ఆదివారం, జులై 31, 2016

నవతరం 'పెళ్ళిచూపులు'

రెండు దశాబ్దాల క్రితం వంశీ తీసిన ఫ్లాప్ సినిమా 'లింగబాబు లవ్ స్టోరీ' లో మొబైల్ కేంటీన్ కాన్సెప్ట్ ని నేటి తరం జీవన శైలిని ప్రతిబింబించే కథలో కీలకాంశంగా మలుచుకుని నవతరం దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపుదిద్దిన సినిమా 'పెళ్ళిచూపులు.' విజరయ్ దేవరకొండ ('ఎవడే సుబ్రహ్మణ్యం' లో నాని 'దూద్ కాశి' ఫ్రెండ్), రీతూ వర్మ (అదే సినిమాలో నాని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి) నాయికానాయకులు కాగా, షార్ట్ ఫిల్ముల్లోనూ, చిన్న సినిమాల్లోనూ నటించిన నటీనటులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రత్యేకత ఆసాంతమూ సరదాగా సాగిపోయే క్లీన్ కామెడీ కావడం. కుటుంబంతో కలిసి హాయిగా చూడగలిగే ఈ సినిమాలో కథ కన్నా, కథనమే ప్రేక్షకులని కట్టి పడేస్తుంది.

లెక్కకి మిక్కిలిగా సప్లీలు (సప్లిమెంటరీ పరీక్షలు) రాసి, ఇంజనీరింగ్ అయిందనిపించిన ప్రశాంత్ (విజయ్) కుదురుగా ఉద్యోగం చేసుకునే టైపు కుర్రాడు కాదు. ధర్మో డైనమిక్స్ స్పెల్లింగ్ కూడా తెలియని తన ఇంజనీరింగ్ చదువుతో ఆ ఫీల్డులో నెగ్గుకు రావడం కష్టమని తెలుసతనికి. తనకి ఇష్టమైన హోటల్ మేనేజ్మెంట్ రంగంలో భవిష్యత్తు వెతుక్కోవాలని నిర్ణయించుకుని, ఓ షెఫ్ దగ్గర శిక్షణ పొందుతాడు. కొడుకుని గుండెల మీద కుంపటిలా భరిస్తున్న విజయ్ తండ్రి, ఓ జ్యోతిష్యుడి సలహా మేరకి కొడుక్కి పెళ్లి చేసేయాలని నిర్ణయించుకుంటాడు. పెళ్లి చూపులు చూడ్డానికి చిత్ర (రీతూ వర్మ) ఇంటికి విజయ్ కుటుంబం వెళ్లడం, అక్కడ జరిగే కామెడీ ఆఫ్ ఎర్రర్స్ తో ప్రథమార్ధం సరదాగా గడిచిపోతుంది.

ఎంబీఏ చేసిన చిత్ర ఏదైనా వ్యాపారం చేసి తనని తాను నిరూపించుకోవాలని నిర్ణయించుకుని, స్నేహితుడి సాయంతో ఓ మొబైల్ రెస్టారెంట్ ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంటుంది. సరిగ్గా ఆ స్నేహితుడు ఆమెకి దూరం అయినప్పుడే, పెళ్లి చూపుల్లో విజయ్ తో పరిచయం అవుతుంది. పెళ్ళిచూపుల ఫలితం వేరేగా ఉన్నప్పటికీ, విజయ్ తో కలిసి వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటుంది చిత్ర. విజయ్ కి కూడా వ్యాపారంలో చేరక తప్పని పరిస్థితులు వస్తాయి. వ్యాపారం ఉహిచనంతగా విజయవంతం అవుతుంది. సరిగ్గా అప్పుడే, చిత్ర స్నేహితుడు తిరిగి రావడం, విజయ్ కి పెళ్లి నిశ్చయమవడంతో కథ క్లైమాక్స్ కి చేరుతుంది. ఒక అత్యంత నాటకీయమైన సన్నివేశం అనంతరం నాయికా నాయకులు వాళ్ళ జీవితాలకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంతో శుభం కార్డు పడుతుంది సినిమాకి.


దర్శకత్వంతో పాటు కథ, కథనం, సంభాషణలు సమకూర్చుకున్న తరుణ్ భాస్కర్ ని ముందుగా అభినందించాలి. బూతు లేకుండా కూడా యూత్ ని మాత్రమే కాక, అన్ని వర్గాలనే అలరించే సినిమా తీయొచ్చని సినిమా తీసి మరీ నిరూపించినందుకు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అంత మాత్రమే ఖర్చు చేసి తీసిన ఈ సినిమాని కొత్తగా చిత్ర నిర్మాణ రంగంలోకి రావాలనుకుంటున్న వాళ్ళు ఒక రిఫరెన్స్ గా పరిశీలించాల్సిన అవసరం ఉంది. వేగవంతమైన కథనం, పాత్రోచితమైన సంభాషణలతో పాటు సినిమాటోగ్రఫీ (నగేష్ బానెల్) సంగీతం (వివేక్ సాగర్) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఎడిటర్ (రవితేజ గిరజాల) కి రెండో సగంలో కొంచం తక్కువ పని చెప్పినట్టనిపించింది. అయితే, సినిమా నిడివి మరీ ఎక్కువగా ఉండకపోవడం ప్లస్ పాయింట్ అయ్యింది. పాటలకి బదులు బిట్ సాంగ్స్ మాత్రమే ఉన్నా, అదో లోటుగా అనిపించలేదు ఎక్కడా.

తరుణ్ భాస్కర్ టేకింగ్ మీద శేఖర్ కమ్ముల ప్రభావంగా విపరీతంగా కనిపించి ఈ సినిమాలో. పాత్రలని డిజైన్ చేసుకోడం మొదలు, నటన రాబట్టుకోడం వరకూ ప్రతి చోటా శేఖర్ ముద్ర కనిపించింది. రీతూ వర్మ కైతే 'ఆనంద్' 'గోదావరి' సినిమాలు పదేపదే చూపించి కమలిని చేసినట్టే చేసేయమని చెప్పారేమో అని సందేహం కలిగింది. విజయ్ చాలా సీన్లలో 'ఆనంద్' సినిమాలో రాజాని గుర్తు చేశాడు. సంభాషణలు, నటీనటులు వాటిని పలికిన తీరు కూడా శేఖర్ సినిమాలనే జ్ఞాపకం చేశాయి. బలమైన నాయిక పాత్ర, అదే సమయంలో హీరో డమ్మీ కాకపోవడం, క్లైమాక్స్ మినహా ఇంకెక్కడా అతి పోకడలు కనిపించక పోవడం వల్ల ఎక్కడా విసుగు కలగదు. మొదటిసగం అయితే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. రెండో సగం మొదలైన కాసేపటికే కథనం ఎలా ఉండబోతోందో అర్ధం అయిపోవడం, సరిగ్గా అలాగే ఉండడం కాస్త నిరాశ పరిచాయి.

రెండో సగం విషయంలో, మరీ ముఖ్యంగా ముగింపు విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే పదికాలాల పాటు గుర్తుండిపోయే సినిమా అయ్యేది. అలాగని ఇప్పుడేమీ తక్కువ కాదు. కుటుంబం అంతా కలిసి నిర్భయంగా చూడగలిగే సినిమా. పైగా, ఆసాంతమూ సరదాగా సాగిపోతుంది కూడా. 'ఇలాంటి మనుషులు మనకి తెలుసు' అనిపించే పాత్రలు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ పెట్టకపోవడం పెద్ద రిలీఫ్. సినిమా చూశాక తరుణ్ భాస్కర్ లో ఓ ప్రామిసింగ్ దర్శకుడు కనిపించాడు. దట్టమైన గడ్డం మాటున పెద్దగా ఎక్స్ ప్రెషన్స్ తో పని లేకుండా నెట్టుకొచ్చేశాడు హీరో. మొదటి సినిమా కన్నా వాచికం లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. కానైతే, చేయాల్సింది ఇంకా ఉంది. కమలిని అనుకరణ విజయవంతంగా చేసింది హీరోయిన్. హీరో స్నేహితుడిగా చేసిన కుర్రాడి కామెడీ టైమింగ్ భలేగా ఉంది. ఫుడ్ ట్రక్ బిజినెస్ చుట్టూ బలమైన సీన్స్ అల్లుకుంటే మరింత బాగుండేది. మొత్తంమీద, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోరుకునే వాళ్ళని అలరించే సినిమా ఇది.

మంగళవారం, జులై 26, 2016

నరసింహుడు

భారతదేశంలోకి నూతన ఆర్ధిక సంస్కరణలు ప్రవేశించి పాతికేళ్ళు పూర్తయ్యాయి. కొత్తతరానికి ఏమాత్రం తెలియని మార్పులెన్నో సాంఘిక, ఆర్ధిక పరిస్థితుల్లోకి చొచ్చుకు వచ్చాయి. మధ్యతరగతి జీవితాలని విశేషంగా ప్రభావితం చేసిన సాఫ్ట్వేర్ రంగం ఊపందుకోవడం మొదలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రజా జీవితంలో ఓ భాగమవ్వడం వరకూ జరిగిన అనేక పరిణామాలకి మూల కారణం ఆర్ధిక సంస్కరణలే. రాజీవ్ గాంధీ మరణానంతరం కాంగ్రెస్ సారధ్యంలోని మైనారిటీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన తెలుగు నాయకుడు పీవీ నరసింహారావు తీసుకున్న కీలక నిర్ణయాల ఫలితమే ఈ ఆర్ధిక సంస్కరణలు.

కేవలం సోనియా గాంధీ పట్ల తగినంత విశ్వాసం ప్రదర్శించలేదు అనే కారణానికి కాంగ్రెస్ పార్టీ పీవీ ని పార్టీ చరిత్రనుంచి తొలగించేసి సంస్కరణల సారధిగా నాటి ఆర్ధిక మంత్రి మన్మోహన్ సింగ్ ని కీర్తిస్తుండగా, ఆర్ధిక సంస్కరణల పర్వానికి నాడు అడుగడుగునా మోకాలడ్డిన వామపక్ష పార్టీల నాయకులు నేడు ఆవేళ ఆ పదవిలో ఎవరున్నా తీసుకునే నిర్ణయాన్నే పీవీ తీసుకున్నారు కాబట్టి అదేమీ పెద్ద విషయం కాదని తేల్చేస్తున్నారు. ఇక రాష్ట్ర స్థాయిలో నాయకులైతే సంస్కరణల తాలూకు ఫలితాలన్నీ తమ ఘనతే అని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. మరి, పీవీ ఆనాడు చేసిన కృషి, ఎదుర్కొన్న ఒత్తిళ్లు, ప్రదర్శించిన రాజనీతి ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోవలసినవేనా? ఈ ప్రశ్నకి 'కాదు' అని సమాధానం ఇస్తోంది 'నరసింహుడు.'

పాత్రికేయుడు, న్యాయవాది, రాజకీయ శాస్త్రవేత్త వినయ్ సీతాపతి ఆంగ్లంలో రాసిన 'ది హాఫ్ లయన్' పుస్తకానికి సీనియర్ పాత్రికేయులు జి. వల్లీశ్వర్, టంకశాల అశోక్, కేబీ గోపాలం కలిసి చేసిన తెలుగు అనువాదమే 'నరసింహుడు.' 'ఇప్పటి భారతదేశ నిర్మాత కథ' అన్నది ఉపశీర్షిక. పీవీ ప్రధానిగా పదవీ కాలం ముగించుకున్న రెండు దశాబ్దాల తర్వాత, భౌతికంగా దూరమైన పుష్కర కాలం తర్వాత వెలువడిన ఈ పుస్తకం ఒక నిస్పక్షపాతమైన రచన. రచయితకి పీవీ కృషి మీద అభిమానం ఉంది. కాబట్టే,  రెండేళ్ల పాటు విశేష పరిశోధన చేసి, కీలకమైన వాటితో సహా వేలాది డాక్యుమెంట్లు చదివి, పీవీ వ్యక్తిగత వంటమనిషి సహా వందలాది మందిని ఇంటర్యూ చేసి రాసిన పుస్తకం ఇది. అయితే, రచయితకి పీవీ మీద దురభిమానం లేదు..కాబట్టే పాలనలో జరిగిన తప్పులని తప్పులుగా ఎత్తి చూపించారు.

2004, డిసెంబరు 23న ఢిల్లీ లో పీవీ అంతిమ శ్వాస విడిచిన మరుక్షణం, అంత్యక్రియలు ఢిల్లీలో జరపడానికి వీలు లేదని సోనియా గాంధీ పట్టుపట్టి సాధించుకోడంతో మొదలయ్యే కథనం, పీవీ బాల్యం, తొలినాళ్ళ రాజకీయ జీవితం, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ, పదవీ చ్యుతి మీదుగా సాగుతూ, ప్రధాని అవుతూనే ప్రవేశ పెట్టిన ఆర్ధిక సంస్కరణలు, అవలంబించిన విదేశీ విధానాలు వివరిస్తూ, బాబరీ మసీదు విధ్వంసం లాంటి వైఫల్యాలని పరామర్శిస్తూ, పీవీ-సోనియాల మధ్య పొడసూపిన విభేదాల దగ్గరకి వఛ్చి, పీవీ వ్యక్తిత్వంలో భిన్న కోణాలని పరిచయం చేస్తూ ముగుస్తుంది.  పాతికేళ్ల నాటి రాజకీయాలతో పాటుగా, నేటి రాజకీయాలమీదా ఒక స్పష్టత వస్తుంది.


నిజానికి పీవీ రచనలు 'లోపలి మనిషి,' 'అయోధ్య' చదివిన వారికి 'నరసింహుడు' లో రాసిన కొన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. అలాగే, జైరాం రమేష్ తాజా రచన 'సంస్కరణల రథసారథి' పీవీ చదివిన వారికి సంస్కరణల పర్వం పరిచయం అవుతుంది. ఈ మూడూ చదివిన తర్వాత 'నరసింహుడు' చదివితే పీవీ తాలూకు పూర్తి చిత్రం కళ్ళకి కడుతుంది. అంతమాత్రాన, 'నరసింహుడు' చదవడానికి పైమూడూ చదివి ఉండడం తప్పనిసరి కాదు. ప్రధానిగా ఐదేళ్ల పదవీ కాలాన్ని పీవీ సమర్ధవంతంగా పూర్తి చేయడానికి, గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పొందిన 'వైఫల్యం' ఉపయోగ పడిందని ప్రతిపాదిస్తారు వినయ్ సీతాపతి. ఈ పరిశీలనని తోసిపుచ్చలేం. అలాగే, స్వాములు, బాబాలతో సన్నిహితంగా మెలగడం వెనుక రాజకీయ కారణాలని విశ్లేషించారు.

మన్మోహన్ సింగ్ ని ఏరికోరి ఆర్ధిక మంత్రిగా నియమించుకోవడం మొదలు, ప్రతిభావంతులైన అధికారులు ఎక్కడ ఉన్నా వెతికి వారికి తన కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగించడం వరకూ ఎక్కడా కూడా పీవీ 'అభద్రత' కి లోనుకాలేదని చెబుతూ, తాను స్వయంగా ప్రతిభావంతుడు కాబట్టి, ప్రతిభావంతుల కారణంగా తనకి ప్రమాదం ఎదురవుతుందేమోనన్న (మెజారిటీ నాయకులకి కలిగే) సందేహాన్ని పీవీ జయించగలిగారన్నది మరో ప్రతిపాదన. పీవీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో 'పవర్ సెంటర్' గా అధికారం చెలాయించిన నాటి కాంగ్రెస్ ఎంపీ తేళ్ల లక్ష్మీకాంతమ్మ, ముఖ్యమంత్రి పదవి కోల్పోగానే ఆయన్ని నిష్కర్షగా దూరంపెట్టిన విధం పీవీకే కాదు, నాయకులందరికీ ఒక పాఠమే.

కీలక నిర్ణయం తీసుకోవాల్సి వఛ్చిన ప్రతిసారీ దాన్ని వాయిదా వేసి కాలం గడిపేశారన్నది నాడు పీవీ మీద వినిపించిన ఫిర్యాదు. ఆ ధోరణికి కారణాలతో పాటు, తాను చేయాలనుకున్న పనులని అత్యంత వేగంగా చేసిన వివరాలనీ ఉదాహరణలతో సహా అందించారు సీతాపతి. తనదైన ఒక సమాచార వ్యవస్థని నిర్మించుకోడం మొదలు, పార్టీ నాయకుల మీద నిఘా పెట్టడం వరకూ పీవీ చేసిన ప్రతిచర్యనీ విశ్లేషిస్తుందీ పుస్తకం. బయటి శత్రువులతోనూ, (పార్టీ) లోపలి శత్రువులతోనూ పోరాడుతూ, దినదిన గండమైన మైనారిటీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటూ వస్తూ దేశ గతిని మలుపు తిప్పే నిర్ణయాలని సమర్ధవంతంగా అమలు చేయడం అన్నది ఎంతటి కత్తిమీద సామో వివరిస్తుంది కూడా.

శాశ్వతంగా గౌరవించాల్సిన ఒక నాయకుణ్ణి చరిత్ర హీనుణ్ణి చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలతో పాటు, పీవీ చేసిన చారిత్రిక తప్పిదాలనీ నిర్మొహమాటంగా రికార్డు చేశారు. పుస్తకం పూర్తి చేసిన తర్వాత మొదటగా తల్చుకునేది పీవీని అయితే, ఆవెంటనే గుర్తు చేసుకునేది వినయ్ సీతాపతి కృషిని. తెలుగు వాళ్ళెవరూ చేయలేకపోయిన బృహత్ ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రచయితని అభినందించకుండా ఉండలేం. అనువాదంలో ముగ్గురు రచయితలు పాలుపంచుకోడం వల్ల కావొచ్చు, రచనలో ఏకరూపత కనిపించదు. అయితే, మొత్తం పుస్తకం వేటికవే అయిన పదిహేను అధ్యాయాలుగా ఉండడం వల్ల ఈలోపం పాఠకులని పెద్దగా బాధించదు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల మీద ఆసక్తి ఉన్నవాళ్లు తప్పక చదవాల్సిన పుస్తకం ఈ 'నరసింహుడు.' (ఎమెస్కో ప్రచురణ, పేజీలు 440, వెల రూ. 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

బుధవారం, జులై 20, 2016

'శారద' నవలలు

వామపక్ష భావజాలం కలిగిన మిగిలిన రచయితల రచనలకన్నా, 'శారద' కలంపేరుతో తెలుగులో కథలూ, నవలలూ రాసిన ఎస్. నటరాజన్ రచనలు భిన్నంగా ఉంటాయి. మెజారిటీ రచయితలు పేదరికాన్నీ, పేదల కష్టాలనీ ఊహించి రాస్తే, నటరాజన్ వాటన్నింటినీ స్వయంగా అనుభవించి రాశారు. అందుకే కావొచ్చు, 'గొప్పవాళ్లందరూ చెడ్డవాళ్ళు.. పేదవాళ్లందరూ బహు మంచివాళ్ళు' అనే సూత్రీకరణ ఈ తమిళుడైన తెలుగు రచయిత కథల్లోనూ, నవలల్లోనూ కూడా కనిపించదు. ఆరవ దేశంలో పుట్టి, పదమూడేళ్ల వయసులో పొట్ట చేతపట్టుకుని తెనాలికి వలస వఛ్చి, హోటల్ కార్మికుడిగా పనిచేస్తూనే తెలుగు నేర్చుకుని, సాహిత్యం చదివి, తనదైన ముద్రతో రచనలు చేసిన శారద ముప్ఫయిరెండేళ్ల వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లిపోవడం, అతని కుటుంబానికే కాదు, తెలుగు సాహిత్యానికే పెద్ద లోటు.

నటరాజన్ ఈ లోకాన్ని విడిచిన అరవయ్యేళ్ళ తర్వాత, అతని రచనలన్నీ మరోసారి అచ్చుకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇది సాహిత్యాభిమానులకు కచ్చితంగా శుభవార్తే. కాలపరీక్షకి నిలబడే రచనలు కావడంతో నటరాజన్ రాసిన కథలూ, నవలల్లోని వస్తువులు ఇవాళ్టికీ సమకాలీనమే. ప్రస్తుతానికి వస్తే, 'శారద రచనలు - మొదటి సంపుటం' లో నటరాజన్ రాసిన మూడు నవలలు 'ఏది సత్యం,' 'మంచీ-చెడూ,' 'అపస్వరాలు' చాన్నాళ్ల తర్వాత మళ్లీ వెలుగు చూశాయి. పేద, మధ్యతరగతి మనస్తత్వాలు, వారి జీవన విధానాలపై నటరాజన్ కి ఉన్న పట్టుని సూచించే నవలలివి. అలాగే, మధ్యతరగతి నుంచి ఉన్నత తరగతికి ఎగబాకిన మనుషులు, పరిస్థితుల ప్రభావం వల్ల - వైకుంఠపాళిలో పెద్ద పాము నోట పడినట్టుగా - ఒక్కసారిగా పేదరికంలోకి జారిపోతే జీవితాన్ని ఎలా ఎదుర్కొంటారో నిశితంగా చిత్రించారు.

కొత్తగా పెళ్ళైన సాంబశివరావు-పార్వతి దంపతుల కథ 'ఏది సత్యం.' సాంబశివరావుకి నా అన్నవాళ్ళు లేరు. పార్వతి పరిస్థితీ ఇంచుమించు అంతే. ఓ మిల్లులో గుమస్తాగా పనిచేసే రావుకి పార్వతి అంటే పంచ ప్రాణాలు. ఇరుగుపొరుగులకి చూడ ముచ్చట ఆ జంట.  ఉన్నట్టుండి మిల్లులో జరిగిన ఓ ప్రమాదంలో రావు కాలికి బలమైన గాయం తగలడంతో ఉద్యోగం పోతుంది. మిల్లు వాళ్ళిచ్చిన నామ మాత్రపు నష్టపరిహారం ఖర్చైపోతే 'రేపు ఎలా?' అన్నది పెద్ద ప్రశ్న ఆ దంపతులకి. పొరుగింటి ప్లీడర్ దంపతులు వీళ్ళ పరిస్థితి చూసి జాలిపడతారు. ఎస్సెస్సీతో పాటు టైపు పరీక్షలు పాసైన పార్వతికి ఓ చిన్న ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తారు. ఇల్లు తప్ప బయటి ప్రపంచం తెలియని పార్వతి భయం భయంగా ఉద్యోగంలో ప్రవేశిస్తుంది. తన భర్త ఆరోగ్యం బాగై, తాను మళ్లీ గృహిణి బాధ్యతల్లోకి వెళ్ళిపోగలిగే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

ఆఫీసు సమస్యల్ని ఇంటికి తేని పార్వతికి ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. మంచాన పడిన రావుకి పార్వతి మీద అనుమానం మొదలవుతుంది. అతని ఆగడాలని ఓరిమితో భరిస్తుంది పార్వతి. అటు ఆఫీసులో ఒకదానిపై ఒకటిగా ఇబ్బందులు వఛ్చి పడుతూ ఉంటాయి. వాటిని నిర్వహించుకోడంలో సతమతమవుతున్న పార్వతికి రావు గురించి ఓ నిజం తెలియడం, మరోపక్క రావుకి ఆమె మీద అనుమానం నానాటికీ బలపడడంతో కథ ముగింపుకి చేరుతుంది. డెబ్భయ్యేళ్ళ నాటి నవల అని ఎంతమాత్రమూ అనిపించక పోవడం ఈనవల ప్రత్యేకత. మధ్యతరగతి ఆలోచనల్నీ, సంఘర్షణాల్నీ రచయిత చిత్రించిన తీరు ఈ నవలని ప్రత్యేకంగా నిలుపుతుంది. తర్వాతి కాలంలో వచ్చిన ఓ కమర్షియల్ నవలలో ముఖ్యమైన పాయింటు ఈ నవలలోదే. (కథంతా గుర్తుంది కానీ, నవల పేరు, రచయిత(త్రి) పేరూ జ్ఞాపకం రావడం లేదు).


ఇరవయ్యేళ్ళ కొడుక్కి తండ్రైన భద్రయ్య, భార్య మరణించిన కొన్నేళ్ళకి తన కొడుకు కన్నా వయసులో చిన్నదైన పద్మని ద్వితీయ వివాహం చేసుకోవడం, ఫలితంగా జరిగిన పరిణామాలే 'మంచీ-చెడూ' నవల. భద్రయ్య కొడుకు భాస్కరరావు పద్మని మాతృ స్థానంలో స్వీకరిస్తాడు. కానీ, పద్మకి భాస్కరరావు పునర్ యవ్వనం పొందిన భద్రయ్యలా కనిపిస్తాడు. 'సారంగధర' కథలా ఉందే అనుకునే లోగానే మొదటి మలుపు ప్రవేశిస్తుంది. వ్యవసాయం చేసుకునే భద్రయ్యని పట్నానికి తీసుకొచ్చి, వ్యాపారం పెట్టించి, గొప్పవాణ్ణి చేసిన సుదర్శనం, అనుకోని పరిస్థితుల్లో భద్రయ్య మీద పగ పట్టడంతో రోడ్డునపడుతుంది భద్రయ్య కుటుంబం. పెళ్లి నుంచి ఏమీ పొందలేకపోయిన పద్మ, భద్రయ్య మరణం తర్వాత తన దారి తను చూసుకునే క్రమంలో వేసిన తప్పటడుగులు ఆమెను ఓ బిడ్డకి తల్లిని చేస్తాయి. జీవితాన్ని పునర్నిర్మించుకునే కృషిలో నిమగ్నమవుతాడు భాస్కర రావు.

మరోపక్క సుదర్శనం, భద్రయ్యని దూరం చేసుకుని సాధించింది ఏమీ కనిపించదు. ఏ కారణానికి భద్రయ్యని దూరం చేసుకున్నాడో, అదే విషయంలో ఊహించని సమస్యల్లో చిక్కుకుంటాడు సుదర్శనం. పద్మ, భాస్కరరావు, సుదర్శనం.. వీళ్ళ ముగ్గురి జీవిత పథాన్ని చిత్రిస్తూ, ఆర్ద్రతతో ముగుస్తుందీ నవల. సంపుటంలో చివరి నవల 'అపస్వరాలు.' ధనిక, పేద, మధ్యతరగతి జీవితకథల కలబోత అయిన ఈ నవలలో ప్రధాన కథ, ఓ పేద వాడికి ఉన్నట్టుండి బోలెడంత డబ్బు దొరకడం.. ఆ డబ్బు విసుగెత్తించేత డబ్బుని సృష్టించడం.. చివరకి అతనికి కావాల్సినవి ఏవీ కూడా ఆ డబ్బుతో దొరకని పరిస్థితులు రావడం. వరదరాజు ఓ దొంగ. పదిమంది సభ్యులున్న ఓ ముఠాకి నాయకుడు. రంగయ్య ఓ మధ్య తరగతి స్కూల్ మేష్టారు. వీళ్లిద్దరికీ ఉన్న అలవాటు 'బ్రాకెట్' ఆట. బ్రాకెట్ గెలిస్తే తన డబ్బు కష్టాలు తీరతాయని రంగయ్య ఆశ. దరిద్రం నుంచి ఐశ్వర్యంలోకి మళ్లాలని వరదరాజు కోరిక.

బ్రాకెట్ ఆటలో కాక, మరోరకంగా వరదరాజుకి పెద్ద మొత్తంలో డబ్బు చేరుతుంది. ఆ డబ్బుతో మొదలు పెట్టిన వ్యాపారం, అతని కృషి లేకుండానే మరింత డబ్బు సంపాదించి పెడుతూ ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టే మార్గాల కోసం వెతుకుతున్న వరదరాజుకి నాటకాలు నిర్వహించే మృత్యుంజయ శాస్త్రి, అతని శిష్యుడు, పుస్తక ప్రచురణ కర్తా అయిన కరుణామూర్తి పరిచయమై ఎన్నికల్లో నిలబడమని ప్రోత్సహిస్తారు. ఒకప్పుడు తనకి అన్నం పెట్టిన వెలయాలు వసంతం, తనని మామా అని పిలిచే పక్కింటి పిల్లాడు చిన్నా, బ్రాకెట్ లో సలహాలు ఇచ్చిన రంగయ్య.. వీళ్ళకి ప్రాణావసరాలు వచ్చినప్పుడు వాటిని తీర్చేందుకు తన డబ్బు ఎందుకూ పనికిరాకపోవడం నివ్వెర పరుస్తుంది వరదరాజుని. అతను తీసుకున్న నిర్ణయం నవలకి ముగింపు. రంగయ్య కుటుంబం, మరీ ముఖ్యంగా అతని కొడుకు సదానందంతో పాటు వసంతం పాత్రని బలంగా చిత్రించారు రచయిత. కథనం మీద రావిశాస్త్రి ప్రభావం కనిపిస్తుంది. అయితే, సూటిగా, స్పష్టంగా సాగే వచనం నటరాజన్ ది. వర్ణనలు ఎక్కడా శ్రుతి మించవు.

ఈ మూడు నవలల సంపుటానికి నటరాజన్ స్నేహితుడు ఆలూరి భుజంగరావు, శ్రీవాసవ్య రాసిన ముందు మాటలు 'శారద' జీవితాన్ని గురించీ, రచనల్ని గురించీ ఆసక్తికరమైన విషయాలెన్నో చెబుతాయి. సాహిత్యం పట్ల నటరాజన్ తపన, వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నా సాహిత్యం కోసం సమయాన్ని వెచ్చించిన తీరు చదివినప్పుడు అతని మీద గౌరవం పెరుగుతుంది. నవలలు చదువుతున్నంతసేపూ రాసింది ఓ తమిళుడు అన్న మాట జ్ఞాపకం రాదెక్కడా. చక్కని తెలుగు నుడికారంతో పాటు, వాక్యం మీద పట్టుని సాధించడం నటరాజన్ ప్రత్యేకత అని చెప్పాలి. ఏ వాక్యమూ సుదీర్ఘమనీ, అనవసరమని అనిపించదెక్కడా. నవచేతన పబ్లిషింగ్ హౌస్ (మరేదో కాదు, తెలంగాణ లో 'విశాలాంధ్ర') ప్రచురించిన ఈ 497 పేజీల సంపుటం తెలుగు సాహిత్యాభిమానులు దాచుకోవలసినది. (వెల రూ. 325, నవచేతన, విశాలాంధ్ర అన్ని శాఖలూ). 'శారద' మిగిలిన రచనల్ని కూడా వీలైనంత త్వరగా ప్రచురించాల్సిందిగా ప్రచురణకర్తలకి విన్నపం.

సోమవారం, జులై 18, 2016

జీవనయానం

అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య ఆత్మకథ 'జీవనయానం.' సుమారు రెండు దశాబ్దాలకి పూర్వం 'వార్త' దినపత్రిక ఆదివారం అనుబంధంలో రెండేళ్ల పాటు సీరియల్ గా ప్రచురితమైన ఈ రచన విశేషమైన పాఠకాదరణ పొందింది. దాదాపు అదే సమయంలో రంగాచార్య సమగ్ర సాహిత్యాన్ని సంపుటాలుగా వెలువరించే కృషిని ఆరంభించిన విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ఈ ఆత్మకథనీ ప్రచురించి, ఇప్పటికి మూడు సార్లు పునర్ముద్రించింది. సంప్రదాయ కుటుంబంలో పుట్టి, వేద విద్యలు అభ్యసించిన రంగాచార్య నిజాం కి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయుధం పట్టడం ఒక వైచిత్రి. పట్టి చూస్తే ఆయన జీవితంలో ఇలాంటి వైచిత్రులకి లోటే లేదు.

దాశరథి వంశీయుల స్వస్థలం భద్రాచలం. అయితే, రంగాచార్య పూర్వీకులు కొన్ని కారణాలకి భద్రాద్రి విడిచి పెట్టేశారు. ఇప్పటి వరంగల్ జిల్లా మహబూబాబాద్ కి సమీపంలోని చిన్న గూడూరులో మొదలైంది రంగాచార్య బాల్యం. అటుపై తెలంగాణ లోని అనేక ప్రాంతాల్లో గడిపి, సికింద్రాబాదులో స్థిరపడ్డారు కుటుంబ సమేతంగా. తల్లిదండ్రుల మధ్య లోపించిన సఖ్యత కారణంగా, రంగాచార్య చిన్నతనంలోనే తండ్రి ఇల్లు విడిచి వెళ్ళిపోతే, అన్నయ్య కృష్ణమాచార్య కుటుంబ బాధ్యత భుజాన వేసుకున్నారు. అయితే, కృష్ణమాచార్య పోరాట మార్గం ఎంచుకుని జైలుకి వెళ్లడంతో యవ్వనారంభం లోనే కుటుంబ పోషణ బాధ్యత స్వీకరించాల్సి వచ్చింది రంగాచార్యకి.

'బోద్ధారో మత్సరగ్రస్తా: ప్రభవః స్మయదూషితాః అబోధోపహతాశ్చాన్నే జీర్ణమంగే సుభాషితమ్' అన్న భర్తృుహరి సుభాషితం తో ఆరంభమయ్యే ఈ పుస్తకం తెలంగాణ చరిత్రను వివరిస్తూ సాగి, దాశరధి వంశాన్ని పరిచయం చేసి, వందేళ్లనాటి తెలంగాణ పల్లెల స్వరూపాన్నీ, నిజాము అకృత్యాలనీ కళ్ళకి కడుతూ, ఆ కాలంలో ఆ ప్రాంతంలో తెలుగు భాష దీన స్థితినివివరిస్తూ రంగాచార్య కథలోకి తీసుకెళ్తుంది పాఠకులని. అక్కడినుంచీ కథనం అక్షరాలా పరుగందుకుంటుంది. ఏకబిగిన పూర్తి చేసి కానీ పుస్తకాన్ని పక్కన పెట్టడం అసాధ్యం. కుటుంబ పరిస్థితులు, చదువుకునే అవకాశాలు పెద్దగా లేకపోవడంతో చదువు కొనసాగించలేకపోయిన రంగాచార్య, నిజాం పాలనలో అన్యాయాన్ని ఎదిరించి కమ్యూనిస్టు అనిపించుకున్నారు.

"నిజానికి నేను ఇవాళ్టికీ ఏ పార్టీలోనూ సభ్యుణ్ణి కాను" అని సందర్భం వఛ్చిన ప్రతిసారీ చెప్పారు. నిజాం వ్యతిరేకతతో పాటు, ఏ పార్టీ మీద ప్రత్యేకమైన అభిమానం లేకపోవడం వల్లనే కావొచ్చు, తెలంగాణ సాయుధ పోరాట సందర్భంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేసిన చారిత్రక తప్పిదాలని నిస్సంకోచంగా వివరించారు. ఆర్య సమాజం వంటి సంస్థల పనితీరునీ సునిశితంగా సమీక్షించారు. పోరాటం ముగిసి, నిజాం రాజ్యం భారతదేశంలో భాగమయ్యాక, ప్రయివేటుగా మెట్రిక్ పరీక్ష ఉత్తీర్ణులై ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన రంగాచార్య, తరువాతి చదువంతా ప్రయివేటుగానే సాగించారు. సికిందరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో అనువాదకుడిగా చేరి, ఉన్నత హోదాలో పదవీ విరమణ చేశారు.


ఓ వంక తెలంగాణ పోరాటాన్ని చిత్రించే 'చిల్లర దేవుళ్ళు,' 'మోదుగుపూలు' లాంటి నవలలు రాస్తూనే, మరోపక్క రామాయణ, భారత, భగవతాలని సరళమైన తెలుగులో వ్యాఖ్యానించారు రంగాచార్య. పన్నెండేళ్లవయసులో బాల్య వివాహం జరగడం, అటుపై దాదాపు పదేళ్ల తర్వాత కాపురం ఆరంభించడం తదనంతరం ఒడిడుకులు ఇవన్నీ ఎంతో ఆసక్తికరంగా చెప్పారు. అప్పుడే మొదలవుతున్న కన్యాశుల్క పద్ధతి మొదలు, కుటుంబంలో వచ్చిన చీలికలు వరకూ ఒకే ధోరణిలో చెప్పుకొచ్చారు.  రామాయణ మహా భారతాలని సిద్ధాంతాల చట్రాలనుంచి సమీక్షించే ఔత్సాహికులు ఎక్కడ పొరబడుతున్నారన్నదీ అంతే వివరంగా, కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు.

రంగాచార్యలో తిరుగుబాటు ధోరణి చిన్ననాటి నుంచీ ఉన్నదే. అది వయసుతోపాటు పెరిగిందే తప్ప తగ్గలేదు. పల్లెటూరి పోరాటాలు, ఉద్యోగ జీవితంలో చేసిన ఉద్యమాల మొదలు, అపౌరుషేయాలుగా పేరుపొందిన వేదాల తెనిగింపు వరకూ ఎన్నెన్నో ఉదాహరణలు జీవితపర్యంతం కనిపిస్తూనే ఉంటాయి. ఆత్మకథలో తప్పనిసరేమో అనిపించే ఆత్మస్తుతి, పరనింద అక్కడక్కడా ఎదురుపడతాయి. అలాగని, ధూమపానం మొదలు, మద్యపానం వరకూ తన అలవాట్లు వేటినీ దాచే ప్రయత్నం చేయలేదు. వాటిని మానుకున్న సందర్భాలని ప్రస్తావించక మానలేదు. ప్రత్యేకంగా గుర్తుండిపోయే అనేక విషయాల్లో మొదటిది అన్నతో అనుబంధం. ఎంతగా ప్రేమించి, గౌరవించారో,  సందర్భాన్ని బట్టి కృష్ణమాచార్య చర్యల్ని విమర్శించేందుకూ వెనుకాడలేదు. అలాగే తనని అభిమానించి, రచనలని ప్రోత్సహించిన వట్టికోట ఆళ్వార్ స్వామి, నార్ల చిరంజీవిల మీద అభిమానాన్నీ దాచుకోలేదు.

'చిల్లర దేవుళ్ళు' నవల గురించీ, మరీ ముఖ్యంగా 'వనజ' పాత్రని గురించీ చాలాసార్లే ప్రస్తావించారు. ఆ పాత్రకి రేడియాలో ప్రాణం పోసిన శారదా శ్రీనివాసన్, వెండితెరపై అభినయించిన కాంచన లను అభినందించారు. రంగాచార్య నవల 'మానవత' లో భిన్న మతాలకి చెందిన పాల్, జానకి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. నిజజీవితంలో రంగాచార్య చిన్న కొడుకు ప్రేమ వివాహం కారణంగా కొన్నేళ్ల పాటు కుటుంబానికి దూరం జరిగాడు!! జరిగినదాన్ని 'తల్లీ కొడుకులమధ్య ఘర్షణ' అంటారాయన. నిజాం వ్యతిరేక పోరాటాన్ని, తన జీవిత కథనీ పడుగు పేకలుగా అల్లిన అల్లిక పుస్తకాన్ని ఆసాంతమూ ఒకే రకమైన ఆసక్తితో చదివేందుకు దోహదం చేసింది. పుస్తకం పూర్తి చేసేసరికి ఏ ఒక్క జీవితాన్నో కాక, ఓ శతాబ్ద కాలపు సమాజ గతిని నిశితంగా పరిశీలించిన అనుభూతి కలుగుతుంది పాఠకులకి.

వైష్ణవ సంప్రదాయాల ప్రస్తావన మహామహోపాధ్యాయ తిరుమల రామచంద్ర ఆత్మకథ 'హంపీ నుంచి హరప్పా దాక..' ని జ్ఞాపకం చేసింది. రెండు కుటుంబాలూ ఆచార వ్యవహారాల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేవే.. రెండూ కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా సర్దుబాట్లు చేసుకున్నవే. "మనం నిజాలు చెప్పకపోతే ముసలినక్క నిజాంని కొంత కాలానికి దేవుణ్ణి చేసేసే ప్రమాదం ఉంది" అంటూ ఒక సందర్భంలో రంగాచార్య తన మిత్రులతో అన్న మాట, తర్వాతి కాలంలో నిజమయ్యింది. ఆత్మకథల మీద ఆసక్తి ఉన్నవాళ్లు, తెలంగాణ పోరాట చరిత్రని తెలుసుకో గోరే వాళ్ళూ, వందేళ్ల కాలంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన మార్పుని గురించి పరిశోధించాలనుకునే వాళ్ళూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఈ 'జీవనయానం.' (విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 508, వెల రూ. 300).

శనివారం, జులై 16, 2016

పడవమునక

కళాశాల విద్య పూర్తి చేసుకోబోతున్న రమేష్, తన స్నేహితుడి చెల్లెలు హేమాలినితో ప్రేమలో పడతాడు. హేమాలిని కుటుంబం బ్రహ్మసామాజికులు కావడంతో ఆమె గోషా లాంటి సంప్రదాయాలేవీ పాటించదు. రమేష్ ఆ కుటుంబానికి సన్నిహితుడయ్యాడు. ప్రతినిత్యం ఆ కుటుంబాన్ని టీ వేళకి కలుసుకోడం, లోకాభిరామాయణం ముచ్చటించడం రివాజుగా మారింది అతనికి. రమేష్ మనసు హేమాలినికి తెలుసు. నిజానికి ఆమెకి కూడా అతనంటే ఇష్టమే. అంతే కాదు, ఆమె కుటుంబ సభ్యులకి కూడా రమేష్ మీద మంచి అభిప్రాయమే ఉంది.

పరీక్షలు పూర్వవుతూనే, రమేష్ ని ఉన్నపళంగా బయల్దేరి రమ్మని జాబు రాస్తాడు అతని తండ్రి. ఇంటికి వెళ్లే వరకూ అతనికి కారణం ఏమిటన్నది తెలీదు. హేమాలిని విషయం తెలుసుకున్న రమేష్ తండ్రి, కొడుక్కి సుశీలతో సంబంధం నిశ్చయం చేస్తాడు. సంప్రదాయవాది అయిన ఆ పెద్దాయన, బ్రహ్మసామాజికురాల్ని కోడలిగా అంగీకరించేందుకు సిద్ధంగా లేడు. పడవ దాటి పెళ్లి వారి ఊరికి చేరుకుంటుంది రమేష్ కుటుంబం. అన్యమనస్కంగానే సుశీల మెడలో తాళి కడతాడు రమేష్. వెన్నెల రాత్రి వేళ స్వస్థలానికి పడవలో తిరుగు ప్రయాణంలో ఉండగా, నది మధ్యలో పడవ తిరగబడుతుంది. స్పృహ వచ్చేసరికి ఓ ఇసుక తిప్పమీద ఉన్న రమేష్, తనకి కొంచం దూరంలో స్పృహ తప్పి పడి ఉన్న నవ వధువుని చూస్తాడు.

ఇరువైపుల బంధువులూ పడవ ప్రయాణంలో మరణిస్తారు. అమాయకురాలైన ఆ వధువు కోసం తానిక హేమాలినిని పూర్తిగా మర్చిపోవాల్సిందే అని నిశ్చయించుకుంటాడు రమేష్. తన వాళ్ళ ఉత్తర క్రియలు పూర్తయ్యాక, వధువుతో సంభాషించే ప్రయత్నం చేస్తాడు. 'సుశీలా' అని పిలిస్తే పలకదు ఆమె. ఎందుకంటే, ఆమె పేరు కమల. ప్రమాదానికి గురైన మరో పడవలో ప్రయాణించిన నవ వధువు ఆమె. జరిగింది ఏమిటో రమేష్ కి అర్ధమవుతుంది తప్ప, ఆమెకి అర్ధం కాదు. పడవ ప్రయాణం తాలూకు షాక్ నుంచి పూర్తిగా కోలుకోని ఆమెకి నిజం ఎలా చెప్పాలో అర్ధం కాదు రమేష్ కి. అయితే, ఆమె తన తాళి కట్టిన భార్య కాదు అని తెలిశాక, హేమాలిని పై మళ్లీ ఆశలు చిగురిస్తాయి అతనిలో. ఈ జంట కథ ఏ తీరం చేరిందన్నదే రవీంద్రనాథ్ టాగోర్ నవల 'పడవమునక.'


ఈకథకి మార్పులు చేర్పులతో చాలా భారతీయ భాషల్లో సినిమాలు వచ్చాయి. తెలుగులో అయితే పడవ ప్రయాణాన్ని రైలు ప్రమాదంగా మార్చేశారు. నవల విషయానికి వస్తే, నాటి కలకత్తా వాతావరణం, బ్రహ్మ సమాజం ప్రభావం, సంప్రదాయ-ఆధునిక వాదుల మధ్య అంతరాలు.. వీటన్నింటితో పాటూ, ప్రధాన పాత్రల అంతరంగాలని రవీంద్రుడు చిత్రించిన తీరు అబ్బుర పరుస్తుంది. నాటకీయతని ఎక్కడ శ్రుతి మించనివ్వక పోవడం వల్ల నవల ఆద్యంతమూ ఆసక్తిగా సాగడంతో పాటు, ఆద్యంతం సహజంగానే అనిపిస్తుంది. హేమాలిని, కమల పాత్రల చిత్రీకరణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రచయిత, వారి వారి నేపధ్యాలని ఆధారంగా చేసుకుని ఆలోచనా స్థాయిల్ని, పరిణతిని చిత్రించారు.

చిన్నప్పుడే తన వాళ్ళని కోల్పోయి, దూరపు బంధువుల ఇంట్లో పెరిగిన కమల కథ విని ఎంతగానో చలించి పోతాడు రమేష్. పెళ్లి కారణంగా తనకంటూ భర్త, ఇల్లు ఏర్పడ్డాయని తృప్తి పడుతున్న కమలకి నిజం చెప్పడం అన్నది అతనికి తలకి మించిన పని అవుతుంది. ఒకే ఇంట్లో ఉంటూ ఆమెకి దూరంగా ఉండడం కష్టం కాకపోయినా, ఆమె ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం కష్టం అవుతుంది అతనికి. ఆమె భవిష్యత్తుని కూడా ఆలోచించి, కమలని ఓ విద్యాలయంలో చేర్చి, అక్కడే ఆమెకోసం ఓ ఇల్లు కుదిర్చి పెడతాడు. యోగ్యుడైన వరుడికిచ్చి ఆమెకి పెళ్లి చేయడం ద్వారా తన బాధ్యతని నెరవేర్చుకుని, అటుపై జరిగిందంతా హేమాలినికి చెప్పి ఆమెతో జీవితం ప్రారంభించాలని తలుస్తాడు రమేష్. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు కథని ముందుకి నడుపుతాయి.

రమేష్ తనని మోసం చేశాడని భావించే హేమాలిని, భర్త తనని ఎందుకు దూరం పెడుతున్నాడో తెలియక కమల అనుభవించే సంఘర్షణ, కథనీ, పాత్రల్నీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి. నవలలో చిత్రించిన బెంగాలీ వాతావరణం శరత్, బిభూతిభూషణ్ ల నవలల్ని గుర్తు చేస్తుంది. ద్వితీయార్ధంలో ప్రవేశించే కొత్త పాత్రల వల్ల ముగింపుని గురించి అవగాహన వచ్చినా, ఊహించిన ముగింపుకి కథ ఎలా చేరుతుందన్న ఆసక్తి పుస్తకాన్ని విడిచిపెట్టకుండా ఏకబిగిన చదివిస్తుంది. కథతో పాటు కథనం మీద రచయిత తీసుకున్న శ్రద్ధని గమనించవచ్చు. రవీంద్రుడి 'కుముదిని' ని అనువదించిన కమలాసనుడు ఈ 'పడవమునక' నూ తెనిగించారు.(సాహితి ప్రచురణ, పేజీలు 208, వెల రూ. 90, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, జులై 11, 2016

మా జ్ఞాపకాలు

సుప్రసిద్ధ రచయిత బుచ్చిబాబు శతజయంతి సందర్భంగా విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ప్రచురించిన తాజా సంకలనం 'మా జ్ఞాపకాలు.' బుచ్చిబాబు భార్య, రచయిత్రీ అయిన శివరాజు సుబ్బలక్ష్మి, బుచ్చిబాబుతో గడిపిన రోజులని జ్ఞాపకం చేసుకుంటూ, నాటి విశేషాలని వ్యాసాలుగా రాస్తే, 'చినుకు' పత్రిక పాతిక భాగాలుగా ప్రచురించింది. వాటన్నింటినీ కలిపి పుస్తక రూపంలోకి తీసుకొచ్చింది విశాలాంధ్ర. ఇవి కేవలం బుచ్చిబాబు, సుబ్బలక్ష్మిలకి సంబంధించిన విశేషాలు మాత్రమే కాదు, ముప్ఫయ్యేళ్ళ  కాలంలో ఆంధ్ర దేశంలో జరిగిన అనేక పరిణామాల తాలూకు పరామర్శ కూడా.

పన్నెండేళ్ల వయసులో బుచ్చిబాబుకి భార్యగా అత్తవారింట అడుగుపెట్టిన సుబ్బలక్ష్మి, ముప్ఫయ్యేళ్ళ పాటు బుచ్చిబాబుతో కలిసి జీవించారు. 1967 లో బుచ్చిబాబు అకాలమరణం పాలైనప్పటి నుంచీ ఒంటరి జీవితం గడుపుతున్నారు. కథలు, నవలలు, వ్యాసాలు రచించడం, పెయింటింగ్స్ చేయడం ఆవిడ వ్యాపకాలు. నవ వధువుగా అత్తింటి జ్ఞాపకాల మొదలు, బుచ్చిబాబు చివరి రోజుల వరకూ జరిగిన ఎన్నో విశేషాలను అక్షరబద్ధం చేశారు. వ్యాసాల వరుసలో చెప్పాలంటే 'మల్లెమొగ్గ చెంబు మళ్ళా దొరికింది' మొదలు 'అభిమానం అంటే ఇదేనేమో' వరకూ.

అత్తవారింట్లో మనుషుల మనస్తత్వాలని గురించి ఆవిడ రాసింది చదువుతుంటే బుచ్చిబాబు కథల్లో కొన్ని పాత్రలు అదాటున గుర్తొస్తాయి. అలాగే, బుచ్చిబాబుతో కలిసి తిరిగిన ఊళ్ళు, చేసిన యాత్రలు కూడా కథల్లో సంఘటనలని జ్ఞాపకం చేస్తాయి. తొలుత అనంతపురంలోనూ, తర్వాత విశాఖపట్నంలోనూ లెక్చరర్ గా పనిచేసిన బుచ్చిబాబు, ఆకాశవాణి లో ఉద్యోగం రావడంతోనే మద్రాసుకి మకాం మార్చారు. అదే సమయంలో 'చివరకు మిగిలేది' నవల 'నవోదయ' పత్రికలో సీరియల్ గా రావడం, నాటి సాహితీ ప్రముఖులంతా బుచ్చిబాబు ఇంటికి వచ్చి నవలని గురించి చర్చించడం, వారికి అతిధి మర్యాదలు చేస్తూనే చర్చలని చెవి వొగ్గి వినడాన్ని గురించి గుర్తు చేసుకున్నారు సుబ్బలక్ష్మి.


సుబ్బలక్ష్మి కథల్ని 'ఇవి ఇంగ్లీష్ లోకి అనువాదం అవ్వాల్సినవి' అంటూ ప్రోత్సహించిన బుచ్చిబాబు, పెయింటింగ్స్ విషయంలో మాత్రం ఆమె వేసిన చిత్రాల కన్నా తాను చిత్రించినవే బాగున్నాయన్న అభిప్రాయంతో ఉండేవారట. తాను అభిమానించే ఇంగ్లీష్ రచయితల పుస్తకాలు మార్కెట్లోకి రాగానే కొనడం, సుబ్బలక్ష్మి చేత వాటికి అట్టలు వేయించుకోవడం బుచ్చిబాబుకి  ఇష్టమైన పనుల్లో ఒకటి. గాంధీ, నెహ్రూ, రమణ మహర్షిలని కలుసుకోడాన్ని అపురూపంగా గుర్తుచేసుకున్నారు. అలాగే, స్వతంత్రం  రాగానే నెహ్రూ చేయబోయే రేడియో ప్రసంగాన్ని వినడం కోసం రేడియో సెట్ కొనుగోలు చేయడం కూడా (అప్పట్లో రేడియోలకి రేషన్, పెద్ద రికమండేషన్ ఉంటే తప్ప దొరకని పరిస్థితి).

విశ్వనాథ సత్యనారాయణ, ఆచంట జానకిరామ్, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు లాంటి సాహితీ ప్రముఖులెదంరో ఆ ఇంటికి తరచూ వచ్చే అతిధులు. వచ్చిన వారి సంప్రదాయాన్ని అనుసరించి మర్యాదలు చేయాలి. (భోజనానికి వచ్చినప్పుడు తనకి ఏం వండాలో విశ్వనాథే స్వయంగా చెప్పేవారట). సాహిత్య విశేషాలతో పాటు, కాలంతో పాటు అత్తింటి, పుట్టింటి పరిస్థితుల్లో వఛ్చిన మార్పులు, నెలల తరబడి ఇంట్లో తిష్ట వేసే దూరపు బంధువుల బెడద లాంటి కబుర్లనీ జ్ఞాపకం చేసుకున్నారు. నాటి కవిపండితుల అలవాట్లు, వ్యవహార శైలి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి ఈ పుస్తకపు పేజీల్లో.

బుచ్చిబాబు పేరు చెప్పగానే గుర్తొచ్చే 'చివరకు మిగిలేది' గురించిన విశేషాలెన్నో. బంధువులు కథ అర్ధం కావడం లేదని గొడవ చేస్తే, స్నేహితులేమో 'నవల్లో స్త్రీ పాత్రలు నిజంగా బుచ్చిబాబుకి సన్నిహితమైన మహిళలా?' అని అడిగేవారట. ఆనాటి రేడియో కార్యక్రమాల తీరుతెన్నులు, సినిమాల సంగతులనీ సందర్భానుసారంగా ప్రస్తావించారు. తన చుట్టూవున్న మనుషుల్లో ఎవరికీ దైవత్వం ఆపాదించలేదు, అలాగని తూలనాడనూ లేదు. విశాలాంధ్ర వారి ప్రచురణలో తగుమాత్రం అచ్చుతప్పులు సాధారణమే కానీ, ఈ పుస్తకంలో ముద్రా రాక్షసాలు మాత్రం అసాధారణంగా ఉన్నాయి. కొన్ని సార్లు వాక్యాలు కూడబలుక్కుని మళ్లీ మళ్లీ చదువుకుని అర్ధం చేసుకోవాలి. 'అంపశయ్య' నవీన్ ముందుమాట నిరాశ పరిచింది. రచనకి మాత్రం వంక పెట్టేందుకు లేదు. (పేజీలు 128, వెల రూ. 100, విశాలాంధ్ర అన్ని శాఖలూ).

మంగళవారం, జులై 05, 2016

పూసపాటి కృష్ణంరాజు కథలు

అప్పటివరకూ సామాజిక సమస్యల మీద కథలు రాస్తూ వఛ్చిన కెఎన్వై పతంజలి దివాణాలని కథా వస్తువులుగా తీసుకుని రచనలు చేయడానికి ప్రేరేపించిన రచయిత పూసపాటి కృష్ణంరాజు.  ఈ రాజుగారు రాసిన 'దివాణం సేరీవేట' కథ స్పూర్తితో 'రాజుగోరు' నవలిక రాశారు పతంజలి. ఇంకేముంది, ఇంగ్లీష్ వాడు చెప్పినట్టు రెస్టిజ్ హిస్టరీ. పతంజలికి ఇక్కడో కామా పెట్టి, కృష్ణంరాజు దగ్గరకి వస్తే గురజాడకి శిష్యుడు, చాసో కి అనుయాయి. పుట్టి పెరిగింది దివాణంలోనే అయినా, పేద ప్రజల పక్షాన కలం పట్టి కథలు రాసిన రచయిత.

కృష్ణంరాజు రాసినవి కేవలం పదహారు కథలే అయినా వాటికవే సాటి. ఈ మధ్య కాలంలో పునఃప్రచురణకి నోచుకోలేదీ కథలు. అయితే, 'ఈతరం కోసం కథాస్రవంతి' పేరిట ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ప్రచురిస్తున్న చిన్న కథల సంకలనాల్లో భాగంగా కృష్ణంరాజు రాసిన పన్నెండు కథలతో ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు. పూసపాటి పేరు చెప్పగానే గుర్తొచ్చే 'దివాణం సేరీవేట,' 'సీతాలు జడుపడ్డది,' 'కుక్కుట చోరులు,' 'రెండు బంట్లు పోయాయి' తో పాటు మరో ఎనిమిది కథలు చదువుకోవచ్చు ఈ సంకలనంలో.

పుస్తకంలో మొదటి కథ 'మహారాజ యోగం' లో విశాఖపట్నంలో డిగ్రీ చదివే కుమార్రాజాకీ, అనుకోకుండా అతని బసకి వచ్చి,  అంత అనూహ్యంగానూ దూరమైన నాగులు అనే కుర్రవాడికి మధ్య అనుబంధాన్ని చిత్రించారు రచయిత. నాటి విశాఖ వాతావరణం, అడివిని తలపించే వాల్తేరు, ఇళ్లలోకి జొరబడే పాములు.. ఈ వాతావరణంలోకి పాఠకులని అలవోకగా తీసుకుపోయి అప్పుడు చెబుతారు నాగులు కథని. రెండో కథ 'దివాణం సేరీవేట.' కూలిపోడానికి సిద్ధంగా ఉన్న దివాణాల్లో ఉంటున్నా పౌరుషాల విషయంలో రాజీపడని రాజుల కుర్రాళ్ళు వేట చేసిన వైనాన్ని చదవాలంతే. (ఈ చిన్నకథకి విస్తృత రూపమే పతంజలి రాసిన 'రాజుగోరు.')


మూడోకథ 'సీతాలు జడుపడ్డది.' మూఢనమ్మకాల కారణంగా పేదవాళ్ళు ఎలాంటి మూల్యాలు చెల్లిస్తారో చెబుతుంది. అయితే, పుస్తకానికి ముందుమాట రాసిన డాక్టర్ చందు సుబ్బారావు ఈ కథని కొంచం అపార్ధం చేసుకున్నారేమో అనిపించింది. 'తెల్లరాజు-నల్లదొర,' 'సామంతం' కథలు రెంటికీ దౌర్జన్యమే కథా వస్తువు. స్వార్ధానికి, ప్రలోభానికి బలైపోయిన అక్కా చెల్లెళ్ళ కథ 'పేరంటాలు గుండం.' కాగా, 'దిగులు' కథలో చెదల్ని ప్రతీకగా తీసుకుని కథ నడిపిన తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక 'కుక్కుట చోరులు' కథ ఏకకాలంలో రెండు కథల్ని చదివిన అనుభూతిని ఇస్తుంది. ఒకటి రచయిత నేరుగా చెప్పిన కథ, రెండోది ప్రతీకాత్మకంగా చెప్పిన కథలో కథ.

రాచవారి వివాహ వేడుకల్ని కళ్ళకి కట్టే కథ 'రెండు బంట్లు పోయాయి.' చదరంగం బల్ల నేపధ్యంగా సాగే కథలో ఎత్తులూ, పై ఎత్తులూ ఆసాంతమూ ఊపిరి బిగపట్టి చదివిస్తాయి. 'దారితప్పినా.. మాట తప్పినా' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వంశీకి నచ్చిన కథ. ఈ కథని అనుసరించి (అనుకరించి కాదు) చాలా కథలే రాశాడు వంశీ. వేట ఇతివృత్తంగా సాగే మరో కథ 'భూతాల స్వర్గం.' ఇది కూడా రెండు కథల కలగలుపు. సంపుటిలో చివరికథ 'గైరమ్మ' మీద చాసో కథ 'కుంకుడాకు' ప్రభావాన్ని కాదనలేం.

చాన్నాళ్ల తర్వాత పూసపాటి కృష్ణంరాజు రచనల్ని అచ్చులోకి తెచ్చిన అరసం వారికి అభినందనలు. మిగిలిన నాలుగు కథలకీ కూడా చోటిచ్చేస్తే సమగ్ర సంకలనం అయ్యేది కదా అనిపించింది కానీ, ప్రచురణకర్తలకి ఏవో పరిమితులు ఉండే ఉంటాయి. కథా సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్లు తప్పక చదవాల్సిన సంకలనం ఇది. కథలు రాయాలనుకునే వాళ్ళైతే అధ్యయనం చేయాలి. ఎందుకంటే కృష్ణంరాజు శైలి, శిల్పం ప్రత్యేకమైనవి. అలాగే, ఏ రెండు కథలకీ పోలిక ఉండదు. ఆవేశపూరిత ప్రసంగాలూ, రాజకీయ ఎజెండాలు కనిపించవు. పేదవాళ్ల పట్ల రచయిత సహానుభూతి మాత్రం అడుగడుగునా కనిపిస్తుంది. (పేజీలు 111, వెల రూ. 50, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).