శుక్రవారం, డిసెంబర్ 23, 2016

ఆ రెండు పార్టీలు ...

ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ  పార్టీలని రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న తాజా నిర్ణయం, ఆ రెండు పార్టీల పుట్టుకని గురించి మరోసారి జ్ఞాపకం చేసుకునేలా చేసింది. ఎన్నికల సంఘం రద్దు చేసిన పార్టీల జాబితాలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు తనయుడు హరికృష్ణ, భార్య  లక్ష్మీ పార్వతి స్థాపించిన 'అన్న తెలుగుదేశం పార్టీ,' 'ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ (ఎల్పీ)' లు ఉన్నాయి. ఈ పార్టీల పుట్టుకకి దారితీసిన పరిస్థితులు, అనంతర పరిణామాలని రాష్ట్ర రాజకీయాలని దగ్గరనుంచి పరిశీలించే వారు మాత్రమే కాదు, ఎన్టీఆర్ అభిమానులు సైతం ఎప్పటికీ మర్చిపోలేరు.

తిరుపతిలో జరిగిన 'మేజర్ చంద్రకాంత్' సినిమా శతదినోత్సవ వేడుకలో నాటికి తన జీవిత చరిత్ర రాస్తున్న లక్ష్మీ (శివ) పార్వతిని వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించిన ఎన్టీఆర్, ఆ మర్నాడే రిజిస్ట్రార్ ని తన ఇంటికి పిలిపించుకుని వివాహాన్ని రిజిస్టర్ చేయించడం, అటుపై రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి భార్యా సమేతుడై తరలి వెళ్లి 1994 ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం జరిగిపోయింది. అప్పటివరకూ పార్టీలో రెండు పవర్ సెంటర్లు గా ఉన్న ఎన్టీఆర్ ఇద్దరు అల్లుళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, నారా చంద్రబాబు నాయుడుకి తోడు మూడోదీ, బలమైనదీ అయిన లక్ష్మీ పార్వతి వర్గం అనతికాలంలోనే తయారు కావడం, కొన్నాళ్లకే దగ్గుబాటి లక్ష్మీ పార్వతికి మద్దతివ్వడం జరిగిపోయింది.

చంద్రబాబు అభిమానులు 'రాజ్యాంగ పరిరక్షణ' గానూ, ప్రజాస్వామ్య వాదులు, ఎన్టీఆర్ అభిమానులు 'వెన్నుపోటు' గానూ పిలుచుకునే సంఘటన 1995 ఆగస్టులో జరిగింది. అత్యంత అవమానకర పరిస్థితులు సృష్టించి ఎన్టీఆర్ ని పదవీచ్యుతుణ్ణి చేసిన చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టారు. డెబ్బై రెండేళ్ల ఎన్టీఆర్ తీవ్రమైన పోరాటం చేశారు. కోర్టులకి, ప్రజాకోర్టుకి వెళ్లారు. కారణాలు ఏవైనప్పటికీ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగారు.. అప్పటి రాజకీయ పార్టీలు ఈ వ్యవహారాన్ని కేవలం ఎన్టీఆర్ కుటుంబ సమస్యగా మాత్రమే చూశాయి. మెజారిటీ మీడియా ఏకపక్షంగా వ్యవహరించడంతో ఎన్టీఆర్ కి తన గొంతు వినిపించే అవకాశం దొరకలేదు. అధికారం కోల్పోయిన కొద్దికాలానికే ఎన్టీఆర్ తుదిశ్వాస విడిచారు.

ముఖ్యమంత్రి అయిన కొత్తలో చంద్రబాబు అప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణతోనూ సత్సంబంధాలు నెరపారు. 'వెన్నుపోటు' అనంతరం ఎన్టీఆర్ స్థాపించిన 'ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ' పగ్గాలని ఎన్టీఆర్ మరణాంతరం లక్ష్మీ పార్వతి చేపట్టడంతో ఆ పార్టీ పేరు చివర బ్రాకెట్లో 'ఎల్పీ' వచ్చి చేరింది.  మరోపక్క, చంద్రబాబు-హరికృష్ణల మధ్య సంబంధాలు ఎన్నో చిత్రమైన మలుపులు తిరిగాయి. ప్రజలు తనని ముఖ్యమంత్రిగా అంగీకరించారన్న విశ్వాసం పెరిగాక, చంద్రబాబు హరికృష్ణని దూరం పెట్టడం ఆరంభిచడంతో, నెమ్మదిగా తెలుగుదేశం నుంచి బయటికి వచ్చిన హరికృష్ణ 'అన్న తెలుగుదేశం పార్టీ' స్థాపించి, కొంతకాలం నడిపించారు.

రాజకీయ పరిణామాలని తనకి అనుకూలంగా మార్చుకుని, ఇమేజి బిల్డింగ్ మీద దృష్టి పెట్టిన చంద్రబాబుకి నాటి మీడియా నుంచి పుష్కలంగా సహాయ సహకారాలు అందడం ఒకపక్క, తగినంత రాజకీయ అవగాహన, కార్యకర్తల బలం లేకపోవడం మరోపక్క -  ఈ కారణాలకి కొత్తగా పుట్టిన పార్టీలు రెండూ కొన్నాళ్లకే నామమాత్రంగా మిగిలిపోయాయి. అప్పటినుంచీ హరికృష్ణ చంద్రబాబుకి చేరువవుతూ, దూరమవుతూ, మళ్ళీ చేరువవుతూ, అంతలోనే దూరమవుతూ వస్తూ ఉండగా, లక్ష్మీ పార్వతి మాత్రం ఇప్పటికీ చంద్రబాబు పట్ల తీవ్ర వ్యతిరేకతతోనే ఉన్నారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమని పదేపదే ప్రచారం చేసిన లక్ష్మీ పార్వతి, కేవలం చంద్రబాబు వ్యతిరేకి అన్న కారణానికి వైఎస్సార్ కి, అటుపై జగన్ కి మద్దతు ప్రకటించారు.

తెలుగుదేశం పార్టీలో అతికొద్ది కాలం పవర్ సెంటర్ గా చక్రం తిప్పిన లక్ష్మీ పార్వతి, 'వెన్నుపోటు' అనంతరం చంద్రబాబు అభిమానులు, అనుయాయుల చేత 'రాజ్యాంగేతర శక్తి' గా ముద్ర వేయించుకున్నారు. ఆంధ్ర ప్రజలు మాత్రమే కాదు, అటు హరికృష్ణ, ఇటు లక్ష్మీ పార్వతి కూడా తమ రాజకీయ పార్టీలని గురించి పూర్తిగా మర్చిపోయిన తరుణంలో, కేంద్ర ఎన్నికల సంఘం జరిపిన పార్టీల రద్దు పుణ్యమా అని వాళ్ళు నడిపిన పార్టీలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. 'ఎన్టీఆర్ కి నిజమైన వారసులం' అని వాళ్లిద్దరూ పదేపదే ప్రకటించుకున్నా, ప్రజలు మాత్రం వాళ్ళని ఆ దృష్టితో చూడలేదు. ఒక సందర్భంలో లక్ష్మీ పార్వతి చెప్పినట్టుగా, ఇప్పుడున్నంత విస్తృతమైన మీడియా ఇరవై ఏళ్ళ క్రితం ఉండి ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోవిధంగా ఉండేవి బహుశా...

శుక్రవారం, డిసెంబర్ 02, 2016

జయమ్ము నిశ్చయమ్మురా (2016)

జాతకాలని, శకునాలని బాగా నమ్మే ఓ కుర్రాడు జీవితంలో ఓ దశలో వాటికి దూరంగా జరిగి, తనకంటూ ఓ వ్యక్తిత్వాన్ని నిర్మించుకుని, సమస్యలని అధిగమించడంతో పాటు ప్రేమని సాధించుకున్న వైనమే హాస్యనటుడు శ్రీనివాస రెడ్డి  కథానాయకుడిగా గతవారం విడుదలైన 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమా. ఈ ఏకవాక్య కథని రెండున్నర గంటల సినిమాగా తెరకెక్కించారు శివరాజ్ కనుమూరి. తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యంలో వచ్చిన కొన్ని కథల్ని ఆధారంగా చేసి రాసుకున్న కథలో, సౌలభ్యం కోసం కొన్ని లాజిక్ లని విడిచిపెట్టినట్టు టైటిల్స్ లో చెప్పేసిన దర్శకుడి చిత్తశుద్ధి నచ్చేసింది.

కరీంనగర్ జిల్లాలోని పల్లెటూళ్ళో ఓ చేనేత కుటుంబంలో పుట్టిన సర్వమంగళం (శ్రీనివాస రెడ్డి) ఉద్యోగాన్వేషణలో ఉంటాడు. తల్లి (డబ్బింగ్ జానకి) నేతపని చేసి అతన్ని పోషిస్తూ ఉంటుంది. జాతకులని నమ్మే సర్వానికి పితా (జీవా) మాట వేదవాక్కు. అతని సూచనల ప్రకారం నడుచుకుని కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం సంపాదిస్తాడు సర్వం. అది మొదలు కరీంనగర్ కి బదిలీ చేయించుకోవడం మీదే అతని దృష్టి అంతా. తన నమ్మకాల కారణంగా తోటి ఉద్యోగుల్లో పలచన అయిన సర్వం, తన ఆఫీసు కాంపౌండ్ లోనే ఉన్న మీసేవా సెంటర్లో పనిచేసే రాణి (పూర్ణ)తో ప్రేమలో పడతాడు, అది కూడా ఆమె జాతకం తన జాతకంలో మేచ్ అయిందని పితా చెప్పాకే.

సొంతంగా నర్సరీ ఏర్పాటు చేసుకుని, ఉద్యోగం వదిలేయాలని ఆలోచనలో ఉన్న రాణి ని జాయింట్ కలెక్టర్ తన వలలో వేసుకునే ప్రయత్నం చేయడం, అప్పటికే ఆ అధికారి అసలు రంగు తెలిసిన సర్వం రాణిని రక్షించడంతో పాకాన పడ్డ కథ, సర్వం-జాయింట్ కలెక్టర్ ల మధ్య మొదలైన యుద్ధం పతాక స్థాయికి రావడం, రాణి తన అన్న చూసిన సంబంధానికి ఒప్పుకోవడంతో ముగింపు దిశగా నడుస్తుంది. సర్వం తన బదిలీని, రాణిని ఎలా సాధించుకున్నాడన్నది ముగింపు. మునిసిపల్ ఆఫీసులో పని జరిగే తీరుని ప్రవీణ్, కృష్ణభగవాన్, జోగి బ్రదర్స్, పోసాని కృష్ణమురళి పాత్రల ద్వారా చూపించాడు దర్శకుడు.


తొలి సినిమానే అయినా కథ చెప్పడంలో ఎలాంటి తడబాటూ ప్రదర్శించలేదు శివరాజ్ కనుమూరి. ప్రథమార్ధంలో నేలమీద నడిచిన హీరోని, జాయింట్ కలెక్టర్ మీద యుద్ధం ప్రకటించాక ఒక్కసారిగా నేల విడిచి సాము చేయించి, ప్రేమ సాధించుకునే విషయంలో మళ్ళీ నేలమీదకి దించాడు. ఇప్పటివరకూ డాక్యుమెంటరీల్లో తప్ప సినిమాల్లో కనిపించని పిఠాపురం-కాకినాడ బీచ్ రోడ్డుని చాలా చక్కగా, "ఆ రోడ్డు అంత బాగుంటుందా?" అనిపించేలా తీశాడు. కెమెరా (నగేష్ బానెల్) కంటికి హాయిగా ఉంది. నేపధ్య సంగీతం (రవిచంద్ర) బాగా కుదిరింది. రెండు మూడు సన్నివేశాలు తొలగిస్తే క్లీన్ 'యు' వచ్చేదే కానీ, ఆ సన్నివేశాలు కథకి కీలకం అయ్యాయి. 'యుఏ' ఇచ్చింది సెన్సారు.

కానైతే, ఈసినిమాకి ప్రధాన సమస్య నిడివి. సాధారణంగా చాలా సినిమాల్లో రెండో సగంలో కనిపించే సాగతీత, మొదటిసగంలో కూడా అనిపించిందంటే ఎడిటింగ్ లోపమే. పాత్రల పరిచయాన్ని కొంచం కుదించి ఉండొచ్చు. అలాగే, రెండో సగంలో శుభం కార్డు కోసం ఎదురు చూస్తుండగా మొదలయ్యే పెళ్లి ప్రహసనం వాచీ చూసుకునేలా చేసింది.హీరోయిన్ పాత్ర చిత్రణ, హాస్యం, ముగింపు ఈ మూడింటి మీదా వంశీ ప్రభావం కనిపించింది. సముద్రాన్ని కూడా కూడా గోదారంత బాగానూ చూపించారు తెరమీద.

థర్టీ ప్లస్ హీరో పాత్రకి శ్రీనివాస రెడ్డి చక్కగా సరిపోయాడు. ఆత్మన్యూనత ఉన్న వ్యక్తిగానూ, దాన్ని జయించిన వాడిగానూ వేరియేషన్స్ చక్కగా చూపించాడు. తెలంగాణ మాండలీకాన్ని సునాయాసంగా పలికాడు కూడా.  అలాగే పూర్ణ కూడా అతనికి సరిపోయే జోడీ. సహాయ పాత్రల్లో కాంతారావుగా కనిపించిన శ్రీవిష్ణు నటనతో గోదారి జిల్లాల వాళ్ళు కొంచం ఎక్కువ కనెక్ట్ అవుతారు. 'జబర్దస్త్' కమెడియన్స్ చాలామంది చిన్న చిన్న పాత్రల్లో మెరిశారు. విలన్ గా రవివర్మ పూర్తి స్థాయి పాత్రలో కనిపించాడు. అలాంటి లక్షణాలున్న కొందరు గుర్తొచ్చారంటే, ఆ క్రెడిట్ దర్శకుడితో పాటు నటుడికీ దక్కుతుంది.

ఇన్నాళ్లూ హాస్యనటులు, విలన్లు పలికిన తెలంగాణ మాండలికాన్ని హీరో పలకడం బాగా అనిపించింది. బహుశా తెలంగాణ ఉద్యమం సాధించిన నిశ్శబ్ద విజయాల్లో ఇదీ ఒకటేమో. ఈ సినిమా బాగా ఆడితే, 'అగ్ర' హీరోలు సైతం పాత్రల్ని తెలంగాణ ప్రాంత వ్యక్తులుగా డిజైన్ చేయించుకున్నా ఆశ్చర్యం లేదు. మొత్తం మీద చూసినప్పుడు నాయికా నాయకులకి వ్యాపకాలు, లక్ష్యాలు ఉండడం, వాటికోసం వాళ్ళు శ్రమించడం మెచ్చుకోవాల్సిన విషయం. గవర్నమెంట్ ఆఫీసుల పనితీరుని వ్యంగ్యంగా చూపించిన తీరు సామాన్యులు బాగా ఎంజాయ్ చేసేదిగా ఉంది. కనీసం ఓ ఇరవై నిమిషాలు ట్రిమ్ చేస్తే రిపీటెడ్ ఆడియన్స్ ని ఆకర్షించేదిగా ఉండేది ఈ 'జయమ్ము నిశ్చయమ్మురా.' భారీ బిల్డప్ సినిమాలు మాత్రమే ఇష్టపడే వాళ్ళకి తప్ప మిగిలిన అందరూ చూడొచ్చీ సినిమాని.