శనివారం, ఫిబ్రవరి 27, 2010

అలా అన్నాడు శాస్త్రి

మానవ నైజాన్ని ఎత్తి చూపడం లో ఒక్కో రచయితదీ ఒక్కో శైలి. గోదారొడ్డున జరిగే కథల్ని తనే మనకి స్వయంగా చెబుతున్న అనుభూతి కలిగించే విధంగా అక్షరీకరించే వంశీ మానవ నైజాన్ని ఇతివృత్తంగా తీసుకుని కథ రాస్తే..? "అరె.. అచ్చం వీళ్ళు మనకి తారసపడ్డ మనుషుల్లాగే ఉన్నారే!!" అనిపించక మానదు, వంశీ రాసిన కొన్ని కథల్లో పాత్రలని చూసినప్పుడు. ఆ కొన్ని కథల్లో ఒకటి 'అలా అన్నాడు శాస్త్రి.'

గోదారొడ్డున పల్లెటూరు. ఆ పల్లెటూళ్ళో కొందరు యువకుల స్నేహ బృందం. ఆ బృంద సభ్యుడు శాస్త్రి. పుస్తకాలంటే విపరీతమైన పిచ్చి. కనిపించిన ప్రతి పుస్తకాన్నీ విడిచి పెట్టకుండా చదువుతాడు. 'పుస్తకాలని ఎంచుకుని చదవడం' అన్నది శాస్త్రికి నచ్చని పని. ఆంధ్ర మహా భారతం నుంచి అంబడిపూడి వాళ్ళ పుస్తకాల వరకూ కాదేదీ చదవడానికి అనర్హం శాస్త్రికి.

పాఠకుడు ముదిరి కవో, రచయితో లేక రెండూనో అవ్వడం చాలామంది విషయంలో జరిగే అత్యంత సహజమైన పరిణామం. శాస్త్రి విషయంలో కూడా జరిగింది అదే. పుస్తకాలు చదివి చదివి అలవోకగా కవితలు అల్లడం మొదలు పెడతాడు. మిత్రులెవ్వరూ అతని కవితలని సీరియస్ గా తీసుకోరు. పైగా రాసినవి సరి చేసుకోమనీ, ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలనీ సలహాలూ, సూచనలూ ఇస్తూ ఉంటారు.

కేవలం తన కవితలని అందరికీ చదివి వినిపించడం మాత్రమే కాకుండా మరో కొత్త పని మొదలు పెడతాడు శాస్త్రి. ఆ ఊళ్ళో ఉండే ఒక పాక హోటల్లో బయట ఉంటే నల్ల బోర్డు మీద ఆవేల్టి 'స్పెషల్స్' రాయగా మిగిలిన చోటులో ప్రతి రోజూ ఒక కవిత రాస్తూ ఉంటాడు. చదివిన వాళ్ళు చదువుతారు, చదవని వాళ్ళు చదవరు. మొత్తం మీద ఎవరూ పెద్దగా పట్టించుకోరు.

పొరుగునే ఉన్న దాక్షారం భీమేశ్వరుడి గుడిలో తను రాసిన 'ఆట కదరా శివా' సంపుటాన్ని చదవడం కోసం వస్తాడు సిని నటుడు, రచయిత తనికెళ్ళ భరణి. అనుకోకుండా కాఫీ హోటల్ బోర్డు మీదున్న కవిత చదివి, రాసింది ఎవరని ఎంక్వైరీలు మొదలు పెడతాడు. భరణి ని కలుస్తాడు శాస్త్రి. సాహిత్యాన్ని గురించి మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ. భరణి ద్వారా సినిమా పాటలు రాసే అవకాశం వస్తుంది శాస్త్రికి.

శాస్త్రి పాటలు రాసిన మొదటి సినిమా 'శ్రీ చరణం' బాగా ఆడడంతో 'శ్రీ చరణం' శాస్త్రి గా మారతాడు, అంతే కాదు అనతికాలంలోనే బిజీ గీత రచయితగా మారతాడు. తమ ఊరి వాడు సినిమా రంగంలో అంత పెద్ద పేరు తెచ్చుకోడం చూసి అతనికి సన్మానం చేయాలని సంకల్పిస్తారు మిత్రులు. ఊళ్ళో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అతనికి ఆతిధ్యం ఇవ్వడానికీ, అతనితో కలిసి కూర్చుని మందు పుచ్చుకోడానికీ పోటీలు పడతారు.

చెప్పిన ప్రకారం ఊరికి వస్తాడు శాస్త్రి. మైక్ లో శాస్త్రి రాసిన సినిమా పాటలే వస్తూ ఉంటాయి. కార్యక్రమం మొదలవుతుంది, యువ కవుల కవితాగానంతో. ఆ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కొత్తగా కవితలు రాయడం మొదలు పెట్టిన వాళ్ళు యెంతో ఉత్సాహంగా వస్తారు. సిని కవి గారికి తమ కవితలు వినిపించాలని. శాస్త్రి ఆసక్తి గా వింటాడు, కానీ జనం వినరు. కనీసం చప్పట్లు కొట్టరు.

కొందరు యువ కవులు కవితలు చదివాక, శాస్త్రి మైకు ముందుకి వస్తాడు. ఓ కవిత చదువుతాడు. జనం చెవులు రిక్కించి వింటారు. బ్రహ్మాండమైన స్పందన. చప్పట్ల హోరు. సరిగ్గా అప్పుడు ఆ మహా జనం అంతా ఉలిక్కిపడే మాటొకటి చెబుతాడు శాస్త్రి. తను కవితలు రాసిన తొలి రోజులని గుర్తు చేసుకుంటాడు. మిత్రులతో సహా అందరూ సిగ్గు పడేలా ఉంటాయతని మాటలు. ఇంతకీ శాస్త్రి ఏమన్నాడో తెలియాలంటే 'ఆనాటి వాన చినుకులు' సంకలనం లో ఉన్న 'అలా అన్నాడు శాస్త్రి' కథ చదివితేనే బాగుంటుంది. (నాకీ కథని గుర్తు చేసిన లలిత గారికి థాంకులు.)

గురువారం, ఫిబ్రవరి 25, 2010

మా 'స్వాతి' కథ

ఆవేళ ఉదయాన్నే ఆకాశం మబ్బు పట్టింది. వాతావరణం వర్షం వచ్చేలా ఉంది. సెలవు రోజు కాదు కాబట్టి బడికెళ్ళడం తప్పదు. నేనా సన్నాహాల్లో ఉండగానే "గేదీతకొచ్చిందమ్మా.." అన్న శ్రీరాములు కేక వినిపించింది పెరట్లోనుంచి. మేమందరం పెరట్లోకి పరిగెత్తాం. పాకలో కట్టేసిన కొమ్ముల గేదె రాట చుట్టూ తిరుగుతోంది. "ఉలవలుడకపెడతాను" అంటూ వంటింట్లోకి వెళ్ళింది అమ్మ. "ఇక్కడ నీకేం పని.. లోపలికి నడు" అని నాన్న అనడంతో నేను అమ్మ వెనుకే వెళ్లాను.

మామూలుగా ఐతే పెరట్లో నీళ్ళపొయ్యి మీద ఉడకపెడతాం ఉలవలు. కానీ వర్షం వచ్చేలా ఉందికదా. అందుకని వంట పొయ్యి మీదే ఉలవల గిన్నె పెట్టేసింది అమ్మ. "నువ్వు స్నానం చేసి ప్రదక్షిణాలు చేసిరా అమ్మా.. ఉలవలు నేను చూస్తాలే.." అన్నాను అమ్మతో. నాన్న పిలిచే వరకూ ఎలాగూ పెరట్లోకి వెళ్ళడానికి ఉండదు కదా. ఏడాది క్రితం తెల్లావు ఈనేటప్పుడు అమ్మ చెర్లో మునిగి, ఆ తడి చీరతోనే ఆవు చుట్టూ ప్రదిక్షిణాలు చేసింది.

"ఆవుకైతేనే చెయ్యాలి.. గేదెకి చెయ్యరు" అని చెప్పింది అమ్మ. గేదె ఈనుతోందని తెలిసి రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు పాక దగ్గరికి వచ్చారు. నాన్న గోనె సంచులూ అవీ సిద్ధం చేసుకుంటున్నారు. ఉలవలు సగం ఉడికాయో లేదో "పెయ్య దూడనేసిందమ్మా.." అన్న శ్రీరాములు కేక, ఆవెనుకే "నువ్విలా రారా.." అని నాన్న పిలుపు. పెరట్లోకి చూసేసరికి నాన్న చేతుల్లో బుజ్జి గేద్దూడ. చలికో ఏమో వణికిపోతోంది. గోనె సంచితో దానిని తుడుస్తున్నారు నాన్న.

ఆ బుజ్జి దూడని పట్టుకునే పని నాకిచ్చి, గబగబా దాని గోళ్ళు గిల్లేసి గేదెకి పెట్టేశారు నాన్న. అలా చేయకపోతే గేదె బాగా పాలివ్వదుట. అమ్మేమో వేడి వేడి ఉలవలని త్వర త్వరగా చల్లారపెట్టి గేదెకి తినిపించేసింది. శ్రీరాములు వాళ్ళూ పాక శుభ్రం చేసే పనిలో పడ్డారు. అమ్మ ఇంట్లోకి వచ్చి కేలండర్ చూసి "స్వాతి నక్షత్రం.. వర్జాలు లేవు" అంది సంతోషంగా. "బిడ్డొచ్చిన వేళ.. గొడ్డొచ్చిన వేళ.." అంటారు కదా మరి. "అయితే దీని పేరు స్వాతి" అన్నాన్నేను.


ఆవేళ బళ్ళో అందరికీ మా స్వాతి గురించి వర్ణించి వర్ణించి చెప్పాను. పొద్దున్న బడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు నలుగురైదుగురు నాతో వచ్చారు, స్వాతిని చూడడానికి. "సాయంత్రం రండమ్మా.. జున్ను తిని వెళ్దురు గాని.." అంది అమ్మ వాళ్ళతో. అది మొదలు మూడు రోజులు మా ఇంటికి ఎవరొచ్చినా వాళ్లకి జున్నే. రెండు పూటలా నీళ్ళు కాచుకునే డేశా లో వండేది అమ్మ జున్ను. వేళ్ళు నలగగొట్టుకోకుండా ఏలకులు, మిరియాలు పొడి కొట్టిచ్చే డ్యూటీ నాది.

మొదటి రోజు సాయంత్రానికే పెరడంతా గంతులేసింది స్వాతి. రెండో రోజుకి మట్టి తినడం మొదలు పెట్టేసింది. నాన్న తాటాకుతో ఓ చిన్న బుట్ట అల్లి, స్వాతి మూతికి కట్టేశారు. స్వాతికి గడ్డి తినడం అలవాటు చేయాలి కదా. అందుకోసం లేత గరిక సంపాదించే డ్యూటీ కూడా నాదే. సన్న రకం గడ్డి చిగుళ్ళు వెతికి కోసి పట్టుకొచ్చి, ఆ చిన్న బుట్టలో పెట్టి మూతికి కట్టేస్తే స్వాతికి ఆకలేసినప్పుడల్లా తింటుందన్న మాట.

అంతేనా.. నాన్న పాలు పితికేటప్పుడు స్వాతిని పట్టుకునే డ్యూటీ కూడా నాదే. అప్పుడు మాత్రం నాక్కొంచం కష్టంగా ఉండేది. స్వాతి బాగా గింజుకునేది. వాళ్ళమ్మ దగ్గర తను తాగాల్సిన పాలు మేము తీసేసుకుంటున్నాం కదా అనిపించేది. అమ్మకి చెబితే, "అన్ని పాలూ తాగించేస్తే దూడకి జబ్బు చేస్తుంది" అని చెప్పింది. రాను రాను స్వాతి నాకు మంచి కాలక్షేపం అయిపోయింది. నాన్న తెచ్చిన దిష్టి తాడులో మువ్వలు గుచ్చి మెళ్ళో కట్టామేమో, స్వాతి గంతులేసినప్పుడల్లా ఘల్లు ఘల్లుమని చప్పుడయ్యేది.

చూస్తుండగానే స్వాతి పచ్చి గడ్డి నుంచి ఎండు గడ్డికి ప్రమోటయ్యింది. కుడితి ఇష్టంగా తాగేది. ఉలవలు పెట్టమని గొడవ పెట్టేది. పాలు పితికేటప్పుడైతే అసలు పట్టుకోనిచ్చేది కాదు. ఎవరైనా 'గేద్దూడ' అంటే నేను కరిచినంత పని చేసి 'స్వాతి' అని సరిచేసేవాడిని. చూస్తుండగానే నెత్తిమీద రెండు బుడిపెలు మొలవడం, అవి కొమ్ములుగా మారడం జరిగిపోయింది. ముట్టి తాడు, కాళ్ళకి బంధం పడ్డాయి. మునుపటి గారాలు కొంచం తగ్గాయి.


వేసంకాలం సెలవులు అయిపోయి నేను ఐదో తరగతిలోకి వచ్చేశాను. ఓ రోజు సాయంత్రం బడి అయిపోగానే మా హెడ్మాష్టారు మా ఇంటికి వచ్చారు. భలే భయపడ్డాను. కాసేపు నాన్నతో మాట్లాడి "గేద్దూడని పెంచుకుందామని ఉందండీ.. మీ దూడ బాగుంది" అన్నారు. ఆయన స్వాతిని అడుగుతున్నారని అర్ధమైపోయింది. నాన్న సరే అనేశారు. "పెద్దాయన నోరు తెరిచి అడిగితే కాదని ఎలా చెప్పను?" అన్నారు అమ్మతో. నాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. రెండు రోజుల్లో మేష్టారి తాలూకు మనిషి వచ్చి పొరుగూళ్లో ఉండే మేష్టారింటికి స్వాతిని తీసుకెళ్ళి పోయారు.

నాకు మేష్టారి మీదా, నాన్న మీదా బోల్డంత కోపం వచ్చింది. కానీ ఏం చేయడానికీ లేదు. అప్పుడప్పుడూ స్వాతి గురించి మేష్టారిని అడగాలని అనిపించేది. కానీ అడిగే ధైర్యం ఉండేది కాదు. అప్పుడప్పుడూ ఆయనే నాన్నకి చెప్పేవారు, స్వాతి యోగ క్షేమాలు. రెండు మూడు నెలలకి స్వాతి మీద బెంగ కొంచం తగ్గింది. చదువు, ఆటపాటలు.. ఎక్కడైనా గేద్దూడ కనిపిస్తే మాత్రం వెంటనే స్వాతి గుర్తొచ్చేసేది. కొమ్ముల గేదె కి మరో దూడ పుట్టినా, అప్పుడప్పుడూ స్వాతి గుర్తొస్తూనే ఉంది.

ఆరోతరగతి మా పక్కూరి హైస్కూల్లో. మా ఊరినుంచి మొత్తం ఐదుగురం. మొదటిరోజు భయం భయంగా బయలుదేరాం బడికి. పైకేవో కబుర్లు చెప్పుకుంటున్నాం కానీ, కొత్త ఊరు, కొత్త స్కూలు అంటే లోపల అందరికీ భయంగానే ఉంది. హైస్కూలు కట్టనందుకు మా ఊరి వాళ్ళని తిట్టుకుంటూ, కొత్త స్కూలు ఎలా ఉంటుందో ఊహించుకుంటూ నడుస్తున్నాం. చాలా దూరం నడిచాక ఒక చోట కొబ్బరి తోటలోనుంచి 'ఓంయ్..' అని వినబడింది. తలతిప్పి చూస్తే మా స్వాతి. మా ఫ్రెండ్స్ కూడా గుర్తు పట్టారు.

పుస్తకాల సంచీ రోడ్డు మీద పడేసి తోటలోకి పరుగెత్తాను. కొంచం గడ్డి తీసి తినిపించి, కాసేపు తల మీద రాసి మళ్ళీ వెనక్కి పరిగెత్తాను, మా వాళ్ళని అందుకోడం కోసం. ఆ పక్కన ఉన్న ఇల్లు మా హెడ్మాష్టారిదిట. ఇంటి పక్క తోటలో స్వాతి కోసం చిన్న పాక వేశారు. సాయంత్రం ఇంటికి వెళ్ళాక అమ్మకి చెబితే చాలా సంతోషించింది. "మనుషులు మర్చిపోయినా, మూగజీవం మరచిపోదు" అంది. అలా కొత్తూర్లో పాత నేస్తం దొరికింది నాకు. అది మొదలు, హైస్కూల్లో చదివిన ఐదేళ్లూ స్కూలికి వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ స్వాతి కనిపించేది, తన పరివారంతో.

మంగళవారం, ఫిబ్రవరి 23, 2010

బ్లాగులు-ఏటిగట్టు

నేను ఒక బ్లాగు టపా చదివి, "ఇవాల్టికి ఇంకేమీ చదవలేను" అనిపించి, ఆ రోజంతా బ్లాగుకి దూరంగా ఉన్న సంఘటన గత ఏడాది కాలంలోనూ కేవలం ఒకే ఒక్కసారి జరిగింది. ఆ టపా గురించి చెప్పడానికి ముందు ఆ బ్లాగు గురించి. పేరు 'ఏటిగట్టు' ..'మాట్లాడుకోడానికి మంచి ప్రదేశం' అనేది ట్యాగ్ లైన్. బ్లాగర్ పేరు శేఖర్ పెద్దగోపు.

ఏముంటుంది ఏటిగట్టు మీద? ప్రవహించే నదీ, పలకరించే పిల్ల గాలీ, చేపలు పట్టడానికో, వ్యాహాళికో వచ్చిన మనుషులూ, వాళ్ళు చెప్పుకునే కబుర్లూ.. ఆ కబుర్లలో కష్టం, సుఖం, వెరసి జీవితం. సరిగ్గా ఈ బ్లాగులో మనకి కనిపించే, మనసుని స్పృశించే అంశాలూ ఇవే. తన టపాలతో శేఖర్ మనల్ని నవ్విస్తారు, మనసుల్ని మెలి పెడతారు... అంతిమంగా మన కళ్ళు తడిసేలా చేస్తారు. నవ్వినా, ఏడిచినా వచ్చేవి కన్నీళ్ళే కదా మరి.

నాలుగేళ్ళుగా బ్లాగుల్లో ఉన్న శేఖర్ 'ఏటిగట్టు' ని మొదలు పెట్టింది మాత్రం గత సంవత్సరం జనవరి 27న. 'నాలోనేను లేనేలేను' అనే టపాతో. ట్విస్ట్ ఏమిటంటే, ఈ టపా ఆయన స్వానుభవం కాదు.. తన మిత్రుడి అనుభవాలకి అక్షర రూపం ఇచ్చారు. ఈ బ్లాగులో నేను చదివిన మొదటి టపా మాత్రం 'జ్ఞాపకమొచ్చెలే... బాల్య స్మృతులన్నీ...' పల్లెటూళ్ళో బాల్యాన్ని గడిపిన నాలాంటి వాళ్ళంతా 'గుర్తుకొస్తున్నాయి..' అని పాడుకునే టపా ఇది. తనకి తీరిక దొరకగానే దీనికి కొనసాగింపు రాస్తానని శేఖర్ గారు మాట ఇచ్చారు కానీ, మనకింకా ఆ రెండో భాగం చదివే అదృష్టం కలగలేదు.

నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు అనిపించినా మరో టపా 'మళ్ళీ చందమామతో ఒక ఆట ఆడాలి... పాట పాడాలి...' మనం కోల్పోతున్న చిన్న చిన్న సంతోషాలని మన కళ్ళ ముందు ఉంచుతుందీ టపా. లెక్కలంటే నాకు మాత్రమే భయం అనుకున్నాను కానీ, ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూడా ఒకప్పుడు గణితం బాధితుడే అని తెలిసినప్పుడు మాత్రం బోల్డంత ఆశ్చర్య పోయాను. మొత్తానికి ఎలాగైతేనేం లెక్కల మీద విజయం సాధించేశారు.


అసలు శేఖర్ గారు టపా రాయడానికి ముడిసరుకు పెద్దగా అవసరం లేదు. ఓ నాలుగు ఫోటోలు ఇస్తే అలవోకగా ఒక కథ అల్లేయగలరు. అన్నట్టు ఈయనలో ఉన్న కథకుడి విశ్వరూపం చూడాలంటే 'హ్యాపీడేస్ - నెరజాణ' ని పలకరించాల్సిందే. ఈ టపా చదివాక ఈయన నుంచి రాబోయే కథల కోసం ఎదురు చూడడం మొదలు పెట్టాన్నేను. కథల కన్నా ముందు కవితలు రాయడం మొదలు పెట్టేశారు.. ప్రస్తుతానికి తన బ్లాగులోనే అప్పుడప్పుడూ కవితలని మెరిపిస్తున్నారు.

అప్పుడప్పుడూ అనగానే చెప్పాల్సిన మరో విషయం గుర్తొచ్చింది. ఈ బ్లాగులో టపాలు అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తాయి.. ఇప్పటివరకూ రికార్డైన హయ్యెస్ట్ స్కోర్ నెలకి నాలుగు టపాలు. గత ఏడాది కాలంలో రాసినవి కేవలం ఇరవైనాలుగు. అయితేనేం.. ప్రతి టపా చదివి తీరాల్సిందే.. 'అజ్ఞాత' భక్తులని ఆలోచించమని చెబుతూ మనల్ని ఆలోచనల్లో పడేసినా, కత్తెర కూడా భయపడే టైలర్ చిట్టిబాబు గురించి చెప్పి కడుపుబ్బా నవ్వించినా అందులో 'శేఖర్ మార్కు' అనేది ఒకటి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

సినిమాల గురించి ఎప్పుడూ టపా రాయకపోయినా, సినిమాల మీద శేఖర్ గారికి ఉన్న ఆసక్తిని పట్టిచ్చే టపా 'బ్లాగుల చుట్టూ తిరిగే కొన్ని సినిమాల పేర్లు, వాటి కథలు టూకీగా..' ప్రస్తుతం వస్తున్న తెలుగు సినిమాల మీద బోల్డన్ని సెటైర్లు కనిపిస్తాయి ఈ టపాలో. తన బ్లాగంటే ఈయనకి ఎంత ఇష్టమంటే, వినాయక చవితి రోజున పుస్తకాలకి బదులు తన బ్లాగుకి పూజ చేసేటంత. ఇలా చేసిన మొదటి బ్లాగర్ శేఖర్ గారే కావొచ్చు బహుశా.

కొన్ని కొన్ని టపాలతో ఎంతగా నవ్విస్తారో, ఇంకొన్ని టపాలతో అంతగా మనసుని మెలి పెడతారీయన. ఎప్పుడు రాఖీ చూసినా 'మరపురాని బంధం' గుర్తు రాక మానదు మనకి. అంతే కాదు.. ఎప్పుడు ఈ బ్లాగుని తలచుకున్నా నాకు మొదట గుర్తొచ్చే టపా 'పల్లేటి -- చెదరని, ఎప్పటికీ చెదిరిపోని ఒక జ్ఞాపకం' . మొదటి పేరా లో నేను చెప్పిన టపా ఇదే. ఇంత చక్కగా రాసే మీరు మరికొంచం తరచుగా టపాలు రాయాలి శేఖర్ గారూ..

ఆదివారం, ఫిబ్రవరి 21, 2010

మరచిపోయా...

అనుకోకుండా ఒక కార్యక్రమానికి వెళ్లాను. తెలిసిన వ్యక్తే కానీ ఏడాది తర్వాత ఒకరికొకరం ఎదురు పడ్డాం. నవ్వీనవ్వనట్టుగా నవ్వాడు. నేను దగ్గరికి వెళ్లి "హవార్యూ" అంటూ షేక్ హ్యాండిచ్చా. "హూ ఆర్యూ" అన్నట్టుగా చూసి, నన్ను కొంచం పక్కకి నడిపించాడు. "వెరీ సారీ.. మిమ్మల్ని గుర్తు పట్టలేక పోతున్నాను.." అన్నాడు చాలా అపాలజెటిక్ గా.. పెద్ద షాక్ నాకు. ఎందుకంటే తెలుగు పండుగలు మొదలు, జాతీయ పండుగ వరకూ ఏ పండుగ వచ్చినా, ప్రత్యేక సందర్భం వచ్చినా తన నుంచి నాకు క్రమం తప్పకుండా ఎస్సెమ్మెస్ రూపంలో సందేశాలు అందుతాయి. నేను అస్సలు బద్ధకించకుండా వెంటనే జవాబు పంపుతాను.

ఇప్పుడింక చేసేదేముంది.. నన్ను నేను పరిచయం చేసుకున్నాను.. తను పాపం చాలా బోల్డన్ని క్షమాపణలు చెప్పాడు. నేనప్పుడు మెసేజీల గురించి చెప్పాను. "నా ఫోన్లో చిప్ సరిగ్గానే పనిచేస్తోందండీ.. బుర్రలో చిప్ కే కొంచం ప్రాబ్లం వచ్చినట్టుంది.." అన్నాడు తను నవ్వుతూ. ఓ పది నిమిషాలు మాట్లాడుకున్నాం. తర్వాత నేను బయటికి వచ్చేస్తున్నప్పుడు తను మళ్ళీ నా దగ్గరికి వచ్చి "ఇంకెప్పుడూ మిమ్మల్ని మర్చిపోను" అని హామీ ఇచ్చాడు. బాగా నవ్వుకున్నాం ఇద్దరం.

ఇది అతనికి మాత్రమే వచ్చిన సమస్య మాత్రమే కాదు, అప్పుడప్పుడూ నాకూ ఎదురవుతూ ఉంటుంది. ఫోన్లో అయితే మొహమాటం లేకుండా "సారీ.. మీరెవరో చెప్పండి" అని అడిగేస్తాను.. ఎదురుగా ఉన్నప్పుడైతే ఓపక్క మాట్లాడుతూనే మరో పక్క తీవ్రంగా ఆలోచిస్తాను, అవతలి వ్యక్తిని గుర్తు చేసుకునేందుకు. మరచిపోడానికి ఇదీ కారణం అని ప్రత్యేకంగా ఒకటో, పదో కారణాలు చెప్పడం కష్టం. సాధారణంగా అందరూ "వయసు ప్రభావం" అనేస్తూ ఉంటారు కానీ దీనికి బోలెడన్ని మినహాయింపులు ఉన్నాయి.

తరచూ కొత్త వ్యక్తులని కలుసుకుంటూ ఉండడం, ఒక వ్యక్తిని రెండు సార్లు కలవడానికి మధ్య బాగా గ్యాప్ రావడం, ఒకేలాంటి రూపు రేఖలు, హావభావాలు ఉన్నవాళ్ళు ఒకరికి మించి మనకి పరిచయం కావడం.. ఇలాంటివన్నీ కొంచం ఎక్కువ మంది చెప్పే కారణాలు. కొంతమందిని ఒక్కసారి చూడగానే గుర్తు పెట్టేసుకుంటాం. వాళ్ళ పరిచయం మనకి సంతోషాన్నో, శిరోభారాన్నో కలిగించడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అదే మరికొందరిని ఎన్నిసార్లు చూసినా.. అబ్బే.. కష్టం.

రోజూ ఉదయాన్నే పేపర్లు తెచ్చే కుర్రాళ్ళని గుర్తు పెట్టుకోవాలని నేను విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాను. సగం నిద్రలో ఉండడం వల్ల వాళ్ళ ముఖాలు వెంటనే రిజిస్టర్ అవ్వవు. కష్టపడి గుర్తు పెట్టుకునేసరికి వాళ్ళు మారి వేరే వాళ్ళు వస్తూ ఉంటారు. పేపర్ బిల్లు ఇచ్చే ప్రతిసారీ సందేహమే, 'పేపర్ తెచ్చేది ఇతనేనా?' అని.

తెలిసిన వాళ్ళలో చాలామంది మనం గుర్తు పట్టలేకపోడాన్ని కొంచం సహృదయంతోనే అర్ధం చేసుకుంటారు. అదే బంధువులయితేనా? మన పని అయిపోయినట్టే. అరుదుగా కలిసే దూరపు బంధువులని గుర్తు పెట్టికోవడం ఎవరికైనా కష్టమే అనుకుంటాను. నేరుగా గుర్తు పట్టలేదు అని చెప్పేస్తే చాలా బాధ పడిపోయి, "ఇప్పుడంటే ఇలా అయిపోయాం కానీ, ఒకప్పుడు మీ కుటుంబం మా కుటుంబం ఎంత బాగా ఉండేవో" అంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతారు.

అలా అని ఈ గండం గట్టెక్కడం కోసం మాటల్లో పెడదామా అంటే ఏం మాట్లాడితే ఏం తంటానో తెలీదు. 'పిల్లలు బాగున్నారా?' అనో 'అమ్మా నాన్నా బాగున్నారా?' అనో దాటేద్దామంటే ఏ కొత్త సమస్య వస్తుందో అని సందేహం. (ఒకటి రెండు అనుభవాలు తల బొప్పి కట్టించాయి) 'మీరెవరు?' ని నేరుగా అడగ కూడదు, మాట్లాడకుండా ఉండకూడదు, మాటల్లో దొరికిపోకూడదు. తాడు మీద నడవడం సులువు, ఇంతకన్నా.

ఇలాంటి గండాలు గట్టెక్కడానికి ఈమధ్యనే నేనో చిట్కా కనిపెట్టాను. ఫంక్షన్లలో ఒక్కళ్ళం ఎవరికీ దొరక్కుండా ఎవరైనా 'బంధుమూర్తి' ని ఫాలో అయిపోతే చాలు. సదరు బంధుమూర్తి సాధారణంగానే మంచి మాటకారీ, కలుపుగోలు వ్యక్తీ అయి ఉంటాడు కాబట్టి, మనం ఏమీ మాట్లాడకుండానే అవతలి వాళ్ళ వివరాలు తెలుసుకోవచ్చు. సదరు బంధుమూర్తే మనపాలిట విలనై "వీణ్ణి గుర్తుపట్టావా?" అని నిండు సభలో మనల్ని గర్వంగా ప్రశ్నిస్తే మాత్రం, తప్పించుకునే సాధనం ఉండదు, ఓ వెర్రి నవ్వు నవ్వేయడం తప్ప.

మర్చిపోవడం వల్ల చాలా లాభాలుంటాయన్న జ్ఞానోదయం మనకి కొంచం ఆలస్యంగా కలుగుతుంది. ముఖ్యంగా, మన దగ్గర అప్పు తీసుకున్న వాడు మనల్ని మర్చిపోయినప్పుడు వద్దన్నా ఈ జ్ఞానం కలిగి తీరుతుంది. మనకి అప్పిచ్చిన వాడు మాత్రం మనల్ని మరచిపోడు. బాకీ తీరేంత వరకూ మన యోగక్షేమాలు విచారిస్తూనే ఉంటాడు. అప్పిచ్చిన మొత్తం కొంచం పెద్దదైతే మన ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలూ అవీ కూడా చేయించే అవకాశం ఉంది.

అధిక శాతం పురుషులు తప్పక గుర్తు పెట్టుకునే, తరచూ తలచుకునే కొందరు వ్యక్తులు: చిన్నప్పుడు మనల్ని స్కూల్లో కొట్టిన మేష్టారూ, హైస్కూల్లో, కాలేజీలో మనతో కలిసి చదువుకున్న అమ్మాయిలూ, మనం ప్రేమలేఖ ఇచ్చిన అమ్మాయిలూ (లిస్టు మరీ పెద్దదయితే కనీసం మొదటి ప్రేమలేఖ ఇచ్చిన అమ్మాయి), మొదటి ఉద్యోగం ఇచ్చిన బాసూ, అప్పు తీసుకున్న మిత్రులూ, పిల్లనిచ్చిన మావగారూ... ఎవరి జాబితా వాళ్ళది. మీరూ మీ జాబితా వేసుకోండి, సరదాగా.

శుక్రవారం, ఫిబ్రవరి 19, 2010

ప్రణతి..ప్రణతి..ప్రణతి...

నలుగురూ నడిచే దారిలో నడవడం సులభం.. కానీ ఓ కొత్త మార్గాన్ని వేయడం కష్టం. ఎన్నో ఆటుపోట్లని, కష్టనష్టాలనీ ఎదుర్కోవాలి. ఆత్మవిశ్వాసం తో పాటు, సాహసమూ కావాలి. అన్నింటికీ మించి నడుస్తున్న దారిమీద స్పష్టత ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ కొత్త బాటలో ప్రయాణం సాధ్యమవుతుంది.. ఆ బాటలో ప్రయాణం చేసిన తొలి బాటసారి వెనుక వచ్చే వారికి మార్గదర్శి కాగలుగుతాడు. తెలుగు సినిమా గతిని మార్చి, తమకంటూ సొంత మార్గాన్ని నిర్మించుకుని తమదైన శైలిలో ప్రయాణం కొనసాగించిన అతికొద్ది మంది దర్శకుల్లో ఒకరైన కాశీనాధుని విశ్వనాధ్ కి ఎనభయ్యో జన్మదిన శుభాకాంక్షలు.

తెలుగు సినిమా పరిశ్రమలో సౌండ్ రికార్డింగ్ ఇంజనీర్ గా ప్రవేశించి, ఆదుర్తి దగ్గర శిష్యరికం చేసి, 'ఆత్మ గౌరవం' సినిమాతో దర్శకుడిగా మారిన విశ్వనాధ్ కెరీర్ తొలినాళ్ళలో తీసిన సినిమాల్లో చాలా వరకూ సాధారణ చిత్రాలే. దర్శకత్వం మొదలు పెట్టిన పుష్కర కాలం తర్వాత, ఇరవైరెండు సినిమాలు పూర్తి చేశాక, అప్పుడు చేపట్టగలిగారు తన మార్కు సినిమా. విశ్వనాధ్ సినిమాల్లో 'శంకరాభరణం' ని ఒక మైలు రాయిగా చెబుతారు చాలామంది. నిజానికి ఆయన సినిమాలని 'సిరిసిరిమువ్వ' కి ముందు 'సిరిసిరిమువ్వ' కి తర్వాత అని విభజించాలి. ఎందుకంటే 'సిరిసిరిమువ్వ' విజయం ఇచ్చిన ధైర్యమే 'శంకరాభరణం' కి పునాది వేసింది కాబట్టి.

ఇలా విభజించడంలో నా ఉద్దేశం 'సిరిసిరిమువ్వ' కి ముందు విశ్వనాధ్ మంచి సినిమాలు తీయలేదనీ, ఆ తర్వాత అన్నీ అద్భుతమైన సినిమాలే తీశారనీ ఎంత మాత్రమూ కాదు. కానీ తెలుగు సినిమాలో 'విశ్వనాధ్' శకం మొదలయ్యింది మాత్రం 'సిరిసిరిమువ్వ' తోనే. రొటీన్ కి భిన్నంగా సినిమా తీసినా ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఆ సినిమా నిరూపిస్తే, అలాంటి వైవిధ్య భరితమైన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగా ముఖం వాచారో ఆ తర్వాతి సినిమాలు నిరూపించాయి. విశ్వనాధ్ సినిమాలో ఏముంటాయి? సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సంస్కారం.. అందుకేనేమో ఆయన సినిమాలు చాలా వరకూ ఆంగ్ల అక్షరం 'ఎస్' తోనే మొదలవుతాయి.



విశ్వనాధ్ మెజారిటీ సినిమాల్లో పాత్రలు నేల మీదే నడుస్తాయి. నటుడు/హీరో ని పాత్ర డామినేట్ చేస్తుంది. నటీనటుల ఇమేజ్ కన్నా, పాత్ర బలమే సినిమాని నడిపిస్తుంది. తను సృష్టించిన పాత్రల మీద విశ్వనాధ్ కి యెంతో నమ్మకం. ఆ నమ్మకమే లేకపొతే టాప్ హీరోస్థాయిలో ఉన్న చిరంజీవి చేత చెప్పులు కుట్టే వ్యక్తి, పాలమ్ముకునే మాధవుడు పాత్రలు వేయించగలరా? జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ని జాలరిగా చూపించగలరా? సినిమా గ్రామర్ ని మార్చడమే కాకుండా, గ్లామర్ కీ కొత్త అర్ధం చెప్పారు విశ్వనాధ్. ఆయన సినిమాల్లో హీరోయిన్ ఇంటి పెరట్లో తులసికోటలా పవిత్రంగా కనిపిస్తుంది. చూడగలగాలే కానీ, కొత్త చిగుళ్ళు వేసే తులసి మొక్కలో ఎన్ని అందాలు??

విశ్వనాధ్ సినిమాల మీద వినిపించే తొలి విమర్శ 'బ్రాహ్మినికల్ మూవీస్' అని. బలంగా ఏర్పరిచేసుకున్న అభిప్రాయాలని మార్చడం కష్టం. నిజం చెప్పాలంటే విశ్వనాధ్ కులతత్వాన్ని సమర్ధించింది ఎక్కడ? జనాదరణ పొందిన ఆయన ఏ సినిమాలో నాయికా నాయకులు ఒకే కులానికి చెందిన వాళ్ళు? విమర్శ నిజమే అనుకున్నా, దానివల్ల సమాజానికి కలిగిన నష్టం ఎంత? ఏ రూపంలో జరిగింది? విశ్వనాధ్ సినిమాల్లో పొరపాట్లు ఉండవనీ, జరగలేదనీ చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. 'స్వాతికిరణం' ముగింపు మార్చి ఉంటే సినిమా విజయవంతమై ఉండేది అంటారు చాలామంది. కానీ, అప్పుడు సినిమాకి అర్ధమే లేకుండా పోయేది. విశ్వనాధ్ మిగిలిన సినిమాలన్నీ ఒక ఎత్తు, 'స్వాతికిరణం' ఒక్కటీ ఒక ఎత్తు అనిపిస్తుంది నాకు.

విశ్వనాధ్ సినిమాల్లో 'సిరిమువ్వల సింహనాదం' ఇప్పటికీ విడుదలకి నోచుకోక పోగా, 'స్వాతిముత్యం' ఆస్కార్ అవార్డ్ కి నామినేషన్ గా పంపబడింది. తెలుగమ్మాయి జయప్రదని హిందీ పరిశ్రమ కి పరిచయం చేసింది విశ్వనాధుడే. విశ్వనాధ్ గత రెండు సినిమాలు 'చిన్నబ్బాయి' 'స్వరాభిషేకం' తీవ్రంగా నిరాశ పరిచాయి. తన పద్ధతికి భిన్నంగా 'చిన్నబ్బాయి' సినిమాని హీరో ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని చేశారని అనిపించింది. కాగా, అప్పటికే నటుడిగా మారిన విశ్వనాధ్ 'స్వరాభిషేకం' లో తను పోషించిన ఇంటి పెద్ద పాత్ర మీద పెంచుకున్న మమకారం ఆ సినిమాకి చేటు చేసిందని అనిపిస్తుంది నాకు. గతం గతః అన్నారు కాబట్టి, భవిష్యత్తు వైపు చూద్దాం. రాబోతున్న 'సుమధురం' విశ్వనాధ్ కి మరో మైలురాయి సినిమా కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, విశ్వనాధ్ కి మరోమారు జన్మదిన శుభాకాంక్షలు.

మంగళవారం, ఫిబ్రవరి 16, 2010

నాయికలు-పద్మావతి

పద్మావతి నాకు చాలా చిత్రంగా పరిచయమయ్యింది. నాకు చిన్నప్పుడే పుస్తకాలు చదవడం అలవాటవ్వడం అమ్మకి సంతోషం కలిగించింది. అప్పట్లో అమ్మ నాకు ఒకే ఒక్క నిబంధన పెట్టింది. "పెద్దాడివి అయ్యే వరకూ చలం పుస్తకాలు చదవకు. అవి తప్ప ఇంకేం చదివినా నీ ఇష్టం" అని. వద్దన్నపని చెయ్యాలనే మానవ సహజమైన కుతూహలం వల్ల చలం అనే ఆయన రాసిన పుస్తకాలు ఎక్కడైనా కనిపిస్తాయా అని వెతికాను కానీ, ఎక్కడా దొరకలేదు.

నేనప్పుడు నాలుగో తరగతో, ఐదో తరగతో. రోజూ లాగే ఉదయం బడికి వెళ్ళడానికి తయారవుతూ రేడియో వింటున్నా. "ఇప్పుడు నవలా పరిచయ కార్యక్రమం.. ఈ వారం నవల 'దైవమిచ్చిన భార్య,' రచన గుడిపాటి వెంకటా చలం..." ఒక్కసారిగా చెవులు రిక్కించాను. ప్రతి అక్షరం శ్రద్ధగా విన్నాను. ఎంతగా అంటే ఇప్పటికీ ఈ నవల చదువుతున్న ప్రతిసారీ రేడియోలో వచ్చిన కార్యక్రమం నా చెవుల్లో వినిపిస్తూ ఉంటుంది. ఈ నవలలో నాయికే పద్మావతి, ఓ జమీందారు గారి అమ్మాయి.

పద్మావతి పక్కింటి అబ్బాయి రాధాకృష్ణ. పూర్వాచారాలని పాటించే కుటుంబం అతనిది. పద్మావతి కుటుంబం కొంచం ఆదర్శ భావాలున్నది. సెలవుల్లో తన అన్నలిద్దరితో పల్లెటూరికి వచ్చిన పద్మావతికి రాధాకృష్ణతో స్నేహం కుదురుతుంది. మొదట అతని ఆహార్యాన్ని చూసి పట్నం పిల్లలు ముగ్గురూ ఆటపట్టించినా, త్వరలోనే పిల్లలు నలుగురూ స్నేహితులవుతారు. ముఖ్యంగా పద్మావతి-రాధాకృష్ణ ల మధ్య స్నేహం బలపడుతుంది.

ఆ సెలవుల్లోనే పద్మావతి కి 'న్యాయమూర్తి' తో పెళ్ళవుతుంది. పెళ్లవ్వగానే పై చదువులకి ఇంగ్లండు వెళ్తాడు న్యాయమూర్తి. మధ్యలో కొంత ఎడబాటు తర్వాత, యుక్త వయస్కులయ్యాక మళ్ళీ కలుసుకుంటారు పద్మావతి-రాధాకృష్ణ. చిన్నప్పటి ఆటపాటల్ని గుర్తు చేసుకుంటారు ఇద్దరూ. స్నేహం ప్రేమగా మారి, ఒకరిపై మరొకరికి మోహం పుట్టడానికి కారణం అవుతుంది. ఓ వెన్నెల రాత్రి వాళ్ళిద్దరూ ఏకమవుతారు.

ఓ పక్క న్యాయమూర్తి తో కాపురం చేస్తూనే, రాధాకృష్ణ తో స్నేహాన్ని కొనసాగిస్తుంది పద్మావతి. ఆమెని ఎప్పటికీ తనతో వచ్చేయమని కోరతాడు రాధాకృష్ణ. "నువ్వు నాతో ఉంటే చాలు.. ఇంకేమీ అక్కర్లేదు" అంటాడు. "ఎందుకు అక్కరలేక పోవాలి? నాకోసం నువ్వు అన్నీ ఎందుకు వదులుకోవాలి? నీకు ఇదా ప్రేమ చేసే ఉపకారం? నిన్ను కలుసుకోడమంటే నాకెంతో ఇష్టం. నీ దగ్గర్నించి వెళ్ళిపోయి, నిన్ను కొన్నాళ్ళు చూడకుండా ఉండడం మరీ ఇష్టం! మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మరీ బాగుంటుందిగా" అంటుంది పద్మావతి.

ఒక రోజు పద్మావతి-రాధాకృష్ణ న్యాయమూర్తి కంట పడతారు. పద్మావతిని వదులుకోడానికి సిద్ధ పడడు న్యాయమూర్తి. ఆమె రాధాకృష్ణతో కలవడానికి వీల్లేదంటాడు. న్యాయమూర్తిని వదిలేసి తనతో వచ్చేయమంటాడు రాధాకృష్ణ. తమ ఇద్దరిలో ఎవరు కావాలో నిర్ణయించుకోమంటాడు. "ఇద్దరిలో ఎవరినో ఏరుకోడం ఏమిటి? ఎందుకు యేరుకోవాలి? ఎవరో ఒకరు ఉండి తీరాలా ఏమిటి నాకు మొగనాధుడు? మీ ఇద్దరూ ఎందుకిలా బొమిక ముక్క కోసం కుక్కల్లాగా పోట్లాడుతారు? ఇది నా ఇల్లు. నేనిక్కడ ఉంటాను," అంటుంది స్థిరంగా.

ఈపోరులో న్యాయమూర్తే గెలుస్తాడు. పద్మావతికీ, రాధాకృష్ణకీ ఎడబాటు తప్పదు. అది ఒప్పందం, పద్మావతి అంగీకరించిన ఒప్పందం. రాధాకృష్ణ కి శకుంతలతో వివాహం జరగడం, అతను దేశాంతరం వెళ్ళడం, తిరిగి వచ్చి ఓ పత్రిక నడపడం, ఇద్దరు పిల్లల్ని కనడం...మరో పక్క పద్మావతికి ఇద్దరు పిల్లలు కలగడం జరిగాక, వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారు యాదృచ్చికంగా. పెద్ద గాలి దుమారం లేస్తుంది పద్మావతి ఇంట్లో. రాధాకృష్ణ మీద ప్రేమ అంతకంతకూ పెరుగుతుంది పద్మావతికి, మరో పక్క రాధాకృష్ణ పరిస్థితి కూడా అదే.

తనతో వచ్చెయ్యమని మరోసారి ప్రతిపాదిస్తాడు రాధాకృష్ణ, ఈసారి కొంచం బలహీనంగా. తన భార్య, ఇద్దరు పిల్లలూ గుర్తొచ్చారు మరి. న్యాయమూర్తి ఆగ్రహంతో రగిలి, రాధాకృష్ణ ని కోర్టుకి ఈడ్చేందుకు నిర్ణయించుకుంటాడు. శకుంతల నలిగిపోతుంది, ఈ గొడవల్లో. ఈ ప్రేమకథకి పద్మావతి ఇచ్చిన (చలం ఇచ్చిన) ముగింపు తెలుసుకోవాలంటే 96 పేజీల 'దైవమిచ్చిన భార్య' నవల చదవాల్సిందే. (అరుణా పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ. వెల రూ.30, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

ఆదివారం, ఫిబ్రవరి 14, 2010

సీతాకోకచిలుక

అప్పుడే నిక్కర్ల నుంచి ఫేంట్ల లోకి మారిన కుర్రాడూ, కొత్తగా ఓణీ వేసుకోవడం మొదలు పెట్టిన అమ్మాయీ ప్రేమలో పడడం, పెద్దవాళ్ళు ఒప్పుకోక పోవడం, స్నేహితులంతా కలిసి వాళ్ళ ప్రేమని గెలిపించడం.. పదేళ్ళ క్రితం 'యూత్' సినిమాల ప్రభంజనం మొదలయ్యాక ఏటా విడుదలవుతున్న సినిమాల్లో కనీసం ముప్ఫై శాతం సినిమాల కథ ఇదే. నిజానికి తెలుగులో ఈ తరహా ప్రేమ కథలకి నాంది పడింది సుమారు మూడు దశాబ్దాల క్రితం.. తమిళం నుంచి తెలుగులోకి రీమేకైన 'సీతాకోకచిలుక' సినిమా ద్వారా.. దర్శకుడు భారతీరాజా.

తమిళంలో విజయవంతమైన 'అలైగళ్ ఊయివితలై' సినిమాని తెలుగులో పునర్నిర్మించింది పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ సంస్థ. దర్శకుడినీ, హీరోనీ తమిళం నుంచి తెచ్చుకుని, మాటలు రాయడానికి జంధ్యాలనీ, సంగీతానికి ఇళయరాజానీ ఎంచుకుని అందమైన 'సీతాకోకచిలుక' ని ప్రేక్షకులకి బహూకరించింది 1981 లో. ఇది కేవలం అప్పుడే ఈడొచ్చిన పిల్లల ప్రేమ కథ మాత్రమే కాదు, భిన్న మతాలకీ, సామాజిక, ఆర్ధిక నేపధ్యాలకీ చెందిన అమ్మాయికీ, అబ్బాయికీ మొలకెత్తిన ప్రేమ కథ.

రఘు (కథానాయకుడు మురళి, తర్వాతి కాలంలో కార్తీక్ గా మారాడు) ఓ పేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు. తండ్రి చిన్నప్పుడే కాలం చేయడంతో, తల్లి శారదమ్మ(డబ్బింగ్ జానకి) సంగీతం పాఠాలు చెప్పి అతన్ని పోషిస్తూ ఉంటుంది. అతనికో స్నేహ బృందం. (వీళ్ళలో తర్వాతి కాలంలో కేరక్టర్ నటుడిగానూ, 'స్వరకల్పన' సినిమాతో హీరో గానూ, ఆపై టీవీ నటుడిగానూ మారిన ఏడిద శ్రీరాం, నేటి ప్రముఖ హాస్య నటుడు అలీ ఉన్నారు.) సైకిళ్ళ మీద పొరుగూరు వెళ్లి చదువుకుంటూ, పెద్దల యెడల భయ భక్తులు నటిస్తూ, తగుమాత్రం అల్లరి చేస్తూ రోజులు గడిపేస్తూ ఉంటారు వీళ్ళంతా.

సముద్రపు ఒడ్డునే ఉన్న ఆ ఊరికి ఓ చిన్న సైజు రాజు డేవిడ్ (శరత్ బాబు), భార్య మేరీ (సిల్క్ స్మిత), ఒక చెల్లెలు కరుణ (ముచ్చెర్ల అరుణ). పిల్లలు లేరు. చెల్లెలు పట్నంలో చదువుకుంటూ ఉంటుంది. సెలవుల్లో సొంతూరికి వచ్చిన కరుణ ని రఘు బృందం అల్లరి పెట్టడం, ఆమె పాటని పరిహసించడం, ఆమె పట్టుదలగా జానకమ్మ దగ్గర సంగీతం నేర్చుకుని 'సాగర సంగమమే' అని స్వరయుక్తంగా పాడగానే, రఘు ఆమెతో ప్రేమలో పడిపోయి 'ప్రణయ..సాగర సంగమమే' అంటూ పాట అందుకోవడం చకచకా జరిగిపోతాయి.

కోపిష్టీ, పాపిష్టీ అయిన డేవిడ్ కి ఎదురు పడి మాట్లాడాలంటే ఆ ఊళ్ళో పెద్ద వాళ్ళకే భయం. మరి పిల్లకాయ రఘు తన ప్రేమ గురించి ఎలా చెబుతాడు? ఏ ధైర్యంతో అతని చెల్లెల్ని అడుగుతాడు? ఆ బాధ్యత స్నేహితులంతా తీసుకుంటారు. పెళ్లి పెద్దల వేషంలో పూలూ, పళ్ళూ పట్టుకుని, డోలూ, సన్నాయిని వెంట తీసుకుని డేవిడ్ ఇంటికి వెళ్లి రఘు, కరుణా ప్రేమించుకున్నారనీ, వాళ్ళ పెళ్లి చేయడం పెద్దవాళ్ళ ధర్మమనీ చెప్పి ఒప్పించే విఫల యత్నం చేస్తారు. డేవిడ్ కి వెర్రి కోపం రావడంతో కథ పరుగందుకుని, ప్రేక్షకులు ఊపిరి పీల్చుకునే ముగింపు దగ్గర ఆగుతుంది.
ప్రేమ కథలు ఎప్పుడూ అందమైనవే. అలాంటి ప్రేమకథకి కర్ణ పేయమైన సంగీతం తోడైతే, ఆ కథ ఓ కావ్యమైపోదూ? 'సీతాకోకచిలుక' విషయంలో జరిగింది అదే. ఇళయరాజా సంగీతంలో ప్రతి పాటా దేనికదే ప్రత్యేకమైనది.. ఇక నేపధ్య సంగీతం.. వాయిద్యాలని ఉపయోగించి మాత్రమే కాదు, నిశ్శబ్దం తో సైతం ఎలాంటి మూడ్ ని సృష్టించవచ్చో ఈ 'స్వరజ్ఞాని' కి బాగా తెలుసు. 'మాటే మంత్రము..' 'మిన్నేటి సూరీడు' ఇప్పటికీ తరచూ వినిపిస్తూనే ఉంటాయి. 'అలలు కలలు' పాట చిత్రీకరణలో వంశీ మార్కు కనిపిస్తుంది. ఈ సినిమాకి తను అసోసియేట్ డైరెక్టర్. ప్రధమార్ధం లో కన్నా ద్వితీయార్ధంలో పదునెక్కింది సంభాషణలు రాసిన జంధ్యాల కలం.

అసలు ప్రేమ కథ అంటేనే రొమాన్స్.. అలాంటిది టీనేజ్ ప్రేమ కథలో రొమాన్స్ లేకుండా ఉంటుందా? వెండితెర పై భారతీరాజా పండించిన ఈ ప్రేమకథలో రొమాన్స్ కి కొదవ లేదు. ఇప్పుడు చూస్తే ఎక్కడా శృతి మించనట్టే అనిపిస్తుంది కానీ, అప్పట్లో చాలామంది తప్పట్టేసుకున్నారు. హీరో హీరోయిన్ల ఎంపిక మొదలు, వాళ్ళిద్దరి మధ్యా 'తెలిసీ తెలియని' ప్రేమని మొగ్గ తొడిగించి, దానిని పుష్పించి, ఫలించేలా చేయడంలో తెర వెనుక భారతీరాజా కృషి చాలానే ఉంది. ముచ్చెర్ల అరుణ ఈ సినిమాకి ఒక అసెట్ అయితే, ఆమెకి ఈ సినిమా కెరీర్ కి గట్టి పునాది వేసింది. కరుణ పాత్రలో ఒదిగిపోయింది అరుణ.

రఘు గా మురళి నటననీ తక్కువ చేయలేం.. ముఖ్యంగా ఒక ఆకతాయి కుర్రాడు, ప్రేమికుడిగా మారే క్రమాన్ని చాలా బాగా అభినయించాడు. మిగిలిన పాత్రల్లో మొదట చెప్పుకోవాల్సింది సిల్క్ స్మిత. చాలా గంభీరమైన పాత్ర ఈమెది. యెంతో హుందాగా చేసింది. ఆమెకి చక్కగా నటించడం వచ్చినా అందుకు తగ్గ అవకాశాలు రాలేదని నిరూపించే సినిమా ఇది. కరుణని తన కూతురిగా చూసుకుంటూ, ఆమె ప్రేమకి పరిక్ష పెట్టి, అందులో గెలిచిన కరుణకి సహాయ పడే వదిన పాత్ర లో స్మిత ని చూసిన తర్వాత, మరెవ్వరినీ ఆ పాత్రకి ఊహించలేము.

శరత్ బాబు, డబ్బింగ్ జానకి లకి దొరికినవి టైలర్ మేడ్ పాత్రలు. చర్చి ఫాదర్ గా అతిధి పాత్రలో కనిపిస్తారు కళావాచస్పతి కొంగర జగ్గయ్య. 'ఒరేయ్ అబ్బాయిలూ' అంటూ తనకన్నా పెద్ద పిల్లలకి 'బాబాయ్' గా నవ్వించిన అలీ గురించి చెప్పుకోక పోతే ఎలా?? ఇప్పటికీ అలీ ని చూడగానే గుర్తొచ్చే డైలాగ్ ఇది. కథకి తగ్గట్టుగా నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే కాదు లొకేషన్లు కూడా దొరికాయి ఈ సినిమాకి. సాగర తీరపు సౌందర్యాన్ని చూడాల్సిందే కానీ, చెప్పలేం. టీనేజ్ ప్రేమ కథా చిత్రాలు చూడాలనుకునే వారి తొలి ఎంపిక ఈ 'సీతాకోకచిలుక.'

గురువారం, ఫిబ్రవరి 11, 2010

రాతిపూలు

చూడడానికి చాలా అందంగా ఉంటాయి.. సున్నితంగా కనిపిస్తాయి.. ఎప్పటికీ వాడిపోవు.. అచ్చంగా పూలలాగే ఉంటాయి కానీ ఎలాంటి వాసనా వెదజల్లవు.. ఎందుకంటే అవి 'రాతిపూలు.' కార్పొరేట్ సంస్కృతిలో మారుతున్న కాలానికి అనుగుణంగా అందరితోనూ పోటీ పడుతూనే తాము కోల్పోతున్న వాటిని గురించి మధ్యతరగతి అమ్మాయిలు పడే ఆవేదనని ఇతివృత్తంగా తీసుకుని సి. సుజాత రాసిన నవల పేరు కూడా ఇదే. టైటిల్ ని ఎంచుకోడం లోనే సగం విజయం సాధించారు సుజాత.

మహిళా సమస్యలని తనదైన దృష్టి కోణం నుంచి చూడడం లోనూ, వాటికి అక్షర రూపం ఇవ్వడం లోనూ తన తొలి రచన 'సుప్త భుజంగాలు' నుంచీ ఒక ప్రత్యేక మార్గంలో వెళ్తున్న సుజాత, తన తాజా నవలకి వేదికగా కార్పొరేట్ ప్రపంచాన్ని, రంగుల సిని పరిశ్రమనీ ఎంచుకున్నారు. 'రాతిపూలు' నవలలో ప్రధాన (స్త్రీ) పాత్రలు మూడు. వీళ్ళు ముగ్గురూ మధ్య తరగతి నేపధ్యం నుంచి వచ్చిన వాళ్ళే. ఆర్ధికంగా ఎదగాలన్న తపన, ఎదగాల్సిన అవసరం ఉన్న వాళ్ళే. ఎదిగే క్రమంలో వాళ్ళు అనుభవించే మానసిక సంఘర్షణే ఈ నవల.



జీవితాన్ని పక్కాగా ప్లాన్ చేసుకోవాలనీ, డబ్బు ద్వారా వచ్చే సౌఖ్యాలని అనుభవించాలనీ తపన పడే భర్త సూచనల మేరకు, తన పసిగుడ్డుని అత్తగారి సంరక్షణలో వదిలి కార్పొరేట్ ఉద్యోగానికి వచ్చిన వనిత శమంత. నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తూ, భర్త తనకి పాకెట్ మనీ గా కేటాయించిన పది వేలలోనే ఖర్చులు కుదించుకోలేని తత్వం ఆమెది. శమంత స్నేహితురాలు, సినిమాలకి, సీరియళ్ళకీ డబ్బిగ్ చెప్పే జమున కి భర్తే సమస్య. తన సంపాదనని అతను మంచి నీళ్ళలా ఖర్చు చేసేస్తుంటే, భరించలేక విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది.

చిన్నప్పుడు నేర్చుకున్న డేన్స్, తర్వాత చేసిన ప్రయత్నాలు ఉపయోగ పడి టీవీ యాంకర్ నుంచి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ వరకూ ఎదిగి, మెయిన్ హీరోయిన్ కావాలని కలలు కనే కిన్నెరకీ భర్తతోనే సమస్య. అతని ఖర్చులు మాత్రమే కాదు, అనుమాలనీ భరించాలి ఆమె. భరిస్తూనే కెరీర్లో ఎదగాలి. వీళ్ళ ముగ్గురినీ ఒక చోటికి చేర్చిన సూత్రధారి సురేంద్ర. శమంత పని చేసే కంపెనీ యజమాని. సినిమా ఫైనాన్షియర్. కోటీశ్వరుడైన సురేంద్ర కి అందగత్తె కాని భార్యా, ఇద్దరు పిల్లలతో పాటు అందమైన అమ్మాయిల మీద విపరీతమైన వ్యామోహం.

మొదట ఉద్యోగం కోసం, ఆ తర్వాత ప్రమోషన్ల కోసం సురేంద్ర కి దగ్గరవుతుంది హైదరాబాద్ లో ఒంటరిగా ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్న శమంత. భర్తా, ఆమె కలిసి గడిపేది ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే. ఇక జమున, కిన్నెరలకీ సురేంద్ర తో అవసరాలు. ముగ్గురు స్త్రీలకీ కెరీర్లలో పైకి ఎదగాలన్న కోరికతో పాటు, ఎదగాల్సిన అవసరాలూ తరుముకుని వస్తుండగా, గడుపుతున్న జీవితంలో అప్పటివరకూ తాము విలువలుగా నమ్మిన వాటిని ఆచరించాలో, విడిచిపెట్టాలో తెలియని సందిగ్ధత.

శమంత-సురేంద్ర ల విషయం తెలిసి శమంత భర్త ఎలా స్పందించాడు? భర్త, కూతురి గురించి శమంత తీసుకున్న నిర్ణయం ఏమిటి? జమున తన భర్తకి విడాకులు ఇచ్చిందా? కిన్నెర హీరోయిన్ కాగలిగిందా? తదితర ప్రశ్నలన్నింటికీ సమాధానాల్ని నవలలో చదవడమే బాగుంటుంది. నిజానికి సమాధానాల కన్నా సంఘర్షణ ని రచయిత్రి వర్ణించిన తీరు ఈ నవలని విడవకుండా చదివేలా చేస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రచయిత్రి శైలి, ఎక్కడా పట్టు సడలకుండా కథని నడిపించిన తీరు. 'నవ్య' వారపత్రికలో సీరియల్ గా వచ్చిన 'రాతిపూలు' నవలని శివసాయి శరత్ పబ్లికేషన్స్ సంస్థ ప్రచురించింది. పేజీలు 143, వెల రూ. 60, (అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

మంగళవారం, ఫిబ్రవరి 09, 2010

గెడ్డం పెట్టి

"రేయ్..ఆ పెట్టి ఇలా పట్టుకురా.." అని నాన్న కేకేశారంటే నాకు కూసింత గర్వం, కుతూహలం, భయం కలగాపులగంగా కలిగేవి. వీధి గదిలోకి పరిగెత్తి, ఇంట్లో అందరం మొక్కల పీట గా పిలుచుకునే ముక్కాలి పీట ఎక్కి, ముని వేళ్ళ మీద నిలబడి, సరంబీ మీద ఉన్న చిన్న పెట్టిని జాగ్రత్తగా దింపే వాడిని. అక్కడక్కడా తుప్పు మరకలు కనిపించే పసుపురంగు రేకు పెట్టి అది. ఆ పెట్టి తీసుకెళ్ళి వీధిలోనో, పెరట్లోనో ఉన్న నాన్నకి ఇచ్చేసి, ఆ పెట్టి పక్కనే ఓ చెంబుడు నీళ్ళు పెట్టేశానంటే నా డ్యూటీ అయిపోయినట్టే. ఈ డ్యూటీ సాధారణంగా సత్యం రాని ఆదివారాల్లో ఉండేది.

ఇక అది మొదలు నాన్నని రహస్యంగా గమనిస్తూ ఉండేవాడిని. ముందుగా చెంబులో నీళ్ళతో ముఖం కడుక్కుని, పెట్టి మూత తీసేవాళ్ళు. అందులో ఉన్న చిన్న సబ్బు ముక్క అందుకుని గెడ్డానికి రాసుకునే వాళ్ళు. ఆ పెట్టిలో ఏముంటాయో నేను నిద్రలో లేపి అడిగినా చెప్పగలను. ఒక చిన్న అద్దం, ఇత్తడి పిడి ఉన్న పాత కుచ్చు బ్రెష్షూ, ఇత్తడి కత్తెరా, ఇవి కాకుండా మరో బుల్లి పెట్టి. అంటే పెట్టిలో పెట్టన్న మాట. ఆ బుల్లి పెట్టిలో రేజరూ, బ్లేళ్ళూ ఉండేవి. సబ్బు రాసుకోవడం అవగానే, బ్రెష్షు ని నీళ్ళలో ముంచి స్పీడుగా గెడ్డానికి రాసుకుంటే బోల్డంత నురగ వచ్చేసేది. "ముసలి నాన్న" అని నవ్వుకునే వాడిని అప్పుడు. గెడ్డం తెల్లగా అయిపోయిందంటే ముసలాళ్ళై పోయినట్టే కదా మరి..



ఐతే నా నవ్వు ఎంతోసేపు ఉండేది కాదు. సబ్బు రాసుకున్నాక తర్వాత పని రేజరులో బ్లేడు మార్చుకోవడం. ఒక్కోసారి ప్రశాంతంగానే జరిగి పోయేది కానీ, కొన్నిసార్లు (అంటే నా టైం బాగోనప్పుడు) మాత్రం మా ఇంట్లో ఓ చిన్న సైజు ప్రళయం వచ్చేసేది. ప్రళయానికి కారణం ఇంకెవరో కాదు, సాక్షాత్తూ నేనే. ఐదో తరగతి వరకూ పెన్నంటే తెలియక పోయినా, పెన్సిళ్ళతో మాత్రం చిన్నప్పటి నుంచే పరిచయం. ఇంటి నిండా పెన్సిల్ ముక్కలు దొర్లుతూ ఉండేవి. పెన్సిల్ తో రాయడం, బొమ్మలేయడం బాగుంటుంది కానీ, ముక్కు అరిగిపోయినప్పుడు చెక్కడం మాత్రం భలే పెద్ద పని.

పెద్దాళ్ళని ఎప్పుడడిగినా "ఇప్పుడు కాదు.. తర్వాత" అని కసురుతారు కదా. అందుకని నాకు వచ్చినట్టుగా నేనే పెన్సిల్ చెక్కేసుకునే వాడిని. అక్కడికీ ఇంట్లో వాళ్ళు బ్లేళ్ళ లాంటి మారణాయుధాలు చిన్న పిల్లాడికి అందకూడదని బోల్డన్ని జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు. కానీ నాకు గెడ్డం పెట్టి అడ్రస్ తెలుసు కదా. రేజర్ లో బ్లేడు బిగిస్తూ నాన్న పిలిచారంటే, నేను పెన్సిల్ చెక్కుకున్న విషయం తెలిసి పోయిందన్న మాట. అక్కడికీ 'నాన్నకి ఎలా తెలుస్తుందా?' అని ఆలోచనలు చేసి, నా వంతుగా నేను బోల్డన్ని జాగ్రత్తలు తీసుకునే వాడిని.

నా వేలి నుంచి వచ్చిన రక్తం (పెన్సిల్ చెక్కినప్పుడు రక్తం తప్పకుండా వస్తుంది) బ్లేడు కాగితానికి అంటుకోడం వల్ల దొరికిపోతున్నానని తెలిసి, వేలు తెగ్గానే నోట్లో పెట్టేసుకునే వాడినా? పెన్సిల్ గీతలు బ్లేడు మీద పడి నాన్న కంట పడుతున్నాయని తెలిసి, వాటిని తుడిచేసే వాడినా.. ప్చ్.. అయినా కూడా దొరికిపోయే వాడిని. సరే.. దొరికి పోయినందుకు గాను ఒకటో, రెండో దెబ్బలు పడేవి. కరడు కట్టిన బాల నేరస్తుడిలా నేను వాటిని పట్టించుకునే వాడిని కాదు. ఎందుకంటే నేను చూడాల్సింది చాలానే ఉంది మరి.

నాన్న పాటికి నాన్నని గడ్డం చేసుకోనివ్వకుండా అమ్మ కాఫీ గ్లాసుతో వచ్చేసేది. అసలు గడ్డం చేసుకునేటప్పుడు కాఫీ తాగడం ఎందుకో నాకు అర్ధమయ్యేది కాదు. నాన్న కాఫీ తాగుతుంటే, వాళ్ళిద్దరూ మాట్లాడుకునే వాళ్ళు. ఆపూట వంటేం చెయ్యాలి లాంటి ముఖ్యమైన విషయాల మొదలు, పిల్లాడి చదువు లాంటి మామూలు విషయాల వరకూ.. (ప్రాధాన్యతా క్రమాలు నాచే నిర్ణయింపబడినవి) వాటిని 'కష్టం సుఖం' అంటారని తర్వాత తెలిసింది నాకు. బామ్మ వంటింట్లో పని చేసుకుంటూ "అల్లమ్ము బెల్లమ్ము ఆలి మాటల్లు.. తాటాకు మంటల్లు తల్లి మాటల్లు.." అని పాడుకునేది. గిన్నెలు, చెంబులు సంగీతం సమకూర్చేవి.

కాఫీ తాగేసరికి సగం గెడ్డానికి ఉన్న నురగలు ఆరిపోతాయి కదా.. మళ్ళీ ఇంకోసారి బ్రెష్ తో రాసుకోవాలన్న మాట. ఇంక ఇక్కడి నుంచీ నేనస్సలు రెప్ప వేసేవాడిని కాదు. చిన్న అద్దం ముక్కలో ముఖం చూసుకుంటూ, బ్లేడు బిగించిన రేజర్ ని చెంప మీద పెట్టుకుని నెమ్మదిగా కిందకి లాగుతూ ఉంటే రేజర్ జారినంతమేరా నురుగు ఖాళీ అయిపోయేది. ఒక్కసారి పెన్సిల్ చెక్కితేనే నాకు వేలు తెగిపోతుంది కదా.. మరి రేజర్ తో అలా గీసుకుంటే నాన్నకి రక్తం రాకుండా ఎలా ఉంటుంది? అని పెద్ద డౌట్ నాకు. నా చూపు ప్రభావమో ఏమిటో తెలీదు కానీ, అప్పుడప్పుడూ ఆ ముచ్చటా జరిగేది.

నాన్నకి గెడ్డం తెగిందని తెలియడం ఆలస్యం, కాఫీ పొడుమో పసుపో పట్టుకుని బామ్మ పరుగున వచ్చేసేది. "ఏవీ అక్కర్లేదమ్మా.." అని నాన్న విసుక్కున్నా సరే. రెండు చెంపలు, గెడ్డం.. ఇలా తెల్ల నురుగంతా ఖాళీ అవ్వగానే మళ్ళీ నురుగు పట్టించేవాళ్ళు. ఎన్నిసార్లు, ఎంత సేపు చూసినా తెగకుండా ఉండే కిటుకేమిటో అస్సలు అర్ధమయ్యేది కాదు. ఒసారిలాగే నాన్నకి సత్యం గెడ్డం చేస్తుండగా రహస్యంగా చూస్తూ సత్యానికి రెడ్ హెండెడ్ గా పట్టుబడి పోయా. "ఆయ్.. ఏటండలా సూత్తన్నారు.. పదేల్లాగేరంటే తవరికీ ఒత్తాదండి గెడ్డం.. నేను సూడక పోతానా, సెయ్యకపోతానా" అనేశాడు.

నాకు మామూలు భయం వెయ్యలేదు.. కాస్త గట్టి పిండాన్ని కాబట్టి తట్టుకున్నాను కానీ లేకపొతే జడుపు జ్వరం వచ్చేసేది.. అసలు నేను పెద్దవాడిని అవుతాననీ, నాక్కూడా గెడ్డం వస్తుందనీ అప్పటి వరకూ ఆలోచించలేదు. సత్యం పుణ్యమా అని ఆలోచన మొదలయ్యింది. అది మొదలు ఖాళీ దొరికినప్పుడల్లా అద్దం ముందు కూర్చోవడం.. గెడ్డం, మీసం వస్తే నేను ఎలా ఉంటానో ఊహించుకోవడం.. బ్లేడు తెగకుండా గెడ్డం చేసుకోగలనో, లేదో అని బెంగ పడడం.. కనీసం ఎవరికీ చెప్పుకోగలిగే సమస్య కూడా కాదు కదా.

ఇప్పటికే నెలకోసారి సత్యానికి తల అప్పగిస్తున్నా.. అప్పుడింక గెడ్డం కూడానా అని మరో భయం. నేను కుదురుగా కూర్చోలేదని వంక పెట్టి, గెడ్డం చేస్తూ సత్యం నా ముఖం మీద కత్తితో గాట్లు పెట్టేసినట్టు కలలు.. ఆ నరకాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. కథలు, కాకరకాయలు చదవడం మొదలు పెట్టాక మరోరకం కష్టం.. నాలుగైదు కథలు చదివితే అందులో కనీసం ఒక కథలో అయినా, నిరుద్యోగి కొడుకుని "గెడ్డానికి బ్లేడు కూడా కొనుక్కోలేవు" అని ఈసడించే తండ్రి పాత్ర ఉండేది. నాన్న చేత ఇప్పుడు తింటున్న తిట్లు చాలక, కొత్త తిట్లు కూడా తినాలా అని బెంగ.

హైస్కూలు దాటి కాలేజీలో అడుగు పెట్టాక మరో రకం బెంగ. గీసిన గెడ్డాలూ, గుబురు మీసాలతో ఉంటే క్లాస్మేట్లని చూసి బోల్డంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. వాళ్ళు హైస్కూల్లోనే గజనీ దండయాత్రలు చేసొచ్చారన్న సంగతి అప్పట్లో అర్ధం కాలేదు. లెక్చరర్లు కూడా వాళ్ళంటే కొంచం భయంతో మెలగడం, అమ్మాయిలు వాళ్ళ వంక ఆరాధనా భావంతో చూస్తుండడం (ఇలా చూస్తున్నారని మన ఫీలింగ్ అన్నమాట) ఇవన్నీ రాని గెడ్డం మీద బోల్డంత కోపం తెప్పించేశాయి ఆ రోజుల్లో. అదృష్టవ శాత్తూ మూతి మీద మీసం చిక్కబడే నాటికి నేను 'ఉద్యోగస్తుడిని' అయిపోయా. నా మొదటి నెల జీతం రాగానే నేను మొదటగా కొనుక్కున్నది ఏమిటో చెప్పలేదు కదూ.. 'షేవింగ్ కిట్.'

బుధవారం, ఫిబ్రవరి 03, 2010

నెత్తురోడని గాయం

మనకి తగిలే గాయాలు రెండు రకాలు. శరీరానికి తగిలేవి, మనసుకి తగిలేవి. శరీరానికి తగిలే గాయాలకి చికిత్స ఉంది. కొన్నాళ్ళు బాధ పడ్డా మచ్చతో సహా మాయం చేసుకునే వైద్య సౌకర్యం ఉంది. శరీరంలో సున్నిత భాగాలకి తగిలిన గాయం నయమవ్వడానికి కొంచం ఎక్కువ సమయం పట్టొచ్చు, కానీ నయమవ్వక పోదు. ఇందుకు విరుద్ధంగా మనసుకి తగిలిన గాయం ఎవ్వరికీ కనిపించదు. నయం చేసే వైద్యం ఏదీ ఇప్పటివరకూ అందుబాటులో లేదు.

శరీరానికి తగిలే గాయాన్ని చూసి, గాయం తీవ్రతని, నయమవ్వడానికి పట్టే సమయాన్ని, అందించాల్సిన చికిత్సనీ అంచనా వేయొచ్చు. కానీ మనసుకి తగిలిన దెబ్బ తీవ్రత యెంతో గాయపడ్డ వాళ్లకి మాత్రమే తెలుస్తుంది. శరీరంలో మిగిలిన ప్రాంతాల్లో తగిలే గాయం కన్నా, సున్నితమైన చోట తగిలే గాయం ఎక్కువగా బాధిస్తుంది. నయం కాడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.

మనసంతా సున్నితమైనదే కాబట్టి ఎంత చిన్న దెబ్బైనా తీవ్రంగానే బాధిస్తుంది. అదే పెద్ద దెబ్బైతే..? వంశీ సినిమా 'సితార' లో 'సితార ఆత్మకథ' పుస్తకం త్వరలో విడుదల అన్న ప్రకటన పేపర్లో చూసి, 'సితార' గా భానుప్రియ అభినయం గుర్తుందా? మనసు గాయపడ్డానికి పరాకాష్ట ఆ సన్నివేశం. ఏమాటకామాటే చెప్పుకోవాలి, రెండో సినిమానే అయినా అద్భుతంగా అభినయించింది భానుప్రియ.

కొందరు అదృష్టవంతులు ఉంటారు. వాళ్ళ మనసు రాటుదేలిపోయి ఉంటుంది. ఎలాంటి గాయమూ వాళ్ళ మనసుని చలింపజేయదు. ఇంకొందరు దురదృష్టవంతులు.. ఎన్ని దెబ్బలు తగిలినా వీళ్ళ మనసులు గట్టిపడవు. పైగా మనసు గాయ పడ్డ ప్రతిసారీ పాతగాయాలు రేగుతూ ఉంటాయి. అలాంటప్పుడే మరుపనేది లేకపోవడమో, తక్కువగా ఉండడమో అన్నది బాధ పడాల్సిన విషయం అని తెలుస్తూ ఉంటుంది.

మనకెంతో ప్రియమైన వ్యక్తి నుంచి మనమో గాజుబొమ్మని కానుకగా అందుకున్నాం అనుకుందాం. మన మిత్రులొకరు ఆ బొమ్మని పరిశీలనగా చూడాలనే కుతూహలంతో అందుకుని చేయి జార్చారనుకుందాం. అదృష్టమో, దురదృష్టమో ఆ బొమ్మ పగిలిపోలేదు. కానీ బీట తీసింది. అది మనకి కానుకిచ్చిన వ్యక్తి కంట పడింది. మనం చేయగలిగింది ఏమిటి?

మచ్చలేకుండా బీటని అతకగలిగే సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదు, మనసుకి తగిలిన గాయాలని మరక కూడా మిగల్చకుండా పూర్తిగా రూపుమాపగలిగే సాధనమేదీ కూడా ఇంకా కనుగొనబడినట్టు లేదు. కొన్ని సమస్యలకి కాలం మాత్రమే జవాబు చెప్పగలదు. మనం చేయగలిగేదల్లా వేచి చూడడమే.