మంగళవారం, డిసెంబర్ 24, 2013

నాయికలు-వరూధిని

కంటినిండా కలలు నింపుకుని ప్రపంచాన్ని చూడాల్సిన యవ్వనంలో ఆమె కష్టాలనీ, కన్నీళ్ళనీ చూసింది. ఒకప్పుడు వైభవంగా బతికిన తన కుటుంబం, దారిద్ర్యపు అంచులలో నిలబడడాన్ని చూసింది. తోడబుట్టిన వాళ్ళ స్వార్దాన్నీ, కన్నవాళ్ళ నిస్సహాయతనీ కళ్ళారా చూసింది. మిగిలిన తోబుట్టువుల అందరి పెళ్ళిళ్ళూ అంగరంగ వైభవంగా చేసిన తండ్రి, తన దగ్గరికి వచ్చేసరికి కనీసం అయినింటి సంబంధం వెతకడానికి కూడా తటపటాయించడాన్ని మౌనంగా గమనించింది.. అలాంటి ఆమెకి కూడా ఒక రోజు వచ్చింది.. ఓ కుటుంబాన్ని శాసించగలిగే స్థాయి వచ్చింది.. అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి? ఆమె చేతిలో కీలుబొమ్మగా మారిన ఆ కుటుంబం ఏమయ్యింది? ఈ ప్రశ్నలకి జవాబులు వెతుక్కోడానికి ముందు ఆమెని గురించి తెలుసుకోవాలి. ఆమె పేరు వరూధిని.

వ్యవసాయ రంగాన్ని ఇతివృత్తంగా తీసుకుని నాలుగున్నర దశాబ్దాల క్రితం డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి రాసిన నవల 'మట్టిమనిషి' లో నాయిక వరూధిని. గుంటూరు జిల్లాలో ఉన్న ఓ పల్లెటూళ్ళో భూస్వామ్య కుటుంబంలో పుట్టింది. తండ్రి బలరామయ్య ఆ ఊరికంతటికీ పెద్దమనిషి. చదువు, ఆటపాటలతోనూ, సినిమాలు, షికార్లతోనూ బాల్యం ఆనందంగా గడిచింది వరూధినికి. యవ్వనంలోకి అడుగు పెడుతూ ఉండగానే పట్నవాసంతో పూర్తిగా ప్రేమలో పడిపోయింది ఆమె. పరిస్థితులు అనుకూలిస్తే, పట్నంలో ఉన్న ఏ గొప్ప ఇంటికో ఆమె కోడలయి ఉండేది. కానీ, అలా జరగలేదు. వరూధినికి పెళ్లివయసు వచ్చేసరికి ఆ కుటుంబం ఆర్ధిక పరిస్థితి పూర్తిగా తిరగబడి పోయింది. అన్నలు ఆస్తులని మాత్రమే పంచుకుని, ఆమె పెళ్లిని తండ్రి బాధ్యతల్లోకి నెట్టేశారు.

పేరులో మాత్రమే జమీందారీని నిలుపుకున్న బలరామయ్యతో వియ్యమందడానికి జమీందార్లు ఎవరూ సిద్ధంగా లేరు. కాబట్టే, తన కూతుర్ని ఊరుబోయిన వెంకయ్య మనవడు, సాంబయ్య కొడుకు అయిన వెంకటపతి కి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి సిద్ధ పడ్డాడు బలరామయ్య. వెంకయ్య ఆ ఊరికి వ్యవసాయ కూలీగా వచ్చి, బలరామయ్య తండ్రి వీరభద్రయ్య ఇంట పాలేరుగా జీవితం మొదలు పెట్టాడు. నెమ్మదిగా రైతుగా ఎదిగాడు. అతని కొడుకు సాంబయ్య రెక్కల కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ఇంచుమించు ఓ వంద ఎకరాల భూమిని కొడుకు వెంకటపతి కి వారసత్వంగా అందించాడు. వెంకటపతికి పెద్ద మొత్తంలో కట్న కానుకలతో పిల్లనిస్తామంటూ ఎన్నో సంబంధాలు వచ్చినా, వాటన్నింటినీ రెండో ఆలోచన లేకుండా తిరగ్గొట్టేశాడు సాంబయ్య. తన తండ్రి పాలేరుగా పనిచేసిన ఇంటినుంచే కోడల్ని తెచ్చుకోవలన్నది సాంబయ్య పట్టుదల.

వెంకటపతి మొరటు మనిషి. చదువూ సంధ్యా లేనివాడు. తాతతండ్రుల బాటలో నేలని మాత్రమే నమ్ముకున్నాడు. పట్నవాసం అంటే ఏమిటో బొత్తిగా తెలియదు అతనికి. ఉండడానికి లంకంత ఇల్లు ఉన్నా, వెంకటపతి పుడుతూనే అతని తల్లి దుర్గమ్మ మరణించడం, సాంబయ్య మరో పెళ్లి చేసుకోకపోవడంతో అది ఆడదిక్కు లేని సంసారం. అలాంటి ఇంట్లో అడుగుపెట్టింది, పట్నవాసపు వాసనలున్న వరూధిని. ఆ ఇంట్లో కోడలిగా తను ఇమిడి పోడానికి శతవిధాలా ప్రయత్నం చేసింది. తన వల్ల ఎంతమాత్రం కాదని అర్ధం కావడంతో, నెలతప్పగానే కాపురాన్ని బస్తీకి మార్చింది. అప్పటికే వెంకటపతి వరూధిని చేతిలో కీలుబొమ్మ. పెళ్ళికి ముందు వరకూ తండ్రిమాట వేదవాక్కు వెంకటపతికి. అతను తనకంటూ సొంత ఆలోచనలు లేని వాడు కావడంతో, వెంకటపతిని తన దారికి తెచ్చుకోడం పెద్ద కష్టం కాలేదు వరూధినికి.

బస్తీలో, సినిమా హాల్ యజమాని రామనాధ బాబుతో స్నేహం మొదలుపెట్టింది వరూధిని. ఆ స్నేహం, అతని భాగస్వామ్యంతో బస్తీలో కొత్త సినిమా హాల్ కట్టేంత వరకూ వెళ్ళింది. వెంకయ్య, సాంబయ్యల చెమట, బస్తీలో సినిమా హాలుగా రూపాంతరం చెందింది. సాంబయ్య, వెంకటపతి ల మధ్య అంతరం మరింతగా పెరిగింది. మట్టి ఆనుపానులు మాత్రమే తెలిసిన వెంకటపతికి బస్తీలో చేసేందుకు ఏపనీ లేదు. రామనాధ బాబు ప్రోత్సాహంతో తాగుడికి అలవాటు పడ్డాడు. ఇంటి పెత్తనం మొత్తం వరూధినిదే అయ్యింది. రామనాధ బాబుతో ఆమె స్నేహం చాలా దూరమే వెళ్ళింది. వయసు మీద పడ్డ సాంబయ్య పల్లెటూరికే పరిమితం అయిపోయాడు. వెంకటపతిది కేవలం వరూధిని భర్త హోదా మాత్రమే. అటు వ్యాపార వ్యవహారాల్లోనూ, ఇటు ఇంటి విషయాల్లోనూ నిర్ణయాలు రామనాధ బాబువే. అలాంటి రామనాధ బాబు, తనకి దూరం అవుతున్నాడు అని తెలిసినప్పుడు వరూధిని ఏం చేసింది?

'రెండు తరాల మధ్య అందమైన వారధి స్త్రీమూర్తి' అంటారు గొల్లపూడి మారుతిరావు తన 'సాయంకాలమైంది' నవలలో. వరూధిని, మట్టిమనిషి సాంబయ్యకి, అతని మనవడు రవి కి మధ్య వారధిగా నిలబడింది. అటు సాంబయ్య ని, ఇటు వెంకటపతిని వాళ్ళు నమ్ముకున్న మట్టికి దూరం చేసింది. "ఎందుకు?" అన్న ప్రశ్న ఎప్పుడూ రాదు, 'మట్టిమనిషి' చదువుతూ ఉంటే. ఎందుకంటే, వరూధినికి ఆ క్షణంలో తనకి అనిపించింది చేయడం తప్ప దీర్ఘ కాలికమైన ప్రణాళికలు అంటూ లేవు. తనకి నచ్చినట్టు జీవించడానికే ఆమె వోటు. తనని కట్టుకున్నవాడి మీద జాలి, తను కన్నవాడి పట్ల బాధ్యత ఇవి మాత్రమే ఆమె దగ్గర ఉన్నవి. అందుకే, తను నమ్ముకున్న వాడు తనని నిలువుగా ముంచేయడానికి సిద్ధపడినప్పుడు, ఆమె మొదట ఆగ్రహించింది, అటుపై ప్రతీకారానికి సిద్ధపడింది.. కానీ, అతనిమీద ఆమెకి ఉన్న ప్రేమదే పైచేయి అయ్యింది.. 'మట్టిమనిషి' చదువుతూ ఉంటే, వరూధిని నాయికా? లేక ప్రతినాయికా? అన్న సందేహం చాలాసార్లే కలుగుతుంది.. వరూధిని కోణం నుంచి చూసినప్పుడు, ఆమె నాయికే..

ఆదివారం, డిసెంబర్ 08, 2013

ధర్మవరపు ...

పది పన్నెండేళ్ళ క్రితం సంగతి.. అప్పటికి వరకూ ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంటే దూరదర్శన్ లో చూసిన 'ఆనందో బ్రహ్మ,' సినిమాల్లో చిన్న చిన్న వేషాలు.. తేజ తీసిన 'నువ్వు-నేను' సినిమా హిట్ అవ్వడంతో అందులో లెక్చరర్ వేషం వేసిన ధర్మవరపు హాస్యనటుడిగా బాగా బిజీగా మారిన సమయం అది. యూత్ సినిమాల్లో లెక్చరర్లని మరీ బఫూన్లు గా చూపిస్తున్నారన్న విమర్శ మొదలైంది కూడా అప్పుడే.. సరిగ్గా ఆసమయంలో ధర్మవరపు తో ప్రత్యక్ష పరిచయం. మొదటి సమావేశంలోనే ఓ ఆత్మీయ వాతావరణం ఏర్పడింది అనడం కన్నా, ధర్మవరపు ఏర్పరిచారు అనడం సబబు.

కొన్ని నెలల పాటు మరీ తరచుగా కాకపోయినా అప్పుడప్పుడూ కలిసే వాళ్ళం. సినిమా విషయాలు అని మాత్రమే కాదు, సమస్త విషయాలూ కబుర్లలో అలవోకగా దొర్లిపోయేవి. ఎంత అలసటగా ఉన్నా సరే, కబుర్లు మొదలు పెట్టారంటే నవ్వులు పూసేవి. ప్రాసకోసం పాకులాట అవసరం లేదు, మామూలు మాటనే కాస్త విరిచి పలికితే చాలు అప్రయత్నంగానే నవ్వొచ్చేస్తుంది, తెరమీదే కాదు, తెరవెనుక కూదా ధర్మవరపు తీరు అదే. పేరు, అవకాశాలు ఒకేసారి చుట్టుముట్టినా ఆ ప్రభావం మనిషి మీద పడినట్టుగా అనిపించలేదు.

ఒంగోలు అన్నా, శర్మ కాలేజీ అన్నా, మిత్రుడు టి. కృష్ణ అన్నా తగని అభిమానం ధర్మవరపుకి. ఈ మూడు విషయాలూ తప్పకుండా తలపుకి వచ్చేవి, ఎంత చిన్న సమావేశం అయినా. వామపక్ష భావజాలం అంటే గౌరవం తనకి. ప్రజా నాట్యమండలి తో అనుబంధం ఉంది కూడా. పాత సినిమాలు విపరీతంగా చూసే అలవాటు, ఎవరినైనా ఇట్టే అనుకరించేసే టాలెంటు వృత్తిలో తనకి ఎంతగానో ఉపయోగ పడ్డాయి. రోజులు గడుస్తూ ఉండగానే, ఇక ధర్మవరపు ని రెగ్యులర్ గా కలవాల్సిన అవసరం లేని రోజు ఒకటి వచ్చేసింది. ఆ విషయం చెప్పగానే తన స్పందన "వచ్చే ఆదివారం మనం కలిసి భోజనం చేస్తున్నాం... మా ఇంట్లో."


చాలా పనులు, షూటింగులు.. తనకి గుర్తుంటుందా, వీలవుతుందా అనుకున్నా.. ఆ విషయం మర్చిపోయాను.. శనివారం ఫోన్ వచ్చింది.. "వచ్చేస్తారా? వచ్చి పికప్ చేసుకోనా?" ఆశ్చర్యం అనిపించింది, "డ్రైవర్ ని పంపనా?" అనకుండా "వచ్చి పికప్ చేసుకోనా?" అన్నందుకు.. నేనే వస్తానని చెప్పి అడ్రస్ తీసుకున్నాను. ఓ వెలుగు వెలుగుతున్న హాస్యనటుడి ఇల్లు అంటే ఎంత హంగామా ఉంటుందని ఊహించుకోవచ్చో అంతా ఊహించుకుంటూ ఇంట్లోకి అడుగు పెట్టాను. ఉహు, మామూలు మధ్యతరగతి ఇల్లు.. లుంగీ, లాల్చీతో సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న ధర్మవరపు. పెద్దబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు.. చిన్నవాడు స్కూలింగ్.

"సభకి నమస్కారం" అన్నాను, 'తోకలేనిపిట్ట' సినిమాలో జయలలిత ని అనుకరిస్తూ. ధర్మవరపు దర్శకత్వం, సంగీతం అందించిన సినిమా అది. పెద్దగా ఆడలేదు. కాసేపు సరదా కబుర్లు అయ్యాయి. చిన్నబ్బాయి తో కబుర్లు చెబుదామంటే, ఆ పిల్లవాడు నోరు విప్పడంలేదు. "పలుకే బంగారమా?" అన్నానో లేదో, "అబ్బే అదేమీ లేదు.. ఇందాకే వాడికి పన్నూడింది.. ఆ అవమాన భారంతో కుంగిపోతున్నాడు" అన్నారు ధర్మవరపు. హాల్లో ఎక్కడా షీల్డులు, సినిమా వాళ్ళతో ఫోటోలు కనిపించలేదు. కబుర్లు అవుతూ ఉండగానే భోజనానికి పిలుపు వచ్చింది.ఆవిడే స్వయంగా వడ్డించారు.. నేను ఆశ్చర్యంగా చూస్తుండగా "వంటకూడా ఆవిడే.. మా ఇంట్లో వంటవాళ్లు, పనివాళ్ళు ఉండరు" అన్నారు ధర్మవరపు.

ఆవిడ మితభాషి.. కానీ, తినేవాళ్ల ఆకలి గుర్తెరిగి వడ్డించే (నేను చూసిన) అతి తక్కువ మంది ఇల్లాళ్ళ లో ఒకరు. భోజనం అవుతూ ఉండగానే నేను ఏమాత్రం ఊహించని ప్రశ్న వచ్చింది ధర్మవరపు నుంచి. "ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన వేషం ఏది?" జవాబు చెప్పడానికి ఆలోచించలేదు ఏమాత్రం. "స్వాతికిరణం లో మంజునాథ్ తండ్రి పాత్ర.. హోటల్ నడుపుకునే బాబాయ్.." తన మోహంలో కనిపించిన వెలుగు ఇప్పటికీ గుర్తుంది నాకు. "మహానుభావుడు విశ్వనాధ్ గారు.. ఆయనే చేయించుకున్నారు.. ఏమీ అనుకోనంటే ఓ మాట.. మీతో కలిసి భోజనం చేయడం ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది నాకు.." నేనేమీ మాట్లాడలేదు.

పెద్దబ్బాయి నాతోపాటు బయటికి వచ్చాడు. నవతరం వారసులు రాజ్యం ఏలడం మొదలుపెట్టిన కాలం కదా.. సహజంగానే "మీరెప్పుడు హీరో అవుతున్నారు?" అని అడిగాను నవ్వుతూ.. ఎటూ పాస్పోర్ట్ ఉందికదా అని.. "నేను రోజూ అద్దంలో చూసుకుంటానండీ" అని నవ్వేసి "లేదండీ..నాకు ఇంట్రస్ట్ లేదు.. చదువయ్యాక ఉద్యోగం.. లేదంటే బిజినెస్ అంతే.." ఆ తర్వాత చాలా ఏళ్ళ తర్వాత రెండు వేర్వేరు సందర్భాలలో అనుకోకుండా ధర్మవరపు ని కలవడం తటస్తించింది. రెండుసార్లూ కూడా తనే వచ్చి పలకరించడం మాత్రం ఎప్పటికీ ఆశ్చర్యమే నాకు. ఉదయం పేపర్లో 'ధర్మవరపు ఇక లేరు' అన్న వార్త చూసినప్పటి నుంచీ ఏపని చేస్తున్నా ఇవే జ్ఞాపకాలు.. దింపుకో గలిగే బరువు కాదు కదూ ఇది.. ధర్మవరపు కి నివాళి..