గురువారం, సెప్టెంబర్ 23, 2021

ప్రియురాలు

 ఓషో రచనల్ని ఇష్టపడే దివ్య ఓ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. జీఆర్యీ కోచింగ్ కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమెకి, అదే అపార్ట్మెంట్లో మరో ఫ్లాట్లో ఉండే మాధవతో పరిచయం అవుతుంది. ఓ టీవీ ఛానల్లో పని చేసే మాధవ వివాహితుడే కానీ, ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటున్నాడు. మాధవతో పరిచయం ప్రేమగా మారుతుంది దివ్యకి. అతన్ని గురించి తెలిసీ  అతనితో  శారీరక సంబంధం పెట్టుకుంటుంది. ఆమె దృష్టిలో అది ఆమె తన ప్రేమని ప్రకటించే పధ్ధతి. లోకం దృష్టిలో వాళ్ళిద్దరిదీ సహజీవనం. అదే అపార్ట్మెంట్లో వాచ్మన్ గా పని చేసే సత్యం వివాహితుడు. అతని భార్య కూడా అదే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ లో పని చేస్తూ ఉంటుంది. అతని దృష్టి మరో పనిమనిషి సరిత మీద పడుతుంది. ఆమె అవివాహిత. సత్యం, సరితని ఆకర్షించి ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు. అతని దృష్టిలో అది మూణ్ణెల్ల ముచ్చట. లోకం దృష్టిలో వాళ్ళది అక్రమ సంబంధం. సమాంతరంగా సాగే ఈ రెండు జంటల కథే రామరాజు దర్శకత్వంలో వచ్చిన 'ప్రియురాలు' సినిమా. 

'మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు' సినిమాతో దర్శకుడిగా పరిచయమై, 'ఒకమనసు' సినిమాతో నీహారిక కొణిదల ని వెండితెరకి పరిచయం చేసిన రామరాజు దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా ఇది. తొలి రెండు సినిమాలనీ తన కథలతో తీసిన రామరాజు, ఈ సినిమాకి మాత్రం శ్రీసౌమ్య రాసిన కథని ఉపయోగించుకున్నారు. దర్శకత్వంతో పాటు, ఎడిటింగ్, నిర్మాణ బాధ్యతలనీ తీసుకున్నారు. ప్రధాన పాత్రలకి కొత్త నటుల్ని, సహాయ పాత్రలకి కొంచం తెలిసిన నటుల్నీ ఎంచుకుని, ఫొటోగ్రఫీ, సంగీతం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి తీసిన ఈ సినిమాలో తన మార్కు కవితాత్మకతతో పాటు, తాను మార్కెట్ అవసరం అని నమ్మిన శృంగారాన్నీ జోడించారు. శృంగార దృశ్యాలని ఒకటి రెండు సన్నివేశాలకి పరిమితం చేయడం కాకుండా, రెండు గంటల నిడివి సినిమాలో దాదాపు మూడో వంతు సమయాన్ని కేటాయించారు. 

మొదటి సినిమాలో తండ్రి-కూతురు (అని విన్నాను), రెండో సినిమాలో తండ్రి-కొడుకు అనుబంధాన్ని చిత్రించిన రామరాజు, ఈ సినిమాలో ముగ్గురు తండ్రులు, ముగ్గురు కూతుళ్ళ కథల్ని చూపించారు. ముగ్గురు తండ్రుల్లోనూ ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం కారణంగా కూతురు 'ప్రేమ' ని అన్వేషిస్తుంది. మరో తండ్రి చేసిన పని కారణంగా ఆ కూతురు భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుంది. ఈ ఇద్దరు తండ్రుల అనుభవాలనుంచీ ఓ జంట నేర్చుకున్న పాఠం, మూడో తండ్రిని తన కూతురికి దగ్గర చేస్తుంది. ఈ కథలతో పాటు, సమకాలీన విషయాల మీద మీడియా - మరీ ముఖ్యంగా టీవీ, యూట్యూబ్ చానళ్ళు స్పందిస్తున్న తీరునీ చర్చకి పెట్టాడు దర్శకుడు. టీవీ ఛానల్ బాస్ "రేప్ కేసా, బంజారా హిల్స్ లో జరిగితే బ్రేకింగ్ వెయ్యి, బస్తీలో జరిగితే స్క్రోలింగ్ చాలు" అంటాడు తన స్టాఫ్ తో. టీవీల్లో వచ్చే వార్తా కథనాలు, చర్చలు ఎలా తయారవుతాయో, వాటి వెనుక పనిచేసే శక్తులేవిటో వివరంగానే చూపించారు. 

రామరాజు తొలి సినిమా చూసే అవకాశం నాకింకా రాలేదు. కానీ, 'ఒక మనసు' తో ఈ సినిమాకి చాలా పోలికలే కనిపించాయి. ముఖ్యంగా, ప్రేమ సన్నివేశాలని  కవితాత్మకంగా చిత్రించే పధ్ధతి. నేపధ్యం, నేపధ్య సంగీతం విషయాల్లో ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం దర్శకుడి మార్కుగా అనిపించింది. ఈ సినిమాలో సంభాషణలూ కొటేషన్ల లాగానే ఉన్నాయి. పాత్రల నేపధ్యాలని బొత్తిగా దృష్టిలో పెట్టుకోకుండా, ప్రతి పాత్ర చేతా కొటేషన్లు చెప్పించడం (మళ్ళీ) మింగుడు పడలేదు. కాసిన్ని అవుట్ డోర్ సన్నివేశాల మినహా, చాలా సినిమా ఇన్ డోర్ లోనే జరిగింది. ఫోటోగ్రఫీకి ఏమాత్రం వంక పెట్టలేం. పాటలతో పాటు, నేపధ్య సంగీతమూ బాగా కుదిరింది, అక్కడక్కడా కాస్త 'లౌడ్' అనిపించినప్పటికీ. కొత్త నటీనటుల నుంచి నటనని రాబట్టుకోడంలోనూ దర్శకుడు కృతకృత్యుడయ్యాడు. 

కథానాయిక దివ్య మొదటి సన్నివేశంలో జరిగే తన పెళ్ళిచూపుల్లో అబ్బాయితో మాట్లాడే విధానం ఆకట్టుకుంటుంది. ఉద్యోగం చేయకుండా ఉండడం తనకి ఇష్టం లేదని చెబుతూ, "ఓ పదిహేనేళ్ల తర్వాత మనం విడిపోతే, నాకు కెరీర్ లేకుండా అయిపోతుంది" అంటుంది. ఇంత స్పష్టత ఉన్న అమ్మాయీ, తర్వాతి  సన్నివేశంలో తనకి ఎదురైన ఈవ్ టీజింగ్ సమస్యని ఎదుర్కోడానికి హీరో సహాయం కోరుతుంది!! ఇలాంటి కాంట్రడిక్షన్లు మరికొన్ని ఉన్నాయి. మాధవని మరీ పాసివ్ గా చూపించడం కొరుకుడు పడని మరోవిషయం. టీవీ ఛానల్ ఆఫీసులో కూడా అతను నోరు తెరిచింది బహుతక్కువ. 'ప్రియురాలు' అనే పేరుతో సినిమా తీయాలన్నది అతని కల. ఓ పోస్టర్ని ఇంట్లో పెట్టుకోడం మినహా, అతని నుంచి ఇంకెలాంటి కృషీ  ఎక్కడా కనిపించదు. సినిమాటిక్ లిబర్టీలు తీసుకున్నప్పటికీ, రొటీన్ సినిమాలకి భిన్నంగానే ఉంది. 'సోనీ లివ్' ఓటీటీ లో స్ట్రీమింగ్ లో ఉందీ సినిమా. 

శుక్రవారం, సెప్టెంబర్ 10, 2021

వందేళ్ల వపా

కళాకారులు అంతర్ముఖులుగా ఉండడం సహజం. వాళ్ళ దృష్టి లౌకిక విషయాల మీద కాక, అంతకు మించిన వాటిమీద ఉంటూ ఉండడం కూడా వాళ్ళ కళాసృష్టికి ఒకానొక కారణం. అయితే, ఈ అంతర్ముఖత్వం కారణంగానే తన కళలో విశేషమైన కృషి చేసి, ఎంతో మంది అభిమానులని సంపాదించుకుని కూడా, తనను గురించి ప్రపంచానికి పెద్దగా తెలియకుండానే వెళ్ళిపోయిన కళాకారులు ఉన్నారు. తెలుగు నేలకి సంబంధించి ఈ వరుసలో ముందు చెప్పుకోవాల్సిన పేరు విఖ్యాత చిత్రకారుడు వడ్డాది పాపయ్య. ఇవాళ ఆయన శతజయంతి. సెప్టెంబర్ 10, 1921న  శ్రీకాకుళంలో జన్మించారని, డిసెంబర్ 30, 1992న కశింకోటలో మరణించారని, ఈ మధ్య గడిపిన జీవితంలో వేలాది వర్ణ చిత్రాలు రచించారనీ మినహా ప్రపంచానికి ఆయన గురించి తెలిసింది బహు తక్కువ. 

ఆయన చిత్రకళ రసజ్ఞులని రంజింపజేయ గలిగిందే కానీ, తగినన్ని కాసుల్ని రాల్చలేకపోయింది. తన చుట్టూ గిరి గీసుకుని బతికిన మనిషిని పిలిచి బిరుదులిచ్చి సన్మానాలు చేసేవారు మాత్రం ఎవరున్నారు? రెండు మూడు రంగాల్లో కాలు పెడితే ఒక చోట కాకపొతే, ఇంకో చోటన్నా పేరు మారుమోగి సౌకర్యవంతమైన జీవితం ఏర్పడి ఉండేదేమో. ఈయనేమో జీవితాంతం చిత్రకళ తప్ప మరోవైపు దృష్టి పెట్టలేదు. నాటి 'చందమామ' మొదలు నేటికీ నడుస్తున్న 'స్వాతి' పత్రిక తొలినాటి సంచికల వరకూ ఏ కొన్ని పత్రికల ముఖచిత్రాలను పరీక్షగా చూసిన వారికైనా 'ఎవరీ బొమ్మ గీసింది?' అన్న ప్రశ్న రాక మానదు. బొమ్మకి కుడివైపు మూలన 'వ.పా' అనే పొడి అక్షరాల్లో, లేక పూరీ జగన్నాధుడిని గుర్తు చేసే 'O|O' సింబలో కనిపిస్తుంది. అది వడ్డాది పాపయ్య సంతకం. 

శారదా నది ఒడ్డున పాతకాలపు చిన్న డాబా ఇంటిని తన ప్రపంచంగా చేసుకుని, ఆ ఇంటి మొదటి అంతస్తులోని కాస్త విశాలమైన గదిని తన స్థూడియోగా చేసుకుని రంగులతో వపా చేసిన ప్రయోగాలు అనితరసాధ్యాలు.  ఆయనకి ఖరీదైన డ్రాయింగ్ పేపర్ అవసరం లేదు, మామూలు కాగితం చాలు. ఆయిల్ కలర్లో, వాటర్ కలర్లో ఉండాలన్న నియమం లేదు. ఇనప సామాన్ల కొట్లలో దొరికే రంగు పొడులు చాలు. అవీ లేని నాడు (కొనడానికి డబ్బు లేనప్పుడు) నీలిమందు, ఆకు పసరు, బొగ్గు పొడులతోనే ప్రపంచస్థాయి చిత్రాలు రచించిన ఘనుడాయన. ఆయన బొమ్మలు చూసి ముగ్ధుడయ్యి చక్రపాణి అంతటి వాడు పిలిచి, 'చందమామ' స్టాఫ్ ఆర్టిస్టుగా ఉద్యోగం ఇచ్చాడు. బహుశా వపా చేసిన ఏకైక ఉద్యోగం అదే. అది కూడా కొన్నేళ్లే. మద్రాసు వాతావరణం సరిపడక, ఉద్యోగం మానేసి కశింకోట తిరిగి వచ్చేశారు. 

శ్రమజీవుల కుటుంబంలో పుట్టారు పాపయ్య. చిత్రకళ తండ్రి శ్రీరామమూర్తి నుంచే వచ్చింది. ఆయన ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేయడంతో పాటు, చిత్రకళకు సంబంధించి ఇతరత్రా కృషి కూడా చేసేవారు. అలా, తండ్రికి సహాయకుడిగా చిన్ననాడే రంగులతో పరిచయం ఏర్పడింది వపాకి. తొలిబొమ్మ ఆంజనేయుడిది. తొలినాటి కలంపేరు 'పావనం', తర్వాతి కాలంలో తన ఇంటికి పెట్టుకున్న పేరు కూడా అదే. బొమ్మల్లోనే కాదు, రంగుల మిశ్రమంలోనూ తనదైన శైలిని నిర్మించుకున్నారు. కేవలం మేలి ముసుగుకు వేసిన రంగుని చూసి చెప్పొచ్చు అది వపా బొమ్మ అని. పురాణ పురుషులు, కావ్య నాయికలు, ఋతు శోభ మాత్రమే కాదు, జానపదుల జీవితాలూ ఆయనకు వస్తువులే. 

బొమ్మలు వేయడంలోనే కాదు, వాటికి పేర్లు పెట్టడంలోనూ వపాది ప్రత్యేక శైలి. 'చంపకమే భ్రమరీ..' లాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఎవరైనా ఇంటర్యూ చేయడానికి వెళ్తే, సున్నితంగా కాక తీవ్రంగా తిరస్కరించేవారట వపా. ఇందువల్లనే కాబోలు ఆయనకి ముక్కోపి, అహంభావి లాంటి బిరుదులొచ్చాయి. దగ్గరనుంచి చూసిన కొద్దిమంది మాత్రం ఆయన సాత్వికుడనీ, కళాకారుడికి కాకుండా కళకి మాత్రమే పేరు రావాలని పైపైకి కాక మనసా వాచా నమ్మినవారనీ చెబుతారు. సాధారణ కాగితం, మామూలు రంగులూ వాడి గీసినా వపా బొమ్మల్లో కనిపించే మెరుపు వెనుక రహస్యం ఏమిటి? 'మిసిమి' పత్రిక కోసం చిత్రకారులు 'బాలి' గతేడాది రాసిన వ్యాసంలో విప్పిచెప్పిన ఆ 'రహస్యం' నన్ను విస్మయ పరిచింది. అంతకు మించి, వపా మీద గౌరవం మరింత పెరిగింది. 

"వపా కొన్ని రంగులు కానీ, చార్కోల్ గీతలు కానీ కొంత కాలానికి చెడిపోతాయని భావించి - తాను స్వంతంగా గంజి మరగపెట్టి, చల్లార్చి, అటు చిక్కగా కాదు, మరీ పల్చగా కాకుండా చూసి, నోటిలో ఇత్తడి పుల్లను పెట్టుకుని ఊదుతూ లైట్ గా స్ప్రే చేసేవాడు - దానికి కొంచం ప్రాక్టీసు కావాలి. నీడలో ఆరబెడితే దాని ఫలితంగా బొమ్మపై సన్నటి గాజు స్ప్రే వంటిది వస్తుంది. బొమ్మ కూడా పాడవదు. (ఆ తర్వాతే పిక్చర్ వార్నిష్ (కేమిక్) వచ్చింది)". వపా చిత్రకారుడు మాత్రమే కాదు, ఫోటోగ్రాఫర్, కార్టూనిస్టు, కథా రచయిత కూడా. 'కథానంద సాగరం' లాంటి కథలున్నాయి ఆయన ఖాతాలో. (ఈ వివరాలూ పూర్తిగా తెలియవు). "ఎన్ని గీసినా, ఎన్ని తీసినా ఆయన చుట్టూ గీసుకున్న గీతను దాటలేదు. కనీసం కొన్నాళ్ళు చెరపలేదు. పెద్ద పెద్ద చిత్రకారుల ముందు నేనెంత అనే వినమ్ర భావన ఉండవచ్చు గాక. దానికీ ఓ పధ్ధతి ఉంటుంది కదా - ఇదే వారి చిన్ననాటి మిత్రులు గజపతి రావు గారి ఆలోచన" ఇవీ బాలి మాటలే. 


చదివే కథలు, చూసే సినిమాల వెనుక ఉండే మనుషుల్ని కలవడం సాధ్యమనే నమ్మకం ఏ మాత్రం లేని రోజుల్లో కూడా వపాని ఎలాగైనా కలవాలనే బలమైన కోరిక ఉండేది. ఆయన మరణించిన రెండు మూడు రోజుల తర్వాత 'ఆంధ్రప్రభ' ఆ మరణ వార్తని ప్రకటించింది. (తన మరణాన్ని గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన ఇంట్లో వాళ్ళకి ముందుగానే చెప్పారట). ఆవేళ చాలా దుఃఖ పడ్డాను. అప్పట్లోనే ఓ పుస్తక ప్రదర్శనలో కేవలం వపా బొమ్మలతో వచ్చిన ఓ బరువైన పుస్తకం కనిపించింది. అప్పటి నా ఆర్ధిక పరిస్థితి ఆ వెలని అందుకోగలిగేది కాకపోవడంతో ప్రదర్శన జరిగినన్నాళ్ళూ రోజూ వెళ్లి ఆ పుస్తకం పేజీలు తిరగేసి వస్తూ ఉండేవాడిని. తర్వాతి కాలంలో ఆ పుస్తకం ఎక్కడా దొరకలేదు. ఆమధ్య ఓ ప్రచురణకర్తని అడిగితే, బొమ్మల మీద హక్కుల సమస్యతో పాటు, మార్కెట్ ఉంటుందన్న గ్యారంటీ లేకపోవడంతో ఎవరూ అలాంటి పుస్తకం వేయడానికి ముందుకు రావడం లేదన్నారు. ఇంటర్నెట్లో కొన్ని బొమ్మల్నయినా చూడగలగడం పెద్ద ఊరట. 

వపా మీద వచ్చిన నివాళి వ్యాసాలు బహు తక్కువ. వచ్చిన వాటిలోనూ పునరుక్తులే ఎక్కువ. ఆయన అమిత మితభాషి కావడం, చెప్పదల్చుకున్న విషయాలు తప్ప ఇంకేవీ బయటకి చెప్పకపోవడం వల్లనేమో బహుశా. అయితే, ఈ వ్యాసాల వల్ల  'O|O' సంతకానికి అర్ధం తెలిసింది. 'అటూ ఏమీలేదు, ఇటూ ఏమీ లేదు, నేను  మాత్రం వాస్తవం' అనే తాత్విక దృష్టిట అది. ఆరోజుల్లో దూరదర్శన్ వారు డాక్యుమెంటరీ తీయడానికి ప్రయత్నిస్తే ఆయన అవసరం లేదనేశారట. వేసిన వేలాది బొమ్మల్లో ఎన్ని పాడవ్వకుండా ఉన్నాయో, ఎవరెవరి దగ్గర ఉన్నాయో తెలిసే వీలు లేకపోతోంది. అప్పుడెప్పుడో ఘనంగా ప్రకటించిన 'బాపూ మ్యూజియం' కే ఓ రూపు ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం నుంచి వపా మ్యూజియం ఆశించడం అత్యాశే అవుతుంది. బొమ్మల్ని డిజిటైజ్ చేసి వెబ్సైట్ నిర్మించినా బాగుండును. చూడ్డానికి వెల పెట్టినా చెల్లించి చూసే అభిమానులున్నారు.  

(Google Images)

సోమవారం, సెప్టెంబర్ 06, 2021

జ్ఞాపకాల జావళి

ముందుగా మార్క్ ట్వేయిన్ చెప్పిన మాటనొకదాన్ని తల్చుకోవాలి. "Truth is stranger than fiction" అన్నాడా మహానుభావుడు. ఆత్మకథలు చదివేప్పుడు బాగా గుర్తొచ్చే మాట ఇది. అచ్చంగా ఆత్మకథ కాకపోయినా, తన జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలని  'జ్ఞాపకాల జావళి' పేరుతో అక్షరబద్ధం చేసిన పొత్తూరి విజయలక్ష్మి గారి అనుభవాలని  చదువుతూ ఉంటే కూడా మార్క్ గారన్న మాట గుర్తొచ్చింది. 'హాస్య కథలు' ద్వారా మాత్రమే కాదు, 'ప్రేమలేఖ' 'శ్రీరస్తు-శుభమస్తు' లాంటి నవలల ద్వారా కూడా విజయలక్ష్మి తెలుగు పాఠకులకి సుపరిచితురాలు. 'ప్రేమలేఖ' నవల జంధ్యాల చేతిలో 'శ్రీవారికి ప్రేమలేఖ' గా మారిన వైనం సాహిత్యాభిమానులందరికీ  చిరపరిచితమే.  పుస్తకం కవరు పేజీ మీద ఆవిడ పేరు చూడగానే 'హాయిగా చదివేయొచ్చు' అనే భరోసా కలిగేస్తుంది పాఠకులకి. పూర్తిగా ఆవిడ మార్కు పుస్తకమే ఈ 'జ్ఞాపకాల జావళి' కూడా. 

శుభవార్తలు చేరవేయడానికి ఉత్తరాలు, అశుభవార్తల కోసం టెలిగ్రాములూ మాత్రమే కమ్యూనికేషన్ చానెళ్లుగా అందుబాటులో ఉన్న 1970వ సంవత్సరంలో విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల నుంచి రెండు రాష్ట్రాల అవతల ఉన్న చిత్తరంజన్లో అడుగు పెట్టారు, రెండు రోజుల రైలు ప్రయాణం చేసి. అది ఆమెకి అత్తవారిల్లు కాదు కానీ, భర్త గారిల్లు. స్థలం కొత్త, భాష తెలీదు, తెలిసిన వాళ్ళు కాదు కదా, కనీసం భాష తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. రేడియోలో తెలుగు స్టేషన్లు వినిపించవు. హాళ్లలో తెలుగు సినిమాలు ప్రదర్శింప బడవు. ఫోనూ, టీవీ లాంటివేవీ ఇంకా అందుబాటులోకి రాలేదు. దొరికేవల్లా తెలుగు పత్రికలు మాత్రమే. పుట్టి పెరిగింది ఉమ్మడి కుటుంబంలోనూ, చూసింది గుంటూరు, బాపట్ల చుట్టుపక్కల ఊళ్లు మాత్రమేనేమో, ఒక్కసారిగా వచ్చిపడిన కల్చరల్ షాక్ ని తట్టుకోడం కష్టమే అయిందామెకి. 

ఎంత సీరియస్ విషయాన్నైనా సరదాగా చెప్పే శైలి పుస్తకాన్ని ఆపకుండా చదివిస్తుంది. అదే సమయంలో అప్పటికి నవ్వేసుకున్న విషయాలు కూడా, స్మృతిలో ఉండిపోయి, తర్వాత తల్చుకున్నప్పుడు ఆ నవ్వు వెనుక ఉన్న నొప్పి అనుభవానికి వస్తుంది. ఈ పుస్తకంలో ఉన్న మొత్తం డెబ్బై అనుభవ శకలాల్లో చాలా చోట్ల ఈ అనుభవం కలుగుతుంది. చిత్తరంజన్ లో వినిపించే రేడియో సిలోన్ తెలుగు వ్యాఖ్యాత మీనాక్షి పొన్నుదొరై మొదట్లో అపభ్రంశాల తెలుగు మాట్లాడినా, అతి త్వరలోనే ఆమె తన భాషనీ, ఉచ్ఛారణనీ మెరుగు పరుచుకోవడం విజయలక్ష్మికి హిందీ, బెంగాలీ భాషలు నేర్చుకోడానికి స్ఫూర్తినిచ్చింది. నిజానికిది చేతులకి, కాళ్ళకీ బంధనాలతో నీళ్ళలోకి విసిరేయబడిన వ్యక్తి ఈత నేర్చుకోడం లాంటిది. చదివేప్పుడు తేలికగానూ, తరువాత బరువుగానూ అనిపించే ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో. 

భాషలు నేర్చుకోడం మాత్రమే కాదు, చుట్టుపక్కల అందరితోనూ స్నేహాలు కలిపేసుకోవడం, రైల్వే ఆఫీసర్స్ క్లబ్బులో కీలక బాధ్యతలు నిర్వహించడం వరకూ ఆమె ఆ ప్రకారం ముందుకు పోతూనే ఉన్నారు.  విపరీతమైన చలి, కుంభవృష్టి వర్షాలు, రోళ్ళు పగిలే ఎండలు.. చిత్తరంజన్ వాతావరణంలో అన్ని ఋతువుల్లోనూ అతి తప్పదు. శీతాకాలాన్ని గురించి చెబుతూ, 'పాలు తోడు పెట్టిన గిన్నెకి, దోశల పిండికీ కూడా రగ్గులు కప్పాలి, లేకపొతే పాలు తోడుకోవు, విరగని దోశలు రావు'  అంటారు రచయిత్రి. మరొకరెవరైనా అయితే ఎన్నేసి ఫిర్యాదులు చేసి ఉండేవారో అనిపిస్తుంది ఇలాంటి చమక్కులని చదువుతున్నప్పుడు. వాతారణం ఎలా ఉన్నప్పటికీ చిత్తరంజన్ ఓ అందమైన కాలనీ. ప్రతి ఇంటి ముందూ పళ్ళు, కూరలు, పూల మొక్కలు తప్పనిసరి. సాక్షాత్తూ గాయని వాణీ జయరామే 'ఇంత అందమైన ఊరిని నేనెక్కడా చూడలేదు' అన్నారు మరి. 

ప్రయాణాలు మరీ సులభం కాని క్రితం రైల్వే ఉద్యోగులంటే ఓ గ్లామర్ ఉండేది. వాళ్ళు టిక్కెట్టు కొనక్కర్లేకుండా పాస్ తో ప్రయాణం చేసేస్తారనీ, ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు వెళ్లిపోవచ్చనీను. ఆ పాస్ ల వెనుక ఉండే కష్టాలనీ హాస్యస్ఫోరకంగా చెప్పారు రెండు మూడు చోట్ల. పుట్టింటికి రానూ పోనూ చేసే రెండేసి రోజుల ప్రయాణాల మొదలు, చిత్తరంజన్ లో నిర్వహించిన తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లో నిర్వహించిన దోశ స్టాల్ వరకూ చాలా తలపోతలే ఉన్నాయిందులో. కొత్త భాష, సంస్కృతీ నుంచి పుట్టే హాస్యం సరేసరి. సిగండాల లాంటి చిరుతిళ్ళు మొదలు, చిత్తరంజన్ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాల వరకూ ఆపకుండా చదివించే కథనాలకి లోటు లేదు. 

తాను రచయిత్రిగా మారిన క్రమాన్ని కనీసం రేఖామాత్రంగా ప్రస్తావించి ఉన్నా బాగుండేది. 'ప్రేమలేఖ' నవలకి ఓ పాఠకుడి నుంచి ప్రేమలేఖ అందుకోడం లాంటి తమాషా సంగతులు చెప్పారు తప్ప, పెన్ను పట్టిన విధానాన్ని గురించి ఎలాంటి హింటూ ఇవ్వలేదు. అలాగే 'ప్రేమలేఖ' నవల 'శ్రీవారికి ప్రేమలేఖ' సినిమాగా మారిన వైనాన్ని చెబుతారని ఎదురు చూశా కానీ ఆ జోలికి వెళ్ళలేదు రచయిత్రి. ఇక, శీర్షికలో ఉపయోగించిన 'జావళి' కి నాకు తెలిసిన అర్ధం శృంగార ప్రధానమైన గీతం అని. స్పష్టంగా చెప్పాలంటే, నాయిక, నాయకుణ్ణి శృంగారానికి ఆహ్వానిస్తూ పాడే పాట (ఉదాహరణ: 'మల్లీశ్వరి' లో 'పిలిచిన బిగువటరా'). ఇంకేదన్నా అర్ధం కూడా ఉందేమో మరి. మొత్తం మీద చూసినప్పుడు నవ్విస్తూనే ఎన్నో జీవిత సత్యాలని గుర్తు చేసే పుస్తకం ఇది. (పేజీలు 196, వెల రూ. 150, ఆన్లైన్లో  కొనుక్కోవచ్చు).