శుక్రవారం, మే 25, 2012

వంశీ 'మన్యంరాణి'

మనం ఏదన్నా అడవి మీదుగా ప్రయాణం చేసేటప్పుడు కిటికీ లోంచి కనిపించే మనుషులనీ, దృశ్యాలనీ రెప్ప వాల్చకుండా చూస్తాం. ప్రయాణం ముగిశాక కూడా ఆ జ్ఞాపకాలు ఓ పట్టాన వదలవు. అదాటున చూసిన మనుషులు పెద్దగా గుర్తుండక పోవచ్చేమో కానీ, చెట్టూ చేమనీ, పశు పక్ష్యాదులనీ ఓ పట్టాన మర్చిపోలేం. వంశీ నవల 'మన్యంరాణి' పూర్తి చేసి పక్కన పెట్టాక కూడా అంతే. నవలలో పాత్రలు, కథా గమనం కన్నా కూడా రచయిత చేసిన ప్రకృతి వర్ణనలు పదే పదే గుర్తొస్తాయి. కథమీద కన్నా కూడా, ఈ వర్ణనల మీద రచయత ఎక్కువగా దృష్టి పెట్టడమే ఇందుకు కారణం.

ఇప్పటివరకూ, 'మా పసలపూడి కథలు' 'మా దిగువ గోదారి కథలు' సంపుటాల్లో తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలని పరిచయం చేసిన వంశీ, ఈ నవలకి నేపధ్యంగా అదే జిల్లాలోని మారేడుమిల్లి అడవులని ఎంచుకున్నారు. అడవి అందాలు, గిరిజనుల జీవితం, ఆచార వ్యవహారాలూ, అడవితో వారికి పెనవేసుకుపోయే అనుబంధం, అదే అడవిని దోచుకునేందుకు రకరకాల మనుషులు చేసే రకరకాల కుట్రలు, వీటికి ఊహకందనంత నాటకీయత తోడైతే అదే 'మన్యంరాణి' నవల. అడవికి అంతకీ పెద్దయిన కొమరం లచ్చన్నమావ కథ, ఆయన కూతురు మన్యం మొత్తానికి అద్భుతమైన సౌందర్యవతీ అయిన రాజమ్మల కథ ఇది.

ఆ అడవిలో లచ్చన్న మావ మాట వేదం. మూలికల వైద్యం చేసే లచ్చన్న మావ గీసిన గీటు దాటరు ఎవరూ. వయసొచ్చిన రాజమ్మ అద్దంలోనూ, నీటి చెలమల్లోనూ తన అందమైన ప్రతిబింబాన్ని చూసుకుని మురుసుకుంటూ ఉంటుంది. ఓ సందర్భంలో రాజమ్మని చూసిన ముగ్గురు యువకులు ఆమెతో పీకలోతు ప్రేమలో మునిగిపోతారు. మరోపక్క, కలప స్మగ్లర్ల బారినుంచి అడవితల్లిని కాపాడుకోడానికి తీవ్రంగా కృషి చేస్తూ ఉంటాడు లచ్చన్న మావ. ఆ ముగ్గురు కుర్రాళ్ళ ప్రేమకథ ఏమయ్యింది? లచ్చన్న మావ ఆశయం నెరవేరిందా, లేదా? అన్నది నవల ముగింపు.


వంశీ కథల్లో తగుమాత్రంగా కనిపించే నాటకీయత, నవలల దగ్గరికి వచ్చేసరికి అంతా తానే అయిపోతూ ఉంటుంది. నవలల్లో సిని ఫక్కీ మలుపులు చేర్చడం పట్ల వంశీకి ఉన్న మక్కువ ఇందుకు కారణం అయ్యి ఉండొచ్చు. మిగిలిన నవలల్లోలాగానే, ఈ 'మన్యంరాణి' లోనూ నాటకీయత శృతి మించడం వల్ల కథా, కథనాలకి ఓ తీరూ తెన్నూ లేకుండా పోయింది. ప్రతి పాత్రకీ ఓ ఐడెంటిటీ ని ఇవ్వడంలో రచయిత కృతకృత్యుడు కాలేకపోయాడు. అలాగే, లచ్చన్న మావ పాత్ర మీద పెంచుకున్న ప్రేమ వల్ల, మిగిలిన పాత్రలు అంగుష్ఠమాత్రంగా మిగిలిపోయాయి. కథని వంశీ మార్కు హడావిడి ముగింపుకి తేవడం వల్ల, కనీసం లచ్చన్న మావ పాత్ర కూడా పాఠకుల మీద బలమైన ముద్ర వేయలేకపోయింది.

గత సంకలనాల్లో గోదారి ప్రాంతపు మాండలీకానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వంశీ, 'మన్యంరాణి' కి వచ్చేసరికి గిరిజనుల చేత 'పేపరు భాష' మాట్లాడించేయడం విషాదం. అసలు లచ్చన్న మావ పాత్ర ఎప్పుడూ ఉపన్యాస ధోరణిలోనే మాట్లాడుతూ ఉంటుంది. అలాగే, మిగిలిన పాత్రల సంభాషణలు కూడా చాలాచోట్ల కృతకంగా అనిపిస్తాయి. గిరిజనులకి ప్రత్యేకమైన ఓ భాష ఉంది.. అలాగే తెలుగు మాట్లాడినా వాళ్ళకో ప్రత్యేకమైన మాండలీకం ఉంది. ఆచార వ్యవహారాలూ, వంటలు, పిండి వంటలని ఒడిసి పట్టుకుని వర్ణించిన వంశీ, ఈ యాసని ఎందుకు పట్టుకోలేదో మరి. అడవిలో కుగ్రామాల్లో ఉండే గిరిజనులు కూడా 'కోట్ల రూపాయల' గురించి మాట్లాడ్డం కొరుకుడు పడదు.

వంశీ రచనలంటే బాపూకి ఎంతో ప్రేమ. రచనకి వంశీ పడే కష్టానికి సమంగా కష్టపడి బొమ్మగీస్తారు బాపూ. ఈ నవలకి వచ్చేసరికి, వంశీ కన్నా కూడా బాపూనే ఎక్కువ కష్ట పడ్డారని అనిపించక మానదు. ఒక్కో పేజీ తిప్పుతుంటే బాపూ గీసిన బొమ్మలు ప్రాణం పోసుకుని కళ్ళ ముందు నిలబడ్డాయేమో అనిపించేస్తుంది. చక్కని ఆర్టు పేపరు మీద, సుందరంగా ముద్రించడం వల్ల మరింత అందం వచ్చేసింది ఆ బొమ్మలకి. కథ, కథనాల మాట ఎలా ఉన్నా, మనకి ఏ మాత్రం తెలియని అడవి గురించీ, అక్కడి చెట్టూ పుట్టా గురించీ, ఒక్కో కాలంలో ఒక్కోలా ప్రవర్తించే జంతువులూ, పక్షుల గురించీ తెలుసుకొడానికీ, వీటన్నింటినీ మించి అందమైన బాపూ బొమ్మలని మరింత బాగా అర్ధం చేసుకోడానికీ చదవాలి 'మన్యంరాణి' ని. (ఇలియాస్ ఇండియా ప్రచురణ, పేజీలు 196, వెల రూ. 250, అన్ని పుస్తకాల షాపులు).

శనివారం, మే 05, 2012

జమీల్యా

దాదాపు పదేళ్ళ క్రితం.. ఓ మిత్రుడితో పుస్తకాల గురించి మాట్లాడుతుండగా, తను అంతక్రితం ఎప్పుడో చదివిన ఓ పుస్తకాన్ని గురించి చాలా ఉత్సాహంగా చెప్పారు. "చాలా చిన్న పుస్తకం.. లైబ్రరీలో కూర్చుని ఓ గంటలో చదివేశాను. ఓ పట్టాన మర్చిపోలేం.. వివాహిత అయిన ఓ ముస్లిం యువతి ప్రేమకథ..." తను చెబుతూ ఉండగానే "మైదానం రాజేశ్వరి లాగా?!" అడిగాన్నేను. "కాదు..కాదు.. ఇది పూర్తిగా వేరే కథ.. పేరు గుర్తు రావడం లేదు కానీ చదవాల్సిన పుస్తకం," కాసేపు పుస్తకం పేరు, రచయిత పేరు గుర్తు చేసుకోడానికి ప్రయత్నించి విఫలమయ్యారు తను.

కిర్గిజ్ రచయిత చింగీజ్ ఐత్ మాతోవ్ నవల 'జమీల్యా' చదవడం పూర్తి చేయగానే, నాకు పదేళ్ళ క్రిందటి సందర్భం,సంభాషణ గుర్తొచ్చాయి. సందేహం లేదు, తను చెప్పిన నవల ఇదే. పాకెట్ సైజులో తొంభై ఆరు పేజీలున్న ఈ నవలని చదవడం మంచినీళ్ళ ప్రాయం. సున్నితమైన కథ, పరుగులు పెట్టించే కథనం, పెద్దగా ఇబ్బంది పెట్టని అనువాదం. ముగింపుతోనే కథ ప్రారంభమవుతుంది కాబట్టి ఏమవుతుందో అన్న ఆదుర్దా ఉండదు. అయితేనేం, కథలో లీనమైపోయిన పాఠకుడికి పుస్తకం చదవడం పూర్తైపోయిందన్న విషయం అర్ధం కాడానికి కొంత సమయం పడుతుంది, కచ్చితంగా.

"ప్రపంచంలోని బహు సుందరమైన ప్రేమకథల్లో ఒకటిగా గణుతికెక్కిన రచన" ఇది ప్రకాశకుల మాట. 'కిర్గిజ్ జాతిపిత' గా పేరుపొందిన చింగీజ్ కి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టిన నవల 'జమీల్యా.' కిర్గిస్తాన్ గిరిజన జీవన సౌందర్యానికి అక్షర రూపం ఈ నవల. కథా కాలం రష్యా-జర్మనీల మధ్య యుద్ధం ముమ్మరంగా ఉన్న సమయం. రష్యా యువకులంతా నిర్బంధంగా సైన్యంలోకి తరలింప బడ్డారు. వారిలో కొత్తగా పెళ్ళైన సాదిక్ కూడా ఉన్నాడు. ఒక పేద గిరిజన ముస్లిం కుటుంబానికి చెందిన వాడు సాదిక్. పెద్ద తమ్ముడితో సహా యుద్ధానికి బయలుదేరాడు, తన భార్య జమీల్యాని ఉమ్మడి కుటుంబంలో వదిలి.


సాదిక్ తల్లి, పెద తండ్రి, పెద తల్లి, (తెగ సంప్రదాయం ప్రకారం తన భర్త మరణాంతరం సాదిక్ తల్లి తన బావ గారిని వివాహం చేసుకుంటుంది), తమ్ముడు చిట్టి, చెల్లెలు.. ఇదీ కుటుంబం. చిన్నపిల్లలిద్దరూ బడి ఈడు వాళ్ళు. యుద్ధం కారణంగా బడి మూసేస్తారు. తండ్రి చేతి పని వాడు. మిగిలిన కుటుంబం అంతా ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో గోధుమలు పండిస్తూ ఉంటారు. జమీల్యా చాలా సరదా అయిన యువతి. కష్ట పడి పని చేసే స్వభావం. అయితే, ఎవరిచేతా మాట పడదు. ఆమె ప్రవర్తన ఒక్కోసారి ఉమ్మడి కుటుంబ నియమావళికి విరుద్ధంగా ఉన్నా, ఆమె స్వభావాన్ని అర్ధం చేసుకున్న కుటుంబ సభ్యులంతా దానిని 'చిన్నతనం' గా సరిపెట్టుకుంటారు.

"జమీల్యా మంచి అందంగా ఉండేది. దార్యమైన శరీరం, వొయ్యారం ఒలికే తీరు, బిగుతుగా జంట జడలుగా దువ్వుకున్న తిన్నని బిరుసు జుట్టు. తెల్లని రుమాలును తమాషాగా నుదుటి మీదకి వొక్క రవ్వ ఐమూలగా వచ్చేటట్టు తలపైన చుట్టుకునేదేమో, అది ఆమెకి చక్కగా అమరి ఆమె చామన ఛాయ ముఖానికి వింత విన్నాణం చేకూర్చేది. జమీల్యా నవ్వేటప్పుడు ఆ కారునలుపు వాలు కళ్ళు యవ్వనోత్సుకతతో వెలిగిపోయేవి, ఇక తటాలున ఏ కొంటె గోంగూర పాటో పాడడం మొదలెట్టడంతో ఆ సొంపారు కళ్ళు కన్యాయోగ్యం కాని మెరపులతో తళ్కుమనేవి." ఆంటాడు రచయిత. సహజంగానే ఊళ్ళో ఉన్న కోడెకారు, యుద్ధం నుంచి వచ్చేసిన సైనికుల కళ్ళన్నీ జమీల్యామీదే. అయితే, ఎవర్ని ఎక్కడ ఉంచాలో బాగా తెలిసిన పడతి జమీల్యా.

కుటుంబ సంప్రదాయాలని గౌరవించే సాదిక్ ఏనాడూ భార్యకి ప్రత్యేకంగా ఉత్తరం రాయడు. తల్లిదండ్రులకి రాసిన ఉత్తరం చివర్లో ఆమె క్షేమం తలుస్తూ ఓ వాక్యం మాత్రం రాస్తూ ఉంటాడు. అతడు సైన్యం నుంచి తిరిగి వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆ కుటుంబం. ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో పండించిన గోధుమలని సైనికుల కోసం తరలించేందుకు పక్కనే ఉన్న టౌన్ లోని రైల్వే స్టేషన్ కి తీసుకెళ్ళాల్సిన బాధ్యత జమీల్యా కుటుంబానికి, కాలి గాయంతో సైన్యం నుంచి తిరిగి వచ్చేసిన దనియార్ అనే అనాధ యువకుడికీ అప్పగించ బడుతుంది. జమీల్యాకి సాయంగా చిట్టిని పంపుతుంది ఆమె కుటుంబం. దనియార్ ఏ ప్రత్యేకతా లేనివాడు. అంతర్ముఖుడు. మొదటి రోజు స్టేషన్ కి వెళ్ళిన జమీల్యాకి, అక్కడ తారస పాడిన ఓ సైనికుడి ద్వారా సాదిక్ త్వరలోనే ఊరికి తిరిగి రాబోతున్నట్టు తెలుస్తుంది.

అయితే, జమీల్యా-దనియార్ ల మధ్య మొదలైన ఓ స్పర్ధ అనుకోకుండా పెద్దదై వారిద్దరూ ఒకరినొకరు తెలుసుకోడానికి కారణం అవుతుంది. దీనంతటికీ సాక్ష్యం చిట్టి. తనకి తెలియకుండానే జమీల్యాని మూగగా ప్రేమించే చిట్టి కూడా ఒకానొక దశలో జమీల్యా-దనియార్ లు ఏకమైతే బాగుండునని కోరుకుంటాడు. ఎవరికీ ఎలాంటి ప్రత్యేకతా లేనివాడుగా కనిపించే దనియార్, జమీల్యాకి ఎంతో ప్రత్యేకమైన వాడవుతాడు. వెన్నెల రాత్రుల్లో, టౌన్ నుంచి ఖాళీ బళ్ళతో టౌన్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు దనియార్ పాడే పాటలు ఆమెని యేవో వింతలోకాల్లో విహరింపజేస్తాయి. ఉమ్మడి కుటుంబం, తెగ సంప్రదాయాలు, త్వరలోనే తన భర్త తిరిగి రాబోతున్నాడన్న సంగతీ బాగా తెలిసిన జమీల్యా, ఓ వర్షపు రాత్రి దనియార్ పట్ల తన ప్రేమని ప్రకటిస్తుంది, చిట్టి సాక్షిగా. తర్వాత ఏం జరిగిందన్నది - తర్వాతి కాలంలో చిత్రకారుడిగా ఎదిగిన - చిట్టి నుంచి వినాల్సిందే.

ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. వుప్పల లక్ష్మణరావు (తెలుగు నవల 'అతడు-ఆమె' రచయిత) సాఫీగా అనువదించారు. పుస్తకంలో పెద్దగా అచ్చు తప్పులు లేనప్పటికీ, అనువాద రచయిత పేరు పుప్పల లక్ష్మణరావుగా ప్రచురింపబడడం విషాదం. చదువుతున్నప్పటి కన్నా, చదివి పక్కన పెట్టాక మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి ఆలోచింపజేసే రచన ఇది. (వెల రూ. 40, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

గురువారం, మే 03, 2012

జాజి పూసే వేళ...

'కాలం వేళ్ళ సందుల్లోనుంచి ఇసుకలా జారిపోతోంది....' తెలియకుండా గడిచిపోయే తీరుని ఇంత చక్కగా అక్షరాల్లో బంధించిన అజ్ఞాత రచయితకి అభివందనాలు. నిజం కదూ.. ఎప్పుడో అలసినప్పుడో, మనసు పుట్టినప్పుడో ఓసారి వెనక్కి చూసుకుందాం అనుకుంటే కనుచూపు మేరంతా పాదముద్రలే.. ఎక్కడ మొదలు పెట్టి ఏ చోట ముగిస్తామో తెలియని ప్రయాణమే కదా జీవితం. ఇంతకీ ఇలా వెనక్కి చూసుకున్నప్పుడు గడిచిన జీవితం మొత్తం సినిమా రీలులాగా కనిపించదు కాక కనిపించదు.. కేవలం కొన్ని సందర్భాలు, సన్నివేశాలు మాత్రమే కాలపరిక్షను ఎదుర్కొని నిలబడతాయి.

జీవిత సారాన్ని 'కష్టం-సుఖం' అని రెండు ముక్కల్లో తేల్చి పారేశారు మన పెద్దవాళ్ళు. నిజమే, జరిగిపోయిన వాటికి జాబితా వేయడం మొదలుపెడితే ఈ రెండు వర్గాలనీ దాటవు. కష్టాలు బావుంటాయి. మరీ ముఖ్యంగా అవి తీరిపోయాక మాబాగుంటాయి. ఇక సుఖం.. దీనికి అంతు ఏమన్నా ఉందా? ఇక చాలు అనిపిస్తుందా? 'సుఖం అనే ఎండమావిని చేరుకోవడం కోసం కష్టాల ఎడారిలో చేసే ప్రయాణమే జీవితం' అంటుంటారు కొందరు.. ఒప్పుకోవాలని అనిపించదు.. కష్టాన్ని గుర్తించినంత, గుర్తు పెట్టుకున్నంతగా సుఖాన్ని గుర్తు పెట్టుకోము కదా మరి..

ఎర్రటి ఎండలో బయట తిరిగొచ్చాక, నీడ పట్టున కూర్చుని చల్లటి నీళ్ళు తాగడంలో ఎంత సుఖం ఉందసలు? ఎండని గుర్తు పెట్టుకున్నంతగా నీళ్ళు తాగి, విశ్రమించడాన్ని గుర్తు చేసుకోం. ఎండా, మనదే, నీళ్ళూ మనవే అయినప్పుడు ఎండని మాత్రమే గుర్తుంచుకుని, నీళ్ళని మర్చిపోవడంలో తప్పు ఎవరిది మరి. నీడా, నీళ్ళూ అంత గొప్పగా ఉంటాయని మనకి చెప్పిన ఎండని మెచ్చుకోవాలి న్యాయంగా. కష్టం వల్లే కదా, సుఖం విలువ బాగా తెలుస్తుంది. 

'నా మొహాన సుఖపడే రాత లేదు' లాంటి మాటలు విన్నప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. ఆశించింది దొరకడం మాత్రమే సుఖం అనే ధోరణి వల్ల, కేవలం కష్టాలని మాత్రమే గుర్తించి గుర్తుపెట్టుకుంటున్నారేమో అనుకుంటూ ఉంటాను. పోనీ, సుఖపడడం కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? ఏదీ తనంతట తాను రాని లోకంలో ఉన్నాం మనం. కష్టమైనా, సుఖమైనా తగినంత కారణం లేనిదే వచ్చి వాలిపోదు.మనం ఆలోచించనిదో, ఆలోచించడానికి ఇష్టపడనిదో ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది.

మన కష్టసుఖాలకి - మరీ ముఖ్యంగా కష్టాలకి - మరొకర్ని బాధ్యులని చేసేయడం మనకి వెన్నతో పెట్టిన విద్య. ఎవరి కర్మకి వారే కర్తలవుతారనే విషయాన్ని చాలా సులువుగా మర్చిపోగలం. అప్పుడైతేనే చేతులు దులిపేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా, మనల్ని మరొకరితో పోల్చుకుని వాళ్ళు సుఖ పడిపోతున్నారనీ మనం మాత్రం కష్టాల్లో మునిగి తేలుతున్నామనీ బలంగా నమ్ముతున్నప్పుడు, అవతలి వారికి అన్నీ అయాచితంగా వచ్చి పడ్డాయనీ, మనం ఎంత ప్రయత్నం చేసినా 'ఏదో అడ్డుపడి' దొరకాల్సింది దొరకలేదనీ అనేసుకోగలం.

జాజులు పూసే సాయంత్రం వేళ, పడక్కుర్చీలో విశ్రాంతిగా జేరబడి, కళ్ళు మూసుకుని పాటలు వినడం చాలా బాగుంటుంది. ఎప్పుడంటే, రోజంతా శ్రమ చేసినప్పుడు.. మనం నిర్వర్తించాల్సిన పనులు పూర్తి చేసినప్పుడు. ఏమీ చెయ్యకుండా, కనిపించిన వాళ్ళనీ, కనిపించని వారినీ తిట్టుకుంటూ రోజంతా గడిపేసినప్పుడు జాజి తీగె మీదనుంచే వచ్చే చల్లగాలి ఏమాత్రమూ ప్రత్యేకంగా అనిపించదు. అలాగే, అనుక్షణం దూరం జరిగే గమ్యమే లక్ష్యంగా సాగే పరుగుపందెంలో తలమునకలై ఉన్నప్పుడు జాజుల వాసన నాసికను తాకనే తాకదు..కదూ..