గురువారం, మార్చి 31, 2011

నిత్యనూతనుడు

పుష్కర కాలం క్రితం ఓ పెళ్ళికి వెళ్లాను. ఉన్నట్టుండి కళ్యాణ మండపంలో చిన్నపాటి కలకలం. అతిధులంతా పెళ్లి చూడ్డానికి బదులుగా, వెనక్కి తిరిగి గుమ్మంవైపు తిరిగి చూస్తున్నారు. "హ్యాట్సాఫ్ అంకుల్.." "హ్యాట్సాఫ్ అంకుల్.." అంటున్నారు పిల్లలంతా. ఎవరా అని కుతూహలంగా చూస్తే, నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్. వాళ్ళబ్బాయి, మరో సహాయకుడు చక్రాల కుర్చీ తోస్తుండగా, వేదికకి దగ్గరగా వచ్చి, నూతన దంపతులని ఆశీర్వదించి, అటుపై భోజనానికి కదిలారు.

అదిగో, సరిగ్గా అప్పుడే నూతన్ ప్రసాద్ తో మాట్లాడే అవకాశం దొరికింది నాకు. నేను వెళ్ళింది పెళ్ళికూతురి తరపున. ఆయన వచ్చింది పెళ్ళికొడుకు తరపున కావడంతో, దగ్గరుండి ఆయన భోజనం సంగతి కనుక్కునే బాధ్యత నాకప్పగించారు పెళ్ళికూతురి తరపు వారు. నిజం చెప్పొద్దూ.. "ఇప్పుడీయన సినిమా గొప్పలన్నీ నేను భరించాలన్నమాట" అనుకున్నాను మనసులో. నా అంచనాకి భిన్నంగా నూతన్ ప్రసాదే మొదట మాటకలిపారు.

"మీరు పెద్ద సినిమా యాక్టర్ కదా.. ఇప్పుడు పిల్లలంతా మిమ్మల్ని కేవలం మీరు చేస్తున్న టీవీ ప్రోగ్రాం ('హ్యాట్సాఫ్' అని అప్పట్లో ఈటీవీలో వచ్చేది) తో మిమ్మల్ని గుర్తు పడుతుంటే ఎలా అనిపిస్తోంది?" అని అడిగాను నేను. "నేను పుడుతూనే సినిమా నటుణ్ణి కాదండీ. మొదట రంగస్థలం, తర్వాత సినిమా, ఇదిగో ఇప్పుడు టీవీ. నన్ను నటుడిగా గుర్తు పట్టారు కదా చాలు నాకు," అన్నది తన సమాధానం. "అంటే, సినిమా వాళ్ళు టీవీకి రావడాన్ని ఒక మెట్టు దిగడంగా అనుకుంటారు కదండీ?" అన్నాను.
"ఏ నటుడుకైనా మీడియం ఏమిటన్నది ఎప్పుడూ సమస్య కాదు. తన టాలెంట్ చూపించే అవకాశం ఎంత ఉంది? జనం నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? అన్నది మాత్రమే చూస్తాడు. చూస్తూ ఉండండి, టీవీలో నటించడానికి అందరూ పోటీ పడే రోజు వస్తుంది," అన్నారు తను. వాళ్ళబ్బాయిని (పేరు పవన్ అని జ్ఞాపకం) పరిచయం చేశారు. "నాతోనే ఉంటున్నాడు" అంటూ. "సినిమాల్లోకి తీసుకొస్తారా?" తడుముకోకుండా అడిగేశాను నేను. "వాడిష్టం. వస్తానంటే వద్దనను.. ఇక్కడి కష్ట నష్టాలన్నీ భరించగలగాలి, వాడికంటూ వాడు పేరు తెచ్చుకోవాలి. ఇప్పటివరకైతే చేస్తానని అనలేదు" అన్నారాయన. వాళ్లబ్బాయిది చిరునవ్వే సమాధానం.

సాధ్యమైనంత వరకూ మరొకరి మీద ఆధారపడకుండా తన పనులు చేసుకోడానికి ప్రయత్నిస్తున్న ఆయన్ని యాక్సిడెంట్ గురించి గుర్తు చేసి బాధ పెట్టడం ఇష్టం లేకపోయింది. అందుకే "సినిమాలేవైనా చేస్తున్నారా?" అని అడిగాను. "నాకోసం వేషం తయారు చేసి పిలుస్తుంటే వెళ్లి చేసి వస్తున్నా. వేషం ఇమ్మని ఎవరినీ అడగడం లేదు. టీవీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చాలు" అని జవాబొచ్చింది. ఆయన సినిమాలు కొన్నింటినీ "పిశ్చాత్తాపం" "క్లిష్ట పరిస్థితి" లాంటి ఉచ్చారణలనీ గుర్తు చేశాను. సంతోషించారు చాలా.

"నా ఒక్కడి గొప్పతనమూ కాదండీ.. రచయితలు రాసినవి, దర్శకుడు చెప్పినట్టుగా నేను చేశానంతే. జనానికి నచ్చింది, అదృష్టం.." అన్నారు. "ఇప్పటికీ నాకు అవకాశాలు వస్తున్నాయంటే కారణం నా గొంతే. అది జనానికి నచ్చడమే..." అంటూ భోజనం ముగించారు. "చాలా సంతోషం అండీ. భోజనం బాగుంది," అని నూతన్ ప్రసాద్ అన్నప్పుడు, "ఈయన నిజంగా సినిమా మనిషేనా?" అని సందేహం కలిగింది నాకు. ఆయన మరణ వార్త విన్నప్పటి నుంచీ ఆనాటి సంభాషణ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తోంది.

సోమవారం, మార్చి 28, 2011

నాయికలు-వనజ

సాయుధ పోరాటానికి పూర్వపు తెలంగాణాని కళ్ళముందుంచుతూ దాశరధి రంగాచార్య రాసిన నవల 'చిల్లర దేవుళ్ళు.' ఈ నవలలో ప్రధాన పాత్ర వనజ ని గురించిన పరిచయ వ్యాసం ఈ నెల 'వనితామాలిక' లో. టపాని ప్రచురించిన 'వనితామాలిక' బృందానికి కృతజ్ఞతలు.
***

సమాజం అధమ వృత్తులుగా ఎంచిన వాటిలో వేశ్యా వృత్తి ఒకటి. జీవిక కోసం శరీరాన్నే ఆధారంగా చేసుకున్న స్త్రీల జీవితాల్లో చీకటి కోణాలని ఎన్నో కథలు, మరెన్నో నవలలు విపులంగా చిత్రించాయి. అయితే మధురవాణి (గురజాడ అప్పారావు రచన 'కన్యాశుల్కం' ) దుగ్గిరాల శేషాచలం (శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి  కథ 'కలుపు మొక్కలు') వంటి అతికొద్ది పాత్రలని మినహాయిస్తే, మిగిలిన పాత్రలన్నీ దాదాపు ఒకేరకంగా అనిపిస్తాయి. నమ్మినవాళ్ళు మోసం చేయడం వల్లనో, తప్పనిసరి పరిస్థితుల వల్లనో వేశ్యా వృత్తిలోకి వచ్చిన స్త్రీల జీవితాలని చిత్రించిన కథలూ, నవలలే అధికం.

వేశ్యలకన్నా కడు హీనమైన జీవితం గడిపే 'ఆడబాప' లని పరిచయం చేసిన నవల దాశరధి రంగాచార్య 'చిల్లర దేవుళ్ళు.' సాయుధ పోరాటానికి పూర్వపు తెలంగాణాని కళ్ళముందు ఉంచిన ఈ నవల, ఆ కాలంలో ఆ ప్రాంతంలో అమలులో ఉన్న 'ఆడబాప' ఆచారాన్ని అద్దంలో చూపించింది 'వనజ' పాత్ర ద్వారా. తెలంగాణా లోని ఓ చిన్న పల్లెటూళ్ళో ఠీవిగా నిలబడ్డ దేశముఖ్ రామారెడ్డి గడీ (భవంతి) లో ఆడబాప వనజ, పుట్టుకతోనే దురదృష్టాన్ని వెంట తెచ్చుకున్న స్త్రీ.  

ఆ ఊళ్ళో రామారెడ్డి అధికారానికీ, దాష్టీకానికీ బలవ్వని వాళ్ళు ఎవరూ లేరనే చెప్పాలి. దేశముఖ్ హోదాలో నిజం ప్రభుత్వం దఖలు పరిచిన అపరిమితమైన అధికారాలన్నింటినీ దుర్వినియోగం చేసిన రామారెడ్డిది విలాసవంతమైన జీవితం. అతని కంటికి ఇంపుగా కనిపించిన ఏ స్త్రీ అయినా రాత్రికి పడకగదికి రావాల్సిందే. ఆ స్త్రీ ఆ వూరి ఆడపడుచు కావొచ్చు, కోడలు కావొచ్చు లేదా ఆ దారినే వెళ్తున్న బాటసారి కావొచ్చు. వనజ తల్లి దొర కంటపడింది అలానే. కొత్తగా పెళ్ళైన ఆమె పెనిమిటితో కలిసి గడీ ముందుగా పోతూ దొర కంట్లో పడింది. గడీలో ఆడబాపగా స్థిరపడిపోయింది. 

తల్లి వారసత్వం కొనసాగించక తప్పని పరిస్థితి వనజకి. గడీ ఆచారాన్ని అనుసరించి, వనజ వ్యక్తురాలవ్వగానే రామారెడ్డి బావమరిది ఇంద్రారెడ్డి ఆమెకి కన్నెచెర విడిపించాడు. ఆనాటి నుంచీ గడీకి వచ్చిన వాళ్ళందరికీ విలాస వస్తువైపోయింది వనజ. దొరలేవరైనా గడీకి వస్తే భోజనాలూ, ఫలహారాలూ మోసుకెళ్ళాలి.  వాళ్ళ కోర్కెలకి తను లొంగిపోవాలి. వాళ్ళు పశువుల్లా ప్రవర్తిస్తుంటే తను బొమ్మలా ఉండాల్సిందే కానీ కిమ్మనడానికి వీల్లేదు. యంత్రవతుగా వ్యవహరించాలి. 

రామారెడ్డి తన తండ్రి అని వనజకి తెలుసు. అంతే కాదు, రామారెడ్డి కూతురు మంజరికి తను సేవిక అన్న సత్యమూ తెలుసు. వీటన్నింటినీ మించి తన కంటినుంచి కన్నీరు జారితే జరిగే పరిణామాలు ఇంకా బాగా తెలుసు. గడీ నుంచి పారిపోవాలని చాలాసార్లే అనుకుంది ఆమె. కానీ తను ఎక్కడున్నా దొర పట్టి తెప్పిస్తాడన్న సత్యం ఆమెని ఆపేసింది. అంతే కాదు. ఎక్కడికి పారిపోవాలి? ఏం చేయాలి? ఆడబాపగా బతికిందానికెవడైనా అండ చూపుతాడా? ఈ ప్రశ్నలకి జవాబులు లేవు వనజ దగ్గర. 

తనని తాను యంత్రంగా మార్చుకుని జీవితాన్ని వెళ్ళదీస్తున్న వనజకి  తనూ మనిషే అన్న సత్యాన్ని బోధ పరిచిన వాడు సారంగపాణి, విజయవాడ ప్రాంతం నుంచి జీవనోపాధిని వెతుక్కుంటూ ఆ పల్లెకి వచ్చిన సంగీతప్పంతులు. అప్పటివరకూ గడీలో దిగిన దొరలకీ, పాణికీ చాలా భేదం ఉందన్న విషయం అర్ధం కావడానికి ఎక్కువ రోజులు పట్టలేదు వనజకి. అతని పలుకులు ఆమెకెంతో ఆప్యాయతని ఇచ్చాయి. ఏదో తెలియని ఆనందం మైకంలా కమ్మిందామెని. 

తనకి తెలియకుండానే పాణితో ప్రేమలో పడిపోయింది వనజ. అతణ్ణి చూడడం కోసం, గొంతు వినడం కోసం ఎంతగానో ఎదురు చూడడం మొదలు పెట్టింది. పాణి సాంగత్యంలో అంతకు ముందు తెలియని ఆనందమేదో అనుభవంలోకి వచ్చింది ఆమెకి. పాణి తనతో యెంతో సౌమ్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ అతనికి తనపై ప్రేమ ఉన్నదా? అన్న విషయం అర్ధం కాదు వనజకి. అందరితోనూ ఆపేక్షగా ఉండడం పాణి నైజం కావడమే ఇందుకు కారణం. 

పాణిని గురించిన ఆలోచనలతో ఆనందంగా రోజులు గడుపుతున్న వనజకి 'అతనికి తను తగినదేనా?' అన్న ప్రశ్న ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 'తానెవరు?' అని ప్రశ్నించుకున్నప్పుడు 'వేశ్యకన్నా కడు హీనం' అన్న జవాబు వస్తుంది వనజకి. వేశ్య డబ్బుకి తనని తాను అమ్ముకుంటుంది. తన తల్లీ, తన ఆచారాలూ తనను అమ్మి వేశాయి, జంతువుని అమ్మినట్టు. తాను బ్రతికి ఉన్నన్నాళ్లూ ఈ దొరకు బానిసే. వేశ్య తాను వద్దనుకుంటే, తనకు డబ్బు అవసరం లేదనుకొంటే తనను అమ్ముకోవాల్సిన పని లేదు. కానీ తాను? తనకు ఇష్టం ఉన్నా లేకున్నా, అవసరం ఉన్నా లేకున్నా అర్పించేయాల్సిందే కోరిన వారికి -- గడీకి వచ్చిన వారికి. 

పాణిని పెళ్లి చేసుకుని, గడీ బతుకు నుంచి బయట పడి తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని కలలు కన్న వనజకి  దైవంలాంటి అతనికి కుళ్ళిన పండు లాంటి తనని అర్పించుకోవడం సమంజసం అనిపించదు. ఆ ఆలోచనల నుంచే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఫలితం.. నిన్నటి రాతి మనిషి నేడు దేవత అయిపోయింది. తన నిర్ణయాన్ని ఆమె పాణికి చెప్పినప్పుడు "నేనంటే ప్రేమ లేదా?" అని అడిగాడతడు. "నేను నీకు తగినదానిని కాను. నువ్వు దేవుడివి. బండవంటి నన్ను మనిషిని చేసినవు. గొడ్డువంటి దాన్కి ప్రేమ చూపినవు. అటువంటి నీకు మచ్చ పడ్డ నా మనసెట్టిద్దును? నా పుటక దరిద్రపుది. నా బతుకు దరిద్రంది..." అంటూ తన కథంతా చెప్పేసింది. 

వనజ నిర్ణయం వాళ్ళిద్దరి మధ్యనే ఉండిపోవడం కారణంగా గడీలో జరిగిన పరిణామాలు వనజకి ఇబ్బందులని తెచ్చాయి. మంజరి చేతిలో ఆమెకి ఎన్నో అవమానాలు జరగడానికి కారణమయ్యాయి. వాటన్నింటినీ భరించింది వనజ. తనలో చలనం తెచ్చిన పాణి ఆమెకి ఎప్పటికీ ప్రత్యేకమైన వాడే. నవల పతాక సన్నివేశంలో రామారెడ్డి మరణించగానే, అప్పటివరకూ 'దొరా' అని పిలిచినా వనజ, 'నాయ్నా..' అంటూ అతని శవం మీద పడి భోరున విలపించడం పాఠకులని కదిలించడం మాత్రమే కాదు, వనజని ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా చేస్తుంది.

ఆదివారం, మార్చి 27, 2011

రామరాజ్యానికి రహదారి

"ఇది కేవలం పాలగుమ్మి పద్మరాజు మాత్రమే రాయగలిగే నవల" ...పుస్తకం పూర్తి చేసి పక్కన పెట్టగానే నాకు కలిగిన భావన ఇది. భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న కొందరు వ్యక్తులు, కొన్ని కుటుంబాల కథ 'రామరాజ్యానికి రహదారి.' దాదాపు ఇరవై వరకూ ప్రధాన పాత్రలున్న ఈ నవలలో ప్రతి పాత్రనీ వైవిద్యభరితంగా చిత్రించడం లోనూ, పాత్రల మధ్య వైరుధ్యాలని స్పష్టంగా ఎత్తిచూపడం లోనూ రచయిత వందశాతం కృతకృత్యులయ్యారని అంగీకరించాల్సిందే.

తెలుగు సాహిత్యంలో మనస్తత్వ చిత్రణకి సంబంధించి తనదైన ముద్ర వేసిన పద్మరాజు, స్వతంత్ర పోరాటాన్ని నేపధ్యంగా తీసుకుని రాసిన ఈ నవలలో కథ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని ఒక పల్లెటూళ్ళో 1930, జనవరి 26 న కొందరు గాంధీ అనుయాయుల జెండావందనంతో ప్రారంభమై, తర్వాతి పదిహేను, పదహారేళ్ళ కాలంలో స్వతంత్ర పోరాటంలోనూ, అందులో పాల్గొనే వారి వ్యక్తి గత జీవితాల్లోనూ, వారి వారి ఆలోచనా ధోరణుల్లోనూ వచ్చే మార్పులని కళ్ళకి కడుతూ సాగి, ప్రధాన పాత్రల్లో ఒకటైన రంగడు తన గమ్యాన్ని గురించిన నిర్ణయం తీసుకోవడంతో ముగుస్తుంది.

ఆద్యంతమూ విడవకుండా చదివించే శైలి పద్మరాజుగారి ప్రత్యేకత. అయితే పేజీలు చకచకా సాగవు. ఎక్కడికక్కడ పాఠకులు ఆగి ఊపిరి తీసుకుని, ఆలోచనలో పడి, తేరుకుని ముందుకు సాగాల్సిందే. అంతమాత్రాన కథనంలో బిగి ఏమాత్రమూ సడలదు. ఎక్కడా అనవసరపు సాగతీతలూ, సుదీర్ఘ ఉపన్యాసాలూ ఉండవు. ''తర్వాత ఏంజరిగిందో'' అన్న ఆతృత తుదకంటా కొనసాగుతుంది. అక్కడక్కడా 'మాలపల్లి' 'నారాయణరావు' 'వేయిపడగలు' 'చదువు' నవలలు గుర్తొచ్చినా, ఈ నవలని ఏ ఇతర నవలతోనూ పోల్చలేము.

ఈ కథని మూడు పాత్రల దృక్కోణాల నుంచి చెప్పారు రచయిత. చదువు మధ్యలో మానేసి స్వతంత్ర పోరాటంలో దూకిన భూస్వామి గోపాలం, గాంధీజీని అమితంగా ఆదరించే అతని వదినగారు లక్ష్మి, తర్వాతి తరానికి ప్రతినిధి అయిన గోపాలం కొడుకు రంగడు. ఈముగ్గురి జీవితాలూ కూడా స్వాతంత్రోద్యమం తో పెనవేసుకు పోయాయి. పరోక్షంగా వీళ్ళ జీవితాలని ప్రభావితం చేసింది గాంధీజీ. ఈముగ్గురూ కూడా లోతైన మనుషులు. తమ అంతః సంఘర్షణలనీ, ఆలోచనలనీ పొరపాటున కూడా పక్కవాళ్ళకి తెలియనివ్వరు.

"గాంధీజీ యెడల తన విశ్వాసం సంపూర్ణమైనదేనా?" అని సందేహం గోపాలానికి. అతనికి ఇల్లు కన్నా దేశం ముఖ్యం. చేసే పనిలో నిజాయితీ, చిత్తశుద్ధీ ఉండాలంటాడు. ఒకప్పుడు తన జీవితాన్నిఎంతగానో ప్రభావితం చేసిన పంతులుగారు తర్వాతి కాలంలో అంతగా నచ్చరు గోపాలానికి. తనతో పోరాటంలో పాల్గొంటున్న డాకూగా పిలవబడే వైద్యుడు రామశాస్త్రి చిత్తశుద్ధిమీద ఎప్పడూ సందేహమే అతనికి. ఇల్లు కూలిపోతున్నా, ఆస్తులు వేలానికొచ్చినా లెక్కచేయకుండా ఉద్యమం కోసం తిరిగిన గోపాలం -- తన చుట్టూ ఉన్న వాళ్ళలో విలువల్ని ఆశించే, ప్రవచించే విలువల్ని ఆచరణలో చూపాలని నమ్మిన గోపాలం -- ఒక వివాహేతర బంధంలోకి వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులని చదవాల్సిందే.

లక్ష్మి ఓ జమీందారు గారి అమ్మాయి. గాంధీజీ వీరాభిమాని. కన్న తండ్రితో పంచుకోలేని తన సమస్యలని సైతం, గాంధీజీతో మనసు విప్పి మాట్లాడగలదు ఆమె. ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొనడంతో పాటు రాట్నం వడకడం, ఆడపిల్లలకి హిందీ బోధించడం చేస్తూ ఉంటుంది. భర్త సూరి ఆమెకి కేవలం పోరాట సహచరుడు మాత్రమే. అతని సాంగత్యాన్ని ఏమాత్రమూ భరించలేదు ఆమె. తల్లి, సోదరితోనూ ఆమె బంధం అంతంతమాత్రమే. ఒక దశలో ఇంటిని చక్కబెట్టుకోలేకపోతున్న తను, దేశంకోసం ఏమాత్రం పని చేయగలదు అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. భర్త రెండో పెళ్లిని ఆమె హర్షించలేదు, అలాగని అభ్యంతర పెట్టనూ లేదు.

రంగడిగా పిలువబడే రంగారావుది చిత్రమైన మనస్తత్వం. వయసుకి మించిన పరిణతి కనిపిస్తుంది అతని ఆలోచనల్లో. తండ్రి గోపాలం అంటే అతనికి అంత మంచి అభిప్రాయం లేదు. తండ్రి చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడమే అతని మతం. కాలేజీలో చదువుకన్నా ఫుట్బాల్ ఆట, సిగరెట్టూ, డ్రింక్స్ మీదే ఎక్కువ శ్రద్ధ చూపుతాడు రంగడు. అంతర్ముఖుడు కావడం వల్ల తన ఆలోచనలని ఎవరితోనూ పంచుకోడు. చుట్టూ ఎందరో స్నేహితులు ఉన్నా అతను ఒంటరి వాడే. తండ్రి వివాహేతర బంధాన్ని గురించి అతనికి తెలిసిన కొన్నాళ్ళకే తల్లి మరణించడం, అటుపై అతని జీవన గమనమే నవల ముగింపు.

గోపాలం భార్య సీత, జస్టిస్ పార్టీ సభ్యుడూ, వకీలూ అయిన నాయుడు, అతని కొడుకులు సత్యం, గోపీ నాయుడు, గోపీ నాయుడు పెళ్లి చేసుకున్న విదేశీ వనిత లారా, శాస్త్రి, శర్మ, డాకూ, పంతులు గారు, నరసయ్య, డాక్టర్ సాంబశివుడు, ఆయన భార్య, రాణీ రంగాయమ్మ, చంద్రమతి... ఇలా ప్రతి పాత్రకీ జీవం పోసి నిలిపారు రచయిత. ముఖ్యంగా లారా పాత్ర అతి సాధారణంగా ప్రారంభమై అసాధారణంగా ఎదుగుతుంది. నాకెందుకో లారా గురించి చదివినప్పుడల్లా అనిబిసెంట్ గుర్తొచ్చింది -- పోలికలేవీలేవు. రంగడు-లారా ల అనుబంధం 'ఆనందోబ్రహ్మ' లో సోమయాజి-మందాకిని ల అనుబంధానికి స్ఫూర్తి అయి ఉండొచ్చు. (సోమయాజి కూడా ఫుట్ బాల్ ప్లేయరే!)

ఈనవలతో పాటుగా పద్మరాజు గారి 'రెండవ అశోకుడి మూన్నాళ్ళ పాలన' 'నల్లరేగడి' నవలల్ని కలిపి ఒక సంకలనంగా ప్రచురించింది విశాలాంధ్ర. పేజీలు 391, వెల రూ. 180. ఈ పుస్తకాన్ని గురించి బ్లాగ్మిత్రులు జంపాల చౌదరి గారి టపా ఇక్కడ.

శనివారం, మార్చి 26, 2011

పాక హోటల్

పొగచూరిన పైకప్పు, చుట్టూ తడికెలు, వాటిని కవర్ చేస్తూ కొత్త సినిమాల వాల్ పోస్టర్లు, చెక్కబల్లలూ, సేవండి పళ్ళాలూ, గ్లాసులూ, అనేకానేక చప్పుళ్ళతో పోటీ పడుతూ వినిపించే కొత్త సినిమాల రికార్డులు. ఇలాంటి ప్రపంచాన్ని మీరెప్పుడైనా చూశారా? చూసి ఉంటే దానిపేరు కాఫీ హోటల్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.. పాకలో నడిపే హోటల్ కాబట్టి పాక హోటల్ అని కూడా అంటూ ఉంటారు జనసామాన్యం. వేడివేడి టీ కాఫీలూ, రుచికరమైన టిఫిన్లూ సరసమైన ధరలకి దొరకడం ఈ హోటళ్ళ ప్రత్యేకత.

ఈ హోటళ్ళు సర్వసాధారణంగా ఒకే కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతూ ఉంటాయి. అంటే టిఫిన్లు తయారు చేయడం మొదలు, వాటిని సప్లై చేయడం, ప్లేట్లు, గ్లాసులు, బల్లలు శుభ్రం చేయడం వరకూ ప్రతి పనినీ ఆ కుటుంబంలో సభ్యులే వంతుల వారీగా చకచకా చేసేస్తూ ఉంటారు. రూపురేఖలలో మార్పులు మినహా ఇప్పటికీ ఈ తరహా హోటళ్ళు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయి. పొట్ట చేతపట్టుకుని నేను ఏ ఊరికి వెళ్ళినా, ముందుగా వెతుక్కునేది ఇదిగో ఇలాంటి హోటల్ కోసమే.

నేను మొదటిసారిగా ఈతరహా హోటల్ని దర్శించింది కాలేజీలో చేరాక. టీ, కాఫీలతో పాటుగా ఇడ్లీ, మినపరొట్టి, బజ్జీ, గారి దొరకే ఆ హోటల్ శుభ్రతకి పెట్టింది పేరు. తర్వాత చూసిన చాలా పెద్ద హోటళ్ళలో కన్నా, ఆ హోటల్ నిర్వహణ యెంతో బాగుండేది. వచ్చిన ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించడం, ఏం కావాలో కనుక్కుని వేడి వేడిగా వడ్డించడం, ఒకవేళ ఆసల్యం అయ్యేలా ఉంటే అదే విషయాన్ని అపాలజిటిక్ గా చెప్పడం.. ఇలా 'హాస్పిటాలిటీ' కి పెట్టింది పేరుగా ఉండేది ఆ హోటల్. వాళ్ళ పిల్లలిద్దరూ నాతోనే చదివే వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళు హోటల్ పనులు కూడా చూసుకునే వాళ్ళు.


సినిమాలకి వాల్ పోస్టర్లు అతికించే వాళ్ళు వస్తే, హోటల్ వాళ్ళు టిఫిన్, టీ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ప్రతిఫలంగా, ఉన్నంతలో మంచి పోస్టర్ హోటల్ తడికెని అలంకరించేది. ఆ సినిమా కనుక, ఎవరన్నా పెద్ద హీరోది అయ్యిందో, మర్నాడు వెళ్లేసరికి ఆ పోస్టర్కి వేలాడుతూ ఒక పూలదండ కనిపించేది. ఆ హీరో అభిమానులు పూలదండ కొని తెచ్చి ఆ పోస్టర్ కి వేసేసే వాళ్ళన్నమాట. హోటల్ కి వచ్చిన అందరితోనూ హోటల్ వాళ్ళు మాట కలిపే వాళ్ళు కాబట్టి, బోలెడన్ని లావాదేవీలు అక్కడ జరిగిపోతూ ఉండేవి. అలాగే ఊరందరి సంగతులూ వద్దన్నా తెలిసిపోతూ ఉండేవి.

ఈ తరహా హోటల్ నాకు భాగ్యనగరంలోనూ తారసపడింది. కాకపొతే గెటప్ లో కొంచం నాగరికత సంతరించుకుంది. రెండు గదులు పోర్షన్లో నడిచే ఈ హోటల్ కూడా కుటుంబ సంస్థే. తర్వాత తిరిగిన ఊళ్లలో, ఒక చోట తిన్న దోశలు, మరోచోట లొట్టలేసిన పొంగల్, ఇంకోచోట ఇష్టంగా తిన్న సాంబార్ వడ ఇప్పటికీ నాకు అప్పుడప్పుడూ గుర్తొచ్చి నోరూరుతూ ఉంటుంది. ఈ హోటళ్ళ ప్రత్యేకత ఏమిటంటే, మనం ఒక రెండుమూడుసార్లు క్రమం తప్పకుండా వెళ్ళామంటే చాలు, మన ఇష్టాలేమితో వాళ్ళు కనిపెట్టేస్తారు. దాంతో మనం ప్రతిసారీ ఆర్డర్ చేసే పని ఉండదు.

చిరునవ్వులతో మొదలయ్యే పరిచయం వ్యక్తిగత విషయాల వరకూ సాగిపోతూ ఉంటుంది. ఒకానొక హోటల్ నడిపే ఆయన, వేడి చల్లారిన తినుబండారాలని అస్సలు వడ్డించడు తన అతిధులకి. వచ్చినవాళ్ళు మొహమాటానికో, టైం లేకో 'పర్లేదు' అన్నాకూడా ఆయన వినేవాడు కాదు. అయ్యప్ప, భవానీ లాంటి దీక్షలు తీసుకున్న వాళ్ళకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసే హోటల్ వాళ్ళూ ఉన్నారు.

నాకు తెలిసిన రెండు హోటళ్ళలో, రెండోతరం వారు హోటల్ నడపడం ఇష్టం లేక వ్యాపారాన్ని వదిలేశారు. తండ్రుల వెంట హోటల్ లో పని చేసిన వాళ్ళే, తమ జమానా వచ్చేసరికి ఉద్యోగాలకి మళ్ళిపోయారు. ఈ సంగతులు తెలిసినప్పుడు నాకెందుకో ఉసూరుమనిపించింది. ఇప్పటికీ పెద్ద పెద్ద రెస్టారెంట్లలో తిన్నా కలగని తృప్తి, ఈతరహా హోటల్లో తిన్నప్పుడు అనుభవానికొస్తూ ఉంటుంది నాకు. వడ్డించే వారు చూపించే ఆత్మీయత ఇందుకు కారణం కావొచ్చునేమో.

శుక్రవారం, మార్చి 25, 2011

ఎడారి లిబియా

ఎడారి దేశం లిబియా మళ్ళీ వార్తల్లోకెక్కింది. లిబియా ప్రజలు సమస్యల్లో ఉన్నారన్న విషయాన్ని వాళ్ళకన్నా ముందు అమెరికా గుర్తించి, ఆ సమస్య పరిష్కారానికి స్వయంగా రంగంలోకి దిగింది. 'కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ' అన్నట్టుగా, అమెరికా ఏం చేసినా, చేయకపోయినా దాని ప్రభావం ఏదో ఒకరకంగా మిగతా ప్రపంచం మీద ఉండి తీరుతుంది. ప్రస్తుత లిబియా సంక్షోభమూ ఇందుకు మినహాయింపు కాదు.

ఉత్తరాఫ్రికా మధ్యధరా తీరంలో ఉన్న లిబియా దేశం, సహారా ఎడారి భాగంలోనిది కావడంతో ఆయిల్ వనరులు పుష్కలంగా ఉన్నాయి. నిజానికి ఈ ఎడారి దేశానికి ఈ వనరులు వరమవ్వాలి. అదేం పాపమో కానీ, లిబియాకి మాత్రం ఇవే శాపమయ్యాయి. కేవలం ఈ ఆయిల్ కోసమే ఇటలీ లిబియా మీద కన్నేసి చాలా కాలంపాటు వలస పాలన సాగించింది. అన్నాళ్ళూ, ఇటలీ కర్ర పెత్తనానికి వ్యతిరేకంగా లిబియన్లు పోరాడుతూనే ఉన్నారు. ఈ మధ్యలోనే సూయజ్ కాలువ సంక్షోభం, అరబ్ జాతీయవాదం ఇవన్నీ లిబియాని పట్టి కుదిపాయి.

ఎట్టకేలకి, 1969 లో నాటి యువ సైన్యాధికారి కల్నల్ గడాఫీ సారధ్యంలో సైనిక తిరుగుబాటు జరిగింది. అప్పటివరకూ పాలించిన రాచరికం స్థానంలో "స్వతంత్ర, లౌకిక, ప్రజాతంత్ర" రిపబ్లిక్ స్థాపన జరిగింది. ఓ చిన్న ఎడారి దేశం, ఆయిల్ తప్ప మరే ఆధారమూ, అంగబలమూ లేని దేశం స్వతంత్ర జెండా ఎగరేస్తే, చుట్టూ ఉన్న 'పెద్ద' దేశాల పరువేం కావాలి? కేవలం ఈ కారణానికే లిబియా మీద ఆంక్షల వర్షం కురిసింది. గడాఫీ ఇంటి మీద బాంబుల వర్షం కురిసింది. ఒకసారి కాదు, ఎన్నోసార్లు.

ఒక నెలో, ఏడాదో కాదు, ఈ ఆంక్షలు ఇరవై రెండేళ్ళ పాటు కొనసాగాయి. గడాఫీ ప్రభుత్వానికి 'పెద్ద' దేశాలతో రాజీ పడక తప్పలేదు. పదేళ్ళ క్రితం ఈ రాజీ ఫలితంగా ఆంక్షల సడలింపు మొదలయ్యింది. అత్యంత సహజంగానే పశ్చిమ దేశాల ఆయిల్ కంపెనీలు లిబియా వైపు ప్రయాణించడానికి పోటీ పడ్డాయి. అయితే, లిబియా ఇక్కడో తెలివైన పని చేసింది. సౌదీ అరేబియా, బహ్రయిన్, కువైట్, కతార్ లాంటి గల్ఫ్ దేశాల్లా కాకుండా విదేశీ కంపెనీలు లిబియా ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థ సార్వభౌమత్వానికి లోబడి పనిచేయాలని ఖచ్చితమైన షరతు పెట్టింది. ఫలితం, లిబియా ఆయిల్ మీద పెద్ద దేశాలకి పెత్తనం చిక్కలేదు.

ఊహించని విధంగా గత నెలలో, లిబియా సైన్యం రెండుగా చీలిపోవడం, గడాఫీకి వ్యతిరేకంగా పోటీ ప్రభుత్వం ఏర్పడడం జరిగిపోయింది. నిజానికి ఇది లిబియా అంతరంగిక సమస్య. ఆ దేశపు ప్రజలు పరిష్కరించుకోవాల్సిన సమస్య. తమకి అధినేతగా ఉండాల్సింది గడాఫీనా లేక మరోకరా అన్నది పూర్తిగా వాళ్ళ విచక్షణకి సంబంధించిన విషయం. అయితే ఇక్కడ జరుగుతున్నది వేరు. అమెరికా తదితర అగ్ర దేశాలు కొత్త ప్రభుత్వాన్ని గడాఫీ బారినుంచి రక్షించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.

లిబియా ప్రస్తుత జనాభా డెబ్భై లక్షల లోపే. వీళ్ళంతా ఇప్పుడు దాడుల బాధితులు. సంఘర్షణ వాళ్లకి కొత్త కాకపోవచ్చు. కానీ, వాళ్ళ రక్షణ పేరుతో జరుగుతున్న దాడుల వల్ల వాళ్లకి కలిగే లాభం కన్నా, ఇతరులకి కలిగే లాభమే పెద్దదిగా కనిపిస్తోంది. సాంకేతికత కారణంగా ప్రపంచం ఓ కుగ్రామంగా మారిందని చెప్పుకుంటున్న ప్రస్తుత తరుణంలో కూడా, అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాలు లిబియా లో జరుగుతున్న దాడులను గురించి గట్టిగా స్పందించక పోవడం తెర వెనుక సంగతులని చెప్పకనే చెబుతోంది. నాకెందుకో తిలక్ కథ 'లిబియా ఎడారిలో' పదేపదే గుర్తొస్తోంది.

గురువారం, మార్చి 24, 2011

పాటలు-పాట్లు

టైటిల్ కొంచం కన్ఫ్యూజింగ్ గా ఉంది కదూ.. పాటలతో పాట్లేమిటన్నదే కదా ప్రశ్న? నేను పాడితే వినే వాళ్లకి పాట్లు అని కొందరైనా ఊహించేసి ఉంటారు. కానీ అది పచ్చి అబద్ధమని నిరూపించడానికే ఈ టపా. ఈ పాటలున్నాయి చూశారూ, ఇవి ఏదో సందర్భంలో తిప్పలు పెట్టేస్తూ ఉంటాయి. పాపం వాటి తప్పేమీ లేదు. కానీ అలా అంటే తప్పు మనదే అని ఒప్పేసుకోవాల్సి వస్తుంది కదా.. అంతపని చేయలేం కాబట్టి, ష్.. గప్ చుప్..

సీరియస్ గా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటామా? ఏదో ఒక పాట గుర్తొచ్చి, అది ఏ సినిమాలోదో వివరం గుర్తురాదు. లేదంటే, పాట మధ్యలో ఓ లైనో రెండు లైన్లో గుర్తొస్తాయి కానీ ఎంత గింజుకున్నా పల్లవి గుర్తుకురాదు. ఒకవేళ ఇవన్నీ గుర్తొచ్చినా గీత రచన ఆచార్య ఆత్రేయా లేక సముద్రాలా? అనో వేటూరా లేక సిరివెన్నెలా? అనో మరో డౌటు పట్టి పీడించడం మొదలుపెడుతుంది. ఇవన్నీ కాకపొతే, అచ్చంగా ఇలాంటి ట్యూన్లోనే ఇంకేదో పాట విన్నాం, అదేమిటబ్బా? అన్న సందేహం.

వినడానికి ఇవన్నీ సిల్లీ సమస్యల్లా కనిపిస్తాయి కానీ, అనుభవించే వాళ్లకి తెలుస్తుంది ఇందులో ఉన్న కష్టం. మొన్నామధ్యన మిత్రులొకరికి మహా సీరియస్ గా, పదో తరగతి పరిక్ష రాసినంత శ్రద్ధగా మెయిల్ రాస్తున్నానా? ఒక ఫ్లో లో రాస్తూ రాస్తూ "ద్వారానికి తారా మణిహారం.. హారతి వెన్నెల కర్పూరం.." పాట బిగినింగ్ వెంటనే గుర్తు రావడం లేదు అని నిజాయితీగా ఒప్పేసుకున్నా.. ఇంక, అక్కడినుంచి చూడాలి, నా జ్ఞాపకశక్తి మీద సందేహాలు, పరిక్షలు. "ఇది మల్లెలవేళయనీ.." ఆవేళ గుర్తురాలేదు మరి.

చాలా రోజులుగా నాకు సమయమూ, సందర్భమూ లేకుండా గుర్తొచ్చి వెంటాడుతున్న లైన్లు "కాటుక కన్నీటి జాలుగా..జాలి జాలిగా.." మరియు "రగిలెను నాగుండె దిగులుగా..కోటి సెగలుగా.." పరిస్థితి ఎలా ఉందంటే, ఈ లైన్లు నేను హం చేస్తున్న విషయం నాకు తెలియడం లేదు. ఆమధ్యనోసారి నలుగురు కూర్చుని నవ్వేవేళ, నా నోటివెంట ఈ లైన్లు.. పరిస్థితి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అక్కడికీ నేనుసైతం ఏదన్నా చేయడం కోసం "రేపల్లె వేచెనూ.." పాటని నా ప్లే లిస్టు నుంచి తాత్కాలికంగా తొలగించాను. అయినప్పటికీ లాభం లేదు.

ఈ లైన్లతో వచ్చిన చిక్కేమిటంటే.. ఏదో పాటలో ఒకటో రెండో లైన్లు పదే పదే బుర్రలో గింగిరాలు తిరుగుతూ ఉంటాయి.. అచ్చంగా అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులాగా. ఇలా నాకు రికార్డు బ్రేక్ చేసేసిన చరణపు ముక్క "రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది.. దీనురాలి గూటిలోన.." అంతే..ఇక్కడితో ఆగిపోతుంది.. ఈ "దీనురాలి గూటిలోన.." మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది, 'గూటి' ఒత్తి పలుకుతూ. ఇంక తోటలో నిదురించడం నావల్లేం అవుతుంది? అలాగే "కురిసేదాకా అనుకోలేదు శ్రావణ మేఘమనీ" కూడా.. "మానసవీణ మధుగీతాల" ని వినేదేలా మరి?

ఆరోజు ఉదయాన్నే టీవీలో 'నిరీక్షణ' లో పాట చూశాను.. ఇంక రోజంతా "యమునా ఎందుకు నువ్వు?" అంటుంటే, "ఈ యమునెవరూ?" అంటూ ఇద్దరు ముగ్గురడిగారు. "చంద్ర కళాధరి ఈశ్వరీ"ది కూడా ఇదే సమస్య. అసలు ఈబాధలు పడలేక పాటలు వినడం మానేస్తే ఎలా ఉంటుందీ అన్న ఆలోచన కూడా రాకపోలేదు కానీ, "ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా?" అని నా అంతరాత్మ కొంచం నిష్టూరంగా ప్రశ్నించింది. ఈసమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి, తప్పదు అనుకుని పుస్తకాల్లోలాగా గాఠిగా ఊపిరి పీల్చాను.

నాకు తోచిన పరిష్కారాలలో మొదటిది: ఇలా జరగడానికి కారణం, నాలో అందరి ఎదుటా పాడాలన్న కోరిక బలంగా ఉండి ఉండొచ్చు. అది తీర్చుకుంటే ఈ సమస్య తీరిపోవచ్చు. అయితే ఇందులో ఓ చిక్కుంది. అసలే "జీవహింస మహాపాపం" లాంటి పాఠాలు చదువుకుంటూ పెరిగి పెద్దైన వాడిని. ఇంతటి హింసకి ఎలా పాల్పడను? ఇక రెండోది: బహుశా గత జన్మలో నేనో గో..ప్ప సంగీత విద్వాంసుడిని అయి ఉండొచ్చు. కాబట్టి ఆ వాసనల వల్ల ఇలా జరుగుతూ ఉండొచ్చు. నేను ఏదన్నా టీవీ ఛానల్ కి వెళ్తే, వాళ్ళు నన్ను నా గతజన్మలోకి తీసుకెళ్ళే వీలుంది.

అయితే ఇక్కడున్న చిక్కేమిటంటే, జీవితం బాగా కాంప్లికేటెడ్ అయిపోతుంది. నా గతజన్మ తెలిసిపోతే, రాయల్టీ కోసం మ్యూజిక్ కంపెనీల చుట్టూ తిరగాలి కదా మరి. అదీ కాకుండా వారసులతో సమస్యలూ అవీ కూడా వచ్చేస్తాయి, తప్పదు. అందువల్ల ఈ రహస్యం తెలుసుకోకుండా ఉండడమే మంచిది. చివరాఖరిగా తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, నేనిలాగే ప్రోసీడయిపోతే, కొన్నాళ్ళకి ఈ అలవాటు దానంతట అదైనా పోతుంది..లేదా నాకూ, నా చుట్టూ వాళ్ళకీ అలవాటన్నా అయిపోతుంది. అప్పటివరకూ ఈ పాట్లు తప్పవు మరి.

బుధవారం, మార్చి 23, 2011

వేలుపిళ్లై

ఇవాల్టి నా దినచర్య ముందుగా ప్లాన్ చేసుకున్నట్టుగా కాక, చేయగలిగినన్ని మార్పులతో సాగింది. ఇందుకు కారణం ఓ పుస్తకం. సి. రామచంద్ర రావు కథా సంకలనం 'వేలుపిళ్ళై' కొత్త ప్రింట్ మార్కెట్లోకి వచ్చిందన్న వార్త ఉదయాన్నే తెలియడంతో, షాపు తెరిచే వేళ వరకూ ఆత్రంగా ఎదురుచూశాను. ఇక పుస్తకం చేత చిక్కాక, పక్కకి పెట్టగలిగినన్ని పనుల్ని పక్కన పెట్టి, వీలైనంత సమయాన్ని పుస్తకం కోసం కేటాయించీ, ఇప్పుడే ఈ పుస్తకం చదవడం పూర్తి చేశాను.

సుమారు రెండేళ్ళ క్రితం, మిత్రులొకరు 'తెలుగు కథకి జేజే!' అనే కథా సంకలనాన్ని బహూకరించారు నాకు. తిరుపతికి చెందిన సాకం నాగరాజు సారధ్యంలో వచ్చిన ఈ సంకలంలో నన్ను అమితంగా ఆకట్టుకున్న కథల్లో ఒకటి 'గాళిదేవరు.' అప్పటినుంచీ ఆ రచయిత గురించి తెలుసుకోవాలనీ, ఆయన రాసిన ఇతర కథలు చదవాలనీ చేస్తున్న ప్రయత్నాలు ఇన్నాళ్ళకి ఫలించాయి. గడిచిన నాలుగున్నర దశాబ్దాలలో రామచంద్రరావు రాసినవి కేవలం తొమ్మిది కథలు. అయితేనేం? ప్రతి కథా దేనికదే ప్రత్యేకమైనది.

నిజానికి, ఒకే రచయిత/రచయిత్రి కథల సంకలనం 'అన్ని కథలూ' చాలా బాగుండే అవకాశం లేదు. కనీసం కొన్ని కథలైనా పర్లేదనో, బాలేదనో అనిపిస్తాయి. పేరొందిన సంకలనాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే, నావరకు అలాంటి మినహాయింపు పొందిన సంకలనం ఈ 'వేలుపిళ్లై.' ఈ ఘనత రచయితదే. తొమ్మిది కథల్లో ఏ ఒక్క కథా నన్ను నిరాశ పరచలేదు మరి.

తొమ్మిదింటిలోనూ, ఐదు కథలకి నేపధ్యం పొరుగు రాష్ట్రాలలోని టీ ఎస్టేట్లే. రచయిత సుదీర్ఘ కాలం ఎస్టేట్ మేనేజర్ గా పనిచేసి ఉండడం ఇందుకు కారణం కావొచ్చు. అయితేనేం, ప్రకృతి వర్ణనల మొదలు మానవ మనస్తత్వ చిత్రణ వరకూ ఎక్కడా పునరుక్తి కనిపించదు. మొదటికథ 'వేలుపిళ్లై' స్త్రీ-పురుష సంబంధాల నేపధ్యంలో సాగితే రెండో కథ 'నల్లతోలు' -- పేరులో చెప్పినట్టుగానే - జాత్యహంకారం కథా వస్తువుగా తీసుకున్నది.

మనిషి-జంతువు-సెంటిమెంట్లు ఇతివృత్తంగా రాసిన కథ 'ఏనుగుల రాయి' కాగా, ఆలుమగల అనుబంధంలో మరో కోణాన్ని చూపించే కథ 'టెన్నిస్ టోర్నమెంట్.' 'ఉద్యోగం,' 'ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ,' 'కంపెనీ లీజ్' 'క్లబ్ నైట్' కథలన్నీ మానవ మనస్తత్వాన్ని అనేక కోణాల్లో చూపించేవే. నిజానికి ఈ కథల్ని ఇలా ఒక్క వాక్యంలో సూత్రీకరించడం కుదరని పని.

ఒక్కో కథ చదవడం పూర్తి చేయగానే, ఆ కథ కోసం రచయిత జరిపిన కృషి, పరిశీలన పాఠకులని అచ్చెరువొందించక మానవు. 'ఏనుగుల రాయి' కథనే తీసుకుంటే ... "మొదట ఏనుగుల రాయిని చూసినప్పుడు గుర్తు పట్టలేదు కడకరై. అడివంతా తిప్పి చివరకి ప్రతి రాత్రీ తనని ఏనుగులు అక్కడికి తీసుకు వెళ్లేసరికి అనుమానం కలిగింది. ఎన్నో రోజులు రాయి వెనకాలే నక్కి చూశాడు. రాతి చుట్టూ ప్రదేశాన్ని చక్కగా చదును చేసుకున్నాయి ఏనుగులు.

అక్కడ పడుకుని కూడా తెచ్చుకున్న కొద్ది ఆకులనీ రెమ్మల్నీ సావకాశంగా మెలిపెట్టి నోట్లో తోసుకునేవి. ఆడ ఏనుగులు చిన్న పిల్లలకి పాలు గుడిపేవి. పిల్లలు తొండం నోటికి అడ్డం రాకుండా పైకి ఎత్తిపెట్టి నోటితో పొదుగుని కరచిపెట్టుకుని తాగేవి. తిండి అయిన తర్వాత ఏనుగులు ఆడుకునేవి. ఒక్కొక్కప్పుడు పోట్లాడుకునేవి. కొన్ని ప్రేమకలాపం సాగించేవి. ఎక్కువ అలిసిపోయినప్పుడు రాతికి ఆనుకుని శరీరాన్ని తోముకునేవి..." ....ఎంత ఓర్పు, పరిశీలన అవసరం ఇది రాయడానికి!! అంతేకాదు, ఈ కథలో కీలక మలుపులకి కారణం ఏనుగుల మనస్తత్వమే.

ఎస్టేట్ జీవితాన్ని గురించి 'క్లబ్ నైట్' కథలో ఓ పాత్ర ఇలా అంటుంది: "బయట కొండలూ, పచ్చటి టీ, కాఫీ తోటలూ, స్వచ్చమైన గాలి అన్నీ ఉన్నాయి నిజమే. కాని వాటిమధ్య పని చెయ్యటానికి తోటి మనుష్యులతో స్పందించాల్సిందే కదా? పెద్దా చిన్నా తారతమ్యాలూ, స్పర్ధలూ, కావేషాలూ, నటనలూ, ఆశ్రిత పక్షపాతాలూ అన్ని చోట్లా ఉన్నట్టే ఇక్కడ కూడా అదే మోతాదులో తాండవిస్తూ ఉంటాయి. వీటి గొడవలో ప్రకృతి నైర్మల్యాన్ని పట్టించుకునే వ్యవధి ఎక్కడ ఉంటుంది?"

'ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ' కథ నేను గతంలో ఎప్పుడో చదివినట్టు జ్ఞాపకం వచ్చింది. ఎప్పుడు ఎక్కడ చదివానో గుర్తు రావడం లేదు. కథలతో పాటుగా ముళ్ళపూడి వెంకటరమణ (తాజా ముద్రణ కోసం), నండూరి రామమోహన రావు (తొలి ముద్రణ కోసం, 1964 లో) రాసిన ముందు మాటలూ చదవాల్సినవే. 'గాళిదేవరు' కథని గురించి బ్లాగులో రాసినప్పుడు "మంచి కథ గురించి చెప్పి, ఆ కథని రాసిన వారి గురించి చెప్పకపోతే ఎలా?" అంటూ కోప్పడ్డ, తాజా ప్రచురణ గురించి కబురందించిన బ్లాగ్మిత్రులు జంపాల చౌదరి గారికి కృతజ్ఞతలు. ('వేలుపిళ్లై' విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 119, వెల రూ. 55, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

మంగళవారం, మార్చి 22, 2011

రెండవ అశోకుడి మూణ్నాళ్ళ పాలన

తెలుగు సాహిత్యంలో వ్యంగ్య రచనలు తక్కువే. మరీ ముఖ్యంగా రాజకీయాలపై వచ్చిన వ్యంగ్య నవలలు, నవలికలు మరీ తక్కువ. వ్యంగ్యం రాసి ఒప్పించడం అక్షరాలా కత్తిమీద సాము కావడం ఇందుకు కారణం కావొచ్చు. తెలుగు కథా సాహిత్యంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న కథకుడు పాలగుమ్మి పద్మరాజు రాసిన వ్యంగ్య నవలిక 'రెండవ అశోకుడి మూణ్నాళ్ళ పాలన.' కథకుడిగా లోతైన మనస్తత్వ చిత్రణకి పెట్టింది పేరైన పద్మరాజు, డెబ్భయ్యవ దశకం లోని దేశ రాజకీయాలని నేపధ్యంగా తీసుకుని వ్యంగ్య ధోరణిలో రాసిన నవలిక ఇది.

పశ్చిమగోదావరి జిల్లా 'పేర్వాలి' గ్రామానికి చెందిన మోరి అశోక వర్ధన రాజు అనే సామాన్య క్షత్రియుడు, ఊహించని పరిస్థితుల్లో దేశానికి రాజు కావడం, కేవలం మూడు రోజులు మాత్రమే దేశాన్ని పాలించినా, తన అజ్ఞానం కారణంగా పాలనపై తనదైన ముద్ర వేయడమే ఈ తొంభై రెండు పేజీల నవలికలో కథ. అసలు ప్రజాస్వామ్య దేశమైన భారత దేశానికి రాజుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కూడా, కేవలం పెరవలి గ్రామం తప్ప ప్రపంచం ఏమాత్రమూ తెలియని, ఇల్లు కదలకుండా అశోకుడి శాసనాలని అనువదించుకుంటూ కాలం గడిపే అశోకవర్ధన రాజుని రాచ పదవికి ఎంపిక చేయడం ఏమిటి?

ఈ నవలిక చదువుతుంటే, మొత్తంగా దేశ రాజకీయాలని, విడి విడిగా ప్రతి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులని, అనేకానేక అంశాల మీద ప్రముఖ రాజకీయ పార్టీల వైఖరులనీ రచయిత ఎంత నిశితంగా గమనించారో అర్ధమై, ఆశ్చర్యం కలుగుతుంది. ఉత్తరాది వారి హిందీ భాషాభిమానం, శివ సైనికుల ప్రాంతీయ వాదం, ఘెరావోల పట్ల బెంగాలీల మమకారం, కమ్యూనిస్టుల్లో చైనా-రష్యా గ్రూపులు, నక్సల్బరీ పార్టీల్లోని సిద్ధాంతపరమైన చీలికలూ.. ఇలా ఏ విషయాన్నీ విడిచిపెట్టకుండా లోతుగా పరిశీలించి, సందర్భానికి తగ్గట్టుగా పుస్తకంలో ఉపయోగించుకున్నారు పద్మరాజు.


అవసర విషయాలని పక్కన పెట్టి, అనవసరమైన విషయాల గురించి రోజుల తరబడి చర్చల పేరుతో పోట్లాడుకునే గౌరవ పార్లమెంటు సభ్యులు, అధికారంలో ఉన్న వారిని ఇరుకున పెట్టడమే పనిగా రంద్రాన్వేషణకి పూనుకునే ప్రతిపక్షీయులు, తమ రాజకీయ భవితవ్యం కోసం ఏమైనా చేసే నాయకులు, పదవి కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేసేందుకు వెనుకాడని వ్యాపారవేత్తలు వీళ్ళందరినీ వ్యంగ్య ధోరణిలో చిత్రించారు రచయిత. కేరళ కి చెందిన ఎనిమిదేళ్ళ కుర్రాడు బాలకృష్ణ నాయర్ (బాలూ) కథ ద్వారా, శివసేన పోరాటాల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర వచ్చి స్థిరపడ్డ ప్రజల ఇబ్బందులని కళ్ళకు కట్టారు. అయితే కథ గడిచే కొద్దీ, బాలూకి వయసుకి మించిన నాయకత్వ లక్షణాలు ఆపాదించడం వల్ల ఆ పాత్ర సహజత్వానికి దూరంగా జరిగినట్టుగా అనిపించింది.

కేవలం దేశానికి సంబంధించిన అంశాల మీదే కాదు, అంతర్జాతీయ రాజకీయాల మీదా రచయితకి మంచి పట్టు ఉందని నిరూపించే ఘట్టాలు ఈ నవలలో అనేకం. ముఖ్యంగా భారతదేశం రాచరికం వైపు వెళ్తోందనగానే వివిధ దేశాల స్పందనలనీ, వాటి వెనుక అంతరార్దాలనీ చెప్పకనే చెప్పారు. అలాగే ఏ దేశం నుంచి సహాయం ఏ రూపం నుంచి వస్తుందన్న రచయిత ఊహ, ఈనాటికీ ఆయా దేశాల పాలసీలకి తగ్గట్టుగా ఉండడం విశేషం. అశోక వర్ధన రాజు జీవితం, పదవి దక్కాక ఒక్కసారిగా అతనిలో వచ్చిన మార్పు, అతని అజ్ఞానాన్ని పొరుగు దేశాలు మహాజ్ఞానంగా స్వీకరించడం ఇవన్నీ పుస్తకం పేజీలు చకచకా తిరిగేలా చేస్తాయి.

అశోకవర్ధన రాజు, బాలూతో పాటుగా ఖాన్ చంద్ర శర్మ, శ్రీమతి హట్టియంగాడీ పాత్రలు గుర్తుండి పోతాయి. పార్లమెంటు లోపల, బయట జరిగే సంఘటనల కారణంగా రాజకీయ వాతావరణంలో అనూహ్య మార్పులు రావడం, ప్రజా ప్రతినిధులంతా భవిష్యత్తు గురించి అక్కడికక్కడే నిర్ణయం తీసుకోవాల్సి రావడం లాంటి సన్నివేశాలు కథనానికి బిగిని ఇచ్చాయి. పన్నుల గురించి రాజు గారి నిర్ణయం, దానికి అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన స్పందన వ్యవస్థలోని బోలుతనాన్ని ఎత్తి చూపాయి. నవలిక చదువుతుంటే కే.ఎన్.వై. పతంజలి వ్యంగ్య నవలిక 'అప్పన్న సర్దార్' చాలాసార్లు గుర్తొచ్చింది. అయితే, పతంజలి రచన రాష్ట్ర రాజకీయాల గురించి కాగా, ఈ నవలిక దేశ రాజకీయాలని ఉద్దేశించింది. ముందుమాట అలా ఉంచి, కనీసం గత ముద్రణలకి సంబంధించిన పూర్తి వివరాలని ఇవ్వకపోవడం ప్రకాశకుల ఆలక్ష్యాన్ని మాత్రమే సూచిస్తోంది.

'రెండవ అశోకుడి మూణ్నాళ్ళ పాలన' తో పాటుగా 'రామరాజ్యానికి రహదారి,' 'నల్లరేగడి' నవలల్ని కలిపి 'పాలగుమ్మి పద్మరాజు రచనలు-2' సంకలనంగా ప్రచురించింది విశాలాంధ్ర. పేజీలు 391, వెల రూ. 180, అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యం.

సోమవారం, మార్చి 21, 2011

ప్రభుత్వం

"అసలు మన రాష్ట్రంలో ప్రభుత్వం ఉందంటారా? జరుగుతున్నవి చూస్తుంటే, భవిష్యత్తు గురించి మీకేమీ బెంగగా అనిపించడంలేదా?" ...విదేశంలో స్థిరపడిన బ్లాగ్మిత్రులొకరు ఈ మధ్య రాసిన మెయిల్ లో అడిగిన ప్రశ్నలివి. ఈ క్షణంలో ఈ ప్రశ్నలని గుర్తు చేసుకుంటే మాత్రం, 'గమ్యం' సినిమాలో ఓ సన్నివేశం గుర్తొస్తోంది. ధనవంతుడైన కథానాయకుడు అభిరాం, ఓ మోటర్ సైకిల్ మీద తిరుగుతూ తన ప్రియురాలు జానకి కోసం అన్వేషిస్తూ ఉంటాడు. ఆ క్రమం లో ఓ చోట గన్ కల్చర్ ని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడే పరిచయమైన ఓ వ్యక్తిని "ప్రభుత్వం ఏమీ చేయదా?" అని అడిగితే, "ఐదేళ్లకోసారి ఎలచ్చన్ పెట్టుద్దిగా" అంటూ ఠక్కున జవాబిచ్చేస్తాడు గాలిశీను.

ఇప్పుడు జరుగుతున్న శాసనమండలి ఎన్నికల తంతుని గమనిస్తుంటే, ఈ ఎన్నికల వల్ల జనం అందరికీ ప్రభుత్వం అనేది ఒకటి పనిచేస్తోంది అని తెలిసే వీలుంది కదా అని సంతోషం కలుగుతోంది. పతంజలి చెప్పినట్టుగా ఎన్నికలు మన దేశంలో కేవలం ఐదేళ్లకోసారి జరిగే తంతు. అయితే మాత్రం? ఈ తంతులో కూడా కాలక్రమంగా అనేకానేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాళ్ళూ వీళ్ళూ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో లాభ పడగలుగుతున్నారు. 'అధికస్య అధికం ఫలం' అన్నట్టుగా, ఎన్నికలు ఎన్ని ఎక్కువసార్లు జరిగితే అందరికీ అంత మంచిదిగా కనిపిస్తోంది.

లేకపొతే, కాస్తో కూస్తో చదువుకున్న వాళ్ళు 'అజాగళస్థనం' అనీ, సామన్యులనేకులు 'ఆరోవేలు' అని ముద్దు పేరు పెట్టిన శాసన మండలికి పునః సృష్టి చేయడం ఏమిటీ, ఆ ఎన్నికల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం ఏమిటి? భగవత్ సృష్టిలో ఉన్న లోపాల గురించి చెబుతూ, ఈ సృష్టిలో పునరుక్తి దోషాలు ఎక్కువగా ఉన్నాయంటాడు గురజాడ వారి గిరీశం. అసలు పాల సముద్రం అంటూ ఒకటి ఉన్నాక, మళ్ళీ పెరుగు సముద్రం, నెయ్యి సముద్రం ఎందుకోయ్? అని ఎద్దేవా చేస్తాడు కూడా. శాసన సభ అంటూ ఒకటి ఉన్నాక, మళ్ళీ శాసన మండలి ఎందుకు? అని మన ప్రభుత్వాన్ని ఎవరూ గట్టిగా అడగలేదు..అక్కడక్కడా పీలగా, లీలగా వినిపించిన గొంతుల్ని నాటి పాలకులు పట్టించుకోనూ లేదు.

నాయకుల సంఖ్యకీ, కుర్చీల సంఖ్యకీ మధ్య సమన్వయం కుదర్చడం కోసం, ఏనాడో మరుగున పడిన మండలిని వెలికి తీసి పదవుల పందేరం మొదలు పెట్టారు. ఈ మండలి పుణ్యమా అని రాష్ట్రం కొత్తగా సాధించింది ఏమీ కనిపించక పోయినా, ఐదేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలని అడపాదడపా జరిపేసుకోడానికి బోల్డంత సాయం చేస్తోంది. దీంతో ఎన్నికలనేవి మరింత బహుళార్ధ సాధకంగా మారిపోయాయి. ఓ ఎన్నికల నోటిఫికేషన్ రావడం ఆలస్యం. సంబంధిత ప్రాంతంలో ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులూ మొదలు పెట్టక్కర్లేదు. ఈ మొదలు పెట్టకపోవడం అన్నది ఏ పద్దు కింద జరుగుతున్నప్పటికీ, ప్రజలు సహృదయంతో 'మోడల్ కోడ్' ఖాతాలో వేసేసుకుంటారు. అధికారులు, ఉద్యోగులకి కొంచం ఆటవిడుపు.

ఆశావహులతో పార్టీ ఆఫీసులన్నీ కళకళలాడిపోతాయా? ఏ పుట్టలో ఏ పాముందో అనే భావంతో టిక్కెట్ ఆశించే వాళ్ళు పార్టీ ఆఫీసులో అందరితోనూ సత్సంబంధాలు నెరపుతారా? తమ నాయకుడికి టిక్కెట్ వచ్చేవరకూ, ఒకవేళ వస్తే ఎన్నికలయ్యే వరకూ అనుచరగణానికి అక్షరాలా పండుగేనా? స్వతహాగా కొంత, టీవీ చానళ్ళ పుణ్యమా అని మరికొంత వోటర్లు తెలివి మీరారు కాబట్టి, వాళ్లకి రావాల్సింది వాళ్ళు పోటీలో ఉన్న అందరినుంచీ నిక్కచ్చిగా రాబట్టుకుంటారా? ఇవన్నీ పైకి కనిపించే ప్రయోజనాలు. ఇంకా పెరిగే మద్యం అమ్మకాలు, ఒక్కసారిగా డబ్బు చెలామణి లోకి రావడంతో పెరిగే మార్కెట్ లావాదేవీలు... ఇలా ఒకటేమిటి? వెతికే కొద్దీ ప్రయోజనాలు కనిపిస్తూనే ఉంటాయి.

అసలు నన్నడిగితే, నల్లడబ్బు వెలికి తియ్యడం కోసం రకరకాల స్కీములు ఆలోచించడం, సభల్లో చర్చలు జరిపి సమయం వృధా చేయడం పూర్తిగా అనవసరం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలని ఐదేళ్లకోసారి కాక, ఏడాదికోసారిగా మారిస్తే దాచిన డబ్బంతా చెలామణి లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే, నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా, ఏ వ్యాపారాలు చేసే వాళ్లైనా చివరికి చేరేది రాజకీయాల్లోకే కదా. ఒకసారి వచ్చేసాక, ఐదేళ్ళ వరకూ డబ్బు సంపాదించడమే తప్ప, ఖర్చు చేద్దామన్నా చేసే అవుట్లెట్ ఉండడం లేదిక్కడ. దీంతో, డబ్బు మురిగిపోయి విదేశీ బ్యాంకులవైపు పరిగెత్తుతున్నారు మన నాయకులు. అదే, ఏడాదికోసారి ఎన్నికలైతే, ఎప్పటికప్పుడు లెక్క, జమ తేలిపోతూ ఉంటుంది. అందరికీ సమన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఓ ప్రభుత్వం పాతబడే లోగానే మరో కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది కాబట్టి, ఎవరికీ 'అసలు ప్రభుత్వం ఉందా?' లాంటి సందేహాలు కలగవు. ఆలోచించాల్సిన విషయమే కదూ?

ఆదివారం, మార్చి 20, 2011

ఆనందభైరవి

సంప్రదాయాన్ని బతికించుకోడానికి ఓ తండ్రి పడే ఆరాటం, ఆధునికతని అందిపుచ్చుకోవాలన్న తనయుడి తపన, వీళ్ళిద్దరికీ మధ్యన నలిగిపోయే తల్లి, ప్రియురాలు. ఓ చిన్న కుటుంబంలో జరిగిన ఈ సంఘర్షణలో సంప్రదాయం గెలిచిందా? లేక ఆధునికత ముందు దాసోహమందా?? ...ఈ స్టోరీలైన్ తో, శాస్త్రీయ నృత్యం నేపధ్యంలో ఓ తెలుగు సినిమా అనగానే, 'కథ-చిత్రానువాదం-దర్శకత్వం కాశీనాధుని విశ్వనాధ్' అనే టైటిల్ ని ఊహించేసుకుంటారు మెజారిటీ ప్రేక్షకులు. కానీ, ఈ కథని తెరకెక్కించింది విశ్వనాధ్ కాదు, ఆయన ఆస్థాన రచయిత జంధ్యాల.

మూడు దశాబ్దాలకి పూర్వం 'ఆనందభైరవి' పేరుతో తెలుగు, కన్నడ భాషల్లో విడుదలై విజయం సాధించిన ఈ జంధ్యాల సినిమాకి, తెలుగులో వచ్చిన కళాత్మక సినిమాల జాబితాలో స్థిరమైన స్థానం ఉంది. బలమైన కథ, అక్కడక్కడా బలహీనంగా అనిపించే స్క్రీన్ ప్లే, వీనులవిందైన సంగీతం, సాహిత్యం, కంటికింపైన నృత్యం, వీటన్నింటికీ మించి పాత్రోచితంగా ఉన్న నటీనటుల నటన, దర్శకత్వ ప్రతిభ.. ఇవన్నీ కలిసి 'ఆనందభైరవి' ని కేవలం అవార్డు సినిమాగా మాత్రమే కాక, జనం మెచ్చిన సినిమాగా నిలబెట్టాయి.

కథాస్థలం దేశం గర్వించదగ్గ సంప్రదాయ నృత్యరీతి పురుడు పోసుకున్న కూచిపూడి అగ్రహారం. ఆ ఊళ్ళోని నాట్య గురువులలో నారాయణ శర్మగారికి (గిరీష్ కర్నాడ్) పెద్ద పేరు. నాట్యకళ వారికి వంశ పారంపర్యంగా అబ్బింది. తాతలనాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, కేవలం మగ పిల్లలకి మాత్రమే నృత్యం నేర్పుతున్నారు శర్మగారు. ఆయన కొడుకు ఆనంద శర్మకీ నృత్యం నేర్పించి, తను భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన సంప్రదాయాన్ని తర్వాతి తరానికి అందించాలన్నది శర్మగారి అత్యంత సహజమైన కోరిక.


అయితే, బళ్ళో చదువుతో పాటు అన్నింటిలోనూ ఫస్టున నిలబడుతున్న ఆనంద్ (రాజేష్) కోరిక వేరు. అతనికి నృత్యం అంటే ఆసక్తి ఏమాత్రమూ లేదు. నేర్చుకోవాలన్న కోరిక అసలే లేదు. బాగా చదువుకోవలన్నది అతని కల అయితే, కొడుకుని పెద్ద ఉద్యోగస్తుడిగా చూసుకోవాలన్నది తల్లి లక్ష్మి (కాంచన) కోరిక. గజ్జెపూజ కి ఆనంద్ నిరాకరించడంతో మొదలైన స్పర్ధ, అతడు ఇల్లు వదిలి పారిపోయి మేనమామ ఇంట తలదాచుకోవడంతో పెద్దదై, తన విద్యని నేర్పించడం కోసం బంగారి అనే దొమ్మరి పిల్లని శర్మగారు ఇంటికి తీసుకు రావడంతో ఓ కొలిక్కి వస్తుంది.

బంగారిని భైరవిగా (మాళవిక) మలచి, ఆమెనో గొప్ప నాట్యగత్తెగా తీర్చిదిద్దుతానని అగ్రహారీకులకి సవాల్ విసిరి, ఆమెతో కలిసి ఇల్లు విడిచిపెడతాడు నారాయణ శర్మ. కొడుకు, భర్త ఇల్లు విడిచిపెట్టడంతో ఒంటరిగా మిగిలిన లక్ష్మికి మామగారే ఆసరా. కొడుకూ, కోడలి ఇళ్ళ మధ్యన తిరుగుతూ ఉంటాడాయన. ఆనంద్, భైరవిల మధ్య చిన్ననాడే మొగ్గ తొడిగిన స్నేహం, వయసుతో పాటు పెరిగి పెద్దదై ప్రేమగా మారడం, ఆనంద్ ని వివాహం చేసుకుంటే భైరవి నాట్యానికి శాస్వితంగా దూరమవుతుందన్న భయంతో వారి ప్రేమని శర్మ గారు అంగీకరించక పోవడం వంటి మలుపులతో చకచకా సాగిపోతుంది కథ.

అగ్రహారీకులకి విసిరిన సవాల్ శర్మ గారు గెలిచారా? ఆనంద్-భైరవిల ప్రేమ గెలిచిందా? శర్మగారి సంప్రదాయం కొనసాగిందా? తదితర ప్రశ్నలకి సమాధానం చెబుతూ ముగుస్తుందీ సినిమా. కొండముది శ్రీరామచంద్రమూర్తి నవల 'చిరుమువ్వల మరుసవ్వడి' ఆధారంగా జంధ్యాల తయారు చేసుకున్న స్క్రిప్ట్ లో విశ్వనాధ్ మార్క్ సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అప్పటికే 'సిరిసిరిమువ్వ' 'శంకరాభరణం' వంటి కళాత్మక సినిమాలకి పనిచేసిన అనుభవం జంధ్యాలకి ఈ సినిమా చేయడంలో బాగా ఉపయోగపడింది. ద్వితీయార్ధంలో సాగతీతని, ముగింపుకి ముందు వచ్చే (ప్రి-క్లైమాక్స్) సన్నివేశంలో నాటకీయతనీ తగ్గించి ఉండాల్సింది అనిపించక మానదు.

రమేశ్ నాయుడు సంగీత సారధ్యంలో వచ్చిన పాటలు ఆణిముత్యాలు. ఎక్కువమందికి మొదట గుర్తొచ్చే పాట 'పిలిచిన మురళికి వలచిన మువ్వకి..' అయినప్పటికీ, నాకుమాత్రం 'కొలువైతివా రంగశాయీ..' పాటే చెవుల్లో మోగుతుంది. శర్మగారు సవాల్ గెలవాల్సిన సందర్భం అనే కీలక సన్నివేశంలో వచ్చే పాట కావడం ఇందుకు కారణం కావొచ్చు. పోటీ జరుగుతుండగానే, శర్మగారి తండ్రి మరణించారనే వార్త తెలియడం, ఆయనతో తమకున్న అనుబంధాన్ని శర్మగారూ, భైరవీ గుర్తు చేసుకుంటూనే పోటీలో కొనసాగడం... పాటకు తగ్గ చిత్రీకరణ.

'గురుబ్రహ్మా..' అంటూ భైరవికి నృత్య పాఠం మొదలు పెట్టిన నారాయణ శర్మ, అక్కడే ఉన్న తన తండ్రి పాదాలకి నమస్కరించడం, శర్మ గారి పాదాలకి భైరవి నమస్కరించడం చూసినప్పుడల్లా 'ఇక్కడ భైరవి స్థానంలో ఆనంద్ ఉండాలి కదూ' అనిపించక మానదు. 'చైత్రము కుసుమాంజలీ..' మరో మంచి పాట. ప్రారంభంలో వచ్చే 'సుడిగాలిలోన దీపం' జానపద బాణీ కాగా, చివర్లో వచ్చే 'రా..రా...రా...రాగమై' పాట చిత్రీకరణలో శృతి మించిన నాటకీయత కనిపిస్తుంది.

నటీనటుల్లో మొదటగా చెప్పుకోవాల్సింది గిరీష్ కర్నాడ్ ని గురించే. నారాయణశర్మ పాత్ర కోసమే పుట్టినట్టుగా అనిపిస్తాడు నాకైతే. బాలూ డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. ఆవెంటనే చెప్పుకోవాల్సింది మాత్రం లక్ష్మి గా చేసిన కాంచనను గురించే. లక్ష్మి పాత్రలో సంఘర్షణని, అత్యంత ప్రతిభావంతంగా ఆవిష్కరించింది కాంచన. కొన్ని సన్నివేశాల్లో గిరీష్ కర్నాడ్ తో పోటీపడి నటించింది. మాళవిక నటనకి వంక పెట్టలేము కానీ, ఒక్కరవ్వ వొళ్ళు చేస్తే ఇంకా బాగుండును కదా అనిపిస్తుంది.

కథ ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ లో నడుస్తుంది. అగ్రహారీకుల చాందసాన్ని కొంచం ఎక్కువ చేసి చూపించరేమో అనిపించక మానదు. సందర్భానుసారంగా 'సత్యభామ జడ' వంటి కూచిపూడి సంప్రదాయాలని పరిచయం చేసిన తీరు మెచ్చదగింది. నాట్య సంప్రదాయాన్ని గురించి గిరీష్ కర్నాడ్ చేత ఓ సుదీర్ఘ ఉపన్యాసం ఇప్పించారు జంధ్యాల. ఈతరహా ఉపన్యాసాలు అప్పట్లో వచ్చిన చాలా సినిమాలకి ఆయన రాసి ఉన్నారు. జంధ్యాల మార్కు హాస్యాన్ని పంచడానికి సుత్తి ద్వయం మరియు శ్రీలక్ష్మి ఉండనే ఉన్నారు. శ్రీలక్ష్మి 'ఈల' కామెడీ గురించి కొత్తగా చెప్పడానికేముంది?

పాత్రలని పరిచయం చేసి కథలో ముళ్ళని చకచకా వేసిన దర్శకుడు, వాటిని విప్పే క్రమంలో కొంచం తడబడినట్టుగా కనబడుతుంది. 'మూవీ టైం' వీడియో వారు విడుదల చేసిన వీడియో డిస్కు క్వాలిటీ ఏమంత బాగాలేదు. 'ఉన్నంతలో బాగా చేయడానికి ప్రయత్నించాం' అని వారు ఓ నోట్ పెట్టి ఊరుకున్నారు. ఈ సినిమా ప్రింట్ లలో బాగున్న దానిని ఎంపిక చేసి డిస్కుగా రూపాంతరం చెందించడం అత్యవసరం. ఎందుకంటే కళాత్మక సినిమాలని ఇష్టపడే అందరిదగ్గరా ఉండాల్సిన సినిమా ఈ 'ఆనందభైరవి.'

శనివారం, మార్చి 19, 2011

కలుపు మొక్కలు

"అంటే నా ఆత్మద్రోహమూ, మన ప్రెసిడెంటు పశుత్వమూ కలిస్తే వొక బ్రాహ్మణ కుటుంబానికి భుక్తి ఏర్పరుస్తాయన్నమాట -- కదుటండీ?" ..... "కనక బాబయ్యా, ఈ రాత్రి ప్రెసిడెంటుని తీసుకురమ్మని ఆ వూరకుక్కతో చెప్పండి.. ఒక్క దమ్మిడీ అయినా పుచ్చుకోదనిన్నీ చెప్పండి..." ...సహాయం కోరి వచ్చిన పేద బ్రాహ్మణుడి కోసం ఆత్మద్రోహానికి సిద్ధపడ్డ ఆ స్త్రీ పేరు దుగ్గిరాల శేషాచలం. రాజమహేంద్రవరం మెరకవీధిలో పేరుమోసిన వేశ్య.

సహాయం కోరి వచ్చినాయన పేరు అవధాన్లు. ఆరుగురు ఆడపిల్లల్ని, ఒక మగ పిల్లవాడినీ కన్న తండ్రి. సమస్య అతని కొడుకు ఉద్యోగం. ఎఫ్యే ఎల్టీ ప్యాసైన ఆ కుర్రాడికి స్కూలు మేష్టరు ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం ఇచ్చేది జిల్లా బోర్డు ప్రెసిడెంటు. శేషాచలం చెబితే ప్రెసిడెంటు కాదనడని ప్రెసిడెంటు దగ్గరి గుమస్తా చెబితే ఆవిడ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు అవధాన్లు. అప్పుడే పూజ ముగించుకు వచ్చిన శేషాచలం తాంబూలంతో సత్కరిస్తుంది పంతులు గారిని.

తను వచ్చిన పని చెప్పిన అవధానులుని ఆమె ఒకటే ప్రశ్న అడిగింది. "...దేవుడున్నాడా అవధానులుగారూ!" జవాబు కూడా ఆవిడే చెప్పింది.. "అదేమంటే? దేవుడు లేడు, దెయ్యాలు మాత్రం ఉన్నాయి. ధర్మం లేదు, అధర్మం అంతటా నిండిపోయివుంది. మంచి మందులోకయినా లేదు, దౌర్జన్యం మాత్రం పెరిగిపోతోంది. నీతి మాలోనే కాదు, మన దేశంలోనే లేదు. ఎవరేం చెప్పినా శుద్ధ అబద్ధం తప్ప సత్యం లేనే లేదు. ఎటు చూసినా హింస. ఎక్కడ పట్టినా రక్తం. దేవుడు లేనేలేడండీ!"

శేషాచలం కోపానికి కారణం లేకపోలేదు. ఆమె ఒక బ్రాహ్మణ ఇంట్లో పెళ్ళికి మేళం వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇందుకు కారణం. మొగ పెళ్ళివారికి ప్రెసిడెంటు చుట్టం. ఒకరాత్రి బసకి రమ్మని కబురు. ఎప్పుడూ, ఎక్కడా, ఎవరి బసకీ వెళ్ళదు శేషాచలం. మేళం వెళ్ళిన చోట బ్రహ్మచర్యం ఆచరిస్తుంది కూడా. ఈ కారణానికి "వల్లకాదని" కచ్చితంగా చెప్పేసింది. ప్రెసిడెంటు నూరు రూపాయల కాగితం మీద పడేసినా, పుల్లాకు చూసినట్టు చూసి దూరంగా వెళ్లిపోయింది.

ఇది మనసులో పెట్టుకున్న ప్రెసిడెంటు, మర్నాడు సాయంత్రం సభలో ఆమె గజ్జె కట్టి ఉండగా విప్పించి సత్రకాయ చేత కట్టించాడు. రాత్రి ఊరేగింపులో ఆమెని గజ్జె కట్టమన్నాడు. "పశుత్వం కాని, యిది పగా బాబయ్యా? సభలో నాయకురాలిని గజ్జె విప్పించిన వాడూ, ఊరేగింపులో నాయకురాలిని గజ్జె కట్టమన్న వాడూ మనిషేనా? ....తరవాత వాకబు చేసాను. మన ప్రెసిడెంటుకి రూపత్రుష్ణ తప్ప మరేమీ లేదు. ఈ కుట్ర అంతా ఆ వూరకుక్కది... నేను శిఫారసు చెయ్యడం అంటే ఏమిటో తమకిప్పుడు బోధపడిందా?"

అవధాని వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోడానికి సిద్ధపడ్డాడు. "ఇంత కుట్రా? ఇంత ద్రోహమా? తనేలాగా తార్పుడుకాడే. నన్ను కూడా తనలాగా తయారు చేస్తాడా ఈ నీచుడు? నీకూ ప్రెసిడెంటుకీ ఇదివరకే సంబంధం ఉందనీ, ప్రాధేయపడితే నువ్వు శిఫారసు చేసి పని యిప్పిస్తావనీ వచ్చాను. పైగా, నువ్వింత యోగ్యురాలివని ఎరగనే ఎరగను. నేను బ్రాహ్మణ్ణి. వేదం వల్లించాను. యాచన చేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నాను. ఇకముందు మరో నలుగుర్ని ఆశ్రయిస్తూ ఉంటాను కానీ, వేశ్య అయినా కులాంగన లాగా అభిజాత్యం కల వొక కళావతిని తార్చడానికి నేను సాహసించలేను. కనక తల్లీ, నన్ను క్షమించు. నాకోరిక మరిచిపో, నాకు సెలవియ్యి.."

కానీ అందుకు శేషాచలం ఒప్పుకోలేదు. తన వల్ల ఒక వేదమూర్తి కుటుంబానికి జీవనాధారం ఏర్పడడం తన అదృష్టంగా భావించింది. తన జీవితంలో దీనినేంతో పవిత్రమైన సంఘటనగా తీసుకుంది. "...ఇంతకీ నేను పతివ్రతనెలాగా కాను. మగనాలినంతకంటే గాను. కనక దీనివల్ల నాకిప్పుడు కొత్తగా సంభవించే పాతిత్యం కూడా ఏమీ లేదు. నాకు విచారం లేదు. తమరూ విచారించ వద్దు.."

అంతటితో ఆగలేదు శేషాచలం. "...ఇక నేను వినను. తమరేమీ సెలవివ్వద్దు. ఇది ఇలా జరిగి తీరవలసిందే. మనవి చేసుకున్నాను కాదూ? పశువులతో సాహచర్యం మాకు పరిపాటే. బాబయ్యా, తమరు బెంగ పెట్టుకోవద్దు. ఇందాకా నేను చెప్పిన మాట ఆ వూరకుక్కతో చెప్పండి. మరోలాగా చేశారంటే, నేర్చిన వేదానికి తమరు ద్రోహం చేసినవారవుతారు.ఎప్పుడేనా దర్శనం దయచేయిస్తూ ఉందండి. అమ్మగారికి నా దండాలు మనవి చెయ్యండి."

ఏం మాట్లాడాలో తెలియని అవధాని "వేశ్యా కులంలో తప్ప పుట్టావమ్మా.." అంటూ ఆమె యోగ్యతని మెచ్చుకుంటే, "ఏం, వేశ్యాకులం అంత చెడిపోయిందా బాబయ్యా? అగ్రజాతి గృహిణులందరూ మచ్చ లేనివారేనా నాయనగారూ? మాలో నన్ను తల తన్నే ఇల్లాళ్ళు -- సానులయి ఉండిన్నీ పాతివ్రత్యానికి వరవడి పెట్టేవారు వేలున్నారు. కాని లోకం గుడ్డిది, పురుషులు మత్తులు.. ఇప్పుడిదంతా అప్రస్తుత ప్రశంస. దయచెయ్యండి. ఒక్కమాటు పాదాలు..." అంటూ నమస్కారం చేసుకుంది.

తర్వాత కథ ఏమయ్యింది? అవధానులు గారబ్బాయికి ఉద్యోగం దొరికిందా? శేషాచలం త్యాగం ఎవరికి ఎక్కువ ఉపయోగపడింది? సమాజంలో కలుపు మొక్కలు ఎవరు? ఇత్యాది ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఏడు దశాబ్దాలకు పూర్వం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రాసిన కథ 'కలుపు మొక్కలు.' శాస్త్రి గారి కథల్లో నేను మొదట చదివిన కథ. ఈ ఒక్క కథతోనే ఆయన నా అభిమాన కథారచయితల జాబితాలో చేరిపోయారనడం అతిశయోక్తి కాదు. గురజాడ వారి 'మధురవాణి' స్ఫూర్తి, ప్రభావమూ శేషాచలం మీద ఉన్నాయనడం నిర్వివాదం. తెలుగు కథా సాహిత్యాన్ని ఇష్టపడే వారంతా తప్పక చదవాల్సిన కథ.

బుధవారం, మార్చి 02, 2011

చదువు

తెలుగు పాఠకులు కొ.కు. గా పిలుచుకునే కొడవటిగంటి కుటుంబరావు రచనల్లో నాకు బాగా ఇష్టమైనది 'చదువు.' ఇది కేవలం చదువుపట్ల చిన్ననాటి నుంచే అమితమైన ఆసక్తి కనబరించిన సుందరం కథ మాత్రమే కాదు, రెండు మహా ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో ఆ యుద్ధాలతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధమూ లేని ఆంధ్ర దేశంలోని ఓ చిన్న పట్టణంలో ప్రజా జీవితంలో చోటు చేసుకున్న మార్పులని, నాటి సాంఘిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులనీ నిశితంగా చిత్రించిన నవల.

సుందరం బాల్యం, అతడి అక్షరాభ్యాసంతో మొదలయ్యే కథ అతని కొడుకు అక్షరాలని గుర్తు పట్టడంతో ముగుస్తుంది. సుందరం తల్లి సీతమ్మగారిని వాళ్ళింట్లో వాళ్ళు చదివించలేదు. చదువుమీద ఇష్టంతో ఆవిడే కొంతవరకు చదువు నేర్చుకుంది. తండ్రి శ్రీమన్నారాయణ ఓ చిన్న ఉద్యోగి. కొడుకు చదువు గురించి అతనికి పెద్దగా పట్టింపులేవీ ఉండవు. సీతమ్మగారికి మాత్రం సుందరాన్నిబాగా చదివించాలని ఉంటుంది. ఇందుకోసం ఆవిడ అతనికి బడి అన్నా, చదువన్నా ఇష్టం ఏర్పడేలా చేస్తుంది.

సీతమ్మ గారి కృషి ఫలితంగా, సుందరానికి చదువుమీద ఆసక్తి నానాటికీ పెరిగి, ఎప్పుడెప్పుడు బళ్ళో చేరతానా అని ఎదురుచూడడం మొదలు పెడతాడు. ఘనంగా అక్షరాభ్యాసం చేసి వీధి బళ్ళో చేరుస్తారు అతణ్ణి. బళ్ళో చేరిన రెండో రోజునే చేదు అనుభవం ఎదురవుతుంది సుందరానికి. మేష్టారి కఠిన శిక్ష కారణంగా బడి అంటే భయం ఏర్పడుతుంది. సీతమ్మగారు తనకి వచ్చిన అక్షరాలు, అంకెలు సుందరానికి శ్రద్ధగా నేర్పించడమే కాదు, అతను వేగంగా నేర్చుకుంటుంటే ఎంతగానో సంతోష పడుతుంది కూడా.

తనకి వచ్చిన అక్షరాలు, గుణింతాలు, అంకెలు నేర్పడం పూర్తయ్యాక భర్తకి మళ్ళీ మళ్ళీ చెప్పి ఒప్పించి సుందరాన్ని ఓ మంచి వీధి బడిలో ప్రవేశ పెడుతుంది సీతమ్మ గారు. అక్కడ చదువు పూర్తవ్వగానే అతను నేరుగా హైస్కూలులో ప్రవేశించవచ్చు. వీధిబడిలో సుందరం చదువు పుస్తకాలకి మాత్రమే పరిమితం కాలేదు. నిజం చెప్పాలంటే అప్పటినుంచీ సుందరం కేవలం పుస్తకాలనుంచి మాత్రమే కాక, తన చుట్టూ ఉన్న సమాజం నుంచి తనకి అర్ధమైనన్ని విషయాలు నేర్చుకోవడం మొదలు పెట్టాడు.

సీతమ్మగారికి ఆడపిల్ల కలగడం, శ్రీమన్నారాయణ 'బెరిబెరీ' వ్యాధితో చనిపోవడం, సుందరం హైస్కూలులో ప్రవేశించడం ఇంచుమించుగా ఒకేసారి జరుగుతాయి. భర్త మరణం సీతమ్మగారిని బాగా కుంగదీస్తే, దానితాలూకు ఫలితం ఏమిటన్నది నెమ్మదిగా అర్ధమవుతూ వస్తుంది సుందరానికి. ఇంటిలో ఓ భాగం అద్దెకి ఇచ్చి, పొలం మీద వచ్చే ఆదాయం జాగ్రత్త చేసీ గుట్టుగా సంసారాన్ని నడపడం మొదలుపెడుతుంది సీతమ్మ గారు. ఆమె సోదరుడు శేషగిరి కొంత సహాయంగా నిలబడతాడు.

సుందరం హైస్కూలు చదువు ముగింపుకి వచ్చేనాటికి యుద్ధం (మొదటి ప్రపంచ యుద్ధం) ముమ్మరమవుతుంది. ఆ ప్రభావం జన జీవితం మీద పడుతుంది. ఖర్చులు రెట్టింపవుతాయి. యుద్ధం ముగియడంతోనే మహాత్ముడి నాయకత్వంలో దేశ స్వతంత్రం కోసం ఉద్యమాలు మొదలవుతాయి. సుందరం స్కూల్ ఫైనల్ అవగానే ఏదన్నా ఉద్యోగం చూసుకుంటే బాగుండును అనుకుంటుంది సీతమ్మగారు. కానీ సుందరం ఆలోచనలు వేరు. అతని దృష్టిలో చదువు ఉద్యోగం కోసం కాదు. చదువు చదువు కోసమే. ఇంకా చదవాలన్నది అతని కోరిక.

స్వభావ సిద్ధంగా కొంత, పరిస్థితుల ప్రభావం వల్ల మరికొంత అంతర్ముఖుడిగా మారిన సుందరం తల్లితో మాట్లాడడం తగ్గించేస్తాడు. అంతే కాదు, తన భావాలని వేటినీ ప్రకటించడు. సుందరం వైఖరి బాధ కలిగిస్తుంది తల్లికి. అతణ్ణి చదువు మానేయమని గట్టిగా చెబుదామంటే, కొడుక్కి చదువుపై ఆసక్తి కలిగించడానికి తను చేసిన ప్రయత్నాలు గుర్తొస్తాయి సీతమ్మ గారికి. మధ్యేమార్గంగా, కొడుక్కి పెళ్ళిచేసి చదువు చెప్పించే బాధ్యతని మావగారికి అప్పగించాలని నిర్ణయించుకుంటుంది ఆవిడ.

కేవలం సుందరం చదువు ఎలా కొనసాగిందన్నది మాత్రమే కాదు, జాతీయోద్యమం ఎలా జగిరింది, అప్పటి గ్రామ రాజకీయాలు, ఆవేశంతో ఉద్యోగాలు వదిలి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఆ తర్వాత పశ్చాత్తాప పడడం, జాతీయ కళాశాలల ఏర్పాటు ఉద్యమం విఫలమైన కారణంగా చదువు మధ్యలోనే ఆగిపోయిన యువత వెతలు, దేశాన్ని పట్టి కుదిపిన ఆర్ధిక మాంద్యం లాంటి ఎన్నో విషయాలని కళ్ళ ముందు ఉంచే నవల 'చదువు.'

సుందరం మితభాషి కావడం వల్ల, సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఉండవు. అయితే అక్కడక్కడా జరిగే చర్చల కారణంగా ఒకే అంశంపై భిన్న కోణాలని, ధోరణులని అర్ధం చేసుకోగలుగుతారు పాఠకులు. సుందరం స్వభావం అతని కుటుంబ సభ్యులకే కాదు, కొన్ని కొన్ని సన్నివేశాల్లో పాఠకులకీ కొరుకుడు పడదు. చదువు మీద అతనికి యెంతో ఆసక్తి, అలా అని చదువు వినా ఇతర విషయాలని పట్టించుకోని వాడు కాదు. కానీ, తామరాకు మీద నీటిబొట్టు చందం.

సుందరం, సీతమ్మలతో పాటు, శేషగిరి, నరుసు, శకుంతల పాత్రలు కూడా చాలాకాలం వెంటాడతాయి. వయసుతో పాటుగా సుందరం ఆలోచనల్లో వచ్చే మార్పుని చాలా చక్కగా అక్షరబద్ధం చేశారు రచయిత. ఒక మధ్యతరగతి నేపధ్యం నుంచి కొన్ని దశాబ్దాల దేశ చరిత్రని పరిశీలించే ఈ నవల, నేను ఎక్కువసార్లు చదివిన పుస్తకాలలో ఒకటి. (విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 184)