మంగళవారం, సెప్టెంబర్ 29, 2009

పితృవనం

శ్మశానం, మరుభూమి, రుద్రభూమి, ఒలుకుల మిట్ట.. ఇవన్నీ పితృవనానికి సమానార్ధకాలు. ప్రతి మనిషి జీవితానికి తప్పని సరి అయిన చివరి మజిలీనే 'పితృవనం.' ఇదే పేరుతో రెండు దశాబ్దాల క్రితం కాటూరు విజయ సారథి రాసిన నవల 'ఆంధ్రప్రభ' దీపావళి నవలల పోటీల్లో ప్రధమ బహుమతి అందుకోవడం తో పాటు, తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ నవల అవార్డునీ అందుకుంది.

'పితృవనం' నవలలో కథానాయకుడు సూరి. శవాల సూరిగాడు అంటారు అందరూ. అతను శవ వాహకుడు. తాత, పద్దిగాడు, సొట్ట కాలు అతని ముఠాలో మిగిలిన సభ్యులు. తమ ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవాలంటే ఊళ్ళో ఎవరింట్లో శవం లేవాలి. అది కూడా బ్రాహ్మణుల ఇళ్ళలోనుంచి లేవాలి. మోయడానికి ఎవరూ మనుషులు లేని కుటుంబం అయిఉండాలి. అప్పుడే వాళ్లకి గిరాకీ. 'కేసు' అంటారు వాళ్ళు. విశాఖపట్నం పూర్ణా మార్కెట్ సమీపంలోని ప్రభాత్ టాకీస్ దగ్గర 'కేసు' ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు.

ముఠా నాయకుడు సూరి ముప్ఫయ్యేళ్ళ వాడు. చింత మొద్దులా ఉంటాడు.. కరుకుగా మాట్లాడతాడు. అవును.. వృత్తిని బట్టి కంఠస్వరం ఏర్పడుతుంది. ఎలా మాట్లాడినా అతనితో పని ఉన్నవాళ్ళు వెనక్కి పోలేరు. అదీ కాక అతనిదగ్గరకి ఎవరూ శుభ్రంగా తయారై రారు. మర్యాదలు పట్టించుకునే స్థితిలో ఉండరు. రేటు మాట్లాడుకున్నాక సూరి మిగిలిన ముఠా సభ్యులకి కబురు చేస్తాడు. వాళ్ళంతా కలిసి శవానికి అంతిమ యాత్ర నిర్వహిస్తారు.

కరుగ్గా మాట్లాడతాడని సూరిని రాతి మనిషి అనుకుంటే పొరపాటు. అతనిది సున్నితమైన మనసు. ఎదుటివాళ్ళ కష్టాలని అర్ధం చేసుకోగలడు. కాబట్టే, ఒకప్పుడు వైభవంగా బతికి, అయినవాళ్లు అలక్ష్యం చేస్తే రోడ్డున పడ్డ డెబ్భయ్యేళ్ళ జానకిరామయ్య 'తాత' కి తన ముఠాలో చోటిచ్చాడు. తండ్రి శవాన్ని దహనం చేయలేని స్థితిలో ఉన్న ఆనందుకి సాయం చేశాడు. అయినవాళ్ళే తనని అయినకాడికి అరబ్బు షేకుకి అమ్మేయ్యాలని చూస్తున్న 'జయ' ఆశ్రయం కోరితే కాదనలేక పోయాడు.

శ్మశానం లో శవాలని దహనం చేసే వీర బాహుడు సూరికి ఆప్త స్నేహితుడు. ఓ పక్క శవాలు కాలుతుంటే, వీరబాహుడికి హాస్య కథలు చెప్పి నవ్వించగలడు సూరి. జమీలు పోయినా పేరులో మాత్రమే మిగిలిన 'రాజు' మరో ఆప్తుడు సూరికి. నిరుద్యోగ పర్వం సాగిస్తూ ఇంటర్యూలకి వెళ్లి వస్తూ, కూడు పెట్టని కులాన్ని నిందించుకుంటూ ఉంటాడు రాజు. వీళ్ళందరికీ సూరి మాట మీద గురి. అతని సలహా సంప్రదింపులు లేనిదే ఏ పనీ చేయరు. సూరిదో విచిత్రమైన కథ.

పదకొండేళ్ళ సూర్యనారాయణ పరబ్రహ్మ శాస్త్రి బీయే, ఎమ్మే చదవాలనీ, పెద్ద ఆఫీసరు కావాలనీ కలలు కన్నాడు. తాత పరబ్రహ్మ శాస్త్రి సోమయాజి అయ్యాడు. తండ్రి లక్ష్మినారాయణ శాస్త్రి ఊళ్ళో 'సిద్ధాంతి' అనిపించుకున్నాడు. వరుస ఫస్టు క్లాసులతో ఎనిమిదో తరగతిలోకి వచ్చిన కుర్రాడిని ఒక రోజు బడికి ఆలస్యంగా వచ్చినందుకు హెడ్మాష్టరు అడ్డగించారు. "బ్రామ్మలంటే బ్రెమ్మ మొగంలోంచి పుట్టారట్రా?" అని చెంప చెళ్ళుమనిపించారు.

ఆ దెబ్బ ఆ కుర్రాడి జీవితం మీద తగిలింది. మళ్ళీ బడి ముఖం చూడలేదు. అటు వేదమూ రాక, హెడ్మాష్టారి పుణ్యమా అని ఇటు ఏబీసీడీలూ పూర్తిగా రాక చివరికి 'శవాల సూరిగాడ'య్యాడు. శవ వాహకులని కార్మిక సంఘం లో చేర్చుకోమని అడిగి భంగపడతాడు సూరి. "మీరు కార్మికులు కాదు' అంటారు సంఘం వాళ్ళు. శ్మశానం పక్కనే వొళ్ళమ్ముకునే అమ్మాయిలు.. వాళ్ళదో ప్రపంచం. సూరి రిజర్వేషన్ల గురించి అనర్ఘళంగా ప్రసంగించే సన్నివేశం, ముగింపు సన్నివేశాల్లో నాటకీయత శృతి మించిందనిపించింది.

ఇరవయ్యేళ్ళ క్రితం ఈ నవల ఆంధ్రప్రభ లో సీరియల్ గా వచ్చినప్పుడు వారం వారం ఆసక్తిగా ఎదురు చూశాను. నవలని మెచ్చుకుంటూనూ, శవ వాహకుడు కథా నాయకుడేమిటని విమర్శిస్తూనూ ఉత్తరాలు వచ్చాయి. జాగ్రత్త ఫైల్ చేసి, తర్వాత పోగొట్టుకున్నాను. ఈ మధ్య అరుణ పప్పు గారి 'అరుణమ్' బ్లాగు లో టపా చూశాక కొత్త ప్రింట్ వచ్చిందని తెలిసి వెంటనే తీసుకున్నాను. గోకుల్ చంద్, రాహుల్ చంద్ మెమోరియల్ ట్రస్టు ప్రచురించిన 'పితృవనం' అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది. వెల రూ. 100.

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2009

దసరాకి వస్తిమని...

...విసవిసలు పడక.. చేతిలో లేదనక.. అప్పివ్వరనక.." క్లాసు రూములలో గోల గోలగా అల్లరిచేసే పిల్లలందరినీ ఒక చోట కూర్చోబెట్టి, మేష్టార్లందరూ ఈ పాట నేర్పడం మొదలు పెట్టారంటే త్వరలో దసరా సెలవులు రాబోతున్నాయని అర్ధం.. "అయ్య వారికి చాలు ఐదు వరహాలు.. పిల్ల వాళ్లకి చాలు పప్పు బెల్లాలు.." కొత్తగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఆ సంవత్సరమే స్కూల్లో చేరిన మేష్టార్లు ఈ లైన్లు చెప్పడానికి మొహమాట పడుతుంటే, హెడ్మాస్టారు అందుకుని మా చేత చెప్పించడం నిన్ననో మొన్ననో జరిగినట్టు ఉంది..

ఎలిమెంటరీ స్కూల్లో ఉండగా ఒక సంవత్సరం మాత్రం మమ్మల్ని ఊళ్ళో తిప్పారు.. అది కూడా గిలకలు లేకుండా.. తర్వాత పాటలు నేర్పడం తో సరిపెట్టేశారు. మా తర్వాతి పిల్లలకి పాటలు కూడా లేవు. పండక్కి అమ్మమ్మ ఇంటికి వెళ్లడానికి ప్లాన్లు.. మన ఇంటికి ఎవరైనా వస్తామని ఉత్తరం రాశారేమో అని ఉత్తరాల కట్ట వెతుక్కోడాలు.. ఏమేం పిండివంటలు కావాలో అమ్మని డిమాండ్లు చెయ్యడాలు.. దసరా అంటే సెలవుల పండగ.. సెలవులు తెచ్చే పండగ..

కొంచం పెద్దయ్యాక దసరా సరదాలన్నీ వార/మాస పత్రికల్లో కనిపించేవి.. దసరా మామూళ్ళ మీద ఎన్నెన్ని కార్టూన్లో.. మామూళ్ళ బాధ పడలేక మారువేషం వేసుకునే వాళ్ళు, అత్తారింటికి ముందుగానే వెళ్ళిపోయే అల్లుళ్ళు.. రేడియో హాస్య నాటికలదీ ఇదే ధోరణి. మా ఊళ్ళో పోస్ట్ మాన్ మాత్రమే ప్రతి ఏడూ దసరా మామూలు అడిగి పుచ్చుకునే వాడు.. అందువల్ల నాకు దసరా మామూళ్ళ మీద అన్ని జోకులెందుకో అర్ధమయ్యేది కాదు.

ఆయుధపూజ రోజున గుళ్ళో ప్రత్యేక పూజలు. "శమీ శమయతే పాపం.. శమీ శత్రు వినాశనం.. అర్జునస్య ధనుర్ధారి.. రామస్య ప్రియదర్శనం.." అని ఓ కాగితం మీద రాసి, కింద మన పేరు రాసి జమ్మి కొమ్మలో ఉంచి దండం పెట్టుకుంటే అంతా జయం జరుగుతుందిట.. పరీక్షల్లో ఫస్టు వస్తుందిట.. (అప్పట్లో జీవితాశయం అదే కదా) ఒక్క తప్పూ లేకుండా శ్లోకం రాయడం కోసం ఎన్ని కాగితాలు ఖరాబయ్యేవో.. జాతరలూ మైక్ సెట్లూ లేకపోయినా దసరా ఉత్సాహంగానే ఉండేది.. పులి వేషాల వాళ్ళు వస్తే వాళ్ళ వెంటబడి తిరగడం.. పండగ కాబట్టి ఇంట్లో తిట్లు పడేవి కాదు. బొమ్మల కొలువు పూర్తిగా ఆడపిల్లల వేడుక.

"మా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు.. ఎంత సరదాగా ఉండేదో.." అని తాతయ్య గుర్తు చేసుకోడం గుర్తొచ్చి నవ్వొస్తోంది ఇప్పుడు.. నేనూ అలాగే అనుకుంటున్నాను తాతయ్యా.. స్కూలైనా కాలేజీ అయినా మాకు సెలవులే ఉండేవి.. స్పెషల్ క్లాసులు ఉండేవి కాదు.. ఇంటికి ఎవరైనా రావడమో, మనం ఎక్కడికో వెళ్లడమో ఉండేది.. రేడియో వినే వాళ్ళం కానీ.. అదే పనిగా కాదు.. ఇప్పుడు మాకు 'మామూళ్ళు' నిత్య జీవితంలో భాగమై పోయాయి కాబట్టి దసరా మామూళ్ళు ప్రత్యేకత కోల్పోయాయి.. పండుగ కేవలం సెలవు రోజుగా మారిపోయింది.

'రోజులు మారిపోయాయి..' అని కాలాన్ని నిందించుకోడం అనవసరం.. మారుతున్నది మనుషులు, వాళ్ళ జీవిత విధానం. ప్రపంచంలో పోటీ పెరిగినప్పుడు, జీవితంలో వేగం పెరిగినప్పుడు అన్నీ మన చిన్నప్పుడు జరిగినట్టే జరగాలంటే కుదరదు కదా.. అలా జరగడం లేదని నిట్టూర్పులు విడవడం కూడా వృధానే. ఒకటి మాత్రం నిజం.. "మా చిన్నప్పుడు.." అని తాతయ్య తల్చుకున్నాడు.. నేను తలచు కుంటున్నాను.. రేపు నా మనవడూ తల్చుకుంటాడు.. ఇది సహజం.. అయితే నిన్నటిని తల్చుకుని అసంతృప్తి తో రగలకుండా నేటిని ఆస్వాదిద్దాం.. అందరికీ దసరా శుభాకాంక్షలు.

బుధవారం, సెప్టెంబర్ 23, 2009

విమానస సంచరరే..

రెండేళ్ళ క్రితం.. ప్రైవేటు విమాన సర్వీసులన్నీ పోటీలు పడి టిక్కెట్ల రేట్లు తగ్గించినప్పుడు.. రైల్లో మొదటి తరగతి ప్రయాణం కన్నా విమాన ప్రయాణమే చౌక అని పత్రికలు కథనాలు రాసినప్పుడు.. వాయు ప్రయాణానికి చెల్లించే మొత్తం తగ్గడం వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ ఏ రకంగా మెరవబోతోందో కొందరు మేధావులు టీవీ చానళ్ళలో బల్లలు గుద్ది చర్చించిన సమయంలో.. విమాన ప్రయాణం పై హాస్య వ్యంగ్య ధోరణిలో వచ్చిన కథ 'విమానస సంచరరే..'

ప్రసన్న కుమార్ సర్రాజు రాసిన ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతి లో ప్రచురితమయ్యింది. పల్లెటూరి భూస్వాములు, బావ, బావమరుదులు పెద రాయుడు, చిన రాయుడు విశాఖపట్నంలో ఎంపీ రామ సుబ్బారెడ్డి గారింట్లో పెళ్ళికి విమానంలో బయలుదేరతారు, హైదరాబాద్ నుంచి. వాళ్ళు ఎప్పుడూ వెళ్ళే విమానానికి సమ్మర్ రష్ వల్ల టిక్కెట్లు దొరక్క ఓ 'చౌక' విమానానికి టిక్కెట్లు బుక్ చేసి సర్డుకోమంటాడు ట్రావెల్ ఏజంటు.

చినరాయుడికి చౌక విమానంలో ప్రయాణించిన అనుభవం ఉంది కానీ, పెద రాయుడికి అదే ప్రధమం. ఇద్దరూ కోలాహలం గా ఉన్న విమానాశ్రయంలో అడుగు పెడతారు. విమానం లేటు.. ఎంత సేపు లేటో తెలీదు. చౌక విమానంలో ప్రయాణం చేయాల్సిన జనమంతా గోతాలు, కోళ్ళ గంపలు వగైరా సామగ్రితో విసుగ్గా ఎదురు చూస్తూ ఉంటారు. 'ఎప్పుడూ ఇమానమేనా..రైల్లో ఎల్దాం..' అని ఓ ఆరేళ్ల పిల్లాడు మారాం చేస్తే 'రైల్లో తీసుకెళ్ళే తాహతు ఈ అయ్యకి లేదని తెలీదు ఎదవకి..' అని ముద్దుగా విసుక్కుంటాడు తండ్రి.

కొడుకు ఆకలని గొడవ చేస్తుంటే గోతాల్లోనుంచి స్టవ్, గిన్నెలు, బియ్యం తీసి వంట ప్రయత్నం మొదలు పెడుతుంది తల్లి. సెక్యూరిటీ గార్డు వచ్చి ఆవిడని అడ్డుకుంటాడు. 'బ్రిలయన్స్' కూరగాయలు, ఆర్గానిక్ పళ్ళు అమ్మే వాళ్ళు, 'మట్టాటా' పల్లీలు అమ్మేవాళ్ళు, ప్రి పెయిడ్ ఫోన్ కనెక్షన్ తీసుకుంటే చిరంజీవి సినిమా టిక్కెట్టు ఫ్రీగా ఇస్తామని మొహమాట పెట్టేవాళ్ళు.. ఈ కోలాహలాల మధ్య ఏడో నెంబరు రన్వే మీదకి విమానం వస్తోందన్న ప్రకటన వస్తుంది.

బిలబిలా విమానాన్ని చుట్టుముడతారు జనం.. కోళ్ళగంపలు ఎక్కించడానికి వీల్లేదని ఎయిర్ హోస్టెస్ కోప్పడితే "లగేజీ కొట్టుకోవమ్మా" అని విసుక్కునే ఆసామీ, చొక్కా విప్పి విమానం తుడిచే ప్రయత్నం చేసే అడుక్కునే కుర్రాడూ, బోర్డింగ్ పాసుల్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు సీట్లు ఆక్రమించుకునే ప్రయాణికులూ.. వీళ్ళందర్నీ దాటుకుని విమానం ఎక్కుతారు బావ, బావమరుదులు. వాళ్ళ ఊరి అమ్మాయి సుబ్బరతో జిలేల్లె (జిళ్ళేళ్ళ సుబ్బరత్నం) అదే ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ కావడం తో కర్చీఫులు వేసి వీళ్ళకోసం సీట్లు ఆపుతుంది.

విమానం ఎక్కింది మొదలు కనిపించే ప్రతి విషయమూ ఆశ్చర్యమే పెద రాయుడికి. ఫుడ్ సర్వ్ చేయడానికి బదులుగా చిరుతిళ్ళు అమ్ముతారు ఎయిర్ హోస్టెస్ లు. పల్లెటూరి ఆసాములకి అర్ధం కావడం కోసం ఫాన్సీ డ్రెస్ వేసుకుని, జానపద గీతానికి డాన్స్ చేసి మరీ నువ్వు జీడీలు, అప్పాలు లాంటి తినుబండారాలన్నీ మిగల్చకుండా అమ్మేస్తారు. వెనుక సీట్లో బామ్మగారొకావిడ ఒక్క క్షణం అన్నవరం కొండ మీద విమానం ఆపితే స్వామి దర్శనం చేసుకొచ్చేస్తానని బతిమాలుతుంది సుబ్బరత్నాన్ని.. పైలట్ ససేమిరా అంటాడు.

కార్పొరేటీకరణ గురించి పెద రాయుడు, చిన రాయుడు, మరికొందరు ప్రయాణికులతో మాట్లాడుతూ ఉండగా విమానం వైజాగ్ చేరుతుంది.. అరగంట సేపు గాలిలో చక్కర్లు కొడుతుందే కాని ఎప్పటికీ లాండ్ అవ్వదు.. మా గొడుగులు మాకిస్తే దూకేస్తాం అంటారు ప్రయాణికులు గోలగోలగా.. అరగంట క్రితం కురిసిన వర్షానికి వైజాగ్ విమానాశ్రయంలో రన్వే మునిగిపోయిందనీ, విమానం వెనక్కి తిప్పేస్తున్నామనీ ప్రకటిస్తాడు పైలట్. అన్నవరంలో ఆపనందుకే ఇలా జరిగిందని మొటికలు విరుస్తుంది బామ్మగారు. 'అమ్మా.. అయ్యకి సెప్పే.. ఈసారైనా రైల్లో ఎల్దామే..' అంటాడు కుర్రాడు.

ఇప్పుడు మళ్ళీ విమాన సంస్థలు చార్జీలు తగ్గిస్తున్నాయన్న వార్త చూడగానే ఈ కథ గుర్తొచ్చి, ఫైల్లో వెతికి మరోసారి చదివి నవ్వుకున్నాను.

మంగళవారం, సెప్టెంబర్ 22, 2009

బాణం

ఒక్కోసారి మనం అస్సలు చేయకూడదు అని నిర్ణయించుకున్న పనిని అనుకోకుండా చేసేస్తాం.. అతి కొద్ది సందర్భాలలో అలా చేసినందుకు పశ్చాత్తాప పడం. నాకు సంబంధించి ప్రస్తుతం అలాంటి సందర్భం 'బాణం' సినిమా చూడడం. ఈ సినిమా చూడకూడదు అనుకోడానికి కారణం కొత్త హీరో నారా రోహిత్, 'అన్నగారికి' వేలువిడిచిన వారసుడు కావడమే. వంశం డైలాగులు, తొడ చరిచే చప్పుళ్ళు తప్పించుకోడం కోసం సినిమా వద్దనుకున్నా.

అయితే సినిమా చూసిన ఒక మిత్రుడు తప్పక చూడమని చెప్పడంతో నిన్ననే 'బాణం' చూశాను. మొదటి పది నిమిషాల్లోనే ఇది రొటీన్ సినిమా కాదని అర్ధమయ్యింది. నక్సల్ నాయకుడు చంద్రశేఖర్ పాణిగ్రాహి (షాయాజీ షిండే) తన పదేళ్ళ కొడుకుతో మాట్లాడుతూ ఉండగా, పోలీసులు చుట్టుముట్టి బుల్లెట్ల వర్షం కురిపిస్తారు.. వాళ్ళని తప్పించుకోడం కోసం నదిలో దూకేస్తాడు పాణిగ్రాహి.

ఇక రెండో సన్నివేశంలో మరణ శయ్యపై ఉన్న తండ్రిని తుపాకితో కాల్చి చంపేస్తాడు పాతికేళ్ళ శక్తి పట్నాయక్.. అలా తండ్రి దందాలకి వారసుడవుతాడు. పెరిగి పెద్దవాడైన చంద్రశేఖర్ పాణిగ్రాహి కొడుకు భగత్ పాణిగ్రాహి (నారా రోహిత్) ఉద్యోగం చేసుకుంటూ సివిల్ సర్విస్ పరీక్షలకి తయారవడం మూడో సన్నివేశం. ఐపీఎస్ కావడం అతని ఆశయం. కథానాయకుడి నేపధ్యం, అతని ఆశయం నాకు సినిమా పట్ల ఆసక్తి పెంచాయి. పర్వాలేదు, నెమ్మదిగానే అయినా తెలుగు సినిమా కూడా ఎదుగుతోంది అనిపించింది.

నక్సలైట్ ఉద్యమం నుంచి స్వచ్చందంగా విరమించుకుని ప్రభుత్వానికి లొంగిపోతాడు చంద్రశేఖర్ పాణిగ్రాహి. ప్రతి ఉద్యోగికీ ఉన్నట్టే తనకీ రిటైర్మెంట్ కావాలంటాడు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని తిరస్కరిస్తాడు. తండ్రీకొడుకులు కలుసుకుంటారు. ఒక పక్క దందాలు చేసే విలన్, పోలీసు ఆఫీసర్ కావాలనుకునే హీరో.. మరి వీళ్ళిద్దరి ముఖాముఖి ఎలా? అప్పుడు ప్రవేశిస్తుంది నాయిక సుబ్బలక్ష్మి (వేదిక). కట్నం డబ్బు ఇవ్వలేదని పెళ్ళిపీటల మీదే వదిలేసిన భర్త, గుండె ఆగి మరణించిన తండ్రి.. వెరసి అనాధగా మారిన సుబ్బలక్ష్మికి ఆశ్రయం ఇస్తాడు భగత్.

ఇక్కడినుంచి కథ ఊహించని మలుపులు తిరిగింది.. ఎంత ఉత్కంఠభరితంగా సాగిందంటే విశ్రాంతి పది నిమిషాలూ ఎప్పుడు పూర్తవుతాయా అని అసహనంగా వాచీ చూసుకునేంతగా. సివిల్ సర్విస్ మెయిన్స్ పరిక్షలు రాయాల్సిన భగత్ అనూహ్యంగా పోలీసు కష్టడీకి వెళ్ళడం.. పరిక్ష రాసే అవకాశం వచ్చినా కలిగే ఆటంకాలూ.. అతని ఆశయం నెరవేరే క్రమంలో ఎదురైనా ఇబ్బందులూ.. ఉద్యమాన్ని వదిలేసినా ప్రతిహింస కోసం ఆయుధం పట్టాలనుకున్న చంద్రశేఖర్ పాణిగ్రాహి.. విలన్ గ్యాంగులో లుకలుకలు.. పోలీసుల్లో మంచీ చెడు.. సినిమా ఆసాంతమూ ఊపిరి బిగపట్టి చూశాను.

ఇది పూర్తిగా దర్శకుడి సినిమా.. కొత్త దర్శకుడు చైతన్య దంతులూరి రొటీన్ కి భిన్నమైన, క్లిష్టమైన సబ్జెక్టుతో ఆరంగేట్రం చేయడాన్ని అభినందించాలి. సీనియర్ నిర్మాత అశ్విని దత్ కుమార్తె శేషు ప్రియాంక కి నిర్మాతగా తొలి చిత్రం ఇది. ఇక కొత్త హీరో నారా రోహిత్ కి ఐతే ఇది బహు చక్కని ప్రారంభం. స్క్రీన్ ప్లే వేగానికి గంధం నాగరాజు పదునైన సంభాషణలు తోడవ్వడంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టని విధంగా సాగింది. మణిశర్మ సంగీతం సినిమా తాలూకు మూడ్ ఆసాంతమూ కొనసాగేందుకు సహకరించింది.

నాయిక పరిచయ సన్నివేశం లో భగత్ రైల్లో ఆఫీసుకి వెళ్తుండగా, ఆమె రైల్వే స్టేషన్ లో ఒంటరిగా, విషాదంగా కూర్చుని ఉంటుంది. అంత విషాదంగా కూర్చున్న అమ్మాయి తలలో ఫ్రెష్ మల్లెపూల దండ అవసరమా అనుకున్నా.. సాయంత్రం ట్రైన్లో ఆఫీసు నుంచి భగత్ తిరిగి వచ్చేసరికి ఆమె అక్కడే కూర్చుని ఉంటుంది.. తలలో పూలదండ వాడిపోయి ఉంటుంది.. కంటిన్యుటీ విషయంలో దర్శకుడి శ్రద్ధకి ముచ్చటేసింది. అంతే కాదు, హింసని నేరుగా చూపకుండా దాని ప్రభావాన్ని మాత్రమే చూపడం బాధ్యతాయుతమైన చర్యగా అనిపించింది.

అయితే ఇంకా చాలా విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. కథా స్థలం శ్రీకాకుళం జిల్లా రణస్థలి అని చూపారు.. అక్కడి వాతావరణాన్ని చిత్రించారు.. పాత్రలన్నీ ఆ ప్రాంతానికి చెందినవే అయినా వారంతా కృష్ణా జిల్లా తెలుగు మాట్లాడతారు. శ్రీకాకుళం యాస ఎక్కడా వినిపించదు. భగత్ సివిల్ సర్విస్ మెయిన్స్ పరిక్ష కి వెళ్తాడు.. నిజానికి ఈ పరిక్ష ఒకరోజులో పూర్తయ్యేది కాదు.. కనీసం పది రోజులు జరుగుతుంది.

పైగా హీరో ఆబ్జెక్టివ్ ప్రశ్న పత్రానికి సమాధానం రాస్తాడు, మెయిన్స్ పరిక్ష కి జవాబులు వ్యాస రూపంలో ఇవ్వాలి. అలాగే సివిల్ సర్విస్ ఇంటర్వ్యూ సీన్ తేలిపోయినట్టుగా అనిపించింది. నిజానికి నక్సల్ ఉద్యమాన్ని గురించి ఒక లోతైన చర్చ జరుగుతుందని ఎదురుచూశాను. బోర్డు సభ్యులుగా మరికొందరు సీనియర్ నటులని తీసుకుని, కొంచం పొడిగిస్తే ఓ గొప్ప సీన్ అయ్యేది. హీరో ఉపన్యాస ధోరణిలో మాట్లాడడం కొరుకుడు పడదు.

నారా రోహిత్ బాగానే చేశాడు.. చాలా మంది కొత్త హీరోల కన్నా పర్వాలేదు. హెయిర్ స్టయిల్ విషయంలో జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. వేదిక ని చూస్తే కెరీర్ తొలి రోజుల్లో నగ్మా గుర్తొచ్చింది చాలాసార్లు. ప్రాధాన్యత ఉన్న నాయిక పాత్ర దొరికింది ఈమెకి. కథకి మూలస్థంభంగా నిలిచిన పాత్ర చంద్రశేఖర్ పాణిగ్రాహి. షాయాజీ షిండే కి ఈమధ్య కాలంలో దొరికిన మంచి పాత్ర. కాకపొతే అతని తెలుగు తెలుగులా వినిపించదు.. అదొక్కటే లోపం.

హీరో పాత్రని ఎలివేట్ చేసే ప్రయత్నాల్లో భాగంగా, అతనికి సాయం చేయడానికి వచ్చిన పోలిస్ ఆఫీసర్ తోనూ, పోలిస్ అకాడెమీ లో సీనియర్ ఆఫీసర్తోనూ హీరో చేత పదునైన సంభాషణలు చెప్పించాడు దర్శకుడు. దీనివల్ల ఆయా సన్నివేశాల్లో నాటకీయత కొంచం శృతి మించింది. అలాగే ముగింపు కూడా.. ఉన్నత లక్ష్యంతో పోలీసు ఆఫీసర్ అయిన హీరో కూడా చివరికి చట్టాన్ని చేతిలోకి తీసుకోడమే పరిష్కారంగా చూపారు.

మొత్తంగా చూసినప్పుడు దర్శక నిర్మాతలని, హీరోని అభినందించాల్సిందే.. తొలి ప్రయత్నానికి రొటీన్ ప్రేమ కథని ఎంచుకోకుండా వైవిధ్యమైన ప్రయత్నం చేసినందుకు. మొదటి సినిమాని వైవిధ్యంగా తీసిన దర్శకుడి మీద బోల్డన్ని ఆశలు పెట్టుకోవడం నా అలవాటు/బలహీనత. 'బాణం' చూశాక చైతన్య దంతులూరి నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయన్న నమ్మకం కలిగింది. ఈ సినిమాని కనీసం మరో రెండుసార్లు చూస్తానని మిత్రులకి సందేశాలు పంపాను.

ఆదివారం, సెప్టెంబర్ 20, 2009

నాయికలు-సుజాత

ఆమె అతన్ని ప్రేమించింది. అతని కోసం అంతవరకు ఆమెని అన్నీ తానే అయి పెంచిన 'పెంపుడు' తండ్రిని ఎదిరించింది. పుట్టింటితో తన సంబంధాన్ని శాశ్వతంగా తెంచుకోడానికి సిద్ధపడింది. పెళ్ళయ్యాక అతని పట్ల ప్రేమ రెట్టింపయ్యింది ఆమెకి. ఓ కొడుక్కి తల్లయ్యాక, అతనిపట్ల ఆమెకి అనుకోకుండా మొదలైన ఓ అనుమానం పెనుభూతమయ్యింది.. అతన్ని విడిచి వెళ్లడానికి కారణమయ్యింది. ఆమె పేరు సుజాత.

తల్లీతండ్రీ లేని అనాధ పసికూనగా బళ్ళో పని చేసే ప్యూనుకి దొరుకుతుంది సుజాత. ఆ ప్యూను ఆమెని తన సొంత కూతుర్లా పెంచుకుంటూ బడిలో చదివిస్తుండగా, ఒక రోజు ప్రసంగించడానికి బడికి వచ్చిన యాభయ్యేళ్ళ అవివాహితుడు పండిత పరమేశ్వర శాస్త్రి ఆమెని చూసి ముచ్చట పడి, అల్లారు ముద్దుగా ఆమెని పెంచుకుంటాడు. ఇందుకోసం సంఘాన్ని సైతం ఎదిరిస్తాడు ఆ పండితుడు.

పెంపుడు తండ్రిని ఒప్పించి ఇంగ్లిషు చదువు చదివిన సుజాత, ఆధునిక భావాలున్న రచయిత కేశవమూర్తి ని ప్రేమిస్తుంది. సంప్రదాయాన్ని నరనరానా జీర్ణించుకున్న పరమేశ్వర శాస్త్రి వారి కులాంతర వివాహానికి అంగీకరించకపోవడంతో ఇంటినుంచి బయటికి వచ్చేస్తుంది సుజాత. అత్తా, ఆడబిడ్డ తను 'అనాధ' అని హేళన చేసినా ఓరిమితో భరిస్తుంది. భర్త తనని అర్ధం చేసుకున్నందుకు సంతోష పడుతుంది.

కేశవమూర్తి రచనల వెనుక సుజాత కృషి యెంతో ఉంది. అతని శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడడం మొదలు, మానసికంగా ఉల్లాసంగా ఉంచడం, పదే పదే గుర్తు చేసి గ్రంధ రచన పూర్తి చేయించడం.. అతను డిక్టేట్ చేస్తుంటే తాను రాసిపెట్టడం.. ఇలా అన్నీ తానే అవుతుంది. వివాహం తర్వాత సినిమాలకి రచన చేసే అవకాశం దొరుకుతుంది కేశవమూర్తికి. భార్యతో సహా మద్రాసుకి ప్రయాణమవుతాడు.

సుజాత దగ్గర ఎలాంటి రహస్యమూ లేదు కేశవ మూర్తికి. సంపాదన అంతా తెచ్చి ఆమె చేతికే ఇస్తాడు. సినిమాల్లో వేషాల కోసం కేశవమూర్తి సిఫార్సు కోరిన కన్యకామణి, అతని రచనలని అభిమానించే సుభాషిణి.. ఇలా అతని స్నేహితులంతా ఆమెకీ స్నేహితులే. మిత్రులంతా కేశవమూర్తి-సుజాతల దాంపత్యాన్ని ఎంతగానో పొగుడుతూ ఉంటారు. వారందరినీ మనస్పూర్తిగా ఆదరిస్తుంది సుజాత.

కేశవమూర్తి మిత్రుల పట్ల ఎంత ఆదరంగా ఉంటుందో, అతని శత్రువుల పట్ల అంత కఠినంగానూ ఉంటుంది సుజాత. "ఏమి మనిషి ఈ సుజాత, ఇన్నాళ్ళ నుంచి నేను ఆమెతో కలిసి జీవిస్తున్నా ఇంతవరకు ఆమె హృదయంలోని లోతులు నాకు అంతు పట్టలేదు. ఆమెలో ఎప్పటికప్పుడు క్రొత్త శక్తులు కనిపిస్తూనే ఉంటై. ఈ మహత్యం స్త్రీ సృష్టిలోనే ఉంది కాబోలు.." అనుకుంటాడు కేశవమూర్తి, ఒక సందర్భంలో.

సినిరచయితగా కేశవమూర్తి బిజీగా ఉన్న సమయంలో మగబిడ్డని ప్రసవిస్తుంది సుజాత. పెంపుడు తండ్రి మీద ప్రేమతో కొడుక్కి'పరమేశ్వర్' అని పేరు పెట్టుకుంటుంది. యెంతో సున్నిత మనస్కుడూ, అలౌకికుడూ అయిన కేశవమూర్తికి సుజాత ఒక రక్షణ కవచం. ఆమెకి తెలియకుండా అతను ఏపనీ చేయడని ఆమెకి తెలుసు. కన్యకామణి, సుభాషిణి లతో అతనికి ఉన్న స్నేహం ఎలాంటిదో కూడా ఆమెకి బాగా తెలుసు.

కానీ.. వరుసగా ఆకాశ రామన్న ఉత్తరాలు రావడం మొదలు పెడతాయి. వాటి సారాంశం ఒకటే.. సుజాత కన్నుగప్పి కేశవమూర్తి సుభాషిణి, కన్యకామణి లతో శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడని. ఆ ఉత్తరాలని మొదట పట్టించుకోదు సుజాత. నెమ్మదిగా ఆమెలో అనుమానం మొలకెత్తుతుంది. అతి త్వరలోనో అది పెరిగి మహా వృక్షమవుతుంది. పుట్టింటి తలుపులు మూసుకుపోడంతో ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఆమెకి.

కేశవ మూర్తి పట్ల మనసు పూర్తిగా విరిగిపోవడంతో ఇంట్లో ఉండడానికి మనస్కరించదు. ఆమె సంసారాన్ని ఛిద్రం చేయడానికి పూనుకున్నది ఎవరు? సుజాత జీవితం ఏ మలుపు తిరిగింది? ఆమె జన్మ రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలకి సమాధానం కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన తొలి తెలుగు నవల 'పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా.' యాభై మూడేళ్ళ క్రితం గోపీచంద్ రాసిన నవలని 'అలకనంద ప్రచురణలు' ఇటీవలే పునర్ముద్రించింది. (వెల: రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శుక్రవారం, సెప్టెంబర్ 18, 2009

పుష్పక విమానము

టైటిల్ చూసి ఇది కేవలం తెలుగు సినిమా అనుకుంటే పొరపాటు.. ఎందుకంటే ఇది అంతర్జాతీయ సినిమా.. తెర మీద కనిపించేది కేవలం భారతీయ నటీనటులు, సంస్కృతి, వాతావరణం కాబట్టి ఇది భారతీయ సినిమా.. ప్రయోగాలను అమితంగా ఇష్టపడే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తానే నిర్మాతగా 1988 లో రూపుదిద్దిన సినిమా 'పుష్పక విమానము.' మొదట కన్నడలో తీసి, ఆ తర్వాత తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో విడుదల చేసిన ఈ సినిమా లో మాటలు ఉండవు.

కథ జరిగే నగరం పేరు, కథలో పాత్రల పేర్లు ప్రేక్షకులకి తెలియవు.. కానీ అవేవీ ఈ సినిమాని ఆస్వాదించడానికి అడ్డంకి కాదు. అంతేనా.. కమర్షియల్ హంగులైన పాటలు, ఫైట్లు కూడా ఈ సినిమా లో లేవు. ఉన్నవల్లా ఏమిటంటే ఉత్కంఠత రేకెత్తించే కథనం, సున్నితమైన హాస్యం, వీనుల విందైన నేపధ్య సంగీతం. సినిమా చూడడం మొదలు పెడితే నూట ముప్ఫై నిమిషాల సమయం మనకి తెలియకుండానే గడిచిపోతుంది.

ఇది ఒక నిరుద్యోగి (కమల్ హాసన్) కథ. ఒక పాతబడ్డ ఇల్లు 'ఆనంద భవన్' లో పెంట్ హౌస్ లో అతని నివాసం. పేపర్లలో వాంటెడ్ కాలమ్స్ చూస్తూ, ఇంటర్వ్యూలకి వెళ్లి నిరాశగా తిరిగి వస్తూ ఉంటాడు.. డబ్బు సమస్య ఉండనే ఉంది. అతనికి ఓ హస్తకళల దుకాణంలో చిత్రంగా పరిచయం అవుతుంది ఓ అమ్మాయి (అమల), ఓ మెజీషియన్ (కే.ఎస్. రమేష్) కూతురు. తొలి పరిచయంలో అతనో లక్షాధికారిగా భ్రమ పడుతుంది ఆమె.

నగరంలో బాగా పేరున్న పెద్ద హోటల్ 'పుష్పక్' లో దిగుతాడు ఓ బిజినెస్ మాన్ (సమీర్ కక్కర్), విపరీతమైన తాగుబోతు. అతని భార్యకి, అతని స్నేహితుడు (ప్రతాప్ పోతన్) తో అక్రమ సంబంధం. సమీర్ ని అడ్డు తొలగించుకుని అతని ఆస్తి అనుభవించాలన్నది ప్రతాప్ పోతన్ ప్లాన్. ఇందుకోసం ఓ కిరాయి హంతకుడిని (టిను ఆనంద్) నియమిస్తాడు. సమీర్ కక్కర్ ఫోటో చూపకుండా 'పుష్పక్' లో అతని గది నెంబరు ఇచ్చి, ఆ గదిలో ఉన్నవాడిని చంపేయమంటాడు.

సరిగ్గా అదే సమయంలో 'పుష్పక్' బయట రోడ్డు మీద అపస్మారక స్థితిలో ఉన్న సమీర్ కక్కర్ ని చూసిన కమల్ హాసన్, అతన్ని తన గదిలో బంధించి, హోటల్ రూం తాళం సాయంతో తను అతని గదికి మారతాడు. అమల కూడా అదే హోటల్లో దిగడంతో వాళ్ళ పరిచయం ప్రేమగా మారుతుంది. అప్పటి వరకు దరిద్రం అనుభవించిన కమల్ కి ఒక్కసారిగా అంత డబ్బు చూసేసరికి ఏం చేయాలో తెలియక పడే అవస్థలు ఒక పక్క, హోటల్ గదిలో ఉన్న కమల్ ని చంపడానికి టిను ఆనంద్ చేసే చిత్ర విచిత్రమైన ప్రయత్నాలు మరో పక్క సాగుతూ ఉంటాయి.

తన మీద హత్యా యత్నాలు జరుగుతున్నాయని తెలిసిన కమల్ ఏం చేశాడు? అతని జీవితపు అసలు రంగు తెలిసిన అమల ఎలా స్పందించింది అన్నది సినిమా ముగింపు. ఎప్పటిలాగే కమల్ వంక పెట్టలేని నటనని ప్రదర్శించాడు. నిరుద్యోగిగానూ, డబ్బులో మునిగి తేలినప్పుడూ, సంపాదనకి సంబంధించి జీవిత సత్యాలు తెలుసుకున్నప్పుడూ అతని హావభావాలు గుర్తుండి పోతాయి. అమల అతనికి సరిజోడి.

నిజానికి ఈ సినిమా క్రెడిట్ లో అత్యధిక భాగం దర్శక నిర్మాత సింగీతం శ్రీనివాసరావు కి చెందుతుంది. తానే రాసుకున్న కథని ఒక్క డైలాగు కూడా లేకుండా తెరకెక్కించడంలో ఆయన చూపిన ప్రతిభ అసామాన్యం. ప్రారంభ దృశ్యాల్లో కమల్ ఉండే ఇంటి పనిమనిషి రేడియోలో వినిపించే సంగీతానికి అనుగుణంగా చీపురుతో నేల తుడిచే సన్నివేశం తోనే ప్రేక్షకులని కథలోకి తీసుకెళ్లిపోతాడు దర్శకుడు. పాత్రల స్వరూప స్వభావాలని ఫోటోల సాయంతో వివరించిన తీరు ఆశ్చర్య పరుస్తుంది.

నాయికా నాయకులు హోటల్ బాల్కనీలలో దూరంగా నిలబడి సైగలతో మాట్లాడుకోడం మొదలు, సినిమా హాల్లో చుంబన దృశ్యం వరకు వారి పరిచయం క్రమంగా పెరగడాన్ని అతి తక్కువ సీన్లలో చూపించారు. నాయిక ఇంటి వాతావరణం, ఆమె తల్లికీ తండ్రికీ పడక పోవడం, ఆమె అల్లరి చేష్టలు ఇలా అతి చిన్న విషయాలని కూడా శ్రద్ధగా చిత్రించడం గమనిస్తే మాటలకన్నా కూడా మౌనమే బలమైన మాధ్యమం అనిపించక మానదు.

ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పాల్సింది పి.ఎల్. నారాయణ పోషించిన బిచ్చగాడి పాత్ర. ఇతను కనిపించేది మూడు సన్నివేశాల్లోనే అయినా మూడూ బలమైన సన్నివేశాలు. కథానాయకుడి ఆలోచనల్లో మార్పు రావడానికి ఈ బిచ్చగాడు కొంతవరకు కారణం. హీరోని ప్రభావితం చేసిన మరో వ్యక్తి 'పుష్పక్' హోటల్ ప్రొప్రైటర్. ఓ చిన్నటీ కొట్టుతో వ్యాపారం మొదలు పెట్టి, స్టార్ హోటల్ అధిపతి గా మారిన ఆయన జీవితం కమల్ డబ్బుకి సంబంధించి తన ఆలోచనలు మార్చుకునేలా చేస్తుంది.

ఆద్యంతమూ హాస్యరస భరితం ఈ సినిమా. ఉదహరించాలంటే అన్ని సన్నివేశాలనీ తిరిగి రాయాల్సిందే. హస్తకళల షాపులో మేనేజర్ పాత్రే 'క్షణ క్షణం' లో బ్రహ్మానందం పాత్రకి స్ఫూర్తి అనిపిస్తుంది. ఎల్. వైద్యనాధన్ అందించిన నేపధ్య సంగీతానిది ఈ సినిమాలో కీలకపాత్ర. బారెడు డైలాగు ఇవ్వలేని సందేశాన్ని ఒక చిన్న ఎక్స్ ప్రెషన్, వెనుక నేపధ్యంలో వినిపించే సంగీతం ప్రేక్షకుడికి అందిస్తాయి. అసలు శాస్త్రీయ సంగీత కళాకారుడితో నేపధ్య సంగీతం చేయించాలన్న ఆలోచనే గొప్పగా ఉంది.

నిజానికి ఈ సినిమా ద్వారా సింగీతం సినిమా పరిశ్రమకి ఒక కొత్త వ్యాపార సూత్రం చెప్పారు. మాటలు లేకుండా సినిమా తీసి విజయవంతం చేయగలిగితే ఆ సినిమాని అన్ని రాష్ట్రాల్లోనూ విడుదల చేసి లాభాలు సంపాదించవచ్చు, డబ్బింగ్ లాంటి ఖర్చులు కూడా లేకుండా. కానీ ఆ తర్వాత ఎవరూ ఇలాంటి సినిమా తీయలేదు. మాటలు లేని ఈ సినిమా గురించి ఎన్ని మాటలు చెప్పినా ఇంకా చాలవేమో అనిపిస్తోంది..

గురువారం, సెప్టెంబర్ 17, 2009

అనుకరణ

మొన్నొక రోజు పి. లీల, జిక్కి పాడిన కొన్ని పాత పాటల కోసం గూగులింగ్ చేస్తున్నా.. దొరికిన కొన్ని ట్రాకుల వివరాలు చూసినప్పుడు భలే ఆశ్చర్యం వేసింది. అదే పాట, అదే ట్యూను.. కానీ పాడింది మాత్రం కొత్త గాయనులు. అంతే టీవీ ప్రోగ్రాములలో పాడినట్టుగానే పాత పాటలు పాడి రికార్డులు విడుదల చేశారన్న మాట. ఇప్పుడు మనం షాపులకి వెళ్తే ఫలానా గాయకుడు/గాయని పాడిన ఒరిజినల్ పాట కావాలి అని ప్రత్యేకంగా అడగాలన్న మాట.

మనకి ఘంటసాల ఒక్కడే.. కానీ ఆంధ్రదేశంలో ఘంటసాలలా పాడే వాళ్ళు వందలమంది ఉన్నారు. వాళ్ళలో చాలా మంది సినిమాల్లో పాడాలని ప్రయత్నించారు.. కానీ బాలు ఒక్కడే సక్సెస్ అయ్యాడు.. తన టాలెంట్ తో పాటు, ఘంటసాలని అనుకరించక పోవడమూ ఇందుకు కారణం. బాలు ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యాక, బాలులా పాడే వాళ్ళు వందలు, వేలు తయారయ్యారు. వీళ్ళెవరూ బాలు అంత పేరు తెచ్చుకోలేక పోయారు. బాలులా పాడడానికి బాలు ఉండగా, వీళ్ళంతా ఎందుకు?

మన అభిమాన గాయనీ గాయకులు పాడిన పాటలు మనం ఆస్వాదిస్తాం. అందుకు కారణం వాళ్ళ గొంతు. వయసు ప్రభావం వల్ల వాళ్ళు మునుపటిలా పాడలేక పోయినా, వారి మీద అభిమానంతో వినగలం.. కానీ అవే పాటలని వేరొకరు అనుకరిస్తుంటే భరించడం కొంచం కష్టమే. పాటల పోటీలు ఇందుకు మినహాయింపు. ఎందుకంటే బహుశా అక్కడ పోటీలో పాల్గొన్న గాయకుడు/గాయని ఆ పాటని అసలు గాయకులు పాడినట్టు పాడగలిగారా లేదా అన్నది మాత్రమే చూస్తాం కాబట్టి.

సాహిత్యం ఈ అనుకరణ కి మినహాయింపు కాదు. ఒక రచయిత/ రచయిత్రి పాపులర్ కాగానే ఇక ఔత్సాహిక రచయిత (త్రు)లందరూ ఆ పాపులర్ రచనలని అనుకరించడం మొదలు పెడతారు. యద్దనపూడి సులోచనారాణి, యండమూరి వీరేంద్రనాథ్ ల రచనలకి వచ్చిన అనుకరణలు ఇందుకు ఉదాహరణలు. సహజంగానే ఈ అనుకరణ రచనలు ప్రజల ఆదరణ పొందలేక పోయాయి. ఒరిజినల్ కి ఉన్న విలువ, గౌరవం నకలుకి ఎందుకు ఉంటుంది?

'కాళిదాసు కవిత్వం కొంత.. నా పైత్యం మరికొంత' అని ఒక వాడుక. రీమిక్స్ పాటలు చెవిన పడ్డప్పుడల్లా నాకీమాట గుర్తొస్తుంది. ఒరిజినల్ పాటని అలా బతకనివ్వకుండా సంగీతాన్నీ, సాహిత్యాన్నీ కూడా ఖూనీ చేసి రీమిక్స్ పేరుతో మార్కెట్లోకి వదులుతున్నారు. పాత తరం గాయనీ గాయకుల్లో చాలామంది ఈ రీమిక్స్ లని వ్యతిరేకించారు. ఒక పాట నచ్చినప్పుడు దానిని యధాతధంగా వాడుకోవచ్చు కదా? దానికి ఈ మార్పులు, చేర్పులు ఎందుకు? నిజంగా అంత టాలెంటే ఉంటే ఆ పాత పాటని తలదన్నే విధంగా ఓ సరికొత్త పాటని సృజించ వచ్చు కదా?

సంగీతమైనా, సాహిత్యమైనా దానిని అనుకరించే వాళ్లకి అభిరుచి, టాలెంట్ బొత్తిగా లేదని అనుకోలేం. ఒరిజినల్ ని ఎంచుకోడంలో వాళ్ళ అభిరుచి, దానిని మార్చే ప్రయత్నంలో వాళ్ళ టాలెంట్ తెలుస్తున్నాయి. ఒక్కోసారి తమ ప్రతిసృష్టి అసలు సృష్టిని మరిపించాలన్న తాపత్రయమూ కనిపిస్తోంది. వీళ్ళ సామర్ధ్యాన్ని అనుకరణ కోసం వృధా చేస్తున్నారు కదా అనిపించకా మానదు. ఒరిజినల్ కి ఉన్న విలువ అనుకరణకి ఉండదని వీళ్ళకి తెలియదనుకోవాలా? కాపీ చేయడం కోసం పడుతున్న శ్రమని మరో మెట్టు పెంచి, బుర్రకి పదును పెడితే మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా..

సోమవారం, సెప్టెంబర్ 14, 2009

హౌస్ సర్జన్

ఒకప్పుడు ఎవరో 'డిటెక్టివ్ నవల' అని చెబితే మనకెందుకు అని పక్కన పెట్టిన పుస్తకం.. తర్వాత కాలంలో ఎందుకో తెలియకుండానే 'చదవాలి' అనిపించి ఎంత వెతికినా దొరకని పుస్తకం.. మొన్నొక రోజు పుస్తక ప్రదర్శనకి వెళ్తే అనుకోకుండా కళ్ళ బడ్డ పుస్తకం.. నాలుగ్గంటల పాటు ఆపకుండా చదివి పూర్తి చేయడమే కాదు, నాలుగు రోజుల తేడాతో రెండుసార్లు చదివిన పుస్తకం.. డాక్టర్ కొమ్మూరి వేణుగోపాల రావు రాసిన 'హౌస్ సర్జన్.'

ఎన్నో కష్టనష్టాలకి ఓర్చి డాక్టర్ కావాలన్న కలని నిజం చేసుకున్న ఓ కుర్రాడు, మెడికల్ కాలేజిలో చదువు ముగించి, ప్రభుత్వాసుపత్రిలో హౌస్ సర్జన్ గా పనిచేసిన యేడాది కాలపు అనుభవాలే ఈ నవల. నిజానికి దీనిని ఒక హౌస్ సర్జన్ డైరీ అనొచ్చు. కథానాయకుడు మధుకర రావు కి వైద్య వృత్తి అంతే ప్రాణం. పుస్తకాలు, లేబరేటరీలే లోకం. అతను చదువు పూర్తి చేసి, తను వైద్య విద్యార్ధి గా అనేకసార్లు వచ్చిన ఆస్పత్రికి హౌస్ సర్జన్ గా రావడం తో కథ మొదలవుతుంది.

మధుకి మొదటి రోజు ఎదురైన అనుభవాలు ఎంత వివరంగా రాశారంటే, మొత్తం 216 పేజీల నవలలో మొదటి యాభై ఎనిమిది పేజీలు అతని మొదటి రోజు దినచర్యే. అవుట్ పేషెంట్లని పరీక్షించి మందులు ఇవ్వడం, వార్డులో తిరుగుతూ ఇన్-పేషెంట్ల కి అవసరమైన చికిత్స చేయడం తో పాటు నైట్ డ్యూటీ లో హాస్పిటల్లో ఉన్న వార్డుల మధ్య పరుగులు పెడుతూ ఎమర్జెన్సీ కేసులు అటెండ్ అవుతాడు మధు. అతనితో పాటు మనమూ పరిగెడతాం.

ఆస్పత్రి వాతావరణం, అక్కడికి వచ్చే రకరకాల పేషెంట్లు, అక్కడ పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది మనస్తత్వాలు, ఇగోలు, ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగత వైషమ్యాలని పక్కకి పెట్టి కలిసి పనిచేయడం.. ఇలా మనకి అంతగా తెలియని ఓ కొత్త ప్రపంచాన్ని కళ్ళముందు ఆవిష్కరిస్తారు రచయిత. చదవడం మొదలు పెట్టాక మనకి తెలియకుండానే కథలో లీనమైపోతాం. మెడికల్ టెర్మినాలజీ మనల్ని అంతగా ఇబ్బంది పెట్టదు.

ఇదేమీ అత్యంత సీరియస్ నవల కాదు. ఎందుకంటే ఇందులో హాస్యానికీ కొదవ లేదు. తనకి ఇంజెక్షన్ చేస్తే తప్ప రోగం తగ్గదని మనసా వాచా నమ్మిన పేషెంట్ ని కన్విన్స్ చేయడం కోసం డిస్టిల్ వాటర్ ని ఇంజెక్ట్ చేసే డాక్టరు, మధు ని చూడ వచ్చిన అతని పల్లెటూరి బంధువుని మెడికల్ కాలేజి స్టూడెంట్ అనుకుని అతనికి ప్రాక్టికల్ పరిక్ష పెట్టే సీనియర్ డాక్టర్లు, పేషెంట్స్ అనుకుని వాళ్ళ కూడా వచ్చే వాళ్లకి పరిక్షలు చేసేసే హౌస్ సర్జన్లు .. ఇలాంటి సన్నివేశాలు అనేకం.

మధుతో కలిసి మెడిసిన్ చదివి డాక్టర్ అయిన ఒక అమ్మాయి, హౌస్ సర్జెన్సీ లో అతనికి సాయ పడిన ఒక నర్సూ అతనితో ప్రేమలో పడతారు. అలా అని ఇది ముక్కోణపు ప్రేమ కథ కాదు. నిజానికి ఈ సన్నివేశాలను మధు వ్యక్తిత్వాన్ని వివరించడానికి ఉపయోగించు కున్నారు రచయిత. సున్నిత మనస్కుడైన మధు తను వైద్యం చేస్తున్న పేషెంట్ చనిపోతే పడే బాధ వర్ణనాతీతం. కథానాయకుడిని చాలా ఉన్నతంగా నిలిపారు కొమ్మూరి. ఈ నవల్లో మధు రచయితేనేమో అన్న సందేహం కలగక మానదు.

నేను కొన్నది ఎమెస్కో వారి తాజా ప్రచురణ. ఇందులో తొలి ప్రచురణ తేదీ ఇవ్వలేదు. హౌస్ సర్జన్ జీతం నూట యాభై రూపాయలు, నర్సు జీతం తొంభై రూపాయలు అని చదివి దాదాపు ఐదు దశాబ్దాల క్రితం నవల అయి ఉండొచ్చని ఊహించాను. కొంచం గూగులింగ్ చేస్తే తొలి ప్రచురణ 1967 లో జరిగిందని తెలిసింది. ప్రచురణ కర్తలు రిప్రింట్ చేసేటప్పుడు తొలి ప్రచురణ తేదీ వేస్తే చదువుకునే వాళ్లకి సౌకర్యంగా ఉంటుంది.

ఎమర్జెన్సీ కేసు వచ్చినప్పుడు వేరే వార్డులో ఉన్న హౌస్ సర్జన్ ని వెతుక్కుంటూ ఆయా పరిగెత్తుకుని వెళ్ళడం లాంటివి చదివినప్పుడు 'మొబైల్ కి ఓ కాల్ చెయ్యొచ్చు కదా' అన్న ఆలోచన రాక మానదు. ఇంటర్ కం కూడా లేని రోజులవి. హాస్పిటల్లో మందుల కొరత ఇవాళ కొత్తగా వచ్చిన సమస్య కాదని చెబుతుంది ఈ నవల. సర్జరీ లంటే మధుకి ఎంతో ఆసక్తి.. కొన్నాళ్ళకి ఎలా అయిపోతాడంటే చిన్నదో, పెద్దదో సర్జరీ చేయకపోతే నిద్ర పట్టని స్థితికి వచ్చేస్తాడు. "ఇది క్రూరమైన వృత్తి" అంటాడతను.

నాణేనికి బొమ్మా బొరుసూ ఉన్నట్టే డాక్టర్లు, నర్సుల్లో రకరకాల వాళ్ళు ఉంటారన్న విషయాన్ని దాచే ప్రయత్నం చేయలేదు రచయిత. మధు తో పాటు డాక్టర్లు కామేశ్వరి, రాజేశ్వరి, చీఫ్ చక్రపాణి, సూపర్నెంట్ దయానంద రాజు పాత్రలు వెంటాడతాయి. వైద్య వృత్తిలో కొత్తకోణాలను చూపే 'హౌస్ సర్జన్ వెల రూ. 60. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది.

శనివారం, సెప్టెంబర్ 12, 2009

బ్లాగులు-'అనంతం'

సుమారు ఎనిమిది నెలల క్రితం.. అప్పటికి బ్లాగులతో కొద్దిపాటి పరిచయం.. నేను బ్లాగు మొదలు పెట్టాను, కానీ బ్లాగులని ఒక క్రమ పద్ధతిలో చదవడం అలవాటు కాలేదు. కనిపించిన టపా అల్లా చదవడమే కానీ బ్లాగు పేరు గుర్తుపెట్టుకోవాలన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. అప్పుడు చదివిన ఒక సుదీర్ఘమైన టపా మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను.. అప్పుడే మొదటిసారిగా ఆ బ్లాగు పేరు గుర్తు పెట్టుకున్నాను.. ఆ పేరు 'అనంతం.' 

"పుట్టింది, పెరిగింది గుంటూరు జిల్లాలో. ఇంజనీరింగ్ చదువు కోసం మొదట హైదరాబాదు కి , తర్వాత ఉద్యోగ రీత్యా అమెరికా కి పయనం. ప్రస్తుతం అమెరికా లోనే ప్రవాస జీవితం." ఇది బ్లాగర్ ఉమాశంకర్ స్వపరిచయం. "కొన్ని జ్ఞాపకాలు,కొన్ని అనుభవాలు,కష్టం-సుఖం, కొద్దిపాటి హాస్యం, అవీ, ఇవీ, అన్నీ.." ఇవి తన బ్లాగు గురించి ఆయన చెప్పిన నాలుగు మాటలు. విండ్సర్ (యునైటెడ్ స్టేట్స్) లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఉమాశంకర్ తన బ్లాగు ద్వారా అప్పుడప్పుడూ అమెరికా జీవితంలో భిన్నకోణాలని పరిచయం చేస్తూ ఉంటారు.

ఇంతకీ ఈ బ్లాగులో నేను ఎప్పటికీ మరిచిపోలేని టపా ఏమిటో చెప్పలేదు కదా.. ఆ టపా పేరు 'ఒక చలిలో వణికిన రాత్రి.' దేశం కాని దేశం లో అర్ధరాత్రి వేళ విమానం దిగి, తనకి ఏర్పాటు చేసిన వసతిలో ఉన్న కొలీగ్ ఎంతకీ తలుపు తీయకపోతే గడ్డకట్టించే చలిలో తను అనుభవించిన టెన్షన్ ని ఆయన హాస్యస్పోరకంగానే అందించినప్పటికీ టపా చదువుతున్న వాళ్లకి చెమటలు పట్టక మానవు. అంతే కాదు, కొత్తగా అమెరికా వెళ్ళే వాళ్ళకి ఇదో పాఠం కూడా. ఈ టపా మాత్రమే కాదు, తను రాసే ప్రతి టపానీ సున్నితమైన హాస్యంతో మేళవించడం ఈయన ప్రత్యేకత.

అది మొదలు వీలున్నప్పుడల్లా బ్లాగులో పాత టపాలు చదువుతుండగా ఒక రోజు 'నా వానాకాలం చదువు' అనే టపా కనిపించింది. ఎగిరి గంతేసినంత పని చేశాను. ఉమాశంకర్ ఎంతటి సాహిత్యాభిమానో ఈ టపాతో తెలిసింది నాకు. ఇంతకీ ఈ టపా తన అకడమిక్స్ గురించి కాదు, సాహిత్యాన్ని చదవడం గురించి. 'చందమామ' మొదలు 'మల్లాది' నవలల వరకూ తన పఠనాభిలాష ఎదిగిన తీరుని అదే క్రమంలో వివరించారు. తనకి ఇష్టమైన మల్లాది నవలల జాబితా లో 'అందమైన జీవితం' ఉంది.. నాకు చాలా ఇష్టమైన నవలల్లో అదొకటి.

'మా ఇంటి కథ' చదవగానే మన జ్ఞాపకాల్లోకి వెళ్ళకుండా ఉండలేం. పుట్టి పెరిగిన ఇంటితో మనకే తెలియకుండా మనలో ఉండే అనుబంధం తాలూకు గొప్పదనం అది. సాహిత్యం తో పాటు, టెన్నిస్ అంటే ఆయనకి ఇష్టమనీ, రాజకీయాలంటే ఆసక్తి అనీ అర్ధమయ్యింది, టపాలు చదువుతున్న కొద్దీ. అన్నట్టు సినిమాల గురించీ ఒకటి రెండు ప్రస్తావనలు ఉన్నాయి. ఒక టపా రాయడంలో ఈయన చూపే శ్రద్ధ నాకెప్పుడూ ఆశ్చర్యమే. వాక్య నిర్మాణం మొదలు, అప్పుతచ్చులు అస్సలు లేకుండా రాయడం వరకూ.. ఓ బండరాయిని అత్యంత జాగ్రత్తతో ఒక శిల్పంగా రూపుదిద్దే శిల్పి గుర్తొస్తాడు నాకు.

మొన్న ఆగస్టు 26 న 'అనంతం' మొదటి పుట్టిన రోజు జరుపుకుంది. గత సంవత్సరం ఇదే రోజున 'జీవన వైచిత్రి' అనే టపా తో మొదలయ్యిందీ బ్లాగు. ఇంతకీ గడిచిన పదమూడు నెలల్లోనూ ఈ బ్లాగులో ప్రచురితమైనవి కేవలం 35 టపాలు మాత్రమే. వీటిని చదువుతుంటే మాత్రం 'గంగిగోవు పాలు' 'నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు..' గుర్తురాక మానవు. ఆమధ్య 'వయసు ముచ్చట్లు' అనే టపా రాసి అందర్నీ ఆశ్చర్య పరిచారు ఉమాశంకర్. చాలా 'బోల్డ్' గా రాసిన ఆ టపాకి కొనసాగింపు ఉందని ప్రకటించారు.

ఎందుకో తెలీదు కానీ గత కొద్ది నెలలుగా నెలకి ఒక్క టపా మాత్రమే కనిపిస్తోంది ఈ బ్లాగులో. ఈ నెల టపా ఇంకా రాలేదు. ఈ బ్లాగులో టపాలు కొంచం తరచుగా వస్తే సంతోష పడే పాఠకుల్లో నేనూ ఒకడిని.

శుక్రవారం, సెప్టెంబర్ 11, 2009

స్నేహితుడు

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఒక విషయంలో చాలా అదృష్టవంతులు. ఆ విషయం సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముఖ్యమంత్రి పదవి పొందడం కాదు.. అన్నీ తానే అయ్యి రెండో సారి కూడా పార్టీని గెలిపించడం కాదు.. ఎంత బలమైన శత్రువుతోనైనా మడమ తిప్పని పోరాటం చేయగలగడమూ కాదు.. మరి?? ఒక 'గొప్ప' స్నేహితుడిని సంపాదించుకోవడం. ఆ మిత్రుడి పేరు కెవిపి రామచంద్ర రావు.

అరవై ఒక్క సంవత్సరాల కెవిపి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకి కేంద్రబిందువు. పార్టీ రాష్ట్ర శాఖకీ, హైకమాండ్ కీ మధ్య వారధి. వైఎస్ వారసుడి ఎంపికలో పరోక్షంగా కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి. వైఎస్ జీవించి ఉన్నంతకాలం, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదున్నరేళ్ల కాలంలోనూ, ఇష్టులకి 'చాణుక్యుడి' గానూ, కిట్టని వాళ్లకి 'రాజ్యాంగేతర శక్తి' గానూ కనిపించిన కెవిపి కి వైఎస్ తో నలభై ఒక్క సంవత్సరాల అనుబంధం.

విద్యార్ధి నాయకుడు మొదలు, ముఖ్యమంత్రి వరకు వైఎస్ చేపట్టిన ప్రతి పదవి వెనుక, తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక, పాదయాత్రతో సహా వేసిన ప్రతి అడుగు వెనుకా కెవిపి ఉన్నారు. ఇన్ని మాటలెందుకు.. కెవిపి మాట వైఎస్ కి సుగ్రీవాజ్ఞ. ఆయన గీసిన గీత లక్ష్మణ రేఖ. వాళ్ళిద్దరి పరిచయం, అది స్నేహం మారి ధృడంగా కొనసాగుతున్న వైనాన్ని మొన్నటి స్నేహితుల దినోత్సవం నాడు వాళ్ళిద్దరూ సాక్షి 'డబుల్ ధమాకా' కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు.

అప్పటికే వాళ్ళిద్దరి స్నేహాన్ని గురించీ కొంత తెలిసినా, ఆ ఇంటర్వ్యూ వల్ల పూర్తిగా తెలుసుకోగలిగాను. ఆ ప్రభావమే కాబోలు, సరిగ్గా నెల్లాళ్ళ తర్వాత వైఎస్ మరణ వార్త తెలియగానే నా కళ్ళు టీవీ చానళ్ళలో కెవిపి కోసం వెతికాయి. శవ పేటికని తడుముతూ, మిత్రుడి కోసం వెతుక్కున్న కెవిపి ని చూడగానే నాకు తెలియకుండానే - మరణ వార్త విన్నాక మొదటిసారిగా - నా కళ్ళు తడిశాయి. "ఎంత అదృష్టవంతుడివి వైఎస్" అనుకోకుండా ఉండలేక పోయాను.

తన ఏకైక ప్రాణ స్నేహితుడిని కోల్పోయిన కెవిపి ఇప్పుడు ఏకాకి. గడిచిన పది రోజుల్లోనే ఆయనకి పదేళ్ళ వయసు మీద పడింది. ఇంత దుఖం లోనూ మిత్రుడి కుటుంబంకోసం ఆయన పడుతున్న తపన, శ్రమ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మిగిలిన రాజకీయ నాయకుల్లాగా ఆ తపనంతా కేవలం తన పదవి నిలుపుకోడం కోసమే అనిపించడం లేదు. తప్పదు కాబట్టి చేస్తున్నారన్న భావనా కలగడం లేదు. ఆయన చర్యల్లో కనిపిస్తున్న పట్టుదల, అంకిత భావాలే ఇందుకు కారణం కావొచ్చు.

"స్నేహితుడంటే ఇలా ఉండాలి.." అని పదే పదే అనిపిస్తోంది కెవిపి ని చూస్తుంటే. ప్రస్తుత పరిస్థితులని బట్టి భవిష్యత్ రాజకీయ సమీకరణాలు మునుపటిలా ఉండవన్న సంగతి ఆయన ఊహించలేనిదేమీ కాదు. అన్నీ అనుకున్నట్టే జరిగినా భవిష్యత్తులో తన పాత్ర మునుపటంత శక్తివంతంగా ఉండదన్నదీ తెలిసే ఉంటుంది. అందుకే కెవిపి చర్యల్లో స్వార్ధాన్ని చూడలేక పోతున్నా.. తను చేస్తున్న ప్రతి పనీ తన ప్రాణ మిత్రుడికోసమే చేస్తున్నారేమో అనిపిస్తోంది.. మిత్రుడికి అర్పిస్తున్న నివాళిలా కనిపిస్తోంది..

గురువారం, సెప్టెంబర్ 10, 2009

పులస చేప పులుసు

పులసల సీజన్ నడుస్తోంది.. ప్రతి యేడాది కన్నా ఈసారి పులసలకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. గత సంవత్సరం చేప ఒక్కింటికి రూ. 1,500 పైగా పలికిన పులస ఈసారి రూ. 2,000 వరకూ పలుకుతోంది. 'పుస్తెలు అమ్మైనా పులస తినాలి' అంటారు మా గోదావరి జిల్లాల వాళ్ళు. జలయజ్ఞం పూర్తయితే పులస ఇంక అదృశ్యమై పోవచ్చు అన్న వార్తల నేపధ్యంలో ఎంత రేటైనా పెట్టి పులస కొనడానికి సిద్ధ పడిపోతున్నారు జనం.

పులసలు రెండు రకాలు. పోతుపులస, ఆడపులస. ఆడపులస నే 'శనగ పులస' అని కూడా అంటారు. గోదారిలో మిగిలిన ప్రాంతాల్లో కన్నా, రాజమండ్రి దగ్గర దొరికిన పులస ఎక్కువ రుచిగా ఉంటుంది. మరి ఇంత ఖరీదైన పులస తో రుచికరమైన పులుసు పెట్టడం అంత సులువేమీ కాదు. పులస చేపతో పులుసు చేయడానికి ముందు పులసకి ఉన్న పొలుసులు తీసేసి శుభ్రం చేయాలి. చేదుకట్ట తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రేకలూ, అల్లం, జీలకర్రా, ధనియాలూ కలిపి ముద్దగా నూరుకుని పక్కన పెట్టుకోవాలి. గుప్పెడు పొడవాటి మిరప్పళ్ళు ముతగ్గా దంచి వేరుగా పెట్టుకోవాలి. వెడల్పుగా, లోతు తక్కువగా ఉన్న గిన్నె (వీలయితే మట్టి దాక) స్టవ్ మీద పెట్టి అందులో నువ్వుల నూనె పోయాలి. నూనె సెగ వచ్చేలా కాగాక నూరి ఉంచుకున్న ముద్దలు ఒక్కొక్కటీ వేసి దోరగా వేయించాలి.

లేత కొబ్బరి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి గిన్నెలో పోయాలి. అలాగే టమాటా పళ్ళని చిదిమి గిన్నెలో వేయాలి. లేత బెండకాయ ముక్కల్ని పొడుగ్గా తరిగి పులుసులో వేశాక, ఒక్కొక్క చేప ముక్కనీ జాగ్రత్తగా పులుసులో మునిగేలా జారవిడవాలి. గిన్నెమీద జల్లిమూత (చిల్లులున్నది) పెట్టి మంట పెంచాలి. కుతకుతా ఉడుకుతూ బుళుకు బుళుకు మనే చప్పుళ్ళు చేస్తుంది పులుసు.

పులుసు నుంచి కమ్మటి వాసన రావడం మొదలవ్వగానే మంట తగ్గించి సన్నని సెగ మీద ఉడకనివ్వాలి. చాలాసేపు మరిగాక పులుసు చిక్కబడుతుంది. స్టవ్ ఆపేసి వేడి పులుసు లో వెన్నముద్ద కలపాలి. పులుసు బాగా చల్లారాక మొన్న వేసవిలో పెట్టిన కొత్తావకాయ మీది తేటని పులుసులో కలపాలి. ఒకరాత్రంతా కదపకుండా గిన్నెలోనే ఉంచేసి, మర్నాడు ఉదయం అన్నంలో కలుపుకుని తింటే ఉంటుంది రుచీ....

ఇదేమిటి? కనీసం 'పులిహోర' చేయడం కూడా రాని నేనేమిటీ? పులస తో ఇంత రుచికరమైన పులుసు చేయడం ఏమిటీ? అని కదా సందేహం. మరి నాకు ఈ పులుసు చేయడం నేర్పించినావిడ సామాన్యురాలు కాదు. ఆవిడ పేరు శ్రీమతి వాసంశెట్టి చిట్టెమ్మ నారాయుడు. సింపుల్ గా చిట్టెమ్మ. వర్షాకాలం వచ్చిందంటే ఊళ్ళో ఎంత పెద్ద మేడలో ఉండే వాళ్లైనా సరే, పులస కొనుక్కుని చిట్టెమ్మ పెంకుటింటి ముందు నిలబడాల్సిందే. ఆమె చేసే పులుసు తిన్నాక ఇంక తనువు చాలించేసినా పర్వాలేదనుకుంటారు అందరూ.

పులుస పులుసు తిన్నాక చెయ్యి నీసు వాసన రాకుండా పులుసు చెయ్యడం చిట్టెమ్మ గొప్పదనం. అలా ఎలా కుదురుతుంది? అని అడిగితే 'రగిస్సం' అని నవ్వేస్తుంది. అలాంటి చిట్టెమ్మకి ఒక కష్టం వచ్చింది. అలాంటి ఇలాంటి కష్టం కాదు.. ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయే అంత కష్టం. మరి ఇన్నాళ్ళూ ఆమె చేతి పులుసు తిన్న ఊరి వాళ్ళు ఊరుకున్నారా? ఇది మాత్రం నన్ను అడగొద్దు. ఎందుకంటే చిట్టెమ్మ మా ఊరి మనిషి కాదు.

మా ప్రాంతం లోనే ఉండే 'పసలపూడి' అనే పల్లెటూరు ఆమెది. ఆమెని నాకు పరిచయం చేసింది వాళ్ళ ఊరి మనిషి వంశీ.. 'మా పసలపూడి కథలు' పేరిట వంశీ వెలువరించిన 72 అచ్చ తెలుగు కథల సంకలనం లో అరవై తొమ్మిదో కథ 'చిట్టెమ్మ కాసే చేపల పులుసు' చదివితే తెలుస్తుంది, చిట్టెమ్మ కి వచ్చిన కష్టం ఏమిటో.. పసలపూడోళ్ళు ఏం చేశారో.. (ఎమెస్కో ప్రచురణ, పేజీలు 520, వెల 175). పులస చేప పులుసు తిన్న ప్రతిసారీ చిట్టెమ్మ ని తలచుకోకుండా ఉండలేరు మరి.

బుధవారం, సెప్టెంబర్ 09, 2009

హైదరాబాద్ యాత్ర

నేను మొట్ట మొదట హైదరాబాద్ చూసింది నా ఐదో ఏట.. మా తాతయ్య, బామ్మతో కలిసి. దాదాపు ఇరవై రోజులు అమ్మని, నాన్నని వదిలి వాళ్ళతో కలిసి ఊళ్ళు తిరిగొచ్చాను. నా అక్షరాభ్యాసం అయ్యాక తాతయ్య మూడు నెలల్లో చిన్న బాలశిక్ష పూర్తి చేస్తే హైదరాబాద్ తీసుకెళ్తానని నాకు మాటిచ్చి, దానిని నిలబెట్టుకునే క్రమంలో చేయించిన ప్రయాణం. బామ్మకి, మిగిలిన కుటుంబ సభ్యులకి ఎవరికీ ఇష్టం లేకపోయినా పైకి ఏమీ మాట్లాడలేదు వాళ్ళు.. బహుశా మాట్లాడినా ఉపయోగం ఉండదని కావొచ్చు.

నాకు హైదరాబాద్ ప్రయాణం విషయాలు అంత బాగా గుర్తుండక పోయేవి.. కానీ యాత్ర ముగిశాక అక్కడ జరిగిన ప్రతి విషయాన్నీ బామ్మ వందల సార్లు తల్చుకోడం వల్ల మర్చిపోదామన్నా మర్చిపోలేనంతగా గుర్తుండి పోయాయి. ప్రయాణం కోసమని తాత నాకు కొత్త బట్టలు కుట్టించడం తో సన్నాహాలు మొదలయ్యాయి. ముందుగా మేము ముగ్గురం బస్సులో రాజమండ్రి వెళ్ళాం. అక్కడ బాబాయి ఇంట్లో రెండు రోజులు ఉన్నాం.

నిజానికి అది నన్ను పరిక్షించడం అన్నమాట.. అమ్మనీ నాన్ననీ వదిలి నేను ఉండగలనా అని? ఆ పరీక్షలో నేను పాస్ కావడం తో అక్కడినుంచి రైల్లో హైదరాబాద్ బయలుదేరాం. తాతయ్య పాపం నాకు అర టిక్కెట్టు కొందామనుకున్నారు కానీ, బామ్మ పడనివ్వ లేదు. 'ఎందుకు దండగ' అని. రైలెక్కే ముందు తాతయ్య నాకో నల్ల కళ్ళజోడు కొనిచ్చారు. రైలు బొగ్గు కళ్ళలో పడకుండా అన్నమాట. ఆ కళ్ళజోడు చాలా రోజులు దాచుకున్నా.. తర్వాత ఎక్కడో పోయింది.

రైలెక్కగానే నన్ను ఎవరితోనూ మాట్లాడొద్దని బామ్మ ఆర్డరేసింది. మూడేళ్ళ లోపు పిల్లలకి సరిగా మాటలు రావు కదా మరి. నాకేమో మనుషులు కనిపిస్తే నోరూరుకోదు. దానికి తోడు జ్ఞానం కొంచం ఎక్కువ అవడం వల్ల ఎవరైనా ఒకటి అడిగితే పది జవాబులు చెప్పడం మాటలు వచ్చిన నాటి నుంచీ అలవాటు. అలా రైల్లో నన్ను పలకరించిన వాళ్ళందరికీ నేను ఠపీ ఠపీ సమాధానాలు చెబుతుంటే బామ్మ గొడవ చేసేది, టీసీ వచ్చి నాకు ఫైన్ కట్టమంటాడని.

మొత్తానికి హైదరాబాద్ చేరాం. మా అత్తయ్యలు, ఇంకా తాతయ్య వాళ్ళ చెల్లెళ్ళు ఇలా చాలా మంది బంధువులు ఉన్నారు. వాళ్ళ ముందు నా విద్యా ప్రదర్శనలు. నేను గుణింతాలు పాటలా పాడుతుంటే మా అత్తయ్యల పిల్లలు మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని నవ్వుకునే వాళ్ళు. తాతయ్యకి మాత్రం భలే గర్వంగా ఉండేది. నేనెక్కడ ఏ అర్ధరాత్రో లేచి అమ్మ కావాలి అంతానో అని టెన్షన్ వాళ్లకి. అందుకని ఎప్పుడూ స్వీట్లు ఇంట్లో ఉండేలా జాగ్రత్త పడే వాళ్ళు. అడక్కపోయినా స్వీట్లు తినిపించేస్తూ ఉండేవాళ్ళు, ప్రేమగా.

నేను ఏ విషయానికి ఏడుపు మొదలు పెట్టినా స్వీటు చూసేసరికి టక్కున ఆపేసేవాడిని.. ఇడ్లీ లో ఇడ్లీ అంత బరువు తూగే పంచదార నంజుకోడం నా అలవాటు. ఈ విషయం తాతయ్యకి బాగా తెలుసు. తాతయ్య తో కలిసి చీకటి గుహలా ఉన్న చార్మినార్ స్థంభం లోనుంచి పైకి ఎక్కడ, గోల్కొండ కోట దగ్గర చప్పట్లు కొట్టడం లీలగా గుర్తుంది. అక్కడే మొదటిసారి ఫోన్ చూశాను. కానీ మాట్లాడడానికి భయ పడ్డాను.

నాకు బోల్డు దిష్టి తగిలేస్తుందని తాతయ్యకి నా చిన్నపటినుంచీ బెంగ. కొంచం బొద్దుగానూ, ఆయనకి ముద్దుగానూ ఉండేవాడిని. అందుకని రోజూ రాత్రి నేను పడుకునే ముందు ఉప్పు తో దిష్టి తీయించే వాడు. ఇంట్లో ఐతే అది అమ్మ డ్యూటీ.. ఈ యాత్రలో మాత్రం అది బామ్మ డ్యూటీ. ఒకరోజు నన్ను హైదరాబాద్ నుంచి మంత్రాలయం తీసుకెళ్ళారు. అక్కడ రాత్రి ఉండాల్సి వచ్చింది. దిష్టి తీయడానికి ఉప్పెక్కడ దొరుకుతుంది? హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళాం కదా.. అక్కడ బామ్మ కూరల్లో ఉప్పు సరి పోలదని వంకలు పెట్టి సర్వరు చేత ఉప్పు తెప్పించి వేరే పళ్ళెంలో వేయించుకుంది. ఆ సర్వర్ చాలా వింతగా చూశాడని బామ్మ తర్వాత చాలాసార్లు తల్చుకుంది.

అత్తయ్యలు మావయ్యలు కొత్త బట్టలు, బొమ్మలు, పుస్తకాలు కొనిచ్చారు. మరి ఇంటికొచ్చాక ఇంక బళ్లోకి వెళ్ళాలి కదా. వచ్చేటప్పుడు కూడా రాజమండ్రి లో ఆగి ఒక రోజు ఉండి మా ఊరొచ్చాం. బెంగ పెట్టుకుని చిక్కిపోయి వస్తాడనుకున్న కొడుకు కాస్తా గుమ్మంలో గుమ్మటంలా దిగేసరికి పాపం అమ్మకీ నాన్నకీ నోట మాట లేదు. రోజూ ముప్పొద్దులా స్వీట్లు తిన్న పిల్లాడు అలా కాక ఇంకెలా ఉంటాడు మరి?

మంగళవారం, సెప్టెంబర్ 08, 2009

నాయికలు-శాంతి

చదువుకున్న, మధ్యతరగతి గృహిణి శాంతి. ఇద్దరు పిల్లల తల్లి. యెంతో భావుకత్వం ఉన్న స్త్రీ. ఆమె భర్త భాస్కరరావు ఓ ఉద్యోగి. బాధ్యతాయుతమైన గృహస్తు. భార్యా పిల్లలంటే ప్రేమ ఉన్నవాడు. అయితే, భావుకత్వం ఏమాత్రమూ లేనివాడు. ఎంత కచ్చితమైన మనిషంటే..హనీమూన్ కి వెళ్ళినప్పుడు ఓ బిచ్చగత్తె పాడిన పాట యెంతో నచ్చి శాంతి ఆమెకి ఒక రూపాయి ఇస్తే, హోటల్ రూముకి రాగానే అతను తన డైరీ తెరిచి 'ధర్మం ఒక రూపాయి' అని లెక్క రాసుకునేంత.

తన భావుకత్వాన్ని ఒక డైరీ కి పరిమితం చేసుకుని, భర్త గురించి అప్పుడప్పుడూ బాధ పడుతూ అంతలోనే సర్దుకుపోతూ ఉండే శాంతి 'మల్లాది' మార్కు నాయిక. చెల్లెలి పురిటి కోసం రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళిన శాంతికి అనుకోకుండా పరిచయమవుతాడు ప్రియతమ్. బ్యాంకు ఉద్యోగి. తనని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృదుల, ముగ్గురు పిల్లలు శ్రేష్ఠ, శ్వేత, ఉపేష్. 'అందమైన జీవితం' ప్రియతమ్ ది.

ప్రియతమ్ పరిచయం శాంతిపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది అన్నదే దాదాపు మూడు దశాబ్దాల క్రితం మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన 'అందమైన జీవితం' నవల్లో కథ. ప్రియతమ్ ని ప్రతి విషయంలోనూ భాస్కరరావుతో పోల్చుకోకుండా ఉండలేదు శాంతి. అదే సమయంలో మృదుల పై రవ్వంత అసూయ కూడా కలుగుతుంది ఆమెకి. భాస్కర రావు పట్ల తనకున్న అసంతృప్తి ని ప్రియతమ్ దగ్గర ఏమాత్రం వ్యక్తం చేయదు ఆమె.

చెల్లెలున్న ఆస్పత్రికి వెళ్ళిరావడం కోసం శాంతి, తన బ్యాంకుకి వెళ్లి రావడం కోసం ప్రియతమ్ ప్రతిరోజూ లోకల్ రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు. ఆ ప్రయాణం లో వాళ్ళిద్దరి మధ్యా ఎన్నో కబుర్లు. ప్రియతమ్ నోరు తెరిస్తే చెప్పేది మృదుల గురించీ, పిల్లల గురించీ.. ఐతే శాంతి ఇందుకు భిన్నం. ఆమె తన బాల్య జ్ఞాపకాలు నెమరు వేసుకోడంలో ఆనందాన్ని వెతుక్కుంటుంది. తన పిల్లల అల్లరి గురించి అప్పుడప్పుడూ తల్చుకుంటుంది.

మంచునీ, వాననీ, వెన్నెలనీ, సూర్యోదయాన్నీ, సూర్యాస్తమయాన్నీ ఆస్వాదించగలరు వాళ్ళిద్దరూ.. చిగురులు తొడిగే కొమ్మ, చిన్నపాప బోసినవ్వు ఇలా సమస్తమూ వాళ్లకి సంతోషాన్ని ఇచ్చేవే. ప్రియతమ్ ని చూసిన ప్రతిసారీ శాంతికి ఒకటే సందేహం. "ఇలాంటి మగవాడు, ఒక భర్త, ఒక తండ్రి ఉండడం సాధ్యమేనా?" అని. సాధ్యమే అని నిరూపిస్తున్నాడు తన ఎదురుగా ఉన్న ప్రియతమ్, కమల్ హాసన్ అంతటి అందగాడు.

ఇద్దరు పిల్లల తల్లైనా తనలో ఆకర్షణ తగ్గలేదని తెలుసు శాంతికి. అయినా ప్రియతమ్ తననేప్పుడూ 'ఆ' దృష్టి తో చూడకపోవడమూ ఆశ్చర్యమే ఆమెకి. అనేక రకాలుగా అతన్ని పరీక్షిస్తుంది.. అతనిలో ఎలాంటి 'చెడు' ఉద్దేశమూ లేదని గ్రహిస్తుంది. రాను రానూ అతను ఆమెకో మిష్టరీగా మారిపోతాడు. జీవితాన్ని రొటీన్ కి భిన్నంగా ఎలా గడపొచ్చో ఉదాహరణలతో వివరిస్తూ ఉంటాడు ప్రియతమ్. రాజమండ్రి వెళ్ళాకా వాటిని అమలు చేయాలని అనుకుంటూనే, భాస్కర రావు ఎలా స్పందిస్తాడో అని సందేహ పడుతూ ఉంటుంది శాంతి.

శాంతికి హైదరాబాద్ ని చాలా కొత్తగా చూపిస్తాడు ప్రియతమ్. సినిమా హాల్లో ప్రొజెక్టర్ రూం, చోర్ బజార్, ఇంకా ఆమె అభిమానించే రచయిత చక్రపాణి ఇలా.. శ్మశానానికి తీసుకెళ్ళి జీవితపు అంతిమ ఘట్టాన్ని చూపించడం ద్వారా, జీవితం ఎంత చిన్నదో, విలువైనదో చెబుతాడామెకి. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరగడానికి తాము ఏమేం చేస్తూ ఉంటామో తరచూ వివరిస్తాడు. ఒకసారి ఆమెని తన ఇంటికి తీసుకెళతాడు కానీ అక్కడ మృదుల, పిల్లలు ఉండరు. అత్యవసరమైన పని మీద బయటకి వెళ్తున్నామని మృదుల రాసిన లెటర్ ఉంటుంది ఇంట్లో.

ప్రియతమ్ గురించి శాంతి 'పూర్తిగా' తెలుసుకోడం, ఇద్దరూ ఉత్తరాలు రాసుకోవాలనీ, స్నేహాన్ని కొనసాగించాలనీ నిర్ణయించుకోడం ఈ నవల ముగింపు. నవలలో కొన్ని కొన్ని సన్నివేశాలు చదువుతుంటే ఏదో ఇంగ్లీష్ నవల ప్రభావం అనిపించక మానదు. మధ్య మధ్య మల్లాది మార్కు జోకులకి, చిట్కాలకీ కొదవ లేదు. రెండు మూడేళ్ళ క్రితం వచ్చిన '10th క్లాస్' అనే తెలుగు సినిమాలో (సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ తొలి చిత్రం) లో ఈ నవలని ఎనభై శాతం వరకూ వాడుకున్నారు. మల్లాదికి తెలుసో, తెలీదో మరి. ఇప్పటికీ మల్లాది నవలల్లో నాకు ఇష్టమైన నవల 'అందమైన జీవితం.'

శనివారం, సెప్టెంబర్ 05, 2009

గీతాంజలి

రెండు దశాబ్దాల క్రితం వరకూ ఎవరినైనా 'గీతాంజలి' గురించి చెప్పమంటే మొదట వచ్చే సమాధానం 'రవీంద్రనాథ్ టాగోర్ రచన' అని ఉండేది. తర్వాతి కాలం లో అది కాస్తా 'మణిరత్నం-నాగార్జున' కాంబినేషన్ లో వచ్చిన సినిమా అయ్యింది. తమిళ దర్శకుడు మణిరత్నం 1989 లో తీసిన 'గీతాంజలి' సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. ఆబాలగోపాలాన్నీ అలరించిన సున్నితమైన ప్రేమకథ.

హీరోకో, హీరోయిన్కో ప్రాణం పోయే జబ్బు ఉండడం, అది కథ క్లైమాక్స్ కి వచ్చాక బయట పడడం అన్నది తెలుగు సినిమాల్లో బాగా నలిగిన ఫార్ములా. ముఖ్యంగా అప్పటివరకూ ఇద్దరి హీరోయిన్లతో ఆడిపాడిన హీరోని శుభం కార్డు సమయానికి ఏకపత్నీవ్రతుడిని చేసేందుకు, ఇద్దరిలోనూ ఒక హీరోయిన్ కి ప్రాణాంతక వ్యాధి ఉన్నట్టు చూపించిన సినిమాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఈ రొటీన్ ఫార్ములాకి కొంచం భిన్నంగా నాయికా నాయకులిద్దరినీ ఎన్నాళ్ళు బతుకుతారో తెలియని పేషెంట్లు గా చూపడం 'గీతాంజలి' ప్రత్యేకత.

కథానాయకుడు ప్రకాష్ (అక్కినేని నాగార్జున) కులాసాగా కాలం గడిపే కాలేజి విద్యార్ధి. స్నాతకోత్సవం ముగిశాక, స్నేహితులతో ఆడి పాడుతుంటే ప్రమాదం జరిగి ఆస్పత్రి పాలవుతాడు. చికిత్స జరుగుతుండగా తెలుస్తుంది.. అతనికి కేన్సర్ చివరి దశలో ఉందనీ, ఇంకెన్నాళ్లో బతకడనీ. తల్లీతండ్రీ తనకోసం బాధ పడడం చూడలేక వాళ్లకి దూరంగా ఊటీ వెళ్ళిపోతాడు ప్రకాష్. అక్కడ అతనికి డాక్టరుగారమ్మాయి గీతాంజలి (నూతన నటి గిరిజ) పరిచయ మవుతుంది.

ముగ్గురు చెల్లెళ్లకి అక్కైన టీనేజ్ అమ్మాయి గీతాంజలి కి తల్లి లేదు. నానమ్మ పెంపకంలో పెరుగుతూ ఉంటుంది. అల్లరిపిల్ల. తన వెంటపడే అబ్బాయిలని ప్రాక్టికల్ జోకులతో ఏడిపిస్తూ ఉంటుంది. 'ఆమనీ పాడవే హాయిగా' పాడుకుంటూ ప్రకాష్ తనని పట్టించుకోడం లేదని అలిగిన గీతాంజలి, అల్లరి చేసి అతనితో మాట కలుపుతుంది. గీతాంజలి ప్రాణాంతకమైన గుండె జబ్బుతో బాధ పడుతోందనీ, ఎన్నాళ్ళో బతకదనీ తెలిసిన ప్రకాష్ ఆమెతో ప్రేమలో పడతాడు.

ప్రకాష్ కూడా ఇంకెన్నాళ్లో బతకడని గీతాంజలికి తెలుస్తుంది. మొదట అతన్ని తిరస్కరించిన ఆమె ఆపై అతను కావాలని ఆమె కోరుకోడం సినిమాకి ముగింపు. 'ఎన్నాళ్ళు బతుకుతారో తెలీదు..కానీ బతికినన్నాళ్ళూ ఆనందంగా బతుకుతారు' అన్న పాజిటివ్ నోట్ తో సినిమా ముగుస్తుంది. ఇది పూర్తిగా మణిరత్నం సినిమా. సున్నితమైన భావోద్వేగాల మేళవింపు. తనే కథ, స్క్రీన్ ప్లే సమకూర్చుకున్నారు. భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ సంస్థ నిర్మించింది.

టైటిల్స్ పడుతుండగానే హీరో పరిచయం, అతనికి ప్రాణాంతక వ్యాధి ఉందన్న విషయమూ తెలిసిపోతాయి. 'జల్లంత తుళ్ళింత' అనే పాటతో గీతాంజలి పరిచయం అవుతుంది. పాట, ఆ తర్వాత వచ్చే దృశ్యాల ద్వారా ఆమె చాలా అల్లరిపిల్ల అనీ, నాయనమ్మ అంటే భయం, తండ్రి అంటే గౌరవం ఉన్నాయని తెలుస్తుంది. తన వెంట పడ్డ ఓ కుర్రాడిని శ్మశానానికి రమ్మని అక్కడినుంచి 'లేచిపోదామ'నీ చెప్పి, చెల్లెళ్ళ సాయంతో అతను భయంతో పారిపోయేలా చేస్తుంది, 'నందికొండ వాగుల్లో' పాట పాడి. ప్రకాష్ నీ భయ పెట్టాలని చూస్తుంది కానీ, అతను తిరిగి వీళ్ళనే భయపెడతాడు. గీతాంజలిని ఏడిపించే క్రమంలో ఆమె జబ్బు గురించి తెలుస్తుంది అతనికి.

అప్పటిదాకా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రకాష్, తను గీతాంజలి ని ప్రేమిస్తున్నానని తెలుసుకున్న క్షణం నుంచీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకుంటాడు. సిగరెట్ వెలిగించి, అంతలోనే ఆలోచనలో పడి, దానిని కింద పడేస్తాడు. తన ఆరోగ్యం విషయం మాత్రం ఆమె దగ్గర దాస్తాడు. ప్రకాష్, గీతాంజలి ప్రేమలో పడ్డాక ఇద్దరూ కలిసి శ్మశానంలో అంత్యక్రియలు చూసే దృశ్యం, అప్పటి వరకూ చావుని సులువుగా తీసుకున్న గీతాంజలి తండ్రిలో 'నాకు బతకాలని ఉంది నాన్నా' అని చెప్పే సన్నివేశం మనసుని మెలిపెడతాయి.

"అందరూ ఎప్పటికైనా చనిపోవాల్సిన వాళ్ళే.. కాకపొతే నేను మిగిలిన వాళ్ళందరికన్నా ముందుగా చనిపోతాను..అంతే" అని చెప్పే గీతాంజలి, అవే మాటలు ప్రకాష్ చెప్పినప్పుడు మాత్రం భరించలేదు. అతనెప్పుడు చనిపోతాడో అనే భయంతో తను గడపలేనని చెప్పి అతన్ని తిరస్కరిస్తుంది. "ఎందుకంటే..నా ప్రాణం కన్నా నువ్వు నాకు ముఖ్యం..." అని గీతాంజలి ఏడుస్తూ చెప్పే సన్నివేశం వెంటాడుతుంది. సంభాషణలు రాజశ్రీ రాశారు.

ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పీసీ శ్రీరామ్ ఫోటోగ్రఫీ. సన్నివేశాలకు తగ్గ మూడ్ ని క్రియేట్ చేయడం కోసం లైటింగ్ ని వాడుకున్న తీరు అబ్బుర పరుస్తుంది. క్లోజప్ సన్నివేశాల్లో ఐతే వెలుగునీడలతో ఆడుకున్నారు. వేటూరి-ఇళయరాజా కాంబినేషన్లో పాటలన్నీ ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేవే. నాకిష్టమైన పాట 'ఓం నమః..' ఈ పాట చిత్రీకరణ ఓ ప్రయోగం. పాట చిత్రీకరణ మొత్తం ఒక చుంబన దృశ్యం మాత్రమే. తరువాత చెప్పుకోవాల్సింది చివరి పాట 'ఓ పాపా లాలి.'

రాజస్థాన్ ఎడారిలో తీసిన 'ఓ ప్రియా ప్రియా..' పాట గురించి చిన్న గమ్మత్తు చెప్పాలి. అప్పట్లో దూరదర్శన్ 'చిత్రలహరి' లో ఈ పాట చూసి (అప్పటికింకా సినిమా చూడలేదు) నేను, నా మిత్రులూ ఇది పేద హీరో-డబ్బున్న హీరోయిన్ల ప్రేమ కథ అని తీర్మానించేసుకున్నాం. మొదటి పాట 'జగడ జగడ జగడం..' లో సిల్క్ స్మిత మెరిసి మాయమవుతుంది. ప్రకాష్ గా నాగార్జున బాగా చేశాడు. కొంచం బరువు తగ్గి ఉంటే ఇంకా బాగుండేవాడు అనిపిస్తుంది. కాలేజి స్టూడెంట్, ఆపై పేషెంట్ కదా. పైగా గిరిజ మరీ సన్నగా ఉండడంతో అతనికన్నా చాలా చిన్న పిల్ల అన్న భావన కలుగుతుంది.

గిరిజ నడక, బాడీ లాంగ్వేజి లో ఎక్కడా ఆడపిల్ల తాలూకు సున్నితత్వం కనిపించదు. ఆమె తరహానే అంతో, లేక పాత్ర కోసం అలా చేసిందో తెలీదు. ఆమె ఇతర సినిమాలేవీ చూడలేదు నేను. అల్లరి సీన్లలోనూ, సెంటిమెంట్ దృశ్యాల్లోనూ కూడా చాలా బాగా చేసింది. అంత బరువైన పాత్రకి ఓ కొత్త నటిని ఎంచుకోడం సాహసమనే చెప్పాలి. ఈ సినిమాలో పంటికింద రాయిలా అనిపించేది సుత్తివేలు-డిస్కోశాంతిల కామెడీ ట్రాక్. ఈ తెలుగు సినిమాలో కామెడీ ఒక్కటే కాస్త తమిళంగా ఉంటుంది. మణిరత్నం మార్కు కామెడీ అనాలేమో. ఈ ఒక్కటీ మినహాయిస్తే మళ్ళీ మళ్ళీ చూడదగ్గ సినిమా 'గీతాంజలి.'

గురువారం, సెప్టెంబర్ 03, 2009

రాజు వెడలె...

రాష్ట్ర రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. అరవయ్యొక్క సంవత్సరాల ఎదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయనతో పాటు మరో నలుగురు ఆ ప్రమాదంలో కన్నుమూశారు. ఆంధ్ర రాష్ట్రం శోక సంద్రమైంది. జనం కన్నీళ్లు తుడుస్తానని పదే పదే ప్రకటించిన నేత కోసం ఇప్పుడు అదే జనం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శుభవార్త కోసం ఇరవైనాలుగు గంటల సుదీర్ఘ ఎదురుచూపు జీర్ణించుకోలేని చేదు వార్తతో ముగిసింది. నిన్న సాయంత్రం టీవీలో ఆర్ధిక మంత్రి జనానికి చేసిన విజ్ఞప్తి తో మొదలైన సందేహం, నిజం కాకూడదని పదే పదే కోరుకున్నా దురదృష్టవ శాత్తూ నిజమే అయ్యింది.

విద్యార్ధి నాయకుడిగా జీవితం మొదలు పెట్టి, ఫాక్షన్ రాజకీయాల మీదుగా సుదీర్ఘ ప్రస్థానం చేసి, ప్రతీ రాజకీయ నాయకుడి చిరకాల స్వప్నమైన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రాజశేఖర రెడ్డిని విజయలక్ష్మి అయాచితంగా వరించలేదు. ముఖ్యంగా 2004 ఎన్నికలకి ముందు ఆయన జరిపిన 'ప్రజా ప్రస్థానం' పాదయాత్ర ఏ రాజకీయ నాయకుడూ తలపెట్టలేని సాహసం. మండుటెండల్లో బయలుదేరి కాలినడకన రాష్ట్రాన్ని చుట్టి రావాలనే సంకల్పం కలగడానికి, దానిని నెరవేర్చుకోడానికి కేవలం పదవీలాలస మాత్రం ఉంటే సరిపోదు. ప్రజా సమస్యల పట్ల స్పందించే హృదయం కొంతైనా ఉండాలి. పాదయాత్ర రాజశేఖర్ రెడ్డి మనస్తత్వంలో మార్పు తెచ్చింది అంటారు ఆయన సన్నిహితులు.

వ్యవసాయాన్ని గురించి ఆలోచించడానికి, ఉచిత విద్యుత్తు లాంటి స్కీములు ప్రకటించడానికి గ్రామీణ జీవితం పట్ల సంపూర్ణ అవగాహనతో పాటు, కించిత్ సాహసమూ కావాలి. ఆచరణలో అనేక లోటుపాట్లు ఉండొచ్చు కాక, జలయజ్ఞం ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు మొదలు పెట్టగల నాయకుడిని రాజశేఖర రెడ్డి లో తప్ప మరొకరిలో చూడలేం. తలుచుకున్నది చేసి తీరే మొండి తనం, ఫలితం ఎలాంటిదైనా బాధ్యత వహించడం ప్రస్తుత రాజకీయాలలో అరుదైన లక్షణాలే. నమ్మిన వాళ్లకి ప్రాణం ఇవ్వడం, శత్రువు యెంత బలవంతుడైనా లెక్క చేయక మడమ తిప్పని పోరాటం చేయడం వైఎస్ కి మాత్రమె సాధ్యమైన గుణాలు.

వైఎస్ కి సన్నిహితులు ఆయన మాటలని గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు. అరవై దాటాక రాజకీయాల్లో ఉండకూడదన్నది ఒకప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం. "అరవై దాటాక ఉండకూడదయ్యా.." అన్నారట చాలాసార్లు. ఆ మాటల్లో రెండో అర్ధం ఇప్పుడు స్ఫురిస్తోంది. వైఎస్ కి మరణం సంభవించిన తీరు ప్రతి ఒక్కరినీ కలచి వేస్తోంది. నీడలా వెన్నంటి ఉండే సూరీడు కూడా వెంట లేకపోవడం..... ప్రమాద కారణాలు బయటికి వస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, తప్పిదానికి చెల్లించిన మూల్యం వెలకట్టలేనిది. రాష్ట్ర కాంగ్రెస్ కి జవజీవాలు పోసి, త్రిముఖ పోటీకి కూడా వెనుకాడక, తనవాళ్ళలో ఆత్మస్త్థెర్యం నింపి విజయం సాధించిన నేత ఇక లేరు అన్నది యెంత చేదు వార్త?? అబద్ధమైతే బాగుండును అని కోరుకోని వారు లేరు.

మంచి చెడు అన్నవి ప్రతి వ్యక్తిలోనూ ఉండే లక్షణాలు. పూర్తిగా మంచి మనిషి లేదా చెడ్డ మనిషి ఉంటారనడం కేవలం అతిశయోక్తి. నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టే ప్రతి మనిషిలోనూ రెండు లక్షణాలూ ఉంటాయి. కానీ ఒక వ్యక్తి మన మధ్య లేరు అని తెలిసినప్పుడు ఆయన తాలూకు ఏ లక్షణాలను తలచుకుంటారు అన్నది జనం సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యమంత్రి క్షేమం కోసం సందేశాలు పంపమని నిన్న, సంతాప సందేశాలని ఎస్సెమ్మెస్ రూపం లో పంపమని ఇవాళ మృత్యువులో కూడా వ్యాపారాన్ని వెతుక్కుంటున్న టీవీ చానళ్ళ గురించి ఇక్కడ మాట్లాడక పోవడమే మంచిది. వైఎస్ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి.