గురువారం, డిసెంబర్ 31, 2015

ఇంకో ఏడాది ...

వచ్చినంత తొందరగానూ వెళ్ళిపోతోంది రెండువేల పదిహేను. మనం పని తొందరలో ఉన్నప్పుడు కాలం పరిగెడుతున్నట్టూ, ఖాళీగా ఉన్నప్పుడు ఎంతకీ కదలనట్టుగానూ అనిపించడం మామూలే కదా. గత కొన్నేళ్లుగా నడకకి అలవాటు పడ్డానేమో, ఈ ఏడాది మళ్ళీ పరుగందుకోవాల్సి రావడంతో త్వరత్వరగా గడిచిపోయినట్టుగా అనిపిస్తోంది. ఎప్పటిలాగే తీపినీ, చేదునీ కలగలిపి అందించి తనదోవన తను వెళ్ళిపోతోంది ఇంకో సంవత్సరం.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. గోదావరి మహాపుష్కరాలు, అమరావతి శంకుస్థాపన, ఆయుత చండీ యాగం.. ఇవన్నీ వెళ్ళిపోతున్న ఏడాది తాలూకు గుర్తులు. పుష్కర ప్రారంభ సంరంభంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన సామాన్యుల ఆత్మలకి శాంతి కలుగుగాక. అంత పెద్ద విషాదం జరిగినా ఎలాంటి విచారణా జరక్కపోవడం, ఎవరిమీదా ఎలాంటి చర్యలూ లేకపోవడం ఓ విచిత్రం.

ఇక, గోదావరి పుష్కరాలని నోరారా విమర్శించి, 'మేము స్నానం చేసేది లేదు' అని బల్లగుద్ది చెప్పిన వాళ్ళు సైతం ఆయుత చండీ యాగానికి హాజరై పట్టు శాలువాలు కప్పించుకోవడం మరో విచిత్రం. బహుశా స్థల, కాలాదుల ప్రభావం కాబోలు. యాగం చివర్రోజు జరిగిన అగ్నిప్రమాదం, ఫలితంగా రద్దైన రాష్ట్రపతి కార్యక్రమం వార్తల్లో ఎక్కడా కనిపించలేదు. జనమంతా ఎటూ లైవ్ లో చూశారు కాబట్టి, మళ్ళీ ప్రత్యేకం చెప్పక్కర్లేదనుకున్నారేమో.

ఏమైనప్పటికీ, పుష్కరాల విషయంలో వచ్చిన విమర్శలు, జరిగిన చర్చల్లో ఒకవంతు కూడా యాగాన్ని గురించి ఎక్కడా జగరలేదు. స్వయం ప్రకటిత హేతువాదులు సైతం నోరు విప్పలేదు ఎందుకనో. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి ప్రస్తుతానికింకా కలల్లోనే ఉంది. 'నేను సైతం' అంటూ దేశ ప్రధాని తెచ్చి ఇచ్చిన మట్టీ, నీరూ పునాదిరాయి వెయ్యడానికి ఉపయోగపడ్డాయి. నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి కేవలం మట్టీ, నీళ్ళూ చాలవు కదా.

అధికార పార్టీకి శాసన సభలో తగినంత సంఖ్యా బలం ఉంటే చాలు, ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనడానికి రెండు తెలుగు రాష్ట్రాలు మంచి ఉదాహరణలుగా నిలబడ్డాయి ఈ సంవత్సరం. రెండు రాష్ట్రాల్లోనూ కూడా ప్రతిపక్షానికి తగినంత 'బలం' లేదన్నది నిజం. ఫలితమే, వోటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ విషయాలు రెండూ కూడా ఇట్టే తెరమరుగైపోయాయి. ప్రతిపక్ష సభ్యుల విషయంలో ఒకరిది 'ఆకర్ష' మార్గం, మరొకరిది బెదిరింపుల మార్గం. ప్రసార మాధ్యమాల పూర్తి మద్దతు బాగా కలిసొస్తోంది రెండు ప్రభుత్వాలకీ.

కేంద్ర ప్రభుత్వం 'అసహనం' గొడవల్లోనుంచి బయట పడింది. బీహార్ శాసనసభ ఫలితాల తర్వాత నేలవైపు చూడడం మొదలు పెట్టినట్టుగా అనిపిస్తోంది. 'స్వచ్చ భారత్' ఫలితంగా పరిశుభ్రత మాటెలా ఉన్నా అదనపు పన్ను భారాన్ని జనం మీద మోపే అవకాశం దక్కించుకుంది. 'అవసరం' ఉన్న రాష్ట్రాలతో ఉదారంగానూ, మిగిలిన వాటితో ఉదాసీనంగానూ వ్యవహరిస్తోంది ప్రస్తుతానికి. తుపాను తాకిడికి విలవిల్లాడిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి కేంద్రం అందించిన సాయమే ఇందుకు అతిపెద్ద ఉదాహరణ.

అటు కేంద్రం వల్లా, ఇటు రాష్ట్రాల వల్లా సామాన్యులకి కొత్త పన్నులు మినహా ఒనగూరిన ప్రయోజనాలు ఏవీ లెక్కకి రావడం లేదు. వాళ్ళ దోషం లేకుండా అటు ప్రధాని, ఇటు ముఖ్యమంత్రులూ నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. ఆస్థాన ప్రవచనకారులు సెలవిస్తున్నట్టుగా ప్రజలకి సేవలు పొందే 'యోగం' ఉండాలి కదా. సదరు యోగాన్ని కొత్త సంవత్సరం తన వెంట తీసుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!!

సోమవారం, డిసెంబర్ 21, 2015

కొల్లాయిగట్టితేనేమి?

కోనసీమలో ఉన్న ముంగండ అగ్రహారానికి ప్రపంచవ్యాప్తంగా పేరు. కేవలం వేదపండితులు, ప్రాచీన శాస్త్రాలలో నిష్ణాతులు మాత్రమే కాదు, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న ఎందరికో ముంగండ పుట్టినూరు. ఉపద్రష్ట జగన్నాధ పండితరాయలు రెండు శతాబ్దాలకి పూర్వమే ఢిల్లీ సుల్తానుల ఆదరణకు పాత్రుడవ్వడం మాత్రమే కాదు, దర్బారు రాజనర్తకిని పెళ్ళాడి అక్కడే స్థిరపడిపోయాడు. ఝాన్సీ లక్ష్మిబాయి సైన్యంలో పనిచేసిన ముఖ్య సైనికుల్లో కొందరు ముంగండ వాస్తవ్యులే. వేదఘోషతో మారుమోగే ఆ పల్లెటూరిలో ఆధునికతకీ లోటులేదు. అలాంటి ముంగండ అగ్రహారాన్ని కథా స్థలంగా తీసుకుని మహీధర రామమోహన రావు రాసిన చారిత్రాత్మక నవల 'కొల్లాయిగట్టితేనేమి?'

జాతీయోద్యమ స్ఫూర్తి, స్వతంత్ర కాంక్ష దేశం నలుమూలలా పాకిపోయిన 1920-22 సంవత్సరాల మధ్య కాలంలో ఆంధ్రదేశంలో జరిగిన సాంఘిక, ఆర్ధిక, రాజకీయ పరిణామాలని ముంగండ అగ్రహారపు దృష్టి కోణం నుంచి చూస్తూ 1964 లో ఈ నవలని రాశారు రామమోహన రావు. నాలుగేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నదీ పుస్తకం. ముంగండలోనే పుట్టిపెరిగిన మహీధర, బాల్యంలో తను చూసిన ఎందరో వ్యక్తులనీ, ఎన్నో సంఘటనలనీ నవలలో చిత్రించినా అది "కల్పనలో కొంత భారం తప్పించుకునేటందుకు తప్ప, దీనిలో పాత్రలేవీ యదార్ధాలు కావు. కథ జరిగి ఉండనూ లేదు" అని స్పష్టంగా చెప్పారు ముందుమాటలో.

రాజమండ్రి కళాశాలలో చదువుతున్న రామనాధం, గాంధీజీ పిలుపు అందుకుని విదేశీ వస్త్ర దహనం కార్యక్రమంలో తన దుస్తులూ, దుప్పట్లనీ తగలబెట్టి, అర్ధంతరంగా చదువుమాని ముంగండకి ప్రయాణం కావడం కథా ప్రారంభం. పడవ ప్రయాణంలో తోటి ప్రయాణికురాలు స్వరాజ్యం తో పరిచయం అవుతుంది అతనికి. ముంగండ పక్కనే ఉన్న చిరతపూడి వాస్తవ్యుడు, బ్రహ్మ సమాజికుడూ అయిన అబ్బాయి నాయుడి కూతురామె. అత్తవారి అభీష్టానికి వ్యతిరేకంగా కాలేజీలో చదువుకుంటోంది. ముంగండ లో రామనాధం కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకీ కూడా అతని నిర్ణయం అర్ధం కాదు. నేడో రేపో ఇంగ్లండు వెళ్లి ఐసీఎస్ పరీక్ష ఇచ్చి కలెక్టరుగా రావాల్సిన తాను ఇలా చదువు మధ్యలో మానుకుని రావడం ఎందుకో వాళ్ళకి అర్ధమయ్యేలా చెప్పడం అతనికి చేతకాదు.


నిజానికి చదువైతే మానుకున్నాడు కానీ, తర్వాత ఏం చేయాలనే విషయంలో స్పష్టత లేదతనికి. చిన్నప్పుడే తల్లిదండ్రులని పోగొట్టుకున్న రామనాధాన్ని నిస్సంతు అయిన అతని బాబాయి శంకరశాస్త్రి పెంచి పెద్ద చేశాడు. రామనాధంతో పాటు అతని ఆస్తినీ పెంచి పెద్దచేసిన శంకరశాస్త్రి, అమలాపురం పోలీసు ఇన్స్పెక్టర్ ఆదినారాయణ మూర్తి కూతురు సుందరితో కుర్రాడికి బాల్య వివాహమూ జరిపించేశాడు. అల్లుడు చదువు మానుకోడం, పైగా గాంధీ ఉద్యమంలో చేరాలనుకోడం కొరుకుడు పడదు నారాయణమూర్తికి. ఓ పక్క శంకరశాస్త్రి-నారాయణ మూర్తి కలిసి రామనాధాన్ని "దారిలో పెట్టే" ప్రయత్నాలు చేస్తూండగానే, ఊహించని విధంగా జైలుపాలై, శిక్ష పూర్తయ్యాక కూడా అగ్రహారీకులు సూచించిన ప్రాయశ్చిత్తానికి నిరాకరించి కులం నుంచి వెలివేయబడతాడు రామనాధం.

తోటలో ఓ చిన్న పాకలో ఒక్కడూ జీవితం మొదలు పెట్టి, చరఖా ఉద్యమాన్ని ఇంటింటి ఉద్యమంగా మార్చే ప్రయత్నాలు ఆరంభిస్తాడు.జాతీయోద్యమంలో ముంగండ నుంచి పాల్గొన్న మొదటి వ్యక్తి రామనాధం పెదనాన్న విశ్వనాథం. అయితే, విశ్వనాథానికి అన్యకులానికి చెందిన స్త్రీ వల్ల కలిగిన కొడుకు వెంకటరమణకి మాత్రం ఆంగ్లేయులపై మోజు. అభివృద్ధి, కులవ్యవస్థ నిర్మూలన వాళ్ళ వల్లే సాధ్యమని నమ్ముతాడు. సంప్రదాయాన్ని ప్రాణం కన్నా మిన్నగా భావించే ముంగండ అగ్రహారీకులు ఊరి చెరువుకి నిత్యం కాపలా కాస్తూ ఉంటారు. పంచములు ఆ చెరువు నీటిని ముట్టుకోవడం నిషేధం. వాళ్లకి నీళ్ళు కావాలంటే ఎవరన్నా తోడి పోయాల్సిందే. మంచినీటి సమస్యని  పరిష్కరించాలని నిర్ణయించుకున్న రామనాథానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి.

చదువు మానేసిన రామనాధంతో కాపురం చేయడానికి సుందరి నిరాకరిస్తుంది. మరోపక్క చదువుకున్న కారణానికి స్వరాజ్యాన్ని విడిచిపెట్టి మరో స్త్రీని వివాహం చేసుకుంటాడు ఆమె భర్త. విజయవాడలో జరిగిన కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో ఊహించని విధంగా రామనాథానికి పేరొచ్చి పెద్ద నాయకుల దృష్టిలో పడతాడు. గోదావరి జిల్లా పర్యటనకి రాబోతున్న గాంధీజీని ముంగండ తీసుకెళ్ళి తను చేస్తున్న కృషిని పరిచయం చేయాలన్నది రామనాధం కోరిక. అందుకు ప్రయత్నాలు ఆరంభిస్తాడు. స్వరాజ్యం, రామనాధాల జీవితాలు ఏ మలుపు తిరిగాయన్నదానితో పాటు, కలెక్టరు కావాల్సిన రామనాధం చదువు మానేయడానికి గాంధీయే కారణమని దుమ్మెత్తి పోసే అతని కుటుంబ సభ్యులు, అగ్రహారీకులు గాంధీజీ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకున్నారన్నది నవల ముగింపు. ఊపిరి బిగపట్టి చదివించే కథనం ఈ నవల ప్రత్యేకత. పాత్రలు, సన్నివేశాలు అన్నీ కళ్ళముందు కనిపిస్తాయి.

చదువుతున్నంతసేపూ ఇదే నేపధ్యంతో వచ్చిన నవలలు'చదువు,' 'మాలపల్లి,' 'నారాయణరావు,' 'వేయిపడగలు,' 'రామరాజ్యానికి రహదారి' పదేపదే గుర్తొస్తూనే ఉంటాయి. సంభాషణలు క్లుప్తంగా ఉండడం, సన్నివేశాల ద్వారానే కథని చెప్పడం ఈ నవల ప్రత్యేకత. అందుకే కావొచ్చు, నాటకీయత బహుతక్కువగా ఉంది. ప్రదాన పాత్రలతో పాటు వితంతువు నరసమ్మ, ఖద్దరు అమ్మే దువ్వూరి సుబ్బమ్మ, లెక్చరర్ రంగనాధరావు పాత్రలు బాగా గుర్తుండిపోతాయి. జాతీయోద్యమం నేపధ్యంలో వచ్చిన తెలుగు సాహిత్యంలో ఈ నవలకి ప్రత్యేక స్థానం ఇవ్వాల్సిందే. (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ, పేజీలు 364, వెల రూ 250, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

మంగళవారం, డిసెంబర్ 15, 2015

హాలికులు కుశలమా!

'రాయలసీమలో ప్రజలు నిత్యం కత్తులు నూరుకుంటూ, బాంబులు విసురుకుంటూ ఉంటారు' ..ఇది  చాలామంది సినిమావాళ్ళు చేసిన ప్రచారం. 'రాయలసీమ ప్రజలు బూతు లేకుండా ఒక్క మాటా మాట్లాడరు' ..ఇది కొందరు రచయితలు ఆ ప్రాంతానికి ఇచ్చిన ఇమేజి. అయితే.. మంచీ, చెడ్డా అన్నవి విశ్వం అంతటా ఉన్నాయనీ, మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నట్టే రాయలసీమలోనూ మంచి ఉన్నదనీ తన కథల ద్వారా ప్రపంచానికి చాటిన కథా రచయిత ఒకరున్నారు. ఆయనే 'దామల్ చెరువు అయ్యోరు' గా తెలుగు సాహితీలోకంలో సుప్రసిద్ధులైన మధురాంతకం రాజారాం.

రాయలసీమ పల్లెల్ని, మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా పల్లె జీవితాలని తన కథల ద్వారా  పటం కట్టిన రాజారాం రాసిన మూడొందల పైచిలుకు కథల్లోనూ మట్టి వాసనలు గుభాళిస్తాయి. సీమ ప్రజల భాష, యాస, పండుగలు, పబ్బాలు, సంప్రదాయాలు, అభిమానాలు.. ఇవన్నీ పాఠకులకి కనిపింపజేస్తాయి, వినిపింపజేస్తాయి కూడా. రాజారాం రాసిన ప్రతికథా దేనికదే ప్రత్యేకమైనదే అయినప్పటికీ, దాదాపు యాభయ్యేళ్ళ క్రితం రాసిన 'హాలికులు కుశలమా!' కథ మరింత ప్రత్యేకమైనది. ఎంచుకున్న వస్తువు మొదలు, కథని తీర్చిదిద్దిన విధానం, మరీ ముఖ్యంగా ముగించిన తీరు ఈ కథని ఓ పట్టాన మర్చిపోనివ్వవు.

ఇది, రాయదుర్గం నరసప్ప అనే ఓ సామాన్య బడిపంతులు కథ. ఆయన టీచరు ట్రైనింగు పొందిన వాడూ, పరిక్షలు పాసైన వాడూ కాదు. సాహిత్యాన్ని ఇష్టంగా చదువుకుని, పద్యాలు అల్లడం నేర్చుకున్న వాడు. జిల్లా బోర్డు ప్రెసిడెంటు దర్శనం చేసుకుని, పంచరత్నాలు చదివితే, ఆ ప్రెసిడెంటు గారు మురిసిపోయి బహుమానం ఇవ్వబోతే, డబ్బుకి బదులుగా బడిపంతులు ఉద్యోగం కావాలని అడిగి ఉద్యోగంలో చేరినవాడు. నరసప్ప గారి వేషం, భాష అన్నీ ప్రత్యేకమైనవి. ఆయన పాండిత్యం పిల్లలకి పాఠాలు చెప్పేదీ, వాళ్లకి పరిక్షలు నిర్వహించేదీ కాదు. అయినప్పటికీ, కృత్యదవస్థ మీద బండి లాగించేస్తూ ఉంటాడు. ఆయన శిష్యులలో ఒకానొకడు రాజు (రచయిత) పెరిగి పెద్దై, బడి పంతులు ఉద్యోగంలోనే చేరతాడు.

కార్యార్దియై ఓ పల్లెటూరికి వెళ్ళిన రాజు, అనుకోకుండా ఒకరోజంతా అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. పుస్తకం చదవకపోతే రోజు గడవదు రాజుకి. ఆ పల్లెలో పుస్తకం కావాలంటే రాయదుర్గం నరసప్ప గారిని దర్శించాల్సిందే అంటాడు గృహస్తు. తనకి చదువు చెప్పిన మేష్టారు ఆ ఊళ్లోనే ఉన్నారని తెలిసిన రాజు, వెంటనే ఆయనింటికి బయలుదేరతాడు. మేష్టారు పొలానికి వెళ్ళారని చెబుతారు ఇంట్లో వాళ్ళు. ఉద్యోగం చేయాల్సిన మేష్టారు వ్యయసాయంలోకి దిగడం ఏమిటన్న ఆశ్చర్యాన్ని ఆపుకోలేని రాజు పొలానికి బయలుదేరతాడు. అక్కడ పాదుల మధ్యలో కనిపించిన నరసప్ప గారిని పలకరిస్తూ "హాలికులు కుశలమేనటండీ మేష్టరు గారూ?" అని అడుగుతూనే తన ప్రశ్నల్ని ఒక్కొక్కటిగా సంధించేస్తాడు.

రాజు చదువయిన కొద్ది కాలానికి నరసప్ప గారు ఉద్యోగం వదిలేశారు. అందుకు కారణం కొత్తగా వచ్చిన కుర్ర హెడ్మాస్టారు. అతడికి అయ్యవార్లు సక్రమంగా పాఠాలు చెప్పడం కన్నా తనకి లొంగి ఉండడం ముఖ్యం. ఆత్మాభిమానాన్ని వదులుకోలేని నరసప్ప ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రైతుగా కొత్త జీవితం మొదలు పెట్టారు. అదేమంత సులభం కాలేదు. ఎందుకూ అంటే, "మనిషి స్వభావానికీ, వాడు చేస్తున్న పనికీ సామరస్యం లేకపోతే, బ్రతుకు బ్రతుకంతా ఒక తీవ్ర సంఘర్షణగా పరిణమిస్తుందేమో" అంటారు. అయితే, ఇరుసుకీ, చక్రానికీ ఏనాటికీ ఘర్షణ తప్పదని తెలిసిన వాడూ, ఇరుసుకి కందెన వేసి ఘర్షణని అదుపులోకి తెచ్చుకోవచ్చన్న సూక్ష్మం గ్రహించిన వాడూ కాబట్టి ఆ సమస్యని ఆయన పరిష్కరించుకున్నాడు.

తన పొలంలో కొబ్బరి చెట్లనీ, అరటి చెట్లనీ, మామిడి తోటనీ, పండ్లు, పూల మొక్కలనీ శిష్యుడికి ఇష్టంగా పరిచయం చేశారు నరసప్పగారు. అయితే, అర్ధం చేసుకోడానికి రాజుకి కొంచం సమయం పట్టింది. అర్ధమైన మరుక్షణం తనూ ఉత్సాహంగా ఎన్నో ప్రశ్నలు వేశాడు. చీకటి పడే వరకూ సంభాషణ సాగించాడు. బంధువుల ఇంటికి వెళ్ళబోతున్న రాజుని ఆపి, ఆపూట తనతో భోజనం చేస్తే తప్ప వల్లకాదన్నారు నరసప్ప గారు. అంతేనా? భోజనానికి కూర్చోబోతూ ఓ ఆర్ద్రమైన కోరిక కోరారు కూడా. నరసప్ప గారు ఉపయోగించిన కందెననీ, ఆయన కోరిన కోరికనీ తెలుసుకోవాలంటే మధురాంతకం రాజారం కథా సంపుటాల్లో అందుబాటులో ఉన్న 'హాలికులు కుశలమా!' కథని చదవాల్సిందే.. కథ పూర్తిచేశాక రాయదుర్గం నరసప్ప గారిని మర్చిపోడం ఏమంత సులభం కాదు.

శుక్రవారం, నవంబర్ 27, 2015

సైజ్ జీరో

మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న సౌకర్యాలు, అందుబాటులోకి వస్తున్న కొత్త కొత్త ఆహార పదార్ధాలు.. వీటన్నింటి తాలూకు ఉమ్మడి ఫలితం అధికబరువు.. ఇంగ్లిష్ లో ఒబేసిటీ. బరువు తగ్గించే  సులువైన పరిష్కారాలెన్నో మార్కెట్ ని ముంచెత్తుతున్నాయి. వీటిని ఎంతవరకూ నమ్మడం? చాపకింద నీరులా త్వరత్వరగా విస్తరిస్తున్న ఈ సమస్యని ఇతివృత్తంగా తీసుకుని, చౌకబారు హాస్యాన్ని కాక సున్నితమైన భావోద్వేగాలని ఆలంబనగా చేసుకుని రూపుదిద్దిన సినిమా 'సైజ్ జీరో,' ..'సన్నజాజి నడుము' అన్నది ఉపశీర్షిక. ప్రధాన పాత్ర సౌందర్య అలియాస్ స్వీటీ ని అగ్రశ్రేణి కథానాయిక అనుష్క పోషించడం, కేవలం ఈ పాత్ర కోసమే బాగా బరువు పెరగడం వల్ల షూటింగ్ నాటినుంచీ ఆసక్తి పెంచిన సినిమా ఇవాళే విడుదలయ్యింది.

రాజరాజేశ్వరి (ఊర్వశి) గారాబుపట్టి స్వీటీ (అనుష్క). అందమైన స్వీటీ ఏ విషయాన్నీ పెద్దగా సీరియస్ గా తీసుకోదు. తల్లితోపాటు తమ్ముడు యాహూ (భారత్), తాతయ్య (గొల్లపూడి) ఆమె కుటుంబం. తండ్రి లేని లోటు లేకుండా పిల్లల్ని పెంచుతున్న రాజరాజేశ్వరికి స్వీటీ పెళ్లి ఓ సమస్యగా మారింది. ఓ ఎన్నారై ని తన అల్లుడిగా చేసుకోవాలని కలలుగనే రాజరాజేశ్వరి కల తీరడానికి ఉన్న ఏకైక అడ్డంకి స్వీటీ బరువు. పెళ్ళికొడుకులు తనని తిరస్కరిస్తున్నా బరువు తగ్గడాన్ని సీరియస్ గా తీసుకోదు స్వీటీ. అంతేకాదు, ఒకానొక ఎన్నారై పెళ్ళికొడుకు అభి (ఆర్య) ని తనే తిరస్కరించి, అటుపై అతనితో స్నేహం చేస్తుంది.

కొన్ని పరిస్థితుల కారణంగా బరువు తగ్గి తీరాలని బలంగా నిర్ణయించుకున్న స్వీటీ అందుకోసం ఎలాంటి ప్రయత్నాలు చేసింది, వాటి తాలూకు పరిణామాలు ఏమిటన్నదే కనిక కోవెలమూడి రాసిన 'సైజ్ జీరో' కథ. ఆమె భర్త ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమాకి దర్శకుడు. మామూలుగా మొదలై, ఒక్కో సీన్ కీ ఆసక్తిని పెంచుకుంటూ వెళ్లి, 'అప్పుడే ఇంటర్వల్ వచ్చేసిందా?' అనిపించిన దర్శకుడు, రెండోసగానికి వచ్చేసరికి కొంత తడబడ్డాడేమో అనిపించింది. చెప్పదలచుకున్న పాయింట్ మొత్తాన్ని రెండో సగం కోసం దాచేసుకోడం, చెప్పాలనుకున్న విషయాన్ని కన్విన్సింగ్ గా చెప్పడంలో తడబాటు వల్ల ప్రధమార్ధం ముందు, ద్వితీయార్ధం తేలిపోయినట్టుగా అనిపించింది. మరికొంచం జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది.


ఇది పూర్తిగా అనుష్క సినిమా. ఒక నటిగా తనకి దొరికిన పాత్రని ఆమె ఎంత అంకితభావంతో చేస్తుందో చెప్పే మరో ఉదాహరణ 'సైజ్ జీరో.' బరువు పెరగడం మాత్రమే కాదు, స్వీటీ పాత్రలోకి అక్షరాలా పరకాయ ప్రవేశం చేసేసింది అనుష్క. నిస్సందేహంగా ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. నాయికని లక్ష్యం దిశగా నడిపించే పాత్ర హీరోది. అయితే, ఈ హీరో పాత్రకి తనకంటూ ఓ లక్ష్యం లేనివిధంగా చిత్రించారు. మొదటి సగంలో స్వచ్చ భారత్ డాక్యుమెంటరీలు తీసే ఎన్నారై, రెండో సగానికి వచ్చేసరికి పూర్తిగా నాయికకి సహాయకుడిగా మారిపోయాడు. హీరో పాత్రని కూడా శక్తివంతంగా రాసుకుని ఉంటే, సినిమా మొత్తం ఒకే టెంపో తో నడిచి ఉండేదేమో.

అనుష్కతో పాటు ఊర్వశికీ, గొల్లపూడికీ మంచి పాత్రలు దొరికాయి. ఒక్క పాట మినహా కీరవాణి సంగీతంలో గుర్తుపెట్టుకోడానికి ఏమీలేదు. రి-రికార్డింగ్ కి మంచి అవకాశం ఉన్న సన్నివేశాలు చాలానే ఉన్నా, కీరవాణి ఎందుకో స్పందించలేదు మరి. రెండు సన్నివేశాల్లో కనిపించిన బ్రహ్మానందం పాత్రని కథలో అంతర్భాగం చేయలేదు. పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి చెరో సీన్లోనూ కనిపించారు. ప్రతినాయకుడిగా ప్రకాష్ రాజ్ సినిమా ద్వితీయార్ధాన్ని ఆక్రమించేశాడు, తన మార్కు 'అతి' తో సహా. నాగార్జున, రానా, తమన్నా, రకుల్ ప్రీత్ లు అతిథి పాత్రల్లో తెరమీద మెరిశారు. నాగార్జున మినహా మిగిలిన వాళ్ళకి డైలాగులు లేవు. సోనాల్ చౌహాన్, అడవి శేష్ పాత్రల్లో స్పష్టత లోపించింది. కెమెరా పనితనం (నిరవ్ షా) కంటికింపుగా ఉంది. ఎడిటర్ (ప్రవీణ్ పూడి) ద్వితీయార్ధంలో తన కత్తెరకి పెద్దగా పని చెప్పలేదు. కిరణ్ సంభాషణల్లో అక్కడక్కడా మెరుపులున్నాయి.

వైవిధ్యం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న సినిమా నటీనటుల పుణ్యమా అని సిక్స్ ప్యాకులు, సైజ్ జీరోలు వాడుక భాషలో భాగమైపోయాయి కాబట్టి ఇంగ్లీష్ లో ఉన్న సినిమా టైటిల్ ఎంతమందికి అర్ధమవుతుంది అన్న ప్రశ్న రాదు. సెన్సార్ 'యు/ఏ' ఇవ్వాల్సినంత ఏముందో అర్ధం కాలేదు. మొత్తం మీద చూసినప్పుడు, ప్రధమార్ధం ఒక సినిమా, ద్వితీయార్ధం మరో సినిమాలాగా అనిపించింది. దీనికి తోడు, అనుష్క కూడా ఇంటర్వల్ తర్వాత ఉన్నట్టుండి కళ్ళజోడు తీసేసింది. 'సినిమాలో ఏమీ లేదా?' అంటే లేదని కాదు, ఓ గొప్ప సినిమా అవడానికి అవకాశం ఉండీ, మంచి ప్రయత్నం గానే మిగిలిపోయిందన్న అసంతృప్తి, అంతే. మేథావుల మాట ఎలా ఉన్నా, వైవిధ్య భరితమైన సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు చూడాల్సిన సినిమా ఇది.

బుధవారం, నవంబర్ 25, 2015

కోనసీమ రైలు

మా కోనసీమ నేల మీద సైకిళ్ళు, మోటారు సైకిళ్ళ మొదలు, లారీలు, కార్లు, బస్సుల వరకూ అనేక రకాల వాహనాలు తిరుగాడతాయి. మా గాలిలో హెలికాప్టర్లు, అప్పుడప్పుడూ దారితప్పిన విమానాలూ విహరిస్తూ ఉంటాయి. అక్కడ కలికానిక్కూడా కనిపించందల్లా రైలుబండి ఒక్కటే. కూ అని కూత పెట్టుకుంటూ వచ్చే రైలు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు మా కోనసీమ ప్రజ. ఏళ్ళ తరబడి మమ్మల్ని ఊరిస్తూ దూరం నుంచే వెళ్లిపోతోందే తప్ప, కోనసీమ ముఖద్వారం దాటి లోపలి రావడం లేదు రైలుబండి.

చిన్నప్పుడు ఎక్కడికైనా ప్రయాణం అంటే సరదాగానే ఉన్నా, కిక్కిరిసిన బస్సులు, మెటాడోర్లు చూసి చిరాకొచ్చేసేది. బహు చిన్నప్పుడే రైల్లో భాగ్యనగర యాత్ర చేసొచ్చేనేమో, 'మన దగ్గరా రైలుంటే బాగుండు కదా' అనిపించేసేది. ఏదన్నా అనిపిస్తే వెంటనే చెప్పేది తాతయ్యతోనే కదా. ఆ అలవాటు చొప్పున ఈ మాటా ఆయన చెవిన వేశాను. "మనది బురద నేలరా. రైలు చాలా బరువుగా ఉంటుంది కదా.. పట్టాలున్నా, ఆ బరువుకి నేలలో కూరుకుపోతుంది," అనేయడంతో రైలాశని నిరాశ చేసేసుకున్నాను. తాతయ్య చెప్పింది నిజం కాదని తెలిసేనాటికి, రైలు రావడం అంత సులభం కాదన్న తత్త్వం బోధపడింది.

నాతో సహా, మా కోనసీమ ప్రజలందరిలోనూ రైలు కోరికని చమురు పోసి ఒత్తి వేసి వెలిగించిన వాడు గంటి మోహన చంద్ర బాలయోగి. చిన్న పదవులతో రాజకీయ జీవితం మొదలు పెట్టి, ఏకంగా లోక్ సభ స్పీకర్ స్థానానికి ఎదిగిన బాలయోగి, పుట్టిన ప్రాంతాన్ని మర్చిపోకుండా కోనసీమ రైలు ప్రాజెక్టు కలని నిజం చేసే ప్రయత్నాలు ఆరంభించాడు. ముందుగా కాకినాడ-కోటిపల్లి మధ్య రైలు మార్గం వేయించి, అటుపై కోటిపల్లి-నరసాపురం రైల్వే లైనుకి నాటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ చేత శంకుస్థాపన చేయించేశాడు.

రాబోయే రైలుబండికి స్వగతం పలకడానికి మేమందరం సిద్ధపడుతూ ఉండగా ఆశనిపాతం లాంటి కబురు. బోల్డంత భవిష్యత్తు ఉన్న బాలయోగిని అకాల మరణం పలకరించింది, అది కూడా అత్యంత అనూహ్యంగా. (ఈ సంఘటన గురించి ఇప్పటికీ రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి, కోనసీమలో). కేంద్రంలో పట్టించుకునే నాథుడు లేకపోవడంతో రైల్వే లైను కథ మళ్ళీ మొదటికొచ్చింది. నాటినుంచీ అడపా దడపా రైల్వే లైను డిమాండు తెరమీదకి వచ్చి వెడుతూనే ఉంది. అంతేకాదు, 'కోనసీమకి రైలు మార్గాన్ని సాధిస్తా' అని ప్రజలకి వాగ్దానం చేయని నాయకుడు లేడు. ప్రాజెక్టు కోసం నడుం కట్టిన పుణ్యాత్ముడూ లేడు.


శిలాఫలకం వెలిసిన పదమూడేళ్ళకి ఇదిగో ఇప్పుడు మళ్ళీ రైల్వే లైను ఉద్యమం ఊపందుకుంటోంది. ఇన్నాళ్ళుగా పోరాడుతున్న వాళ్లకి తోడుగా యువతరం కదిలొచ్చింది. కోనసీమ యువ రైల్వే సాధన సమితి పేరుతో దేశ విదేశాల్లో ఉన్న కోనసీమ వాళ్ళందరినీ ఫేస్బుక్, వాట్సాప్ ల ద్వారా ఏకతాటి మీదకి తెస్తోంది. పిల్లలూ, పెద్దలూ కలిసి ఏర్పాటు చేసుకున్న జాయింట్ యాక్షన్ కమిటీ నవంబర్ 27 నుంచి నాలుగు రోజుల పాటు రైల్వే లైను కోసం ఎంపిక చేసిన యాభై ఐదు కిలోమీటర్ల మార్గంలో పాదయాత్ర చేయబోతున్నారు. ఇది కేవలం ప్రారంభం అంటున్నారు మరి.

మాన్య మంత్రిణి మమతా బెనర్జీ శంకుస్థాపన చేసిన రోజున అంచనా వ్యయం ఆరువందల కోట్లు. అదీనాటికి పెరిగి పెద్దదై పద్దెనిమిది వందల కోట్ల పైచిలుకుకి లెక్క తేలింది. 'ఈ ప్రాజెక్టు మీద ఇంత సొమ్ము పెడితే తిరిగి వస్తుందా?' అని రైల్వే వారి సందేహమట. పోరాట కమిటీ వాళ్ళు ఆ లెక్కలూ తీశారు. ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పక్కన పెడితే, ప్రస్తుతం లారీల ద్వారా రవాణా చేస్తున్న కొబ్బరి, అరటి, చేపలు, రొయ్యలు తదితరాలని రైలు రవాణాకి మళ్ళించడం అటు ఎగుమతి దారులకి ఇటు రైల్వే కి ఉభయ తారకంగా ఉంటుందిట.

కోనసీమ రైల్వే టూరిజం అని ఒకటి ప్రారంభిస్తే, దేశ విదేశాల్లో ఉన్న టూరిస్టులని ఆకర్షించవచ్చునట. దానా, దీనా ఐదేళ్ళలో ప్రాజక్టు వ్యయం వెనక్కి వచ్చేస్తుంది అంటున్నారు. కాలపరిమితి కొంచం అటూ ఇటూ అవ్వచ్చేమో కానీ, పెట్టిన సొమ్ము బూడిదలో పోసిన పన్నీరయ్యే ప్రశ్నే లేదు. రైల్వే బడ్జెట్ తయారీకి మూడు నెలలు ముందుగా మొదలవుతున్న ఈ ఉద్యమాన్ని దఫదఫాలుగా పెంచుకుంటూ వెళ్లి, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సొమ్ము విడుదల చేయించే లక్ష్యంతో పనిచేస్తున్నారు కార్యకర్తలు.

అన్ని రాజకీయ పార్టీల మద్దతూ కూడగట్టి చేస్తున్న ఈ ఉద్యమం, ప్రభుత్వాన్ని ఏ మేరకి కదిలించగలదు అన్నది ప్రశ్న. నిధుల విషయంలో తొలినుంచీ ఆంధ్ర ప్రదేశ్ ని చిన్న చూపు చూస్తున్న కేంద్రం, బీహార్ ఫలితం చూశాకన్నా మనసు మార్చుకోక పోతుందా అని ఓ చిన్న ఆశయితే ఉంది. మాన్య ముఖ్యమంత్రి వర్యులకి ఎటూ టూరిజం ఆరోప్రాణం కాబట్టి అందుకోసమైనా వారీ ప్రాజెక్టు విషయంలో కలగజేసుకోవచ్చు. మా రైలుబండి కల తీరనూ వచ్చు. పోరాటం శాంతియుతంగానూ, శక్తివంతంగానూ సాగాలనీ, విజయం సాధించాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూ...

గురువారం, నవంబర్ 19, 2015

వసంతగీతం

లింగయ్య పద్దెనిమిదేళ్ళ కుర్రాడు. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాడు. తల్లి గట్టుమల్లు కి కళ్ళు కనిపించవు. అన్న రాయమల్లు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. వదిన గంగమ్మ తన ఈడుదే. అన్న లాగా, ఊళ్ళో మిగిలిన తన ఈడు కుర్రాళ్ళ లాగా పాలేరు పని చేయడం ఇష్టం లేదు లింగయ్యకి. అలాగని వేరే ఏం చెయ్యాలో తెలీదు. వయసొచ్చిన కొడుకు ఏపనీ చేయకుండా ఇంట్లో కూర్చోడం తల్లికి ఏమాత్రం నచ్చక, లింగయ్య ఎదురు పడినప్పుడల్లా తిట్లందుకోడం మొదలుపెట్టింది. వదిన ఎదురుగా తల్లి తనని తిట్టడం భరించలేని లింగయ్య ఇంట్లోనుంచి పారిపోయి అన్నల్లో చేరిపోయాడు. ఆ తర్వాత అతని కథా,  ఆ కుటుంబం కథా ఎన్ని మలుపులు తిరిగిందన్నదే పాతికేళ్ళ క్రితం ప్రచురితమైన 'వసంతగీతం' నవల.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలో జరిగిన నక్సల్బరీ పోరాటాల్లో 'ఇంద్రవెల్లి' ఘటన ప్రత్యేకమైనది. పోడు భూములపై సాగు హక్కుని సాధించుకోడం కోసం వందలమంది గిరిజనులు 1981 ఏప్రిల్ 20 న సమావేశం కావడం, అనుమతి లేదన్న కారణాన్ని,  పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం ఉందన్న నెపాన్నీ చూపి పోలీసులు కాల్పులు జరపడం, అటుపై ఆదిలాబాద్ జిల్లాలో నక్సల్బరీ ఉద్యమం మరింతగా ఊపందుకోడమూ చరిత్ర. 'ఇంద్రవెల్లి ఘటన' జరిగిన మూడేళ్ళకి మొదలవుతుంది 'వసంతగీతం' నవలలో కథ. లింగయ్య దళంలో చేరే నాటికి దళం ఆదిలాబాద్ అడవుల్లో అడుగు పెట్టి ఐదేళ్ళు గడుస్తుంది. తొలినాళ్ళ ఇబ్బందుల్ని అధిగమించి గిరిజనంలోకి మరింతగా చొచ్చుకుపోయే ప్రయత్నాల్లో ఉంటుంది.

మరోపక్క, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ పై విజయవిహారం చేసి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఏకాభిప్రాయానికి వచ్చిన ఏకైక అంశం 'నక్సల్ అణచివేత.' అడివంచు పల్లెల్లో పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, సిబ్బంది పెంపు, ఇన్ఫార్మర్ వ్యవస్థ ఏర్పాటు, నక్సలైట్ల తలలకి వెలలు నిర్ణయించడం మొదలు, ఏజెన్సీ గిరిజనులకోసం లెక్కలేనన్ని సంక్షేమ పధకాలు ప్రకటించడం వరకూ ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్న తరుణంలోనే, గిరిజనులతో మమేకమై వాళ్ళని హక్కులకోసం పోరాటానికి సన్నద్ధం చేసే కార్యక్రమంలో నిమగ్నమై పనిచేయడం మొదలు పెడతాయి నక్సల్ దళాలు.

వివిధ కాలాల్లో అడివి రూపురేఖలు, దళం సభ్యుల వ్యక్తిగత జీవితాలు, సమిష్టి జీవితం, లక్ష్యం కోసం పనిచేసే క్రమంలో ఎదురయ్యే అవాంతరాలు, ఎన్కౌంటర్లలో పోరాట సహచరులని కోల్పోవడం లాంటి ఎదురు దెబ్బలు, అంతలోనే వాటినుంచి తేరుకుని పోరాటానికి పదును పెట్టడం.. వీటన్నింటీ దగ్గరనుంచీ చూస్తాడు 'కామ్రేడ్ గట్టయ్య' గా మారిన లింగయ్య. సోదరభావంతో కలిసి పనిచేసే దళం నుంచీ, మగవాళ్ళతో సమంగా కష్టపడే కామ్రేడ్ రాధక్క నుంచీ ఎంతో స్ఫూర్తి పొందుతాడు. అయితే,  ఊహించని విధంగా అతని కుటుంబానికి ఎదురైన ఆటుపోట్లు గట్టయ్యని తిరిగి లింగయ్య గా మారేలా చేస్తాయి. దళాన్ని విడిచి ఊరికి తిరిగి వెళ్ళిన లింగయ్య దళంలో అలవడిన కొత్త దృష్టితో తన పల్లెని పరిశీలించడం మొదలుపెడతాడు.


అడివిలో ఉంటూ గట్టయ్యగా తను చేసిన ఉద్యమం ఫలితం తన పల్లెమీద ఏమేరకి ఉన్నదన్నది అతను స్వయంగా తెలుసుకోగలుగుతాడు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో వచ్చిన మార్పు పల్లె రాజకీయాల్లోనూ ప్రతిబింబిస్తుంది. ఆ ఊరి జమీందారు, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి మారడానికి సిద్ధ పడతాడు. గిరిజనులతో స్నేహం నటిస్తూనే,  పోలీసులని ఉపయోగించుకుని తనకి కావలసిన పనులు జరిపించుకునే కొత్త తరహా రాజకీయ చాణక్యానికి తెరతీస్తాడు. ఊళ్ళో జరిగిన ఓ కేసులో పోలీసుల చేతికి చిక్కిన లింగయ్యకి పోలీసుల పనితీరుని దగ్గరనుంచి చూసే అవకాశం వస్తుంది. తనకి తెలియకుండానే పోలీసుల పనితీరునీ, దళం పనితీరునీ బేరీజు వేసుకుంటాడు. దళం సభ్యుల మధ్య ఉన్న సోదరభావం పోలీసుల్లో లేకపోవడం అతని దృష్టిని దాటిపోదు. లింగయ్య తన జీవితాన్ని ఎక్కడ వెతుక్కున్నాడన్నది నవల ముగింపు.

'వసంతగీతం' నవల తొలి ముద్రణ 1990 ఆగస్టులో జరిగింది. రచయితపేరు పులి ఆనంద్ మోహన్. డిసెంబర్ 2013 లో జరిగిన మలిముద్రణ నాటికి రచయిత అల్లం రాజయ్య తన అసలు పేరుని ప్రకటించుకోగలిగారు, "ఆ నాటి పరిస్థితుల కారణంగా ఈ నవల మొదటి ముద్రణ పులి ఆనంద్ మోహన్ పేరుతో అచ్చయింది" అన్న వివరణతో సహా. ఎనభైల కన్నా తొంభైల్లో, అప్పటికన్నా ఇప్పుడు మరింతగానూ పరిస్థితులు మారాయి. అన్నిరంగాలలోనూ పెనుమార్పులు తోసుకు వచ్చాయి. అయితే, 'భూమి' సమస్య మాత్రం అలాగే ఉంది. నాటి సమస్య వ్యవసాయ భూముల  పంపిణీ అయితే, నేటి సమస్య పరిశ్రమల బారినుంచి భూముల రక్షణ. మరోపక్క, మావోయిష్టులు గా పేరుమార్చుకున్న నక్సలైట్ల గ్రూపుల్లో ఎన్నో చీలికలు వచ్చాయి.

మావోయిష్టుల షెల్టర్ జోన్ అయిన అడవుల విస్తీర్ణం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తగ్గుతోంది. పోలీసు బలగం పెరిగింది. నాటితో పోలిస్తే, గిరిజనుల మద్దతు ఏమేరకు ఉన్నదన్నది ప్రశ్నార్ధకం. ఈ నేపధ్యంలో  'వసంతగీతం' చదవడం ఎన్నో ప్రశ్నలని మిగిల్చింది. వరవరరావు రాసిన నలభై పేజీల ముందుమాటలో కొన్ని ప్రశ్నలకి జవాబులు దొరికినట్టే అనిపించింది. 'లింగయ్య మరెవరో కాదు రచయిత రాజయ్యే నేమో' అనిపించేంత సహజంగా ఉంది పాత్రచిత్రణ, అనేకానేక సన్నివేశాల కూర్పూ. "హెమండార్ఫ్ సంస్కరణలు బూటకమని నిరూపించాగలిగాం" అని ఓ సందర్భంలో ఓ దళ  సభ్యుడి చేత చెప్పించిన రచయిత, ఆ విషయాన్ని గురించి మరింత వివరంగా చెబుతారని నవల చివరికంటా ఎదురు చూసినా ఫలితం లేదు. (హెమండార్ఫ్ సంస్కరణల గురించి ఫణికుమార్ రాసిన 'గోదావరి గాథలు' పుస్తకంలో చదవొచ్చు).

ఒకే ఒక్క సన్నివేశంలో ఒక కేంద్రమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి భేటీ (పీవీ నరసింహారావు-ఎన్టీఆర్) మినహా మిగిలిన కథంతా అడవులు, తండాలు, పోలీసు స్టేషన్లలోనే జరుగుతుంది. కొన్ని కొన్ని  సన్నివేశాలు కేవలం చదువుతున్నట్టు కాక, స్వయంగా చూస్తున్నట్టు అనిపించడం రచయిత ప్రతిభే. "ఆదిలాబాద్  జిల్లా పార్టీ నాయకత్వంలో ఒక దళం దైనందిన జీవితం, పోరాట ఆచరణ, త్యాగాలు చిత్రించిన రాజకీయార్ధిక చారిత్రక నవల ఇది. రష్యా, చైనా విప్లవాల కాలంలో వెలువడిన యుద్ధ కాలపు నవలల వంటి ఒక ప్రామాణిక (క్లాసికల్) నవల ఇది" అంటారు వరవరరావు. ఎన్ కౌంటర్లలో పాల్గొన్న రెండో పక్షమైన పోలీసుల నుంచి, అదికూడా కింది స్థాయి ఉద్యోగులైన కానిస్టేబుళ్ల నుంచి వారి అనుభవాలు రచనలుగా వస్తే బాగుండుననిపించింది. నాణేనికి రెండో వైపుని కూడా సంబంధీకులనుంచి వినడం అవసరం కదా. ('వసంతగీతం,' పర్ స్పెక్టివ్స్ ప్రచురణ, పేజీలు 420, వెల రూ. 250, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ద్వారా లభ్యం).

సోమవారం, నవంబర్ 16, 2015

అర్జున మంత్రం -2

(మొదటి భాగం తర్వాత)

ఏం చెయ్యాలో తోచక చుట్టూ చూస్తున్నా. కుర్చీ పక్కనే ఉన్న పెద్ద కిటికీ లోంచి ఇంటి ఆవరణ చాలావరకూ కనిపిస్తోంది. వీధి వైపు ప్రహరీ లోపల వరసగా అరటి, కొబ్బరి చెట్లు. సందు పొడవునా కాయగూర మళ్ళు, పూల మొక్కలు. పూర్వకాలపు మండువా లోగిలి పెంకుటిల్లే అయినా చాలా దిట్టంగా ఉంది కట్టడం. లోపల ఎన్ని గదులున్నాయో తెలియదు కానీ, ఎక్కడా శబ్దం అన్నది వినిపించడం లేదు.

అంత నిశ్శబ్దంలో ఒక్కసారిగా నా మొబైల్ రింగ్ అయ్యేసరికి ఉలికిపడ్డాను. మేఘన కాల్. 'హనీకి లేక్టోజెన్ పేకెట్ ఒకటి' తీసుకురమ్మని. "ఓ పేకెట్ ఉంది కానీ, మరొకటి దగ్గరుండడం సేఫ్ సైడ్ కదా.." అంటూ, త్వరగా వచ్చేయమని చెప్పి కాల్ కట్ చేసింది.

హనీకి ఇప్పుడు తొమ్మిది నెలలు. పుట్టినప్పుడు అచ్చం మేఘనలాగే ఉండేది కానీ, ఇప్పుడు నా పోలికలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏడాది నిండే వరకూ పిల్లలు ఎవరి పోలికో చెప్పలేం అంటూ ఉంటుంది అమ్మ. నిజమే అని నిరూపిస్తోంది హనీ. నా కూతురని చెప్పడం కాదు కానీ భలే బుద్ధిమంతురాలు. ఆ వయసు పిల్లల్లో ఉండే తిక్క, రాత్రుళ్ళు జాగారం చేయించడం లాంటివి అస్సలు లేవు. ఎప్పుడో తప్ప తిక్క పెట్టదు.

'హనీ ఇంత బుద్ధిగా కాకుండా బాగా అల్లరిచేసే పిల్లయినా బాగుండేదేమో' అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అసలు శ్రీకర్ పెళ్ళికి నేనొక్కడినే వద్దామనుకున్నాను. 'చంటి పిల్లతో అంతదూరం ప్రయాణం కష్టం ' అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాను కానీ, వాడి దగ్గరా నా ఆటలు? మొత్తం నాలుగు రోజుల ప్రయాణానికి అన్ని ఏర్పాట్లూ చేసేశాడు. మేఘన కూడా ప్రయాణానికి సిద్ధ పడడంతో ఇక నేనేమీ మాట్లాడేందుకు  లేకపోయింది.

పెళ్లి కుదిరినప్పటినుంచీ సహజంగానే వాడు చాలా ఎక్సైట్ అవుతున్నాడు. "పల్లెటూరి సంబంధం అంటే అమ్మాయి మరీ మందాకినిలా కాకపోయినా, కనీసం ప్రమద్వరలా అన్నా ఉంటుందనుకున్నానురా.. ఈమె చూడబోతే తరళ పోలికలతో పుట్టినట్టుంది," అన్నాడు ఆ మధ్య ఒకరోజు. నేనేమీ మాట్లాడకుండా ఓ ఫోన్ నంబర్ ఇచ్చాను వాడికి.

"యండమూరి నెంబర్రా.. నీకు సరిపోయేట్టుగా ఓ హీరోయిన్ ని సృష్టించి ఇమ్మని అడుగు.." అన్నాను. వాడిక్కోపం వచ్చి ఓ రోజంతా మాట్లాడడం మానేశాడు. అది చాలా పెద్ద శిక్ష నాకు. ఆ విషయం వాడికీ తెలుసు.

 స్టేట్స్ నుంచి రాగానే నన్ను రిసీవ్ చేసుకుంటూ, "అమెరికాలో జెండా పాతి వచ్చావా?" అని కన్ను కొట్టాడు. తల అడ్డంగా ఊపాను. "అసలు నిన్ను యూఎస్ పంపిన వాణ్ణనాలి," అంటూ నవ్వేశాడు వాడు.

నీళ్ళు తెచ్చిచ్చిన కుర్రాడు కాఫీతో వచ్చి "తాతయ్యగారు వచ్చేస్తున్నానని చెప్పమన్నారండీ," అని చెప్పి వెళ్ళాడు. కాఫీ తాగుతూ మళ్ళీ శ్రీకర్ ని గుర్తు చేసుకున్నాను. నా పెళ్ళిలో హడావిడంతా వాడిదే. ఒక్క క్షణం నన్ను విడిచిపెట్టలేదు.

పెళ్ళైన మర్నాడు మధ్యాహ్నం నిద్రపోయి అప్పుడే లేచాను. వాడు హడావిడిగా నా గదికొచ్చి, లేపీ ఆన్ చేసి, కూడా తెచ్చిన మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేశాడు. తాతగారి పాటలతో ప్రత్యేకంగా చేసిన వీడియో. 'మౌనమేలనోయి' మొదలు 'కాయ్ లవ్ చెడుగుడు' వరకూ సెలెక్టెడ్ సాంగ్స్.

"చూసి బాగా ప్రిపేర్ అవ్వు.." సీరియస్ గా చెప్పాడు. మళ్ళీ వాడే "గురువుగారిదో నవలుంది, 'ప్రేమ' అని.. వేదసంహిత-అభిషేక్ ల మధ్య రొమాన్స్.. గొప్పగా ఉంటుందిలే.. తెచ్చిస్తాను క్విక్ బ్రౌజ్ చేద్దూగాని..."

వాణ్ని చెయ్యి పట్టుకుని ఆపి చెప్పాను "చాలబ్బాయ్.. టీవీ చూసి వ్యవసాయం, పుస్తకాలు చదివి సంసారం.. చేసినట్టే.." వాడు తన చెయ్యి లాక్కుని, రెండు చేతులూ నడుం మీద పెట్టుకుని "ఒక్క రోజులో ఎంత పెద్దవాడివి అయిపోయావ్ రా? ఈ లెక్కన రేపు తెల్లారేసరికి ఇంకెంత పెద్దవాడివి అయిపోతావో..." అంటూండగానే, చూపుడు వేలితో గుమ్మం వైపు చూపించాను కొంచం సీరియస్ గా.

అదొకటుంది వాడిదగ్గర, గీత దాటడు అలాగని పూర్తిగా వదిలెయ్యడు. మేఘన లేబర్ లో ఉన్నప్పుడైతే వాడు ఒక్క క్షణం కూడా నన్ను వదల్లేదు. డాక్టర్ ఇచ్చిన డేట్ కన్నా ముందే మేఘన ని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. అమ్మా నాన్నా అప్పటికప్పుడు హడావిడిగా బయల్దేరారు. రాడానికి టైం పడుతుంది.

మేఘన పేరెంట్స్ తనని చూసుకుంటున్నారు. నార్మల్ అవుతుందని ఒక రోజంతా వెయిట్ చేయించారు డాక్టర్. ఇరవై నాలుగు గంటల పాటు భయంకరమైన లేబర్.. ఆ పెయిన్స్ ని అనుభవించిన మేఘన మర్చిపోతుందేమో కానీ, విన్న నేను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. శ్రీకర్ రోజంతా ఫోన్లోనే ఉన్నాడు నాతో. ఆమె మీద నాకు మొదలైన కన్సర్న్, టైం గడిచే కొద్దీ నామీద నాకు అసహ్యం కలిగే వరకూ వచ్చింది.

"ఆడవాళ్ళందరికీ తప్పదురా ఇది.. సృష్టి ధర్మం.. తను బాధ పడుతోంది కరెక్టే.. కానీ, నువ్వు ఇంత బాధ పడ్డం మాత్రం.. కరెక్ట్ కాదు.." వాడు చెబుతూనే ఉన్నాడు. మర్నాడు అమ్మా, నాన్నా రావడం, మేఘనకి డాక్టర్ సిజేరియన్ చేయడం ఒకేసారి జరిగాయి. ఆమెని కళ్ళెత్తి చూడ్డానికి కొంత సమయం పట్టింది నాకు.

హనీకి మూడో నెల వచ్చాక చెకప్ కోసం మేఘనని గైనిక్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఫార్మాలిటీస్ పూర్తి చేసి "మీరు మళ్ళీ మొదలుపెట్టొచ్చు.." ఎటో చూస్తూ అభావంగా చెప్పింది మా ఇద్దరికీ. నాకు అర్ధమయినా, కానట్టుగా ఉండిపోయాను. మేఘనని  తాకాలంటే ఏదో సంకోచం.

దాదాపు నెల్లాళ్ళ తర్వాత ఈ విషయాన్ని పసిగట్టాడు శ్రీకర్. నేరుగా నేనుండే చోటికి వచ్చేశాడు. ఇంటికి మాత్రం రానని చెప్పేశాడు. ఆ రాత్రి రెస్టారెంట్లో డిన్నర్. టేబుల్ దగ్గర కూర్చుంటూనే నేరుగా విషయంలోకి వచ్చేశాడు. వాడిదగ్గర నాకు దాపరికం ఏముంది? బీర్ బదులుగా విస్కీ ఆర్డర్ చేసి కాసేపు ఆలోచనలో ఉండిపోయాడు. నేను ఫోన్లో ఎఫ్బీ అప్డేట్లు చెక్ చేసుకుంటూ ఉండగా చాలా సీరియస్ గా మొదలుపెట్టాడు.

"మేఘన విషయం నువ్వు చాలా కన్వీనియంట్ గా మర్చిపోతున్నావు.. నీకొద్దు సరే, మరి తనకి?" వాడి ప్రశ్నకి జవాబు లేదు నాదగ్గర. "అండ్, ఈ వైరాగ్యం తాత్కాలికం.. ఇందుకోసం మీ ఇద్దరిమధ్యా దూరం పెరగకూడదు.." కళ్ళెత్తి చూశానోసారి.

"పెళ్లి, సంసారం నాకేమాత్రం తెలియని విషయాల్రా.. కానీ ఒకటి మాత్రం తెలుసు. మగాడికి బాధ్యతలు ఉంటాయి.. అవి నెరవేర్చడంలో ఒక్కోసారి ఇష్టంతో పని ఉండకూడదు.." కళ్ళముందు మెరుపులు మెరిశాయి నాకు. విస్కీ సిప్ చేస్తున్నాం ఇద్దరం.

"ఇంకొక్క స్మాల్ పెగ్ కి మాత్రమే పర్మిషన్ నీకు. ఫ్రెష్ అయిపోతావు పూర్తిగా.. ఇంటికెళ్ళు.. మొదలుపెట్టు.. ఒక్కసారి మొదలైతే..." మాటల కోసం వెతుక్కోడానికి ఆగాడు. విస్కీతో పాటు, వాడి మాటలూ పనిచేశాయి. కానీ, ఆవేళ రాత్రి మేఘన నన్ను బలంగా తోసేసి, హనీని పక్కలోవేసుకుంది. నిద్రపోలేదు, నిద్ర నటించింది.

మర్నాడు నేను ఆఫీస్ కి వెళ్లేసరికి రిసెప్షన్లో ఎదురు చూస్తున్నాడు శ్రీకర్. కేంటీన్ కి తీసుకెళ్ళి జరిగింది చెప్పాను. "నాకేమీ అర్ధం కావడం లేదురా.. కానీ, ప్రతీ సమస్యకీ పరిష్కారం ఉంటుంది.. డోంట్ వర్రీ.. ఆలోచిద్దాం.. నాకిప్పుడు ఫ్లైట్ టైం అవుతోంది.." అంటూ వెళ్ళిపోయాడు.

మేఘన ధోరణిలో ఏ మార్పూ లేదు. ఆ ఒక్క విషయం తప్ప, భూమ్మీద సమస్త విషయాలూ మాట్లాడుతోంది. పరిష్కారం వెతుకుతూ ఉంటే, సైకియాట్రిస్ట్ దొరికాడు. ఇద్దరి మధ్యా విషయం కాబట్టి, కౌన్సిలింగ్ లో మేఘన కూడా ఉండాలన్నాడు. ఆ మాట వింటూనే ఇంతెత్తున లేచింది మేఘన. కౌన్సిలింగ్ కి రాకపోగా, నాతో మాటలు తగ్గించేసింది. ఐదార్నెల్లుగా అశాంతి పెరుగుతోందే తప్ప తగ్గడంలేదు.

"ఈ వైరాగ్యం తాత్కాలికం" ఎంత కరెక్ట్ గా చెప్పాడో శ్రీకర్!! 'అన్నీ ఉండీ ఏంటిదీ?' అనిపించని రోజు లేదు. అమ్మా, నాన్నలతో నేను కల్లో కూడా ఈ విషయం మాట్లాడలేను.

వాడి పెళ్లి హడావిడిలో ఉంటూ కూడా నాగురించి ఆలోచిస్తున్నాడు శ్రీకర్. "సోమయాజిగారనీ.. ఆ ఏరియా లో పెద్ద పేరుందిట్రా.. సిటీల్లో వాళ్ళలాగా కమర్షియల్ కాదు.. భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పేస్తారట.. అపాయింట్మెంట్ గొడవా అవీ ఏవీ ఉండవు.. నేరుగా ఇంటికి వెళ్లి కలవడమే..ఓ ప్రయత్నం చేసి చూడు," వాడి పెళ్ళికి నా ప్రయాణం ఫిక్స్ అయినప్పటినుంచీ చెబుతూ వస్తున్నాడు నాకు. ఇవాళ రాత్రి ముహూర్తానికి వాడి పెళ్లి.

గ్లాసు మీంచి జారిన కాఫీ చుక్కొకటి నా ఒళ్ళో ఉన్న కవర్ మీద పడింది. జేబులోంచి కర్చీఫ్ తీసి కవర్ తుడిచేశాను. నా పెళ్లి తర్వాత అమ్మిచ్చిన కవర్ అది. "అమ్మాయివీ, నీవీ జాతకాలు.. నీ దగ్గరుంచు," అంతకు మించి ఏమీ చెప్పలేదు. నేనూ అడగలేదు. అసలు వీటితో పని పడుతుందని కూడా అనుకోలేదు నేను.

విభూది పరిమళాలతో వచ్చారు సోమయాజి గారు. "కాస్త ముఖ్యమైన విషయం అయ్యేసరికి వెళ్ళాల్సొచ్చింది.. ఆలస్యానికి ఏమీ అనుకోకు బాబూ.." ఆయన అంటూండగానే కవర్ అందించబోయాను. అవసరం లేదన్నట్టుగా చేసైగ చేశారు.

"ఆడపిల్లా? మగపిల్లాడా?" ఆయన్నన్ను పరీక్షగా చూడడం ఇబ్బంది పెడుతోంది. "ఆడపిల్లండి.. పదోనెల వస్తుంది.." చెప్పాను. మళ్ళీ లోపలినుంచి పిలుపు రాక ముందే ఈయన విషయంలోకి వస్తే బాగుండును.

నా ఆలోచన చదివినట్టుగా "ఆ అరటి చెట్లు చూశావా బాబూ" అన్నారు. అరటి చెట్లలో చూడ్డానికి ఏముంటుందో అర్ధం కాక ఆయనవైపు చూశాను. 

"గెల పక్వానికి రాగానే చెట్టుని మొదలుకంటా నరికేస్తాం.. ఒక్కటే గెల.. మళ్ళీ కాపుండదు.. కదళీ వంధ్యత్వం అంటారు.." ఆయన చెప్పింది అర్ధమయ్యే కొద్దీ నా ముఖంలో రంగులు మారుతున్నాయి. అది గమనించి అభయం ఇచ్చారు..

"ఉహు, అది అరటి చెట్టుకే.. మనుషులకి కాదు.. కంగారు పడకు.. మనుషులకీ ఉంటే ఇంత సృష్టి జరుగుతుందా?"

నిజమే కదా! 

"సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోలేక, దోషాల వంకలు వెతుక్కుంటూ ఉంటారు ఓపికా, శ్రద్ధా లేని వాళ్ళు.. కొత్త రుచులు కోరుకునే వాళ్లకయితే ఇదో అవకాశం కూడాను..." సోమయజిగారి స్వరం గంభీరంగా మారింది.

"పాప పుట్టాక ఇంట్లో నువ్వు కేవలం తండ్రిగా ఉంటున్నావా? మొగుడిగా కూడానా?" కన్ఫ్యూజింగ్ గా అనిపించింది ఆ ప్రశ్న.

"అమ్మాయిని ఏమాత్రం పట్టించుకుంటున్నావు? పాప పుట్టక మునుపూ, ఇప్పుడూ ఒకేలా చూసుకుంటున్నావా?" సూటిగా అడిగారు. అమ్మాయంటే మేఘన అని అర్ధమయ్యింది. శ్రీకర్ గాడికీ, నాకూ రాని ప్రశ్న ఇది.

మేఘన నేనూ హనీకి తల్లిదండ్రులం. అంతకన్నా ముందు ఇద్దరం భార్యాభర్తలం. ఆ సంగతి ఇద్దరం మర్చిపోతున్నామా? ఆలోచనలు చదివే శక్తి ఏదో ఉన్నట్టుందీయనకి.

"కావాల్సిందల్లా కాస్త సహనం, ఓర్పు.. ఏమీ తెలియని వాడివి కాదు కదా.. ఇంతకన్నా అరటిపండు ఒలవనక్కర్లేదు నేను," నవ్వేశారాయన. నేనూ తేలిక పడ్డాను.

"జాతకం చూడకుండానే ..ఎలా చెప్పగలిగారు?" చాలా సేపటినుంచీ లోపల దాచుకున్న ప్రశ్న అడిగేశాను అప్రయత్నంగా.

"దీనికి జాతకం అక్కర్లేదు బాబూ.. అనుభవం చాలు.. మీ ఇంట్లో నా వయసు వాళ్ళు ఉండుంటే ఇంత దూరం వచ్చే శ్రమ తప్పేది నీకు.." వయసొక్కటే కాదు, సమస్యలతో వచ్చే వాళ్ళెంతోమందిని దగ్గరగా చూసిన అనుభవమూ ఉంది కదా. ఆయనకి మరోసారి నమస్కరించి బయల్దేరాను.

తెలియకుండానే హుషారొచ్చింది. "మనో వేగమున మరో లోకమున మనో రధములిటు పరుగిడగా..." తాతగారి పాట.. ప్లేయర్ కాదు, నేనే పాడుతున్నాను.

అమ్మాయి వాలుజడలా అందంగా కనిపిస్తున్న తార్రోడ్డు మీద కారు పరుగులు తీస్తోంది.

(అయిపోయింది)

(వచన రచనకి మేస్త్రి, 'టుప్ టీక' కథా రచయిత, కీర్తిశేషులు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి కృతజ్ఞత)

శనివారం, నవంబర్ 14, 2015

అర్జున మంత్రం -1

"సఖియా.. చెలియా.. కౌగిలి.. కౌగిలి.. కౌగిలి..." తాతగారి పాట మొదలవ్వడంతోనే అప్రయత్నంగా కారు వేగం కాస్త పెంచి, అంతలోనే తగ్గించాను. ఏటిగట్టుని ఆనుకుని కొత్తగా వేసిన తార్రోడ్డు నల్లత్రాచులా ఉంది. గోదారి మీంచి వీస్తున్న గాలికోసం కారు అద్దాన్ని పూర్తిగా కిందకి దించాను.

"కొత్త రోడ్డు మీద పది పన్నెండు కిలోమీటర్లు వెళ్ళాక ఎడం వైపుకి ఎర్ర కంకర రోడ్డు వస్తుంది.. అగ్రహారంరా ఆ ఊరి పేరు. మొదట్లో పెద్ద రావిచెట్టు ఉంటుందట.. అచ్చం 'ఆనందోబ్రహ్మ' నవల్లోలా..." శ్రీకర్ గాడి మాటలు గుర్తొచ్చాయి.

నాకు తాతగారెలాగో, వాడికి యండమూరి అలాగ. ఆయన నవలల పేర్లు,  వాటిలో పాత్రలు ఎప్పుడూ వాడి నాలుక చివరనే ఉంటాయి. ఏం చేస్తున్నాడో పెళ్ళికొడుకు? నా ఈ ప్రయాణాన్ని గురించి  పూర్తిగా తెలిసింది వాడొక్కడికే. బయలుదేరే వరకూ నన్ను తరుముతూనే ఉన్నాడు.

మేఘనకి కూడా "ఓ ఫ్రెండ్ ని కలిసి వచ్చేస్తాను," అని మాత్రమే చెప్పి బయల్దేరాను.  తనూ నాతో వస్తానంటుందేమో అని అనుమానించాడు వాడు. ఒకవేళ అన్నా, తను చక్రం అడ్డేస్తానని ముందే చెప్పాడు. పాట పూర్తవ్వడంతోనే  ఆడియో రిమోట్ లో షఫుల్ ఆప్షన్ మీదకి వెళ్ళింది ఎడమచేతి బొటన వేలు. వినబోయే పాటని ముందే ఊహించేస్తే, ఆ పాటని ఎంజాయ్ చెయ్యలేం.

"జ జ జ జాజ జాబిల్లీ..." మళ్ళీ తాతగారు! "నింగి  నించి తొంగిచూసి.. నచ్చగానే నిచ్చెనేసి.. జర్రుమంటు జారింది..." ఎంత రసికుడివయ్యా మహానుభావా అసలు!! పాట వినడంకోసం కారు మరికొంచం స్లో చేశాను.. ఎలాంటి ట్రాఫిక్కూ లేదు రోడ్డు మీద. సైకిళ్ళ వాళ్ళు కూడా  కారుని దాటుకుని వెళ్ళిపోతున్నారు. ఏం పర్లేదు.. ఇంకా టైం ఉంది.

"ఆయన ఆహితాగ్ని.. అనుష్ఠానం పూర్తయ్యే వరకూ ఇంట్లో నుంచి బయటికి రారు. ఆయన్ని కలిసి, పని పూర్తి చేసుకునే రా.. ఇక్కడ నీ భోజనానికి నేను గేరంటీ.." కారు తాళాలిస్తూ శ్రీకర్ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. పక్క సీట్లో రెండు క్యారీ బ్యాగుల్లో పళ్ళు, స్వీట్లు.. ఆయనకోసం.

"రాఘవేంద్ర రావుకిస్తే ఓ పాట తీసేస్తాడు.."  అనుండేవాడు శ్రీకర్ చూస్తే. రెండు బ్యాగులతో పాటు ఓ తెల్ల కవర్, అందులో మడత పెట్టిన అరఠావు కాగితాలు.. ఆయనకి చూపించాల్సిందేనా?

దూరంగా రావిచెట్టు కనిపించడంతో రోడ్డు పక్కన కారాపాను. షఫుల్ సంగతి మర్చిపోయాను కదా.. "పిక్క పైకి చీరకట్టి వస్తవా వస్తవా?" నాగార్జున గొంతుతో అడుగుతున్నారు బాలూ. అడిగిస్తున్నది తాతగారే. హీరో, సింగర్, డైరెక్టర్.. వీళ్ళెవరితోనూ నాకు సంబంధం లేదు. తాతగారి పాట అవునా కాదా అన్నదే ప్రశ్న. ఇది ఇవాల్టిది కాదు.

ఇంటర్లో ఉండగా కొత్త హీరోయిన్ బాగుందని ఎవరో చెప్పడంతో మా ఫ్రెండ్స్ అందరం సినిమాకి బయల్దేరాం. హీరోయినే కాదు, సినిమా కూడా బాగుంది. ఇంటర్వల్ తర్వాత ఓ పాట.. మరీ ముఖ్యంగా అందులో ఓ మాట.. "గసగసాల కౌగిలింత.. గుసగుసల్లె మారుతావు..."  ఎక్కడో గుచ్చుకుంది. ఎక్కడో కాదు, గుచ్చుకోవాల్సినచోటే గుచ్చుకుంది.  పదహారేళ్ళ వయసులో హార్మోన్లు  వాటి పని అవి చెయ్యకుండా ఉంటాయా?

ఆ ఒక్క పాటనీ రోజంతా విన్న రోజులెన్నో. ఆ తర్వాత, ఆ పాట ఎలా పుట్టి ఉంటుందన్న ఆలోచన.. జవాబు వెతుకుతూ ఉండగా దొరికారా రచయిత. గూగుల్ ఇచ్చిన పాటల లిస్టు చూస్తే కళ్ళు తిరిగాయి. పాటలు వింటూ వింటూ ఉండగా ఆయన నాకు తాతగారైపోయారు.

నాకు దగ్గరి బంధువులెవరూ లేరు. అమ్మ, నాన్న, వాళ్ళ స్నేహితులు, చాలా తక్కువ మంది దూరపు బంధువులు అంతే. అమ్మకీ, నాన్నకీ నేనొక్కడినే. శ్రీకర్ నాకు అన్నో,  తమ్ముడో అయితే ఎంత బాగుండేదో అని ఎన్ని సార్లు అనుకున్నానో లెక్కేలేదు. ఇప్పుడు మాత్రం ఏం? అన్నదమ్ముడి కంటే ఎక్కువే వాడు.

వింటున్న పాట పూర్తవ్వడంతోనే, గోదారి గట్టున నడవాలనిపించి ఆడియో ఆపి కారు దిగాను. చల్లగాలి ఒక్కసారిగా ఒళ్ళంతా తడమడంతో నా రెండు చేతులూ ఫేంట్ జేబుల్లోకి వెళ్ళిపోయాయి అప్రయత్నంగా. జుట్టు చెదిరి మొహం మీద పడుతోంది. ఓ పక్క నిశ్చల గోదారి, రెండో పక్క కొబ్బరి చెట్ల అడివి. ఆ అడివి మధ్యలో అక్కడొకటి ఇక్కడొకటిగా చిన్న చిన్న ఊళ్లు.

నాకు తెలియకుండానే అడుగులు గోదారి వైపు పడుతున్నాయి. రోడ్డున వెళ్ళే వాళ్ళు తిరిగి చూడడం తెలుస్తోంది. ఆరడుగులకి ఓ అంగుళం తక్కువ హైటు, తగ్గ బిల్ట్ అవ్వడం వల్ల వయసుకి మించే కనిపిస్తాన్నేను.

"ఎంతైనా హైబ్రిడ్ మొక్కల బలమే వేరబ్బా.." అంటూ ఉంటాడు శ్రీకర్. వాడు కాక నా ఫ్రెండ్స్ ఎవరూ ఆ మాటనే సాహసం చేయరు.

అమ్మా, నాన్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కులం మొదలు, నమ్మకాల వరకూ చాలా విషయాల్లో వాళ్ళిద్దరిదీ చెరో దారి. అమ్మకి దైవభక్తి అపారం. నాన్నది పూర్తి నాస్తికత్వం. అయితేనేం, ఇంటికి సంబంధించిన విషయాల్లో వాళ్ళిద్దరిదీ ఒకటే మాట. ఇద్దరూ ఒకే అభిప్రాయానికి వస్తారో, ఒకరి మాటని రెండో వాళ్ళు మనస్పూర్తిగా గౌరవిస్తారో అర్ధంకాదు నాకు.

టీచర్ ట్రైనింగ్ లో మొదటిసారి కలిశారట వాళ్ళిద్దరూ. ఉద్యోగాలొచ్చాక పెళ్లిచేసుకున్నారు. మిగిలిన టీచర్లందరూ వాళ్ళ పిల్లల్ని కాన్వెంట్లలో చదివిస్తుంటే, నన్ను మాత్రం వాళ్ళు పని చేస్తున్న స్కూల్లోనే చేర్చారు. నేను ఇంజినీరింగ్ చేస్తే బాగుండునన్నది వాళ్ళిద్దరి కోరికా.. నిర్ణయం మాత్రం నాకే వదిలేశారు.

అంతే కాదు, నాకు కేంపస్ ప్లేస్మెంట్ రాగానే "నాలుగేళ్ళలో నీకు పెళ్లి. పిల్లని నువ్వు చూసుకున్నా సరే.. మమ్మల్ని చూడమన్నా సరే," అని ఒకే మాటగా చెప్పారు.

పెళ్లి లాంటి ముఖ్యమైన విషయంలో నాకన్నా వాళ్ళే బాగా నిర్ణయం తీసుకోగలరు అనిపించింది. ట్రైనింగ్ పూర్తి చేసి ఆన్సైట్ కి వెళ్తూ ఆమాటే చెప్పి ఫ్లైట్ ఎక్కాను. నేను తిరిగి వస్తూనే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మేఘనతో దైవ సాక్షిగానూ, రిజిస్ట్రార్ సాక్షిగానూ నా పెళ్లి జరిపించేశారు. అటుపై నేనూ మేఘనా - తాతగారి భాషలో - "కౌగిలిపర్వం కొత్తగ రాయడం" మొదలుపెట్టాం. ఇదంతా మూడేళ్ళ క్రితం మాట.

అమ్మా నాన్నా  అన్ని విషయాల్లోనూ ఒకే మాటగా ఎలా ఉంటారో ఇప్పటికీ ఆశ్చర్యమే. వేసవి సెలవుల్లో ఏటా తిరుపతి వెళ్ళడం చిన్నప్పటి  నుంచీ అలవాటు. అటునుంచటే చెన్నయో, బెంగుళూరో ఓ నాలుగు రోజులు టూర్. చుట్టాలెవరూ లేరన్న లోటు నాకు తెలియకూడదనేమో.

తిరుపతి దర్శనం పూర్తి చేసుకుని బయటికి రాగానే, అమ్మ ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని విమాన గోపురానికి దణ్ణం పెట్టుకుంటే, నాన్నేమో "పుల్లారెడ్డి, స్వగృహ.. ఎవరికీ కూడా ఇంత బాగా కుదరదురా ఈ లడ్డూ.. ఎవరు చేస్తారో కానీ.." అంటారు. ఇద్దరూ కూడా వాళ్ళ భక్తినో, నాస్తికత్వాన్నో నాకు మప్పే ప్రయత్నం చేయలేదు. నాపాటికి నన్ను వదిలేశారు, నమ్మకాల విషయంలో.

నీళ్ళని చీల్చుకుంటూ పడవొకటి గట్టువైపుకి వస్తోంది. అవడానికి శీతాకాలపు మధ్యాహ్నమే అయినా వెన్నెల రాత్రిలా ఉంది వాతావరణం. "అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే.. గట్టుమీన రెల్లుపువ్వా బిట్టులికి పడుతుంటే..." ఇలాంటి దృశ్యాలెన్నో చూసే రాసి ఉంటారు తాతగారు.  ఆయన కబుర్లు శ్రీకర్ కి తప్ప ఇంకెవరికీ చెప్పను.

నేను మొదలెట్టిన కాసేపటికి వాడు ఏ 'గోధూళి వేళ' వర్ణనో లేకపోతే 'ఫోన్ లో రేవంత్ గొంతు వింటే రమ్యకి గుప్పెడు సన్నజాజులు గుండెల మీదనుంచి జారుతున్న అనుభూతి కలగడం' గురించో అందుకుంటాడు. మిగిలిన ఫ్రెండ్స్ ఎవరన్నా విన్నా, వాళ్లకి మేం ఏ భాషలో మాట్లాడుకుంటున్నామో అర్ధం కాదు. "మీరు మాట్లాడుకుంటున్నది తెలుగేనా?" అని అడిగిన వాళ్ళు లేకపోలేదు.

సైకిలు మీద వెళ్తున్న ఓ మనిషి, ప్రత్యేకం సైకిల్ దిగి, కారునీ నన్నూ మార్చి చూస్తూ "ఆయ్.. ఎందాకెల్లాలండీ?" అని పలకరించాడు. "అగ్రహారం.. సోమయాజి గారింటికి.." రెండో ప్రశ్నకి ఆస్కారం లేకుండా జవాబిచ్చేశాను.

"ఆ సెట్టు పక్కన కంకర్రోడ్డున్నాది సూడండి.. తిన్నగెల్లిపోతే సివాలయవొత్తాది.. పక్కనేనండారిల్లు.. ఆయ్" అంటూ సైకిలెక్కేశాడు. ఇక్కడే ఉంటే ఇంకా ఎవరెవరు వస్తారో అనిపించి కారెక్కేశాను. ఐదు నిమిషాల కన్నా ముందే గమ్యం చేరింది కారు. ఎవరూ చెప్పక్కర్లేకుండానే అది సోమయాజి గారి ఇల్లని తెలిసిపోయింది.

శ్రీకర్ చూస్తే "వ్యాసపీఠంలా ఉందీ ఊరు" అని ముచ్చట పడతాడు. "అంటే ఏంటి?" అని అడగక్కర్లేకుండానే నవల రిఫరెన్స్ ఇచ్చేస్తాడు.

"పూజలో ఉన్నారు.. వచ్చేస్తారు కూర్చోండి," కుర్చీ చూపించి లోపలికి వెళ్ళాడో కుర్రాడు. మరు క్షణం మంచినీళ్ళ చెంబుతో తిరిగొచ్చాడు. ఆవేల్టి పేపర్ నా ముందు పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు.

నేను పేపరు చూస్తూ ఆలోచిస్తున్నాను. రావడం అయితే వచ్చేశాను కానీ, ఇప్పుడెలా? శ్రీకర్ కూడా పక్కనుంటే బాగుండునని బాగా అనిపిస్తోంది. దృష్టి పేపర్ మీదకి పోవడం లేదు.

నేను ఆలోచనల్లో ఉండగానే విభూది వాసనలు వెంట తెచ్చుకుని వచ్చారాయన. లేచి నిలబడ్డాను. ఎనభయ్యేళ్ల వయసుంటుంది. బక్క పల్చని మనిషి. ముగ్గుబుట్ట తల, గుబురు గడ్డం. శక్తివంతమైన కళ్ళు. ఈయన్ని ఒక్కసారే చూసిన వాళ్ళకైనా, ఎప్పుడైనా తల్చుకుంటే మొదట గుర్తొచ్చేవి కళ్ళే.

ఎర్రరంగు పట్టు పంచె కట్టుకున్నారు. పైన ఆచ్చాదనల్లా రెండు వరుసల రుద్రాక్షలే. ఒళ్ళంతా విభూది పట్టీలు పెట్టుకున్నారు. నుదుట విభూది మధ్యలో ఎర్రని కుంకుమ బొట్టు, పరమశివుడి మూడో కన్నులా. అన్నిటికన్నా ఆశ్చర్యం, ఆవయసులో కూడా కళ్ళజోడు లేకపోవడం.

పళ్ళూ, స్వీట్లు ఆయన ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టాను. కవర్ మాత్రం నా చేతిలోనే ఉంది. నా ఒంట్లో ప్రవహిస్తున్న అమ్మ-నాన్న రక్తాల మధ్య యుద్ధం జరుగుతున్నట్టుంది. నన్ను కూర్చోమని సైగచేశారాయన.

"ఎలా జరిగింది బాబూ ప్రయాణం?" క్షణం పట్టింది ప్రశ్న అర్ధం కాడానికి. నా పరిచయం అడగలేదు మరి.

"బాగా జరిగిందండీ.. రోడ్డు చాలా బాగుంది.." నవ్వారు చిన్నగా. "బ్రిటిష్ వాడు రైలు మార్గం వేసినట్టు, వీళ్ళు రోడ్లు వేస్తున్నారు.. లాభాపేక్ష ఉండకుండా ఉంటుందా.. చవురు తీసి పట్టుకెడుతున్నారు కదూ.." ఏమీ మాట్లాడలేదు నేను. నా పది వేళ్ళ మధ్యా కవరు నలుగుతోంది.

"ఏవీ అనుకోకు బాబూ.. చిన్న వాళ్ళని ఏకవచనంతో సంభోదించడమే అలవాటు.. ఆ కాలం వాణ్ణి మరి.." పర్లేదన్నట్టుగా తలూపి, నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఎలా మొదలుపెట్టాలో అర్ధం కావడం లేదు. చాలా ప్రైవేటు విషయాన్ని, అత్యంత కొత్త మనిషితో పంచుకోవడం..అనుకున్నంత సులువు కాదు.

ఆయన నావైపే చూస్తున్నారు పరీక్షగా. కాసేపటికి, "తెలుగు అర్ధమవుతుంది కదూ?" అడిగారు.

"అవుతుందండీ.." వెంటనే చెప్పాను.

"ఆహార నిద్రా భయ మైథునాల్లో ఒకటి నీకు దూరమయ్యింది.." ఉలికిపాటుని దాచుకున్నాను, అతి కష్టం మీద.

నిదానంగా నన్ను చూసి "స్పష్టంగా చెప్పాలంటే చివరిదే.. కదూ?" ఈసారి మాత్రం నేనేమీ దాచుకోలేదు.. దాచుకోలేక పోయాను..

"అ..అవునండీ.." అన్నాను కొంచం అస్పష్టంగా.. చర్మం కింద చమటలు పడుతున్న అనుభూతి. నా గుండెల్లో వణుకు స్పష్టంగా తెలుస్తోంది నాకు.

ఆయన మౌనం అత్యంత దుర్భరంగా ఉంది, ఉన్నట్టుండి నేను కూర్చున్న కుర్చీకి ముళ్ళు మొలిచినట్టుగా. ఇంతలో ఆయనకి లోపలినుంచి పిలుపొచ్చింది.

"ఇప్పుడే వస్తాను బాబూ..." అంటూ వెళ్ళారు.

క్షణమొక యుగంగా గడవడం అంటే ఏమిటో ఆ క్షణంలో అనుభవంలోకి వచ్చింది.

(ఇంకా ఉంది)

మంగళవారం, నవంబర్ 03, 2015

అసహనం

చాలా రోజుల తర్వాత నలుగురు మిత్రులం పార్కులో కలిశాం. నడకయ్యాక బెంచీల మీద చోటు సంపాదించుకున్నాం. వాతావరణం చల్లబడడంతో మా దృష్టి మిరపకాయ బజ్జీల మీదకి మళ్ళింది. బండి కుర్రాడు బజ్జీలు తెచ్చిపెట్టి వెళ్ళాడు. బజ్జీలంత వేడిగా, ఘాటుగా సంభాషణ సాగింది. "షారుక్ ఖాన్ అలా అని ఉండాల్సింది కాదు," అన్నాడో మిత్రుడు. హిందీ సినిమాలు, హిందీ రాజకీయాలు తనకి కరతలామలకం. "ఎప్పుడు లేదు అసహనం? అధికార పక్షం మీద ప్రతిపక్షానికి ఎప్పుడూ అసహనమే కదా. ఇప్పడు ప్రతిపక్షం నోరున్నది కాబట్టి, ఇప్పటివరకూ అవార్డులు అందుకున్న వాళ్ళలో మెజారిటీ కాంగ్రెస్, కమ్యూనిస్టు వాదులే కాబట్టీ ఇంత గొడవ జరుగుతోంది" అని తన ఉవాచ.

మత అసహనం పెరగడం దేశానికి మంచిది కాదని తన యాభయ్యో పుట్టిన రోజు సందర్భంగా షారుక్ ఖాన్ జాతికి సందేశం ఇవ్వడం, దాన్ని కాంగ్రెస్సు, కమ్యూనిస్టులు స్వాగతించగా, బీజీపీ మరియు అనుబంధ సంస్థలు వ్యతిరేకించడం వేడి వేడి టాపిక్ మరి. "వెనక్కివ్వడానికి తన దగ్గర అవార్డులేవీ లేవని చెబుతున్నాడంటే, తనకి అవార్డు ఇమ్మని అడుగుతున్నట్టా, లేక రాజకీయాల్లోకి రాబోతున్న సంకేతమా?" ప్రశ్న పూర్తయ్యేసరికి పొగలుగక్కుతున్న బజ్జీలు కాస్త చల్లబడ్డాయి. నిమ్మరసం పిండిన ఉల్లిపాయముక్కల స్టఫింగ్ భలేగా ఉంది. "దేశంలోనే కాదు, రాష్ట్రంలోనూ అసహనం పెరిగిపోతోంది," ప్రకటించాడు రెండో మిత్రుడు. రాష్ట్రం తప్ప మరో విషయం పట్టదితగాడికి.

"అసలు చంద్రబాబు ఎంత కష్టపడుతున్నాడు. అమరావతి పూర్తిచేస్తే చరిత్రలో నిలిచిపోతాడు. అది భరించలేకే అపోజిషన్ వాళ్ళు హోదా అనీ, ఉల్లిపాయలనీ, కందిపప్పు అనీ గొడవలు చేస్తున్నారు. ఏం చేసినా చంద్రబాబుని ఆపలేరు" కొంచం ఆవేశంగా చెప్పాడు. ఏమాటకామాట, మిరపకాయ కొంచం కారంగానే ఉంది. "మోడీ ప్యాకేజీ ఏమీ అనౌన్స్ చేయడని నేను మొదటినుంచీ చెబుతూనే ఉన్నా కదా. ఏపీని మించిన విషయాలు చాలానే ఉన్నాయి.. మరీ ముఖ్యంగా బీహార్ ఎలక్షన్స్. ఏపీలో ఇప్పట్లో బీజీపీ స్ట్రాంగ్ అవ్వదని మోడీకి తెలుసు," హిందీ మిత్రుడు అందుకున్నాడు. మూడో మిత్రుడి ఆసక్తి సాహిత్యం. ఏమీ మాట్లాడకుండా శ్రద్దగా బజ్జీ తింటూ వాళ్ళ సంభాషణ వింటున్నాడు, నాలాగే.

"ఇంకెక్కడ బీజేపీ? అమరావతి పూర్తయితే ఇక రాష్ట్రంలో ఎప్పటికీ తెలుగుదేశమే పవర్లో ఉంటుంది. చంద్రబాబు, తర్వాత లోకేష్ బాబు సీఎంలు. ఇంకెవరూ ఆశలు పెట్టుకోడం అనవసరం" రాష్ట్ర మిత్రుడు కళ్ళు మూసుకుని చెప్పాడు. నిమ్మరసం పులుపు మామూలుగా లేదసలు. నేను ఊరికే ఉండక "గ్రీన్ ట్రిబ్యునల్ ఏదో అభ్యంతరం చెప్పిందని పేపర్లో చూశాను" అన్నాను. అతగాడికి అద్దుమాలిన కోపం వచ్చింది. "ఏ ట్రిబ్యునలూ ఏమీ చెయ్యలేవు. చంద్రబాబుకి ట్రిబ్యునల్ ఓ లెక్కా? చూస్తూ ఉండు, ఇట్టే మేనేజ్ చేసేస్తాడు. పైసా ఖర్చు లేకుండా బిల్డింగులు కట్టివ్వడానికి సింగపూర్ వాళ్ళు, జపాన్ వాళ్ళు రెడీగా ఉన్నారు," కొంచం గట్టిగానే చెప్పాడు.

"చేతిలో పైసా లేకుండా కేపిటల్ కట్టడం అంటే మాటలు కాదు," హిందీ మిత్రుడి ఉవాచ. "ఇంకెవరన్నా సీఎం పొజిషన్ లో ఉంటే సెంట్రల్ ఫండ్స్ కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉండే వాళ్ళు. కానీ, ఇక్కడున్నది చంద్రబాబు. అసలు పదమూడు జిల్లాల రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలన్న ఆలోచనే ఇంకెవరికన్నా వస్తుందా?" ప్రశ్న విని, ఓ బజ్జీ తీసి అతనికిచ్చాను. సాహిత్యం మిత్రుడు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నాను. హరిరామ జోగయ్య ఆత్మకథ విశేషాలేమన్నా తెలుస్తాయని ఆశ. చూడబోతే తను మాట్లాడే మూడ్ లో ఉన్నట్టు లేడు. "బజ్జీ తినడానికి తప్ప నోరిప్పడం లేదు నువ్వు?" హిందీ మిత్రుడు, సాహిత్యం మిత్రుణ్ణి కదిలించాడు.

"మొన్న నా ఫేవరెట్ రైటర్ కి ఫోన్ చేశాను.. చెడా మడా తిట్టి ఫోన్ పెట్టేశాడు," తను చెప్పింది విని ముగ్గురం ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచాం. "అతనికి నువ్వు ఎప్పటినుంచో ఫోన్లు చేస్తున్నావు కదా. ఎప్పుడూ సరదాగానే మాట్లాడతాడని చెప్పావు?" హిందీ మిత్రుడు అడిగేశాడు. "ఈ మధ్య అతను రాస్తున్న కథలు ఏమంత బాగుండడం లేదు. ఆమాట చెప్పానో లేదో, విరుచుకు పడ్డాడు నా మీద. నచ్చకపోతే చదవడం మానెయ్యండి కానీ ఇలా ఫోన్లు చెయ్యకండి. మీకు చదవడం చేతకాక వంకలు పెడుతున్నారు అని నిర్మొహమాటంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు," గొంతు కొంచం జీరబోయింది. ఎవ్వరం ఏమీ మాట్లాడలేదు. అతని చెయ్యి నొక్కి వదిలాను అప్రయత్నంగా. చినుకులు మొదలవ్వడంతో ఇళ్ళ దారి పట్టాం.

మంగళవారం, అక్టోబర్ 27, 2015

గుడి ఎనక నాసామి -2

(మొదటి భాగం తర్వాత...)

ఏటి సెయ్యటాకీ ఆలోసిన తెగట్లేదు నాకు. గాబరకి గొంతెండిపోతన్నట్టుగా ఉన్నాది. కున్నీల్లు తాగుదారనిపించేతలికి ఇయ్యాల సుక్కురోరవని గేపకవొచ్చింది. అమ్మోరమ్మకి కటికుపాసాల మొక్కు. తప్పితే ఇంకేటన్నా ఉన్నాదా?

మాయాయినికి పోన్జేత్తే పక్కన్టీవీ వోల్లున్నారని కూడా సూడకండా బూతుల్లంకించు కుంటాడు. పోనీ బిత్తిరి గాడికి సేద్దారంటే ఆన్నోట్లో నువ్వు గింజి నాన్దు. అంత కనాకట్టపు మనిసాడు. ఏదైతే, మావోడు బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నాడుగదా. పక్కనే టీవీ వోడున్నాడు. నా ఎదర టీవీ ఉన్నాది. అక్కడేటయ్యిందో ఆడు సూపింతవే తరవాయి, నాకు తెలిసి పోద్ది.

ఎడ్వడింగులయిపోయేయి గానీ టీవోడు ఇంకేయో వోర్తలు సూపింతన్నాడు. బిత్తిరిగోడు సరైనోడైతే నాకీ బాద లేకపోను. ఆన్ణాకు దూరపు సుట్టం. కొడుకొరస. ఈ సంగత్తెలిసే నేనాణ్ణి ఇంట్లోకి రానింతం మొదలెట్టేను. నన్ను సిన్నమ్మగోరూ అనీసి, బంగార్తల్లిని సెల్లెమ్మా అనీ పిలుత్తాడాడు. పెల్లికెదిగిన ఆడపిల్లని ఇంట్లో ఎట్టుకుని ఎవుణ్ణిబడితే ఆణ్ణి సనూగా తిరగనిత్తావేటి?

ఆడు డిపాటుమెంట్లో సేరిన కొత్తల్లో మాయాయిన ఆడితో ఎల్లాగుండేవోడో తెల్దుగానీ, ఏ మూర్తాన బిత్తిరిగోడు నాకు సుట్టవన్న సంగత్తెల్సిందో ఆ నాట్నించీ ఆడు మా మారాజుకి నీల్ల కన్నా పల్సనై పోయేడు. ఈయినగోర్ని అనుకోటం ఎందుకూ? ఆడూ తగ్గావోడే.

ఆర్నెల్ల కితం కామాల, ఓనాడు బిత్తిరోడు సొమ్మట్టుకొచ్చేడు. వొచ్చిన వొసూల్లో మాయాయినగోరి వోటా. ఈయనగోరిప్పుడు ఎస్సైగదా.. వోటాల పని కానిస్టీబుల్లు సూత్తారు. మాయాయిన మంచి కుసీ గా ఉంటం సూసి బిత్తిరోడికి దైర్నం సిక్కినట్టున్నాది.

"మనవిల్లాగ డబ్బుచ్చుకోటం తప్పుగాదా గురువు గారూ?" అని అడిగేసేడు. వొంటింట్లో ఉన్నాన్నేను.

"అయిపోయిందియ్యాల.. బిత్తిరోడి గూప్పగిలిపోతాదిప్పుడు" అనుకుంటన్నానో లేదో, నా పెనివిటి మొదలెట్టేడమ్మా ఉపన్యేసం. ఇనాలంతే..

"బాబొరే బిత్తిరీ.. నీ వొయిసెంతరా? నా సర్వీసంత ఉంటాదా? మీ సిన్నమ్మగోర్ని సేసుకునే నాటికి నేను కానిస్టీబు డూటీలో ఉండేవోన్ని. గవర్మెంటు అప్పుడే కొత్తగా సారా మీద ప్రొబేసనెట్టింది. అంటే ఏటన్న మాట? ఎక్కడా సారా అన్నది అమ్మరాదు. మనం ఎవరం? ప్రోబిసనోల్లం. పక్కన ఎక్సైజు కూడా ఉంటాదనుకో. మన డూటీ జెనాలకి సారా అన్నది దొరక్కండా సెయ్యటం. సెక్కింగులు, రెయిడింగులు.. అబ్బో.. పోలీసోడి కన్నా ప్రొబీసనోడే పవర్ఫుల్గుండేవోడు. ఎవడో మాటెందుకు, నాకే కొత్త పెల్లంతో కాపరం కన్నా డూటీ సెయిటంలోనే ఎక్కూ కిక్కుండేది. పేపరోల్లు గూడా సారా ఒక్కటే గాదు, అసలు మందన్నదే దొరక్కండా సేసెయ్యాలని ప్రెతి రోజూ పేజీలకి పేజీలు  రాసేవోల్లు.."  ఆలోసింతాక్కాబోలు ఆగేడు మావోడు.

బిత్తిరోడు ఇంకే ఎదవ ప్రెశ్నలూ అడక్కండా కాయమని అమ్మోరమ్మకి దండాలెట్టుకునే లోగానే, నా ప్రెత్యెక్స దైవం మల్లీ అందుకున్నాడు.

"కొన్నాల్లకా ముచ్చటా తీరింది. కంప్లీటు ప్రోబిసన్ అన్నారు. మన డిపాట్మెంటు పులైపోయింది. అబ్బబ్బ.. ఆరోజులు మల్లీ రావనుకో. కానేవయ్యింది? గవర్మెంటు మారింది. ప్రోబిసన్ మీద మాట మారిసింది. మొత్తం ప్రొబిసనన్నదే ఎత్తెయిటవే గాదు, మందమ్మటాకి టారిగెట్లేసింది. ఆ డూటీ మన డిపాట్మెంటుకపజెప్పింది. మంచీ సెడ్డా సెప్పాల్సిన పేపరోల్లేంజేసేరు? మాట మారిసేసి, గవర్మెంటు సేసిందే రైటని జై కొట్టేరు. అంటే ఏటన్న మాట? ఎవర్లాబం ఆల్లు సూసుకున్నారు. గవర్మెంటు ఏం సెబితే అది సెయ్యాల్సినోల్లం మనవనగా ఎంతరా? నీకంతగా డబ్బు సేదనుకో, నీ వోటా వొదిలేసుకో. అంతేగానొరే, ఇల్లాటి మాట్లు ఎవరి కాడా అనకు. ఉజ్జోగానికి అన్ఫిట్ అనెయ్ గల్రు. ఇప్పుణ్ణీ డూటీ ఏటన్నమాటా? మీ సిన్నమ్మగోర్నడిగి మనకో డబల్ స్ట్రాంగ్ టీ అట్టుకురా" అని పురమాయించేడు.

ఆ ముచ్చటల్లాగ తీరింది బిత్తిరిగోడికి. నాల్రోజుల్నాడు ఎస్సై గోరు ఇంట్లో లేకండా సూసి "సిన్నమ్మగారో" అంటా వొచ్చేడాడు.

"మా బతుకు మరీ కనాకట్టవై పోయిందమ్మా. ఎవురికి సెప్పుకోవాలో గూడా తెల్టంలేదు. ఇన్నాల్లూ మందు కొట్లోల్ల మీద, బార్లోల్ల మీద పెత్తనం సేసేంగదా. ఇంకా సేత్తానే ఉండాలిగూడా గదా.. గవర్మెంటిప్పుడు ఏం జేసిందో సూసేరా? మాసేతే దుకానవెట్టించి మందమ్మిత్తాదంట. ఏవంటే టారిగెట్లంట. కొట్లోల్ల కాడ మాకిలవుంటాదా? మమ్మల్నాల్లు సులకనగా సూత్తే మాకెంత కట్టంగుంటాది.." అంటా ఏడిసినంత పని సేసేడు.

మా మారాస్సెప్పినట్టుగా, ఉజ్జోగస్తుడంటే గవర్మెంటోడు ఏ డూటీ సెయ్యమంటే ఆ డూటీ సెయ్యాల్సిందే. ఏరే గచ్చంతరం లేదు.

బిత్తిరిగోడు సెప్పిందింటా వుంటే మూడోరాల్నాడు అమ్మోరమ్మతల్లి సెప్పిన మాట్లు గేపకానికొచ్చేయి. పక్కీదిలో ఒకల్లింటికొచ్చిన సుట్టాలావిడికి అమ్మోరమ్మ వొంటిమీదకొత్తాదని తెల్సి దర్సినానికెల్లేను. నా పున్యేనికి అమ్మ పలికింది.

"నువ్వు నా బక్తురాలివే.. నా బక్తుల్ని నేను కాసుకుంటానే.. అంతా మంచే జరుగుతాది నీకు.. సిన్న సిన్న సిక్కులు నీదారికడ్డం పడబోతన్నాయి.. జేగర్త.. నిన్ను కాయటాకి నేనున్నాను.. నీ జేగర్తలో నువ్వూ ఉండాల" అంజెప్పి, వొరసగా మూడు సుక్కురోరాలు ఉపాసాలు సెయ్యమని ఆజ్నేపించింది తల్లి. ఇయ్యాల మూడో వోరం. ఆయేల్నుంచీ మొదలయ్యింది బెదురు. ఏరోజేటవుతాదోనని ఒకిటే బెంగ.

అమ్మ.. ఇంచేపు కదలకండా టీవీ సూసినందుకు పలితం కనబడ్డాది. అడిగో మాయాయిన. పక్కన బిత్తిరిగోడు. గొట్టం మైకట్టుకుని టీవీ కుర్రోడు..

"ఇళ్ళ మధ్యలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు స్మితా. పవిత్రమైన దేవాలయం వెనుక మద్యం దుకాణం నిర్వహించడాన్ని వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. స్వయంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వారే ఈ షాపుని నిర్వహిస్తున్నారు స్మితా. అయితే, ఇక్కడ ఉన్న ఎక్సైజ్ ఎస్సై మాత్రం మనతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. పై అధికారుల ఆదేశం మేరకే షాపుని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.."

ఇదా ఇసయం.. తీరామోసి ఈల్ల సేత మందమ్మిత్తన్నాది అమ్మోరమ్మ గుడెనకాల. ఎప్పుడూ సూపర్నెంటు దొరగోరో, పెద్దొరగోరో కురిసీలో కూసుంటే, పేపరు పోటోలకి ఎనకొరసలో నిలబడే మాయాయిన, ఇయాల దరిజాగా కురిసీలో కూసుని కనబడ్డాడు టీవీలో. ఆడంగులంతా టీవీల్లో కనిపించేవొరుకూ అరిసేసి, బోజినాలకెల్లిపోతారు కామాల. 

మాయాయిన్ని కుంచేపు టీవీలో సూసుకుందారనుకున్నానో లేదో మల్లీ ఎడ్వడింగులు మొదలైపోయేయి. ఈ వోర్త మల్లీ సూపింతారో లేదో.

ఓయమ్మ ఏటిదీ? ఎడ్వడింగులయ్యేతలికి పుట్ల పుట్ల కింద జేరిపోయేరాడంగులు. బిత్తిరిగోడు కంగారుగా పోన్లు కలుపుతున్నాడు. మా మొగాయన టీవీవోల్లకేసి సూడకుండా పన్లో ఉన్నట్టుగా యాక్టింగు జేత్తన్నాడు.

ఆడోల్లని సూత్తాంటే నాగ్గాబర పెరిగిపోతన్నాది. అమ్మోరమ్మా.. ఉపాసంలో ఉన్నానమ్మా.. ఈ బక్తురాలిని పరిచ్చింతన్నావా తల్లే.. కూసున్న ఆడంగులు ఒక్కసారే పైకి లేసేరు.  నాకేదో కీడు తోత్తన్నాదమ్మోరమ్మా.. మాయాయిన్ని దాటుకుని కొట్లోకెల్లిపోయేరు. ఒక్కో సీసాకాయీ తీత్తన్నారు.. నేలకేసికొడతన్నారు.

యేటిది? లోపల్నించేటింత సంతోసం కలుగుతున్నాది. ఒక్కోసీసా పగుల్తా ఉంటే ఎన్నెన్నిగుర్తొత్తన్నాయి. నాన మంచోడే.. అమ్మ మంచిదే.. మందు సెడ్డది.. ఆంటీగారు మంచోలే..అంకులు గారు మంచోరే.. మందు సెడ్డది.. రావుడన్నయ్య మంచోడే.. వొరమ్మొదిని మంచిదే.. మందు సెడ్డది.. నేను మంచిదాన్నే.. మాయాయిన మంచోడే.. మందు సెడ్డది. సుట్టాలోల్లు.. తెలిసినోల్లు.. ఇంకా ఎంతమంది? ఏల కుటుంబాలా, లచ్చల కుటుంబాలా? ఎంతమంది పడ్డారు? పడతన్నారు? గవర్మెంటు ఇంకా ఇంకా తాగించమనే సెబుతాదిగానీ, వొద్దని సెప్పదు.. టారిగెట్లేత్తాది.. కొట్లేయించి అమ్మింతాది.. ఎవురూ మాటాడ్రు..

అమ్మోరమ్మ తల్లీ... ఈయాడోల్ల రూపంలో వొచ్చేవా అమ్మా.. ఇంతమంది కోసం గుడెనకాలికి  వొచ్చేవా తల్లీ.. ఆడంగుల్లారా.. కొట్టండి.. ఒక్కో సీసా కాయనీ నేలకేసి కొట్టండి.. అడ్డవొత్తే మాయాయిన్నైనా సరే కొట్టండి..

అదుగో.. బిత్తిరిగాడి పోనందుకుని పోలీసోల్లొచ్చేసేరు.. ఆడోల్లని లోపలేసేత్తారు. అయితే ఏటి.. మందునేంజెయ్యాలో అమ్మోరమ్మ సెప్పింది.. ఆడోల్లందరిసేతా సేయిత్తాది..సేయించు తల్లే.. సేయించమ్మా.. మూడు సుక్రోరాలు గాదు.. ఈ బక్తురాలు జీవితాంతం ప్రెతి సుక్రోరం కటికుపోసం సేత్తాది.. అమ్మోరమ్మ తల్లే.. దయుంచమ్మా.... కాపరాల్నిలబెట్టే సెక్తి నీకే ఉన్నాత్తల్లే.. నాకేటిది... సెలవలు కమ్ముతున్నాయి... కల్లు తిరూతున్నాయి... అ..మ్మా.. అ...మ్మో...ర...మ్మా.... 

 (అయిపోయింది)

సోమవారం, అక్టోబర్ 26, 2015

గుడి ఎనక నాసామి -1

పొద్దున్న పది కొట్టేతలికి ఒక్కసారిగా కాలీ అయిపోతాను. పిల్లలిద్దరూ సదువులికీ, ఈయనగోరు ఉజ్జోగానికీ బయలెల్లేక సందలడే వొరుకూ పెద్దగా పనేటీ వుండదు. కుంచేపు పేపరు సూసేసి, టీవీ ఎట్టుకోటవే. పేపర్లో మా డిపాటుమెంటు వోర్తోటి సిన్నదేసేరు. పొటో ఎయ్యిలేదు.

కూడబొలుక్కుని సదివి, సినిమా బొమ్మలు సూసేసి, పేపరు దాని సోట్లో ఎట్టేసి, అప్పుట్టీవీ ఎట్టేను. ఇల్లన్నాక గాలీ, ఎల్తురూ ఉండాలనేసి, ఎక్కడొస్తువులక్కడ ఎట్టుకోవాలనేసి సిన్నప్పన్నించీ మా సెడ్డ కోరిక నాకు.

సిన్నప్పుడంతా పోలీసు కోటర్సులోనే ఉండేవోల్లం. నానది కానిస్టీబులుజ్జోగం. కోటర్సు పక్కల్ని మురుగ్గుంట్లున్నాయో, మురుగ్గుంట్ల మజ్జిలో కోటర్సున్నాయో మాకే తెలిసీది కాదు. అక్కడికీ, మిగిలిన కోటర్సోల్లు లోపల బాగానే సదురుకునీవోల్లు. మాయమ్మ మాత్తరం ఇంట్లోపల కూడా మురుగ్గుంట్లాగే ఉండిచ్చేది.

నేనెప్పుడన్నా సదరడం మొదలెడితే "నీకుప్పుడు పెల్లోరొత్తన్నారంటే?" అంటా ఈపు సితక్కొట్టేది. అమ్మోరమ్మ దయిలేక ఎన్ని దెబ్బలు కాసేనో లెక్కేలేదు.

మాయమ్మకే అద్దుమాలిన కోప్మనుకుంటే, నానకి అంతకొందరెట్లు కోపం. యే రోజూ తాగి రాటవే. ఆ మడిసి రాటంతోనే మాయమ్మ గుమ్మంలోనే తగువేసుకునీది. సితక్కొట్టీసీవోడు మానాన. అయినా గానీ మాయమ్మ ఏమాత్తరం తగ్గేది కాదు. ఉన్నదున్నట్టు సెప్పుకోవాల, ఏనాడూ మా నాన నామీస్సెయ్యెత్తింది లేదు.

అయితే మాత్తరం, ఆ తగూల్సూసి నా గుండి జారిపోతా ఉండేది. అదుగో, అప్పుడు సెప్పేరు పక్కోటర్సు ఆంటీగారోల్లు.. "అమ్మోరమ్మని కొలుసుకోయే బాగ్గెవా.. ఆయమ్మ నిన్ను సల్లగా సూత్తాదీ" అని.

ఏమూర్తానా తల్లిని కొల్డం మొదలెట్టేనో, ఆరోజు మొదలుకుని సల్లగానే సూత్తన్నాది తల్లి. ఒక్కోపాలేటవుద్దో గానీ పరిచ్చింతా ఉంటాది. ఇదుగో ఉప్పుడు నా పాపిస్టి జెనమం సేతా తల్లికేం లోటు సేసేనో, పరిచ్చింతన్నాది నన్ను.

టీవీ ఎట్టేను కానీ పట్టుమని పది నిమిసాలు ఏ సేనలూ సూళ్ళేకపోతన్నాను. అసల్దీన్ని టీవీ అనగూడదంట. దీనిపేరు ఓమ్ దియేటరో ఏదోనంట. బాబిగాడు పద్దాకలా సెబుతానే ఉంటాడు. ఆడికి నేనంటే పేనం. పొద్దుగూకులా అమ్మా అమ్మా అంటా నా ఎనకే ఉంటాడు. బంగార్తల్లియయితే అచ్చుగుద్దేసినట్టు దాని బాబ్బుద్దులే. నోరు తెరిత్తే నోట్లో దాసిన బంగారం బయటడిపోతాదని బయివేమో దానికి. నేనల్లాగుండ్లేనుమరి.

మొన్నామజ్జిన దాని ప్రెండొచ్చింది. అల్లిద్దరూ పిల్లల గెదిలో కబుర్లు సెప్పుకుంటన్నారు. పిల్లల ప్రెండ్సులొచ్చినప్పుడల్లా నేన్దూరంగా ఉండి ఆల్లక్కావొల్సినయి సూత్తాను గానీ, పోలీస్జవాన్లాగా అక్కడే పాతుకుపోను. మాయమ్మతల్లితో నేను పడ్డ బాదలు ఈ జెన్మకి మర్సిపోతానా. నాకోసవనేసి ఇంటికి రావాలంటే బయపడి సచ్చేవోల్లు నా సావాసగత్తిలు.

సరే, ఆయేల బంగార్తల్లి, దాని ప్రెండు కబుర్లు సెప్పుకుంటంటే ఏడేడిగా పకోడీలేసి అట్టుకెల్లిచ్చేనిద్దరికీని. ఆయమ్మి ఓ పకోడీ నోట్లో ఏసుకుని ఏదో అన్నాది.. స్పీటన్న మాట మాత్తరం ఇనబడ్డాది. పకోడీ కారవెడతన్నాది కామాల, స్పీటడుగుతున్నాదీ పిల్ల అనుకున్నాను. అమ్మోరమ్మ దయివల్ల ప్రిజ్జిలో గులాజ్జావున్నాదన్న సంగతి టయానికి గురుతొచ్చి అట్టుకెల్లిచ్చేను. ఆలిద్దరూ ఒకల్లమొకాలొకల్లు సూసుకుని ఒకిటే నవ్వుకోటం.

ఆ పిల్లెల్లిపోయేక బంగార్తల్లినడిగేసేను. ఆయమ్మి  స్పీటడగలేదంట. నన్నే స్పీటన్నాదంట. ఈ ముక్క ముందే సెప్పొచ్చు గదా. ఉంకో రెండేల్లు పోతే సదువైపోయి ఇంజినీరుజ్జోగంలో జేరతాది బంగార్తల్లి. అక్కడా ఇలాగే సేత్తాదో ఏటోమరి.

బాబిగాడి సదువవ్వటాకింకా నాలుగైదేల్లడతాది. ఆడేమో పోలీసవుతానంటన్నాడు. ఎక్కడికి పోతాది రగతం. ఆడు పోలీసయినా నాకేటీ పేసీ లేదు గానీ, జెవానుజ్జోగం గాదు, దొరుజ్జోగం జెయ్యాల. జెవానుజ్జోగాల కతలు సిన్నప్పన్నించీ సూత్తానే ఉన్నానుగదా.

మొదన్నించీ నాకు సదువు అంతంతమాత్తరవే. ఏనాడూ నాన నా సదువు సంగజ్జూల్లేదు. పైట పేరంటకం అవుతానే సదివింది సాలన్నాది మాయమ్మ. ఆ యింట్లో గాలాడక, బయిటికెల్లేక ఎన్నెన్ని బాదలడ్డానో నాకు తెలుసు, నేను కొలిసిన అమ్మోరమ్మకి తెలుసు.

ఆ టయంలోనే ఆంటీగారోల్ల ద్వారాగా ఈయినగోరి సంమందం వొచ్చింది. ఆంటీగారు మాయమ్మకేం సెప్పేరో తెల్దు కానీ, నా పెల్లి సెయ్యాల్సిందేనని మా నానకాడ పట్టట్టి సాదించింది. కుర్రోడిది కానిస్టీబులుజ్జోగం అన్తెలగానే పేణం ఉసూరుమన్నాది.

"నిన్ను కొలిసినందుకు మల్లీ కోటర్సు కూపానికే అంపుతున్నావా అమ్మోరమ్మా" అనుకున్నాను. అంతకన్నా నేనేం సెయ్యిగల్దును? మూర్తవెట్టేసుకున్నాక ఆంటీగారోల్లు నన్నాలింటికి పిలిసి సేనా సేప్మాటాడేరు. ఈయనగోరు కానిస్టీబులే గానీ పోర్సు గాదంట. కోటర్సు ఉండవంట.

"జెవాను బతుకంటే దొరగార్ల దయా దాచ్చిన్యవే బాగ్గెవా.. దొరక్కోపవొచ్చినా బూతులు జెవానుకే. దొర్ల మద్దిన మాట తేడా వొత్తే ఆ పెతాపవూ జెవానోడి మీదే.. దొరగోరి బంగలాలో ఆడర్లీ డూటీ గానీ పడ్డాదంటే ఆల్ల పెల్లాం పిల్లలకి సాకిరీ సెయ్యాలి.. ఆల్ల తిట్లూ కాయాలి" అంటా శానా ఇవరంగా చెప్పుకొచ్చేరు.

"ఇయ్యన్నీ పడ్డ జెవానోడు మరాడి కోపం ఎవడి మీస్సూపించాలి? ఎవున్నంటే ఎవుడూరుకుంటాడు? అన్నిటికీ లోకూగా దొరికీదింట్లో పెల్లవే గదే. అయినా గీనీ, అందరు మొగోల్లొక్కలాగుండ్రనుకో.. రోడ్నడకండా కాపరం సేసుకోయే.." అంటా సెప్పి పంపేరు. నిజంజెప్పాల, మాయమ్మిందులో ఒక్క మాటా సెప్పలేదునాకు. ఆవిడిగోరికి తెలిత్తే నాకు సెప్పకుండా ఉంటాదా?

సేనల్సు మారుత్తా మొగుడూ పెల్లాల పంచాయితీ కాడాగేను. ఒకల్లమీదొకల్లు సినిమా ఏక్టరికి నేరాల్జెప్పుకుంటన్నారు. కొత్తసీర కట్టుకుని, ఏసుకున్న కొత్త మోడలు గొలుసు సేత్తో తిప్పుకుంటా ఇద్దరి మాట్లూ ఇంటన్నాదాయమ్మి.

అసుల్నన్నడీతే మొగుడూ పెల్లాలకి ఈదినడేంత గొడవలే రాకోడదు. ఒకేలొచ్చినా పెద్దల్లో ఎట్టుకుని పరిస్కారం సేసుకోవాల్తప్ప పోలీసోల్ల కాడికీ, టీవీలోల్ల కాడికీ ఎల్లకూడదు. పోలీసోల్లు డబ్బుల్తినేత్తారు, టీవీలోల్లు పరువుల్దీసేత్తారు. నా పెనివిటితో  ఏటీ పడకండానే ఇన్నాలు కాపరం జేసేనా? 

నేను కాపరానికొచ్చేతలికి రొండు గెదులిల్లు. మాయమ్మేదో కాంత సామానం ఇచ్చంపింది. ఈ మడిసి తెల్లార్లేత్తానే డూటీకెల్లిపోయేవోడు. మల్లీ ఏ అద్దరేతిరో తలుపు కొట్టేవోడు. నిజంగానే అంచేపు డూటీ సేత్తన్నాడో ఎక్కడన్నా తిరిగొత్తన్నాడో తెలిసీదికాదు. సెప్పుకోటాక్కూడా ఎవురూ ఉండేవోల్లుగాదు. మాయమ్మకి సెపితే గొడవల్దప్ప ప్రెయోజనం లేదుగదా. అమ్మోరమ్మ మీద బారవేసేను. అంతకన్నా సెయ్యగెలిగింది మాత్తరం ఏవున్నాది?

ఆ టయ్యంలో రావుడన్నయ్య, వొరమ్మొదినా ఎంత కాసేరో సెప్పలేను. ఆల్లేవీ నాకన్నదమ్ములోల్లుగాదు. ఆ మాటకొత్తే మా కులపోల్లే గాదు. అన్నయ్య మాయాయింతోబాటు పంజేత్తాడు. "ఎదవ డూటీల్సెల్లెమ్మా.. సంపేత్తన్నారనుకో.. ఆనాకొడుకులు ఏసీ గెదుల్లోనుంచి కదల్రు.. శాకిరంతా మాకూను, వోటాలేమో ఆల్లకీను.." అంటా చెప్పుకొచ్చేడు.

"మా బావకి సంపాదింతం బొత్తిగా తెల్దు సెల్లెమ్మా.. డబ్బులిచ్చేవోడు సెప్పే ఎదవ కతలన్నీ నమ్మేసి సంగోరుకి బేరం తెగ్గొట్టేత్తా వుంటాడు" అంటా మాయాయినగోరిమీద పాపం జాలడ్డాడు. మొగోల్ల కబుర్లకేట్లేగీనీ, డబ్బుల గురించి మంచీ సెడ్డా సెప్పింతల్లి మా వొరమ్మొదిని. అసలీల్లకి జీతాలెంతొత్తాయి, సంపాదనెలాగుంటాది, ఎల్లాగ దాయాలి.. ఇయ్యన్నీ ఆయమ్మే సెప్పింది. ఇయ్యాల కాంత పచ్చగా ఉన్నావంటే వొరమ్మిచ్చిన సలాలే.

తాగుడలాటు మాయాయినకీ ఉన్నాది. నానలాగా రోజూ కాదుగానీ, వోరానికోరోజో రెండ్రొలో తాగేసొత్తా ఉంటాడు. పిచ్చి కాపోతే, మిటాయి కొట్లో వుండే వోడు రుస్సూడకండా ఉంటాడా? తాగుడు గురించనే కాదు, అసలే ఇసయంలోనూ మాయాయింతో నేను గొంతెత్తి తగువాల్లేదు. తగువాట్టాకి, సాదించుకోనాకి ఏరే పద్దతులుంటాయని నెమ్మది మీద తెలకుండా ఉంటాదా?

తాగొచ్చిన్నాడు మాయాయిన గొంతిప్పనాకి లేదు. ఆడిట్టవయినంత తాగనీ.. తాగుడు సంగతి మా ఇద్దరికీ తప్ప మూడో మడిసికి తెలకూడదు. ఇదీ ఒప్పందం. ఇయ్యాల్టికీ ఇదే జరూతున్నాది. ఏమాటకామాట, ఆడు తాగొచ్చిన్రోజున నాకెంత బాదగా ఉంటాదో అమ్మోరమ్మక్కూడా తెల్దు. పుట్టింట్లో పడ్డయ్యన్నీ వొద్దన్నా గుర్తొస్తానే ఉంటాయి. ఈ మడిసి గొంతెక్కడ లెగుత్తాదో, నేనడ్డ బాదలన్నీ నా పిల్లలెక్కడ అనుబించాలో అని బయివేసేత్తా ఉంటాది. ఆడకూతుర్ని, ఏటి సెయ్యగల్ను? కానైతే, ఈ ఒక్కిసయం తప్పించి, మిగిల్నియ్యి నేను సెయ్యిగల్ను, దైర్నంగా.

అసలేనాడైతే నాకాడ డబ్బు జేగర్తున్నాదాని మాయాయినకి నమ్మకం సిక్కిందో, ఆనాడే డబ్బు పెత్తనం నాసేతికిచ్చేసేడు. వొచ్చిందాంట్లో తన కరుసులకుంచుకుని, మిగిలింది నా సేతుల్లో ఎట్టేత్తావుంటాడు. ఇల్లు సుబ్బరంగా ఉండాల.. సొమ్ములు కరుసైనా పిల్లలికి మంచి సదూల్జెప్పించాల.. ఆడపిల్లకనీసి అప్పుడో కాంతా ఇప్పుడో కాంతా బంగారం జేగర్త సెయ్యాల. మొగ నలుసుకీ ఎంతోకొంత ముట్టజెప్పాల. ఇదీ నా పద్దతి.

అమ్మోరమ్మ దయవొల్ల ఈనాటి వొరకూ అంతా బాగానే వున్నాది. అంతా సరింగా ఉంటే ఆయమ్మిని తల్టం మానెత్తాననుకున్నాదో ఏమో, మెలికెట్టేసింది మాతల్లి.

ఇదేటిదీ, టీవీలో మా పక్కీది కనిపింతన్నాది? గుడెనకాలీది. టీవీ కుర్రోడు సేతుల్తిప్పుకుంటా, గొట్టం మైకు సేతులు మార్సుకుంటా ఏటో సెప్పేత్తన్నాడు. ఆడంగులు గుంపుగా జేరి కేకలెడతన్నారు. ఓయమ్మో మాయాయిన. పక్కనే బిత్తిరిగోడు కూడా వున్నాడు. ఆడు పులుకూ పులుకూ సూత్తన్నాడుగానీ, మావోడు మాత్తరం సెక్కుసెదర్లేదు.

ఏమాటకామాట, మిన్నిరిగి మీదడ్డా సెలించడు మా మొగ పురుసుడు. సౌండెడితే తప్ప ఇసియవేటో తెల్దు. అమ్మోరమ్మ తల్లే.. ఏ ఉపద్దరవం తెత్తన్నావమ్మా.. సీ.. ఈ టీవీలోల్లకి ఏలా పాలా లేదు.. సౌండెట్టీలోగా వోర్తలాపేసి ఎడ్వడింగులు మొదలెట్టేసేరు.. కాంచేపాగాలా ఉప్పుడు?

(చిన్న బ్రేక్...)

శనివారం, అక్టోబర్ 24, 2015

కంచె

"ప్రియమైన సీత గారికి, ధూపాటి హరిబాబు వ్రాయునది..." ఏమిటిది? ఓ కుర్రాడు తన స్నేహితురాలికి రాస్తున్న ఉత్తరమా లేక ప్రియుడు ప్రేయసికి రాస్తున్న ప్రేమలేఖా? ఇంతకుమించి ఆలోచన ముందుకు వెళ్ళదు. వెళ్తే ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకి సమాధానం 'కంచె' సినిమా. నూట ఇరవై ఐదు నిమిషాల స్క్రీన్ టైం లో ఏ ఒక్క నిమిషాన్నీ వృధా చేయకుండా, ఒక్క క్షణం కూడా ప్రేక్షకులకి తల పక్కకి తిప్పే అవకాశం ఇవ్వని విధంగా, అత్యంత పగడ్బందీగా క్రిష్ తీసిన సినిమా ఇది.

'గమ్యం,' 'వేదం' చూసిన తర్వాత క్రిష్ మీద పెరిగిన అంచనాలు ఒక పక్కా, షూటింగ్ దశ నుంచీ పోస్ట్-ప్రొడక్షన్ వరకూ సినిమా తాలూకు వివరాలన్నీ తెలుస్తూ ఉండడం మరో పక్కా 'కంచె' మీద ఆసక్తిని పెంచాయి. మొదటి రోజే వినిపించిన 'సినిమా బాగుంది' అన్న టాక్ సంతోషం కలిగించినా, చూడ్డానికి మాత్రం రెండు రోజులు ఆగాల్సి వచ్చింది. కంటికి ఇంపైన కెమెరా పనితనం, సన్నివేశాలకి సరిగ్గా సరిపోయే సంగీతం, అక్కడక్కడా 'కాస్త నాటకీయత' వినిపించినా గుర్తుండిపోయే సంభాషణలు,  అన్నింటినీ మించి పాత్రల పరిధుల మేరకు మాత్రమే నటించిన నటీనటులు... 'కంచె' కథతో పాటుగా గుర్తొచ్చేవివన్నీ.

రెండో ప్రపంచ యుద్ధ కాలంనాటి ఒక ఊరి కథనీ, యుద్ధంలో పాల్గొన్న ఒక బెటాలియన్ కథనీ కలిపి అల్లిన కథ 'కంచె.' రెండు కథలనీ సమాంతరంగా నడపడమే కాదు, ఒక్కో భాగాన్నీ సరిగ్గా ఎక్కడ ఆపాలో అక్కడే ఆపి, రెండో కథలో భాగాన్ని సరిగ్గా అతికే విధంగా జతచేసి చివరివరకూ ప్రేక్షకుల ఆసక్తి సడలని విధంగా కథనాన్ని నడపడం - స్క్రీన్ ప్లే - ఇది మొదటి విజయం. 'గమ్యం' తర్వాత క్రిష్ మెరిపించిన స్క్రీన్ ప్లే 'కంచె' దనే చెప్పాలి. పాత్రలకి తగ్గట్టుగా నటీనటుల్ని ఎంచుకోవడం (వీళ్ళు తప్ప మరొకరు సరిపోరు అనిపించే విధంగా) వాళ్ళ నుంచి కథకి కావలసినంత మాత్రమే నటనని రాబట్టుకోడం (గొల్లపూడి చేత కూడా అండర్ ప్లే చేయించడం!!) క్రిష్ రెండో విజయం.


యుద్ధ కథని పండితపామర జనరంజకంగా చెప్పాలంటే సరైన సంభాషణలు అత్యవసరం. ప్రేమకథ తో తనని తాను నిరూపించుకున్న సాయి మాధవ్ బుర్రా తక్కువ మాటల్లో ఎక్కువ కథని చెప్పారు. (రెండు మూడు సన్నివేశాల్లో 'డైలాగులు మరి కొంచం సటిల్ గా ఉంటే బాగుండు' అనిపించిన మాట నిజం) హీరో మిత్రుడి చేత కోట్ చేయించిన 'శ్రీనివాసరావు' కవితా పంక్తుల్ని శ్రీనివాసరావు ఎవరో తెలియని వాళ్ళు బాగా ఆస్వాదిస్తే, తెలిసినవాళ్ళు 'ఈ కథా కాలం నాటికి ఈ కవిత వెలుగు చూసిందా?' లాంటి సందిగ్దావస్థ లోకి వెళ్ళారు (స్వానుభవం!).

పీరియడ్ మూవీ కి ప్రాణం సంగీతం. చిరంతన్ భట్ తనకప్పగించిన పనికి పూర్తి న్యాయం చేశాడు. సన్నివేశాలకి తగ్గట్టుగా నేపధ్య సంగీతాన్ని, నిశ్శబ్దాన్నీ అందించాడు. జ్ఞానశేఖర్ కెమెరా, సూరజ్ ఎడిటింగ్ లని గురించి ప్రస్తావించకపోతే ఎలా? ఒక్కమాటలో చెప్పాలంటే, కెమెరా కంటికి ఇంపుగానూ, ఎడిటింగ్ సమతూకంగానూ ఉన్నాయి. వర్గ వైరుధ్యాలు కథా వస్తువయినప్పుడు ఏదో ఒక వర్గాన్ని ఎంతోకొంత నొప్పించక తప్పదు. కానైతే క్రిష్ 'నొప్పించక తానొవ్వక' పద్ధతిలో కథ నడుపుకుని వచ్చేశాడు. "నేను కమర్షియల్ దర్శకుణ్ణి మొర్రో" అని ఊరికే అంటున్నాడా మరి!

మెగా ఫామిలీ కుర్రాడు వరుణ్ తేజ్ హరిబాబు పాత్రలో మెప్పించగా, స్నేహితుడి పాత్రలో అవసరాల శ్రీనివాస్ కొన్ని సన్నివేశాల్లో పోటీ పడ్డాడు. వరుణ్ ముఖం లో ప్లస్ పాయింట్ (కళ్ళు) ని కెమెరా బాగా కేప్చర్ చేసింది. కథానాయిక సీతగా వేసిన ప్రగ్యా జైస్వాల్ కి నటించేందుకు అవకాశం ఉన్న పాత్ర. పోస్ట్-ప్రొడక్షన్ టైంలో మిత్రులొకరు 'హీరోయిన్ కి చేయడానికి పెద్దగా ఏమీ లేదు.. హీరో సెంట్రిక్ మూవీ' అని చెప్పడంతో పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్లాను. ప్రాధాన్యత ఉన్న పాత్రకి ఆ అమ్మాయి న్యాయం చేసింది. డిజైనర్ చీరలకి బదులుగా, ఏంటిక్ లుక్ ఉండే చీరలు కడితే మరింత బాగుండేది.

చిత్రీకరణ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు అడుగడుగునా తెరమీద కనిపించాయి. ముఖ్యంగా డెబ్భై ఎనభై ఏళ్ళ నాటి గ్రామీణ వాతావరణ చిత్రణ, కరెంట్ తీగలు కూడా కనిపించని ఊరు, పాత్రల ఆహార్యం, పీరియడ్ ని గుర్తుచేసేవిధంగా సంభాషణలు ఇవన్నీ చిత్ర బృందం తీసుకున్న జాగ్రత్తని చెప్పకనే చెబుతాయి. సింగీతం శ్రీనివాస రావు, షావుకారు జానకి చిన్న పాత్రల్లో మెరిశారు. హీరో తల్లి పాత్ర ఎవరన్నా సీనియర్ నటి చేత చేయించి ఉంటే బాగుండేది అనిపించింది. మొత్తంగా చూసినప్పుడు మెచ్చవలసిన ప్రయత్నం. వైవిధ్య భరితమైన సినిమాలు ఇష్టపడే వాళ్ళు మిస్ కాకూడని సినిమా ఇది.

సోమవారం, అక్టోబర్ 19, 2015

మంజుల నుంచి నీహారిక వరకూ ...

పాతికేళ్ళ క్రితం ఓ ప్రముఖ తెలుగు సినీ కథా నాయకుడి కుమార్తె వెండితెర నాయికగా పరిచయం కాబోతోందన్న వార్త పత్రికల్లో వచ్చింది. ఆ మర్నాటి నుంచీ ఆ హీరో అభిమానులు ఆ అమ్మాయిని సినిమాల్లోకి రావద్దంటూ బహిరంగ ప్రకటనలు చేయడంతో పాటు, అభిమాన హీరోని కలిసి ఒత్తిడి తెచ్చారు కూడా. ఈ అభిమానులే ఆ కథానాయకుడి కొడుకులిద్దరినీ హీరోలుగా ఆదరించారు. వాళ్ళలో చిన్నవాడు ఇప్పుడు తెలుగు టాప్ హీరోల్లో ఒకడైన మహేష్ బాబు. ఆ అమ్మాయి పేరు మంజుల.

నటి కావాలన్న మంజుల కోరిక కేవలం తన తండ్రి అభిమానుల కారణంగా తీరకుండా పోయింది. ఒకటి రెండు పరభాషా చిత్రాల్లో ప్రత్యేక అతిధి పాత్రల్లో నటించిన మంజుల, 2002 లో తను నటించి, నిర్మించిన తెలుగు సినిమా 'షో' తాలూకు వివరాలని సినిమా విడుదల ముందు వరకూ అత్యంత రహస్యంగా ఉంచాల్సి వచ్చింది. ఆ సినిమా రొటీన్ కి భిన్నమైనది కావడం, ఆమెపాత్ర హీరోతో ఆడిపాడే రొటీన్ కథానాయిక పాత్ర కాకపోవడం వల్ల ఆమె తండ్రి 'నటశేఖర' కృష్ణ అభిమానులు 'షో' ని ఆదరించారు. వెండితెర మీద కథానాయికగా వెలుగొందాలనుకున్న మంజుల, తన తండ్రి అభిమానుల కారణంగా ఆ ప్రయత్నం మానుకుని నిర్మాతగా స్థిరపడింది.


పాతికేళ్ళు గడిచాయి. ఈ మధ్యలో అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి ఆయన మనవరాలు సుప్రియ ఒకే ఒక్క సినిమాలో కథానాయికగా నటించింది తప్పిస్తే, ప్రఖ్యాత సినీ కుటుంబాల్లో స్త్రీలెవరూ వెండితెర మీదకి రాలేదు. ఇన్నేళ్ళ తర్వాత, ఒకప్పుడు మంజులకి ఎదురైన సమస్యే ఇప్పుడు నీహారిక ఎదుర్కొంటోంది. 'మెగాస్టార్' చిరంజీవి సోదరుడు 'లాఫింగ్ స్టార్' నాగబాబు కుమార్తె నీహారిక. ఇప్పటికే టీవీ షోలకి వ్యాఖ్యాతగా జనానికి పరిచయం అయ్యింది. మరో అడుగు ముందుకు వేసి సినిమాల్లో కథా నాయికగా నటించాలని నిర్ణయించుకుంది నీహారిక. తండ్రి ప్రోత్సహించాడు. దర్శక నిర్మాతలు ముందుకి వచ్చారు. కానీ, అభిమానులు అభ్యంతరం చెబుతున్నారు.

"నీహారికని మేము సోదరిగానో, కూతురిగానో చూస్తాం.. ఆమెని కథానాయికగా పరిచయం చేయడం మాకు అభ్యంతరం," అంటున్నారట చిరంజీవి అభిమానులు. నీహారిక చేయబోయే సినిమా దర్శక నిర్మాతలకి కొందరు అభిమానులనుంచి బెదిరింపులు వచ్చాయనీ, అయినప్పటికీ వెనక్కి తగ్గనవరసం లేదని వాళ్లకి నాగబాబు హామీ ఇస్తున్నారనీ ఆంగ్ల దినపత్రిక 'ది హిందూ' రాసింది. తండ్రి, సోదరుడు వరుణ్ తేజ్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులనుంచి నీహారికకి ప్రోత్సాహం లేదన్నది ఆ పత్రిక కథనం. అభిమానుల ఒత్తిళ్ళని నాగబాబు కుటుంబం ఏమాత్రం పట్టించుకోడవం లేదనీ, నీహారిక కథానాయికగా పరిచయం కావడం ఖాయమనీ తెలుస్తోంది.

రెండు ఉదంతాలనీ 'ఆడపిల్ల మీద వివక్ష' కోణం నుంచి కన్నా, 'తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయిక స్థానం' అన్న కోణం నుంచి చూడడమే సముచితం. పాతికేళ్ళ క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు కథానాయిక స్థాయి పెరగక పోగా మరింత దిగజారిందన్నది వాస్తవం. హీరోలిప్పుడు తెరమీద నాయికని 'ఏమే.. ఒసే..' అని పిలుస్తున్నారు. ఇలాంటి సంభాషణలు రాస్తున్న రచయితలేమో కాపురాలు బాగుచేసే టీవీ పంచాయితీల్లో పెద్దమనుషుల పాత్ర పోషిస్తున్నారు. మెజారిటీ సినిమాల్లో కథలో నాయిక పాత్ర ప్రాధాన్యం మొదలు, చిత్రీకరణలో ఔచిత్యం వరకూ తిరోగమన దిశలోనే ఉన్నాయిప్పుడు.


తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు, నాయికల ప్రాధాన్యత పాటలకే పరిమితం అవ్వడానికి కారకుల్లో కథానాయకులూ ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. హీరో పాత్రని ఎలివేట్ చేసే క్రమంలో మిగిలిన పాత్రల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చి, చివరికి హీరో పాత్రలు కూడా నేలవిడిచి సాము చేసే స్థితి వచ్చేసింది. ఈ క్రమంలో, ఇప్పటి హీరోయిన్లు ఒకనాటి వ్యాంపుల స్థానాన్ని భర్తీ చేస్తున్నారు తప్ప, అంతకు మించి వాళ్లకి చేసేందుకు ఏమీ ఉండడంలేదు. అందుకే కావొచ్చు, అభిమానులు తమ హీరోల కుమారులు తెరమీద చేసే అద్భుతాలకి జేజేలు పలుకుతున్నారు. కూతుళ్ళు నాయికలుగా వస్తామంటే, వాళ్ళని వ్యాంపులుగా చూడలేమని తిరస్కరిస్తున్నారు.

నూటికి తొంభైకి పైగా సినిమాల్లో నాయికని వ్యాంపుగా చిత్రించి, ఏడాదికో రెండేళ్ళకో ఓ సారి బాక్సాఫీసుని కొల్లగొట్టే ఒకటీ అరా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలని ఉదాహరణగా చూపించి తెలుగు తెరపై నాయికలు పూజలందుకుంటున్నారు అనడం ఆత్మవంచన తప్ప మరొకటి కాదు. నాయిక విలువని హీరోయిన్లకి చెల్లించే పారితోషికాలతో కాక, సినిమా కథలో వాళ్ళకున్న ప్రాధాన్యతతో కొలవడం అత్యవసరం. కథానాయికలంటే కేవలం షో పీస్ లు కాదన్న భావన ప్రేక్షకుల్లో వచ్చిన రోజున, మంజుల, నీహరికలకి ఎదురైన వ్యతిరేకతలాంటివి మున్ముందు కాలంలో మరో నాయికకి ఎదురుకాకుండా ఆగే అవకాశం ఉంది. కానీ, ఆలోచించగలిగే ఓపికా, తీరికా ఎందరికి ఉన్నాయి?

శుక్రవారం, అక్టోబర్ 16, 2015

రుద్రమదేవి

కాలేజీ పిల్లల్ని గుంపులుగా చూసినప్పుడల్లా 'వీళ్ళలో చాలామందికి చరిత్ర తెలీదు కదా.. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు కదా' అనిపిస్తూ ఉంటుంది. చరిత్ర తెలుసుకోక పోవడం వల్ల వాళ్లకి కలిగే నష్టం ఏమీ ఉండదు.. కేంపస్ ప్లేస్మెంట్లలో చరిత్ర గురించి ప్రశ్నలు ఉండవు కాబట్టి. "సోషల్ సైన్సెస్ వేస్టు, కంప్యూటర్ కోర్సులే ముద్దు" అని ఏలినవారే స్వయంగా చెప్పాక, పిల్లల్ని అనుకోవడం ఎందుకు? గడిచిన వారం రోజులుగా "రానా భలేగా చేశాడు.. అల్లు అర్జున్ అదుర్స్" తో పాటు "రుద్రమదేవిని నిజంగానే మగ పిల్లాడిలా పెంచారా?" అన్న ప్రశ్న అక్కడక్కడా కుర్రాళ్ళ నుంచి వినబడుతోంది. ఈ ఆసక్తికి కారణం గతవారం విడుదలైన 'రుద్రమదేవి' సినిమా.

పిల్లలకి చరిత్రని గురించి ఆసక్తిని పెంచే ఒక్కో మార్గమూ మూసుకుపోతున్న తరుణంలో శక్తివంతమైన సినిమా మాధ్యమం ఉపయోగించుకుని తనదైన శైలిలో ఓ ప్రయత్నం చేసిన దర్శక నిర్మాత గుణశేఖర్ కి ముందుగా అభినందనలు. కాకతీయుల చరిత్రని, మరీ ముఖ్యంగా రుద్రమదేవి చరిత్రని సినిమాటిక్ లిబర్టీ సహితంగా జనం ముందు పెట్టాడు గుణశేఖర్. నాయిక ప్రధానమైన భారీ బడ్జెట్ సినిమాని నిర్మించడానికి ఏ నిర్మాతా ముందుకు రాకపోతే, నిర్మాణ బాధ్యతల్ని సైతం తనే తలకెత్తుకున్నాడు. అడివి బాపిరాజు రాసిన 'గోన గన్నారెడ్డి' తో సహా, కాకతీయుల చరిత్రకి సంబంధించి ఎన్నో పుస్తకాలు చదివి స్క్రిప్టు రాసుకున్నాడు.

పుత్ర సంతానం లేని గణపతి దేవ చక్రవర్తి తన ప్రధమ పుత్రిక రుద్రమదేవి ని 'రుద్రదేవుడు' అనే పేరుతో రాజ్య ప్రజలకి పరిచయం చేసి, మగపిల్లాడిగానే పెంచి పట్టాభిషేకం చేయడం, శత్రురాజుల్నీ, ఎదురు తిరిగిన సామంతులనీ దనుమాడి కాకతీయ సామ్రాజ్యాన్ని రుద్రమ సుస్థిరం చేయడం అన్నది స్థూలంగా చరిత్ర. ఈ కృషిలో రుద్రమకి అండదండలు అందించిన వారు మంత్రి శివదేవయ్య దేశికులు, గజదొంగ గోనగన్నారెడ్డి. ఈ కథని నేరుగా చెప్పకుండా, ఇటలీ నుంచి ఆరంభించడం, విదేశీయుల చేత రుద్రమకి జేజేలు పలికించడం తెలివైన ఎత్తుగడ. రుద్రమ జననంతో ఆరంభమయ్యే ఫ్లాష్ బ్యాక్, శత్రురాజు, సామంతులపై ఆమె విజయంతో ముగుస్తుంది. అటుపై శుభం కార్డుకి బదులుగా 'ప్రతాప రుద్రుడు' కార్డు తెరపై ప్రత్యక్షమై, ప్రేక్షకులని హాలు ఖాళీ చేయమంటుంది.

కాకతీయ వీరనారి రుద్రమలో ఉన్న 'హీరోయిజం' ని తెరమీదకి అనువదించడంమీద దర్శకుడు పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టలేదనిపించింది. సినిమా పూర్తయ్యాక 'ఇంతకీ రుద్రమ ఏమేం చేసింది?' అన్న ప్రశ్నకి మరికొంచం గట్టి జవాబు వచ్చే వీలుంది. కానైతే, వచ్చే జవాబు ఏమంత సంతృప్తిగా అనిపించదు. కొన్ని సన్నివేశాల నిడివి తగ్గించి, మరికొన్నింటిని వాయిస్ ఓవర్ తో సరిపెట్టి, రుద్రమ మీద సన్నివేశాలని ఫోకస్ చేసి ఉంటే ఈ అసంతృప్తి ఉండేది కాదు. 'నదీ ప్రవాహాన్ని ఆపడం' అనే ముఖ్యమైన విషయాన్ని క్లుప్తంగా తేల్చేయడం, ప్రాకారాల నిర్మాణాన్ని మాటలతోనే పూర్తి చేసేయడం (ఈ సినిమా వరకూ ఈ ప్రాకారాలు రుద్రమ ప్రధాన విజయాల్లో ఒకటి) నిరాశ కలిగించే అంశాలు.


కాకతీయ సామ్రాజ్యం కథలో పాలకులకే తప్ప ప్రజలకి భాగం ఉన్నట్టు కనిపించలేదు. మహా సభలో అనుకూల, ప్రతికూల నినాదాలు చేసే ప్రజలు మాత్రమే కనిపిస్తారు. 'కాకతీయుల కాలంలో ప్రజా జీవితం' అన్న విషయాన్ని ఈసినిమా స్క్రిప్టు పూర్తిగా విస్మరించింది. ఆహార వ్యవహారాలు, కళా సంస్కృతులు ఇవేవీ కనిపించవు. అంతఃపురాన్ని దాటి కెమెరా బయటికి వచ్చిందే తక్కువ. చరిత్రలో కాకతీయ శిల్పానికి ప్రత్యేక స్థానం ఉంది. ఒక్క ఆలయ నిర్మాణమూ తెరకెక్కలేదు. వీరశైవ మతావలంబకులైన కాకతీయుల కాలంలోనే 'పేరిణి' తాండవ నృత్యం బహుళ ప్రచారంలోకి వచ్చిందంటారు. ఒక్క ఫ్రేములో కూడా ఆ నాట్యం కనిపించలేదు.

రాకుమార్తె అన్నాంబిక (సినిమాలో అనామిక)ని వ్యాంపు లా చిత్రించడం, ముమ్ముడమ్మ (సినిమాలో ముక్తాంబ) ని పాత్రౌచిత్యానికి తగని విధంగా 'బబ్లీ' గా చూపించడాన్ని పరిహరించి ఉంటే బాగుండుననిపించింది.  నటీనటుల విషయానికి వస్తే, గణపతి దేవుడిగా కృష్ణంరాజు కేవలం విగ్రహ పుష్టిగా మిగిలిపోయాడు. నటించడానికి అవకాశం ఉన్న సన్నివేశాల్లోకూడా నిర్లిప్తంగా ఎందుకుండి పోయాడో అర్ధం కాదు. శివదేవయ్యగా ప్రకాష్ రాజ్ తెలుగు వినడానికి చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. 'శ' ని 'ష' అని పలికే ప్రకాష్ రాజ్ డైలాగుల నిండా అనేకానేక 'శ' లు ఉండడంతో అవి వినడానికి ఎంత సహనమూ సరిపోలేదు. ఒకానొక దశలో 'ఈ పాత్రకి వేరే ఎవరిచేతన్నా డబ్బింగ్ చెప్పిస్తే బాగుండేది' అనిపించింది.

రుద్రదేవుడు, రుద్రమదేవి పాత్రలని న్యాయం చేసే నటి ప్రస్తుత జనరేషన్లో అనుష్క ఒక్కర్తే. రెండు పాత్రలకీ న్యాయం చేసిన అనుష్క, రాచకన్య దుస్తుల్లో బాగా ఒళ్ళు చేసినట్టుగా కనిపించింది. కెమెరా లోపమో ఏమో తెలీదు. చాళుక్య వీరభద్రుడి పాత్రని రానా, గోన గన్నారెడ్డి పాత్రని అల్లు అర్జున్ అలవోకగా చేసేశారు. అల్లువారబ్బాయి ఇమేజిని దృష్టిలో పెట్టుకుని, గోన గన్నారెడ్డి పాత్రకి హీరోయిజాన్ని రెండింతలు చేశారు. ఈ రాయలసీమ రాకుమారుణ్ణి తెలంగాణా ఖాతాలోకి పంపడం వెనుక ఏదో అంతరార్ధం ఉండే ఉంటుంది. సాంకేతికంగా ఏమాత్రం బాగోనిది సంగీతం. ఇళయరాజా సంగీతం అంటే అస్సలు నమ్మబుద్ధి కావడంలేదు.

రుద్రమకి తను ఆడపిల్లని అని తెలిసే సన్నివేశం, అదే విషయం ముక్తాంబకి తెలుసునని రుద్రమకి తెలియడం.. చప్పట్లు కొట్టించే సన్నివేశాలు ఈ రెండూ. వీటితో పాటు మరో రెండు మూడు సన్నివేశాలు 'భలే' అనిపిస్తాయి. యుద్ధ సన్నివేశాలు చూస్తున్నంత సేపూ మంచి నేపధ్య సంగీతం జతకూడితే ఇంకెంత బాగుండేదో కదా అని మరీ మరీ అనిపించింది. భారీ బడ్జెట్ నీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ నీ ఏ చందమామ కథ చెప్పడానికో కాక చరిత్రని చెప్పడానికి ఉపయోగించుకున్న గుణశేఖర్, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని ఉంటే మరింత గొప్ప చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి ఇచ్చినవాడై ఉండేవాడు. అలాగని, గుణశేఖర్ కృషిని తక్కువ చేయడానికి లేదు. ఎవరు చేయగలిగారు ఇన్నాళ్ళుగా? హౌస్ ఫుల్ అయిన థియేటర్ లో అన్ని వయసుల వాళ్ళూ ఉండడం, యువత ఎక్కువగా ఉండడం సంతోషంగా అనిపించింది.

చివరగా ఓ చిన్న పిడకల వేట: అతిథి పాత్రలతో కలిపి చిరంజీవి ఇప్పటివరకూ 149 సినిమాలు చేశాడనీ, రాబోయేది నూట యాభయ్యో సినిమా అవుతుందనీ, అది బ్రహ్మాండం బద్దలు కొడుతుందనీ బాగా ప్రచారం జరుగుతోంది. నిజానికి, 'రుద్రమదేవి' లో చిరంజీవి తెరమీద కనిపించలేదన్న మాటే కానీ, సినిమా ఆసాంతమూ 'వాయిస్ ఓవర్' రూపంలో స్వరం వినిపిస్తూనే ఉంది. ఈ వాయిస్ ఓవర్ అతిథి పాత్ర పాటి చేయదా? 'రుద్రమదేవి' నే చిరంజీవి నూట యాభయ్యో సినిమాగా లెక్కేయడానికి అభ్యంతరం ఏవిటో అర్ధం కావడం లేదు నాకు.

ఆదివారం, అక్టోబర్ 04, 2015

'పూర్ణోదయా' నాగేశ్వర రావు

కాకినాడ సాల్ట్ ఇనస్పెక్టర్ గారబ్బాయి.. పీఆర్ కాలేజీగా పిలవబడే పిఠాపురం రాజా కాలేజీలో చదువుకునే రోజుల్లో నాటకాల సరదా మొదలయ్యింది. కాకినాడ అంటేనే కళలకి కాణాచి. ఇక నాటకరంగం సంగతి చెప్పక్కర్లేదు. ఈ కుర్రాడికి ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒకతని పేరు వీరమాచనేని రాజేంద్రప్రసాద్.. మరొకతను హరనాథ రాజు. ముగ్గురూ కలిసి కాలేజీలో నాటకాలు ఆడారు. అబ్బే, కాలేజీలో ఏడాదికి ఒకటో, రెండో నాటకాలు అంతే. పైగా, ఓల్డ్ స్టూడెంట్స్ కి నాటకాలు వేసే అవకాశం లేదు. 'నాటకాలని వదిలేయాల్సిందేనా?' అన్న ప్రశ్న. జవాబు 'అవును' అయితే, తర్వాతి కథ వేరేగా ఉండేదేమో బహుశా. 

పీఆర్ కాలేజీలో చదువు పూర్తవుతూనే బళ్ళారి రాఘవని స్మరించుకుంటూ 'రాఘవ కళా సమితి' ఆరంభించారు. సాంఘిక నాటకాలకి దశ తిరిగిన కాలం. ఆచార్య ఆత్రేయ చేయితిరిగిన నాటక రచయితగా వెలుగొందుతున్న రోజులు. సినిమా పరిశ్రమకి అంజలీదేవి, ఆదినారాయణ రావు, రేలంగి, రావు గోపాలరావు లాంటి మహా మహులని అందించిన ది యంగ్మెన్స్ హేపీ క్లబ్ ఉన్నది కాకినాడలోనే. అయినప్పటికీ, రాఘవ కళా సమితి అతి తక్కువకాలంలోనే తనకంటూ పేరు తెచ్చుకుంది. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ నిర్మాతగా నిలదొక్కుకునే ప్రయత్నాలు, హరనాథ రాజు హీరో చాన్సుల కోసం మద్రాసు బయల్దేరారు. మిత్రుణ్ణి మర్చిపోలేదు.

తను తీసిన మొదటి సినిమా 'ఆరాధన' లో కాలేజీ మిత్రుడి చేత వేషం వేయించారు రాజేంద్ర ప్రసాద్. అటు పైని కూడా నటుడిగా అవకాశాలు అడపా దడపా వస్తూనే ఉన్నాయి. అయితే అవేవీ పెద్దగా గుర్తింపు రాడానికి అవకాశం ఉన్న పాత్రలు కాదు. వేషాలు వేస్తున్న కాలంలోనే అంతకు మించి ఏదన్నా చేయాలన్న ఆలోచన వచ్చింది. 'పూర్ణోదయా మూవీ క్రియేషన్స్' పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి, పక్కూరి అమ్మాయి జయప్రద కథానాయికగా, అప్పటికే స్నేహితుడైన కె. విశ్వనాధ్ దర్శకత్వంలో 'సిరి సిరి మువ్వ' సినిమా తీసి 1978 లో సినిమా నిర్మాత అయ్యారు ఏడిద నాగేశ్వర రావు.


అటు తర్వాతి పద్నాలుగేళ్ళ కాలంలో కేవలం పది సినిమాలు (మాత్రమే) నిర్మించి, అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకోడమే కాకుండా, తనకూ, తన సంస్థకూ తెలుగు సినిమా చరిత్రలో ఓ పేజీని కేటాయింపజేసుకున్నారు నాగేశ్వర రావు. తెలుగు సినిమా నలుపు తెలుపుల నుంచి రంగుల్లోకి మారిన తర్వాత వచ్చిన మొదటి పది కళాత్మక సినిమాల జాబితా వేస్తే, అందులో 'పూర్ణోదయా' వారి సినిమా లేకపోతే ఆ జాబితా అసంపూర్ణం. ఖండాంతరాల్లో ఖ్యాతి తెచ్చిన 'శంకరాభరణం' వ్యాపార పరంగా నిర్మాతకి లాభాలు తేకపోవడం సినిమా పరిశ్రమలో మాత్రమే సాధ్యమయ్యే ఒకానొక వైచిత్రి.

కుమారుడు ఏడిద శ్రీరాంని కథానాయకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన 'స్వరకల్పన' బాగా ఆడదు అని తెలిసీ విడుదల చేశానని మరో నిర్మాత అయితే చెప్పేవారు కాదేమో. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పక్కూరు పసలపూడి కుర్రాడు పాతికేళ్ళ వంశీ కి దర్శకుడిగా అవకాశం ఇస్తూ తారల్ని కాక కథని నమ్మి 'సితార' నిర్మించడం నాగేశ్వరరావు అభిరుచికీ, ధైర్యానికీ కూడా నిదర్శనం. ఏడిద నాగేశ్వర రావు నిర్మించిన పది సినిమాల్లోనూ ఆరు సినిమాలకి - సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి, ఆపద్భాందవుడు - దర్శకుడు కె. విశ్వనాధ్. ఈయన పేరుకి ముందు 'కళా తపస్వి' వచ్చి చేరడంలో 'పూర్ణోదయా' ది కీలకపాత్ర.

కొందరు నిర్మాతలు మారుతున్న కాలానికి అనుగుణంగా తమని తాము మార్చుకోడానికి కాంప్రమైజ్ అవ్వగలరు. అలా అవ్వడానికి సిద్ధ పడకుండా, సినిమా నిర్మాణానికే దూరం జరిగిన కొద్దిమంది నిర్మాతల్లో నాగేశ్వర రావు ఒకరు. 'ఆపద్భాందవుడు' తరువాత మరి సినిమాలు నిర్మించలేదు. అలాగని సినిమా పరిశ్రమకి దూరంగా జరగనూలేదు. అవార్డుల కమిటీ చైర్మన్ లాంటి ఎన్నో పదవులు నిర్వహించారు. వచ్చిపడిన మార్పుని ఆడిపోసుకోకుండా తనలాంటి వాళ్లకవి సరిపడవని ఒప్పుకుని చిత్ర నిర్మాణం నుంచి తప్పుకున్నారు. అయితేనేం, తెలుగు సినిమా చరిత్రలో 'పూర్ణోదయా' నాగేశ్వరరావు స్థానం పదిలం, ప్రత్యేకం. తెలుగు సినిమాకి ఇలాంటి నిర్మాతల అవసరం ఉంది, రాడానికి అవసరమైన పరిస్థితులు ఏర్పడితే అదే ఏడిద నాగేశ్వర రావుగారికి అసలైన నివాళి అవుతుంది.

శనివారం, ఆగస్టు 29, 2015

అదీ సంగతి ...

హోటల్ డైనింగ్ హాల్ అంతా హడావిడిగా ఉంది. శనివారం సాయంత్రం టిఫిన్స్ అన్-లిమిటెడ్ బఫే ఆఫర్. పెద్దలూ, పిల్లలూ అన్న భేదం లేకుండా.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆబాలగోపాలమూ అక్కడే ఉన్నారు. మెనూ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇడ్లీ, కోకోనట్ ఇడ్లీ, పకోడీ, పుణుకులు, పెసరట్, ఉప్మా, పుల్కా విత్ రాజ్మా కర్రీ, నూడుల్స్, చాట్ మరియూ అక్కడిక్కడ తయారు చేసి వడ్డిస్తున్న స్వీట్ మలై పూరీ. ప్లేట్లో రెండిడ్లీలు పెట్టుకుని, చట్నీలు, సాంబారు కప్పుతో చోటు వెతుక్కుంటూ హాలంతా కలియతిరుగుతున్న నా బాధ భరించలేక ఓ టేబుల్ కార్నర్ సీట్ చూపించాడు మేనేజర్.

నా ఎదురుగా ఇద్దరు పెద్దవాళ్ళు. ఎప్పుడో రిటైరైన ఉద్యోగులై ఉంటారు బహుశా. కొంచం గట్టిగానే కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. వద్దన్నా వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. బ్యాంకుల వడ్డీ రేట్లు, బంగారం ధరల్లో మార్పులు, షేర్ మార్కెట్ పతనం లాంటి టాపిక్స్ జమిలిగా నడుస్తున్నాయి. పక్క టేబిల్ లో కుర్ర గుంపు.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అంటూ టాపు లేపేస్తున్నారు. శ్రద్ధగా రెండిడ్లీలూ పూర్తి చేసి పెసరట్ ఉప్మా కోసం వెళ్ళబోతూ ఎదుటివాళ్ళిద్దరివైపూ చూశాను. ఒకాయన మా పక్క టేబిల్ వైపు విసుగూ కోపం కలగలిపి చూస్తున్నాడు. ఎందుకై ఉంటుంది?

పెసరట్టు, పేస్టుప్మాతో పాటు చట్నీలు వడ్డించుకుని సీటు దగ్గరికి వస్తూ ఈసారి పక్క టేబిల్ మీద దృష్టి పెట్టాను. మొత్తం నలుగురు. కాలేజీ ఈడు వాళ్ళు. ముగ్గురు అబ్బాయిలు, ఓ అమ్మాయి. ఆమె వాళ్ళందరితోనూ నవ్వుతూ, తుళ్ళుతూ కబుర్లు చెబుతోంది. 'అరేయ్' 'ఒరేయ్' అంటూ కబుర్లు చెబుతూ, అప్పుడప్పుడూ చనువుగా ఒక్కటేస్తోంది. కూర్చుంటూ ఎదుటాయన్ని ఓసారి చూశా. ఆయనకే శక్తి ఉంటే వాళ్ళ నలుగురినీ అక్కడికక్కడే బూడిద చేసేసి ఉండేవాడేమో బహుశా. పెసరట్టు పని పడుతూ ఉండగా మహేష్ బాబు గ్రూపుకీ, పవన్ కళ్యాణ్ కీ తగాదా. పవన్ కళ్యాణ్ గ్రూపులో ఒక్కడే. ఆ అమ్మాయి ఈ గొడవ పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటోంది.

చుడీదారు, కళ్ళజోడుతో చదువుల సరస్వతిలా ఉందా అమ్మాయి (స్కూలు, కాలేజీ పిల్లలకి కనుక కళ్ళజోడు ఉంటే వాళ్ళు పుట్టు మేధావులని నాకో బలమైన ఫీలింగ్, నా చిన్నప్పటినుంచీ కూడా). గొడవ చల్లారింది. వాళ్ళు నలుగురూ వెళ్లి స్వీటు తెచ్చుకున్నారు. ఎదుటి ఇద్దరూ కళ్ళతోనే మొటికలు విరుస్తున్నారు. ఒకాయన ఉన్నట్టుండి వాళ్ళ పిల్లలని తను ఎంత క్రమశిక్షణతో పెంచాడో చెప్పడం మొదలుపెట్టాడు, రెండో ఆయనకి. నేను నవ్వాపుకోవాల్సిన తరుణం రానే వచ్చేసింది. ఆయన్ని పూర్తి చేయనివ్వకుండా రెండో ఆయన అందుకుని 'పిల్లలు-తల్లిభయం' టాపిక్ అలవోకగా అందుకున్నాడు. ఆ పిల్లలు కనీసం ఇటు చూడకుండా 'శ్రీమంతుడు' గురించి చెప్పుకుంటున్నారు.

చూస్తుండగానే జనం పెరిగారు. చిన్న పిల్లలు మెనూ చూసి సరదా పడిపోతున్నారు. స్త్రీలేమో ఒకరి నగలని ఒకరు వోరగా చూసుకుంటున్నారు. మగవాళ్ళు యధావిధిగా జేబులు తడుము కుంటున్నారు. నేను పుల్కా తినడమా లేక నూడుల్స్ రుచి చూడ్డమా అని తీవ్రంగా ఆలోచిస్తుండగా వెయిటరమ్మాయి వచ్చి "ప్లేటు తీసేయనా సార్?" అని వినయంగా అడిగింది. నేనెక్కడ 'ఊ' అనేస్తానో అని కంగారు పడ్డ ఎదుటాయన "ఆయనింకా ఏం తినలేదు" అనడంతో, "సారీ సర్" అని చెప్పి వెళ్ళిపోయింది. రాజ్మా తిని చాలా రోజులయిందని గుర్తు రావడంతో నా మనసు పుల్కా వైపు మొగ్గింది.

నేను సీట్లో కూర్చుంటూ ఎదుటివాళ్ళ వైపు చూసేసరికి ఒక్క క్షణం అయోమయం కలిగింది. మన్ను తిన్న కృష్ణుళ్ళా ఇద్దరూ నోళ్ళు తెరుచుకుని ఉన్నారు. ఇద్దరి కళ్ళూ పక్క టేబిల్ వైపే ఉన్నాయి. ఆ అమ్మాయి ముగ్గురబ్బాయిలకీ రాఖీలు కడుతోంది. దృశ్యం చూడముచ్చటగా అనిపించడంతో నేనూ చూస్తూ ఉండిపోయాను. కుర్రాళ్ళు ముగ్గురూ జేబుల్లోనుంచి గిఫ్ట్లు తీసిచ్చారు ఆ అమ్మాయికి. ఇంతలో బిల్ వచ్చింది. ఆ అమ్మాయి అందుకుంది. ఇప్పుడు ముగ్గురబ్బాయిలకీ వాళ్ళ హీరోలు గుర్తొచ్చినట్టు లేదు. ఒకే పార్టీగా మారిపోయి ఆమె చేతినుంచి బిల్ ఫోల్డర్ అక్షరాలా లాగేసుకున్నారు. మరో ఐదు నిమిషాల్లో ఆ టేబిల్ ఖాళీ అయ్యింది. ఎదుటి ఇద్దరివైపూ నేనస్సలు చూడలేదు.

మిత్రులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు!!