ఆదివారం, ఏప్రిల్ 14, 2024

ఎదలో గానం.. పెదవే మౌనం...

"శిల కూడా చిగురించే విధి రామాయణం
విధికైనా విధి మార్చే కథ ప్రేమాయణం ..."

మంచి సాహిత్యం, దానికి సరిపడే సంగీతం, తగిన సన్నివేశం.. ఇవన్నీ కుదిరినప్పటికీ కొన్ని పాటల విషయంలో కొన్ని కొన్ని అసంతృప్తులు అలా మిగిలిపోతూ ఉంటాయి. శేఖర్ కమ్ముల 'ఆనంద్' (2004) సినిమా కోసం వేటూరి రాసిన 'ఎదలో గానం..' పాట ఆ కొన్నింటిలో ఒకటి. ప్లే లిస్టులో పెర్మనెంటు మెంబరుగా ఉండిపోవాల్సిన ఈ పాట కేవలం గాయకుడి ఉచ్ఛారణ కారణంగా అతిథిలా అప్పుడప్పుడూ వచ్చి పోతూ ఉంటుంది. చాన్నాళ్ల తర్వాత ఈ మధ్యనే మళ్ళీ వచ్చింది. 

ఈ పాట నాయికా నాయకుల యుగళగీతం కాదు, కథలో కీలక సన్నివేశాలు జరుగుతుంటే నేపథ్యంలో వినిపించే పాట. సినిమాలో ఉన్న ముఖ్య పాత్రలన్నీ ఈ పాటలో కనిపిస్తాయి. కె ఎం రాధాకృష్ణన్ ఫ్యూషన్ సంగీతంతో బాణీ కట్టారు. 

"ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో
మెరిసెనిలా శ్రీ రంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో"

శ్రీరంగ కావేరి ఒక్కో ఋతువులోనూ ఒక్కో అందంతో మెరుస్తుంది. 'సారంగ' అంటే 'చిత్ర వర్ణము కలది' అంటున్నారు వావిళ్ళ వారు. కనులు సెలయేరులైనప్పుడు కలలు 'సెలవు' తప్ప ఇంకేం అనగలవు? పాటని అద్భుతంగా ఎత్తుకున్నప్పటికీ,  హరిహరన్ "ష్రిరంగ కావేరి.." అంటుంటే పంటికింద మొదటి రాయి 'ఫట్' మంటుంది. 

"కట్టు కథలా ఈ మమతే కలవరింత
కాలమొకటే కలలకైనా పులకరింత
శిల కూడా చిగురించే విధి రామాయణం
విధికైనా విధి మార్చే కథ ప్రేమాయణం
మరవకుమా వేసంగి ఎండల్లొ పూసేటి మల్లెల్లొ మనసు కథ" 

పల్లవిలో 'సెలవన్నాయి కలలు' అనేశారు కదా. ఇప్పుడేమో 'కాలమొకటే కలలకైనా పులకరింత' అంటున్నారు. ఒకే కల మళ్ళీ మళ్ళీ రావచ్చు.. లేదూ, ఎప్పటి కలలనో తల్చుకుని ఇప్పుడు పులకరించనూ వచ్చు. "శిల కూడా చిగురించే విధి రామాయణం.. విధికైనా విధి మార్చే కథ ప్రేమాయణం" వేటూరి మాత్రమే రాయగలిగే లైన్లైవి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన సంతకం. ఎండల్లో మల్లెలు పూస్తాయి, క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతాలు జరుగుతాయి.. 

పంటి దగ్గరికి వస్తే 'కట్టుకద' 'విది' 'ఖద'  వరుసగా రాళ్లే రాళ్లు. ఒక్క చరణంలో ఇన్ని తప్పులు ఎలా పాడించ గలిగారా అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, విన్నప్పుడల్లా. హరిహరన్ కి తెలుగు రాదు సరే, మిగిలిన బృందంలో ఎవరికీ తెలుగు తెలియదా? హరిహరన్ కి సరితూగే తెలుగు గాయకుడు దొరకలేదని సరిపెట్టుకున్నా, కనీసం ఈ ఒక్క చరణం మళ్ళీ రికార్డు చేసి ఉండకూడదా అనేది సరిపెట్టుకోలేని సంగతి నాకు. 

"శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నొ
పూచే సొగసులో ఎగసిన ఊసులో
ఊగే మనసులో అవి మూగవై
తడి తడి వయ్యారాలెన్నొ
ప్రియ ప్రియ అన్న వేళలోన.. శ్రీ గౌరీ..."

సినిమా చూడకపోయినా, సందర్భం తెలియకపోయినా కూడా ఈ చరణం వినగానే ఓ కొత్త పెళ్లికూతురు కళ్ళముందు మెదులుతుంది. చిత్రీకరణ పరంగా కూడా ఈ చరణం కొంచం ప్రత్యేకంగానే ఉంటుంది. నేనైతే ఈ చరణం కోసం ఎదురు చూస్తాను, పాట వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడూ కూడా. పరభాషా గాయనే అయినా చిత్ర ఉచ్ఛారణకి వంక పెట్టడానికి ఉండదు సాధారణంగా. 'శ్రీ గౌరీ' ఒక్కటీ మాత్రం 'ష్రి గౌరీ' లా వినిపిస్తూ ఉంటుంది నాకు. పల్లవి, తొలి చరణం ప్రభావమేమో మరి. 

శుక్రవారం, ఫిబ్రవరి 09, 2024

భారత రత్నం

అవార్డుల బహూకరణలో రాజకీయాలు ప్రవేశించడం ఇవాళ కొత్తగా జరిగింది కాదు. ఎవరికి ఏ అవార్డు వచ్చినా దాని వెనుక ఒక రాజకీయ కారణం ఉంటుందన్నది బహిరంగ రహస్యం. అయినప్పటికీ కూడా నేను ఇష్టపడే ఇద్దరు వ్యక్తులకి 'భారత రత్న' అవార్డు ప్రకటించడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి ఈ అవార్డు ప్రకటించారన్న వార్త తెలియగానే తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరిగాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలకీ, సోనియా, రాహుల్ గాంధీల అభిమానులకీ ఈ ప్రకటన మింగుడు పడక పోవచ్చు. కానీ, 'భారతరత్న' అవార్డుకి విలువ పెంచే నిర్ణయం ఇది. మళ్ళీ చెబుతున్నా, ఇది రాజకీయ నిర్ణయమే అయి ఉండవచ్చు. అయినప్పటికీ, పీవీ అర్హతకి తగిన బహుమతి - అది కూడా చాలా చాలా ఆలస్యంగా. 

అది తాత ముత్తాతల నుంచి తనకి వారసత్వంగా వచ్చిన పార్టీ కాదు. అందులో తాను అప్పటికి ఎంపీ కూడా కాదు. ప్రధాని పదవికి తన అభ్యర్థిత్వం ఒక తాత్కాలిక ప్రకటన. ఆ పదవి కోసం పార్టీలో సీనియర్ల నుంచే విపరీతమైన పోటీ. ప్రతి పూటా ఆ పదవిని రక్షించుకుంటూ ఉండాలి. ఇది చాలదన్నట్టు ఏ క్షణంలో ప్రభుత్వం కూలుతుందో తెలియని రాజకీయ అనిశ్చితి. ఒకరిద్దరు ఎంపీలు గోడ దూకినా ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితి. మరో నాయకుడైతే కేవలం తన పదవిని నిలబెట్టుకోడానికే పరిమితమై, రోజువారీ కార్యకలాపాలని 'మమ' అనిపించి కుర్చీ దిగి ఉండేవాడు. ఆనాడు ఆ పదవిలో ఉన్నది మరో నాయకుడే అయితే ఇవాళ భారత దేశం మూడో ప్రపంచ దేశాల (థర్డ్ వరల్డ్ కంట్రీస్) సరసన నిలబడి ఆకలి దప్పులతోనూ, అంతర్గత యుద్ధాలతోనూ అలమటిస్తూ ఉండేది. 

ఇవాళ్టిరోజున చాలా మామూలుగా అనిపించే 'నూతన ఆర్ధిక సంస్కరణలు' ఆరోజున చాలా పెద్ద నిర్ణయం. అప్పుడు, అంటే 1991 లో దేశానికి ఇక అప్పు పుట్టని పరిస్థితి ఎదురైనప్పుడు, బంగారం నిలవల్ని విదేశానికి తరలించాల్సి వచ్చింది, కుదువ పెట్టి అప్పు తీసుకు రావడం కోసం. బంగారాన్ని కళ్ళతో చూస్తే తప్ప అప్పు ఇవ్వడానికి నిరాకరించిన వాతావరణం. అంతర్జాతీయంగా ఆనాటి భారతదేశపు పరపతి అది. ఉన్నవి రెండే దారులు. కొత్త కొత్త అప్పులు చేస్తూ, పన్నులు పెంచి వాటిని తీరుస్తూ రోజులు గడపడం మొదటిది. ప్రపంచీకరణ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశించడం రెండవది. స్వపక్షం, విపక్షాలు కూడా మొదటి దారిని కొనసాగించమనలేదు, కానీ రెండో దారిని తీవ్రంగా వ్యతిరేకించాయి. (అలా వ్యతిరేకించిన వారిలో చాలామంది సంతానం ఇవాళ అమెరికా తదితర దేశాల్లో స్థిరపడడానికి కారణం ఆ ప్రపంచీకరణే కావడం ఒక వైచిత్రి). 

తన పదవిని, మైనారిటీ ప్రభుత్వాన్నీ నిలబెట్టుకుంటూనే, వ్యతిరేకిస్తున్న అందరినీ సమన్వయం చేసుకుంటూ, ఒక చారిత్రక నిర్ణయం తీసుకుని భారత దేశాన్ని ప్రపంచ మార్కెట్లో ప్రవేశపెట్టిన ఘనత కచ్చితంగా పీవీ నరసింహారావుకే దక్కుతుంది. మన్మోహన్ సింగ్ ని ఆర్ధిక మంత్రిగా నియమించుకోవడం మొదలు, కీలక నిర్ణయాలు తీసుకోడానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వరకూ అడుగడుగునా పీవీ శక్తియుక్తులు కనిపిస్తాయి. ప్రపంచీకరణ ఫలితంగా విదేశీ పెట్టుబడులు భారతదేశానికి రావడం మొదలయ్యింది. అప్పటి వరకూ ఉద్యోగం అంటే గవర్నమెంట్, బ్యాంక్ లేదా స్థానిక ప్రయివేటు సంస్థల్లో మాత్రమే విపరీతమైన పోటీ మధ్యలో అవకాశాలు దక్కించుకుంటూ వస్తున్న యువతకి కార్పొరేట్ ఉద్యోగాలు దేశ విదేశాల్లో స్వాగతం పలికాయి. స్థానికంగా విద్యావకాశాలు పెరిగాయి. మధ్యతరగతి నిలబడింది. చదువుకునే అవకాశాన్ని వినియోగించుకున్న పేదలు మధ్య తరగతికి, ఆపై తరగతికి చేరగలిగారు. 

ఇంత చేసిన పీవీకి దక్కింది ఏమిటి? సొంత పార్టీ నుంచే ఛీత్కారాలు. ప్రాణం పోయాక, అంతిమ సంస్కారాలకి దేశ రాజధానిలో కనీసం చోటు దొరకలేదు. ఆ జీవుడు వెళ్ళిపోయిన ఇన్నేళ్ల తర్వాత కూడా "అప్పట్లో మా కుటుంబం అధికారంలో ఉండి ఉంటే బాబరీ మసీదు కూలి ఉండేది కాదు" అనే వాళ్ళు ఒకరైతే, "భారత దేశానికి తొలి బీజేపీ ప్రధాని పీవీ నరసింహారావు" అనేవారు మరొకరు. ఇవన్నీ ఒక ఎత్తైతే, జీవితకాలమూ పీడించిన కోర్టు కేసులు మరో ఎత్తు. పోనీ ప్రధాని పదవిని దుర్వినియోగం చేసి వందల కోట్లో, లక్షల కోట్లో వెనకేసుకున్నారా అంటే, ఆ కుటుంబం ఇప్పటికీ దేశంలోనే ఉంది. సాధారణ జీవితాన్నే గడుపుతోంది. గోరంత చేసినా కొండంత ప్రచారం చేసుకునే నాయకులున్న కాలం ఇది. కొండంత చేసి కూడా గోరంతకూడా చెప్పుకోని (చెప్పుకోలేని) పీవీ లాంటి నాయకులు అత్యంత అరుదు. 

ఇప్పుడీ అవార్డు వల్ల విమర్శించే నోళ్లు మూత పడతాయా? అస్సలు పడవు. అవార్డు వెనుక రాజకీయ ప్రయోజనం ఉన్నట్టే, విమర్శ వెనుక కూడా ఉంటుంది. ఏం జరుగుతుందీ అంటే, నూతన ఆర్ధిక సంస్కరణలనాటి రోజుల నెమరువేత జరుగుతుంది. వాటి వల్ల బాగుపడిన కొందరైనా గతాన్ని గుర్తు చేసుకుంటారు. పీవీ కృషికి తగిన గుర్తింపు దొరికిందని సంతోషిస్తారు. విమర్శకులందరూ పాత విమర్శలకి మరో మారు పదును పెడతారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఉన్నతమైన అవార్డు పరువు తీసింది అంటారు. జీవించి ఉన్నప్పుడే విమర్శలకి వెరవని, చలించని నాయకుడు పీవీ. ప్రధాని పదవి వరిస్తే పొంగి పోనట్టే, ఈ అవార్డుకీ పొంగిపోరు. ఎటొచ్చీ ఆయన కృషిని గుర్తు చేసుకునే నా బోంట్లు సంతోషిస్తారు. అంతే.. 

అన్నట్టు, ఎమ్మెస్ స్వామినాథన్ కి 'భారత రత్న' వస్తుందని ఆయన ఉండగానే అనిపించింది నాకు. పీవీ లెక్కలో చూస్తే, స్వామినాథన్ కి త్వరగా వచ్చినట్టే. ఆయనకీ ఈ అవార్డుకి అన్ని అర్హతలూ ఉన్నాయి. 

బుధవారం, జనవరి 24, 2024

పదిహేను ...

నిజానికి ఈ పోస్టు రాయడమా, వద్దా అని చాలా ఆలోచించాను. బ్లాగింగ్ మొదలు పెట్టి పదిహేనేళ్ళు పూర్తవ్వడం సంతోషం కలిగించే విషయమే. కానీ, గడిచిన ఏడాది బ్లాగు చరిత్రని తిరిగి చూసుకుంటే ఏమున్నది గర్వకారణం అనిపించింది. వ్యక్తిగత జీవితం తాలూకు ప్రభావం బ్లాగింగ్ మీద ఉండడం అన్నది ఎప్పుడూ నిజమే అయినా, గడించిన సంవత్సర కాలంలో అది మరింతగా రుజువయ్యింది. రాయాలని అనిపించక పోవడం, మొదలు పెట్టబోతూ వాయిదా వెయ్యడం, నెమ్మదిగా రాద్దాం అనుకోవడం...ఇలాంటి అనేక అనుభవాలే గుర్తొస్తున్నాయి నెమరువేతల్లో. ఏమీ సాధించక పోయినా ఏడాది తిరిగేసరికి పుట్టినరోజు వచ్చేసినట్టే, పెద్దగా రాయకపోయినా కేలండర్ మారడంతో బ్లాగుకీ పుట్టినరోజు వచ్చేసింది. ఇదొక సహజ పరిణామ క్రమం అన్నమాట. 

మరీ 'మా రోజుల్లో' అనబోవడం లేదు కానీ, పదిహేనేళ్ళు అయింది కాబట్టి నేను బ్లాగుల్లోకి వచ్చిన తొలినాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలనిపిస్తోంది. అప్పటికే తెలుగులో వందకి పైగా బ్లాగులుండేవి. ప్రతి వారం కొత్త బ్లాగులు జతపడుతూ ఉండేవి. కొందరు ప్రతి రోజూ, చాలామంది కనీసం వారానికి ఒకటి రెండు పోస్టులు రాసేవాళ్ళు. ఆవకాయ మొదలు అమెరికా రాజకీయాల వరకూ ప్రతి విషయం మీదా పోస్టులు, కామెంట్లలో చర్చలూ ఉండేవి. ఆవేశకావేశాలు లేకపోలేదు కానీ, కామెంట్ మోడరేటర్ పుణ్యమా అని అసభ్య కామెంట్లు, వ్యక్తిగత దూషణలు అరుదుగా తప్ప కనిపించేవి కాదు. తెలుగు బ్లాగు అగ్రిగేటర్లకి ట్రాఫిక్ పెరుగుతున్న కాలంలోనే కొన్ని వెబ్ మ్యాగజైన్లు కూడా ప్రారంభం అయ్యాయి. చదివేవాళ్ళు, రాసేవాళ్ళతో మంచి సాహిత్య వాతావరణం ఉండేది. 

Google Image

అప్పటితో పోలిస్తే బ్లాగులు రాసే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. అయితే, బ్లాగుల్ని చదివి, అభిప్రాయాలు పంచుకునే పాఠకులు ఇప్పటికీ కొనసాగుతున్నారు. అప్పట్లో ఆన్లైన్ లో తెలుగు కంటెంట్ అరుదుగా దొరికేది. ఇప్పుడు విస్తృతి పెరిగింది. చదవడానికి, చూసేందుకు కూడా కంటెంట్ కి లోటు లేదు. మోడరేషన్ లేని చర్చలు లైవ్ లో నడుస్తున్నాయి. సభా మర్యాదల్లోనూ మార్పు వచ్చింది. మైక్రో కంటెంట్ వెల్లువెత్తుతోంది. నాలుగైదు లైన్లు/అర నిమిషం వీడియోల్లో విషయాలని కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. చదివే/చూసే వాళ్ళ ధోరణిలోనూ మార్పు కనిపిస్తోంది. ఒకప్పటిలా సుదీర్ఘమైన పోస్టులు, అర్ధవంతమైన చర్చలు అరుదుగా కనిపిస్తున్నాయి. మార్పు అనివార్యం. 

విస్తృతి పెరగడం తాలూకు విపర్యయం ఏమిటంటే కంటెంట్ చోరీ. బ్లాగుల్లో రాసుకున్న పోస్టులు లేదా వాటిలో కొన్ని భాగాలూ తెలియకుండానే ఇంకెక్కడో ప్రత్యక్షం కావడం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. కానీ అప్పట్లో ఫలానా చోట వచ్చిందని పట్టుకోడానికి వీలు ఉండేది. ఇప్పుడు ఎక్కడని వెతకాలి? తాజా ఉదాహరణ 'గుంటూరు కారం' సినిమా. ఆ సినిమా విడుదలకి కొన్ని రోజుల ముందు యద్దనపూడి సులోచనా రాణి రాసిన 'కీర్తి కిరీటాలు' నవల ఆధారంగానే సినిమా తయారవుతోందనే గాలి వార్త ఒకటి బయటికి వచ్చింది. ఆ నవలని గురించి నేను రాసిన బ్లాగ్ పోస్టు, అందులో కొన్ని భాగాలూ నాకు తెలిసి నాలుగైదు చోట్ల ఉపయోగించుకో (చోరీ చేయ) బడ్డాయి. తెలియకుండా ఇంకెన్ని చోట్ల వాడారో మరి. సోర్సుకి క్రెడిట్ ఇవ్వడాన్ని అవసరం లేని పనిగానో, పరువు తక్కువగానో భావించే వాళ్ళు ఉన్నత కాలం ఇది జరుగుతూనే ఉంటుంది బహుశా. 

ఈ తరహా చౌర్యాలు తాత్కాలికంగా ఉసూరుమనిపిస్థాయి కానీ, 'ఎందుకొచ్చింది, రాయడం మానేద్దాం' అనిపించవు నాకు. చోరీ చేసిన వాళ్ళ మీద కోపం కన్నా చికాకే ఎక్కువ కలుగుతూ ఉంటుంది. ముందే చెప్పినట్టుగా ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, ఏం చేసినా ఆగేది కూడా కాదు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, బ్లాగింగ్ ఆపేసే ఉద్దేశమేమీ లేదు. వీలైనంత తరచుగా రాయాలనే ఉంది. అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా మరింత గట్టిగా చేయాలన్నదే సంకల్పం. పదిహేనేళ్ళుగా నా రాతల్ని చదివి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఇక్కడే మరింత తరచుగా మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాను.