శుక్రవారం, జులై 31, 2020

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

అతని పేరు ఉమామహేశ్వర రావు. అతన్ని గురించి ఒక్కమాటలో చెప్పాలంటే మూర్తీభవించిన మంచితనం. వృత్తిరీత్యా ఫోటో గ్రాఫర్, టెక్నిక్ మాత్రమే తెలుసును తప్ప, క్రియేటివిటీ గురించి ఆలోచన లేదు. ఇప్పటి లోకంలో బతకాలంటే మంచితనం మాత్రమే ఉంటే సరిపోదనీ, సృజనాత్మకత లేకుండా కేవలం టెక్నిక్ మీదే ఆధారపడితే మంచి ఫోటోగ్రాఫర్ కాలేనని అతడు తెలుసుకోవడం, ఆ దిశగా ప్రయత్నాలు చేసి విజయం సాధించడమే సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా. మహేష్ అని పిలవబడే ఈ ఉమామహేశ్వరరావు ఉండేది అరకులోయలో. ఇందువల్ల ప్రేక్షకులకి కలిగిన ప్రయోజనాలు ఏమిటంటే, సినిమా జరిగిన రెండు గంటల పదహారు నిమిషాలపాటూ అరకు, పరిసర గ్రామాల పచ్చదనం కళ్ళని ఆహ్లాద పరుస్తూ ఉండగా, ఇన్నాళ్లూ సినిమాలో కామెడీకి మాత్రమే పరిమితమైన ఉత్తరాంధ్ర మాండలీకం సినిమా ఆసాంతమూ సొగసుగా చెవులకి వినిపించింది. 

వైవిద్యభరితమైన 'C/o. కంచరపాలెం' సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన వెంకటేష్ మహా తన రెండో ప్రయత్నానికి రీమేక్ సినిమాని ఎంచుకోవడం (మాతృక 'మహేసిన్టే ప్రతీకారం' (2016) అనే మలయాళీ సినిమా) ఆశ్చర్యం కలిగించినా, కథా స్థలాన్ని తనకి పట్టున్న ఉత్తరాంధ్రకి మార్చేయడం అతడి తొలివిజయం అనిపించింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక అతడి రెండో విజయం. తొలి సినిమాని అందరూ కొత్తవాళ్లతో తీసిన వెంకటేష్, రెండో సినిమాలో నలుగురైదుగురు మినహా కథా నాయికలతో సహా మిగిలిన అన్ని పాత్రలకీ కొత్తవాళ్ళనే ఎంచుకున్నాడు. సత్యదేవ్ తో పాటు సీనియర్ నరేష్ (ఇతని తాజా పేరు వీకే నరేష్), నిర్మాతల్లో ఒకరైన విజయ ప్రవీణ పరుచూరి (ఈమె  'C/o. కంచరపాలెం' సినిమాని నిర్మించడంతో పాటు అందులో ఓ ముఖ్య పాత్రని పోషించారు), ఇద్దరు ముగ్గురు టీవీ నటులు మినహా  మిగిలిన అందరూ కొత్త మొహాలే. 


మహేష్ (సత్యదేవ్) కి కెమెరా వారసత్వంగా వస్తుంది. అతడి తండ్రి వయసులో ఉండగా ఫోటోలు తీసుకోడం కోసం అరకు వచ్చి అక్కడే ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకుని, ఫోటోగ్రాఫర్ గా స్థిరపడి పోతాడు. ఆ జంటకి మహేష్ ఒక్కడే సంతానం. భార్య మరణం తర్వాత, స్టూడియోని కొడుక్కి అప్పగిస్తాడతను. పాస్పోర్ట్ ఫోటోలు, పెళ్ళిళ్ళకి, చావులకి ఫోటోలు తీసే మహేష్ కి తండ్రి చేసినట్టుగా కెమెరాతో ప్రయోగాలు చేయాలన్న ఆలోచన రాదు. తనో మంచి ఫోటోగ్రాఫర్ని అని గాఢమైన నమ్మకం. ఫోటోకి బ్యాక్ గ్రౌండ్, లైటింగ్ సరిగ్గా ఉంటే చాలుకదా అనుకుంటాడు. తండ్రికి వండిపెడుతూ, చుట్టుపక్కల వాళ్లందరితోనూ స్నేహంగా ఉండే మహేష్ జీవితం ఒకేసారి మూడు మలుపులు తిరుగుతుంది. ప్రియురాలు దూరమవ్వడం, అనుకోని రీతిలో అతనికి పదిమందిలోనూ అవమానం జరగడం, ఫోటో తీయించుకోడానికి వచ్చిన ఓ అమ్మాయి 'నీకసలు ఫోటోగ్రఫీ తెలుసా?' అని మొహం మీదే అడిగేయడం. అక్కడినుంచి మలుపు తిరిగిన అతని కథ, మహేష్ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడంతో ముగుస్తుంది. 

నటీనటులందరూ బాగా చేశారు. సత్యదేవ్, నరేష్, నాయికలిద్దరి నటనా గుర్తుండిపోతుంది. రెండో సగంలో వచ్చే నాయిక కెరీర్ తొలినాళ్లలో భానుప్రియని గుర్తు చేసింది. పాత్రలు, సంభాషణలు ఎంత సహజంగా ఉన్నాయంటే, సినిమా చూస్తున్నట్టుగా కాక అరకులో రోడ్డు పక్కన నిలబడి జరుగుతున్నది చూస్తున్నట్టుగా అనిపించింది చాలాసార్లు. కెమెరా (అప్పు ప్రభాకర్), సంగీతం (బిజిబల్) విభాగాలని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  సహజంగానే ఎంతో అందమైన అరకు, కెమెరా కంటిలో మరింత అందంగా కనిపించింది. యుగళ గీతాలు లేకపోయినా, నేపధ్య సంగీతంతో పాటు, మూడు పాటలూ కూడా సినిమాలో కలిసిపోయాయి. మలయాళం ఒరిజినల్ చూసిన మిత్రులు "యథాతథంగా దించేశాడు" అన్నారు కానీ, నేను ఒరిజినల్ చూడలేదు. రెండోసగంలో హీరో ఫోటోగ్రఫీతో ప్రేమలో పడే సన్నివేశాలని మరికొంచం బాగా రాసుకుంటే బాగుండేది అనిపించింది. 

కథాకాలం విషయంలో కొంచం కన్ఫ్యూజన్ కనిపించింది. ఓ పక్క మహేష్ బాబు-జూనియర్ ఎన్ఠీఆర్ ఫ్యాన్స్ ని కథలో పాత్రలు చేస్తూనే, హీరో తన స్టూడియోలో పాత పద్ధతితో ఫోటోలు డెవలప్ చేసినట్టుగానూ ('కడగడం' అనేవాళ్ళు), పాతకాలపు కంప్యూటర్ వాడుతున్నట్టుగానూ చూపించారు. అలాగే కాలేజీ స్టూడెంట్స్ చేసిన ఫ్లాష్ మాబ్ లో అన్నీ పాత పాటలే ఉన్నాయి. మొదటి సగంలో కనిపించిన కొన్ని పాత్రలు (అరకు వాసులు) రెండో సగంలో మాయమవడం వల్ల ఆ పాత్రల్ని కథలో భాగంగా కాక, కామెడీ ఫిల్లింగ్ కోసం వాడుకున్న భావన కలిగింది. స్థానిక ఆచారాలు, వంటకాల్ని కథలో భాగం చేశారు కానీ, యాత్రికులని మర్చిపోయారు. సంభాషణలు సహజంగా ఉండడమే కాదు, నవ్విస్తూనే ఆలోచలోకి నెట్టేశాయి చాలా సన్నివేశాల్లో.  ఫోటోగ్రఫీతో పరిచయం లేనివాళ్ళకి రెండోసగం సాగతీతగా అనిపించే అవకాశం ఉంది. రొటీన్ కి భిన్నంగా ఉండే క్లీన్ సినిమాలని ఇష్టపడేవాళ్ళకి నచ్చే సినిమా ఇది. ఓటీటీ లో విడుదలైంది కాబట్టి కలెక్షన్ల లెక్కలు కుదరవు కానీ, సినిమాగా చూసినప్పుడు వెంకటేష్ మహా  కొత్త దర్శకులు ఎదుర్కొనే 'రెండో సినిమా గండం' దాటేసినట్టే. 

శుక్రవారం, జులై 24, 2020

పీవీ గురించి మళ్ళీ ...

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుని 'కాంగ్రెస్ మనిషి' గా గుర్తించారు! పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీవీ శతజయంతి కార్యక్రమానికి పంపిన సందేశంలో సోనియా పీవీని 'నిజమైన కాంగ్రెస్ మనిషి' గా అభివర్ణించారు. బాగా ఆలస్యంగానే అయినా, సోనియా ఓ నిజాన్ని గుర్తించి, అంగీకరించారు. ప్రధానిగా పీవీ చేసిందంతా దేశం కోసమూ, కాంగ్రెస్ పార్టీ కోసమే తప్ప తాను, తన కుటుంబం బాగుపడేందుకోసం ఏమీ చేయలేదనీ, చేసిన దానికి ఫలితంగా అనేక కేసుల్నీ, బోలెడంత అపకీర్తినీ మాత్రమే  మూటకట్టుకున్నారనీ దేశం యావత్తూ గుర్తించిన చాలా ఏళ్ళకి సోనియాకి ఈ గమనింపు కలిగింది. ఓ పదహారేళ్ళ క్రితం ఆమెకీ ఎరుక కలిగి ఉంటే కనీసం పీవీ పార్థివ దేహానికి  ఓ గౌరవం దొరికి ఉండేది. 

ఇన్నాళ్లూ పీవీ ప్రస్తావనని కూడా ఇష్టపడని సోనియా ఇంతకీ ఇప్పటికిప్పుడు ఈ ప్రకటన చేయడం వెనుక కారణం ఏమిటి? ఆ కారణం రెండు కాంగ్రెసేతర పార్టీలు కావడం - ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ కి బద్ధ విరోధులు కావడం - ఇక్కడ విశేషం. గత నెల 24 న పీవీ తొంభై తొమ్మిదో జయంతిని హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆరెస్), ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించాయి. అప్పుడప్పుడూ లీలగా, పీలగా వినిపిస్తూ వచ్చిన 'పీవీకి భారత రత్న' డిమాండ్ ఈసారి కొంచం గట్టిగా వినిపించింది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పీవీకి 'భారత రత్న' ప్రకటించినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటు ఢిల్లీ లోనూ, ఇటు పీవీ స్వరాష్ట్రంలోనూ ఏడాది పాటు పీవీ శతజయంతి జరిపేందుకు అధికార పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఒకరోజు ఫోటోకి దండేసే కార్యక్రమం మాత్రమే అయితే కాంగ్రెస్ పెద్దగా పట్టించుకుని ఉండేది కాదేమో, కానీ ఏడాది పాటు తెలియనట్టుగా ఉండడం అంటే కష్టం కదా. 

కేంద్ర ప్రభుత్వం పీవీకి ప్రాధాన్యం ఇవ్వడం వెనుక కారణం ఊహించగలిగేదే. ఆయన నెహ్రు-గాంధీ కుటుంబేతరుడు కావడం. సోనియా-రాహుల్ పీవీ ప్రస్తావనని వీలైనంత దూరం పెట్టడమూను. శత్రువుకి శత్రువు మిత్రుడే అవుతాడు కదా. పీవీ కృషిని ప్రశంసించడాన్ని, నెహ్రు-గాంధీ వారసుల అసమర్ధతని ఎత్తిచూపడంగా భావించుకునే పరిస్థితులున్నాయిప్పుడు. ('అప్పుడు మా వంశీకులు ప్రధాని పదవిలో ఉండి ఉంటె బాబరీ మసీదు కూలేదే కాదు' అని రాహుల్ గాంధీ కొన్నేళ్ల క్రితం చేసిన ప్రకటనని ఎవరు మర్చిపోయినా బీజేపీ మర్చిపోతుందని అనుకోలేం). దేశంలోని సకల అనర్ధాలకీ నెహ్రుని, కాంగ్రెస్ ని కారణాలుగా చూపే బీజేపీ నాయకులు పీవీ శతజయంతి జరపడం అంటే ఒకరకంగా కాంగ్రెస్ ని కవ్వించడమే. కాంగ్రెస్ పార్టీకి కూడా పీవీని తల్చుకోక తప్పని పరిస్థితిని కల్పించడమే. 

(Google Image)
'పీవీ తెలంగాణ ఠీవి' అని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్త్రి కె. చంద్రశేఖర్ రావు. ఆయనకి కూడా కాంగ్రెస్ ని విమర్శించని రోజు ఉండదు. కానీ, పీవీ విషయంలో మినహాయింపు. ప్రధాన కారణం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్ని ఇరుకున పెట్టే అవకాశం దొరకడం. వాళ్ళు పీవీని ఓన్ చేసుకోలేరు, వదిలేయనూ లేరు. ఈ శతజయంతి సంవత్సరంలో చేసే కార్యక్రమాల్లో భాగంగా పీవీ కుటుంబం నుంచి ఒకరిని (కుమార్తె సురభి వాణీదేవి పేరు వినిపిస్తోంది) గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. సభలు, సమావేశాలు జరుగుతాయి. 'పీవీకి భారత రత్న' అనే ఖర్చు లేని డిమాండ్ ఉండనే ఉంది. ఈ డిమాండ్ విషయంలో ఢిల్లీ కూడా ఆసక్తి చూపిస్తోందంటూ వార్తలు రావడం కొంచం ఆలోచించాల్సిన విషయం.  

వివాదాస్పదులు, కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నవారి పేర్లని 'పద్మ' పురస్కారాలకి పరిశీలించరు అన్నది అందరూ అనుకునే మాట. 'పద్మశ్రీ' మొదలు 'పద్మవిభూషణ్' వరకూ ఇప్పటికే ఆచరణలో మినహాయింపులు వచ్చేశాయి. ఇక మిగిలింది 'భారత రత్న.'  పీవీ ద్వారా మార్గం సుగమం చేసుకునే ఆలోచనగా దీనిని భావించాలా? ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత పీవీ చివరి రోజులు దుర్భరంగా గడిచాయి. కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగడం, లాయర్ల ఫీజుల కోసం సొంత ఇంటిని అమ్ముకోవడం లాంటివన్నీ జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ పీవీ ఎవరో తెలియనట్టు ప్రవర్తించింది.  తర్వాతి కాలంలో మరో అడుగు ముందుకేసి ఆర్ధిక సంస్కరణలన్నీ మన్మోహన్ సింగ్ ఖాతాలో మాత్రమే వేసే ప్రయత్నమూ చేసింది. (అయితే, మన్మోహన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు). చివరికి పీవీ మరణించినప్పుడు ఢిల్లీలో అంత్యక్రియలు జరిపేందుకే కాదు, పార్టీ కార్యాలయంలో పీవీ పార్థివ దేహాన్ని ఉంచేందుకు కూడా అధినేత్రి సోనియా అంగీకరించలేదు. 

ఇన్నేళ్ల తర్వాత అదే సోనియా అదే పీవీ శతజయంతి జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకి అనుమతి ఇచ్చారు. తన సందేశంలో పీవీని  'కాంగ్రెస్ మనిషి' గా అంగీకరించారు. దేశానికి ఆయన చేసిన సేవల్ని ప్రశంసించారు. వార్తలు చూస్తుంటే ఒక్కటే అనిపించింది. 2004 డిసెంబర్ 23న దేశంలోనూ, రాష్ట్రం లోనూ (సమైక్య ఆంధ్ర ప్రదేశ్) కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండకుండా ఉండి ఉంటే, మాజీ ప్రధానులు అందరి అంత్య క్రియలూ జరిగిన దేశ రాజధానిలోనే పీవీ అంత్యక్రియలు కూడా జరిగి ఉండేవేమో కదా. క్లిష్ట సమయంలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టి, ఆర్ధికంగా దేశాన్ని ఒడ్డున పడేసి, ఆ పడేసే క్రమంలో జరిగిన చెడుకి తాను మాత్రమే జీవితాంతం బాధ్యత వహించిన పీవీకి కనీసం మరణానంతర గౌరవమైనా దక్కేదేమో. పీవీ పదవుల్లో ఉన్నప్పుడు మొదలు ఇప్పటి శతజయంతి వరకు ఆయన వల్ల చుట్టూ ఉన్నవాళ్లు మాత్రమే ఏదో ఒక రీతిలో ప్రయోజనం పొందుతూ ఉండడాన్ని విధి వైచిత్రి అనే అనాలేమో...

సోమవారం, జులై 20, 2020

వెంకట సత్య స్టాలిన్ 

పెద్ద పెద్దవాళ్ళు ఎవరు ఎక్కడినుంచి పిలిచినా, ఏ పేరుతో పిలిచినా పలుకుతాడతను. ఎక్కడున్నా రెక్కలు కట్టుకుని వాలతాడు. సలహా సంప్రదింపు కానిచ్చేసి, తాను చెప్పదల్చుకున్న నాలుగు ముక్కలూ వాళ్ళ చెవిన వేసేసి మాయమైపోతాడు. చేసిన సాయానికి ప్రతిగా కృతజ్ఞతలు చెప్పడాన్ని కూడా ఒప్పుకోని బహు మొహమాటి. బిరుదులూ, సన్మానాలకి ఆమడ దూరం. బాల నెహ్రు కోటుకి మొదటగా గులాబీని గుచ్చింది అతనే. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఇంకా 'కుంజమ్మాళ్' గా ఉండగానే సంగీతంలో సుళువులు చెప్పిందీ అతనే. అరవిందుడికి 'సావిత్రి' రాయమని సూచించిన వాడూ, చక్రవర్తుల రాజగోపాలాచారి రాసిన రామాయణ సారానికి మెరుగులు దిద్దినవాడూ ఒక్కడే. అతను తెలుగు వాడు. వెంకట సత్య స్టాలిన్ అతని పేరు. 

'నేమ్ డ్రాపింగ్' అనేది ఒక కళ. అందరికీ చేతనయ్యేది కాదు. విషయాన్ని అతికినట్టుగా చెప్పాలి. ఆ చెప్పడంతోనే అవతలి గొప్పవాళ్ళకి మనం ఎంత దగ్గరో చెప్పాలి. అలా చెబుతూనే, 'అబ్బే  మనదేం లేదు' అన్నట్టుగా ధ్వనించినా, చేరాల్సిన వాళ్ళకి చేరాల్సిన విషయం చేరిపోవాలి. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఈ బాపతు జనం పుష్కలంగా కనిపిస్తూ ఉంటారు. అది ఇది ఏమని అన్ని రంగాలనీ చక్కపెట్టేసే వాళ్ళు నిజ జీవితంలో అరుదే కానీ, సాహిత్యంలో అప్పుడప్పుడూ తారసపడుతూ ఉంటారు. వాళ్ళు మహా సీరియస్ గా చెప్పే విషయాలు మనల్ని గిలిగింతలు పెట్టేస్తాయి. కొండొకచో ఆపుకోలేని నవ్వు పుట్టిస్తాయి కూడా. కాలం నాడు గురజాడ వారి గిరీశం ఈ 'నేమ్ డ్రాపింగ్' ని ప్రశస్తంగా నిర్వహించాడు. దానిని పరాకాష్టకు తీసుకెళ్లిన వాడు మాత్రం, శ్రీరమణ సృష్టించిన ఈ వెంకట సత్య స్టాలిన్. 

బెంగాలీలు ఇతన్ని 'బెంకట్' అనీ 'స్తోలిన్' అనీ పిలిస్తే, తమిళులు ఆదరంగా 'సచ్చూ' అంటారు. కన్నడిగులు 'హోళిన్ గారో' అని మర్యాద చేస్తే, ఉత్తరాది వారు 'వెంకట్ జీ' అంటూ పాదాభివందనాలు చేస్తారు. ఇతను ఏ కాలంలోకైనా, ఏ ప్రాంతానికైనా వెళ్లగలిగిన వాడు. విక్టోరియా మహారాణి మొదలు పీవీ నరసింహా రావు వరకూ, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి మొదలు ఎంటీ రామారావు వరకూ ఎవరికి ఏ సందేహం వచ్చినా చిటికలో తీర్చే వాడూ, సమయానికి తగు సలహాలు ఇచ్చేవాడూను. తన పేరు బయటికి రావడాన్ని బొత్తిగా ఇష్టపడడు. లేకపోతే, చిన్నయసూరి బాల వ్యాకరణానికి సహరచయితగా స్టాలిన్ పేరు ఉండేది. ప్రతిభని మొగ్గ దశలో గుర్తిచే శక్తి స్టాలిన్ లో అపారం. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, ద్వారం వెంకట స్వామి నాయుడు, ఈలపాట రఘురామయ్య, స్థానం నరసింహారావు.. వీళ్లంతా స్టాలిన్ డిస్కవరీలే. 


కేవలం అతడికున్న తీవ్రమైన మొహమాటం, విపరీతమైన మాడెస్టీ వల్ల స్టాలిన్ పేరు మనకి చరిత్ర పుస్తకాల్లో కనిపించదు. అసలు మొట్టమొదట ఉప్పు సత్యాగ్రహం చేసిన వాడు స్టాలినే. ఎవరెస్టుని అధిరోహించిన టెన్సింగ్ నార్కే కి పర్వతారోహణలో మెళకువలు చెప్పిన వాడూ ఇతడే. స్టాలిన్ ధైర్యం చెప్పి ఉండకపోతే యూరి గెగారిన్ అంతరిక్ష యాత్ర చేసేవాడే కాదు. గాలిబ్ రచనలన్నీ తనకి వెంటనే కావాలని పీవీ నరసింహారావు పట్టుపడితే, రెండు దస్తాల ఠావులు, పుల్లకలం, సిరాబుడ్డి సాయంతో  గాలిబ్ కవిత్వాన్నంతటినీ అక్షరం పొల్లుపోకుండా కాగితం మీదకి ఎక్కించిన జ్ఞాపకశక్తి స్టాలిన్ సొంతం. మోతీలాల్ నెహ్రు ఖరీదైన బారిస్టర్ అని అందరికీ తెలుసు కానీ, మోతీలాల్ విజయం వెనుక ఉన్నవి స్టాలిన్ సలహాలే అని ఎందరికి తెలుసు? 

అనేక స్థలకాలాదుల్లోకి బొంగరంలా తిరుగుతూ ఎన్నో పనులు చక్కబెట్టినా, స్టాలిన్ చేయలేక పోయిన పనులూ చాలానే ఉన్నాయి. 'శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు' నిర్మాణంలో చేయి వేయలేదని పిఠాపురం మహారాజా ఫిర్యాదు. తన దర్బారులో కనీసం ఓ వారం విడిది చేసి తన పండితులకి సాహిత్య విషయాలు బోధ పరచలేదని మైసూరు మహారాజు పెద్ద వడయారుకి ఓ వెలితి. వంగ సాహిత్యాన్ని గురించి స్టాలిన్ తో తనివితీరా చర్చించలేదన్న లోటు రవీంద్రుణ్ణి పీడిస్తూనే ఉంది. సరోజినీ దేవి, డాక్టర్ ముత్యాల గోవిందరాజులు నాయుణ్ణి ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు, పెళ్లిపెద్దగా ఉండాల్సిన వాడే, వేరే అత్యవసరమైన పని తగలడంతో ఆ వేళకి హాజరు కాలేకపోయాడు. అనేకానేకులకి అంతరంగికుడు మరి. ఒకేసారి అన్నిచోట్లా ఉండడం సాధ్యమవుతుందా? 

ముందుమాటలో 'వెంకట సత్య స్టాలిన్' ని పరిచయం చేస్తూ 'కాలం నాటి కందిగింజ' అన్నారు శ్రీరమణ. స్టాలిన్లు అన్ని కాలాల్లోనూ కనిపిస్తూనే ఉంటారు. మంచం కింద దాగిన రామప్పంతులు 'ఏవిట్రా వీడి గోతాలు?' అనుకున్నంత మాత్రాన, గిరీశం తన ధోరణి మార్చుకున్నాడా? 'వెంకట సత్య స్టాలిన్' చదువుతూ ఇదే మాటని కొన్ని వందల సార్లు అనుకోవచ్చు. మన సర్కిల్లో మనకి తెలిసిన 'స్టాలిన్' లని గుర్తు చేసుకోవచ్చు. పుస్తకం చదివేశాక, 'స్టాలిన్' లు తారసపడినప్పుడు కష్టపడి నవ్వాపుకోవడం మాత్రం తప్పక సాధన చేయాలి. స్టాలిన్ అనుభవాలు మొత్తం ఇరవై మూడింటిని అక్షరబద్ధం చేశారు శ్రీరమణ. ఇరవై ఒక్కింటిలో సాక్షాత్తూ స్టాలిన్ మాత్రమే కనిపిస్తాడు పాఠకులకి. ఎంటీఆర్, బాపూ-రమణ గురించి రాసిన వాటిలో మాత్రం స్టాలిన్ కాస్త వెనకడుగేయడం వల్ల కాబోలు, శ్రీరమణ కనిపించిపోయారు. వాళ్ళముగ్గురితో 'తన మార్కు' చనువుని ప్రదర్శించ లేక పోయాడు స్టాలిన్. ఈ బహు చక్కని వ్యంగ్య రచనని వీవీఐటీ ప్రచురించింది. పేజీలు 104, వెల రూ. 120. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు, ఆన్లైన్ లోనూ లభిస్తోంది. 

బుధవారం, జులై 08, 2020

కనిపించని సమస్య

నెమ్మదిగా నాలుగు నెలలవుతోంది, కరోనా అని మనం పిలుచుకుంటున్న కోవిడ్-19 తో సహజీవనం మొదలై. కొన్ని ప్రపంచ దేశాలు మనకన్నా (భారతదేశం) ముందే కరోనా బారిన పడితే, మరికొన్ని మన వెనుక నిలిచాయి. దేశాల పేర్లు వేరు తప్ప పరిస్థితులు దాదాపు ఒక్కటే. కరోనా క్రిమి ఎలా అయితే కంటికి కనిపించడం లేదో, జనజీవనం మీద దాని ప్రభావం కూడా అలాగే దృశ్యాదృశ్యంగా ఉంది.  పైకి కనిపించని విధంగానే జీవితాలని అల్లకల్లోలం చేసేస్తోంది. మొదట్లో ఇది కేవలం ఆరోగ్య సమస్య అనుకున్నాం కానీ, రానురానూ ఇది ఆర్ధిక వ్యవస్థల్ని మింగేసేదిగా విశ్వరూపం దాలుస్తోంది. ఫలితం, ఇప్పటికే కొన్ని కోట్ల మంది ఉపాధి కోల్పోయారు, మరి కొన్ని కోట్ల మంది 'ఏక్షణంలో అయినా మెడమీద కత్తి పడొచ్చు'  అనే భయంతో బతుకుతున్నారు. 

'కరోనా-ఉపాధి' అనగానే మొదట గుర్తొచ్చేవాళ్ళు వలస కూలీలు. నగరాల్లో ఉపాధి కోల్పోయి, ప్రయాణ సాధనాలేవీ అందుబాటులో లేక కాలినడకన వందల కిలోమీటర్లు నడిచి స్వస్థలాలకు చేరుకున్న వాళ్ళు. వాళ్ళ కష్టాన్ని తీసేయలేం కానీ, స్వచ్చంద సంస్థల నుంచీ, వ్యక్తుల నుంచీ, ప్రభుత్వం నుంచీ కూడా వాళ్లకి ఎంతో కొంత సహాయం అందింది. 'మేమున్నాం' అంటూ ముందుకొచ్చి తోచిన సాయం చేసినవాళ్లు లక్షల్లో కాకపోయినా, వేలల్లో ఉన్నారు. ప్రభుత్వం కూడా ఉచిత రేషన్ లాంటి పథకాలు ప్రకటించింది. దేశంలో ఎక్కడున్నా రేషన్ పొందొచ్చన్న వెసులుబాటునీ ఇచ్చింది. దీనివల్ల వాళ్ళకి మూడుపూటలా భోజనం దొరక్క పోవచ్చు, కానీ ఒక్క పూట భోజనానికైనా భరోసా ఉంది. ఈ వలస కూలీల సమస్య అందరి దృష్టిలోనూ పడింది. మొత్తంగా కాకపోయినా, కనీసం కొంతమేరకైనా వాళ్ళకి తోడు నిలబడే వాళ్ళూ తారస పడ్డారు.

కరోనా తొలిదశలో దెబ్బతిన్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉండగా, రెండో దశలో దెబ్బ తింటున్న వాళ్ళు, తినబోతున్న వాళ్ళది మరో కథ. మనం పెద్దగా మాట్లాడుకోని కథ. మాట్లాడుకోవాల్సిన కథ కూడా. ప్రయివేటు సెక్టార్లో జీతాల కోతతో మొదలైన కరోనా ప్రభావం ఇప్పుడు ఉద్యోగాల కోత దశకి చేరుకుంది. బాధితులంతా మధ్య తరగతి వాళ్ళు. ప్రభుత్వం ముక్కు పిండి మరీ పన్ను వసూలు చేసే వర్గం ఏదైనా ఉందా అంటే అది వీళ్ళు మాత్రమే. వీళ్ళలో చాలామందికి జూలై మొదటి వారంలో వాళ్ళ వాళ్ళ ఆఫీసులనుంచి రెండు రకాల కబుర్లు వచ్చాయి. కొందరికి 'మీసేవలు చాలు' అని, మరి కొందరికి 'ఈ కష్ట కాలంలో మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మానసికంగా సిద్ధ పడండి' అనీను. ఒక్కసారిగా వీళ్లందరి కాళ్ళ కింద నేలా కదిలినా, ప్రసార సాధనలకి అది 'వార్త' కాలేదు. ప్రభుత్వానికి 'పట్టించుకోవాల్సిన విషయం' కూడా కాలేదు. 

కరోనా కారణంగా భారతదేశంలో ఎక్కువగా ప్రభావితం అయ్యిందీ, ఎటు నుంచీ సాయానికి నోచుకోనిదీ ఏదన్నా వర్గం ఉందా అంటే, అది ఈ ప్రయివేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగ వర్గమే. ఇన్నాళ్లూ పని చేసిన సంస్థలకి వీళ్లిప్పుడు ఒక్కసారిగా 'వదిలించుకోవాల్సిన బరువు' అయిపోయారు. ప్రభుత్వం దృష్టిలోనేమో సాయం పొందేంత పేదలు కాదు. సోషల్ మీడియా తో సహా ఎవరికీ మాట్లాడుకోవాల్సిన టాపిక్ కూడా కాదు. ఒకపూట భోజనంతోనో, ప్రయాణపు ఏర్పాట్ల ద్వారానో లేక ఉచిత రేషన్ వల్లనో (కనీసం కొంతైనా) పరిష్కారమయ్యే  సమస్యలు కూడా కావు వీళ్ళవి. 'అంతకు మించి' చేయాల్సిన అవసరం ఉండగా, అసలు సమస్యే లేనట్టుగా వ్యవహరిస్తూ ఉండడం జరుగుతోందిప్పుడు. 'బ్యాంక్ రుణాల చెల్లింపు వాయిదా' అనే ప్రహసనాన్ని చూస్తూనే ఉన్నాం. 

జీతాల్లో కొంత మేర కోత పడితేనే సర్దుబాట్లు చేసుకోలేక తబ్బిబ్బు పడిన వాళ్ళలో చాలామందికి 'ఇకపై జీతాలే రావు' అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలిగేదే. ఖర్చులేవీ ఆగవు. పూలమ్మిన చోట కట్టెలమ్ముదామన్నా ఈ కరోనా కాలంలో కొనేవాళ్ళు లేరు. ఇప్పట్లో ఉద్యోగాలేవీ దొరికే సూచనలూ లేవు. ఒకవేళ జాబ్ మార్కెట్ పుంజుకున్నా, మరింతగా పెరిగే పోటీలో ఉద్యోగం దొరకబుచ్చుకోడం అంత సులువేమీ కాదు. ఉద్యోగం చేసినంత కాలం ముక్కుపిండి పన్ను వసూలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు సమస్యనే గుర్తించడం లేదు. 'ఉపశమనం' స్కీముల్లో ఈ వర్గానికి ప్రాతినిధ్యమే లేదు.  వ్యక్తి స్థాయిలో ఎవరు ఎవర్ని ఆదుకోగలుగుతారు? అదైనా ఎన్నాళ్ళు? 

ఉద్యోగాలు పోయిన వాళ్ళ సమస్యలు ఒకరకమైతే, మెడమీద కత్తి వేలాడుతున్న వాళ్ళ ఇబ్బందులు మరోరకం. నూరేళ్లాయుస్సుకి హామీ లేదు కానీ, పరిస్థితి మాత్రం దినదిన గండమే. ఎప్పుడు ఏ కబురు వినాల్సి వస్తుందో తెలీని అనిశ్చితిలో రోజులు గడుపుతున్న వాళ్ళు అనేకమంది.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, బయటికి వెళ్లి ఉద్యోగం చేయడం వల్ల ప్రాణానికి ఉన్న ముప్పు ఒకటైతే, ఇప్పటికిప్పుడు ఈ ఉద్యోగం పోతే జరుగుబాటు ఎలా అన్న మిలియన్ డాలర్ ప్రశ్న మరొకటి. నిజానికి, ఈ ఉద్యోగాలు పోవడం అన్నది కరోనా బారిన పడ్డ అనేక దేశాల్లో జరుగుతున్నా, వాటిలో చాలా దేశాలు సమస్యని గుర్తించాయి. ఎంతోకొంత ఉపశమనానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ కూడా కనీసం సమస్యని గుర్తిస్తే బాగుండును.