గురువారం, జులై 29, 2021

ఓం నమః నయన శృతులకు ...

 "జీవన వేణువులలో మోహన పాడగా..."

ఇంకెంతో కాలం బతకమని తెలిసిన ఓ అబ్బాయీ, అమ్మాయీ ప్రేమలో పడ్డప్పుడు పాడుకునే యుగళగీతంలో "ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో" లాంటి మాటల్ని పొదగగలిగే సినీ కవి వేటూరి ఒక్కరేనేమో బహుశా!  మణిరత్నం తెలుగులో తీసిన ఏకైక సినిమా 'గీతాంజలి' (1989) కి సింగిల్ కార్డు గేయ రచయిత వేటూరి. కథకి తగ్గట్టుగానే పాటల్లోనూ భావుకత, ఆర్ద్రత వినిపిస్తాయి. మిగిలిన అన్ని పాటలూ ఒక ఎత్తైతే, రౌండ్ ట్రాలీ వేసి కేవలం చుంబన దృశ్యంతో పాట మొత్తం చిత్రీకరించేసిన 'ఓం నమః' పాట ఒక్కటీ ఓ ఎత్తు - చూడడానికే కాదు, వినడానికి కూడా. 


ఓం నమః నయన శృతులకు
ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జతులకు
ఓం నమః మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో..
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో

రేగిన కోరికలతో గాలులు వీచగా
జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిధై లోకము తోచగా
కాలము 
లేనిదై  గగనము అందగా
సూరేడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా
ముద్దుల సద్దుకే నిదుర రేగే ప్రణయ గీతికి...

ఒంటరి బాటసారి జంటకు చేరగా 
కంటికి పాపవైతే రెప్పగ మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిథులై  జననమందిన ప్రేమ జంటకు... 

ఇప్పుడంటే ఏబీసీడీ లతో అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి కానీ ఒకప్పుడు మొదటిసారిగా పలకమీద 'ఓం నమః శివాయః' రాసి దిద్దించి, ఆ తర్వాత అఆలు మొదలుపెట్టేవారు. ఈ ఓం నమఃలు క్రమేణా 'ఓనమాలు' అయ్యాయి. ఈ పాటలో జంట ప్రేమకి ఓనమాలు దిద్దుకుంటోంది. నయన శృతులకి, హృదయ లయలకి, ఆధర జతులకి, మధుర స్మృతులకీ ఓం నమఃలు. అలతి అలతి పదాలకి భావుకత అద్ది రాసిన రెండే చరణాలు. గుండె చప్పుడుతో మొదలయ్యే నేపధ్య సంగీతం, జానకి-బాలూల పోటాపోటీ గానం. వెనక్కి తిరిగి చూసుకుంటే గడిచిన మూడు దశాబ్దాలలోనూ ఇలాంటి పాట ఇంకోటి రాలేదేమో అనిపిస్తోంది. ఇకపై వచ్చే అవకాశమూ పెద్దగా కనిపించడం లేదు.

సోమవారం, జులై 26, 2021

జయంతి ...

కొందరు నటీనటుల్ని తలచుకోగానే వారికి సంబంధించిన ఒకటో రెండో విషయాలు ప్రస్ఫుటంగా మొదట గుర్తొస్తాయి. అలా జయంతి అనుకోగానే నాకు మొదట గుర్తొచ్చేది ఆమె గొంతు. జయంతి గొంతుకు నేను ఫ్యాన్ ని. రేడియోతో పాటు పేపర్లు పుస్తకాలూ, అటుపైన టీవీ అలవాటున్న ఇల్లవ్వడం వల్ల మా ఇంట్లో సినిమా కబుర్లతో సహా సకల సంగతులూ దొర్లుతూ ఉండేవి. "ఆ జయంతి గొంతేంటి బాబూ, రేకు మీద మేకుతో గీసినట్టుంటుంది" అంది మా పిన్ని ఓసారి. బహుశా అప్పుడే నేను జయంతి గొంతుని శ్రద్ధగా వినడమూ, అభిమానించడమూ మొదలైనట్టుంది. ఆమె గొంతు మెత్తనా కాదు, అలాగని గరుకూ కాదు. ఒకలాంటి సన్నని జీరతో, కాస్త విషాదాన్ని నింపుకున్నట్టుగా (రొమాంటిక్ డైలాగులు చెబుతున్నా సరే) వినిపిస్తుంది. ఆ జీరే నాకు బాగా నచ్చి ఉంటుంది బహుశా. 

మిగిలిన భాషల్లో హీరోయిన్ గా చాలా సినిమాలు చేసినా, తెలుగులో బాగా పేరు తెచ్చినవి మాత్రం సహాయ పాత్రలే. నాగేశ్వరరావుకి చెల్లెలు,  ఎన్టీఆర్   డబుల్ ఫోటో సినిమాల్లో ముసలి పాత్రకి భార్య.. ఇలా అన్నమాట. నాగేశ్వరరావు-వాణిశ్రీల 'బంగారు బాబు' సినిమా గుర్తుందా? అందులో హీరో చెల్లెలు 'చంద్ర' పాత్రలో జయంతి. చంద్ర అంధురాలు. ఆమెకి కళ్ళు రప్పించడమే హీరో జీవిత ధ్యేయం. మరీ రిక్షాలూ అవీ తొక్కించకుండా రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగం ఏర్పాటు చేశారు. "నీకిష్టమని ఉప్మా చేశానన్నయ్యా" అనే డైలాగు, ఓ చేతిలో ప్లేటు, మరో చేత్తో తడుముకుంటూ జయంతి ఎంట్రీ, నేను మర్చిపోలేని సీన్లలో ఒకటి. దాదాపు అదే టైములో వచ్చిన కృష్ణ 'మాయదారి మల్లిగాడు' లో ఇంకో ఉదాత్తమైన చెల్లెలి లాంటి పాత్ర. పడుపు వృత్తిలో ఉండే అమ్మాయిగా కనిపిస్తుంది. ఆ సినిమాలో సూపర్ హిట్ పాట 'మల్లెపందిరి నీడలోనా జాబిల్లీ..' ఆమె కలే!!

ఎన్టీఆర్-జయంతి కాంబినేషన్ గురించి ఓ పుస్తకం రాయొచ్చు అసలు. చేసినవి తక్కువ సినిమాలే అయినా, వాటిలో సెంటిమెంటు సీన్లకి అస్సలు లోటు లేకపోవడం, ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి నటించడమూను. అటు 'జస్టిస్ చౌదరి' లోనూ, ఇటు 'కొండవీటి సింహం' లోనూ ఒకటికి ఇద్దరు ఎన్టీఆర్లతో ఒకే ఫ్రేమ్లో సెంటిమెంట్ సీన్లు పండించిన నటి జయంతి. అసలు, 'ఊర్వశి' శారదని 'సారో క్వీన్' అంటారు కానీ ('మనుషులు మారాలి' సినిమా నుంచీ) ఆ బిరుదు జయంతికి ఇవ్వాలి. కావాలంటే ' కొండవీటి సింహం' లో 'మా ఇంటిలోన మహలక్ష్మి నీవే' పాటోసారి చూడండి. ఓ పక్క వృద్ధ ఎన్టీఆర్ లౌడ్ గా సెంటిమెంట్ అభినయిస్తూ ఉంటాడు. మధ్యలో చిన్న ఎన్టీఆర్ వచ్చి చేరతాడు (జూనియర్ కాదు). తన పాత్రేమో కుర్చీకే పరిమితం (పెరలైజ్డ్). చక్రాల కుర్చీలోంచి కదలకుండా అభినయించాలి. ఇప్పుడు చూస్తే నవ్వొస్తుంది కానీ, అప్పట్లో ఆ పాట మహిళల చేత కన్నీళ్లు పెట్టించి, కాసులు కురిపించింది. 


వీళ్లిద్దరి కాంబోని తలచుకోగానే అప్రయత్నంగా గుర్తొచ్చే ఇంకో పాట 'జస్టిస్ చౌదరి' లో పెళ్లి పాట. వేటూరి మనసు పెట్టి రాసిన 'శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వే కట్నం..' సాహిత్యంలో నాకు ఇష్టమైన లైన్స్ అన్నీ జయంతి మీదే చిత్రీకరించారు. ముఖ్యంగా 'అడగలేదు అమ్మనైనా' చరణంలో విషాదం సుశీల గొంతులో బాగా పలికినా, నాకెందుకో జయంతి చేతే పాడించే ప్రయత్నం చేయాల్సింది (ఆమె గాయని కూడా) అనిపిస్తూ ఉంటుంది. ఆమె వ్యక్తిగత జీవితపు జోలికి ఎందుకు గానీ, వృత్తిగతంగా వివాదంలో జయంతి పేరు బాగా వినిపించింది మాత్రం 'పెదరాయుడు' షూటింగ్ అప్పుడు. ఓ సీన్లో ఆమె పరిగెత్తాలిట. ఆమె పరిగెత్తలేను అందిట. ఆమె రోజూ ఉదయం వాకింగ్, రన్నింగ్ చేయడం హీరో కమ్ నిర్మాత మోహన్ బాబు చూశాట్ట. పంచాయతీ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది. డైలాగుల కేసెట్ చాలాసార్లు వినేయడం వల్ల నేనా సినిమా చూడలేదు. అప్పట్లో 'ఆంధ్రప్రభ' ఈ సంగతులన్నీ పసందుగా రిపోర్టు చేసింది. 

కేసెట్ అనగానే గుర్తొచ్చిన ఇంకో విషయం ప్రయివేటు మిమిక్రీ కేసెట్లు. పందొమ్మిది వందల ఎనభయ్యవ దశకంలో ప్రయివేటు మిమిక్రీ కేసెట్లు విరివిగా వచ్చేవి. సహజంగానే వాటిలో సినిమా వాళ్ళ గొంతులు మిమిక్రీ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు టీవీ చానళ్ళు పండగ స్పెషల్ ప్రోగ్రాం కోసం ఏదో ఒక థీమ్ అనుకుంటున్నట్టుగా, ఈ కేసెట్లకి కూడా ఒక్కో థీమ్ ఉండేది. కేసెట్ ఏదైనా జయంతి పాత్రకి సెంటిమెంట్ డైలాగులే, ముఖ్యంగా 'నాకేం కావాలండీ.. చిటికెడు పసుపు, డబ్బాడు కుంకుమ చాలీ జీవితానికి' అనే డైలాగు తప్పనిసరిగా వినిపించేది. (అప్పట్లో ఇలాంటి కేసెట్లు చేసిన ఒకాయన ఇప్పుడు ప్రముఖ జ్యోతిష్య విద్వాన్ గా పరిణమించడం విశేషం). ఈ మిమిక్రీల వల్ల కూడా జయంతి అంటే సెంటిమెంటు అనే ముద్ర బలపడిపోయింది జనాల్లో. అసలు జయంతి తెరమీద కనిపించగానే ఆ పాత్రకి కథలో రాబోయే కష్టాలని ఊహించేసిన వాళ్ళు నాకు తెలుసు. 

కె. విశ్వనాథ్ 'స్వాతి కిరణం' లో జయంతి పాత్ర పేరు పక్షితీర్థం మామ్మగారు. కథా నాయకుడు గంగాధరానికి సంగీతంలో తొలి గురువు ఈ మామ్మగారే. జయంతి కేవలం సినిమాలే కాదు టీవీలోనూ నటించారని ఎందరికి తెలుసో మరి. ఈటీవీలో వచ్చిన 'అనూహ్య' సీరియల్లో కథానాయిక అనూహ్య (శిల్పా చక్రవర్తి) బామ్మ అనసూయమ్మ పాత్రలో కనిపించారామె. 'అయ్యో రామా అనూహ్య మనసే పారేసుకుందీ' అనే టైటిల్ సాంగ్ తో వచ్చిన ఆ సీరియల్ నేను క్రమం తప్పకుండా చూడడానికి ఒకే ఒక్క కారణం జయంతి. ఆ కథలో బామ్మ పాత్ర కీలకం. భలే గంభీరమైన డైలాగులు ఉండేవి జయంతికి. మనకి సినిమా అంటే హీరోలు. అప్పుడప్పుడూ హీరోయిన్లు కూడా. కథ మొదలు, కెమెరా వరకూ అన్నీ వాళ్ళ చుట్టూనే తిరిగే సినిమాల్లో కొద్దిమంది ఇతర నటీనటులు మాత్రం తమదైన ముద్ర వేస్తారు. అలాంటి కొద్దిమందిలో జయంతి ఒకరు. ఆమె ఆత్మకి శాంతి కలగాలి. 

శనివారం, జులై 10, 2021

నాకు తెలిసిన కత్తి మహేశ్

ఆన్లైన్ ప్రపంచంలోకి నేను అడుగుపెట్టి దాదాపు పదమూడేళ్ళు. తొలినాళ్లనుంచీ నాకు తెలిసిన పేర్లలో ఒకటి కత్తి మహేశ్. ఆన్లైన్ ని ఆధారంగా చేసుకుని అటుపైన ఎత్తులకి ఎదిగిన అతికొద్ది మందిలో తనూ ఒకరు. మహేశ్ ఇక లేరన్న వార్త తెలియగానే అతని  తాలూకు జ్ఞాపకాలన్నీ మనసు లోపలి పొరలనుంచి ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. నాకు తెలిసిన మొదటి ఆన్లైన్ వేదిక 'నవతరంగం' అనే వెబ్ పత్రిక. అక్కడ సినిమా సమీక్షకుడు, విమర్శకుడు పాత్రల్లో మహేశ్ కనిపించారు. అక్కడి నుంచి నా రెండో అడుగు బ్లాగ్ ప్రపంచం. అక్కడ బ్లాగరుగానూ, వ్యాఖ్యాత గానూ మహేశ్ ప్రత్యక్షం. అటు 'నవతరంగం' లోనైనా, ఇటు 'పర్ణశాల'  బ్లాగులోనైనా తను రాసిన పోస్టుల కన్నా చేసిన కామెంట్లే చాలా ఎక్కువ. అవి కూడా ఎక్కువగా వివాదాలకి దారితీసే వ్యాఖ్యలే. 

మహేశ్ ధోరణి చూస్తున్నప్పుడల్లా ఓ రచయిత్రి తరచుగా గుర్తొచ్చే వారు. తొలినాళ్లలో సాధారణ రచనలే చేసిన ఆమె, వివాదాల ద్వారా ఎక్కువ పేరు సంపాదించుకోవచ్చునని తెలుసుకున్న తర్వాత తన ప్రతి రచనలోనూ ఓ వివాదం ఉండేలా చూసుకోవడం అలవాటు చేసుకున్నారు. పేరొచ్చిన ప్రతి వ్యక్తినీ, రచననీ తనదైన ధోరణిలో విమర్శించడం ద్వారా తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చేసుకోగలిగారు. అటుపైన 'మనోభావాల' వైపు దృష్టి సారించారు. పథకం ఫలించింది. ఆ రచనల కారణంగా మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళ తాలూకు ప్రతిస్పందనలతో ఆమెకి మరింత పేరొచ్చేసింది.  ఇంచుమించుగా మహేశ్ కూడా ఇదే స్ట్రాటజీని అమలుచేశారు. ఆయన లక్ష్యం పాపులర్ కావడమే అయి ఉంటే, చాలా తక్కువ కాలంలోనే దానిని సాధించేశారు. 

బ్లాగుల్లోనూ, అంతకన్నా ఎక్కువగా బజ్జులోనూ పేరు తెచ్చుకున్నారు మహేశ్. ఎక్కడ వివాదం ఉన్నా అక్కడ తను ఉండడం, తానున్న ప్రతి చోటా వివాదం ఉండడం ఆన్లైన్ వేదికని పంచుకున్న అందరికీ త్వరలోనే అలవాటైపోయింది. వాదనా పటిమ ద్వారా కన్నా, ఎక్కడ ఏ కార్డు వాడాలో బాగా తెలియడం మహేశ్ కి బాగా కలిసొచ్చిన విషయం. అవతలి వాళ్ళని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసేలా చేయడం, వాటి ఆధారంగా వివాదాన్ని మరింత పెంచడం, కొండొకచో వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టడం నిత్యకృత్యంగా ఉండేది. ఎందుకొచ్చిన గొడవ అని కొందరూ, అతని స్ట్రాటజీని అర్ధం చేసుకుని, మనమెందుకు సహకరించాలి?అనే ధోరణిలో మరికొందరు వాదనలకు దిగడం మానేశారు. సరిగ్గా అప్పుడే బ్లాగులు, బజ్జుని మించిన వేదిక దొరికింది మహేశ్ కి. ఫేస్బుక్ మాధ్యమం ద్వారా కొత్త వాదనలు, కొంగొత్త ప్రతివాదులు. 

పాపులారిటీని సంపాదించుకోడమే కాదు, దాన్ని ఛానలైజ్ చేసుకోవడంలోనూ తానే ముందుండి ఒరవడి పెట్టారు మహేశ్. 'క్రౌడ్ ఫండింగ్' ద్వారా సినిమా నిర్మాణం మొదలు పెట్టారు. తానే దర్శకుడు. సినిమా ఆడకపోయినా ఆ రంగంలో ఫుట్ హోల్డ్ దొరికింది. కార్యసాధకులకి అది చాలు. అంతలోనే టీవీ ఛానళ్లలో విమర్శకుడిగా మరో కొత్త అవతారం. సినిమా రంగంలో నిలదొక్కుకోడానికీ తనకి అచ్చొచ్చిన వివాదాలనే నమ్ముకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన సినిమా నటుడు పవన్ కళ్యాణ్ మీద కత్తి కట్టారు. ఫలితంగా, పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కత్తి మహేశ్ చిరపరిచితం అయిపోయారు. నటుడిగా అవకాశాలు రావడం మొదలైంది. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ కూడా పేరు జనంలో నానుతూ ఉండడం అన్నది ముఖ్యం - మంచిగానా, చెడ్డగానా అన్నది తర్వాత. 

నిజానికి మహేశ్ తర్వాతి అడుగు రాజకీయాలవైపే అనిపించింది. కులం, మతం లాంటి కార్డులని వ్యూహాత్మకంగా వాడడం, నిత్యం వివాదాల్లో ఉండేలా జాగ్రత్త పడడం చూసినప్పుడు త్వరలోనే ఇతన్ని ఏదో ఒక రాజకీయ పార్టీలో చూడబోతున్నాం అనుకున్నాను. రోడ్డు ప్రమాదం జరగకపోయి ఉంటే ఆ దిశగా అడుగులు పడి ఉండేవేమో. అతని వైద్య ఖర్చుల నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పదిహేడు లక్షల రూపాయల్ని ఆఘమేఘాల మీద కేటాయించడం చూసినప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి కాగానే ఇక రాజకీయాలే అనుకున్నాను. ("కత్తి మహేశ్ కోసం ప్రభుత్వం పదహారు ప్రాణాల్ని పణంగా పెట్టింది" అన్నారు మిత్రులొకరు - సహాయనిధి నుంచి సామాన్యులకి విడుదలయ్యే మొత్తం సగటున ఒక్కొక్కరికి లక్ష రూపాయలు). 

చాలా ఏళ్ళ క్రితం సంగతి - బ్లాగు మిత్రులొకరు కథ రాయడానికి ప్రయత్నిస్తూ డ్రాఫ్ట్ మెయిల్ చేశారు. కథ బాగుంది కానీ, కులాల ప్రస్తావన ఉంది. "కులాల గురించి తీసేస్తే కథలో ఫ్లేవర్ ఉండదు. ఉంచితే కత్తి మహేశ్ గారు కత్తి తీసుకుని వస్తారేమో అని అనుమానంగా ఉంది" అన్నది వారి సందేహం. ఆన్లైన్ వేదిక మీద కత్తి మహేశ్ చూపించిన ప్రభావానికి ఇదో చిన్న ఉదాహరణ. తనకేం కావాలో, కావాల్సిన దానిని ఎలా సాధించుకోవాలో చాలా స్పష్టంగా తెలిసిన మనిషి మహేశ్. తన బలాలు, బలహీనతల మీద కూడా మొదటినుంచీ స్పష్టమైన అవగాహన ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ పదమూడేళ్లలో అతను సాధించింది తక్కువేమీ కాదు. తన అడుగులు మాత్రమే కాదు, మరణం కూడా 'సెన్సేషనల్' వార్తే ఇవాళ.  జీవించి ఉంటే మరింత సాధించే వారేమో కూడా. ఎందుకంటే తనకి మార్గం కన్నా, లక్ష్యం ముఖ్యం. 

(ఆత్మల మీద మహేశ్ కి నమ్మకం లేదు, తన కుటుంబానికీ, మిత్రులకీ సానుభూతి).