పెట్టనివీ లేవు. సుదీర్ఘమైన ఎన్నికల క్రతువు పూర్తయ్యేసరికి దేశంలో పరిస్థితులు పూర్తిగా చేయిదాటిపోయాయి. ఆక్సిజన్ సిలిండర్లకి మాత్రమే కాదు, శ్మశానాలలో కట్టెలకీ కరువొచ్చింది. వాక్సిన్ కి మాత్రమే కాదు, వ్యాధితో పోరాడుతున్న వాళ్ళని రక్షించే ఇంజక్షన్లకీ 'నో స్టాక్' బోర్డులు వేలాడుతున్నాయి. పరిస్థితులు విషమించేసరికి కేంద్రానికి రాష్ట్రాలు అనేవి ఉన్నాయని గుర్తొచ్చింది. బ్లేమ్ గేమ్ మొదలయ్యింది. పార్టీకి అధ్యక్షుడు వేరే ఉన్నా, పనులన్నీ మానుకుని మరీ ప్రధాని స్థాయి వ్యక్తి పదుల సంఖ్యలో పబ్లిక్ మీటింగులు పెట్టినా పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కలేదు. పార్టీ బలం బాగా పెరిగింది అని అభిమానులు గర్వంగా ప్రచారం చేసుకుంటున్నారు కానీ, అందుకుగాను జరిగిన ఖర్చు దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన అన్ని ప్రాణాలూ అనే వాస్తవాన్ని విస్మరిస్తూ ఉండడం విషాదాల్లోకెల్లా విషాదం.. 

బుధవారం, ఏప్రిల్ 14, 2021

'ఎమి' నేర్చుకున్న పాఠం

ఉద్యోగం చేస్తున్న సంస్థని 'కుటుంబం' గా భావించుకుని అనుబంధం పెంచుకోవచ్చా? నేనొక ఉద్యోగిని అని కాకుండా, ఫలానా సంస్థలో నేనో విడదీయరాని భాగం అని భావించుకోడం ఎంతవరకూ సబబు? 'గూగుల్' సంస్థ మాజీ ఉద్యోగిని ఎమి నైట్ ఫీల్డ్ తను ఉద్యోగం విడిచిపెట్టేందుకు దారితీసిన పరిస్థితులని వివరిస్తూ గతవారం 'ది న్యూయార్క్ టైమ్స్' కి రాసిన వ్యాసం చదివాకా తలెత్తే అనేకానేక ప్రశ్నల్లో ఇవికూడా ముఖ్యమైనవే. యూనివర్సిటీ క్యాంపస్ నుంచి నేరుగా గూగుల్ సంస్థలో ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరి, నాలుగేళ్లు మాత్రమే అక్కడ పనిచేయగలిగి 2019 లో ఉద్యోగాన్ని విడిచిపెట్టేశారు ఎమి.  ఆమె ప్రధాన ఆరోపణ పని ప్రదేశంలో తాను లైంగిక వేధింపులకు గురయ్యానని, సంస్థ నుంచి ఎలాంటి భరోసానీ పొందలేక పోయననీను.  ఆమె రాసిన విషయాలని గురించి అటు 'న్యూయార్క్ టైమ్స్' కామెంట్స్ సెక్షన్ లోనూ, ఇతరత్రా మాధ్యమాలలోనూ విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఆమె వేలెత్తి చూపిన సంస్థ అతిపెద్ద కార్పొరేట్ కావడం కూడా ఈ విస్తృత చర్చకి ఒక కారణం. 

అనాధాశ్రమంలో పెరిగిన ఎమీకి గూగుల్ లో ఉద్యోగం చేయడం అన్నది చదువుకునే రోజుల్లో ఒక కల.ఎంతో శ్రమించి ఆ కలని నెరవేర్చుకుంది. ఆఫీసు వాతావరణం, పని ప్రదేశంలో లభించిన సౌకర్యాలు, ఉద్యోగభద్రత ఇవన్నీ ఆమెకి చాలా సంతోషాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా సంస్థ ఆమెకి కల్పించిన సౌకర్యాలకు (ఉచిత భోజనం, జిమ్, తరచూ ప్రయాణాలు, పార్టీలు ఇత్యాదులు) అతిత్వరలోనే అలవాటు పడిపోయింది. "నా మేనేజర్లో నేను తండ్రిని చూసుకున్నాను" అంటూ ఆమె రాసిన వాక్యం దగ్గర ఒక్క క్షణం ఆగుతారు పాఠకులందరూ. అయితే, ఆమెకి వేధింపులు ఎదురయ్యింది మేనేజర్ నుంచి కాదు. మరో సీనియర్ సహోద్యోగి నుంచి. మేనేజర్ మాత్రమే కాదు, మానవ వనరుల విభాగం కూడా ఆమె కోరుకున్నట్టుగా స్పందించలేదు. పైపెచ్చు ఆమె వేధించినతని కనుచూపు మేరలోనే పనిచేయాల్సి వచ్చింది. "ఇంటి నుంచి పనిచెయ్యి, లేదా సెలవుపెట్టు" అని ఆమెకి సలహా ఇచ్చింది మానవవనరుల విభాగం. 

చాలా ఓపిక పట్టి, మూడు నెలలు సెలవు పెట్టినా కూడా ఆమె ఫిర్యాదు మీద విచారణ ఓ కొలిక్కి రాలేదు. ఆమె అతనితోనే పనిచేయాల్సి వచ్చింది. కాలేజీ రోజుల నాటి కలలు, ఉద్యోగంలో చేరిన కొత్తలో పెంచుకున్న భరోసా.. ఇవన్నీ బద్దలైపోవడం ఆమెని కుంగదీసింది. వేరే ఉద్యోగం వెతుక్కుంది. "ఇది కేవలం ఉద్యోగం.. చేస్తాను, కానీ ఎప్పటికీ నేను నా ఉద్యోగాన్ని ప్రేమించలేను" అంటుంది ఎమి. వేధింపుల విషయంలో మహిళా ఉద్యోగుల నుంచి వచ్చే ఫిర్యాదుల పట్ల సంస్థల ఉదాసీన వైఖరి కొత్తేమీ కాదు. నిజం చెప్పాలంటే ఇలాంటి ఫిర్యాదుల విషయంలో సంస్థలు వేగంగా స్పందించిన  సందర్భాలు అరుదు. సాక్ష్యాల సేకరణ, నేర నిరూపణ జాప్యానికి ముఖ్య కారణాలని చెప్పొచ్చు. ఒక జూనియర్ ఉద్యోగికి, సీనియర్ కి మధ్య అభిప్రాయ భేదాలు వస్తే, యాజమాన్యాలు సీనియర్ పక్షానే ఉంటాయన్నది తరచూ వినిపించే మాట. గూగుల్ కూడా ఇందుకు భిన్నంగా వ్యవహరించలేదు. బాధితురాలిగా ఎమి రాసింది చదువుతున్నప్పుడు, చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, విచారణని ఆమె సంస్థ మరికొంత సహానుభూతితో నిర్వహించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. 

ఎమి రాసింది చదువుతూ ఉంటే బాగా ఆకర్షించేది, ఆలోచింపజేసేదీ సంస్థని, ఉద్యోగాన్ని ఆమె ప్రేమించిన తీరు. ఓ ఇరవై, పాతికేళ్ల క్రితం వరకూ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందని క్రితం ఉన్న బంధాన్ని గుర్తు చేసింది. గూగుల్ సంస్థలో ఉన్నన్ని ఆకర్షణలు లేకపోయినా, ఒకప్పుడు ఉద్యోగం సంపాదించడం అంటే జీవితంలో స్థిరపడడమే. రిటైర్మెంట్ వరకూ ఉద్యోగమూ, సంస్థా కూడా ఉంటాయన్న భరోసా బాగానే ఉండేది. కాస్త భద్రమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టడం అనేది బహు అరుదు. ఉద్యోగం పోతుందేమో అన్న భయం ఉద్యోగుల్లో ఉన్నప్పటికీ, సంస్థలు కూడా "వీళ్ళకి మనం తప్ప మరో దిక్కు లేదు" అన్నట్టు కాకుండా ఉన్నంతలో బాగానే చూసేవి. ఆ భయం వల్లనే కావొచ్చు, సంస్థలో విడదీయలేని భాగం అనేంత అనుబంధం అయితే ఉండేది కాదు. అంత అనుబంధం పెంచుకోవాల్సిన అవసరం లేదనిపించే సందర్భాలూ తటస్తిస్తూనే ఉండేవి. సంస్థకి, ఉద్యోగానికి అలవాటు పడడం అనే ప్రసక్తి ఉండేది కాదు. ఉద్యోగుల వయసు, పూర్వానుభవాలు కూడా ఇందుకు దోహదం చేస్తూ ఉండేవి బహుశా. 

గడిచిన ఇరవై ఏళ్లలో సంస్థ-ఉద్యోగి సంబంధాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఎమి ఉదంతాన్ని పరిశీలించడం అవసరం. మిలీనియల్స్ లో (1990 తర్వాత పుట్టిన వాళ్ళు) ఎక్కువగా కనిపించే 'ప్రాక్టికాలిటీ' ఉద్యోగంలో చేరిననాటి ఎమిలో కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది.  ఇందుకు ఆమె ఆలోచనా ధోరణితో పాటు, ఆ సంస్థలో పనిచేస్తున్న కారణంగా ఆమెకి దొరికిన హోదా, లభించిన సౌకర్యాలూ కూడా తగుమాత్రం పాత్ర పోషించి ఉండాలి. నిజానికిప్పుడు జాబ్ మార్కెట్లో 'లాయల్టీ' కి విలువ లేదు. 'ఒక సీనియర్ కి ఇచ్చే డబ్బుతో ఇద్దరు/ముగ్గురు  జూనియర్లు' అనే సూత్రాన్ని వంటబట్టించుకున్న సంస్థలే అధికం. ఈ కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు, అభద్రతతో రోజులు వెళ్లదీస్తున్న వాళ్ళు (ముఖ్యంగా ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తూ, సీనియర్లు అయిన వాళ్ళు) చాలామందే ఉన్నారు. గూగుల్ లాంటి బాగా పేరున్న కార్పొరేట్లు కొంత మినహాయింపు కావచ్చేమో కానీ, మెజారిటీ సాఫ్త్వేర్ కంపెనీల్లో ఉద్యోగుల సగటు సర్వీసు ఒకటి నుంచి ఐదు సంవత్సరాలు మించడం లేదు. 

సంస్థ-ఉద్యోగి సంబంధాల్లో వచ్చిన మార్పుని ఉద్యోగులు - మరీ ముఖ్యంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న యువత - బాగా గుర్తు పెట్టుకోవాలని ఎమి ఉదంతం హెచ్చరిస్తోంది. సంస్థని ఓ కుటుంబంగానో, భరోసాగానో భావించడం తెలివైన పని కాదని చెబుతోంది. కుటుంబాన్నీ, సోషల్ సర్కిల్నీ త్యాగం చేసి ఉద్యోగంలో నిరూపించుకోవాల్సిన అవసరం లేదని గుర్తుచేస్తోంది. 'వర్క్-లైఫ్ బాలన్స్' అనేది ఎవరికి వారు నిర్వచించుకుని అమలు చేసుకోవాలి తప్ప సంస్థే సర్వస్వం అనుకోకూడదు అంటోంది ఎమి. సగటు మిలీనియల్స్ కన్నా ఆమె తన సంస్థని, ఉద్యోగాన్ని కొంచం ఎక్కువగానే ప్రేమించి ఉండొచ్చు. అందుకుగాను మూల్యాన్ని చెల్లించింది కూడా. పని ప్రదేశంలో ఇచ్చిపుచ్చుకునే లెక్క తప్పకూడదనీ, తప్పితే అందుకు మూల్యం చెల్లించాల్సింది ఉద్యోగేననీ 'గూగుల్' సాక్షిగా చెప్పింది ఎమి. కొన్ని చేదు అనుభవాల తర్వాత ఆమె నేర్చుకున్న పాఠాన్ని గమనంలో ఉంచుకోడం ద్వారా ఎవరికివారు వృత్తిగత-వ్యక్తిగత జీవితాల మధ్య ఒక రేఖ గీసుకోగలిగే వీలుంది. ఆమె అనుభవాలు చదివిన కొందరైనా ఈ ప్రయత్నం మొదలు పెడతారు, తప్పకుండా. 

ఆదివారం, ఫిబ్రవరి 07, 2021

సుబ్బిశెట్టి గారి చింతామణి

గత కొద్దిరోజులుగా వాట్సాప్ గ్రూపుల్లో ఓ మెసేజీ చక్కర్లు కొడుతోంది. ఆర్య వైశ్య సంఘాల అభ్యర్ధన మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 'చింతామణి' నాటక ప్రదర్శనని నిషేధిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సాంస్కృతిక శాఖకి ఆదేశాలు వెళ్లాయన్నది ఆ మెసేజీ సారాంశం. దీంతో, వివాదాస్పద నాటకం 'చింతామణి' మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. గతంలోనూ ఈ నాటకం నిషేధాలకి గురైనా అది కొన్ని ప్రాంతాల్లో, స్థానిక పోలీసు అధికారుల నిర్ణయం మేరకు తాత్కాలికంగా జరిగింది తప్ప, ప్రభుత్వం ద్వారా శాశ్వత నిషేధం కాదు. శత వసంతాల ఉత్సవం జరుపుకోవాల్సిన సమయంలో నిషేధానికి గురవ్వడం అన్నది ఒక రచనగా చూసినప్పుడు 'చింతామణి' విషయంలో బాధ కలిగించే విషయమే. కానీ, నాటక ప్రదర్శనగా చూసినప్పుడు నిషేధాన్ని సమర్ధించకుండా ఉండలేం. అదే సమయంలో, ఇన్నేళ్ల తర్వాత నిషేధించడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నా తలెత్తుతుంది. 

తెలుగులో తొలితరం ప్రచురణ కర్త కూడా అయిన కాళ్ళకూరి నారాయణ రావు (1871-1927) సంఘ సంస్కరణని ఆశిస్తూ నాటక రచన చేశారు. హాస్యం ద్వారా ప్రజలకి చేరువ కావచ్చన్నది వీరు నమ్మిన సిద్ధాంతం. వరకట్నాలని వ్యతిరేకిస్తూ రాసిన 'వర విక్రయం' నాటకం ప్రజాదరణ పొందింది. ఈ నాటకంలో సింగరాజు లింగరాజు పాత్ర, 'అహనా పెళ్ళంట' తో సహా అనేక తెలుగు సినిమాల్లో పిసినారి పాత్రలకి ఒరవడి పెట్టింది. 'వర విక్రయం' తర్వాత నారాయణరావు రాసిన నాటకం 'చింతామణి', ఇతివృత్తం వేశ్యా వ్యసన నిర్మూలన. లీలాశుకుని కథని ఆధారం చేసుకుని రాసిన ఈ నాటకం ఆద్యంతం హాస్యభరితంగానూ, ముగింపు కరుణరస భరితంగానూ ఉంటుంది. అటు వేశ్య చింతామణిలోనూ, ఇటు విటులలోనూ పరివర్తన రావడంతో నాటకం ముగుస్తుంది. 

మూల నాటకంలో హాస్యమే తప్ప బూతు లేదు. చింతామణి ముగ్గురు విటుల్లో ఒకరైన సుబ్బిశెట్టిని హాస్య పాత్రగా మలిచారు రచయిత. ఈ పాత్ర లోభిగా కనిపించి ప్రేక్షకుల్ని నవ్విస్తుంది  ('కన్యాశుల్కం' నాటకంలో పోలిశెట్టి లాగా) తప్ప  ఆ కులంవారు అభ్యంతరం చెప్పేలా ఉండదు. ఒకసారి ప్రదర్శనల కోసం నాటక సమాజాల చేతుల్లో పడ్డాక మూల నాటకం తన రూపాన్ని కోల్పోయింది. హాస్యం స్థానంలో బూతు ప్రవేశించింది. స్త్రీలు తమంతట తామే ఆ నాటకాన్ని దూరం పెడితే, పెద్దవాళ్ళు పిల్లలని ఆ నాటకం చూడనిచ్చే వాళ్ళు కాదు. రానురానూ, మిగిలిన పాత్రలని నామమాత్రం చేసి కేవలం చింతామణి-సుబ్బిశెట్టిల సరస సంభాషణల్ని పెంపు చేసి నాటకాన్ని నిర్వహించడం, ఆ ప్రదర్శనలకు ప్రజాదరణ పెరగడం సంభవించింది. మూల నాటక రచయిత కాలధర్మం చెందడంతో అభ్యంతర పెట్టేవాళ్ళు లేకపోయారు. 

ఆశ్చర్యం ఏమిటంటే, నాటకంలోని బూతు సినిమా లోకీ చొరబడింది. కాళ్ళకూరి 'వరవిక్రయం' నాటకం ఆధారంగా అదే పేరుతో తీసిన సినిమా ద్వారా వెండి తెరకి పరిచయమైన భానుమతి, భరణీ పిక్చర్స్ సంస్థని స్థాపించి వరుసగా సినిమాలు తీస్తూ 1956లో తానే కథానాయికగా, తన భర్త రామకృష్ణ దర్శకత్వంలో  'చింతామణి' సినిమా తీసినప్పుడు, ఆ సినిమాకి సెన్సార్ ఇబ్బందులు తప్పలేదు. సుబ్బిశెట్టి పాత్ర పోషించిన రేలంగి చేత చెప్పించిన డైలాగులన్నీ సెన్సారు చేయబడ్డాయి. ప్రజలు కోరిందే (?) తీద్దాం అనుకున్న భరణీ వారికి, సెన్సార్ రూపంలో చుక్కెదురైంది. ఎన్ఠీఆర్ బిల్వమంగళుడుగా నటించినా ఆ సినిమా సరిగా ఆడలేదు. విమర్శకుల మెప్పూ దొరకలేదు. నాటక సమాజాల చేతుల్లో రూపాంతరం చెందిన సుబ్బిశెట్టి పాత్ర తాలూకు ప్రభావాన్ని అంచనా వేయడానికి ఉపయోగ పడే దృష్టాంతం ఇది. 

నిజానికి 'చింతామణి' నాటకం పట్ల ఆర్య వైశ్యుల అభ్యంతరం ఇవాళ కొత్తగా మొదలైంది కాదు. సుమారు ముప్ఫయ్ ఏళ్ళ క్రితం, వాణీ విశ్వనాథ్ చింతామణి గానూ, తాను సుబ్బిశెట్టి గానూ స్వీయ దర్శకత్వంలో 'చింతామణి' సినిమాని నిర్మిస్తానని దాసరి నారాయణ రావు ప్రకటించినప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య సంఘాలన్నీ ఆ ప్రతిపాదన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశాయి. మర్నాటికే తన నిర్ణయంపై వెనక్కి తగ్గారు దాసరి (అప్పటికే ఈ సినిమా విషయంలో కొన్ని విఫల యత్నాలు చేసి ఉన్నారు). ఒకప్పటితో పోల్చినప్పుడు గత పదేళ్లుగా తెలుగు ప్రజల్లో కుల స్పృహ బాగా పెరిగిందనన్నది కంటికి కనిపిస్తున్న విషయం. అప్పటివరకూ ఎన్నో సినిమాల్లో బ్రాహ్మణ వేషాల పాత్రల్ని అవమానకరంగా చిత్రించినా పెద్దగా పట్టించుకోని ఆ వర్గం, 2012 లో విడుదలైన 'దేనికైనా రెడీ' సినిమా విషయంలో తీవ్రంగా స్పందించడం రాష్ట్రమంతా చర్చనీయమయ్యింది. వైశ్య వర్గం నుంచి ఒత్తిడి పెరగడంతో, ప్రస్తుత ప్రభుత్వం 'చింతామణి ప్రదర్శనల నిషేధం' నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. 

నాటక ప్రదర్శనలు దాదాపుగా అంతరించిపోయిన తరుణంలో ఈ నిషేధం వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమిటన్నది ఒక ప్రశ్న. అలాగే, ఆంధ్ర ప్రదేశ్ తో పోల్చినప్పుడు ఉన్నంతలో తెలంగాణలో నాటక ప్రదర్శనలు కాస్త జరుగుతున్నాయి. మరి ఆ రాష్ట్రంలో ఈ నాటకాన్ని నిషేధించేందుకు ఏవన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్నది రెండో ప్రశ్న. రెండో ప్రశ్నని ఆర్య వైశ్య సంఘాల వారికి విడిచిపెట్టి, మొదటి ప్రశ్న గురించి మాట్లాడుకుంటే ఈ నాటకాన్ని నిషేధించడం వల్ల ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. కేవలం నాటకాలు, సినిమాలే కాదు టీవీ, ఓటీటీ మీడియం లోనూ విపరీతంగా 'కంటెంట్' ఉత్పత్తి అవుతూ, అందులో హాస్యం కోసం సదరు ఉత్పత్తి దారులు నానా పాట్లూ పడుతున్న నేపథ్యంలో, కంటెంట్ క్రియేటర్ల మీద ఈ నిషేధం తాలూకు ప్రభావం ఉండొచ్చు. మనోభావాల జోలికి వెళ్లకూడదన్న మెసేజీ వారికి అందవచ్చు. ఒకవేళ వాళ్ళు పెడ చెవిన పెట్టినా, తమని టార్గెట్ చేస్తే ఎలా స్పందించాలో అన్ని వర్గాలకీ ఓ స్పష్టత తప్పక వస్తుంది. మూల రచనలో వేలు పెట్టకుండా ఉన్నదున్నట్టు ప్రదర్శించి ఉంటే 'చింతామణి' నాటకానికి ఈ ముగింపు ఉండేది కాదు కదా..

శుక్రవారం, జులై 24, 2020

పీవీ గురించి మళ్ళీ ...

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుని 'కాంగ్రెస్ మనిషి' గా గుర్తించారు! పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీవీ శతజయంతి కార్యక్రమానికి పంపిన సందేశంలో సోనియా పీవీని 'నిజమైన కాంగ్రెస్ మనిషి' గా అభివర్ణించారు. బాగా ఆలస్యంగానే అయినా, సోనియా ఓ నిజాన్ని గుర్తించి, అంగీకరించారు. ప్రధానిగా పీవీ చేసిందంతా దేశం కోసమూ, కాంగ్రెస్ పార్టీ కోసమే తప్ప తాను, తన కుటుంబం బాగుపడేందుకోసం ఏమీ చేయలేదనీ, చేసిన దానికి ఫలితంగా అనేక కేసుల్నీ, బోలెడంత అపకీర్తినీ మాత్రమే  మూటకట్టుకున్నారనీ దేశం యావత్తూ గుర్తించిన చాలా ఏళ్ళకి సోనియాకి ఈ గమనింపు కలిగింది. ఓ పదహారేళ్ళ క్రితం ఆమెకీ ఎరుక కలిగి ఉంటే కనీసం పీవీ పార్థివ దేహానికి  ఓ గౌరవం దొరికి ఉండేది. 

ఇన్నాళ్లూ పీవీ ప్రస్తావనని కూడా ఇష్టపడని సోనియా ఇంతకీ ఇప్పటికిప్పుడు ఈ ప్రకటన చేయడం వెనుక కారణం ఏమిటి? ఆ కారణం రెండు కాంగ్రెసేతర పార్టీలు కావడం - ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ కి బద్ధ విరోధులు కావడం - ఇక్కడ విశేషం. గత నెల 24 న పీవీ తొంభై తొమ్మిదో జయంతిని హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆరెస్), ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించాయి. అప్పుడప్పుడూ లీలగా, పీలగా వినిపిస్తూ వచ్చిన 'పీవీకి భారత రత్న' డిమాండ్ ఈసారి కొంచం గట్టిగా వినిపించింది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పీవీకి 'భారత రత్న' ప్రకటించినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటు ఢిల్లీ లోనూ, ఇటు పీవీ స్వరాష్ట్రంలోనూ ఏడాది పాటు పీవీ శతజయంతి జరిపేందుకు అధికార పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఒకరోజు ఫోటోకి దండేసే కార్యక్రమం మాత్రమే అయితే కాంగ్రెస్ పెద్దగా పట్టించుకుని ఉండేది కాదేమో, కానీ ఏడాది పాటు తెలియనట్టుగా ఉండడం అంటే కష్టం కదా. 

కేంద్ర ప్రభుత్వం పీవీకి ప్రాధాన్యం ఇవ్వడం వెనుక కారణం ఊహించగలిగేదే. ఆయన నెహ్రు-గాంధీ కుటుంబేతరుడు కావడం. సోనియా-రాహుల్ పీవీ ప్రస్తావనని వీలైనంత దూరం పెట్టడమూను. శత్రువుకి శత్రువు మిత్రుడే అవుతాడు కదా. పీవీ కృషిని ప్రశంసించడాన్ని, నెహ్రు-గాంధీ వారసుల అసమర్ధతని ఎత్తిచూపడంగా భావించుకునే పరిస్థితులున్నాయిప్పుడు. ('అప్పుడు మా వంశీకులు ప్రధాని పదవిలో ఉండి ఉంటె బాబరీ మసీదు కూలేదే కాదు' అని రాహుల్ గాంధీ కొన్నేళ్ల క్రితం చేసిన ప్రకటనని ఎవరు మర్చిపోయినా బీజేపీ మర్చిపోతుందని అనుకోలేం). దేశంలోని సకల అనర్ధాలకీ నెహ్రుని, కాంగ్రెస్ ని కారణాలుగా చూపే బీజేపీ నాయకులు పీవీ శతజయంతి జరపడం అంటే ఒకరకంగా కాంగ్రెస్ ని కవ్వించడమే. కాంగ్రెస్ పార్టీకి కూడా పీవీని తల్చుకోక తప్పని పరిస్థితిని కల్పించడమే. 

(Google Image)
'పీవీ తెలంగాణ ఠీవి' అని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. ఆయనకి కూడా కాంగ్రెస్ ని విమర్శించని రోజు ఉండదు. కానీ, పీవీ విషయంలో మినహాయింపు. ప్రధాన కారణం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్ని ఇరుకున పెట్టే అవకాశం దొరకడం. వాళ్ళు పీవీని ఓన్ చేసుకోలేరు, వదిలేయనూ లేరు. ఈ శతజయంతి సంవత్సరంలో చేసే కార్యక్రమాల్లో భాగంగా పీవీ కుటుంబం నుంచి ఒకరిని (కుమార్తె సురభి వాణీదేవి పేరు వినిపిస్తోంది) గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. సభలు, సమావేశాలు జరుగుతాయి. 'పీవీకి భారత రత్న' అనే ఖర్చు లేని డిమాండ్ ఉండనే ఉంది. ఈ డిమాండ్ విషయంలో ఢిల్లీ కూడా ఆసక్తి చూపిస్తోందంటూ వార్తలు రావడం కొంచం ఆలోచించాల్సిన విషయం.  

వివాదాస్పదులు, కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నవారి పేర్లని 'పద్మ' పురస్కారాలకి పరిశీలించరు అన్నది అందరూ అనుకునే మాట. 'పద్మశ్రీ' మొదలు 'పద్మవిభూషణ్' వరకూ ఇప్పటికే ఆచరణలో మినహాయింపులు వచ్చేశాయి. ఇక మిగిలింది 'భారత రత్న.'  పీవీ ద్వారా మార్గం సుగమం చేసుకునే ఆలోచనగా దీనిని భావించాలా? ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత పీవీ చివరి రోజులు దుర్భరంగా గడిచాయి. కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగడం, లాయర్ల ఫీజుల కోసం సొంత ఇంటిని అమ్ముకోవడం లాంటివన్నీ జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ పీవీ ఎవరో తెలియనట్టు ప్రవర్తించింది.  తర్వాతి కాలంలో మరో అడుగు ముందుకేసి ఆర్ధిక సంస్కరణలన్నీ మన్మోహన్ సింగ్ ఖాతాలో మాత్రమే వేసే ప్రయత్నమూ చేసింది. (అయితే, మన్మోహన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు). చివరికి పీవీ మరణించినప్పుడు ఢిల్లీలో అంత్యక్రియలు జరిపేందుకే కాదు, పార్టీ కార్యాలయంలో పీవీ పార్థివ దేహాన్ని ఉంచేందుకు కూడా అధినేత్రి సోనియా అంగీకరించలేదు. 

ఇన్నేళ్ల తర్వాత అదే సోనియా అదే పీవీ శతజయంతి జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకి అనుమతి ఇచ్చారు. తన సందేశంలో పీవీని  'కాంగ్రెస్ మనిషి' గా అంగీకరించారు. దేశానికి ఆయన చేసిన సేవల్ని ప్రశంసించారు. వార్తలు చూస్తుంటే ఒక్కటే అనిపించింది. 2004 డిసెంబర్ 23న దేశంలోనూ, రాష్ట్రం లోనూ (సమైక్య ఆంధ్ర ప్రదేశ్) కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండకుండా ఉండి ఉంటే, మాజీ ప్రధానులు అందరి అంత్య క్రియలూ జరిగిన దేశ రాజధానిలోనే పీవీ అంత్యక్రియలు కూడా జరిగి ఉండేవేమో కదా. క్లిష్ట సమయంలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టి, ఆర్ధికంగా దేశాన్ని ఒడ్డున పడేసి, ఆ పడేసే క్రమంలో జరిగిన చెడుకి తాను మాత్రమే జీవితాంతం బాధ్యత వహించిన పీవీకి కనీసం మరణానంతర గౌరవమైనా దక్కేదేమో. పీవీ పదవుల్లో ఉన్నప్పుడు మొదలు ఇప్పటి శతజయంతి వరకు ఆయన వల్ల చుట్టూ ఉన్నవాళ్లు మాత్రమే ఏదో ఒక రీతిలో ప్రయోజనం పొందుతూ ఉండడాన్ని విధి వైచిత్రి అనే అనాలేమో...

బుధవారం, జులై 08, 2020

కనిపించని సమస్య

నెమ్మదిగా నాలుగు నెలలవుతోంది, కరోనా అని మనం పిలుచుకుంటున్న కోవిడ్-19 తో సహజీవనం మొదలై. కొన్ని ప్రపంచ దేశాలు మనకన్నా (భారతదేశం) ముందే కరోనా బారిన పడితే, మరికొన్ని మన వెనుక నిలిచాయి. దేశాల పేర్లు వేరు తప్ప పరిస్థితులు దాదాపు ఒక్కటే. కరోనా క్రిమి ఎలా అయితే కంటికి కనిపించడం లేదో, జనజీవనం మీద దాని ప్రభావం కూడా అలాగే దృశ్యాదృశ్యంగా ఉంది.  పైకి కనిపించని విధంగానే జీవితాలని అల్లకల్లోలం చేసేస్తోంది. మొదట్లో ఇది కేవలం ఆరోగ్య సమస్య అనుకున్నాం కానీ, రానురానూ ఇది ఆర్ధిక వ్యవస్థల్ని మింగేసేదిగా విశ్వరూపం దాలుస్తోంది. ఫలితం, ఇప్పటికే కొన్ని కోట్ల మంది ఉపాధి కోల్పోయారు, మరి కొన్ని కోట్ల మంది 'ఏక్షణంలో అయినా మెడమీద కత్తి పడొచ్చు'  అనే భయంతో బతుకుతున్నారు. 

'కరోనా-ఉపాధి' అనగానే మొదట గుర్తొచ్చేవాళ్ళు వలస కూలీలు. నగరాల్లో ఉపాధి కోల్పోయి, ప్రయాణ సాధనాలేవీ అందుబాటులో లేక కాలినడకన వందల కిలోమీటర్లు నడిచి స్వస్థలాలకు చేరుకున్న వాళ్ళు. వాళ్ళ కష్టాన్ని తీసేయలేం కానీ, స్వచ్చంద సంస్థల నుంచీ, వ్యక్తుల నుంచీ, ప్రభుత్వం నుంచీ కూడా వాళ్లకి ఎంతో కొంత సహాయం అందింది. 'మేమున్నాం' అంటూ ముందుకొచ్చి తోచిన సాయం చేసినవాళ్లు లక్షల్లో కాకపోయినా, వేలల్లో ఉన్నారు. ప్రభుత్వం కూడా ఉచిత రేషన్ లాంటి పథకాలు ప్రకటించింది. దేశంలో ఎక్కడున్నా రేషన్ పొందొచ్చన్న వెసులుబాటునీ ఇచ్చింది. దీనివల్ల వాళ్ళకి మూడుపూటలా భోజనం దొరక్క పోవచ్చు, కానీ ఒక్క పూట భోజనానికైనా భరోసా ఉంది. ఈ వలస కూలీల సమస్య అందరి దృష్టిలోనూ పడింది. మొత్తంగా కాకపోయినా, కనీసం కొంతమేరకైనా వాళ్ళకి తోడు నిలబడే వాళ్ళూ తారస పడ్డారు.

కరోనా తొలిదశలో దెబ్బతిన్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉండగా, రెండో దశలో దెబ్బ తింటున్న వాళ్ళు, తినబోతున్న వాళ్ళది మరో కథ. మనం పెద్దగా మాట్లాడుకోని కథ. మాట్లాడుకోవాల్సిన కథ కూడా. ప్రయివేటు సెక్టార్లో జీతాల కోతతో మొదలైన కరోనా ప్రభావం ఇప్పుడు ఉద్యోగాల కోత దశకి చేరుకుంది. బాధితులంతా మధ్య తరగతి వాళ్ళు. ప్రభుత్వం ముక్కు పిండి మరీ పన్ను వసూలు చేసే వర్గం ఏదైనా ఉందా అంటే అది వీళ్ళు మాత్రమే. వీళ్ళలో చాలామందికి జూలై మొదటి వారంలో వాళ్ళ వాళ్ళ ఆఫీసులనుంచి రెండు రకాల కబుర్లు వచ్చాయి. కొందరికి 'మీసేవలు చాలు' అని, మరి కొందరికి 'ఈ కష్ట కాలంలో మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మానసికంగా సిద్ధ పడండి' అనీను. ఒక్కసారిగా వీళ్లందరి కాళ్ళ కింద నేలా కదిలినా, ప్రసార సాధనలకి అది 'వార్త' కాలేదు. ప్రభుత్వానికి 'పట్టించుకోవాల్సిన విషయం' కూడా కాలేదు. 

కరోనా కారణంగా భారతదేశంలో ఎక్కువగా ప్రభావితం అయ్యిందీ, ఎటు నుంచీ సాయానికి నోచుకోనిదీ ఏదన్నా వర్గం ఉందా అంటే, అది ఈ ప్రయివేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగ వర్గమే. ఇన్నాళ్లూ పని చేసిన సంస్థలకి వీళ్లిప్పుడు ఒక్కసారిగా 'వదిలించుకోవాల్సిన బరువు' అయిపోయారు. ప్రభుత్వం దృష్టిలోనేమో సాయం పొందేంత పేదలు కాదు. సోషల్ మీడియా తో సహా ఎవరికీ మాట్లాడుకోవాల్సిన టాపిక్ కూడా కాదు. ఒకపూట భోజనంతోనో, ప్రయాణపు ఏర్పాట్ల ద్వారానో లేక ఉచిత రేషన్ వల్లనో (కనీసం కొంతైనా) పరిష్కారమయ్యే  సమస్యలు కూడా కావు వీళ్ళవి. 'అంతకు మించి' చేయాల్సిన అవసరం ఉండగా, అసలు సమస్యే లేనట్టుగా వ్యవహరిస్తూ ఉండడం జరుగుతోందిప్పుడు. 'బ్యాంక్ రుణాల చెల్లింపు వాయిదా' అనే ప్రహసనాన్ని చూస్తూనే ఉన్నాం. 

జీతాల్లో కొంత మేర కోత పడితేనే సర్దుబాట్లు చేసుకోలేక తబ్బిబ్బు పడిన వాళ్ళలో చాలామందికి 'ఇకపై జీతాలే రావు' అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలిగేదే. ఖర్చులేవీ ఆగవు. పూలమ్మిన చోట కట్టెలమ్ముదామన్నా ఈ కరోనా కాలంలో కొనేవాళ్ళు లేరు. ఇప్పట్లో ఉద్యోగాలేవీ దొరికే సూచనలూ లేవు. ఒకవేళ జాబ్ మార్కెట్ పుంజుకున్నా, మరింతగా పెరిగే పోటీలో ఉద్యోగం దొరకబుచ్చుకోడం అంత సులువేమీ కాదు. ఉద్యోగం చేసినంత కాలం ముక్కుపిండి పన్ను వసూలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు సమస్యనే గుర్తించడం లేదు. 'ఉపశమనం' స్కీముల్లో ఈ వర్గానికి ప్రాతినిధ్యమే లేదు.  వ్యక్తి స్థాయిలో ఎవరు ఎవర్ని ఆదుకోగలుగుతారు? అదైనా ఎన్నాళ్ళు? 

ఉద్యోగాలు పోయిన వాళ్ళ సమస్యలు ఒకరకమైతే, మెడమీద కత్తి వేలాడుతున్న వాళ్ళ ఇబ్బందులు మరోరకం. నూరేళ్లాయుస్సుకి హామీ లేదు కానీ, పరిస్థితి మాత్రం దినదిన గండమే. ఎప్పుడు ఏ కబురు వినాల్సి వస్తుందో తెలీని అనిశ్చితిలో రోజులు గడుపుతున్న వాళ్ళు అనేకమంది.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, బయటికి వెళ్లి ఉద్యోగం చేయడం వల్ల ప్రాణానికి ఉన్న ముప్పు ఒకటైతే, ఇప్పటికిప్పుడు ఈ ఉద్యోగం పోతే జరుగుబాటు ఎలా అన్న మిలియన్ డాలర్ ప్రశ్న మరొకటి. నిజానికి, ఈ ఉద్యోగాలు పోవడం అన్నది కరోనా బారిన పడ్డ అనేక దేశాల్లో జరుగుతున్నా, వాటిలో చాలా దేశాలు సమస్యని గుర్తించాయి. ఎంతోకొంత ఉపశమనానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ కూడా కనీసం సమస్యని గుర్తిస్తే బాగుండును.

శనివారం, మే 30, 2020

ఏడాది పాలన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో కనీసం నాలుగైదు సందర్భాల్లో జగన్ నిర్ణయాలని గురించి రాద్దామనుకునే, ఏడాది పూర్తయ్యే వరకూ ఏమీ మాట్లాడకూడదని నేను పెట్టుకున్న నియమం గుర్తొచ్చి ఆగిపోయాను. ఏడాది ఆగడం ఎందుకంటే, జగన్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కాదు. ముఖ్యమంత్రిగా కాదు కదా, మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం లేదు. ఇప్పుడు మాట్లాడడం ఎందుకంటే, ఆయన వెనుక ఏడాది కాలపు పాలనానుభవం ఉంది. మరే ఇతర నాయకుడికైనా ఐదేళ్ల కాలంలో ఎదురయ్యే అనుభవాలన్నీ జగన్ కి తొలి సంవత్సరంలోనే అనుభవానికి వచ్చేశాయి. 

శెభాష్ అనిపించే నిర్ణయాలతో పాటు, అయ్యో అనిపించే నిర్ణయాలనీ తీసుకుని అమలు పరిచారు గత  పన్నెండు నెలల్లోనూ.  అనేక ఇబ్బందులనీ ఎదుర్కొన్నారు. చెయ్యదల్చుకున్న పనులన్నీ వరుసగా చేసేయాలనే తొందర  కొన్ని వివాదాస్పద  నిర్ణయాలకి తావివ్వగా, మరికొన్ని నిర్ణయాలు కేవలం రాజకీయ కారణాల వల్లే వివాదాస్పదం అయ్యాయి.  వ్యక్తిగతంగా నన్ను కలవర పెట్టిన నిర్ణయాలు రెండు. మొదటిది పరిశ్రమల్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనేది. వినడానికి ఇది చాలా బాగుంది. కానీ ఆచరణలో కష్టనష్టాలు అనేకం. చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే, మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే నిర్ణయం తీసుకుంటే, వెనక్కి వచ్చేసే అందరికీ రాష్ట్రం ఉపాధి చూపించగలదా? 

రెండో నిర్ణయం, ఏదో ఒక పేరుతో చేస్తున్న ఉచిత పంపిణీలు. నిజానికి ఈ ఉచితాలు మొదలై చాలా ఏళ్ళే గడిచినా, ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక సందర్భంలో అమలు చేసిందే అయినా, ప్రస్తుత ప్రభుత్వం వీటిని పరాకాష్టకి తీసుకెళ్లినట్టు అనిపిస్తోంది. విద్య, వైద్యం ఈ రెండు సేవలనీ అర్హులకి ఉచితంగా అందించడం అవసరం. వ్యవసాయం చేసుకునే రైతులు సమయానికి రుణాలని, పంటలకు గిట్టుబాటు ధరల్నీ ఆశిస్తున్నారు తప్ప అంతకు మించి కోరుకోవడం లేదు. ప్రతివర్గానికీ ఏదో ఒక పేరిట నిరంతరంగా డబ్బు పంపిణీ అన్నది సుదీర్ఘ కాలంలో ఒక్క ఆర్ధిక వ్యవస్థకి మాత్రమే కాక అన్ని వ్యవస్థలకీ చేటు చేస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఇదో పులి స్వారీలా తయారయ్యే ప్రమాదం ఉంది. ఉచితాల మీద కన్నా ఉపాధికల్పన మీద దృష్టి పెట్టడం శ్రేయస్కరం. 

Google Image

వినగానే నచ్చిన నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం. ఈ నిర్ణయం వల్ల పేదల జీవితాల్లో  రాత్రికి రాత్రే వెలుగొచ్ఛేస్తుందన్న భ్రమలేవీ లేవు కానీ, దీర్ఘ కాలంలో ప్రయోజనాన్ని ఇచ్చే నిర్ణయం అవుతుంది అనిపించింది. అయితే ఈ నిర్ణయం అమలులో చాలా సాధకబాదకాలున్నాయి. తెలుగుని ఒక తప్పనిసరి సబ్జెక్టుగా ప్రవేశపెట్టే మాటుంటే,  దానిని కేవలం ప్రభుత్వ విద్యాసంస్థలకి మాత్రమే పరిమితం చేయకుండా ప్రయివేటు సంస్థల్లోనూ కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. బాగా పనిచేస్తున్న మరో వ్యవస్థ గ్రామ వాలంటీర్లు. మా ఊరు, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి నాకున్న సమాచారం ప్రకారం ఈ వ్యవస్థ బాగా పనిచేస్తోంది. ముఖ్యంగా కరోనా కాలంలో వాలంటీర్లు చాలా బాధ్యతగా పనిచేశారు. నిరుద్యోగ సమస్యని కొంతవరకూ పరిష్కరించడం ఈ వ్యవస్థలో మరో పార్శ్వం. 

"మొండివాడు రాజుకన్నా బలవంతుడు అంటారు, ఇప్పుడు మొండివాడే రాజయ్యాడు," ఏడాది క్రితం ఒక మిత్రుడన్న మాట ఇది. జగన్ మొండితనాన్ని తెలియజెప్పే దృష్టాంతాలు గత కొన్నేళ్లుగా అనేకం జరిగాయి. కాంగ్రెస్ ని వ్యతిరేకించడం మొదలు, తెలుగు దేశం పార్టీని ఢీ కొనడం వరకూ అనేక సందర్భాల్లో, "మరొకరైతే ఈపని చేయలేకపోయేవారు" అనిపించింది. ఒక ఓటమితో ప్రయాణాన్ని ఆపేసిన/మార్గాన్ని మార్చుకున్న నాయకులతో పోల్చినప్పుడు జగన్ ని ముందుకు నడిపించింది ఆ మొండితనమే అని చెప్పక తప్పదు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి వారసత్వంగా జగన్ కి  అంది ఉంటే కథ  వేరేగా ఉండేది. ప్రస్తుతానుభవాలని బట్టి చూస్తే, అప్పట్లో ఆ పదవిని నిలబెట్టుకోవడం ఆయనకి బహుశా కష్టమై ఉండేది. 

ప్రజలు  అఖండమైన మెజార్టీ ఇచ్చి ఉండొచ్చు కానీ, బలమైన ప్రతిపక్షం అనేక రూపాల్లో చుట్టుముట్టి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రతి నిర్ణయాన్నీ ఆచితూచి తీసుకోవడం అవసరం. ప్రతి ప్రకటన వెనుకా ఒక సమగ్ర సమీక్ష ఉండాల్సిందే. సమస్యలు ఏయే రూపాల్లో ఉండొచ్చు అన్న విషయంలో ఇప్పటికే ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఆ వైపుగానూ ఆలోచనలు సాగాలి. మూడు రాజధానులు, మండలి రద్దు వంటి నిర్ణయాల అమలులో కనిపించిన తొందరపాటు విమర్శలకి తావిచ్చింది. (వీటిలో మండలి రద్దు నాకు బాగా నచ్చిన నిర్ణయం). అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటిలోనూ అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. అలాగే, సంక్షేమం అంటే కేవలం ఉచిత పంపిణీలు మాత్రమే అనే ధోరణి నుంచి  బయటికి వచ్చి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏడాది కాలపు అనుభవాల నుంచి జగన్ ఏం నేర్చుకున్నారన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.