సోమవారం, జూన్ 13, 2011

రెండేళ్ళ పద్నాలుగు

"ఇల్లు కట్టేటోనికి ఇల్లుంటదా?" అని అడుగుతాడు 'వేదం' సినిమాలో రాములు తాత. ఈ ప్రశ్న చాలా సార్లే గుర్తొస్తుంది, మధురాంతకం నరేంద్ర తాజా కథల సంపుటి 'రెండేళ్ళ పద్నాలుగు' చదువుతుంటే. మొత్తం పదమూడు కథల్లోనూ పది కథల్లో ప్రధాన పాత్రలు గృహ నిర్మాణంలో అప్రధాన పాత్రలు పోషించే వాచ్మెన్, తాపీమేస్త్రీ, వడ్రంగి, మట్టి పని చేసేవాళ్ళూ దినసరి కూలీలూ. కథా స్థలం కృష్ణానగర్, తిరుపతి పట్టణ శివార్లలో కొత్తగా వెలుస్తున్నకాలనీ.

మధురాంతకం పేరు వినగానే తెలుగు కథకి కొత్త వెలుగులద్దిన దామల్ చెరువు అయ్యోరు మధురాంతకం రాజారాం గుర్తు రావడం అత్యంత సహజం. ఆయన వారసుడు నరేంద్రది కథా రచనలో ఓ భిన్నమైన శైలి. సమాజంలో వేగంగా చొచ్చుకుని వస్తున్న మార్పుని నేపధ్యంగా తీసుకుని రాసిన ఈ కథలన్నింటిలోనూ, ఆ మార్పు కారణంగా ఒకప్పుడు కుల వృత్తులని నమ్ముకుని జీవించిన పేద జనం ఎలాంటి సంఘర్షణని అనుభవిస్తున్నారన్నది కళ్ళముందుంచుతారు రచయిత.

బతుకు తెరువు కోసం పట్నం వచ్చి మేస్త్రీలుగా అవతారమెత్తినా కులాహంకారాన్ని తమతోనే తెచ్చుకున్న వీరమ రెడ్డి, విశ్వనాథ నాయుడుతో పాటు అందరినీ పొగిడి తన అవసరాలు గడుపుకునే దేవరాజునీ చూడొచ్చు తొలికథ 'ప్రత్యర్ధి' లో. ఎవరు ఎవరికి ప్రత్యర్ధి అన్నది కథ ముగింపు. చదువుకున్న కొడుకుని ఉద్యోగస్తుడిగా చూడాలని కలలు కనే మట్టి పని గంగయ్య కథ 'నమ్మకం'. అంతిమ యాత్ర నేపధ్యంగా సాగే ఈ కథలో ఆసాంతమూ చదివించింది కథనం.

బతకడం కోసం, గుండె దిటవు చేసుకోవడం కోసం వాచ్మన్ గా మారిన యానాది బత్తయ్య దంపతులు దేనిని ఆసరాగా చేసుకున్నారో 'ప్రహేళిక' కథ చెబుతుంది. హేతువాదానికి అందని ముగింపు ఈ కథ ప్రత్యేకత. ఎలక్ట్రీషియన్-ప్లంబర్ల కథ 'అబద్ధం' కాగా, కార్పెంటర్ పరమేశాచారి కథ 'నిషా,' వంశీ 'మా పసలపూడి కథలు' లో 'జక్కం వీర్రాజు' ని జ్ఞాపకం చేస్తుంది. వివాహ వ్యవస్థలో ఓ కొత్త కోణాన్ని చూపించే కథ 'మూల కారణం' ఓహెన్రీ తరహా ముగింపుతో ఆకట్టుకునే కథ.

'హరేరామ హరేకృష్ణ రోడ్డు' కథ పట్టణాలకి వలస వచ్చి రోడ్డు పక్కన గుడిసెల్లో ఉండేవారి బతుకుల్ని చిత్రిస్తూనే, వేగంగా చదివించే ఈ కథలో ఇంద్రాణి పాత్ర వెంటాడుతుంది. 'హింస రచన' ఇద్దరు కాలేజీ లెక్చరర్ల బతుకు భయాన్ని చిత్రించిన కథ. ముగింపు ఊహకందదు. వ్యంగ్యం ప్రధానంగా సాగే 'ప్రార్ధన' కథ చదువుతుంటే శ్రీపాద వారి 'శుభికే! శిర ఆరోహ' కథ గుర్తొచ్చింది అప్రయత్నంగా. 'దొంగతనం' 'మేరె గావ్ కో జానా' కథలు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీల కథలు.

'న్యాయం' కథ భార్య పొరు పడలేక పట్టణానికి వలస వచ్చి వాచ్మన్ గా స్థిరపడ్డ ఓ రజకుడి కథ. అతని భార్య పంచరత్నని కూడా అంత త్వరగా మర్చిపోలేం. ఒక నాటికగా మలుచుకుని స్టేజి మీద ప్రదర్శన ఇవ్వడానికి వంద శాతం సరిపోయే కథ సంపుటిలో చివరిదైన 'చిత్రలేఖ.' అపార్ట్మెంట్ నేపధ్యంగా సాగే ఈకథ చదువుతుంటే ఒక హాస్య, వ్యంగ్య నాటికని చదువుతున్న అనుభూతి కలిగింది. ఈ కథలని గురించి బి. తిరుపతిరావు రాసిన సమీక్షని చివర్లో చేర్చారు.

కేవలం యాత్రికులుగా తిరుపతి వెళ్లి వచ్చిన వారికి మాత్రమే కాదు, అక్కడే ఉన్నవాళ్ళకీ, అక్కడ కొంత కాలం ఉన్న వాళ్ళకీ కూడా తిరుపతిని ఓ కొత్త కోణంలో చూపించాయి కథలన్నీ. సూక్ష్మమైన వివరాలని సైతం విడిచిపెట్టకుండా చిన్న చిన్న వాక్యాలలో వర్ణించడం ద్వారా పాఠకులకి కథలు తమ కళ్ళ ఎదుట జరుగుతున్న అనుభూతిని కలిగించారు నరేంద్ర. కథా సంపుటికి ఏదో ఒక కథ పేరు పెట్టడం సహజం. అందుకు భిన్నంగా ఈ సంకలనానికి 'రెండేళ్ళ పద్నాలుగు' అనే పేరు ఎందుకు పెట్టారో అర్ధం కాలేదు. అయినా, పేరులో ఏముంది? (విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 170, వెల రూ.75, ఎవీకేఫ్ లోనూలభ్యం).

2 కామెంట్‌లు:

  1. nice intro. ఇతనిదే 'కుంభమేళా' అని ఒక బుక్ వచ్చింది. చదివారా?
    btw 'వేదం' గురించి కూడా బాగా రాశారు.

    రిప్లయితొలగించండి
  2. @హరిచందన: 'కుంభమేళా' లో కొన్ని కథలు విడిగా చదివాను కానీ,సంకలనం చదవలేదండీ.. అది కూడా ఒక కారణం, ఈ పుస్తకం కనిపించగానే తీసేసుకోడానికి :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి