సోమవారం, సెప్టెంబర్ 11, 2017

పోలిశెట్టి

ఓ పక్క మాయగుంట కనిపించక రామచంద్రపురం అగ్రహారం మొత్తం అట్టుడికిపోతూ ఉంటే, రామప్పంతులు ఇంటి కొట్టు గదిలో మధురవాణి బృందం తాపీగా ఆడే పేకాటలో మొదటిసారి కనిపిస్తాడు పోలిశెట్టి, తనకి 'భష్టాకారి' ముక్కలు పడ్డాయని బాధపడుతూ. పోలిశెట్టిని చూడడానికి 'కన్యాశుల్కం' నాటకం పంచమాంకం వరకూ ఆగాలి కానీ, అతగాడి ప్రస్తావన మాత్రం చతుర్ధాంకంలోనే వస్తుంది. సుబ్బి పెళ్లి చెడగొట్టడం కోసం, లుబ్దావధాన్లుకి గిరీశం రాసిన ఉత్తరంలో "మీ వూరి వారెవరోగాని వక తుంటరి, మీరు విశేష ధనవంతులన్నియు, పెళ్లి దేవదుందుభులు మ్రోయునటులు చేతురనియు..." అని రాసినప్పుడు మొదటిసారిగా పోలిశెట్టిని గురించి చర్చ జరుగుతుంది. 

ఉత్తరం చదువుతున్న రామప్పంతులు, వింటున్న లుబ్దావధాన్లు, మధురవాణి ఆ 'తుంటరి' ఎవరై ఉంటారా అన్న ఆలోచన చేస్తున్నప్పుడు, ఏనుగులు, లొట్టిపిట్టలు, గాడిదల వల్ల రామప్పంతులికేం లాభం లేదని తీర్మానిస్తుంది మధురవాణి. "ఒకవేళ రాతబు బేరం జరుగుతుంది గనక పోలిశెట్టికి లాభించవచ్చును," అని ఆలోచన చేస్తుంది తనే. "బాగా చెప్పావు - పోలిశెట్టి చేసిన పనే" అని లుబ్దావధాన్లు సమర్ధించడమూ, "అనుభవించు" అని రామప్పంతులు, లుబ్ధుణ్ణి కోప్పడ్డమూ వెంటవెంటనే జరుగుతాయి. ఈ సంభాషణని బట్టి, పోలిశెట్టి రామచంద్రపురం అగ్రహారంలో ఒక వ్యాపారి అని తెలుస్తుంది. అటుపై, పోలిశెట్టి మళ్ళీ కనిపించేది పేకాట సన్నివేశంలోనే.

పేకముక్కలు కలుపుతున్న భుక్త మీద పోలిశెట్టికి విశేషమైన అనుమానం, కావాలనే ముక్కలు సరిగా కలపడంలేదని. "ఆ! బాపనయ్య పంచాలని తప్పు పంచుతున్నావు. తప్పు పంచితే బేస్తు మీద కుదేలెట్టిస్తాను" అని బెదిరిస్తాడు కూడా. " రెండో ఏత నాలుగాసులడకూడదా" అని ఆశ పడడమే కాదు "ఎంత సెడ్డా బాపనాడి శాపనాకారం మా శెడ్డది" అని జాగ్రత్త పడతాడు పోలిశెట్టి. పోనీ అనుకుందుకు సిద్ధాంతి మీద కూడా అనుమానమే, బేస్తు మీద కుదేలెట్టి, బాకీలు పెట్టి ఎగేసేస్తాడేమో అని. భుక్త తోటీ, సిద్ధాంతి తోటీ పోలిశెట్టి పేచీలు పెట్టుకుంటూ ఉండగానే, పూజారి గవరయ్య ఆశు కవిత్వం ఆరంభిస్తాడు. "రాణా డైమను రాణి" అని మధురవాణి మీద కవిత చెప్పడం, ఆ వెంటనే ఆమె తురుపు రాణీ వేయడంతో పోలిశెట్టి గుండెలు బాదుకుంటాడు.

"అదుగో అదుగో ఈ బాపనాడు కపీశం శెప్పి, మధురవోణి దగ్గర రాణీ ఉందని చెప్పేసేడు.. గోరం.. గోరం.." అంటూ గొడవ చేయడమే కాదు. తర్వాతి ఆటకి ముక్కలు పంచుతుంటే, మంచి ముక్కలు పడాలని "నరశింవ్వ నీ దివ్వె నామ మంతరము శేత..." అంటూ ప్రార్ధన ఆరంభిస్తాడు. పాపం, ప్రార్ధన ఫలించి మంచి ముక్కలే పడతాయి కానీ, రామప్పంతులు గొంతుని అనుకరించి మధురవాణిని పిలుస్తూ మహేశం తలుపు తట్టడంతో ఆట అర్ధాంతరంగా ఆగిపోతుంది. అటకమీద దాగుదామని నిచ్చెనెక్కిన పోలిశెట్టి సిద్ధాంతి మీద పడతాడు. అప్పుడు కూడా రామప్పంతులుకి దొరికిపోకూడదని "నరశింవ్వ నీ దివ్వ..." అందుకుంటాడు. మొత్తం మీద, పోలిశెట్టే లేకపోతే పేకాట సన్నివేశానికి అంత కళా కాంతీ ఉండేవి కాదు. ఇక్కడ చీకట్లో మాయమైన పోలిశెట్టి, మళ్ళీ సప్తమాంకంలో తెరమీదకి వస్తాడు.

మాయగుంట కూనీ జరగలేదనీ, ఆ కేసులో లుబ్ధావధాన్లు నిర్దోషి అని బలంగా నమ్మిన వకీలు సౌజన్యారావు పంతులు, 'నిజమైన' సాక్షుల కోసం వెతుకుతూ పోలిశెట్టిని తన ఇంటికి పిలిపించు కుంటాడు. కేసుని గురించి సౌజన్యారావు చెప్పినదానికల్లా "అబ్బెంతర వేటి బాబూ" అనడం తప్ప మరో మాట మాట్లాడడు. "మీరు చెప్పబోయే సాక్ష్యానికి స్టేట్మెంటు కట్టుకుంటాను. జరిగినది అంతా చెప్పండి, వ్రాసుకుంటాను" అనగానే అప్పుడు అభ్యంతరం ఏవిటో చెబుతాడు పోలిశెట్టి. "మా యింటోళ్ళకి ఉడ్డోలవైన జబ్బుగా ఉందని కబురెట్టారు బాబూ, నాకు సేతులు కాల్లు ఆడకుండ ఉన్నాయి. ఈ సాచ్ఛీకాల్లో తిరిగితే పిల్లా పేకా బతుకుతారా బాబూ?" అని అడిగేస్తాడు.

పోలిశెట్టి సాక్ష్యం ఎంత ముఖ్యమో సౌజన్యారావు పంతులు పరిపరివిధాల చెప్పినా, "తమరు తలిస్తే సాచ్ఛీకానికి కొదవా?" అంటాడే తప్ప, సాక్ష్యం పలకడానికి మాత్రం అంగీకరించడు. కనిస్టీబోళ్ళు ఊరుకోరు కాబట్టి సాక్ష్యం చెప్పడానికి అంగీకరించానని, చెబితే ఇన్నీసిపికటరు పీక పిసికేస్తాడు కాబట్టి చెప్పననీ నిజం ఒప్పేసుకుంటాడు. పైగా, ఆవేళ రాత్రి తనసలు ఊళ్ళోనే లేననీ, లొంగోరం సంతకెళ్ళాననీ కొత్త కథ ఆరంభిస్తాడు. సౌజన్యారావు పంతులుకి కోపం వచ్చిందేమో అని సందేహం పోలిశెట్టికి. శాంతపరుచుకోడం కోసం, "ఆవునెయ్యి బాబూ - గుమగుమలాడేది - ప్రతోరం పంపుకుందునా బాబూ?" అని అడిగినప్పుడు మాత్రం, పంతులుకి నిజంగానే కోపం వస్తుంది.

"మీ ఇన్స్పెక్టర్ కి పంపండి" అంటాడు అంతటి సౌజన్యమూర్తీ కూడా. అప్పుడు కూడా ఏమాత్రం తగ్గడు పోలిశెట్టి. "తవక్కోపవొస్తే బతగ్గలవా బాబూ" అంటూ గుమ్మం దిగి, ఆ వెంటనే ఆత్మగతంగా "బతిగాన్రా దేవుడా. పెందరకాళే ఇంటికి పోయి యెంకటేశ్వర్లుకి అర శెటాకు నెయ్యి దివ్వెలిగిస్తాను" అనుకుంటాడు. ఒక హాస్య సన్నివేశంలో పరోక్షంగానూ, మరో హాస్య సన్నివేశంలో ప్రత్యక్షంగానూ కనిపించే పోలిశెట్టి, ఈ సీరియస్ సీన్ తర్వాత మరి కనిపించడు. పేకాట సన్నివేశంలో అతగాడి ఆశనీ, ఆత్రుతనీ, సౌజన్యారావు పంతులుతో సంభాషణలో పోలిశెట్టి లౌక్యాన్నీ, జాగ్రత్తనీ గమనించవచ్చు. కాళ్ళకూరి నారాయణరావు 'చింతామణి' నాటకంలో సుబ్బిశెట్టి (ఒరిజినల్ రచనలో పాత్ర, తర్వాతి అనుసరణలు కాదు) ఈ పోలిశెట్టికి వారసుడే అనిపిస్తాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి