ఆదివారం, ఆగస్టు 14, 2016

జెండా పండగ

"రండీ ఓ మిత్రులార జెండా ఎగురవేయ.. మన జాతికి గౌరవమీయ.." ఆడపిల్లలందరూ గదిలో ఓ మూల కూర్చుని పాట ప్రాక్టీసు చేసుకుంటున్నారు చక్కగా. వాళ్ళకయితే అదొక్కటే పని. అదే మగపిల్లలకయితేనా.. పురికొసలు కాలవలోకి పట్టుకెళ్లి నానబెట్టి, ఆ తర్వాత ఎండబెట్టాలి. రంగు రంగుల జెండా కాయితాలు మడతలు పెట్టి, మేష్టారు కత్తిరించడానికి రెడీగా పెట్టాలి. ఎవరింట్లో కత్తెరలు ఉన్నాయో లెక్కేసి, వాళ్లలో ఎవరు తిట్టకుండా ఎరువిస్తారో నిర్ణయించి, జెండా కాయితాలు కత్తిరించడడం కోసం అడిగి పట్టుకురావాలి. మేష్టారు జెండాలు కత్తిరిస్తుంటే, ఆయనకి కోపం రాకుండా చూసుకోవాలి. నోటిమీద వేలేసుకుని చూస్తూ ఉండాలి. అప్పుడు గనక ఏమన్నా మాట్లాడామంటే, చెయ్యి తిరగెయ్యమని వేళ్ళ కణుపుల మీద రూళ్ళ కర్రతో ఒక్కటేస్తారు మేష్టారు.

జెండాలు కత్తిరించడం అయిపోగానే కనీసం ఇద్దరం వెళ్లి కత్తెరని తిరిగిచ్చేసి రావాలి. పురికొస తాడుని బడి బయట ఆ చివర నుంచి ఈ చివరికి వరసలుగా కట్టి, రామారావు గారి ఇంటి దగ్గరనుంచి తెచ్చిన వేడి వేడి లైపిండి తాడుకి పులమాలి. అప్పుడేమో మేష్టారొచ్చి దగ్గరుండి జెండా కాగితాలు చిరిగిపోకుండా తాడుకి ఎలా అతికించాలో చూపిస్తారు. కొంతమంది జెండాలు అంటిస్తుంటే, ఇంకొంతమంది రద్దు ఏరి బయట పడేసే పని, బండిముందు ఇసుకలో నీళ్లు జల్లేపనీ చూడాలి. హమ్మయ్య పురికొస అంతా రంగురంగుల జెండా కాగితాలతో నిండిపోయింది.. మిగిలిన జెండాలు గుమ్మాల పైనా, బోర్డు పైనా అతికించేస్తే జెండాల పని అయిపోయినట్టే. ఈ పైన కట్టే పని మాత్రం పొడుగు పిల్లలదే. వొచ్చే ఏడాదికైనా వాళ్లంతా పొడుగైపోతే బాగుండును అనిపించేస్తుంది మనకి.

సరే, ఇప్పుడింక ఆడపిల్లల పని మొదలవుతుంది. మధ్యాహ్నం బళ్లోకి వచ్ఛేప్పుడే తెల్ల ముగ్గు, రంగు ముగ్గులూ తెచ్చేసుకుంటారు కదా వాళ్ళు. వాటిలో తడిసిన ఇసక మీద రంగు ముగ్గులు పెట్టేస్తారు. మేష్టారు దగ్గరుండి జెండా కర్ర చుట్టూ రంగు ముగ్గు పెట్టించేస్తారు. ఆరిపోయిన జెండాల తాడుని క్లాసులో కట్టే పనీ, నేల బెంచీలు పైకెత్తి, ఇసకంతా తుడిచి, నీళ్లు జల్లే పనీ మళ్ళీ మగ పిల్లలవే. ఇవయ్యాక ఆడపిల్లలు షోగ్గా వచ్చి మేష్టారిచ్చిన రంగు సుద్దలతో గచ్చు నేలమీద ముగ్గులు పెట్టేస్తారు. ఆ ముగ్గులు ఆరిపోయాక నేల బల్లలు మళ్ళీ పరిచేయాలి. అన్నట్టు, అంతకన్నా ముందే, అప్పటికి వారం ముందు నుంచీ రోజూ చేయిస్తున్న 'ఎటేంషన్' 'స్టెండిటీజ్' అందరం కలిసి మళ్ళీ ఓ సారి చేసి చూపించాలి మేష్టారికి.

ముగ్గులతోనూ, జెండాలతోనూ బడి భలే కొత్తగా అయిపోతుంది కదా. అప్పుడేమో మేష్టారు, మర్నాడు పొద్దున్నే జెండాలో వెయ్యడానికి పువ్వులు అవీ ఎవరెవరు తేవాలో చెప్పేసి, పొద్దున్నే ఉతికిన బట్టలు కట్టుకుని ఆలీసం చెయ్యకుండా బడికొచ్చేయాలని, ఎవ్వరూ మానకూడదనీ చెప్పేసి ఇంటికి పంపిస్తారు. ఇంటికొచ్చేమంటే జెండా పండగ సగం అయిపోయినట్టే. ఇంక మర్నాడు తెల్లారిందంటే ఇంట్లో ఒకటే హడావిడి. మామూలు పండగల్లాగే తలంటేస్తుంది అమ్మ. కుంకుడు కాయ రసం కానీ కంట్లో పడిందంటే కళ్ళు ఎర్రగా అయిపోతాయి. "అబ్బే మా నాన్నగారు అస్సలు కొట్టలేదు.. కుంకుడ్రసం పడిందంతే" అని మనం చెప్పినా సరే, ఫ్రెండ్సులు అనుమానంగా చూస్తారు.

ఇంక బళ్ళోకెళ్లింది మొదలూ ఎండలో నిలబెట్టి 'ఎటేంషన్' లు' 'స్టెండిటీజ్' లూను. సగం ముగ్గులు చెరిగిపోయి, మనకి కాళ్ళు నొప్పులు మొదలయ్యాక అప్పుడొస్తారు పెద్దమనుషులు, జెండా ఎగరెయ్యడానికి. ఫ్రెండ్సులేమో "మీ నాన్నగార్రోయ్" అంటారు మనకి తెలియనట్టుగా. వాళ్ళని కొంచం గీరగా చూసేమనుకో, ఆ కోపం కడుపులో పెట్టుకుని తర్వాతెప్పుడో ఏదో ఒకటి చేసేస్తారు. అందుకని మామూలుగా ఉండాలి, ఏమీ మాట్లాడకుండా. ఓ నాలుగు 'ఎటేంషన్' లు' 'స్టెండిటీజ్' లూ అయ్యాక వచ్చే 'ఎటేంషన్' లో పెద్దమనుషులు జెండా కర్ర దగ్గర కొబ్బరి కాయలు కొట్టి, జెండా ఎగరేసేస్తారు. ఆడపిల్లలు పాటలు పాడేస్తారు. ఈలోగా రామారావు గారొచ్చి, కొబ్బరి చెక్కల్ని చిన్న చిన్న ముక్కలు చేసి వాళ్ళింట్లో బేసిన్లో తెచ్చుకున్న పంచదారలో కలిపేస్తారు. ఇంకో బేసిన్లో చాకలేట్లు, బిస్కట్లు కూడా కవర్లు చింపేసి పోసేస్తారు.

అది మొదలు పెద్ద మనుషులు గాంధీ గారనీ, నెహ్రు గారనీ ఏవిటేవిటో మాట్లాడతారు. ఫ్రెండ్సులందరూ చక్కగా కొబ్బరి ముక్కలూ అవీ ఎప్పుడు పెడతారో అని చూడొచ్చు కానీ, మనం మాత్రం పెద్ద మనుషులు మాట్లాడేది శ్రద్ధగా వినాలి. ఇంటికెళ్ళాక ఎవరెవరు ఏమేం మాట్లాడారు అని ప్రశ్నలు ఉంటాయి. సరిగ్గా కానీ చెప్పలేకపోయామా, పొద్దు పొద్దున్నే ఫ్రెండ్సులకి వచ్చిన అనుమానాలు నిజమయిపోతాయి. ఎండలో నిలబడి వినగా వినగా, మేష్టారు సైగ చేసినప్పుడల్లా చప్పట్లు కొట్టగా కొట్టగా, అప్పటికి పూర్తిచేస్తారు వాళ్ళు మాట్లాడడం. గాంధీ గారు, నెహ్రు గారు జైలుకి వెళ్లారు కాబట్టే మీరిలా చదువుకోగలుగుతున్నారు అని చెబుతారు వాళ్ళు. "వాళ్లంత కష్టపడి జైలుకి వెళ్లకపోతేనేం" అనిపిస్తుంది కానీ, ఆ మాట పైకనేస్తే పాతెయ్యరూ?

హమ్మయ్య! చిన్న చిన్న కాగితం ముక్కల్లో కొబ్బరి ముక్కలూ అవీ ఇచ్చేశారు కదా.. ఎప్పటిలాగే రామారావు గారు "పడెయ్యకూడదు.. గాంధీ గారి ప్రసాదం" అని కూడా చెప్పేశారు కదా.. ఇంకా ఇంటికి వెళ్లిపోవచ్చు అనుకుంటున్నారా? అప్పుడే ఎక్కడ.. ఇంకా కాంగ్రెస్ అరుగు దగ్గర జెండా ఎగరెయ్యద్దూ? అందరం రోడ్డుకి ఎడమవైపున వరుసలుగా బయలుదేరతాం.. కాంగ్రెస్ అరుగు దగ్గరికి వచ్చేస్తే మనిల్లు దగ్గరే కూడాను. ఆలా అని ఇంట్లోకి వెళ్లిపోకూడదు. అక్కడ మళ్ళీ కాసేపు 'ఎటేంషన్'  'స్టెండిటీజ్' చేశాక, వేరే పెద్దమనుషులు వచ్చి, కొబ్బరికాయలు కొట్టి జెండా ఎగరేస్తారు. ఇక్కడైతే ఒకళ్ళో ఇద్దరో మాట్లాడతారంతే. పైగా, కొబ్బరి ముక్కలతో పాటు తీబూందీ, కారబూందీ వేరేవేరే అరిటాకు ముక్కల్లో పెట్టి ఇస్తారు.

అంతేనా? గత సంవత్సరం ఎక్కువ మార్కులు వఛ్చిన విద్యార్ధులకి నగదు బహుమతుల పంపిణీ కూడాను. డబ్బులు తీసుకుని, ఆ పెద్దమనిషి ఎప్పుడూ మన ఇంటికొచ్చే నాన్న ఫ్రెండే అయినా అస్సలు నవ్వకుండా, ఆయనకీ, మేష్టారికి నమస్కారం చేసేసి, అప్పుడా డబ్బులతో ఏమేం చెయ్యొచ్చో ప్లాన్లు వేసేసుకోవచ్చు. బడికి దగ్గరగా ఇళ్లున్న వాళ్ళు వెనక్కి వెళ్తారు కానీ, మనం ఉండిపోవచ్చు ఎంచక్కా. వచ్చిన చిరుతిళ్లన్నీ ఒలికిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని ఇంటికి వెళ్తామా? అమ్మ ముందుగా డబ్బులగురించి అడుగుతుంది. "నీ దగ్గరుంటే పారేసుకుంటావు.. నాన్నగారికి చెప్పి పోస్టాఫీసులో వేయిస్తాను" అని ఆమాటా ఈమాటా చెప్పి పుచ్చేసుకుంటుంది. బాగా చదువుకుని, వొచ్చే ఏడు కూడా బహుమతీ తెచ్చుకోవాలనీ, అప్పుడా డబ్బులు అమ్మకి అస్సలు ఇవ్వకుండా ప్రసాదం గారి కొట్లో బజ్జీలూ, వడలు అవీ కొనుక్కుని తినెయ్యాలనీ ప్లాన్లు వేసుకోడంతో ఆ ఏటికి జెండా పండగ అయిపోయినట్టే...

మిత్రులందరికీ డెబ్భయ్యో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

బుధవారం, ఆగస్టు 10, 2016

మనమంతా

తెలుగు సమాజంలో బాగా పెరిగిన మధ్యతరగతి వర్గానికి తెలుగు తెరమీద మాత్రం సరైన ప్రాతినిధ్యం కనిపించడం లేదు గత కొన్నేళ్లుగా. అసలు సినిమా కథలే నేల విడిచి సాము చేస్తున్న పరిస్థితుల్లో, మధ్యతరగతి వాస్తవ పరిస్థితులని ప్రతిబింబిస్తూ ఓ సినిమా రావడం విశేషమైతే, ఎక్కడా అనవసరమైన మెలోడ్రామాకి చోటివ్వకుండా, అత్యంత సహజంగా సినిమాని తీర్చిదిద్దడం మరో విశేషం. మనకి తెలిసిన మనుషులే తెరమీద కనిపించే ఆ సినిమా పేరు 'మనమంతా.' చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వారాహి సంస్థ నిర్మించిన ఈ సినిమాని తెలుగులో నిర్మించి తమిళ, మలయాళ భాషల్లో డబ్ చేసి విడుదల చేయడం ఇంకో విశేషం.

ఇది నలుగురి కథ. నలుగురూ మధ్య తరగతి జీవితానికి ప్రతినిధులే. ఎవరి పరిధిలో వాళ్లకి ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకునే క్రమంలో ఎదురయ్యే ఒత్తిడులూ ఉంటాయి వీళ్లందరి కథలూ కంచికి చేరుతూనే ఓ మంచి సినిమాని చూసిన అనుభూతిని మిగులుస్తాయి ప్రేక్షకులకి. సాయిరాం (మోహన్ లాల్), గాయత్రి (గౌతమి), అభిరామ్ (విశ్వాంత్), మహిత (రైనా రావు) ల కథ ఇది. వీరిలో, ఓ సూపర్ మార్కెట్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే సాయిరాంకి మేనేజర్ అవ్వాలన్నది లక్ష్యం. చదివిన చదువు మర్చిపోయి గృహిణిగా మారిపోయిన గాయత్రికి చుట్టూ ఉన్నవారి నుంచి గౌరవం అందుకోవాలన్నది కోరిక.

తెలివైన విద్యార్థి అభిరామ్, ఉన్నట్టుండి ప్రేమలో పడి, ఆ ప్రేమని నిలబెట్టుకోడం కోసం శ్రమిస్తూ ఉంటాడు. ఇక, అందరిలోకీ చిన్న పిల్ల మహిత కి తన చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందంగా ఉంచడం అంటే ఇష్టం. రోజురోజుకీ పెరిగే ఆర్ధిక అవసరాలు, సాయిరాం కోరికని 'లక్ష్యం' గా మారుస్తాయి. తప్పని పరిస్థితుల్లో ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోడానికి అడ్డదారి తొక్కి, అటుపై చిక్కుల్లో పడతాడు. మధ్యతరగతి నుంచి కాస్త పైకెదిగి, నలుగురి చేతా భేష్ అనిపించుకోవాలని కలలుకనే గాయత్రికి ఉన్నట్టుండి ఓ పెద్ద అవకాశం తలుపు తడుతుంది. కానీ, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి ఎన్నో సందేహాలు. తాను ప్రేమించిన అమ్మాయి తనని కూడా ప్రేమిస్తోందన్న అతి నమ్మకంతో ఉన్న అభిరామ్ కి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి.


ఇక, తన శక్తికి మించి స్నేహితుడికి సాయం చేయాలని ప్రయత్నించిన మహిత ఓ చిక్కుముడిని విప్పాల్సి వస్తుంది. నిజానికి ఈ నలుగురి కథల్లోనూ కొంత నాటకీయతకి చోటిచ్చిన కథ మహితదే. వయసుకి మించిన పరిణతి, బాధ్యత చూపించే ఈ అమ్మాయి ఎవరికైనా సాయం చేయడానికే కాదు, అవసరమైనప్పుడు సాయం పొందడానికీ వెనుకాడదు. సాయిరాం సమస్యని మహిత పరిష్కరిస్తే, మహిత సమస్య సాయిరాం ద్వారా పరిష్కరింపబడుతుంది. గాయత్రిని గురించి ఆమె కుటుంబం తీసుకున్న నిర్ణయం ఒక్కటే నన్ను కన్విన్స్ చేయలేకపోయింది. బహుశా అందువల్లనే కావొచ్చు, ముగింపుని నా చుట్టూ ఉన్న ప్రేక్షకులు ఆస్వాదించినంతగా నేను చేయలేకపోయానేమో.

మణిరత్నం 'యువ' నుంచి ప్రవీణ్ సత్తారు 'చందమామ కథలు' వరకూ ఈ తరహా కథనం తెలుగు తెరకి కొత్త కాదు. నాలుగు కథల్ని వేర్వేరుగా చూపిస్తూ, ఆ నాలుగింటి ముగింపుకీ ఓ అందమైన ముడి వేయడం ద్వారా తన సినిమా, ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండి పోయేలా చేశాడు. సాయిరాం గా నటించిన మోహన్ లాల్ నటనకి వంక పెట్టలేం కానీ, సొంతంగా చెప్పుకున్న డబ్బింగ్ ప్రేక్షకుల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. సినిమా మొదలైన కాసేపటికి కానీ ఆ డబ్బింగ్ కి అలవాటు పడలేం. గాయత్రి పాత్రకి గౌతమి సరైన ఎంపిక. తెరపై ఆమె కనిపించినంత సేపూ మనకి తెలిసిన మధ్యతరగతి మహిళలు గుర్తొస్తూనే ఉంటారు. ముఖ్యంగా నగల షాపు సన్నివేశాల్లో ఆమె నటన గుర్తుండిపోతుంది.

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మహితగా నటించిన రైనా రావు, దాసుగా కనిపించిన అయ్యప్ప పి. శర్మ గురించి.. (అయ్యప్పని ఇతని సోదరుడు 'బొమ్మాళి' రవిశంకర్ గా పొరబడి మొదట ఇలా రాశాను:  'అరుంధతి' డబ్బింగ్ ఎంత పేరు తెచ్చిందో, ఈ సినిమాలో నటనా అంతటి పేరు తెచ్చే అవకాశం ఉంది రవికి). గాయత్రి స్నేహితురాలిగా తెరమీద కనిపించినంత సేపూ ఊర్వశి నవ్విస్తుంది. గొల్లపూడి, ఎల్బీ శ్రీరామ్, పరుచూరి వెంకటేశ్వర రావు, నాజర్ ఇతర పాత్రల్లో కనిపించారు. మహేష్ శంకర్ సంగీతం సన్నివేశాల తాలూకు మూడ్ ని ఎలివేట్ చేసింది. మొదటి సగంతో పోల్చినప్పుడు రెండో సగంలో కథనం నెమ్మదించింది అనిపించింది. మొత్తంమీద,  మధ్యతరగతి తమని తాము ఐడెంటిఫై చేసుకునే సినిమాని అందించిన చంద్రశేఖర్ యేలేటిని అభినందించాల్సిందే..

ఆదివారం, ఆగస్టు 07, 2016

మరల తెలుపనా ప్రియా

భావుకత్వం  ఉన్న టైటిల్, బాగున్న సంగీతం, ఆసక్తి కలిగించిన స్టిల్స్, మహిళా దర్శకురాలి తొలి చిత్రం.. అన్నింటికీ మించి, కావాల్సిన వాళ్ళ ప్రొడక్షన్.. నిజానికి రిలీజ్ రోజునే చూడాల్సిన 'మరల తెలుపనా ప్రియా' సినిమాని కారణాంతరాల వల్ల రెండ్రోజులు ఆలస్యంగా చూశాను. దర్శకురాలు వాణి ఎం. కొసరాజు తానే రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమా కథ కూడా తెలిసిందే.. ఇదే పేరుతో కొన్నేళ్ల క్రితం ఓ వారపత్రికలో సీరియల్ గా ప్రచురితమయింది. మామూలుగానే ఓ నవలని సినిమాగా మలచడంలో అనేక సవాళ్లు ఉంటాయి. అది కూడా సొంత నవలని సినిమాగా మార్చి ఒప్పించడం, అది కూడా దర్శకురాలిగా తొలిప్రయత్నంలోనే చేయాల్సి రావడం నిజంగా కత్తిమీద సామే. ఈ సాముని గురించి మాట్లాడుకోవాలంటే, ముందుగా కథ గురించి చెప్పుకోవాలి.

కోటీశ్వరులింటి గారాబు పట్టి వైషూ అలియాస్ వైష్ణవికి జీవితం అంటే ఎంజాయ్ చేయడం మాత్రమే. బైకర్ అయిన ఈ అమ్మాయి అప్పుడప్పుడూ బైక్ రేసుల్లోనూ, ఎప్పుడూ ఇంటా, బయటా జరిగే పార్టీల్లోనూ బిజీగా గడిపేస్తూ ఉంటుంది. అలాంటి వైషూకి గాయకుడూ, సంగీత దర్శకుడూ అయినా జై అలియాస్ జయకృష్ణ తారసపడతాడు ఒకానొక పార్టీలో. పరిచయం స్నేహంగా మారినప్పుడు తెలుస్తుంది ఇద్దరి అలవాట్లూ పూర్తిగా భిన్నమని. వైషూకి వైనూ, సిగరెట్లూ మామూలు విషయాలైతే, ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా ఆంజనేయస్వామి గుడికి వెళ్లే జై కి బీరు రుచి కూడా తెలీదు. జై తో కలిసి, రాజమండ్రి దగ్గరలో ఉన్న అతని పల్లెటూరికి సంక్రాతి పండక్కి వెళ్ళొచ్చిన వైషూ, హైదరాబాద్ కి తిరిగి రాగానే అతనికి ప్రపోజ్ చేస్తుంది. అతను కూడా అంగీకరిస్తాడు. ఇంతలో ఊహించని విధంగా వాళ్లకి బ్రేకప్ అవ్వడంతో సినిమా విశ్రాంతికి వస్తుంది.

తన తప్పు తెలుసుకున్న వైషూ జై కోసం వెళ్లేసరికి అతని ఇంటికి తాళం ఉంటుంది. ఫోన్లకి జవాబు  ఉండదు. వాళ్ళ ఊరికి ఫోన్ చేసినా అతని సమాచారం ఏమీ తెలియదు.. ఇక, అతన్ని వెతుక్కుంటూ తానే స్వయంగా బయల్దేరుతుంది వైషూ. అతని కోసం జరిపిన అన్వేషణలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, అసలు అతను ఉన్నట్టుండి మాయమైపోడానికి కారణాలు, తిరిగి కలుసుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలని దాటుకుంటూ శుభం కార్డుకి చేరుకుంటుంది. వైషూ గా వ్యోమ నంది (తొలిపరిచయం), జై గా ప్రిన్స్ నటించారు. కథ ప్రకారం హీరో కన్నా, హీరోయిన్ కే నటించడానికి అవకాశం ఎక్కువ. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది వ్యోమ నంది. నాయిక పాత్రలో ఉన్న డిఫరెంట్ షేడ్స్ ని ఎక్కడా వంక పెట్టడానికి వీల్లేని విధంగా ప్రదర్శించింది. కేవలం నటనకి మాత్రమే పరిమితమైపోకుండా గ్లామర్ నీ చిలకరిచింది.


హీరోది ఒకరకంగా పాసివ్ పాత్ర. హీరోయిజం ఉన్న నాయికచేత ప్రేమించబడే హీరో. చాకోలెట్ బాయ్ లా కనిపించే ప్రిన్స్ ఈ పాత్రకి సరిగ్గా సరిపోయాడు. ఈ కుర్రాడు వాచికం, డాన్సులు మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది. సాంకేతిక విభాగాల్లో మొదటగా చెప్పుకోవాల్సింది కెమెరా (ఎస్. రాజశేఖర్), సంగీతం (శేఖర్ చంద్ర) గురించి. హైదరాబాద్, రాజమండ్రి, గోవా, హరిద్వార్, రిషీకేశ్ లని అందంగా చూపించింది కెమెరా. కళ్ళకి హాయిగా ఉంది పనితనం. గ్రీటింగ్ కార్డుల్లాంటి ఫ్రేములకి కొదవ లేదు. ఇక సంగీతం విషయానికి వస్తే, పాటలతో పాటుగా నేపధ్య సంగీతమూ చక్కగా కుదిరింది. మార్తాండ్ కె. వెంకటేష్ లాంటి సీనియర్ ఎడిటర్ రెండో సగం విషయంలో ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఎందుకు మొహమాట పడ్డారో అర్ధం కాలేదు. చిన్న సినిమానే అయినా, చేసిన ఖర్చు తెరమీద కనిపించింది.

దర్శకత్వం గురించి చెప్పుకోవాల్సింది కొంత ఉంది. నాయకుణ్ణి వెతుక్కుంటూ నాయిక జరిపే అన్వేషణతో కథను మొదలు పెట్టి ఇంటర్కట్స్ లో వాళ్ళిద్దరి పరిచయం, ప్రేమని చూపి, బ్రేకప్ దగ్గర విశ్రాంతిని ఇచ్చారు. రెండో సగంలో తన అన్వేషణ కొనసాగిస్తున్న నాయిక గతాన్ని గుర్తు చేసుకునే క్రమంలో మరి కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్లు చూపి, కథని ముగింపుకి తీసుకొచ్చారు. నాయికని పల్లెటూరికి తీసుకెళ్లిన నాయకుడు, తన కుటుంబాన్ని పరిచయం చేస్తాడు. తండ్రితో అతనికున్న మాట పట్టింపులతో సహా అన్నీ తెలుస్తాయి నాయికకు. అలాగే, ఓ సంగీత దర్శకుడిగా అతడు ఎంత బిజీ అన్నది కూడా ఆమె ద్వారా ప్రేక్షకులకి తెలుస్తుంది. అలాంటిది, ఉన్నట్టుండి అతను కనిపించకుండా పోతే అటు కుటుంబమూ, ఇటు సంగీత రంగానికి సంబంధించిన వాళ్ళూ కూడా ఏమాత్రం పట్టించుకోక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

అలాగే, నాయికని ఎంతగానో ప్రేమించే ఆమె తల్లిదండ్రులు, ఓ స్నేహితుడి సాయంతో ఆమె నాయకుణ్ణి వెతుకుతూ, ఆ క్రమంలో జ్వరపడితే ఫోన్లో ఓదారుస్తారే తప్ప పరుగున వెళ్లే ప్రయత్నం చేయరు. మొదటి సగం ఇట్టే గడిచిపోయిన సినిమా, రెండో సగానికి వచ్చేసరికి సాగతీతగా అనిపించిందంటే స్క్రిప్ట్ లోపమే. సున్నితమైన భావోద్వేగాలనీ, నాయికపై నాయకుడి ప్రభావాన్నీ మైన్యూట్ డీటెయిల్స్ తో సహా చిత్రించిన దర్శకురాలు, ఐటెం సాంగ్ తో సహా కమర్షియల్ హంగుల విషయంలోనూ రాజీ పడలేదు. ప్రారంభ సన్నివేశంతో మొదలుపెట్టి, విశ్రాంతి వరకూ కలిగించిన ఆసక్తిని రెండో సగంలోనూ కొనసాగించే విధంగా శ్రద్ధ తీసుకుని ఉంటే గుర్తుండిపోయే సినిమా అయి ఉండే ఈ 'మరల తెలుపనా ప్రియా' హింసనీ, రక్తపాతాన్నీ కాక హాయైన సినిమాలని ఇష్టపడే వాళ్లకి నచ్చుతుంది.