శుక్రవారం, జులై 25, 2014

కృష్ణవేణి-11

ఉన్నట్టుండి రాజమ్మకి అనారోగ్యం చేసింది. బొంగరంలా తిరిగే మనిషి కాస్తా  మంచం నుంచి లేవడానికి కష్ట పడుతోంది. ఊళ్ళో ఆరెంపీ 'డాక్టర్ గారు' తనకి తెలిసిన వైద్యం అంతా చేసి చివరికి చేతులెత్తేశాడు.

"నా వైద్యానికి లొంగడం లేదు. చూడబోతే కామెర్లలా ఉన్నాయి. వెల్ల మందు వాడి చూడండి" అని చెప్పేసి వెళ్ళిపోయాడు.

చిక్కి శల్యమైపోయింది రాజమ్మ. మనిషి ఆర్చుకుపోతోంది. ఈశ్వరబాబు, సుగుణ రోజూ తొంగి చూసి వెళ్తున్నారు తప్ప, వైద్యం విషయం ఏమీ మాట్లాడడం లేదు. ఊళ్ళో ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు కూడా రాజమ్మని చూసి  కామెర్లు అని తేల్చడంతో, మందు కోసం 'వెల్ల' బయల్దేరాడు రంగశాయి.

తన మీద కోపంతో మంగళగౌరి చంటాడిని పుట్టింట్లో వదిలేసి రావడం, కృష్ణవేణి ని వెతుక్కుంటూ తను రాజమండ్రి బయలుదేరడం, వస్తూనే తల్లి అనారోగ్యంతో మంచాన పడడం..ఇవన్నీ నిన్ననో మొన్ననో జరిగినట్టుగా అనిపిస్తున్నాయి.

"నాకున్నది మాయక్కొక్కర్తే. అదేమో మంచానడింది. నాతో వొచ్చెయ్ మంటే ఈ రామిండ్రీ ఒదిలేసి రానంటాది.. సూత్తా సూత్తా దాన్నిడిసిపెట్టి నేన్రాలేను. ఇంకొన్నాల్లిక్కడుండక తప్పదు నాకు. కుదిర్నప్పుడల్లా ఒత్తా ఉండు.. సైకిలు మీద కాదేం.." తనని సాగనంపుతూ కృష్ణవేణి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి రంగశాయికి.

తల్లిని తల్చుకుని బాధ పడ్డాడు కాసేపు. అన్నీ ఉండీ సుఖపడలేని ప్రాణం. "నాయీ అయ్యే పోలికలేమో," అనుకున్నాడు.

ఎక్కడెక్కడి నుంచో మందు కోసం వచ్చిన వాళ్ళు బారులు తీరి ఉన్నారు ఓ పెద్ద ఇంటి ముందు. ఆవరణలో అక్కడక్కడా బెంచీలు ఉన్నాయి. రోడ్డుని ఆనుకుని పెద్ద పెద్ద చెట్లు నీడనిస్తున్నాయి. దగ్గర ఊళ్ళ వాళ్ళు రోగులని వెంటబెట్టుకుని వచ్చారు.

వరుసలో కూర్చుని ఎదురు చూడగా చూడగా రెండు గంటల తర్వాత వచ్చింది రంగశాయి వంతు. తెల్లటి జులపాల జుట్టు, పొడవు గడ్డం ఉన్న నల్లని మనిషి మఠం  వేసుకుని కూర్చుని ఉన్నాడు అరుగు మీద.

నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టు మెరుస్తోంది. పక్కనే మరచెంబు, గ్లాసు. కొంచం దూరంలో కల్వం, జాడీల్లో కొన్ని ఔషధాలున్నాయి. రోగ లక్షణాలు ఒకటికి రెండు సార్లు అడిగి చెప్పించుకున్నాడు. ఏమేం తింటోంది, ఎంత సేపు నిద్రపోతోంది లాంటి వివరాలు కూడా అడిగి తెలుసుకుని అప్పుడు ఇచ్చాడు ఔషధం.

"పథ్యం చాలా జాగ్రత్తగా చేయించాలి" హెచ్చరికగా చెప్పాడా పెద్దాయన.


తల్లికి బాలేదని తెలిసి చూడడానికి వచ్చింది సూరమ్మ, రాజాబాబుని చంకనేసుకుని. మంచంలో ఉన్న రాజమ్మని చూసి కన్నీళ్లు పెట్టుకుంది.

"నీ సిన్న మనారాలికి పెల్లి కుదిరింది. నువ్వొచ్చి దెగ్గిరుండి సెయ్యించాల.. నీ సేత్తో నాలుగచ్చింతలు దాన్నెత్తినెయ్యాల.." అంది తల్లి చేతులు పట్టుకుని.

నీరసంగా నవ్వింది రాజమ్మ. "బాజ్జెతలు తీరిపోతన్నాయన్న మాట. ఒడ్డున పడతన్నావు తల్లే.. సంతోసం.. ఇప్పుడీ సంటోడి సాకిరి వొచ్చి పడింది నీకు," అంది నెమ్మదిగా. ఓ చెవి ఇటే వేసి ఉంచిన మంగళగౌరి తారాజువ్వలా లేచింది.

"మంచానున్నోల్లు బానే ఉంటారు. సెయ్యలేక మేం సత్తన్నాం మద్దిన," అనేసరికి, రాజమ్మ కన్నా ఎక్కువగా కష్టపెట్టుకుంది సూరమ్మ.

"కడుపుకి అన్నం తింటన్నావా గెడ్డి తింటన్నావే నువ్వు? ఏం సేత్తన్నావు శాకిరీ? ఎంతమందికి వొండోరుత్తున్నావూ అంట.. నా సేత సేయించుకున్నప్పుడు మరీ? ఒక్కనాడు సెయ్యి సాయానికి రాగలిగేవంటే నువ్వూ?" అంటూ కడిగేసింది కూతుర్ని.

తల్లి అలా మాట్లాడుతుందని ఊహించలేదు మంగళగౌరి. ఒక్క క్షణం బిత్తరపోయింది. మరుక్షణం తేరుకుని, పక్క  వాటా వైపు చెయ్యి చూపించి "ఏం? ఆయినగోరూ కొడుకే గదా.. పయిగా పెద్ద కొడుకు. తొంగి సూసి ఎల్లిపోతాడా? కనీసం దగ్గిరెట్టుకుంటానని అనగలిగేడా?" అంది మంగళగౌరి.

"నువ్వు మాటాడకొలే.. లోపల్నడు ముందల," కసిరింది సూరమ్మ. తల్లివైపు కొరకొరా చూసి వంటింట్లోకి విసవిసా వెళ్ళింది మంగళగౌరి. కాసేపటి తర్వాత మొదలైన ధనాధనా శబ్దాలు, సూరమ్మ వంటింట్లోకి వెళ్ళేవరకూ అవుతూనే ఉన్నాయి.

అది మొదలు, సూరమ్మ బయల్దేరి వెళ్ళే వరకూ ఆమెతో పన్నెత్తి మాట్లాడలేదు మంగళగౌరి. తల్లికీ, తమ్ముడికీ వంద జాగ్రత్తలు చెప్పి, రాజాబాబుని చంకనేసుకుని బయల్దేరింది సూరమ్మ.

వెల్ల మందు గుణం చూపించినట్టే చూపించినా, ఉన్నట్టుండి రోగం తిరగబెట్టేసింది రాజమ్మకి. కొడుకులిద్దరినీ చెరో పక్కా కూర్చోబెట్టుకుని, ఓ రాత్రంగా అవస్థ పడి తెల్లవారు జామున ప్రాణాలు వదిలేసింది. చాలాసేపటి వరకూ జరిగిందేమిటో అర్ధం కాలేదు రంగశాయికి.

తండ్రి పోయే నాటికి అతను చిన్నవాడు. ఎక్కడా రోగాలనీ, చావులనీ చూసినవాడు కాదు. ముందుగా తెరుకున్నది ఈశ్వర బాబే. దగ్గర బంధువులకి కబుర్లు వెళ్ళాయి. ఆడవాళ్ళ ఏడుపులు వినిపించడంతోనే చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ వచ్చేశారు. జరగవలసిన ఏర్పాట్లు చూడడం మొదలు పెట్టారు. శవం లేస్తే తప్ప వీధిలో పొయ్యి వెలగడానికి లేదు.

సూరమ్మకి చివరిచూపు అందాలని  ఆరాట పడుతున్నారు తమ్ముళ్ళిద్దరూ. చివరి నిమిషంలో వచ్చిందామె. నలుగురు ఆడవాళ్ళు కష్టపడినా పట్టి నిలపలేక పోయారు. నిలువెత్తు రాజమ్మ పిడికెడు బూడిదగా మారిపోయింది.

ఆస్థి పంపకాలు ఏనాడో అయిపోయాయి. ఇక మిగిలిందల్లా రాజమ్మ ఒంటిమీద ఉన్న కొద్దిపాటి బంగారం, కాసిన్ని చీరలు. తల్లి బంగారం కూతురికే అన్నారు బంధువులు. అభ్యంతరం చెప్పలేదు ఎవరూ.

"మనారాలి పెల్లి కోసవని నీ కూతురు అప్పులయిపోకండా కాసేవా అమ్మా" అంటూ పొగిలి పొగిలి ఏడ్చింది సూరమ్మ.

తల్లి మరణం అందరికన్నా ఎక్కువగా బాధ పెట్టింది రంగశాయిని. తన చుట్టూ అంతా ఖాళీ ఖాళీగా ఉన్నట్టు అనిపించింది అతనికి. ఇంట్లో మిగిలింది అతను, మంగళగౌరి. ఆమెతో ఏం మాట్లాడాలి? ఆమె అడిగే వాటికి ఏం చెప్పాలి? తల్లి ఉన్నంతకాలం చిన్న చిన్న విషయాలు చాలావాటిని  సర్దుబాటు చేసేసేది. ఇప్పుడిప్పుడు తనకి మతి స్థిమితం తప్పుతుందేమో అన్న భయం కలుగుతోంది రంగశాయికి.

చాలా రోజుల తర్వాత కృష్ణవేణి పదే పదే గుర్తొచింది. ఆమెని చూడాలనిపించి రాజమండ్రి బయల్దేరాడు. ఆ పాతకాలపు డాబా ఇంటి గుమ్మానికి తాళం కప్ప వేలాడుతూ పలకరించింది. పక్క వాళ్ళెవరూ కనిపించలేదు.

"మేం మొన్నే దిగేం.. వొచ్చిన కాన్నించీ ఆయింటికి తాలవేసే ఉన్నాది.." ఎదురింటామె పైట సర్దుకుంటూ చెబుతుండగానే, ఉసూరుమని కాళ్ళీడ్చుకుంటూ వెనక్కి తిరిగాడు రంగశాయి.

(ఇంకా ఉంది) 

10 కామెంట్‌లు:

  1. కథనం బావుంది. ఆసక్తిగా వ్రాస్తున్నారు. రోజూ మీ బ్లాగు చూడడం అలవాటుగా మారింది.

    రిప్లయితొలగించండి
  2. ఈ మధ్య సమయాభావం వల్ల బ్లాగులు చదవడం చాలా తగ్గిపోయింది. ఏ క్షణాన మళ్ళీ మొదలుపెట్టానో కానీ, మీ కృష్ణవేణి కి అతుక్కొనిపోయాను. ఎక్కువ ప్రస్తావించకుండానే రంగ శాయి ఒంటరితనాన్ని చిత్రీకరించడం కేవలం మీవల్లే సాధ్యం.
    శారద

    రిప్లయితొలగించండి
  3. మీ కృష్ణవేణి కి బానిస అయిపోతున్నాను. అద్భుతంగా రాస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  4. చాలా చాలా శ్రద్ధగా తీర్చిదిద్దుతున్నారండీ. రాజమ్మ కోడి, మెరక వీధిలో ఎదురింటామె.. ఏ ఒక్క విషయమూ వదలలేదు. అభినందనలు! మురారి గారు చెప్పినట్టూ..

    రిప్లయితొలగించండి
  5. @జ్యోతిర్మయి: ధన్యవాదాలండీ..
    @శారద: ఒకప్పటి బ్లాగు రోజులు గుర్తొచ్చాయండీ, మీ వ్యాఖ్య చూడగానే. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  6. @మురారి: ఎలా స్పందించాలో అర్ధం కావడం లేదండీ.. థాంక్యూ..వెరీ మచ్..
    @కొత్తావకాయ: శ్రద్ధగా చదివే పాఠకులున్నారని తెలిసినప్పుడు, మరింత శ్రద్ధగా రాయాలి కదండీ..
    ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  7. బలే రాత్నారండే.. మీరు సూసి రాత్నట్టు గా ఉంది.. మాకు సూత్తన్నట్టు గా ఉంది.. బలే ఓళ్ళని ఎట్టారు కథలోని.. రంగసాయి గాడు పాపమండే.. ఏదోటి సేసి ఆడ్ని ఒడ్డునడేయండి..

    రిప్లయితొలగించండి
  8. మూర్తి రవి: ఆయ్.. బలేటోరండీ బాబా మీరు. సూసొచ్చి రాత్తన్నట్టున్నాదన్న మాటైతే. శానా సంతోసం.. మన్రంగసాయికేటండీ.. మంగల గౌరున్నాది.. ఇంకానేమో కిట్నేనేం సేత్తాదో సూద్దారి... ఇప్పుటికి చెలవు బాబా..

    రిప్లయితొలగించండి
  9. రోజూ అనుకుంటూ, మొత్తానికి ఈరోజు ఏక బిగిన పదకొండు అధ్యాయాల కృష్ణవేణిని చదవగలిగాను.
    ఇంత స్పీడ్ గా నేను ఇప్పటిదాకా ఏదీ చదవలేదనుకుంటానండి. ముఖ్యంగా గోదావరి తీర కథలు తెలుసుకోవలన్న కోరిక మాత్రమే కాదు, మీ కథనం అంతగా చదివించింది. గోదావరి యాసలో ఎక్కడా కూడా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎంతో క్లియర్ గా ఉంది.

    నాటకం ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. ప్రతి అంకం కూడా వరుసగా నా కళ్ళతో చూడ గలిగాను.

    ప్రతి చిన్న అంశం కూడా ఎంతో వివరంగా ఆ పాత్రల పక్కనే కాకుండా ఆ ప్రాంతాల లోనే నేను కూడా ఉన్నానా అనిపించింది.

    సరస్వతమ్మ వంట చేయడం ఎంత బాగా చెప్పారో. నోరూరింది.

    కొన్ని అంశాలు చదువుతుంటే మురళి గారు ఇలా కూడా రాయగలరా అనిపించింది. మీరు ప్రతి చిన్న విషయాన్ని ఎంతలా గమనిస్తారో అర్ధమయింది.

    కృష్ణవేణి, రంగశాయిల కథ ఏం కానున్నదో తొందరగా తెల్సుకోవాలనిపిస్తోంది.

    మిగిలినవి కూడా తొందరగా చదివేయాలి. మీరు ప్రతి రోజూ రాసేయండి....

    రిప్లయితొలగించండి
  10. @జయ: అబ్బ!! ప్రతి వాక్యాన్నీ ఎంత శ్రద్ధగా చదివారో మీ వ్యాఖ్య చదివితే అర్ధమయ్యిందండీ.. మనసు నిండిపోయింది.. మీరు మిగిలిన భాగాలు చదివేలోగా నేను రాసేస్తాను, సరేనా :) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి