ఆదివారం, డిసెంబర్ 23, 2012

తనికెళ్ళ 'మిథునం'

వెండి తెరమీద 'మిథునం...' అక్షరాల్లో 'మిథునం' శ్రీరమణది అయితే, దృశ్యరూపంలో వచ్చిన ఈ 'మిథునం' దర్శకుడు తనికెళ్ళ భరణిదనే చెప్పాలి. కథని సినిమాగా మార్చడంలో ఉన్న కష్టసుఖాలు తెలిసిన వాడిగానూ, గడిచిన రెండు దశాబ్దాల్లోనూ మన చుట్టూ అనివార్యంగా వచ్చి పడిన మార్పులని ఆకళింపు చేసుకున్న వాడిగానూ 'సినిమాటిక్ లిబర్టీ' తీసుకుని భరణి తీసిన సినిమా ఇది. అందుకే, అక్షరాల్లో అప్పదాసు-బుచ్చిలక్ష్మిలకీ, తెరమీద కనిపించే "ఆది దంపతులు అభిమానించే" జంటకీ భేదాలు కనిపిస్తూనే ఉంటాయి.

శ్రీరమణ కథలో అప్పదాసుకి ఎనభై ఏనాడో దాటేస్తే, సినిమా అప్పదాసు (నేపధ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం) అరవై దాటిన వాడు. మూడు ఎమ్మేలు పాసై, స్కూలు మేష్టారు ఉద్యోగం చేసి పింఛను పుచ్చుకుంటున్న వాడు. కథలో అప్పదాసులాగా నూనెలో ముంచి తీసిన ఏకులా కాకుండా, కొంచం కండపుష్టి గానే ఉంటాడు. అక్షరాల్లో బుచ్చిలక్ష్మికి ప్రపంచాన్ని తెలుసుకునే మరో మార్గం లేదు, భర్త చెప్పే కబుర్లు వినడం ద్వారా తప్ప. కానైతే సినిమా బుచ్చిలక్ష్మి (లక్ష్మి) అలాకాదు. కట్టుకున్న వాడికి తెలియకుండా, అమెరికాలో ఉండే కొడుకులూ, మనవలతో రహస్యంగా సెల్ ఫోన్ మాట్లాడి చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకుంటూ ఉంటుంది.

గ్యాసు పొయ్యి మీద వంటచేసుకునే ఈ బుచ్చిలక్ష్మి, కొత్తని ఆహ్వానించాలనీ, మిక్సీ గ్రైండర్లు మంచివనీ భర్తతో వాదిస్తూ ఉంటుంది కూడా. అలాగని ఈ సినిమా చూడాలంటే శ్రీరమణ రాసిన కథని మర్చిపోవాల్సిన అవసరం లేదు. నిజానికి కథలో ముఖ్య సంభాషణలు, సన్నివేశాలు సినిమాలోనూ ఉన్నాయి. వాటితోపాటు కొన్ని సన్నివేశాలకి మార్పులూ, మరికొన్ని అదనపు సన్నివేశాలూ వచ్చి చేరాయి. పాటలు సరేసరి. కథగా చెప్పుకోవాలంటే, పిల్లలు విదేశాల్లో స్థిరపడిపోతే, వాళ్ళ మీద ఆధార పడడం ఇష్టం లేని ఓ వృద్ధ జంట తమ పల్లెటూరి ఇంట్లో ఒకరికి ఒకరుగా కలిసి బతకడం. ఒకే ప్రాణంగా బతికిన ఆ ఇద్దరిలో, ఒకరు తనువు చాలించినప్పుడు రెండోవారి స్పందన ఏమిటన్నది ముగింపు.

ఇది ముగ్గురి సినిమా. భరణి, బాలు, లక్ష్మి. నాటక రంగం నుంచి సినిమాకి వచ్చి రచయితగా, నటుడిగా స్థిరపడ్డాక,దర్శకుడిగా కొన్ని లఘు చిత్రాల తర్వాత భరణి తీసిన తొలి కమర్షియల్ సినిమా (నిజానికి ఈ మాట వాడకూడదేమో.. కానీ, బడ్జెట్, ప్రచారం, థియేటర్ రిలీజ్ పరంగా చూసినప్పుడు వాడాల్సిందే) ఇది. అత్యంత సహజంగానే తన మార్కుని చూపేందుకు ప్రయత్నం చేశాడు. తను చేస్తున్నది సాహసం అన్న విషయాన్నీ ఎక్కడా మర్చిపోలేదు. ప్రారంభంలో తెరపై సూర్యోదయాన్ని చూపి, ఆ సూర్యబింబాన్ని సినిమా టైటిల్ మధ్య అక్షరానికి పొట్టలో చుక్కగా రూపాంతరం చెందించగానే దర్శకుడి పనితీరు మీద మొదలైన కుతూహలం, సినిమా ఆసాంతమూ కొనసాగింది.


ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ మొదలు, 'కార్మికుల కార్యక్రమం' నుంచి 'మన్ చాహే గీత్' వరకూ అనేక కార్యక్రమాలని కథకి అనుగుణంగా వాడుకున్నాడు దర్శకుడు. ఇంతేనా, "శ్రీ సూర్య నారాయణా" "పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు" లాంటి 'వెనుకటి తరం' పాటలకీ సముచిత స్థానం దొరికింది, సందర్భానుసారంగా. చిన్న కథని - అందునా పెద్దగా మెలికలూ మలుపులూ  లేకుండా సాఫీగా సాగిపోయే కథని - సినిమాగా మలచడంలో కలిగే ఇబ్బంది భరణి కీ తప్పలేదు. ఫలితం, మొదటి సగం నింపాదిగా కదులుతున్నట్టు అనిపించడం, కథ చదవని వాళ్లకి సినిమా ఎటు పోతోందో అర్ధం కాక పోవడం.

కథలో కొన్ని సన్నివేశాలు సినిమాలో లేవు. మరికొన్ని సగం సగం మాత్రమే ఉన్నాయి. అలాగే, కథలో లేని సన్నివేశాలు కొన్ని సినిమాలో ఉన్నాయి. వీటిలో రెండు మూడు సన్నివేశాలు చూసినప్పుడు, "అరె... వీటిని కూడా కథలో చేర్చి ఉండాల్సిందే" అని శ్రీరమణ అనుకుని ఉంటారా అనిపించింది. చూడగానే నచ్చేసేది కెమెరా పనితనం. కొన్ని దృశ్యాలు గ్రీటింగ్ కార్డులని తలపించాయి. నేపధ్య సంగీతం మరికొంచం బాగా చేసి ఉండొచ్చు అనిపించింది. పాటలు బావున్నాయి. ఆడియో విని కించిత్ భయపడ్డ కాఫీ దండకాన్ని, భలే తెలివిగా దృశ్యీకరించారు. ముచ్చటగా అనిపించింది. అయితే పాటల ప్లేస్మెంట్ - మరీ ముఖ్యంగా రెండో సగంలో - విషయంలో కొంచం జాగ్రత్త తీసుకోవాల్సింది. రెండు పాటలూ వరుసగా వచ్చేశాయి.

కథలో అప్పదాసు ఆవుని తన పెరట్లో ఉంచడు, పచ్చని పెరడుకీ పాడి ఆవుకీ పొసగదని. ఆ ఆవు పాలు అందించే మిష తోనే కథకుడు అప్పదాసు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సినిమాలో, ఆవు అప్పదాసు పెరట్లోనే ఉంటుంది, ఓ అందమైన పేరుతో. ఆ ఆవు చుట్టూ అల్లిన సన్నివేశమూ బావుంది. కథలో అప్పదాసుకి చెట్లంటే ప్రాణం. కర్వేపాకు మొదలు కంద వరకూ ఎవరి మీదా ఆధార పడనవసరం లేని విధంగా ఉంటుంది ఆయన పెరడు. అంతే కాదు, "రుణానుబంధ రూపేణా..." లో చెట్టునీ చేర్చాలి అనేంత మమకారం ఆయనది. సినిమాలోనూ పచ్చని పెరడు ఉంది. కానైతే, ఆ పెరడు మధ్యలో ఇల్లు ఉంది అనే విషయం అర్ధమయ్యేలా చిత్రీకరణ ఉంటే బావుండేది. అంతే కాదు, కేవలం కూరగాయల కోసం తోట పెంచుతున్న భావన వచ్చిందే తప్ప, అప్పదాసు అసలు తత్వాన్ని తెరమీద అందరికీ చేరేలా చూపలేదు.

శ్రీరమణ కథని పక్కన పెట్టి, భరణి కథ ప్రకారం చూసినప్పుడు బాలూ, లక్ష్మీ అప్పదాసు-బుచ్చిలక్ష్మీ పాత్రల్లో ఒప్పించారు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో వారి నటన నాటకీయత వరకూ వెళ్లి, అంతలోనే వెనక్కి రావడం ప్రేక్షకుల దృష్టిని దాటిపోదు. ఇప్పటి వరకూ వాళ్ళు చేసిన సినిమాలతో పోల్చినప్పుడు చాలావరకూ 'అండర్ ప్లే' చేశారనే చెప్పాలి. భరణి కి నాటక రంగం మీద ఉన్న ప్రేమ వల్ల కావొచ్చు, నాటకీయత అయితే చాలాచోట్లే కనిపించింది - కథ నడకలోనూ, నటనలోనూ కూడా. స్క్రీన్ ప్లే విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. లోపాలని పక్కన పెడితే, వెంటాడే సినిమా ఇది. పతాక సన్నివేశం తెర మీద కనిపిస్తున్నప్పుడు, థియేటర్లో వెనుక వరుస నుంచి వెక్కిళ్ళు వినిపించాయి. కొందరి కళ్ళు, దాదాపు అందరి హృదయాలూ చెమర్చేలా సినిమా తీసిన భరణికి, నిర్మాత ఆనంద్ మొయిదా రావుకీ అభినందనలు. ఈ తరహా సినిమాలు భవిష్యత్తులో రావడం, రాకపోవడం అన్నది ఈ సినిమా విజయం మీద ఆధారపడి ఉంటుంది, కచ్చితంగా.

మంగళవారం, డిసెంబర్ 18, 2012

సుబ్బారాయుడి షష్ఠి

"హమ్మయ్య... 'పోలిస్వర్గం' అయిపొయింది కదా.. ఇంక రోజూ పొద్దున్నే లేచే పని ఉండదు..." అనుకుంటామో లేదో, సుబ్బారాయుడి షష్ఠి వచ్చేస్తుంది. ఏవిటో ఈ పండగలన్నీ ముందే చెప్పుకున్నట్టు ఒకదాని తర్వాత ఒకటి వరసగా వచ్చేస్తాయి. షష్ఠి అంటే స్నానమూ, తీత్తమూ అన్నమాట. రెండూ కూడా పక్క ఊళ్లోనే. పొద్దు పొద్దున్నే లేచేసరికే గుమ్మంలో వెంకాయమ్మ గారి బండి ఉంటుందా... అది నిండేలా బోల్డంతమంది ఆడవాళ్ళూ, పిల్లలూ ఉంటారు. ఎద్దులకి కూడా పాపం చలే కదా. మెల్లిగా నడిచీ నడిచీ పక్క ఊళ్ళో చెరువు పక్కన ఉన్న గుడికి తీసుకెడతాయి. 

మనం బండి దిగేసరికే బోల్డంత మంది పంతులు గార్లు 'సంకల్పం చెబుతామమ్మా' అంటూ ఎదురు వచ్చేస్తారు. ముందర ఎవరు అడుగుతారో వాళ్ళతో 'అలాగేనండీ' అని చెప్పాలన్న మాట. ఈ మాట కూడా పెద్ద వాళ్ళే చెప్పాలి. పిల్లలు గప్ చుప్ గా ఉండాలి. అసలే చలి చంపేస్తూ ఉంటుందా, మన పాటికి మన్ని స్నానం చేయనీయకుండా పంతులు గారు ఏవేవో మంత్రాలు చెప్పేస్తారు. ఓపక్క వణుకు వచ్చేస్తున్నా సరే, వాటిని తప్పుల్లేకుండా పలకాలి. లేకపోతే ముందర ఆయనకీ, తర్వాత అమ్మకీ కోపాలు వచ్చేస్తాయి. స్నానం గండం గడిచిపోయిందంటే, ఇంక గుళ్ళోకి వెళ్లి ప్రసాదం తెచ్చేసుకోడమే. జనం ఉంటారు కదా.. కొంచం ఆలీసం అవుతుంది.

గుడి నుంచి బయట పడేసరికి వెలుగు వస్తూ వస్తూ ఉంటుందన్న మాట. గుడి బయట అప్పుడే సైకిళ్ళ మీదా, బళ్ళ మీదా వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద మూటలు దింపుకుంటూ ఉంటారు. ఆ మూటల్లో ఏముంటాయంటే తీత్తం లో అమ్మేవి అన్నీను. అన్నట్టు, తీత్తం అంటే ఏమిటో చెప్పలేదు కదూ. బోల్డు బోల్డు జీళ్ళు, కర్జూర పళ్ళూ, బుడగలూ, రంగు కళ్ళ జోళ్ళూ, గాలికి గిరగిరా తిరిగే రంగు కాయితం పువ్వులూ, టిక్కూ టిక్కూ చప్పుడు చేసే కప్పలూ, ఇంకానేమో రంగుల రాట్నం కలర్ సోడాలు, గుండాట (ఇది కొంచం రహస్యం) ఇవన్నీ ఉండే చోటన్న మాట. గుడి ముందు నుంచి చాలా బోల్డంత దూరం ఒకదాని తర్వాత ఒకటి కొట్లు వస్తూనే ఉంటాయి.

మనం బండిలో వెడుతూ వెడుతూ బొమ్మలో అవీ ఏమేం వచ్చాయో చూసి, ఏ కొట్లో బావున్నాయో గుర్తులు పెట్టేసుకోవచ్చు. 'ఇప్పుడే కావాలీ' అని పేచీ పెట్టకూడదు. అలా కానీ పేచీ పెట్టామంటే, బండి దింపేస్తాం అంటారు పెద్ద వాళ్ళందరూ. హమ్మో... బండి దిగిపోతే ఇంకేమన్నా ఉందా? తీత్తంలో మారిపోమూ? అదే గుర్తులు పెట్టేసుకున్నాం అనుకో, మధ్యాహ్నం మళ్ళీ వస్తాం కదా.. అప్పుడు కొనుక్కోవచ్చు. ఇంచక్కా బడి ఉండదు కాబట్టి, ఇంటికి వెళ్ళాక ఆటలు ఆడుకోవచ్చు. మళ్ళీ మధ్యాహ్నం బోయినం అవ్వగానే తీత్తం ప్రయాణం ఉంటుంది కదా. "తీత్తం ఏమిటీ తీత్తం? నీ మొహం... తీర్ధం అనాలి" అని బామ్మ అంటుందనుకో.. అయినా మనకి ఎలా పలికితే అలా అనొచ్చు. చిన్న పిల్లలు అన్ని మాటలూ సరిగ్గా పలకలేరని దేవుడికి మాత్రం తెలీదూ?

తీత్తానికి రెండు రకాలుగా వెళ్ళొచ్చు. అమ్మ, అమ్మ ఫ్రెండ్సులతో అయితే నడిచి, అదే నాన్నతో అయితే సైకిలు మీద. మన ఊరి తీత్తమైతే రోజులో ఆరు సార్లో, పది సార్లో ఇట్టే వెళ్లి అట్టే వచ్చేస్తామా? ఈ తీత్తానికి మాత్రం ఒక్ఖ సారే వెళ్ళగలం. బండిలో చటుక్కున వెళ్లినట్టు అనిపిచేస్తుంది కానీ, నడిచి వెడితే యెంత దూరమో అసలు. వెళ్ళేప్పుడు, మనకి ఎదురు వస్తున్న వాళ్ళ చేతుల్లో ఉండే బూరాలూ, బొమ్మలో చూస్తూ పట్టించుకోము కానీ, ఇంటికి రాగానే మొదలవుతాయి కాళ్ళ నొప్పులు. అదే సైకిలు మీదనుకో, కాళ్ళు చక్రంలో పెట్టేయ్యకుండా జాగ్రత్తగా కూర్చోవాలి. మనం వెడుతూ వెడుతూ ఉండగా తాడుచ్చుకుని కొట్టుకునే వాడు కనిపించాడంటే తీత్తం వచ్చేసినట్టే. వాడిని చూస్తే ఎంత భయం వేస్తుందంటే, తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది. అమ్మైతే "కళ్ళు మూసుకుని నా చెయ్యి గట్టిగా పట్టుకో బాబూ" అంటుంది కానీ, అదే నాన్నైతే "మొగ పిల్లాడివి, ఏడుస్తావేంటీ?" అనేస్తారు.

ఎన్నేసి జీళ్ళో... ఎన్నెన్ని ఖర్జూరం పళ్ళో... వాటిని చూస్తూనే కడుపు నిండిపోతుంది అసలు.. కొట్ల వాళ్ళందరూ యెంత మర్యాదగా పిలుస్తారో అసలు.. వాళ్ళ కొట్లోనే కొనుక్కోమని. కానీ అలా ఎక్కడ పడితే అక్కడ కొనేసుకోకూడదు. ఈగలు లేకుండా ఉన్న కొట్టు వెతుక్కోవాలా... జీళ్ళు అప్పటికప్పుడు చేస్తూ అమ్ముతారు చూడూ, అక్కడైతే బావుంటాయి. ఖర్జూరం పళ్ళ మీద బెల్లం నీళ్ళు చిలకరించి అమ్మేస్తూ ఉంటారు. అది పసికట్టుకోవాలి. మనం యెంత జాగ్రత్తగా ఎంచినా బామ్మ ఏదో ఒక పేరు పెట్టకుండా ఉండదనుకో. అయినా, అమ్మ చెప్పినట్టు డబ్బులు పోసి కొంటున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. తీత్తంలో కళ్ళజోళ్ళు యెంత బావుంటాయో అసలు. ఎన్ని రంగులో.. ఎరుపూ, నీలం, ఆకుపచ్చా, పసుప్పచ్చా... మనకైతే అన్నీ తలోటీ కోనేసుకోవాలి అనిపించేస్తుంది కానీ, ఒకటి కన్నా కొనుక్కోడానికి ఉండదు.

పేరుకి బోల్డన్ని కొట్లు ఉంటాయి కానీ అన్నీ చూడ్డానికి ఉండదు. పెద్దవాళ్ళు ఎక్కడికి వెడితే మనమూ అక్కడికే వెళ్ళాలి. లేకపోతే మారిపోతాం కదా. పోలీసులు ఒకళ్ళు తెగ తిరుగుతూ ఉంటారు. నేనెప్పుడూ చూడలేదు కానీ, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారుట తీత్తంలో. నాన్నైతే బరబరా తీసుకొచ్చేస్తారు, రెండో మూడో బొమ్మలు కొనిపెట్టి. అమ్మతో అయితే తిరగొచ్చు కానీ, ఊరిఖే చూడాలి అంతే. బతిమాలినా ఏమీ కొనిపెట్టదు. "ఎందుకూ.. రేపటికి విరగ్గొట్టేస్తావ్" అంటుంది పైగా. ఏవీ కొనుక్కోక పొతే ఫ్రెండ్సులకి ఏం చూపించాలీ? వాళ్ళందరూ నవ్వరూ?? ఏవిటో..ఇంత పెద్దైనా ఏమీ తెలీదు. ఆ ఏడాది తీత్తానికి నాన్నతో వెళ్లాను కదా... తిరిగొస్తూ "ఎందుకు నాన్నా సుబ్బారాయుడి తీత్తం ఇంత దూరంగా ఉంటుందీ?" అని అడిగా. "ఇదీ ఓ దూరమే? వచ్చే ఏడు నుంచీ నీ బడి ఇక్కడే.. రోజూ రావాలి. మనూళ్ళో హైస్కూలు లేదు కదా మరి" అనేశారు

మంగళవారం, నవంబర్ 27, 2012

బీన్స్ కూరలు...

ఆ మధ్య ఎప్పుడో ఓ సందర్భంలో బ్లాగు మిత్రులొకరు సింపుల్ గా చేసుకోగలిగే వంటల గురించి రాస్తే బావుంటుంది అన్నారు. ఇప్పటివరకూ పులిహోర, నూడుల్స్, ఉప్మా మరియు స్నాక్స్ గురించి అప్పుడప్పుడూ చెప్పుకున్నాం కదూ. ఇవాళ కూరల సంగతి చూద్దాం. అంటే మొత్తం అన్ని కూరల గురించీ కాదు, ఇంగ్లీష్ కూరలైన బీన్స్, కేరట్, టమాటాలతో తక్కువ టైంలో, తక్కువ శ్రమతో, వీలైనంత రుచిగా చేసుకోగలిగే కూరల కబుర్లు అన్నమాట. పదండి, అలా వంటింట్లోకి వెళ్లి మాట్లాడుకుందాం.

శీతాకాలం వచ్చేసింది కదా, నాలుక కొంచం ఖారం ఖారం, ఘాటు ఘాటు రుచులు కోరుకుంటుంది. అల్లం, పచ్చిమిర్చీ ఉన్నది అందుకే కదూ. ఆ రెంటినీ సన్నగా తరిగి పక్కన పెట్టండి ముందు. బీన్సూ, కేరట్టూ ఒకే సైజు ముక్కలు కోసేసుకుంటే మరో పని కూడా అయిపోతుంది. కుక్కర్లో బియ్యం ఎలాగూ పెడతారు కదూ, ఆ గిన్నె మీద మూత పెట్టేసి ఈ బీన్సు, కేరట్టు ముక్కలని మూత మీద సద్దేసి, ఓ చిటికెడు పసుపు జల్లేసి, కుక్కరు మూత బిగించి స్టవ్ మీదకి ఎక్కించేయండి. నాలుగంటే నాలుగే విసిల్స్ రానిచ్చి, స్టవ్ కట్టేయండి.

ఇయర్ ఫోన్స్ లో కనుక ఆర్.నారాయణమూర్తి పాటల్లాంటివి వస్తూ ఉంటే, అర్జెంటుగా మార్చేసి ఇళయరాజాకో, కేవీ మహదేవన్ కో షిఫ్ట్ అయిపోండి ముందు. ఇప్పుడు బాండీని రెండో స్టవ్ మీద పెట్టి, కించిత్ వేడెక్కాక ఓ చెంచాడు నూనె పోయండి. మరీ ఎక్కువ అక్ఖర్లేదు. నూనె తగుమాత్రం వేడెక్క గానే, తరిగి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి, ఓ వేపు రానిచ్చి, పచ్చిమిర్చి చేర్చండి. ఇవి వేగుతూ ఉండగా శనగపప్పు, చాయ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కాసిన్ని మెంతులు చేర్చి వేగనివ్వండి. గరిటతో కదుపుతూ ఉండక్కర్లా.. ఈలోగా టమాటాలు ముక్కలు కోసుకుని, బాండీ లోకి జార విడవొచ్చు.


టమాటా ముక్కలు వేసేశాక బాండీ మీద మూత పెట్టి, వింటున్న పాట సగం అవ్వగానే ఆ మూత తీసేయాలి. టమాటా ముక్కలు ఇట్టే మెత్తబడతాయన్న మాట. కుక్కర్ చల్లారింది కదా. జాగ్రత్తగా విసిల్ తీసేసి, ఒక్క క్షణం ఆగి మూత తీసి, మరో క్షణం ఆగి, ఆవిరి బయటికి పోగానే ఉడికిన బీన్సూ, కేరట్టూ ముక్కలని గరిటె సాయంతో బాండీలోకి బదలాయించాలి. ఓ తిప్పు తిప్పేసి, బాండీ మీద మూత పెట్టేయాలి. బాండీలో తడి తక్కువగా ఉన్నట్టాయనా, మూత మీద కాసిన్ని నీళ్ళు చిలకరించాలి. ఈ బ్రేక్ లో కొత్తిమీర సంగతి చూద్దాం. రెండు తాజా మొక్కలు తీసుకుని, ఓసారి కడిగేసి వేళ్ళు కోసి పడేసి, నీళ్ళు పిండేసి మిగిలింది సన్నగా తరిగి పెట్టుకోవాలి.

కొత్తిమీర పని అయ్యాక, బాండీ మూత తీసి, కూర ఓసారి కలిపి, ఉప్పు వేసి మళ్ళీ కలిపి, మళ్ళీ ఓ క్షణం మూత పెట్టి తియ్యాలి. రుచికి కావలిస్తే ఓ పావు స్పూను చక్కర కూడా చేర్చుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు కొత్తిమీర జల్లేసి, మరో క్షణం మూత పెట్టి ఉంచి, స్టవ్ కట్టేయడమే. ఒకవైపు వేడన్నం, మరోవైపు వేడి వేడి కూర...మధ్యలో నేనెందుకు చెప్పండి? కూర వండగా మిగిలిన బీన్సూ, కేరట్టూ రెండు రోజులకి వాడు మొహం వేసేస్తాయి. అలాగని రేపు కూడా ఇదే కూర తినలేం కదా.. ఉపాయం లేని వాడిని ఊరి నుంచి తరిమేయమని సామెత.. ఊళ్ళో ఉండడం కోసం ఉపాయాలు సిద్ధం పెట్టుకుని ఉండాలన్న మాట. ఇదే కూరని మరో రుచి వచ్చేలా చేసుకోడం ఎలాగో చూద్దాం ఇప్పుడు.

అల్లం, పచ్చిమిర్చీ బదులుగా ఎండు మిరపకాయలని తీసుకుని ముక్కలుగా తుంపుకోండి. ఒక స్పూను నూనె సహితంగా బాండీ వేడెక్కగానే, ముందుగా ఎండుమిర్చి ముక్కలని వేగనివ్వండి. అవి వేగుతూ ఉండగానే శనగపప్పు, చాయ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులూ మామూలే. ఇవి వేశాక టమాటా ముక్కల కన్నా ముందు కాసిన్ని ఉల్లిపాయ ముక్కలు చేర్చండి. ఈ ఉల్లి ముక్కలు బంగారు వర్ణంలోకి వేగాక (వేలికి ఉన్న ఉంగరాన్నీ, వేగుతున్న ఉల్లిపాయ ముక్కలనీ మార్చి, పోల్చి, చూడక్కర్లేదు) అప్పుడు టమాటా ముక్కలు చేర్చండి. కొత్తిమీర గార్నిష్ తో సహా మిగిలిన విధానంలో ఏ మార్పూ లేదు. వేడి వేడి కూర వడ్డించుకుని రుచిలో తేడా గమనించడం మర్చిపోకండి.

జెండాకూర అనీ, అదికూడా చేసేసుకోవచ్చు కాసిన్ని బంగాళా దుంప ముక్కలు చేర్చుకుని. కుక్కర్లో పెట్టేప్పుడే బీన్సూ, కేరట్టూ ముక్కలతోపాటు, చెక్కు తీసిన బంగాళా దుంపల ముక్కలు కూడా చేర్చేసుకుని, పసుపు వేయకుండా ఊరుకోవాలి. అల్లం పచ్చిమిర్చీ తో అయితే ఉల్లి లేకుండానూ, ఎండుమిర్చి కారం అయితే ఉల్లి చేర్చీ రెండు రకాలుగానూ చేసేసుకోవచ్చు కూరని. గార్నిష్ కూడా కొత్తిమీర బదులు, పుదీనా ప్రయత్నించవచ్చు, ఇష్టమైతేనే సుమా. ఈ కూరలు కేవలం అన్నంలోకి మాత్రమే కాదు, చపాతీలు, రొటీల్లోకి కూడా భలే బావుంటాయి. అన్నట్టు, కేవలం చపాతీల కోసం చేసుకునే కూరలు ఉన్నాయి. వాటి విషయాలు మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం.  రుచి గలదని మిక్కిలి తినరాదు కదా మరి.

గురువారం, నవంబర్ 01, 2012

ఓ జ్ఞాపకం... కృష్ణశాస్త్రిది...

"లిఫ్టు కావాలి సార్"
"చంద్రంపాలెం వెడుతున్నాం"
"మా ఊరేనండి.. థాంక్సండీ బాబూ.. రెండు కిలోమీటర్లు నడవాల్సొచ్చేది.."
"ఎవరింటికి మీరు?"
"ఉహు... ఎవరింటికీ కాదు.. ఊరికే...ఊరు చూద్దామని.."
"నిజం చెప్పండే.. ఊరికే మా ఊరు ఎవరొస్తారు?"


"మీ ఊళ్ళో స్కూలు ఉంది కదండీ.. అది చూద్దామని.."
"దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి స్కూలు..."
"ఓహ్.. ఆయన పేరు తెలుసా మీకు?"
"అయ్ బాబోయ్... ఏటా ఆయన పుట్టిన్రోజు సేత్తాం కదండీ.. ఆయాల అన్నీ ఆయన పాటలే ఏస్తాం మైకులో... 'గోరింటా పూసింది కొమ్మాలేకుండా..' ఇంకా సాలా పాటలు.."
"బాగా పాడుతున్నారు.. పాడండి.. పాడండి.."
"అంత బాగా రావండి.. 'ఆకులో ఆకునై.. కొమ్మలో పువ్వునై.."
"కొమ్మలో కొమ్మనై అండీ.. పాడండి..."
"ఆరు బేమ్మలు కామోలు.. మీరు గానీ సుట్టాలా?"
"కాదండీ.. ఆయన ఇల్లు చూద్దామని వెళ్తున్నాం"
"ఆయన ఇల్లే స్కూలికి ఇచ్చేశారండి.. అక్కడే ఇగ్రహం కూడా పెట్టావండి, ఆయంది.. ఆరి పిల్లలూ గట్రా ఒచ్చారండి అప్పుడు .."
"మీ వయసు చూస్తే, ఆయన పేరు కూడా మీకు తెలిసి ఉండకపోవచ్చు అనిపించింది"
"నిజం సెప్పాలంటే తెల్దండి.. ఇగ్రహం పెట్టాక, పుట్టినరోజులు సేత్తన్నారు కదండీ.. అప్పట్నుంచీ తెలుసు"
"మీరు...?"
"ఈరబాబంటారండి. కాకినాట్లో పెట్రోలు బంకులో సేత్తన్నానండి.. రోజూ ఎల్లొస్తా ఉంటాను..ఊళ్ళో సొంతిల్లండి.."
"పిఠాపురం రాజా వారికీ కృష్ణ శాస్త్రి గారికీ మంచి స్నేహం ఉండేదంటారు?"
"తెల్దండీ.. ఇప్పుడారి కోటా లేదక్కడ.. ఏయో గుర్తులు మాత్రం ఉన్నాయ్ లెండి..."
"భలేగా ఉందండీ మీ ఊరు.. పచ్చగా..."


"ఈ ఊరు చూసే రాసుంటారండి.. 'మేడంటే మేడా కాదూ...' భలే పాట కదండీ.."
"మీకు కృష్ణశాస్త్రి గారి పాటలన్నీ నోటికి వచ్చేసినట్టే ఉన్నాయే.."
"అంటే మరి, ప్రెతి సంవత్సరం ఆయన పుట్టిన్రోజుకి మైకులో ఈ పాటలే ఏసుకుంటాం కదండీ...కానీ, మాకు పెద్ద బాగోందండి ఊరు..రోడ్డు సరింగా లేదు.. ఆటోలు కూడా గమ్మున్రావు..కానైతే, అయన వల్ల పేరండి.. "
"బయటి నుంచి వచ్చిన వాళ్ళకే నచ్చుతుందన్న మాట అయితే..."
"అంతేనండి... ఇక్కడోసారి ఆపండి.. నే దిగుతాను.. తిన్నగా ఎల్లి, సెంటర్లో లెఫ్టు తిరగండి.. స్కూలు కనిపిత్తాది.. అక్కణ్ణుంచి మీరు తిన్నగా ఎల్లిపోవచ్చు.. ఆ రోడ్డు బాగుంటాది దీనికన్నా.."


"థాంక్స్ అండీ.."
"అయ్ బాబోయ్.. ఎంతమాటా.. నేను చెప్పాలండి.. మీరు లేకపోతే నడుచుకుంటా రావాల్సొచ్చును ఇంతదూరం.." 

(తెలుగునాట భావకవితకి పర్యాయపదంగా నిలిచిన దేవులపల్లి  వేంకట కృష్ణశాస్త్రి జయంతి నేడు)

మంగళవారం, అక్టోబర్ 30, 2012

రెండు సన్నివేశాలు

మనకి ప్రియమైన వ్యక్తిని మరొకరికి అప్పగించడం అన్నది ఎంతో వేదనతో కూడుకున్న విషయం. ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడూ, ఆపై అప్పగింతలప్పుడూ తల్లి మాత్రమే బాధ పడదు. తండ్రి కూడా బాధ పడతాడు. నిజానికి తల్లి కన్నా ఎక్కువే బాధ పడతాడు కానీ, బయట పడడు. మన సమాజం మగవాడికి విధించిన కనిపించని కట్టుబాట్ల ఫలితం ఇది. తాళి కట్టిన భార్యనో, పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న ప్రియురాలినో మరొకరికి శాశ్వతంగా అప్పగించాల్సిన పరిస్థితే వస్తే, ఆ మగవాడి పరిస్థితి వర్ణనాతీతమే.

వెండితెర సాక్షిగా రెండు సన్నివేశాలు. రెంటినీ రూపు దిద్దిన దర్శకుడు ఒక్కరే. కళాతపస్వి కే. విశ్వనాథ్. రెండు సినిమాలూ ఏడాదిన్నర తేడాతో విడుదలై, ప్రేక్షకుల మీద తమవైన ముద్ర వేసినవే. వీటిలో మొదటిది 'సప్తపది.' వర్ణ వ్యవస్థని ఇతివృత్తంగా తీసుకుని విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఓ సద్బ్రాహ్మణ నాట్యాచార్యుడి కూతురు హేమ ఓ నర్తకి. తన బృందంలోని వేణు గాన కళాకారుడు హరిబాబుతో ప్రేమలో పడుతుంది ఆమె. తన ప్రేమని వ్యక్త పరిచాక, హరిబాబు ఓ హరిజనుడనీ, తన ప్రేమకోసం కులాన్ని దాచిపెట్టాడనీ తెలుస్తుంది హేమకి. అయినా ఆమె ప్రేమలో ఏ మార్పూలేదు.

హేమ మాతామహుడు యాజులు గారికి కులం పట్టింపు ఎక్కువ. స్వకులం వాడే అయినా అల్లుడు నాట్యాచార్యుడు కావడంతో కూతురి పెళ్లి అభ్యంతరం ఆయనకి. కూతురు మరణించినా రెండు కుటుంబాల మధ్యనా దూరం అలాగే ఉంటుంది. హేమ నాట్య ప్రదర్శన చూసిన యాజులు గారి ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుంది. స్నేహితుడు రాజు గారు కూడా ఇందుకు కొంత కారణం. హేమని తన మనవడు (కొడుకు కొడుకు) గౌరీనాధానికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. కూతురి ప్రేమ విషయం తెలియని హేమ తండ్రి, ఆమెతో సంప్రదించకుండానే పెళ్ళికి అంగీకరిస్తారు.

పరంపరాగతంగా వచ్చిన అర్చక వృత్తిలో స్థిరపడ్డ గౌరీనాధుడు, తాతగారి మాటప్రకారం హేమని పెళ్లి చేసుకుంటాడు. కానీ కాపురం చేయలేకపోతాడు. ఆమె భార్యగా కాక తను పూజించే పర దేవతగా కనిపిస్తుంది అతనికి. కారణాలు అన్వేషిస్తుండగా, హేమ ప్రేమ విషయం తెలుస్తుంది అతనికి. హరిబాబుని తీసుకు వచ్చి అతనికి హేమని అప్పగిస్తాడు. ఊరివారిని ఎదిరించి మరీ, మనవడి నిర్ణయాన్ని సమర్ధిస్తారు యాజులు గారు. సినిమా ముగింపు సన్నివేశంలో, హరిబాబుని పడవలో తీసుకు వచ్చిన గౌరీనాధం, తను మాత్రం ఒడ్డునే నిలబడి ఉంటాడు. మంగళ వాయిద్యాలు, చీర సారెలతో తాతయ్య వెంట రేవుకి వస్తుంది హేమ.

తాతయ్య కాళ్ళకి నమస్కరించి సెలవు తీసుకుని, పడవలో ఉన్న తను ప్రేమించిన వాడిని చేరుకోవాలి ఆమె. రేవు ఒడ్డున తనకి తాళి కట్టినవాడు. అగ్నిసాక్షిగా పెళ్ళాడినా భర్త కాలేక పోయినవాడు. అయినప్పటికీ, తన మనసు తెలుసుకున్న వాడు. అతని నుంచి వీడుకోలు తీసుకోడం ఎలా? అప్పటికే కొంగు భుజం చుట్టూ కప్పుకున్న హేమ తల వంచుకునే నమస్కరిస్తుంది గౌరీనాధానికి. ఒక్కసారి కళ్లెత్తి, రెండు చేతులూ పైకెత్తి నవ్వుతూ తనని ఆశీర్వదిస్తున్న గౌరీనాధాన్ని చూస్తుంది. హేమకే కాదు సినిమా చూస్తున్న ప్రేక్షకులకి కూడా ఆ క్షణంలో గౌరీనాధుడు గాలిగోపురం అంత ఉన్నతంగా కనిపిస్తాడు.


'సప్తపది' విడుదలైన రెండేళ్ళ లోపుగానే కళాతపస్వి నుంచి వచ్చిన మరో కళాత్మక చిత్రం 'సాగర సంగమం.' కథా నాయకుడు బాలూ, నాట్యాన్ని ప్రేమించిన వాడు. నాట్యాన్ని తప్ప మరి దేనినీ ప్రేమించని వాడూను. అంతటి వాడూ మాధవి ప్రేమలో పడతాడు. ఆమె తన పక్కన ఉంటే చాలు అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా ఆమెకి తన ప్రేమని ప్రతిపాదిస్తాడు. మాధవి వివాహిత. తాళి కట్టిన భర్త గోపాలరావు ఆమెని ఏలుకోలేదు. పెళ్లి పీటల మీదే వదిలేసి వెళ్లి పోయాడు. ఆమె ఆ గాయాన్ని మాన్పుకునే ప్రయత్నంలో ఉండగానే బాలూ పరిచయమయ్యాడు.

బాలూ ప్రతిపాదనని మాధవి అంగీకరించ బోతున్నతరుణంలో ఆమె జీవితంలో తిరిగి ప్రవేశిస్తాడు గోపాలరావు. బాలూ-మాధవిల ప్రేమని గ్రహిస్తాడు అతడు. నిండు మనసుతో వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలనీ అనుకుంటాడు కూడా. వాళ్ళని ఒకటి చేసి తను కెనడా వెళ్లిపోవాలి అన్నది అతని ఆలోచన. కానీ, బాలూ ఆలోచన వేరు. ప్రేమ కన్నా తాళికి విలువ ఇవ్వాలి అనుకుంటాడు. మాధవి, గోపాలరావుకి చెందడమే న్యాయం అనుకుంటాడు. అందుకు ఆమెని ఒప్పిస్తాడు. మాధవి, కాపురానికి కెనడా వస్తోందని గోపాలరావుకి చెబుతాడు.

ఆవేళ మాధవి ప్రయాణం. రైల్లో లగేజీ సద్దుకుంటూ ఆమె, టికెట్ కలెక్టర్ తో మాట్లాడుతూ ఆమె భర్త. అప్పుడు స్టేషన్ కి వస్తాడు బాలూ. చేతిలో ఓ కెమెరా. తనకి మాధవిని పరిచయం చేసిన కెమెరా. గోపాలరావుని అనుమతి కోరతాడు, ఫోటో కోసం. బాలూ, మాధవితో ఫోటో దిగుతాడనుకుని అందుకు సమ్మతిస్తాడు గోపాలరావు. కానీ, బాలూకి కావాల్సింది మాధవి-గోపాలరావుల ఫోటో. అతను ఫోటో తీసుకున్నాక రైలు కదలడానికి సిద్ధ పడుతున్న వేళ, బోగీ గుమ్మంలో భర్త పక్కన నిలబడి బాలూకి నమస్కరిస్తుంది మాధవి. ఆమె కళ్ళలో కనిపించేది కృతజ్ఞత మాత్రమేనా?

మరి బాలూ స్పందన ఏమిటి? తను చేసిన పని మంచిదనే అతను అనుకుంటున్నాడు. కానీ, ఆ పని మనస్పూర్తిగా చేశాడా? మాధవిని వదులుకోడానికి అతను సిద్ధంగానే ఉన్నాడా? ఆ క్షణంలో బాలూని చూసిన ప్రేక్షకులకి అతని మీద జాలీ, బాధా, కోపమూ ఏకకాలంలో కలుగుతాయి. రైల్లో వెళ్ళిపోయిన మాధవి, స్టేషన్లో మిగిలిపోయిన బాలూ చెరగని ముద్ర వేసేస్తారు ప్రేక్షకుల మనసుల్లో.


ఈ రెండు సన్నివేశాల్నీ తెరకెక్కించిన విశ్వనాథ్ ని మాత్రమే కాదు, రెండు సినిమాలకీ సంభాషణలు అందించిన జంధ్యాలనీ అభినందించి తీరాలి. ప్రత్యేకించి ఈ రెండు సన్నివేశాలకీ ఎలాంటి సంభాషణలూ రాయనందుకు.. మాటల కన్నా, మౌనమే శక్తివంతంగా పని చేసే సందర్భాల్ని గుర్తించినందుకు...

(టపా ఆలోచనని ప్రోత్సహించి, ఫోటోలు సమకూర్చిన బ్లాగ్మిత్రులు కొత్తావకాయ గారికి కృతజ్ఞతలు...)

సోమవారం, అక్టోబర్ 29, 2012

నిర్జన వారధి

"ఓ మనిషికి జీవితం ఇన్ని పరిక్షలు పెట్ట గలదా?" అనిపించింది ఆమె ఆత్మకథ చదువుతుంటే. అంతకు మించి, వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డ ఆమె స్థైర్యం ఆశ్చర్యాన్ని కలిగించింది. పుస్తకం ముగించి పక్కన పెడుతుంటే, తొంభై రెండేళ్ళ కొండపల్లి కోటేశ్వరమ్మ మూర్తి పర్వతమంత ఎత్తున కనిపించింది. మనసులో ఆమెకి నమస్కరించ కుండా ఉండలేక పోయాను. ఈమధ్య కాలంలో మళ్ళీ మళ్ళీ చదివిన ఆ పుస్తకం పేరు 'నిర్జన వారధి.' లోతైన, బరువైన కథనం.. పుస్తకం పేరులాగే.

'నిర్జన వారధి' చదవక మునుపు నాకు తెలిసిన కోటేశ్వరమ్మ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త. పార్టీలో కొంతకాలం పనిచేసి, తర్వాత నక్సల్బరీ ఉద్యమంలోకి వెళ్ళిన కొండపల్లి సీతారామయ్య భార్య. ఈ రెండు పాత్రలూ ఆమె జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసి ఉంటాయో, ఎన్ని పరిక్షలు పెట్టి ఉంటాయో, ఎన్నెన్ని మలుపులు తిప్పి ఉంటాయో అన్న ఆలోచన ఎప్పుడూ కలగలేదు. అందుకే కావొచ్చు, ఈ పుస్తకం ద్వారా నాకో సరికొత్త కోటేశ్వరమ్మ పరిచయం అయ్యారు.

ఇద్దరు పిల్లలు పుట్టాక, కట్టుకున్న భర్త కారణం చెప్పకుండా వదిలేసినా, ఏ పార్టీ కోసమైతే తను ప్రాణాలకి తెగించి బలవంతపు గర్భ స్రావానికి సిద్ధ పడిందో ఆ పార్టీయే తనని వదులుకునే పరిస్థితులు వచ్చినా, తోడు నిలబడాల్సిన పిల్లలు, అండగా నిలిచిన కన్నతల్లి ఒకరి తర్వాత ఒకరుగా తన కట్టెదుటే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా...ఇవన్నీ తట్టుకుని నిలబడ్డమే కాదు, తనకంటూ ఓ జీవితాన్ని నిర్మించుకుని నిలదొక్కుకున్న మహిళ ఆమె.

కృష్ణా జిల్లా పామర్రులో ఓ సంప్రదాయ కుటుంబంలో 1920 లో జన్మించారు కోటేశ్వరమ్మ. ఆమె ఆమెకి ఓ తమ్ముడు. తండ్రికి ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఉండేది. చదువుతో పాటు, ఆటపాటల్లో చురుగ్గా ఉండే ఆమెకి తానో బాల వితంతువుననే విషయం యవ్వనారంభంలో తెలిసింది. ఆమెకి పునర్వివాహం చేయాలన్న తల్లిదండ్రుల తలంపుకి స్నేహితుల ప్రోత్సాహం, బంధువుల విమర్శలు వీటన్నింటినీ ఏక కాలంలో గమనించింది. అంతే కాదు, అటు గాంధీ మహాత్ముడి సత్యాగ్రహ ఉద్యమాన్ని కళ్ళారా చూసి, తన నగలని మహాత్ముడికి సమర్పించడంతో పాటు, ఇటు కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.


సీతారామయ్య తో వివాహం జరిగాక, అతని ప్రోత్సాహంతో, అత్తమామల ఇష్టానికి వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన కోటేశ్వరమ్మ, కృష్ణా జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ మహిళా విభాగాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషించారు. ఇద్దరు పిల్లలు కలిగాక, పార్టీ కార్యకలాపాల మీద ప్రభుత్వం నిషేధం విధించిన సందర్భంలో, పార్టీ ఆదేశాల మేరకు పిల్లలని తన తల్లి రాజమ్మ దగ్గర వదిలి అజ్ఞాత జీవితం గడిపారు. పార్టీ ఆదేశం మేరకే గర్భం వద్దనుకుని, మృత్యువుతో పోరాడి గెలిచారు.

పార్టీ మీద ఉన్న నిషేధం తొలగే సమయానికి ఆమె వ్యక్తిగత జీవితంలో సమస్యలు చుట్టుముట్టాయి. సీతారామయ్య జీవితంలో మరో స్త్రీ ప్రవేశించడం, అతను పార్టీకి దూరం జరగడం, సిద్ధాంత పరమైన కారణాలతో పార్టీ రెండు ముక్కలు కావడం దాదాపు ఒకేసారి జరిగిన సంఘటనలు. ఆ కష్ట కాలంలో, అప్పటి వరకూ కలిసి పనిచేసిన పార్టీ సహచరులతో కూడా రహస్యంగా మాట్లాడాల్సిన పరిస్థితి. సీతారామయ్య సొంత పార్టీ నిర్ణయం ఒకపక్కా పార్టీ లో చీలిక మరోపక్కా... ఈ రెండూ ఆమెకి సంబంధం లేని విషయాలే అయినా, ఆమె జీవితం మీద ఇవి చూపిన ప్రభావం మాత్రం తక్కువది కాదు.

పిల్లలని తల్లి సంరక్షణలో ఉంచి, ముప్ఫై ఐదేళ్ళ వయసులో ఆంద్ర మహిళా సభలో చేరి చదువు నేర్చుకుని, అటుపై ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్న కోటేశ్వరమ్మ ఆ తర్వాత ఎదుర్కొన్న ఆటుపోట్లూ తక్కువవి కావు. కొన్ని కొన్ని సంఘటనలు చదువుతుంటే "అసలు వీటిని తట్టుకుని ఈమె ఎలా నిలదొక్కుకో గలిగారు?" అన్న సందేహం కలగక మానదు. తన కథ మొత్తాన్నీ ఎంతో ప్రశాంతంగా చెప్పారు కోటేశ్వరమ్మ. ఎక్కడా, ఎవ్వరినీ తూలనాడలేదు. కారణం ఏమీ చూపకుండానే తనని నడి రోడ్డున వదిలేసిన భర్తని గురించీ, పార్టీని గురించీ చెప్పినప్పుడూ, తన సంసార జీవితంలో ప్రవేశించిన మూడో వ్యక్తిని గురించి ప్రస్తావించి నప్పుడూ అదే సంయమనం.

"మగవాళ్ళు అందరూ ఒకటే. కానీ పార్టీలో మగవాళ్ళు మిగిలిన వాళ్ళ కన్నా కొంచం నయం" అని చెప్పినా, సీతారామయ్య కి కేవలం 'ఉద్యమ సహచరుడి' గానే కడపటి వీడ్కోలు ఇచ్చినా వాటన్నింటి వెనుకా ఉన్నవి ఆమె అనుభవాలే అని సులభంగానే బోధ పడుతుంది. కోటేశ్వరమ్మ తర్వాత అంతగా ఆకట్టుకునే మరో వ్యక్తి ఆమె తల్లి రాజమ్మ గారు. బాల వితంతువైన కూతురు లోకం బాధ పడలేక బొట్టూ పూలూ తీసేస్తే, ఆమె కోసం పునిస్త్రీ అయి ఉండీ తను కూడా వాటిని త్యజించడం మొదలు, సిద్ధాంతాలు ఏవీ తెలియక పోయినా తను దాచుకున్న కొద్దిపాటి మొత్తాన్ని మరణానంతరం పార్టీకి చెందేలా చేయడం వరకూ...ఆమె చేసిన ప్రతి పనీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

'నిర్జన వారధి' కేవలం కోటేశ్వరమ్మ ఆత్మకథ మాత్రమే కాదు, గడిచిన తొంభై ఏళ్ళలో ఆంధ్ర దేశంలో జరిగిన అనేక ఉద్యమాలని, సమాజంలో వచ్చిన మార్పులనీ ఆ మార్పులు రావడం వెనుక కారణాలనీ ఆవిష్కరించే పుస్తకం. జీవితం పట్ల భయాలు ఉన్న వాళ్లకి కావలసినంత ధైర్యాన్ని అందించే పుస్తకం. కాల పరీక్షలకి తట్టుకుని నిలబడి, జీవితంతో పోరాడి గెలిచిన ఓ యోధురాలి స్పూర్తివంతమైన గాధ. తొలి ప్రచురణ జరిగిన నెల రోజులకే మలి ప్రచురణ పనులు మొదలైన పుస్తకం ఇది. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన 'నిర్జన వారధి' (పేజీలు 179, వెల రూ. 100) అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది.

మంగళవారం, అక్టోబర్ 02, 2012

తెలుగు కథల్లో గాంధీ దర్శనం

కథా సాహిత్యం, మిగిలిన సాహిత్య ప్రక్రియలకన్నా భిన్నమైనది. కథల్లో కల్పన ఉంటుంది, కానీ కేవలం కల్పన మాత్రమే ఉండదు. వాస్తవానికి, కల్పన జోడిస్తే అది కథ అవుతుంది. తెలుగునాట నడుస్తున్న చరిత్రని రికార్డు చేయడంలో కథా సాహిత్యం పాత్ర తక్కువదేమీ కాదు. స్వాతంత్ర సంగ్రామం నేపధ్యంగా వచ్చిన కథలే ఇందుకు ఉదాహరణ. శాంతిని, అహింసనీ ఆయుధాలుగా మలుచుకుని స్వతంత్ర పోరాటాన్ని నడిపించిన మహాత్మా గాంధీని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒక పాత్రగా చేసుకుని రచించిన కథల సంకలనమే 'తెలుగు కథల్లో గాంధీ దర్శనం.'

విశ్వనాథ సత్యనారాయణ మొదలు, దాదా హయత్ వరకూ మొత్తం పదకొండు మంది రచయితలు రాసిన పన్నెండు కథలని సంకలనంగా కూర్చిన వారు తెలుగు కథకి కొత్త వెలుగులద్దిన 'దామల్ చెరువు' అయ్యోరు మధురాంతకం రాజారాం. 1986 లో రూపుదిద్దుకున్న ఈ సంకలనాన్ని, కృష్ణా జిల్లా అవనిగడ్డకి చెందిన 'గాంధీ క్షేత్రం' 2008 లో మార్కెట్లోకి తెచ్చింది, ఎమెస్కో సౌజన్యంతో. కొన్ని కథలు స్వతంత్ర సంగ్రామం నేపధ్యంతో వచ్చినవి కాగా, మరికొన్ని గాంధీ శతజయంతి (1969) సందర్భంగా వెలువడ్డవి. 

'జీవుడి ఇష్టము' ఈ సంపుటిలో మొదటి కథ. విశ్వనాథ వారి రచన. ఒక నియంతకూ, అతడు చెరబట్టిన ఓ వివాహిత స్త్రీకి మధ్య జరిగే కథ ఇది. నియంత ఆమెని బెదిరించినా, భయపెట్టినా, పదే పదే చెరిచినా తన భర్తని జ్ఞాపకం చేసుకోడం మానదు ఆమె. "మీకు తుపాకులున్నవి, కత్తులున్నవి, అతనికి ఏమీ లేవు. అయినా తన భార్యను, పిల్లలను రక్షించుకునేందుకు కర్ర పుచ్చుకొని నిలబడ్డాడు. రక్షించ లేనని తెలుసు. అయినా తన ధర్మం తాను చేశాడు. తాను చచ్చిన తరువాతగాని నిన్ను నాదగ్గరకు రానీయలేదు" అంటుందామె.

కరుణకుమార రాసిన రెండు కథలు 'పోలయ్య' 'ఉన్నతోద్యాగాలు' చోటు సంపాదించుకున్నాయి ఈ సంకలనంలో. గతుకుల రోడ్డు మీద బండి ప్రయాణాన్ని పాఠకులకి అనుభవంలోకి తెచ్చే కథ 'పోలయ్య.' రచయిత ఈ కథకి ఇచ్చిన మెరుపు ముగింపు వెంటాడుతుంది చదువరులని.  'ఉన్నతోద్యాగాలు' కథ ముగింపు కించిత్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అప్పటివరకూ ఒక పంధా లో సాగిన కథ, ముగింపు కోసం మార్గాన్ని మార్చుకున్నట్టుగా అనిపిస్తుంది. గాంధీ శిష్యుడు, ఆధునిక భావాలు ఉన్నవాడూ అయిన నారాయనప్ప గారి చదువుకున్న భార్య సుశీల, ఆ ఊరికి కొత్తగా వచ్చిన బ్రిటిష్ పోలీసాఫీసర్ సులేమాన్ ల మధ్య మొలకెత్తిన ప్రణయం, చలం రాసిన 'సుశీల' కథ. 'మైదానం' ఛాయలు కనిపిస్తాయిందులో.


కొనకళ్ళ వేంకటరత్నం రాసిన 'చివరికి మిగిలిన రంగడు' వెంటాడే కథ. అస్పృశ్యత వ్యతిరేక ఉద్యమం నేపధ్యంగా సాగిన రచన ఇది. ఎక్కడా ఆపకుండా చదివించే మరో కథ అడివి బాపిరాజు రాసిన 'వడగళ్ళు.' స్వతంత్ర పోరాటం నేపధ్యంగా వచ్చిన కథ ఇది. గాంధీజీ మరణాన్ని చిత్రించిన కథ అమరేంద్ర రాసిన 'సమర్పణ,' కాగా గాంధీజీ శతజయంతి నేపధ్యంగా వచ్చిన కథ కలువకొలను సదానంద రాసిన 'తాత దిగిపోయిన బండి.' స్వాతంత్రానంతరం పాలనా వ్యవస్థలో మొదలైన మార్పులని చిత్రించిన కథ ఇది. డాక్టర్ పి. కేశవరెడ్డి కథ 'ది రోడ్.' కేశవరెడ్డి నవలలు చదివిన వాళ్ళని ఏమాత్రమూ ఆశ్చర్య పరచని ముగింపుకి చేరిన కథ ఇది.

గాంధీ పేరుని వాడుకునే నాయకులమీద దాశరథి రంగాచార్య సంధించిన సెటైర్ 'మళ్ళీ మహాత్ముడు మన మధ్యకి వచ్చాడు.' రాజకీయ రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన తొలి రోజుల్లో వాటిని ఉపయోగించుకోలేక పోయిన వాళ్ళ కథ 'అజ్ఞాతవాసం' మధురాంతకం రాజారాం రాసిన ఈ కథ రాయలసీమ మాండలీకంలో ఆయనదైన శైలిలో సాగుతుంది. దాదా హయత్ రాసిన 'ప్రదర్శన' ఈ సంపుటిలో చివరి కథ. గాంధీని తమ ప్రయోజనాల కోసం వాడుకునే పెట్టుబడిదారీ వర్గాల కథ ఇది..నగరం నడిబొడ్డున వెలిసిన గాంధీ పార్కు గుట్టు విప్పుతుంది.

"ఆవేశంలోనుండి పుట్టేది పద్యం. ఆలోచనలోనుండి పుట్టేది గద్యం. పద్యంలో కవి ఊహాలోకాలలో సంచరిస్తూ కొద్దిగానో, గొప్పగానో తన్మయత్వాన్ని భజించే అవకాశం ఉంది. గద్య ప్రక్రియల్లో అలాంటి స్వేచ్ఛ లేదు. అది వీలైనంతవరకూ వాస్తవికతను అంటిపెట్టుకోవలసి ఉంటుంది," సంకలనానికి ముందుమాట రాస్తూ మధురాంతకం రాజారాం ప్రకటించిన అభిప్రాయమిది. "కథానికల ద్వారా గాంధీ దర్శనం గావించుకోడానికి సల్పిన ఒక చిన్న ప్రయత్నం ఇది" అన్నారాయన.

"గాంధీజీ పాత్రగా ఉన్న రచనలను గుర్తించడం తేలిక. కానీ ఆయన ఆశయాలని ప్రతిఫలించే కథలని గుర్తించడం అంత తేలిక కాదు. సుప్రసిద్ధ కథానికా రచయిత మధురాంతకం రాజారాం గాంధీజీని దర్శనం చేయించే తెలుగు కథలని అద్భుతంగా సంకలనం చేశారు" అన్నారు ప్రకాశకులు. స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానంతర కాలంలో దేశ పరిస్థితులని గురించి ఒక అవగాహన ఇచ్చే కథలివి. (పేజీలు 183, వెల రూ.80, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

గురువారం, సెప్టెంబర్ 13, 2012

మిస్డ్ కాల్

చారులత-జగన్ ఒకరికొకరు చాలా చిత్రంగా పరిచయమయ్యారు. వాళ్ళిద్దరూ తలో పనిమీదా అరకు వెళ్ళినప్పుడు ఉన్నట్టుండి ఘాట్ రోడ్డు పాడైపోడం, రైలు మినహా ఇతరత్రా ప్రయాణ మార్గాలు మూసుకుపోడంతో, ఇద్దరూ కలిసి ఓ రాత్రి అరకులోయలో గడపాల్సి వచ్చింది. వాల్తేరు పాసింజర్ మిస్సైన కాసేపటికే, తనను చూసిన పెళ్ళికొడుకు శ్రీరామ్ కి తను నచ్చాననీ, మరో రెండు రోజుల్లో విశాఖపట్నంలోనే తన పెళ్లనీ తెలుస్తుంది చారులతకి. పెళ్ళైన వారానికే శ్రీరామ్ తో కలిసి అమెరికా వెళ్లిపోవాలి. పెళ్ళి చూపుల్లోనే శ్రీరామ్ నచ్చాడు కాబట్టి, ఆ సంబంధం ఇష్టమే చారులతకి.

భద్రాచలం వెళ్ళాల్సిన జగన్ కూడా, రైలు మిస్సై అరకు ప్లాట్ఫాం మీద మిగిలిపోతాడు. అదిగో, అప్పుడు చారులత తారసపడుతుంది అతనికి. ఆ వెన్నెల రాత్రి ఆ ఇద్దరూ కలిసి అరకు అంతా కలియతిరుగుతారు. ఓ స్మశానానికి వెళ్లి మంగభాను సమాధి చూడడం మొదలు, ఓ చోట బోనులోనుంచి తప్పించుకున్న కుందేళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసి ఓడిపోయి, స్థానికంగా జరుగుతున్న ఓ జాతరలో రికార్డింగ్ డేన్స్ చూసి, ఆ పై అరకు ట్రైబల్ మ్యూజియం చూసి బయటికి వస్తారు ఇద్దరూ.

ఏ పని చేస్తున్నా శ్రీరామ్ ని తలచుకుంటూనే ఉంటుంది చారులత. అతనెంత మంచి వాడో, గొప్పవాడో కథలు కథలుగా చెబుతుంది జగన్ కి. కాబోయే భర్తని అంతగా ప్రేమిస్తున్న చారులత మీద గౌరవం కలుగుతుంది జగన్ కి. అనుకోకుండా, మైథునం లో మునిగి ఉన్న ఓ జంట ఈ ఇద్దరి కంటా పడుతుంది.జగన్ లో కలిగిన ఆవేశం, శ్రీరామ్ గుర్తు రావడంతో చప్పున చల్లారుతుంది. ఖాళీగా ఉన్న బస్టాండ్ ఆవరణలో, జగన్ మ్యూజిక్ స్టిక్ నుంచి వస్తూన్న లయకి అనుగుణంగా నాట్యం చేస్తున్న చారులత ఉన్నట్టుండి వైన్ తాగాలని ఉందన్న కోరికని బయట పెడుతుంది.


జగన్ మీద ఆసరికే అధికారం చలాయించడం మొదలుపెట్టిన చారులత, అతన్ని కోరివచ్చిన ఓ గిరిజన యువతిని కొట్టినంత పని చేస్తుంది. అతన్ని కోప్పడుతుంది. 'ఏమిటీ అధికారం?' అన్న అతని ప్రశ్నకి, జవాబు లేదు ఆమె దగ్గర. ఓ రెడ్ వైన్ బాటిల్ తీసుకుని చెరిసగం తాగిన జగన్, చారులతలకి చలి తెలుస్తుంది. ఒకే శాలువాలో ఇద్దరూ సద్దుకుంటారు. మత్తెక్కిన జగన్ 'నాగ మల్లివో, తీగ మల్లివో, నీవే రాజకుమారి..' పాట అందుకుంటాడు. ఏమిటేమిటో మాట్లాడతాడు. ఆ క్షణంలో శ్రీరామ్ గుర్తురాడు..అతనికే కాదు, ఆమెకి కూడా.

మరునాడు ఉదయం ఎవరి గమ్యం వాళ్ళు చేరుకుంటారు, కనీసం చిరునామాలు మార్చుకోకుండా. తొమ్మిదేళ్ళ తర్వాత అనుకోకుండా ఒకరికి ఒకరు మళ్ళీ తారసపడతారు, ఓ పుస్తక ప్రదర్శనలో. అమెరికాలో స్థిరపడిన జగన్, తెలుగు నవలా రచయితగా పేరు తెచ్చుకుంటాడు. అరకు నేపధ్యంగా, చారులత కథానాయికగా అతను రాసిన తొమ్మిది నవలలూ చాలా పాపులర్ అవుతాయి. పుస్తక ప్రదర్శన వేదిక మీద అతని తాజా నవల ఆవిష్కరణ జరిగాక, ప్రేక్షకుల్లో ఉన్న చారులతని గుర్తు పట్టి పలకరిస్తాడు. ఓ గంటలో ఫ్లైట్ అందుకోవాల్సిన జగన్, దగ్గరలో ఉన్న ఆమె ఇంటికి వెడతాడు. తర్వాత ఏం జరిగిందన్నదే వంశీ రాసిన 'మిస్డ్ కాల్' కథ.

వెన్నెల రాత్రి అరకు అందాలని వంశీ వర్ణించిన తీరు, మరీ ముఖ్యంగా చారులత పాత్ర ఈ కథకి బలం. భాషా భేదం లేకుండా సినిమాలు చూసే మిత్రులొకరు ఈ కథ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. 'బిఫోర్ సన్రైజ్'  'బిఫోర్ సన్సెట్' అనే రెండు ఇంగ్లిష్ సినిమాల కథల్ని తీసుకుని, నేపధ్యాన్ని అరకుకు మార్చి వంశీ ఈ కథ రాసేశారని. హాలీవుడ్ సినిమాలు విడవకుండా చూసే మరో ఫ్రెండ్ ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అయినప్పటికీ, నేటివిటీ కూర్పుని అభినందించాల్సిందే అనిపించింది నాకు. వంశీ 'ఆకుపచ్చని జ్ఞాపకం' సంకలనంలో ఉందీ కథ. (ఇలియాస్ ఇండియా ప్రచురణ, పేజీలు 360, వెల రూ. 350, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

ఆదివారం, సెప్టెంబర్ 09, 2012

కాళిదాసు మూడు నాటకాలు

సంస్కృత నాటకం అనగానే మొదట గుర్తొచ్చే పేరు మహాకవి కాళిదాసు. "ఉపమా కాళిదాసస్య.." అని ఆర్యోక్తి. ఉపమానాలు వాడడంలో కాళిదాసు తర్వాతే ఎవరైనా అని భావం. ఉపమానాలు మాత్రమే కాదు, పాత్రలని తీర్చి దిద్దడంలోనూ, ప్రకృతి వర్ణనలోనూ, కథని తీరుగా నడిపించడంలోనూ కాళిదాసుది ప్రత్యేకమైన బాణీ. ఈ మహాకవి రాసిన మూడు ప్రసిద్ధ నాటకాలని పరిచయం చేస్తూ పీకాక్ క్లాసిక్స్ వెలువరించిన చిరు పొత్తం 'కాళిదాసు మూడు నాటకాలు.'

'మాళవికాగ్నిమిత్రం,' 'విక్రమోర్వశీయం,' 'అభిజ్ఞాన శాకుంతలం' ఈ మూడూ కాళిదాసు పేరు చెప్పగానే గుర్తొచ్చే నాటకాలు. వీటిని తెలుగులో సంక్షిప్తీకరించారు దోనెపూడి రామాంజనేయ శర్మ. మూడూ వేటికవే ప్రత్యేకమైన నాటకాలు. మూడింటి పరిచయాలూ ఒకేసారి చదివినప్పుడు నాకు వీటిలో కనిపించిన సామ్యం 'విరహం.' మాళవిక మీద మనసుపడ్డ అగ్నిమిత్రుడూ, ఊర్వశిచేత మోహితుడైన పురూరవుడూ, తొలిపరిచయం తర్వాత శకుంతలా, దుష్యంతుడూ అనుభవించిన విరహాన్ని కాళిదాసు వర్ణించిన తీరు అమోఘం.

నర్తకి మాళవిక చిత్తరువుని చూసిన మహారాజు అగ్నిమిత్రుడు ఆమెతో ప్రేమలో పడిపోతాడు. తన స్నేహితుడైన విదూషకుడికి తన గోడు వెళ్ళబోసుకుంటాడు. రాజు విరహం చూడలేని విదూషకుడు, నాట్య గురువులిరువురి మధ్య స్పర్ధ కలిగించి, రాజు ఎదుట మాళవిక నాట్య ప్రదర్శన ఏర్పాటు జరిగేలా చేస్తాడు. మాళవిక సైతం అగ్నిమిత్రుడితో తొలిచూపులోనే ప్రేమలో పడుతుంది. వారిరువురి ప్రణయం, వివాహానికి ఎలా దారి తీసిందన్నదే 'మాళవికాగ్నిమిత్రం'నాటకం ముగింపు.


స్వర్గాధిపతిదేవేంద్రుడి స్నేహితుడు పురూరవుడు. ఓ ప్రమాదం నుంచి దేవ నర్తకి ఊర్వశిని రక్షించిన ఆ రాజు, ఆమెతో ప్రేమలో పడతాడు. రాజు భుజ బలాన్నీ, శౌర్యాన్నీ, సాయం చేసే గుణాన్నీ దగ్గరనుంచి చూసిన ఊర్వశి సైతం అతనితో ప్రేమలో పడుతుంది. ఊర్వశి ప్రేమని ఆమోదిస్తాడు దేవేంద్రుడు. మరోవంక, అంతఃపురంలో రాణులు సైతం పురూరవుడు తన వాంఛ నెరవేర్చుకోడానికి అనుమతి ఇస్తారు. రాజ్యానికి దూరంగా పర్వత సానువుల్లో, చెట్టూ చేమల్లో ప్రణయ కలాపంలో మునిగి తేలిన ఊర్వశీ పురూరవులకి అనుకోకుండా విరహం సంభవిస్తుంది. వారి పునస్సమాగమం ఎలా జరిగిందన్నదే 'విక్రమోర్వశీయం' నాటక కథ.

'అభిజ్ఞాన శాకుంతలం' కథ రేఖామాత్రంగానైనా తెలియని భారతీయులు తక్కువ. భరతుడి పేరిట ఏర్పడ్డ భరత ఖండ వాసులు కదా మరి. ఆ భరతుడి తల్లిదండ్రులు శకుంతలా, దుష్యంతులు. కణ్వ మహర్షి ఆశ్రమం సాక్షిగా మొదలైన వారి ప్రేమ కథ ఎన్నెన్ని మలుపులు తిరిగిందో కాళిదాసు కలం నుంచే తెలుసుకోవాలి. మరీముఖ్యంగా, తొలి పరిచయం తర్వాత అటు శకుంతల, ఇటు దుష్యంతుడు అనుభవించిన విరహాన్ని ఉపమాన సహితంగా వర్ణించారు కాళిదాసు.

పుస్తకం విషయానికి వస్తే, 'మాళవికాగ్నిమిత్రం' ప్రారంభంలో కించిత్ ఇబ్బంది అనిపించినా, రానురానూ చకచకా సాగిపోయింది. అనువాదం అత్యంత సరళంగా సాగింది. 'విక్రమోర్వశీయం' లో ముని శాపానికి ఊర్వశి పూలతీగెగా మారిపోయిన సంగతి తెలియని పురూరవుడు, ఆమెకోసం అనుభవించిన విరహబాధ, చెట్టునీ, పుట్టనీ, పామునీ, పురుగునీ సైతం వదలకుండా ఆమె ఆచూకీ అడిగిన వైనం చదువుతుంటే ఆలస్యం చేయకుండా సంస్కృతం నేర్చేసుకుని, మూల గ్రంథం చదివేయాలన్న కోరిక బలపడింది.

ఇదివరకు వసంతసేన గురించి చదివినప్పుడు, మరీముఖ్యంగా 'కన్యాశుల్కం' నాయిక మధురవాణి కి వసంతసేనే స్ఫూర్తి అని గుర్తొచ్చినప్పుడు, 'మృచ్ఛకటికమ్' నాటకాన్ని ఇంగ్లిష్ లో చదివాను నేను. అప్పటికన్నా, ఈ క్లుప్తీకరించిన తెలుగు పుస్తకం చదువుతున్నప్పుడు కథలో బాగా లీనం కాగలిగాను. ఈ పుస్తకం తేవడంలో ఉద్దేశ్యం, కాళిదాసు మూడు నాటకాలని పరిచయం చేయడమే కాబట్టి, ఆ ఉద్దేశ్యం నూరు శాతం నెరవేరిందనే చెప్పాలి. (పేజీలు 173, వెల రూ. 75, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

శుక్రవారం, సెప్టెంబర్ 07, 2012

శ్రద్ధాంజలి

సుమన్ బాబూ,

నీ కోసం మొదలు పెట్టిన సిరీస్ ని ఈ టపాతో ముగిస్తానని అనుకోలేదయ్యా.. నీ అనారోగ్యం సంగతి తెలిసి బాధ పడినా, తలచుకుంటే దేనినైనా సాధించ గల మీ నాన్నగారి తాహతు గురించి తెలిశాక, నువ్వు వైద్యం చేయించుకుని, కళకళలాడుతూ మీ టీవీ తెరమీద కనిపిస్తావనే ఆశ పడ్డాను. నీకు తెలుసా? నువ్వు లేవనే వార్తని మీ పత్రిక కన్నా ముందే, భూగోళానికి అవతలిపక్క ఉన్న నా స్నేహితులు చెప్పారు. కనీసం ముఖ పరిచయం లేని వాళ్ళనీ, నన్నూ కలిపిన వాటిలో నువ్వూ ఉన్నావన్న సంగతి జ్ఞాపకం వచ్చి, కలుక్కుమనిపించింది.

మీ పేపర్లో నువ్వు రాసిన నవలలు కొనుక్కోమని వచ్చే ప్రకటనల ద్వారా నువ్వు మొదట పరిచయం నాకు. తర్వాత, మీరో టీవీ చానల్ పెట్టడం, కాల క్రమేణా దానికి అన్నీ నువ్వే కావడం మా కళ్ళ ముందే జరిగిపోయింది. మొదట్లో మీ చానల్లో వచ్చే ప్రతి కార్యక్రమాన్నీ విడిచి పెట్టకుండా చూశాను. పరిమితంగా కార్యక్రమాలు చూపించే దూరదర్శన్, జెమినిల తర్వాత రోజులో ఎక్కువ భాగం కార్యక్రమాలు, ఎక్కువగా సినిమా ఆధారిత కార్యక్రమాలని ప్రసారం చేసేది మీ చానల్.

అయితే సుమన్ బాబూ, నిన్ను కొంచం పరికించి చూసింది మాత్రం 'అంతరంగాలు' టైం లోనే. అప్పుడే కదూ, ఆ 'సీరియల్ సృష్టికర్త' వైన నీతో ప్రత్యేక ఇంటర్యూలు వచ్చిందీ. 'గుండెకీ సవ్వడెందుకో...' పాటని అరకు లో చిత్రీకరిస్తే 'ఆహా' అనుకున్నాను. రాన్రానూ నీ సీరియళ్ళు ఒకే మూసలో పోసినట్టు ఉండడం మొదలయ్యింది. 'అనుబంధం' 'అందం' 'కళంకిత' తరవాత నేను సీరియస్ గా చూసింది లేదనే చెప్పాలి. అయినప్పటికీ, ఆయా సీరియళ్ళ ప్రత్యేక ఎపిసోడ్లలో నువ్వు కనిపిస్తే మాత్రం మిస్సవ్వ లేదనుకో.

ఉన్నట్టుండి ఓ అలజడి సృష్టించావు. 'శ్రీకృష్ణ బలరామ యుద్ధం' అన్నావు. నువ్వే కృష్ణుడివి అన్నావు. ఒంటికి నీలం రంగూ, తలపై కిరీటం, నెమలిపించం, ధగద్ధగాయమైన దుస్తులూ, ఆభరణాలూ.. మీ పేపర్లో స్టిల్స్ చూసి, ఆ టెలి ఫిలిం చూసి తీరాల్సిందే అనుకున్నాను. చూశాను. నా స్నేహితుల్లో కొందరు మీ నాన్నగారికి వీరాభిమానులయ్యా. "అందరూ పిల్లలకి ఆడుకోడానికి బొమ్మలు కొని పెడితే, ఫలానా ఆయన ఏకంగా ఓ టీవీ చానల్నే కొడుక్కి ఇచ్చేశారు" అని నిష్టూరాలు ఆడారు.

ఎవరెన్ని అనుకోనీ, నువ్వు నాకు నచ్చావు. నిజం చెబుతున్నాను. నీ టాలెంట్ మీద నీకున్న నమ్మకం నాబోటి వాడికి ఎప్పుడూ ఆశ్చర్యమే. ఏ పనన్నా మొదలు పెట్టే ముందు, 'ఇది నేను చెయ్యగలనా?' అని ఆలోచనలో పడి, వెనకడుగు వేసే వాళ్లకి నువ్వో స్ఫూర్తి. ఇదే మాట నా మిత్రులతో అంటే కొందరు ఒప్పుకున్నారు, మరి కొందరు వాదించారు. నీమీద నీకున్న నమ్మకమే నీ చేత సినిమాలూ, టెలి ఫిల్ములూ తీయించింది. ఇప్పుడు కలికంలో కూడా కనిపించని తెలుగు పంచ కట్టునీ, పట్టు పరికిణీలనీ బుల్లి తెరకి ఎక్కించావు. నీకు చేతైనంతగా హాస్యానికి పెద్ద పీట వేశావు.

ఇంటిగుట్టుని నీ ప్రత్యర్ధి పత్రికలో బయట పెట్టిన్నాడు మాత్రం బాధ కలిగిందయ్యా. అప్పటి నీ ఇంటర్యూలో కూడా నిన్ను నువ్వు ఒక కళాకారుడి గానే చూసుకున్నావు. నీ తండ్రిని పెట్టుబడి దారుగా మాత్రమే చూశావు. 'కళ' పట్ల నీ కమిట్మెంట్ అర్ధమయినట్టే అనిపించింది. నీ ఆసక్తులని మీ ఇంట్లో వాళ్ళు కొంచం ముందుగానే గుర్తించి ఉంటే, పరిస్థితి మరోవిధంగా ఉండేదేమో అనుకున్నాను. ఎవరేమన్నా అనుకోనీ, నువ్వు అనుకున్నది చేయకుండా వెనక్కి తగ్గలేదు. నీ పేరు చెప్పుకుని అనేకమంది కడుపు నింపుకున్నారు.

నా మిత్రులు కొందరు నిన్ను కోప్పడే వాళ్ళు. మీ నాన్నగారి పేరు పాడు చేస్తున్నావని. ఎందుకో తెలియదు, ఎన్ని జరిగినా నీ మీద నాకెప్పుడూ కోపం రాలేదు. చాలా స్వచ్చంగా అనిపించేవాడివి నువ్వు. నీ ఆలోచనా విధానం ఎలా ఉంటుందో, నువ్వు తీసిన సీరియళ్ళు, సినిమాలు, టెలి ఫిల్ములు చూసిన వాడిగా ఓ అంచనాకు రాగలను కదా. ఇప్పుడు నువ్వు లేవనే వార్త. నమ్మలేకపోయాను.. కానీ నమ్మక తప్పని నిజం. సుమన్ బాబూ, నీమీద నీకున్న విశ్వాసానికీ, అనుకున్నది చేసి తీరిన నీ పట్టుదలకీ మరోమారు జోహారు..

మంగళవారం, సెప్టెంబర్ 04, 2012

సావిరహే

ఇద్దరు పెద్దమనుషులు ఆడుతున్న చదరంగంలో ఆ అమ్మాయి ఒక పావు. ఆమె పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటే తన తాతయ్య సంపాదించిన విలువైన ఆస్తికి వారసురాలు అవుతుంది. అలా కాక, ప్రేమ వివాహం చేసుకున్నట్టయితే ఆ ఆస్తి మొత్తం ఓ ట్రస్టు ఆధ్వర్యంలో నడిచే హాస్పిటల్ కి చెందుతుంది. ఆ ఇద్దరు పెద్దమనుషుల్లో ఒకరు ఆమె శ్రేయోభిలాషి. ఆస్తి ఆమెకి మాత్రమే చెందాలని కోరుకుంటున్నారు. మరొకరు, ట్రస్టు శ్రేయోభిలాషి. ఆమె ప్రేమ వివాహం చేసుకుంటే, ట్రస్ట్ కి కలిసి రాబోయే ఆస్తితో ఏమేం అభివృద్ధి పనులు చేయాలో ఆలోచిస్తూ ఉంటారు.

విచిత్రం ఏమిటంటే, తన పేరిట పెద్దమొత్తంలో ఆస్తి ఉన్నట్టు గానీ, దాని కోసం జరుగుతున్న చదరంగం గురించి కానీ ఆ అమ్మాయికి ఎంత మాత్రం తెలియదు. పుట్టక మునుపే తండ్రినీ, పుట్టిన కొద్దిరోజులకే తల్లినీ పోగొట్టుకున్న ఆ అమ్మాయి తన మామయ్య  ఇంట అతి సామాన్యంగా పెరుగుతోంది. పదిహేడేళ్ళ ఆ అందమైన అమ్మాయి పేరు ప్రియాంక. విమెన్స్ కాలేజీలో బీయే ఇంగ్లిష్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల 'సావిరహే' ఈ ప్రియాంక ప్రేమకథే.

కాలేజీలో చేరిన తొలిరోజే ఇంగ్లిష్ లెక్చరర్ రాజ్ కృష్ణ ఆకర్షణలో పడుతుంది ప్రియాంక. మలయాళీ అయిన రాజ్ కృష్ణ, పాఠాలు చెప్పే విధానం మిగిలిన లెక్చరర్స్ కి భిన్నంగా ఉండడంతో పాటు, ఇంగ్లిష్ లిటరేచర్ మీద అతనికి విపరీతమైన ప్రేమ ఉండడం వల్ల, అతి త్వరలోనే ఆ క్లాసులో అమ్మాయిలందరూ అతని క్లాసు కోసం ఎదురు చూడడం మొదలుపెడతారు. స్నేహితురాలు వాహిలతో కలిసి ప్రతి వారం సినిమాకి వెళ్ళే అలవాటున్న ప్రియాంకకి, ఓసారి థియేటర్ లో రాజ్ కృష్ణ తారస పడడంతో అతని గురించి మరికొంచం ఎక్కువ తెలుసుకో గలుగుతుంది.

తను రాజ్ కృష్ణతో ప్రేమలో పడ్డానేమో అని ప్రియాంక అనుమానిస్తున్న సమయానికే, రాజ్ కృష్ణ తను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫారిన్ ఛాన్స్ వెతుక్కుంటూ రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి యూఎస్ వెళ్ళిపోతాడు. తన మనసుకి తగిలిన గాయం తాలూకు నొప్పి తెలుస్తూనే ఉంటుంది ప్రియాంకకి. స్నేహితురాలి మనసు అర్ధం చేసుకున్న వాహిల, ఆ గాయం మానేందుకు తనవంతు సాయం చేస్తూ ఉంటుంది. సరిగ్గా, రాజ్ కృష్ణ ఆలోచనల నుంచి బయట పడుతున్న సమయంలోనే సందీప్ పరిచయం అవుతాడు ప్రియాంకకి.


ఇరవై ఒక్క సంవత్సరాల సందీప్ ఓ ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలో ఉద్యోగి. అతని తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో, తల్లే పెంచి పెద్ద చేసింది. చురుకైన అ కుర్రాడు, తొలి చూపులోనే ప్రియాంకతో ప్రేమలో పడతాడు. అతని బాస్ ఏకాంబరం ప్రియాంక ప్రేమని గెలుచుకునేందుకు అవసరమైన సలహాలు ఇస్తూ ఉంటాడు సందీప్ కి, తగుమాత్రం 'ఫీజు' పుచ్చుకుని. సందీప్ చొరవ, ఏకాంబరం సలహాలు, కలిసొచ్చే పరిస్థితులతో పాటు, ప్రియాంక, వాహిలలిద్దరికీ సందీప్ మీద మంచి అభిప్రాయం ఏర్పడడంతో ప్రియాంక కూడా అతన్ని ప్రేమించడం మొదలుపెడుతుంది.

ప్రియాంక-సందీప్ ల ప్రేమ చిక్కబడేనాటికి, వారికి మద్దతుగా ఓ పెద్ద మనిషి, వ్యతిరేకంగా మరో ఆయనా చేసే ప్రయత్నాలూ ఊపందుకుంటాయి. వారి ప్రేమకథ పెళ్ళి పీటల వరకూ వెళ్ళ గలిగిందా? ప్రియాంక తన ఆస్తిని దక్కించుకో గలిగిందా? అన్న ప్రశ్నలకి జవాబిస్తూ ముగుస్తుందీ నవల. ఆద్యంతం మల్లాది మార్కు నవల ఇది. ప్రతి అంశాన్నీ విపులంగా రాసే మల్లాది, నవల శీర్షికని గురించి ఓ సందర్భంలో ఓ పాత్ర చేత ఇలా చెప్పించారు: "విరహం లేకపొతే అది సరయిన ప్రేమ కాదు. 'సావిరహే తవదీనా రాధా' అన్నాడు జయదేవుడు. అంటే, 'నా విరహంతో ధన్యురాలైన రాధ' అని అర్ధం." 

ప్రియాంక-సందీప్ ల తొలి ముద్దుకి మల్లాది మార్కు వర్ణన ఇది: "స్వల్పంగా గడ్డి పరక మీద వాన చినుకులా మొదలయిన ఆ చిరుముద్దు, క్షణాల్లో జడివానలా మారి, జలపాతంలా దూకి, నదులుగా సాగి సాగరమై పొంగి పొరలసాగింది. అంతా కొన్ని పదుల క్షణాలు మాత్రమే. ఒకరికి మాత్రమే కుదరనిది, ఇద్దరికీ సరిపోయేది, ముగ్గురికి ఎక్కువయ్యేది అయిన ఆ ముద్దు, ప్రపంచంలోని అతి తియ్యటి మధుర భాష అయిన ఆ ముద్దు ఉపయోగించడానికి పనికిరాని వస్తువులాంటిదయినా, డబ్బుకన్నా విలువైనదానిలా చూసుకునే ఆ ముద్దు కేవలం కొన్ని పదుల క్షణాల్లోనే వాళ్ళని వివశులని చేసింది." 

సందీప్ కాసే చిత్రమైన పందాలు, ప్రియాంక, సందీప్ ఒకరికొకరు తమ ప్రేమని వ్యక్త పరుచుకునే తీరు, కాలేజీలో అమ్మాయిల కోడ్ లాంగ్వేజీ చదవడానికి సరదాగా అనిపిస్తే, ప్రియాంక మామయ్య క్షీరసాగరానికి దినఫలాల మీద ఉన్న నమ్మకం నవల చివరికి వచ్చేసరికి విసుగు కలిగిస్తుంది పాఠకులకి. సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం రాసిన నవల ఇది. టీనేజ్ యువతీయువకులని, మరీ ముఖ్యంగా ప్రేమలో ఉన్న వారిని బాగా ఆకట్టుకుంటుంది. ప్రేమలో ఉన్నవాళ్ళకి, కొత్తగా ప్రేమలో పడ్డవాళ్ళకి బహుమతిగా ఇవ్వదగిన పుస్తకం. (సాహితి ప్రచురణ, పేజీలు 264, వెల రూ. 90, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శనివారం, సెప్టెంబర్ 01, 2012

నాయికలు-నతాష

నతాష అందమైన అమ్మాయి. నికోలాయ్-అన్నా దంపతుల ఏకైక కుమార్తె. వాళ్ళింట్లోనే పెరిగిన వాన్యా, నతషని ఎంతగానో ఆరాధించాడు. ఆవిషయం బాగా తెలుసు నతాషకి. కానీ, అతని ప్రేమకి ఆమె అవునని చెప్పలేదు. అలాగని కాదనీ చెప్పలేదు. పేదరికం నుంచి ప్రిన్స్ స్థాయికి ఎదిగిన వాల్కొవిస్కీ నికోలాయ్ తో స్నేహం చేస్తాడు. నికోలాయ్ నిజాయితీ, శ్రమించే తత్వం నచ్చి, ఎస్టేట్ వ్యవహారాల బాధ్యతని అతనికి అప్పగిస్తాడు. అంతే కాదు, లోకజ్ఞానం లేని తన కొడుకు అయోషాని కూడా నికోలాయ్ ఇంట్లో ఉంచుతాడు ప్రిన్స్.

నతాష-ఆయోష ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. ఆయోషలో, నతాషకి నచ్చింది ఏమిటి? అని అడిగితే జవాబు చెప్పడం కష్టం ఆమెకి. అతని అమాయకత్వం, స్వచ్చత ఆకట్టుకుంటాయ్ ఆమెని. అతను మిగిలిన కుర్రాళ్ళ కన్నా భిన్నం అని తెలుసు. జ్ఞానంలో తనకన్నా ఓ మెట్టు తక్కువేననీ బాగా తెలుసు నతాష కి. అయినప్పటికీ అతనంటే విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమ ఎంతటిదంటే, దానికోసం తనని ఎంతగానో ప్రేమించిన తల్లిదండ్రులని విడిచిపెట్టేయడానికి సైతం వెనకాడదు నతాష.

జరిగింది ఏమిటంటే, నతాష-ఆయోషల ప్రేమ గురించి విన్న ప్రిన్స్ భగ్గుమంటాడు. నతాష అంతస్తు తన అంతస్తుకి ఏమాత్రం తూగదు మరి. కూతుర్ని తన కొడుకు మీదకి ఉసిగొలిపాడని నికోలాయ్ మీద ఎగిరిపడతాడు. ఎస్టేట్ వ్యవహారాల వంకన నికోలాయ్ ని కోర్టుకి ఈడుస్తాడు. ఫలితం, ఆయోష తో కూతురి ప్రేమని ఏమాత్రం ఆమోదించడు నికోలాయ్. ఆయోష కోసం ఇల్లు విడిచిపెడుతుంది నతాష. ఓ చిన్న ఇంట్లో నతాష ని ఉంచుతాడు ఆయోష. అప్పుడప్పుడూ వచ్చి చూసి వెడుతూ, పెళ్ళి చేసుకుంటానని హామీలు ఇస్తూ ఉంటాడు.

ఆయోషకి తన మీద ఉన్న ప్రేమమీద అంతులేని నమ్మకం నతాషకి. అయితే, ఆ నమ్మకానికి బీటలు పడే పరిస్థితులు వస్తాయి. నతాష విషయంలో కొడుకుని నయానో, భయానో ఒప్పించడానికి ప్రయత్నించి భంగపడ్డ ప్రిన్స్ అతనికోసం మరో గొప్పింటి సంబంధం చూస్తాడు. ఆ గొప్పింటి అమ్మాయి పేరు కాత్య, ఓ జమీందారీకి ఏకైక వారసురాలు. ఆయోషకి స్థిరమైన అభిప్రాయాలు లేవని బాగా తెలుసు నతాషకి. అతను తండ్రి చేతిలో పావుగా మారడం, కాత్యలో ప్రేమలో పడడం ఆమె దృష్టిని దాటిపోవు.

తల్లిదండ్రులని విడిచి వచ్చిన నతాష కి మిగిలింది వాన్య మాత్రమే. అతని దగ్గర ఆమెకి దాపరికాలు ఏవీ లేవు. నతాష-వాన్యాల స్నేహం గురించి బాగా తెలుసు అయోషకి. అతనికి కూడా వాన్య అంటే ఇష్టం. ఎంతగా అంటే, తను అటు నతాషా ప్రేమకీ, ఇటు కాత్య  ప్రేమకీ మధ్య నలిగిపోయినప్పుడు వాన్యని సలహా అడిగేటంత. ఓపక్క ఆయోష, కాత్యాలని దగ్గర కానిస్తూనే, ఆయోషతో పెళ్ళి జరిపిస్తానని నతాష కి మాట ఇస్తాడు ప్రిన్స్, అది కూడా తన కొడుకు, వాన్యాల సమక్షంలో.

ప్రిన్స్ ఎలాంటివాడో నతాషకి బాగా తెలుసు. తన తండ్రికి జరిగిన అన్యాయం ఆమె మర్చిపోయేది కాదు. అలాంటి అన్యాయాన్నే తనకీ తలపెడుతున్నాడని సులభంగానే అర్ధం చేసుకుంది. మరోపక్క ఆయోష ఊగిసలాట కూడా తెలుసు నతాషకి. పరిస్థితులు తనకి పూర్తిగా ఎదురు తిరిగినా, ఆమె ఆయోష పక్షాన్నే నిలబడుతుంది. ఆయోష విషయమై, కాత్య తనని కలుసుకున్నప్పుడు సైతం ఎంతో స్థిత ప్రజ్ఞత చూపుతుంది నతాష.

చిన్న వయసులోనే జీవితంలో ఊహించని ఎదురు దెబ్బలు తిన్న ఆ అమ్మాయి, వ్యతిరేక పరిస్థితులని ఎదుర్కొన్న విధానం, తన భవిష్యత్తుని నిర్ణయించుకున్న తీరు ఆమె మనకి గుర్తుండిపోయేలా చేస్తాయి. సమస్యల నుంచి ఎన్నడూ పారిపోలేదు నతాష. అలాగే, ఆయోష మీద ఆమె ప్రేమలోనూ ఎలాంటి మార్పూ లేదు. అతని స్వచ్చత మీద ఎలాంటి సందేహమూ లేదామెకి. ఈ లక్షణాలే నతాషని ప్రత్యేకంగా నిలుపుతాయి. రష్యన్ రచయిత దస్తయే వస్కీ నవల 'తిరస్కృతులు' లో ఒక నాయిక నతాష. ఈమెతో పాటుగా, మరోనాయిక నీలీ సైతం పాఠకులని వెంటాడుతుంది, పుస్తకం పక్కన పెట్టాక చాలా రోజులపాటు.

బుధవారం, ఆగస్టు 29, 2012

వర్ధని

"తెలుగు నవల పట్నాల్లో కాపురం పెట్టి పల్లెల్ని మరిచిపోయిందన్న అభిప్రాయానికి ఈ నవల ఒక మినహాయింపు. రచయిత్రికి పల్లెలలోను, మనుషులలోను గల అత్యంత ఆత్మీయతా బంధాలు అడుగడుగునా స్ఫురిస్తాయి. ఏడేళ్ళ అమ్మాయి వర్ధనిని ముఖ్య పాత్రగా తీసుకుని నవల రాసి మెప్పించడం జీవితం పట్ల ఎంతో శ్రద్ధ, ఆరాధన ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం" ...మెచ్చుకుని ముందుమాట రాసినవారు, తెలుగు కథకి కొత్త వెలుగులద్దిన 'దామల్ చెరువు అయ్యోరు' మధురాంతకం రాజారాం.

'రేగడి విత్తులు' తో తెలుగు సాహితీలోకాన్ని ఆకర్షించి, 'దృశ్యాదృశ్యం' అనే నిరుపమాన నవలని అందించిన రచయిత్రి చంద్రలత తొలి నవల 'వర్ధని.' చతుర మాసపత్రిక మే, 2006, సంచికలో ప్రచురితమైన ఈ నవలకి నేపధ్యంగా, తెలుగు సాహిత్యంలో అతి తక్కువగా ఉపయోగించుకున్న 'చైల్డ్ సైకాలజీ' ని నేపధ్యంగా తీసుకున్నారు రచయిత్రి. ఓ ఏడేళ్ళ అమ్మాయి మనస్తత్వాన్ని పాఠకుల కళ్ళకి కట్టడం మాత్రమే కాదు, పిల్లల పెంపకం అన్నది ఎంత శ్రద్ధగా నిర్వహించాల్సిన బాధ్యతో కొంచం గట్టిగానే చెప్పారు.

మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ పల్లెటూళ్ళో వ్యవసాయం చేసుకునే ఉమ్మడి కుటుంబమే 'వర్ధని' నవలలో కథాస్థలం. ఇద్దరు అన్నదమ్ములు కోటయ్య, ముకుందం. వీరిలో ముకుందం పెద్ద కూతురు వర్ధని. ఆ ఇంట్లో తొలి ఆడపిల్ల. అన్నదమ్ములిద్దరూ ఆ అమ్మాయికి తమ తల్లి వర్ధనమ్మ పేరు పెట్టుకోడమే కాదు, ఎంతో గారాబంగా చూసుకుంటారు కూడా. తల్లిదండ్రుల దగ్గర కన్నా, పెదనాన్న, పెద్దమ్మల దగ్గర చేరిక ఎక్కువ వర్ధనికి. వాళ్ళు చేసే ముద్దు కారణంగా తనని తను ఓ యువరాణీ లాగా భావించుకుంటూ, అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ ఊళ్ళో, ఆ ఇంట్లో ఆమె ఆడింది ఆట. చెల్లెలు వాణీని కూడా కనీసం మనిషిలాగా గుర్తించదు వర్ధని.


ఉన్నట్టుండి ఒకరోజు తన భార్యాపిల్లలతో కలిసి పట్నం బయలుదేరి అక్కడ కాపురం పెడతాడు ముకుందం. ఈ మార్పు వర్ధని ఆసలు ఊహించనిది, భరించలేనిది. తల్లి, తండ్రి, చెల్లెలితో ఇమడలేని వర్ధనిలో మిగిలి ఉన్న ఆశ ఒక్కటే. ఎప్పటికైనా తను పెద్దమ్మ, పెదనాన్నల దగ్గరికి వెళ్లిపోవచ్చని. పండుగ సెలవులకి ఊరికి వెళ్ళిన వర్ధనికి శరాఘాతం తగులుతుంది. పెద్దమ్మ, పెదనాన్న ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చిన తమ మనవరాలిని ముద్దాడుతూ కనిపిస్తారు. ఇన్నాళ్ళూ తనదైన స్థానాన్ని, ఆ పసిపిల్ల దక్కించుకోడాన్ని ఏమాత్రం భరించలేదు వర్ధని. ఆ పసిపిల్లమీద హత్యాప్రయత్నం చేసేంత ఉన్మాదంలోకి వెళ్లి పోతుందామె.

నవల చదువుతుంటే, ఎక్కడా కూడా ఇది రచయిత్రికి తొలి నవల అన్న భావన కలగదు. ముగింపులో వచ్చే సంభాషణల్లో తొంగిచూసే కొద్దిపాటి నాటకీయతని మినహాయించుకుంటే, మిగిలిన కథనంతటినీ అత్యంత సహజంగా కళ్ళకి కట్టారు చంద్రలత. పల్లెవాతావరణం, రైతు కుటుంబాలు, అక్కడి పద్ధతులు, ఉమ్మడి కుటుంబం...వీటన్నింటి మధ్యకీ పాఠకులని తెసుకెళ్ళిపోయారు. నిజానికి ఇదే కేన్వాసుని మరికొంచం విస్తరించి, 'రేగడి విత్తులు' నవలలో ఉపయోగించారు. "ఒక సాధారణమైన విషయాన్ని అసాధారణంగా చెప్పగలిగిన రచయిత్రి, మంచి ఇతివృత్తాన్ని స్వీకరించి - ఆద్యంతం ఉత్కంఠ కొనసాగేటట్లుగా ఒక సీరియల్ నవల రాయవచ్చు," అన్న మధురాంతకం వారి మాటలు స్ఫూర్తి కలిగించి ఉండొచ్చు, బహుశా.

కథలో పాఠకులని ఎంతగా లీనం చేస్తారంటే, వర్ధని తప్పు చేస్తున్నప్పుడల్లా ఆమెకి నచ్చచెప్పాలనీ, ఇంట్లో పెద్దవాళ్ళని మందలించాలనీ అనిపిస్తుంది పాఠకులకి. ఓ ఏడేళ్ళ పిల్ల ఆలోచనలనీ, భయాలనీ, పెరిగిన వాతావరణం కారణంగా ఆమెలో పోటీపడే సుపీరియారిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లనీ అత్యంత సహజత్వంతో చిత్రించిన తీరు ముచ్చట గొలుపుతుంది. అప్పటికే 'రేగడివిత్తులు' 'దృశ్యాదృశ్యం' చదివేసి ఉండడంతో, ఈనవల పూర్తి చేసిన వెంటనే నాకు "పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది" అన్న నానుడి గుర్తొచ్చింది. ('వర్ధని,' పేజీలు 118, వెల రూ.60, ప్రభవ పబ్లికేషన్స్ ప్రచురణ, అన్ని పుస్తకాల షాపులూ)

మంగళవారం, ఆగస్టు 28, 2012

మంగళసూత్రం

కిక్కిరిసిన కళ్యాణ మండపంలో, జూనియర్ ఆర్టిస్టుల సాక్షిగా పెళ్ళికొడుకు హీరోయిన్ మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. ఇంతలో ఉన్నట్టుండి "ఆపండీ పెళ్ళి" అని వినిపిస్తుంది, పెళ్ళికొడుకుతో సహా అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరుగుతారు..ఇలాంటివి కొన్ని వందల సన్నివేశాలు.. హీరోయిన్ మెడలో విలన్ బలవంతంగా తాళి కట్టేయబోతూ ఉంటే, హీరో అదాటున వచ్చి విలన్ చేతిమీద కొట్టి హీరోయిన్ని రక్షించేస్తాడు...ఈ తరహా సీన్లు బోలెడన్ని.

నాయికని అల్లరి పెట్టబోతున్న విలన్ గుంపుని నాయకుడు చెదరగొడుతుంటే, అమ్మవారి విగ్రహం మెడలో మంగళసూత్రం నాయకుడి చేతిమీదుగా నాయిక మెడలో పడుతుంది. అక్కడినుంచీ, దైవసాక్షిగా అతనే ఆమె భర్త...ఇలాంటివీ అనేకానేక సన్నివేశాలు. మన తెలుగు సినిమాలు మంగళసూత్రానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఇది. అతగాడు ఆమె మెడలో తాళి కడితే, ఆమె ఇక అతని పాదాల చెంత చోటు వెతుక్కోవలసిందే. శేష జీవితాన్ని అతని సేవలో తరియింప జేయాల్సిందే.

క్లైమాక్స్ కన్నా ముందు తెరమీద పెళ్ళి కనుక జరుగుతున్నట్టాయనా, తాళి సన్నివేశంలో "ఆగండి" అనే డవిలాగు వినడానికి సిద్ధ పడిపోతాం మనం. ఇంతకీ సినిమాలకి సంబంధించి మంగళ సూత్రం అంటే కథని మలుపు తిప్పే ఒకానొక వస్తువు. కానైతే, ఇదంతా నిన్న మొన్నటి విషయం. ఇప్పటి సినిమాల్లో పెళ్ళి సన్నివేశాలు ఎలాగైతే పెద్దగా ఉండడం లేదో, కథలు కూడా అలాగే మంగళసూత్రం చుట్టూ తిరగడం లేదు. మన సిని రచయితలకీ, దర్శకులకీ 'మంగళసూత్రం' అవుట్ డేటెడ్ సబ్జక్ట్ అయిపోయినట్టుంది.

"ఇదివరకు ఆడపిల్లల మెడ చూస్తే పెళ్లయ్యిందో, కాలేదో తెలిసేది. ఇప్పుడా వీలు కుదరడం లేదు," ఈమధ్యన కొంచం తరచూ వినిపిస్తున్న మాట ఇది. ఓ పెద్దాయన ఇదే మాట అంటే ఉండబట్టలేక "ఇప్పటి వాళ్ళవి చంద్రమతీ మాంగల్యాలు అయి ఉంటాయి లెండి," అని గొణిగాను. నా ఉద్దేశం అర్ధమయ్యో, కాకో ఆయన ఓ నవ్వు నవ్వారు. చంద్రమతి మాంగల్యం కేవలం హరిశ్చంద్రుడికి మాత్రమే కనిపించేది కావడం, ఈ కారణానికే కాటికాపరి వేషంలో ఉన్న హరిశ్చంద్రుడిని చంద్రమతి గుర్తించ గలగడం తెలిసిన కథే కదా.

వారం తిరక్కుండానే, మిత్రులొకరితో 'మంగళసూత్రం' అనే విషయం మీద కొంచం సుదీర్ఘమైన సంభాషణ జరిగింది. మంగళసూత్రాన్ని గౌరవించడానికీ, అది కట్టిన వాడిని గౌరవించడానికీ పెద్దగా సంబంధం లేదన్నది అంతిమంగా తేలిన విషయం. కొంచం తీరిక దొరికి, మంగళసూత్రాన్ని గురించి 'తెవికీ' ఏం చెబుతోందా అని వెతికాను. "వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు."

మరికాస్త ముందుకు వెడితే, "మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడులనుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం.శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు" అని కనిపించింది. 'వైవాహిక జీవితంలోని సమస్త కీడులని తొలగిస్తుంది' అని భావం కావొచ్చు. వెనకటి తరాల్లో, ఈ మంగళ సూత్రాన్ని గురించి చాలా పట్టింపులే ఉండేవి.

కాలంతో పాటు మార్పు సహజం. నమ్మకాల్లో మార్పు రావడం మరింత సహజం. కాబట్టి, మంగళసూత్రాన్ని కేవలం ఓ అలంకారంగా భావించడాన్ని తప్పు పట్టలేం. ఇంకా చెప్పాలంటే ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం. ధరించాలా, వద్దా అన్నది వారి వారి ఇష్టాయిష్టాల మీద ఆధార పడి ఉంటుంది. పెళ్లికి కావాల్సింది మొదట మనసు, తర్వాతే మంగళసూత్రం. నిజానికి మంగళసూత్రం లేకుండా పెళ్ళి చేసుకునే పద్ధతులు చాలానే ఉన్నాయి. కానీ, మనసు లేకుండా జరిగే మనువుల్ని కేవలం మాంగల్యం నిలబెట్టగలదా అన్నది బహు చిక్కు ప్రశ్న. "మాకు పుట్టిన ఇద్దరు పిల్లలూ  మా పెళ్లికి సాక్ష్యం. వేరే రుజువులు, సాక్ష్యాలు అవసరమా?" అన్న స్నేహితురాలి ప్రశ్న గుర్తొస్తోంది, ఇది రాస్తుంటే.

సోమవారం, ఆగస్టు 27, 2012

సర్వసంభవామ్

'నాహం కర్తా, హరిః కర్తా' ఇది పీవీఆర్కే ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణాధికారిగా పనిచేసిన కాలంలో తనకెదురైన వింత అనుభవాల సమాహారానికి ఇవ్వాలనుకున్న శీర్షిక. ఈ శీర్షికకి అర్ధం 'నేను కర్తని కాదు..చేసేది, చేయించేది శ్రీహరి మాత్రమే.' అయితే, 'స్వాతి' సపరివార పత్రికలో ఈ కథనాలని వారం వారం ప్రచురించిన ఆ పత్రిక ఎడిటర్, శీర్షికని 'సర్వసంభవామ్' గా మార్చారు. ప్రసాద్ మరోమారు చిరునవ్వు నవ్వుకుని ఉంటారు, బహుశా. తర్వాతి కాలంలో ఆ అనుభవాలకి పుస్తక రూపం ఇచ్చినప్పుడు, తను మనసుపడ్డ శీర్షికని ఉపశీర్షికగా ఉంచారయన.

పత్రి వెంకట రామకృష్ణ (పీవీఆర్కే) ప్రసాద్ పేరు వినగానే, నాకు మొదట గుర్తొచ్చే రచన 'అసలేం జరిగిందంటే.' ఆయన రచనల్లో నేను చదివిన తొలి రచన అది. చెప్పే విషయంతో పాటు, చెప్పిన విధానం కూడా నచ్చడంతో కేవలం రచయిత పేరు చూసి తీసుకున్న పుస్తకం ఈ 'సర్వసంభవామ్.' ఊహించినట్టుగానే నన్ను ఏమాత్రమూ నిరాశ పరచలేదు. కలియుగ దైవం కొలువై ఉన్న ప్రదేశం అని మాత్రమే కాక, మరికొన్ని వ్యక్తిగత కారణాలకి కూడా తిరుమల-తిరుపతి అంటే ఇష్టం నాకు. ప్రసాద్ రచనా శైలితో పాటు, నాకున్న ఈ ఇష్టం కూడా పేజీలు చకచకా సాగడానికి కారణమయ్యింది.

జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని తార్కిక కోణం నుంచి చూడడం వీలుకాదు. హేతువుకీ, తర్కానికీ అందనివెన్నో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి అనుభవాలే, ప్రపంచంలో అత్యంత సంపన్నమైన ఆలయాల్లో ఒకదానికి కార్య నిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి జీవితంలో జరిగితే వాటి తాలూకు ఫలితాలు ఎలా ఉంటాయన్నదే 'సర్వసంభవామ్' పుస్తకం. అంతే కాదు, దేవస్థానానికి సంబంధించిన ముఖ్యమైన పదవిలో ఓ దైవ భక్తుడు ఉంటే, దానివల్ల భక్తులకీ, దేవస్థానానికీ ఎటువంటి ప్రయోజనం ఉంటుందన్నది కూడా చెబుతుందీ రచన.


తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ఇవాళ మనం చూస్తున్న రూపంలో, అనుభవిస్తున్న సౌకర్యాలతో ఉండడం వెనుక ఉన్న అనేకమందిలో ప్రసాద్ ఒకరు. 'మాస్టర్ ప్లాన్' అమలు చేయడం మొదలుపెట్టిన తొలి అధికారి ఆయన. ఆ సందర్భంలో ఎన్నో ఒత్తిడులు ఎదురైనా, తనని ముందుకు నడిపిన శక్తి శ్రీనివాసుడే అంటారాయన. మొత్తం ముప్ఫై అధ్యాయాలున్న ఈ పుస్తకంలో ప్రతి అధ్యాయమూ పాఠకులని ఆశ్చర్యంలో ముంచెత్తేదే.అసలు ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని విచిత్రాలు జరిగే అవకాశం ఉందా అన్న ఆశ్చర్యం ఒక్కసారన్నా కలగక మానదు.

తాళ్ళపాక అన్నమాచార్య కీర్తనలని పరిష్కరించిన రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ ను, ఆయన జీవితపు చివరి క్షణాల్లో 'దేవస్థానం ఆస్థాన విద్వాంసుడి' గౌరవంతో సత్కరించడం, ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఎమ్మెస్ సుబ్బులక్ష్మి చేత (నమ్మలేని నిజం ఇది) అన్నమయ్య కీర్తనలు పాడించి, అటు ఆ గాయనికి సాయం చేయడంతో పాటు కీర్తనలని ప్రాచుర్యంలోకి తీసుకురావడం లాంటి సంఘటనలు ఎక్కువమందికి తెలిసే అవకాశం ఉండకపోయేది, ఈ పుస్తకం రానట్టైతే. కుటుంబమంతా ఏళ్ళ తరబడి ఒంటిపూట ఉపవాసాలు చేసి, దాచిన సొమ్ముతో స్వామికి బంగారు హారం చేయించి బహూకరించిన భక్తుల గురించి మాత్రమే కాదు, ఎవరో చెప్పినట్టుగా సరైన సమయానికి నవరత్నాలని కానుకగా తెచ్చి ఓ ముఖ్యమైన 'సేవ' ఆగిపోకుండా సాయపడ్డ భక్తుడి గురించీ ఇంత వివరంగా మరొకరు చెప్పలేరు.

ఒత్తిళ్ళు అనేవి ఏ ఉద్యోగికైనా తప్పవు. ప్రభుత్వోగికి మరీ ఎక్కువ. పైగా, తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రతిష్టాత్మకమైన చోట ఉన్నతోద్యోగం చేసే వారికి ఉండే ఒత్తిళ్ళు ఊహకి కూడా అందవు. ముఖ్యమంత్రి, మంత్రులు, చీఫ్ సెక్రటరీ, ప్రతిపక్షాలు..ఇలా అనేక దిక్కులనుంచి ఎదురయ్యే ఒత్తిడులని సమర్ధవంతంగా ఎదుర్కొని అవుననిపించుకోడం కత్తిమీద సామే. ఆ సాముని సక్రమగా చేయడం వెనుక 'స్వామి' కృప ఉందంటారు ప్రసాద్. ప్రత్యేక కళ్యాణోత్సవం మొదలు పెట్టడం మొదలు, పద్మావతి అతిధి గృహం నిర్మించడం వరకూ ప్రతి పనిలోనూ, ప్రతి దశలోనూ ఎదురైన ఒత్తిడులని వివరంగా అక్షరబద్ధం చేశారాయన.

శ్రీవెంకటేశ్వర స్వామికి వజ్రాల కిరీటం చేయించే మిష మీద, స్వామికి చెందిన వజ్రాలని ప్రసాద్ దొంగిలించారన్నది ఆయనపై వచ్చిన అతిపెద్ద ఆరోపణ. ఈ ఆరోపణని నేరు గా విచారించారు, అప్పుడే ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న ఎన్టీ రామారావు. వజ్రాలతో పాటు, తనపై మరో రెండు ఆరోపణలకి సంబంధించి వివరంగా రాసిన కథనం 'ఎన్టీఆర్ దృష్టిలో మూడు నేరాలు.' కేవలం వృత్తిగత విషయాలే కాకుండా, వ్యక్తిగత అంశాలకీ ఈ పుస్తకంలో చోటిచ్చారు ప్రసాద్. తన బాల్యం, నేపధ్యం, భార్యాపిల్లలకి సంబంధిచిన విషయాలని సందర్భానుసారంగా ప్రస్తావించారు. తిరుమల పై భక్తీ, నమ్మకం ఉన్నవాళ్ళందరినీ ఆకట్టుకునే రచన ఇది. (ఎమెస్కో ప్రచురణ, పేజీలు 271, వెల రూ.100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

ఆదివారం, ఆగస్టు 26, 2012

'కన్యాశుల్కం' కబుర్లు...

తెలుగు నాట సాంఘిక నాటకం అనగానే మొదట గుర్తొచ్చేది 'కన్యాశుల్కం.' గురజాడ అప్పారావు పంతులు గారి అపూర్వ సృష్టి. ఏళ్ళు గడుస్తున్నా కన్యాశుల్కాన్ని తలదన్నే నాటకం తెలుగునాట రాకపోవడం అన్నది, ఈనాటకం గొప్పదనమా లేక తర్వాతి తరాల్లోని రచయితల కృషిలో లోపమా అన్నది ఇప్పటికీ శేష ప్రశ్నే. 'కన్యాశుల్కం' సృష్టికర్త గురజాడ నూట యాభయ్యో జయంతి సందర్భంగా, ఈనాటకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శింప బడుతోంది, ఇప్పటి ప్రేక్షకులకి తగ్గట్టుగా క్లుప్తీకరింపబడి. హైదరాబాద్ కి చెందిన 'రసరంజని' చేస్తున్న ప్రయత్నం ఇది. 

'కన్యాశుల్కం' పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది గిరీశం. ఆ వెనుక మధురవాణి, రామప్పంతులూ, అగ్నిహోత్రావధాన్లూ, లుబ్దావధాన్లూ, ఇంకా మిగిలిన వాళ్ళందరూను. 'డామిట్! కథ అడ్డం తిరిగింది' (గిరీశం), 'తాంబోళం ఇచ్చేశాను, తన్నుకు చావండి' (అగ్నిహోత్రావధాన్లు), 'విద్య వంటి వస్తువు లేదు' (రామప్పంతులు), 'బుద్ధికి అసాధ్యం ఉందేమో కానీ, డబ్బుకి అసాధ్యం లేదు' (మధురవాణి)...ఇలా ఎన్నో సంభాషణలు ఇప్పటికీ జనం నాలుకమీద ఆడుతూ ఉంటాయి. బహుశా, ఇదే ఈ నాటకం విజయ రహస్యమేమో కూడా.

మొదట్లో ఇది ఎనిమిది గంటల నాటకం. తర్వాత, గురజాడే స్వయంగా పూనుకుని కొంత సంక్షిప్తం చేశారు. అయినప్పటికీ ప్రదర్శన నిడివి ఐదారు గంటలు. ఇప్పటివరకూ ఆరు తరాల నటులు వేలాది ప్రదర్శనలు ఇచ్చిన నాటకం ఇది. 'కన్యాశుల్కం' నాటకంలో వేషం వేసిన ప్రముఖుల జాబితా చాలా పెద్దది. తెలుగు రంగస్థలం అనగానే మొదట గుర్తొచ్చే స్థానం నరసింహారావు మధురవాణిగా అలరించారు. ఇక, 'కవిసామ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ ఎంతో మనసుపడి వేసిన వేషం రామప్పంతులు. అదికూడా, యాదృచ్చికంగా దొరికిన అవకాశం.


ఇప్పటి రోజుల్లో ఐదారు గంటల నాటకం అంటే ఆడే వాళ్ళకే కాదు, చూసే వాళ్లకి కూడా ఓపిక చాలని వ్యవహారం. కాలక్రమేణా కుదింపులు జరిగీ, జరిగీ ప్రస్తుతం రెండు గంటల నిడివిలో ప్రదర్శింప బడుతోంది. గిరీశం, బుచ్చమ్మని లేవదీసుకు పోయాడన్నసంగతి తెలిసి, ఆగ్రహంతో ఊగిపోయిన అగ్నిహోత్రావధాన్లు వెంకటేశాన్ని దండించడంతో అయిపోతుంది ప్రదర్శన. మధురవాణి ఇంట్లో పోలిశెట్టి బృందం పేకాట, కంటె కోసం మధురవాణి చేసే హంగామా, సారాయి దుకాణం, బైరాగి తత్వాలు, సౌజన్యారావు పంతుల్ని మధురవాణి కలుసుకోవడం...ఇవన్నీ పుస్తకంలో చదువుకోవాల్సిందే.

'యద్భావం తద్భవతి' అన్నది 'కన్యాశుల్కం' నాటకానికి బహుచక్కగా వర్తిస్తుంది. మనం ఏం చూడాలనుకుంటే అదే దొరుకుంతుంది ఈ నాటకంలో. "గిరీశం ఇచ్చిన లెక్చరు విన్న బండివాడు అడుగుతాడూ, 'సొరాజ్యం వస్తే మా ఊరి కనిస్టీబుకి బదిలీ అవుతుందా బాబయ్యా?'అని. అంటే, పోలీసుల హింస ఈనాటిది కాదు. కన్యాశుల్కం రాసిన రోజులనుంచీ ఉందని తెలుసుకోవాలి మనం," మానవహక్కుల గురించి ఉపన్యాసం ఇస్తూ, ప్రొఫెసర్ హరగోపాల్ వెలిబుచ్చిన అభిప్రాయమిది. ఇక, తెలుగు భాషోద్యమంలో చురుగ్గా ఉన్న ఏబీకే ప్రసాద్ ఓ సందర్భంలో ఏమన్నారంటే :"ఏదీ ఒక పర్యాయం అబ్బీ మీరూ ఇంగిలీషులో మాట్లాడండి నాయనా' అని గిరీశాన్ని అడుగుతుంది వెంకమ్మ. చదువురాని ఆ పల్లెటూరి గృహిణికి కూడా ఇంగ్లిష్ మీద ఎంత మోజు ఉందో అర్ధమవుతుంది!" 

రంగస్థల, సినీ నటుడూ, రచయితా గొల్లపూడి మారుతి రావుకి 'కన్యాశుల్కం' నాటకం అంటే మహా ఇష్టం. ఆమధ్య మాటీవీ కోసం తీసిన సీరియల్లో గిరీశం వేషం వేశారు కూడా. ఈ నాటకంలో మొట్టమొదటి డైలాగు 'సాయంకాలమైంది' ని తన నవలకి శీర్షికగా ఉంచారు గొల్లపూడి. సావిత్రీ, రామారావూ నటించిన 'కన్యాశుల్కం' సినిమా (హీరో పేరు ముందు రాయాలనే సంప్రదాయానికి మినహాయింపున్నకొన్ని సినిమాల్లో ఇదీ ఒకటి), గురజాడ వారి రచనని పెద్ద ఎత్తున తెలుగు వాళ్లకి దగ్గర చేసింది. అయితే, ఈ సినిమా కారణంగా "సినిమా చూసేశాం కదా, ఇక నాటకం చదవడానికి ఏముంది?" అనే ధోరణి ప్రబలడం విషాదం. దూరదర్శన్ లో జేవీ రమణమూర్తి 'గిరీశం,' శృతి 'మధురవాణి'గా పదమూడు వారాల సీరియల్ ప్రసారమయ్యింది, చాన్నాళ్ళ క్రితం.

తెలుగునాట మధురవాణి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పురాణం సుబ్రహ్మణ్య శర్మ అనేకానేకమంది ప్రముఖుల్ని మధురవాణి చేత ఊహాత్మక ఇంటర్యూలు చేయిస్తే, పెన్నేపల్లి గోపాలకృష్ణ ఏకంగా 'మధురవాణి ఊహాత్మక ఆత్మకథ' రాసేశారు. "ఏముందీ కన్యాశుల్కం? కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కులాలకి సంబంధించిన విషయం.. ఇప్పుడు ఏమాత్రం సమకాలీనం కాదు. అయినా ఊరికే నెత్తిన పెట్టుకుంటున్నారు," అన్నది 'కన్యాశుల్కం' మీద వినిపించే ప్రధాన విమర్శ. జనాదరణ లేని ఏ కళారూపమూ సుదీర్ఘ కాలం మనజాలదని, ఈ విమర్శకులకి గుర్తు చేయాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఇది కొత్త విషయం ఏమీ కాదు కదా. (ఫోటో కర్టెసీ: The Hindu)

శనివారం, ఆగస్టు 18, 2012

సామి కుంబుడు

పొరుగు రాష్ట్రాల్లో ఉన్న టీ ఎస్టేట్లకీ, తెలుగు పాఠకులకీ మధ్య అందమైన సాహితీ వారధులు, సి. రామచంద్ర రావు కథలు. గడిచిన అరవై ఏళ్ళ కాలంలో కేవలం తొమ్మిది కథలు మాత్రమే రాసి, 'వేలు పిళ్ళై' కథా సంకలనాన్ని మూడు దఫాలుగా వెలువరించిన రామచంద్ర రావు తన ఎనభై ఒకటో ఏట రాసిన తాజా కథ 'సామి కుంబుడు.' సుదీర్ఘ కాలంపాటు టీ ఎస్టేట్ లో ఉన్నతోద్యాగాలు చేసిన ఈ రచయిత రాసిన మెజారిటీ కథల్లో లాగానే, ఈ కథకీ నేపధ్యం టీ ఎస్టేటే.. ఇంకా చెప్పాలంటే, టీ ఎస్టేట్ యాజమాన్యానికీ-పనివాళ్ళకి మధ్యన తగువే ఈ కథ ఇతివృత్తం.

కథాస్థలం సీఫోర్త్ టీ ఎస్టేట్. ప్రతి ఐదేళ్లకీ ఓసారి టీ తోటల్లో తప్పక జరిపించాల్సిన ప్రూనింగ్, ఆ సంవత్సరం గూడలూరు మలై డివిజన్లో జరుగుతోంది. టీ చెట్లని నిర్ణీత ఎత్తుకి మించి పెరగనివ్వకూడదు. అలా పెరగనిస్తే లేత టీ ఆకులు దొరకవు, పైగా ఎత్తైన చెట్ల నుంచి ఆకు తెంపడం కూలీలకి కష్టమవుతుంది. వేసవి ముగిసి, వర్షాలు మొదలు కాగానే ప్రూనింగ్ పని మొదలు పెడతారు నిపుణులైన పనివాళ్ళు. ఎంతో బాధ్యతగా పని చేసే ప్రూనింగ్  పని వాళ్ళమీద పెద్దగా నిఘా కూడా ఉండదు.

కానైతే, ఆ సంవత్సరం ప్రూనింగ్ పనివాళ్ళు 'గోస్లో' మొదలు పెట్టారు. ప్రతిరోజూ, చేయాల్సిన పనిలో నాలుగో వంతు మాత్రమే చేస్తున్నారు. ఈ పరిణామం ఎస్టేట్ మేనేజర్ సంపత్ దొర ముందుగా ఊహించిందే. కానైతే, పరిణామం తాలూకు తీవ్రత మాత్రం అతను ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంది. నిజానికి, యాజమాన్యానికీ ప్రూనింగ్ పని వాళ్ళకీ మధ్య వచ్చిన తగువు చాలా చిన్నది. పరిష్కారం కూడా సంపత్ చేతిలోనే ఉంది. కానీ, ఆ పరిష్కారం సంపత్ కి ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదు. ఓ మెట్టు దిగి రాడానికి అతను ఎంతమాత్రమూ సిద్ధంగా లేడు.

టీ తోటల్లో కులమతాలకీ, భాషా భేదాలకీ అతీతంగా పనివాళ్ళంతా కలిసి జరుపుకునే సంబరం ఒకటి ఉంది. దానిపేరు 'సామి కుంబుడు.' ప్రూనింగ్ పని మొదలు పెట్టే ముందు ప్రతి ఎస్టేట్ లోనూ జరుపుతారీ పండుగని. ఈ నిమిత్తం అయ్యే ఖర్చుని యాజమాన్యం ఆనందంగా భరిస్తుంది, 'సామి కుంబుడు బక్షిస్' రూపంలో. మొత్తంగా అయ్యే ఖర్చు ఓ రెండొందల రూపాయలు. ఆ సంవత్సరం ప్రూనింగుకి రెండు నెలల ముందే పని వాళ్ళంతా ఆందోళనలు చేసి, యాజమాన్యాలు వేతనాలు పెంచేలా చేసుకున్నారు.

ఇలా పెంచడం ఏమాత్రం ఇష్టం లేదు సంపత్ కి. అయినప్పటికీ ఇది అన్ని టీ ఎస్టేట్లకీ సంబంధించిన విషయం కాబట్టి కొత్త వేతన ఒప్పందాన్ని ఒప్పుకోక తప్పదు అతనికి. ఇందుకు ప్రతిగా, అగ్రిమెంట్ లో లేదనే కారణంతో 'సామి కుంబుడు బక్షిస్' నిలిపివేస్తాడు. యాజమాన్యం 'సామి కుంబుడు' జరపలేదు కాబట్టి, గోస్లో బాట పడతారు పనివాళ్ళు. ప్రూనింగ్ పని జరుగుతున్నట్టే ఉంటుంది, కానీ జరగదు. యజమానికీ పనివారికీ మధ్య నలిగిపోతాడు కండక్టర్ ఆరుళ్ దాస్. ఇంతకీ, పనివాళ్ళు తమ బక్షిస్ ని ఎలా సాధించుకోగలిగారు అన్నదే కథ ముగింపు.

టీ, కాఫీ ఎస్టేట్లు, తాజా గాలి పరిమళాలు, మలుపులు తిరిగే ఘాట్ రోడ్లు, 'దొరల' పట్ల విధేయంగా ఉంటూనే తమకి కావాల్సింది సాధించుకునే ఎస్టేట్ కూలీలు..ఇవన్నీ కాఫీ/టీ తోటలు నేపధ్యంగా రామచంద్రరావు గతంలో రాసిన కథలని గుర్తు చేస్తాయి. పాత్ర చిత్రణ, కథని నడిపే తీరు...ఈ రెండూ రచయిత బలాలు. ఒక్కో పాత్రనీ ఎంత నిశితంగా చిత్రిస్తారంటే, కథ చదువుతుంటే ఆ పాత్రలు కళ్ళముందు నిలబడాల్సిందే. పనివాడు బెల్లా మొదలు (నాకు 'గాళిదేవరు' కథలో మాంకూ గుర్తొచ్చాడు) సంపత్ స్నేహితుడు రాజారాం వరకూ ప్రతిఒక్కరూ పాఠకులకి తెలిసినవాళ్ళు అయిపోతారు.

కథని తాపీగా చెప్పడం రామచంద్రరావు గారి పధ్ధతి. ఎక్కడా ఉరుకులూ, పరుగులూ ఉండవు. అలాగని చదవలేకపోవడమూ ఉండదు. కథ మొదలు పెట్టామంటే ఏకబిగిన ముగించాల్సిందే. 'సామి కుంబుడు' క్లైమాక్స్ కి సంబంధించి ఒకటి రెండు చిన్నపాటి క్లూలని ఇచ్చినప్పటికీ, ఓ.హెన్రీ తరహా మెరుపు ముగింపునే ఇచ్చారు. కనీసం మూడు తరాల తెలుగు పాఠకులని తన కథల కోసం ఎదురుచూసేలా చేసిన రామచంద్ర రావు గారు కొంచం తరచుగా కథలు రాస్తే బాగుండును. (ఆదివారం ఆంధ్రజ్యోతి సెప్టెంబరు 4, 2011 సంచికలో 'సామి కుంబుడు' కథని చదవొచ్చు).

ఆదివారం, ఆగస్టు 12, 2012

మన బంగారం...

బంగారంతో భారతీయుల అనుబంధం ఈనాటిది కాదు. అనాదిగా భారతీయ సంస్కృతిలో బంగారం ఓ భాగం. ఇక్కడి స్త్రీపురుషులు ధరించినన్ని స్వర్ణాభరణాలని మరెక్కడా అలంకరణకి ఉపయోగించరనడంలో అతిశయోక్తి లేదు. కేవలం అలంకారంగా మాత్రమే కాదు, పసిడిని మదుపు గా చూడడమూ మనకి తాత ముత్తాలల కాలం నుంచీ ఉన్నదే. పిల్లలకివ్వడంకోసం వాళ్ళు దాచినవి భూమి, బంగారం. మరికొంచం స్పష్టంగా చెప్పాలంటే  భూమి మగ పిల్లలకి, బంగారం ఆడపిల్లలకీను.

ఇంతగా మన జీవన విధానంతో పెనవేసుకుపోయిన బంగారమే ఇప్పుడు మన ఆర్ధిక వ్యవస్థకి సవాలు విసురుతోంది అంటున్నారు నిపుణులు. రాన్రానూ బంగారం కొనుగోళ్ళు శరవేగంతో పెరుగుతున్నాయి భారతదేశంలో. దేశీయంగా ఉత్పత్తి బహుతక్కువగా ఉన్న ఈ లోహాన్ని విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నాం మనం. ఫలితంగా, పెద్దమొత్తంలో మన మారకద్రవ్యం బంగారం కింద ఖర్చైపోతోంది. దీని ప్రభావం, అత్యవసరమైన ఇతర దిగుమతులమీద పడక తప్పడం లేదు.

అధికారిక లెక్కలనే తీసుకుంటే, 2010-11 సంవత్సరంలో నలభై యూఎస్ బిలియన్ డాలర్లని బంగారం కొనుగోలు కోసం వెచ్చించాం మనం. తర్వాతి సంవత్సరానికి వచ్చేసరికి ఆ మొత్తం అరవై యూఎస్ బిలియన్ డాలర్లకి పెరిగింది, ఒక్కసారిగా. అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) అంచనాల ప్రకారం, 2015 సంవత్సరం నాటికి ఈ మొత్తం వంద యూఎస్ బిలియన్ డాలర్లు దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏ ఇతర దేశంలో పోల్చినా, భారతదేశంలో బంగారానికి డిమాండ్ శరవేగంగా పెరుగుతోంది.


ఈ డిమాండ్ కి కారణం కేవలం ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం మాత్రమేనా? అర్దికవేత్తలు చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిణామం ఇది. దేశ ఆర్ధిక పరిస్థితిని గురించి అవగాహన ఉన్న వాళ్ళ దృష్టిలో ఇదో 'వేలం వెర్రి.' పసిడికి పెరుగుతున్న డిమాండ్ ద్రవ్య లోటుకి దారి తీస్తోందన్నది, ప్రముఖ ఆర్ధికవేత్త సి. రంగరాజన్ పరిశీలన. ఇక, అసోచామ్ అయితే మరో అడుగు ముందుకు వేసి బంగారం మీద దిగుమతి సుంకాలు మరింత పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ప్రజల కొనుగోలు శక్తి మొత్తం బంగారం మీదే కేంద్రీకృతం అయితే, మిగిలిన రంగాలు దెబ్బ తింటాయన్నది ఈ సంస్థ వాదన.

భారతీయ సమాజంలో మధ్యతరగతి కొనుగోలు శక్తి బాగా పెరగడం అన్నది గడిచిన పది-పదిహేనేళ్ళలో దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామం. నూతన ఆర్ధిక సంస్కరణలు, మరీ ముఖ్యంగా సాఫ్ట్ వేర్ బూం ఇందుకు బాగా దోహదం చేశాయి. పెట్టుబడి అనగానే మనకి మొదట గుర్తొచ్చేది బంగారమే. ఎందుకంటే, ఇది ఇవాళ కొత్తగా వచ్చినది కాదు, మన నరనరాల్లో జీర్ణించుకున్నది. 'తిరుగులేని పెట్టుబడి' అన్నది అందరి మాటానూ. అయితే, కేవలం ఈ ఒక్క కారణానికే మనం బంగారం కొంటున్నామా? దీనికి జవాబు 'కాదు' అనే వస్తుంది.

సంపాదనతో పాటు ప్రజల్లో అభద్రతా పెరిగింది, రేపటిరోజు గురించి చింత పెరిగింది. గడిచిన తరాలతో పోల్చుకుంటే, ఈ అభద్రత ప్రస్తుత తరంలో బాగా ఎక్కువ. కుప్ప కూలుతున్న ఆర్ధిక వ్యవస్థలు, ఫలితంగా దారుణంగా పడిపోతున్న షేర్ మార్కెట్లూ మన పెట్టుబడులకి సరైన ప్రత్యామ్నాయాన్ని చూపించలేక పోతున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరిగినా, దాని ఫలితం మన షేర్ మార్కెట్ మీద పడుతుంది. ప్రపంచీకరణకి మరో పార్శ్వం ఇది. షేర్ మార్కెట్ ప్రభావం బ్యాంకుల వడ్డీరేట్ల మీద పడుతుంది. ఎలా చూసినా, నగదు, డాక్యుమెంట్ల రూపంలో ఉన్న మన పెట్టుబడి మీద ఏదోరకంగా ప్రభావం ఉండి  తీరుతుంది.

ఈ నేపధ్యంలో, 'బంగారం కోసం ఎగబడుతున్నారు' అంటూ భారతీయులని ఆడిపోసుకోవడం ఎంతవరకూ సబబు? ప్రత్యామ్నాయాలు లేని రోజులనుంచీ బంగారాన్ని నమ్ముతూ వచ్చారు మన ప్రజ. ఇప్పటికీ, బంగారానికి దీటైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో అదే ధోరణి సాగిస్తున్నారు. ఒకవేళ, దేశ పరిస్థితులు దృష్టిలో పెట్టుకోకుండా బంగారం వెంట పడడం ప్రజల తప్పే అయితే, ఆ తప్పులో బంగారానికి ప్రత్యామ్నాయం చూపించలేని ప్రభుత్వానికీ వాటా ఉంటుంది. దేశ ఆర్ధిక పరిస్థితుల దృష్టిలో చూసినప్పుడు, ఈ ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టడం తక్షణావసరం.

శుక్రవారం, ఆగస్టు 10, 2012

కాలుతున్న పూలతోట

వేర్వేరు నేపధ్యాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకి ఉన్నట్టుండి మృత్యువు అనివార్యంగా వచ్చి పడబోతోందని తెలిసింది. వాళ్ళిద్దరూ కూడా కేవలం మూడు పదుల వయసు దాటినవాళ్ళు. భవిష్యత్తుని గురించి ఎన్నో ఆశలు, కలలు ఉన్నవాళ్ళు. అయితే, త్వరలోనే చనిపోబోతున్నామని తెలిసిన మరుక్షణం జీవితాన్ని గురించి ఇద్దరి దృక్పధాల్లోనూ ఊహించని మార్పు వచ్చేస్తుంది. పెద్ద చదువులు చదివి, బ్యాంక్ ఆఫీసరుగా ఉద్యోగం చేస్తున్న కుమార్ జీవితాన్ని అంతం చేసుకునే మార్గాల అన్వేషణ మొదలుపెడితే, నిరక్షరాస్యురాలైన నాగమణి మృత్యువుని ఎదుర్కొనే మార్గాలు వెతుకుతుంది.

యవ్వనాన్ని పూలతోటతో పోలుస్తారు మన రచయితలూ కవులూ. అయితే ఆ పూలతోట కాలిపోతోంది అంటున్నారు యువ రచయిత సలీం. అలా కాలుస్తున్న అగ్ని పేరు 'ఎయిడ్స్'. కుమార్, నాగమణి ఇద్దరూ జీవితాన్ని గురించి తమ దృక్పధాలు మార్చుకునేలా చేసింది కూడా ఈ వ్యాధే. ఇంతకీ వీళ్ళిద్దరూ సలీం నవలలో పాత్రలు. సాహిత్య అకాడెమీ బహుమతి (2009) అందుకున్న ఆ నవల పేరు 'కాలుతున్న పూలతోట.' 2005-06 లో సలీం ఈ నవల రాసేనాటికి దేశమంతా చర్చలో ఉన్న సమస్య 'ఎయిడ్స్.' ఈ ఇతివృత్తంతో తెలుగులో వచ్చిన తొలి నవల ఇది.

భార్య మాధురి, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతున్న కుమార్, అనుకోకుండా కాలేజీ నాటి స్నేహితురాలు సుధీరని కలుస్తాడు. కాలేజీలో సుధీరకి ప్రేమలేఖలు అందించిన అనేకమందిలో కుమార్ కూడా ఒకడు. ఊహించని విధంగా కుమార్ కి దగ్గరవుతుంది సుధీర. ఓ కాన్ఫరెన్స్ కోసం మద్రాస్ వెళ్ళిన కుమార్ అక్కడే మూడు రోజులు గడుపుతాడు సుధీరతో. నెల తిరక్కుండానే, ఆమె నుంచి వర్తమానం వస్తుంది కుమార్ కి. పెళ్ళికి దూరంగా ఉంటూ, తనకి నచ్చిన అందరితోనూ స్వేచ్ఛా జీవితం గడిపిన సుధీరకి ఎయిడ్స్ సోకిందనీ, ఆమె మరణానికి దగ్గరగా ఉందనీ సారాంశం. కుమార్లో మృత్యుభయం మొదలవుతుంది.


ఒంగోలు పట్టణంలో ఓ బస్తీలో ఉండే లారీ క్లీనర్ కోటయ్య. భార్య నాగమణి, కొడుకు శ్రీను. ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడతాడు కోటయ్య. ధర్మాసుపత్రికి తీసుకెళ్ళిన నాగమణి కి తెలిసిన విషయం ఏమంటే, కోటయ్యకి ఎయిడ్స్ సోకి మరణానికి దగ్గరగా ఉన్నాడనీ, తనూ, కొడుకూ కూడా హెచ్ ఐ వీ పాజిటివ్ అనీ. ఉన్న సమస్య చాలదన్నట్టు, ఓ టీవీ ఛానల్ వాళ్ళు కోటయ్యని ఇంటర్యూ చేసి, కనీసం అతని ముఖం దాచకుండా టీవీలో చూపిస్తారు. దీనితో బస్తీ జనం నాగమణి కుటుంబాన్ని అక్షరాలా బయటికి గెంటేస్తారు. మరో బస్తీకి మారితే అక్కడ కూడా టీవీలో చూసిన వాళ్ళు గుర్తు పట్టేయడం, అప్పుడే కోటయ్య మరణించడంతో - భర్త శవంతో రోడ్డున పడుతుంది నాగమణి.

సుధీర ద్వారా అనకి ఎయిడ్స్ సోకిందేమో అన్న భయం నిలువనివ్వదు కుమార్ ని. అలాగని ఆ విషయాన్ని భార్యకి చెప్పలేదు, డాక్టర్ని కలవలేడు, మిత్రుల సలహా తీసుకోలేడు. తనకి ఎయిడ్స్ ఉందని నలుగురికీ తెలిస్తే ఇన్నాళ్ళూ భద్రం దాచుకుంటూ వస్తున్న పరువు ఒక్కసారిగా పోతుందనీ, భార్య బిడ్డలు ఎయిడ్స్ రోగి తాలూకు మనుషులుగా ముద్రపడి దుర్భర జీవితం గడపాల్సి వస్తుందనీ..ఇలా ఎన్నో భయాలు. భార్యా పిల్లలని కనీసం తాకలేడు, తన జబ్బు వారికి అంటుకుంటుందనే భయంతో. తన శరీరంలో ఏ చిన్న మార్పు జరిగినా అది ఎయిడ్స్ సంకేతమే అనుకుంటూ, తను చిత్రవధ అనుభవిస్తూ, చుట్టూ ఉన్నవాళ్ళకి నరకం చూపించడం మొదలుపెడతాడు కుమార్. 

కుమార్, నాగమణిల కథలు ఏ కంచికి చేరాయన్నది 'కాలుతున్న పూలతోట' ముగింపు. నిజానికి కథ, కథనాల మీద కన్నా ఎయిడ్స్ ని గురించి వివరంగా చెప్పడానికే మొగ్గు చూపారు సలీం. ఫలితంగా, అనేక ప్రచార మాధ్యమాల ద్వారా ఇప్పటికే తెలిసిన విషయాలనే మరోసారి చదవాలి పాఠకులు. సంభాషణల్లో నాటకీయత, విషయాన్ని వివరించే తీరు వ్యాసరూపంలో ఉండడం.. ఇవి భాష మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పాయి. అయితే, ఎయిడ్స్ బాధితుల పట్ల సమాజం వైఖరి మారాల్సిఉందన్న విషయాన్ని గట్టిగా చెబుతుందీ నవల. 

"సాహిత్య అకాడెమీ బహుమతి అందుకున్న పిన్న వయస్కుడిని నేను. అంతే కాదు, నా మాతృ భాష ఉరుదూ. బహుమతి వచ్చింది తెలుగులో నేరాసిన నవలకి. మాతృ భాష కాని భాషలో చేసిన రచనకి ప్రతిష్టాత్మక బహుమతి అందుకున్న తొలి రచయితనీ నేనే," అన్న సలీం మాటలు చాలాసార్లే గుర్తొచ్చాయి, నవల చదువుతుండగా. (పేజీలు 232, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

బుధవారం, ఆగస్టు 08, 2012

ఇంజినీరింగ్ 'మిధ్య'

నూతన ఆర్ధిక సంస్కరణల అనంతరం దేశంలో వేగవంతంగా చోటుచేసుకున్న మార్పుల్లో ఒకటి, ఇంజినీరింగ్ విద్యావకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడం. అప్పటివరకూ ప్రభుత్వ కాలేజీల్లో, కొద్దిమంది విద్యార్ధులకి మాత్రమే అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్ విద్య, ప్రైవేటు కాలేజీల రాకతో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది. గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ఉద్యోగావకాశాల ఫలితంగా, విద్యార్దులకన్నా ఎక్కువగా వారి తల్లిదండ్రులు తమ పిల్లలని ఇంజనీరింగ్ చదివించడానికి ఉత్సాహ పడుతున్నారు.

ప్రవేశం సులభతరం కావడం, మెడిసిన్ తో పోల్చి చూసినప్పుడు ఖర్చు బాగా తక్కువ కావడం, చదువు పూర్తవ్వక మునుపే ఊరించే ఉద్యోగావకాశాల పుణ్యమా అని ఏటా ఈ కోర్సుకి డిమాండ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఫలితంగా, కూతవేటు దూరంలోనే ఇంజినీరింగ్ కాలేజీలు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్యే ఏడు వందల పైచిలుకు. పొరుగు రాష్ట్రాల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీలేదు.

అయితే రాన్రానూ ఇంజనీరింగ్ వాళ్లకి వెంటనే 'కేంపస్' (కేంపస్ సెలక్షన్స్) రావడం లేదన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకులతో పాటుగా, ఇంజనీరింగ్ విద్యలో క్షీణిస్తున్న నాణ్యతని కూడా ఇందుకు కారణంగా చెబుతున్నారు నిపుణులు. 'మళయాళ మనోరమ' గ్రూప్ నుంచి వచ్చే 'ది వీక్' పత్రిక తాజా సంచికలో (జూలై 29) ఇంజనీరింగ్ విద్యపై వచ్చిన ఓ కథనం ఆసక్తికరంగా అనిపించింది. ఆ పత్రిక, ఒక సర్వే సంస్థతో కలిసి పదమూడు రాష్ట్రాల్లో 198 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న ముప్ఫై నాలుగువేల మందిని సర్వే చేసి రిపోర్టు ప్రచురించింది.

సదరు సర్వే ప్రకారం, మన ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో కేవలం పన్నెండు శాతం మంది మాత్రమే వెంటనే ఉద్యోగంలో చేరేందుకు అర్హులు. మరో యాభై రెండు శాతం మంది శిక్షణ తర్వాత ఉద్యోగం చేయగలుగుతారు. ఇక, మిగిలిన ముప్ఫై ఆరు శాతం మందీ కనీసం శిక్షణకి కూడా అర్హులు కారు! కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు, అనలిటికల్ అబిలిటీ, రీజనింగ్ తదితరాల్లోనూ బాగా వెనుకబడి ఉన్నారు మన విద్యార్ధులు. కేవలం పెట్టుబడి, రాజకీయ పలుకుబడీ ఉంటే చాలు, ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించేయ గలగడం, ఈ కాలేజీలపై నియంత్రణ లేకపోవడం, బోధనా సిబ్బంది కొరత.. ఇలా ఎన్నో కారణాలు.

సరిగ్గా ఇదే సమయంలో, విద్యార్ధుల ఫీ-రీ ఎంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించే విషయంలో రాష్ట్రంలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రజలకి అనేక "మేళ్ళు" చేయడంలో భాగంగా మొదలైన ఈపథకం, ప్రభుత్వానికి ఓ తెల్ల ఏనుగుగా మారిందిప్పుడు. ఉచిత విద్య ఉచితమా, అనుచితమా అన్న ప్రశ్న అప్పుడు రాలేదు. ఇప్పుడు వస్తోంది. ఒక్కసారిగా ఈ పథకాన్ని తొలగించకుండా, విడతలు విడతలుగా నీరుగార్చే అవకాశం ఉంది. నిజానికి, 'అర్హత' 'ప్రతిభ' తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య అందించడం ఎంతవరకూ సబబు? ఉచితంగా వచ్చే చదువు విలువ ఎంతమంది విద్యార్ధులకి తెలుస్తుంది??

కేవలం మన రాష్ట్రం అనే కాదు, ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంచేందుకు దేశ వ్యాప్తంగా కృషి జరగాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో, ఇండియా బలం మానవ వనరులే. ఈ వనరులని సాధ్యమైనంత బాగా ఉపయోగించుకోవాలంటే తగిన విధంగా శిక్షణ అందించాలి. ఈ శిక్షణ కళాశాలల ద్వారానే జరగాలి. అలా జరగాలంటే, కళాశాల మీద నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఇప్పటికే సాచ్యురేటెడ్ దశకి చేరుకున్న ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్యని మరింత పెంచకుండా, ఉన్నవాటిలో వనరులు, సౌకర్యాలని మెరుగు పరచడం తక్షణావసరం. కాని పక్షంలో, మన బలంగా చెప్పుకుంటున్న మానవ వనరులే బలహీనతగా మారిపోయే ప్రమాదం కనిపిస్తోంది..

శనివారం, ఆగస్టు 04, 2012

నాయికలు-స్రవంతి

జీవితాన్ని గురించి స్థిరమైన అభిప్రాయాలు ఉన్నవాళ్ళూ, తమకి ఏం కావాలో స్పష్టంగా తెలిసిన వాళ్ళూ కొందరే ఉంటారు. వాళ్ళలో కూడా, కావలసినదాన్ని సాధించుకునే చొరవా, తెగువా ఉన్నవాళ్ళు తక్కువే. ఈ లక్షణాలన్నీ ఓ అమ్మాయికి ఉంటే, ఆమె 'స్రవంతి' అవుతుంది. జీవితం పూలపానుపు కాదు స్రవంతికి. వయసులో బాగా పెద్దవాడూ, తనని నిర్లక్ష్యం చేసినవాడూ అయిన భర్త. ఐదుగురు స్త్రీలతో సంబంధం పెట్టుకున్న అతగాడు, ఓ రాత్రివేళ హత్యకి గురవుతాడు. శవాన్ని గుర్తించడమే కష్టమవుతుంది పోలీసులకి.

భర్త మరణం ఇరవై ఏడేళ్ళ స్రవంతికి స్వేచ్చని ఇస్తుంది. సౌకర్యంగా బతకడానికి అవసరమైన డబ్బునీ ఇస్తుంది. అయితే, ఓ వయసులో ఉన్న స్త్రీకి జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి ఇవి మాత్రమే సరిపోతాయా? తనకి చాలవని స్పష్టంగా తెలుసు స్రవంతికి. కావలసినవి ఏమిటో కూడా తెలుసు. భర్త సంవత్సరీకం రోజున దైవ దర్శనం కోసం తిరుపతి వెళ్ళిన స్రవంతికి కనిపిస్తాడు శ్రీనివాస్. తను ఉంటున్న హైదరాబాద్ లోనే ఉంటూ, అంతకు మునుపే కొద్దిపాటి పరిచయమైన శ్రీనివాస్ తో అనుబంధం పెంచుకోవాలని నిర్ణయించుకుంటుంది ఆమె.

స్వతహాగా తెలివైన అమ్మాయి స్రవంతి. తొందరపడి నిర్ణయం తీసుకోదు. ఒకసారి తీసుకున్నాక, వెనక్కి తగ్గదు. అనుకున్నది సాధించుకోవడం ఎలాగో ఆమెకి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు. ఓ ప్రైవేట్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేసే ముప్ఫై నాలుగేళ్ల శ్రీనివాస్ కి భార్య ఇందిర, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇందిరతో సఖ్యంగానే ఉంటున్న శ్రీనివాస్ దృష్టిలో మరో స్త్రీ లేదు. జీవితం సంతోషంగానే ఉంది అతనికి. ఓ మొక్కు తీర్చుకోడానికి ఒంటరిగా తిరుపతి వెళ్ళిన శ్రీనివాస్ పక్క కాటేజీలోనే తనూ గది తీసుకుంటుంది స్రవంతి. ఓ రాత్రివేళ అతనికి దగ్గరవుతుంది. శ్రీనివాస్ దృష్టిలో ఆ పరిచయం ఆ రాత్రికే పరిమితం.. కానీ స్రవంతి ఆలోచన వేరు. ఆమెకి అతను కావాలి.

హైదరాబాద్ తిరిగి వచ్చాక కూడా, స్రవంతితో అనుబంధం కొనసాగుతుంది శ్రీనివాస్ కి. స్రవంతి చొరవే ఇందుకు కారణం. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న స్రవంతి, ఒంటరిగా ఉంటోంది ఓ అపార్ట్ మెంట్లో. ఆ ఇంటి డూప్లికేట్ తాళం చెవి శ్రీనివాస్ కి ఇస్తుంది, అతను ఏ వేళలో అన్నా ఆమె ఇంటికి రాడానికి వీలుగా. అర్ధరాత్రి వచ్చినా తలుపు తట్టనవసరం లేకుండా. తన జీవితంలో అతను తప్ప మరో మగాడు లేడని చెప్పకనే చెబుతుందామె. పూర్తిగా మధ్యతరగతి మనస్తత్వం శ్రీనివాస్ ది. ఏ ఖర్చూ లేకుండా దొరికే శారీరక సౌఖ్యం సంతోష పెడుతుంది అతన్ని. అంతకు మించి, ఇందిరకి అన్యాయం చేస్తున్నానన్న భావన నిలువనివ్వదు. ఇంట్లో ఉన్నంతసేపూ భార్యని ఎక్కువ ప్రేమగా చూసుకుంటూ, ఆ లోటుని భర్తీ చేసుకుంటున్నట్టుగా భావించుకుని తృప్తి పడుతూ ఉంటాడతను.

స్రవంతికి తెలుసు, ఇందిర విషయంలో శ్రీనివాస్ మానసిక సంఘర్షణ. కానీ, ఆమెకి శ్రీనివాస్ కావాలి. శ్రీనివాస్ మాత్రమే కావాలి. ఎందుకంటే, అతన్ని మనస్పూర్తిగా ప్రేమించింది ఆమె. మొదట్లో కేవలం శారీరక సుఖం కోసమే స్రవంతి ఇంటికి వెళ్ళిన శ్రీనివాస్ కి ఆమెతో ప్రేమలో పడడానికి, మానసిక అనుబంధం ధృడ పడడానికీ ఎక్కువ సమయం పట్టదు. పట్టనివ్వదు స్రవంతి. అతని సమక్షంలో అతనికి నచ్చే మాటలే మాట్లాడుతుంది, ఇష్టమైన పనులే చేస్తుంది. అతనిలో ఉన్న బద్ధకాన్నీ, చిన్న చిన్న చెడు అలవాట్లనీ వదిలిస్తుంది. మొత్తంగా, అతని జీవితం మీద తనదైన ముద్ర వేస్తుంది స్రవంతి. అయినప్పటికీ, అతని విషయంలో ఆమెలో ఏదో అభద్రత.

స్రవంతి భయపడినట్టే జరుగుతుంది. ఉన్నట్టుండి, ఆమెకి దూరంగా జరగాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు శ్రీనివాస్. దూరం ఊరికి బదిలీ కోరతాడు కూడా. ఆమె ఇంటికి వెళ్ళకుండా ఉండడానికి తీవ్రంగా ప్రయత్నించి, కొంత మేరకు విజయం సాధిస్తాడు. కానీ, అతని మనసుని పూర్తిగా ఆక్రమించుకున్న స్రవంతి, అతన్ని దూరంగా ఉండనివ్వదు. తన నిర్ణయాన్ని ఆమెకి చెప్పేసి, విడిపోవడం కోసం ఆమె ఇంటికి వెళ్ళిన శ్రీనివాస్ ని, ఆ నిర్ణయాన్ని కేవలం రెండు నెలలు వాయిదా వెయ్యమని కోరుతుంది స్రవంతి. అయితే, ఆ రెండు నెలల కన్నా ముందే ఆశ్చర్యకరంగా అతని జీవితం నుంచి తప్పుకుంటుంది ఆమె.

జీవితంలో మనకి ఎదురయ్యే అందరినీ తప్పొప్పుల తూకంలో వేయలేం. ఎందుకంటే ఈ తప్పూ, ఒప్పూ అనేవి పరిస్థితులని బట్టి మారిపోతూ ఉంటాయి. స్రవంతిని కూడా అంతే. తనకి కావల్సిందేమిటో తెలిసిన స్రవంతి, దానిని సాధించుకునే ఓర్పూ, నేర్పూ ఉన్న స్రవంతి... అందుకోసం ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. శ్రీనివాస్ సంఘర్షణని అర్ధం చేసుకుని అతన్ని ఊరడించినది. అతన్ని కేవలం తన అవసరం తీర్చుకునే సాధనంగా కాక, తనవాడిగా ప్రేమించింది. జీవితాన్ని ఎంత బాగా గడపొచ్చో అతనికి నేర్పించింది. అతని ఎదురుగా తను లేకపోయినా, అతని ఆలోచనలలో ఎప్పటికీ ఉండిపోయేలాంటి అనుభవాలనీ, అనుభూతులనీ పంచింది.

"భగవంతుడు వజ్రానికుండే కాఠిన్యాన్ని, పులికుండే క్రూరత్వాన్ని, గుంటనక్కకుండే జిత్తులమారి తనాన్ని, మేఘానికుండే కన్నీటిని, గాలికి ఉండే చలనాన్ని, తేనెకుండే తీయదనాన్ని, ఉదయపుటెండకుండే వెచ్చదనాన్ని, పక్షి ఈకకుండే మృదుత్వాన్ని, లేడిపిల్లకుండే చురుకుదనాన్ని, పురివిప్పి ఆడే నెమలికుండే ఆకర్షణని, కుందేలుకుండే భయాన్ని తీసుకున్నాడు. వాటికి సామర్ధ్యాన్ని కలిపి, ఆ మొత్తాన్ని బాగా రంగరించి, ఆ మిశ్రమం లోంచి ఒక యువతిని తయారు చేశాడు. ఆమెని మగవాడికి బహుమతిగా ఇచ్చాడు." స్రవంతిని గురించి ఆమె సృష్టికర్త, ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి చేసిన పరిచయం ఇది. 'స్రవంతి' నవల చదువుతున్నప్పుడో, లేక చదివి పక్కన పెట్టాకో "ఇలాంటి స్త్రీ పరిచయం అయితే బాగుండు" అని కనీసం ఒక్క క్షమన్నా ప్రతి పాఠకుడూ అనుకుంటాడనడం అతిశయోక్తి కాదు.

('స్రవంతి' నవల ప్రస్తుతం అందుబాటులో లేదు. త్వరలోనే కొత్త ప్రింట్ మార్కెట్లోకి వస్తుందని భోగట్టా.. స్రవంతిని గురించి నాలుగు మాటలు రాయమని సూచించిన మిత్రులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు)