గురువారం, మే 20, 2021

నవ్వులో శివుడున్నాడురా

జుట్టున్నమ్మ ఏ కొప్పు ముడిచిన అందంగానే ఉంటుంది అన్నట్టుగా విషయపరిజ్ఞానం, రాయడంలో ఒడుపూ తెలిసిన వాళ్ళు ఏం రాసినా చదివించేదిగానే ఉంటుంది. ఇందుకు తాజా ఉదాహరణ శ్రీరమణ నుంచి వచ్చిన 'నవ్వులో శివుడున్నాడురా' అనే 'విశేషాల' సంకలనం. వ్యాసాలు, కబుర్లు, చమక్కులూ.. వీటన్నింటి కలగలుపు ఈ 232 పేజీల పుస్తకం. మొత్తం మూడు అధ్యాయాలుగా విభజింపబడిన ఈ పుస్తకంలో మొదటి అధ్యాయంలో హాస్యాన్ని గురించి పదిహేను వ్యాసాలున్నాయి. ఇవన్నీ హాస్యభరితంగా ఉంటూనే అకడమిక్ విలువని కలిగి ఉన్నాయి. 'తెలుగు సాహిత్యంలో హాస్యం' అనే అంశం మీద పరిశోధన చేయాలనుకునే వారు తప్పక రిఫర్ చేయాల్సిన వ్యాసాలివి. కేవలం లిఖిత సాహిత్యం మాత్రమే కాదు, హరికథలు, అవధానాలు లాంటి అలిఖిత సాహిత్యంలో హాస్యాన్నీ ఈ వ్యాసాల్లో సందర్భోచితంగా చేర్చారు. ఇవన్నీ శ్రీరమణ చేసిన రేడియో ప్రసంగాలు. 

"త్యాగరాజ స్వామి కృతుల్లో కొన్నిచోట్ల చిత్రమైన శబ్దాలు కనిపిస్తాయి. ఒక కీర్తనలో 'నాదుపై ఏల దయరాదూ' అని ఉంటుంది. 'నాదు శబ్దం ఎలా చెల్లుతుంది స్వామీ' అని ఒక శిష్యుడు అడిగాడు. 'చెల్లదు నాయనా! చెల్లదు. అజ్ఞానం వుంది కనకనే ఏల దయరాదూ అని రాముణ్ణి వేడుకోవడం' అన్నారట త్యాగయ్య" ...మచ్చుకి ఇదొక్కటి. ఇలాంటివి ఈ పదిహేను వ్యాసాల నిండా కోకొల్లలు. కవులు, రచయితలు, నాటక కర్తలు, చిత్రకారులు, కార్టూనిస్టులు.. ఇలా ఎందరెందరి కబుర్లో వినిపిస్తాయీ వ్యాసాలలో. ఇలాంటి చోట విశ్వనాథ ప్రస్తావన రాకపోతే అది శ్రీరమణ రచనే కాదు. ఓసారి విశ్వనాథ, రుక్కాయిని (జరుక్ శాస్త్రిగా ప్రసిద్ధుడైన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి - పేరడీలు సృష్టికర్త మాత్రమే కాదు, 'ఒఖ్ఖ దణ్ణం' లాంటి కాలానికి నిలబడే కథలెన్నో రాశారు కూడా) 'ఏం చేస్తున్నావు నాయనా?' అని అడిగారట. 'వేయిపడగల్ని తెలుగులోకి అనువదిస్తున్నా' అన్నారట రుక్కాయి తడుముకోకుండా.  

రెండో భాగం 'బాపూరమణశ్రీరమణ' లో మొత్తం ఎనిమిది వ్యాసాలున్నాయి. పేరులోనే చెప్పినట్టుగా ఇవన్నీ బాపూ-రమణలని గురించే. ఆ ద్వయంతో శ్రీరమణది సుదీర్ఘమైన అనుబంధం. బాపు పుస్తకాలకి ముందుమాటలు రాయడం మొదలు, వాళ్ళ సినిమాలకి పనిచేయడం (ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్) వరకూ వాళ్ళని చాలా దగ్గరగా చూశారు శ్రీరమణ. కొన్ని ప్రత్యేక సందర్భాలలో వాళ్లతో చేసిన ఇంటర్యూలు, రమణ వెళ్ళిపోయాక రాసిన నివాళి వ్యాసమూ ఉన్నాయి భాగంలో. వీటిలో 'దక్షిణ తాంబూలం అను కార్తీక దక్షిణ' అస్సలు మిస్సవకూడనిది. దూరదర్శన్ వారి 'టెలి స్కూల్' కార్యక్రమానికి వీడియో పాఠాలు షూట్ చేయడం కోసం గోదావరి జిల్లాలకు వెళ్ళినప్పుడు ఓ లాకు సూపర్వైజర్ గారింట్లో చేసిన కార్తీక భోజనం కథ ఇది. చదువుతుంటే, ఆ చిన్న ఇంట్లో మనం కూడా ఆ దంపతుల ఆతిధ్యం పొందుతున్నట్టు అనిపిస్తుంది. ఆధరువులన్నీ వాటి రుచులతో సహా ఎంతగా గుర్తు పెట్టుకున్నారో శ్రీరమణ. బహుశా అందుకే 'మిథునం' రాయగలిగారు!

ఇక పుస్తకంలో ముచ్చటైన మూడోభాగం శీర్షిక 'సశేషాలు-విశేషాలు' తొమ్మిది వ్యాసాల సంకలనం. వీటిలో మొదటిది 'నాస్తికానికి ముందుమాట' పేరుతో నరిశెట్టి ఇన్నయ్య ఆత్మకథకి రాసిన ఇరవై పేజీల ముందుమాట. "అర్ధంకాకో, ఎందుకులే అనుకునో ఈ ముందుమాటని ఆ పుస్తకంలో చేర్చుకోలేదు" అన్న చివరిమాట నిజంగానే మాస్టర్ స్ట్రోక్. ఈ ఒక్క వ్యాసం కోసమైనా ఈ పుస్తకాన్ని మన లైబ్రరీలో దాచుకోవాలి.  నాలుగు ఎలిజీలు - ఎస్వీ భుజంగరాయ శర్మ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, నండూరి రామ్మోహన రావు - మళ్ళీ మళ్ళీ చదివించేవిగా ఉన్నాయి.  మద్రాసులో ఓసారి అనుకోని విధంగా శ్రీరమణ గారబ్బాయి అక్షరాభ్యాసం శ్రీకాంతశర్మ చేతులమీదుగా జరిగింది. "కొన్నాళ్ళు గడిచినాయ్. బళ్ళో మావాడి ప్రోగ్రెస్ కార్డు ఎప్పుడొచ్చినా కాపీ తీయించి శర్మకి పోస్ట్ చేసేవాణ్ణి. 'ఇదేంటండీ? నన్నీవిధంగా హింస పెడుతున్నారు. నేను వద్దు మొర్రో అన్నా వినకుండా నాతో దిద్దబెట్టించారు. నేనెప్పుడూ లెక్కల్లో పూరే. వాడికి లెక్కల్లో తోకలేని తొమ్మిదులు, తల లేని ఆర్లు వస్తుంటే నాదా పూచీ' అంటూ జవాబులు వస్తుండేవి." ..చదువుతూ నవ్వాపుకోవడం మన తరమా? 

వ్యాసాల చివర్లో పేజీల్లో ఖాళీలు మిగిలిపోతే వాటినలా వదిలేయకుండా బాపూ కార్టూన్లు ప్రచురించడం వల్ల పుస్తకానికి అదనపు శోభ చేకూరింది. 'నవ్వులో శివుడున్నాడురా' అన్న మాట మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిదట. ఈ పుస్తకానికి చక్కగా అమిరింది. సరసి గీసిన కైలాసం ముఖచిత్రంలో శ్రీరమణ వేషంలో ఉన్న శివుడు, ఆయన మెడలో ఫణిరాజుతో సహా ఎల్లరూ నవ్వులు చిందిస్తున్నారు. తన మిత్రులు వేలమూరి శ్రీరామ్ ప్రోత్సాహంతో ఈ పుస్తకం తీసుకొచ్చానని చెబుతూ, "దేవుడు మేలు చేస్తే చిలకలపందిరి, సరసం.కామ్ (హాస్య కదంబాలు), విరాట, ఉద్యోగ పర్వాలు, ఇంకా మరికొన్ని పుస్తకాలు రావాల్సి ఉన్నాయి" అని చెప్పేశారు. వీటిలో 'చిలకలపందిరి' కోసం నేను బాగా ఎదురు చూస్తున్నా - శ్రీరమణ రాతకి, మోహన్ గీతకీ మధ్య విపరీతమైన పోటీ ఉంటుందా పందిట్లో. వీవీఐటీ ప్రచురించిన 'నవ్వులో శివుడున్నాడురా' వెల రూ. 180. ఆన్లైన్ లో లభిస్తోంది. 

సోమవారం, మే 17, 2021

ఎటర్నల్ రొమాంటిక్ - మై ఫాదర్, జెమినీ గణేశన్

ఎప్పుడో 'మహానటి' సినిమా రిలీజైన కొత్తలో ప్రారంభించి, కమల్ హాసన్ రాసిన ముందుమాట చదివి పక్కనపెట్టి, అటుపైన దాదాపు మర్చిపోయిన పుస్తకం నారాయణి గణేష్ రాసిన బయోగ్రఫీ 'Eternal Romantic - My Father, Gemini Ganesan'. సగం చదివిన పుస్తకాలని పరామర్శిస్తుంటే కంటపడిన ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని ఏకబిగిన చదవడం పూర్తి చేసేశాను. ఒకట్రెండు చోట్ల కాస్త సాగతీత ఉన్నా, ఏకబిగిన చదివించిన పుస్తకం అనే చెప్పాలి. జెమినీ గణేశన్ కి తన భార్య అలిమేలు (బాబ్జీ అంటారు చిన్నా పెద్దా అందరూ) వల్ల కలిగిన నలుగురు కూతుళ్లతో మూడో అమ్మాయి నారాయణి. అక్కలిద్దరిలాగా డాక్టరు కాకుండా, జర్నలిస్టయింది. 'టైమ్స్ ఆఫ్ ఇండియా' లో ఎడిటర్ గా పనిచేస్తున్న నారాయణి తన తల్లిదండ్రులిద్దరూ మరణించిన కొన్నేళ్ల తర్వాత తన తండ్రి ఆత్మకథ రాయడానికి పూనుకుంది. 

జెమినీ గణేశన్ పుదుక్కోటై లో పుట్టి పెరిగిన తమిళుడే అయినా, తెలుగు నేలకి అల్లుడి వరస. అతని జీవితంలో ఉన్న ఉన్న స్త్రీలలో అధికారికంగా బయటికి తెలిసిన ఇద్దరు స్త్రీలు తెలుగు వాళ్ళు. జెమినీ నటి పుష్పవల్లి ద్వారా రేఖ (బాలీవుడ్ నటి), రాధ (పెళ్ళిచేసుకుని అమెరికాలో స్థిరపడింది) లకు, మహానటి సావిత్రిని పెళ్లి చేసుకుని ఆమె ద్వారా విజయ చాముండేశ్వరి (చెన్నై), సతీష్ (అమెరికా) లకూ తండ్రయ్యాడు. వీళ్ళిద్దరే కాకుండా, మరికొందరు స్త్రీలూ అతని జీవితంలో ఉన్నారు. ఇంటి యజమానిగా, భర్తగా, తండ్రిగా జెమినీ గణేశన్ ఎలా ఉండే వాడు, అతని విస్తృత సంబంధాల తాలూకు ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఎలా ఉండేది అనే విషయాల మీద దృష్టి పెట్టి రాశారీ పుస్తకాన్ని. జెమినీతో సహా ఎవరినీ జడ్జీ చేయకపోవడం ఈ పుస్తకం ప్రత్యేకత. ప్రత్యేకించి తన వ్యక్తిగత జీవితంలో రెండు సార్లు డైవోర్సులు జరిగాయని చెప్పిన  రచయిత్రి, ఆ ప్రభావాన్ని రచనలో ఎక్కడా కనిపించనివ్వలేదు. 

పుదుక్కోటైలో ఓ సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన గణేశన్ ('మహానటి' లో చూపించినట్టు మెడిసిన్ చదువుకోడానికి డబ్బులేని నేపధ్యం కాదు, అసలు మెడిసిన్ చదవాలని సీరియస్ గా అనుకోలేదు కూడా), చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకుని చిన్న తాత పెంపకంలో పెరిగాడు. ఆ చిన్నతాత ఎవరో కాదు, దేవదాసి చంద్రమ్మాళ్ ని రెండో పెళ్లి చేసుకుని ఆమె ద్వారా ముత్తులక్ష్మి రెడ్డికి జన్మనిచ్చిన నారాయణ స్వామి. గణేశన్ యవ్వనారంభంలో ముత్తులక్ష్మి ఇంట్లోనే గడిపాడు. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే అలిమేలుతో పెళ్లయింది. క్రికెట్టు, టెన్నిస్, పుస్తకాలు, సినిమాలు, నాటకాలు గణేశన్ కి అభిమాన విషయాలు. నాటి డైరీలని ప్రస్తావిస్తూ నారాయణి ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. సెలవులకి పుదుక్కోటై వెళ్లి, మద్రాసుకి తిరిగొచ్చిన రోజున డైరీ ఎంట్రీ 'మిస్సింగ్ పి' అని ఉంది. "ఈ 'పి' పుదుక్కోటై కావొచ్చు, లేదూ ఎవరన్నా లేడీ లవ్ కావొచ్చు, ఎవరికి తెలుసు?" అంటారు రచయిత్రి.


చదువయ్యాక ఒకట్రెండు చిన్న ఉద్యోగాలు, అటుపైన జెమినీలో కాస్టింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం. త్వరలోనే నటించే అవకాశం, అంతకన్నా త్వరగా హీరోగా నిలదొక్కుకోవడం జరిగిపోయాయి. నిజానికి అలిమేలుకి తన భర్త సినిమాల్లో నటించడం ఇష్టం లేదు. పుట్టింటి వాళ్ళు కలిగిన వాళ్ళే. ఆమెకి ఇల్లు, ఆస్థి కూడా ఉన్నాయి. అప్పటికే ఇద్దరు కూతుళ్లు. వాళ్ళని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది కూడా. నెల్లాళ్లకే మనసు మార్చుకుని మద్రాసు వచ్చేసింది. సినిమాల్లో చేరిన తొలినాళ్లలోనే పుష్పవల్లితో అనుబంధం ఏర్పడింది. ఇద్దరమ్మాయిలు కలిగిన తర్వాత జరిగిన బ్రేకప్ కూడా పరస్పరాంగీకారంతోనే జరిగిందంటారు నారాయణి. చివరి వరకూ పుష్పవల్లి ఓ స్నేహితురాలిగానే ఉన్నారట. గణేశన్ టాప్ హీరో అయ్యాక మిగిలిన ఇద్దరు టాప్ హీరోలు శివాజీ, ఎంజీఆర్ ఇతనికి పెట్టిన ముద్దుపేరు 'సాంబార్' (వాళ్లిద్దరూ మాంసాహారులు). "నాన్న ఆ పేరుని సరదాగానే తీసుకున్నారు" అన్నారు రచయిత్రి. 

జెమినీ కుటుంబంలోనూ, అతని వ్యక్తిగత జీవితంలోనూ పెద్ద కుదుపు సావిత్రితో జరిగిన బ్రేకప్. ఆ సంఘటన జెమినీ మీద, ఇంటి వాతావరణం మీదా ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో వివరంగా రాశారు తప్ప, ఎవరినీ సమర్ధించలేదు, నిందించనూ లేదు నారాయణి. అత్తగారు, చిన్నత్తగారు, తాను, నలుగురు కూతుళ్లు మాత్రమే ఉన్న ఇంటికి భర్త ఏ వేళలో వస్తాడో, ఏ స్థితిలో వస్తాడో తెలియని పరిస్థితి అలిమేలుకి. "ఒక్కోసారి నాన్న స్నేహితుల ఇళ్లనుంచి అర్ధరాత్రులు ఫోన్లు వచ్చేవి, వచ్చి తీసుకెళ్లమని. తాగి పడిపోయిన ఆ మనిషిని ఎవరు వెళ్లి తీసుకురావాలి?" ఇలాంటివే మరో రెండుమూడు "క్రైసిస్" లు ఉన్నాయి జెమినీ జీవితంలో. వాటి ప్రభావం కుటుంబం మీద గట్టిగానే పడింది. ఇంతకీ నారాయణి, విజయ చాముండేశ్వరి చిన్నప్పుడు ఒకే బడిలో చదువుకున్నారు, స్నేహితులు కూడా. జెమిని ఇంటినుంచి, సావిత్రి ఇంటికి తరచుగా వెళ్లిన రెండో వ్యక్తి  నారాయణే. ఆ విశేషాలు వివరంగానే రాశారు. 

ఒకరోజు స్కూల్ అయిపోయాక నారాయణి తన కారు కోసం ఎదురు చూస్తుంటే క్లాస్ టీచర్ హడావిడిగా వచ్చారు. వస్తూనే "నీకు తెలుసా, మీ నాన్న ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నారు" అన్నారు. "అవును, ప్రతి సినిమా చివర్లోనూ మా నాన్న హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటారు" అన్నారు బాల నారాయణి ప్రివ్యూ షోలు చూసిన అనుభవంతో. ఇలాంటి సరదా విషయాలూ చాలానే ఉన్నాయి పుస్తకంలో. నిజానికి ఇవే పుస్తకాన్ని చివరికంటా ఆసక్తిగా చదివించాయి. అరుదైన ఫోటోలు ఈ పుస్తకాన్ని అదనపు ఆకర్షణ. అయితే, పుస్తకం రెండో సగంలో ఫోటోలో మరీ ఫ్యామిలీ ఆల్బమ్ ని తలపించాయి. "This is by no means a faithful documentation of Gemini Ganesan as a film actor; neither do I claim to offer a critical appraisal of his films. This is the story of growing up with a star as a father, adored and respected by many, and perhaps disliked by a few" అన్న మాటలకి పుస్తకం ఆసాంతమూ కట్టుబడే ఉన్నారు రచయిత్రి. నూటనలభై పేజీల ఈ కాఫీ టేబుల్ పుస్తకం వెల ఎంతో ముద్రించలేదు. ఒక్కో ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద ఒక్కో వెలకి లభిస్తోంది. 

గురువారం, మే 13, 2021

కామోత్సవ్

చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎంతగానో అభిమానించే కవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన నవల 'కామోత్సవ్'. ఆంధ్రజ్యోతి వారపత్రికలో 1987 లో సీరియల్ గా ప్రచురితమైన ఈ నవల అశ్లీల రచనగా ముద్రపడి, కోర్టు కేసుల్ని ఎదుర్కొంది. సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు కేసుని కొట్టేసింది. ఇంతలోనే ఇదే పేరుతో, ఇదే రచయిత పేరుతో మరో రచన అచ్చులోకి వచ్చింది. సాహిత్యంలోనే అరుదైన సంగతి ఇది. ఇన్నేళ్ల తర్వాత శేషేంద్ర ప్రతిని నవలగా అచ్చొత్తించారు ఆయన చిన్న కొడుకు సాత్యకి. అంతే కాదు, శేషేంద్ర తల్లితండ్రులు, భార్యాబిడ్డల విశేషాలను, ఛాయాచిత్రాలతో సహా ప్రచురించారు. శేషేంద్ర రెండో భార్యగా ప్రచారంలో ఉన్న ఇందిరా ధన్రాజ్ గిర్, శేషేంద్రకి ఏరకంగానూ వారసురాలు కాదంటున్నారు సాత్యకి. 

అంతేకాదు, 'కామోత్సవ్' ని "ఈ నవల ఇ.ధ. జీవిత చరిత్ర. ఇ.ధ. అంతరాత్మ కథ" అన్నారు 'వాస్తవాలు' పేరిట రాసిన ముందుమాటలో. (ఆమె పూర్తిపేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదు). ఇందిరే తన అనుచరులచేత ఈ నవలని తిరగరాయించి ప్రచురించిందని ఆరోపించారు కూడా. శేషేంద్ర మరణం తర్వాత వారసత్వపు కోర్టు కేసుల తీర్పు తనకి అనుకూలంగా వచ్చిన సందర్భంలో పత్రికలకు ఇచ్చిన ఇంటర్యూలలో తన తండ్రికి సంబంధించిన చాలా విషయాలని ప్రస్తావించిన సాత్యకి, శేషేంద్ర తనని 'కామోత్సవ్' మీద అభిప్రాయం అడిగినప్పుడు "ఈ రచనకి నవల లక్షణాలేవీ లేవు" అని చెప్పానని జ్ఞాపకం చేసుకున్నారు. కుటుంబం తరపున ప్రారంభించిన గుంటూరు శేషేంద్ర శర్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా శేషేంద్ర రచనలన్నీ పునర్ముద్రిస్తున్న క్రమంలో ఈ ఏడాది మొదట్లో తీసుకొచ్చిన పుస్తకం ఈ 'కామోత్సవ్'. 

'పేజ్ త్రీ పీపుల్' గా వాడుకలో ఉన్న సినిమా నటీనటులు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఉన్నతాధికారుల  వాతావరణంలో సాగే కథ ఇది. డబ్బుని నీళ్లలా ఖర్చుపెడుతూ, పార్టీలివ్వడానికి కారణాలు వెతుక్కునే బాపతు జనమే అంతా. ఈ మందికి కాస్త భిన్నమైన వాడు జ్ఞాన్, ఈ నవలలో కథా నాయకుడు. జ్ఞాన్ చిత్రకారుడు, చదువరి, తాంత్రిక విద్యల్లో ప్రవేశం ఉన్నవాడూను. అతని భార్య కీర్తి ఓ రాజకీయ ప్రముఖుడి పెద్ద కూతురు, హైదరాబాద్ వాసి. జ్ఞాన్ ఓ చిన్న సమస్యలో చిక్కుకోడంతో అతన్ని బొంబాయికి ప్రయాణం చేస్తుంది కీర్తి. అక్కడ వాళ్ళు గడిపే వారం రోజుల జీవితమే ఈ నవల. వాళ్ళు అటెండయ్యే మొదటి పార్టీ వహీదా రహ్మాన్ ఇంట్లో. అది మొదలు ప్రతిరోజూ వాళ్ళకే విసుగొచ్చే అన్ని పార్టీలు. ఆ పార్టీలకి వచ్చే ప్రముఖులందరూ జ్ఞాన్ తో చిత్రకళ గురించీ, కవిత్వం గురించీ చేసే లోతైన చర్చలతో కథ సా...గుతుంది. 

రెండోరోజు ఓ సినీ తార ఇచ్చే పార్టీకి వెళ్తారు జ్ఞాన్, కీర్తి. అవివాహిత అయిన ఆ తార తాంత్రిక ఆరాధన చేస్తుంది. జ్ఞాన్ కి అందులో ప్రవేశం ఉందని తెలియడంతో అతనితో సుదీర్ఘమైన చర్చ చేయడమే కాక, అతనితో కలిసి ఏకాంతంగా తాంత్రిక పూజలో పాల్గొంటుంది. (ఈ రచన మీద 'అశ్లీల' ముద్ర పడడానికి, కోర్టులో కేసు ఫైల్ అవడానికి ఈ సన్నివేశ చిత్రణదే మేజర్ కంట్రిబ్యూషన్). అన్ని వయసుల స్త్రీలకీ జ్ఞాన్ ఇష్టుడు కావడం, వాళ్ళు అతని వెనక పడుతూ ఉండడం కీర్తికి నచ్చదు. అలాగని ఆమె అతన్ని ఏమీ అనలేదు. "నాకున్న ఒకేఒక్క బలహీనత జ్ఞాన్" అంటుందామె. కీర్తి చెల్లెలు తృష్ణ, ఆమె భర్త కుబేర్ తో కలిసి బొంబాయిలోనే ఉంటోంది. కానీ కీర్తి-జ్ఞాన్ లు హోటల్లో దిగుతారు. క్రికెటర్ పటౌడీని ప్రేమించి,  బ్రేకప్ అయిన తృష్ణని ఓదార్చి, కుబేర్ తో పెళ్లి చేసింది కీర్తే. అవ్వడానికి అక్కే కానీ, ఒక తల్లిలా చూసుకుంటుంది తృష్ణని. 

కుబేర్ ఆహ్వానం మేరకు ఒకరోజు తృష్ణ ఇంటికి వెళ్లారు  కీర్తి-జ్ఞాన్. అక్కడ అనుకోని సంఘటనలో జ్ఞాన్ కి దగ్గరవుతుంది తృష్ణ. అటుపైని తృష్ణ తీసుకునే నిర్ణయం, దాని తాలూకు పర్యవసానాలే నవల ముగింపు. జ్ఞాన్ పుట్టుపూర్వోత్తరాల గురించి రచయిత ఎక్కడైనా చెబుతారేమో అని చివరికంటా ఎదురుచూశాను కానీ, ఎక్కడా ఆ ప్రస్తావన తేలేదు. మొత్తం అరిస్ట్రోకటిక్ సెటప్ లో అడుగడుగునా మిస్ఫిట్ గా అనిపించేది జ్ఞాన్ ఒక్కడే. డబ్బు ద్వారా వచ్చే సౌకర్యాలని అనుభవిస్తూనే, వాటి పట్ల వ్యతిరేకత కనబరుస్తూ ఉంటాడతను. పార్టీలని ఒకింత అడ్మిరేషన్ తోనూ, మరికొంత ఉదాసీనత తోనూ పరిశీలిస్తూ గడుపుతాడనిపిస్తుంది. కొన్ని చోట్ల జ్ఞాన్ బహుశా శేషేంద్ర 'ఆల్టర్ ఇగో' అయి ఉండొచ్చు అనిపించింది కూడా. సాత్యకి ముందుమాటని దృష్టిలో పెట్టుకున్నప్పుడు 'ఇ.ధ' కీర్తా, తృష్ణా అన్న ప్రశ్నకి జవాబు దొరకలేదు. 

వృత్తి ప్రవృత్తులతో సంబంధం లేకుండా కథలో ప్రవేశించే ప్రతి పాత్రా కవితాత్మకంగా మాట్లాతుతూ ఉండడంతో చదువుతున్నది నవలో, కవిత్వమో అర్ధం కానీ పరిస్థితి చాలాసార్లే ఎదురైంది.  కవితా పంక్తులన్నీ వేరు చేస్తే ఓ చిన్న సైజు కవిత్వం పుస్తకం వేయొచ్చు. అలాగే జ్ఞాన్ ని నక్సల్ సానుభూతిపరుడిగా చూపడం వల్ల కథకి ఒనగూరిన అదనపు ప్రయోజనం ఏమిటో కూడా అర్ధం కాలేదు. మొత్తం మీద  చూసినప్పుడు 'కామోత్సవ్' ని ఒక నవల అనడం కన్నా, మధ్యతరగతి దృష్టికోణం నుంచి ధనవంతుల జీవితాలలో కొన్ని పార్శ్వాలని వర్ణించే ర్యాండమ్ రైటింగ్స్ అనొచ్చు. అక్కడక్కడా కొంచం విసిగించినా, మొత్తంమీద పూర్తిగా చదివిస్తుంది. మొత్తం 200 పేజీల ఈ పుస్తకం వెల రూ. 200. హైదరాబాద్ నవోదయ ద్వారా ఆన్లైన్ లో లభిస్తోంది. 

సోమవారం, మే 10, 2021

సింహాచలం సంపెంగలు 

మా చిన్నప్పుడు ఇంటి వెనుక కొబ్బరితోట సరిహద్దులో పాముపుట్టకి అటూ ఇటూ మొగలిపొదా, ఆకుసంపెంగ చెట్టూ ఉండేవి. పుట్టలో వృద్ధ నాగరాజు నివాసం ఉంటూ ఉండడంతో పిల్లలకి 'అధికారికంగా' అటువైపు వెళ్లే అవకాశం ఉండేది కాదు. మొగలిపొత్తులు, సంపెంగల వాసన ఆకర్షించకుండా ఉంటుందా? ఆకుసంపెంగలతో పరిచయం అప్పుడు మొదలైంది. సన్నని, దళసరి, ఆకుపచ్చ రేకులు, కాసింత మత్తు కలగలిసిన గాఢమైన వాసనతో ఉండే ఆ పూవులు ఎండిపోయినా కూడా సువాసన నిచ్చేవి, పుస్తకాల పేజీలలో. కాలారా తిరగడం మొదలయ్యాక పరిచయమైనవి సింహాచలం సంపెంగలు. పసుపచ్చని పల్చని రేకలతో ముట్టుకుంటే నలిగిపోయే సుకుమారం, తీయని వాసనా వీటి ప్రత్యేకతలు. నాకీ రెండు రకాల సంపెంగలూ ఇష్టమే కానీ, శ్రీరమణకి సింహాచలం సంపెంగలంటేనే ఇష్టమట అందుకే తన తాజా కథల సంపుటికి 'సింహాచలం సంపెంగలు' అని పేరు పెట్టుకున్నారు. 

కథల్లాంటి అనుభవాలు, అనుభవాల్లాంటి కథలూ మొత్తం కలిపి పదమూడు. అసలు నాస్టాల్జియా అనేసరికి శ్రీరమణ కలం పరవళ్లు తొక్కుతుంది కదా, 'షోడా నాయుడు' సాక్షిగా. కథలన్నింటిలోనూ ఎక్కడో అక్కడ రచయిత తొంగిచూస్తూ ఉంటారు. అసలు పుస్తకానికి శీర్షికగా ఉంచిన 'సింహాచలం సంపెంగలు' కథ శ్రీరమణ స్వానుభవమేనేమో అని అనుమానం వచ్చేస్తుంది కూడా. ఇదో కొత్తపెళ్ళికొడుకు కథ. బరువుగా ఆషాఢం పూర్తయ్యి, బిరబిరా శ్రావణం రాగానే, బొగ్గుల రైలెక్కి అత్తారింటికి బయల్దేరిన కొత్త పెళ్ళికొడుకు, దార్లో సింహాచలం సంపెంగలు పొట్లం కట్టిస్తాడు, భార్యకోసం. ఆ సంపెంగలు, వాటి నిమిత్తం అతగాడాడిన ఓ అబద్ధమూ కథని కొత్త మలుపులు తిప్పేస్తాయి. హాస్యమే కాదు, బోల్డంత వ్యంగ్యం కూడా ఉందీ కథలో. ఈ ఒక్క కథే కాదు, మొత్తం కథలన్నింటిలోనూ హాస్యమూ వ్యంగ్యమూ చీరంచులో జరీపోగుల్లా (ఈ పోలిక రచయితదే, వేరే సందర్భానికి) తళుక్కుమంటాయి. 

అసలు మొదటి కథ 'బైపాస్ సాములోరు' పేరు చూస్తూనే 'అరటిపువ్వు సాములోరు' గుర్తొచ్చేస్తారు. కాకపోతే ఈ బైపాసాయన బహు పాతకాలం వాడు. అప్పుడే ఫోటో కెమెరాలు కొత్తగా ఊళ్లలోకి వచ్చిన రోజుల నాటివాడు. 'ఉత్తమజాతి ఉడుముక్కూడా పట్టు దొరకనంత నున్నగా ఉంది గురువుగారి గుండు' లాంటి చమక్కులకి లోటే లేదు. 'చివ్వరి చరణం' కథ బ్లాగు మిత్రులందరికీ తెలిసిందే. బ్లాగుల స్వర్ణయుగంలో పొడిచిన 'పొద్దు' పత్రికలో చదివిందే కూడా. 'బేడమ్మ' లాంటి కథలు రాయడం, 'అలా మొదలైన నీళ్ల మోత సాగి సాగి, బేడమ్మ తలమీంచి కొసలనుంచి జారిన నీటిచుక్కలతో రోడ్డు వారగా పడిన నీళ్లచార వీధికి అంచుదిద్దినట్టు అయ్యేది' లాంటి వర్ణనలు చేయడం శ్రీరమణకి 'పీచ్మిఠా' తో పెట్టిన విద్య. ఒకప్పుడు ఇలాంటి బేడమ్మలు లేని వీధులూ, ఊళ్ళూ ఉండేవి కాదు. అగ్రహారపు కథల్లో తప్పక కనిపించే పాత్ర ఇది. 

చదువుతూండగానే ఆకట్టేసుకునేదీ, పుస్తకం పక్కన పెట్టాక కూడా ఓ పట్టాన విడిచిపెట్టనిదీ 'గుర్రాల మామయ్య' కథ. ఒక్కమాటలో చెప్పాలంటే మాంచి రుచికరమైన కథ. అసల్నా అనుమానం ఏవిటంటే, ఈ కథలో మావయ్యా అత్తయ్యలు వాళ్లకి ముసలితనం వచ్చాక అప్పదాసు, బుచ్చిలక్ష్మిలుగా పరిణామం చెంది మనందరికీ 'మిథునం' అందించారేమో అని. కాకపోతే ఈకథలో అత్తయ్యకి పలుకే బంగారం, బుచ్చిలక్ష్మేమో నోరు తెరిచినందంటే అప్పదాసుకి పాపం మరి మాట్లాడే అవకాశం ఉండదు. చిన్నప్పటి సర్కస్ జ్ఞాపకాలని కళ్ళముందుకి తెచ్చే కథ 'సింహం చెట్టు'. కథలా కాక, నిజంగా జరిగిన సంఘటనని రికార్డు చేసినట్టుగా ఉంటుంది. అలాగని కథలో పడాల్సిన దినుసులకి లోటు రానివ్వలేదు ఇలాంటిదే ఇంకో కథ 'తాడిచెట్లు పీకే వస్తాద్'. నాకు 'తేనెలో చీమ' లీలగా గుర్తొచ్చింది, పోలికేమీ లేకపోయినా. 

రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఒక పాత్రగా ఉన్న కథలు రెండు. నిజానికి ఇవి నిజ సంఘటనలే. కర్ణాకర్ణిగా విన్నవాటికి కథారూపం ఇచ్చారు రచయిత. 'వెండిగొట్టంలో దానపత్రం అను వరహాపురం అగ్రహారం' కథ శ్రీరమణకి ఏడుతరాల పూర్వుడైన జ్యోతిష్యవేత్త వంకమామిడి దక్షిణామూర్తి శాస్త్రులది కాగా, 'మనిషి పక్షిలా ఎగిరినందుకు..' కథేమో ఊరూరూ తిరుగుతూ సర్కస్ ఫీట్లు చేసే జక్కులకి సంబంధించింది. అడుగడుగునా మలుపులు తిరుగుతూ, ఓ పక్క నవ్విస్తూనే మరోపక్క తర్వాత ఏమవుతుందో అని ఆత్రుతని కలిగించే కథ 'అస్తికలు'. ఈ కథ చదువుతుంటే 'గడించే వాడొకడు, గుడించే వాడొకడు' అనే పాత సామెత గుర్తొచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే దీన్నో రియలెస్టేట్ కథ అనేయొచ్చు. 

బాపూ, రమణ, శ్రీరమణ, గోదారి - కలిపితే 'గోదారి పిలిచింది..' ఇది కథ కేటగిరీలోకి రాదు కానీ, కథలాగే చదివిస్తుంది. చదువుతున్నంతసేపూ నోరూరిస్తుంది. గోదారి మీద లాంచీ మాట్లాడుకుని కథా చర్చలు చేసుకోవడం బాపూ-రమణల అలవాటని 'కోతికొమ్మచ్చి' లో తెలిసింది కదా. అలాంటి కొన్ని కథా చర్చలకు ప్రత్యక్ష సాక్షి అయిన శ్రీరమణ నాటి అనుభవాలని, పెసరప్పడం, దప్పళం, కందట్టు, పుల్లట్టు తదాది రుచుల్నీ తన్మయంగా జ్ఞాపకం చేసుకున్నారు. భోజనానికి ముందు ఈ కథ చదవకండి. 'ఆ చేతులెవరివో' ని కూడా కథ అనలేం, అలాగని అనకుండా ఉండలేం. పుస్తకంలో చివరిదైన 'సర్వనామం' మాత్రం కథ కాదు. ఓ చిన్న వ్యాసం. వీవీఐటీ, నంబూరు, ప్రచురించిన ఈ 109 పేజీల పుస్తకం వెల రూ. 90. నవోదయ బుక్ హౌస్ లో దొరుకుతోంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ 'సింహాచలం సంపెంగలు' తో పాటు 'నవ్వులో శివుడున్నాడురా' అనే కబుర్ల సంపుటి కూడా  విడుదలయ్యింది. 

సోమవారం, మే 03, 2021

అదే కథ ...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుని తన రాజకీయ గురువుగా చెప్పుకుంటూ ఉంటారు. ఎన్ఠీఆర్ మీద అభిమానంతోనే తన కొడుక్కి తారకరామారావు అని పేరు పెట్టుకున్నారు కూడా. అయితే, ఆచరణకి వచ్చేసరికి కొన్ని విషయాల్లో ఆయన తెలుగు దేశం పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పద్ధతుల్ని అనుసరిస్తున్నారేమో అనిపిస్తోంది. రాజకీయాలలో కూరిమి విరసంబైనప్పుడు ఇదే కేసీఆర్ ఇదే చంద్రబాబుని 'డర్టీయెస్ట్ పొలిటిషన్ ఇన్ ఇండియా' అని అని ఉండొచ్చు గాక, రాజకీయ చాణక్యంలో - కనీసం కొన్ని విషయాల్లో అయినా - చంద్రబాబు నాయుణ్ణి అనుసరిస్తున్నారన్న భావన రోజురోజుకీ బలపడుతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ని పదవీచ్యుతుణ్ణి చేసిన ప్రస్తుత సందర్భంలో. 

కారణాంతరాల వల్ల తనకి ఇష్టం లేని నాయకుల్ని పదవి నుంచి తొలగించడానికి, అధికారులని ఉన్నత పదవులలోకి రాకుండా చేయడానికీ చంద్రబాబు నాయుడు దాదాపు రెండు దశాబ్దాల క్రితమే అమలు చేసిన వ్యూహాలనే ఇప్పుడు కేసీఆర్ రాజేందర్ విషయంలో అమలు చేస్తున్నారనిపిస్తోంది. పందొమ్మిదేళ్ళ క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాటి కేబినెట్లో నేటి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా ఉన్నారు. కారణాలు పైకి రాలేదు కానీ, ముఖ్యమంత్రికి-మంత్రికి కుదరాల్సినంతగా సఖ్యత కుదరలేదు. ఫలితంగా ఒకరోజు ముఖ్యమంత్రి ఒద్దికలో ఉండే ఓ పత్రికలో పంచాయతీ రాజ్ శాఖలో పెద్దఎత్తున అవినీతి జరిగిందంటూ ముఖ్యవార్త. పంచాయతీ ఆఫీసులకి అవసరమైన స్టేషనరీ కొనుగోలులో నిధుల గోల్ మాల్ జరిగిందన్నది కథనం. 

క్రమశిక్షణకు మారుపేరుగా పేరుతెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వం ముందుగా మంత్రి రాజీనామాకి, అటుపైన జరిగిన అవినీతిపై విచారణకి ఆదేశాలిచ్చింది. ఒక్క వార్తాకథనంతో మంత్రిగారి పదవి పోయింది. అటుపై చాలారోజుల పాటు విచారణ సా...గి, రిపోర్టులో తేల్చిందేమిటంటే అవినీతిలో మంత్రి పాత్ర లేదని!! కొంచం అటూ ఇటూగా ఇదే సమయంలోనే ఇలాంటి అనుభవమే ఓ ఉన్నతాధికారికీ ఎదురయ్యింది. తెల్లారి లేస్తే ప్రభుత్వంలో ముఖ్యమైన పోస్టుకు ప్రమోషన్ ఉత్తర్వులు అందుకోవాలి. కానీ ఎక్కడో ఏదో ఈక్వేషన్ తేడా కొట్టింది. ఫలితం, ఉత్తర్వులు అందుకోడానికి కొన్ని గంటల ముందుగా  - మళ్ళీ ఒద్దికలో ఉన్న పత్రికే - ఓ భారీ భూ కుంభకోణాన్ని బద్దలు కొట్టింది. ఆ కుంభకోణపు తీగని ఈ అధికారికి ముడిపెట్టింది. క్రమశిక్షణకి మారుపేరైన ప్రభుత్వం ప్రమోషన్ ఆపేసింది!! ఆ ఆరోపణల మీద విచారణ ఇంకా కొనసాగుతోందో, మధ్యలో అటకెక్కిందో మరి. 

కాలం మారింది. రెండు దశాబ్దాల కాలం చాలా మార్పుల్ని తోడు తెచ్చుకుంది. చంద్రబాబు నాయుడికి ఒద్దికలో ఉన్న పత్రికలు సాయం చేసిపెడితే, కేసీఆర్ చేతుల్లో సొంత మీడియానే ఉంది. సొంత చానళ్ళు పేపర్లతో పాటు, అనుకూల చానళ్ళు, పత్రికలూ మూకుమ్మడిగా రాజేందర్ వ్యతిరేక కథనాలు కూడబలుక్కున్నట్టు ఒకేసారి ప్రసారం చేశాయి. కథనాలు రావడమే తరువాయిగా విచారణ, వెంటనే మంత్రిత్వ శాఖ ఉపసంహరణ, ఆ వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్. పరిణామాలన్నీ శరవేగంతో జరిగిపోయాయి. రాత్రికి రాత్రే రాజేందర్ 'మాజీ మంత్రి' అయిపోయారు. ఈసారి ఆరోపణ భూ ఆక్రమణ. నిజానికి ఇది చాలా మందిమీద వచ్చిన చాలా పాత ఆరోపణ. తెలంగాణ రాష్ట్రం రాగానే ముందుగా దృష్టిపెడతామని ఉద్యమకాలంలో కేసీఆర్ హెచ్చరించిన ఆరోపణ. 'లక్ష నాగళ్ళ' తో ఆక్రమణల్ని దున్నే కార్యక్రమాన్ని సొంత మంత్రివర్గ సహచరుడితో మొదలు పెట్టారనుకోవాలా? 

రాజేందర్ పై తీసుకున్న 'క్రమశిక్షణ చర్య' గడిచిన రెండు దశాబ్దాల్లో మన చుట్టూ వచ్చిన అనేక మార్పులని పరిశీలించే అవకాశం ఇస్తోంది మనకి. నాటితో పోలిస్తే నేడు ప్రత్యామ్నాయ మీడియా, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా బలపడ్డాయి. ప్రసార సాధనాలు వర్గాలుగా విడిపోవడం వల్ల ప్రతి విషయం తాలూకు బొమ్మనీ, బొరుసునీ తెలుసుకోగలుగుతున్నాం. ఇరుపక్షాల వాదనలనీ వినగలుగుతున్నాం. సోషల్ మీడియా ద్వారా మన అభిప్రాయాలనూ చెప్పగలుగుతున్నాం. వీటి ఫలితమే రాజేందర్ కి దొరుకుతున్న మద్దతు. జరిగింది కేవలం క్రమశిక్షణ చర్య మాత్రమే కాదన్న సంగతి జనబాహుళ్యం అర్ధం చేసుకోగలిగింది. కేవలం పత్రికలు, టీవీల్లో వచ్చింది మాత్రమే నమ్మేసి, అభిప్రాయాలు ఏర్పరుచుకోకుండా, విషయాన్ని మొత్తంగా తెలుసుకుని, విశ్లేషించుకుని ఓ అభిప్రాయానికి రావడానికి వీలవుతుంది. చంద్రబాబు నాయుడు రాజకీయపుటెత్తుగడల్లో కేసీఆర్ ఇంకా ఏమేమి వాటిని అనుసరిస్తారో రాబోయే రోజుల్లో చూడాలి.

ఆదివారం, మే 02, 2021

ఐనా, ఫలం దక్కలేదు ...

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి 'కరోనా' కలిసిరాలేదు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారిని లెక్కచేయకుండా ఎదురెళ్ళిన రెండు సందర్భాలలోనూ వ్యతిరేక ఫలితమే వచ్చింది. ఈ ఎదుర్కోలు ఫలితంగా దేశం తీవ్రమైన ప్రాణ నష్టాన్ని, ఆర్ధిక కష్టాలని అనుభవించింది, అనుభవిస్తోంది. నిజానికి ఈ కష్టనష్టాలని భరిస్తున్నవాళ్ళు దేశంలోని పేదలు, మధ్యతరగతి వాళ్ళూను. ఈ కష్టకాలంలో సామాన్యుల మీద పన్నుల భారం దాదాపు రెట్టింపవ్వగా, సంపన్నుల సంపదలు సైతం అదే వేగంతో రెట్టింపు కావడం ప్రపంచం మొత్తం పరిశీలిస్తున్న విషాదం. దేశంలో కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడం, చివరికి పాకిస్తాన్, నేపాల్ లాంటి దేశాలు కూడా భారత్ మీద ట్రావెల్ బ్యాన్ విధించడం అంతకు మించిన విషాదం. అతలాకుతలమైన పరిస్థితులన్నీ ఎప్పటికి అదుపులోకి వస్తాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. 

గత ఏడాది ఫిబ్రవరి మాసాంతం.. అప్పటికే కొన్ని దేశాలకి కరోనా తన తీవ్రతని రుచి చూపించింది. పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. నూటముప్ఫయ్ కోట్లకి పైగా జనాభా ఉన్న, జనసాంద్రత అధికంగా ఉన్న భారతదేశంలోని అధికార యంత్రాంగం మాత్రం అమెరికా కి నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగత సత్కారాలకి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై ఉంది. నిజానికి ఈ 'నమస్తే ట్రంప్' కార్యక్రమం అంతకు నాలుగు నెలల క్రితమే భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికాలో 'హౌడీ మోడీ' పేరిట జరిగిన సత్కారానికి కృతజ్ఞత ప్రకటించడం. రాబోయే అమెరికా ఎన్నికల్లో ట్రంప్ మళ్ళీ విజయ దుందుభి మోగించబోతున్నాడనీ, మోడీ-ట్రంప్ ల మధ్య స్నేహం బలపడడం వల్ల భారతదేశం మళ్ళీ వెలిగిపోతుందనీ ప్రచారం హోరెత్తింది. 

'నమస్తే ట్రంప్' ని విజయవంతంగా పూర్తిచేసి, యంత్రాంగం మళ్ళీ ప్రజల మీద దృష్టి సారించే నాటికి దేశంలో కరోనా పడగ విప్పింది. లాక్ డౌన్ ప్రకటనతో లక్షలాది మంది వలస కార్మికులు వేలాది కిలోమీటర్లు కాలినడకన స్వస్థలాలకు ప్రయాణం అయ్యారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం పిండిన పన్నులకీ, విదిల్చిన సాయానికి పొంతనే లేదు. చమురు ధరల పెరుగుదల ఒక్కటి చాలు, ప్రభుత్వ పన్ను విధానం జనజీవితాన్ని ఎంతగా అతలాకుతలం చేసిందో చెప్పడానికి. నిజానికి కాస్త ముందుగా మేల్కొని, అంతర్జాతీయ ప్రయాణికుల మీద ఆంక్షలు పెట్టి, విదేశాల నుంచి వచ్చిన వాళ్లందరినీ తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉంచడం లాంటి చర్యలు కూడా తీసుకుని ఉంటే లాక్ డౌన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. సరే, ఎంత ప్రభుత్వమే అయినా ఇంతటి విపత్తుని ఊహించలేదు కదా. తీరా అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలవ్వడం, బైడెన్ ప్రభుత్వంతో భారత్ సంబంధాల విషయంలో ఒక స్పష్టత లేని అయోమయం కొనసాగుతూ ఉండడం నడుస్తున్న చరిత్ర. 

ఒకసారి దెబ్బతిన్నాక, రెండోసారి జాగ్రత్త పడడం అందరూ చేసే  పని. దురదృష్టవశాత్తూ మనదేశంలో అలా జరగలేదు. ఈ ఏడాది తొలినాటికి కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టే కనిపించాయి. కానీ, కరోనాకి దెబ్బతిన్న దేశాలన్నీ అప్పటికే సెకండ్ వేవ్ దెబ్బని రుచిచూసి ఉన్నాయి. కొన్ని దేశాలైతే ప్రాప్తకాలజ్ఞతతో ముందస్తు ఏర్పాట్లు చేసుకుని వైద్య రంగాన్ని బలపరుచుకున్నాయి. వాక్సిన్ మార్కెట్లోకి వస్తే చాలు, మన దేశంలో మ్యాన్ పవర్ కి, నెట్వర్క్ కి కొరత లేదు కాబట్టి అతి త్వరలోనే అందరికీ వాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందని నా బోట్లం ఆశించాము. ఇప్పటికే, పోలియో నిర్మూలన వాక్సినేషన్లో దేశానికి ఒక రికార్డు ఉంది కదా. మన ఫార్మా కంపెనీల గత చరిత్ర కూడా ఘనమైనదే. అభివృద్ధి చెందిన దేశాలకే ఔషధాలు, వాక్సిన్లు సప్లై చేసిన కంపెనీలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఫార్ములా చేతికొస్తే తయారీ, రవాణా ఇబ్బందులు కూడా ఉండబోవనుకున్నాం. 

తీరా వాక్సిన్ మార్కెట్లోకి వచ్చేసరికి ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముంచుకొచ్చాయి. నాటి పురాణ పురుషులు అశ్వమేధాది యాగాలు చేసి రాజ్య విస్తరణ చేసినట్టుగా, ఎన్నికల్లో రాష్ట్రాలని గెలవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంటుంది కదా. అయితే, నాటి పురాణ పురుషులు కరువు కాటకాలప్పుడు, విపత్తులతో ప్రజలు అల్లాడుతున్నప్పుడు రాజ్యవిస్తరణ మీద దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. కానీ,  ప్రజాస్వామ్యంలో అలాంటి శషభిషలు పనికి రావు మరి. దేశీయంగా వాక్సిన్ తయారీ, పంపిణీ లాంటి విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన వ్యక్తులు, కీలకమైన సమయంలో ఎన్నికల ప్రచార బాధ్యతల్లో తలమునకలయ్యారు. అన్నీ బాగున్న రోజుల్లో వర్చువల్ సభలు నిర్వహించి టెక్నోక్రాట్ ఇమేజీకోసం తాపత్రయ పడిన వాళ్ళు, కరోనా కాలంలో నేరుగా సభలు నిర్వహించి బలప్రదర్శనలు చేశారు. 

ఐదు రాష్ట్రాలని, మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ని ఏకఛత్రం కిందికి తీసుకు రాడానికి చేయని ప్రయత్నాలు లేవు, తొక్కని దారులు లేవు, పణంగా పెట్టనివీ లేవు. సుదీర్ఘమైన ఎన్నికల క్రతువు పూర్తయ్యేసరికి దేశంలో పరిస్థితులు పూర్తిగా చేయిదాటిపోయాయి. ఆక్సిజన్ సిలిండర్లకి మాత్రమే కాదు, శ్మశానాలలో కట్టెలకీ కరువొచ్చింది. వాక్సిన్ కి మాత్రమే కాదు, వ్యాధితో పోరాడుతున్న వాళ్ళని రక్షించే ఇంజక్షన్లకీ 'నో స్టాక్' బోర్డులు వేలాడుతున్నాయి. పరిస్థితులు విషమించేసరికి కేంద్రానికి రాష్ట్రాలు అనేవి ఉన్నాయని గుర్తొచ్చింది. బ్లేమ్ గేమ్ మొదలయ్యింది. పార్టీకి అధ్యక్షుడు వేరే ఉన్నా, పనులన్నీ మానుకుని మరీ ప్రధాని స్థాయి వ్యక్తి పదుల సంఖ్యలో పబ్లిక్ మీటింగులు పెట్టినా పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కలేదు. పార్టీ బలం బాగా పెరిగింది అని అభిమానులు గర్వంగా ప్రచారం చేసుకుంటున్నారు కానీ, అందుకుగాను జరిగిన ఖర్చు దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన అన్ని ప్రాణాలూ అనే వాస్తవాన్ని విస్మరిస్తూ ఉండడం విషాదాల్లోకెల్లా విషాదం..