సోమవారం, జూన్ 28, 2021

గొల్ల రామవ్వ

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, రచయితా, కవీ కూడా. విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు' నవలని 'సహస్ర ఫణ్' పేరిట హిందీలోకి అనువదించడమే కాదు, తన ఆత్మకథని 'ది ఇన్సైడర్' పేరుతో ఆంగ్ల నవలగా రాశారు కూడా (కల్లూరి భాస్కరం తెలుగు అనువాదం 'లోపలి మనిషి'). 'అయోధ్య 1992' పుస్తకం పీవీ మరణానంతరం ప్రచురణకి నోచుకుంది. ఇవి మాత్రమే కాదు, పీవీ కొన్ని కథలు, కవితలూ కూడా రాశారు. ఎంపిక చేసిన కొన్ని రచనల్ని ఆయన కుమార్తె సురభి వాణీదేవి (మొన్నటి ఎన్నికల్లో టీఆరెస్ నుంచి ఎమ్మెల్సీ గా గెలిచారు) తన సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున 'గొల్ల రామవ్వ మరికొన్ని రచనలు' పేరిట చిరుపొత్తంగా వెలువరించారు. ఇందులో కథకుడిగా పీవీకి ఎంతో పేరుతెచ్చిన 'గొల్ల రామవ్వ' కథతో పాటు పొలిటికల్ సెటైర్ కథ 'మంగయ్య అదృష్టం,' రెండు కవితలు, మూడు వ్యాసాలు ఉన్నాయి. 

తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో సాగే కథ 'గొల్ల రామవ్వ.' ఈ కథలో నాయకుడు పీవీయే అయ్యే అవకావశాలు ఉన్నాయి. సాయుధుడైన ఓ కాంగ్రెస్ కార్యకర్త పోలీసులకి, నిజం ప్రయివేటు సైన్యం రజాకార్లకీ వ్యతిరేకంగా పోరాటం చేస్తూ, ఓ రాత్రి ఇద్దరు పోలీసుల్ని తుపాకీతో కాల్చి చంపి గొల్ల రామవ్వ గుడిసెలో ఆశ్రయం పొందడం, అతని పట్ల సానుభూతి చూపించిన రామవ్వ ఎంతో ధైర్యాన్ని, యుక్తిని ప్రదర్శించి పోలీసుల బారి నుంచి రక్షించడం ఈ కథ. సాయుధ పోరాటం జరిగే నాటికి పీవీ కాంగ్రెస్ కార్యకర్త, తుపాకీ పట్టి పోరాటంలో పాల్గొన్నారు కూడా. ఈ వివరాలన్నీ 'లోపలి మనిషి' లో ఉన్నాయి. తెల్లవారు జామున గుడిసెలో ప్రవేశించిన వాడు రజాకారో, పోలీసో అని అనుమానించిన రామవ్వ వచ్చింది ఎవరైనా తన ప్రాణం, మనవరాలి మానం పోక తప్పదని నిశ్చయించుకుంటుంది. 

మనవరాలిని కాపాడుకోవడం కోసం వచ్చిన వాడి కాళ్ళమీద పడుతుంది. ఆ వచ్చిన వాడు అటు రజాకార్లకీ, ఇటు పోలీసులకి శత్రువే అని తెలిసినప్పుడు అతన్ని ఆదరిస్తుంది. అతని వొంటిని గుచ్చుకున్న ముళ్ళని తీసి కాపడం పెడుతుంది, తన గుడిసెలో ఉన్న తిండీ పెడుతుంది. కాల్పుల్లో చనిపోయింది పోలీసులు కావడంతో తెల్లారకుండానే ఊరిమీదకి పోలీసుల దండు దిగుతుంది. గుడిసె గుడిసెలోనూ గాలింపు మొదలవుతుంది. పోలీసులు రామవ్వ గుడిసె తలుపులూ తడతారు. ఆ యువకుడిని రక్షించేందుకు అనూహ్యమైన యుక్తి పన్నుతుంది రామవ్వ. పోలీసులకి రామవ్వ మీద అనుమానమే, ఆమె ఒక 'బద్మాష్' అని నిశ్చయం కూడాను. అయినా కూడా వాళ్ళ కళ్ళుకప్పే ప్రయత్నం చేస్తుంది రామవ్వ. కథ చదువుతున్నట్టుగా కాక, ఒక సన్నివేశాన్ని చూస్తున్నట్టుగా పాఠకులకి అనిపించేలా ఈ కథ రాశారు పీవీ. 1949 లో తొలిసారి ప్రచురింపబడిన ఈ కథ నిశ్చయంగా ఎన్నదగినది. 

'మంగయ్య అదృష్టం' కథ ఎప్పుడు రాశారన్న వివరం లేదు కానీ, కథాంశాన్ని బట్టి చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయవలసి వచ్చిన అనంతర పరిస్థితుల నేపథ్యంలో రాసిన కథ అయి ఉండొచ్చుననిపించింది. బ్రహ్మదేవుడు, సరస్వతిల మధ్య అభిప్రాయం భేదం రావడం, దేవతలందరూ రెండు వర్గాలుగా విడిపోవడంతో మొదలయ్యే ఈ కథ, ఆ రెండు వర్గాలూ మంగయ్య అనే భూలోక వాసి జీవితాన్ని నిర్దేశించే ప్రయత్నాలలో ఎత్తుకి, పై ఎత్తులు వేసుకోవడంతో ఆసక్తిగా సాగుతుంది. ఈ కథ సోషియో ఫాంటసీ ఎంతమాత్రమూ కాదు, పూర్తి పొలిటికల్ సెటైర్. స్మగ్లర్లకి కడునమ్మకస్తుడిగా మారిన మంగయ్య, అనూహ్యంగా రాజకీయాల్లోకి రావడం, చకచకా పైకెదడగం వర్ణిస్తారు రచయిత. నాటి రాజకీయాలని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, 'మంగయ్య' ని పోల్చుకోవడం పెద్ద కష్టం కాదు. ఈ 'మంగయ్య'ని 'లోపలి మనిషి' లోనూ చూడొచ్చు. 

పుస్తకంలో ఉన్న రెండు కవితాల్లోనూ ఒకటి,  భారత స్వతంత్ర రజతోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో శాసన సభలో చదివింది. రెండోది తన ప్రియమిత్రుడు కాళోజీ నారాయణ రావు షష్టిపూర్తి సందర్భంగా అభినందిస్తూ రాసింది. వ్యాసాల్లో మొదటిది చివుకుల పురుషోత్తం తెలుగు నవల 'ఏది పాపం?' కి సూర్యనాథ ఉపాధ్యాయ హిందీ అనువాదానికి పీవీ హిందీలో రాసిన ముందుమాటకి తెలుగు అనువాదం. రెండోది 'వేయిపడగలు - పండిత ప్రశంస'. తన 'సహస్ర ఫణ్' కి రాసుకున్న ముందుమాటకి తెలుగు అనువాదం. మూడోది హిందీ కవయిత్రి మహాదేవి వర్మ షష్టిపూర్తి ప్రత్యేక సంచికకి రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం. సాహిత్యం పట్ల పీవీ 'దృష్టి' ఏమిటో తెలుసుకోవాలనుకునే వారికి ఇవి ఉపకరిస్తాయి. 

పుస్తకం చివర్లో ఇచ్చిన జీవన రేఖల్లో 'ప్రచురించిన రచనలు' జాబితాలో అనేక కథలు, కవితలు, నవలికలు అన్నారు. స్వయానా కూతురే ప్రచురించిన పుస్తకంలో కూడా ఇంతకు మించిన వివరాలు లేకపోవడం విషాదం. కనీసం ఎన్ని కథలు, కవితలు, నవలికలు అనే అంకెలు (సంఖ్యలు) కూడా ఇవ్వలేదు.  పీవీ తొలినాటి రచనలు కలం పేరుతో రాసినవే. 'గొల్ల రామవ్వ' ని 'విజయ' అనే కలం పేరుతో రాశారు. ఆయా రచనల వివరాలని ప్రకటించకపోతే మరుగున పడిపోయే ప్రమాదం ఉంది ఇందుకు కుటుంబ సభ్యులని మించి పూనుకోగలవారెవరు? రెండు ముద్రణలు పొందిన 'గొల్ల రామవ్వ' పుస్తకం 103 పేజీలు, వెల రూ. 100. ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. 

ఆదివారం, జూన్ 13, 2021

స్వాతి చినుకు సందెవేళలో ...

మన సినిమాల్లో పాటలకి, అందునా వాన పాటలకి, ప్రతికించి సందర్భం అంటూ ఉండాల్సిన అవసరం లేదు. నాయికో, నాయకుడో లేక సైడు కేరెక్టర్లో కలగనేస్తే సరిపోతుంది. సినిమా ఆసాంతమూ ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించినా వాన పాట అనేసరికి నాయిక చీర కట్టక తప్పదు. తెలుగుదనమా, మజాకానా? అలాగే గీత రచయితలూనూ.. రెండో మూడో చరణాల్లో వాననీ, నాయికనీ వర్ణించేస్తే సరిపోతుంది. అనాదిగా మన వానపాటల సంప్రదాయం ఇదే. అత్యంత అరుదుగా ఈ సంప్రదాయానికి కాసిన్ని మినహాయింపులు దొరుకుతూ ఉంటాయి. 

'ఆఖరి పోరాటం' (1988) సినిమాలో 'స్వాతి చినుకు సందెవేళలో..' అనే వాన పాటని పూర్తిగా సందర్భోచితం అనలేం కానీ, అలాగని డ్రీమ్ సీక్వెన్సు కూడా కాదు. నాయికానాయకులిద్దరూ కలిసి విలన్ల దృష్టిని మళ్లించి, చిన్నపిల్లల్ని రక్షించడం కోసం చేసిన డైవర్షన్ స్కీములో భాగం. మామూలుగా అయితే ఇది వ్యాంపు గీతానికి అనువైన సందర్భం. కానీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, శ్రీదేవి-నాగార్జునల మీద ఓ వానపాటని చిత్రీకరించేశాడు. వేటూరి రచన, ఇళయరాజా స్వర రచన, జానకీ-బాలూల యుగళం. (తీరాచేసి కథ ప్రకారం నాయిక మామూలమ్మాయేమీ కాదు, పవర్ఫుల్ ఆఫీసర్. అయినప్పటికీ విలన్ల భరతం పట్టేందుకు స్కిన్ షో తప్ప వేరే దారి దొరక్కపోవడమే విషాదం!). 



"స్వాతి చినుకు సందెవేళలో... లేలేత వణుకు అందగత్తెలో... 
మబ్బే కన్ను గీటే అరె మతే పైట దాటే
చలే కొరుకుతుంటే చెలే ఒదుగుతుంటే
భలేగుంది పడుచు ముచ్చటా  బలే కదా గాలి ఇచ్చటా"

...అంటూ నాయకుడు పాట అందుకుంటాడు. తగుమాత్రం గాలితో వర్షం మొదలవుతుంది తెరమీద. మబ్బు కన్ను గీటడమూ, మతి పైట దాటడమూ వేటూరి మార్కు చమక్కులు. 'బలే కదా గాలి ఇచ్చటా' అనడంలో నాయికా నాయకుల మధ్యకి వచ్చి చేరిన గాలి బలైపోతోందన్న కొంటెదనం ఉంది. శ్రద్దగా వినకపోతే 'భలే కదా గాలి ఇచ్ఛటా' గా పొరబడే అవకాశమూ ఉంది.  

"స్వాతి చినుకు సందెవేళలో... లేలేత వలపు అందగాడిలో... 
ఈడే ఉరుముతుంటే... నేడే తరుముతుంటే
సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే
పదా అంది పడుచు పూపొదా.. ఇదే కదా చిలిపి ఆపదా"

...ఇది నాయిక కొనసాగింపు. సాధారణంగా పాటకి ఒకటే పల్లవి ఉంటుంది కానీ, ఈ పాటకి ఒకేలా వినిపించే రెండు పల్లవులు. వర్షానికి తగ్గ వాతావరణం - చినుకు, వణుకు, మబ్బు, చలి, గాలి, ఉరుము - మొత్తం రెండు పల్లవుల్లోనూ అమరిపోయింది. వీటికి జతగా మరో రెండు చరణాల యుగళం. 

"ఈ గాలితో ఒకే చలీ ఈ దెబ్బతో అదే బలి
ఈ తేమలో ఒకే గిలీ ఈ పట్టుతో సరే సరి
నీ తీగకే గాలాడక.. నా వీణలే అల్లాడగా..
నరాలన్ని వేడి పదాలెన్నొ పాడా
వరాలిచ్చి పోరా వరించాను లేరా
చల్లని జల్లుల సన్నని గిల్లుడు సాగిన వేళా.. కురిసిన... "

సున్నితమైన శృంగారం, వానపాటకి తప్పదు కదా.  "నీ తీగకే గాలాడక.. నా వీణలే అల్లాడగా.." అన్నది పూర్తిగా వేటూరి మార్కు. "నరాలన్ని వేడి పదాలెన్నొ పాడా" లో 'వేడి' పదాలకి సంబంధించింది, వేడిపదాలు.. పాటలో పలికిన విధానం  'వేడుకోలు' అని అర్ధం స్ఫురింపజేస్తోంది. 

"ఈ వానలా కథేమిటో.. నా ఒంటిలో సొదెందుకో
నీకంటిలో కసేమిటో.. నాకంటినీ తడెందుకో
తొలివానలా గిలిగింతలో.. పెనవేసినా కవ్వింతలో
ఎదే మాట రాకా పెదాలందు ఆడా
శృతే మించిపోయి లయే రేగిపోగా
మబ్బుల చాటున ఎండలు సోకిన అల్లరి వేళా మెరిసిన..."

లాకాయిలూకాయి కవులెవరూ "నీకంటిలో కసేమిటో.. నాకంటినీ తడెందుకో" అనలేరు. గుండె గొంతుకలో కొట్టాడడం తెలుసు కానీ, ఇక్కడ కవి ఆ ఎదని పెదాలవరకూ తీసుకొచ్చేశారు. శ్రుతిలయల్ని మాత్రం విడిచిపెట్టారా ఏంటి? 

ఇళయరాజా ఇచ్చిన హుషారైన ట్యూనుకి అంతే హుషారుగా పాడారు గాయనీగాయకులు. నాగేశ్వరరావుతో ఆడిపాడిన డ్యూయెట్లన్నింటికీ చెప్పుల్ని త్యాగం చేసిన శ్రీదేవి, వాళ్ళబ్బాయితో చేసిన ఈ పాటకీ ఒఠి కాళ్లతోనే నర్తించింది పాపం. అంతకు ముందు సంవత్సరం దేశాన్ని ఊపేసిన 'మిస్టర్ ఇండియా' వానపాట ఆమెకి బాగా ఉపయోగించి ఉండాలి, ఈపాట విషయంలో. (నాకైతే, ఆ పాట చూసే ఈ పాటని కథలో ఇరికించి ఉంటారని బలమైన సందేహం). చూడ్డానికే కాదు, వినడానికీ బాగుండే ఈ పాట నా ప్లేలిస్టులో పర్మనెంటు మెంబరు. 

శుక్రవారం, జూన్ 04, 2021

కారా మాస్టారు ...

దాదాపు పదిహేనేళ్ల క్రితం ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకావిడ తన పుస్తకావిష్కరణ సభని హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఒక హోటల్ టెర్రాస్ మీద చాలా వైభవంగా జరిగిందా సభ. నా వరకు, అంతకు ముందు, ఆ తర్వాత కూడా అంతటి ఖరీదైన సభని చూడలేదు. ముగ్గురు హై-ప్రొఫైల్  ముఖ్య అతిధులు పుస్తకాన్ని చాలా మెచ్చుకుంటూ మాట్లాడారు. ఇద్దరు సాహితీ ప్రముఖులు ఆ సభలో నిశ్శబ్ద ప్రేక్షకులు - ఒకరు అబ్బూరి ఛాయాదేవి, రెండోవారు కాళీపట్నం రామారావు మాష్టారు. సభ పూర్తవ్వగానే మాస్టారు   బయల్దేరబోతూ  రచయిత్రిని పిలిచి ఒకటే మాట చెప్పారు: "వాళ్లంతా పుస్తకం చాలా బాగుందని మెచ్చుకున్నారు కానీ, మెరుగు పరుచుకోవాల్సిన  విషయాలున్నాయి, వాటిమీద దృష్టి పెట్టడం అవసరం" ..నేను మాత్రమే కాదు, ఆ మాటలు విన్న కొద్దిమందీ ఆశ్చర్యపోయారు. కారా మాస్టారిని ప్రత్యక్షంగా చూడడం అదే ప్రధమం. 

మాస్టారితో కొంచంసేపు వివరంగా మాట్లాడింది మాత్రం తర్వాత పదేళ్లకి. ఐదారేళ్ళ క్రితం ఓ ఎండవేళ శ్రీకాకుళంలో పని చూసుకుని విశాఖపట్నం వెళ్ళబోతుండగా ఒక్కసారి కూడా 'కథానిలయం' చూడలేదని గుర్తొచ్చి విశాఖ 'ఎ' కాలనీ వైపు దారి తీసినప్పుడు కూడా ఆయన్ని కలుస్తాననుకోలేదు. కథానిలయం తాళం చెవి మాష్టారింట్లో ఉంటుందని తెలిశాక, ఆ అపరాహ్న వేళ బెల్ కొట్టి ఆయన్ని నిద్రలేపడమా, కథానిలయానికి బయటినుంచే దణ్ణం పెట్టేసుకుని తిరిగి వెళ్లిపోవడమా అనే సందిగ్ధం. ఓ ప్రయత్నం చేద్దామనిపించింది. ఆశ్చర్యం, ఆయన నిద్రపోవడం లేదు సరికదా కుర్చీలో కూర్చుని దీక్షగా చదువుకుంటున్నారు. పక్కనే పెన్సిలు, బుక్ మార్కు కోసం కాబోలు కొన్ని కాగితాలు ఉన్నాయి. తలుపు తీసినవారు మేస్టారిని చూపించి లోపలి తప్పుకున్నారు. ఆయనేమో, మర్నాడే పరీక్షన్నంత శ్రద్ధగా చదువుకుంటూ, మధ్యమధ్యలో పెన్సిల్ తో అండర్లైన్ చేసుకుంటూ, మార్జిన్లో నోట్సు రాసుకుంటున్నారు, (అప్పటికే ఆయనకి తొంభై దాటేశాయి) ఎంత సొగసైన దృశ్యమో!!

కాసేపటికి తలుపు తీసిన వారు తాళంచెవితో  హాల్లోకి  వచ్చి "మీరాయన్ని  పలకరించండి  పర్లేదు. కొంచం గట్టిగా మాట్లాడాలి" అని చెప్పి వెళ్లారు కానీ, మాస్టారిని డిస్టర్బ్ చేయాలనిపించలేదు. ఓ క్షణానికి ఆయనే తలెత్తి చూశారు. కళ్ళకి కళ్ళజోడు, మడిచి కట్టిన తెల్ల పంచ, అనాచ్చాదిత ఛాతీ మీద బరువుగా వేలాడుతున్న జంధ్యం. ఆయన కథలకీ, ఈ ప్రయివేటు రూపానికీ అన్వయం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది లోపల్లోపల. "మీరు లెఫ్టిస్టు ఐడియాలజీ తోనే కథలన్నీ రాశారు కదా, మరి ఇదేవిటీ?" అని అడుగుదామా అనుకునే, 'విప్లవానికి జంఝప్పోచే అడ్డవైపోతుందా ఏవిటి?' అనిపించి ఆ ప్రశ్న మానుకున్నా. అసలైతే మాస్టారిని ఎప్పటినుంచో 'కలిస్తే అడగాలి' అనుకుంటున్న ప్రశ్న ఒకటుంది. 'యజ్ఞం' కథ మీద మీద జరిగిన చర్చ, రచ్చలలో మిగిలిన వాళ్ళ సంగతెలా ఉన్నా సొంత లెఫ్ట్ గ్రూపు నుంచి విమర్శలు వచ్చినప్పుడు ఆయనకేమనిపించిందీ అని. కానైతే ఆ ప్రశ్నకది సమయమూ, సందర్భమూ కాదనిపించి ఊరుకున్నా. పస్తాయించి చూస్తే ఆయన చుట్టూ ఉన్నవన్నీ కొత్త పుస్తకాలే. కొత్త రచయిత (త్రి) లు రాసినవే. అవి ఎలా ఉన్నాయని అడిగా. 

"చాలామంది బాగా కృషి చేసి రాస్తున్నారు. కొందరు కృషి లేకుండా రాస్తున్నారు. రాయడం మాత్రం మానడం లేదు, అందుకు సంతోషం" అన్నారాయన. ప్రశ్నలు క్లుప్తంగా ఉండాల్సిన అవసరం అర్ధమై, "మీ కథల్లో నేటివిటీ.." అన్నాను   కొంచం గట్టిగా. "ఆ పాత్రలన్నీ నిజజీవితం నుంచి వచ్చినవే. వాళ్ళ కట్టు, బొట్టు, భాష, యాస అన్నీ నాకు తెలిసినవే. కథలెక్కడినుంచి వస్తాయ్? మనుషుల నుంచే కదా" అన్నారాయన. అప్పుడు 'కథా నిలయం' గురించి అడిగితే ఆయన అక్షరాలా చిన్న పిల్లాడై పోయారు. డిజిటైజేషన్ ప్రాజెక్టు గురించి చాలా వివరంగా చెప్పారు. ఎవరెవరు పనిచేస్తున్నారో, ఫండింగ్ చేశారో  పేరుపేరునా జ్ఞాపకం చేసుకుని చెప్పారు. "కొన్ని పేర్లు, విషయాలు బాగా గుర్తుండడం లేదు" అన్నారు కొంచం విచారంగా. కాసిని కబుర్లయ్యాక 'కథానిలయం' చూడాలన్న కోరిక బయటపెడితే, వాళ్ళ మనవడికి తాళంచెవిచ్చి కూడా పంపారు. రోడ్డుకి ఒకపక్క మాష్టారి ఇల్లయితే, రెండోవైపున్న  భవనమే 'కథానిలయం'.

ఎటుచూసినా కథలే కనిపించే ఆ నిలయంలో గోడలకి రచయితలు, రచయిత్రుల ఫోటోలు వేలాడుతున్నాయి. వాటిని శ్రద్ధగా చూస్తుండగా స్పురించిన విషయం - మాష్టారు రచయితగా ఒక భావజాలానికి కట్టుబడిన కథలు మాత్రమే రాసినా, 'కథానిలయం' లో మాత్రం భావజాలాలతో నిమిత్తం లేకుండా కథలన్నింటికీ  చోటిచ్చారు. కథల్ని ప్రేమించే వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ, కథల కోసం తాను ఇష్టంగా కట్టుకున్న ఇంటినే ఇచ్చేసేంత ప్రేమ ఒక్క మాస్టారికి మాత్రమే సొంతం. కథలకి ఓ గూడు ఏర్పాటు చేయడం ఓ ఎత్తైతే, ఊరూరూ కాలికి బలపం కట్టుకుని తిరిగి మరీ అరుదైన కథల్ని సేకరించి, భద్రపరచడం మరో ఎత్తు. ఆయన కథా ప్రయాణాల కథలు బహు గమ్మత్తైనవి. వాటిని ఆయన మిత్రులు రికార్డు చేయడం అవసరం. పాఠకుడిగా, విమర్శకుడిగా కూడా ఆయనెక్కడా భావజాలపు గిరులు గీసుకోలేదు. జీవితమంతా కథల్ని ప్రేమించారు,   కథకుల్ని తన సునిశిత విమర్శతో  ప్రోత్సహించారు. తెలుగు కథ అనగానే వెంటనే గుర్తొచ్చేంతగా శేషకీర్తులయ్యారు. కారా మాస్టారికి నివాళి.