శనివారం, సెప్టెంబర్ 26, 2020

బాలూ

తనకి కరోనా పాజిటివ్ వచ్చిందనీ, ముందు జాగ్రత్త కోసం ఆస్పత్రిలో చేరుతున్నాననీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సెల్ఫీ వీడియో విడుదల చేసినప్పుడు, "ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చేస్తే ఇక పాడుతా తీయగా, స్వరాభిషేకం ప్రోగ్రాం షూటింగులు పెట్టేసుకుంటారు కాబోలు" అనుకున్నాను. వైద్యం అలా కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా అదే నమ్మకం, "ఇవాళ కాకపోతే రేపు.. 'నా ఆరోగ్యం కోసం ప్రార్ధించిన మీ అందరికీ అనేక నమస్కారాలు' అంటూ టీవీలో కనిపించేస్తాడు" అనుకున్నా. కోలుకుంటున్న కబురులు వినిపిస్తూనే, ఉన్నట్టుండి పరిస్థితి విషమం అనీ, అటుపైన 'ఇకలేరు' అనీ చెప్పేశారు హాస్పిటల్ వాళ్ళు. వాళ్ళు చెప్పే వరకూ కూడా ఆగకుండా సోషల్ మీడియాలో నివాళులు హోరెత్తడం మొదలుపెట్టేశాయి. నివాళులు అర్పించడంలో మనమే ముందుండాలనే సోషల్ మీడియా రష్ బాలూని కొన్ని గంటల ముందుగానే స్వర్గస్తుణ్ణి చేసేసింది. ఇది విషాదంలోని మరో విషాదం. 

బాలూ అంటే నాకు మా ఇంట్లో ఉండే కరెంట్ రేడియో. తర్వాతి కాలంలో విరివిగా వచ్చిన పోర్టబుల్ టీవీ సైజులో ఉండే ఆ రేడియోలోనే బాలూ పేరుని, పాటని మొదటగా వినడం. అరుదుగా పత్రికల్లో ఇంటర్యూలు వచ్చేవి. తను కాస్త బొద్దుగా మారిన రోజుల్లో ఓ కాలేజీ అమ్మాయి తన దగ్గరికి వచ్చి 'లవ్ బాలూ' అందనీ, తనేమో 'లవ్ బాలూ కాదమ్మా లావు బాలూ' అన్నాననీ చెప్పిన ఇంటర్యూ బాగా గుర్తుండిపోయింది. సినిమాల్లో అడపాదడపా వేషాలు, డబ్బింగులు ఇవన్నీ ఓ వైపైతే పాతికేళ్ల క్రితం మొదలైన ప్రయివేటు తెలుగు చానళ్ళు, వాటిల్లో తరచుగా కనిపిస్తూ, పాడుతూ, మాట్లాడుతూ ఉండే బాలూ మరోవైపు. ఘంటసాల తర్వాతి తరంలో వచ్చిన పాటల్లో నూటికి తొంభై బాలూవే అవ్వడం వల్ల కూడా కావొచ్చు, వైవిధ్యంగా ఉండే జేసుదాసు గొంతు నాకు అభిమాన పాత్రమయ్యింది. దీనర్ధం బాలూ పాట ఇష్టం లేదని కాదు. అసలు బాలూ పాటని ఇష్టపడకుండా ఉండడం సాధ్యపడదేమో కూడా. 

టీవీ చానళ్ళు-బాలూ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది 'పాడుతా తీయగా' కార్యక్రమం. నేను టీవీ తెరమీద బాలూని దగ్గరగా గమనించింది మాత్రం అదే సమయంలో జరిగిన ఓ సినిమా కార్యక్రమంలో. అందరూ చిన్న పిల్లలతో ఎమ్మెస్ రెడ్డి మల్లెమాల పతాకం మీద నిర్మించిన 'రామాయణం'  (జూనియర్ ఎన్ఠీఆర్ మొదటి సినిమా) చిత్రాన్ని ప్రమోట్ చేయడం కోసం బాల నటీనటులతో  జెమినీలో ఓ ఇంటర్యూ వచ్చింది. ఆశ్చర్యంగా, ఆ ఇంటర్యూ నిర్వహించింది బాలూనే. రాముడి పాత్ర కాకుండా నీకు ఇష్టమైన ఇంకో పాత్ర ఏమిటి అని బాలూ అడిగినప్పుడు, 'రావణాసురుడు'  అని జూనియర్ చెప్పడమూ, "మీ తాతయ్యకి కూడా రావణబ్రహ్మ పాత్రంటే చాలా ఇష్టమయ్యా" అంటూ బాలూ నవ్వడమూ అలా గుర్తుండిపోయాయి. నావరకూ, బాలూ నవ్వు అంటే ఇప్పటికీ ఆ క్షణంలో  నవ్విన నవ్వే.

(Google Image)
అదే సమయంలో, అదే ఛానల్ కోసం చేసిన ఓ సరదా కార్యక్రమంలో (ఓ హిట్ పాట ట్యూన్ లో మరో హిట్ పాటని అప్పటికప్పుడు ప్రేక్షకుల ఫోన్ కోరిక మేరకు పాడడం) 'శంకరా.. నాద శరీరా పరా' ని వేరే ట్యూన్ లో పాడినప్పుడు 'ఇలా చేయకుండా ఉంటే బాగుండేది' అనిపించింది. రానురానూ టీవీలో బాలూ కనిపించడం పెరిగే కొద్దీ ఈ 'ఇలా చేయకుండా ఉంటే బాగుండేది' జాబితా కూడా పెరుగుతూ వచ్చింది. పాట ట్యూన్ లో కిట్టింపులు చేయడం నన్ను బాగా ఇబ్బంది పెట్టిన విషయం (సినిమాలో పాడినట్టు కాకుండా కొంత మార్పు చేయడం -  తగినంత ప్రాక్టీసు లేకనా లేక కావాలని చేస్తూ వచ్చిందా అన్నది ఇప్పటికీ సందేహమే). అలాంటి సందర్భాల్లో కో-సింగర్ల ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తూ ఉండేది మొదట్లో (రానురాను వాళ్ళూ అలవాటు పడిపోయారు). 

తను వేలల్లో పాటలు పాడిన కాలంలో పదుల సంఖ్యలో మాత్రమే పాటలు పాడిన గాయకుల్ని 'పాడుతా తీయగా' కి అతిధులుగా పిలిచి, వాళ్ళు పాడిన ఆ కొన్ని పాటలూ కూడా తను మిస్ అయినందుకు వాళ్ళ సమక్షంలోనే బాధ పడడం ("ఇంకానా బాలూ? ఇంకా ఎన్ని పాటలు పాడాలి? ఇంకెవరూ పాడకూడదా?"), రెండు మూడు సినిమాల్లో హీరో వేషాలు వేసి తర్వాత అవకాశాల కోసం తిరుగుతున్న వాళ్ళని అతిధులుగా పిలిచి "అందరు హీరోలకీ పాడాను. మీకూ పాడాలని ఉంది, కనీసం ఒక్క పాట" అని కోరడం (మాడెస్టీ అని తను అనుకుని ఉండొచ్చు గాక) లాంటివి చూసినప్పుడు 'అబ్బా' అనిపించడం - వీటితో పాటు మరికొన్ని కారణాల వల్ల ఆ ప్రోగ్రాం మీదే ఆసక్తి సన్నగిల్లింది. - మాత్రమే కాదు, "అసలు బాలూ టీవీలో కనిపించకుండా ఉంటే బాగుండేదేమో" అనిపించేది. నిజానికి 'పాడుతా తీయగా' 'పాడాలని ఉంది' లాంటి కార్యక్రమాలు ఎందరికో ప్లాట్ఫార్మ్ ని, కెరీర్నీ ఇచ్చాయి. 

బాలూ తనని తాను కొంచం ఎక్కువగా ఆవిష్కరించుకున్న కార్యక్రమం 'మా' టీవీ కోసం ఝాన్సీ చేసిన 'పెళ్లి పుస్తకం.' ఆసాంతమూ ఆసక్తిగా సాగే ఆ కార్యక్రమం చివర్లో, "మేం చాలా నిజాయితీగా మాట్లాడాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే అన్ని జంటలూ ఇలాగే నిజాయితీగా మాట్లాడాలి" అని సందేశం ఇవ్వడం బాలూ మార్కు చమక్కు. తను అడపాదడపా మాత్రమే తెరమీద కనిపించే రోజుల్లో బాలూ ఎలా చేశాడో చూడడం కోసం 'ఓపాపా లాలి' లాంటి సినిమాలకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి కానీ, టీవీలో తరచూ కనిపించడం బాగా పెరిగిన కాలంలో వచ్చిన 'మిథునం' నాటికి మాత్రం బాలూ ఎలా చేశాడన్న కుతూహలం కన్నా, సినిమా ఎలా తీసి ఉంటారన్న ఆసక్తే ఎక్కువైంది. (తెలియకుండానే తన నటన మీద ఓ అంచనా వచ్చేసిందేమో బహుశా). బాలూని నాలుగడుగుల దూరం నుంచీ చూసిన సందర్భాలు నాలుగైదు ఉన్నాయి కానీ, ఒక్కసారి కూడా దగ్గరకి వెళ్లి పలకరించాలనిపించలేదు - బహుశా టీవీ వల్లే. 

కొన్నాళ్ల క్రితం నేనూ, నా మలయాళీ మిత్రుడూ సినిమా పాటల గురించి ఇంగ్లీష్లో  మాట్లాడుకుంటున్నాం. జేసుదాస్, విజయ్ ఏసుదాస్ పాటల గురించి నేనూ, 'ఎస్పీబీ సర్' పాటల్ని గురించి తనూ. "హీ ఈజ్ వెరీ హంబుల్. డౌన్ టు ఎర్త్..." అంటూ చాలా సేపు మాట్లాడాడు. నేను 'బాలూ' అని రిఫర్ చేస్తే, కాసేఫు తెలుగులో బాలూ అనే ఇంకో గాయకుడు ఉన్నాడనుకుని పొరబడ్డాడు తను. 'బాలూ, ఎస్పీబీ సర్ ఒక్కరే' అని నేను చెప్పినప్పటి తన రియాక్షన్ ఇప్పటికీ గుర్తే. "హౌ కెన్ యు కాల్ హిం బాలూ?" అంటూ తగువేసుకున్నాడు. ఏళ్లతరబడి మన జీవితంలో ఓ భాగమైపోయిన వాళ్ళని ఇంకెలా పిలుస్తాం? అదే విషయం చెప్పడానికి ప్రయత్నించా. 'ఎస్పీబీ సర్' ని ఒక్కసారైనా కలవాలన్న నా మిత్రుడి కోరిక తీరకుండానే, కరోనా మహమ్మారి బాలూని బలి తీసుకుంది.  'నీవు లేవు నీ పాట ఉంది' అంటూ ఏనాడో కవికుల తిలకుడు దేవరకొండ బాలగంగాధర తిలక్ చెప్పిన కవితా వాక్యం బాలూ విషయంలో అక్షర సత్యం. బాలూ పాట ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది.   

సోమవారం, సెప్టెంబర్ 21, 2020

పూర్ణమూ... నిరంతరమూ...

శ్రీకాళహస్తి కి చెందిన జర్నలిస్టు, కథకుడు సురేష్ పిళ్లె రాసిన పందొమ్మిది కథలతో వెలువడిన సంకలనం 'పూర్ణమూ... నిరంతరమూ... ' మూడు దశాబ్దాలకి పైగా రచనా వ్యాసంగాన్ని నిర్వహించాక ఒకేసారి రెండు కథాసంపుటాలు, ఒక నవలా వెలువరించారు సురేష్. వాటిలో ఇది తొలి సంకలనం. జర్నలిస్టు రాసిన కథలు కావడంతో సహజంగానే బోల్డంత వస్తు వైవిధ్యం కనిపించింది. పేపరు భాష అస్సలు కనిపించకపోవడం హాయిగా అనిపించింది. ఎక్కువ కథలకి కథాస్థలం కాలాస్త్రిగా, కొన్నింటికి హైదరాబాదు, ఒకట్రెండు కథలకి అమెరికా మరియు ఒకే ఒక్క కథకి తూర్పు గోదావరి. కథాస్థలానికి వెళ్లడంలో పాఠకులకి ఎలాంటి కష్టమూ లేకుండా, వేలుపట్టి తీసుకుపోయారు రచయిత. చుట్టూ జరిగే విషయాల తాలూకు పరిశీలన, కొంత తాత్వికత, మరికొంత వ్యంగ్యం కలగలిపిన కథలివి. 

కోతినుంచి మనిషి పుట్టాడనే పరిణామ సిద్ధాంతం కేవలం శారీరక నిర్మాణానికేననీ, ఒక్కో తరమూ జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్లడం అన్నివేళలా సాధ్యపడకపోగా ఒక్కోసారి తిరోగమించే తరాలూ పుట్టుకు రావచ్చునని చెప్పే కథ '2.0', సంపుటిలో ఇదే మొదటి కథ. జ్ఞానాన్ని మాత్రమే నమ్ముకున్న వేంకటేశ్వరుడి కడుపున పుట్టినా, ఆ జ్ఞానం జోలికి వెళ్లని అవధాన్ల పరమేశ్వరుడి కథ ఇది.  నాస్తికత్వం- ఆస్తికత్వాలని రచయిత చర్చకి పెట్టలేదు కానీ, నాస్తికుల కడుపున పుట్టిన పరమభక్తులు గుర్తొస్తారు ఈ కథ చదువుతూ ఉంటే. ఆదర్శానికి-ఆచరణకి మధ్య జరిగే సంఘర్షణని 'ఆరోజు' చెబితే, దైవదర్శనాంతరపు ఓ భక్తురాలి మానసిక స్థితిని 'ఇక్కడే ఉన్నాడేమిటీ?' కథ వర్ణిస్తుంది. దాదాపు ఇరవయ్యేళ్ళ క్రితం రాసిన 'కొత్త చెల్లెలు' కథలో పాయింట్ ఆ తర్వాత వచ్చిన అనేక ఫ్యాక్షన్ సినిమాల్లో వాడుకోబడింది. 


'రూట్స్' నవల (తెలుగు అనువాదం 'ఏడు తరాలు') చదివిన వాళ్ళకి మరింతగా నచ్చేసే కథ 'ఈగ'.  ఆఫ్రికన్ పాత్రలతో అమెరికాలో కథ నడిపినా, నాకెందుకో మన సమాజపు కథనే  ప్రతీకాత్మకంగా చెబుతున్నట్టుగా అనిపించింది. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకి సిద్ధ పడిన ఓ స్త్రీ కథ 'తోటకాడ బావి'. దీనిని స్త్రీవాద కథ అనొచ్చు. రైతు ఆత్మహత్య ఇతివృత్తంగా రాసిన కథ 'నా నూకలు మిగిలే ఉన్నాయి' నాస్టాల్జియా కథలా అనిపించే 'పశువుల కొట్టం' కథలో ఓ సన్నివేశం కొన్నేళ్ల క్రితం మా ఇంట్లో జరగడమూ, ఆ కథ ముగింపులో 'పెద్దక్క' పాత్ర మాట్లాడిన మాటల్నే ఇంచుమించుగా అప్పుడు నేనూ మాట్లాడి ఉండడమూ నా వరకూ ఓ విశేషం (అప్పటికే ఈ కథ పత్రికలో అచ్చయింది కానీ, నేను ఇప్పుడే చదివాను). మూన్నాలుగేళ్ల క్రితం నిత్యం వార్తల్లో నలిగిన విజయవాడ కాల్ మనీ లాంటి ఇతివృత్తంతో తూర్పుగోదావరి నేపధ్యంగా రాసిన కథ 'వరాలత్త గాజులు.' వరాలత్త లాంటి స్త్రీలు నాక్కూడా తెలుసు కాబట్టి  ఈ కథని కల్పితం అనుకోలేను. 

కెమెరా కంటితో చూసి రాసినట్టుగా అనిపించే కథ 'ఆ 5 నిమిషాలు.'  మన చుట్టూ జరిగిన, జరుగుతున్న కథలో మనకి బాగా తెలియని అంశం ఇతివృత్తం. అమెరికాలో బాగా సంపాదించి అటుపై తెలుగు నేల మీద రాజకీయ ప్రవేశం చేసి, ఎమ్మెల్యే కావాలని కలగన్న ఓ ఎన్నారై కథ 'పులినెక్కిన గొర్రె.' రచయిత ఒక్క గొర్రెని గురించే చెప్పినా, నిత్యం వార్తలను ఫాలో అయ్యే వాళ్ళకి మరికొన్ని 'గొర్రెలు' గుర్తు రాక మానవు. వాటిపట్ల సానుభూతి కలిగించేలా రాశారీ కథని. స్త్రీ గొంతుతో వినిపించిన పురుషుల కథ 'మా ఆయన అపరిచితుడు.'  సంకలనానికి శీర్షికగా ఉంచిన 'పూర్ణమూ... నిరంతరమూ...' తో పాటు, 'అనాది అనంతం' 'గార్డు వినాయకం భజే' కథల్ని గురించి నా బ్లాగు తొలిరోజుల్లో ఓ టపా రాశాను. ఈ కథా సంకలనం చివర్లో ఆ టపాకి చోటిచ్చారు రచయిత. థాంక్యూ సురేష్ పిళ్లె గారూ. 


నాకు ఎక్కువగా నచ్చేసిన కథలు 'గడ్డి బొగ్గులు' 'తపసుమాను' 'పేరు తెలియని ఆమె' 'రుచుల జాడ వేరు.' మొత్తం కథా సంకలనంలో లాగే ఈ నాలుగింటిలో కూడా ఏ రెండు కథలకీ పోలిక లేదు. 'గడ్డిబొగ్గులు' లో ఇస్మాయిల్ ని తలచుకోగానే చెరుకురసం మిషన్ నుంచి బయటికి వచ్చే పిప్పి జ్ఞాపకం వస్తుంది. చిత్తూరు జిల్లాకి మాత్రమే ప్రత్యేకమైన 'భారతాలు' ఇతివృత్తంగా రాసిన 'తపసుమాను' ఆ జిల్లాలో నేను స్వయంగా తెలుసుకున్న స్థానిక సాంస్కృతిక విషయాన్ని చెప్పింది. హైవేని బతుకుతెరువుగా చేసుకున్న 'పేరుతెలియని ఆమె' కథలో ముగింపు వెంటాడుతుంది. గత కొంతకాలంగా స్థాయీ ప్రదర్శనగా మారిపోయిన పూర్వ విద్యార్థుల కలయిక ఇతివృత్తంగా సాగే 'రుచుల జాడ వేరు' లో రచయిత జీవన వైరుధ్యాల్ని పట్టుకున్న తీరు ఇట్టే ఆకర్షిస్తుంది. నావరకూ, వెంటాడుతున్న కథలివి. 

"ద్రౌపతమ్మ  అగ్నిగుండాం తొక్కినట్టుగా భారతంలో యేడుండాదో మాకు దెలవదు. మా తిరనాల్లలో మాత్రం అదే ఆచారం" ('తపసుమాను'), "దేవుడు విటుడిగా వస్తే ఇలాగే ఉంటాడేమో అనిపించింది నాకు" ('పేరు తెలియని ఆమె'), "ఆయన అనే వాడికీ అన్నయ్యకీ అక్షరాల అమరికలో ఒకింత తేడా తప్ప భేదం ఏమీ ఉన్నట్టు అనిపించలేదు నాకు" ('తోటకాడ బావి'), "ఎన్ని గడ్డిపరకలు కాలిస్తే బొగ్గులవుతాయ్?" ('గడ్డి బొగ్గులు) లాంటి వాక్యాలు, చదువుకుంటూ వెళ్లిపోకుండా ఆపి ఆలోచనలో పడేస్తాయి.  ద్రౌపతమ్మ  అగ్నిగుండం ప్రశ్నయితే, గురజాడ 'మీ పేరేమిటి?' కథలో రాసిన "ఈ దేశంలో పాండవులు ఉండని గుహలూ, సీతమ్మవారు స్నానమాడని గుంటలూ లేవు" వాక్యాన్ని గుర్తు చేసింది. మధురాంతకం నరేంద్ర రాసిన ముందుమాట కథల నేపధ్యాన్ని వివరిస్తే, సురేష్ పిళ్లె రాసుకున్న 'న వినుతి.. నా వినతి' రచయిత నేపధ్యాన్ని చెబుతుంది. ఆదర్శిని మీడియా ప్రచురించిన ఈ పుస్తకం, పుస్తకాల షాపులతో పాటు అమెజాన్ లో దొరుకుతోంది. (పేజీలు 200, వెల రూ. 200). 

మంగళవారం, సెప్టెంబర్ 08, 2020

జయప్రకాశ్ రెడ్డి

ఓ సినిమాలో వేసిన ఓ పాత్ర ప్రేక్షకులకి బాగా దగ్గరైతే, ఆ నటి/నటుడు కొన్నాళ్ల/కొన్నేళ్ల పాటు అదే తరహా పాత్రలు వేయాల్సి ఉంటుంది. కొత్తదనం కోసం ప్రయత్నిస్తే ప్రేక్షకులు తిరస్కరిస్తారేమో అనే భయం ఆయా నటీనటులతో పాటు, నిర్మాత, దర్శకుల్లోనూ పేరుకుపోయి ఉంటుంది. మన తెలుగు సినిమా పరిశ్రమ దీనికి పెట్టిన ముద్దుపేరు 'ఇమేజ్.' ఒక్కసారి ఓ ఇమేజ్ వచ్చిందీ అంటే, అందులోనుంచి బయట పడడం మాటల్లో అయ్యే పని కాదు. (అలాగని అదే ఇమేజ్ ని సుదీర్ఘకాలం పాటు చెక్కు చెదరకుండా నిలబెట్టుకోడమూ కుదిరే పని కాదు, అది వేరే కథ). ఇమేజ్ నుంచి బయట పడడానికి  నటులకి టాలెంట్ తో పాటు తెగువ కూడా అవసరం. ధైర్యం చేసే దర్శక నిర్మాతలూ కలిసి రావాలి. ఇలా అన్నీ కలిసొచ్చినప్పుడు జయప్రకాష్ రెడ్డి లాంటి నటులు ఇమేజిని బద్దలుకొట్టగలిగిన కొందరిలో ఒకరవుతారు. 

సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'ప్రేమించుకుందాం రా' సినిమాలో ప్రధాన ఆకర్షణ ఇద్దరు. కథానాయిక కావేరిగా కనిపించిన ఉత్తరాది నాయిక అంజలా జవేరి, విలన్ గా మెప్పించిన జయప్రకాశ్ రెడ్డి. అప్పటికే చిన్న చిన్న పాత్రల్లో తెరమీద కనిపించినా, ఆ సినిమాతోనే 'ఎవరీ జయప్రకాశ్ రెడ్డి?' అన్న ప్రశ్న వచ్చింది, సినిమా పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ కూడా. భయం గొలిపే భారీ విగ్రహం, అప్పటికి తెలుగు తెరకి అంతగా పరిచయం లేని రాయలసీమ యాసలో సంభాషణలు, చూపుల్లో క్రౌర్యం, చేతల్లో రాజసం.. ఓ మంచి విలన్ దొరికేశాడు తెలుగు సినిమాకి. అది మొదలు రాయలసీమ విలనీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు కొన్నేళ్ల పాటు. 'సమరసింహా రెడ్డి' సినిమాలో పోషించిన విలన్ పాత్రతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది 'రాయలసీమ వాసులంటే విలన్లేనా?' అని ఆ ప్రాంత ప్రజల మనోభావాలు గాయపడే వరకూ వెళ్ళింది, ఈ విలనీ పరంపర. 

ఒక టైంలో జయప్రకాశ్ రెడ్డి అవుట్ డోర్ షూట్ లో ఉంటే, షూటింగ్ చూడ్డానికి చేరే జనం ఆయన్ని పలకరించడానికి భయపడే వాళ్ళట! అంతటి నిలువెత్తు విలనూ హాస్య పాత్రల్ని అవలీలగా పోషించి కడుపుబ్బా నవ్వించడం ఒక విచిత్రం. ముందుగానే చెప్పుకున్నట్టుగా, ఒక ఇమేజిని సంపాదించుకోడమే కాదు, దానిని తనకి తానే బ్రేక్ చేసుకున్నారు జయప్రకాశ్. తరువాత కొన్ని సెంటిమెంట్ పాత్రల్నీ పండించారు. అలాగని విలనీని విడిచిపెట్టలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే తనకి వచ్చిన ప్రతి పాత్రకీ న్యాయం చేశారు. ప్రేక్షకుల చేత ఔననిపించుకున్నారు. నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన జయప్రకాశ్ రెడ్డికి నాటకాల మీద మక్కువ తగ్గలేదు. సినిమాల నుంచి కొంత ఆటవిడుపు దొరికాక 'అలెగ్జాండర్' అనే నాటిక (ఏకాంకిక అనొచ్చేమో, ఎందుకంటే, స్టేజి మీద కనిపించేది ఆయనొక్కడే. మధ్యమధ్యలో కొన్ని గొంతులు (రికార్డెడ్ ఆడియో) వినిపిస్తూ ఉంటాయి) అనేక చోట్ల ప్రదర్శించారు. అయన సినిమా ఇమేజీ, ఆ నాటిక విజయానికి దోహదపడింది. 

Google Image

'అలెగ్జాండర్' ప్రదర్శన సందర్భంలోనే నాటకాల మీద మక్కువ తగ్గని కొందరం ఆయన్ని కలిసి కాసేపు గడిపాం. అసలే సినిమా వాడు, ఆ పైన గంభీర విగ్రహం కావడంతో మాలో కొందరు పలకరించడానికి కూడా జంకారు. కానీ, జయప్రకాశ్ చాలా మృదు స్వభావి, నిజమైన కళాకారుడూను. మేము సహజంగానే సినిమా విషయాలు, మరీ ముఖ్యంగా విలన్ నుంచి కేరక్టర్ ఆర్టిస్టుగా మారడాన్ని గురించి అడిగాం. జవాబు గా చెప్పినవి రెండు విషయాలు. మొదటిది, నటుడన్న వాడు అన్నిరకాల పాత్రలూ చేయాలి (ఇది అందరూ చెప్పేదే). రెండోది, కేవలం విలన్ పాత్రలు మాత్రమే చేస్తాను అని కూర్చుంటే అలాంటి సినిమాలు ఎన్ని వస్తాయి? వాటిలో మనదాకా వచ్చే పాత్రలు ఎన్ని? ప్రేక్షకులకి విసుగొస్తే తర్వాత పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నలు, వాటికి జవాబులూను. 'బురిడీ' అనే సినిమాలో ఆసాంతమూ ఓ టర్కీ టవల్లో కనిపిస్తారాయన. ఆ సినిమాని గుర్తు చేస్తే పగలబడి నవ్వారు. "ఏం జెప్పమంటారూ? సత్తిబాబు (దర్శకుడు ఈవీవీ) టేక్ అవుతుంటేనే పగలబడి నవ్వేసేవాడు" అని చాలా విశేషాలు గుర్తు చేసుకున్నారు. 

టిక్కెట్టు నాటకాలని ప్రమోట్ చేయడం అన్న కాన్సెప్ట్ గురించి అడిగాం. మీరు సినిమా వాళ్ళు కదా, మీరు టికెట్ పెడితే జనానికి నాటకానికి టికెట్ కొనడం అలవాటు అవుతుందేమో కదా అని. తను ఎందుకు టిక్కెట్ పెట్టడం లేదు అనే విషయాన్ని గురించి చాలాసేపు చెప్పారు. ముఖ్యంగా చెప్పింది ఎక్కువమంది తన నాటకం చూసేలా చేయడం కోసం అని.  తాను కోరుకున్నట్టుగానే ఆ నాటక ప్రదర్శన చాలా విజయవంతం అయ్యింది. కొన్నాళ్ళకి సినిమాల్లో మళ్ళీ బిజీ అయిపోయారు కూడా. ఒక్క మాండలీకాన్ని పలికే తీరే కాదు, చిన్న చిన్న విరుపులు ద్వారా డైలాగుల్ని మెరిపించడం జయప్రకాష్ రెడ్డి ప్రత్యేకత. విసుగు, చికాకు లాంటి రొటీన్ ఎక్స్ప్రెషన్ లలో కూడా బోలెడంత వైవిధ్యం చూపించడాన్ని గమనించొచ్చు. గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పడం మొదలు, అస్సలు డైలాగే లేని పెద్ద పాత్రలో మెప్పించడం వరకూ వెండితెర మీద జయప్రకాశ్ రెడ్డి చేసిన ప్రయోగాలు అనేకం. 

దిగుమతి విలన్లకి దీటుగా మెప్పించినా, హాస్యాన్ని, సెంటిమెంట్ ని రసభంగం కాకుండా పండించినా ఆయనతో ప్రత్యేకమైన తరహా. ఆ నటుడు మరింక తెరమీద కనిపించబోడు అనుకుంటే కష్టంగా ఉంది. జయప్రకాశ్ రెడ్డి ఆత్మకి శాంతి కలగాలి.