మంగళవారం, ఫిబ్రవరి 28, 2012

అమ్మాయి పెళ్ళి

దాదాపు రెండువేల మంది కూర్చునేందుకు సౌకర్యంగా ఉన్న కల్యాణ మండపం. రంగురంగుల పూలతో అలంకరించిన వేదిక. ఆంధ్ర దేశంలోని అధునాతన ఫ్యాషన్లు ఏమిటో తెలుసుకోడానికి గూగుల్ సెర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెబుతున్నారా అన్నట్టుగా అతిధులు. ఓ పక్క బ్యాండ్ మేళం వాళ్ళ హడావిడి.. వారిలో ఒక గాయకుడు కూడా ఉన్నట్టున్నాడు.. మైకందుకుని 'జగదానంద కారకా...' పాడేస్తున్నాడు. తిరునామాలు, కేరళ అంచు పంచెలతో మెరిసిపోతున్న ఐదుగురు పురోహితులూ చుట్టూ ఉన్నవాళ్ళని ఖంగారు పెట్టేస్తున్నారు.

తెల్లటి కుర్తా పైజమా, మెడ చుట్టూ మెరూన్ రంగు ష్రాల్ తో పెళ్ళికొడుకు మండపంలోకి వచ్చాడు. నేరుగా పరిచయం లేదు కానీ, ఆమధ్య స్కైప్ లో పరిచయాలై, కొద్దిగా మాటాడుకున్నాం. కొంచం చిక్కినట్టుగా అనిపించాడు. ఎంతైనా పెళ్ళంటే అబ్బాయిలకి టెన్షన్ మొదలవుతుంది కదా. పురోహితులకీ, బ్యాండు వాళ్ళకీ మధ్య హోరాహోరీ జరుగుతోంది. వీళ్ళు వాయించడం ఆపమంటారు, వాళ్ళు ఆపరు. ఆపారా, మళ్ళీ వాయించమన్నప్పుడు వాయించరు. ఉన్నట్టుండి బ్యాండు వాళ్ళు "బంగారు బొమ్మ రావేమే.." అందుకున్నారు. వచ్చేసింది బంగారు బొమ్మ. కానైతే వేదిక కి కొంచం ఎడంగా పూజకి కూర్చుంది.

పెళ్ళి శ్రద్ధగా చూడడం కోసం, చుట్టుపక్కల ఎవరితోనూ మాట కలపకుండా వేదికకి కళ్ళు అప్పగించేశాను. నా చుట్టుపక్కల గుంపుల్లో పెళ్ళి ఖర్చు, అబ్బాయి సంపాదన మొదలు, అమ్మాయి కట్టుకున్న చీర, పెట్టుకున్న నగల వరకూ తీవ్రంగా జరుగుతున్న చర్చలు వద్దన్నా చెవుల్లో పడుతున్నాయ్. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి బహుమానాలు అందించారు. ముందుగా అమ్మాయి, తర్వాత అబ్బాయి వేదిక మీద నుంచి తప్పుకున్నారు. పురోహితుల్లో పెద్దాయన మైకందుకుని అప్పటివరకూ చదివిన మంత్రాలకి అర్ధాలు వివరంగా చెప్పారు. విన్నవాళ్ళు మెచ్చుకున్నారు. కబుర్లలో బిజీగా ఉన్నవాళ్ళు, బహుశా వాటిని కూడా మంత్రాలనే అనుకుని ఉంటారు.

అబ్బాయి వచ్చాడు, మరో డ్రెస్ లో. బ్యాండు వాళ్ళు 'పందిట్లో పెళ్లవుతున్నాది..' వాయిస్తున్నారు. అమ్మాయి రాబోతోందని వీడియో వాళ్ళ హడావిడిని బట్టి అర్ధమయ్యింది. "పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ కాళ్ళు కడగడం ఎక్కడా జరగదు. ఒక్క పెళ్ళిలో తప్ప. ఇక్కడ వరుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు..." పురోహితుడు వివరిస్తూ ఉండగానే, అమ్మాయి తల్లిదండ్రులు వరపూజకి ఆయత్తమయ్యారు. కళ్ళ నిండుగా చూసుకున్నాను ఇద్దరినీ. ఆది దంపతుల్లా అనిపించారు. ఇవాల్టి పరిచయం, స్నేహమూ కాదు కదా. అమ్మాయి వాళ్లకి ఎంత అపురూపమో తెలుసు నాకు. ఆమెని అతనికి అప్పగించే క్షణంలో వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? సర్రున దూసుకొచ్చింది ఈ ప్రశ్న. నాకు తెలియకుండానే, వాళ్లలోకి పరకాయ ప్రవేశం చేసేశాను.

మనసెంత బరువెక్కి పోయిందంటే, బ్యాండు వాళ్ళ హడావిడి వినబడితే తప్ప సుముహూర్తం అయిందన్న స్పృహ కలగలేదు. ఉలికిపడి చూసేసరికి నూతన వధూవరుల మీద అక్షింతలు వేయడానికి బారులు తీరిన జనం. ఒకరితలపై ఒకరు జీలకర్ర, బెల్లం ఉంచుకున్న వధూ వరులు. వారి వెనుక నిలబడి అతిధులకి నమస్కరిస్తున్న వధువు తల్లిదండ్రులు. కాసేపలా చూస్తూ ఉండిపోయాను. నెమ్మదిగా కదిలి, క్యూలో నిలబడ్డాను. నా వంతు వచ్చేసరికి, వధూ వరులిద్దరూ పీటల మీద కూర్చుని అతిధులకి నమస్కరిస్తున్నారు. నా మిత్రులుద్దరూ నవ్వుతూ పలకరించేశారు. అమ్మాయి, అబ్బాయికి నేరుగా నన్ను పరిచయం చేసేయడం, అంత హడావిడిలోనూ.

వేదిక దిగుతుండగా కొందరు పరిచయస్తులు పలకరించారు. వారితో కలిసి భోజనానికి దారితీశాను. రెండు మూడు వంటకాలు కేవలం నాకోసమే వండించారేమో అనిపించింది. "మా ఇంటికి మీరెప్పుడు భోజనానికి వచ్చినా, ఐటమ్స్ సరిగ్గా ఉండవు" ఆవిడ మాటలు గుర్తొచ్చి నవ్వొచ్చింది. పాత బాకీలన్నీ వడ్డీతో సహా తీరిపోయాయి కదా మరి. అప్పటికప్పుడు చుట్టిచ్చిన తాజాపాన్ అందుకుని, మండపం దగ్గరికి వచ్చేసరికి ఇంకా అక్షింతలు వేసే కార్యక్రమం జరుగుతోంది. కాసేపటికి నూతన వధూవరులిద్దరూ చెరో చేంజింగ్ రూములోకీ వెళ్ళారు. పురోహితుడు మైకందుకునే లోగా, బ్యాండ్ గాయకుడు అలర్టై 'పెళ్ళి' గురించిన సినిమా పాటలన్నీ ఆపకుండా పాడేయడం మొదలు పెట్టాడు. తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరూ పలకరిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు, కొందరు స్నేహితులూ కూడా పరిచయమే నాకు.

అమ్మాయి తల్లిదండ్రులు వేదిక దిగడానికి అనుమతి దొరికేసింది. వాళ్ళు ఒక్కొక్కరినీ పలకరించడం మొదలు పెట్టారు. "ఎలా ఉందండీ భోజనం?" అడిగారాయన, చేయి నొక్కుతూ. "చాలా బాగుందండీ.. ఎక్కడా వేస్టేజ్ కూడా లేదు. సర్వీసింగ్ కూడా చాలా బాగుంది.." ఆయన సంతోష పడ్డారు. పెళ్లితంతు మళ్ళీ మొదలయ్యింది. మాంగల్య ధారణ పూర్తయ్యి, తలంబ్రాలకి రంగం సిద్ధమవుతోంది. "అమ్మాయి రేపటినుంచీ ఉదయం లేచీ లేవగానే మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని, అతని కాళ్ళకి నమస్కరిస్తుందా... " ఊహ చాలా సరదాగా అనిపించింది నాకు. తలంబ్రాల్లో ఇద్దరికీ పోటీ పెట్టారు బంధుమిత్రులు.. అబ్బాయి పొడుగు, తలవంచని స్వభావం (!!) అవ్వడం వల్ల అతగాడే గెలిచినట్టు కనిపించింది. "అమ్మాయే గెలిపించింది" అనిపించింది.

"మీరొక్కరే కూర్చున్నారా? ఎవరితోనన్నా మాట్లాడొచ్చు కదా" వేదిక ఎప్పుడు దిగారో, వధువు తల్లి అడుగుతున్నారు నన్ను. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ముఖంలో బోలెడంత అలసట, అంతకు మించిన తృప్తీ కనిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరగడం, బాధ్యత తీరడం వల్ల కలిగిన తృప్తా అది? ఏమో.. "లేదండీ.. నేనే కలవడం లేదు, పెళ్ళి చూడడం కోసం..." జవాబుగా నవ్వేశారు. భోజనాలు బాగున్నాయనీ, అందరూ మెచ్చుకున్నారనీ కూడా చెప్పేశాను, ఆవిడకి తీరిక దొరకదని అర్ధమై. అమ్మాయీ, అబ్బాయీ వాళ్ళ స్నేహితులతో కబుర్లలో పడబోతుండగా, పురోహితులు అడ్డుకుని, దాంపత్యం ఎలా ఉండాలో శ్లోకాలు, అర్ధాలతో సహా చెబుతున్నారు వాళ్లకి. తిరుగు ప్రయాణానికి సన్నద్ధమై, ఆవిడకి చెప్పి, ఆయన్ని వెతికి పట్టుకుని "బాధ్యత తీర్చేసుకున్నారు.." అన్నాను. "మీ అందరివల్లానండీ.." అన్నారాయన, నిజానికి భోజనం తప్ప నేను చేసింది ఏమీ లేకపోయినా. "ఇది చాలా మంచి ముహూర్తం.. చాలా పెళ్ళిళ్ళు జరిగాయివాళ" ఆటో అతని మాటలు చాలా సంతోషపెట్టాయి నన్ను.

శుక్రవారం, ఫిబ్రవరి 24, 2012

పంచమ స్వరం

"నా దృష్టిలో బ్లాగన్నది మన జీవితంలో ఓ భాగం కాదు. మన అభిప్రాయాలు, మనసులోని భావాలు పంచుకోవటానికి ఓ వేదిక అంతే! కుదిరిన రోజు వ్రాస్తాం..లేని రోజు లేదు! నచ్చిన వాటిని మెచ్చుకుంటాం..నచ్చని వాటిని వదిలేస్తాం!" ...అభిప్రాయం బాగుంది కదూ.. ఇది నాది కాదు. నాకు నచ్చే బ్లాగు రాసే ఒకానొక బ్లాగరిది. ఆ బ్లాగు నిన్ననో, మొన్ననో మొదలయ్యింది కాదు.. ఐదేళ్ళ క్రితం వెలుగు చూసింది.. తొలి తరం తెలుగు బ్లాగుల్లో ఒకటి. బ్లాగు పేరు సరిగమలు, బ్లాగరి పేరు సిరిసిరిమువ్వ (నాకు మాత్రం మువ్వగారు!) ." రెండూ ఒకదానితోఒకటి పోటీ పడుతున్నాయి కదూ.

ఐదేళ్ళలో నూటముప్ఫై (మాత్రమే) టపాలు వ్రాసి, రాశి కన్నా వాసి ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పిన మువ్వగారికి ముందుగా శుభాభినందనలు. సీనియర్ అని అందరూ అనుకోడమే కానీ, "నేను సీనియర్ని" అన్న భావం ఆవిడ టపాల్లో కానీ, వ్యాఖ్యల్లో కానీ ఎక్కడా కనిపించదు. కొత్తగా బ్లాగుల్లోకొచ్చి బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూసే రోజుల్లో, టపాలకి వచ్చిన వ్యాఖ్యలు ఏదో ఊతం దొరికినట్టుగా అనిపిస్తాయి, నిజం. రాయడం కన్నా, బ్లాగులు చదవడానికి ఎక్కువ ఇష్టపడే మువ్వ గారు, ఎంతో ఆచితూచి, నొప్పించక తానొవ్వక వ్యాఖ్యానిస్తారు..అవి కూడా సదరు బ్లాగరికి మరిన్ని టపాలు రాయాలనే ఉత్సాహాన్ని కలిగించేవిగా ఉంటాయి.

తెలుగంటే మువ్వగారికి ఎంత ఇష్టమంటే,
"తెలుగులో వ్రాస్తున్నానన్న తృప్తికోసమే నేను బ్లాగు వ్రాస్తున్నానేమో!" అనేటంత. అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి ఆవిడ చేస్తున్న పరోక్ష కృషి చాలామందికి తెలిసిందే. అంతెందుకూ, క్రమం తప్పకుండా 'పొద్దు' పొడవడం వెనుక, మువ్వగారి నిశ్శబ్ద కృషీ ఉందన్నది ఓ వినికిడి. సాహిత్యం మీద ఇష్టం, వర్తమాన అంశాలమీద స్పందించే తీరు, పల్లెటూరి బాల్యాన్ని గురించిన జ్ఞాపకాలు, మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులపై సునిశిత పరిశీలన...ఇవన్నీ మువ్వగారి బ్లాగులో నాకు బాగా నచ్చే విషయాలు.

మెజారిటీ బ్లాగులు స్ప్రుశించేవి పరిమిత అంశాలనే. కానైతే మువ్వగారు మొత్తం నూట పదకొండు వైవిద్యభరితమైన వర్గాల్లో రచనలు చేశారు! దాదాపుగా ఒక టపాలో ఎంచుకున్న అంశానికీ, మరో టపాలోని విషయానికీ పోలిక ఏమాత్రమూ లేదన్నమాటే. అచ్చుతప్పులు లేని చక్కని భాష (నాలాంటి వాళ్ళు ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం), సూటిగా, స్పష్టంగా, కొండొకచో గంభీరంగా ఉండే విషయ ప్రకటన, అటుపై వ్యాఖ్యలకి ఆత్మీయంగా ఇచ్చే జవాబులు. "మువ్వగారిలాగా వ్యాఖ్యలకి జవాబులు రాయాలి" అని చాలాసార్లే అనుకున్నా, బ్లాగు ప్రయాణం మొదలు పెట్టిన తొలి రోజుల్లో.

నా బ్లాగులో వారు రాసిన మొదటి వ్యాఖ్యకి నా జవాబు అప్పుడప్పుడూ గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉంటాను. 'ఝుమ్మంది నాదం' పాటని తల్చుకున్నానా రోజు. అలాగే, 'గుండె గొంతుకలోన కొట్టాడడం' అంటే ఏమిటో తెలుసా మీకు? ఓ బ్లాగరుగా నేనా అనుభూతిని పతాక స్థాయిలో పొందింది మువ్వగారి 'బ్లాగు పుస్తకంలో నెమలీక'ని చూసిన క్షణంలో. ప్రకృతి జన్యమైన భారతీయ సంగీతంలో పంచమ స్వరానికి ఆధారం కోయిల గానం. వసంతానికి కొంచం ముందుగా బ్లాగులోకంలో 'సరిగమల' ప్రస్థానాన్ని ఆరంభించిన మువ్వగారు ఈ ప్రయాణాన్ని ఎన్నెన్నో వసంతాలపాటు నిరంతరాయంగా కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. మేరు పర్వతాన్ని అద్దంలో చూపించడం అసాధ్యమే అయినా, మానవ ప్రయత్నంగా మొదలుపెట్టి, ఈనాలుగు మాటల్నీ మీతో పంచుకుంటున్నా..