శనివారం, ఆగస్టు 31, 2013

బ్లఫ్ మాస్టర్

తెలుగు నాట కమర్షియల్ నవలలు రాజ్యం చేస్తున్నకాలంలో మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల 'బ్లఫ్ మాస్టర్.' ఎదుటివారిని సులువుగా మోసం చేసి క్షణాల్లో లక్షలు సంపాదించగల మోసగాడు యాభయ్యేళ్ళ విషకంఠం, అతనికి అన్నివిధాలా సరిజోడు అయిన ప్రియురాలు పందొమ్మిదేళ్ళ విరిజ ల కథ ఇది. ఎన్నో నేరాలు చేసినా ఎప్పుడూ పోలీసులకి చిక్కని విషకంఠాన్ని ఎలాగైనా అరెస్టు చేసి తీరాలని పట్టుదలగా ఉన్న పోలీస్ అధికారి కృపాల్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలిగాడా లేదా అన్నది ఈ నవల ముగింపు.

"మనిషిలో ఆశకన్నా దురాశ ఓ పాలు ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా భారతదేశ పరిస్థితి ఇలాగే ఉంది. న్యాయ సమ్మతంగా నెలకి ఐదారు వేల రూపాయలు వచ్చినా తృప్తి లేదు. బల్లకింద నించి ఇచ్చే చేతుల ద్వారా వచ్చే 'అదనపు వంద'ఆత్మతృప్తిని ఇవ్వని పరిస్థితి నేడు ఎదురవుతోంది. రూపాయి పెట్టుబడి పెట్టి నెల తర్వాత సంపాదించే పావలా కన్నా, పావలా పెట్టుబడితో మర్నాడు వచ్చే రూపాయి మాత్రమె హుషారునిస్తోంది. యధా రాజా, తధా ప్రజ.." అన్న ప్రారంభ వాక్యాలతో మొదలయ్యే ఈనవల, మల్లాది రాసిన అన్ని నవలల్లాగే ఆసాంతమూ విడవకుండా చదివిస్తుంది.

కథానాయకుడు విషకంఠం చిన్న చిన్న మోసాలు చెయ్యడు. వందలు, వేలు కాదు అతను సంపాదించాలి అనుకునేది. లక్షలు సంపాదించాలి.. అది కూడా సులభంగా, ఎవరికీ చిక్కకుండా. అందుకే అతని టార్గెట్ బాగా డబ్బున్న వాళ్ళే అవుతారు.. వాళ్ళ బలహీనతలని ఎరగా వేసి తనకి కావాల్సింది సంపాదించుకుని మాయమైపోయే విషకంఠం, ఎక్కడో మరోచోట తేలి మరో రకం మోసానికి తెరతీస్తాడు. ఏ భాషనైనా తన మాతృభాష అనిపించేట్టు మాట్లాడడం, ప్రతిరోజూ దినపత్రికలు క్షుణ్ణంగా చదివి వార్తల్లో నుంచి ఐడియాలు తీసుకోవడం, అత్యంత శ్రద్ధగా తన పధకం అమలుచేసి, అంతే జాగ్రత్తగా మాయమవ్వడం అతని పధ్ధతి.


నగల దుకాణానికి వెళ్లి డబ్బిచ్చి ఓ ఉంగరం కొనుక్కుని, విలువైన వజ్రాల నెక్లెస్ కొట్టేయడం, ఓ కంపెనీలో తక్కువ జీతానికి ఉద్యోగంలో చేరి తక్కువ సమయంలోనే పద్నాలుగు లక్షలు తెలివిగా మాయం చేయడం... అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడా పోలీసులకి దొరక్కపోవడం ఇదీ విషకంఠం ప్రత్యేకత. ఇలాంటి గూటి పక్షే విరిజ. ఒకరినొకరు మోసం చేసుకోబోయి, దొరికిపోయి, అటుపై స్నేహితులు, ప్రేమికులు అయిపోతారు ఇద్దరూ. అప్పటివరకూ తన పథకాలని తనొక్కడే అమలు చేసుకున్న విషకంఠం, అటు తర్వాత విరిజని కూడా భాగస్వామిగా చేసుకుంటాడు.

తనకంటూ ఎవరూ లేని విషకంఠం తన సంపాదనని బంగారు బిస్కట్లుగా మార్చి జాగ్రత్తగా దాచుకుంటాడు. అతనా బిస్కట్లు ఎక్కడ దాచాడో తెలుసుకోవడం విరిజ లక్ష్యం. తన గురించి ఎన్నో విషయాలనీ, పథకాల అమలులో తీసుకునే శ్రద్దనీ పూసగుచ్చినట్టు చెప్పినా, బంగారు బిస్కట్ల విషయం మాత్రం రహస్యంగా ఉంచుతాడు. విషకంఠం గురించి బాగా తెలిసిన విరిజ తొందర పడదు. ఆ బంగారం తనకి దక్కక మానదని నమ్మకం ఆమెకి. అతని సాన్నిహిత్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది విరిజ.

విషకంఠాన్ని పట్టుకోడాన్ని చాలెంజ్ గా తీసుకున్న పోలీసాఫీసర్ కృపాల్ ఎట్టకేలకి తన కృషిలో విజయం సాధించగలుగుతాడు. బంగారం రహస్యం విరిజకి చెప్పి జైలుకి వెడతాడు విషకంఠం. ఒకవేళ తను పోలీసులకి దొరికిపోతే విడిపించడానికి ఏం చేయాలో ముందుగానే ఆమెకి చెప్పి ఉంచుతాడు కూడా. ఇంతకీ విషకంఠం జైలు నుంచి బయట పడగలిగాడా? అతని శేషజీవితం ఎలా గడిచింది? దొరికిన సంపదని విరిజ ఏం చేసింది? ఇత్యాది ప్రశ్నలకి సమాధానం ఇస్తూ ముగుస్తుందీ నవల. కొన్ని విదేశీ క్రైమ్ కథల ప్రభావం ఉన్నట్టనిపిస్తుంది. ('బ్లఫ్ మాస్టర్' ప్రింట్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేదు).

మంగళవారం, ఆగస్టు 13, 2013

కథా సుగంధాలు

గంధం నాగరాజు పేరు చెప్పగానే 'గమ్యం' సినిమాలో సంభాషణలు గుర్తొస్తాయి. 'బాణం' 'సొంత ఊరు' లాంటి వైవిద్యభరిత సినిమాలూ అదే వరసలో గుర్తొస్తాయి. రాసింది తక్కువ సినిమాలకే అయినా, సినిమా సంభాషణల మీద తనదైన ముద్ర వేసిన నాగరాజు మొదట నాటక రచయిత. తర్వాత కథా రచయితగా ప్రయాణం సాగించి, సినీ రచయితగా ఎదిగి నలభై రెండేళ్ళ పిన్న వయసులోనే ప్రపంచాన్నివిడిచి పెట్టేశారు. నాగరాజు స్మృత్యర్ధం ఆయన రాసిన పదిహేను కథలతో వెలువరించిన సంకలనమే 'కథా సుగంధాలు.'

పుస్తకాన్ని చేతిలోకి తీసుకోగానే 'గమ్యం' సినిమా గుర్తు రావడం వల్ల కాబోలు, చాలా అంచనాలతో కథలు చదవడం మొదలు పెట్టాను నేను. అయితే, 'గమ్యం' సినిమా వరకూ నాగరాజు చేసిన సాహితీయానంలో ఈ కథలు రాశారన్న ఎరుక కలగడానికి ఎన్నో పేజీలు పట్టలేదు. రొమాన్స్, సెంటిమెంట్, హాస్యం అనే వర్గాలలో ఏదో ఒకదానిలో ఇమిడిపోయేలా ఉన్నాయి మెజారిటీ కథలు. ఇంకా చెప్పాలంటే, ఫలానా వర్గంలో కథ రాయాలి అని ముందుగానే అనుకుని ఆపై కథా రచన సాగించారేమో అనిపించింది.

'సృష్టి,' 'జీవితానికో పుష్కరం,' 'దుప్పటి' కథలు 'సరసమైన కథల' కేటగిరీలోకి వస్తాయి. వీటిలో గోదావరి పుష్కరాలు నేపధ్యంగా రాసిన 'జీవితానికో పుష్కరం' ఆకట్టుకునే కథ. తర్వాత నిలబడేది 'దుప్పటి' కథ. 'వెల్లవేసి చూడు,' 'పాకలహరి,' 'వెంకటప్పయ్య ట్రా(డ్రా)మా కేర్' హాస్య కథలు. పాత్రలు, సన్నివేశాల నుంచి హాస్యం పుట్టించడానికి రచయిత చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. వీటిలో, 'పాకలహరి' కథ భరాగో రాసిన 'వంటొచ్చిన మగాడు' కథని జ్ఞాపకం చేసింది.


'చెరువు,' 'జన్మభూమి,' 'క్షమయా ధరిత్రి' కథలు వ్యవసాయాన్ని, మరీ ముఖ్యంగా వ్యవసాయరంగ సంక్షోభాన్ని ఇతివృత్తంగా  రాసినవి. 'పునరావాసం' కథలో నక్సల్ ఉద్యమాన్ని స్పృశించిన నాగరాజు, 'అపరాజిత' కథని స్త్రీవాద కోణంలో రచించారు. 'అబార్షన్' కథ అబ్ స్ట్రాక్ట్ గా అనిపిస్తుంది. ట్రీట్మెంట్ విషయంలో మరికొంచం శ్రద్ధ పెడితే బాగుండేది అనిపించిన కథ 'రజ్జు సర్ప భ్రాంతి.' మానవనైజం ఇతివృత్తంగా సాగే కథ ఇది.

మొత్తం సంకలనంలో నన్ను బాగా ఆకట్టుకున్న కథ 'తెల్ల మచ్చల నల్ల క్రోటన్ మొక్క.' పేరులాగే కథలోనూ ఎంతో వైవిధ్యం ఉంది. అపరాధ పరిశోధన ఇతివృత్తంగా సాగే ఈ కథ ఆసాంతమూ ఊపిరి బిగపట్టి చదివించడమే కాదు, ఊహకందని ముగింపుతో ఆశ్చర్య పరుస్తుంది కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఒక్క కథ కోసం ఈ పుస్తకం కొనుక్కోవచ్చు అనిపించింది. మళ్ళీ మళ్ళీ చదివిన కథ ఇది.

మొత్తంగా చూసినప్పుడు కథల్లో వైవిధ్యం చూపడానికి నాగరాజు చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. ఇతివృత్తం మొదలు మాండలీకం వరకూ ప్రతి విషయంలోనూ ఏ రెండు కథలకీ పోలిక ఉండని విధంగా శ్రద్ధ తీసుకున్నారు. అయితే మితిమీరిన నాటకీయత, బలవంతపు హాస్యం కోసం చేసిన ప్రయత్నాలని తగ్గించుకుంటే మరింత బాగుండేది అనిపించింది.గంధం నాగరాజు కుటుంబం, స్నేహితులు కలిసి ప్రచురించిన ఈ సంకలనం అచ్చుతప్పులు ఎక్కువే. అయితే, నాగరాజు కథలు కను మరుగు కాకుండా ఉండడానికి చేసిన ప్రయత్నాన్ని మాత్రం అభినందించాల్సిందే. (పేజీలు 190, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).