బుధవారం, అక్టోబర్ 14, 2020

శోభానాయుడు

"సిరిసిరిమువ్వ సినిమాలో హేమ వేషం వెయ్యమంటే, స్టేజి వదిలి సినిమాల్లో చెయ్యనని చెప్పేసిందిట" ... శోభానాయుడు పేరు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన తొలి సందర్భం ఇది. సినిమాలంటే ఇప్పుడున్నంత క్రేజు నలభయ్యేళ్ళ క్రితం లేకపోయినా, పిలిచి సినిమా అవకాశం ఇస్తే వద్దనడం మాత్రం వార్తే అయ్యింది. అప్పటికే ఆమె పేరున్న నర్తకి. పెద్ద పెద్ద వేదికల మీద తప్ప, ఓ మాదిరి కార్యక్రమాలకి పిలిచేవారు కాదు. కొన్నాళ్లకే విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి వచ్చిన నర్తకి అనే విశేషణం తోడయ్యింది. శోభానాయుడు ప్రదర్శనల్ని చూస్తూ వచ్చింది మాత్రం గత పాతికేళ్లుగా. మొట్ట మొదట చూసిందీ, చివరిసారిగా చూసిందీ ఒకటే బ్యాలే - 'శ్రీనివాస కళ్యాణం.' ఆమె పద్మావతి. వేదిక మీద ఆమె నర్తిస్తూ ఉంటే కళ్ళుతిప్పి మరో పాత్రని చూడడం కష్టం, చూపు తిప్పుకోనివ్వనిది రూపం మాత్రమే కాదు, అభినయం కూడా. 

విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో, స్థిరపడిన తెలుగు వాళ్ళు వాళ్ళ పిల్లలకి కూచిపూడి నేర్పించడం, వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి రవీంద్రభారతిలో అరంగేట్రం చేయించడం అనే పధ్ధతి ఓ పాతికేళ్ల క్రితం మొదలై, ఐదారేళ్ళ పాటు ఉధృతంగా సాగింది. యూఎస్ వెకేషన్ సీజన్ లో అయితే వారానికి రెండు మూడు అరంగేట్రాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటిలో చాలా కార్యక్రమాలకి శోభానాయుడు ముఖ్య అతిధి. అరంగేట్రం చేసే పిల్లల గురువులు, శోభానాయుడు శిష్యులు. అలా, తన ప్రశిష్యుల్ని ఆశీర్వదించడం కోసం ఆమె వీలు చేసుకుని వచ్చేవాళ్ళు. నాలుగు ముక్కలు మాట్లాడే వాళ్ళు. వాటిలో తాను చిన్నప్పటి నుంచీ నృత్యం మీద ఇష్టం పెంచుకుని, నేర్చుకోవడం మొదలు, దేశ విదేశాల్లో ప్రదర్శనలు, అక్కడి అనుభవాలు ప్రముఖంగా వినిపించేవి. ఆమెని గురించి ఆమె నుంచే విన్న సంగతులు ఎన్నో. 

ఒకసారి విదేశంలో (రష్యాలో అని జ్ఞాపకం) తన ప్రదర్శన చూసిన ఓ యువజంట, ఆ తర్వాత వాళ్ళకి పుట్టిన పాపకి శోభ అని పేరు పెట్టుకున్నారని చాలా అపురూపంగా జ్ఞాపకం చేసుకునేవారు. ఈ అరంగేట్రాల కాలంలోనే 'అశ్విని' హెయిరాయిల్ ప్రకటనకు మోడలింగ్ చేశారు శోభానాయుడు. సినిమాలే వద్దనుకున్నామె  ఇలా మోడలింగ్ చేయడం ఏమిటన్న ఆశ్చర్యం కలిగింది. దాదాపు అదే సమయంలో ఐఏఎస్ అధికారి అర్జునరావుని ఆమె వివాహం చేసుకున్నారు. ఇద్దరూ చెరో రంగంలో సెలబ్రిటీలు కావడంతో ఆ వివాహం అప్పట్లో విశేషమైన వార్త అయ్యింది పేపర్లకీ, మేగజైన్లకీ. 'ఇండియా టుడే' లో చదివిన కథనం ఇప్పటికీ గుర్తే. మొదటినుంచీ ఆమె ట్రూపులోనూ, అకాడెమీ లోనూ పురుషుల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. పురుష పాత్రల్ని కూడా స్త్రీలే పోషించే వాళ్ళు.  కొంతకాలం క్రితం ట్రూపు వరకూ సడలింపు ఇచ్చారు.

Google Image

తెలుగింటి పాత్రల్నే కాక, చండాలిక లాంటి పాత్రలకీ తెలుగుదనం అద్ది ప్రదర్శించారు శోభానాయుడు. సత్యభామగా ఆమెని స్టేజి మీద చూడడం ఒక అనుభవం. రెప్పపాటులో ఆమె ఎక్స్ప్రెషన్ మారిపోయేది. అడుగులు కూడా అంతే వేగంగా పడేవి. ముఖ్యంగా లైవ్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శన ఇచ్చేటప్పుడు పాడే వాళ్ళకి సవాలుగా ఉండేది ఆమె ప్రదర్శన. (ఇలా పోటీ ఇచ్చే మరో 'అభినవ సత్యభామ' గురు కళాకృష్ణ). రంగాలంకరణలో విశేషమైన మార్పులు శోభానాయుడుతోనే మొదలయ్యాయి అంటారు. తెరలు, లైటింగ్ లాంటి ప్రతి విషయంలోనూ ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారనీ, ఎక్కడా ఏ చిన్న విషయంలోనూ రాజీ పడరనీ చెప్పుకునే వారు. కొందరు నర్తకులు అభినయానికి (ఎక్స్ ప్రెషన్స్) , మరికొందరు అడుగులకీ (ఫుట్ వర్క్) పెట్టిందిపేరు. ఈ రెండింటిలోనూ విశేష ప్రతిభ ఉన్న కొద్దిమందిలో శోభానాయుడు ఒకరు. ఆమె నర్తిస్తుంటే అక్షరాలా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడాలి, అది కూడా రెప్పపాటు లేకుండా. 

దాదాపు రెండేళ్ల క్రితం ఆమెని ముఖాముఖీ కలిసే అవకాశం వచ్చింది. మా మిత్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 'శ్రీనివాస కళ్యాణం' ప్రదర్శించడానికి శిష్యులతో వచ్చారు. ఆర్గనైజర్లతో ఉన్న అనుబంధం వల్ల ఆమెతో కలిసి బ్రేక్ఫాస్ట్ తీసుకునే అవకాశం దొరికింది. 'సిరిసిరిమువ్వ' మొదలుగా చాలా విషయాలు దొర్లాయి కబుర్లలో. వాళ్ళమ్మాయి 'శివరంజని' ని పరిచయం చేశారు. బృందంలో ఆమె కూడా ఓ సభ్యురాలు. ఆవేళ రాత్రి ప్రదర్శించిన 'శ్రీనివాస కళ్యాణం' మాత్రం నిరాశ పరిచింది. అభినయం విషయంలో ఆమె రాజీ పడలేదు కానీ, అడుగులు చాలా బరువుగా పడ్డాయి. వయసు తెచ్చిన మార్పు శరీరంలో కనిపించింది కానీ, అది అడుగుల్లో కూడా కనిపించేసరికి బాధేసింది. 

ఆ మర్నాడు సహజంగానే ఆమె ఆరోగ్యం గురించి చర్చ జరిగింది మాలో మాకు. అప్పుడు విన్న కొన్ని విషయాలు యద్దనపూడి సులోచనారాణి 'కీర్తి కిరీటాలు' నవలని గుర్తు చేశాయి. రెండు రోజుల క్రితం డాన్సర్ మిత్రులొకరు ఆమె ఆరోగ్యం బాలేదన్న అప్డేట్ ఇచ్చారు. అయితే, ఇంత విషమం అని ఊహించలేదు. ఆమె నృత్యం, ఆమె మాటలు, ఆమె జీవితం.. ఇవన్నీ ఉదయం నుంచీ ఏ పని చేస్తున్నా గుర్తొస్తూనే ఉన్నాయి. కూచిపూడి నృత్యరీతిని ప్రపంచం నలుమూలలకీ తీసుకెళ్లిన నర్తకి, ఎందరికో నాట్యం మీద ఆసక్తి కలిగించిన నర్తకి, నాట్యం తప్ప జీవితంలో ఇంకేదీ తన మొదటి ప్రాధాన్యత కాదని కడదాకా మనసా వాచా నమ్మిన నర్తకి 'ఇకలేరు' అనుకోవడం కష్టంగానే ఉంది. మువ్వల చప్పుళ్ళల్లో ఆమె జ్ఞాపకాలు కలగలిసిపోతాయి. శోభానాయుడు ఆత్మకి శాంతి కలగాలి.. 

శుక్రవారం, అక్టోబర్ 09, 2020

కొండపొలం 

తెలుగు నవల ప్రౌఢిమను సంతరించుకుని శతాబ్దం కావొస్తున్నా అనేక వర్గాల జీవితాలు సమగ్రంగా రికార్డు కాలేదన్న సత్యాన్ని మరోమారు ఎత్తిచూపే నవల సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన 'కొండపొలం.'  కరువుసీమ రాయలసీమలోని గొర్రెల కాపరుల జీవితాలని ఇతివృత్తంగా తీసుకుని ఈ నవల రాశారు. ఏళ్లతరబడి వాళ్ళ జీవితాలని పరిశీలించి, ఎన్నో వివరాలని సేకరించి, దానికి ఓ వ్యక్తిత్వ వికాసపు కథని జోడించి నవలగా మలిచారు రచయిత. పుస్తకం చదవడం పూర్తి చేసి పక్కన పెట్టాక కూడా గొర్రెలు, గొర్రెల కాపరులు, వాళ్ళ జీవన విధానం కొన్నాళ్లపాటు పాఠకులని వెంటాడతాయనడం అతిశయోక్తి కాదు. కథానాయకుడు రవిని మాత్రమే కాదు, అతని తండ్రి గురప్పనీ, గురు సమానుడు పుల్లయ్యనీ, స్నేహితులు అంకయ్య, భాస్కర్ తదితరులనీ, మరీముఖ్యంగా అతని జీవన గతిని మార్చేసిన పెద్దపులినీ మర్చిపోవడం అంత సులువేమీ కాదు. 

పంటపొలాలకి సకాలంలో నీరందకపోతే పంట నష్టం. అదే గొర్రెలకు మేతా, నీరూ అందకపోతే ప్రాణ నష్టం. కరువు విలయతాండవం చేస్తున్న ఓ వేసవిలో, తమ గొర్రెలకి ఎలాగయినా మేత, నీరు అందించి వాటిని రక్షించుకోవాలని 'కొండపొలం' బయల్దేరతారు అహోబిలం సమీపంలోని ఓ గ్రామంలో గొల్లలు.ముందుగా కొందరు అడవికి వెళ్లి పచ్చిక, నీరు అందుబాటులో ఉన్న చోట్లని గుర్తు పెట్టుకుని రావడంతో ప్రయాణ సన్నాహాలు మొదలవుతాయి. ఒక్కో మంద లోనూ వందేసి గొర్రెలు. వాటిని నిలేసేందుకు ఇద్దరిద్దరు కాపరులు. వారం రోజులకి సరిపడా పాడవ్వని ప్రత్యేకమైన ఆహారం (రొట్టెలు వగయిరా), నీళ్ల క్యాన్లు తదితర సామాగ్రితో బయల్దేరతారు. ప్రతివారం ఊరినుంచి ఎవరో ఒకరు అందరు కాపరుల మరుసటి వారపు ఆహారాన్నీ (భత్యం అంటారు) అడవికి తీసుకెళ్లి ఇవ్వాలి. ఊళ్ళో వానలు కురిశాకే మందలు, వాటితో పాటు కాపరులూ  వెనక్కి తిరిగి వచ్చేది. 

గురప్ప మందకి రెండో మనిషి కావాలి. ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అందరికీ గొర్రెలు అలవాటే. పెద్ద కొడుక్కి మూడు నెలల క్రితమే పెళ్లయింది. పెళ్ళైన తొలి ఏడాది కొండపొలం వెళ్లకూడదని గొల్లల ఆచారం. అలాగే ఆడపిల్లని అడవికి తీసుకెళ్లడాన్ని కూడా సమర్ధించరు. అలా వెళ్లిన అమ్మాయికి పెళ్లి సంబంధాలు రావడమూ కష్టమే. ఇక మిగిలింది రెండో కొడుకు రవి. ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న రవి, ఆ సమయానికి ఊళ్ళోనే ఉంటాడు. రవి అడవిలో ఉండగలడా, తనకి సాయ పడగలడా అన్నది గురప్ప సందేహమైతే, చదువుకున్న కుర్రాణ్ణి కొండపొలం పంపడం అతని భార్యకి అభ్యంతరం. మందకి రెండో మనిషి దొరక్క పోవడంతో అడవికి ప్రయాణం కాక తప్పదు రవికి. ఆ ప్రయాణం మొదలైనప్పటి నుంచీ, కొండపొలాన్ని రవి కళ్ళతో పాఠకులకి చూపించారు రచయిత. 

చదువుకున్న వాడే కానీ బొత్తిగా భయస్తుడు రవి. ఆ భయం కారణంగానే నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఉద్యోగం సంపాదించుకోలేక పోతున్నాడు. ఇంటర్యూ అన్నా, గ్రూప్ డిస్కషన్ అన్నా తగని భయం అతనికి. పల్లెటూరివాడిననే ఆత్మ న్యూనత నుంచి బయట పడలేక పోతున్నాడు. ఈ అడవి ప్రయాణం అతనికి పూర్తిగా కొత్త. యాభై రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన కొండపొలం తొలినాళ్లలో తాడుని చూసి పామనుకుని భయపడిన వాడు, నక్కని చూసి జడుసుకున్న వాడూ, చివరికి వచ్చేసరికి తన గొర్రెల మందని రక్షించుకోడానికి పెద్దపులితో తలబడే ధైర్యాన్ని సంతరించుకుంటాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని మించి ఇంకేదన్నా సాధించాలనీ, తనవల్ల అడవికి ఏదన్నా ఉపకారం జరగాలనీ తపిస్తాడు. కొత్త లక్ష్యాన్ని ఏర్పరుచుకుని విజయం సాధిస్తాడు. 

నవలలో పాఠకులని కట్టిపడేసేది మాత్రం యాభై రోజులపాటు సాగే కొండపొలం. గొర్రెలు, కాపరులతో పాటు పాఠకులు కూడా నల్లమలకి వెళ్ళిపోతారు. కొండచిలువలు, చిరుతలు, పెద్దపులుల నుంచి గొర్రెలకు, కాపరులకు ఎదురయ్యే సవాళ్ళకి ఉద్విగ్న పడతారు. కాపరుల వ్యక్తిగత జీవితాలలో జరిగే సంఘటనలని సొంత మనుషులకి జరిగిన వాటిగా భావిస్తారు. ఊళ్ళో ఎప్పుడు వర్షం కురుస్తుందా, ఈ మందలన్నీ ఎప్పుడు ఈ అడవి నుంచి బయట పడతాయా అని ఎదురు చూస్తారు. ఇలా చూసేలా చేయడంలో రచయిత కృతకృత్యులయ్యారు. నవల చదువుతూ ఉంటే, కాపరులతో పాటు రచయిత కూడా కొండపొలం వెళ్లి తన అనుభవాలని రికార్డు చేశారా అనిపించేంత గాఢమైన సన్నివేశ కల్పన చేశారు. ఎర్ర చందనం అక్రమ రవాణాని, చెంచుల సమస్యలని కూడా ఈ గొల్లల కథలో భాగం చేశారు. 

'కొండపొలం' చదవడం పూర్తి చేశాక సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డిలోని ఆశావాది కనిపిస్తాడు పాఠకులకి.  రవిని అటవీశాఖ అధికారిని చేయడం మాత్రమే కాదు, అతని కారణంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ ఆగిపోయిందని చెబుతారు మరి. పాత్రల చిత్రణకి వస్తే మనుషుల్ని కేవలం బ్లాక్ అండ్ వైట్ లో మాత్రమే చూశారు. అధికశాతం పాత్రలు మంచి వాళ్ళు (దాదాపుగా ఒకే మూసలో ఉంటారు వీళ్ళు), కొద్దిమంది చెడ్డవాళ్ళు (వీళ్ళదీ ఒకే ధోరణి). నలుగురు మనుషులు కలిస్తే రాజకీయం పుడుతుందని వాడుక. అందరు గొల్లలు కలిసి అన్ని రోజులు అడవిలో గడిపినా ఎక్కడా వాళ్లలో వాళ్ళకి అభిప్రాయ భేదాలు వచ్చే సందర్భం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అందరూ అన్నివేళలా ఒకే మాట మీద ఉండడం, ఎవరూ, ఎదురాడక పోవడం అన్నది కొండపొలం లాంటి ప్రత్యేక సందర్భాలలో సహజంగానే జరుగుతుందా, లేక రచయిత పాజిటివిటీకి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి అలాంటి వాటికి కథలో చోటివ్వలేదా అన్న ఆలోచన వచ్చింది నాకు. 

నవల ప్రారంభం కొంచం నాటకీయంగా ఉన్నా, ఒక్కసారి కొండపొలం  మొదలయ్యాక ఊపిరి బిగబట్టి చదివిస్తుంది. సంభాషణలు అక్కడక్కడా ప్రీచీగా అనిపిస్తాయి కానీ అవేవీ కథా గమనానికి అడ్డు పడవు. ఎక్కడా సుదీర్ఘమైన సంభాషణలు లేవు కూడా. రవిలో మార్పు వచ్చే క్రమాన్ని, చుట్టూ జరిగే సంఘటనలకు అతని స్పందనలో క్రమేపీ వచ్చే మార్పునీ ప్రత్యేకంగా చిత్రించారు. కథని పట్టుగా నడిపించడానికి పెద్దపులి పాత్ర ఎంతగానో దోహద పడింది. ఏ మలుపు నుంచి, ఏ చెట్టు/బండచాటు నుంచి పెద్దపులి వచ్చి మంద మీద దాడి చేస్తుందో అనే సందేహం పాఠకులని ప్రతి పేజీలోనూ అప్రమత్తంగా ఉంచుతుంది. తరువాతి పేజీకి పరుగెత్తేలా చేస్తుంది. నిజానికి ఈ నవలని కొండపొలం వెళ్లొచ్చిన గొల్ల కులం వారెవరైనా రాసి ఉంటే ఎలా ఉండేదా అన్న ఆలోచన వచ్చింది. చివర్లో చదివిన ముందుమాటలో రచయిత కూడా ఇలాంటి అభిప్రాయాన్నే ప్రకటించారు. సాహిత్యాభిమానులు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. 

(తానా నవలల పోటీలో రెండు లక్షల రూపాయల బహుమతిని గెలుచుకున్న ఈ నవల 'తానా ప్రచురణలు' ద్వారా మార్కెట్లో ఉంది. పేజీలు 350, వెల రూ. 200).

బుధవారం, అక్టోబర్ 07, 2020

కొన్ని సమయాలలో కొందరు మనుషులు 

గంగ ఇప్పుడు పుట్టి ఉంటే ? ..యాభయ్యేళ్ళ నాటి నవలల్ని ఇప్పుడు చదువుతుంటే తరచూ వచ్చే ప్రశ్నలు ఇలాంటివే. ఆ పాత్రలు ఇప్పుడు పుట్టి ఉంటే? అనో లేక ఆ కథ ఈ కాలంలో జరిగి ఉంటే? అనో. దీనర్ధం ఆయా రచనలు అవుట్ డేటెడ్ అని ఎంతమాత్రం కాదు, ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ మర్చిపోలేనివీ, వెంటాడుతూ ఉండేవీ కాబట్టే వాటిని మళ్ళీ మళ్ళీ చదువుకోవడం, మరింతగా ఆలోచించడమూను. సరిగ్గా యాభయ్యేళ్ళ క్రితం డి. జయకాంతన్ రాసిన తమిళ నవల ' సిల నేరంగళిల్, సిల మనితర్గళ్' లో నాయిక గంగ. తమిళ మూలం విడుదలై, సంచనలం సృష్టించి, అదే పేరుతో వచ్చిన సినిమాలో గంగగా నటించిన లక్ష్మికి జాతీయ అవార్డు వచ్చాక, ఆ నవలని  'కొన్ని సమయాలలో కొందరు మనుషులు' పేరిట తెనిగించారు విదుషి మాలతీ చందూర్. ఈమధ్యే కంట పడిన ఆ పుస్తకాన్ని మరోమారు చదువుతుంటే, మళ్ళీ వచ్చిన ప్రశ్నే 'గంగ ఇప్పుడు పుట్టి ఉంటే?' నిజానికిది గంగ ఒక్కదాని కథే కాదు, ఆమె చుట్టూ ఉండే అందరి కథాను. 

ఓ సంప్రదాయపు పేదింటిలో పుట్టిన గంగ మద్రాసు కాలేజీలో చదువుతూ ఉండగా, ఓ వర్షపు సాయంత్రం ఓ ధనవంతుడైన యువకుడు ఆమెకి తన కారులో లిఫ్ట్ ఇస్తాడు. ఆ కారులోనే వాళ్లిద్దరూ ఒక్కటౌతారు. ఆమెని ఇంటి దగ్గర దింపేసి తన దారిన వెళ్ళిపోతాడు. కనీసం అతని పేరుకూడా తెలీదు గంగకి. తమ మధ్య జరిగిందేవిటో తల్లి కనకానికి చేప్పేస్తుంది గంగ. బిగ్గరగా ఏడుపు ఆరంభిస్తుంది ఆ తల్లి. చుట్టుపక్కల అందరికీ విషయం తెలిసిపోతుంది. గంగని ఇంట్లో నుంచి గెంటేస్తాడు ఆమె అన్న గణేశన్. కొడుకుని కాదని కూతురితో పాటు బయటికి వచ్చేస్తుంది కనకం. మేనమామ వరసైన న్యాయవాది వెంకటేశ అయ్యంగార్ గంగకి తంజావూరులోని  తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి చదివిస్తాడు. యూనివర్సిటీ టాపర్ అయిన గంగకి ప్రభుత్వంలో ఉన్నతోద్యోగం రావడంతో తిరిగి మద్రాసులో అడుగు పెడుతుంది. అన్నావదినలకి దూరంగా తల్లితో కలిసి వుంటుంది. 

తన కూతురికి పెళ్లి జరిగే రాత లేదని కనకానికి స్థిర నిశ్చయం. 'వెంకూ అన్నయ్య' దయవల్ల తన కూతురికి బతుకుతెరువు దొరికిందనీ, ఆమె నీడన తన జీవితం కూడా వెళ్ళిపోతుందనీ భావిస్తూ ఉంటుంది. జరిగినదాని పట్ల ఓ తల్లిగా ఆమెకి బాధ ఉంది, అంతకు మించి గంగకి తాను ఏమన్నా చేయగలనా అన్న ఆలోచన లేదు. ఇక గణేశన్ పనల్లా చెల్లెలి గురించి వినిపించే పుకార్లని మరింతగా ప్రచారంలో పెట్టడం, తానే స్వయంగా వచ్చి తల్లి చెవిన వేస్తూ ఉండడం. అలాగని గంగ సంపాదన మీద అతనికి ఆశ లేదు. తల్లిని ఏనాడూ రూపాయి చేబదులు అడగలేదు. అతని భార్యకైతే గంగ మీద అకారణ ద్వేషం. వేంకటేశ అయ్యంగార్ దృష్టిలో గంగ తను మలిచిన బొమ్మ. ఆమె మీద తనకి అధికారం ఉన్నదనే భావిస్తూ ఉంటాడు. ప్రాచీన ధర్మాలని అలవోకగా వల్లెవేసే, పిల్లలు లేని ఆ ప్లీడరు గంగలో కూతుర్ని కాక, స్త్రీని చూస్తూ ఉంటాడు. అవకాశం కోసం కాసుకునీ ఉంటాడు. 

ఇంతకీ గంగ ఏమనుకుంటోంది? ఆమెకి మగవాళ్ల పట్ల విముఖత. ఆమెకి తారసపడే వాళ్ళ చూపులు, చర్యలూ ఆ వైముఖ్యాన్ని మరింత పెంచుతూ ఉంటాయి. 'వెంకూ మామయ్య' మనసులో ఏముందో ఆమెకి తెలుసు. ఆశ్రయం ఇచ్చాడన్న గౌరవం ఉంది. అంతకు మించి అతని చర్యల పట్ల అసహ్యమూ ఉంది. అతన్ని హద్దు దాటనివ్వకుండా ఉంచడం ఎలాగన్నది ఆమె నేర్చుకుంది. గంగకి ఈ జాగ్రత్తని బోధించింది స్వయానా వెంకూ భార్యే. గంగ ఎవరికన్నా ఉంపుడుగత్తెగా ఉండేదుకు తప్ప, భార్య అయ్యేందుకు అర్హతని కోల్పోయిందని తీర్మానిస్తాడు వెంకూ. దాని వెనుక ఆమె తనకే ఉంపుడుగత్తె కావాలన్న ఆలోచన ఉన్నదని గంగకి మాత్రమే తెలుసు. గంగకి చేతనైతే ఆవేళ ఆమెని కార్లో తీసుకెళ్లిన వాడిని వెతికి పట్టుకోవాలని, కనకం దగ్గర ఛాలెంజి చేస్తాడు వెంకూ. ఈ ఛాలెంజి గంగ చెవిన పడుతుంది. అనూహ్యంగా, ఆ వ్యక్తిని వెతికి పట్టుకోడానికి నిశ్చయించుకుంటుంది గంగ. 

పన్నెండేళ్ల తర్వాత అతన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తుంది గంగ. అతని కారు తప్ప, ముఖం కూడా గుర్తు లేదామెకి. ఆర్నెల్ల ప్రయత్నం తర్వాత ప్రభూగా పిలవబడే ప్రభాకర్ని వెతికి పట్టుకుంటుంది. అతను సంఘంలో గౌరవనీయుడు. ఓ టీనేజ్ అమ్మాయి మంజుకి తండ్రి. భార్య పద్మ, మరో ఇద్దరు మగపిల్లలు. అనూహ్యంగా గంగకి, ప్రభుకి స్నేహం కుదురుతుంది. తాను చేసిన పని పట్లా, దాని పర్యవసానం పట్లా పశ్చాత్తాపం కలుగుతుంది ప్రభులో. తగిన వరుణ్ణి చూసి గంగకి పెళ్లి చేయాలని అతని ప్రయత్నం. వెంకూ మామయ్య ప్రవచనాల ఫలితం వల్ల కావొచ్చు, గంగ దృష్టిలో మరో మగవాడు లేడు, ప్రభు తప్ప. అలాగని అతనితో సంబంధానికి ఆమె వ్యతిరేకి. కానీ, అతని మనిషిగా ముద్ర వేయించుకోవాలని తనంత తానుగా ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుతో పరిచయం తర్వాత గంగలో వచ్చే మార్పు ఈ నవలకి ఆయువుపట్టు అని చెప్పాలి. ఆమె అంతః సంఘర్షణ నవల చదివే పాఠకులకి తప్ప, ఆమె చుట్టూ ఉన్న ఎవరికీ అర్ధం కాకపోవడం ఒక విషాదం. 

ప్రభుతో గంగ స్నేహాన్ని సంఘం మాత్రమే కాదు, కనకం కూడా అంగీకరించదు. ప్రభు భార్య అతన్ని పట్టించుకోడం ఏనాడో మానేసింది. ఆమె జాగ్రత్తల్లా ఆస్తిని కాపాడుకోవడం, పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచడం. మంజుకి గంగకి స్నేహం కుదురుతుంది. మంజు మగ స్నేహితుల గురించి విన్నప్పుడు తరంతో పాటు స్త్రీ-పురుష సంబంధాలని గురించి యువత ఆలోచనల్లో వచ్చిన మార్పులని అర్ధం చేసుకుంటుంది గంగ. ప్రభు ఆమెకి మానసికంగా దగ్గరయ్యే సమయానికి గంగ జీవితంలో కొన్ని ఊహించని పరిణామాలు జరగడం, అటుపైన గంగ జీవితం ఊహకందని విధంగా మారిపోవడం ఈ నవల ముగింపు. నిజానికి ఈ నవలకి కొనసాగింపుగా మరో నవల రాశారు జయకాంతన్. మనస్తత్వ విశ్లేషణ మీద జయకాంతన్ కి ఉన్న పట్టుని గురించి కొత్తగా చెప్పుకోడానికి ఏమీ లేదు. తెలుగు నవలేమో అనిపించేలా అనువదించారు మాలతీ చందూర్. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని ఆర్కీవ్స్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.