సోమవారం, అక్టోబర్ 28, 2013

చింతలవలస కథలు

విజయనగరం జిల్లాలో ఉన్న ఓ పల్లెటూరు చింతలవలస. నిజానికి ఇదే జిల్లాలో ఇదే పేరుతో సుమారు ఓ పది పల్లెటూళ్ళు ఉన్నాయి అంటారు రచయిత డాక్టర్ మూలా రవి కుమార్. పశువైద్య శాస్త్రం చదివి, నేషనల్ డైరీ డవలప్మెంట్ కార్పోరేషన్ లో ఉద్యోగం చేస్తున్న రవి కుమార్ స్వస్థలం, ఒకానొక చింతలవలసకి సమీపంలో ఉన్న అమరాయవలస. చింతలవలస కథా స్థలంగా తను రాసిన ఆరు కథలకి, పాలకేంద్రాల పని తీరు ఇతివృత్తంగా రాసిన నాలుగు కథలు, అనేక అంశాలని స్పృశిస్తూ రాసిన మరో ఎనిమిది కథలని చేర్చి, మొత్తం పద్దెనిమిది కథలతో వెలువరించిన కథా సంకలనమే 'చింతలవసల కథలు.'

ఇవి నేటివిటీ చుట్టూ అల్లుకున్న కథలు కావు. ఇంకో మాటలో చెప్పాలంటే, చింతలవలస అని మాత్రమే కాదు, ఏ పల్లెటూళ్ళో అయినా జరిగేందుకు అవకాశం ఉన్న కథలే ఇవి. వానాకాలం చదువులు ఇతివృత్తంగా సాగే 'బడిశాల' ఈ సంకలనంలో మొదటి కథ. అడివిని ఆనుకుని ఉన్న ఓ పల్లెలో ఓ రీసెర్చ్ స్కాలర్ కి ఎదురైన అనుభవాలు 'బలిపశువు' కథ. వ్యవస్థ పనితీరుని ఎత్తిచూపించే కథ ఇది. 'చింతలవలస 1985 అను ది సీక్రెట్ ఆఫ్ జోయ్' కవితాత్మకంగా సాగే మినీ కథ. రాజకీయాలు, మానవ మనస్తత్వ విశ్లేషణల సమాహారం 'గురివింద నాయుడు' కథ. 

ఆద్యంతం ఆసక్తిగా సాగే కథ 'పాఠం' ఆర్టీసీ బస్సు డిపో కథా స్థలం ఇందులో. 'పొడుం డబ్బాలో దూరిన దోమ' ఓ బడిపంతులు ఉద్యోగాన్ని ఎలా పొట్టన పెట్టుకుందో చెప్పే కథ సస్పెన్స్ ప్రధానంగా సాగుతుంది. చిన్న చేపను పెద్ద చేప మింగే అవినీతి శాఖా చంక్రమణానికి క్లాస్ రూం పాఠాన్ని జోడించి ఆసక్తికరంగా చెప్పిన కథ 'ఫుడ్ చైన్.' ఈ కథ చదువుతుంటే శ్రీరమణ రాసిన 'పెళ్లి' కథ గుర్తొచ్చింది అసంకల్పితంగా. 'ఎలోవీరా' గా పిలవబడే కలబంద పంట ఇతివృత్తంగా రాసిన 'చెంచు మంత్రం' చాలాకాలం పాటు గుర్తుండిపోయే కథల్లో ఒకటి.


పాడిపరిశ్రమ ఇతివృత్తంగా కథలేవీ ఇప్పటివరకూ తెలుగులో వచ్చిన దాఖలాలు లేవు. ఓ అధికారిగా ఈ రంగంలో అనుభవం గడించిన రవికుమార్ 'రోడ్డు పాలు,' 'కులం పాలు,' 'సానుభూతి పాలు,' 'పాలపుంతలో ముళ్ళు' అనే నాలుగు 'పాల' కథలు రాశారు. చదువుతున్నంతసేపూ తన అనుభవాలని, పరిశీలనలనీ మరిన్ని కథల రూపంలో అక్షరీకరించి ఈ రచయిత ఓ పాల కథల సంపుటం తీసుకువస్తే బావుంటుంది కదా అనిపిస్తూనే ఉంది. డైరీల నిర్వహణ, పాలసేకరణలో క్షేత్ర స్థాయిలో ఉండే ఇబ్బందులు మొదలు, పైస్థాయిలో జరిగే రాజకీయాల వరకూ ఎన్నో అంశాలని స్పృశించారు.

చదివించే గుణం పుష్కలంగా ఉన్న కథలే ఇవన్నీ. ఎక్కడా సుదీర్ఘమైన సంభాషణలు లేవు. "ఈయన కింద ఏడాది పరిగెడితే  మేలుజాతి గుర్రాలు కూడా మేం గాడిదలం అనే అభిప్రాయానికి వచ్చేస్తాయి" లాంటి వాక్యాలతో ఆఫీసు బాసునీ, "రోజుకి నాలుగు గంటలే నిద్రపోడానికి మీరేమైనా ప్రధాన మంత్రా?" లాంటి ప్రశ్నల ద్వారా ఇంటిబాసునీ పాఠకులకి రూపు కట్టేస్తారు. చాలా కథల్లో కనిపించే 'కిరణ్' పాత్ర మరెవరో కాదు, రచయిత రవికుమారే అని పాఠకులకి అర్ధం కాడానికి ఎన్నో కథలు పట్టవు. 'చెంచు మంత్రం' కథలో కిరణ్ ఉండడు.. కానీ పార్థ, సారథి పాత్రలు రెంటిలోనూ రచయిత కనిపించేస్తారు.

పుస్తకం పేరులో చింతలవలస ఉన్నా, కథల్లో కళింగాంధ్రతో పాటు కోస్తా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలు మూడూ కనిపిస్తాయి. పాల కథలు అన్నింటికీ కథాస్థలం రాయలసీమే. అలాగే నల్గొండ, పల్నాడు ప్రాంతాల్లో పశుపోషణని గురించిన నిశిత పరామర్శ కనిపిస్తుంది 'పాలపుంతలో ముళ్ళు' కథలో. పుస్తకం చదవడం పూర్తిచేసేసరికి ఉత్తరాంధ్ర నుంచి మరో ప్రామిసింగ్ రైటర్ వచ్చారన్న భావన బలపడింది. ('చింతలవలస కథలు,' చినుకు పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 152, వెల రూ. 95, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శుక్రవారం, అక్టోబర్ 25, 2013

కలగంటి.. కలగంటి..

ఉన్నట్టుండి 'కలలు' ఇప్పుడు హాట్ టాపిక్కై కూర్చున్నాయి. నలుగురు కూచుని నవ్వే వేళ ఈ కలల విషయం గుర్తు చేసుకోవడమో, లేదంటే గుర్తు చేసుకుని మరీ నవ్వుకోవడమో జరిగిపోతోంది. నవ్విన నాప చేను పండుతుందా లేదా అన్నది చెప్పే కృషిలో నిమగ్నమై ఉంది ప్రభుత్వం. ఒకవేళ పండక పొతే మాత్రం ఏమయ్యింది, కల పేరు చెప్పుకుని ఇప్పటికే చాలామంది జనం వాళ్ళ కష్టాలన్నీ కాసేపు మర్చిపోయి కాసేపు హాయిగా నవ్వుకుంటున్నారు కాదూ. పండిందే అనుకుందాం.. ప్రజలందరూ సాధ్యమైనంత సేపు నిద్దరోయి మరిన్ని కలలు కనేందుకు పక్కలు సిద్ధం చేసుకుంటారు.

కలలు అందరూ కంటారు.. వీటి హేతువుల జోలికి వెళ్లొద్దు మనం. రాజకీయనాయకులు ఉన్నారు చూడండి, వీళ్ళు కొన్నాళ్ళ క్రితం వరకూ ఓటర్లని పగటి కలల్లో ముంచి తేల్చేసి పబ్బం గడిపేసుకునే వాళ్ళు. రానురానూ, కలలు కనే ఓపిక లేకా, కనడానికి కావలసినంత నిద్ర పట్టే పరిస్థితులు కనిపించకా జనం సదరు నాయకులని నమ్మడం మానేశారు. కానైతే, నమ్మినట్టు నటించడం మాత్రం మర్చిపోవడం లేదు. ఇన్నాళ్ళూ తాడిన తన్నిన నాయకులకి, తలదన్నే వాళ్ళు పెరిగిపోవడంతో ప్రత్యామ్నాయాలు వెతుక్కోక తప్పని పరిస్థితి వచ్చేసింది.

రాష్ట్రపతి పదవికి ఓ కొత్త గౌరవం తెచ్చిన టెక్నోక్రాట్ అబ్దుల్ కలాం పిల్లలు, యువకులతో ఎప్పుడు మాట్లాడినా వాళ్ళని కలలు కనమనీ, వాటిని నిజం చేసుకోడానికి శ్రమించమనీ చెబుతారు. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన తాను, అంతపెద్ద హోదాకి ఎదగడానికి జీవితంలో పైకి ఎదగాలన్న కలలు ఎంతగానో దోహదం చేశాయని చాలాసార్లే చెప్పారు వివరంగా. ఆయన మాటల్లోంచి నిద్రపొమ్మని అర్ధం తీసుకున్న కొందరు మాత్రం, "కలాం గారు ఏమన్నారు? కలలు కనమన్నారు.." అంటూ వ్యంగ్య భాష్యాలు మొదలుపెట్టారు. ఇందులో కూడా అవకాశం వెతుక్కున్న మన నాయకులు మాత్రం, "కలాం గారు కూడా కలలు కనమనే చెప్పారు" అని కొత్తపాట అందుకున్నారు.

కేంద్రంలో వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూటమికి సమస్యలు రోజు రోజుకీ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అవినీతి ఆరోపణలు ఓ పక్కా, రోజు రోజుకీ క్షీణిస్తున్న రూపాయి ఆరోగ్యం మరోపక్కా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఎన్నికలు దగ్గరకి వచ్చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ గండాలని గట్టెక్కించే తరుణోపాయాలు ఏమిటన్న విషయం మీద కాంగ్రెసు నాయకత్వం దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. కాలం బొత్తిగా కలిసి రాకపోవడం వల్ల కాబోలు, ఉల్లిపాయ సైతం బాంబుగా మారి తను పేలడమో, ప్రభుత్వాన్ని పేల్చడమో చేసేసేలా ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో, అల్లక్కడెక్కడో ఉండే ఓ సాధు పుంగవుడు ఓ ధగధ్ధగాయమానమైన కలగన్నాడు. ఒకటీ రెండూ కాదు, వేలాది బంగారు నాణేలు ఆ కలనిండా.. కేవలం నాణేలు మాత్రమే కాకుండా, అవి దొరికే చోటు కూడా స్పష్టంగా కనిపించడంతో ఈ కల సంగతిని ఓ రాజకీయ నాయకుడి చెవిన వేశాడు. ఇంకేముందీ, తవ్వకాలు మొదలయ్యాయి. ప్రభుత్వం కూడా తవ్వితే పోయేదేముందనుకుంది. నిజమే, బంగారం దొరికిందా.. డబ్బుతో ముడిపడ్డ కొన్ని సమస్యలైనా తీరొచ్చు. దొరకలేదూ.. కొన్నాళ్ళ పాటు జనం మాట్లాడుకోడానికి ఓ టాపిక్ దొరుకుతుంది. వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళని ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కాలం గడపగలరు పాపం.

ఏలినవారి అంచనా ఏమాత్రం తప్పలేదు.. ఓ పక్క ఆ ఫలానీ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతూ ఉండగానే, దేశానికి మరోమూల ఉన్న ఇంకో సాధు సామ్రాట్టు సైతం ఓ బంగారు కలగన్నాడు. పలుగులూ, పారలూ సిద్ధం. జన సామాన్యానిది నిద్ర అయితే, సాధువులది యోగనిద్ర అని కదా ప్రచారం. ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం ఏమిటంటే, సామాన్య జనానిని మామూలు కలలైతే, సాధు జనానివి మాత్రం బంగారు కలలు. కాషాయం కట్టిన వారందరూ యోగనిద్రలోకి జారుకోడం ద్వారా, ప్రజల సంగతి ఎలా ఉన్నా, ప్రభుత్వానికి మాత్రం బాగా మేలు జరిగేలా కనిపిస్తోంది ప్రస్తుతం..

మంగళవారం, అక్టోబర్ 22, 2013

కృష్ణశాస్త్రి బాధ...

"కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ" అన్నాడు గుడిపాటి వెంకటాచలేయుడు, శ్రీశ్రీ 'మహాప్రస్థానం' పుస్తకానికి ముందుమాట రాస్తూ... ఇప్పుడు ప్రపంచం మొత్తానికి 'కృష్ణశాస్త్రి' ఎవరంటే.. అమెరికా సంయుక్త రాష్ట్రాలు. అస్సలు ఆశ్చర్యం అక్కర్లేదు, ఎందుకంటే అమెరికా బాధ ప్రపంచం బాధ అయి కూర్చుంది ఇప్పుడు. అమెరికా ఆర్ధిక వ్యవస్థకి నీరసం చేస్తే, మూడొంతుల ప్రపంచ దేశాలు వాళ్ళ భవిష్యత్తుని గురించి ఆందోళన పడడం ఇవాళ కొత్తగా మొదలైంది కాదు.. నూతన ఆర్ధిక సంస్కరణలని నీడలాగా అనుసరించిన పరిణామం ఇది.

ఇరవై రెండేళ్ళు వెనక్కి వెళ్తే, ఢిల్లీలో కాంగ్రెస్ మైనారిటీ సర్కారుని పీవీ నరసింహారావు ప్రధానిగా సారధ్యం వహించి నడిపిస్తున్న రోజులు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కర్ణుడి చావుకి ఉన్నన్ని కారణాల వల్ల దివాలాకి దగ్గరలో ఉన్నాయి. తీవ్రమైన డబ్బు కటకట. జాతి సంపద అయిన బంగారం నిలవలని తాకట్టు పెట్టి సొమ్ము తెచ్చినా, కేవలం కొన్ని నెలల్లోనే ఆర్ధిక వ్యవస్థ పుంజుకుని పరుగులు తీసే పరిస్థితి ఏమాత్రమూ లేదు. ఆ బంగారాన్ని అమ్మేస్తే, దేశ భవిష్యత్తు అవసరాలు మరి?

సరిగ్గా ఇదే సమయంలో కేంద్రం ముందుకు వచ్చిన ఓ ప్రత్యామ్నాయం నూతన ఆర్ధిక సంస్కరణలు. అప్పటివరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద విపరీతమైన ఆంక్షలు విధిస్తూ -- పారిశ్రామికవేత్తల మాటల్లో చెప్పాలంటే 'మడి కట్టుకుని' -- ఉన్న భారతదేశం విదేశీ పెట్టుబడులని ఆహ్వానించింది. ఒక్కసారిగా మొత్తం అన్ని రంగాలకీ గేట్లు బార్లా తెరవకుండా, ఎంపిక చేసిన కొన్ని రంగాల్లో, కొంత శాతం మేరకు విదేశీ పెట్టుబడులని ఆహ్వానించే విధంగా నిబంధనలని సడలించింది. ఫలితంగా ఎన్నో కొత్త పరిశ్రమలు వచ్చాయి.. ముఖ్యంగా ఐటీ పరిశ్రమ ఊపందుకుంది. 

వందల్లో పరిశ్రమలు, లక్షల్లో ఉద్యోగాలు.. ఒక్కమాటలో చెప్పాలంటే దశ తిరిగింది... ఉన్నత, మధ్య తరగతి వర్గాలది, దేశ ఆర్ధిక వ్యవస్థదీ కూడా. ఇది నాణేనికి ఒకవైపు. ప్రతి నాణేనికీ బొమ్మా బొరుసూ ఉన్నట్టే, ఈ నాణేనికీ ఉన్నాయి. నూతన ఆర్ధిక సంస్కరణలు మంచిని మాత్రమే వెంటపెట్టుకుని రాలేదు. భారత సమాజంలో పేదా, గొప్పా అంతరాలు మొదటినుంచీ ఉన్నవే అయినా, అవి మరింతగా పెరిగిపోడానికి దోహదం చేశాయి. వ్యవసాయ రంగాన్నైతే సంక్షోభంలోకి నెట్టేశాయి.

సంస్కరణల ఫలితంగా ఇప్పుడు మార్కెట్ అంటే ఒక్కటే మార్కెట్.. అది గ్లోబల్ మార్కెట్.. స్వేచ్చా వాణిజ్యం అందుబాటులోకి వచ్చాక నాణ్యమైన సరుకు తక్కువధరలో దొరికే చోటునుంచి సులభంగా తెచ్చుకో గలుగుతున్నాడు వినియోగదారుడు.. (ఇక్కడి లొసుగులు ఇక్కడా ఉన్నాయి, అది వేరే కథ). ఇప్పటికీ సంప్రదాయ పద్ధతిలోనే, ప్రభుత్వం నుంచి నామమాత్రంగా అందుతున్న మద్దతుతో వ్యవసాయం సాగిస్తున్న భారతీయ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పెట్టుబడులు పెరిగిపోవడం, ధరలు పడిపోవడం ఒక్కసారిగా జరగడంతో వ్యవసాయరంగం ప్రమాదం అంచున నిలబడింది.

వ్యవస్థ ఏదైనా కావొచ్చు.. కానీ బలవంతుడిదే పైచేయి అన్న ప్రాధమిక సూత్రంలో ఏమార్పూ ఉండదు.. మార్కెట్ మొత్తం కేంద్రీకృతం అయిపోవడం ఫలితం ఏమిటంటే, ఆ మార్కెట్ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. అమెరికాలో ఏం జరిగినా దాని ప్రభావం మార్కెట్ మీద, తద్వారా ఆ మార్కెట్లో భాగస్వాములైన ప్రపంచ దేశాల మీద పడి తీరుతుంది. అమెరికా ఆర్ధిక వ్యవస్థ కళకళలాడితే, మిగిలిన దేశాల్లో పరిస్థితులు బాగుంటాయి. ఆ వ్యవస్థకి ఏ చిన్న జలుబు చేసినా అన్ని దేశాలూ తుమ్మడం ప్రారంభిస్తాయి.. ఇప్పుడిక అమెరికా కృష్ణశాస్త్రి కళ్ళలో ఆనందం కోసం ఎదురుచూడాలి మనం..

సోమవారం, అక్టోబర్ 14, 2013

...ఐనా, నేను ఓడిపోలేదు!

డిస్ప్లే లో ఉన్న పుస్తకాలు వరుసగా చూసుకుంటూ వెళ్తూ, ఒక కవర్ పేజి చూసి "బాగా తెలిసిన అమ్మాయిలా ఉందే?" అనిపించి పుస్తకం చేతిలోకి తీసుకున్నా. '...ఐనా, నేను ఓడిపోలేదు!' అనే టైటిల్ బాగా ఆకర్షించడంతో, పుస్తకం తీసేసుకున్నాను. ఆ తర్వాత, వెళ్ళిన చోట పని కొంచం ఆలస్యం కావడంతో చేతిలో ఉన్న పుస్తకం చదవడం మొదలుపెట్టాను... పది పేజీలు పూర్తిచేసేసరికి అర్ధమయ్యింది, ఈ పుస్తకం పూర్తిచేసి కానీ నేను నిద్రపోలేనని. 'ఏముందీ నూట పాతిక పేజీల పుస్తకంలో?' అని ఎవరన్నాఅడిగితే, నేను చెప్పగలిగే జవాబు ఒక్కటే... "జీవితం!!" 

ఘనమైన చారిత్రక, సాంస్కృతిక చరిత్ర ఉన్న వరంగల్ జిల్లా ప్రస్తుతం ఆత్మహత్యల్లో ముందుంది. ఆంధ్రప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నజిల్లాలలో వరంగల్ ఒకటి. ఆ జిల్లాలో మైలారం అనే ఓ మారుమూల పల్లెటూరికి చెందిన గృహిణి జ్యోతి తన ఇద్దరు చిన్నపిల్లలు బీనా, బిందు లతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. కూలీలందరూ ఇళ్ళకి వెళ్ళిపోయాక, పిల్లలిద్దరినీ బావిలోకి తోసేసి, ఆపై తనూ అదే బావిలో దూకి ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధ పడిపోయింది. కారణం? ఏడాది తేడాతో పుట్టిన ఆ పిల్లలు ఇద్దరికీ కనీసం పాలిచ్చే స్తోమతు లేకపోవడం..

అప్పటివరకూ తన పేదరికం, శారీరక దుర్బలత్వం.. వీటి చుట్టూనే ఆమె ఆలోచనలు తిరిగాయి.. కూలీలందరూ ఇళ్ళకు వెళ్ళిపోయారు. జీవితానికీ, మరణానికీ మధ్య ఉన్నవి కేవలం కొన్నే క్షణాలు. అప్పుడే ఆమెకి గుర్తొచ్చింది.. తను పదోతరగతి పాసయ్యానని. ఆ చదువు తన ఇద్దరు బిడ్డలకీ గుక్కెడు పాలని అందించలేక పోదన్న ధైర్యమూ వచ్చింది.. ఆ పదో తరగతి కూడా, స్వయంగా ఆమె తండ్రే ఆమెని 'బాల సదన్' అనే అనాధాశ్రమానికి తీసుకెళ్ళి అక్కడ చేర్చడం వల్ల చదవగలిగింది. అటుపై ఊహించనంత తొందరగా పెళ్లి, పిల్లలు...


బతకగలను అన్న ధైర్యం కలిగిన క్షణం జ్యోతి జీవితంలో చాలా గొప్పది. ఆ ధైర్యమే ఆమెచేత ఎన్నో ఉద్యోగాలు చేయించింది.. అమెరికా తీసుకెళ్ళింది.. అక్కడ సొంత వ్యాపారం ప్రారంభించ గలిగేలా చేసింది. తను నడిచే దారిలో అడుగడుగునా ఎదురయ్యే ముళ్ళని ఏరి పారేసి ఆపకుండా తన ప్రయాణాన్ని కొనసాగించేలా చేసింది. పదోతరగతి చదువు, గుండెల నిండా ధైర్యం పెట్టుబడిగా, తన ఇద్దరు పిల్లలకీ మంచి జీవితం ఇవ్వడం అనే లక్ష్యంతో మైలారం వదిలిపెట్టిన జ్యోతి చేసిన ప్రయాణం తక్కువదేమీ కాదు. ఎదుర్కొన్న ఒడిదుడుకులూ మామూలువి కాదు.

2012 మే ఒకటిన ఓ తెలుగు టెలివిజన్ చానల్ కి జ్యోతి రెడ్డి ఇంటర్యూ ఇవ్వడం తో మొదలయ్యే కథనం, అదే సంవత్సరం మే రెండున ఎమెస్కో బుక్స్ ఆఫీసులో తన ఆత్మకథ ప్రచురించడానికి అంగీకరించడంతో ముగుస్తుంది. అక్కడక్కడా కొన్ని తడబాట్లు ఉన్నప్పటికీ ఆపకుండా చదివించే కథనం. "నేను నాకు యాది ఉన్నంతవరకూ, నేను అనుభవించిన సంఘటనలన్నీ, అప్పటి మనోభావాల్నీ యథాతథంగా కాగితం మీద పెట్టే ప్రయత్నం చేశాను. కొంతమందికి బాధ కలిగించే విషయాలు ఏవయినా నేను రాసి ఉండకపోవచ్చు, కానీ రాసినవన్నీ వాస్తవాలు. గుండె లోతుల్లోంచి తన్నుకొస్తున్న వేలాది భావాలకి అక్షరరూపాలు," అన్న చివరి మాట సాయంతో ఆమె రాయకుండా వదిలేసిన విషయాలని ఊహించవచ్చు.

"నాకనిపించింది ఏమిటంటే, ఈ జ్యోతి అనే పల్లెటూరు అమ్మాయి ప్రపంచ ఆర్ధిక విపణికి కేంద్రమైన అమెరికాలో స్థానం పొందడానికి కారణం ఆమె భయాన్ని జయించడమేనని. నేను జ్యోతిని భయం లేని ఓ స్త్రీగా భావించడంలేదు. భయాన్ని జయించిన ఓ స్త్రీగా భావిస్తున్నాను" అన్నారు ఎమెస్కో విజయకుమార్ తన ముందుమాటలో. 'నిప్పులాంటి నిజం' పుస్తకాన్ని తెనిగించిన జర్నలిస్ట్ జి.వల్లీశ్వర్ రచనా సహకారం అందించిన ఈ పుస్తకం కథనంలో ఆయన మార్కు కనిపించింది. అచ్చుతప్పులు తక్కువే కానీ, ఫోటోల ముద్రణ విషయంలో మరికొంచం శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది.

... నాకు తెలిసిన అమ్మాయిలా అనిపించి పుస్తకం చేతిలోకి తీసుకున్నా, కవర్ ఫోటోని దగ్గరనుంచి చూడగానే అర్ధమయ్యింది, ఆమె నాకు తెలియదని. కానీ, పుస్తకం చదవడం పూర్తిచేయగానే ఆమె నాకు ఆత్మీయురాలన్న భావన కలిగింది. జీవితం వడ్డించిన విస్తరి కాని ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే రచన ఇది. (ఎమెస్కో ప్రచురణ, వెల రూ. 60, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, అక్టోబర్ 07, 2013

దాలప్ప తీర్థం

దాలప్ప ఓ మామూలు మనిషి. సమాజానికి బాగా ఉపయోగ పడే మనిషి. కానీ, సమాజం నుంచి ఎలాంటి గుర్తింపూ నోచుకోక పోగా చివాట్లూ, చీత్కారాలూ భరిస్తున్న మనిషి. అతనొక్కడే కాదు, దాలప్ప చేసే వృత్తిలోనే ఉన్న అతని బంధువులు, సావాసగాళ్ళూ అందరిదీ ఇదే పరిస్థితి. తన వృత్తి అవసరాన్ని అందరూ గుర్తించేలా చేయాలన్న దాలప్ప ప్రయత్నం ఎంతగా ఫలించిందంటే, ఇప్పటికీ అతని పేరు మీద ఏటా 'దాలప్ప తీర్థం' జరుపుకునేటంత!!

'సాక్షి' దినపత్రికను, మరీ ముఖ్యంగా 'ఫ్యామిలీ' పేజీని క్రమం తప్పకుండా చదివే వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు. ఎన్నో ఆసక్తికరమైన వార్తా కథనాలు రాసిన ఈ పాత్రికేయుడు కథకుడు కూడా. తను రాసిన పద్నాలుగు కథలతో విడుదల చేసిన సంకలనానికి శ్రీనివాసరావు ఇష్టంగా పెట్టుకున్న పేరు, సంకలనంలో మూడో కథ పేరూ ఒక్కటే.. అదే 'దాలప్ప తీర్థం.'

ఉత్తరాంధ్ర నుడికారంలో చకచకా సాగిపోయే ఈ కథలన్నీ ఆసాంతమూ విడవకుండా చదివిస్తాయి. బ్రాహ్మలు పెట్టుకునే ఆవకాయ కోసమని మడిగట్టుకుని మరీ తన మిల్లులో కారాలు ఆడించి ఇచ్చే 'పిండిమిల్లు' హుస్సేను కథ చెప్పినా, ఊళ్ళో తల్లిపాలు చాలక అల్లాడుతున్న పసిపిల్లలందరికీ స్తన్యం అందిచి ఊపిరిపోసిన గంపెడు పిల్లల తల్లి 'పాలమ్మ' ని గురించి చెప్పినా పాఠకుల చేత ఏకబిగిన కథని చదివించడం ఎలాగో ఈ రచయితకు బాగా తెలుసు. 'పులికన్నా డేంజర్' అయినది ఏమిటో, ఒకప్పుడు 'చల్దన్నం చోరీ' చేసిన దొంగలు ఇప్పుడు ఎలా రూపు మార్చేసుకున్నారో తెలుసుకోవచ్చు ఈ కథల ద్వారా.


విశాఖ జిల్లా పల్లెల్నీ, మరీ ముఖ్యంగా మూడు నాలుగు దశాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన అగ్రహారాలనీ, వాటితో పాటుగా కష్టానికీ సుఖానికీ కలిసిమెలిసి ఉండి, వాటిని ఎదురీదిన అష్టాది వర్ణాల వారినీ పాఠకులకి పరిచయం చేసిన రచయిత, మానవీయ విలువలు క్రమక్రమంగా కనుమరుగవుతున్న తీరుని కథలు చదివిన వారు ఆలోచనలో పడే రీతిలో చిత్రించారు. 'వానతీర్పు' 'నిదర్శనం' 'శిఖండి గాడు' 'చిదిమిన మిఠాయి' అగ్రహారం నేపధ్యంగా సాగే కథలు. వీటిలో తొలి మూడు కథలూ వాస్తవ సంఘటనలే!!

"ఒక రావిశాస్త్రి నీ ఒక పతంజలి నీ కలిపి ముద్ద చేస్తే వచ్చే పదార్ధం చింతకింది లా ఉంటుందేమో" అన్నారు 'ప్రియదర్శిని' రామ్. నాకైతే, పేదవాడి పక్షాన నిలబడ్డంలో రావిశాస్త్రినీ, 'కన్యాశుల్కం' నాటకాన్ని ప్రేమించడంలో పతంజలినీ గుర్తు చేసిన ఈ రచయిత నేటివిటీ చిత్రణలో వంశీ ని జ్ఞాపకం చేశారు. 'రాజుగారి రాయల్ ఎన్ ఫీల్డ్' 'గుడ్డముక్కలు' కథలు వంశీని బాగా జ్ఞాపకం చేశాయి. అయితే, శ్రీనివాసరావుకి తనదైన శైలి ఉంది, ఆపకుండా చదివించే గుణం ఈయన కథల్లో పుష్కలంగా ఉంది.

అక్కడక్కడా సంభాషణల్లో వినిపించిన నాటకీయత, ఉన్నట్టుండి కథల్లోకి జొరబడే పత్రికల భాష, కొంచం ఎక్కువగానే ఉన్న అచ్చుతప్పులు పంటికింద రాళ్ళు. వీటిని మినహాయించుకుంటే, ఈ కథల సంకలనం మృష్టాన్న భోజనమే. గురజాడ, చాసో, రావిశాస్త్రి కథల్లో కనిపించే "అమాయకమైన కవితాస్వప్నం" డాక్టర్ చింతకింది కథల్లో కూడా కనిపించడం తనకెంతో సంతోషంగా ఉందన్న వాడ్రేవు చిన వీరభద్రుడి ముందుమాటతో ఏకీభవించకుండా ఉండలేం.. కథా సాహిత్యాన్ని ఇష్టపడే వారు తప్పక చదవాల్సిన సంకలనం ఈ 'దాలప్ప తీర్థం.' (శ్రీనిజ ప్రచురణలు, పేజీలు 106, వెల రూ. 110, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

గురువారం, అక్టోబర్ 03, 2013

అందరూ మనుషులే!

ఓ భూస్వామ్య కుటుంబంలో పుట్టి, పెద్ద చదువు చదివి, ఓ వ్యాపారస్తుడికి ఇల్లాలై, ఓ బిడ్డకి తల్లైన తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టి నాయికగా నీరాజనాలు అందుకున్న రేఖ కథ 'అందరూ మనుషులే!' కేవలం సినిమా పరిశ్రమని మాత్రమే కాక, తనకి పరిచయం ఉన్న అనేక రంగాలనీ, భిన్న మనస్తత్వాలనీ నేపధ్యంగా తీసుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి వి.యస్. రమాదేవి రాసిన నవల ఇది.

ఆంధ్ర రాష్ట్ర అవతరణ సమయం ఈ నవల కథా కాలం.. మధ్య తరగతి అమ్మాయి రేఖ పెళ్ళితో మొదలయ్యే ఈ నవల, సినిమా పరిశ్రమతో సహా, మద్రాసులో స్థిరపడ్డ తెలుగు పరిశ్రమ ప్రముఖులు వాళ్ళ కార్య స్థానాలని హైదరాబాద్ కి మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్న సమయంలో తెలుగు సినీ రంగంలో ఉన్నత స్థితిలో ఉన్న కథానాయిక రేఖ తీసుకున్న నిర్ణయం, దాని తాలూకు ఫలితాలతో ముగింపుకి చేరుకుంటుంది. విస్తారమైన కేన్వాసు కావడంతో కథనం తాపీగా సాగుతుంది.

ఓ రైతు కుటుంబానికి చెందిన సత్యనారాయణకి తల్లీ తండ్రీ లేరు. వారసత్వంగా వచ్చిన ఆస్తి అమ్మి, విజయవాడలో ఓ కట్టెల అడితి ప్రారంభిస్తాడు. అతనికి ఉన్నదల్లా చిన్నాన్న రామారావు. జర్మనీలో స్థిరపడ్డ ఫిలాసఫీ స్కాలర్. ఆ రామారావు కూతురు ూర్యకాంతం. ప్లీడర్ భూషణ రావు, సత్యనారాయణని చూసి, ముచ్చట పడి, తన భార్య శాంత సవతి చెల్లెలు రేఖతో పెళ్ళికి ఒప్పిస్తాడు. హైదరాబాద్ లో అన్న రాజేశ్వర్ దగ్గర ఉండి డిగ్రీ పూర్తిచేసిన రేఖకి కవిత్వంలో మంచి అభినివేశం ఉంది.

పెళ్ళైన కొంత కాలానికే మిత్రుల ప్రోద్బలంతో సినిమా కంపెనీలో వాటా తీసుకుంటాడు సత్యనారాయణ. లాభాలు బావుండడంతో అడితి అమ్మేసి మొత్తం డబ్బు సినిమాల్లోనే పెడతాడు. పార్ట్నర్స్ సలహా మేరకు రేఖ కథానాయికగా ఓ సినిమా నిర్మాణం ప్రారంభిస్తారు. అదే సమయానికి, తన జర్మన్ భార్యకి పుట్టిన కొడుకు మన్మోహన్ తో కలిసి సత్యనారాయణ దగ్గరికి వచ్చేస్తాడు రామారావు. ఫిలాసఫీ రేఖకి కూడా ఎంతో ఇష్టమైన సబ్జక్ట్ కావడం, మన్మోహన్ కి ఇంగ్లీష్ తప్ప తెలుగు రాకపోవడంతో వాళ్ళిద్దరికీ దగ్గరవుతుంది రేఖ. రేఖ సినిమాల్లో నటించడాన్ని రామారావు ప్రోత్సహిస్తాడు.

మొదటి సినిమా రేఖకి మంచి పేరు తేవడంతో వరసగా అవకాశాలు వస్తాయి. సత్యనారాయణ అడ్డుకోడు. అలాగని, ఆమెకి వస్తున్న పేరుని పూర్తిగా ఆస్వాదించనూ లేడు. నటించడం రేఖకి ఇష్టమూ కాదు, అయిష్టమూ కాదు. సినిమా పరిశ్రమలో ఉండే రకరకాల మనుషుల మధ్య నెగ్గుకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే, రామారావుతో సహా ఆమెకి దగ్గర వాళ్ళందరూ రేఖని అనుమానించే పరిస్థితులు వస్తాయి. తామరాకు మీద నీటిబొట్టు చందంగా తన పని తాను చేసుకుపోయే రేఖ ఎలా స్పందించిందో చెబుతూ కథని ముగిస్తారు రమాదేవి.


ముందుగా చెప్పినట్టుగా విస్తారమైన కేన్వాసుతో 418 పేజీల నవలని రాశారు రమాదేవి. మధ్య తరగతి మనస్తత్వాలు, తాగుడు అనర్ధాలు మొదలు, లోతైన వేదాంత విషయాలు, నవాబుల జీవన విధానం వరకూ ఎన్నో ఎన్నెన్నో విషయాలని కథలో భాగం చేశారు. కోస్తా, తెలంగాణా ప్రాంతాల నైసర్గిక రూపం, ప్రజల జీవన విధానం, న్యాయస్థానాల పనితీరు, మారుతున్న ఫ్యాషన్లు, వస్త్రధారణ ఇలా ఎన్ని సంగతులో చర్చకి వస్తాయి నవలలో. కథనం పరుగులు పెట్టించేది కాదు. తాపీగా చదివించేది.

రేఖ ఉన్నత వ్యక్తిత్వాన్ని చిత్రించే క్రమంలో రచయిత్రి మిగిలిన పాత్రలని ఒకింత చిన్న చూపు చూశారేమో అనిపించక మానదు. ప్రాముఖ్యత ఉన్న కొన్ని పాత్రలు ఉన్నట్టుండి తెరవెనక్కి వెళ్ళిపోవడం, అదాటున రంగం మీదకి వచ్చిన పాత్రలు అంతలోనే కీలకమైనవిగా మారిపోవడం ఆశ్చర్య పరుస్తుంది. ఎడిటింగ్ విషయంలో కొంచం శ్రద్ధ తీసుకుని ఉంటే రీడబిలిటీ పెరిగి ఉండేది అనిపించింది. రమ్య ప్రచురణలు ప్రచురించిన ఈ పుస్తకం నవోదయ బుక్ హౌస్ ద్వారా అందుబాటులో ఉంది. (వెల రూ. 190).