మంగళవారం, అక్టోబర్ 30, 2012

రెండు సన్నివేశాలు

మనకి ప్రియమైన వ్యక్తిని మరొకరికి అప్పగించడం అన్నది ఎంతో వేదనతో కూడుకున్న విషయం. ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడూ, ఆపై అప్పగింతలప్పుడూ తల్లి మాత్రమే బాధ పడదు. తండ్రి కూడా బాధ పడతాడు. నిజానికి తల్లి కన్నా ఎక్కువే బాధ పడతాడు కానీ, బయట పడడు. మన సమాజం మగవాడికి విధించిన కనిపించని కట్టుబాట్ల ఫలితం ఇది. తాళి కట్టిన భార్యనో, పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న ప్రియురాలినో మరొకరికి శాశ్వతంగా అప్పగించాల్సిన పరిస్థితే వస్తే, ఆ మగవాడి పరిస్థితి వర్ణనాతీతమే.

వెండితెర సాక్షిగా రెండు సన్నివేశాలు. రెంటినీ రూపు దిద్దిన దర్శకుడు ఒక్కరే. కళాతపస్వి కే. విశ్వనాథ్. రెండు సినిమాలూ ఏడాదిన్నర తేడాతో విడుదలై, ప్రేక్షకుల మీద తమవైన ముద్ర వేసినవే. వీటిలో మొదటిది 'సప్తపది.' వర్ణ వ్యవస్థని ఇతివృత్తంగా తీసుకుని విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఓ సద్బ్రాహ్మణ నాట్యాచార్యుడి కూతురు హేమ ఓ నర్తకి. తన బృందంలోని వేణు గాన కళాకారుడు హరిబాబుతో ప్రేమలో పడుతుంది ఆమె. తన ప్రేమని వ్యక్త పరిచాక, హరిబాబు ఓ హరిజనుడనీ, తన ప్రేమకోసం కులాన్ని దాచిపెట్టాడనీ తెలుస్తుంది హేమకి. అయినా ఆమె ప్రేమలో ఏ మార్పూలేదు.

హేమ మాతామహుడు యాజులు గారికి కులం పట్టింపు ఎక్కువ. స్వకులం వాడే అయినా అల్లుడు నాట్యాచార్యుడు కావడంతో కూతురి పెళ్లి అభ్యంతరం ఆయనకి. కూతురు మరణించినా రెండు కుటుంబాల మధ్యనా దూరం అలాగే ఉంటుంది. హేమ నాట్య ప్రదర్శన చూసిన యాజులు గారి ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుంది. స్నేహితుడు రాజు గారు కూడా ఇందుకు కొంత కారణం. హేమని తన మనవడు (కొడుకు కొడుకు) గౌరీనాధానికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. కూతురి ప్రేమ విషయం తెలియని హేమ తండ్రి, ఆమెతో సంప్రదించకుండానే పెళ్ళికి అంగీకరిస్తారు.

పరంపరాగతంగా వచ్చిన అర్చక వృత్తిలో స్థిరపడ్డ గౌరీనాధుడు, తాతగారి మాటప్రకారం హేమని పెళ్లి చేసుకుంటాడు. కానీ కాపురం చేయలేకపోతాడు. ఆమె భార్యగా కాక తను పూజించే పర దేవతగా కనిపిస్తుంది అతనికి. కారణాలు అన్వేషిస్తుండగా, హేమ ప్రేమ విషయం తెలుస్తుంది అతనికి. హరిబాబుని తీసుకు వచ్చి అతనికి హేమని అప్పగిస్తాడు. ఊరివారిని ఎదిరించి మరీ, మనవడి నిర్ణయాన్ని సమర్ధిస్తారు యాజులు గారు. సినిమా ముగింపు సన్నివేశంలో, హరిబాబుని పడవలో తీసుకు వచ్చిన గౌరీనాధం, తను మాత్రం ఒడ్డునే నిలబడి ఉంటాడు. మంగళ వాయిద్యాలు, చీర సారెలతో తాతయ్య వెంట రేవుకి వస్తుంది హేమ.

తాతయ్య కాళ్ళకి నమస్కరించి సెలవు తీసుకుని, పడవలో ఉన్న తను ప్రేమించిన వాడిని చేరుకోవాలి ఆమె. రేవు ఒడ్డున తనకి తాళి కట్టినవాడు. అగ్నిసాక్షిగా పెళ్ళాడినా భర్త కాలేక పోయినవాడు. అయినప్పటికీ, తన మనసు తెలుసుకున్న వాడు. అతని నుంచి వీడుకోలు తీసుకోడం ఎలా? అప్పటికే కొంగు భుజం చుట్టూ కప్పుకున్న హేమ తల వంచుకునే నమస్కరిస్తుంది గౌరీనాధానికి. ఒక్కసారి కళ్లెత్తి, రెండు చేతులూ పైకెత్తి నవ్వుతూ తనని ఆశీర్వదిస్తున్న గౌరీనాధాన్ని చూస్తుంది. హేమకే కాదు సినిమా చూస్తున్న ప్రేక్షకులకి కూడా ఆ క్షణంలో గౌరీనాధుడు గాలిగోపురం అంత ఉన్నతంగా కనిపిస్తాడు.


'సప్తపది' విడుదలైన రెండేళ్ళ లోపుగానే కళాతపస్వి నుంచి వచ్చిన మరో కళాత్మక చిత్రం 'సాగర సంగమం.' కథా నాయకుడు బాలూ, నాట్యాన్ని ప్రేమించిన వాడు. నాట్యాన్ని తప్ప మరి దేనినీ ప్రేమించని వాడూను. అంతటి వాడూ మాధవి ప్రేమలో పడతాడు. ఆమె తన పక్కన ఉంటే చాలు అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా ఆమెకి తన ప్రేమని ప్రతిపాదిస్తాడు. మాధవి వివాహిత. తాళి కట్టిన భర్త గోపాలరావు ఆమెని ఏలుకోలేదు. పెళ్లి పీటల మీదే వదిలేసి వెళ్లి పోయాడు. ఆమె ఆ గాయాన్ని మాన్పుకునే ప్రయత్నంలో ఉండగానే బాలూ పరిచయమయ్యాడు.

బాలూ ప్రతిపాదనని మాధవి అంగీకరించ బోతున్నతరుణంలో ఆమె జీవితంలో తిరిగి ప్రవేశిస్తాడు గోపాలరావు. బాలూ-మాధవిల ప్రేమని గ్రహిస్తాడు అతడు. నిండు మనసుతో వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలనీ అనుకుంటాడు కూడా. వాళ్ళని ఒకటి చేసి తను కెనడా వెళ్లిపోవాలి అన్నది అతని ఆలోచన. కానీ, బాలూ ఆలోచన వేరు. ప్రేమ కన్నా తాళికి విలువ ఇవ్వాలి అనుకుంటాడు. మాధవి, గోపాలరావుకి చెందడమే న్యాయం అనుకుంటాడు. అందుకు ఆమెని ఒప్పిస్తాడు. మాధవి, కాపురానికి కెనడా వస్తోందని గోపాలరావుకి చెబుతాడు.

ఆవేళ మాధవి ప్రయాణం. రైల్లో లగేజీ సద్దుకుంటూ ఆమె, టికెట్ కలెక్టర్ తో మాట్లాడుతూ ఆమె భర్త. అప్పుడు స్టేషన్ కి వస్తాడు బాలూ. చేతిలో ఓ కెమెరా. తనకి మాధవిని పరిచయం చేసిన కెమెరా. గోపాలరావుని అనుమతి కోరతాడు, ఫోటో కోసం. బాలూ, మాధవితో ఫోటో దిగుతాడనుకుని అందుకు సమ్మతిస్తాడు గోపాలరావు. కానీ, బాలూకి కావాల్సింది మాధవి-గోపాలరావుల ఫోటో. అతను ఫోటో తీసుకున్నాక రైలు కదలడానికి సిద్ధ పడుతున్న వేళ, బోగీ గుమ్మంలో భర్త పక్కన నిలబడి బాలూకి నమస్కరిస్తుంది మాధవి. ఆమె కళ్ళలో కనిపించేది కృతజ్ఞత మాత్రమేనా?

మరి బాలూ స్పందన ఏమిటి? తను చేసిన పని మంచిదనే అతను అనుకుంటున్నాడు. కానీ, ఆ పని మనస్పూర్తిగా చేశాడా? మాధవిని వదులుకోడానికి అతను సిద్ధంగానే ఉన్నాడా? ఆ క్షణంలో బాలూని చూసిన ప్రేక్షకులకి అతని మీద జాలీ, బాధా, కోపమూ ఏకకాలంలో కలుగుతాయి. రైల్లో వెళ్ళిపోయిన మాధవి, స్టేషన్లో మిగిలిపోయిన బాలూ చెరగని ముద్ర వేసేస్తారు ప్రేక్షకుల మనసుల్లో.


ఈ రెండు సన్నివేశాల్నీ తెరకెక్కించిన విశ్వనాథ్ ని మాత్రమే కాదు, రెండు సినిమాలకీ సంభాషణలు అందించిన జంధ్యాలనీ అభినందించి తీరాలి. ప్రత్యేకించి ఈ రెండు సన్నివేశాలకీ ఎలాంటి సంభాషణలూ రాయనందుకు.. మాటల కన్నా, మౌనమే శక్తివంతంగా పని చేసే సందర్భాల్ని గుర్తించినందుకు...

(టపా ఆలోచనని ప్రోత్సహించి, ఫోటోలు సమకూర్చిన బ్లాగ్మిత్రులు కొత్తావకాయ గారికి కృతజ్ఞతలు...)

సోమవారం, అక్టోబర్ 29, 2012

నిర్జన వారధి

"ఓ మనిషికి జీవితం ఇన్ని పరిక్షలు పెట్ట గలదా?" అనిపించింది ఆమె ఆత్మకథ చదువుతుంటే. అంతకు మించి, వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డ ఆమె స్థైర్యం ఆశ్చర్యాన్ని కలిగించింది. పుస్తకం ముగించి పక్కన పెడుతుంటే, తొంభై రెండేళ్ళ కొండపల్లి కోటేశ్వరమ్మ మూర్తి పర్వతమంత ఎత్తున కనిపించింది. మనసులో ఆమెకి నమస్కరించ కుండా ఉండలేక పోయాను. ఈమధ్య కాలంలో మళ్ళీ మళ్ళీ చదివిన ఆ పుస్తకం పేరు 'నిర్జన వారధి.' లోతైన, బరువైన కథనం.. పుస్తకం పేరులాగే.

'నిర్జన వారధి' చదవక మునుపు నాకు తెలిసిన కోటేశ్వరమ్మ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త. పార్టీలో కొంతకాలం పనిచేసి, తర్వాత నక్సల్బరీ ఉద్యమంలోకి వెళ్ళిన కొండపల్లి సీతారామయ్య భార్య. ఈ రెండు పాత్రలూ ఆమె జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసి ఉంటాయో, ఎన్ని పరిక్షలు పెట్టి ఉంటాయో, ఎన్నెన్ని మలుపులు తిప్పి ఉంటాయో అన్న ఆలోచన ఎప్పుడూ కలగలేదు. అందుకే కావొచ్చు, ఈ పుస్తకం ద్వారా నాకో సరికొత్త కోటేశ్వరమ్మ పరిచయం అయ్యారు.

ఇద్దరు పిల్లలు పుట్టాక, కట్టుకున్న భర్త కారణం చెప్పకుండా వదిలేసినా, ఏ పార్టీ కోసమైతే తను ప్రాణాలకి తెగించి బలవంతపు గర్భ స్రావానికి సిద్ధ పడిందో ఆ పార్టీయే తనని వదులుకునే పరిస్థితులు వచ్చినా, తోడు నిలబడాల్సిన పిల్లలు, అండగా నిలిచిన కన్నతల్లి ఒకరి తర్వాత ఒకరుగా తన కట్టెదుటే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా...ఇవన్నీ తట్టుకుని నిలబడ్డమే కాదు, తనకంటూ ఓ జీవితాన్ని నిర్మించుకుని నిలదొక్కుకున్న మహిళ ఆమె.

కృష్ణా జిల్లా పామర్రులో ఓ సంప్రదాయ కుటుంబంలో 1920 లో జన్మించారు కోటేశ్వరమ్మ. ఆమె ఆమెకి ఓ తమ్ముడు. తండ్రికి ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఉండేది. చదువుతో పాటు, ఆటపాటల్లో చురుగ్గా ఉండే ఆమెకి తానో బాల వితంతువుననే విషయం యవ్వనారంభంలో తెలిసింది. ఆమెకి పునర్వివాహం చేయాలన్న తల్లిదండ్రుల తలంపుకి స్నేహితుల ప్రోత్సాహం, బంధువుల విమర్శలు వీటన్నింటినీ ఏక కాలంలో గమనించింది. అంతే కాదు, అటు గాంధీ మహాత్ముడి సత్యాగ్రహ ఉద్యమాన్ని కళ్ళారా చూసి, తన నగలని మహాత్ముడికి సమర్పించడంతో పాటు, ఇటు కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.


సీతారామయ్య తో వివాహం జరిగాక, అతని ప్రోత్సాహంతో, అత్తమామల ఇష్టానికి వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన కోటేశ్వరమ్మ, కృష్ణా జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ మహిళా విభాగాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషించారు. ఇద్దరు పిల్లలు కలిగాక, పార్టీ కార్యకలాపాల మీద ప్రభుత్వం నిషేధం విధించిన సందర్భంలో, పార్టీ ఆదేశాల మేరకు పిల్లలని తన తల్లి రాజమ్మ దగ్గర వదిలి అజ్ఞాత జీవితం గడిపారు. పార్టీ ఆదేశం మేరకే గర్భం వద్దనుకుని, మృత్యువుతో పోరాడి గెలిచారు.

పార్టీ మీద ఉన్న నిషేధం తొలగే సమయానికి ఆమె వ్యక్తిగత జీవితంలో సమస్యలు చుట్టుముట్టాయి. సీతారామయ్య జీవితంలో మరో స్త్రీ ప్రవేశించడం, అతను పార్టీకి దూరం జరగడం, సిద్ధాంత పరమైన కారణాలతో పార్టీ రెండు ముక్కలు కావడం దాదాపు ఒకేసారి జరిగిన సంఘటనలు. ఆ కష్ట కాలంలో, అప్పటి వరకూ కలిసి పనిచేసిన పార్టీ సహచరులతో కూడా రహస్యంగా మాట్లాడాల్సిన పరిస్థితి. సీతారామయ్య సొంత పార్టీ నిర్ణయం ఒకపక్కా పార్టీ లో చీలిక మరోపక్కా... ఈ రెండూ ఆమెకి సంబంధం లేని విషయాలే అయినా, ఆమె జీవితం మీద ఇవి చూపిన ప్రభావం మాత్రం తక్కువది కాదు.

పిల్లలని తల్లి సంరక్షణలో ఉంచి, ముప్ఫై ఐదేళ్ళ వయసులో ఆంద్ర మహిళా సభలో చేరి చదువు నేర్చుకుని, అటుపై ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్న కోటేశ్వరమ్మ ఆ తర్వాత ఎదుర్కొన్న ఆటుపోట్లూ తక్కువవి కావు. కొన్ని కొన్ని సంఘటనలు చదువుతుంటే "అసలు వీటిని తట్టుకుని ఈమె ఎలా నిలదొక్కుకో గలిగారు?" అన్న సందేహం కలగక మానదు. తన కథ మొత్తాన్నీ ఎంతో ప్రశాంతంగా చెప్పారు కోటేశ్వరమ్మ. ఎక్కడా, ఎవ్వరినీ తూలనాడలేదు. కారణం ఏమీ చూపకుండానే తనని నడి రోడ్డున వదిలేసిన భర్తని గురించీ, పార్టీని గురించీ చెప్పినప్పుడూ, తన సంసార జీవితంలో ప్రవేశించిన మూడో వ్యక్తిని గురించి ప్రస్తావించి నప్పుడూ అదే సంయమనం.

"మగవాళ్ళు అందరూ ఒకటే. కానీ పార్టీలో మగవాళ్ళు మిగిలిన వాళ్ళ కన్నా కొంచం నయం" అని చెప్పినా, సీతారామయ్య కి కేవలం 'ఉద్యమ సహచరుడి' గానే కడపటి వీడ్కోలు ఇచ్చినా వాటన్నింటి వెనుకా ఉన్నవి ఆమె అనుభవాలే అని సులభంగానే బోధ పడుతుంది. కోటేశ్వరమ్మ తర్వాత అంతగా ఆకట్టుకునే మరో వ్యక్తి ఆమె తల్లి రాజమ్మ గారు. బాల వితంతువైన కూతురు లోకం బాధ పడలేక బొట్టూ పూలూ తీసేస్తే, ఆమె కోసం పునిస్త్రీ అయి ఉండీ తను కూడా వాటిని త్యజించడం మొదలు, సిద్ధాంతాలు ఏవీ తెలియక పోయినా తను దాచుకున్న కొద్దిపాటి మొత్తాన్ని మరణానంతరం పార్టీకి చెందేలా చేయడం వరకూ...ఆమె చేసిన ప్రతి పనీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

'నిర్జన వారధి' కేవలం కోటేశ్వరమ్మ ఆత్మకథ మాత్రమే కాదు, గడిచిన తొంభై ఏళ్ళలో ఆంధ్ర దేశంలో జరిగిన అనేక ఉద్యమాలని, సమాజంలో వచ్చిన మార్పులనీ ఆ మార్పులు రావడం వెనుక కారణాలనీ ఆవిష్కరించే పుస్తకం. జీవితం పట్ల భయాలు ఉన్న వాళ్లకి కావలసినంత ధైర్యాన్ని అందించే పుస్తకం. కాల పరీక్షలకి తట్టుకుని నిలబడి, జీవితంతో పోరాడి గెలిచిన ఓ యోధురాలి స్పూర్తివంతమైన గాధ. తొలి ప్రచురణ జరిగిన నెల రోజులకే మలి ప్రచురణ పనులు మొదలైన పుస్తకం ఇది. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన 'నిర్జన వారధి' (పేజీలు 179, వెల రూ. 100) అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది.

మంగళవారం, అక్టోబర్ 02, 2012

తెలుగు కథల్లో గాంధీ దర్శనం

కథా సాహిత్యం, మిగిలిన సాహిత్య ప్రక్రియలకన్నా భిన్నమైనది. కథల్లో కల్పన ఉంటుంది, కానీ కేవలం కల్పన మాత్రమే ఉండదు. వాస్తవానికి, కల్పన జోడిస్తే అది కథ అవుతుంది. తెలుగునాట నడుస్తున్న చరిత్రని రికార్డు చేయడంలో కథా సాహిత్యం పాత్ర తక్కువదేమీ కాదు. స్వాతంత్ర సంగ్రామం నేపధ్యంగా వచ్చిన కథలే ఇందుకు ఉదాహరణ. శాంతిని, అహింసనీ ఆయుధాలుగా మలుచుకుని స్వతంత్ర పోరాటాన్ని నడిపించిన మహాత్మా గాంధీని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒక పాత్రగా చేసుకుని రచించిన కథల సంకలనమే 'తెలుగు కథల్లో గాంధీ దర్శనం.'

విశ్వనాథ సత్యనారాయణ మొదలు, దాదా హయత్ వరకూ మొత్తం పదకొండు మంది రచయితలు రాసిన పన్నెండు కథలని సంకలనంగా కూర్చిన వారు తెలుగు కథకి కొత్త వెలుగులద్దిన 'దామల్ చెరువు' అయ్యోరు మధురాంతకం రాజారాం. 1986 లో రూపుదిద్దుకున్న ఈ సంకలనాన్ని, కృష్ణా జిల్లా అవనిగడ్డకి చెందిన 'గాంధీ క్షేత్రం' 2008 లో మార్కెట్లోకి తెచ్చింది, ఎమెస్కో సౌజన్యంతో. కొన్ని కథలు స్వతంత్ర సంగ్రామం నేపధ్యంతో వచ్చినవి కాగా, మరికొన్ని గాంధీ శతజయంతి (1969) సందర్భంగా వెలువడ్డవి. 

'జీవుడి ఇష్టము' ఈ సంపుటిలో మొదటి కథ. విశ్వనాథ వారి రచన. ఒక నియంతకూ, అతడు చెరబట్టిన ఓ వివాహిత స్త్రీకి మధ్య జరిగే కథ ఇది. నియంత ఆమెని బెదిరించినా, భయపెట్టినా, పదే పదే చెరిచినా తన భర్తని జ్ఞాపకం చేసుకోడం మానదు ఆమె. "మీకు తుపాకులున్నవి, కత్తులున్నవి, అతనికి ఏమీ లేవు. అయినా తన భార్యను, పిల్లలను రక్షించుకునేందుకు కర్ర పుచ్చుకొని నిలబడ్డాడు. రక్షించ లేనని తెలుసు. అయినా తన ధర్మం తాను చేశాడు. తాను చచ్చిన తరువాతగాని నిన్ను నాదగ్గరకు రానీయలేదు" అంటుందామె.

కరుణకుమార రాసిన రెండు కథలు 'పోలయ్య' 'ఉన్నతోద్యాగాలు' చోటు సంపాదించుకున్నాయి ఈ సంకలనంలో. గతుకుల రోడ్డు మీద బండి ప్రయాణాన్ని పాఠకులకి అనుభవంలోకి తెచ్చే కథ 'పోలయ్య.' రచయిత ఈ కథకి ఇచ్చిన మెరుపు ముగింపు వెంటాడుతుంది చదువరులని.  'ఉన్నతోద్యాగాలు' కథ ముగింపు కించిత్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అప్పటివరకూ ఒక పంధా లో సాగిన కథ, ముగింపు కోసం మార్గాన్ని మార్చుకున్నట్టుగా అనిపిస్తుంది. గాంధీ శిష్యుడు, ఆధునిక భావాలు ఉన్నవాడూ అయిన నారాయనప్ప గారి చదువుకున్న భార్య సుశీల, ఆ ఊరికి కొత్తగా వచ్చిన బ్రిటిష్ పోలీసాఫీసర్ సులేమాన్ ల మధ్య మొలకెత్తిన ప్రణయం, చలం రాసిన 'సుశీల' కథ. 'మైదానం' ఛాయలు కనిపిస్తాయిందులో.


కొనకళ్ళ వేంకటరత్నం రాసిన 'చివరికి మిగిలిన రంగడు' వెంటాడే కథ. అస్పృశ్యత వ్యతిరేక ఉద్యమం నేపధ్యంగా సాగిన రచన ఇది. ఎక్కడా ఆపకుండా చదివించే మరో కథ అడివి బాపిరాజు రాసిన 'వడగళ్ళు.' స్వతంత్ర పోరాటం నేపధ్యంగా వచ్చిన కథ ఇది. గాంధీజీ మరణాన్ని చిత్రించిన కథ అమరేంద్ర రాసిన 'సమర్పణ,' కాగా గాంధీజీ శతజయంతి నేపధ్యంగా వచ్చిన కథ కలువకొలను సదానంద రాసిన 'తాత దిగిపోయిన బండి.' స్వాతంత్రానంతరం పాలనా వ్యవస్థలో మొదలైన మార్పులని చిత్రించిన కథ ఇది. డాక్టర్ పి. కేశవరెడ్డి కథ 'ది రోడ్.' కేశవరెడ్డి నవలలు చదివిన వాళ్ళని ఏమాత్రమూ ఆశ్చర్య పరచని ముగింపుకి చేరిన కథ ఇది.

గాంధీ పేరుని వాడుకునే నాయకులమీద దాశరథి రంగాచార్య సంధించిన సెటైర్ 'మళ్ళీ మహాత్ముడు మన మధ్యకి వచ్చాడు.' రాజకీయ రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన తొలి రోజుల్లో వాటిని ఉపయోగించుకోలేక పోయిన వాళ్ళ కథ 'అజ్ఞాతవాసం' మధురాంతకం రాజారాం రాసిన ఈ కథ రాయలసీమ మాండలీకంలో ఆయనదైన శైలిలో సాగుతుంది. దాదా హయత్ రాసిన 'ప్రదర్శన' ఈ సంపుటిలో చివరి కథ. గాంధీని తమ ప్రయోజనాల కోసం వాడుకునే పెట్టుబడిదారీ వర్గాల కథ ఇది..నగరం నడిబొడ్డున వెలిసిన గాంధీ పార్కు గుట్టు విప్పుతుంది.

"ఆవేశంలోనుండి పుట్టేది పద్యం. ఆలోచనలోనుండి పుట్టేది గద్యం. పద్యంలో కవి ఊహాలోకాలలో సంచరిస్తూ కొద్దిగానో, గొప్పగానో తన్మయత్వాన్ని భజించే అవకాశం ఉంది. గద్య ప్రక్రియల్లో అలాంటి స్వేచ్ఛ లేదు. అది వీలైనంతవరకూ వాస్తవికతను అంటిపెట్టుకోవలసి ఉంటుంది," సంకలనానికి ముందుమాట రాస్తూ మధురాంతకం రాజారాం ప్రకటించిన అభిప్రాయమిది. "కథానికల ద్వారా గాంధీ దర్శనం గావించుకోడానికి సల్పిన ఒక చిన్న ప్రయత్నం ఇది" అన్నారాయన.

"గాంధీజీ పాత్రగా ఉన్న రచనలను గుర్తించడం తేలిక. కానీ ఆయన ఆశయాలని ప్రతిఫలించే కథలని గుర్తించడం అంత తేలిక కాదు. సుప్రసిద్ధ కథానికా రచయిత మధురాంతకం రాజారాం గాంధీజీని దర్శనం చేయించే తెలుగు కథలని అద్భుతంగా సంకలనం చేశారు" అన్నారు ప్రకాశకులు. స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానంతర కాలంలో దేశ పరిస్థితులని గురించి ఒక అవగాహన ఇచ్చే కథలివి. (పేజీలు 183, వెల రూ.80, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).