శుక్రవారం, సెప్టెంబర్ 22, 2017

సౌజన్యారావు పంతులు

ఏదైనా ఒక వ్యవస్థ మీద జనానికి నమ్మకం పోతున్నప్పుడు ఆ వ్యవస్థలో ఏదన్నా అద్భుతం  జరుగుతూ ఉంటుంది. ఆ అద్భుతాన్ని ఆలంబనగా చేసుకుని ప్రజలు మళ్ళీ ఆ వ్యవస్థ మీద నమ్మకం పెంపొందించుకుంటూ ఉంటారు (మన ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లాగా). రామప్పంతులు లాంటి కోర్టు పక్షులు, నాయుడు, భీమారావు లాంటి వకీళ్లు, ఫోర్జరీ కాగితాలు, నకిలీ సాక్షులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయి మొత్తం న్యాయవ్యవస్థ ద్వారా జరిగే 'న్యాయం' అన్నది సందేహాస్పదమయిన తరుణంలో ప్రవేశించాడు వకీలు సౌజన్యారావు పంతులు. కల్పిత సాక్ష్యాలకీ, నకిలీ పత్రాలకీ శుద్ధ వ్యతిరేకి. సాక్ష్యం అంటే నిజమైన సాక్ష్యమే అయి ఉండాలన్న 'సత్తెకాలపు' మనిషి. అంతేకాదు, పార్టీ ఇచ్చే ఫీజుమీద కన్నా తన పార్టీ కేసు గెలవడమే ముఖ్యంగా భావించుకునే వకీలు సౌజన్యారావు 'కన్యాశుల్కం' నాటకం చివరి రెండంకాల్లో కనిపించే ప్రత్యేక అతిధి పాత్ర.

లుబ్దావధాన్లుని పెళ్లాడిన మాయగుంట, మధురవాణి కంటెతో సహా గోడ దూకి పారిపోవడంతో, తన కంటె తెచ్చి ఇస్తే తప్ప అతగాడి ఇంట్లోకి అతగాడిని అడుగు పెట్టనిచ్చేది లేదని భీష్మించుకు కూర్చుంటుంది మధురవాణి. కంటెని సాధించడం కోసం లుబ్దావధాన్లే మాయగుంటని ఖూనీ చేశాడని కథ అల్లి కేసు బనాయిస్తాడు రామప్పంతులు. కోర్టులన్నీ తన చెప్పుచేతల్లో ఉన్నాయనీ, ఎలాంటి సాక్ష్యాన్నయినా పుట్టించగలననీ రామప్పంతులు దిలాసా. మాయగుంటనీ, కంటెనీ వెతకాల్సిన బాధ్యత పోలీసులది. వాళ్ళు కూడా రెండు గ్రూపులుగా చీలిపోయారు - ఖూనీ జరిగిందనీ, జరగలేదనీ. ఈ గందరగోళం చాలక, బుచ్చమ్మని లేవదీసుకుపోయిన గిరీశం మీద అబ్ డక్షన్ కేసు బనాయించాడు అగ్నిహోత్రావధానులు. విశాఖపట్నం ప్లీడర్లకి చేతినిండా పని.

సత్యసంధత, సంఘ సంస్కరణాభిలాష మెండుగా ఉన్న సౌజన్యారావు పంతులు యాంటీ నాచ్. అంటే, సానివాళ్ళ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నవాడు. వేశ్యావృత్తిని నిర్మూలించాలనే ఆశయంతో పనిచేస్తున్న వాడు. ఏకేసుని పడితే ఆ కేసుని  తీసుకోడు. తన దగ్గరికి వచ్చిన పార్టీ పక్షాన న్యాయం ఉందని నమ్మితేనే రంగంలోకి దిగుతాడు. ఖూనీ కేసు నుంచి బయట పడేయమని లుబ్దావధాన్లు తనని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆ ముసలి  బ్రాహ్మడి మీద నమ్మకం కలిగింది సౌజన్యారావుకి. వెంటనే కేసు టేకప్ చేశాడు. అదిమొదలు నిజమైన సాక్షుల కోసం వెతుకులాట ఆరంభించాడు. పోలిశెట్టితో సహా ఎవరూ సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ లుబ్దావధాన్లుని రక్షించాలన్న పట్టుదల పెరిగిపోయింది ఆ వకీలులో.

మాయగుంట వేషం మార్చేసుకుని, ఊరు దాటేసే ముందు మధురవాణి కంటెని ఆమెకే ఇచ్చేశాడు మహేశం. కానీ, అది రహస్యంగా జరిగిపోయింది. ఆ కంటెని, కన్యాశుల్కంగా పుచ్చుకున్న పన్నెండువందల రూపాయల సొమ్మునీ బంగీ కట్టి లుబ్దావధాన్లుకి పంపిస్తే ఖూనీ జరగలేదని పోల్చుకుంటారన్నది కరటక శాస్త్రి ఆలోచన. కంటె కోసం మధురవాణిని ఒప్పించే క్రమంలో సౌజన్యారావు పంతులు సౌజన్యాన్ని వేనోళ్ళ వర్ణిస్తాడు శాస్త్రి. అది విన్నవాళ్లకి ఎవరికైనా 'లోకంలో ఇంకా ఇలాంటి మనుషులున్నారా?' అన్న సందేహం కలుగుతుంది. మధురవాణికీ అదే సందేహం కలిగింది. ఆమె, సౌజన్యారావు పంతులు దర్శనం చేయాలనుకుంది. అతగాడు చూస్తే యాంటీ నాచ్. వేశ్య ముఖం చూడడానికి కూడా ఇష్టపడడు. అందుకే ఓ రాత్రి వేళ మారువేషం వేసుకుని, తలపాగా చుట్టుకుని అతడి బసకి బయలుదేరుతుంది.

"మనం చెడ్డవారని అనుకునే వారి యెడల కూడా మంచిగా వుండుటకు ప్రయత్నము చేస్తే దయాపరిపూర్ణుడైన భగవంతుడు సృజించిన యీ లోకము మీకు మరింత యింపుగా కనపడుతుంది! మీకూ, మీ పరిచయం కలిగిన వారికీ మరింత సౌఖ్యము కలుగుతుంది. కాక, మంచిచెడ్డలు ఏర్పర్చగలిగిన వాడు యెవడు? మంచిలోనూ చెడ్డ ఉంటుంది. చెడ్డలోనూ మంచి ఉంటుంది" అంటూ మారువేషంలో ఉన్న మధురవాణితో సంభాషణ ఆరంభిస్తాడు సౌజన్యారావు పంతులు. "మంచిగా వుందామని ప్రయత్నిస్తున్నాను. అంతకన్న నాయందు యోగ్యతేమీ లేదు" అని తన గురించి చెప్పుకుని, లుబ్దావధాన్లు కేసులో సాయం చేసే ఎవరినైనా తమ పాలిట దేవుడిగా భావించుకుంటాం అంటాడు. ఆ సహాయం ఒక వేశ్య వల్ల జరగాల్సి ఉందనీ, ఆమె డబ్బుకి అసాధ్యురాలనీ విన్నప్పుడు, ఆలోచనలో పడతాడు. తాను ఆమెని ఉంచుకున్న పక్షంలో లుబ్దావధాన్లుకి సాయపడగలదు అన్న మాట విన్నప్పుడు మొదట కోపం తెచ్చుకుంటాడు, అటుపైని శత్రువుల కుట్ర ఉందేమో అని సందేహిస్తాడు.

మధురవాణి తన మారువేషం తీసేసి, "నా వూరూ పేరూ అడిగితిరి. వూరు విజయనగరం, పేరు మధురవాణి" అన్నప్పుడు, మొదట ఆశ్చర్యం, అటుపైని కోపావేశం కలుగుతాయి సౌజన్యారావు పంతులికి. తాను మంచిదానిని అని నమ్మించడానికి ఒక తుని తగువు మనవి చేస్తానంటుంది మధురవాణి. "అట్టే సేపు నువ్వు నా యెదుటగానీ నిలిచి ఉంటే నువ్వు ఏ తగువు తీరిస్తే ఆ తగువుకి ఒప్పుదల అవుతానేమో అని భయవేస్తోంది" అన్న సౌజన్యారావు జవాబు వింటున్నప్పుడు "ఎంతనేర్చిన..." కీర్తన గుర్తొచ్చి తీరుతుంది! కరటక శాస్త్రులే గుంటూరు శాస్త్రులని, మహేశమే మాయగుంట అనీ విన్నప్పుడు "ఔరా.. ఏమి చిత్రము! మేలుకున్నానా, నిద్రబోతున్నానా?" అని ఆశ్చర్యపోయి, అటుపైని బీదవాడిని కాబట్టి ఫీజు (మధురవాణికి ఒక ముద్దు) ఇచ్చుకోలేనంటాడు. "నీవు సొగసరివి. ముద్దు చేదని కాదు. వ్రతభంగం (యాంటీనాచ్) గదా అని దిగులు" అంటూనే ముద్దు పెట్టుకోబోతాడు. కానీ, మధురవాణి సమ్మతించదు.

"నువ్వు మంచి దానివి. ఎవరో కాలుజారిన సత్పురుషుల పిల్లవై వుంటావు. ఈ వృత్తి మానలేవూ, స్థితి లోపమా?" అన్న సౌజన్యారావు ప్రశ్న ఒకింత గందరగోళ పరుస్తుంది. సత్పురుషులైతే కాలు ఎందుకు జారతారు? కాలు జారాక సత్పురుషులు ఎలా అవుతారు?? సత్పురుషుడనే నామం సార్ధకంగాగల శ్రీకృష్ణుడిని (భగవద్గీత) ఆమెకి కానుకగా ఇస్తాడు. "అప్పుడప్పుడు తమ దర్శనం చేయవచ్చునా?" అన్న మధురవాణి ప్రశ్నకి తటపటాయిస్తాడు. "వృత్తి మానినా, మంచి-" అంటూ భవిష్యత్తుని గురించి తన నిర్ణయాన్ని చెబుతుందామె. "అయితే రావచ్చును" అంటాడు సంతోషంగా. యాంటీనాచ్ సౌజన్యారావు పంతులు, ఒక్క మధురవాణిలో మార్పుకి దోహదం చేసి ఊరుకోకుండా, ఆమె ద్వారా వేశ్యావృత్తిలో ఉన్నవారిలో మార్పు కోసం ప్రయత్నం చేసి ఉంటే, మధురవాణి ఒక్క భక్తి మార్గానికే పరిమితం కాకుండా, సంఘసేవలోనూ రాణించి ఉండేది కదా అనిపిస్తుంది.

మధురవాణి వచ్చి చెప్పేవరకూ తన శిష్యుడు గిరీశం అసలు రంగుని పోల్చుకోలేక పోతాడు సౌజన్యారావు పంతులు. ఇది గిరీశం  గొప్పదనమా లేక పంతులు బోళా తనమా అన్నది ప్రశ్నే. అయితే, అసలు సంగతి తెలిసిన మరుక్షణం, గిరీశాన్ని ఇంటినుంచి గెంటేయడమే కాక, బుచ్చమ్మని కలవడానికి వీల్లేకుండా ఏర్పాటు చేస్తాడు. ఆమెని పూనాలో విడోస్ హోమ్ కి పంపి చదివించాలనీ, చదువు పూర్తయ్యాక తనకి నచ్చిన వాడిని పెళ్లిచేసుకోవచ్చనీ నిర్ణయిస్తాడు. అటు, లుబ్దావధాన్లులో మార్పు తెచ్చి మీనాక్షిని వితంతువుల మఠానికి పంపే ఏర్పాటు చేస్తాడు. రామప్పంతులు లాంటి వాళ్ళని దూరం పెట్టడం ఒక్కటే పరిష్కారంగా భావించాడు. యెంత ప్రయత్నించినా, సౌజన్యారావు పంతులు మార్పు తేలేకపోయింది ఒక్క అగ్నిహోత్రావధానులులోనే. అనునయ వాక్యాలకీ, బెదిరింపులకీ కూడా లొంగడు అగ్నిహోత్రావధానులు. సౌజన్యారావు పంతులే వుండి ఉండకపోతే మాయగుంట ఖూనీ కేసు ఎన్నెన్ని మలుపులు తిరిగి ఉండేదో ఊహించడం కష్టమే.

2 కామెంట్‌లు:

  1. చాలా వివరంగా రాశారు సర్..చాల కూల్ గా చదివాను. భాష సరళంగా ఉంది.కన్యాశుల్కం లో మీరు రాసిన మిగతా వారి గురించి కూడా చదువుతాను.. కంగ్రాట్స్ సర్

    రిప్లయితొలగించండి