బుధవారం, ఏప్రిల్ 06, 2016

కళ్యాణపురం

నాలుగేళ్ల క్రితం విడుదల చేసిన కథాసంకలనం 'యానాం కథలు' కి కొనసాగింపుగా కవీ, రచయితా దాట్ల దేవదానం రాజు ఏడాది క్రితం విడుదల చేసిన అనుబంధ సంకలనం 'కళ్యాణపురం.' ఈ పుస్తకానికి 'యానాం కథలు-2' అని ఉపశీర్షిక ఇచ్చారు రచయిత. మొదటి సంకలనంలో పద్దెనిమిది కథలు చేర్చిన దేవదానం రాజు, రెండో భాగంగా పదహారు కథల్ని ప్రచురించారు. అయితే, మొదటి సంకలనంలో కథలన్నీ కథాస్థలంతో సంబంధం ఉన్నవే కాగా, తాజా పుస్తకంలో నాలుగైదు కథలు మినహా మిగిలినవి ఏ ప్రాంతంలో అయినా జరిగే అవకాశం ఉన్నవి. అంటే, వీటిలో కథా స్థలానికి పెద్దగా ప్రాధాన్యత లేదు.

శీర్షికగా ఉంచిన 'కళ్యాణపురం' ఈ సంకలనంలో మొదటి కథ. యానాం పట్టణానికి పూర్వనామమే ఈ కళ్యాణపురం. బ్రిటిష్ చట్టాలు అమలులో ఉన్న ఆంధ్ర ప్రాంత్రంలో ప్రభుత్వం బాల్య వివాహాలను నిషేధించినప్పుడు, సంప్రదాయం తప్పడానికి ఇష్టపడని శోత్రియులు ఫ్రెంచి పాలనలో ఉన్న యానాం వెళ్లి పిల్లలకి పెళ్ళిళ్ళు జరిపించేవారు. అలాంటి ఓ బాల్య వివాహాన్ని కథా వస్తువుగా తీసుకుని రాసిన ఈ కథ ఆద్యంతమూ ఉత్కంఠ భరితంగా చదివిస్తుంది. శోత్రియ కుటుంబాల ఆచార వ్యవహారాలని కాసింత లోతుగానే అధ్యయనం చేసి కథని రాశారని అర్ధమవుతుంది.

సంకలనంలో రెండో కథ 'దేశద్రోహి.' ఇది ఫ్రెంచి వాళ్ళ కథ. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఫలితంగా యానాంలో ఉన్న ఫ్రెంచి అధికారులలో పెరిగిన అభద్రతా భావం కథావస్తువు. ఏదైనా చేసి యానాంని స్థిరవాసంగా చేసుకోవాలని నిర్ణయించుకున్న అధికారి పౌల్ షెల్జ్ కి ఇంటినుంచే వ్యతిరేకత మొదలవుతుంది. విభజించి పాలించాలన్న పౌల్ షెల్జ్ ప్రయత్నాలని అతని కుమారుడు, ఉన్నత విద్యావంతుడు, రోనే తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. యానాం భవిష్యత్తుతో ముడిపడిన షెల్జ్ ఇంటి తగువు ఎలా ముగిసింది అన్నది ఆసక్తికరంగా చెప్పారు రచయిత.


ప్రస్తుత సమాజంలో పెరిగిపోతున్న ఆర్ధిక నేరాలని ఇతివృత్తంగా చేసుకుని రాసిన కథ 'మన్యంవోరి మేడ.' యానాం జమీందారిణి మహాలక్ష్మమ్మ మంచితనం, నిక్కచ్చితనంతో పాటుగా నూట యాభై ఏళ్ళ కాలంలో విలువల విషయంలో సమాజంలో చోటుచేసుకున్న వశ్యతని ప్రశ్నిస్తారు రచయిత. అయితే, జమీందారీ వాతావరణ చిత్రణలో మరికొంచం శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది అనిపించింది కథ చదవడం పూర్తిచేశాక. వీటి తర్వాత గుర్తుండిపోయే మరో కథ 'చూపుడువేలు.' ఓ వర్గం ప్రజలనుంచి పూజలందుకునే నాయకుడి విగ్రహానికి అపచారం జరిగినప్పుడు యానాం పట్టణంలో చోటుచేసుకున్న రాజకీయాలని చిత్రించిన కథ 'చూపుడు వేలు.' కథా స్థలం యానాం కావడం వల్ల ముగింపు అతికినట్టుగా సరిపోయింది.

మానవ సంబంధాలని ఇతివృత్తంగా తీసుకుని రాసిన 'పలకరింపు' గుర్తుండిపోయే కథల జాబితాలో చేరుతుంది. ఒకప్పుడు యానాంలో ఉద్యోగం చేసి, చాలా రోజుల విరామం తర్వాత చూసిపోడానికి వచ్చిన భాస్కర్ కథ ఇది. ముందుగానే చెప్పినట్టుగా మిగిలిన పదకొండు కథలూ ప్రపంచంలో ఎక్కడైనా జరగడానికి అవకాశం ఉన్నవి. కొన్ని కథలకి కథా స్థలంగా యానాంని ప్రకటించారు కానీ, నిజానికి 'స్థలం' అన్నది కథలో భాగం కాలేదు. మానవనైజం ఇతివృత్తంగా చేసుకుని రాసినవే ఈ కథలన్నీ. 'విషాద మోహం' కథ వడ్డెర చండీదాస్ మొదలు  కాశీభట్ల వేణుగోపాల్ వరకూ కొందరు రచయితల కథలు అప్రయత్నంగా గుర్తొస్తాయి. 

'అభయం,' 'మళ్ళీ బాల్యం,' 'జగమంత కుటుంబం,' 'వెంటాడే విలువలు,' 'రంగు పడింది,' 'తీరని దాహం,' 'కొత్త దేవుడు,' 'హోరు గాలి' కథలు మానవ సంబంధాలనీ, మనస్తత్వాన్నీ చిత్రించిన కథలు. అయితే, సంకలనంలో మెజారిటీ కథలు హడావిడిగా రాసేసినట్టుగా అనిపించాయి. కథనం, సంభాషణలు వంటి విషయాల్లో మరికొంత శ్రద్ద తీసుకుని ఉంటే గొప్ప కథలుగా నిలబడే అవకాశం ఉన్నవే. అలాగే, కథల్లో యానాంకి మరింత ప్రాధాన్యత ఇచ్చి ఉంటే 'యానాం కథలు-2' అన్న ఉపశీర్షికకి న్యాయం జరిగి ఉండేది. (శిరీష ప్రచురణలు, పేజీలు  159, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, ఏప్రిల్ 04, 2016

'సంగీత చూడామణి' శ్రీరంగం గోపాలరత్నం

శాస్త్రీయ సంగీత అభిమానులకే కాదు, గడిచిన తరం ఆకాశవాణి శ్రోతలకి కూడా శ్రీరంగం గోపాలరత్నం పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలమురళి-గోపాలరత్నం యుగళంలో వచ్చిన ఎన్నెన్నో గీతాలు శ్రోతల మనస్సులో చిరస్థానాన్ని సంపాదించుకున్నాయి. భక్తిపాటల మొదలు రేడియో నాటకాల వరకూ అనేక విధాలైన రేడియో కార్యక్రమాలకి తన గాత్రాన్ని అందించిన గోపాలరత్నం కచేరీలతో పాటు, ప్రైవేటు ఆల్బంల ద్వారానూ లక్షలాది మంది శ్రోతలకి దగ్గరయ్యారు. అయితే, ఆమె గొంతే తప్ప ఆమెని గురించిన విశేషాలు పెద్దగా ఎవరికీ తెలియదు.

తెలుగునాట ప్రముఖ సంగీత విద్వాంసుల పేర్ల జాబితా వేస్తే, గోపాలరత్నం పేరు లేకుండా ఆ జాబితా అసంపూర్ణం. అలాంటి గోపాలరత్నం జీవితాన్ని పరిచయం చేస్తూ ఓ చిరుపుస్తకాన్ని రచించారు ప్రముఖ రచయిత్రి ఇంద్రగంటి జానకీబాల. 'సంగీత చూడామణి శ్రీరంగం గోపాలరత్నం (జీవితం-సంగీతం)' పేరిట విడుదలైన డెబ్బై ఆరు పేజీల పుస్తకంలో గోపాలరత్నం జీవిత విశేషాలతో పాటు, అరుదైన ఛాయా చిత్రాలనీ పొందు పరిచారు. గోపాలరత్నం అకాల మరణానికి స్పందిస్తూ ప్రముఖులు పంపిన సంతాప సందేశాలు, ఆమె పాడిన కొన్ని పాటల సాహిత్యాన్నీ జతచేశారు.

విజయనగరం జిల్లా పుష్పగిరిలో శ్రీరంగం వరదాచార్యులు, సుభద్రమ్మ దంపతులకి 1939 లో గోపాలరత్నం జన్మించారు. శాస్త్రీయ సంగీతపు నేపధ్యం ఉన్న కుటుంబం కావడంతో పాట సహజంగానే అబ్బింది ఆమెకి. చిన్నవయసులోనే హరికథలు చెప్పడం ఆరంభించిన గోపాలరత్నం, తల్లిదండ్రులనుంచి వైష్ణవ భక్తిగీతాలనీ, గురువు శ్రీపాద పినాకపాణి నుంచి శాస్త్రీయ సంగీతపు మెలకువలనీ నేర్చుకున్నారు. పద్దెనిమిదేళ్ళ వయసులో ఆకాశవాణి లో నిలయ గాయనిగా ఉద్యోగం రావడం గోపాలరత్నం సంగీత ప్రస్థానంలో మేలిమలుపు. అక్కడినుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.


"నిజాయితీగా చెప్తున్నా - వివాహం గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. సంగీత సాధనలో, అదే ధ్యాసలో ఉండడం వల్ల నాకు సమయమే చిక్కదు. అయితే, జీవితంలో ఏదో కోల్పోయానన్న బాధ అస్సలు లేదు. సంగీతం నా సర్వస్వం. సంగీతం తప్ప మరో అవసరమే కలగదు" అన్న గోపాలరత్నం మాటలు చాలామందికి కఠినంగా వినిపించాయంటారు జానకీబాల. "గోపాలరత్నం బహుముఖ సంగీత విదుషీమణిగా సానదేరడానికి సరైన సమయంలో తన కళ పట్ల తన ఉద్దేశాన్ని, అభిప్రాయాల్ని నిర్ణయించుకోవడం తన కర్తవ్యంగా భావించారు - అదే ఆమె జీవితంలో ఒక ప్రధాన ఘట్టంగా చెప్పుకోవాలి" అంటారు రచయిత్రి.

నిజానికి ఈ పుస్తకం గోపాలరత్నం జీవితాన్ని గురించిన ఒక రేఖామాత్రపు పరామర్శ. క్లుప్తంగా ఆమె జీవిత విశేషాలనీ, ఆకాశవాణి ప్రస్థానాన్నీ పరామర్శించారు రచయిత్రి. కొన్ని చోట్ల ఆ క్లుప్తత ఆకట్టుకున్నప్పటికీ, చాలా చోట్ల మరిన్ని వివరాలు రాసి ఉంటే బాగుండేది అనిపించింది పుస్తకం చదువుతుంటే. గోపాలరత్నం కుటుంబ, వ్యక్తిగత విషయాలని ఎంతో సంయమనంతో ప్రస్తావించారు జానకీబాల. ఆ గాయని అకాల మరణాన్ని గురించి చెప్పినప్పుడు కూడా, సంగీతాభిమానుల్లో తలెత్తిన సందేహాలని గురించి కాక, సంగీత ప్రపంచపు స్పందనల్ని మాత్రమే రికార్డు చేశారు. తనకి తెలిసన ప్రతి విషయాన్నీ రాయాల్సిన అవసరం లేదు అన్న భావనతో ఈ పుస్తకాన్ని రాశారనిపించింది.

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్ రాసిన ముందుమాట. మొత్తం తొమ్మిది పేజీల ముందుమాటలో గోపాలరత్నంతో తన అనుబంధాన్ని ఎంతో హృద్యంగా జ్ఞాపకం చేసుకున్నారు శారద. ముందుమాటలో ఆమె ప్రస్తావించిన కొన్ని సంగతులు, పుస్తకంలో పునరుక్తమయ్యాయి కూడా. పుస్తకాన్ని మరింత సమగ్రంగా తీసుకుని వచ్చి ఉంటే చాలా బాగుండేదన్న భావన బలంగా కలిగినప్పటికీ, ఇన్నాళ్ళకి గోపాలరత్నాన్ని గురించి ఓ పుస్తకం తెచ్చినందుకు అభినందించాల్సిందే అనిపించింది పుస్తకం పూర్తి చేశాక. గోపాలరత్నం పాడిన పద్నాలుగు పాటల సీడీని పుస్తకంతో పాటు ఉచితంగా అందిస్తున్నారు. (అనల్ప ప్రచురణలు మరియు సాహిత్య కేంద్రం ప్రచురణ, వెల రూ. 100, అని ప్రముఖ పుస్తకాల షాపులు).