సోమవారం, ఏప్రిల్ 25, 2022

థాయిస్

"నా 'చిత్రలేఖ' కు అనతోల్ ఫ్రాంసు 'థాయీ' కి నడుమ నాకు, అనతోల్ ఫ్రాంసుకి ఉన్నంత అంతరం ఉన్నది. చిత్రలేఖలో ఒక సమస్య ఉన్నది; మానవ జీవనాన్ని, అందులోని మంచి చెడుగుల్ని పరిశీలించడంలో నా దృష్టి కోణము, నా ఆత్మాలాపము నావి" నవలా రచయిత భగవతీ చరణ్ వర్మ తన 'చిత్రలేఖ' నవలకి రాసిన ఈ ముందుమాట 'థాయిస్' మీద ఆసక్తి పెంచింది. అంతే కాదు, విశ్వనాథ 'వేయి పడగలు' లో కనిపించే అనేకానేక చర్చల్లో ఈ 'థాయిస్' ను గురించిన చర్చ కూడా ఉంది.  ఆసక్తి మరింత పెరిగి వెతుకులాట మొదలు పెడితే, రెంటాల గోపాలకృష్ణ చేసిన తెలుగు అనువాదం కనిపించింది. ఫ్రెంచ్ భాషలో 1890లో తొలుత ప్రచురితమైన ఈ నవల అనేక ప్రపంచ భాషల్లోకి అనువదింపబడింది. నాటకాలుగానూ, సినిమాలుగానూ మలచబడింది. రచయిత అనతోల్ ఫ్రాంస్ ఫ్రెంచ్ సాహిత్యంలో ఉద్ధండుడు. నోబెల్ బహుమతి గ్రహీత. ఒక ఓపెరా ఆధారంగా ఈ నవలని రాశాడు. 

ఈజిప్షియన్ ఎడారిలో ఓ మఠాధిపతి అయిన క్రైస్తవ సన్యాసి పప్నూటియస్ కి కొంత శిష్యగణం ఉంది. సాటివారిలో మంచిపేరూ ఉంది. క్రీస్తుని చేరేందుకు తాను చేస్తున్న సాధన సరిపోతుందా అన్న ప్రశ్న వేధిస్తూ ఉన్నప్పటికీ, జీవితం పట్ల సంతృప్తిగానే ఉంటాడు ఆ సన్యాసి. నిజానికి అతను అలెగ్జాండ్రియాలో ఓ ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. యవ్వనంలో విలాసవంతమైన జీవితం గడిపాడు. ఉన్నట్టుండి ఒకరోజు ఐహిక సుఖాల మీద విరక్తి బయలుదేరి సన్యాసిగా మారాలని నిర్ణయించుకుంటాడు. సంపదల్ని త్యజిస్తాడు. బంధుమిత్రుల్ని వదిలిపెడతాడు. ఆశ్రమ జీవితానికి అలవాటు పడతాడు. పీఠాధిపతి స్థాయికి ఎదుగుతాడు. పుట్టి పెరిగిన నగరానికి దూరంగా ఆశ్రమవాసం, అతి సాధారణ జీవితం, తనలాగే సుఖాలని త్యజించిన ఆశ్రమ వాసుల సావాసం.. ఈ జీవితం చాలా నచ్చుతుంది కూడా. రోజులు గడుస్తుండగా ఉన్నట్టుండి ఒకరోజున ఆ సన్యాసికి 'థాయిస్' గుర్తు రావడంతో కథ మలుపు తిరుగుతుంది. 

అలెగ్జాండ్రియా నగరంలో ప్రముఖ నటి, నర్తకి, వేశ్య థాయిస్. ఆమె అపురూప సౌందర్యవతి, అంతకు మించిన నటి, నర్తకి. ధనవంతులందరూ తమ సమస్త సంపదల్నీ ఆమె పాదాల చెంత ధారపోసి మరీ ఆమె పొందుకు పాకులాడతారు. తన అందచందాలతో అనతి కాలంలోనే విశేషమైన పేరునీ, ధనాన్నీ ఆర్జిస్తుంది థాయిస్. ఇప్పుడు ఆమె మీద ఆధారపడి కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి. పప్నూటియస్ కూడా తన పూర్వ జీవితంలో థాయిస్ ని పొందిన వాడే. ఆమె మీద విశేషంగా ధనాన్ని వెచ్చించిన వాడే. సన్యాసిగా మారిన పప్నూటియస్ కి థాయిస్ ని సంస్కరించాలనే అభిలాష కలుగుతుంది. ఆమెని పాపకూపం నుంచి బయటకు తెచ్చి, యేసు ప్రభువుని చేరే మార్గం బోధించాలన్న తపన చిన్నగా మొదలై, త్వరత్వరగా పెరిగి పెద్దదై అలెగ్జాండ్రియా ప్రయాణం అయ్యేలా చేస్తుంది. సాటి మఠాథిపతి వారించే ప్రయత్నం చేసినా వినకుండా థాయిస్ ని సంస్కరించడమే ధ్యేయంగా నిశ్చయించుకుంటాడు. 

తన అందంతో, ప్రతిభతో అపారమైన సంపద ఆర్జించిన థాయిస్ తన బాల్యాన్ని కడు పేదరికంలో గడిపింది. ఆకలితో పాటు తల్లిదండ్రుల నిరాదరణ కూడా ఆమెని బాధించింది. ఆమెని కూతురిగా భావించిన వ్యక్తికి క్రైస్తవం పట్ల గాఢమయిన అభిమానం. ఒక రాత్రి ఆమెని రహస్యంగా ఓ చర్చికి తీసుకువెళ్లి బాప్టిజం ఇప్పిస్తాడు. కాలక్రమంలో  జీవితం ఎన్ని మలుపులు తిరిగినా ఈ సంఘటనని మర్చిపోదు థాయిస్. మత పెద్దలని, సన్యాసులని ఇతోధికంగా గౌరవిస్తూ ఉంటుంది. ఈ కారణానికే, తన ఇంటికి వచ్చిన పప్నూటియస్ ని ఆదరించి గౌరవిస్తుంది. అంతేకాదు, సన్యాసం స్వీకరించి పాపపు జీవితం నుంచి బయటపడమని అతడు ఇచ్చిన సలహాని పెద్దగా తటపటాయింపు లేకుండానే అంగీకరిస్తుంది. సమస్త సంపదలనీ త్యజించి అతని వెంట ఎడారికి బయలుదేరుతుంది. ఆమె నిర్ణయం విని అలెగ్జాండ్రియా నగరం అట్టుడుకుతుంది. ఆమె ఆరాధకుల నుంచీ, ఆమె మీద ఆధారపడ్డ వారి నుంచీ తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కానీ, ఆమె పట్టించుకోదు. సన్యాసినుల ఆశ్రమంలో ఆమెని చేర్చి, తన ఆశ్రమానికి బయలుదేరతాడు పప్నూటియస్. అటు తర్వాత కథ అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. 

నవల చదవడం పూర్తి చేశాక, భగవతీ చరణ్ వర్మకి అనతోల్ ఫ్రాంసుకి మరీ ఎక్కువ అంతరం ఉన్నట్టు అనిపించలేదు. చిత్రలేఖకి, థాయిస్ కి బొత్తిగా పోలిక లేకపోలేదు. మక్కికి మక్కి ఎంత మాత్రమూ కాదు. అలాగని, ఒకవేళ థాయిస్ లేకపోతే చిత్రలేఖ ఉండేదా అంటే సందేహమే. ఈ రెండు పాత్రల మధ్యా పోలిక, 'మృచ్ఛకటికమ్' వసంతసేన కి 'కన్యాశుల్కం' మధురవాణి కి ఉన్న పోలిక లాంటిది. అనువాదం మరికొంచం సరళంగా ఉండొచ్చు. ఏకబిగిన చదివించదు కానీ, మధ్యలో వదలాలనీ అనిపించని కథనం. ఇంగ్లీష్ వెర్షన్ చదవాలన్న కుతూహలాన్ని కలిగించింది. థాయిస్ ఇంట విందు సందర్భంగా జరిగే వేదాంత చర్చ మరీ సుదీర్ఘంగా అనిపించింది. 'థాయిస్' తెలుగు అనువాదం క్లాసిక్ బుక్స్ ద్వారా అందుబాటులో ఉంది. 184 పేజీల ఈ పుస్తకం వెల రూ. 150. ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు. 

బుధవారం, ఏప్రిల్ 13, 2022

వెన్నెలవే వెన్నెలవే ...

"భూలోకం దాదాపు కన్ను మూయు వేళ... 
పాడేను కుసుమాలు పచ్చగడ్డి మీన...  
యే పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ..."

సంగీత దర్శకుడు ఇచ్చిన ట్యూన్ కి పాట రాయడం ఒకరమైన కష్టం అయితే, డబ్బింగ్ సినిమాకి పాట రాయడం ఇంకోరకం కష్టం. మొదటి దాంట్లో ట్యూన్ పరిధి మేరకు పదాలని కుదించుకుని, భావం చెడకుండా రాసే వీలుంటుంది. కానీ రెండో దాంట్లో అప్పటికే వేరే భాషలో వచ్చిన సాహిత్యాన్ని తెనిగించాలి. అలాగని అది మక్కి కి మక్కి అనువాదం కారాదు. తెలుగు నుడికారం వినిపించాలి, అదే సమయంలో మూలానికి దగ్గరగా ఉండాలి. తేలిపోకూడదు, మూలాన్ని మించిపోనూ కూడదు. తెలుగు సినిమా కవులు ఎవరి  పరిధిలో వారు ఈ అసిధారా వ్రతాన్ని నిర్వహించారు. కొందరు కేవలం అనువాద చిత్రాలకి మాత్రమే పాటలు రాశారు. 

అర్జునుడు రెండు చేతుల్తోనూ బాణాలు సంధించినట్టుగా కుడి చేత్తో ఓ పాట, ఎడమ చేత్తో మరో పాట ఏకకాలంలో రాయగలిగిన వేటూరి చాలా డబ్బింగ్ పాటల్నీ తన ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా ఏ. ఆర్. రహమాన్ సంగీత సారధ్యంలో వచ్చిన తమిళ పాటల్ని తెనిగించడానికి మొదటి పిలుపు వేటూరికే వచ్చేది. అలా పాతికేళ్ల నాడు ఈ కాంబినేషన్ లో వచ్చిన 'మెరుపు కలలు' సినిమాలో 'వెన్నెలవే.. వెన్నెలవే' యుగళగీతం కాల పరీక్షకి నిలబడింది. ఇవాళ్టికీ వినిపిస్తోంది. ఇప్పుడైతే 'పాన్ ఇండియా సినిమా' అనే బ్రాండింగ్ హడావిడి చేసేవాళ్ళేమో కానీ, అప్పట్లో డబ్బింగ్ సినిమా అనే అన్నారు రాజీవ్ మీనన్ దర్శకత్వంలో ఏవీఎం నుంచి వచ్చిన ఈ తమిళ, తెలుగు, హిందీ రిలీజ్ ని. 

అసలు 'మెరుపు కలలు' కథే చిత్రం అనుకుంటే, ఈ పాట సందర్భం మరీ విచిత్రం. సన్యాసినిగా మారి యేసుక్రీస్తు సేవకి అంకితమైపోవాలని నిర్ణయించుకున్న కథానాయికలో (కాజోల్) ప్రేమ భావనలు పుట్టించాలి. అలాగని ఆమెని తను (ప్రభుదేవా) ప్రేమించకూడదు. ఆమె దృష్టి ఐహికం మీదకి మళ్ళాక అసలు కథానాయకుడు (అరవింద్ స్వామి) రంగంలోకి దిగుతాడు. ఇక్కడ అంతస్థుల భేదం కూడా ఉంది. కాజోల్, అరవింద స్వామి ఇద్దరూ డబ్బున్న వాళ్ళ బిడ్డలు, చిన్ననాటి స్నేహితులూను. ప్రభుదేవా పేదవాడు. అనాధ పిల్లలతో కలిసి తిరిగేవాడూను. ప్రపంచం నిద్రపోయిన ఓ అర్ధరాత్రి వేళ ఆమె కోసం పాట అందుకున్నాడు.. ఇక్కడ వెన్నెల అంటే ఆకాశంలో చందమామ మాత్రమే కాదు, కథానాయిక కూడా.. 


వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా 
విరహాన జోడీ నీవే... హే... 
నీకు భూలోకుల కన్ను సోకేముందే 
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…  

ఆకాశాన్ని దాటి ఒక్కసారి కిందకి వచ్చావంటే, భూమ్మీద ఎవరి కన్నూ నీ మీద పడక మునుపే నిన్ను వెనక్కి పంపేస్తా అంటూ వెన్నెలని పిలుస్తున్నాడు. ఇది పల్లవి. ఇక చరణాల్లోకి వస్తే.. 

ఇది సరసాల తొలి పరువాల 
జత సాయంత్రం సైఅన్న మందారం 
చెలి అందాల చెలి ముద్దాడే 
చిరు మొగ్గల్లొ సిగ్గేసె పున్నాగం   
పిల్లా ... పిల్లా... 
భూలోకం దాదాపు కన్నుమూయు వేళ .. 
పాడేను కుసుమాలు పచ్చగడ్డి మీన 
యే పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ

'కన్నుమూయడం' అంటే వాడుకలో అర్ధం తనువు చాలించడం. ఇక్కడ కవి ప్రయోగం 'నిద్రపోవడం' అని. మందారం, పున్నాగం మాత్రమే కాదు,  'అందాలు అందాలి' అనడం భలేగా కుదిరింది. 

అతగాడు పల్లవి, చరణం పడ్డాక అప్పుడు ఆమె అందుకుంది: 

ఎత్తైన గగనంలో నిలిపేవారెవరంట
కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంట 
ఎద గిల్లీ గిల్లీ వసంతాన్నే ఆడించే 
హృదయంలో వెన్నెలలే రగిలించే వారెవరు 
పిల్లా ... పిల్లా ... 
పూదోట నిదరొమ్మని పూలే వరించు వేళ 
పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళ 
ఆ వయసే రసాల విందైతే .. ప్రేమల్లే ప్రేమించు 

ఆమె హృదయంలో ప్రేమ భావన అంకురించింది. పూదోటని పూలు వరించడం, పూతీగ తేనెని గ్రహించడం, ప్రేమల్లె ప్రేమించు అనడం.. ఇవన్నీ గుర్తుండిపోయే ప్రయోగాలు. తమిళ 'మిన్సార కణవు' కి వైరముత్తు రాసిన సాహిత్యాన్ని తెలుగు చేశారు వేటూరి. హరిహరన్, సాధనా సర్గం ఆలపించారు. సింపుల్ సెట్లో ప్రభుదేవా, కాజోల్, చిన్నపిల్లల మీద చిత్రీకరించారు ఈ పాటని. వింటున్నంత సేపూ హాయిగా ఉండడమే కాదు, విన్నాక ఓ పట్టాన వదిలిపెట్టని పాట ఇది. 

సోమవారం, ఏప్రిల్ 11, 2022

'ఆర్కే రోజా అనే నేను ...'

ఆమె పేరు శ్రీలత. చిత్తూరు జిల్లా భాకరాపేట ఆమె స్వస్థలం. కుటుంబానికి ఉన్న సినీ పరిచయాల  కారణంగా కాలేజీలో చదివే రోజుల్లోనే సినిమా అవకాశాలు వచ్చాయి. దాదాపు ఒకేసారి ఓ తమిళ సినిమా, మరో తెలుగు సినిమా. సినిమా కెరీర్ ని ఆమె ఎంత సీరియస్ గా తీసుకుని ఉండేదో తెలియదు, తెలుగు సినిమా షూటింగ్ లో ఓ సహనటుడు ఆమెని ఇబ్బంది పెట్టి ఉండకపోతే. అతడి ప్రవర్తన ఆమెలో పట్టుదలని పెంచింది. తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో కొన్నేళ్ల పాటు టాప్ హీరోయిన్ 'రోజా' గా వెలుగొందేందుకు దోహదం చేసింది. ఏ నటుడైతే తొలినాళ్లలో ఆమెని ఇబ్బంది పెట్టాడో, అతడే స్టూడియోల్లో ఆమె వచ్చేవరకూ మేకప్ వేసుకుని ఎదురు చూశాడు. కెమెరా సాక్షిగా ఆమె చేత చెంపదెబ్బలూ తిన్నాడు. తనతో సినిమాలు తీసిన తమిళ దర్శకుడు ఆర్కే సెల్వమణిని ప్రేమ వివాహం చేసుకుని సంసార జీవితంలో స్థిరపడింది. ఇక్కడితో ఆగిపోతే, ఓ సినిమా నటిగా తప్ప ఆమెని గురించి చెప్పుకోడానికి ఇంకేమీ ఉండకపోను. ఆమె ఆగలేదు, రాజకీయాల్లో అడుగుపెట్టింది. 

నిజానికి సినీనటిగా రోజాని నేను గమనించింది తక్కువ. అప్పట్లో నేను చూసిన కొన్ని సినిమాల్లో ఆమె కథానాయిక, అంతే.  అయితే ఆమె రాజకీయాల్లోకి వచ్చాక మాటల్నీ, చేతల్నీ తెలియకుండానే గమనిస్తూ వచ్చాను. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారి చిలక పలుకులు వినడానికి సరదాగా ఉంటాయి. పెద్దగా సబ్జక్ట్ నాలెడ్జి లేకుండా నాయకుడిని పొగడ్తల్లో ముంచే ప్రసంగాలు చేసి నెట్టుకొచ్చేస్తూ ఉంటారు. అయితే, రోజా ఇందుకు భిన్నం. తెలుగు దేశం పార్టీలో ఉన్న రోజుల్లో కూడా ఆమెకి తనేం మాట్లాడుతోందో స్పష్టత ఉండేది. స్వతహాగా ఉన్న వాగ్ధాటి, సినిమా ఇమేజి, తక్కువ కాలంలోనే ఆమెకి పేరు తెచ్చిపెట్టాయి. అప్పట్లో కాంగ్రెస్ నాయకులపై ఆమె విసిరే పంచ్ డైలాగులు వింటుంటే ఆమె ఎవరిదో డైలాగ్ రైటర్ సాయం తీసుకుంటోందన్న సందేహం కలిగేది. అయితే, ఆమెకి 'స్పాంటేనిటీ' ఉందన్నది తర్వాత రోజుల్లో అర్ధమైన విషయం. రాజకీయాలని ఆమె ఎంత సీరియస్ గా తీసుకుని ఉండేది అన్నది మళ్ళీ సందేహమే -- తెలుగు దేశం పార్టీలో ఆమె దారుణమైన అవమానాలు ఎదుర్కొని ఉండకపోతే. పదేళ్ల పాటు పార్టీ కోసం పని చేస్తే, సొంత పార్టీ నాయకులే ఆమెని పోటీ చేసిన చోట ఓడించారు రెండు సార్లు. ఈ పరిస్థితుల్లో పార్టీ వీడింది. 

తెలుగు దేశం పార్టీని అవమానకర పరిస్థితుల్లో వీడిన మొదటి నటి రోజా కాదు. అప్పటికే జయప్రదకి ఆ అనుభవం వుంది. అయితే, జయప్రద నాటి పార్టీ పరిస్థితులు, లెక్కలు ఆమెని రాజ్యసభకు నామినేట్ చేసేలా చేశాయి. రోజాకి దక్కింది కేవలం 'తెలుగు మహిళ' అధ్యక్ష పదవి మాత్రమే. పార్టీని వీడిన జయప్రద  రాజకీయంగా ఉత్తరాదికి మరలిపోవడంతో ఆమెకి తెలుగు దేశం పార్టీని ఎదుర్కోవలసిన, ఆ పార్టీని గురించి మాట్లాడవలసిన అవసరం కలగలేదు. కానీ, రోజా పరిస్థితి అది కాదు. తొలుత కాంగ్రెస్ లో చేరి, ఆవిర్భావం నాటినుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న రోజా పార్టీకి ప్రధాన శత్రువు తెలుగు దేశం పార్టీనే. ఆ పార్టీ నుంచి పొందిన అవమానాల బ్యాగేజీని ఆమె మోస్తూనే ఉంది.  రాజకీయాల్లోకి వచ్చిన పదిహేనేళ్ళకి 2014లో నగరి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికవడం రాజకీయాల్లో ఆమె తొలివిజయం. ఆ ఎన్నికల్లో ఆమె పార్టీ గెలుపొందలేదు. అధికార పార్టీతో ఆమె అసెంబ్లీలోనూ, బయటా తీవ్రంగా పోరాడింది. ఆమె ఏదైనా మాట్లాడితే, తెలుగు దేశం పార్టీ మహిళా నేతలందరూ కలివిడిగానూ, విడివిడిగానూ ఎదురుదాడి చేసేవాళ్ళు. 

ఒకానొక సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 'లైవ్' లో ఉండడానికి రోజా కారణమైంది అనడం అతిశయోక్తి కాదు. తెలుగు దేశం పార్టీ చేసిన అనేక తప్పులు అధికారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పళ్లెంలో పెట్టి అందించినా, వాటిలో ముఖ్యమైనది రోజా అసెంబ్లీ బహిష్కరణ. ఏ పరిస్థితులు ఆమె బహిష్కరణకి దారితీశాయన్నది ఇవాళ్టికీ స్పష్టంగా తెలియదు. కానీ, ఆ బహిష్కరణని సవాల్ చేస్తూ ఆమె చేసిన పోరాటం మాత్రం గుర్తుండిపోయింది. ఒక సెక్షన్ వోటర్లని ఆమె పార్టీకి దగ్గర చేసింది. మూడేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో ఆమె రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. పార్టీ విజయ దుందుభి మోగించి అధికారంలోకి వచ్చింది. ఆమెకి మంత్రి పదవి తధ్యం అనుకున్నారందరూ. 'హోమ్' శాఖని కేటాయించనున్నారని రూమర్లూ షికారు చేశాయి. రోజాకి మంత్రి పదవి రాకపోవడం ఆమె కన్నా ఎక్కువగా రాజకీయాలని గమనిస్తున్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది. మరో మూడేళ్ళ తర్వాత, అనేక నాటకీయ పరిణామాల అనంతరం మాత్రమే ఆమెకి మంత్రి పదవి దక్కింది. 

రోజా మీద వినిపించే ప్రధానమైన విమర్శ రాజకీయాల్లో హుందాతనం పాటించదనీ, ఎమ్మెల్యేగా ఉంటూ ద్వందార్ధపు టీవీ కామెడీ షోలలో కనిపిస్తుందనీను. 'ఇదే విషయాన్ని ఈమె మరికొంచం హుందాగా చెప్పి ఉండొచ్చు' అనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానైతే, ఆమె ఒక్కర్తీ హుందాగా ఉంటే సరిపోతుందా, లేక మొత్తం రాజకీయాల నుంచి ఏనాడో మాయమైపోయిన హుందాతనం మళ్ళీ తిరిగి రావడం బాగుంటుందా? అదీకాకుండా, తన ప్రత్యర్థులకు అర్ధమయ్యే భాష అదేనని ఆమె భావిస్తోందా? ఎడతెగని ప్రశ్నలు. ఇక టీవీ షోల విషయానికి వస్తే, ఎమ్మెల్యేగా ఉంటూ ద్వందార్ధపు మాటలు, పాటలున్న సినిమాల్లో హీరోగా నటిస్తూ, తెరనిండా నెత్తురు పారిస్తున్న వారి విషయంలో ఈ అభ్యంతరం ఎందుకు వినిపించదు? ఆమె మహిళ కావడం వల్ల ఆమె నుంచి కొంచం ఎక్కువగా ఆశిస్తున్నారా? పురుషుడై ఉంటే షోల విషయంలో అభ్యంతరాలు ఉండేవి కాదా? ఇవీ ఎడతెగని ప్రశ్నలే. "టీవీ షోలు మానేస్తున్నా" అంటూ ఆమె చేసిన తాజా ప్రకటనతో ఈ రెండో విమర్శకి ఇకపై తావుండక పోవచ్చు. 

ఇంతకీ, మంత్రిగా రోజా ఏం చేయబోతోంది? ఒక ప్రాంతీయ పార్టీలో (ఆ మాటకొస్తే ఏ పార్టీలో అయినా) మంత్రిగా ఉన్నవాళ్ళు చేయగలిగేది ఏం ఉంటుంది? ఏదన్నా మంచి జరిగితే దాన్ని ముఖ్యమంత్రి ఖాతాలో వేయడం, చెడు జరిగితే, తప్పని పరిస్థితులు ఎదురైతే, బాధ్యత వహించడం. ఇప్పటి వరకూ చూస్తూ వస్తున్నది ఇదే కదా. వారసత్వం పుణ్యమా అని చులాగ్గా మంత్రులైపోయి, బోల్డంత స్వేచ్ఛని అనుభవించిన వాళ్ళే ఏ ముద్రా వేయలేకపోయిన పరిస్థితుల్లో, అనేక పరిమితుల మధ్య స్వల్పకాలం పదవిలో ఉండే ఈమె నుంచి అద్భుతాలు ఆశించగలమా? పోనీ గడిచిన మూడేళ్ళనే తీసుకున్నా, 'ఇది ఫలానా మంత్రి చేపట్టిన కార్యక్రమం' అని చెప్పుకోడానికి ఏముంది? చెక్కులిచ్చే ఫోటోల్లో ముఖ్యమంత్రి  వెనుక నిలబడ్డం మినహా ఎవరూ చేసిందేమీ ప్రస్ఫుటంగా కనిపించడం లేదు. కాబట్టి, మంత్రిగా రోజా ఏదో చేసేయబోతుందనే భ్రమలేవీ లేవు. ఓ దెబ్బ తిన్నప్పుడో, అవమానం ఎదురైనప్పుడో అక్కడే ఆగిపోకుండా, పట్టు వదలకుండా, ఓర్పుగా పోరాడితే  విజయం సాధించవచ్చు అనే సత్యాన్ని మరోమారు చెబుతుంది ఆమె కథ. 

బుధవారం, ఏప్రిల్ 06, 2022

కాఫీ, టీ కబుర్లు

అమెరికా కాఫీ చైన్ 'స్టార్ బక్స్' ఒడిదుడుకుల్లో ఉందన్న వార్త చూడగానే నాకు మన 'కేఫ్ కాఫీ డే' గుర్తొచ్చింది. ఈ రెండు కాఫీ చైన్లకీ పోలికలు పెరిగిపోతున్నాయి రోజురోజుకీ. 'కాఫీ డే' ని తన ఇంటిపేరుగా మార్చేసుకున్న దివంగత వీజీ సిద్ధార్థ ఒకానొక టైం లో ఈ 'స్టార్ బక్స్' కి పోటీ ఇవ్వాలనుకున్నాడు, దేశీయంగా మొదలుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో. బెంగళూరు నగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఊపందుకుంటున్న తొలినాళ్లలో సిద్ధార్థ్ చేసిన 'కేఫ్ కాఫీ డే' ప్రయోగం ఊహించనంతగా విస్తరించింది, అది కూడా తక్కువ కాలంలోనే. సిద్ధార్థ్ వ్యాపార సామ్రాజ్యం కూడా కాఫీ నుంచి అనేక ఇతర రంగాలకి విస్తరించింది. అతడి అకాల, అనూహ్య మరణం తర్వాత 'ఇక కాఫీ డే పని అయిపోయినట్టే' అనుకున్నారు అందరూ. ఆ కుటుంబానికి ఉన్న రాజకీయ నేపధ్యం మంచినీ, చెడునీ కూడా చేసిందన్నారు. ఊహించని విధంగా సిద్ధార్థ భార్య మాళవిక తెరమీదకి వచ్చింది. కాఫీ డే పగ్గాలు చేపట్టడమే కాదు, అప్పులన్నీ తీర్చి సంస్థని గాడిన పెడతానని నమ్మకం కలిగించింది ఉద్యోగులు అందరిలోనూ. ఆమె కృషి కొనసాగుతోంది. 

అటు 'స్టార్ బక్స్' కూడా చిన్నగా మొదలై తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకుని వేగంగా విస్తరించిన సంస్థ. అప్పటివరకూ ఇల్లు, పని ప్రదేశం తప్ప మరో చోటు తెలీని వారికి 'థర్డ్ ప్లేస్' ని పరిచయం చేసింది. రకరకాల కాఫీ ఫ్లేవర్లని అన్ని రకాల ధరల్లోనూ అందుబాటులో ఉంచడం, కస్టమర్లు కోరిన కొత్త ఫ్లేవర్లని, కాంబినేషన్లని అప్పటికప్పుడు చేసి ఇవ్వడం లాంటివి 'స్టార్ బక్స్'ని సగటు అమెరికన్లకి దగ్గర చేశాయి. అదే సమయంలో ఓ సంస్థగానూ మిగిలిన సంస్థలకి భిన్నంగా వ్యవహరించింది 'స్టార్ బక్స్'. పూర్తి కాలపు ఉద్యోగులకే కాదు, కాంట్రాక్టర్లకీ షేర్లు ఇవ్వడం, సామాజిక బాధ్యత తలకెత్తుకుని, అవసరమైన సమయాల్లో అవసరమైన విషయాల మీద జనంలో కదలిక తెచ్చే ప్రయత్నం చేయడం (రేస్ సమస్య లాంటివి), చిన్నచిన్న అమ్మకం దారులని ప్రోత్సహించడం, విద్యార్ధులకి స్కాలర్షిప్పులు.. ఇలా సామాజిక బాధ్యతని నెరవేర్చడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అలాంటి 'స్టార్ బక్స్' లో అంతర్గత సంక్షోభం ముదురుతోందంటోంది అమెరికన్ మీడియా. 

Google Image

అమెజాన్ తో కలిసి 'స్టార్ బక్స్' ప్రారంభించిన నో టచ్ కాఫీ షాపులు వివాదం మొదలవడానికి కారణమట. బరిస్టా (కాఫీ కలిపి ఇచ్చే ఉద్యోగి) అవసరం లేకుండా, యాప్ ద్వారా కాఫీ ఆర్డర్ ఇచ్చి, పే చేసి, మెషీన్ నుంచి కప్పు అందుకుని తాగే ఈ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో ఉద్యోగాల కోత ఏర్పడుతుందని భయం మొదలైందట ఉద్యోగుల్లో. ఈ కొత్త ఏర్పాటుకి ప్రజలింకా పూర్తిగా అలవాటు పడలేదు. కాఫీ షాపులోకి వెళ్ళడానికి ఫింగర్ ప్రింట్స్ ఎందుకివ్వాలో అర్ధం కాని వాళ్ళే ఎక్కువ ఉన్నారు ప్రస్తుతానికి. ఒకప్పుడు ఘనంగా అనిపించిన 'స్టార్ బక్స్' వాళ్ళ పే చెక్కులు, కోవిడ్ తర్వాత సవరింపబడిన మార్కెట్ వేతనాలతో పోలిస్తే వెలవెలపోతూ ఉండడం, షిఫ్టుల విషయంలో స్పష్టత లేకపోవడం వంటివన్నీ ఉద్యోగులు రోడ్డెక్కేలా చేశాయి. ఫలితంగా, 'స్టార్ బక్స్' షేరు పతనమవుతోంది. ఓ పక్క మూతపడిపోతోందనుకున్న 'కేఫ్ కాఫీ డే' పునరుత్తానం వైపు అడుగులు వేస్తుండగా, 'స్టార్ బక్స్'  భవిష్యత్తుని గురించి సందిగ్ధత ఏర్పడడం ఓ చిత్రమైన పరిణామం.  

ఇంతకీ, 'కేఫ్ కాఫీ డే' ని పునర్నిర్మించడం మాళవికకి నల్లేరు మీద బండి నడక అవుతుందా? సిద్ధార్థ్ కాఫీ డే ప్రారంభించే నాటికీ, ఇవాళ్టికీ మార్కెట్లో చాలా మార్పులు వచ్చాయి. నాడు ప్రజలకి వేరే ఛాయిస్ లేదు. ఇప్పుడు ఎంచుకునేందుకు ఛాయిస్ లు అనేకం. సాఫ్ట్వేర్ రంగంలో మొదలయిన 'స్టార్ట్ అప్' ల ట్రెండు కాఫీ వ్యాపారానికీ విస్తరించింది. కొత్తగా వస్తున్నవాళ్ళు కూడా వ్యాపారాన్ని ఆషామాషీగా తీసుకోడం లేదు. నేరుగా కాఫీ ఎస్టేట్లకి వెళ్లి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ సరుకుని కొనుక్కు తెచ్చి, గింజల్ని స్వయంగా పొడికొట్టి, కాఫీ చేసి అమ్ముతున్నారు. కాఫీ నాణ్యత విషయంలో రాజీ పడక పోవడం, కొత్త రుచుల్ని పరిచయం చేయడానికి సర్వదా సిద్ధంగా ఉండడంతో ఆదరణ బాగుంటోంది. వీటికి లేనిదీ, 'కాఫీ డే' కి ఉన్నదీ బ్రాండ్ ఇమేజి. ఈ కారణంగానే వీటి విస్తరణ ఆలస్యమవుతోంది. ఈ కొత్త సంస్థలు నిలదొక్కుకునే లోగానే 'కాఫీ డే' బండిని పూర్తిగా పట్టాలెక్కించడం మాళవిక ముందున్న పెద్ద సవాలు. మరి దేశీయ 'స్టార్ బక్స్' కథ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. 

కాఫీ గురించి మాట్లాడుకుని, టీ గురించి చెప్పుకోకపొతే ఎలాగ? సిద్ధార్ధ్ చూపించిన మార్గాన్ని టీ వ్యాపారులూ ఉపయోగించుకున్నారు. 'కాఫీ డే' స్థాయిలో కాకపోయినా, అనేక 'టీ' చైన్లూ మార్కెట్లోకి వచ్చాయి. పోటీ ఎక్కువగా ఉండడం, విస్తరణ వేగంగా కాక మందకొడిగా సాగుతూ ఉండడం ఈ రంగాన్ని పీడిస్తున్న సమస్య. నగరాల్లో ఉండే పోటీకి దూరంగా, చిన్న పట్టణాల మీద దృష్టి పెట్టి 'టీ టైం' చైన్ ని విస్తరించిన గోదావరి కుర్రోడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కథ స్ఫూర్తివంతంగా అనిపించింది. ఇంజనీరింగ్ చదివి, పదేళ్ల పాటు సాఫ్ట్వేర్ రంగంలో పని చేసిన ఈ కడియం కుర్రాడు, ఉద్యోగాన్ని వదిలి టీ వ్యాపారంలోకి దిగడం, అది కూడా కార్పొరేట్ స్థాయిలో కాకుండా, గ్రామీణ స్థాయి నుంచి మొదలు పెట్టడం అతని కుటుంబాన్నే కాదు, అందరినీ ఆశ్చర్య పరిచింది. పెద్ద గ్రామాలు, చిన్న పట్టణాల్లో టీ వ్యాపారానికి కొదవ లేదని, కోట్లలో ఆదాయం సంపాదించే వీలుందని నిరూపించింది 'టీ టైం'. రకరకాల పేర్లతో స్థానిక షాపుల వాళ్ళు ఇమిటేషన్ బ్రాండింగ్ చేసేసుకున్నా, ఆ పోటీని తట్టుకుని తన బ్రాండ్ నేమ్ ని నిర్మించుకుని, నిలబెట్టుకున్నాడు శ్రీనివాస్. ఇవీ కాఫీ, టీ లని గురించి కాసిన్ని కబుర్లు. 

సోమవారం, ఏప్రిల్ 04, 2022

కొత్త జిల్లాలు

మా చిన్నప్పుడు కోనసీమ నుంచి కాకినాడ వెళ్లాలంటే ఓ రోజు పని. అమలాపురం మీదుగా బస్సులో ఎదుర్లంక వెళ్లి, అక్కడ రేవు దాటి, యానాం వెళ్లి, అక్కడినుంచి మళ్ళీ బస్సు పట్టుకుని కాకినాడ వెళ్లడం దగ్గర దారి. కాకపొతే అంచె బస్సులు, పడవ వరసగా దొరికెయ్యాలి. ఎక్కడ ఆలస్యం అయినా మొత్తం ప్రయాణ సమయం పెరుగుతూ పోతుంది. లేదూ అంటే రావులపాలెం వెళ్లి, అక్కడి నుంచి అప్పుడప్పుడూ ఉండే కాకినాడ ప్యాసింజర్ బస్సు పట్టుకుంటే పడుతూ లేస్తూ నాలుగైదు గంటల్లో కాకినాడ చేరేవాళ్ళం. కలక్టరేట్లోనో ఇంకేదైనా ఆఫీసు లోనో  పనంటే వెళ్లినవాళ్ళు పనిపూర్తి చేసుకుని అదే రోజు తిరిగి రావడం కల్ల. అక్కడ ఉండిపోవడం అంటే, బంధుమిత్రులెవరన్నా ఉంటే పర్లేదు కానీ, లేకపోలే తిండి, లాడ్జీ ఖర్చులు తడిసిమోపెడు. ధ్రువీకరణ పత్రంలో (కులం/ఆదాయం/నివాసం) తప్పులు సవరింపజేసుకోడానికో, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ లో పేరు నమోదుకో, అప్డేటుకో మిత్రులు తరచూ ప్రయాణం అవుతూ ఉండేవారు, శ్రమనీ, ఖర్చునీ తట్టుకుని నిట్టూరుస్తూ. 

ఇప్పుడూ దూరం తగ్గలేదు కానీ, ప్రయాణ వేగం కాస్త పెరిగింది. ఎదుర్లంక-యానాం ల మధ్య వృద్ధ గౌతమి మీద బ్రిడ్జీ రావడం తో నేరుగా అమలాపురం-కాకినాడ బస్సులు తిరుగుతున్నాయి. రావులపాలెం వరకూ రోడ్డు అని భ్రమించే లాంటిది ఒకటి ఉంటుంది కానీ, అక్కడి నుంచీ పర్లేదు. అయినప్పటికీ మొత్తం ప్రయాణం మూడు నాలుగు గంటలు పైగా పడుతోంది.పాలనలో ఆన్లైన్ విప్లవం వచ్చేసినప్పటికీ ప్రత్యక్షంగా హాజరైతే తప్ప పూర్తికాని పనులు ఇప్పుడూ ఎక్కువే. ఏదో ఒక పని నిమిత్తం ప్రయాణం తప్పదు. జిల్లాలోకెల్లా ఉన్న పెద్ద ధర్మాసుపత్రిలో వైద్యం కోసం చేరేవాళ్ళు, వాళ్ళకి తోడుగానో, చూడ్డానికో వెళ్లేవాళ్ల సంఖ్యా ఎక్కువే. ప్రయాణం మరీ సుఖంగా ఏమీ ఉండదు. కాకపోతే, వెళ్లిన పని పూర్తయితే అర్ధరాత్రైనా అదే రోజు ఇంటికి తిరిగి రావొచ్చనే భరోసా ఉంది. చేతిలో మోటార్ సైకిల్ ఉంటే ప్రయాణం మరికొంచం సులువు. కారున్న వాళ్ళకి ఎటూ ఎక్కడైనా దూరాలు భారాలు కాదు కదా. 

దాదాపు పది పన్నెండేళ్ల క్రితం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ పుట్టకమునుపు, బ్యూరోక్రసీలో ఉన్న ఓ మిత్రుడి ఉవాచ: "మీ జిల్లాని మూడు జిల్లాలుగా చెయ్యచ్చు. ఉత్తరాదిలో ఎక్కడా ఇంత పెద్ద పెద్ద జిల్లాలు లేవు. జిల్లా చిన్నదైతే ప్రజలకే కాదు, అధికారులకి కూడా సుఖం. పనిమీద కొంచం ఎక్కువ శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంటుంది". ఆ మాట నేను కాదనలేదు కానీ, మరీ 'మూడు జిల్లాలు' అవసరం లేదేమో అనిపించింది. అప్పటికే 'కోనసీమ ప్రత్యేక జిల్లా' అనే నినాదం ఉండుండీ వినిపిస్తూ ఉండేది. అసలు జీఎంసీ బాలయోగి అకాల మరణం పాలయ్యి ఉండకపోతే, తన అధికారాలు ఉపయోగించి ఎప్పుడో కోనసీమని ప్రత్యేక జిల్లా చేసేసి ఉండేవారని నమ్మే వాళ్ళు ఎందరో ఉన్నారు మా ప్రాంతంలో. "రెండు జిల్లాలు చాలేమో" అన్నాను. "జనసాంద్రత, విస్తీర్ణం దృష్ట్యా మాత్రమే కాదు, ఇక్కడున్న వనరుల్ని దృష్టిలో పెట్టుకున్నా మూడు జిల్లాలైతేనే ఏవన్నా అభివృద్ధికి అవకాశం ఉంటుంది" అన్నప్పుడు, ఇంకేమీ జవాబు చెప్పకుండా వినేసి ఊరుకున్నా, "జరిగే పని కాదులే" అనుకుంటూ. 

Google Image

అప్పుడే కాదు, మొన్నామధ్య రాష్ట్ర ప్రభుత్వం 'జిల్లాల పునర్వ్యవస్తీకరణ-కొత్త జిల్లాల ఏర్పాటు' ప్రకటించినప్పుడు కూడా "బోల్డన్ని చిక్కులొస్తాయి, అయినప్పుడు కదా" అనే అనుకున్నాను. కానీ, అత్యంత ఆశ్చర్యకరంగా అనుకున్న సమయానికే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోయింది. పదమూడల్లా ఇరవయ్యారు జిల్లాలయ్యాయి.  మా కోనసీమకి ప్రత్యేక జిల్లా హోదా వచ్చేయడమే కాదు, నాటి నా మిత్రుడి మాటని నిజం చేస్తూ తూర్పుగోదావరి మూడు జిల్లాలుగా పునర్వ్యవస్తీకరింపబడింది. ప్రభుత్వ విభాగాలతో బొత్తిగా అవసరం పడని వాళ్ళకో, 'అన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతాయి' అనుకునే వాళ్ళకో ఇదేమీ పెద్ద విషయం కాదు కానీ, కలెక్టరేట్ల చుట్టూ నిత్యం చెప్పులరిగేలా తిరిగే వేలాది మందికి ఇది తీపి కబురు. జిల్లా కలెక్టరే మేజిస్ట్రేట్ కూడా అవ్వడం, భూ తగాదాలు లాంటివి ప్రత్యక్ష హాజరుతో తప్ప పరిష్కారం కానివి కావడం వల్ల గ్రామాల్లో ఉండే వాళ్ళకి, వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరక్క తప్పదు, ఎందుకో అందుకు. సదరు కార్యాలయం అక్కడెక్కడో కాక, దగ్గర ఉండడం అన్నది చాలా పెద్ద ఊరట. 

గతంతో పోల్చినప్పుడు రెండూ బై మూడో వంతు పని భారం తగ్గింది కాబట్టి కొత్త జిల్లాల కలెక్టర్లకి అభివృద్ధి మీద దృష్టి పెట్టే సమయమూ, వీలూ చిక్కొచ్చుననే ఆశ ఒకటి ఉంది. ఇక్కడ అభివృద్ధి అంటే ఫ్లై వోవరూ, హైటెక్ సిటీ నిర్మాణాలు కాదు, చేయగలిగే వాళ్ళకి యేటి పొడవునా చేతినిండా పని, కడుపు నిండా తిండీ దొరికేలా చేయడం. వనరులన్నీ ఉండి కూడా, ఈ విషయంలో వెనకపడ్డానికి కారణం రాజకీయ నాయకులకి చిత్తశుద్ధి కొరవడడం ఓ కారణం అయితే, శ్రద్ధ పెట్టాల్సిన ఉన్నతాధికారులకి తగినంత సమయం చేతిలో లేకపోవడం ఇంకో కారణం. వనరుల సద్వినియోగం మీద దృష్టి పెట్టగలిగే అధికారులు కలెక్టర్లుగా వస్తే, జీవనోపాధి సమస్య కొంతవరకైనా పరిష్కారం అవ్వకపోదనిపిస్తోంది. వ్యవస్థలో ఉన్న సమస్త లోపాలూ ఈ ఒక్క నిర్ణయంతో సరిద్దిబడిపోతాయన్న అత్యాశ అయితే లేదు. కొందరు ప్రచారం చేస్తున్నట్టుగా ఈ కొత్త జిల్లాల ఏర్పాటు సర్వరోగ నివారిణి కాదు. అదే సమయంలో మరికొందరు చెబుతున్నట్టుగా ఎందుకూ పనికిరాని నిర్ణయమూ కాదు. 

జిల్లా కేంద్రం అంటే కలెక్టరాఫీసు, ఎస్పీ ఆఫీసు, ముఖ్యమైన ఆధికారుల కార్యాలయాలతో పాటుగా జిల్లా ఆస్పత్రి కూడా ఉంటుంది. సాధారణంగా ఈ ఆస్పత్రిలో అన్ని వైద్య విభాగాలూ, అన్ని రకాల అనారోగ్యాలకీ వైద్యసేవలు అందించేవిగా ఉండాలి. ప్రస్తుతం ప్రకటించిన కొత్త జిల్లా కేంద్రాలలో చాలాచోట్ల ఏరియా ఆస్పత్రులున్నాయి. అయితే, వాటిలో సేవలు, సౌకర్యాలు పరిమితం. వీటిని జిల్లా ఆసుపత్రులుగా అప్ గ్రేడ్ చేసి, అవసరమైన వైద్యుల్ని, పరికరాల్ని సిద్ధం చేయాలి. ప్రయివేటు ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా విస్తరించినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది రోగులు ఇప్పటికీ ధర్మాసుపత్రుల మీదే ఆధారపడ్డారు. ప్రయివేటు ఆస్పత్రులో దొరికే వైద్యం ఖరీదైనది కావడం ఇందుకు ముఖ్య కారణం. పాలనా కార్యాలయాల ఏర్పాటుతో పాటుగా దృష్టి పెట్టాల్సిన అంశం ఇది. లెక్కపెడితే, ఇప్పటికీ జిల్లా కేంద్రాలకి ఇతరత్రా పనుల నిమిత్తం వెళ్లే వారి సంఖ్యతో సరిసమంగా ప్రభుత్వ వైద్యం కోసం వెళ్లేవారి సంఖ్యా ఉంటోంది. ఈ ఏర్పాటు చేసినప్పుడే కొత్త జిల్లాల ఏర్పాటు పరిపూర్ణమవుతుంది. 

శుక్రవారం, ఏప్రిల్ 01, 2022

వేపపువ్వు

'ఉగాది పచ్చడి' అనే చక్కని పేరున్నా 'వేపపువ్వు పచ్చడి' అన్న పేరే స్థిరపరిచేశారెందుకో. 'చేదు పచ్చడి' అనడం కూడా కద్దు. చెరుకు ముక్కలు, మామిడి పిందెల ముక్కలు, అరటి పండు, కొబ్బరి, బెల్లం, పచ్చి మిరప, చింతపండు పులుసు, ఉప్పు, ఇంకా ఎవరి అభిరుచిని, అందుబాటునీ బట్టి వాళ్ళు అనేక దినుసులు చేర్చేసినా ఏమీ అనుకోని పండగ ప్రత్యేక వంటకం ఇది. పచ్చడి కదా అని కర్వేపాకు తగిలించి నేతితో ఇంగువ పోపు వేసేవాళ్ళూ ఉన్నారు. ఎన్ని వేసినప్పటికీ మోడర్న్ వంటల్ని కొత్తిమీరతో 'గార్నిష్' చేసినట్టుగా, ఉగాది పచ్చడికి చివర్లో వేపపువ్వు అలా పడాల్సిందే. ఎవరి చేతిలోనన్నా శాస్త్రోక్తంగా పచ్చడి వేయాలంటే, ముందుగా వేపపువ్వు వేసి, తిననిచ్చి, అప్పుడు మిగిలిన మిశ్రమాన్ని వడ్డించాలి. తలంటులో కుంకుడు పులుసు పడి కళ్ళు మండితే మిగిలిన రోజుల్లో ఉప్పుకల్లు అద్దిన చింతపండు తినే సౌలభ్యం ఉండేది కానీ, ఉగాది రోజున మాత్రం మొదటగా తినాల్సింది వేపపువ్వు పచ్చడినే. 

మార్చి మూడోవారం మొదలు ఏప్రిల్ మొదటి వారం లోగా ఎప్పుడైనా వచ్చే పండుగ ఉగాది. వేసవి మొదలైపోతుంది. ఉక్కపోత, చెమట సరేసరి. వేపచెట్లు పూతకొస్తాయి. పండుగ కాస్త ముందుగా వచ్చేస్తే వేపపువ్వుకి బదులుగా మొగ్గలు పడతాయి పచ్చడిలో. కాస్త ఆలస్యం అయి, పిందెలు మొదలైపోయినా పువ్వైతే దొరుకుతుంది. వినాయక చవితి పండక్కి పత్రి కోసుకోడానికి బోల్డన్ని నిబంధనలుండేవి. కొన్ని చెట్లనుంచి కోసీ కోయనట్టు ఒకట్రెండు ఆకులు మాత్రమే తుంపాలి, మరికొన్ని మొక్కలు, చెట్ల జోలికి వెళ్లనే కూడదు ఇలా అన్నమాట. అయితే, వేపపువ్వు విషయంలో ఈ నియమాలేవీ ఉండేవి కాదు. ఎంత పువ్వు కోసుకున్నా ఎవరూ ఏమీ అనేవాళ్ళు కాదు. కానైతే, కొయ్యడానికే మనసొప్పేది కాదు. పువ్వు వృధా పోకూడదని అంతా పచ్చట్లో వేసేస్తే తినాల్సింది మనమే అన్న జ్ఞానం కాస్త తొందరగానే కలిగింది. ఇలాంటి జ్ఞానాన్ని పత్రీ, ఇతరత్రా పువ్వులూ కలిగించలేక పోయాయి. 

Google Image

రాములవారి గుడి గోడని ఆనుకుని పెద్ద వేపచెట్టు ఉండేది. మొదలు గుడి లోపల ఉంటే, కొమ్మలు గోడ మీంచి వాలి ఉండేవి. చెట్టు మొదట్లో కండ చీమలు పుట్టలు పెట్టుకుని ఉండడమూ, ప్రహరీ గోడ నెరజలు తీసి ఉండడంతో పిల్ల మేళానికి చెట్టెక్కే సాహసం ఉండేది కాదు. గోడ బయట రాతి సోఫా మీద నిలబడి, పొడవాటి కర్రతో వేప కొమ్మల్ని వంచుకుంటే పువ్వు కోసుకోవచ్చు. అయినా, ఎంత పువ్వు కావాలి కనుక? చిక్కేవిటంటే, వేపపువ్వు ఎప్పుడు పడితే అప్పుడు కోయడానికి లేదు. ఉదయమో, సాయంత్రమో మాత్రమే కొయ్యాలి. సాయంత్రం వేళ ఆ ప్రాంతంలో ఓ గోధుమవన్నె ముసలి తాచుపాము వ్యాహ్యాళికి తిరిగేది. ఆ పాము ఎవరినీ ఏమీ చేసేది కాదు, ఆ పామునీ ఎవరూ ఏమీ చేసేవారు కాదు. పిల్లలు తెలిసో తెలియకో రాయి విసురుతారని పెద్దవాళ్ళ భయం. అందుకని, ఆ వ్యాహ్యాళి వేళల్లో కూడా అటువైపు వెళ్లడం నిషిద్ధం. అలా వేపపువ్వు కోసం పంచాంగం చూసి ముహూర్తం పెట్టినంత హడావిడి జరుగుతూ ఉండేది. అన్నట్టు, ఆ చెట్టు వేప పుల్లలకి ఎంత డిమాండ్ అంటే, లెక్కేస్తే దాదాపు  ఊళ్ళో సగం దంతధావనాలకి ఆ ఒక్క చెట్టే దోహదం చేసి ఉంటుంది, కొన్ని దశాబ్దాల పాటు.  

గణాచారి చేతిలో వేపమండల్లాంటి, పువ్వులున్న వేపకొమ్మలు ఇంటికి తేవడంతోనే పనైపోయినట్టు కాదు. తెచ్చిన వేపపువ్వు నుంచి మొగ్గల్నీ, పసిరి మొగ్గల్నీ వేరు చేసే పని కూడా పిల్లలదే. పసిరి మొగ్గల్ని ఎప్పుడూ ఉండనిచ్చే వాళ్ళం కాదు కానీ, మొగ్గల్ని ఒక్కోసారి ఉంచేయాల్సి వచ్చేది. ఉగాది ముందే వచ్చేసి, చెట్టు పూర్తిగా పూత అందుకోక పొతే మొగ్గలోనే పూలని చూసుకోవాలి కదా మరి. పూలు కోసేశాక, ఆ మిగిలిన పుల్లల్ని పడేయకూడదు. వేలెడేసి చొప్పున విరిచి, చిన్న పురికొస ముక్క ముడేసి, ఏ గూట్లోనో గుర్తుగా దాస్తే, గబుక్కున వచ్చే చుట్టాలకి పొద్దున్నే పళ్ళు తోముకోడానికి ఇవ్వొచ్చు. ఈ జ్ఞానమూ ఊరికే వచ్చింది కాదు. ఓ పండగెళ్ళిన పాతనాడు వచ్చిన చుట్టానికి పొద్దుపొద్దున్నే వేపపుల్ల సమకూర్చాల్సి వచ్చి, అష్టకష్టాలూ పడినప్పుడు కలిగింది. తాటాకు ముక్కదేం వుంది, పెరట్లో ఉన్న పాక పైకప్పు నుంచి లాక్కోవచ్చు, వేపపుల్ల అలా కాదు కదా? ఇంతకీ, అలా వేరు చేసిన వేపపువ్వుని చిన్న గిన్నె లోకో, ఖాళీ కొబ్బరి చిప్పలోకో తీసి పెట్టేస్తే అప్పటికి పనైపోయినట్టే. 

పండుగనాడు పొద్దున్నే పచ్చడి నోట్లోవేసుకోగానే కలిగే మొదటి కోరిక 'తియ్యగా ఉంటే బాగుండును'. ఉండే అవకాశం ఎంతమాత్రమూ లేదు. ఎందుకంటే, మొదట వేపపువ్వు చప్పరించాకే మిగిలిన పచ్చడి చేతిలో పడుతుంది. శ్రేష్టమైన వేపచెట్టు కొమ్మన పూసిన పువ్వు తియ్యగా ఎలా ఉంటుంది? పైగా, ప్రకృతి ఇష్టారాజ్యంగా కాకుండా ఓ పద్ధతిగా నడిచిన రోజుల్లో? అయితే, ఉగాది మరీ అంత చేదుగా ఏమీ మొదలయ్యేది కాదు. అప్పటికే పచ్చడిలో నాని ఉండడం వల్ల వేపపూలకి కాస్త పులుపు, తీపి అంటి ఉండేవి. పైగా, చేదు తిన్నందుకు గాను, పచ్చట్లో చెరుకు ముక్కని ఎంచి చేతిలో వేసేవాళ్ళు. ఈసారి వేపపూత అంటుకున్న చెరుకు ముక్క. ఏ ఒక్క రుచో దొరకదు. అన్ని రుచులూ కలగలిసే నాలిక్కి తగులుగూ ఉండేవి. నిజానికి అదో ప్రత్యేకమైన రుచి. ఇదీ అని ప్రత్యేకంగా చెప్పలేం. కావాలనుకోలేం, వద్దనీ అనుకోలేం. మళ్ళీ రుచి చూడాలనిపిస్తుందా అంటే, సందేహమే. ఆ రుచి పేరు 'జీవితం' అని అర్ధమవ్వడానికి కొన్నేళ్లు పట్టింది. మిత్రులందరికీ శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు!!